-
‘శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు’
విజయవాడ: శవ రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన చిన్నారి సాయిశ్రీ తల్లి సుమ అన్నారు. ఎమ్మెల్యేగా న్యాయం చేయాల్సిన బాధ్యత బోండా ఉమామహేశ్వరరావుకు లేదా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. 20 రోజులుగా తన గోడు చెబుతున్నా బోండా ఉమ స్పందించలేదని సుమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరుల వల్లే ఇల్లు అమ్ముకోలేక, తన బిడ్డను కోల్పోయానని సుమ భోరున విలపించారు. సీఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె అన్నారు. మరోవైపు సుమను వైఎస్ఆర్ సీపీ నేత వెలంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మ పరామర్శించారు. కాగా బిడ్డ వైద్యం కోసం ఇంటిని అమ్మనీయకుండా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీయులు అడ్డుకోవడం, ఆస్తి కోసం తండ్రి ముఖం చాటేయడంతో ఆరోగ్యం విషమించి మాదంశెట్టి సాయిశ్రీ నిన్న మధ్యాహ్నం ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. -
నాన్నా.. నన్ను బతికించవూ..
-
నాన్నా.. నన్ను బతికించవూ..
ఓ చిన్నారి ఆఖరి ఆర్తనాదం ► క్యాన్సర్తో బాధపడుతూ కన్నుమూసిన చిన్నారి ► వైద్యం చేయించడానికి అష్టకష్టాలు పడిన తల్లి ► వైద్య ఖర్చుల కోసం ఇల్లు అమ్ముతుంటే అడ్డుకున్న తండ్రి ► ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీయుల దౌర్జన్యం ► మాతృ దినోత్సవం రోజున విజయవాడలో ఓ తల్లికి కడుపుకోత పిల్లలకు జ్వరమొస్తేనే తల్లడిల్లిపోతాం.. నిమిషానికోసారి చేయి పట్టుకుని చూస్తాం.. డాక్టర్, మందులు అంటూ హడావుడి చేస్తాం.. తిరిగి వారు కోలుకునే వరకు నిద్రపోకుండా సపర్యలు చేస్తాం.. అలాంటిది క్యాన్సర్తో బాధ పడుతున్న కన్న బిడ్డ ‘నాన్నా.. నన్ను బతికించు ప్లీజ్.. నేను స్కూల్కెళ్లి ఎన్ని నెలలైందో.. నా ఫ్రెండ్స్తో ఆడుకోవాలనుంది.. నీతో మాట్లాడాలని ఉంది..’ అంటూ కన్నీటితో వేడుకున్నా ఆ తండ్రి గుండె కరగలేదు. పైగా అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో తల్లీబిడ్డను వీధిన పడేశారు. చరమాంకంలో ఆ బిడ్డ తన తండ్రికి పంపిన వీడియోలోని ఒక్కో మాట వింటుంటే కళ్లెంట నీరు ఆగలేదు.. నేను ఎక్కువ రోజులు బతకనంట డాడీ.. ‘‘డాడీ.. నీ దగ్గర డబ్బుల్లేవంటున్నావ్.. కనీసం నా ఇల్లుందిగా.. ఈ ఇంటిని అమ్మేసి ఆ డబ్బులతో అయినా నాకు ట్రీట్మెంట్ చేయించు డాడీ.. ట్రీట్మెంట్ లేకపోతే ఎక్కువ రోజులు నేను బతకనంట డాడీ.. ఏదో ఒకటి చేసి నన్ను కాపాడు డాడీ.. నన్ను బ్రతికించు డాడీ.. నేను స్కూల్కెళ్లి ఎన్ని మంత్స్ అయిందో నీకు తెలుసు కదా డాడీ.. నా ఫ్రెండ్స్తో ఆడుకోవాలనుంది.. దయచేసి నాకు ట్రీట్మెంట్ చేయిస్తే హ్యాపీగా నేను టెన్త్ క్లాస్ చదువుకుంటా.. స్కూలుకెళ్తా.. నా ప్రాణాలు కాపాడు డాడీ.. నీకు దండం పెడతా.. చేయి కూడా నొప్పిగా ఉంది డాడీ.. నీకు దండం పెడదామంటే చేయి వాచిపోయి నొప్పిగా ఉంది డాడీ.. కాళ్లు కూడా వాచి పోయాయి డాడీ.. కుంటుతూ నడుస్తున్నా డాడీ.. ఎప్పుడూ నన్ను మీ అమ్మతో పోలుస్తావుగా డాడీ.. వెంకట సుబ్బమ్మ అంటావుగా.. మీ మమ్మీకే డిసీజ్ వచ్చిందనుకుని నాకు ట్రీట్మెంట్ చేయించు డాడీ.. నాకు ఇపుడు ట్రీట్మెంట్ అవసరం అంట డాడీ.. నాకు ట్రీట్మెంట్ లేకపోతే ఇంక బతకనంటా.. అమ్మ దగ్గర డబ్బుల్లేవు డాడీ.. నిజంగా అమ్మ దగ్గర డబ్బుల్లేవు.. ఒకవేళ నీ డబ్బులు ఏమైనా మా మమ్మి తింటుందనుకుంటే మాకెవ్వరికీ డబ్బులివ్వద్దు.. నువ్వే నన్ను హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిం చు డాడీ.. నాకు అవసరమైనప్పుడల్లా ఆ డబ్బులు నువ్వే ఆస్పత్రిలో కట్టు డాడీ.. మమ్మీకి కూడా ఇవ్వద్దు.. నాకేమన్నా అయితే మీ నలుగురే దానికి బాధ్యత వహిస్తారు డాడీ.. మాదంశెట్టి శివకుమార్ నువ్వు నా తండ్రిగా, నీ కొడుకులు మాదంశెట్టి శివరామకృష్ణ, మాదంశెట్టి సీతారాం కృష్ణ, నీ భార్య మాదంశెట్టి కృష్ణకుమారి.. మీరు నలుగురూ కలసి ఈ ఆస్తికి అడ్డు వస్తానని ఇన్డైరెక్టుగా నన్ను చంపేయాలనుకుంటున్నారు.. మీ చేతికి మట్టి అంటకుండా నా కొచ్చిన జబ్బుతోనే చంపేయాలని చూస్తున్నారు కదా డాడీ.. దయచేసి ఈ వీడియో చూసిన టూ త్రీ డేస్లో నువ్వు రెస్పాండ్ అవ్వు డాడీ.. ఒకవేళ ఇదంతా నువ్వు నమ్మకపోతే వీడియో కాల్ చేయి డాడీ.. నేనే మాట్లాడుతా.. కనీసం నాతో మాట్లాడటానికి ఇష్టం లేకపోతే ఇదిగో ఇవన్నీ చూడు డాడీ.. కొంచెమన్నా నా మీద జాలి చూపించు డాడీ.. నేను కూడా నీ కూతురునే కదా డాడీ.. ప్రేమ కాకపోయినా కనీసం జాలి అయినా చూపించు డాడీ.. ట్రీట్మెంట్ చేయించు డాడీ.. ప్లీజ్ డాడీ..’ సాక్షి, అమరావతి బ్యూరో: బిడ్డను బతికించుకోవాలన్న ఆ తల్లి వేదన అరణ్య రోదనే అయ్యింది. కుమార్తెకు వైద్యం చేయించేందుకు ఆమె పడిన ఆరాటం ఫలించలేదు. బిడ్డ వైద్యం కోసం ఇంటిని అమ్మనీయకుండా ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీ యులు అడ్డుకోవడం, ఆస్తి కోసం తండ్రి ముఖం చాటేయడంతో ఆరోగ్యం విషమించి మాదంశెట్టి సాయిశ్రీ (13) ఆదివారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది. బొండా ఉమా వర్గీయుల రౌడీయిజానికి నిదర్శనంగా నిలిచిన ఈ ఘటన రాజధాని విజ యవాడలో కలకలం రేపింది. మాదంశెట్టి సుమశ్రీ తన కుమార్తె సాయిశ్రీతో కలసి విజయవాడ దుర్గానగర్లోని ఓ అపార్టుమెంటు ఫ్లాట్లో నివాసం ఉంటున్నారు. సుమశ్రీ భర్త మాదంశెట్టి శివకుమార్ ఆ ఫ్లాట్ను కుమార్తె సాయిశ్రీ పేరిట రాశారు. సంరక్షకుడిగా తన పేరే పెట్టుకున్నారు. అయితే కొంత కాలంగా సుమశ్రీ, శివకుమార్ మధ్య విభేదాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలో సాయిశ్రీ క్యాన్సర్ బారిన పడింది. ఖరీదైన వైద్యం చేయిస్తే తప్ప ఫలితం ఉండదని వైద్యులు చెప్పారు. దీంతో తాము ఉంటున్న ఇంటిని విక్రయించి కుమార్తెకు వైద్యం చేయించాలని తల్లి సుమశ్రీ భావించారు. ఆ ఇల్లు మైనర్ అయిన కుమార్తె పేరిట ఉండటంతో సంరక్షకుడిగా ఉన్న తండ్రి శివకుమార్ సమ్మతించాల్సి ఉంది. ఇందు కు ఆయన అంగీకరించలేదు సరికదా అందుబాటులో లేకుండాపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక తల్లీకూతుళ్లు తల్లడిల్లిపోయారు. ఎమ్మెల్యే బొండా వర్గీయుల బెదిరింపులు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వర్గీయులు కొందరు ఇటీవల ఆ ఫ్లాట్కు వచ్చారు. ఎమ్మెల్యే బొండా ఉమా చెప్పారంటూ ఆ ఇల్లు ఖాళీ చేయాలన్నారు. శివకుమార్ ఆ ఇంటిని తమకు అమ్మేశారని బెదిరించారు. దీనిపై సుమశ్రీ తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఉంటున్న ఫ్లాట్ను అమ్మేయడం ఏమిటి? కుమార్తె అనారోగ్య సమస్యల్లో ఉండగా ఈ దౌర్జన్యమేమిటి? అని ప్రశ్నించారు. ఇదేమీ పట్టించుకోని బొండా ఉమా వర్గీయులు మరింతగా చెలరేగిపోయారు. కుమార్తె సాయిశ్రీని తీసుకుని వైద్యం కోసం సుమశ్రీ హైదరాబాద్ వెళ్లిన సమయంలో ఆ ఇంటిలోకి దౌర్జన్యంగా ప్రవేశించారు. సామాన్లను బయట పడేసి ఫ్లాట్ను ఆక్రమించుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సుమశ్రీని ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దీంతో ఓ రోజు రాత్రంతా ఆమె ఇంటిబయటే పడిగాపులు కాశా రు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. వారం రోజుల్లో ఫ్లాట్ ఖాళీ చేయాలని హెచ్చరించి ఎమ్మెల్యే బొండా వర్గీయులు వెళ్లిపోయారు. కుమార్తె వైద్య ఖర్చుల కోసం ఆ ఇంటిని విక్రయించాలన్న సుమశ్రీ ప్రయత్నాలు ఫలించలేదు. అసలు శివకుమార్ ఉద్దేశపూర్వకంగా అందుబాటులో లేకుండాపోయారు. ఎమ్మెల్యే బొండా ఉమా వర్గీయులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ఇటీవల మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైనా ఎమ్మెల్యే ఏమాత్రం స్పందించ లేదు. దీంతో అంతా ఒక్కటై ఉద్దేశ పూర్వకంగా సుమశ్రీ, సాయిశ్రీలను వేధించారని స్పష్టమైంది. బొండా ఉమా బాధ్యత వహించాలి ‘నా బిడ్డ సాయిశ్రీ మృతికి మాదంశెట్టి శివకుమార్, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు బాధ్యత వహించాలి. నా బిడ్డ ప్రాణాల మీదకు వచ్చినా వైద్య ఖర్చుల కోసం మా ఇంటిని అమ్ముకోనివ్వలేదు. ఎమ్మెల్యే బొండా ఉమా అండతో ఓ రౌడీషీటర్ మమ్మల్ని బెదిరించారు. ఇంటిని అమ్మి బిడ్డ ప్రాణాలు కాపాడాలని నా భర్త మాదంశెట్టి శివకుమార్ను వేడుకున్నాను. ఇంటిని అమ్ముకోవడాన్ని అడ్డుకోవద్దని ఎమ్మెల్యే బొండా ఉమాను పలుసార్లు ప్రాథేయపడ్డాను. వారు ఏమాత్రం కనికరించలేదు. పైగా వైద్యం చేయించకపోతే సాయిశ్రీ చనిపోతుందని, అప్పుడు ఇంటిని దక్కించుకోవచ్చని శివకుమార్ పథకం వేశాడు. అందుకు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ శేషగిరిరావు, అతని కుమారుడు సహకరించారు. నా భర్త శివకుమార్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు స్నేహితుడు కావడంతో అతనికి అండగా నిలిచి దౌర్జన్యం చేశారు. దీంతో నా కూతురుకు సరైన వైద్యం చేయించలేకపోయాను. అనారోగ్యంతో తీవ్ర వేదన అనుభవిస్తూ నా కూతురు ప్రాణాలు విడిచింది. దీనికి ఎమ్మెల్యే బొండా ఉమా బాధ్యత వహించాలి. ఆయనకూ పిల్లలు ఉన్నారు. ఓ తల్లిగా నా ఆవేదనను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు.’ – సాయిశ్రీ తల్లి సుమశ్రీ ప్రాణాలు విడిచిన సాయిశ్రీ రోజురోజుకు సాయిశ్రీ ఆరోగ్యం క్షీణిం చింది. డబ్బులు లేక సుమశ్రీ తన కుమార్తెను మెరుగైన వైద్యం కోసం మళ్లీ హైదరాబాద్ తీసుకువెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించి సాయిశ్రీ ఆదివారం మధ్యా హ్నం ఇంట్లోనే ప్రాణాలు విడిచింది. దీంతో కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లి బోరున విలపించింది. శివకుమార్కు సహకరించిన వారందరిని కఠినంగా శిక్షిస్తేనే తన బిడ్డ ఆత్మ శాంతిస్తుందని కన్నీటిపర్యంతమైంది. సాయి శ్రీ చివరిసారిగా తన తండ్రికి పంపిన వీడియోను మీడియాకు చూపించింది. -
‘రక్షించండి నాన్న అని ఆఖరి సెల్ఫీ వీడియో’
-
