-
భర్త ఉండగా ఇల్లు దాటలేదు.. ఇప్పుడేమో ఏకంగా సీఎంతో ఢీ.. ఎవరీ సుభావతి?
లక్నో: ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ ప్రాంతం.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి కంచుకోట. గోరఖ్పూర్ అర్బన్ నుంచి తొలిసారిగా ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతూ ఉంటే, సమాజ్వాదీ పార్టీ ఆయనపై ఒక మహిళా అభ్యర్థిని బరిలోకి దింపింది. ఒకప్పుడు బీజేపీ సహా వివిధ పార్టీలు మారిన దివంగత నాయకుడు ఉపేంద్ర దత్ శుక్లా భార్య సుభావతి శుక్లాను వ్యూహాత్మకంగా సీఎంపైనే పోటీకి నిలిపింది. ఉపేంద్ర 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. గోరఖ్పూర్లో క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి ఆయన ఎంతో కృషి చేశారు. బీజేపీలో ఉన్నప్పుడు ఆయనకి యోగి ఆదిత్యనాథ్కి తరచూ తగాదాలు జరిగేవి. పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నా ఎన్నికలు ఆయనకి కలిసి రాలేదు. నాలుగుసార్లు ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్కసారి కూడా నెగ్గలేదు. ఉపేంద్ర గుండెపోటుతో 2020లో మరణించారు. ఆయన భార్య సుభావతి తన కుమారుడు అమిత్ దత్ శుక్లాకు గోరఖ్పూర్లోనే మరో నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తే బీజేపీ నిరాకరించింది. దీంతో సుభావతి కుమారుడితో కలిసి ఎస్పీలో చేరారు. (చదవండి: మోదీలు, ఈడీలు, సీబీఐలు నన్ను భయపెట్టలేవు) ఉపేంద్ర జీవించి ఉండగా సుభావతి ఎప్పుడూ ఇల్లు కదిలి బయటకు రాలేదు. ప్రచారంలో కూడా ఆమె ఎప్పుడూ కనిపించలేదు. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని సుభావతిని యోగి ఆదిత్యనాథ్ వంటి బలమైన అభ్యర్థిపై దింపడానికి ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్కి కూడా కొన్ని లెక్కలున్నాయి. ఠాకూర్ సామాజికవర్గానికి చెందిన యోగిపై యూపీలో బ్రాహ్మణులు గుర్రుగా ఉన్నారు. గోరఖ్పూర్లో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ప్రముఖ నాయకుడు ఉపేంద్ర. ఆయన మరణించినప్పుడు కూడా యోగి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడంపై అప్పట్లో ఆయనపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. సానుభూతి ఓట్లు, ఓబీసీల అండతో పాటుగా బ్రాహ్మణ ఓట్లను కూడా దక్కించుకోవాలన్న వ్యూహంతో అఖిలేశ్ ఆమెను రంగంలోకి దింపారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. (చదవండి: లతా మంగేష్కర్ మెమోరియల్ రగడ: సేన సెంటిమెంట్ను కెలుకుతున్న బీజేపీ.. లతాజీ సోదరుడి ఫైర్) -
యూపీ అసెంబ్లీ ఎన్నికలు.. తొలిదశ పోలింగ్ పూర్తి
-
ఐదేళ్ల క్రితం యూపీలో రౌడీ రాజ్యం!
లక్నో: ఐదేళ్ల కిందట ఉత్తరప్రదేశ్ను మాఫియా, అల్లరి మూకలు పాలించేవని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో బాఘ్పత్, షమ్లీ, గౌతమ్ బుద్ధనగర్, ముజఫర్నగర్, శరణ్పూర్ జిల్లాల్లోని 21 అసెంబ్లీ స్థానాల ర్యాలీల నుద్దేశించి ఆయన వర్చువల్గా ప్రసంగించారు. సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో వ్యాపారులు దోపిడీకి గురయ్యారని, ఆడపిల్లలు ఇళ్లు దాటే పరిస్థితి లేకపోయిందన్నారు. ప్రభుత్వ అండదండలతో మాఫియా స్వేచ్ఛగా తిరిగేదని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్పై ప్రధాని మాటల దాడి చేశారు. మూఢ నమ్మకాలతో అఖిలేశ్ యువత కలల ప్రపంచమైన నోయిడాకు రాలేదని, అలాంటి మూఢ నమ్మకాలున్న వ్యక్తి యువతకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తారని ప్రశ్నించారు. మన దేశం తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్పై భరోసా ఉంచని వారు, పుకార్లకు ప్రాధాన్యమిచ్చినవారు ఉత్తరప్రదేశ్యువత ప్రతిభను, ఆవిష్కరణలను ఎలా గౌరవిస్తారని ప్రధాని సందేహం వ్యక్తం చేశారు. బీజేపీ యూపీ మార్పును కోరుకుంటుందని, కానీ ప్రత్యర్థులు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారని, వాళ్లు టికెట్ ఇచ్చిన వారిని చూస్తే అది అర్థమవుతుందని అన్నారు. ప్రతీకారమే వారి సిద్ధాంతమని, అలాంటి వారి పట్ల యూపీ ప్రజలు అప్రమత్తంగా ఉండటం తనకు ఆనందం కలిగిస్తోందని మోదీ తెలిపారు. కృష్ణుడు తన కలలోకి వస్తాడన్న అఖిలేశ్ మాటలనుద్దేశించి ప్రస్తావిస్తూ... ఆయన నిద్రపోయి కలలు కంటూనే ఉంటారని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం యూపీ అభివృద్ధికోసం నిరంతరం పనిచేస్తారని అన్నారు. బీజేపీలోకి నిదా ఖాన్, గంగారామ్ అంబేడ్కర్ మహిళా హక్కుల ఉద్యమకారిణి నిదా ఖాన్, బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఓఎస్డీగా పనిచేసిన గంగారామ్ అంబేడ్కర్ భారతీయ జనతాపార్టీలో చేరారు. చేరికల కమిటీ నాయకుడు లక్ష్మీకాంత్ బాజ్పేయ్ ఆధ్వర్యంలో సోమవారం వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బాజ్పేయ్ మాట్లాడుతూ... ఇక అల్లరి మూకల రాజ్యం చెల్లదని, ప్రజలంతా నిర్భయంగా జీవించే యోగి ఆదిత్యనాథ్ పరిపాలన నడుస్తోందని అన్నారు. -
UP Assembly Election 2022: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!
UP Assembly Election 2022: ఎన్నికల్లో కీలకం కావడానికి ఏవో పెద్ద పెద్ద అంశాలే ఉండనక్కర్లేదు. ఆకాశాన్నంటే ఉల్లిపాయ ధరలు ప్రభుత్వాన్ని దించేయగలవు. పాతాళాన్ని తాకే బంగాళ దుంప ధరలు అధికార పార్టీలో దడ పుట్టించగలవు. ఉత్తరప్రదేశ్లో శ్రీకృష్ణుడు జన్మించిన మథురలో ఎన్నికల కాక ఆలూ చుట్టూ రాజుకుంది. వీటి ధరలు రాత్రికి రాత్రి పడిపోయి రైతుల్ని కష్టాల్లోకి నెట్టేసాయి. యూపీలోని ఆగ్రా–మథుర నుంచి కాన్పూర్–ఇటావా వరకు ఆలూ ఎక్కువగా పండుతుంది. (దేశవ్యాప్తంగా పండే ఆలూలో 30% ఇక్కడే పండిస్తారు). హోల్సేల్ మార్కెట్లో కొన్నాళ్ల క్రితం వరకు కేజీకి రూ.8, 9 పలికే ధరలు ఇప్పుడు హఠాత్తుగా రూ.5 , 6కి పడిపోయాయి. డీజిల్, ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోవడం, కోల్డ్స్టోరేజీల్లో ఉంచడానికయ్యే ఖర్చులతో రైతులకు పంట వ్యయం తడిసిమోపెడవుతోంది. కేజీ ఆలూ పండించడానికి రూ.10 వరకు ఖర్చు అవుతుంటే, మార్కెట్లో 50 కేజీలున్న బస్తాకి రూ.200–250 ధర మాత్రమే పలుకుతోంది (అంటే కేజీకి రూ.5 కంటే తక్కువ). దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. ‘‘ఇక్కడ మాకు మరే పని చెయ్యడానికి అవకాశం లేదు. ప్రభుత్వం ఎలాంటి ఉపాధి సదుపాయాలు కల్పించలేదు.పరిశ్రమలేవీ రాలేదు. బంగాళ దుంపల ధరలు పడిపోకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే ఈసారి మా ఓటు సమాజ్వాదీ పార్టీకే’’ అని మహమ్మద్ అన్వర్ అనే రైతు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. మథుర పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి కూడా రైతాంగ సమస్యలు పట్టించుకోని కమలనాథులు మథురలో శ్రీకృష్ణుడికి ఆలయం కట్టిస్తామంటూ హిందుత్వ ఎజెండానే అందుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఎస్పీ పెంచి పోషించిన నేరస్తులు, మాఫియాను... బీజేపీ తరిమికొట్టింది: అమిత్ షా
ముజఫర్నగర్: యూపీలో సమాజ్వాదీ పార్టీ పెంచి పోషించిన నేరస్తులు, మాఫియాను బీజేపీ ప్రభుత్వం తరిమికొట్టిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అబద్ధాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అఖిలేష్ యాదవ్, జయంత్ చౌదరి కలిసి ప్రచారంలో పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ ఆ రెండు పార్టీలది ఎన్నికల బంధమేనని, ఆ తరువాత ఎవరిదారి వారిదేనని ఎద్దేవా చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పడినా ఆజంఖాన్, అతిఖ్ అహ్మద్ లాంటివాళ్లు వేదికపై ఉంటారే తప్ప... జయంత్ ఎక్కడా కనిపించరని జోస్యం చెప్పారు. బాధితులనే నిందితులుగా చేసిన 2013 ముజఫర్నగర్ అల్లర్లను ఎవరైనా మరచిపోగలరా? అని అమిత్ షా ప్రశ్నించారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలో నేరాలు తగ్గాయని, ఈ విషయంలో గణాంకాలతో సహా చర్చకు తాము సిద్ధమని, ఎస్పీ ప్రభుత్వంలోని గణాంకాలతో అఖిలేష్ ముుందుకొస్తారా అని సవాల్ విసిరారు. అఖిలేష్ ప్రభుత్వ పాలనకు ముజఫర్ నగర్ అల్లర్లు సజీవ సాక్షమన్నారు. అల్లర్ల సమయంలో పోలీసులు.. తప్పుడు కేసులు బనాయించారని, బాధితులనే నిందితులుగా చేసే ప్రయత్నం జరిగిందని తెలిపారు. కోర్టుల్లోనూ, రోడ్ల మీద న్యాయం కోసం పోరాడిన బీజేపీ నేత సంజీవ్ బలియాన్ని అమిత్ షా అభినందించారు. మళ్లీ అదే తప్పు చేయొద్దు... ఉత్తరప్రదేశ్ను ఎస్పీ చేతిలో పెట్టి ప్రజలు మళ్లీ తప్పు చేయొద్దని, అదే జరిగితే మరో ముజఫర్నగర్ ఆవిష్కృతమవుతుందని అభిప్రాయపడ్డారు. బీజేపీ పార్టీ గెలుపొందితే ఎలాంటి అల్లర్లు ఉండవని, 300 స్థానాల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే ఒక పార్టీ గురించే మాట్లాడుతుందని, కాంగ్రెస్ ఒక కుటుంబం గురించే మాట్లాడుతుందని, ఇక ఎస్పీ అధికారంలోకి వస్తే గూండాలు, మాఫియా రాజ్యంగా మారిపోతుందని, ఒక్క బీజేపీ మాత్రమే భద్రత, అభివృద్ధి గురించి మాట్లాడుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైనది, దాన్ని యూపీ ప్రజలు తెలివిగా వినియోగించాలని ప్రజలకు సూచించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా యూపీ నిలుస్తుందన్నారు. దేశభద్రత బీజేపీ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. అఖిలేష్ యాదవ్ రైతులకు వరాలు కురిపిస్తున్నారని, కానీ ఎస్పీ, బీఎస్పీ ప్రభుత్వాల హయాంలోనే 21 చక్కెర కర్మాగారాలు మూసివేశారని ఎద్దేవా చేశారు. ముజఫర్నగర్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ పోటీ చేస్తుండగా, ఎస్పీ– ఆర్ఎల్డీ కూటమి నుంచి సౌరభ్ స్వరూప్ బరిలో ఉన్నారు. -
సాక్షి కార్టూన్(29-01-2022)
-
మాయ మౌనం వెనుక ఏ మాయ ఉందో ఎవరికీ అంతుచిక్కడం లేదు!
