-
న్యూజిలాండ్ వీసా రూల్స్లో మార్పులు
న్యూజిలాండ్ వీసా రూల్స్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తమ దేశంలో కొన్ని పాత్రల్లో పనిచేస్తున్న విదేశీయులు తమ ద్వారా తమవారికి వర్క్, విజిటర్, స్టూడెంట్ వీసాలకు స్పాన్సర్ చేయడానికి అనుమతించని కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలను న్యూజిలాండ్ ప్రకటించింది.వీసా స్పాన్సర్లు న్యూజిలాండ్ ఆర్థిక, ఇమ్మిగ్రేషన్ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రమాణాలను చేరుకునేలా వీసా ప్రక్రియలను క్రమబద్ధీకరించడమే ఈ నిబంధనల లక్ష్యం. వీటి ప్రకారం జూన్ 26 నుంచి ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ (ANZSCO) లెవల్స్ 4, 5 లో రెసిడెన్సీ పాత్వేస్ (వివిధ రంగాల్లో నైపుణ్యాలు) లేకుండా అక్రిడేటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా ఉన్నవారు ఇకపై తమ భాగస్వాములు, పిల్లల కోసం వర్క్, విజిట్, స్టూడెంట్ వీసా దరఖాస్తులకు మద్దతు ఇవ్వలేరు.ఈ సంవత్సరం ప్రారంభంలో ఏఈడబ్ల్యూవీ పథకానికి చేసిన విస్తృత సవరణలకు అనుగుణంగా ఈ సర్దుబాటు ఉంటుంది. అయితే భాగస్వాములు, పిల్లలు సంబంధిత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఎక్రిడేటర్ ఎంప్లాయర్ వర్క్ వీసా లేదా అంతర్జాతీయ స్టూడెంట్ వీసా వంటి వాటి కోసం సొంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే భాగస్వాములుగా లేదా డిపెండెంట్ పిల్లలుగా వీసాలను కలిగి ఉన్నవారిపై ఈ మార్పుతో ప్రభావం ఉండదని న్యూజిలాండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా.. మారిన రూల్స్ తెలుసా?
ఐటీఆర్ రిటర్న్స్ ఫైలింగ్కు ఇంక కొన్ని రోజులే ఉంది. 2024 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఏటా ఐటీఆర్ దాఖలు చేస్తున్నవారైనా, ఈసారి కొత్తగా ఫైలింగ్ చేస్తున్నవారైనా పన్నుకు సంబంధించిన మార్పుల గురించి తప్పక తెలుసుకోవాలి.గత కొన్నేళ్లలో సీబీడీటీ అనేక పన్ను సంబంధిత నిబంధనలను మార్చింది. ఐటీఆర్ ఫైలింగ్కు సంబంధించి మారిన నిబంధనల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ విషయాల పట్ల జాగ్రత్త వహించకపోతే ట్యాక్స్ రీఫండ్ ఆగిపోయే అవకాశం ఉంది.కొత్త పన్ను విధానం2024 సంవత్సరంలో కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. దీని కింద రూ .7 లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్నూ ఉండదు. అయితే మీరు కొత్త, పాత పన్ను విధానం ఏదోఒక దాని కింద ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. కొత్త పన్ను విధానం డిఫాల్ట్ గా ఉంటుంది. పాత పన్ను విధానం ఐచ్ఛికం. ఎలాంటి మినహాయింపు, డిడక్షన్ లేకుండా క్లెయిమ్ సమర్పిస్తే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలి. ఒక వేళ పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే దాని కింద వివిధ పన్ను మినహాయింపులు, డిడక్షన్లను క్లెయిమ్ చేయవచ్చు.స్టాండర్డ్ డిడక్షన్వేతన జీవులకు రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ను ఇటీవల ప్రవేశపెట్టారు. ఈ స్టాండర్డ్ డిడక్షన్ పెన్షనర్లకు మాత్రమే. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకునేందకు స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50,000 తగ్గింపును క్లెయిమ్ చేయవచ్చు. దీంతో పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.సెక్షన్ 80సీసెక్షన్ 80సీ పరిమితిని రూ.1.5 లక్షలకు పెంచారు. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, ఎల్ఐసీ, ఎన్ఎస్సీ, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఇన్వెస్ట్ చేస్తే 80సీ కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందొచ్చు. ఇది కాకుండా, 80డీ కింద మీరు మీ కుటుంబం, సీనియర్ సిటిజన్లైన తల్లిదండ్రుల కోసం తీసుకున్న ఆరోగ్య బీమాపై పన్ను మినహాయింపు పొందవచ్చు. రెండింటి గరిష్ట ప్రీమియం రూ.75,000. 80సీలో హోమ్ లోన్, పిల్లల ఎడ్యుకేషన్ ఫీజుల అసలు మొత్తాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.హోమ్ లోన్మీరు ఇల్లు కొనుగోలు చేసి, దాని కోసం హోమ్ లోన్ తీసుకున్నట్లయితే 80ఈఈఏ కింద దాని వడ్డీపై మినహాయింపు పొందుతారు. గృహ రుణ వడ్డీపై రూ .2 లక్షల వరకు అదనపు తగ్గింపును ప్రోత్సహించడమే దీని లక్ష్యం. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, అఫోర్డబుల్ హౌసింగ్ను ప్రోత్సహించడం ఈ మినహాయింపు ఉద్దేశం.అదనపు వివరాలుఐటీఆర్ ఫారాన్ని సవరించి అదనపు వివరాలను పొందుపరిచారు. ముఖ్యంగా విదేశీ ఆస్తులు, ఆదాయం, భారీ లావాదేవీలు వెల్లడించేలా నిబంధనలు మార్చారు. విదేశీ పెట్టుబడులు లేదా గణనీయమైన ఆర్థిక కార్యకలాపాలు ఉన్న పన్ను చెల్లింపుదారులు జరిమానాను నివారించడానికి వివరణాత్మక సమాచారాన్ని అందించాలి. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు పెన్షన్, వడ్డీ ద్వారా మాత్రమే ఆదాయం ఉంటుంది. ఐటీఆర్ దాఖలు చేయాల్సిన బాధ్యత నుంచి వారికి మినహాయింపు ఉంది. అయితే దీని కోసం పెన్షన్, వడ్డీ డబ్బుల నుంచి బ్యాంకులు టీడీఎస్ను మినహాయించడం మాత్రం తప్పనిసరి. -
రుణమాఫీకి ‘పీఎం కిసాన్’ రూల్స్!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సచివా లయంలో రాష్ట్రమంత్రివర్గం సమావేశమై వ్యవసాయ రుణమాఫీకి సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలపై చర్చించి ఖరారు చేయనుంది. రుణమాఫీకి అర్హులను గుర్తించడానికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం విధివిధానాలనే వర్తింపజేయాలా? లేక ఇతర పద్ధతులను అనుసరించాలా? అనే అంశంపై రాష్ట్రమంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రప్రభుత్వం దేశంలో అర్హులైన రైతులందరికీ ఏటా రూ.6 వేలు ఆర్థికసాయం అందిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, మేయర్లు, జెడ్పీ ఛైర్మన్లు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఐటీ పన్ను చెల్లించేవారిని ఈ పథకం నుంచి మినహాయించింది. ఉన్నత ఆదా యం పొందే సంతానం ఉన్నా ఈ పథకం కింద అనర్హులే. రాష్ట్రంలో రుణమాఫీ అమలుకు సైతం ఇలాంటి మార్గదర్శకాలనే అమలు చేయాలనే భావనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ సహాయం పొందడానికి అర్హులైన రైతులెవరూ నష్టపోకుండా మార్గదర్శకాలను మంత్రివర్గం ఖరారు చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 15 లోగా రుణమాఫీ అమలు చేస్తామని ఇప్పటికే సీఎం హామీ ఇచ్చారు. రుణమాఫీకి అర్హులైన రైతులు ఎవరు ? ప్రభుత్వ సహాయం అవసరమున్న రైతులను ఏ ప్రాతిపదికన గుర్తించి రుణమాఫీ వర్తింపజేయాలి ? ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీకి అమలు చేసిన మార్గదర్శకాలు ఏమిటి? వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. రుణమాఫీకి కటాఫ్ తేదీతోపాటు ఈ పథకం అమలుకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా రుణమాఫీపైనే చర్చ జరుగుతుందని, ఎజెండాలో ఇతర అంశాలు లేవని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. -
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? తప్పకుండా ఇవి తెలుసుకోండి
పర్సనల్ లోన్ అనేది ప్రస్తుతం సర్వసాధారణం అయిపోయింది. ఉద్యోగం చేస్తున్నవారు, బిజినెస్ చేసేవారు ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో లోన్ తీసుకోవడానికి సిద్దమైపోతారు. ఇంతకీ పర్సనల్ లోన్ తీసుకునే ముందు తెలుసుకోవలసిన విషయాలు ఏంటి? ఏ సమయంలో పర్సనల్ లోన్ తీసుకోవాలి అనే విషయాలను వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..వడ్డీ రేటుపర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వ్యక్తి బ్యాంకులు ఎంత వడ్డీకి లోన్ ఇస్తుంది అనే విషయాన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే వెహికల్ లోన్స్, హోమ్ లోన్స్ వంటి వాటితో పోలిస్తే.. పర్సనల్ లోన్ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా తీసుకొనే మొత్తాన్ని (డబ్బు) బట్టి, వ్యవధి, క్రెడిట్ స్కోరును బట్టి కూడా ఈ వడ్డీని నిర్ణయిస్తారు. పర్సనల్ లోన్ మీద వడ్డీ రేటు 12 నుంచి 21 శాతం వరకు ఉంటుంది. కాబట్టి లోన్ తీసుకునే వ్యక్తి తప్పకుండా ఈ విషయంలో జాగ్రత్తపడాలి. అంతే కాకుండా.. మీకు వచ్చే వార్షిక ఆదాయానికి మించి లోన్ తీసుకుంటే.