22 ఏళ్లుగా ఆ ఇంటికి వాటర్ బిల్లే లేదు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ సీనియర్ శాస్త్రవేత్త గత 22 ఏళ్లుగా నీటి బిల్లు కట్టడం లేదు. ఎందుకంటే ఆయన ఇంటికి అసలు ప్రభుత్వ కుళాయి కనెక్షన్ కూడా లేదు. అదేమిటీ బెంగళూరులాంటి నగరంలో అసలు కుళాయి కనెక్షన్ లేకుండా ఎలా జీవితాన్ని గడుపుతున్నారని అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. ఏఆర్ శివకుమార్ అనే వ్యక్తి ఓ శాస్త్రవేత్త. అతడు కర్ణాటక స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆయన తన నివాసాన్ని హరిత గృహంగా నిర్మించారు. రోజుకు కనీసం 400 లీటర్ల వర్షపు నీటిని స్టోర్ చేసేలా కట్టుకున్నారు. ఈ విధంగా నీటి కష్టాలు మొత్తం రాష్ట్రం మొత్తం ఎదుర్కొంటున్నా తన ఇంట్లో మాత్రం ఎలాంటి సమస్య లేకుండా హాయిగా గడిపేస్తున్నారు. మొత్తం మీద ఆయన ఇంటికి దాదాపు 45వేల లీటర్ల నీటిని నిలువ చేసుకునే సామర్థ్యం ఉంది. శక్తివనరులు, వర్షపు నీటిని తిరిగి వినయోగించుకుకోవడం ఎలా అనే విభాగంలో పని చేస్తున్న ఆయన తన ఇంటికి ఏడాదికి మొత్తం 2.3లక్షల లీటర్ల నీరు సరిపోతుందని చెప్పారు. రోజుకు 400 లీటర్ల చొప్పున అవసరం అవుతుందని, 100 రోజులకు 40000 లీటర్ల నీరు అవసరం ఉంటుందని, కానీ తమకు 45వేల లీటర్ల నిలువ నీటి సామర్థ్యం ఉందని అన్నారు. -
పోలీస్ కమిషనర్పై కేసు నమోదు
దుబ్బాక(సిద్దిపేట): సిద్దిపేట సీపీ శివకుమార్, ఏసీపీ నర్సింహారెడ్డిలపై కేసు నమోదైంది. దుబ్బాక ఎస్సై చిట్టిబాబు దంపతుల ఆత్మహత్యకు వీరే కారణమని వారి కుమారుడు ప్రేమ్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి ప్రజాసంఘాలతో కలిసి దుబ్బాక పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేసిన చిట్టిబాబు కుమారుడికి నిజామాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీపీ శివకుమార్, ఏసీపీ నర్సింహారెడ్డిలపై ఐపీసీ 302, సీఆర్పీసీ 174 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. దుబ్బాక ఎస్సై చిట్టిబాబు దంపతుల ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు(శనివారం) దుబ్బాక బంద్కు పిలుపునిచ్చారు. -
నోట్ల రద్దుపై కాంగ్రెస్ నిరసనలు
2 నుంచి 11 వరకు కార్యక్రమాలు: ఉత్తమ్ ► జనవరి రెండో వారంలో రాష్ట్రానికి రాహుల్గాంధీ! ► గాంధీభవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ► హాజరైన ఏఐసీసీ పరిశీలకులు కేబీ కృష్ణమూర్తి, కర్ణాటక మంత్రి శివకుమార్ సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేపట్టనున్న నిరసనల్లో భాగంగా రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రకటించారు. జనవరి 2న జిల్లా కేంద్రాల్లో, పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మీడియా సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. తర్వాత జనవరి 5, 6, 7 తేదీల్లో కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని, 9న మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపుతామని వివరించారు. అనంతరం 11వ తేదీన ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగే సభకు భారీ సంఖ్యలో తరలి వెళ్లాలని నిర్ణయించామని, మండల, జిల్లా కేంద్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అనంతరం సమావేశం వివరాలను ఉత్తమ్ మీడియాకు వివరించారు. జనవరి రెండో వారంలో రాష్ట్రానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జనవరి 11 తర్వాత 24 గంటల సత్యాగ్రహ దీక్ష చేస్తామని తెలిపారు. ప్రజల డబ్బుపై ఆంక్షలెందుకు..? పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏఐసీసీ తరఫున పీసీసీ సమావేశానికి పరిశీలకుడిగా హాజరైన కర్ణాటక మంత్రి శివకుమార్ అన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులపై 15 రోజుల పాటు దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరిం చారు. ప్రజలు కష్టపడి సంపాదించుకుని బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుల పై ఎందుకు ఆంక్షలు పెట్టారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. నల్ల ధనాన్ని వెలికితీయడానికి తాము వ్యతిరేకం కాదని, చిన్న వ్యాపా రులకు పన్నుల్లో మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొ న్నారు. పీసీసీ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకుడు కేబీ కృష్ణమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డి, నేతలు షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హన్మంతరావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, వంశీచంద్రెడ్డి, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో టీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన భూసేకరణ చట్టం, బలవంతపు భూసేకరణ చట్టమేనని, సభలో సీఎం కేసీఆర్ అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని పీసీసీ సమా వేశంలో నేతలు పేర్కొన్నారు. అసెంబ్లీలో సీఎం వ్యవహారశైలి తెలంగాణ పరువు తీసేలా ఉందని, 2013 భూసేకరణ చట్టాన్ని యూపీఏ సర్కార్ పార్లమెంట్ లో తీసుకొచ్చినప్పుడు, ఆరోజు కేసీఆర్ ఎం దుకు వ్యతిరేకించలేదని నేతలు మండిపడ్డారు. కొత్త భూసేకరణ చట్టంపై కాంగ్రెస్ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. -
30 మంది విద్యార్థినులపై రేప్
