-
గిరిజన మహిళల ఆరోగ్యంపై నివేదిక
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాల మహిళల సమస్యలపై 2024–2025 యాక్షన్ ప్లాన్లో భాగంగా జాతీయ మహిళా కమిషన్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమహిళా కమిషన్ నివేదిక సమర్పించింది. మహిళల సంక్షేమం, భద్రత, ప్రభుత్వ విధానాలు, మహిళా కమిషన్ల కార్యాచరణపై జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో హరియాణలో నిర్వహించిన రెండ్రోజుల జాతీయస్థాయి సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల నుంచి మహిళా కమిషన్ చైర్ పర్సన్లు, సభ్యులు హాజరైన ఈ జాతీయస్థాయి సమావేశంలో ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి నివేదికను సమర్పించారు.ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంత మహిళల హక్కులు, అక్షరాస్యత, ఆరోగ్యం, ఆర్ధిక, సామాజిక అవగాహన కార్యక్రమాలు, అనాదిగా కొనసాగుతున్న అనాగరిక ఆచార పద్ధతులపై పలు అంశాలను ఆ నివేదికలో వివరించారు. వెంకటలక్ష్మి మాట్లాడుతూ వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని మాతంగి, బసివిని, జోగిని వంటి అనాగరిక ఆచారాలతో తలెత్తే సమస్యలే పెద్ద సవాల్గా మారాయన్నారు. ఈ నివేదికపై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మ స్పందిస్తూ ఒక్క ఏపీలోనే కాకుండా అన్ని రాష్ట్రాల గిరిజన ప్రాంతాల్లో మహిళా కమిషన్ల సందర్శనతో పాటు అక్కడ మహిళా సమస్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇందుకు జాతీయ మహిళా కమిషన్ తరఫున కొంత నిధిని కేటాయించి రాష్ట్ర కమిషన్లతో ఉమ్మడి కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేస్తామని తీర్మానం చేశారు. పనిప్రాంతం (వర్క్ప్లేస్)లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కారం) చట్టం–2013 కింద ఏర్పాటు చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేసేలా అధికారులను ఆదేశించాలని చైర్పర్సన్ రేఖా శర్మ అన్ని రాష్ట్రాల మహిళా కమిషన్ల చైర్ పర్సన్లకు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలిచ్చారు. కమిషన్ కార్యదర్శి విద్యాపురపు వసంత బాల పాల్గొన్నారు. -
ఎగిరిపోతున్న సంపన్నులు! ఎక్కువగా ఆ దేశానికే..
భారత్ నుంచి ఏటా వేల సంఖ్యలో మిలియనీర్లు విదేశాలకు తరలిపోతున్నారు. ఈ ఏడాది దాదాపు 4,300 మంది మిలియనీర్లు భారత్ను వీడే అవకాశం ఉందని, వీరిలో ఎక్కువ మంది యూఏఈని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నారని అంతర్జాతీయ పెట్టుబడుల వలస సలహా సంస్థ హెన్లీ అండ్ పార్టనర్స్ తాజా నివేదిక వెల్లడించింది.గత ఏడాది ఇదే నివేదిక ప్రకారం 5,100 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు మకాం మార్చారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ మిలియనీర్ల వలసల విషయంలో చైనా, యూకే తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉంటుందని అంచనా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఇప్పుడు చైనాను అధిగమించగా, భారతీయ నికర మిలియనీర్లు చైనా కంటే 30 శాతం కంటే తక్కువ.కొత్త మిలియనీర్లుభారత్ ప్రతి సంవత్సరం వేలాది మంది మిలియనీర్లను కోల్పోతున్నప్పటికీ దానికంటే ఎక్కువ సంఖ్యలో కొత్త సంపన్నులను తయారు చేస్తూనే ఉందని నివేదిక పేర్కొంది. గత దశాబ్దంలో దేశంలో 85 శాతం సంపద పెరిగినట్లు వెల్లడించింది. ఇలా వెళ్తున్న మిలియనీర్లలో చాలా మంది భారత్లో వ్యాపార ప్రయోజనాలు, ఇళ్లను కలిగి ఉన్నారని నివేదిక ఎత్తి చూపింది. ఇది కొనసాగుతున్న ఆర్థిక సంబంధాలను సూచిస్తుంది.2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,28,000 మంది మిలియనీర్లు వలసలు వెళ్తారని భావిస్తున్నారు. వీరికి యూఏఈ, యూఎస్ఏ ఇష్టమైన గమ్యస్థానాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. భద్రత, ఆర్థిక పరిగణనలు, పన్ను ప్రయోజనాలు, పదవీ విరమణ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, అనుకూలమైన జీవనశైలి, పిల్లలకు విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, మొత్తం జీవన నాణ్యతతో సహా వివిధ కారణాల వల్ల సంపన్న కుటుంబాలు వలస వెళ్తున్నాయి. -
రాష్ట్రంలో ‘రబీ’ నష్టం రూ. 320 కోట్లు
అనంతపురం అగ్రికల్చర్/కర్నూలు(అగ్రికల్చర్): గత రబీ సీజన్ (2023–24)లో కరువు పరిస్థితుల కారణంగా గత ప్రభుత్వం ఆరు జిల్లాల పరిధిలో ప్రకటించిన 87 కరువు మండలాల్లో రూ. 320 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రకృతి విపత్తుల విభాగం మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఆరి్థకసాయం అందజేయాలంటూ.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ)కు సమగ్ర కరువు నివేదిక అందజేశారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో రాష్ట్రస్థాయిలో రబీ నష్టంపై సమీక్ష నిర్వహించారు. అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ నేతృత్వంలో ఈ సమీక్ష జరిగింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ రితే‹Ùచౌహాన్ నేతృత్వంలో ఆరుగురు కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు. మరో నలుగురితో కూడిన కేంద్ర బృందం నెల్లూరు నుంచి వర్చువల్ పద్ధతిలో సమీక్షలో పాల్గొన్నారు. అలాగే ఆర్.కూర్మనాథ్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.నాగరాజు, గ్రౌండ్ వాటర్ ఏడీ విశ్వేశ్వరరావు, జేడీఏ జగ్గారావు, మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ డిప్యూటీ చీఫ్ ఇంజనీరు ఎం.బ్రహ్మాజీ, పశుశాఖ జేడీ జెడ్.ఈశ్వర్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాషా, గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్ కమిషనర్ శివప్రసాద్తో కూడిన రాష్ట్ర స్థాయి బృందం సభ్యులు కూడా సమీక్షకు హాజరయ్యారు. 24 రకాల పంటలకు దెబ్బ ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపకపోవడంతో గత రబీలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు కేంద్ర బృందానికి రాష్ట్ర, జిల్లా అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లాలో 14 మండలాలు, శ్రీసత్యసాయి జిల్లాలో ఒకటి, కర్నూలు జిల్లాలో 18, నంద్యాలలో 13, ప్రకాశంలో 31, నెల్లూరులో 10... మొత్తంగా ఆరు జిల్లాల పరిధిలో 87 మండలాలు కరువు జాబితాలో ప్రకటించినట్లు తెలిపారు. ఆరు జిల్లాల పరిధిలో 2.53 లక్షల హెక్టార్లలో 24 రకాల పంటలు దెబ్బతినడంతో రూ.1,207 కోట్లు విలువ చేసే 2.93 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు కోల్పోయినట్లు వివరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం ఒక్కో రైతుకు రెండు హెక్టార్లకు ఆరి్థకసాయం అందించడానికి వీలుగా 2.38 లక్షల మంది రైతులకు రూ. 