-
2025 సంక్రాంతి మూవీస్ ఇవే..
-
2025 సంక్రాంతికి పొట్టి పడబోతున్న సీనియర్ హీరోలు
-
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడంలో ఎల్లప్పుడూ ముందుండే సింగపూర్ తెలుగు సమాజం.. సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించింది. సింగపూర్లోని PGP హాల్లో జరిగిన ఈ వేడుకలకు తెలుగువారు భారీగా తరలివచ్చారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా వరుసగా ఏడోసారి తెలుగు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. బాలబాలికలు రామాయణాన్ని చక్కగా ప్రదర్శించి పలువురి మన్నలను పొందారు. అచ్చ తెలుగు పిండివంటలు, 34 రకాల నోరూరించే వంటకాలతో కూడిన భోజనం స్థానిక తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు సంక్రాంతి వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన వారందరికీ STS అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు పేరునా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తమ కార్యవర్గం గత సంవత్సర కాలంగా నిర్వహించిన కార్యక్రమాలను వివరించడంతో పాటు అందరూ మరింత సహాయ సహకారాలను అందించాలని, 50వ ఆవిర్భావ దినోత్సవం లోపు సమాజ భవన స్వప్నాన్ని సాకారం చేసే దిశగా తోడ్పాటు నందించాలన్నారు. -
మొత్తం సినీ ఇండస్ట్రీకి కలిసొచ్చిన సంక్రాంతి 2024
-
ఆర్టీసీకి హ్యాపీ సంక్రాంతి!
సాక్షి, విశాఖపట్నం: ఆర్టీసీకి సంక్రాంతి సంతోషాన్నిచ్చింది. ఈ ఏడాది ఊహించిన దానికంటే అధిక ఆదాయాన్ని ఆర్జించింది. ఈనెల ఎనిమిదో తేదీ నుంచే సంక్రాంతి రద్దీ మొదలైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విశాఖ జిల్లా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను అందుబాటులోకి తెచ్చారు. 765 సంక్రాంతి స్పెషల్ సర్వీసులను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 22వ తేదీ వరకు నడిపారు. వీటిలో జోన్–1 నుంచి హైదరాబాద్కే 120కి పైగా బస్సులను తిప్పారు. గత సంక్రాంతికి కేవలం 60 బస్సులనే నడపగా ఈసారి వాటిని రెట్టింపు చేశారు. తెలంగాణలో మహలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించడంతో ఎక్కువ బస్సులను అక్కడ అవసరాలకే కేటాయించారు. ఫలితంగా సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ బస్సుల కొరతతో ఆంధ్రప్రదేశ్ వైపు స్పెషల్ సర్వీసులను గణనీయంగా తగ్గించింది. దీంతో ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్–విశాఖపట్నంల మధ్య ఎక్కువ సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రయత్నం బాగా ఫలించి మంచి ఆదాయాన్ని సమకూర్చింది. గత సంక్రాంతికి విశాఖ జిల్లా నుంచి 745 స్పెషల్స్ను నడపగా.. ఈ సంవత్సరం 20 బస్సులను అదనంగా వెరసి 765 స్పెషల్స్ను నడిపారు. వీటిలో సంక్రాంతికి ముందు 472, తర్వాత 293 సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. వీటిని ప్రయాణికుల డిమాండ్, రద్దీకి అనుగుణంగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, శ్రీకాకుళం, పార్వతీపురం, పలాస, పాలకొండ, రాజాం, విజయనగరం, బొబ్బిలి, సాలూరు తదితర ప్రాంతాలకు ఎక్కువ సర్వీసులు తిప్పారు. ఈ స్పెషల్ బస్సుల ద్వారా సంక్రాంతి దాకా రూ.79,81,655, అనంతరం రూ.74,64,119 వెరసి రూ. 1,54,45,774 రాబడి వచ్చింది. గత సంక్రాంతికి రూ.1,41,57,400 ఆదాయాన్ని ఆర్జించింది. అంటే గత సంక్రాంతికంటే సుమారు రూ.12 లక్షలకు పైగా ఆదాయం సమకూరిందన్న మాట! పెరిగిన ఆక్యుపెన్సీ రేషియో మరోవైపు ఈ సంక్రాంతికి ప్రయాణికుల ఆక్యపెన్సీ రేషియో (ఓఆర్) కూడా బాగానే పెరిగింది. గతేడాది ఓఆర్ 62 శాతం ఉండగా ఇప్పుడది 67 శాతానికి చేరింది. కిలోమీటరుకు రూ.42.90 ఆదాయం సమకూరింది. కాగా సంక్రాంతి పండగకు వచ్చి తిరుగు ప్రయాణమయ్యే వారిని దృష్టిలో ఉంచుకుని ఈనెల 28వ తేదీ వరకు స్పెషల్ సర్వీసులను నడుపుతామని విశాఖ జిల్లా ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి ఎ.అప్పలరాజు ‘సాక్షి’కి చెప్పారు. -
మస్కట్లో సంక్రాంతి సంబరాలు
ఒమన్ దేశ రాజధాని మస్కట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఒమన్లో స్థిరపడ్డ తెలుగు ప్రజలు, వీరి కోసం వచ్చిన తెలుగు ప్రముఖుల మధ్య రెండు రోజుల పాటు శోభాయమానంగా వేడుకలు నిర్వహించారు. 'రాయల్ కింగ్ హోల్డింగ్'తోపాటు 'చిరు మెగా యూత్ ఫోర్స్' సంయుక్తంగా నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ అలరించాయి. ఇటీవల సినీరంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రముఖులు.. డా. మాగంటి మురళీ మోహన్ గారిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఒమన్ దేశ చిహ్నం అయిన కంజరి నడుముకు తొడిగి స్వర్ణ కంకణంతో గౌరవించడం ఈ వేడుకలో ప్రధానఘట్టంగా నిలిచింది. టాలీవుడ్ నిర్మాత, సినీ పంపిణీదారు వ్యాపారవేత్త బుర్ర ప్రశాంత్ గౌడ్తోపాటు సీపీవైఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షలు రామదాస్ చందక ఈ వేడుకలు నిర్వహించారు. డా. మురళీమోహన్తో పాటు టాలీవుడ్ నటీమణులు.. రజిత, మధుమని, పింకీ, సోనియా చౌదరి, టివి నటి సంజన సంక్రాంతి వేడుకలకు కొత్త కళను తెచ్చారు. వేడుకలకు కుమారి మాధవి రెడ్డి చేసిన యాంకరింగ్ ఆకట్టుకుంది. సింగర్లు హనుమాన్, స్వాతి సత్యభామ, మోనికా యాదవ్ లు తమ సంగీతంతో ప్రేక్షుకలును కట్టిపడేసారు. పాటలకు తగ్గ డ్యాన్సులతో సందడి నెలకొంది. వేడుకలో ఢీ ఫేమ్ గోవింద్ టీమ్ స్టెప్పులతో స్టేజిని దులిపారు. జబర్దస్త్ సుధాకర్ తన కామెడీతో కడుపు ఉబ్బా నవ్వించారు. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన మరో కళాకారుడు ఎమ్ఎస్ఆర్ నాయుడు తన వెంట్రిలాక్కుజమ్ నైపుణ్యంతో పిల్లలను అలరించారు. ఈ సంక్రాంతి సంబరాలకు హైదరాబాద్ నుంచి ఇన్కంటాక్స్ మాజీ అధికారి శ్రీకర్ వేముల, వ్యాపారవేత్త రమేష్ గౌడ్లు హాజరయ్యారు. ఒమన్లో వివిధ రంగాల్లో వ్యాపారాభివృద్ధి గురించి పరిశీలన చేశారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా సామాజిక బాధ్యతను మరిచిపోలేదు తెలుగు బిడ్డలు. ఇప్పటివరకు 20 సార్లకు పైగా రక్తదానం చేసిన 30 మంది యువతీయువకులకు మురళీమోహన్ సత్కరించారు. అంబేద్కర్ సేవాసమితి మహిళామణుల అధినేత శ్రీలతాచౌదరి శాలువాతో సత్కరించారు. ఇందులో భాగంగా తెలుగు కమ్యూనిటీకి విశేష సేవలను అందిస్తున్న రాజేష్ మడకశిరను మెమొంటోతో సత్కరించారు. ఈ వేడుక జరిగేందుకు అన్ని రకాలుగా సహకరించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థ, వైబ్రాంట్ సంస్థకు చెందిన పెద్దలు.. మల్లారెడ్డి, రవీంద్ర రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, సీఈఓ శ్రీనివాస్ రావులను సత్కరించారు. సంబరాల్లో సహాయ సహకారాలను అందించిన బాలాజీ, చంద్రశేఖర్, ప్రసాద్ రెడ్డి, నాగభూషణ్ను సన్మానించారు. సంక్రాంతి సంబరాలకు సహకరించిన రాయల్ కింగ్ యాజమాన్యానికి (రెన్నీ జాన్సన్ అండ్ టీం) అభినందనలు తెలిపారు. -
Kodi Pandalu In AP Photos: సంక్రాంతి సంబరాల్లో జోరుగా సాగిన కోడి పందేలు.. కోలాహలం (ఫొటోలు)
-
Hyderabad: కారు మాత్రమే నీది.. రోడ్డు కాదు