తమిళనాడులో ట్యూషన్ సెంటర్ నిర్వాహకుల కీచకం సాక్షి ప్రతినిధి, చెన్నై: ట్యూషన్ విద్యార్థినులకు మత్తుమందిచ్చి లైంగిక వాంఛ తీర్చుకున్న ముగ్గురు ట్యూషన్ సెంటర్ నిర్వాహకులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం, తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలక్కోడుకు చెందిన శివకుమార్ (25) తన స్నేహితులైన ఈశ్వరన్, శివలతో కలసి పాలక్కాడు, ధర్మపురిలో ట్యూషన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లుగా నడుస్తున్న ఈ సెంటర్లలో టెన్త్, ఇంటర్మీడియెట్కు చెందిన దాదాపు 100 మంది విద్యార్థులు చదువుతున్నారు. ట్యూషన్ కు వచ్చే అమ్మాయిలను స్పెషల్ క్లాసుల పేరుతో శివకుమార్ ఎక్కువసేపు ఉంచేవాడు. ఆ సమయంలో టీ/ శీతలపానీయాల్లో మత్తుమందు కలిపి ఇచ్చేవాడు. వారు స్పృహకోల్పోగానే వారితో అసభ్యంగా ప్రవర్తించి ఆ దృశ్యాలను వీడియో తీసేవాడు. వాటిని చూపించి తర్వాత వారితో తన కోరిక తీర్చుకునేవాడు. ఆ దారుణాలనూ వీడియో తీసేవాడు. స్నేహితులు ఈశ్వరన్, శివలు సైతం వీడియోలను బయటపెడతామని బెది రించి, విద్యార్థినులను లొంగదీసుకున్నారు. గత రెండేళ్లలో దాదాపు 30 మంది విద్యార్థినులు వీరి దురాగతాలకు బలయ్యారు. -
శివకుమార్ అంటే ఐ‘డర్’
సాక్షి, సిటీబ్యూరో: చైనా బైక్స్ పేరుతో దేశ వ్యాప్తంగా 60 మందికి పైగా టోకరా వేసిన శివకుమార్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘరానా మోసగాడిని సీసీఎస్ పోలీసుల శనివారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. హయత్నగర్ సమీపంలోని పెద్ద అంబర్పేటలో ఉన్న గోడౌన్ను సీజ్ చేసిన అధికారులు అందులో ఉన్న బైక్స్ను స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క ఈ ఘరానా మోసగాడు అనేక మంది యువతులనూ వంచించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కోణంలో తమకు ఫిర్యాదులు రాలేదని, వస్తే నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని సీసీఎస్ అధికారులు పేర్కొంటున్నారు. ఐడర్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి అదే బ్రాండ్తో బైక్స్ తయారు చేసి విక్రయించాలని శివకుమార్ ప్రయత్నాలు చేశాడు. చైనాకు చెందిన ద్విచక్ర వాహనాల తరహాలోనే ఇవీ ఉంటాయని ప్రచారం చేసుకున్నాడు. అయితే ఇలాంటి వాహనాల తయారీకి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. తానే స్వయంగా హైదరాబాద్లో కొన్ని వాహనాలు తయారు చేయించి ప్రదర్శించాడు. మొత్తం 15 మోడల్స్లో 110 సీసీ నుంచి 650 సీసీ సామర్థ్యం కలిగిన వాహనాలు ఉంటాయని, వీటి ధర రూ.49 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని నమ్మబలికాడు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ మహరాష్ట్ర, గోవాలతో పాటు దేశ వ్యాప్తంగా 60 మంది నగదు చెల్లించి డీలర్షిప్స్ తీసుకున్నారు. ఈ నయవంచకుడు కొందరు యువతులకూ ప్రేమ పేరుతో వల వేసి వారినీ వంచించాడు. ఆయా యువతులతో సన్నిహితంగా ఉన్న సమయాల్లో వారికి తెలియకుండా వీడియోలు, ఫొటోలు తీసేవాడు. వీటిని చూపించి ఆ యువతులను బెదిరించే వాడని, అలా తన డీలర్ల వద్దకు వారిని పంపుతూ ఆ దృశ్యాలు చిత్రీకరించే వాడని తెలిసింది. రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వరకు డిపాజిట్లుగా, మరికొంత మొత్తం బైక్స్ కోసం అడ్వాన్స్గా చెల్లించే డీలర్లు చివరకు మోసపోయామని తెలుసుకునే వారు. తాము చెల్లించిన నగదు తిరిగి ఇవ్వమంటే ‘దృశ్యాలు’ ఉన్నాయంటూ వారినీ బ్లాక్మెయిల్ చేసే వాడని తెలుస్తోంది. ఇతడి కార్యాలయంలో సోదాలు చేసిన పోలీసులకు రెండు ఈ తరహాకు చెందిన సీడీలు లభించాయని సమాచారం. పోలీసులు మాత్రం తమకు ఈ వ్యవహారాలపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేస్తున్నారు. ఇతడిపై ఇప్పటికే జూబ్లీహిల్స్, కాచిగూడ, మీర్చౌక్, సరూర్నగర్ ఠాణాల్లో కేసులు నమోదై ఉండగా... తాజాగా సీసీఎస్ పోలీసులు నమోదు చేశారు. శివకుమార్ మాటలు నమ్మిన అనేక మంది డీలర్లు కొన్ని నెలలుగా షోరూమ్స్, కార్యాలయాలు, సిబ్బందిని సిద్ధం చేసుకున్నారు. అప్పటి నుంచి వాటి అద్దెలు, వారికి జీతాలు చెల్లిస్తున్నారు. చివరకు ఇప్పుడు మోసపోయామని తెలియడంతో లబోదిబోమంటున్నారు. -
స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలి
వీరన్నపేట (మహబూబ్నగర్) : తెలంగాణ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శివకుమార్ డిమాండ్ చేశారు. గురువారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాలను మూడింతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ను చెల్లించకపోవడం వల్ల విద్యార్థుల నుంచి కళాశాలల యాజమాన్యాలు పరీక్ష ఫీజులను తీసుకోవడం లేదని అన్నారు. దీంతో విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలను పెంచాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నూరు రాజు, కార్యదర్శి ఓంప్రకాష్, నాయకులు వెంకట్రాములు, బాలరాజు, అంజి, నరేష్, నవీన్, శివ, గోపి, రఘు తదితరులు పాల్గొన్నారు. -
నేడు విద్యాసంస్థల బంద్
వీరన్నపేట (మహబూబ్నగర్) : విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఈనెల 8వ తేదీన విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చినట్లు బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్తో పాటు కలెక్టరేట్, ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం స్కాలర్షిప్లు పెంచడంతో పాటు రూ. 3100 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
మా ఓట్లతో గెలిచి మాపైనే పెత్తనమా?