228.03 కోట్లు ఇన్పుట్సబ్సిడీ రూపంలో అందించాలని కోరారు. పంటనష్టం కాకుండా ఉద్యానశాఖ, పశుశాఖ, ఉపాధిహామీ, గ్రామీణ, పట్టణ తాగునీటి సరఫరా తదితర వాటికి మరో రూ. 91.74 కోట్లు... మొత్తంగా రూ.319.77 కోట్లు కరువు సాయం అందించాలని కోరుతూ సమగ్ర కరువు నివేదికను కేంద్ర బృందానికి అందించారు. ఇక్కడే ఆరు జిల్లాల పరిధిలో జరిగిన పంటనష్టం గురించి ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అనంతరం ఒక బృందం శ్రీసత్యసాయి జిల్లా పర్యటనకు, మరొక బృందం కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనకు వెళ్లాయి.నగరడోణ, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణంతోనే కరువు నివారణ కర్నూలు జిల్లాలో కరువును శాశ్వతంగా నిర్మూలించాలంటే ప్రధానంగా నగరడోణ రిజర్వాయర్, వేదవతినదిపై ప్రాజెక్టు నిర్మించాలని, ఈ మేరకు కేంద్రానికి నివేదించాలని రైతులు, రైతు సంఘాల నేతలు ఐఎంసీటీ ప్రతినిధులను కోరారు. కేంద్ర బృందం బుధవారం కర్నూలు కలెక్టరేట్లో రబీ కరువును ప్రతిబింబించే ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించింది. శనగ, జొన్న రైతులతో ముఖాముఖి మాట్లాడి కరువు తీవ్రతను తెలుసుకున్నారు. 2023–24 ఖరీఫ్, రబీల్లో వివిధ పంటల్లో పెట్టిన పెట్టుబడుల్లో 25 శాతం కూడా దక్కలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి పంటల బీమా పరిహారం చెల్లించాలని కోరారు. గురువారం జిల్లాల్లో కరువు పరిశీలన తర్వాత అన్ని బృందాలు విజయవాడ చేరుకుంటాయని అధికారులు తెలిపారు. -
నో లెర్నింగ్.. నో అప్డేట్
సాక్షి, హైదరాబాద్: చేసే పనిలో అప్డేట్ కావాలంటే...తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. కొత్త విషయాలను నిరంతరం నేర్చుకోవాలి. కానీ తొంభైశాతం మంది భారత వృత్తి నిపుణులు అందుకు పూర్తిస్థాయిలో సిద్ధం కావడం లేదు. కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత కమిట్మెంట్లు, బిజీ వర్క్షెడ్యూళ్లు తదితర కారణాలతో వెనుకడుగు వేస్తున్నట్టు స్పష్టమైంది. తాము పనిచేస్తున్న సంస్థలు, కంపెనీల యాజమాన్యాలు వివిధ రూపాల్లో నైపుణ్యాలు పెంచేందుకు సానుకూల దృక్పథంతోనే ఉన్నా, దీనికి సంబంధించి తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడంలో దేశంలోని దాదాపు 80 శాతందాకా వృత్తి నిపుణులు విఫలమవుతున్నారు. కుటుంబ బాధ్యతలు, ఇతర రూపాల్లోని ప్రతిబంధకాలు అధిగమించి కొత్తవి నేర్చుకునే విషయంలో అత్యధికుల అనాసక్తి కనబరుస్తున్నారు. 2030 సంవత్సరం నాటికల్లా ప్రపంచస్థాయిలోనే కాకుండా భారత్లోనూ ప్రస్తుతమున్న ఉద్యోగాలు, బాధ్యతలు, విధుల స్వరూపం 64 శాతం మేర మారిపోయే అవకాశాలున్నాయని నిపుణులు, కంపెనీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వృత్తినిపుణులు, ఉద్యోగులు తమ నైపుణ్యాలను తప్పనిసరిగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త విషయాలు నేర్చుకోవడం, చేసే పని పద్ధతులు, విధానాల్లో మార్పులపై అధిక దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా నెట్వర్కింగ్ సంస్థ ‘లింక్డ్ ఇన్’ విడుదల చేసిన నివేదికలో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. వెనుకబాటుకు కారణాలు.. వృత్తి నిపుణులు కొత్త విషయాలు నేర్చుకోవడం, నైపుణ్యాలు పెంచుకోవడంలో వెనుకబాటుకు పలు కారణాలు నివేదికలో పొందుపరిచారు. 34 శాతం మంది కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగతంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు 29 శాతం మంది చేస్తున్న పనిలో బిజీ వర్క్ షెడ్యూ ల్26 శాతం మంది నేర్చుకునేందుకు వనరులు, విధానాలు లెక్కకు మించి ఉండడంతో ఏదీ తేల్చుకోలేకపోవడంఈ పరిస్థితిని అధిగమించాలంటే ‘లౌడ్ లెర్నింగ్’» పని ప్రదేశాల్లో లేదా ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో అక్కడే మౌఖికంగా లేదా ఇతర కొత్త విషయాలను అర్థమయ్యేలా చేయగలిగితే అధిక ప్రయోజనం ఉంటుందన్నారు. » తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఈ విధానం తమకు ఉపయోగపడుతుందని 81 శాతం మంది చెప్పారు. » ఈ విధానంలో నిమగ్నమై కొత్త విషయాలను నేర్చుకుంటున్నవారు 64 శాతం ఉన్నట్టుగా నివేదిక చెబుతోంది.» ‘లౌడ్ లెర్నింగ్’లో భాగంగా తమ టీమ్ సభ్యుల నుంచి మెళకువలు నేర్చుకోవచ్చునని 40 శాతం మంది చెప్పగా, 35 శాతంమంది తాము నేర్చుకునే విషయాలకు సంబంధించి టీమ్ సభ్యులకు వివరించడం ద్వారా అంటున్నారు. » అనుభవజ్ఞులైన వృత్తినిపుణుల గైడెన్స్లో నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా 28 శాతం మంది తమ కెరీర్లో ముందుకెళ్లేందుకు దోహదపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. » నైపుణ్యాల మెరుగుదలతో కొత్త వృత్తుల్లో అవకాశాలు లభిస్తాయని 27 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. » తమతో పనిచేస్తున్న వృత్తినిపుణులు, ఉద్యోగుల అనుభవసారం, ఆయా అంశాలపై వారికున్న విషయ దృష్టిని గ్రహించడం ద్వారా ప్రయోజనం చేకూరుతోందంటున్న 26 శాతం మంది చెప్పారు. -
Budget 2024: పన్నుల తగ్గింపు యోచనలో ప్రభుత్వం!
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొన్ని వర్గాల ప్రజలకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని యోచిస్తోందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక నివేదికలో తెలిపింది.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 ఆర్థిక సంవత్సరానికి పూర్తి కేంద్ర బడ్జెట్ను వచ్చే జులై నెలలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా కొత్త ఆదాయపు పన్ను రేట్లను ప్రకటించే అవకాశం ఉంది. వ్యక్తిగత పన్ను తగ్గింపు వల్ల ఆర్థిక వ్యవస్థలో వినియోగం పెరుగుతుందని, మధ్యతరగతికి పొదుపు పెరుగుతుందని నివేదిక పేర్కొంది.వార్షికాదాయం రూ.15 లక్షలు కంటే ఎక్కువ పొందేవారు పన్ను ఉపశమనం పొందే కేటగిరీలో ఉన్నారని, అత్యధిక పన్ను పరిమితి ఆదాయం ఎంత ఉండాలన్నది ఇంకా నిర్ణయించలేదని నివేదిక తెలిపింది. రూ.10 లక్షల వార్షికాదాయానికి ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని, పాత పన్ను విధానంలో అత్యధికంగా 30 శాతం పన్ను విధించే ఆదాయానికి కొత్త పరిమితిపై చర్చిస్తున్నట్లు నివేదిక తెలిపింది.2020లో ప్రారంభించిన పన్ను విధానంలో ప్రభుత్వం మార్పులు చేయవచ్చు. దీని ప్రకారం.. రూ .15 లక్షల వరకు వార్షిక ఆదాయంపై 5 శాతం నుంచి 20 శాతం పన్ను, రూ .15 లక్షలకు పైగా ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తున్నారు. ఒక వ్యక్తి ఆదాయం రూ .3 లక్షల నుంచి రూ .15 లక్షలకు ఐదు రెట్లు పెరిగినప్పుడు ఆదాయపు పన్ను రేటు మాత్రం ఆరు రెట్లు పెరుగుతుంది. ఇది చాలా తీవ్రమైనదంటూ నివేదిక పేర్కొంది. -
వృద్ధాప్యం బరువై.. ఆదరణ కరువై..