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఎవరికి లోన్ ఇస్తారులోన్ అనేది ఉద్యోగం చేసేవారికైనా.. సొంతంగా బిజినెస్ చేసేవారికైనా ఇస్తారు. అయితే ఉద్యోగికి బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే.. వారు మూడు నెలల పేస్లిప్ ఇవ్వాల్సి ఉంటుంది. సొంతంగా బిజినెస్ చేసేవారికి డెబిట్ / క్రెడిట్ కార్డు హిస్టరీని చూసి లోన్ మంజూరు చేయడం జరుగుతుంది. కొన్ని బ్యాంకులు ఫేమస్ కంపెనీలలో ఉద్యోగం చేసేవారికి మాత్రమే లోన్ ఇస్తాయి.ఆదాయాన్ని మించకుండా..పర్సనల్ లోన్ తీసుకునే వ్యక్తి తన నెలవారీ జీతం కంటే ఎక్కువ లోన్ తీసుకోకూడదు. ఎందుకంటే వచ్చే డబ్బుతోనే నిత్యావసరాలు, ఈఎంఐ వంటి వాటితో పాటు పిల్లల చదువులు ఇతరత్రా ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ పూర్తిగా బేరీజు చేసుకున్న తరువాత ఎంత లోన్ తీసుకుంటే.. ఎంత ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. నెల జీతంలో ఈఎంఐ పోగా ఎంత మిగులుతుంది అనేది చూసుకోవాలి. ముఖ్యంగా పర్సనల్ లోన్ అనేది 12 నెలలు (ఒక సంవత్సరం) మించగకుండా ఉండేలా చూసుకోవడం ఉత్తమం.లోన్ ఎప్పుడు తీసుకోవాలి?లోన్ తీసుకోవడం అనేది కొంతవరకు కరెక్ట్ కాదు. అయితే అత్యవసర పరిస్థితుల్లో, వేరే మార్గం లేని సమయంలో తీసుకోవాలి. ఆరోగ్యం మందగించినప్పుడు లేదా అనుకోని దుర్ఘటనలు జరిగినప్పుడు తీసుకోవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. సరదాల కోసం, గ్యాడ్జెట్స్ కొనుగోలు కోసం, విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి లోన్ తీసుకోకూడదు. తప్పకుండా ఇవన్నీ గుర్తుంచుకోవాలి. -
రాజకీయ పార్టీని ఎలా పెట్టాలి? నియమ నిబంధనలేమిటి?
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు 18వ లోక్సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యాయి. అయితే రాజకీయ పార్టీ ఎలాపెట్టాలి? పేరు ఎలా నిర్ణయించాలి? పార్టీకి చిహ్నం ఎలా వస్తుంది? ఇందుకు ఎన్నికల సంఘం ఎటువంటి నిబంధనలు రూపొందించింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ఎవరైనా రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత, దానిని ఎన్నికల కమిషన్లో నమోదు చేయడం తప్పనిసరి. రాజకీయ పార్టీల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో పేర్కొన్నారు. దీనిప్రకారం రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి, ఎన్నికల సంఘం జారీ చేసిన దరఖాస్తు ఫారాన్ని పూరించాలి. దీనిని ఆన్లైన్లో నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాని ప్రింటౌట్ను తీసుకుని, ఇతర ముఖ్యమైన పత్రాలు జతచేసి, 30 రోజుల్లోగా ఎన్నికల కమిషన్కు పంపాలి. రిజిస్ట్రేషన్ కోసం రూ.10వేలు ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. పార్టీని ఏర్పాటు చేసినవారు ఎన్నికల కమిషన్ దరఖాస్తు ఫారంలో ఆ రాజకీయ పార్టీ పేరు ఏమిటి? దాని పని విధానం ఏమిటి? పార్టీ అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు? అనే వివరాలతో పాటు పార్టీలో కీలకమైన పదవుల్లో ఉన్నవారి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. పార్టీ సమర్పించే దరఖాస్తు ఫారంపై పార్టీలోని సభ్యులందరి సంతకాలు తప్పనిసరిగా ఉండాలి. పార్టీకి సంబంధించిన బ్యాంకు ఖాతా వివరాలను కూడా తెలియజేయాల్సి ఉంటుంది. పార్టీ పేరును ఆ పార్టీ వ్యవస్థాపకులే నిర్ణయిస్తారు. అయితే ఆ పేరు చెల్లుబాటును ఎన్నికల సంఘం నిర్ణయిస్తుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే అటువంటి పేరు నమోదు అయ్యిందో లేదో తనిఖీ చేస్తుంది. ఇప్పటికే పార్టీపేరు నమోదై ఉంటే ఆ పేరుతో మళ్లీ పార్టీ రిజిస్టర్ కాదు. ఇలా జరిగినప్పుడు పార్టీ పేరును మార్చుకోవలసి ఉంటుంది. ఏదైనా రాజకీయ పార్టీని స్థాపించడానికి, దానిలో కనీసం 500 మంది సభ్యులు ఉండాలి. అంతే కాదు ఆ సభ్యులు ఏ ఇతర పార్టీతోనూ సంబంధం కలిగివుండకూడదు. దీనికి సంబంధించిన అఫిడవిట్ను కూడా సమర్పించాలి. పార్టీ రిజిస్ట్రేషన్కు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత, ఎన్నికల సంఘం సదరు పార్టీకి గుర్తును ఇస్తుంది. అయితే దీనికి కొన్ని ప్రత్యేక నియమాలు కూడా ఉన్నాయి. ఎన్నికల చిహ్నాలను జారీ చేసే విషయానికి వస్తే ముందుగా కమిషన్ పార్టీకి ఒక గుర్తును జారీ చేస్తుంది. అయితే ఏ పార్టీ అయినా నిర్దిష్ట ఎన్నికల గుర్తును జారీ చేయాలని కూడా కోరవచ్చు. ఆ తర్వాత ఎన్నికల సంఘం దానిని పరిశీలిస్తుంది. ఒకవేళ ఆ ఎన్నికల గుర్తు ఏ పార్టీకీ కేటాయించకపోతే అప్పుడు దానిని జారీ చేస్తుంది. -
ఉల్లం'ఘను'లు .. యథేచ్ఛగా టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘన
ప్రొద్దుటూరు/ చిత్తూరు అర్బన్/ కొమ్మాది(విశాఖ)/ పాలకొల్లు (సెంట్రల్)/భాకరాపేట(తిరుపతి జిల్లా)/హిందూపురం అర్బన్: ఈసీ ఆదేశాలను టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కోడ్కు విరుద్ధంగా అనుమతులు లేకుండానే సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. దేవాలయాలను సైతం ప్రచారానికి వినియోగిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఓటర్లకు చీరలు, ఇతర సామగ్రి పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. ప్రొద్దుటూరులో.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి స్థానిక టీడీపీ నేతలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్తపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని టీచర్స్ కాలనీలో మంగళవారం సాయంత్రం టీచర్స్ కాలనీలో సమావేశానికి టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డి హాజరై ప్రసంగించారు. బుధవారం ఉదయం గోపవరం గ్రామంలో 22వ వార్డు కౌన్సిలర్ మహ్మద్గౌస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వరదరాజులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్యతోపాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో వరదరాజులురెడ్డి ప్రసంగించారు. విషయం తెలుసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి హైమావతి సంఘటన స్థలానికి వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పినా పట్టించుకోలేదు. దీనిపై ఎన్నికల కోడ్కు సంబంధం లేదంటూ అధికారితో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఆమె ఫిర్యాదుతో వన్టౌన్ పోలీసులు వరదరాజులరెడ్డితోపాటు మహ్మద్ గౌస్పై కేసు నమోదు చేశారు. అయినప్పటికీ వరదరాజులురెడ్డి బుధవారం సాయంత్రం గోపవరం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన సమావేశానికి సైతం హాజరవడం గమనార్హం. రెండు రోజుల్లో నాలుగు సమావేశాలు ఏర్పాటు చేయగా ఇప్పటి వరకు వరదపై ఒక్క కేసు మాత్రమే నమోదైంది. వైద్యం పేరుతో వల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన నాయకులు వైద్యం పేరుతో ఓటర్లకు వల వేస్తున్నారు. విశాఖ నగరం 8వ వార్డు గొల్లల ఎండాడలో బసవతారకం, గీతం ఆస్పత్రులు సంయుక్తంగా బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని టీడీపీ, జనసేన నాయకులు ప్రారంభించారు. ఇది వైద్య శిబిరంలా కాకుండా పార్టీ ప్రచార కార్యక్రమంలా సాగింది. ఇటీవల 39వ వార్డు లక్ష్మీటాకీస్ ప్రాంతంలో బసవతారకం ఆస్పత్రి, గీతం ఆస్పత్రి సంయుక్తంగా వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. టీడీపీ విశాఖ పార్లమెంట్ ఇన్చార్జి భరత్, జనసేన నాయకుడు వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరై.. ఓటర్లను ప్రభావితంచేసేలా కార్యక్రమం చేపట్టారు. పార్టీ గుర్తుతో పూజలు ఎన్నికల నియమావళి ప్రకారం ఆలయాల్లో రాజకీయ ప్రచారాలు చేయకూడదు. చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు సైకిల్ గుర్తును చొక్కాకు పెట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రి పక్కనున్న ఈశ్వరుని ఆలయంలో పూజలు చేశారు. అదేరీతిలో బుధవారం రాత్రి చిత్తూరు కట్టమంచి వద్ద ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలోనూ టీడీపీ కండువా ధరించి పూజలు నిర్వహించారు. తొలగించని టీడీపీ పోస్టర్లు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఇంకా తెలుగుదేశం పార్టీకి చెందిన వాల్ పోస్టర్లు, ట్రీ గార్డులపై పేర్లు తొలగించలేదు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా టీడీపీ వాల్పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. అధికార పక్షానికి చెందిన పోస్టర్లు, బ్యానర్లు తొలగించిన అధికారులు టీడీపీకి చెందిన వాల్పోస్టర్ల జోలికి వెళ్లకపోవడం విశేషం. టీడీపీ ప్రచారంలో కానిస్టేబుల్, ఏఎన్ఎం టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దిశ కానిస్టేబుల్ సాకిరి రాజశేఖర్పై భాకరాపేట పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. మంగళవారం అన్నమయ్య జిల్లా రాయచోటికి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వెళుతుండగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటలో టీడీపీ శ్రేణులు మార్గమధ్యలో స్వాగతం పలికారు. దిశ కానిస్టేబుల్ టీడీపీ నాయకులతో కలసి పూలమాలలు వేయడం, భాకరాపేటలో పార్టీ కరపత్రాలు పంచుతూ టీడీపీకి ఓటు వేయమని అభ్యర్థించడం, వాటర్ బాటిళ్లపై సైతం టీడీపీ నాయకుల ఫొటోలు వేయించుకోవడం చర్చనీయాంశమైంది. బుధవారం రాత్రి ఆ కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పడాల్ ఉత్తర్వులిచ్చారు. అలాగే టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చిత్తూరు జిల్లా చౌడేపల్లి సచివాలయ గ్రేడ్ 3 ఏఎన్ఎం లతను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. హిందూపురంలో ప్రలోభాలు శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ ప్రలోభాలకు తెరలేపింది. యథేచ్ఛగా చీరల పంపిణీ చేపడుతోంది. బుధవారం రాత్రి హిందూపురం పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో టీడీపీ వర్గీయులు ఓటర్ల జాబితా చేతబట్టుకుని ఇంటింటికీ చీరలు పంపిణీ చేస్తుండగా అధికారులు కొన్ని చీరలు, ఓటర్ల జాబితాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. -
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు
సాక్షి, అమరావతి: ఎటువంటి హింస, రీపోలింగ్ వంటివి లేకుండా స్వేఛ్చాయుత వాతావరణంలో రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో మే 13న జరిగే ఎన్నికలకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. ఆయన శనివారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను వివరించారు. ఎక్కడైనా అల్లర్లు జరిగితే ఆ జిల్లా ఎస్పీ, రీపోలింగ్ జరిగితే ఆ జిల్లా కలెక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా గతంలోకంటే అధికంగా పోలింగ్, పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 46,156 పోలింగ్ స్టేషన్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఓటర్ల సంఖ్య 1600 దాటితే వాటిని రెండు పోలింగ్ స్టేషన్లుగా విభజిస్తామని, దీనివల్ల 887 కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేలా కేవలం మహిళా సిబ్బందితో 179 పోలింగ్ కేంద్రాలు, అదే విధంగా దివ్యాంగులతో 63, యువతతో 50, మోడల్ పోలింగ్ స్టేషన్లు 555 ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు 1 ప్లస్ 5 మంది ఉద్యోగులు ఉంటారన్నారు. గతంలో ఎన్నికల విధుల్లో అంగన్వాడీలు, తాత్కాలిక సిబ్బంది సేవలను కూడా వినియోగించుకున్నారని, ఈ సారి పూర్తిగా రెగ్యులర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులనే నియమిస్తున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ సిబ్బందికి ప్రధాన బాధ్యతలు కాకుండా సిరా వేయడం వంటి విధులను అప్పగిస్తామన్నారు. ఎవరు ఎక్కడ విధుల్లో పాల్గొంటారో ర్యాండమ్గా సాఫ్ట్వేర్ ద్వారా ఎంపిక చేస్తామని చెప్పారు. వలంటీర్లు, తాత్కాలిక సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉండరన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పోలింగ్ స్టేషన్కు కనీసం ఇద్దరు పోలీసు సిబ్బంది ఉంటారన్నారు. ఇందుకోసం 1,14,950 మంది సివిల్ పోలీసులు, 58 కంపెనీల రాష్ట్ర ఆర్మ్డ్ పోలీసులు, 465 కంపెనీల కేంద్ర బలగాలు అవసరమవుతాయని ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు శనివారం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, కోడ్ ఉల్లంఘిస్తే తనతో సహా ఏ స్థాయి అధికారిపైన అయినా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఫిర్యాదులు అందిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా నిరంతరం నిఘా కోసం 50 మంది జనరల్ అబ్జర్వర్లు, 115 మంది వ్యయ పరిశీలకులు, 13 మంది పోలీసు అబ్జర్వర్లు ఉంటారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 22 విభాగాలతో తనిఖీలు చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 121 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు. వీటికి అదనంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే తనిఖీల ద్వారా రూ.164.35 కోట్లు విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రధాన మంత్రి మినహా మిగతా రాజకీయ నేతలందరినీ తనిఖీ చేస్తారని, చేతి బ్యాగులు తప్ప మిగతా వాటిని సోదా చేస్తారని చెప్పారు. విమానాశ్రయాల్లో కాకుండా ప్రైవేటుగా విమానాలు, హెలికాప్టర్లలో దిగిన స్థలాల వద్దకు సంచార స్క్వాడ్స్ వెళ్లి తనిఖీలు చేస్తాయన్నారు. అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలను జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పెయిడ్ ఆర్టికల్స్, సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలపైనా నిఘా ఉంటుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎటువంటి మత ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల ఉల్లంఘనలపై 1950 నంబరుకు లేదా సీ విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులకుఇంటి వద్దే ఓటింగ్ 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి వద్ద లేదా పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటు వేయొచ్చని మీనా తెలిపారు. ఇంటి వద్దే ఓటు వేయాలనుకొంటే ముందుగా ఫారం 12 పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి ఇస్తే దాన్ని పరిశీలించి పోస్టల్ బ్యాలెట్కు అనుమతిస్తారన్నారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్కు అనుమతి లభిస్తే వారు పోలింగ్ స్టేషన్కు వచ్చి ఓటు వేయడానికి కుదరదని స్పష్టం చేశారు. ఇలా పోస్టల్ బ్యాలెట్ కోరిన వారికి ఎన్నికల తేదీకి పది రోజుల ముందే వీడియోగ్రాఫర్తో కలిపి ఐదుగురు సిబ్బంది ఇంటికి వచ్చి పోస్టల్ బ్యాలెట్కు ఏర్పాట్లు చేస్తారని చెప్పారు. పోలింగ్ బూత్లో లానే గోప్యంగా ఓటు హక్కును వినియోగించుకొని ఆ పోస్టల్ బ్యాలెట్ను రెండు కవర్లలో పెట్టి పోలింగ్ బాక్స్లో వేయాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్కు ఇంటికి వస్తున్న సమాచారాన్ని పోటీలో ఉన్న అభ్యర్థులకు ముందుగానే తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు డీజీపీ (లా – ఆర్డర్) శంకబ్రత్ బాగ్చీ, అదనపు సీఈవోలు హరేంధర ప్రసాద్, పి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 53 రోజుల్లో కొత్తగా 1.30 లక్షల మంది ఓటర్లు ఈ నెల 16 నాటికి 4.09 కోట్లు దాటిన ఓటర్లు జనవరి 22న విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాతో పోలిస్తే ఈ నెల 16 నాటికి ఓటర్ల సంఖ్య 1,30,096 పెరిగినట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జనవరిలో విడుదల చేసిన జాబితాలో ఓటర్ల సంఖ్య 4,08,07,256 మంది ఉండగా ఇప్పడు 4,09,37,352కు చేరినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూలు వచ్చినందున ఓట్ల తొలిగింపు, చిరునామా మార్పులకు అవకాశం ఉండదని, కొత్త ఓటర్ల నమోదుకు నామినేషన్ల చివరి రోజు వరకు అవకాశం ఉందని చెప్పారు. ఇవి చేయొచ్చు ♦ ఇప్పటికే అమల్లో ఉన్న పథకాల లబ్ధిదారులకు ప్రయోజనాలను కొనసాగించవచ్చు ♦ చేయూత పథకానికి ఇప్పటికే నిధులిస్తే వాటిని కొనసాగించవచ్చు ♦ ఇప్పటికే చేపట్టిన పనులు కొనసాగించొచ్చు. పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించొచ్చు ♦ ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ వంటి సంస్థలు ఉద్యోగాల నియామకాల ప్రక్రియ కొనసాగించొచ్చు ఇవి చేయకూడదు ♦ పథకాలకు కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేయకూడదు ♦ పథకాలకు కొత్తగా నిధులు విడుదల చేయాల్సి వస్తే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలి ♦ పనులు మంజూరైనప్పటికీ, ఇంకా ప్రారంభించని వాటిని ఇప్పుడు చేపట్టకూడదు ♦ కంపెనీలకు, వ్యక్తులకు భూములు కేటాయించకూడదు. అసాధారణ కేసుల్లో సీఎంఆర్ఎఫ్ మంజూరుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలి ♦ మంత్రులు ఫైలెట్ కార్లను వినియోగించకూడదు ♦ ప్రధానమంత్రి తప్ప మిగతా ఏ రాజకీయ నాయకులకు ప్రొటోకాల్ ఉండదు -
‘నిమిషం నిబంధన వద్దు’.. దీని కారణంగానే ఇప్పుడిలా..
ఆదిలాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో నిమిషం ఆలస్యం నిబంధన తొలగించాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో డీఐఈవో రవీందర్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ బీ రాహుల్ మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి టేకం శివకుమార్ ‘నిమిషం’ నిబంధన కారణంగా పరీక్షకు దూరమై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిమిషం ఆలస్యం నిబంధన ఎత్తివేస్తూ శివకుమార్ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎఫ్డీఎస్ జిల్లా కార్యదర్శి కుంటాల నవీన్కుమార్, టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పూసం సచిన్, ఏఎస్యూ జిల్లా కార్యదర్శి అశోక్, టీఎస్ఎఫ్ నాయకుడు సత్యనారాయణ, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సిడం సాయికుమార్, ఎస్వీఏ జిల్లా అధ్యక్షుడు గొప్లే సుజయ్, నాయకులు ఇఫ్తెఖార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలి.. ఇంటర్ విద్యార్థి శివకుమార్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూసం సచిన్ డిమాండ్ చేశారు. రిమ్స్ మార్చురీలో శివకుమార్ మృతదేహాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఆయన కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్షకు సంబంధించి నిమిషం ఆలస్యం నిబంధన విద్యార్థుల పాలిట శాపంగా మారిందని పేర్కొన్నారు. నిమిషం నిబంధన వెంటనే ఎత్తి వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు ఆత్రం కిష్టన్న, లక్ష్మణ్ తదితరులున్నారు. ఇవి చదవండి: హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్! -
ఈవీలకు ప్రత్యేక మీటర్.. విద్యుత్ కనెక్షన్లలో కీలక మార్పులు!
దేశంలో విద్యుత్ కనెక్షన్లకు సంబంధించిన నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో నివసించే వారు ఇప్పుడు ఏడు రోజులకు బదులుగా కేవలం మూడు రోజుల్లోనే విద్యుత్ కనెక్షన్లను పొందవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలను (EV) ఛార్జ్ చేయడానికి ప్రత్యేక విద్యుత్ కనెక్షన్ను పొందవచ్చు. ఈ మేరకు విద్యుత్ (వినియోగదారుల హక్కులు) రూల్స్, 2020ని సవరించినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. సవరించిన నిబంధనల ప్రకారం కొత్త విద్యుత్ కనెక్షన్ పొందేందుకు గల గడువును మహానగరాల్లో ఏడు రోజుల నుంచి మూడు రోజులకు, ఇతర మున్సిపల్ ప్రాంతాల్లో 15 రోజుల నుంచి ఏడు రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించారు. ఇక కొండ ప్రాంతాలు ఉన్న గ్రామీణ ప్రాంతాలు, కొత్త కనెక్షన్లు లేదా ఇప్పటికే ఉన్న కనెక్షన్లలో మార్పుల కోసం వ్యవధి 30 రోజులు ఉంటుందని కేంద్ర విద్యుత్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రూఫ్టాప్ సోలార్ రూఫ్టాప్ సోలార్ పీవీ సిస్టమ్లను ఏర్పాటు చేయడానికి డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ కాలపరిమితిని కూడా 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించింది ప్రభుత్వం. ఏడాదిలో కోటి గృహాలకు రూఫ్టాప్ సోలార్ను ఏర్పాటు చేస్తామని, ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిర్యాదులొస్తే అదనపు మీటర్ వినియోగదారులు మీటర్ రీడింగ్లు తమ వాస్తవ విద్యుత్ వినియోగంతో సరిపోలడం లేదని ఫిర్యాదులు చేసిన సందర్భాల్లో డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ ఫిర్యాదు అందిన తేదీ నుంచి ఐదు రోజులలోపు అదనపు మీటర్ను ఏర్పాలు చేయాల్సి ఉంటుంది. ఈ అదనపు మీటర్ ద్వారా మూడు నెలలపాటు విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తారు. కో-ఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, బహుళ అంతస్థుల భవనాలు, నివాస కాలనీలు మొదలైన వాటిలో నివసిస్తున్నవారు పంపిణీ లైసెన్స్దారు నుంచి ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత కనెక్షన్లు లేదా మొత్తం ప్రాంగణానికి సింగిల్ పాయింట్ కనెక్షన్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. -
గుడ్న్యూస్! కెనడాలో వర్క్ పర్మిట్.. కీలక మార్పులు
Canada work permit : కెనడాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు శుభవార్త ఇది. పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ (PGWP) కి కెనడా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రెండేళ్లలోపు వ్యవధి ఉన్న మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ను పూర్తి చేసిన విద్యార్థులు కూడా ఇప్పుడు 3 సంవత్సరాల పీజీడబ్ల్యూపీకి అర్హత పొందుతారు. 2024 ఫిబ్రవరి 15 నుంచి ఈ మార్పులను ఆ దేశ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అయితే 2024 సెప్టెంబరు 1 నుండి కరికులమ్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ ప్రోగ్రామ్లలో నమోదు చేసుకున్న విద్యార్థులు ఇకపై పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్కి అర్హత పొందలేరు. అలాగే దూరవిద్య, పీజీడబ్ల్యూపీ చెల్లుబాటు కోసం ప్రత్యేక చర్యలను 2024 ఆగస్టు 31 వరకు పొడిగించింది. పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ అనేది కెనడాలో చదువులు పూర్తయిన తర్వాత విదేశీ విద్యార్థులకు మంజూరు చేసే ఓపెన్ వర్క్ పర్మిట్. పీజీడబ్ల్యూపీ హోల్డర్లు కెనడాలో ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా తమకు నచ్చినన్ని గంటలు పని చేసుకోవచ్చు. పీజీడబ్ల్యూపీ చెల్లుబాటు ఎంత కాలం ఉంటుందనేది స్టడీ ప్రోగ్రామ్ స్థాయి, వ్యవధితోపాటు పాస్పోర్ట్ గడువు తేదీపై ఆధారపడి ఉంటుంది. విదేశీ విద్యార్థులందరూ అర్హులేనా? కెనడాలోని ఆమోదిత విద్యా సంస్థలలో కనీసం రెండు సంవత్సరాల నిడివి ఉన్న డిగ్రీ ప్రోగ్రామ్లు పూర్తి చేసి తాత్కాలికంగా కొన్నాళ్లపాటు కెనడాలో ఉండాలనుకుంటున్న విదేశీ విద్యార్థులందరూ 3 సంవత్సరాల పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ప్రోగ్రామ్ (PGWP)కి అర్హులు. ఇక మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ల విషయానికి వస్తే కనీసం 8 నెలలు (లేదా 900 గంటల క్యూబెక్ క్రెడెన్షియల్స్ ) వ్యవధి ఉండాలి. అన్ని ఇతర అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నంత వరకు మాస్టర్స్ డిగ్రీ వ్యవధి 2 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ 3 సంవత్సరాల పీజీడబ్ల్యూపీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇది సర్టిఫికేట్ లేదా డిప్లొమా ప్రోగ్రామ్లకు వర్తించదు. -
రైలు ప్రయాణికులకు అలర్ట్.. ట్రైన్ ఎక్కే ముందు తప్పక తెలుసుకోండి..