హైదరాబాద్: సంక్రాంతి పండగ సందర్భంగా చాలామంది సొంతూళ్లకు వెళ్లడంతో నగర రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఇంకేముంది.. పలువురు బడాబాబులు ఖరీదైన కార్లు, బైక్లకు పని చెప్పారు. సైలెన్సర్లు మార్చి భారీ శబ్దాలతో రోడ్లపై వేగంగా దూసుకెళ్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేశారు. ఆదివారం రాత్రి బంజారాహిల్స్ రోడ్డునెంబర్–1 నుంచి లాంబోర్గిని కారు (టీఎస్09 జీడీ 9777)లో ఓ యువకుడు మితిమీరిన వేగంతో, భారీ శబ్దంతో దూసుకెళ్లి న్యూసెన్స్ సృష్టించాడు. ఈ కారును ఓ యువకుడు ఫొటోలు తీశాడు. ‘కారు మాత్రమే నీది.. రోడ్డు కాదు’ అంటూ ట్వీట్ చేయడంతో వైరల్గా మారింది. సోమవారం రోజంతా సోషల్ మీడియాలో ఈ ట్వీట్ చక్కర్లు కొట్టడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. సదరు కారు నడిపిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు. లాంబోర్గిని కారును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించడంతో పోలీసులు వేట ప్రారంభించారు. ట్వీట్ చూసిన సదరు కారు నడిపిన యువకుడు తన మొబైల్ ఫోన్ స్విచ్ఛాప్ చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కూతురికి సంక్రాంతి కానుక ఇచ్చేందుకు ..70 ఏళ్ల తండ్రి ఏకంగా..!
దేశమంతా సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. ఒక్కోచోటు ఒక్కో తీరులో వేడుకలు అంబరాన్ని అంటేలా ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇక తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు చాలా వినూత్నంగా ఉంటాయి. ఈ పండుగ సందర్భంగా కూతూరికి అల్లుడికి బట్టలు పెట్టడం, కానుకలు ఇవ్వడం వంటివి చేస్తారు. అలానే తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ తండ్రి కూతురికి సంక్రాంతి కానుక ఇచ్చేందుకు ఎంత పెద్ద సాహసం చేశాడో వింటే షాకవ్వుతారు. అక్కడ చెరుకు గడలతో పాయసం వండుతారు. అందుకని 70 ఏళ్ల వయసులో ఉన్న ఈ తండ్రి 14 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించి మరీ సంక్రాతి కానుక అందించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే..తమిళనాడు రాష్ట్రం పుదు కొట్టై ప్రాంతానికి చెందిన చెల్లాదురై వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తుంటాడు. ఇతడి కూతురు పేరు సుందర పాల్. ఈమెకు 2006లో వివాహం జరిగింది. వివాహం జరిగి 10 సంవత్సరాల వరకు ఆమెకు పిల్లలు కలగలేదు. 2016లో ఆమె గర్భం దాల్చింది. ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఇక అప్పటినుంచి చెల్లదురై ఆనందానికి అవధులు లేవు. అప్పటినుంచి తన కూతురి ఇంటికి ప్రతి సంక్రాంతికి చెల్లాదురై వెళ్లి..ఆమెకు, ఆమె పిల్లలకు ఏదో ఒక కానుక ఇచ్చి వస్తుంటారు. అక్కడ సంక్రాంతి పండుగను భారీగా నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా కొత్త పంటలు ఇంటికి రావడంతో అక్కడ చెరకు గడలతో పాయసం వండుకోవడం అనేది ఆచారం. అయితే ఈ సంక్రాంతికి తన కూతురు, మనవరాళ్ల కోసం చెల్లాదురై సాహసం చేశారు. పుదుకొట్టై ప్రాంతంలో ఉంటున్న తన కూతురి కోసం చెరుకు గడల గుత్తిని తలపై పెట్టుకుని 14 కిలోమీటర్ల పాటు ప్రయాణించి ఆమె ఇంటికి వెళ్లారు. చెరుకు గడలు ఆమెకు ఇచ్చారు. మనవరాళ్లకు కొత్త దుస్తులు కొనిచ్చారు. అయితే ఇలా చెల్లాదురై తలపై చెరుకు గడలు పెట్టుకొని సైకిల్ తొక్కుతున్న వీడియోను ఓ యువకుడు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట హాట్టాపిక్గా మారింది. #WATCH | Pudukkottai, Tamil Nadu: An elderly man carried a bunch of sugarcane on his head and rode a bicycle for 14 kilometres to give it as a Pongal gift to his daughter. People watched him with surprise and cheered for him on his way pic.twitter.com/gvxQPGjXz1 — ANI (@ANI) January 14, 2024 (చదవండి: శాండ్విచ్ బ్యాగ్ ధర వింటే షాకవ్వడం ఖాయం!) -
తగ్గని వేడి..పందెం కో‘ఢీ’
భీమవరం/అమలాపురం టౌన్: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కోడి పందేలు మూడో రోజైన మంగళవారం కూడా కొనసాగాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెదఅమిరం, సీసలి, పెన్నాడ, యలమంచిలి మండలం కలగంపూడి, పూలపల్లి, పోడూరు మండలం కవిటం, వీరవాసరం మండలం జొన్నలపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం ప్రాంతాల్లో పందేలు జోరుగా సాగాయి. ఏలూరు జిల్లా పరిధిలోని ఉంగుటూరు, కైకలూరు, నూజివీడు, దెందులూరు, చింతలపూడి, ఏలూరు తదితర నియోజకవర్గాల్లో పందేల జోరు కొనసాగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు రోజుల్లో దాదాపు రూ.500 కోట్లకు పైగా చేతులు మారినట్టు చెబుతున్నారు. కోడి పందేలతో పాటు గుండాట, పేకాట వంటి జూదాలు విచ్చలవిడిగా నిర్వహించారు. పందేల రాయుళ్లను ఆకర్షించేందుకు భీమవరం సమీపంలోని పెన్నాడ శిబిరం వద్ద ఎక్కువ పందేలు గెల్చుకున్న వారికి బుల్లెట్, స్కూటీ వంటి వాహనాలను బహుమతులుగా ఇచ్చారు. చిన్న గ్రామాల్లో సైతం కోడి పందేల జోరు కనిపించింది. తూర్పున 80 బరుల్లో.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు 80 ప్రధాన బరుల్లో కోడి పుంజులు తలపడ్డాయి. హైదరాబాద్ వంటి సుదూర ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడ్డ వారంతా కుటుంబాలతో సహా సొంతూళ్లకు వచ్చి కోడి పందేల బరుల వద్దకు వెళ్లి ఆసక్తిగా తిలకించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో వెలిసిన భారీ పందెం బరిలో రూ.కోట్లు చేతులు మారాయి. మలికిపురం, రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట, అమలాపురం రూరల్, అల్లవరం, రాయవరం తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో వెలిసిన బరుల్లో కోడి పందేలు జోరుగా జరిగాయి. కాకినాడ జిల్లా వేట్లపాలెం, మేడపాడు, ఉండూరు, అచ్చంపేట, పులిమేరు, తూర్పుగోదావరి జిల్లాలో కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, అనపర్తి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో పందెం కోళ్లు సై అంటే సై అన్నాయి. కృష్ణా జిల్లాలోని ఈడుపుగల్లు, ఉప్పులూరు, గొడవర్రు, అంపాపురం, కంకిపాడు, కొత్తూరు తాడేపల్లి, మేకావానిపాలెం, ఎనీ్టఆర్ జిల్లా వెలగలేరు తదితర ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహించారు. -
కొత్త అల్లుళ్లకు బాహుబలి విందు
కొయ్యలగూడెం/రాజానగరం: సంక్రాంతి రోజుల్లో కొత్త అల్లుళ్లకు చేసే మర్యాద అంతా ఇంతా కాదు. ఈ విషయంలో గోదారోళ్లకు పెట్టింది పేరు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం, రాజవరం గ్రామానికి చెందిన కాకి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతుల కుమార్తె జ్యోత్స్నకు విజయవాడకు చెందిన చీమకుర్తి శ్రీమన్నారాయణ, దీప్తి కుమారుడు లోకేశ్ సాయితో ఇటీవల వివాహం జరిగింది. సంక్రాంతికి కొత్త అల్లుడిని 225 రకాల తినుబండారాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగను ఇంత సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. 150 రకాలతో.. తూర్పు గోదావరి జిల్లా రాజానగరానికి చెందిన చవ్వా నాగ వెంకట శివాజీ సంక్రాంతి పండగకు వచ్చిన అల్లుడు రిషీంద్రకు అత్తమామలు సునీతరాణి, శివాజీ 150 రకాలతో ఘనంగా విందు భోజనం ఏర్పాటు చేశారు. -
సంక్రాంతి కోసం ఖండాలు దాటొచ్చారు..