సాక్షి, హైదరాబాద్: పండుటాకులకు ఎంత కష్టం.. జీవనయానం ఎంత దయనీయం.. మలిసంధ్య వేళ వెలుగురేఖల్లేక అంధకారం అలముకుంది. వృద్ధాప్యం బరువైంది.. ఆదరణ కరువైంది. వృద్ధులను నిరాదరణ, నిర్లక్ష్యం ఆవరించాయి. అనువైన జీవనం కోసం ఎక్కువ శాతం మంది వృద్ధులు సంరక్షకులపై ఆధారపడాల్సి వస్తోందని హెల్ప్ఏజ్ ఇండియా నివేదిక వెల్లడించింది. హెల్ప్ ఏజ్ ఇండియా ఈ ఏడాది జాతీయ నివేదిక విడుదల చేసింది. పది రాష్ట్రాల్లో 20 ముఖ్యమైన టైర్ 1, 2 నగరాల్లో 5,169 వృద్ధులు, 1,333 వృద్ధుల సంరక్షకులు, కుటుంబసభ్యులపై అధ్యయనం చేసింది. ఈ సర్వేలో భాగంగా పలు కీలక ఆరి్థక, ఆరోగ్య, ప్రాథమిక సంరక్షణ విషయాలు వెలుగుచూశాయి. ప్రతి ముగ్గురు వృద్ధుల్లో ఒకరు ఆరి్థక సమస్యల్లో ఉన్నారు. వృద్ధుల్లో ఎలాంటి ఆదాయంలేని పురుషులు 27 శాతం, మహిళలు 38 శాతం ఉన్నారు. 32 శాతం వృద్ధులు రూ.50 వేల కంటే తక్కువ వార్షిక ఆదా యం కలిగి ఉన్నారు. 29 శాతం వృద్ధులు మా త్రమే సామాజిక భద్రతా పథకాలైన వృద్ధాప్య పెన్షన్/కాంట్రిబ్యూటరీ పెన్షన్/ప్రావిడెంట్ ఫండ్లను పొందుతున్నారని సర్వే వెల్లడించింది. నిరక్షరాస్యులైన వృద్ధులు (40 శాతం) ఎలాంటి ఆదాయ వనరులు లేక అవస్థలు పడుతున్నారు. 54 శాతం మందికి వ్యాధులు 52 శాతం వృద్ధులు ఆరోగ్యపరంగా నిత్యం ఏదో ఒక ప్రాథమిక సవాలును ఎదుర్కొంటున్నారు. 54 శాతం మంది రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నారు. 31 శాతం మంది వృద్ధులు మాత్రమే ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్, ఈఎస్ఐ–సీజీహెచ్ఎస్ వంటి ఆరోగ్య బీమాలను కలిగి ఉంగా, 3 శాతం మంది మాత్రమే కమర్షియల్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినట్లు నివేదించారు. ఆరోగ్య బీమా లేకపోవడానికి ప్రధాన కారణాలుగా అవగాహన లేకపోవడం(32%), ఆరి్థక స్థోమత లేకపోవడం (24%), దాని అవసరం లేకపోవడం (12%) అని గుర్తించారు. 1.5 శాతం మంది మాత్రమే టెలీ–హెల్త్ సేవలను ఉపయోగించారు. 79 శాతం మంది వృద్ధులు ప్రభుత్వ ఆసుపత్రులు/క్లినిక్లు/పీహెచ్సీలను సందర్శించారు. 80 ఏళ్లు పైబడిన 47 శాతం మందికి ఆసుపత్రులకు వెళ్లడానికి వ్యక్తిగత ఆదాయం లేక అవస్థలను ఎదుర్కొంటున్నారని హెల్ప్ఏజ్ ఇండియా పాలసీ రీసెర్చ్ అండ్ అడ్వకేసీ హెడ్ అనుపమ దత్తా వెల్లడించారు. నిరక్షరాస్యులపట్ల నిర్లక్ష్యం వృద్ధులు నిర్లక్ష్యానికి గురికావడంలో కుమారులు 42 శాతం, కోడళ్లు 28 శాతం కారణంగా ఉన్నారు. నిర్లక్ష్యం ఎదుర్కొన్నవారిలో అత్యధికులు నిరక్షరాస్యులు కాగా, వృద్ధుల ఆదాయం తగ్గడంతో వారిపై నిర్లక్ష్యం పెరిగిందని 73 శాతం బాధితులు నివేదించారు. ఈ బాధితులు (94 శాతం మంది) కనీసం ఒక దీర్ఘకాలిక వ్యాధికి గురికావడం వల్ల కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారని వెల్లడైంది. నిర్లక్ష్యానికి గురైన బాధితులు.. వారిని దూషించడం, కొట్టడం వంటి చర్యలను తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియజేయగా, పరిష్కారం లభించలేదని కుమిలిపోతున్నారు. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు చాలా అత్యల్పమని హెల్ప్ఏజ్ ఇండియా సీఈఓ రోహిత్ ప్రసాద్ పేర్కొన్నారు. మంచాన పడినప్పుడువృద్ధుల సంరక్షణలో కుటుంబసభ్యులు ప్రాథమిక పాత్ర పోషించారని సర్వే తెలిపింది. వృద్ధులు మంచాన పడినప్పుడు వారి జీవిత భాగస్వామి లేదా పిల్లలు చూసుకున్నారని, 68 శాతం మంది సంరక్షకులు వారికి బాసటగా నిలిచామని తెలిపారు. సగటున వారంలో దాదాపు 20 గంటలు వారి సేవలకే అంకితం చేశామని సంరక్షకులు తెలిపారు. అయితే సంరక్షణలో భాగంగా 10 శాతం మంది మాత్రమే సమీపంలో వృద్ధాశ్రమం, డే కేర్ సెంటర్లు, పాలియేటివ్ కేర్(ఉపశమన సేవలు) వినియోగించుకున్నారని వెల్లడైంది. జెరియాట్రిక్ హెల్త్కేర్ సౌకర్యాలను 15 శాతం మంది మాత్రమే అందించారు. -
అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్!.. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో సహా వచ్చే మూడేళ్లలో 6.7 శాతం స్థిరమైన వృద్ధిని నమోదు చేయడం ద్వారా భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇండియా ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని వరల్డ్ బ్యాంకు మంగళవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది.భారత్ 2023-24 ఆర్థిక సంవత్సరం వృద్ధి 8.2 శాతానికి చేరుకుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. ఇది జనవరిలో నిపుణులు అంచనా వేసినదానికంటే 1.9 శాతం ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. 2025-26లో 2.7 శాతానికి చేరుకునే ముందు 2024లో వృద్ధి 2.6 శాతం వద్ద స్థిరంగా ఉంటుందని పేర్కొంది.భారతదేశంలో ప్రాంతీయ వృద్ధి కూడా గణనీయంగా పెరుగుతోంది. బంగ్లాదేశ్లో వృద్ధి పటిష్టంగా ఉంటుంది. అయితే పాకిస్తాన్, శ్రీలంకలు నెమ్మదిగా బలపడే సూచనలు ఉన్నాయి. ఇండియా మాత్రమే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుందని వెల్లడించింది.వ్యవసాయోత్పత్తి పుంజుకోవడం, ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల ప్రైవేట్ వినియోగ వృద్ధి ప్రయోజనం పొందుతుందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. జేడీపీకి సంబంధించి ప్రస్తుత వ్యయాన్ని తగ్గించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ వినియోగం నెమ్మదిగా మాత్రమే పెరుగుతుందని అంచనా వేశారు.ప్రపంచ ద్రవ్యోల్బణం 2024లో 3.5 శాతం.. 2025లో 2.9 శాతానికి మధ్యస్థంగా ఉంటుందని అంచనా వేశారు. ఈ క్షీణత కేవలం ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత వేగంగా పుంజుకుంటుందని.. అయితే కేంద్ర బ్యాంకులు పాలసీ వడ్డీ రేట్లను తగ్గించడంలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. -