దేశవ్యాప్తంగా రోజూ కొన్ని లక్షల మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ప్రజా అవసరాలు, సరుకుల రవాణా కోసం ఇండియన్ రైల్వేస్ వేల సంఖ్యలో రైళ్లను నడుపుతోంది. టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించడం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే కొన్ని సందర్భాల్లో రైలు బయలుదేరే సమయానికి కౌంటర్ వద్ద క్యూ ఎక్కువగా ఉండటం వల్లనో లేదా టికెట్ కొనే సమయం లేకపోవడం వల్లనో కొందరు టికెట్ లేకుండానే రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. ఏది ఏమైనా టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించడం చట్టరీత్యా నేరం. రైళ్లలో ప్రయాణికులు అందరూ టికెట్ తీసుకున్నారా.. ఎవరైనా టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారా అన్నది పరీశీలించడానికి టీటీఈలు (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) ఉంటారు. వీరిలో కొంతమంది టికెట్ లేని ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. వేలాది రూపాయలు వసూలు చేస్తుంటారు. టికెట్ లేకపోతే ఏం చేయాలి.. రైళ్లలో రోజూ కొన్ని లక్షల మంది ప్యాసింజర్లు ప్రయాణిస్తుంటారు. వీరిలో కొందరు టికెట్ లేకుండా ప్రయాణించే సందర్భం వస్తుంది. ఈ క్రమంలో కొందరు టీటీఈలు దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల లక్నో ఎక్స్ప్రెస్లో ఓ రైల్వే అధికారి ప్రయాణికుడిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతన్ని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేసింది రైల్వే శాఖ. ఇలా అధికారులు ప్రవర్తించవచ్చా.. టికెట్ లేకుండా రైలు ఎక్కిన ప్రయాణికులు ఏం చేయాలి అన్న విషయాలు ఇక్కడ తెలుసుకుందాం... ఇదీ చదవండి: IRCTC: రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్లో మార్పులు టికెట్ లేకుండా రైలు ఎక్కిన ప్రయాణికులు మొదటగా టీటీఈని సంప్రదించి మీ పరిస్థితి గురించి వారికి తెలియజేయాలి. మీ వద్ద రిజర్వేషన్ టికెట్ లేకపోతే మీరు వెళ్ళాల్సిన గమ్య స్థానానికి అయ్యే టికెట్ ధరతో పాటు రూ.250 జరిమానా విధిస్తారు. అంటే మీరు రైలు ఎక్కిన ప్రదేశం నుండి గమ్యస్థానానికి అయ్యే చార్జీతో పాటు అదనంగా రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేశాక ఒకవేళ ట్రైన్లో సీట్లు కాళీ ఉంటే సీటును కూడా కేటాయిస్తారు. ఇదీ చదవండి: ఓటీపీలకు స్వస్తి.. ఆర్బీఐ కీలక ప్రతిపాదన! -
ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ రూల్స్ మారాయ్.. ఇక అది అవసరం లేదు!
IMPS Rules change: ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంకుకు చేసే ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ నిబంధనలు మారాయి. వినియోగదారులు ఫిబ్రవరి 1 నుంచి రిసీవర్ మొబైల్ నంబర్, పేరుతోనే ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) ద్వారా డబ్బును బదిలీ చేయవచ్చని, ఐఎఫ్ఎస్సీ కోడ్ జోడించాల్సిన అవసరం లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. 2024 జనవరి 31 నాటికి అన్ని ఐఎంపీఎస్ ఛానెల్లలో మొబైల్ నంబర్ + బ్యాంక్ పేరు ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ను అనుమతించాలని బ్యాంకులను అభ్యర్థిస్తున్నట్లు ఎన్పీసీఐ ఒక సర్క్యులర్లో పేర్కొంది. అలాగే డిఫాల్ట్ ఎంఎంఐడీ (మొబైల్ మనీ ఐడెంటిఫైయర్- MMID)తో సభ్యుల బ్యాంక్ పేర్లను మ్యాపింగ్ చేయాలని రిమిటర్ బ్యాంకులకు సూచించింది. ఐఎంపీఎస్ అంటే.. ఇమీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) అనేది ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్లు, బ్యాంక్ శాఖలు, ఏటీఎంలు, ఎస్ఎంఎస్, ఐబీఆర్ఎస్ వంటి వివిధ ఛానెల్ల ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్కు అత్యంత సాధారణంగా ఉపయోగించే పద్ధతుల్లో ఒకటి. ఈ ఐఎంపీఎస్ ప్రస్తుతానికి P2A (అకౌంట్ + ఐఎఫ్ఎస్సీ) లేదా P2P (మొబైల్ నంబర్ + ఎంఎంఐడీ) ట్రాన్స్ఫర్ విధానాల్లో లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. ఒక వేళ ఒకే మొబైల్ నంబర్తో ఎక్కువ అకౌంట్లను లింక్ చేసిన సందర్భంలో కస్టమర్ సమ్మతి ఆధారంగా ప్రాథమిక/డిఫాల్ట్ అకౌంట్కు బెనెఫీషియరీ బ్యాంక్ డబ్బును జమ చేస్తుంది. ఒక వేళ కస్టమర్ సమ్మతి లేని పక్షంలో బ్యాంకు ఆ లావాదేవీని తిరస్కరించాలి. -
రామ్లల్లా దర్శనానికి ఎలా వెళ్లాలి?
జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం పూర్తయ్యాక అయోధ్యను సందర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇందుకు ఎటువంటి విధివిధానాలు అనుసరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. రామాలయంలో బాలరామునికి రోజుకు ఐదుసార్లు హారతులు ఇవ్వనున్నారు. అయితే భక్తులు మూడు హారతులను మాత్రమే దర్శించుకోగలుగుతారు. ఈ హారతులు ఉదయం 6:30 గంటలకు, మధ్యాహ్నం 12:00 గంటలకు, సాయంత్రం 7:30 గంటలకు నిర్వహిస్తారు. ఇక శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం 6 నుండి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. అయోధ్యలో బాలరాముని దర్శనం కోసం ముందుగా రిజిస్టేషన్ చేసుకోవాలి. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం (https://online.srjbtkshetra.org) అధికారిక వెబ్సైట్కి వెళ్లి, మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాలి. ఓటీపీ నమోదు చేశాక పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో ‘దర్శన్’ ఎంపికపై క్లిక్ చేశాక, ఓపెన్ అయిన పేజీలో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ, సమయం, మీతోపాటు వచ్చేవారి సంఖ్య, దేశం, రాష్ట్రం, మొబైల్ నంబర్తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది. శ్రీరాముని హారతులను చూడాలనుకుంటే ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ చేసుకోవాలి. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆఫ్లైన్లో టిక్కెట్లు పొందాలనుకుంటే ఆలయం సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్లి, ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి, టికెట్ పొందవచ్చు. కాగా పదేళ్లకన్నా తక్కువ వయసుగల పిల్లలకు దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. దర్శనం కోసం టిక్కెట్తో పాటు ఐడీప్రూప్ ప్రూఫ్ను ఖచ్చితంగా వెంట తీసుకువెళ్లాలి. ఎవరైనా భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకుంటే, ఆ స్లాట్ మరో భక్తుడికి అందుబాటులోకి వస్తుంది. దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక, దర్శనానికి 24 గంటల ముందు సంబంధిత భక్తునికి మెసేజ్ లేదా మెయిల్ వస్తుంది. దర్శనానికి 24 గంటల ముందు భక్తుడు తన టిక్కెట్ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా స్త్రీలు, పురుషులు సంప్రదాయ దుస్తులలో మాత్రమే దర్శనానికి రావాలి. పురుషులు ధోతీ-కుర్తా లేదా కుర్తా, పైజామా.. మహిళలు చీర, దుపట్టాతో కూడిన పంజాబీ దుస్తులు లేదా దుపట్టాతో చుడీదార్ సూట్ ధరించి శ్రీరాముని దర్శనానికి రావచ్చు. ఇది కూడా చదవండి: అయోధ్యలో త్రేతాయగం... అంతా రామమయం! -
డేంజర్ యాప్స్పై డాట్ పంజా.. డిలీట్ చేసిన గూగుల్, యాపిల్
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త యాప్స్ పేరుతో ఇప్పటికే చాలామంది మోసపోవడంతో.. 'డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్' (DoT) కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ఈసిమ్ యాప్లను గూగుల్, యాపిల్ ప్లాట్ఫామ్ల నుంచి తొలగించాలని ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆదేశాల ప్రకారం.. గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి ఎయిర్లో (Airalo), హోలాఫ్లై (Holafly), eSIM వంటి యాప్లను తొలగించాయి. భారతదేశంలో ఈసిమ్ విక్రయాలు చేపట్టాలంటే తప్పకుండా DoT నుంచి నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందాలని, అప్పుడు మాత్రం అధీకృత డీలర్లు విక్రయించుకోవచ్చని, విక్రయించే ముందు తప్పకుండా పాస్పోర్ట్ కాపీ లేదా వీసా వంటి ఐడెంటిటీ ప్రూఫ్ను కస్టమర్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది వెల్లడించింది. విక్రేత కూడా గ్లోబల్ సిమ్ల వివరాలను భద్రతా ఏజెన్సీలకు తప్పకుండా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది. ఈసిమ్ విషయాన్ని పక్కన పెడితే.. సింగపూర్కు చెందిన ఎయిర్లో, స్పెయిన్కు చెందిన హోలాఫ్లై రెండు యాప్లను పూర్తిగా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇవి ఇండియాలో పూర్తిగా నిషిద్ధమని స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: లాంచ్కు సిద్దమవుతున్న యాపిల్ విజన్ ప్రో - ధర రూ.2.90 లక్షలు నిజానికి ఈసిమ్ అనేది ఫిజికల్ సిమ్ మాదిరిగా ఉండదు, దీనిని నెట్వర్క్ ప్రొవైడర్ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ యూజర్లు మాత్రం ఈసిమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఈసిమ్ వంటి వాటిని నిషేధించడానికి ప్రధాన కారణం ఏమిటంటే.. సైబర్ మోసాలకు పాల్పడేవారు ఎక్కువగా ఇంటర్నేషనల్ నంబర్లను ఉపయోగిస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, సైబర్ మోసాల సంఖ్యను తగ్గించడానికి DoT ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
సంద్రంలో ‘విండ్ పవర్’
సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే సహజ ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు, వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలనేది వాటన్నిటి లక్ష్యం. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత పెరుగుతోంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సాధించాలని దేశం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సముద్రంలో ఏర్పాటు చేసే పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ లీజ్ రూల్స్–2023ను తాజాగా ప్రకటించింది. సముద్రంలో విండ్ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉండే చోటు కోసం జరిగే సర్వేకు మూడేళ్లు ఉన్న గడువును ఐదేళ్లకు పెంచింది. అలాగే ప్రాజెక్టుల లీజు వ్యవధి 35 ఏళ్లుగా నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్వాహకులు మెగావాట్కు రూ.1లక్ష సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించాలని చెప్పింది. అయితే ఇది రిఫండబుల్ అని స్పష్టం చేసింది. థర్మల్ కంటే ఖర్చు తక్కువ పవన శక్తి సామర్థ్యం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. ప్రపంచ పవన విద్యుత్ పరిశ్రమ సామర్థ్యం 837 గిగావాట్లకి చేరింది. ఇది ఏటా 1.2 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను తగ్గించడంలో సహాయపడుతోంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూసీ) విశ్లేషణ ప్రకారం.. విండ్ పవర్ వృద్ధి రేటు వచ్చే దశాబ్దంలో 15 శాతానికి పెరగాలి. ఇందుకోసం పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపన పెరగాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో దేశంలోని సముద్రంలో 2026 నాటికి దాదాపు 20 గిగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లను స్థాపించే ప్రయత్నం జరుగుతోంది. భూమి మీద కంటే సముద్రంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆఫ్షోర్ విండ్ పవర్ ప్లాంట్లతో అధికంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అయ్యే ఖర్చు కంటే తక్కువకే పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఈ విద్యుత్ విక్రయానికి ఓపెన్ యాక్సెస్, ఇంటర్–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జీల మినహాయింపు వంటి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. రాష్ట్రంలో సముద్రం అనుకూలం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం 8,998.323 మెగావాట్లకు చేరుకుంది. ఇందులో పవన విద్యుత్ 4,083.37 మెగావాట్లుగా ఉంది. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పవన విద్యుత్ ఉత్పత్తి పెరుగుదలను నమోదు చేసుకుంది. ప్రభుత్వ చర్యలకు వాతావరణంలో వస్తున్న మార్పులు తోడవ్వడంతో ఏపీలో పవన విద్యుత్కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయొరాలజీ (పుణె)కి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రంలోని సముద్ర ప్రాంతాల్లో గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. -
మరోసారి గెలుచుకునేదానిపైనా జీఎస్టీ ఉంటుందా? ఆర్థిక మంత్రి క్లారిటీ..