ఒకప్పుడు రాజసంతో యూపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన దళిత బిడ్డ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి నేడెందుకో మౌన ప్రేక్షకురాలి పాత్రకు పరిమితమయ్యారు. ఆ మౌనం వెనుక ఏ మాయ ఉందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒకప్పుడు ఎవరి ఊహకి అందని విధంగా యూపీ ప్రజల్ని మాయ చేశారు. అగ్రవర్ణాలు, దళితులు అనే సోషల్ ఇంజనీరింగ్ వ్యూహంతో ఎన్నికల్లో కాకలు తీరిన యోధులకే కొత్త పాఠాలు నేర్పించారు. తొలి దళిత మహిళా ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న సూత్రాన్ని వంటబట్టించుకున్న ఆమె ఆప్త మిత్రులనైనా పక్కన పడేయగలరు. ఆగర్భ శత్రువులతోనైనా చేయి కలపగలరు. సామాజిక కార్డుతోనే యూపీతో సహా దేశ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. అభిమానులు బెహన్జీ అని ఆప్యాయంగా పిలుచుకొనే మాయావతి శక్తిసామర్థ్యాలు ఇప్పుడు గతమెంతో ఘనకీర్తి అన్నచందంగా మారింది. ప్రస్తుతం ఆమె ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉన్నారు. యూపీలో ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీ మధ్య సాగుతూ ఎన్నికల కాక రగులుతూ ఉంటే మాయావతి వ్యూహాలేమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. రాజకీయంగా అత్యంత అనుభవజ్ఞురాలు, అత్యంత శక్తిమంతమైన మహిళగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నాయకురాలు, ఒకప్పుడు ప్రధాని పదవికి సైతం పోటీదారుగా నిలువాలని ఆశించిన మాయావతి.. ఈసారి మౌనం దాల్చడం వెనుక ఎలాంటి మాయ దాగుందోనన్న చర్చ జరుగుతోంది. ►ఢిల్లీలోని నిరుపేద దళిత కుటుంబంలో 1956 సంవత్సరం జనవరి 15న జన్మించారు. ►ఘజియాబాద్లోని ఢిల్లీ యూనివర్సిటీలో లా డిగ్రీ చేసిన మాయావతి ఐఏఎస్ కావాలని కలలు కన్నారు. ►1977– 1984 మధ్య కాలంలో ఢిల్లీ స్కూల్లో టీచర్గా చేశారు ►దళిత నాయకుడు కాన్షీరామ్తో 1977లో పరిచయం ఏర్పడింది ►కాన్షీరామ్ 1984లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) స్థాపించి మాయావతిని కూడా పార్టీలోకి తీసుకున్నారు. ►రాజకీయ రంగప్రవేశంతో ఆమె జీవితమే మారిపోయింది. ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ►మాయావతికి మొదట్లో అపజయాలే ఎదురయ్యాయి. 1985లో తొలిసారి లోక్సభకు పోటీపడినప్పుడు ఆమె ఓడిపోయారు. 1987లో మళ్లీ ఓటమిపాలయ్యారు. 1989లో యూపీ శాసనమండలికి ఎన్నికయ్యారు ►కాన్షీరామ్ అనారోగ్యం బారినపడడంతో 1995లో బీఎస్పీ పగ్గాలు చేపట్టారు. ►1998, 1999, 2004లో వరుసగా మూడుసార్లు లోక్సభకు, మరో మూడు పర్యాయాలు (1994–2012 మధ్య) రాజ్యసభకు ఎన్నికయ్యారు. ►తొలిసారిగా 1995 సంవత్సరం నాలుగు నెలల పాటు యూపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక దళిత మహిళ అత్యున్నత స్థాయి పదవిని అందుకోవడం అదే తొలిసారి. ►ఆ తర్వాత మరో రెండు సార్లు స్వల్పకాలం సీఎంగా కొనసాగారు. 1997లో ఆరు నెలలు, 2002–03లో 17 నెలలు సీఎం పదవిలో ఉన్నారు ►గురువు కాన్షీరామ్ 2006లో కన్నుమూసినప్పుడు మాయావతి స్వయంగా ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ►2007లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి సీఎం పగ్గాలు చేపట్టి పూర్తిగా అయిదు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగారు ►ఈ అయిదేళ్ల కాలంలో ఆమె ప్రభ మసకబారడం ప్రారంభించింది. అవినీతి, ఆదాయానికి మించి ఆస్తులు, అధికారాన్ని ఉపయోగించుకొని బల ప్రదర్శన, డజనుకు పైగా విమానాలు, హెలికాప్టర్లను ప్రచారానికి వినియోగించడం, తాజ్ హెరిటేజ్ కారిడార్లో అవకతవకలు వంటివెన్నో వివాదాస్పదమయ్యాయి. ►ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన విగ్రహాలు, పార్టీ చిహ్నం ఏనుగు విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టించడం, పుట్టిన రోజు వేడుకల్ని ఘనంగా చేసుకోవడం, కార్యకర్తలు వేసే కరెన్సీ దండల్ని స్వీకరించడం, పాలనా వైఫల్యాలు వంటివన్నీ ఆమెపై తీవ్ర వ్యతిరేక భావాన్ని పెంచాయి. నిమ్నకులాలకి చేసిందేమిటన్న ప్రశ్నలు వచ్చాయి. ►2017 శాసనసభ ఎన్నికల్లో కేవలం 19 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ►2019 లోక్సభ ఎన్నికల్లో ఆగర్భ శత్రువైన ఎస్పీతో పొత్తు పెట్టుకొని బీఎస్పీ 10 స్థానాలు దక్కించుకోగలిగింది. ►ఈసారి ఎన్నికల్లో మాయావతి పార్టీ పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల ప్రచారంలోనూ, మ్యానిఫెస్టో విడుదలలోనూ, అభ్యర్థుల ఎంపికలోనూ ఎందులోనూ స్పీడ్ కనిపించడం లేదు. ►అయినప్పటికీ సంప్రదాయంగా తమకు వచ్చే 20% ఓటు బ్యాంకుపైనే మాయావతి ఆశలు పెట్టుకున్నట్టుగా బీఎస్పీ వర్గాలు చెబుతున్నాయి. – నేషనల్ డెస్క్ సాక్షి -
కులాల కురుక్షేత్రంలో... ఆరంభమే అదిరేలా!
భాగపట్ (యూపీ) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు: ఐదేళ్ల పదవీ కాలం చివరి దశకు చేరడంతో ఉత్తరప్రదేశ్లో మళ్లీ అధికారం కోసం ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చేస్తున్న ప్రయత్నాలు అంత తేలిగ్గా సఫలమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ విసురుతోంది. దానికితోడు ఇటీవలి రైతు ఉద్యమాలకు కేంద్రమైన పశ్చిమ ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల పొత్తులు, రాజకీయ పార్టీల ఎత్తులు బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత ఎన్నికల వైభవాన్ని నిలుపుకోవాలన్న ఆ పార్టీ ఆశలను కులాల సమీకరణతో చిత్తు చేయాలని సమాజ్వాదీ పార్టీ ఉర్రూతలూగుతోంది. జాట్లు, ముస్లింలు, రైతులు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో కులాలు, వర్గాల వారీగా ఓట్లు కొల్లగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్ఎల్డీతో పొత్తు కుదుర్చుకొని జాట్ వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడంలో ఎస్పీ సఫలమైంది. జాట్లలో చీలిక తెచ్చి కూటమి వ్యూహాలను బద్ధలు కొట్టే ప్రణాళికలతో బీజేపీ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. ముస్లిం–జాట్ల సోదరబంధం ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరీ తాత, మాజీ ప్రధాన మంత్రి చౌదరీ చరణ్సింగ్ ‘కిసాన్ నేత’గా కీర్తి గడించారు. ఆయన హయాం నుంచే ముస్లింలు జాట్లతో సత్సంసంబంధాలు కలిగి ఉన్నారు. ఎస్పీ– బీఎస్పీ పుట్టుకకు ముం దు పశ్చిమ యూపీ ముస్లింలు చరణం సింగ్ ఎవరికి మద్దతు ఇస్తే వారినే బలపరిచే వారు. అజిత్ సింగ్ కూడా వారిని కలుపుకుంటూ రాజకీయాలు సాగించారు. అయితే జాట్–ముస్లింల బంధాన్ని 2013లో జరిగిన ముజఫర్నగర్ అల్లర్లు దెబ్బ తీశాయి. అల్లర్ల అనంతరం రెండు వర్గాల మధ్య చీలక ఏర్పడి ముస్లింలు ఆర్ఎల్డీకి దూరమయ్యారు. ఈ కారణంగా ఆర్ఎల్డీ 2014, 2019 ఎన్నికల్లో ఒక్క లోక్సభ స్థానాన్ని గెలుచుకోలేదు. ‘మా రెండు వర్గాల మధ్య సత్సంబంధాలను దెబ్బ తీయడానికి జరిగిన కుట్ర అది. చిన్న ఘటనను ఆధారం చేసుకుని సాగిన హింసాకాండను ఏ రాజకీయ పార్టీ తన ప్రయోజనాలకు వాడుకున్నదో అందరికీ తెలుసు’ అని భాగపట్లో ఎస్పీ తరపున చురుకుగా ప్రచారం చేస్తున్న రసూల్ అలీ ఖాన్ అన్నారు. ఇప్పటికీ అదే అల్లర్లను బూచీగా చూపి బీజేపీ లబ్ది పొందాలని చూస్తోందన్నది అలీఖాన్ ఆరోపణ. జాట్–ముస్లిం–రైతులు కలిస్తే కనీసంగా 50 స్థానాలు గెలువచ్చన్న అంచనాతో పొత్తు పెట్టుకున్న ఆర్ఎల్డీకి ఎస్పీ 33 సీట్లు కేటాయించింది. ఇందులో ఆర్ఎల్డీ 5 స్థానాలను ముస్లింలకు కేటాయించింది. మిగతా స్థానాల్లో ఎస్పీ పోటీలో నిలవగా ఇందులో 8 స్థానాలను ముస్లింలకు కేటాయించింది. అయితే సీట్ల కేటాయింపుపై రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలొచ్చాయి. ముఖ్యంగా సర్ధన, హస్తినాపూర్ సీట్లను ఎస్పీకి అప్పగించడంపై ఆర్ఎల్డీ జాట్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముజఫర్నగర్ జిల్లాలోని 6 స్థానాలకు గానూ 4 స్థానాల్లో ముజఫర్నగర్ సదర్, మీరాపూర్, ఖటోలీ, పుర్కాజీ స్థానాల్లో ఆర్ఎల్డీ గుర్తుపై ఎస్పీ తమ నేతలను బరిలోకి దింపింది. దీంతో ఆర్ఎల్డీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. ఇంతకు జాట్లు ఎటువైపు? పశ్చిమ యూపీలో పార్టీల గెలుపోటముల పాత్ర కీలకమైనది. గడచిన లోక్సభ, శాసనసభ ఎన్నికలలో జాట్లు మద్దతు ఇవ్వడంతో బీజేపీ సునాయసంగా విజయాలు దక్కించుకుంది. అయితే, రైతు ఉద్యమం నేపథ్యంలో జాట్లు బీజేపీకి వ్యతిరేకమయ్యారని,అది తమకు లాభిస్తుందని ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి విశ్వాసంతో ఉంది. ఎస్పీకి ఓట్ల బదిలీ అంత సులభం కాదని దాద్రి, భాగ్పట్, మీరట్, ముజఫర్నగర్ ప్రాంతాల్లో పర్యటించిన సాక్షి ప్రతినిధుల పరిశీలనలో వెల్లడైంది. ఎస్పీ అధికారంలోకి వస్తే జయంత్ సింగ్ చౌధురి పాత్ర నామమాత్రమే అవుతుందంటూ బీజేపీ కేడర్ జాట్లకు నూరిపోసే ప్రయత్నం చేస్తుంది. అంతే కాదు ముజఫర్నగర్ అల్లర్లను పదేపదే గుర్తు చేస్తోంది.