హిమాయత్నగర్: లక్షల జీతాలు తీసుకుంటున్న ఉన్నతాధికారుల సభలు, సమావేశాల ఖర్చు కార్మికులపై మోపుతున్నారని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శివకుమార్ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం వెళ్లిన కార్మికులపై రుబాబు చేయడమేగాక ఇళ్లలో పాచి పనిని చేయించుకుంటున్నారని ఆరోపించారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మున్సిపల్ వర్కర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ వ్యవస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని, కార్మికులకు కనీస వేతనాలను రూ. 15వేలకు పెంచుతామన్న నేతలు అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదన్నారు. కార్పొరేటర్ల బర్త్డేలు, ఫంక్షన్లకు కార్మికులు కేకులు తీసుకెళ్లి కట్ చేయాల్సి వస్తుందన్నారు. లేకపోతే వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కార్మికులకు మాస్క్లు, షూలు. గ్లౌవ్స్ ఇవ్వటం లేదన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ , మహబూబ్నగర్ అటవీ ప్రాంతాల వద్ద పనిచేసే కార్మికులు జంతువుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమలో రషీద్, కృష్ణ. ఆనంద్, సుధాకర్ గౌడ్, సాయిదీప్ తదితరులు పాల్గొన్నారు. -
'కేసీఆర్కు ఉప ఎన్నికల భయం పట్టుకుంది'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ఉప ఎన్నికల భయం పట్టుకుందని టీవైఎస్ఆర్సీపీ నేతలు శివకుమార్, విజయ్ చందర్ వ్యాఖ్యానించారు. నగరంలోని వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు సమావేశమయ్యారు. వరంగల్ ఉప ఎన్నికలకు సంబంధించి రూపొందించిన పాటల సీడిని ఈ సందర్భంగా వారు ఆవిష్కరించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా రైతుల ఆత్మహత్యలు ఆగలేదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. వరంగల్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ చరిత్ర సృష్టించబోతోందని ఆ పార్టీ నేతలు శివకుమార్, విజయ్ చందర్ ధీమా వ్యక్తం చేశారు. -
'సీఎం, మంత్రుల వ్యవహారశైలి సిగ్గుచేటు'
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు, ఇతర మంత్రుల వ్యవహారశైలి సిగ్గుచేటు అని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నేతలు ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్ విమర్శించారు. హైదరాబాద్లో వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో భయంకరమైన కరువు నెలకొందని పార్టీ నేతలు పేర్కొన్నారు. రైతులు పిట్టల్లా రాలిపోతున్నా, కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఈ సందర్బంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. త్వరలో తెలంగాణ వైఎస్ఆర్ సీపీ రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుందని టీవైఎస్ఆర్సీసీ నేతలు ఎడ్మ కిష్టారెడ్డి, శివకుమార్ తెలిపారు. -
10న మహబూబ్నగర్ జిల్లా బంద్
మహబూబ్నగర్: పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర జలమండలికి లేఖ రాయడాన్ని నిరసిస్తూ శుక్రవారం అధికార టీఆర్ఎస్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినిమా థియేటర్ల యజమానులు సహకరించాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ కోరారు. ఇందులో భాగంగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా బంద్కు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ బంద్కు వివిధ సంఘాలు మద్దతు తెలిపాయి. -
శివకుమార్ 7/30
త్రిపుర 151 ఆలౌట్ సాక్షి, ఒంగోలు: ఆంధ్ర బౌలర్ దువ్వారపు శివకుమార్ అద్భుత ప్రదర్శనతో చెలరేగాడు. త్రిపురతో మంగళవారం ఇక్కడ ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్లో 30 పరుగులకే 7 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా త్రిపుర తమ తొలి ఇన్నింగ్స్లో 47.5 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది. పదో నంబర్ బ్యాట్స్మన్ రాణా దత్తా (64 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు)దే అత్యధిక స్కోరు కాగా, రాకేశ్ సోలంకి (39 బంతుల్లో 37; 7 ఫోర్లు) కొద్దిగా ప్రతిఘటించాడు. అనంతరం ఆంధ్ర బ్యాటింగ్ కూడా తడబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర 4 వికెట్లకు 97 పరుగులు చేసింది. కెప్టెన్ మొహమ్మద్ కైఫ్ (82 బంతుల్లో 40 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజ్లో ఉన్నాడు. శ్రీరామ్ (23), ప్రదీప్ (12), ప్రశాంత్ (4), భరత్ (0) వెనుదిరిగారు. ఆంధ్ర తమ తొలి ఇన్నింగ్స్లో మరో 54 పరుగులు వెనుకబడి ఉంది. -
అంబేద్కర్ ఆశయసాధనకు పాటుపడుదాం
కరీంనగర్ : భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేద్కర్ బడుగు,బలహీన వర్గాలకు ఆరాధ్యదైవమని, ఆ మహానీయుని ఆశయ సాధన కోసం పాటుపడాలని కరీంనగర్, ధర్మపురి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా స్థానిక కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎస్పీ శివకుమార్,నగర మేయర్ సర్దార్ రవీందర్సింగ్, డెప్యూటీమేయర్ గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేషన్ కమిషనర్ శ్రీకేశ్లట్కర్,సాంఘిక సంక్షేమ శాఖ జేడీ నాగేశ్వర్రావు, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే అభివృద్ధి సాధ్యమని అంబేద్కర్ అనాడే గ్రహించి రాష్ట్రాల విభజన సమయంలో అడ్డంకులు ఏర్పడకుండా ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానికి పూర్తి అధికారాలు ఇచ్చారని పేర్కొన్నారు. అంబేద్కర్ భిక్ష వల్లే తెలంగాణరాష్ట్ర సాధన సాధ్యమైందన్నారు. అంబేద్కర్ తీసుకొచ్చిన రిజర్వేషన్లతో చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగాకొనసాగుతున్నామని అన్నారు. కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎస్పీ శివకుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశించిన లక్ష్య సాధన కోసం ప్రజలు ముందుకు సాగాలని అన్నారు. కార్పొరేటర్లు, వివిధ దళిత, ఉద్యోగ సంఘాల నాయకులు కట్ల సతీష్,కంసాల శ్రీనివాస్,అంజన్కుమార్, బండారి వేణు, సత్యనారాయణరెడ్డి, అర్ష మల్లేశం, సునీల్రావు,కన్న కృష్ణ, కర్ర రాజశేఖర్, గంట కళ్యాణిశ్రీనివాస్, సరిళ్ల ప్రసాద్, మెండి చంద్రశేఖర్, కొరివి వేణుగోపాల్,కన్నం అంజయ్య, దళిత సంఘాల నాయకులు మేడి రాజవీరు, జానపట్ల స్వామి, వి.రాజమల్లయ్య పాల్గొన్నారు. అంబేద్కర్ వర్ధంతి ఏర్పాట్లపై అధికారులు చిన్న చూపు చూస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ జేడీ నాగేశ్వర్రావుతో దళిత సంఘాల నాయకులు వాగ్వాదానికి దిగారు. -