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్లో ప్రారంభ పందేలపై 28% జీఎస్టీ విధింపునకు సంబంధించి విలువ ఆధారిత నిబంధనలు ప్రభావవంతంగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ‘‘ఇందుకు సంబంధించి వివరణ జారీ అయింది. 28% పన్ను రేటు అమలవుతుంది. ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎవరిపై భారం పడుతుందన్నది వివరంగా పేర్కొనడం జరిగింది. విలువకు సంబంధించి నిబంధనలు విజయాలను మినహాయిస్తున్నాయి. కనుక దీనిపై ఎలాంటి గందరగోళం ఉండదని భావిస్తున్నాను’’అని మంత్రి వివరించారు. దీని ప్రకారం.. ఆన్లైన్ గేమింగ్లో గెలుచు కున్న నగదుతో తిరిగి బెట్టింగ్లు వేసినప్పుడు వా టిపై 28% జీఎస్టీ అమలు కాదు. స్పష్టంగా చెప్పాలంటే మొదటిసారి బెట్టింగ్కు పెట్టే మొత్తంపై 28% జీఎస్టీ చెల్లించాలి. దానిపై గెలుచుకున్న మొత్తాన్ని తిరిగి వెచ్చించినప్పుడు జీఎస్టీ పడదు. లోక్ సభలో జీఎస్టీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీతారామన్ మాట్లాడారు. అప్పిలేట్ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్, సభ్యుల వయో పరిమితిని ఈ బిల్లులో సవరించారు. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రి ఓ ఉదాహరణను కూడా వినిపించారు. ‘‘ఒక వ్యక్తి రూ.1,000 బెట్ చేసి, దానిపై రూ.300 గెలుచుకుని.. ఆ తర్వాత రూ.1,300తో మరోసారి గెలుచుకునే మొత్తంపై జీఎస్టీ పడదు’’అని వివరించారు. -
రష్మిక ఫేక్ వీడియో : సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం మరోసారి రెడ్ సిగ్నల్
న్యూఢిల్లీ: తప్పుడు సమాచార వ్యాప్తికి సంబంధించి నటి రష్మిక మందన్నకు చెందినడీప్ఫేక్ వీడియో వైరల్ కావడంతో కేంద్రం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 66డీ ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్ష, జరిమానా తప్పదంటూ రిమైండర్ జారీ చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో డీప్ఫేక్లకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను, ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలను తాజా సర్క్యులేషన్లో మరోసారి గుర్తు చేసింది. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66డీ ప్రకారం కంప్యూటర్ వనరులను ఉపయోగించి ఎవరైనా వ్యక్తుల పట్ల మోసపూరితంగా వ్యవహరించినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా నేరం రుజువైతే మూడేళ్ల దాకా జైలు శిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానా ఉంటుంది. ప్రభుత్వం, లేదా బాధిత వ్యక్తులు కోరిన వెంటనే సోషల్ మీడియా వెబ్ సైట్లు ఆయా కంటెంట్ వివరాలను 36 గంటల్లోగా తొలగించాల్సి ఉంటుంది. IT మధ్యవర్తి నియమాల ప్రకారం, సోషల్ మీడియా సంస్థలు 10 రకాల కంటెంట్కి సంబంధించిన పోస్టులను తప్పక తొలగించాలి. ముఖ్యంగా దేశ సమగ్రత, శాంతి భద్రతలు, సార్వభౌమత్వం, విదేశాలతో సంబంధాలు, ఇతర దేశాలను అవమానించడం, నేరాలకు పాల్పడేందుకు ప్రోత్సహించే చర్యలు, ఒక వ్యక్తి లేదా ప్రభుత్వాన్ని కించపర్చేలా మాట్లాడడం నేరంగా పరిగణిస్తారు. అలాగే అసభ్యకరమైన కంటెంట్, లింగ విద్వేషం రెచ్చగొట్టే పోస్టులు, ఇతరుల ప్రైవసీని దెబ్బ తీసే కంటెంట్, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడేలా ప్రోత్సహించడం, జాతి, మతం, రంగును అవమానించడం, భారతీయ చట్టాలలో నేరంగా వెల్లడించిన పనులను ప్రోత్సహించే కంటెంట్ వంటివి ఎవరైనా పోస్ట్ చేస్తే వాటిని వెంటనే తొలగించాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ ప్రభుత్వం కోరితే ఆ సమాచారాన్ని ముందుగా పోస్ట్ చేసిన వ్యక్తి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. కాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో స్పందించిన కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఫేక్ న్యూస్, డీప్ఫేక్ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయులకు భద్రత, విశ్వాసం కల్పించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇవ్వడం తోపాటు ఇలాంటి ఫేక్ వీడియోపై సోషల్ మీడియా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
రోగం పేరుతో డ్రామా కోర్టు నిబంధనలు ఉల్లంఘన
-
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు.. కలెక్టర్..
ఆదిలాబాద్: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన క్రమంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్రాజ్ అ న్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల కోడ్ వివరాలు వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమి షన్ సోమవారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వి డుదల చేసిందని తెలిపారు. దీంతో నియమావళి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుందని, 10 వరకు నామినేషన్ల గడువు, 13న పరిశీలన, 15న ఉపసంహరణ, 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుందని వివరించారు. ఓటర్లు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఓటరు లిస్టుతో తమ పేర్లు ఉన్నయో లేవో పరిశీలించుకోవాలన్నారు. ఎవరైనా పేర్లు లేకపోతే నామినేషన్లకు పది రోజుల ముందు వరకు ఫారం–6 ద్వారా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులకు నిబంధనలతో కూడిన బుక్లెట్ అందజేస్తామన్నారు. నియమావళిని పరిశీలించేందుకు ఫ్లయింగ్స్క్వాడ్ నియమించినట్లు తెలిపారు. అలాగే అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్కడ నిరంతరం సీసీ నిఘా, వీడియో చిత్రీకరణ ఉంటుందన్నారు. వీటిని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు అనుసంధానం చేశామన్నారు. ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తామన్నారు. అలాగే సర్వేలైన్ అధి కారుల ద్వారా పరిస్థితులను సమీక్షిస్తామన్నారు. ఒకవ్యక్తి రూ.50వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లరాదని, అంతకు మించి తీసుకెళితే సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే డబ్బును సీజ్ చేస్తామన్నారు. అలాగే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని, సభలు, సమావేశాలు నిర్వహించే ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రజలు స్వేచ్ఛాయూత వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొ ని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా రు.ఎన్నికల నిర్వహణ కోసం అన్నిఏర్పాట్లు చేస్తా మన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పె డుతామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సంక్షే మ పథకాలు సూచించే ఫ్లెక్సీలు తొలగించామన్నారు. ఇందులో ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, ఐటీడీఏ పీవో చాహత్బాజ్పాయ్ పాల్గొన్నారు. -
అక్రమ ధనార్జన నిరోధక నిబంధనలు మరింత పటిష్టం!