‘జయంత్ చౌధురి పార్టీ పోటీ చేసే స్థానాల్లో మా మద్దతు ఉంటుంది. కానీ,అఖిలేశ్ పై మాకు పూర్తి నమ్మకం లేదు’ అని దాద్రి ప్రాంతానికి చెందిన రైతు కిషన్సింగ్ చౌదరి అన్నారు. ఆ ఎత్తుగడ.. రెండువైపులా పదునున్న కత్తి! ముస్లిం ఓట్లు కీలకమైన ముజఫర్నగర్ డివిజన్ లో ఎస్పీ ఒక్క ముస్లింను కూడా బరిలోకి దింపలేదు. ముస్లిం ఓట్లు ఎటూ తమకే దక్కుతాయన్న అంచనాతో హిందూ ఓట్ల చీలిక కోసం ఈ వ్యూ హం పన్నింది. ఇది సీట్లు ఆశించిన ముస్లిం నేతల అసంతృప్తికి కారణమైంది. మరోవైపు ఇదే అదునుగా మాయావతి ఏకంగా 17 మంది ముస్లింలను బరిలోకి దించింది. దాంతో బీజేపీని ఎదుర్కొనేందుకు గంపగుత్తగా ఎస్పీకి ఓట్లు వేయాలనుకున్న ముస్లింల మధ్య అయోమయం నెలకొంది. ‘మేము ఈ ఎన్నికలలో ఎస్పీకి మద్దతు ఇ వ్వాలనే భావించాం. కానీ ఎస్పీ మా మనోభావాలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలన్న విషయంలో మాకింకా స్పష్టత రాలేదు’ ముజఫర్నగర్ వాసి ఫరీద్ అన్నారు. ఇతరులను దువ్వేద్దాం! ఇక పశ్చిమ యూపీలో ముస్లింలు 26 శాతంగా ఉన్నప్పటికీ బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా పోటీకి పెట్టలేదు. గత ఎన్నికల్లోనూ ఒక్క సీటు ఇవ్వని బీజేపీ 76 స్థానాల్లో 66 స్థానాలనుగెలిచింది. కేవలం తనకున్న హిందుత్వ బలం, సంక్షేమ కార్యక్రమాలనే ప్రధానంగా నమ్ముకున్న బీజేపీ ప్రస్తుతం జాట్ల చీలికపై దృష్టి పెట్టింది. గత ఏడాది సెప్టెంబర్లోనే జాట్ రాజు రాజా మహేంద్ర ప్రతాప్సింగ్ జ్ఞాపకార్థం ఒక విశ్వవిద్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. కేంద్రమంత్రి సంజీవ్ బలియాన్ అటు రైతు నేతలు, ఇటు జాట్ నేతలతో సంప్రదింపులు జరిపారు. అనంతరం ఎస్పీ–ఆర్ఎల్డీ పొత్తుల నేపథ్యంలో జాట్ వర్గం గంపగుత్తగా అఖిలేశ్ అండ్ కో వైపునకు వెళ్లకుండా జాట్ నేతలతో కేంద్ర హోమంత్రి అమిత్ షా జనవరి 26న కీలక సమావేశం నిర్వహించారు. పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్సింగ్ వర్మ ఇంట్లో 200 మంది పశ్చిమ యూపీకి చెందిన జాట్ నేతలతో నిర్వహించిన భేటీకి హాజరైన అమిత్ షా వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆర్ఎల్డీ పట్ల తాము సానుకూలంగా ఉన్నామని, అవసరమైతే ఎన్నికల తరువాత పొత్తుకు సిద్దమన్న సంకేతాలు ఇచ్చారు. ఇక ప్లాన్–బి కింద బీజేపీ పశ్చిమ యూపీలో అధికంగా ఉండే షైనీలు, పాల్లు, కశ్యప్లు, ప్రజాపతిల ఓట్లను అభివృధ్ధి మంత్రంతో ఆకట్టుకునే యత్నాలు చేస్తోంది. ‘జాట్లు మాత్రమే కాదు. ఇంకా మావి చాలా కులాలు ఉన్నాయి. మేను కూడా గెలుపోటములు నిర్ణయించగలము’అని భాగ్పట్ మార్కెట్లో టీ దుకాణం నడుపుతున్న శంకర్ లాల్ అన్నారు. -
Uttar Pradesh Assembly Election 2022: ఏదో తేడా కొడుతోంది..!
Uttar Pradesh Assembly Election 2022: గడిచిన దశాబ్దం కాలంగా ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ప్రధాన ఓటు బలం అగ్రవర్ణాల్లోని వైశ్యులు, బాహ్మణులు, రాజ్పుత్లు. మొత్తం యూపీ జనాభాపరంగా చూస్తే వైశ్యులు తక్కువే అయినప్పటికీ 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ సామాజికవర్గంలో బీజేపీకి మద్దతు తగ్గింది. అలాగే బ్రాహ్మణులు మొత్తం యూపీ జనాభాలో గణనీయంగా 8 నుంచి 9 శాతం ఉంటారు. వీరిలోనూ బీజేపీకి పడే ఓట్లలో 6 శాతం తగ్గాయి. దానికి తోడు బీజేపీలో రాజ్పుత్లకు పెద్దపీట వేస్తున్నారని, బాహ్మణులకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని ఏడాదికాలంగా ఆ సామాజికవర్గంలో బలమైన భావన ప్రబలుతోంది. నష్టనివారణకు బీజేపీ గట్టి ప్రయత్నాలే చేసింది. బ్రాహ్మణుల్లో ప్రముఖుడు, యువ నాయకుడు, రాహుల్ గాంధీ కోటరీ సభ్యుడైన జితిన్ ప్రసాదనలు లాగేసింది. అలాగే లఖీంపూరి హింసాకాండ ఘటనలో ఆశిష్ మిశ్రా ప్రమేయం ఉందని దర్యాప్తులో తేలి... అతను జైల్లో ఉన్నందువల్ల దీనికి అసలు కుట్రదారైన అతని తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని విపక్షాలు ఎంత గట్టిగా డిమాండ్ చేసినా... బ్రాహ్మణ ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని, వారికి కోసం తెప్పించకూడదనే ఉద్దేశంతో కమలదళం అజయ్ మిశ్రాను కాచింది. ఇక కుర్మీల విషయానికి వస్తే అనుప్రియా పటేల్కు చెందిన అప్నాదళ్ (ఎస్) నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటీవలే సమాజ్వాదీ పార్టీలోకి మారారు. ఇలా ప్రధాన బలమైన సామాజిక వర్గాల లెక్కల్లో తేడా కొడుతుండటం బీజేపీ పెద్దలను ఆందోళనకు గురిచేస్తోంది.! – నేషనల్ డెస్క్, సాక్షి. -
స్వామి ప్రసాద్ మౌర్య కుమారుడికి ‘నో ఛాన్స్’
ఇటీవల ఎస్పీలో చేరిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య కుమారుడు ఉత్క్రిష్ఠ్ మౌర్యకు ఎస్పీ అధినేత మొండిచేయి ఇచ్చారు. 2017 ఎన్నికల్లో ఉంచహార్ నుంచి పోటీ చేసి 1,934 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఉత్క్రిష్ఠ్ మౌర్యకు ఎస్పీ సీటు కేటాయిస్తారని ఊహాగానాల మధ్య, సిట్టింగ్ ఎమ్మెల్యే మనోజ్ పాండే వైపే అఖిలేష్ మొగ్గు చూపారు. అయితే తొలి జాబితాలో స్వామి ప్రసాద్ మౌర్య ప్రాతినిధ్యం వహిస్తున్న పండ్రౌనా స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు. కాగా అఖిలేష్ బాబాయి శివపాల్ యాదవ్ జస్వంత్నగర్ నుంచి పోటీకి దిగుతుండగా, రాంపూర్ స్వర్ నుంచి ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం బరిలోకి దిగనున్నారు. -
159 మందితో ఎస్పీ తొలి జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ బరిలో దిగారు. దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలన్న ప్రతిపక్షాల నుంచి వచ్చిన సవాళ్ళ నేపథ్యంలో మెయిన్పురి జిల్లాలోని కర్హల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈమేరకు సోమవారం పార్టీ ప్రకటించిన 159 మంది అభ్యర్థుల తొలి జాబితాలో అఖిలేశ్ పేరు ప్రథమంగా ఉంది. సమాజ్వాదీ పార్టీకి.. ముఖ్యంగా యాదవులకు కంచుకోటగా ఉన్న కర్హల్... మాజీ సీఎం ములాయంసింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెయిన్పురి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉంది. 2002 ఎన్నికల్లో మినహా 1993 నుంచి కర్హల్లో సమాజ్వాదీ జెండా ఎగురుతోంది. 2017లో ఎస్పీ అభ్యర్థి సోబ్రాన్సింగ్ యాదవ్ 38 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై గెలిచారు. పార్టీకి బలమైన స్థానం కావడంతో అఖిలేశ్ సైతం ఇక్కడి నుంచే పోటీకి మొగ్గు చూపారు. 2012లో ఎస్పీ ప్రభుత్వం ఏర్పడి అఖిలేశ్ సీఎంగా ఉన్నప్పటికీ, శాసనమండలి సభ్యుడిగానే ఉన్నారు. 2000 నుంచి 2012 వరకు కన్నౌజ్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన అఖిలేశ్ 2019 ఎన్నికల్లో ఆజంఘఢ్ నుంచి ఎంపీగా గెలిచారు. -
సమాజ్వాదీ పార్టీలో చేరిన బీజేపీ అభ్యర్థి
లక్నో/ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, బీజేపీల మధ్య వలసలు అధికంగా ఉన్నాయి. రెండు పార్టీలు పోటా పోటీగా ‘గోడ దూకుళ్ల’ను ప్రోత్సహిస్తున్నాయి. బీజేపీ నేత, జలాలాబాద్ అభ్యర్థి అనిల్ వర్మ తన మద్దతుదారులతో కలసి సోమవారం సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరారు. పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ కూడా సమాజ్ వాదీ పార్టీలోకి మారిపోయారు. అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ తనకు టిక్కెట్ నిరాకరించడంపై స్పందిస్తూ... ‘బీజేపీ కోసం నేను చిత్తశుద్ధితో పనిచేశాను, అయినప్పటికీ నాకు టిక్కెట్ నిరాకరించారు. యువతను ప్రోత్సహిస్తామని చెప్పి 75 ఏళ్ల వృద్ధుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది. యూపీలో సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజల సంక్షేమం కోసం పాటుపడతామ’ని జితేంద్ర వర్మ అన్నారు. (చదవండి: బరేలీలో కాంగ్రెస్ టిక్కెట్ తీసుకొని ఎస్పీలోకి...) జలాల్పూర్కు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే, సుభాష్ రాయ్ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. -
రసవత్తరంగా యూపీ రాజకీయం.. సరికొత్త వ్యూహాలకు పదును
రసవత్తరంగా మారిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అత్యధిక ఓట్లు కొల్లగొట్టేందుకు సమాజ్వాదీ పార్టీ రైతులు, యువత, మహిళలను ఆకర్షించేలా సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతోంది. వీరి ఓటుబ్యాంకే 50 నుంచి 60 శాతం మధ్యలో ఉండడంతో వీరి చుట్టూనే సమాజ్వాదీ పార్టీ మేనిఫెస్టో సిద్ధమౌతోంది. ఇప్పటికే రైతు ఉద్యమానికి మద్దతు పలికి బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టిన ఎస్పీ, ఇప్పుడు రైతు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నేతల మద్దతు కూడగట్టే యత్నాలకు దిగింది. మరోవైపు యువతను ఆకర్షించేందుకు ఉచిత ల్యాప్టాప్ల పథకాన్ని ప్రకటించిన అఖిలేశ్, మహిళల భద్రత అంశాన్ని తెరపైకి తెస్తూ వారి ఓట్లను రాబట్టుకొనే చర్యలకు పదునుపెట్టారు. ఈ మూడు వర్గాలనుంచి వీలైనన్ని ఓట్లను రాబట్టుకొని తన విజయావకాశాలు మెరుగుపరిచేలా చర్యలు చేపట్టారు. రైతు సంక్షేమమే ఎజెండా అందులోభాగంగా రైతులకు సంబంధించి ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. అన్ని పంటలకు ఎంఎస్పీతో పాటు చెరుకు రైతులకు 15 రోజుల్లో చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేగాక రైతులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, సాగునీటికి వడ్డీలేని రుణాలతో పాటు బీమా, పింఛన్ సౌకర్యాలు సైతం ప్రకటించారు. బీజేపీని రాష్ట్రం నుంచి తొలగిస్తామని ప్రతిజ్ఞ చేయాలని అఖిలేశ్ రైతులకు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు రైతులపై పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటామని, ఆందోళనలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇస్తామని అఖిలేశ్ ప్రకటించారు. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత విడుదల చేసే సమాజ్వాదీ మేనిఫెస్టోలో ఇవన్నీ పొందుపరుస్తామని ఎస్పీ అధినేత పేర్కొన్నారు. గతంలో రైతు ఉద్యమానికి మద్దతు తెలిపిన అఖిలేశ్ రైతు ఉద్యమ నేతలతో సన్నిహితంగా ఉంటూ వారి మద్దతును కూడగట్టుకున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్లో కీలక రైతు నేత నరేశ్ తికాయత్ ఎస్పీ కూటమికి మద్దతును ప్రకటించడం ఈ చర్యల్లో భాగమేనని పార్టీ వర్గాలు తెలిపాయి. మహిళల భద్రత– యువతకు ఉపాధే లక్ష్యం ఓట్ల శాతాన్ని పెంచేందుకు రాష్ట్రంలో తమ పార్టీ టార్గెట్ చేయాల్సిన ఓటుబ్యాంకుకు సంబంధించి సుదీర్ఘ కసరత్తును అఖిలేశ్ యాదవ్ ఇప్పటికే పూర్తి చేశారు. ముస్లిం–యాదవ్ ఫార్ములాతో ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గరిష్ఠంగా 30 శాతం ఓటుబ్యాంకు మార్కును టచ్ చేయలేకపోయిన సమాజ్వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో మహిళలు–యువత ఫార్ములాతో కనీసం 40 నుంచి 50 శాతం ఓట్లు రాబట్టేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు ఎక్కువగా జరిగాయని అఖిలేశ్ ఇప్పటికే అనేకసార్లు విమర్శించారు. ఉన్నావ్, గోరఖ్పూర్, హథ్రాస్ వంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండేలా మహిళల భద్రత విషయంలో చర్యలు తీసుకుంటామని అఖిలేశ్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలను ఇవ్వలేక పోయారని, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని అఖిలేష్ ఇప్పటికే అనేకసార్లు ఆరోపించారు. అంతేగాక తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువత, విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేగాక పార్టీ ప్రత్యేకంగా మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుంటోందని ఎస్పీ వర్గాలు తెలిపాయి. మధ్య తరగతి యువతకు ఉపాధి కల్పించడం, వారి విద్య, రైతుల సాగు ఖర్చు తగ్గించడం, మహిళల భద్రతకు సంబంధించిన తదితర అంశాలపై తమ పార్టీ దృష్టి సారించిందని పేర్కొంటున్నారు. ఈ అంశాలే తమ మేనిఫెస్టోలో ప్రతిబింబిస్తాయని వెల్లడిస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 50 శాతం కంటే ఎక్కువ ఓటుబ్యాంకును తమవైపు ఆకర్షించేందుకు అవకాశం ఉంటుందని ఎస్పీ నేతలు భావిస్తున్నారు. గతంలో 2012లో అధికారంలోకి వచ్చినప్పుడు సైతం కేవలం 29.15 శాతం ఓట్లను మాత్రమే సమాజ్వాదీ పార్టీ రాబట్టుకోగలిగింది. అయితే ఆ తర్వాత 2017లో అధికారంలోకి వచ్చిన బీజేపీ, రాష్ట్రం లోని ఓబీసీ ఓటుబ్యాంకును తమవైపు ఆకర్షించుకోవడం ద్వారా 39.67 శాతం ఓట్లను కైవసం చేసుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో వివిధ సమీకరణాల ద్వారా ఓటుబ్యాంకును పెంచుకోవడం ద్వారా అధికారంలోకి రావాలనుకుంటున్న ఎస్పీ ఇప్పటికే బీఎస్పీ సంప్రదాయ ఓటుబ్యాంకును ఎస్పీ తమవైపు లాక్కొందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా మధ్యతరగతి, అట్టడుగు వర్గాల నాయకులు పార్టీలో చేరుతున్న ఈ సమయంలో, పార్టీ తమ సంప్రదాయ ఓటుబ్యాంకు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. – సాక్షి, న్యూఢిల్లీ -
UP Assembly Election 2022: ‘మాణిక్పూర్’కా మాలిక్ కౌన్!
అక్కడ దశాబ్దాలుగా దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రశాంతంగా ఉండే పల్లెల్లో రక్తపాతం పారిస్తున్నారు. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండే గ్రామాల ప్రజలను నిత్యం వేధిస్తూ వారిని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని చంబల్ మాదిరే డెకాయిట్ల అకృత్యాలతో అల్లాడుతున్న నియోజకవర్గం ఉత్తర్ప్రదేశ్ బుందేల్ఖండ్ ప్రాంతంలోని చిత్రకూట్ జిల్లాలోని ‘మాణిక్పూర్’. మినీ చంబల్గా పిలువబడే ఈ ప్రాంతంలోని డెకాయిట్లను ఏ ప్రభుత్వాలు అణచివేస్తాయో ఆ పార్టీకి ఇక్కడి ప్రజలు పట్టం కడుతున్నారు. డెకాయిట్లతో దోస్తీ ఉందన్న కారణంతో సమాజ్వాదీ పార్టీని దూరం పెడుతున్నారు. ఇక్కడ ఇంతవరకూ గెలువని ఏనాడు గెలవని ఎస్పీ ప్రస్తుత ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మినీ చంబల్లో ఐదు దశాబ్దాలుగా అరాచకాలు ప్రస్తుత యూపీ ఎన్నికల్లో అత్యంత చర్చనీయాంశం అయిన అసెంబ్లీ ఏదైనా ఉందంటే అది మాణిక్పూర్ నియోజకవర్గమే. వింధ్యా పర్వత శ్రేణుల మధ్యలో మధ్యప్రదేశ్–ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దులతో ఉన్న మాణిక్పూర్లో ఐదు దశాబ్దాలుగా దోపిడీ దొంగల హవా నడుస్తోంది. దోపిడీ దొంగల కారణంగా ఈ ప్రాంతం మినీ చంబల్గా అపఖ్యాతిని మూటగట్టుకుంది. 1965 ప్రాంతంలో ఇక్కడ గజదొంగగా పేరుగడించిన తయా ప్రసాద్ 15 ఏళ్ల పాటు నానా బీభత్సం సృష్టించాడు. గయా ప్రసాద్ పేరు చెబితేనే చిత్రకూట్ మొత్తం వణికిపోయేదని, ఇక్కడ సాయంత్రం కాగానే అతని భయంతో ఇళ్లకు తాళాలు వేసి ఉంచేవారని చెబుతారు. గయా ప్రసాద్ ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉండేవాడు. అతని తర్వాత ఎక్కువ కాలం పాటు ఆ ప్రాంతంలో పేరు గడించిన దోపిడీ దొంగ దదువా. గయా ప్రసాద్ మరణం తర్వాత ఆయన వారసుడిగా 1980లో దదువా తెరపైకి వచ్చాడు. దదువా ప్రాంతీయ రాజకీయాల్లో తరుచూ జోక్యం చేసుకునేవాడు. 2004 లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ తరఫున ప్రచారం సైతం చేశాడు. దోపిడీ దొంగలకు ఎస్పీ ప్రభుత్వం వంత పాడుతోందన్న సందేశం ప్రజల్లోకి వెళ్లిన కారణంతో 2007 ,2012, 2017, 2019 (ఉప ఎన్నిక) ఎన్నికల్లో ఎస్పీని ఇక్కడి ప్రజలు చిత్తుగా ఓడించారు. 2007లో మాయావతి ప్రభుత్వ హయాంలో ఇతన్ని ఎన్కౌంటర్ చేశారు. ఇతని తర్వాత స్ఫెషల్ టాస్క్ఫోర్స్ సిబ్బందిపై మెరుపుదాడి చేసి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటనతో థొకియా అనే మరో దోపిడీదొంగ వెలుగులోకి వచ్చాడు. ఈ ఘటనలో ఆరుగురు కమాండోలు వీరమరణం పొందారు. చదవండి: (UP Assembly Election 2022: నువ్కొకటి కొడితే... నేను రెండేస్తా!) 2008 ఆగస్టులో సిల్ఖోరి గ్రామంలో ఎస్టీఎఫ్ జరిపిన ఎన్కౌంటర్లో ఇతను హతమయ్యాడు. ఆ తర్వాత ఆ స్థానం గౌరీయాదవ్ తీసుకున్నాడు. యూపీ, ఎంపీల్లోని పలు పోలీస్స్టేషన్లలో గౌరీ యాదవ్పై హత్య, కిడ్నాప్ వంటి 60కి పైగా కేసులు నమోదయ్యాయి. గౌరీ యాదవ్ను గత ఏడాది అక్టోబర్లో బహిల్పూర్వా అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో ఎస్టీఎఫ్ హతమార్చింది. వీరితో పాటే బల్ఖాడియా, బాబ్లీకోల్ వంటి గజదొంగలు ఈ ప్రాంతంలో బీభత్సం సృష్టించి ప్రజలను తీవ్రంగా హింసించారు. డెకాయిట్లను అణిచిన పార్టీలకే ప్రజల మద్దతు... నేర ప్రపంచంలో మకుటం లేని మారాజులుగా వెలిగిన క్రూరమైన నేరగాళ్లను అణిచివేసిన పార్టీలకు ఇక్కడి ప్రజలు తొలినుంచి మద్దతిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా దదువా అరాచకాలు సాగిన కాలంలో జన్సంఘ్, కాంగ్రెస్ నేతలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దొంగల బీభత్సం నుంచి విముక్తి చేయడంలో కాంగ్రెస్, జన్సంఘ్లు ప్రత్యేక కృషి చేయలేకపోయాయని భావించిన ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చారు. 1989, 1993లో మాణిక్పూర్ స్థానం నుంచి బీజేపీకి చెందిన మన్నూలాల్ ఎమ్మెల్యే అయ్యారు. మన్నూలాల్ గెలుపును జీర్ణించుకోలేని దదువా 1992లో మదయన్ గ్రామంలో ముగ్గురిని చంపి తర్వాత గ్రామం మొత్తానికి నిప్పంటించాడు. చాలా రక్తపాతం జరిగింది. దీంతో బెంబేలెత్తిన ప్రజలు 1996 ఎన్నికల్లో బీఎస్పీకి చెందిన దద్దూ ప్రసాద్ను తమ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అతని పాలనలో బెదిరింపులు తగ్గడంతో 2002, 2007లో అతన్నే గెలిపించారు. ఇక్కడ ప్రజల విశ్వాసాన్ని గమనించిన అప్పటి ముఖ్యమంత్రి మాయావతి దదువాను ఎన్కౌంటర్ చేయించింది. దీంతో 2012లో దద్దూ ప్రసాద్ తర్వాత బీఎస్పీ అభ్యర్థి చంద్రభాన్ సింగ్ ఎమ్మెల్యేగా గెలిచారు. మాణిక్పూర్లో బీఎస్పీ ఆధిక్యతను చూసి బీజేపీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాస్టర్ ప్లాన్ వేసింది. పార్టీ బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే ఆర్కే పటేల్ను అభ్యర్థిగా చేసి ఆయనను ఈ స్థానం నుంచి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయించింది. బీజేపీ ప్లాన్ ఫలించి పటేల్ భారీ ఆధిక్యంతో గెలిచారు. అనంతరం 2019 లోక్సభ ఎన్నికల్లో పటేల్ విజయం సాధించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగ్గా, బీజేపీ అభ్యర్థి ఆనంద్శుక్లా గెలిచారు. 2017లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇక్కడి ప్రాంతంలో చాలామంది డెకాయిట్లను యోగి ప్రభుత్వం అంతమొందించడంతో బీజేపీ సానుకూలత కనబడుతోంది. ఇక నియోజకవర్గంలో ఇంతవరకూ గెలుపు రుచి చూడని ఎస్పీ ఎలాగైనా గెలవాలన్న గట్టి పట్టుదలతో ఉంది. – సాక్షి, న్యూఢిల్లీ గౌరీయాదవ్, బాబీకోల్ -
UP Assembly Election 2022: నువ్కొకటి కొడితే... నేను రెండేస్తా!