2030 నాటికి జాబ్ మార్కెట్ షేక్.. కలవరపెడుతున్న రిపోర్ట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వచ్చే దశాబ్దంలో జాబ్ మార్కెట్లో గణనీయమైన మార్పులకు కారణమవుతుంది. మెకిన్సే నివేదిక ప్రకారం.. 2030 నాటికి సుమారు 1.2 కోట్ల వృత్తిపరమైన పరివర్తనలకు దారితీస్తుంది. ఇది కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కనిపించిన ఉద్యోగ మార్పులతో పోల్చదగిన వేగం.మెకిన్సే సీనియర్ పార్ట్నర్, దాని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ క్వైలిన్ ఎలిన్గ్రుడ్ ఇటీవల జరిగిన మీడియా డే సందర్భంగా ఈ విషయాలను పంచుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పురోగతి కారణంగా కొన్ని రంగాలు ముఖ్యంగా హెల్త్ కేర్, స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) రంగాలు వృద్ధిని చవిచూస్తాయని భావిస్తున్నారు.ప్రభావితమయ్యే రంగాలు ఇవే..ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావిత ఉద్యోగ మార్పులు ప్రధానంగా నాలుగు ప్రధాన విభాగాలలో కేంద్రీకృతమై ఉంటాయి. అవి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెన్స్, కస్టమర్ సర్వీస్ అండ్ సేల్స్, ఫుడ్ సర్వీస్ అండ్ ప్రొడక్షన్, మ్యాన్యుఫ్యాక్చరింగ్. ఈ విభాగాల్లో పునరావృత పనులు, డేటా కలెక్షన్, ప్రాథమిక డేటా ప్రాసెసింగ్ నిర్వహించే వారిపై మార్పు ప్రభావం ఉంటుందని ఎల్లిన్గ్రుడ్ పేర్కొన్నారు. ఈ విధులు ఆటోమేషన్కు ప్రధాన లక్ష్యమని, వీటిని ఏఐ సమర్థవంతంగా నిర్వహించగలదని ఆమె చెబుతున్నారు. 2030 నాటికి డిమాండ్ తగ్గుతున్న ఉద్యోగాల్లోని సుమారు 1.18 కోట్ల మంది కొత్త పనులకు మారాల్సి ఉంటుందని మెకిన్సే నివేదిక అంచనా వేసింది.ఈ మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఎలిన్గ్రుడ్ ఎత్తిచూపారు. అభివృద్ధి చెందుతున్న జాబ్ ల్యాండ్ స్కేప్ గురించి తెలుసుకోవడం, ఆటోమేషన్ కు తక్కువ అవకాశం ఉన్న నైపుణ్యాలను పెంపొందించుకోవడం వ్యక్తులకు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. మానవ సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ను యంత్రాలు భర్తీ చేయలేవు. ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టాలని ఆమె సూచిస్తున్నారు. -
రుచిగా ఉంటే తినేయడమే!
సాక్షి, అమరావతి: భారతీయుల ఆహార అలవాట్లు వేగంగా మారుతున్నాయి. ప్రపంచానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేసిన వేద భూమి.. అనారోగ్యకర వంటకాల వైపు పరుగులు పెడుతోంది. దేశంలో 38 శాతం మంది వేయించిన, ప్రాసెస్ చేసిన పదార్థాలను అధికంగా ఆరగించేస్తున్నారు. కేవలం 28 శాతం మంది మాత్రమే ఆరోగ్యకరమైన పిండి ప్రధాన ఆహారం, కూరగాయలు, పండు, పప్పు, గింజ, మాంసాన్ని ఆహారంగా తీసుకుంటున్నారు. దేశ జనాభాలో 16.6 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్పీఆర్ఐ) తాజాగా ప్రపంచ దేశాల్లోని ఆహార అలవాట్లపై సర్వే చేసి విడుదల చేసిన ‘గ్లోబల్ ఫుడ్ పాలసీ రిపోర్టు–2024’ పేర్కొంది. భారతదేశంలో ఆహారపు అలవాట్లపై ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పోషకాహారంతో పోలిస్తే అనారోగ్యకరమైన ఆహార వినియోగంలో గణనీయమైన పెరుగుదల నమోదైందని పేర్కొంది. కూరగాయలు, పండ్లు, ఇతర సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునే వారితో పోలిస్తే భారతదేశంలో ఎక్కువ మంది ఉప్పు లేదా వేయించిన స్నాక్స్ వంటి అనారోగ్యకరమైన ఆహారాన్నే ఇష్టపడుతున్నారని ప్రకటించింది. ప్రపంచంలో పెరుగుతున్న పోషకాహార లోపం చాలా దేశాలు రెట్టింపు పోషకాహార లోప భారాన్ని ఎదుర్కొంటున్నాయని గ్లోబల్ ఫుడ్ పాలసీ నివేదిక నొక్కి చెప్పింది. ఆఫ్రికా, దక్షిణాసియాలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారని.. రెండు బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలపై చేసిన పరిశోధన ద్వారా అంచనా వేసింది. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో సగానికి పైగా, వయోజన మహిళల్లో మూడింట రెండొంతుల మంది సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతున్నట్టు ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తేల్చింది. భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దక్షిణాసియా దేశాల్లో పోషకాహార లోపంతో అధిక బరువు, ఊబకాయంతో పాటు సంబంధిత నాన్ కమ్యూనల్ డిసీజెస్ (ఎన్సీడీ) ప్రాబల్యం పెరుగుతున్నట్టు వెల్లడించింది. దక్షిణాసియాలో సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు ఖరీదైనవి కాగా.. ధాన్యాలు, కొవ్వులు, నూనె, చక్కెర, స్వీట్ అండ్ సాల్ట్ ఉండే చిరుతిళ్లు చౌకగా లభిస్తున్నట్టు నివేదిక పేర్కొంది. దాంతో ప్రజలు ఈ తరహా ఆహార వినియోగంపై మక్కువ చూపుతున్నట్టు తేల్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇటీవల విడుదల చేసిన ఆహార మార్గదర్శకాల ప్రకారం ప్యాకేజ్డ్ ఫుడ్పై అందించిన సమాచారం కూడా ప్రజలు పట్టించుకోవడం లేదని హెచ్చరించింది. సంస్థ అందించిన 17 ఆహార మార్గదర్శకాలలో సమాచారం, ఆరోగ్యకరమైన ఆహార ఎంపిక చేయడానికి ఆహార లేబుల్స్పై సమాచారాన్ని చదవమని ఐసీఎంఆర్ వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు, అ్రల్టా–ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగాన్ని తగ్గించాలని కూడా సూచించింది. రోజువారీగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే సమీప భవిష్యత్లో అనారోగ్య భారతదేశాన్ని చూడాల్సి ఉంటుందని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో హెచ్చరించింది. నాలుగేళ్లలో ప్యాకేజ్డ్ ఫుడ్ వినియోగం రెట్టింపు నిత్యం తీసుకుంటున్న ఆహారంలో అధిక కేలరీలు గలవి, తక్కువ పోషకాలు గలవి ఎక్కువగా ఉంటున్నాయని నివేదిక పేర్కొంది. అంతేకాకుండా కూరగాయలు, ఇతర సూక్ష్మపోషకాలు అధికంగా ఉండే ఆహారాల వినియోగం తగ్గిపోతున్నట్టు కూడా హెచ్చరించింది. భారతదేశం, ఇతర దక్షిణాసియా దేశాల్లో ప్రాసెస్ చేసిన ఆహారాలు (చాక్లెట్లు, చక్కెర మిఠాయిలు, ఉప్పగా ఉండే స్నాక్స్, పానీయాలు, రెడీమేడ్ ఫుడ్) వినియోగం పెరుగుతోంది. ఆహార బడ్జెట్లో ఎక్కువ భాగం ప్యాకేజ్డ్ పాలు, స్నాక్స్ రెడీమేడ్ ఫుడ్కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు తేల్చింది. భారతదేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారు పెరుగుతున్నట్టు నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పెద్దవారిలో అధిక బరువు పెరుగుదల 2006లో 12.9 శాతం నుంచి 2016 నాటికి 16.4 శాతానికి పెరిగింది. పోషకాహార లోపంతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది పోషకాహార లోపంతో బాధపడే వారు 2011లో 15.4 శాతం ఉంటే.. 2021 నాటికి 16.6 శాతానికి పెరిగింది. జనాభాలో దాదాపు 17 శాతం మందికి జీవించేందుకు అవసరమైన ఆహారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటికి దూరంగా ఉంటున్నవారు ఆహారం, గృహావసరాల కోసం చేస్తున్న వార్షిక ఖర్చు 2015లో రూ.619 బిలియన్స్ ఉంటే, 2019లో అది రూ.820 బిలియన్లకు పెరిగింది. అంటే నాలుగేళ్లలో రూ.201 బిలియన్ల మేర పెరిగింది. అలాగే గృహ ఆహార బడ్జెట్లో ప్యాకేజ్డ్ (అత్యధికంగా ప్రాసెస్ చేసిన, అత్యధిక క్యాలరీలు ఉండేవి) ఆహార పదార్థాల వాటా 6.5 శాతం నుంచి 12 శాతానికి పెరిగింది. అంటే నాలుగేళ్లలో దాదాపు రెండింతలు పెరిగింది. సంపన్న కుటుంబాలు తమ ఆహార బడ్జెట్లో ఎక్కువ భాగం ప్రాసెస్ ఫుడ్పైనే ఖర్చు చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. -
విదేశాలకే వి‘హారం’