పెద్దపల్లిరూరల్: సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని బ్రిటన్ నుంచి పెద్దపల్లికి వచ్చారు దరియా–అరుణ్ దంపతులు. ఉద్యోగ నిమిత్తం బ్రిటన్ వెళ్లిన అరుణ్ అక్కడ పోలెండ్ దేశస్తురాలు దరియాను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి పెద్దపల్లిలో ఉండే తల్లిదండ్రులు రాంరెడ్డి–రోహిణిల వద్దకు వచ్చాడు. భోగి పండుగ రోజు ఆదివారం అత్త రోహిణి ముగ్గులు వేయగా, కోడలు దరియా వాటిపై గొబ్బెమ్మలను ఉంచింది. అనంతరం స్థానిక కోదండ రామాలయంలో గోదాదేవిరంగనాథులస్వామి కల్యాణాన్ని వీక్షించడం ఆనందంగా ఉందని తెలిపింది. కల్యాణోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి ఫొటోలు దిగారు. -
పండగ వేళ.. స్వగృహానందం
సంక్రాంతి పండగవేళ పేదల్లో స్వగృహానందం నెలకొంది. సొంతిళ్లులేని వీరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 17,111 ఇళ్లను మంజూరు చేయగా వీటిలో 986 మంది నిర్మాణాలు పూర్తి చేశారు. నూతన గృహాల్లో సంక్రాంతి పండగను ఆనందంగా జరుపుకుంటున్నారు. మిగతా లబి్ధదారులు కూడా సొంతింటి కళను సాకారం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. సాక్షి, పాడేరు: జిల్లాలో ఇళ్లు లేని పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుజేస్తున్న పీఎంఏవై–వైఎస్సార్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం వరంలా మారింది. గతేడాది జిల్లాలోని 22 మండలాల్లో ప్రభుత్వం 17,111 పక్కా గృహాలను మంజూరు చేసింది. వీరిలో 1328 మంది గిరిజనులు వివిధ కారణాలతో ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. మిగతా 15,783 మందిలో 986 మంది పూర్తి చేశారు. మిగతా 14,791 మంది చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని ఈ ఏడాది మార్చి లోగా పూర్తి చేసే లక్ష్యంతో గృహ నిర్మాణశాఖ అధికారులు ఉన్నారు. ఈ బాధ్యతలను గ్రామసచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు అప్పగించారు. ఒక్కొక్క ఇంటికి రూ.1.80 లక్షలు ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వాలు రూ.1.80 లక్షలు మంజూరు చేశాయి. ఇందులో రూ.1.50 లక్షలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి. ఎన్ఆర్ఈజీఎస్లో కూలీ పనుల రూపంలో రూ.12 వేలు, బాత్రూం నిర్మాణానికి రూ.18 వేలు చెల్లిస్తున్నాయి. ఇంటి నిర్మాణం స్థాయినిబట్టి బిల్లుల మంజూరు ప్రక్రియ పారదర్శకంగా చేస్తున్నారు. పనులు మరింత వేగవంతానికి కలెక్టర్ సుమిత్కుమార్ తరచూ గృహ నిర్మాణశాఖ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు అదనంగా మరికొంత జోడించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సకాలంలో బిల్లుల చెల్లింపులు జిల్లా వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేశాం. గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పనుల్లో పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరుకల్లా ఎలాగైనా నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. బిల్లులు కూడా నిర్మాణ స్థాయిని బట్టి సకాలంలో మంజూరు చేస్తున్నాం. – బాబునాయక్, ఇన్చార్జి పీడీ, గృహ నిర్మాణశాఖ, పాడేరు -
Celebrities Sankranti Celebrations Pics: పండుగ వేళ అగ్రతారల సందడి ఇలా.. (ఫొటోలు)
-
Tirumala: నేడు శ్రీవారి పార్వేట ఉత్సవం.. అర్జిత సేవలు రద్దు
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. సర్వదర్శనం కోసం 24గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటలు. ఇక ఆదివారం 80,964 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 27,657 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు లెక్క తేలింది. నేడు శ్రీవారి పార్వేట ఉత్సవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన నేడు మంగళవారం (జనవరి 16న) అత్యంత ఘనంగా జరగనుంది. ఇదే రోజు గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు. గోదాపరిణయోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్స్వామి మఠం నుండి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకు వెళ్ళి స్వామివారికి సమర్పిస్తారు. ఆనంతరం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు. ఆర్జితసేవలు రద్దు : ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. -
Happy Pongal 2024: సంక్రాంతి వేడుకల్లో సందడి చేసిన సినీ తారలు (ఫోటోలు)
-
బీకామ్ బ్యాచ్.. పెద్ద సందడి..
అమలాపురం రూరల్: అసలే పెద్ద పండగ. వారంతా పూర్వ విద్యార్థులు. 28 ఏళ్ల తరువాత కలుసుకున్నారు. ఇంతకన్నా పెద్ద సందర్భం ఏముంటుంది వారి అల్లరికి? 1993–96 అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాల బీకాం బ్యాచ్ వారంతా. చదివింది బీకాం అయినా కామ్గా ఉండే బ్యాచ్ కాదది. అటువంటి వారంతా ఆదివారం ఆ కళాశాలలో సమావేశమయ్యారు. కలసిన సమయం అంతా నాటి అల్లర్లలోకి, సరదా కబుర్లలో మునిగి తేలిపోయారు. హైదరాబాద్ జీ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ప్రసాద్ ఈ బ్యాచ్లో సభ్యుడే. వారికి తోడు సినీ హీరో నాగార్జున వీడియో ద్వారా తన సందేశాన్ని విద్యార్థులకు పంపుతూ వారి కలయికను అభినందిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మా నిమ్మకాయల ప్రసాద్ కూడా అక్కడే ఉన్నారని నాగార్జున ఆ వీడియోలో ప్రస్తావించారు. దాదాపు 120 మందితో కూడి ఆ బ్యాచ్ కుటుంబ సమేతంగా ఎంతో సందడి చేశారు. వారికి పాఠాలు చెప్పిన అప్పటి అధ్యాపకులు డాక్టర్ పైడిపాల, కనకరాజు, వక్కలంక కృష్ణమోహన్ తదితరులను సాదరంగా ఆహ్వానించి పాదాభివందనాలు చేసి సన్మానించారు. పూర్వపు విద్యార్థులు మున్సిపల్ కౌన్సిలర్ గొవ్వాల రాజేష్, పిండి శేషు, నల్లా శ్రీధర్, సాపే శ్రీనివాస్ (హైదరాబాద్), కుమారి (గుజరాత్), చొల్లంగి సుబ్బిరామ్ తదితరులు పూర్వపు విద్యార్థులను సమీకరించి ఈ వేడుకకు ఏర్పాటుచేశారు. చివరగా తమ జ్ఞాపకాలను వారు పదిలం చేసుకుంటూ గ్రూప్ ఫోటో దిగారు. -
సై అంటున్న కోడి పుంజులు..