ఇప్పుడు సరిగ్గా.. ఇదే పంథాలో ఉత్తరప్రదేశ్ రాజకీయ యవనికపై టిట్ ఫర్ టాట్ క్రీడ రక్తికడుతోంది. అబ్బురపరిచే ఎత్తులతో సమాజ్వాదీ పార్టీ, బీజేపీ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. హిందుత్వ కార్డుతో ఓటర్లు సంఘటితం కాకుండా చూసుకుంటే సగం యుద్ధం గెలిచినట్లేనని భావించిన ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్... చాణక్యాన్ని ప్రదర్శించారు. కీలకమైన ఓబీసీ నేతలను లాగేశారు. తామేమి చేయకపోతే చేష్టలుడిగి చూస్తుండిపోయిందనేది ప్రజల్లోకి వెళుతుందని... దిక్కుతోచని స్థితిలోకి బీజేపీ వెళ్లిపోయిందని భావిస్తారని కమలదళం భయపడింది. ఎత్తుకు పైఎత్తుకు వేసింది. చిన్న కోడలు అపర్ణా యాదవ్ను లాగేయడం ద్వారా ములాయం సింగ్ ఇంట్లోనే చిచ్చు పెట్టింది. ఈ రాజకీయ సమయంలో వ్యూహాలు పదునెక్కుతున్న వైనంపై ‘సాక్షి’ సవివర కథనం... మౌర్య ఇచ్చిన షాక్తో ‘మైండ్ బ్లాంక్’ ఇతర వెనుకబడిన వర్గాల్లో (ఓబీసీల్లో) బలమైన నాయకులైన మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య జనవరి 12న, దారాసింగ్ చౌహాన్ 13న మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో కలకలం రేగింది. రోజుకో మంత్రి, ఒక ఎమ్మెల్యే చొప్పున పార్టీని వీడిపోవడంతో బీజేపీకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మొత్తం ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీని వీడారు. కాషాయపార్టీ తేరుకునే లోగానే... ఓబీసీలను బీజేపీ అవమానిస్తోందని... అందుకే వారంతా సమాజ్వాదీ పార్టీలోకి క్యూ కడుతున్నారనే సందేశం బలంగా ప్రజల్లోకి వెళ్లింది. ములాయం ఇంట్లోనే ముసలం నష్టనివారణకు దిగిన బీజేపీ దిమ్మతిరిగేలా కొట్టాలని భావించి అసంతృప్తితో ఉన్న అఖిలేశ్ మరదలు అపర్ణా యాదవ్కు (సవతి సోదరుడు ప్రతీక్ యాదవ్ భార్య) గాలం వేసింది. సొంత మనిషినే ఆపలేకపోతే అఖిలేశ్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటారు. సరిగ్గా బీజేపీ అక్కడే కొట్టి లక్ష్యాన్ని సాధించింది. మైండ్గేమ్ కీలక ఓబీసీ మంత్రులు పార్టీని వీడి వెళ్లిపోవడంతో తూర్పు యూపీలో నష్టం తప్పదని భావించిన బీజేపీ దీన్ని పూడ్చుకోవాలనే ఉద్దేశంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ను గోరఖ్పూర్ నుంచి బరిలోకి దింపింది. తర్వాత బీజేపీ కేంద్రమంత్రులు, రాష్ట్ర నాయకులు ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల బరిలోకి దిగడానికి భయపడుతున్నారని ప్రతిరోజూ వల్లెవేస్తూ ఎస్పీ చీఫ్ను పిరికివాడిగా చూపే ప్రయత్నం చేశారు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన అఖిలేశ్ తాను మెయిన్పురి నుంచి పోటీ చేస్తానని గురువారం ప్రకటించారు. నిజానికి వీరిద్దరూ పోటీచేసింది... కంచుకోటలైన సొంత నియోజకవర్గాల నుంచే. నిజానికి ఈ విషయంలో ఏటికి ఎదురీదే గుండె ధైర్యాన్ని ప్రదర్శించి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఒకప్పటి తన కుడిభుజం సువేందు అధికారికి కంచుకోటగా మారిన ‘నందిగ్రామ్’ నుంచి పోటీచేస్తానని ప్రకటించి నివ్వెరపరిచారు. తాను నందిగ్రామ్ బరిలో ఉంటే సువేందు అధికారి సొంత నియోజకవర్గానికి బాగా సమయం కేటాయించాల్సి వస్తుందని, ఇతర ప్రాంతాల్లో ప్రచారానికి తిరగలేరనేది దీదీ ఎత్తు. తాను ఓడిపోయినా... మమత వ్యూహం మాత్రం బ్రహ్మాడంగా వర్క్ అవుట్ అయి దీదీ హ్యాట్రిక్ కొట్టారు. కొట్టారు.. తీసుకున్నాం. మాకూ టైమొస్తుంది.. మేమూ కొడతాం – 2017లో నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక ముగిశాక... చంద్రబాబు సర్కారు కుట్రపూరిత వేధింపులపై అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంధించిన ఈ వాగ్భాణం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. ‘ఇది కదా... సిసలైన పోరాటయోధుడి గుండెధైర్యం’ అనుకున్నారు జనం. ప్రియాంక నినాదం తుస్సుమనేలా.. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో కొడిగట్టిన కాంగ్రెస్ కనీసం గౌరవప్రద స్థితిలో నిలిపితే.. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా సానుకూలత రావడానికి ఉపయోగపడుతుందని యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ప్రియాంకా గాంధీ ‘లడకీ హూ... లడ్ సక్తీ హూ (ఆడబిడ్డను... పొరాడగలను)’ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. తద్వారా ‘మేమెందుకు పురుషులతో సమానం కాదు. మాకేం తక్కువ’ని నేటితరం యువతుల్లో బలంగా నాటుకుపోయిన భావజాలాన్ని ప్రేరేపించారు. బాగా జనంలోకి వెళ్లిపోవడంతో ఈ నినాదంతో కాంగ్రెస్ యూపీ నలుమూలగా నిర్వహించిన మారథాన్లకు యువతుల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రియాంక ఎత్తుగడ ఫలించింది. దాంతో ఆమె 40 శాతం అసెంబ్లీ టిక్కెట్లను మహిళలకు కేటాయిస్తామని ప్రకటించి.. చేతల్లో చూపడం ద్వారా మహిళా ఎజెండాను మరిం త ముందుకు తీసుకెళ్లారు. చదవండి: (కరోనానే పెద్ద పరీక్ష!) ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ప్రియాంక పోరాట సన్నద్ధంగా ఉన్న ముగ్గురు యువతుల ఫోటోతో కూడిన హోర్డింగ్లు, పోస్టర్ల ను యూపీ వ్యాప్తంగా విస్తృతంగా అతికిం చారు. ఈ ముగ్గురిని లీడ్ చేస్తూ మధ్యలో ఉన్న యువతి పేరు ప్రియాంకా మౌర్య, వృత్తిరీత్యా డాక్టర్. మంచి వక్త. లింగ సమానత్వం కోసం ప్రియాంకా గాంధీ చేపట్టిన ఈ ఉద్యమాన్ని బలంగా తీసుకెళ్లిందని ప్రియాం క మౌర్య. ఆమె స్వభావం, ఆహార్యం దీనికి బాగా ఉపకరించాయి. దాంతో ఈ ఉద్యమానికి ప్రియాంక మౌర్య బ్రాండ్ అంబాసిడర్గా, పర్యాయపదంగా మారారు. సరిగ్గా బీజేపీ ఇక్కడే గురిచూసి కొట్టింది. 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తే మహిళల్లో కాంగ్రెస్కు మంచి సానుకూలత వస్తుందని, అసలే ఒకవైపు ఎస్పీ– రాష్ట్రీయ లోక్దళ్ పొత్తులో తమ హిందూత్వ కార్డు నిర్వీర్యమైన పోయిన పరిస్థితుల్లో ప్రియాంకా గాంధీ ఎత్తుగడ తమకు భారీ నష్టం కలుగుజేస్తుందని భయపడ్డ బీజేపీ మాస్టర్ గేమ్ ఆడింది. ‘అడపిల్లను... పోరాడగలను’ అనే నినాదానికి బ్రాండ్ అం బాసిడర్గా ఉన్న ప్రియాంక మౌర్యను లాగేస్తే కాంగ్రెస్ను చావుదెబ్బ కొట్టొచ్చని భావించి అమలులో పెట్టేసింది. మహిళలకు 40 టిక్కెట్లు ఇచ్చామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటోందని.. చేతల విషయానికి వచ్చే సరికి కష్టజీవి ప్రియాంక మౌర్యకే మొండి చేయి చూపిందనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా పంపింది. ఇప్పుడిక ప్రియాంకా గాంధీ మహిళలకు ఇచ్చే టికెట్లు 50 శాతానికి పెంచినా, ఈ విషయాన్ని ఎన్నికల ర్యాలీల్లో 500 సార్లు చెప్పినా జనం నమ్మరు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
అఖిలేష్కు మరో షాక్: బీజేపీలో చేరిన ములాయం తోడల్లుడు
లక్నో: ఉత్తరప్రదేశ్లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్నవేళ అన్ని పార్టీల్లో నేతల పార్టీ చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా సమాజ్వాదీ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్పీ వ్యవస్థపక అధ్యక్షుడు, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ తోడల్లుడు మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ గుప్తా గురువారం బీజేపీలో చేరారు. బుధవారం ములాయంసింగ్ యాదవ్ సవతి కుమారుడు (రెండో భార్య సాధనా సింగ్కు మొదటి వివాహం ద్వారా జన్మించారు) ప్రతీక్ యాదవ్ భార్య అయిన అపర్ణా యాదవ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ప్రమోద్ గుప్తాతో పాటు కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ప్రియాంక మౌర్య కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘లడ్కీ హూన్, లడ్ సక్తి హూన్’ ప్రచారంలో ప్రియాంక మౌర్య పోస్టర్ గర్ల్గా ఉండి కీలకంగా వ్యవహరించారు. బీజేపీలో ఆమె చేరిక కాంగ్రెస్ పార్టీకి నష్టం కలగనుందని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు మంత్రులు సహా పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో ఓబీసీ వర్గాల్లో ఇబ్బంది పడుతున్న బీజేపీకి ములాయం చిన్న కోడలు బీజేపీలో చేరడం కాస్త ఉపశమనం కలిగించే అంశంగా మారింది. -
పశ్చిమ యూపీ బీజేపీకి కత్తిమీద సామే!