న్యూఢిల్లీ: అక్రమ ధనార్జన నిరోధక నియమ నిబంధనలను ఆర్థిక మంత్రిత్వశాఖ మరింత కఠినతరం చేసింది. ముఖ్యంగా భాగస్వామ్య సంస్థల్లో ‘లాభదాయక యజమానుల’ నిర్వచనం కింద గతంలో 15 శాతంగా ఉన్న వాటాను (ఒక సంస్థలో) తాజాగా 10 శాతానికి తగ్గించింది. ఇది లాభదాయకమైన యజమానులను కఠినమైన పర్యవేక్షణలోకి తీసుకువస్తుంది. బినామీ, షెల్ కంపెనీల కార్యకలాపాల నిరోధానికి దోహదపడుతుంది. అంతేకాకుండా, లాభదాయకమైన యజమానిని ‘‘ఇతర మార్గాల ద్వారా నియంత్రించే’’ వ్యక్తిగా కూడా పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ ‘‘నియంత్రణ’’ అనేది నిర్వహణ లేదా విధాన నిర్ణయాన్ని నియంత్రించే హక్కును సంబంధించినదని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ పేర్కొంది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారాన్ని అందించడానికి బాధ్యత వహించే ’ప్రిన్సిపల్ ఆఫీసర్’ స్థాయిని.. మేనేజ్మెంట్ స్థాయి వ్యక్తికి కూడా కల్పిస్తూ అక్రమ ధనార్జన నిరోధక చట్టం, 2005 నిబంధనలను (మెయిటినెన్స్ ఆఫ్ రికార్డ్స్) కఠినతరం చేసినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ట్రస్ట్ విషయంలో రిపోర్టింగ్ సంస్థ, ఖాతా ఆధారిత సంబంధాన్ని ప్రారంభించే సమయంలో లేదా పేర్కొన్న లావాదేవీలను నిర్వహిస్తున్నప్పుడు ధర్మకర్తలు తమ స్థితిని వెల్లడించేలా చూసుకోవాలని కూడా సవరణ పేర్కొంది. టెర్రర్ ఫైనాన్సింగ్, మనీలాండరింగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) నవంబర్లో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవలి నెలల్లో వివిధ మనీలాండరింగ్ నిరోధక నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. -
అక్కాచెల్లెళ్లకు క్యాష్ గిఫ్ట్ ఇస్తున్నారా.. ఐటీ రూల్స్ ఏంటో తెలుసా?
తోబుట్టువుల మధ్య అపురూపమైన బంధానికి అపూర్వ ప్రతిక రక్షా బంధన్. సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ తమ బంధం జన్మ జన్మలకూ కొనసాగాలని కోరుతూ అక్కాచెల్లెళ్లు రాఖీలు కడతారు. ఇక తమ సోదరీమణులకు ఐశ్వర్యం, సౌభాగ్యాలు కలగాలంటూ అన్నాతమ్ముళ్లు తమ శక్తిమేరకు బహుమతులు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ఇదీ చదవండి: ఈపీఎఫ్వో అలర్ట్: వివరాల అప్డేషన్కు కొత్త మార్గదర్శకాలు బహుమతులు లేకుండా రాఖీ పండుగ అసంపూర్ణంగా ఉంటుంది. అయితే కాలంతో పాటు ట్రెండ్స్ మారుతున్నాయి. కానీ స్థిరంగా ఉన్న ఒక విషయం కొనసాగుతోంది. అదే సోదరులు తమ సోదరీమణులకు బహుమతిగా డబ్బు ఇవ్వడం. కాబట్టి ఈ రక్షా బంధన్ సందర్భంగా సోదరికి ఎంత డబ్బు బహుమతిగా ఇవ్వవచ్చు.. దీనిపై ట్యాక్స్ ఉంటుందా.. ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు ఎలా ఉన్నాయి.. నిపుణులు ఏం చెబుతున్నారు...? తెలుసుకుందాం. రూ.2 లక్షలకు మించితే.. ఆదాయపు పన్ను చట్టాలు లేదా మరేవైనా ఇతర చట్టాల ప్రకారం ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బహుమతి ఇవ్వడానికి ఎటువంటి పరిమితి లేదు . అది నగదు బహుమతికైనా సరే ఎలాంటి పరిమితి ఉండదు. అయితే రూ. 2 లక్షలకు మించి నగదు ఇచ్చిపుచ్చుకోవడానికి వీలు లేదు. కాబట్టి రూ.2లక్షలకు మించి బహుమతి ఇచ్చేవారు నగదు రూపంలో కాకుండా బ్యాంకింగ్ మార్గాల ద్వారా ఇవ్వవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ట్యాక్స్ ఉంటుందా? ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 56(2)(x) ప్రకారం బహుమతులు గ్రహీతల చేతిలోకి వెళ్లాక పన్ను ఉంటుంది. అయితే కొంతమంది నిర్దిష్ట బంధువుల నుంచి వచ్చే బహుమతులకు మాత్రం ఈ నిబంధనకు మినహాయింపు ఉంటుంది. ఇక షేర్ల విషయానికి వస్తే పన్నుల ప్రభావం లేకుండా షేర్లను సోదరికి బదిలీ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం.. అక్కాచెల్లెళ్లకు క్యాష్ గిఫ్ట్ ఇస్తే.. ఇచ్చేవారికి కానీ, తీసుకునేవారికి కానీ ఎలాంటి ట్యాక్స్ పడదు అని పేర్కొంటున్నారు. -
ఉద్యోగులకు గుడ్న్యూస్: ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు.. భారీగా పన్ను ఆదా!
ప్రైవేటు ఉద్యోగులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (CBDT) శుభవార్త అందించింది. కొన్ని ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగుల్లో కొందరికి అద్దె రహిత వసతి కల్పిస్తుంటాయి. అలాంటి అద్దె రహిత ఇళ్లకు విధించే పన్నుకు సంబంధించి విలువను నిర్ణయించే నిబంధనలను సీబీడీటీ సవరించింది. దీంతో ఉద్యోగులకు మరింత ఎక్కువ పన్ను ఆదా అవుతుంది. టేక్-హోమ్ జీతం పెరుగుంది. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఆదాయపు పన్ను నిబంధనలకు సవరణలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నోటిఫై చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా ఇతర ఉద్యోగులకు యాజమాన్యాలు కల్పించే అన్ఫర్నిష్డ్ గృహాలకు సంబంధించిన వ్యాల్యుయేషన్ నిబంధనలు మారాయి. తగ్గిన పన్నులు 2011 జనాభా లెక్కల ప్రకారం 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో నివసించే ఉద్యోగులకు వసతిపై పన్ను వారి జీతంలో 10 శాతం ఉంటుంది. ఇది ఇంతకు మందు 15 శాతంగా ఉండేది. ఇక 15 లక్షలకు మించి 40 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో ఇది జీతంలో 7.5 శాతం ఉంటుంది. గతంలో 10 శాతంగా ఉండేది. వసతి వ్యాల్యుయేషన్ నిబంధనలను సీబీడీటీ మార్చడం వల్ల అధిక జీతం పొందుతూ యాజమాన్యాలు కల్పించే వసతిలో నివాసముంటున్న ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుకుందని, పెద్ద పన్ను ఆదాతోపాటు వారు పొందే టేక్ హోమ్ జీతం పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదీ చదవండి: లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నారా? మెచ్యూరిటీ సొమ్ముపై పన్ను తప్పదు! -
మణిపూర్ అంశంపై తెరమీదకు రూల్ నెం.176 Vs 267.. అసలేంటివి?