అమలాపురం టౌన్/సాక్షి నెట్వర్క్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి కోడి పందేలు ఆదివారం మొదలయ్యాయి. పండగ మూడు రోజులూ జరిగే ఈ పందేలను వీక్షించేందుకు, రూ.వేలు, రూ.లక్షల్లో కాసేందుకు వేలాదిగా తరలివస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 80 బరులు ఏర్పాటైనట్టు సమాచారం. వీటిలో దాదాపు రూ.20 కోట్ల మేర పందేల రూపంలో చేతులు మారతాయని అంచనా వేస్తున్నారు. తొలి రోజే రూ.6 కోట్ల వరకూ పందేలు జరిగాయని తెలుస్తోంది. హైదరాబాద్లో ఉద్యోగాలు, వ్యాపారాలతో స్థిరపడిన వారందరూ కార్లలో సొంతూళ్లకు వచ్చి మరీ కోడి పందేలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. బరుల వద్దకు మోటార్ సైకిళ్లు, కార్లలో అధిక సంఖ్యలో వస్తున్నారు. పలుచోట్ల బరుల వద్ద గుండాటలు కూడా ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వీటిని పోలీసులు అడ్డుకున్నారు. ►డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో భారీ బరి ఏర్పాటైంది. ఇక్కడ రూ.కోట్లలో పందేలు కాస్తున్నారు. మండల కేంద్రమైన మలికిపురంలో కూడా భారీ బరి ఏర్పాటు చేశారు. లక్కవరం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, అల్లవరం, అమలాపురం రూరల్ మండలం కామనగరువు, ఇందుపల్లిలో సైతం పెద్ద బరులు ఏర్పాటయ్యాయి. ముమ్మిడివరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిర్వాహకులు క్రికెట్ పోటీలను తలపించే రీతిలో కోడి పందేలు సాగిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి, బారికేడ్లు, ఎల్ఈడీ స్క్రీన్లతో బరులు ఏర్పాటు చేసి మరీ పందేలు నిర్వహించారు. ►తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, అనపర్తి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. నల్లజర్ల మండలంలో పోలీసులు గుండాటకు ఎక్కడా అనుమతించలేదు. ఇక్కడ మధ్యాహ్నం తర్వాతే పందేలు ప్రారంభించారు. ఎక్కడా మునుపటి ఉత్సాహం కనపడలేదు. తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు ఉదయం కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ మండలంలోని మలకపల్లిలో ఏర్పాటు చేసిన బరి వద్ద బౌన్సర్లను పెట్టి మరీ పందేలు నిర్వహించారు. నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల్లోని 25 బరుల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ►కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని వేట్లపాలెం, మేడపాడులో భారీ ఎత్తున పందేలు జరిగాయి. ఉండూరు, పులిమేరు, అచ్చంపేటల్లో కూడా బరులు ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్ సర్పవరం, గైగోలుపాడు తదితర చోట్ల కోడి పందేలపై పోలీసులు దాడి చేశారు. డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి, సీఐ వైఆర్కే శ్రీనివాస్ తదితరులు సిబ్బందితో వెళ్లి గుండాట బోర్డులను తొలగించి, పందేలు నిర్వహిస్తున్న వారిని హెచ్చరించారు. కరప మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలు జరిగాయి. -
సంక్రాంతికి ముగ్గులు వేయడంలో దాగున్న ప్రాశస్త్యం ఏంటీ?
'సంక్రాంతి వచ్చింది తుమ్మెద' 'సరదాలు తెచ్చింది తుమ్మెదా'.. అన్న పాటలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగ కోసం ఎక్కడెక్కడ ఉన్నవాళ్లు కష్టపడి మరి తమ సొంతూళ్లకి వచ్చేస్తారు. ఎంత ఖర్చు పెట్టి అయినా పండుగకి ఊరు వెళ్లి పోవాల్సిందే. అక్కడ ఉండే సందడే వేరు. ముఖ్యంగా కోడిపందాలు, పిండి వంటలతో ఊరు ఊరంతా సందడి సందిడిగా ఉంటుంది. ఈ పండుగల్లో మంచి ఆకర్షణగా కనిపించేవి ముగ్గులు. వచ్చిరాని పడుచులు సైతం ఏదో రకంగా ముగ్గు వేసి శభాష్ అనిపించుకోవాలని తెగ ఆరాట పడిపోతుంటారు. అసలు ఈ నాలుగు రోజుల పండుగల్లో కచ్చితంగా రకరకాల రంగవల్లులతో ముగ్గులు పెడతారు ఎందుకని? దీని వెనుక దాగున్న రహస్యం ఏంటీ? వాస్తవానికి సాధారణ రోజుల్లో కూడా ఇంటి ముందు ముగ్గులు వేస్తాం. ఇలా ముగ్గులతో వాకిళ్లను అందంగా అలంకరిస్తే ఇంటికి శ్రేయస్సును తెస్తాయని పెద్దల నమ్మకం. పైగా లక్ష్మీ దేవిని ముచ్చటపడి ఇంట్లోకి వస్తుందని, ఆమె అనుగ్రహం లభిస్తుందని పురాణ వచనం. ముగ్గు ప్రాముఖ్యత.. హిందూసంప్రదాయంలో ముగ్గులకు అధిక ప్రాధాన్యం ఉంది. ముగ్గులు వేయడానికి ఎంతో చారిత్రక సంబంధం కూడా ఉంది. ముగ్గుల్లో తామర పువ్వు, పూల ఆకారాలు, నెమళ్లు, మామిడి పండ్లు, చేపల చిహ్నాలు ఎక్కువగా ఉంటాయి. రంగురంగుల ముగ్గులను చూసినప్పుడు ప్రశాంతత, దైవిక శక్తుల ఉనికిని అనుభవిస్తారు. ఇంట్లోకి దేవతలను స్వాగతించడానికి, ప్రజలను ఆశీర్వదించడానికి దేవతల చిత్రాలను, లక్ష్మీ దేవి పాద చిహ్నాలను గీస్తారు. అలాగే అతిథులను స్వాగతించడానికి కూడా ఇలా ముగ్గులు వేస్తారు. అయితే చరిత్ర మాత్రం చెడున అరికట్టి మంచి చేకూరాలనే ఉద్దేశ్యంతో తెల్లటి బియ్యపిండితో ముగ్గు వేస్తారని చెబుతోంది. ఇది శరీరానికి మంచి ఫిట్నెస్ లాంటిది కూడా.. ఓర్పును నేర్పే కళ… ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్ల ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి. భోగి నాడు వేసే ముగ్గు ఇష్టంతో కూడిన కష్టం! పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గు వేయడం కొంచెం కష్టంతో కూడుకున్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు, రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు. శాస్త్రీయ కారణాలు.. చుక్కలను కలిపే వక్ర నమూనాలు విశ్వంలోని అనంతమైన స్వభావాన్ని సూచిస్తాయి. ఇటువంటి నమూనాలు ధ్వని వేవ్ హార్మోనిక్స్ను పోలి ఉంటాయి. వీటిని చూస్తే డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలతో సహా అనేక రుగ్మతలు దరిచేరకుండా మనసు ఆహ్లాదభరితంగా ప్రశాంతంగా ఉంటుంది. తెలియకుండానే మనసులో ఓ ఆధ్యాత్మకి భావన వస్తుంది. విశ్వకవి రవీంద్రుడు సైతం ముగ్గు గురించి ప్రస్తావించారు! అంతేకాదండోయ్ రవీంద్రనాథ్ ఠాగోర్ 1919 లో రాసిన 'బంగ్లర్ బ్రత' అనే పుస్తకంలో వ్రతం, పూజ విధానాలలో 'అల్పన' (ముగ్గు) గురించి ప్రస్తావించారు. లక్ష్మీకాంత్ ఝా అరిపన్' మిథిల జానపద సంస్కృతి గురించి రాసిన రచనలలో రంగోలి ప్రస్తావన తెచ్చారు. ఇక ఈ ముగ్గులు వేయడం అనేది కేవలం దక్షిణాదికే పరిమితం కాదని భారతదేశం అంతటా ఈ ముగ్గులు వేయడం అనేది వారి సంస్కృతిలో భాగం అని పరిశోధకులు కూడా పేర్కొన్నారు. అంతేగాదు కామశాస్త్రంలో ప్రస్తావించిన 64 కళల్లో నృత్యం, సంగీతం, తలపాగాలు చుట్టడం, పూల మాలలు అల్లడం, వంటలు, అల్లికలతో పాటు ముగ్గులు వేయడాన్ని కూడా ఒక కళగా పేర్కొన్నారని చెప్పారు. అంతటి ప్రాశస్యం గల ఈ ముగ్గులను రకరకాల రంగవల్లులతో తీర్చిదిద్ది కలర్ఫుల్గా జోయ్ఫుల్ చేసుకోండి ఈ సంక్రాంతి పండుగని. (చదవండి: భోగి రోజే గోదా కళ్యాణం.. చిన్నారులకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు?) . -