భారత్లో లోక్సభ ఎన్నికల తర్వాత అంతగా ప్రాధాన్యం, జనాసక్తి ఉండేది ఉత్తరప్రదేశ్ ఎన్నికలపైనే. అక్కడ ఏ పార్టీ పరిస్థితేంటి, ఎవరెవరు పొత్తులు పెట్టుకుంటున్నారు... విజయావకాశాలు ఎవరికి ఉన్నాయి? ఏయే కారణాల వల్ల అనేది రాజకీయ పండితుల నుంచి పామరుల దాకా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ యూపీలో ఫిబ్రవరి 10న తొలివిడత ఎన్నికలు జరగనున్న 58 నియోజకవర్గాల పరిస్థితిపై సవివర విశ్లేషణ... తొలిదశ ఎన్నికలు జరగనున్న 58 నియోజకవర్గాల్లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 53 స్థానాలను గెలిచింది. దీనికి కారణం 2013 ముజఫర్నగర్లో జరిగిన మతఘర్షణలు. అందులో 43 మంది చనిపోయారు. తర్వాత 2014–16 మధ్యకాలంలో కైరానా పట్టణం నుంచి ముస్లింల వేధింపులు భరించలేక దాదాపు 350 దాకా హిందువుల కుటుంబాలు వలసపోయాయి. పశ్చిమ యూపీలో ముస్లిం జనాభా ఎక్కువ. మొత్తం ఉత్తరప్రదేశ్ జనాభాలో ముస్లింలు 19.3 శాతం ఉండగా... పశ్చిమ యూపీలో ఏకంగా 26 శాతం కేంద్రీకృతమై ఉన్నారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూత్వ నినాదాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లిన బీజేపీ... ముజఫర్నగర్, కైరానా ఘటనలను పదేపదే ఎత్తిచూపుతూ... ముస్లింలకు కొమ్ముకాసే సమాజ్వాదీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ ఆగడాలు మరింతగా మితిమీరుతాయని ప్రచారం చేసింది. తద్వారా హిందువుల ఓట్లను విజయవంతంగా సంఘటితం చేసి పశ్చిమ యూపీని ఏకపక్షంగా కైవసం చేసుకుంది. ఈసారి సీన్ మారింది ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే... ఈసారి సీన్ పూర్తిగా మారిపోయింది. హిందూత్వ కార్డు ఫలించే పరిస్థితులు కనిపించడం లేదు. దాంతో హిందూత్వ సెంటిమెంటును మరోస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా... అయోధ్య రామాలయ నిర్మాణం, కాశీ విశ్వనాథ ఆలయ అభివృద్ధి బీజేపీ ఉండబట్టే జరుగుతున్నాయని.. మరోసారి అధికారమిస్తే మథురలో శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్మిస్తామని కాషాయపార్టీ చెబుతోంది. ఈ పాచిక కూడా పారేటట్లు కనిపించడం లేదు. దాంతో బీజేపీ ఇక్కడ ప్రభావవంతంగా ఉండే చెరకు రైతులను దృష్టిలో పెట్టుకొని... యోగి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రూ 1.55 లక్షల కోట్లను చెరకు రైతులకు చెల్లింపులు చేసిందని, ఎప్పటికప్పుడు బకాయిలు లేకుండా చూశామని చెబుతోంది. అలాగే నోయిడాలో నిర్మితం కానున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చూపుతూ... అభివృద్ధి మంత్రం పఠిస్తోంది. క్షేత్రస్థాయిలో ఎస్పీకి సానుకూలంగా.. పశ్చిమ యూపీలో ముస్లింలు 26 శాతం పైచిలుకు ఉన్నారు. ఎనిమిది జిల్లాల్లో అయితే ఏకంగా 40.43 శాతం ఉన్నారు. ముస్లింల ప్రయోజనాలను కాపాడటంలో చాంపియన్గా పేరుపడ్డ సమాజ్వాదీ పార్టీతోనే ముస్లిం యూపీలో ఉంటున్నారు. దీనికి తోడు... ఈసారి బీజేపీని నిలువరించాలంటే తమ ఓట్లు లౌకిక పార్టీల మధ్యన చీలిపోకూడదని, గెలిచే అవకాశాలున్న ఎస్పీకే గంపగుత్తగా ముస్లిం ఓట్లన్నీ పడితేనే కమలదళాన్ని ఓడించడం సాధ్యమనే సందేశాన్ని ముస్లిం మతపెద్దలు, నాయకులు సామాన్యులకు నూరిపోస్తున్నారు. మసీదుల్లో ఈ అంశాన్ని నొక్కి చెబుతున్నారు. మరోవైపు దాదాపు 3.5 శాతం మంది జాట్లు ఉన్నారు. జాట్ల పార్టీగా గుర్తింపు పొందిన రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ)– సమాజ్వాదీతో పొత్తు పెట్టుకుంది. అంటే... దాదాపు 30 శాతం ఓట్ల బలం పశ్చిమ యూపీలో ఎస్పీకి ఏకపక్షంగా అనుకూలంగా మారినట్లే. పైగా ఎస్పీ ప్రధాన బలమైన, యూపీలో శక్తివంతమైన సామాజికవర్గం యాదవుల మద్దతు ఎలాగూ ఉంటుంది. చదవండి: (పొలిటికల్ సిద్ధూయిజం: క్రికెట్లో అజారుద్దీన్నీ వదల్లేదు.. రాజకీయాల్లో..) మాజీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్ల చేరికతో ఇతర వెనుకబడిన వర్గాల్లోనూ (ఓబీసీ) ఎస్పీకి బాగా సానుకూలత ఏర్పడింది. దానికి తోడు మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా 14 నెలల సుదీర్ఘకాలం పాటు జరిగిన రైతు ఉద్యమంలో పశ్చిమ యూపీకి చెందిన రైతులు ప్రధాన భూమిక పోషించారు. అందులోనూ జాట్ రైతు నాయకులు ముందుండి అన్నదాతలను నడిపించారు. ఇదే ప్రాంతానికి చెందిన భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు నరేశ్ తికాయత్ ఎస్పీ– ఆర్ఎల్డీ కూటమికి బాహటంగా మద్దతు ప్రకటించారు. రైతు ఉద్యమం చివరి దశకు చేరుకున్న దశలో ఘజియాబాద్లో నిర్వహించిన మహాపంచాయత్కు ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. ఆ సభలోనే బీకేయూ మరోనేత రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ ప్రధాని మోదీ, బీజేపీ రైతులను గోస పెట్టాయని ఆరోపించారు. బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింలు– రైతులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. తామిక ప్రతీ వేదికపై అల్లా హో అక్బర్తో పాటు హరహర మహదేవ్ అంటూ నినదిస్తామని ప్రకటించారు. ఘజియాబాద్ సభకు అంచనాలకు అందని విధంగా రైతులు తరలిరావడం, నగర రోడ్లన్నీ జనంతో కిక్కిరిసి పోవడం చూసి బీజేపీకి డేంజర్ బెల్స్ మోగినట్లేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు. అంటే క్షేత్రస్థాయిలో ఎస్పీకి మంచి సానుకూల వాతావరణం ఉంది. సమాజ్వాదీ పార్టీ తొలి దశలో సునాయాసంగా 45 నుంచి 50 శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ కూడా ఎన్నికలు జరిగే 58 స్థానాల్లో తమ కూటమి 45– 50 స్థానాలు గెలుచుకుంటుందనే ధీమాతో ఉన్నారు. చదవండి: (Mayawati: ఆమె మౌనం.. ఎవరికి లాభం!) ఆరంభమే అదిరితే..! యూపీలో ఫిబ్రవరి 10న మొదలై మార్చి 7వ తేదీదాకా మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశలో పశ్చిమ యూపీలో పోలింగ్ ఉండటం ఎస్పీకి బాగా కలిసొచ్చే అంశం. బోణీ బాగుంటుంది కాబట్టి ఎస్పీ ఉత్సాహంగా మిగతా ఆరు దశల్లో ఎన్నికలను ఎదుర్కొంటుంది. తొలిదశలోనే సైకిల్ (సమాజ్వాదీ పార్టీ ఎన్నికల చిహ్నం) స్పీడు పెరుగుతుందని... ఇక తమను ఆపడం ఎవరితరం కాదని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి ఇటీవల అన్నారు. ఓపెనర్ సెంచరీ చేస్తే ఆ జట్టు మంచిస్కోరు సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లే... తాము మంచి స్థితిలో ఉన్నామనేది ఎస్పీ వ్యూహకర్తల భావన. పశ్చిమాన మొదలైన ఈ గాలి క్రమేపీ బలపడి తూర్పుకు వెళ్లేసరికి సుడిగుండంలా మారుతుందని, బీజేపీని తుడిచిపెట్టేస్తుందని అఖిలేశ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈటెల్లాంటి మాటలే.. ఎన్నికల షెడ్యూల్ రావడానికి రెండు మూడు నెలల ముందు నుంచే యూపీలో రాజకీయ నాయకుల మాటలు పదునెక్కాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘చాచా జాన్’ అనే వారికి ఎస్పీ హయాంతో రేషన్తో సహా అన్ని దక్కేవని పరోక్షంగా ఎస్పీ పూర్తిగా ముస్లింకు కొమ్ముకాసే పార్టీ అని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. తర్వాత ప్రధాని మోదీ ఇటీవల యూపీ పర్యటనకు వెళ్లినపుడు up+yogi=upyogi(యూపీ + యోగీ.. కలిపితే ఉపయోగి అవుతుందని, ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్కు ఎంతో చేశారని.. మరో అవకాశమిస్తే బాగా ఉపయోగపడగలరని చెప్పే ప్రయత్నం చేశారు. బెంగాల్ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ ఇచ్చిన ‘ఖేలా హోబే (ఆట మొదలైంది)’ అనే నినాదం ప్రజల్లోకి బాగా వెళ్లిపోయిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని... అదే లైన్లో అఖిలేశ్ నాలుగైదు రోజుల కిందట ’మేళా హోబే (ఐక్యత ఉంటుంది... బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఎస్పీ నేతృత్వంలో ఏకమవుతాయన్న అర్థంలో) అంటూ ట్వీట్ చేశారు. కరోనా థర్డ్వేవ్ నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలు, సభలు, సమావేశాలపై ఈసీ కఠిన ఆంక్షలు విధించింది. ఇప్పుడప్పుడే కరోనా ఉధృతి తగ్గేలా లేదు కాబట్టి ఇవే ఆంక్షలూ ఇకపైనా కొనసాగుతాయి. అందువల్ల నేతలు వర్చువల్గా ప్రచారం చేయాల్సిందే. సోషల్మీడియాలో నాయకుల పోస్టులు తప్పకుండా హీటును పెంచేటట్లుగా ఉంటాయి. ఈటెల్లాంటి మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ... యువతరాన్ని, విద్యావంతులైన ఓటర్లను, తటస్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి రాజకీయపార్టీలు. – నేషనల్ డెస్క్, సాక్షి -
బీజేపీకి థ్యాంక్స్ చెప్పిన అఖిలేష్ యాదవ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. పలువురు నేతలు ఇప్పటికే పార్టీలు మారడంతో అధికార ప్రతిక్షాల మధ్య పోరు హోరాహారీగా జరగనుందని రాజకీయవర్గాలు విశ్లేషణ చేస్తున్నాయి. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సోదరుడి భార్య అపర్ణ యాదవ్ బుధవారం బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన అపర్ణ యాదవ్ అపర్ణ యాదవ్ బీజేపీలో చేరడంపై అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. అపర్ణ యాదవ్ సమాజ్వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. సమాజ్వాదీ పార్టీ భావాజాలన్ని అపర్ణ యాదవ్ ఇతరపార్టీలో కూడా వ్యాప్తి చేయాలనుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. తప్పకుండా సమాజ్వాదీ పార్టీ భావాజాలం బీజేపీకి చేరుతుందని తెలిపారు. ఆమె పార్టీ మారకుండా ఉండాలని ప్రయత్నించామని, కానీ సాధ్యం కాలేదని పేర్కొన్నారు. కాగా, అపర్ణ యాదవ్ 2017లో ఎస్పీ తరపున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో అపర్ణ యాదవ్.. బీజేపీ నేత రీటా బహుగుణ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇక మరోవైపు అపర్ణయాదవ్ చేరిక బీజేపీ ఏమేరకు కలిసివస్తుందో చూడాలి. -
రాజకీయ దురంధరుడైన తండ్రినే వ్యూహాలతో మట్టికరిపించి..