వెబ్ కాస్టింగ్ ద్వారా శాంతిభద్రతల పర్యవేక్షణ
కరీంనగర్ క్రైం, న్యూస్లైన్: పోలింగ్ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. బుధవారం ఎస్పీ శివకుమార్ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిస్థితిని గమనిస్తూ పోలీసులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందించారు. త న కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్సీడీ ప్రొజెక్టర్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ సత్ఫలితాలు ఇచ్చిందని ఎస్పీ తెలిపారు. అంతా ప్రశాంతం మానకొండూర్ : జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎస్పీ శివకుమార్ అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. తొమ్మిదివేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. గ్రేహౌండ్స్తో పాటు సరిహద్దు రాష్ట్రాల పోలీసుల సహకారంతో ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన వెంట కరీంనగర్ రూరల్ సీఐ కమలాకర్డ్డి ఉన్నారు. -
శిక్షణ ఐపీఎస్లకు ఎన్నికల విధులపై అవగాహన
కరీంనగర్ క్రైం, న్యూస్లైన్: సార్వత్రికల ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల విధులు, అధ్యయనం కోసం విచ్చేసిన యువ శిక్షణ ఐపీఎస్ అధికారులకు ఎస్పీ శివకుమార్ సోమవారం ఎన్నికల విధులపై అవగాహన కల్పించారు. హైదరాబాద్ కేంద్రంలో శిక్షణ పొందుతున్న సుమారు 20 మంది ఐపీఎస్ అధికారులు జిల్లాకు వచ్చారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో పోలీసులు చేపడుతున్న చర్యలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అక్రమ కార్యకలాపాల నియంత్రణ, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న చర్యలు, రోడ్ ఓపెనింగ్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ విధులపై వారికి ఎస్పీ పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ సుబ్బారాయిడు, ఎలక్షన్ సెల్ సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
కొత్త ఎస్పీగా శివకుమార్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ కొత్త ఎస్పీగా ఉప్పుల శివకుమార్ నియమితులయ్యారు. ఇక్కడ ఎస్పీగా ఉన్న వి.రవీందర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. శివకుమార్ ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి డీసీపీగా పనిచేస్తున్నారు. గ్రూప్-1కు ఎంపికైన ఆయన 1994లో డీఎస్పీగా నియమితులయ్యా రు. మహబూబ్నగర్ జిల్లా వనపర్తిలో తొలి పోస్టింగ్ పొందారు. తర్వాత ఆవనిగడ్డ, కరీంనగర్లో ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేశారు. అనంతరం పదోన్నతిపై విజయనగరంలో అదనపు ఎస్పీగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీలోబాధ్యతలు నిర్వర్తించారు. కోసావో ఐక్యరాజ్య సమితి మిషన్లో పనిచేశారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఏడేళ్లు పనిచేసిన ఆయన ఈ ఏడాది జనవరి 1న మల్కాజిగిరిడీసీపీగా బదిలీ అయ్యారు. అక్కడ పది నెలలు పనిచేసి.. కరీంనగర్ ఎస్పీగా వస్తున్నారు. 1952 జూలై 9న వరంగల్లో జన్మించిన ఆయన.. వరంగల్ నిట్లో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అక్కడే ఐదేళ్లపాటు ఇంజినీరింగ్ పనిచేశారు. -
పెను విషాదం
పండగ శోభ ఇంకా తగ్గలేదు. దసరా సందడి ఇంకా సద్దుమణగలేదు. ఇంతలోనే ఓ దుర్వార్త అయిదు కుటుంబాలను వణికించింది. బెజవాడ కనకదుర్గ దర్శనానికి టవేరా వాహనంలో బయల్దేరిన వారిలో అయిదుగురు రాజమండ్రి వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మృతుల్లో నలుగురు యువకులే. సోమవారం రాత్రి డ్రైవర్తో సహా తొమ్మిది మంది పెదగంట్యాడ కొత్త కర్ణవానిపాలెం నుంచి బయల్దేరారు. మంగళవారం వేకువజామున తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు జాతీయరహదారి సమీపంలోని సుద్దకొండ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. దీంతో శివకుమార్, రమేష్, అప్పల శ్రీను, శ్రీనివాసరావుతో పాటు వాహనం డ్రైవర్ శంకర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల్లో శ్రీనివాసరావుకు అయిదు నెలల క్రితమే వివాహమైంది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. దుర్గమ్మ దర్శనం కోసం బయలుదేరిన భవానీ భక్తులు మార్గంమధ్యలో రోడ్డు ప్రమాదంలో అశువులు బాశారు. రాజమండ్రి జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ప్రమాదంలో పెదగంట్యాడ మండలం కొత్త కర్ణవానిపాలెం గ్రామానికి చెందిన నలుగురు, ప్రహ్లాదపురం శ్రీనివాసనగర్కు చెందిన వాహన డ్రైవర్ దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో కొత్త కర్ణవానిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు గ్రామంలో మిన్నంటాయి. న్యూస్లైన్, పెదగంట్యాడ దేవీనవరాత్రుల సందర్భంగా గ్రామానికి చెందిన గొన్న శివకుమార్(26), గద్దె శ్రీనివాసరావు (27), వెంకటేష్ (24), వానపల్లి అప్పలరాజు (24)లు భవానీ మాలలు ధరించారు. సోమవారం రాత్రి అనుపోత్సవం నిర్వహించి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం బయల్దేరారు. వారితో పాటు యర్రా రమేష్(26), విరోతి అప్పలశ్రీను (28) అతని భార్య శిరీష (23), చిననడుపూరు గ్రామానికి చెందిన గురుభవానీ పగడాల జోగారావు (45), ప్రహ్లాదపురం శ్రీనివాసనగర్ చెందిన దమన్సింగ్ శంకర్(26) (డ్రైవర్) టవేర వాహనంలో ప్రయాణిస్తూ తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు జాతీయరహదారి సమీపంలోని సుద్దకొండ వద్ద ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో శివకుమార్, రమేష్, అప్పలశ్రీను, శ్రీనివాసరావుతో పాటు వాహనం డ్రైవర్ శంకర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆందోళనలో కుటుంబసభ్యులు విషయం తెలుసుకున్న కు టుంబ సభ్యులు సంఘటన స్థలానికి పయనమయ్యారు. కొందరు ఇంటి వద్దే ఉంటూ సమాచారం తెలుసుకుంటున్నారు. క్షతగాత్రులు రాజ మండ్రి, కాకినాడలోని ప్రభు త్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బంధువులు, స్నేహితుల పరామర్శలతో కొత్త కర్ణవానిపాలెంలో విషాదఛాయలు ఆలుముకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, మాజీ కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. పెద్ద దిక్కు దూరం.. దేవునిదే భారం యర్రా రమేష్ దుర్మరణంతో ఆ కుటుంబం ఆధారం కోల్పోయింది. తండ్రి దేముడు పక్షవాతంతో బాధపడుతుండగా, తల్లి వెంకయ్యమ్మ ఇతర అనారోగ్య కారణాలతో సతమతమవుతుంది. రమేష్కు పదో తరగతి చదువుతున్న తమ్ముడు నగేష్ ఉన్నాడు. షిప్యార్డులో ఓ ప్రైవేటు ఫ్యాబ్రికేషన్ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్న రమేష్ మరణించినట్టు తల్లిదండ్రులకు తెలియపర్చలేదు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోవడంతో సోదరుడు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్గా ఎంపికైన తరుణం గొన్నా శివకుమార్ ఇటీవల ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులంతా ఆనందంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అతని మరణ వార్త వారిని కలిచివేసింది. అతని తల్లిదండ్రులు రామారావు, అప్పలనర్సమ్మ గుండెలవిసేలా రోదిస్తున్నారు. స్టీల్ప్లాంట్ జనరల్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న రామారావుకు కుమార్తె భాగ్యలక్ష్మితో పాటు శివకుమార్, కనకరాజు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె వివాహం చేశారు. రెండో కుమారుడైన కనకరాజు బీకాం చదువుతున్నాడు. వివాహమైన ఐదు నెలలకే.. రెండేళ్ల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన గద్దె శ్రీనివాసరావుకు ఈ ఏడాది మే 30న కశింకోట గ్రామానికి చెందిన నాగమణితో వివాహమైంది. ప్రస్తుతం ఫార్మాసిటీలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. శ్రీనివాసరావు మరణవార్తతో అతని భార్య నాగమణి రోదనలు అక్కడివారిని కలచివేసింది. అల్లుడు మరణంతో నాగమణి తల్లిదండ్రులు ఉషారత్నం, గోవింద్రాజు కుమార్తెను పట్టుకొని గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారు. ప్రమాదంలో శ్రీనివాసరావు సోదరుడు వెంకటేష్కు తీవ్రగాయాలయ్యాయి. దుఃఖసాగరంలో శ్రీను కుటుంబం స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న విరోతి అప్పల శ్రీను, శిరీషకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రమాదంలో అతడు దుర్మరణం పాలవ్వగా, శిరీష తీవ్రగాయాలతో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లిదండ్రులు దేముడు, వరహాలమ్మ అనారోగ్యంతో ఉండడం వల్ల కుమారుని మరణవార్త వారికి చెప్పలేదు. కర్ణవానిపాలేనికి చేరుకున్న శిరీష తల్లిదండ్రులు ప్రమాదాన్ని తలుచుకుంటూ కుమిలిపోతున్నారు. కుటుంబసభ్యులు హుటాహుటిన రాజమండ్రికి తరలివెళ్లారు. మృత్యు శకటాలు మర్రిపాలెం, న్యూస్లైన్ : ప్రమోదంగా సాగాల్సిన ప్రయాణం ప్రమాదభరితంగా మారుతోంది. జాతీయ రహదారిపై నిలిపి ఉన్న వాహ నాలు జనం ఉసురు తీస్తున్నాయి. నిత్యం రహదారులకు రక్తతర్పణం చేస్తున్నాయి. ఎన్నో కుటుంబాలను అనాథలను చేసి నడిరోడ్డున పడేస్తున్నాయి. అయినా అధికారులు మొద్దు నిద్ర వీడడంలేదు. రహదారి నిబంధనలను కఠినంగా అమలుపరచడం లేదు. దీంతో డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కొన్ని నెలల క్రితం నక్కపల్లిలో ఆగి ఉన్న లారీని స్కార్పియో ఢీకొన్న ప్రమాదంలో నగరానికి చెందిన నలుగురు యువకులు బల య్యారు. ఇటీవల ఆగి ఉన్న కారును లారీ ఢీకొట్టడంతో విశాఖకు చెందిన బాపట్ల మున్సిపల్ కమిషనర్ దుర్మరణం చెందారు. మంగళవారం రాజమండ్రిలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడం తో విశాఖకు చెందిన ఐదుగురు మృతి చెందారు. హైవేపై వాహనాల పార్కింగ్ జాతీయ రహదారిపై ఇష్టానుసారంగా నిలిపే వాహనాల వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా లారీలను రోడ్డుకు అ డ్డం గా, కాస్త పక్కగా ఆపేసి తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. అతి వేగంతో వచ్చే వాహనాలు గమనించక ప్రమాదాలకు గురవుతున్నాయి. పర్యవేక్ష ణ లోపం పోలీస్ పెట్రోలింగ్, హైవే అథారిటీ సిబ్బంది రోడ్లను నిరంతరం పర్యవేక్షించాలి. రోడ్డు పక్క గా నిలిపి ఉన్న వాహనాల పట్ల కఠినంగా వ్యవహరించాలి. పోలీసులు నో పార్కింగ్ కేసులు నమోదు చేయాలి. కానీ అలా జరగడం లేదు. రోడ్డుకు ఆనుకొని వెలసిన హోటల్స్, దాబాలు, రె స్టారెంట్లు, మద్యం షాపుల వద్ద నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు పార్కింగ్ చేసినా చూసీచూడనట్టు వ్యవహరిసున్నారు. కాసులకు కక్కు ర్తి పడే మిన్నకుంటున్నారని ఆరోపణలు ఉన్నా యి. వీరు తమ విధుల్లో కాస్త కఠినంగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. -
శివకుమార్కు సేవారత్న అవార్డు