సాక్షి, అమరావతి: భారతీయులు విదేశీయానాల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. 2019తో పోలిస్తే జపాన్లో 53 శాతం, అమెరికాలో 59 శాతం, వియత్నాంలో 248 శాతం భారతీయ ప్రయాణికులు రాకపోకలు పెరగడం విశేషం. మాస్టర్ కార్డ్ ఎకనామిక్స్ ఇన్స్టిట్యూట్ ‘బ్రేకింగ్ బౌండరీస్’ పేరుతో తాజా ట్రావెల్ ట్రెండ్స్ను విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయులు అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. ఆదాయాన్ని మెరుగు పరచుకోవడంతో విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులు సంఖ్య ట్రావెల్, టూరిజం రంగానికి ఊతమిస్తోందని నివేదిక పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల మందికిపైగా మధ్య తరగతి ప్రజలు (ఏడాదికి రూ.12 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నవారు). దాదాపు 20 లక్షల మంది అధిక ఆదాయ ప్రజలు (ఏటా రూ.66 లక్షలు కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారు) కూడా అంతర్జాతీయ ప్రయాణికుల జాబితాలో చేరతారని అంచనా వేసింది. విస్తరిస్తున్న విలాసవంతమైన ఆలోచనలు ఔట్ బౌండ్ ఇండియా ట్రావెల్ రంగాన్ని అసాధారణ వృద్ధిలోకి తీసుకెళ్తున్నాయని అభిప్రాయపడింది. తొలి త్రైమాసికంలో 10 కోట్ల మంది ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే సుమారు 10 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒక దశాబ్దం కిందటి వరకు ఈ సంఖ్యలో ప్రయాణాలు చేయాలంటే ఏడాది సమయం పట్టేది. అంటే భారతీయుల్లో ఏ స్థాయిలో ప్రయాణాలు వృద్ధి చెందాయో నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి దేశీయ ప్రయాణాలు 21శాతం, విదేశీ ప్రయాణాలు 4 శాతం మేర పెరిగినట్టు గుర్తించింది. ఆమ్స్టర్డామ్, సింగపూర్, లండన్, ఫ్రాంక్ఫర్డ్, మెల్బోర్న్లు ఈ వేసవి (జూన్–ఆగస్టు)లో భారతీయ ప్రయాణికులు సందర్శించే ఐదు ట్రెండింగ్ గమ్యస్థానాలుగా నిలవడం విశేషం. 2019, 2020లో ఒక పర్యటన సగటు వ్యవధి నాలుగు రోజులుగా ఉంటే ఈ ఏడాది ఐదు రోజులకు పెరిగింది. పెరిగిన క్రూయిజ్ ప్రయాణాలు ప్రపంచ వ్యాప్తంగా చూస్తే యూరోపియన్ చాంపియన్íÙప్ కారణంగా 2024లో జర్మనీలోని మ్యూనిచ్ టాప్ ట్రెండింగ్ డెస్టినేషన్గా నిలిచింది. గత మార్చికి ముందు 12 నెలల్లో ప్రజలు అత్యధికంగా ప్రయాణించిన గమ్యస్థానంగా జపాన్ నిలిచింది. ముఖ్యంగా ఐదు మార్కెట్లలో నాలుగు యూరోపియన్ గమ్యస్థానాలు, టాప్ 10లో 50 శాతం ఆసియా–పసిఫిక్ గమ్యస్థానాలు ఉన్నాయి. గడిచిన ఏడాది అత్యధికంగా ప్రయాణికులను ఆకర్షించిన గమ్యస్థానాల్లో జపాన్, ఐర్లాండ్, రొమేనియా, ఇటలీ, స్పెయిన్, మలేషియా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, యూఏఈ, ఇండోనేషియా నిలిచాయి. అయితే విదేశీ సందర్శకుల రికవరీలో అమెరికా 2019తో పోలిస్తే 6 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. హోటల్ పరిశ్రమలలో నిరంతరం ధరల పెరుగుదల కారణంగా క్రూయిజ్ ప్రయాణాలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గ్లోబల్ క్రూయిజ్ ప్యాసింజర్ లావాదేవీల సంఖ్య 2019 కంటే దాదాపు 16 శాతం పెరిగాయి. -
వన సంపదకు పెద్ద ఆపద!
సాక్షి, అమరావతి: ప్రకృతికి మనిషి హాని తలపెడుతున్నాడు. తద్వారా తన ఉనికిని తానే దెబ్బతీసుకుంటున్నాడు. జంతుజాలాన్ని బతకనివ్వడం లేదు. మనిషి స్వార్థం వృక్షజాలాన్నీ వదలడం లేదు. తత్ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. వృక్షజాలమూ బోసిపోతోంది. అక్రమ వ్యాపారుల దుశ్చర్యలకు పర్యావరణం సమతౌల్యాన్ని కోల్పోతోంది. 2015–2021 మధ్య కాలంలో 162 దేశాల్లో యథేచ్ఛగా జంతు, వృక్షజాతుల అక్రమ వాణిజ్యం జరిగినట్టు ఐక్యరాజ్య సమితి నివేదిక చెబుతోంది. దాదాపు 4 వేలకు పైగా జంతు, వృక్షజాతులు నిత్యం అక్రమ రవాణాలో పట్టుబడుతున్నట్టు ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ విడుదల చేసిన వరల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్–2024లో పేర్కొంది. వీటిల్లో సుమారు 3,250 రకాలు అంతరించిపోతున్న జాతుల్లో ఉండటం కలవరపెడుతోంది. ఫ్యాషన్ ఉత్పత్తులు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువుల తయారీ, ఔషధాల కోసం చట్ట విరుద్ధంగా అడవుల్లోని జీవజాలాన్ని మట్టుబెడుతున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ఖడ్గమృగం, దేవదారు వృక్షాలు అక్రమ వ్యాపారానికి ఎక్కువగా అంతరించిపోయినట్లు తేల్చింది. బ్లాక్ మార్కెట్లో ఖడ్గమృగం కొమ్ము 29 శాతం డిమాండ్తో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పాంగోలిన్ స్కేల్స్ 28 శాతం, ఏనుగు దంతాలు 15 శాతంగా ఉన్నాయి. అక్రమ రవాణాకు తెగటారిపోతున్న జంతు, వృక్షజాలం అక్రమ వ్యాపారానికి బలవుతున్న జంతు జాతుల్లో ఏనుగులు (6 శాతం), ఈల్స్ (5 శాతం), మొసళ్లు (5 శాతం), చిలుకలు, కాకాటూలు (2 శాతం), సింహాలు, పులుల వంటి ఇతర మాంసాహార జంతువులు (2 శాతం), తాబేళ్లు (2 శాతం), పాములు (2 శాతం), సీహార్స్ చేపలు (2 శాతం) ఉన్నాయి. అక్రమ రవాణాలో ధూపం, పరిమళ ద్రవ్యాలు, కలప, ఔషధాల వినియోగానికి దేవదారు, మహోగని, హోలీ వుడ్, గుయాకం వృక్ష జాతులు యథేచ్ఛగా నరికి వేస్తున్నారు. మార్కెట్లో వీటి వాటా 47 శాతంగా ఉంది. ఇంకా రోజ్వుడ్ 35 శాతం, ఔషధ మొక్కలు అగర్వుడ్ , రామిన్, యూకలిప్టస్ 13 శాతంగా ఉన్నాయి. సముద్ర జీవులకు ఆవాసాన్ని కల్పించడంతో పాటు తీరప్రాంతాన్ని కోత నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషించే పగడపు దిబ్బలనూ అక్రమ వ్యాపారులు తొలిచేస్తున్నారు. అక్రమ రవాణాలో ఈ పగడాల వాటా 16 శాతంగా ఉంటోంది. గత దశాబ్దంలో ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ముల వేట తగ్గినట్టు నివేదిక చెబుతోంది. మార్కెట్లోనూ ధరలు క్షీణించినట్టు తెలిపింది. కరోనా కాలంగా చైనా మార్కెట్లు మూసివేయడంతో ఇది జరిగి ఉండవచ్చని భావిస్తోంది. దేశ సరిహద్దుల్లో అక్రమ రవాణా గుర్తింపు భారత్లోనూ విమానాశ్రయాలు, ఓడరేవులు, దేశ సరిహద్దు రాష్ట్రాలైన మిజోరం, మణిపూర్లలో ఎక్కువగా వన్యప్రాణుల అక్రమ రవాణాను గుర్తించారు. స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్టు 2022–23 ప్రకారం 1,652 క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచర జాతులను స్వా«దీనం చేసుకున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పేర్కొంది. వీటిల్లో 40 శాతానికి పైగా అత్యంత ప్రమాదంలో ఉన్న జాతులుగా పేర్కొంది. సజీవంగా ఉన్న జంతువులు ముఖ్యంగా పెంపుడు జంతువులకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతున్నందుకు దేశంలో అక్రమ వ్యాపారం పెరిగినట్టు వన్య ప్రాణుల నేర నియంత్రణ నిపుణులు చెబుతున్నారు. -
AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