Sabarimala: నేడు మకరజ్యోతి దర్శనం
తిరువనంతపురం: శబరిమలలో నేడు మకరజ్యోతి దర్శనం కానుంది. ఈ నేపథ్యంలో స్వాములు భారీగా తరలి వస్తున్నారు. శబరిగిరులు అయ్యప్ప నామ స్మరణతో మారుమోగుతున్నాయి. మకర జ్యోతి దర్శనానికి 50 వేల మంది భక్తులకు అనుమతి ఉంటుందని ట్రావెన్కోర్ బోర్డ్ ప్రకటించింది. కానీ, నాలుగు లక్షల మంది దాకా వీక్షించే అవకాశం ఉండొచ్చని ఒక అంచనా. హరిహర తనయుడు అయ్యప్ప స్వామి కొలువైన క్షేత్రం కేరళ శబరిమల. శబరిమల మకరజ్యోతి/మకరవిళక్కు ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున...శబరిమల ఆలయంలో నిర్వహించే కార్యక్రమం. మకర సంక్రాంతి నాడు ఈ జ్యోతి దర్శనం ఇస్తుంది కాబట్టి శబరిమల మకరవిళక్కు/ శబరిమల మకర జ్యోతి అని పిలుస్తుంటారు. #WATCH | Kerala: Devotees throng Sabarimala Temple in large numbers to offer prayers to Lord Ayyappa ahead of the Makaravilakku festival. pic.twitter.com/n2UXCMOkTP — ANI (@ANI) January 14, 2024 మకర జ్యోతి దర్శన నేపథ్యంలో.. నియమ నిష్టలతో అయ్యప్ప మాల ధరించిన స్వాములు స్వామి దర్శనం కోసం శబరిమలకు పోటెత్తుతున్నారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున కనిపించే మకర జ్యోతిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. 41 రోజుల ఉపవాస దీక్ష చేసిన భక్తులు కందమల శిఖరంపై దర్శనమిచ్చే మకర జ్యోతి కోసం ఎదురుచూస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 నుంచి 7.00 గంటల మధ్య ఉంటుంది ఆలయ బోర్డు ప్రకటించింది. భక్తుల కోసం ప్రత్యేకంగా వ్యూ పాయింట్లు ఏర్పాటు చేసింది. -
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు...ఇంకా ఇతర అప్డేట్స్
-
సంక్రాంతిని 'పెద్ద పండుగ' అని ఎందుకు పిలుస్తారు?
భోగభాగ్యల భోగి పండుగను చిన్నా పెద్ద అంతా ఆనందంగా జరుపుకున్నారు. ఇక తరువాత రోజే అసలైన పండుగ 'సంక్రాంతి'. ఈ పండుగ రోజు ఉండే హడావిడి అంతా ఇంత కాదు. పైగా ఈ పండుగను పెద్దల పండుగ లేదా పెద్ద పంగ అని అంటారు. ఈ రోజు నవ్వులతో చేసిన వంటకాలను తప్పకుండా తింటారు. నాలుగు రోజులు పండుగల్లో ఈ సంక్రాంతి మాత్రమే ఎలా పెద్ద పండుగ అయ్యింది?. ఇన్ని సంక్రమణాలు ఉండగా ఈ సంక్రమణానికి ఎందుకంత విశిష్టత? నెలకు ఒక రాశి చొప్పున సూర్యభగవానుడు ఏడాది మొత్తం కలిపి 12 రాశుల్లో సంచరిస్తాడు. రాశిమారిన ప్రతిసారీ సంక్రమణం అంటారు. కానీ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు సంచరించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటారు. అదే సంక్రాంతి పండుగ. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. ప్రతి ఒక్కరి జీవితంలో నూతన అధ్యాయం మొదలు కాబోతుందనే దానికి సంకేతం. అలాగే దక్షిణదిక్కువైపు ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని పుష్యమాసంలో ఉత్తరదిక్కులో సంచరిస్తుంటాడు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. ఈ సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటి వరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి. సంక్రాంతి ఎలా పెద్ద పండుగంటే.. సంక్రాంతి పండుగ సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుకుంటుంది. చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తారు. ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో అన్నం వండుకుని తినరు. ఎందుకంటే కొత్త బియ్యం తొందరగా అరగదు. అందుకే ఆ బియ్యానికి బెల్లం జోడించి పరమాన్నం, అప్పాలు, అరిసెలు, చక్కిలాలు తయారు చేస్తారు. ఇలా చేస్తే పిండివంటలు చేసుకున్నట్లు కూడా ఉంటుంది. జీర్ణ సమస్యలు కూడా రావు. తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు. అందుకే అక్కడ పొంగల్ అని పిలుస్తారు. పంట చేతికందించిన దేవుడికి ధన్యవాదాలు తెలిపేందుకు ఇలా నైవేద్యం సమర్పిస్తారు. ఈ పండుగలో ముఖ్యంగా ప్రకృతిని పూజించడంతోపాటు పశువులను కూడా పూజిస్తుంటారు. అలాగే సంక్రాంతి పండుగ అంటే ఖచ్చితంగా ప్రతి పదార్థంలో నువ్వులు ఉంటాయి. సూర్య భగవానుడికి సమర్పించే నీటిలోనూ నువ్వులు వేస్తారు. సంక్రాంతి సమయంలో నువ్వుల వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు అప్పటి వరకు దక్షిణాయనంలో ఉండి ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. దీని వల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటి నుంచి తట్టుకునేలా శరీరాన్ని సిద్ధం చేసుకునేందుకు నువ్వులను కచ్చితంగా తీసుకోవాలని మన పెద్దలు నియమం ఏర్పాటు చేశారు. ఈ రోజునే పెద్దలకు తర్పణాలు.. సంక్రాంతి రోజు పెద్దలకు తర్పణాలు వదలడం తప్పనిసరిగా చేస్తారు. ఉత్తరాయణ కాలం మొదలైన ఆరోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని పితృదేవతలకి స్వర్గ ప్రాప్తి లభించడం కోసం ఇలా చేస్తారు. ఈరోజు పెద్దలని స్మరించుకుంటూ వారిని సంతోష పెట్టే విధంగా వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేస్తారు. ఇలా చేస్తే వాళ్ళ ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అందుకే ఇది పెద్దల పండుగ లేదా పెద్దల పండుగ అయ్యింది. కొత్త అల్లుళ్ల సందడి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకం. కొత్తగా పెళ్ళైన కూతురు, అల్లుడిని ఇంటికి పిలిచి తమ ఆతిధ్యంతో ఔరా! అనిపిస్తారు. కొత్త అల్లుళ్ల రాకతో ఇల్లు కళకళాడిపోతాయి. మరదళ్ళు బావలని సరదాగా ఆట పట్టిస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇక మహిళలు ఇళ్ల ముందు పెద్ద పెద్ద రంగవల్లులు వేసి మురిసిపోతారు. గొబ్బెమ్మలు పెట్టి వాటి చుట్టూ పాటలు పాడుకుంటూ డాన్స్ వేస్తారు. పల్లెటూరులో అయితే ఏ వీధిలో చూసినా కన్నె పిల్లలు పరికిణీలు కట్టి పూల జడలు వేసుకుని అందంగా ముస్తాబై తిరుగుతూ సందడి చేస్తారు. కోడి పందేలు, ఎడ్ల పోటీలు.. గోదావరి జిల్లాల్లో కోడిపందేలతో ఫుల్ జోష్తో పండుగ జరుగుతుంది. వీటిని చూసేందుకు దూరప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తారు. పూర్వకాలంలో దీన్ని యుద్ధనీతిని గెలిపించే పందెంగా భావించేవారు. అంతేగాదు ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారట. ఆ తర్వాత అదే కాలక్రమేణ ఓ సరదా జూదంలా మారింది. ఈ పండుగ రోజు కొన్ని ప్రాంతాల్లో ఈ కోడిపందేలు కచ్చితంగా జరుగుతాయి. మరికొన్ని చోట్ల ఈ రోజు ఎండ్ల పోటీలు నిర్వహిస్తారు. గాలిపటాలు ఎగరువేసేది కూడా. కొన్ని చోట్ల ఈ సంక్రాంతి పండుగను పతంగులు పండుగగా జరుపుకుంటారు. ఆ రోజు చిన్నా పెద్దా అని తేడా లేకుండా గాలి పటాలు ఎగరేస్తూ ఆనందిస్తారు. దీంతో ఆకాశంలో రంగు రంగుల గాలి పటాలు ఎగురుతూ కనువిందు చేస్తాయి. మరీ ఇన్ని విశేషాలు ఉన్న సంక్రాంతి పెద్ద పండగే కదా! -
Makar Sankranti 2024: సంక్రాంతి వైభవాన్ని కనుమా!