గుమ్మిడిపూండి, న్యూస్లైన్: పంచాయతీని అభివృద్ధి చేయడమేకాకుండా పలు ప్రజాహిత కార్యక్రమాల్లో చేపట్టిన పంచాయతీ అధ్యక్షుడు కేఎంఎస్ శివకుమార్ సేవారత్న అవార్డు ను అందుకున్నారు, గుమ్మిడిపూండి యూనియన్ పరిధి ఈగువారిపాళెం పంచాయతీకి అధ్యక్షుడిగా ఉన్నారు. రెండు రోజుల కిందట రాష్ర్ట గవర్నర్ రోశయ్య చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. తెలుగు గ్రామమైన ఈగువారిపాళెంకు 2012లో శివకుమార్ పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యా రు. ఎంకామ్ చదవిన ఈయన ఒక పక్క పంచాయతీని అభివృద్ధి చేస్తూనే మరో పక్క పంచాయతీ పరిధిలోని ప్రైవేటు కంపెనీల సహాకారంతో ప్రజాహిత కా ర్యక్రమాలు చేపట్టారు. వైద్యశిబిరాలు, ప్లాస్టిక్ నిషేదం,మద్య నిషేదం,బడిమానివేసిన పిల్లలను బడిలో చేర్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. అం తేకాకుండా బాల్యవివాహాలు,అంటరానితనంపై ప్రజల్లో అవగాహన కల్పిం చారు. పంచాయతీ పరిధిలో వంద శా తం మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య మెరుగు, ప్రతి గ్రామంలో సభలో నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కారం చూపుతూ అతి కొద్ది కాలంలోనే ఈ యువ పంచాయతీ అధ్యక్షుడు ప్రజల మన్నలు పొం దారు. అంతేకాకుండా చెన్నైకి చెందిన చెన్నై మెట్రో వార్త పత్రికలో ఈ పంచాయతీ అభివృద్ధి భవిష్యత్తు ప్రణాళిక వ్యాసాలు రాశారు. వీటికి గుర్తింపుగా చెన్నై మెట్రో పత్రిక 2013 సంవత్సరంకుగాను రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ పంచాయతీ అభివృద్ధి చేసిన అధ్యక్షుడు ఎంపిక చేసింది. అందుకుగాను ఈ తెలుగు గ్రామ అధ్యక్షుడు శివకుమార్ సేవారత్న 2013 అవార్డును పొందారు. ఈ అవార్డును రాష్ట్ర గవర్నర్ రోశయ్య చేతుల మీదగా శివకుమార్ రెండు రోజుల క్రితం అందుకున్నారు. ఈ సం దర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి మౌలిక వసతులు కల్పన కోసం కృషి చేయనున్నట్లు చెప్పారు. తన సేవలను గుర్తించి సంస్థ సేవారత్న అవార్డుకు ఎంపిక చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలి పారు. పంచాయతీ అభివృద్ధిలో తనకు సహకరించిన వార్డు సభ్యులు, గ్రామ నిర్వాహణాధికారి, గ్రామ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఏసీబీ వలలో లైన్మేన్
విజయవాడ, న్యూస్లైన్ : విద్యుత్తు లైన్ కేటగిరి మార్పు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన లైన్మ్యాన్ను ఏసీబీ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. విజయవాడలోని చిట్టినగర్ సొరంగం రోడ్డులో నవభారత్ పబ్లిక్ స్కూల్ ఉంది. దీన్ని ఇటీవల భవనం రెండో అంతస్తులోని రేకుల షెడ్డులోకి మార్చారు. డొమిస్టిక్ కేటగిరీలో ఉన్న విద్యుత్తు కనెక్షన్ను కమర్షియల్ కేటగిరీలో మార్పుచేయాలని కరస్పాండెంట్ ముద్దాడ శివకుమార్ లైన్మ్యాన్ సాంబశివరావును కోరారు. అందుకు నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని సాంబశివరావు డిమాండు చేశారు. అంత మొత్తం ఇవ్వలేనని శివకుమార్ చెప్పడంతో కనెక్షన్ కట్ చేస్తానని లైన్మ్యాన్ హెచ్చిరించారు. దీంతో ఈ నెల 16వ తేదీన శివకుమార్ చిట్టినగర్ విద్యుత్తు కార్యాలయం ఏఈ సింహచలంకు కేటగిరి మార్పు చేయాలంటూ దరఖాస్తు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సాంబశివరావు డబ్బు కోసం మరోమారు శివకుమార్పై ఒత్తిడి పెంచారు. డబ్బు ఇవ్వకుంటే మూడు నెలల బకాయిలు ఉన్నట్లు చూపిస్తాననంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో శివకుమార్ ఏసీబీ డీఎస్పీ ఆర్ విజయ్పాల్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తున్న సమయంలోనే శివకుమార్కు సాంబశివరావు ఫోన్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులు సూచించినట్లు సాంబశివరావుకు ఫోన్ చేసి ఆదివారం ఉదయం ఒంటిగంటకు స్కూల్ వద్దకు రావాలని శివకుమార్ చెప్పారు. అక్కడికి చేరుకున్న సాంబశివరావు రూ.500 నోట్లు నాలుగు ఇచ్చారు. ఆ డబ్బు జేబులో పెట్టుకున్న వెంటనే ఏసీబీ అధికారులు సాంబశివరావును పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఏసీబీ డీఎస్పీ విజయ్పాల్ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు రవి, శ్రీనివాస్, నాగరాజు, సీతారాం ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అవినీతి ఉద్యోగుల్లో.. ఏసీబీ గుబులు ఏసీబీ వరుస దాడులతో ప్రభుత్వ శాఖల్లో అవినీతిపరులను వణికిస్తోంది. గత నెలరోజుల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏసీబీ అధికారులు నాలుగు దాడులు చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ వారం రోజుల్లో రోజువిడిచిరోజు వరుసగా ముగ్గురిని అరె స్టు చేశారు. ఈ నెల 10న నాగార్జునా యూనివర్సిటీలో ఓ ఉద్యోగి వెయ్యి రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. 23న విజయవాడలో ఎక్సైజ్ కార్యాలయంపై దాడిచేసి నెలవారీ మామూళ్లు డిమాండ్ చేసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ బీ శ్రీలతను, కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సత్యనారాయణను అరెస్టు చేశారు. నెలవారీ మూమూళ్ల కింద రూ.40 వేలు లంచం తీసుకున్నారని ఏసీబీ వారిద్దరిపై కేసు నమోదు చేసింది. ఈ ఘటనతో జిల్లాలో ఎక్సైజ్ అధికారులు ఆందోళనకు గురయ్యారు. సాక్షాత్తూ ఎక్సైజ్ సూపరింటెండెంట్నే అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకోవటం సంచలనం కలిగించింది. అనంతరం 28న మంగళగిరిలో హార్టీకల్చర్ అధికారి సత్యనారాయణను రూ.6 వేలు లంచం తీసుకుంటున్న కేసులో అరెస్టు చేశారు. తాజాగా 29వ తేదీ ఆదివారం విజయవాడ చిట్టినగర్లో లైన్మన్ సాంబశివరావు వినియోగదారుని సర్వీసు కేటగిరీ మార్చటానికి రూ.2 వేలు లంచం అడిగి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తుండటంతో ప్రభుత్వ శాఖల్లో అక్రమ సంపాదనకు అలవాటుపడిన ఉద్యోగులు, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.