ఢిల్లీ: మణిపూర్ అంశంపై నేడు పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ఈ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా కేంద్రం కూడా అందుకు సమ్మతించింది. కానీ రూల్ నెంబర్ 267 కింద మణిపూర్ అంశాన్ని చర్చించాలని ప్రతిపక్షాలు కోరగా.. కేంద్రం మాత్రం రూల్ నెంబర్ 176 కింద చర్చిస్తామని స్పష్టం చేసింది. మణిపూర్ అంశంపై అరగంట చర్చ సరిపోదని, రూల్ 267 కింద చర్చ జరపాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. కేంద్రం ఇందుకు అంగీకరించడం లేదని ఆరోపించారు. అయితే.. ప్రతిపక్షాలు పదే పదే తమ నిర్ణయాన్ని మారుస్తున్నాయని కేంద్రం మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. కేవలం ప్రధాని మోదీ వచ్చి ప్రకటన ఇవ్వాలని కోరుతున్నాయని చెప్పారు. మణిపూర్ అంశంపై చర్చించే ఆసక్తి ప్రతిపక్షాలకు లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. అసలు ఈ రూల్ నెంబర్ 176, 267 రెండు నిబంధనల మధ్య ఉన్న తేడా ఏంటీ? #WATCH | Defence Minister Rajnath Singh on the Manipur violence says, "I feel the opposition is not serious about the discussion on the Manipur issue. The government wants to discuss the Manipur issue. PM Modi himself said that the country is ashamed of whatever has happened in… pic.twitter.com/GlTZ3sj9uM — ANI (@ANI) July 21, 2023 ఇదీ చదవండి: మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటిని తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు రూల్ 267 ప్రకారం.. రాజ్య సభ నిబంధనల ప్రకారం రూల్ 267కు ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మీద ప్రత్యేకంగా చర్చ జరపాలని సభ్యులు కోరవచ్చు. ఇందుకు ఆ రోజు సభలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ఇతర సభ్యులు ఇచ్చిన నోటీసులు తాత్కాలికంగా రద్దు చేయాలని కోరుబడతాయి. ప్రత్యేక చర్చకు సభ్యుడు నోటీసు ఇస్తే.. స్పీకర్ అనుమతించాల్సి ఉంటుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాన్ని రాతపూర్వకంగా కానీ, ఓరల్గానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చర్చలో సభ్యులు ఏ అంశంపైనైనా అడగవచ్చు. 1990 నుంచి 2016 వరకు కేవలం 11 సార్లు మాత్రమే ఈ రూల్ కింద చర్చ జరిగింది. రూల్ 176 ప్రకారం.. ఈ రూల్ ప్రకారం చర్చ అరగంట నుంచి రెండున్నర గంటలపాటు మాత్రమే ఉంటుంది. సభలోని ప్రతి సభ్యుడు ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశంపై చర్చించేందుకు నోటీసు ఇస్తున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్కు లేఖ రాయాల్సి ఉంటుంది. ఆ నోటీసుకు మద్దతుగా ఇద్దరు సభ్యులు సంతకాలు చేయాలి. ఈ నోటీసు ఇచ్చిన కొద్ది గంటల వ్యవధిలో లేదా మరుసటి రోజు స్పీకర్ పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇదీ చదవండి: సుప్రీంలో రాహుల్ గాంధీ పిటిషన్.. పలువురికి నోటీసులు.. బెంచ్ ఆసక్తికర వ్యాఖ్యలు -
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య చదవాలనుకునే తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్ రూల్స్కు సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రీఆర్గనైజషన్ ఆక్ట్, ఆర్టికల్ 371D నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్కు సవరణ చేసింది. దీని ప్రకారం 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. అంతకు ముందు 85శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15శాతం అన్ రిజర్వుడుగా ఉండేది. ఇందులో తెలంగాణతో పాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. ఎంబిబిఎస్ సీట్లు పొందేవారు. తాజా నిర్ణయం వల్ల తెలంగాణ విద్యార్థులకు ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు దక్కనున్నాయి. తెలంగాణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు చేరువ చేయడంతో పాటు, తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ప్రారంభించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి రాష్ట్రంలో 20 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 56కు చేర్చించింది తెలంగాణ ప్రభుత్వం. నాడు తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉంటే, ఇప్పుడు 8340 సీట్లకు పెరిగింది. చదవండి: సీఎం కేసీఆర్ టూర్.. ఎస్సై గంగన్నతో మామూలుగా ఉండదు మరి! తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న 20 మెడికల్ కాలేజీల్లోని 2,850 సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 1,895 సీట్లు ఉండేవి. ఇందులో 15శాతం అన్ రిజర్వుడు కోటాగా 280 సీట్లు కేటాయించాల్సి వచ్చేది. ఇందులో తెలంగాణ విద్యార్థులతో పాటు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అవకాశం పొందేవారు. దీంతో తెలంగాణ విద్యార్థులు సీట్లు కోల్పోవాల్సి వచ్చేది. ఇదే విధానం కొనసాగితే, పెరిగిన మెడికల్ కాలేజీల్లో కూడా 15శాతం అన్ రిజర్వుడు కోటా అమలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల మరిన్ని సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోవాల్సి వస్తుంది. దీన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, అన్ రిజర్వుడు కోటాను కేవలం పాత 20 మెడికల్ కాలేజీలకు మాత్రమే పరిమితం చేస్తూ నిబంధనలకు సవరణ చేసింది. కొత్తగా వచ్చిన 36 మెడికల్ కాలేజీలకు ఆ నిబంధన వర్తించకుండా తాజా సవరణ చేసింది. దీంతో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అదనంగా లభిస్తున్నాయి. ఇప్పటికే ఎంబీబీఎస్ బి కేటగిరి సీట్లలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసుకోవడం వల్ల తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1300 ఎంబీబీఎస్ సీట్లు విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల మొత్తం 1820 సీట్లు ప్రతి ఏటా దక్కనున్నాయి. 1820 సీట్లు అదనంగా అంటే దాదాపు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు తో సమానం. ప్రతి ఏటా కాలేజీలు పెరిగినా కొద్ది ఈ సీట్ల మరింత పెరగనుంది. కొత్త మెడికల్ కాలేజీలలో అల్ ఇండియా కోట 15% సీట్లు యధాతదం గా ఉంటాయి. దీనిలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తో సహా దేశంలో ఎక్కడివారైనా మెరిట్ ప్రకారం అడ్మిషన్ పొందవచ్చు. తెలంగాణ విద్యార్థుల డాక్టర్ కల సాకారం దిశగా.. తెలంగాణ విద్యార్థులు స్థానికంగా ఉంటూనే డాక్టర్ కల సాకారం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించిందని మంత్రి హరీష్రావు అన్నారు. ఏండ్ల కాలం నుంచి వైద్య విద్యకు దూరమైన తెలంగాణ బిడ్డలు సీఎం కేసీఆర్ ఆలోచనతో అమలు చేస్తున్న నిర్ణయాలు దగ్గర చేస్తున్నాయి. తెలంగాణ సోయితో ఆలోచించిన ప్రభుత్వం తెలంగాణ విద్యార్థులకు అదనంగా 1820 మెడికల్ సీట్లు వచ్చేలా చేసింది. డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకోవాలి. తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ వైద్యారోగ్య రంగం గణనీయమైన వృద్ది సాధించింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఒకవైపు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూనే, ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ విద్యార్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
‘లివ్ ఇన్’లో ఉండాలంటే.. ఆ యువతి కండీషన్లకు నెటిజన్లు గగ్గోలు!
ఒక యువతి తన పార్ట్నర్తో లివ్ ఇన్లో ఉండేందుకు అతని ముందు ఉంచిన షరతుల లిస్టు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వీటినన్నింటినీ నెరవేరుస్తానని హామీ ఇస్తేనే లివ్ ఇన్లో ఉంటానని, లేని పక్షంలో బైబై టాటా చేప్పేస్తానని బెదిరించింది. ఎవరైనా మరొకరికితో కలసి ఉండాలంటే కాస్తయినా సద్దుకుపోవాల్సి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. స్కూలులో స్నేహితులతో, కాలేజీలో రూమ్ మేట్స్తో సద్దుకుపోతూ కలసిమెలసి ఉండటం అనేది అందరికీ అనుభవమే. అయితే ఇప్పుడు కాలం మారింది. పెళ్లికి ముందు లేదా పెళ్లి ఊసే లేకుండా లివ్ ఇన్ రిలేషన్లో యువతీయువకులు ఉంటున్నారు. ఇలా ఉంటున్నవారిలో చాలామంది పరస్పరం అడ్జెస్ట్ కాలేక విడిపోతున్నారు. వివాహం అయినవారు ఒకరి ఇష్టాఇష్టాలు, అభిరుచులు ఎలా ఉన్నా ఒకరితో మరొకరు అడ్జెస్ట్ అవుతున్నారు. అలాగే భాగస్వామి కోసం తమ ఇష్టాఇష్టాలను మార్చుకుంటున్నారు. అయితే ఇప్పటి యువత భాగస్వామితో అస్సలు అడ్జెస్ అయ్యేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. తాజాగా ఒక లివ్ ఇన్ జంటకు సంబంధించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లివ్ ఇన్లో ఉండేందుకు.. ‘ది మిర్రర్’ రిపోర్టును అనుసరించి ఒక యువతి తన పార్ట్నర్తో పాటు లివ్ ఇన్లో ఉండేందుకు కొన్ని షరతులు విధించింది. ఈ షరతులకు అంగీకరించకపోతే బ్రేకప్ చెప్పేస్తానని బెదిరించింది. ఆ యువతి తన బాయ్ఫ్రెండ్కు లివ్ ఇన్ కోసం ఉంచిన షరతులను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాను విధించిన నియమాలను తాను కూడా పాటిస్తానని, అదేవిధంగా తన బాయ్ ఫ్రెండ్ కూడా పాటించాలని స్పష్టం చేసింది. యువతి పెట్టిన నిబంధనలివే.. ఆ యువతి విధించిన కండీషన్లలో మొదటిది తన బాయ్ ఫ్రెండ్ అతని సామాన్లతో సహా విడిగా వేరే గదిలో ఉండాలి. రెండవ నియమం.. డైనింగ్ టేబుల్ మొదలుకొని ఇంటిలో ఎక్కడా చెత్తపోయకూడదు. అపరిశుభ్రంగా మార్చకూడదు. మూడవ నియమం.. ఇంటిలోని న్యూస్ పేపర్లు, ఇతర కాగితాలు సరిగా సద్దుకొని అతని గదిలోనే ఉంచుకోవాలి. ఈ షరతులను చూసి నెటిజన్లు కామెంట్ల వెల్లువ కురిపిస్తున్నారు. ఒక యూజర్.. లివ్ ఇన్లో ఉండేందుకు ఎటువంటి షరతులు ఉండకూడదని రాయగా,మరో యూజర్ లివ్ ఇన్లో ఇలాంటి తీరు అస్సలు పనికిరాదని రాశారు. ఇంకో యూజర్ సరైన జీవితం గడిపేందుకు ఆ యువతి పెట్టిన కండీషన్లలో తప్పేముందని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ‘మత్స్య కన్య’గా మారిన ఇంగ్లీష్ టీచర్.. చూసేందుకు జనం పరుగులు!