భారతీయులు అందులోనూ దాక్షిణాత్యులు, ముఖ్యంగా తెలుగువారు సంక్రాంతిని ఎంతో వైభవోపేతంగా చేసుకుంటారు. ఆడపడుచులు, అల్లుళ్లతో సహా సంక్రాంతికి మాత్రం తమ స్వగ్రామాలకి చేరుకుంటారు అందరు. సంక్రాంతి వైభవం అంతా పల్లెలలో చూడాలి. సంక్రాంతి పండుగ సమయానికి పంటలు ఇంటికి వచ్చి రైతులు, వ్యవసాయ కూలీలు గ్రామంలో ఉన్న అందరు కూడా పచ్చగా ఉంటారు. ప్రకృతి కూడా పచ్చగా కంటికి ఇంపుగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ΄పొలం పనులు పూర్తి అయి కాస్త విశ్రాంతి తీసుకునే వీలుండటంతో సందడి, సంబరాలు. తమకి ఇంతటి భద్రత కలగటానికి మూలమైన భూమిని, రైతులను, కూలీలను, పాలేర్లను, పశువులను, పక్షులను అన్నింటికి కృతజ్ఞతను తెలియచేయటం, తమ సంపదను సాటివారితో బంధుమిత్రులతో పంచుకోవటం ఈ వేడుకల్లో కనపడుతుంది. భారతీయులు చాంద్రమానంతో పాటు కొన్ని సందర్భాలలో సూర్యమానాన్ని కూడా అనుసరిస్తారు. అటువంటి వాటిల్లో ప్రధానమైనది మకరసంక్రమణం. మకరసంక్రమణంతో సూర్యుడి గమనం దిశ మారుతుంది. అప్పటి వరకు దక్షిణదిశగా నడచిన నడక ఉత్తర దిక్కుగా మళ్ళుతుంది. అందుకే ఆ రోజు నుండి ఆరునెలలు ఉత్తరాయణం అంటారు. అప్పటికి ఆరునెలలనుండి దక్షిణాయనం. ఈ పుణ్య సమయంలో చేయవలసిన విధులు కూడా ఉన్నాయి. వాటన్నింటిని సంక్రాంతి సంబరాల్లో మేళవించటం జరిగింది. ► విధులు అంతరిక్షంలో జరిగే ఖగోళవిశేషాల ననుసరించి ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనుషులు చేయవలసిన పనులను పండుగ విధులుగా చెప్పటం మన ఋషుల ఘనత. అవి మనిషి వ్యక్తిగత, కుటుంబపరమైన, సామాజిక క్షేమాలని కలిగించేవిగాను ఖగోళ, ఆయుర్వేద, ఆర్థిక మొదలైన శాస్త్రవిజ్ఞాన్ని అందించేవిగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఉన్నతస్థాయికి ఎదగటానికి సహాయం చేసేవిగా ఉంటాయి. మన పండుగలు బహుళార్థసాధక ప్రణాళికలు. అన్నింటిని సమీకరించి ఎప్పుడేం చెయ్యాలో చక్కగా చె΄్పారు. ► పెద్దపండగ సంక్రాతిని పెద్దపండగ అంటారు. చాలా పెద్ద ఎత్తున చేసుకోవటంతో పాటు ఎక్కువ రోజులు చేసుకుంటారు. సంక్రమణం జరిగే రోజు పండుగ, ముందురోజు భోగి, మూడవరోజు కనుము. నాలుగవ రోజు ముక్కనుము. నిజానికి పండుగ వాతావరణం నెలరోజుల ముందు నుండే నెలకొంటుంది. ► నెల పట్టటం సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుండి ధనుర్మాసం అంటారు. అది డిసెంబరు 15వ తేదీ కాని, 16 వ తేదీ కాని అవుతుంది. అప్పటి నుండి మకర సంక్రమణం వరకు అంటే జనవరి 14వ తేదీ వరకు కాని, 15 వ తేదీ వరకు కాని ఉండే ధనుర్మాసం అంతా ప్రత్యేకంగానే కనపడుతుంది. దీనిని ‘నెలపట్టటం’ అని అంటారు. అంటే ఈ నెల అంతా ఒక ప్రత్యేక మైన పద్ధతిని పాటిస్తామని చెప్పటం. ఇళ్ల ముందు ఆవుపేడ కళ్ళాపిలో అందంగా తీర్చి దిద్దిన రంగవల్లికలు, ఆకాశంలో నుండి క్రిందికి దిగి వచ్చినట్టు కనపడే చుక్కల ముగ్గుల మధ్యలో కంటికింపుగా దర్శనమిచ్చే గొబ్బెమ్మలు, గొబ్బెమ్మల పైన అలంకరించ బడి పలకరించే బంతి, చేమంతి, గుమ్మడిపూలు, వాటిని తొక్క కుండా ‘హరిలో రంగ హరి’ అంటు అందరిని తన మధురగానంతో మేలుకొలుపుతున్న హరిదాసులు, వారు వెళ్ళగానే ‘అయ్యగారికీ దండం పెట్టు, అమ్మగారికీ దండం పెట్టు’ అంటు గంగిరెద్దుల నాడించేవారు, జంగంవారు, బుడబుక్కలవారు ...... తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించే ఎంతోమంది జానపద కళాకారులు – అదొక కలకలం, అదొక కళావిలాసం. ఈ నెల అంతా విశిష్టాద్వైత సంప్రదాయాన్ననుసరించే వారు తిరు΄్పావై లేక శ్రీవ్రతం లేక స్నానవ్రతం అనే దాన్ని ఆచరిస్తారు.ద్వాపరయుగం చివరలో గోపికలు ఆచరించిన ఈ వ్రతాన్ని గోదాదేవి ఆచరించి శ్రీరంగనాథుని వివాహం చేసుకుని ఆయనలో సశరీరంగా లీనమయింది. వైష్ణవదేవాలయాల్లో తెల్లవారుజామునే కృష్ణుని అర్చించి బాలభోగంగా నివేదించిన ప్రసాదాన్ని తెల్లవారక ముందే పంచిపెడతారు. ప్రకృతిలో భాగమైన సర్వజీవులు స్త్రీలు. వారు పరమపురుషుని చేరుకోవటం కోసం చేసే సాధన మధురభక్తి మార్గం. దానికి ప్రతీక అయిన గోదాదేవి చేసిన వ్రతాన్ని ఈ నెలరోజులు సాధకులు, భక్తులు అందరు ఆచరిస్తారు. ఆండాళు తల్లి ఆ రోజుల్లో గోపికలుగా భావించుకున్న తన చెలులను వ్రతం చెయ్యటానికి స్నానం చేద్దాం రమ్మని మేలు కొలుపుతుంది. ఇప్పుడు ఆపని హరిదాసులు చేస్తున్నారు. ► సంక్రాంతి అసలు ప్రధానమైనది సంక్రాంతి, అంటే సంక్రమణం జరిగే రోజు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే రోజు. ఈ పుణ్య కాలంలో దానాలు, తర్పణాలు ్రపాధాన్యం వహిస్తాయి. ఈ సమయంలో చేసే దానాలకి ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. దానికి కారణం ఈ మూడురోజులు పాతాళం నుండి వచ్చి భూమిని పరిపాలించమని శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి వరం ఇచ్చాడు. కనుక బలి తనకి ఇష్టమైన దానాలు చేస్తే సంతోషిస్తాడు. అందులోనూ గుమ్మడికాయను దానం చేయటం మరీ శ్రేష్ఠం. గుమ్మడిని దానం ఇస్తే భూగోళాన్ని దానం ఇచ్చినంత ఫలితం. మకరరాశిలో ఉండే శ్రవణానక్షత్రానికి అధిపతి అయిన శని శాంతించటానికి నువ్వుల దానం చేయటం శ్రేయస్కరం. వస్త్రదానం, పెరుగుదానంతో పాటు, ఏ దానాలు చేసినా మంచిదే. భోగినాడు ఏ కారణంగానైనా పేరంటం చేయని వారు ఈ రోజు చేస్తారు. అసలు మూడు రోజులు పేరంటం చేసే వారున్నారు. దక్షిణాయణం పూర్తి అయి పితృదేవతలు తమ స్థానాలకి వెడితే మళ్ళీ ఆరునెలల వరకు రారు కనుక వారికి కృతజ్ఞతా పూర్వకంగా తర్పణాలు ఇస్తారు. కొంతమంది కనుము నాడు తర్పణాలిస్తారు. ► కనుము తమ ఇంటికి పంట వచ్చి ఆనందంగా ఉండటానికి కారణభూతమైన భూదేవికి, రైతులకి, పాలేర్లకి, పశువులకి కూడా తమ కృతజ్ఞతలని తెలియ చేయటం ఈ పండుగలోని ప్రతి అంశంలోనూ కనపడుతుంది. కనుముని పశువుల పండగ అని కూడా అంటారు. ఈ రోజు పశువుల శాలలని శుభ్రం చేసి, పశువులని కడిగి, కొమ్ములకి రంగులు వేసి, పూలదండలని వేసి, ఊరేగిస్తారు. వాటికి పోటీలు పెడతారు. ఎడ్లకి పరుగు పందాలు, గొర్రె΄పొటేళ్ళ పోటీలు, కోడిపందాలు మొదలైనవి నిర్వహిస్తారు. పాలేళ్ళకి ఈరోజు సెలవు. వాళ్ళని కూడా తలంటు పోసుకోమని కొత్తబట్టలిచ్చి పిండి వంటలతో భోజనాలు పెడతారు. సంవత్సరమంతా వ్యవసాయంలో తమకు సహాయం చేసిన వారి పట్ల కతజ్ఞత చూపటం నేర్పుతుంది ఈ సంప్రదాయం. మాంసాహారులు ఈరోజు మాంసాహారాన్ని వండుకుంటారు. సాధారణంగా కోడిపందెంలో ఓడిపోయిన కోడినో, గొర్రెనో ఉపయోగించటం కనపడుతుంది. ఓడిపోయిన జంతువు పట్ల కూడా గౌరవ మర్యాదలని చూపటం అనే