గూండారాజ్, దాదాగిరికి మారుపేరైన సమాజ్వాదీ పార్టీలో మార్పుని తీసుకువచ్చి యువతరాన్ని ఆకర్షించిన నాయకుడు అఖిలేశ్ యాదవ్. రాజకీయ దురంధరుడైన తండ్రి ములాయం సింగ్ యాదవ్నే తన రాజకీయ వ్యూహాలతో మట్టి కరిపించి పార్టీని తన గుప్పిట్లోకి తీసుకున్నారు. దేశంలో అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 38 ఏళ్ల వయసులో అతి పిన్న వయస్కుడైన సీఎంగా పగ్గాలు చేపట్టి తన సొంతముద్రని కనబరిచారు. నేరాలు ఘోరాలు, గూండాయిజం వెర్రితలలు వేసే యూపీ ప్రజలకు అభివృద్ధి అంటే ఏమిటో తొలిసారి చూపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మాని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హిందూత్వ ఎజెండాని ఓబీసీ ఓట్లతో ఎదుర్కొనే వ్యూహాలకు పదునుపెడుతూ రెండోసారి సీఎం కుర్చీని అందుకోవాలని తహతహలాడుతున్నారు. చదవండి: (Punjab Assembly Election 2022: ఆప్కు ముప్పు: విజయావకాశాలను దెబ్బతీసేలా) ►1973 జులై 1న ములాయంసింగ్ యాదవ్, మాలతిదేవి దంపతులకు జన్మించారు. ►రాజస్థాన్లోని ధోల్పూర్ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం చేయడంతో చిన్నప్పట్నుంచి క్రమశిక్షణ మధ్య పెరిగారు. ►కర్ణాటకలోని మైసూర్ యూనివర్సిటీ నుంచి సివిల్ ఎన్విరాన్మెంటల్లో ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నారు. ►ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పర్యావరణంలో మాస్టర్స్ చేశారు. ►సామ్యవాద భావాలున్న అఖిలేశ్కు సామాజిక అంశాలపై పరిజ్ఞానం ఎక్కువ. సోషలిస్టు దిగ్గజం రామ్మనోహర్ లోహియా గురించి అనర్గళంగా ఎంతసేపైనా మాట్లాడగలరు. ►1999 నవంబర్ 24న డింపుల్ను తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ►2000 సంవత్సరంలో తొలిసారిగా రాజకీయాల్లో అడుగుపెట్టి తండ్రి ములాయం ఖాళీ చేసిన కన్నౌజ్ నుంచి ఉప ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికయ్యారు. అప్పుడు ఆయన వయసు కేవలం 27 ఏళ్లు. ►2004, 2009 ఎన్నికల్లో కూడా కన్నౌజ్ నుంచే ఎంపీగా గెలిచారు. ►2012లో సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అంతకు ముందు పార్టీ యువజన విభాగం బాధ్యతలు కూడా కొన్నాళ్లు నిర్వహించారు. ►2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేసి పార్టీని విజయతీరాలకు చేర్చారు. ►కేవలం 38 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టి యూపీలో అతి పిన్న వయస్కుడైన సీఎంగా రికార్డు సృష్టించారు. ►2012–2017 మధ్య ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమంపై ఎక్కువగా దృష్టి పెట్టి యూపీ ముఖచిత్రాన్ని మార్చి.. పరిపాలనాదక్షుడిగా పేరు సంపాదించారు. ►2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుటుంబంలో చోటు చేసుకున్న అంతర్గత కలహాలను సమర్థంగా ఎదుర్కొన్నారు. కన్నతండ్రిని కూడా ఖాతరు చేయలేదు. తండ్రి ములాయం, చిన్నాన్న శివపాల్సింగ్ యాదవ్లను కాదని తానే పార్టీకి జాతీయ అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. ►రెండోసారి సీఎం కావడం కోసం 2017 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 10 వేల కిలోమీటర్లు మేర తిరిగారు. 800 ర్యాలీలు నిర్వహించారు. కానీ ప్రధాని మోదీ చరిష్మా ముందు నిలువలేకపోయారు. ►2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తోనూ, 2019 లోక్సభ ఎన్నికల్లో మాయావతికి చెందిన బీఎస్పీతోనూ పొత్తు పెట్టుకొని నష్టపోయారు ►ములాయం మాటల్ని పెడచెవిన పెట్టి మరీ మోదీని ఓడించాలన్న కసితో 2019 లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో కేవలం అయిదు స్థానాలు మాత్రమే దక్కాయి. ►2019 లోక్సభ ఎన్నికల్లో ఆజమ్గఢ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ►గత చేదు అనుభవాలతో ఈ సారి అఖిలేశ్ ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరి పోరాటానికే సిద్ధమయ్యారు. ఇన్నాళ్లూ యాదవేతర ఓబీసీ ఓట్లను పట్టించుకోని అఖిలేశ్ ఇప్పుడు వ్యూహాత్మకంగా వాటినే నమ్ముకున్నారు. ►స్వామి ప్రసాద్ మౌర్య సహా బీజేపీలో కీలక ఓబీసీ నేతలకు గాలం వేసి ఆ వర్గంలో పట్టుని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఆ పార్టీ తరపున యూపీ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ..
కోల్కతా: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరఫున పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రచారం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ పోటీ చేయదని, కేవలం ఎస్పీకి మద్దతుగా ప్రచారం చేస్తామని టీఎంసీ నేత కిరణ్మయ్ నందా మంగళవారం చెప్పారు. బీజేపీపై యుద్ధానికి సమాజ్వాదీకి మద్దతిస్తామన్నారు. ఇందులో భాగంగా లక్నో, వారణాసిల్లో అఖిలేశ్తో కలిసి మమత ఆన్లైన్ ప్రచారం చేస్తారని చెప్పారు. బీజేపీకి వ్యతిరేక శక్తుల్లో మమత కీలకమని చెప్పారు. ఆమె ఎంత బలమైన నేత అని అందరికీ తెలుసని, 2021 బెంగాల్ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించి గుణపాఠం చెప్పారన్నారు. మరోవైపు బెంగాల్లో టీఎంసీ విజయం తరవాత జరిగిన హింసపై సమాజ్వాదీ అభిప్రాయం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. చదవండి: (వంద సీట్లిచ్చినా ఎస్పీతో పొత్తు పెట్టుకోం: ఆజాద్) -
వంద సీట్లిచ్చినా ఎస్పీతో పొత్తు పెట్టుకోం: ఆజాద్
నోయిడా: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లిస్తామని చెప్పినా... సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ) అధినేత చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో పొత్తుకు సిద్ధమేనన్న ఆజాద్, బీజేపీని ఓడించడానికి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా అఖిలేష్ యాదవ్ను కలిసింది నిజమేనని, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వంద సీట్లిచ్చినా ఎస్పీతో పొత్తు కుదుర్చుకోబోమన్నారు. అది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. తమకు మద్దతిస్తామని చెబుతూనే ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఏఎస్పీకి కేవలం రెండు సీట్లు ఆఫర్ చేశారని, ఆయన ఎగతాళి చేస్తున్నాడో, మద్దతు ఇస్తున్నాడో న్యాయ విద్యార్థి అయిన తనకు అర్థమవుతోందని అన్నారు. చదవండి: (కాక రేపుతున్న యూపీ ఎన్నికలు.. బీజేపీ ఎమ్మెల్యేకు అఖిలేష్ బంపర్ ఆఫర్) -
బీజేపీ రివర్స్ పంచ్! ఎస్పీ చీఫ్ సోదరుడి భార్య అపర్ణకు బీజేపీ గాలం?
ముగ్గురు ఓబీసీ మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేల (ఇందులో ఇద్దరు బీజేపీ మిత్రపక్షం ‘అప్నాదళ్–ఎస్’కు చెందిన వారు)ను చేర్చుకొని ఊపుమీదున్న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్కు దిమ్మతిరిగే షాకిచ్చేలా బీజేపీ పావులు కదుపుతోంది. అఖిలేశ్ సవతి సోదరుడైన ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్కు కండువా కప్పేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అపర్ణ కొంతకాలంగా మోదీ ప్రభుత్వ విధానాలకు బాహటంగా మద్దతు పలుకుతున్నారు. ఆమెతో బీజేపీ టచ్లో ఉంది. ఇరుపక్షాల మధ్య అపర్ణ పార్టీ ఫిరాయింపుపై చర్చలు జరుగుతున్నాయని... ఇప్పుడవి ఒక కొలిక్కి వచ్చాయని తెలుస్తోంది. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి ఎస్పీ టికెట్పై పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి, సీనియర్ నాయకురాలు రీటా బహుగుణ చేతిలో 33,796 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఫిబ్రవరి– మార్చిల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ లక్నో కంటోన్మెంట్ సీటునే అడుగుతున్నట్లు వినికిడి. అయితే సీనియర్ రీటా బహుగుణను కదపడం ఇష్టం లేని బీజేపీ ములాయం సింగ్ కోడలిని మరో చోటు నుంచి పోటీ చేయించాలని చూస్తోంది. కుంభస్థలాన్ని కొట్టాలని... బీజేపీ నుంచి ఎస్పీకి ఇటీవలి వలసలతో కమలదళం లోలోపల రగిలిపోతోంది. పెద్ద ఎత్తున ప్రతిదాడి చేయకపోతే బీజేపీ చేష్టలుగిడి చూస్తోందనే అభిప్రాయం బలపడుతుంది. అందుకే అపర్ణా యాదవ్కు గాలం వేసింది. తమ్ముడి భార్యను ఆపలేకపోతే... అఖిలేశ్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో తనతో విబేధించి వేరుకుంపటి పెట్టుకున్న బాబాయ్ శివపాల్ యాదవ్ (ప్రగతిశీల్ సమాజ్వాదీ పార్టీ– లోహియా)తో అఖిలేశ్ ఇటీవలే సయోధ్య కుదుర్చుకున్నారు. ప్రతి ఒక్క ఓటు ముఖ్యమే అన్నట్లుగా బీజేపీ వ్యతిరేకంగా చిన్న పార్టీలన్నింటినీ కలుపుకుపోతున్నారు. ఇప్పుడు బీజేపీ అపర్ణను లాగేస్తే... మళ్లీ ఇంటిపోరు మొదలైనట్లే. ‘మా జోలికొస్తే ఊరుకుంటామా? మీ ఇంటికొస్తాం.. నట్టింటికొస్తాం’ అన్నట్లుగా బీజేపీ ప్రతిదాడికి దిగింది. ములాయంసింగ్ ఇంట్లో చిచ్చు పెట్టడం ద్వారా ఎస్పీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టవచ్చేనేది కమలనాథుల వ్యూహం. ములాయంసింగ్ రెండో భార్య సాధనా గుప్తాకు మొదటి వివాహం ద్వారా జన్మించిన కుమారుడే ప్రతీక్ యాదవ్. – నేషనల్ డెస్క్, సాక్షి -
అఖిలేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. 'వారిని పార్టీలోకి చేర్చుకునేది లేదు'
లక్నో: బీజేపీ పాలనలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ విలువలు ప్రమాదంలో పడ్డాయని, దళితులు, వెనుకబడ్డ వర్గాల రిజర్వేషన్లు ప్రశ్నార్థకమయ్యాయని సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను బీజేపీ ఏ విధంగా ప్రైవేటుపరం చేస్తోందన్న విషయం దళితులు, వెనుకబడిన వర్గాలకు అర్థమైందన్నారు. యూపీ రాష్ట్రాభివృద్ధి సమాజ్వాదీ పార్టీనే సాధ్యమని పునరుద్ఘాటించారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మంత్రి ధారా సింగ్ చౌహాన్ ఆదివారం అఖిలేష్ సమక్షంలో ఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా అఖిలేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ నుంచి సమాజ్వాదీ పార్టీ లోకి ఫిరాయింపులు పెరుగుతున్నాయి. ఇకపై బీజేపీ ఎమ్మెల్యేలను, మంత్రులను తమ పార్టీలోకి చేర్చుకునేది లేదని స్పష్టం చేశారు. బీజేపీకి రాజీనామా చేసి ఎస్పీలో మంత్రులు చేరిన నేపథ్యంలో అఖిలేశ్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: (నాలుగేళ్లుగా మంచంలో.. ఇక జీవితమే లేదనుకున్నాడు.. అంతలోనే..) పార్టీలో చేరిక సందర్భంగా దారాసింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. '2017లో బీజేపీ ప్రభుత్వం సబ్కా సాథ్, సబ్కా వికాస్ అనే నినాదాన్ని ఇచ్చింది. అందరి మద్దతును తీసుకుంది. అయితే అభివృద్ధి ఫలాలు మాత్రం కొందరికే దక్కాయి. మేము యూపీ రాజకీయాలను మార్చి అఖిలేష్ యాదవ్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తాం. ఓబీసీ, దళిత వర్గాలకు చెందిన ప్రజలు ఏకతాటిపైకి వస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు అనివార్యం' అని చౌహాన్ అన్నారు. అఖిలేశ్కు అగ్ని పరీక్షగా సీట్ల కేటాయింపు ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో తమతో కలిసొచ్చేందుకు చిన్నాచితకా పార్టీలు ముందుకు రావడం, వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు చేరుతుండటంతో సమాజ్వాదీ పార్టీకి నూతనోత్సాహాన్ని ఇచ్చినా.. వారందరికీ సీట్ల సర్దుబాటు అంశం మాత్రం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. సొంత పార్టీ నేతలకు టికెట్ల కేటాయింపుపై ఇప్పటికే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూనే. మిత్రపక్షాలతో పాటు కొత్తగా వచ్చి చేరుతున్న ఆశావహులకు టిక్కెట్ల కేటాయింపు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్కు పెద్ద సవాల్ విసురుతోంది. ఇప్పటికే తమతో పొత్తు పెట్టుకునేందుకు సిధ్దమైన ఏడు మిత్రపక్ష పార్టీలతో చర్చలు చేసిన అఖిలేశ్, అతిత్వరలోనే కుల, వర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంటూనే జాబితాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం 10 మంది ఎస్పీ అభ్యర్థులు, 19 మంది ఆర్ఎల్డీ అభ్యర్థులతో ఎస్పీ సారథ్యంలోని కూటమి తొలి జాబితా వెలువడింది. చదవండి: (తగ్గేదేలే.. గడ్డకట్టే చలిలో.. చెక్కుచెదరని విశ్వాసంతో..) -
దళితులు అవసరం లేదు!... దళిత ఓటు బ్యాంకే లక్ష్యం!