సాక్షి, విజయవాడ: ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 150 పేజీల ప్రాథమిక నివేదికను సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీకి అందజేశారు. సిట్ ప్రాథమిక నివేదికలో పోలీసుల వైఫల్యాలు బయటపడ్డాయి. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేపట్టింది. నాలుగు బృందాలుగా మూడు జిల్లాల్లో పర్యటించిన సిట్.. 33 ఘటనలలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, సీసీ కెమెరాలను పరిశీలించింది.ఈ అల్లర్లలో 1370 మంది నిందితులకు 124 మందినే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 639 మంది నిందితులను ఇంకా గుర్తించాల్సి ఉందని సిట్ పేర్కొంది. 1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన సిట్.. దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించింది.రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్.. రెండు గ్రూపుల మధ్య రాళ్ల దాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొంది. ప్లీ ప్లాన్డ్గానే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తించింది. దాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదిక పేర్కొంది.ఎన్నికలకి ముందు పోలీస్ అధికారుల బదిలీలే ఘటనలకు కారణంగా సిట్ నివేదికలో వెల్లడించింది. పరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సూచించిన సిట్.. కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు జోడించాలని పేర్కొంది. సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను డీజీపీ ఆదేశించారు. -
ఏపీ పోలింగ్ ఘటనలు: డీజీపీకి సిట్ ప్రాథమిక నివేదిక అందజేత
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక విచారణ బృందం(సిట్) నేటితో ముగియనుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తాకు సిట్ ఇన్చార్జి.. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నివేదికను అందజేశారు. 150 పేజీల ప్రాధమిక నివేదికను డీజీపీకి అందజేశారు. ఈ నివేదకను డీజీపీ.. ఈసీకి పంపనున్నారు. కాగా రాష్ట్రంలో న్నికల అనంతరం హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు సిట్ విచారించిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు నాలుగు బృందాలుగా క్షేత్రస్థాయిలో పర్యటించింది సిట్. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో పర్యటించిన సిట్ బృందాలు.. హింసాత్మక ఘటనలకు కారణాలను విశ్లేషిస్తూ ప్రాథమిక నివేదిక రూపొందించింది. అయితే రెండ్రోజుల్లో సమాచార సేకరణకే సమయం సరిపోవడంతో లోతైన దర్యాప్తు కోసం గడువు పొడిగించాలని సిట్ బృందం డీజీపీని కోరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల పరిధిలోని పీఎస్లలో నమోదు అయిన 33 ఎఫ్ఐఆర్లను సిట్ పరిశీలించింది. వీటి ఆధారంగా 300 మందిని ఈ హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్లు నిర్ధారించుకుంది. ఇందులోనూ 100 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు.. పరారీలో ఉన్న మిగతా వాళ్ల కోసం పోలీస్ బలగాలు గాలింపు చేపటినట్లు సిట్ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. అదే సమయంలో పోలీసులకు సిట్ బృందాలు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.ఇక క్షేత్రస్ధాయి పర్యటనలో కీలక సమాచారాన్ని రాబట్టిన సిట్ బృందాలు.. సీసీ కెమెరాల ఫుటేజీలను సైతం క్షుణ్ణంగా పరిశీలించింది. హింసాత్మక ఘటనలు ముందస్తుగా ఊహించడంలో పోలీస్ఉన్నతాధికారుల వైఫల్యంపైనా పరిశీలన చేసింది. సస్పెండ్ అయిన పల్నాడు జిల్లా ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ల పనితీరుపైనా సిట్ అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. హింసాత్మక ఘటనల సమయంలో పోలీసుల ఉదాసీనతపైనా నివేదిక అందించింది. నేర స్వభావం కలిగిన వ్యక్తులని పూర్తిస్ధాయిలో బైండోవర్ చేయడంలో విఫలమయ్యారని ఆరోపించింది. ప్లీప్లాన్గానే హింసాత్మక ఘటనలు జరిగాయని, కర్రలు, రాళ్లు వంటివి ముందుగానే సిద్దం చేసుకోవడం ద్వారా హింసికు పాల్పడ్డారని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఈసీ నిర్ణయంపై ఉత్కంఠఈసీ ఆదేశాలనుసారం సిట్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం సిట్కు పూర్తి అధికారులు అప్పగించింది. రెండ్రోజుల గడువులో క్షేత్రస్థాయి సమాచార సేకరణ మాత్రమే చేపట్టింది. ప్రధాన ఘటనలకు సంబంధించిన దర్యాప్తును మాత్రమే సిట్ సమీక్షించింది. అయితే ఈ అల్లర్ల వెనుక ఉన్న కుట్రను చేధించాలన్నా.. హింసకు కారణమైన రాజకీయ పెద్దలను గుర్తించాలన్నా పూర్థిస్తాయిలో దర్యాప్తు అవసరం. అందుకే గడువు పొడిగించాలని సిట్ ఇన్చార్జి వినీత్ బ్రిజ్లాల్ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే డీజీపీ ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. దీంతో ఈసీ సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటుందా? లేదంటే పూర్తిస్థాయి దర్యాప్తు నివేదిక వచ్చేదాకా ఎదురు చూస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. -
హర్యానాలో కర్ఫ్యూ విధించిన సూర్యుడు
హర్యానాలో వేసవి తాపం బీభత్సం సృష్టిస్తోంది. దీంతో పగటిపూట ఎక్కడ చూసినా కర్ఫ్యూ లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చండీగఢ్తో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణీయంగా పెరిగాయి. దేశంలోని హాటెస్ట్ నగరాల్లో హర్యానాలోని నుహ్ రెండో స్థానంలో ఉంది. దేశంలోనే అత్యంత వేడిగా ఉండే నగరంగా యూపీలోని ఆగ్రా నిలిచింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం హర్యానాలోని 25 నగరాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే అధికంగా నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ హర్యానాలోని 11 జిల్లాల్లో మే 23 వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జాబితాలో మహేంద్రగఢ్, రేవారీ, గురుగ్రామ్, నుహ్, పల్వాల్, ఫరీదాబాద్, సిర్సా, ఫతేహాబాద్, హిసార్, భివానీ, చర్కి దాద్రీ జిల్లాలు ఉన్నాయి. పంచకుల, అంబాలా, యమునానగర్, కురుక్షేత్ర, కైతాల్, కర్నాల్, ఝజ్జర్, రోహ్తక్, సోనిపట్, పానిపట్, జింద్ 11 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.మరోవైపు అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు పలు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంబాలాలో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పగటిపూట మార్కెట్లు వెలవెల బోతున్నాయి. సాయంత్రం పూట కొద్దిసేపు మాత్రమే వ్యాపారం జరుగుతున్నదని దుకాణదారులు వాపోతున్నారు. ఒకప్పుడు సందడిగా ఉండే మార్కెట్లు ఇప్పుడు ఎండ వేడిమి కారణంగా నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి. -
టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