సంస్కారం ఇక్కడ కనపడుతుంది. పక్షులు వచ్చి తమ పంట పాడుచేయకుండా ఉండేందుకు, పురుగులని తిని సహాయం చేసినందుకు వాటికి కూడా కృతజ్ఞతను ఆవిష్కరించేందుకు వరి కంకులను తెచ్చి చక్కని కుచ్చులుగా చేసి, ఇంటి ముందు వసారాలలో కడతారు. కొన్ని ్రపాంతాలలో ఇప్పటికీ కనుమునాడు గుడిలో వరికంకుల గుత్తులను కట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ‘కనుము నాడు కాకైనా కదలదు’, ‘కనుము నాడు కాకైనా మునుగుతుంది’ అనే సామెతలు కనుముకి పితదేవతలకు ఉన్న సంబంధాన్ని సూచిస్తాయి. ► ముక్కనుము ముక్కనుము నాడు ప్రత్యేకంగా చేయవలసినవి పెద్దగా కనిపించవు. పండగలో అలిసిపోయిన వారి విశ్రాంతి కోసం కావచ్చు. కానీ, కొంతమంది కనుమునాడు కాక ఈ రోజుని మాంసాహారం తినటానికి కేటాయిస్తారు. ఒక పండుగ, అందులోనూ ప్రధానమైన పండుగను చేసుకోవటంలో ఎన్ని అంశాలను మిళితం చేసి, వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంపొందించే విధంగా ప్రయోజనాత్మకంగా రూ΄పొందించారో మన పెద్దలు! – డా. ఎన్.అనంతలక్ష్మి -
సంబరంగా సంక్రాంతి వేడుక
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గంగిరెద్దులకు సారెను సమర్పించడం, భోగిమంటలు, గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు, హరిదాసుల కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలతో వేడుకలు కన్నులపండువగా జరిగాయి. సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాలను చక్కగా పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. నవరత్నాలతో ముఖ్యమంత్రి ప్రతిఇంటికీ సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, మెడికల్ కాలేజీ, నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా తీర్చిదిద్ధిన స్కూల్ భవనం, పాల కేంద్రం నమూనాలు వంటి ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేస్తూ.. ముత్యాల ముగ్గులు, రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, ధాన్యాగారాలు, గడ్డివాములు, ఎడ్లబండ్లు ఇలా అచ్చం అసలు సిసలైన గ్రామీణ వాతావరణ ప్రతిబింబించేలా, మన సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరిసేలా.. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నేతృత్వంలో గ్రామ స్వరాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. సీఎం దంపతులను మంత్రముగ్థుల్ని చేసేలా ఆ ప్రాంతం శోభాయమానంగా అలంకరించారు. ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు ఏర్పాటుచేసిన శిలాతోరణం అందరినీ ఆకట్టుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో భోగి మంటలు వెలిగిస్తున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. ఇక ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో హాజరైన సీఎం జగన్ దంపతులను వేదపండితులు నుదుట తిలకం దిద్ది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం.. వారిరువురూ భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. హరిదాసుకు స్వయంపాకం, సారె సమర్పించారు. అలాగే, గోశాలలోని గోవులకు పూజచేసి వాటిని నిమురుతూ కొద్దిసేపు అక్కడ గడిపారు. గంగిరెద్దులకు, తులసి చెట్టుకు పూజలు చేశారు. గ్రామీణ సంక్రాంతి వేడుకల్లో ప్రధానంగా కనిపించే వివిధ కళాకారులను సీఎం ఆప్యాయంగా పలకరించారు. అంతేకాక.. తెలుగింటి సంక్రాంతి పిండివంటలను ముఖ్యమంత్రి దంపతులు రుచి చూశారు. అనంతరం.. కలియుగ దైవమైన శ్రీహరికి పూజలు నిర్వహించటం, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు ఏర్పాటుచేసిన వందేళ్ల క్రితం నాటి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ నమూనా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్ దంపతులు పూలమాల వేసి నివాళులరి్పంచారు. అనంతరం.. అక్కడున్న మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులను పలకరిస్తూ ముందుకు కదిలారు. తొలుత.. కాణిపాక వినాయక విగ్రహానికి సీఎం జగన్ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. తర్వాత.. కనకదుర్గమ్మకు.. అనంతరం శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదపండితుల ఆశీర్వాదం స్వీకరించారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎంకు కంకణం కట్టగా.. వేదపండితులు అందించిన మరో కంకణాన్ని భారతమ్మకు ముఖ్యమంత్రి జగన్ కట్టారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. ప్రముఖ సినీ నేపథ్యగాయని గోపిక పూర్ణిమ, ప్రముఖ గాయని శ్రీలలిత పాటల కార్యక్రమం శ్రవణపేయంగా సాగింది. అలాగే, సినీ రంగానికి చెందిన ప్రముఖ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ రాఘవ, కౌండిన్య, మెహర్, మానస్, చందు, రమేష్, హరేరాము, మహేష్, భాను తదితరుల లైవ్ పెర్ఫామెన్స్.. ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారులు రిత్విక్ వెంకట్, చార్మి, చిన్నారి కేతనరెడ్డి నాట్య ప్రదర్శన.. నీలకంఠం మిమిక్రీ, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఉదయ్ బృందంచే సంక్రాంతి ప్రత్యేక గీతాల నృత్యం, మాస్టర్ భువనేష్ ప్రత్యేక గీతాలు.. వీటితో పాటు ప్రముఖ సినీగేయ రచయిత, సంగీత దర్శకులు విశ్వ.. ప్రముఖ సినీ మరియు ప్రజా గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, ప్రజా రచయితలు మానుకోట ప్రసాద్, మాట్ల తిరుపతి, గాయకులు గద్దర్ నర్సిరెడ్డి, తేలు విజయల కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కృష్ణవేణి మల్లావఝుల వ్యవహరించారు. చివర్లో వీరందరిని సీఎం జగన్ దంపతులు సత్కరించి, మెమొంటోలు అందజేశారు. అంతేకాక.. ప్రాంగణంలో ఉన్న అందరితో సీఎం జగన్ దంపతులు ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చెవిరెడ్డికి సీఎం అభినందనలు.. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించేలా.. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలా.. చక్కని ఏర్పాట్లతో, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. విజయానందాలతో అడుగులు ముందుకేయాలి.. సీఎం జగన్ ట్వీట్ ఊరూ వాడా ఒక్కటై.. బంధుమిత్రులు ఏకమై.. అంబరమంత సంబరంగా జరుపుకునే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకుని.. సుఖ సంతోషాలతో.. విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంటూ ఆదివారం ‘ఎక్స్’ (ట్విట్టర్)లో తెలిపారు. -
సెల్ మాయ.. పల్లె పరాయి!