అఖిలేష్ యాదవ్కు దళితులు అక్కర్లేదు, దళితుల ఓటు బ్యాంకు మాత్రమే కావాలి అని భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు చర్చల అనంతరం మాట్లాడిన ఆజాద్.. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఎస్పీతో పొత్తు చర్చలు విఫలమైన నేపథ్యంలో అఖిలేష్ యాదవ్పై మండిపడ్డారు ఆజాద్. అంతేకాదు ఉత్తరప్రదేశ్లో జరగనున్న ఎన్నికల కోసం అఖిలేష్ యాదవ్ దళిత ఓటు బ్యాంకుపై దృష్టి సారించాడు అని విమర్శించారు. పైగా అతను బహుజన సమాజ్ ప్రజలను కించపరిచాడని ఆరోపించారు. తాను గత ఆరు నెలలుగా యాదవ్తో అనేక చర్చలు నిర్వహించిన పొత్తు కుదరలేదని చెప్పారు. రాబోయే రాష్ట్ర ఎన్నికలలో సమాజవాదీ పార్టీ(ఎస్పీ) తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలను బలోపేతం చేయడానికి అఖిలేష్ యాదవ్ అనేక చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకున్నారనేది గమనార్హం. అయితే వెనుకబడిన తరగతులు, దళితులు తమకు సామాజిక న్యాయం చేస్తాడనే నమ్మకంతో యాదవ్కు మద్దతు ఇస్తున్నారని ఆజాద్ అన్నారు. కానీ అఖిలేష్ యాదవ్కి సామాజిక న్యాయం అంటే అర్థం కావడం లేదని, అది మాటలతో జరగదంటూ ఆజాద్ విమర్శించారు. దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై యాదవ్ మౌనం వహిస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లాగా ప్రవర్తిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. అయితే ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరగనున్న సంగతి తెలసిందే. (చదవండి: కంగనా రనౌత్ చెంపల కంటే సున్నితమైన రోడ్లు నిర్మిస్తాం!: ఇర్ఫాన్ అన్సారీ) -
బీజేపీకి షాకిచ్చేలా.. మాస్టర్ స్ట్రోక్.. మైండ్గేమ్!
ఉత్తరప్రదేశ్లో ఏదో జరుగుతోంది. నిన్న మొన్నటి దాకా బీజేపీ మంచి స్థితిలో ఉన్నట్లు కనిపించింది. కానీ ఉన్నట్టుండి ఈ వలసలేమిటి? ఒకరివెంట మరొకరు పోటీలుపడి ఓబీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీని ఎందుకు వీడుతున్నారు. బీసీల ప్రయోజనాలను సమాజ్వాదీ పార్టీ మాత్రమే కాపాడగలదా? బీజేపీ మునిగిపోయే నౌకా? నాయకగణంలో, జనసామాన్యంలో ఇప్పుడీ అభిప్రాయం బలపడుతోంది. బీజేపీలో ‘ఆల్ ఈజ్ నాట్ వెల్’ అనేది బాగా ప్రబలింది. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బృందానికి సరిగ్గా ఇదే కావాలి. అంతా వారనుకున్నట్లే జరుగుతోంది. ఆడించినట్లే రక్తి కడుతోంది. వ్యూహరచనలో, క్షేత్రస్థాయిలో తమకు తిరుగులేదని భావిస్తున్న బీజేపీ పెద్దలకు అఖిలేశ్ ఇచ్చిన గట్టి ఝలక్ ఇది. ఎన్నికల నగారా మోగాక.. అసలుసిసలు ‘సినిమా’ చూపిస్తున్న వైనమిది. ఇదంతా ఈనెల 11న ప్రముఖ ఓబీసీ నేత, మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యతో మొదలైంది. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీకి గుడ్బై చెబుతున్నట్లు ప్రకటించారు. మౌర్య మద్దతుదారులైన నలుగురు ఎమ్మెల్యేలు అదే బాట పట్టారు. చిన్న అలజడి మొదలైంది. 12న మరో ఓబీసీ ముఖ్యనేత, మంత్రి దారాసింగ్ చౌహాన్ బీజేపీకి టాటా చెప్పారు. 13న మరో ఓబీసీ నేత ధరమ్సింగ్ సైనీ కాషాయదళాన్ని వీడారు. మూడురోజుల్లో ముగ్గురు మంత్రులు... ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీని విడిచి వెళ్లిపోయారు. చిన్న పాయ కాస్తా ముందుకెళ్లిన కొద్దీ నదిగా మారుతున్న దృశ్యం గోచరమవుతోంది. బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్ (సోనేలాల్)కూ సెగ తగిలింది. ఈ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎస్పీ పంచన చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల వేళ కప్పదాట్లు సహజమే అయినా... నలుగురైదుగురు పోతే ఫర్వాలేదు. అలాకాకుండా కీలక ఓబీసీ నేతలు పక్కా ప్రణాళిక ప్రకారం బీజేపీని టార్గెట్ చేస్తూ... కాషాయదళంలో ఓబీసీలను, దళితులను చిన్నచూపు చూస్తున్నారనే సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ‘బౌన్సర్లు’ వేస్తున్నారు. ఆల్రౌండర్ ఆదిత్యనాథ్ యోగి (రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల యూపీ సీఎంను క్రికెట్ పరిభాషలో ఆల్రౌండర్గా అభివర్ణించారు), జట్టు కెప్టెన్ జేపీ నడ్డా (బీజేపీ అధ్యక్షుడు), కోచ్... అమిత్ షా (ప్రధాన వ్యూహకర్త)లకూ అఖిలేశ్ టీమ్ షాక్ల మీద షాక్లు ఇస్తూనే ఉంది. పసిగట్టలేకపోయారా? ఫర్వాలేదనుకున్నారా? ఎన్నికల వేళ ఏ పార్టీ అయినా, ప్రభుత్వమైనా అప్రమత్తంగా ఉంటుంది. అసంతృప్తులు, అనుమానం ఉన్నవారి కదలికలపై నిఘా ఉంటుంది. వారేం చేస్తున్నారు... ఎవరిని కలుస్తున్నారనే దానిపై ఓ కన్నేసి ఉంచుతాయి. అలాంటిది కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉండి, ఐబీ, రాష్ట్ర నిఘా విభాగాలు రాబోయే ఈ వలసల ఉద్యమాన్ని ఎందుకు పసిగట్టలేకపోయాయి. ఒకవేళ కొంత సమాచారం ఉన్నా ఆ పోతే ఒకరిద్దరు పోతారు, దాంతో మనకొచ్చే నష్టమేముందని బీజేపీ అగ్రనేతలు తేలిగ్గా తీసుకున్నారా? ఈ స్థాయి ప్రణాళికాబద్ధమైన దాడిని ఊహించలేకపోయారా?. ఇప్పుడు నష్టనివారణకు దిగి ఎస్పీ, కాంగ్రెస్ల నుంచి ఇద్దరిని చేర్చుకున్నా జరిగిన డ్యామేజీని ఇలాంటివి పూడుస్తాయా? కసికొద్దీ ఇంకా కొంతమందిని లాగినా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. చెప్పి... మరీ! ఈనెల 11న మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామా చేయగానే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్పవార్ మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు, ఇంకొందరు నేతలు ఎస్పీలోకి వస్తారని ప్రకటించారు. జనవరి 20వ తేదీదాకా బీజేపీలో రోజుకు ఒకటి రెండు వికెట్లు పడుతూనే ఉంటాయని, 20న నాటికి బీజేపీని వీడిన మంత్రులు, ఎమ్మెలేల సంఖ్య 18కి చేరుతుందని ఎస్పీ మిత్రపక్షమైన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓంప్రకాశ్ రాజ్బర్ బుధవారం ప్రకటించారు. 20 దాకా రాజీనామాల పరంపర కొనసాగుతుందని, రోజుకొక మంత్రి, ఎమ్మెల్యే కాషాయపార్టీకి గుడ్బై చెబుతారని రాజీనామా చేస్తూ మంత్రి ధరమ్సింగ్ గురువారం చెప్పారు. భవిష్యత్తు చేరికలపై ఎస్పీ మాట్లాడకుండా... బయటి వారు మాట్లాడుతుండటం... ఇదంతా ఒక విస్తృత అవగాహనతో జరుగు తోందనేది దానికి అద్దం పడుతోంది. నిజానికి పార్టీ మారేటపుడు ఎవరూ అంత ఆషామాషీగా అడుగు వేయరు. భవిష్యత్తుకు సంబంధించిన స్పష్టమైన భరోసా, తాము కోరిన నియోజకవర్గాల్లో తమ వారికి టికెట్లు ఖరారు చేసుకున్నాకే... బయటపడతారు. రాజీనామా చేస్తారు. అంటే అఖిలేశ్ వీరిందరితో ఎంతోకాలంగా టచ్లో ఉన్నట్లే లెక్క. పైగా ఎవరెవరు వస్తే ప్రయోజనం, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వగలం... అనేది బాగా కసరత్తు చేశారు ఎస్పీ చీఫ్. అధికార, బీజేపీ వేగులకు ఉప్పందకుండా ఎంతో జాగ్రత్తగా ఈ డీల్ను పూర్తి చేయడం అఖిలేశ్ వయసుతో పాటే రాజకీయ వ్యూహాల్లో ఆరితేరారనే విషయాన్ని చాటిచెబుతోంది. ఇది ఒక ఎత్తైతే... తమ ప్రణాళికను అమలులో పెట్టిన తీరు బీజేపీ చాణక్యులనే నివ్వెరపరుస్తుండొచ్చు. అఖిలేశ్ను కలవడం... ఫొటోలు దిగడం, బయటకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు తాము బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిపోతోంది. వీరి రాజీనామా ప్రకటన వెలువడిందో లేదో నిమిషాల్లో అఖిలేశ్ ట్విట్టర్ హ్యాండిల్ వారు ఎస్పీ చీఫ్తో దిగిన ఫొటోలు ప్రత్యక్షమవుతున్నాయి. అంతా కట్టగట్టుకొని ఏ 20 మందో ఒకేసారి బీజేపీని వీడితే... అది ఒక్కరోజుకే టీవీ చానళ్లకు, పత్రికలకు వార్త అవుతుంది. మరుసటి రోజు ఫోకస్ వేరే అంశాలపైకి మళ్లుతుంది. అలాకాకుండా విడతల వారీగా వలసలు చోటుచేసుకుంటే రోజూ మీడియాలో సమాజ్వాదీ కవరేజీయే. పత్రికల్లో, టీవీల్లో రోజూ ఎస్పీలో చేరికలపై వార్తలు ఉంటే... ప్రజల్లోకి ఒకరకమైన సానుకూల సందేశం వెళుతుంది. బీజేపీ అధికార, అంగ, అర్థబలాన్ని ఎదుర్కొనగలమా అని లోలోపల సంశయంలో ఉన్న ఎస్పీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోతాయి. వారు ద్విగుణీకృత ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తారు. ప్రజల్లోనూ ఎస్సీకే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయనే భావన వస్తే... తటస్థ ఓటర్లు కూడా కొంతమేరకు సైకిల్ వైపు మొగ్గే అవకాశాలుంటాయి. అన్నింటికంటే ముఖ్యమైన అంశం... తమకు ఎదురులేదనే భావనలో ఉన్న బీజేపీని ఈ అనూహ్య పరిణామాలు ఆత్మరక్షణలోకి నెట్టేస్తాయి. ఊగిసలాటలో ఉన్న నాయకులు ఎస్సీవైపు చూసేలా ఈ పరిణామాలు ప్రోత్సహిస్తాయి. ఎవరుంటారో... ఎవరు పోతారో తెలియని పరిస్థితుల్లో బీజేపీ సొంత నాయకులనే అనుమాన చూపులు చూసే పరిస్థితి. ఒక్కసారి గనక బీజేపీ అవకాశాలు సన్నగిల్లుతున్నాయనే అభిప్రాయం బలపడితే... మునిగే నౌకలో ఉండటానికి ఎవరూ ఇష్టపడరు. కమలదళానికి సరైన ప్రత్యామ్నాయంగా ఉన్న ఎస్పీలోకి నాయకులు క్యూ కడతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే అఖిలేశ్ విడతల వారీగా బీజేపీని దెబ్బకొట్టే వ్యూహాన్ని ఎంచుకున్నారు. చక్కటి మైండ్గేమ్ ఆడుతున్నారు. పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ తదుపరి ఎలాంటి పావులు కదుపుతుందో చూడాలి. – నేషనల్ డెస్క్, సాక్షి