ఏడుకొండల.. వెంకటరమణ తిరుపతికొండలు.. తిరిగినవాడ తిరుమనిరేకులు.. దిద్దినవాడ హరిలో రంగ హరి.. అయ్యవారికి దండంపెట్టు అమ్మవారికి దండంపెట్టు పిల్లపాపలు సల్లంగుండని గొడ్డుగోదలు సంపదనివ్వని పెట్టరా బసవన్న దండంబెట్టు సిరిసిల్ల: ఈ పాటలు.. ఆ మాటలు.. పల్లెతల్లి ఒడిలో లీలగా వినిపిస్తున్నాయి. పాడేది హరిదాసు. మాట్లాడేది గంగిరెద్దాయన. పట్టణాలకు చదువుల కోసం, కొలువుల కోసం వెళ్లిన వాళ్లు పల్లెకు చేరారు. కానీ మనసు విప్పి మాట్లాడుకునుడే లేదు. సెల్ఫోన్ చేతికొచ్చాక ప్రపంచాన్ని అరచేతిలోనే చూస్తుండ్రు. పక్కింటి వాళ్లతో మాట్లాడే సమయం లేదు. ఆనాటి ఆప్యాయతలు లేవు. అనురాగాలు కానరావు. పండగ వచ్చిందంటే నాకు ఎంతో సంబురం. ఎక్కడెక్కడో ఉండే నా వాళ్లంతా నా దరికి చేరుతారు. వాళ్లను చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. నా ఒడిలో బతికే వాళ్లకు ఒకప్పుడు చేతినిండా పని. ఇంటి నిండా ధాన్యం. ఊరు సుట్టూ వాగులు, కాలువలు. తుకాలు పోసి.. పొలాలు దున్నతూ.. నాట్లు వేస్తూ.. ఉషారుగా ఉండేవారు. బోగి మంటలు.. భోగభాగ్యాలతో కళకళలాడే పల్లెల్లో మునుపటి సందడి కనుమరుగైంది. ముచ్చట్లు మరిచిపోయిండ్రు పల్లెలకు చేరిన పట్నమోళ్లు సెల్ఫోన్లతోనే ఆడవట్టిరి. నాటి ముచ్చట్లు లేవు.. మంచీ చెడు అర్సుకునే ధ్యాసే లేదు. వాట్సాప్లలో మెస్సేజ్లు.. ఫేస్బుక్కుల్లోనే పలకరింపులు. సంక్రాంతికి చలి సంకలెత్తనిత్తలేదు. ఒకప్పుడు గండ్రపేగులు కట్టుకొని, గొంగడిబొంతలు సుట్టుకుని గజగజ వణుక్కుంట నాగండ్లు కడుదురు. మరీ ఇప్పుడు కాలం మారింది. అన్ని పనులు ట్రాక్టరే చేస్తుంది. మాగికాలం నాట్ల పనికిపోతే మంచి కూలి వస్తుంది. కానీ పైసలకు లెక్కలేదు, మనుషులకు విలువ లేదు. హరిదాసులు ఏమైరి ఒకప్పుడు సంకురాత్రి అంటేనే గంగిరెద్దుల ఆట లు, హరిదాసుల పాటలు. ఇంటింటికీ తిరిగి ధాన్యమడుక్కుందురు.గిప్పుడు వాళ్ల తిరుగుడు లేదు.. మనం పెట్టుల్లేదు. ఒకప్పుడైతే కాలుపెట్ట సందులేకుండా ఇంటినిండ ధాన్యం ఉండేది. గొబ్బెమ్మలు చేసే పెండ నుంచి అరిసెలు చేసే బెల్లం దాకా అన్నీ కొనుడేనాయె. ఇక నవధాన్యాలు, రేగుపండ్లు.. జీడిపండ్లంటరా.. ఎన్నడో దేవునికి ముట్టినయి. కడపల మీద పిజ్జాలు.. బర్గర్లు పెట్టే కాలమొచ్చింది. సకినాలు ఎటుపాయే సంకురాత్రి అనంగనే సకినాలు గుర్తుకొత్తయి. కుంచెడు బియ్యం నానబోసి దంచి.. తవ్వెడు నువ్వులు.. చారెడు ఓమ గలిపి సకినాలు వొత్తే నెల్లాల్ల గాసమైతుండే. గారప్పులు.. అరిసెలు.. మురుకులు.. ఎన్నెన్ని పిండివంటలో. పల్లీలు.. నువ్వులు.. బబ్బెర్లు.. పెసర్లు.. అన్ని మన పొలంల పండినయే. మరిప్పుడు చేసుడు బందాయే.. ఆన్లైన్ బుకింగ్లాయే. అంతా మాయలాగే.. పొద్దు పొడిసినా పొగమంచు పోకపోతుండే. చలిమంటలు ఏసుకుని పడుసు పోరగాండ్లు, నడివయసోళ్లు.. ముసలోళ్లు కూసుందురు. ఊరు ముచ్చట్లు పెడుదురు. కోడిపుంజు కోసుకుని వాసన బియ్యంతో బిర్యానేసుకుంటే కమ్మటి వాసన. ఇప్పుడు పారంకోడి కూర రుచి లేదు.. వాసన అసలే లేదు. వానాకాలం పోయింది. సలికాలం.. ఎండ కాలమాయె. ఊరు పచ్చదనాన్ని కోల్పోయే. నా పొలిమేరలోకి సెల్టవర్లు వచ్చి మనుషులను దూరం చేసే. పండగన్న మాటే కానీ.. రైతు ముఖంల ఆ నవ్వేలేదు. రైతు సల్లంగుంటే సబ్బండ వర్ణాలకు పనుంటుండే. కులవృత్తి నమ్ముకున్నోళ్ల నుంచి గంగిరెద్దు, హరిదాసు వరకు అందరికీ గాసం దొరికేది. ఇప్పుడు అందరూ ఒకే చోట ఉన్నా మనసువిప్పి మాట్లాడుకునుడు లేదు. అంతా సెల్ఫోన్ మాయ. నా మనసులోని బాధను చెప్పిన. పండుగ పూట నా వేదన విన్నందుకు అందరికీ వందనాలు. ఇగ ఉంట బిడ్డ. బంగారు కాలంబోయింది.. బంగారమస్సోంటి మనుషులు పోయిండ్రు.. ఇంక రానురాను ఎంతగతికుందో.. ఇట్లు మీ అందరి క్షేమం కోరే పల్లెతల్లి