సాక్షి, అమరావతి: సరైన సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఉదయం 8 గంటలకు అల్పాహారం.. రాత్రి 8 గంటలకు చివరి భోజనం తీసుకోవడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఫ్రాన్స్లోని వర్సిటీ సోర్బన్ ప్యారిస్ నోర్డ్ అధ్యయనంలో భోజన సమయాలకు, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాలకు మధ్య గుట్టును నిర్ధారించింది.ముఖ్యంగా కార్డియోవాసు్కలర్ డిసీజెస్ (సీవీడీ)లో భాగంగా కొరోనరీ హార్ట్ డిసీజ్, సెరెబ్రోవాసు్కలర్ డిసీజ్, రుమాటిక్ హార్ట్ డిసీజ్ ప్రమాదాలను అరికట్టడానికి క్రమబద్ధమైన ఆహారపు అలవాట్లు మేలైన మార్గమని సూచిస్తోంది. నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురించిన ఈ ఫ్రెంచ్ అధ్యయనం ప్రకారం రాత్రిపూట ఎక్కువసేపు ఉపవాసంతో ఉంటే హృదయ సంబంధ వ్యాధుల ప్రభావాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఇందుకు నిద్రవేళకు దగ్గరగా భారీ భోజనాన్ని తగ్గించాలని హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపు.. శరీరంలోని వివిధ అవయవాల సిర్కాడియన్ లయలను సరి చేస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు నియంత్రణ వంటి కార్డియోమెటబాలిక్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఈ సిర్కాడియన్ రిథమ్ శరీరంలోని అంతర్గత గడియారంగా పని చేస్తుంది. లేటుగా తింటే చేటే.. అల్పాహారం దాటవేయడం, రోజులో మొదటి ఆహారాన్ని ఆలస్యంగా తీసుకోవడంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు తినేవారి కంటే 9 గంటలకు అల్పాహారం చేసే వ్యక్తికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం 6 శాతం ఎక్కువ. ఆలస్యంగా రాత్రి 8 గంటలకు బదులు 9 గంటలకు తినడం వల్ల ముఖ్యంగా మహిళల్లో పోలిస్తే స్ట్రోక్ వంటి సెరెబ్రోవాసు్కలర్ వ్యాధి వచ్చే ప్రమాదం 28 శాతం పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. రాత్రిపూట ఎక్కువ సేపు ఉపవాస సమయం ఉంటే సెరెబ్రోవాసు్కలర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చని, ఉదయం ప్రారంభ భోజనం మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీని, ఇన్ఫ్లమేషన్ను నివారించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తించారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం ద్వారా కాలక్రమేణా హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి తగ్గి గుండె పనితీరు మెరుగుపడుతుందని చెబుతున్నారు. భోజనం చేసే సమయం నిద్ర నాణ్యతను కూడా ప్రభావతం చేయడం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పొంచి ఉంటుందని పేర్కొన్నారు. ఐదో వంతు భారత్లోనే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నివేదిక ప్రకారం హృదయ సంబంధ వ్యాధుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 1.80 కోట్ల మరణాలు నమోదైతే.. ఇందులో ఐదో వంతు భారత్ నుంచే ఉన్నాయి. ముఖ్యంగా భారతీయ యువతలో గుండె సంబంధిత మరణాలు ఎక్కువయ్యాయి. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనంలోనూ భారత్లో ఒక లక్ష జనాభాకు 272 మంది హృదయ సంబంధ మరణాలు రేటు ఉంది. ఇది ప్రపంచ సగటు 235 కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. -
చేతులు కాలాక ‘సిట్’!
సాక్షి, అమరావతి: ఎన్నికల హింసపై ఎన్నికల కమిషన్ (ఈసీ) వ్యవహరిస్తున్న తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైంది! రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింసాకాండకు ఏకైక కారణం రాజకీయ ఒత్తిళ్లతో పోలీస్ ఉన్నతాధికారులను ఈసీ ఏకపక్షంగా బదిలీ చేయడమే! ఆ స్థానంలో వచ్చిన అధికారులకు క్షేత్రస్థాయి పరిస్థితులపై సరైన అవగాహన లేకపోవడంతోపాటు పచ్చముఠాల ఆగడాలను ఉపేక్షించడం వల్ల భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో నష్ట నివారణ చర్యలకు దిగిన ఈసీ ఆదేశాల మేరకు హింసాత్మక ఘటనలపై విచారణకు శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటైంది. ఎస్ఐబీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది పోలీసు అధికారులతో ఏర్పాటైన ‘సిట్’ రెండు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై ‘సిట్’ దర్యాప్తు చేయనుంది. హింస చెలరేగడంలో పోలీసు అధికారుల పాత్రను కూడా ‘సిట్’ నిగ్గు తేల్చనుంది. ఆయా చోట్ల నమోదు చేసిన కేసులు, విచారణ తీరుతెన్నులపై పరిశీలించి వాస్తవాలు తేల్చాలని సిట్కు స్పష్టం చేసింది. అదనపు సెక్షన్లు, అవసరమైతే కొత్త ఎఫ్ఐఆర్ల నమోదును సూచించాలని పేర్కొంది. ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు సిట్ విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. అనుకూల అధికారుల అండతో..‘సిట్’ ఏర్పాటు చేసి నష్టనివారణ చర్యలకు దిగేలా పరిస్థితులు మారడానికి ఈసీ తీసుకున్న నిర్ణయాలే ముఖ్య కారణంగా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు ముందు చంద్రబాబు, పురందేశ్వరి ఒత్తిళ్లకు తలొగ్గి ఎడాపెడా పోలీస్ అధికారులను మార్చేసి, వారి సూచనల మేరకు ఈసీ నియామకాలు చేపట్టింది. అనుకూల అధికారుల అండ చూసుకుని పల్నాడు, రాయలసీమతో పాటు ఇతర ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి.వైఎస్సార్సీపీ నాయకులు, ఆ పార్టీకి ఓటు వేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. పరిస్థితులు చేయి దాటాక ఈసీ మేల్కొంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా అనంతపురం, పల్నాడు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. మూడు జిల్లాల్లో 12 మంది పోలీసులపై సస్పెన్షన్ కొరడా ఝుళిపించింది. ఈ క్రమంలో సిట్ ఏర్పాటైంది. మొత్తం వ్యవహారంలో ఈసీ తీరు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో చెలరేగిన హింస, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఈసీ పక్షపాత వైఖరి ఫలితమేనని పరిశీలకులు పేర్కొంటున్నారు.ఒత్తిళ్లకు తలొగ్గి ఉదాశీనత..గత ఐదేళ్లుగా అన్ని వర్గాల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి పెద్దపీట వేసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జనరంజక పాలన అందించారు. ప్రజాదరణ కోల్పోయి దిక్కుతోచని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏం చేయాలో పాలుపోక దుష్ప్రచారాలతో పేట్రేగిపోయింది. ఎన్ని కుట్రలు చేసినా ప్రజాదరణ దక్కకపోవడంతో పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెద్ద ఎత్తున హింసకు చంద్రబాబు ప్రణాళిక రచించారు. ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పట్టున్న సమర్థులైన పోలీసు అధికారులు ఉంటే తమ పన్నాగాలు పనిచేయవని పసిగట్టి నిరాధాణ ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదులు చేశారు. పురందేశ్వరి సహకారంతో పల్నాడు, ప్రకాశం, తిరుపతి తదితర జిల్లాల్లో ఎవరిని నియమించాలో కూడా సూచిస్తూ ఏకంగా జాబితాను అందచేశారు. పచ్చముఠా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి డీజీపీ, నిఘా విభాగం ఇన్చార్జ్తో పాటు పలువురు డీఐజీ, ఎస్పీలను ఈసీ పక్కనపెట్టింది. టీడీపీతో సత్సంబంధాలున్న వారిని రాజకీయ ఒత్తిళ్లతో అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో నియమించింది. పల్నాడు ఎస్పీగా గరికపాటి బిందుమాధవ్ను నియమించడమే ఇందుకు నిదర్శనం. ఈ అధికారి నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. ఈ పార్లమెంట్ స్థానంలో వైఎస్సార్సీపీకి గట్టి పట్టు ఉంది. 2019లో ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు స్థానాలను పార్టీ స్వీప్ చేసింది. దీంతో అధికార పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా జరగకుండా నిలువరించేలా కృష్ణదేవరాయలు స్కెచ్ వేశారు. క్షేత్రస్థాయిలో తన సామాజికవర్గానికి చెందిన వారిని నియమించుకుని పల్నాడులో అరాచకానికి కృష్ణదేవరాయలు ముఖ్యకారణమయ్యారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చోద్యం చూసిన అధికారులు..అనుకూల అధికారి అండ చూసుకుని పల్నాడులోని నరసరావుపేట, మాచర్ల, గురజాల, కొత్త గణేశునిపాడులో టీడీపీ రౌడీ మూకలు రెచ్చిపోయాయి. పెట్రోలు బాంబులు, వేట కొడవళ్లు, బరిసెలు, బాకులు, ఇనుప రాడ్లతో స్వైర విహారం చేశాయి. వైఎస్సార్సీపీ సానుభూతిపరులు, ఆ పార్టీకి ఓటు వేసినట్లు భావించిన వారిపై యథేచ్ఛగా దాడులకు తెగబడ్డాయి. ఇంత జరుగుతున్నా పల్నాడు ఎస్పీ బిందు మాధవ్తోపాటు ఆయన ఆధ్వర్యంలోని డీఎస్పీలు, సీఐలు చోద్యం చూశారు. టీడీపీ మూకల నుంచి తమకు, ప్రజలకు రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఫోన్లు చేసినా పోలీసులు పెడచెవిన పెట్టారు.సీమలో వివాదాస్పదంఅనంతపురం జిల్లాలో కొందరు పోలీసుల తీరు వివాదాస్పదంగా మారింది. పోలింగ్కు ముందు ఈ జిల్లాకు అమిత్ బర్దర్ను ఎస్పీగా నియమించారు. తొలి నుంచి ఆయన టీడీపీకి కొమ్ముకాశారు. కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనంలో రూ.2 కోట్లు లభ్యమైతే కేసు నమోదు చేయకుండా తాత్సారం చేయడం ఆయన పచ్చపాత వైఖరికి నిదర్శనం. ఎన్నికల రోజు తాడిపత్రిలో టీడీపీ నాయకులు జేసీ ప్రభాకర్రెడ్డి, అస్మిత్రెడ్డి, దీపక్రెడ్డి పోలింగ్ కేంద్రాల్లో చొరబడి అక్రమాలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి నివాసంపై టీడీపీ గూండాలు రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలను నియంత్రించడంలో ఎస్పీ విఫలమయ్యారు. మరోవైపు పోలీసులు పెద్దారెడ్డి నివాసంలోకి చొరబడి విధ్వంసానికి పాల్పడ్డారు. వారి చర్యలు సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా ముందుగానే ధ్వంసం చేసిన ఫుటేజ్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరుపతి జిల్లాలో చంద్రగిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేసి ఆయన వాహన శ్రేణిలోని వాహనానికి నిప్పుపెట్టారు. ఇక్కడ కూడా అల్లర్లను కట్టడి చేయడంలో ఈసీ నియమించిన పోలీసు అధికారులు దారుణంగా విఫలమయ్యారు.13 మందితో ‘సిట్’సాక్షి, అమరావతి: ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై విచారణకు ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేసింది. ఎస్ఐబీ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది పోలీసు అధికారులతో ఏర్పాటైన ‘సిట్’ పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసపై విచారణ జరిపి రెండు రోజుల్లో ఎన్నికల కమిషన్కు నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో డీజీపీ ఆదేశించారు.‘సిట్’ సభ్యులు...1. రమాదేవి, ఎస్పీ, ఏసీబీ2. సౌమ్యలత, ఏఎస్పీ, ఏసీబీ3. రమణమూర్తి, డీఎస్పీ, ఏసీబీ, శ్రీకాకుళం4. పి.శ్రీనివాసులు, డీఎస్పీ, సీఐడీ5. వి.శ్రీనివాసరావు, డీఎస్పీ, ఏసీబీ, ఒంగోలు6. రవి మనోహరా చారి, డీఎస్పీ, ఏసీబీ, తిరుపతి7. వి.భూషణం, ఇన్స్పెక్టర్, గుంటూరు రేంజి8. కె.వెంకట్రావు, ఇన్స్పెక్టర్, ఇంటెలిజెన్స్, విశాఖ9. రామకృష్ణ, ఇన్స్పెక్టర్, ఏసీబీ10. జీఎల్ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్, ఏసీబీ11. మొయిన్, ఇన్స్పెక్టర్, పీటీసీ, ఒంగోలు12. ఎన్.ప్రభాకర్, ఇన్స్పెక్టర్, ఏసీబీ, అనంతపురం13. శివప్రసాద్, ఇన్స్పెక్టర్, ఏసీబీ -
ఇప్పట్లో మరమ్మతులు కష్టమే!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నిర్వహించాల్సిన అత్యవసర మరమ్మతులను సూచిస్తూ కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ తాజాగా మధ్యంతర నివేదిక సమర్పించినా.. మరమ్మతులు తక్షణమే ప్రారంభమయ్యే సూచన లు కనిపించడం లేదు. వానాకాలం ప్రారంభానికి నెల రోజులే మిగిలి ఉండగా, ఆలోగా అయ్యర్ కమిటీ సిఫారసు చేసిన తాత్కాలిక మరమ్మతులను పూర్తి చేయడం సాధ్యం కాదని నీటిపారుదల శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ నంబర్ బ్లాక్కు నిర్వహించే మరమ్మతులు తాత్కాలికమేని, మళ్లీ ఏదైనా జరగదని గ్యారెంటీ ఇవ్వలేమని అయ్యర్ కమిటీ తేల్చిచెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో కమిటీ నివేదికపై అధ్యయనం కోసం నీటి పారుదల శాఖలోని ఇంజనీర్లతో ఓ కమిటీని వేయా లని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం బ్యారేజీలకు మరమ్మతుల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అయ్యర్ కమిటీ చేసిన సిఫారసుల్లో కొన్నింటిని మాత్రమే వానాకాలం ప్రారంభానికి ముందు అమలు చేసేందుకు అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. కమిటీ సూచించిన పనులకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్ను తయారు చేసి ఆమోదం తీసుకోవడానికి చాలా సమయం పడుతుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆలోగా వర్షాకాలం ప్రారంభం అవుతుందని చెపుతున్నాయి. అయ్యర్ కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించిన తర్వాతే బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులను నిర్వహి స్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.మేడిగడ్డ బ్యారేజీ భవితవ్యంపై అయ్యర్ కమిటీ ప్రశ్నలు రేకెత్తించిన నేపథ్యంలో మరమ్మతులు చేపట్టిన తర్వాత ఏదైనా అనుకోని సంఘటన జరిగితే దానికి బాధ్యత వహించాల్సి వస్తుందనే భావనతో ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోంది. కాగా, మరో వారం రోజులు గడిచిన తర్వాతే మరమ్మతులు చేపట్టే అంశంపై కొంత స్పష్టత వచ్చే అవకాశముందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
తెలంగాణ: మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో బుధవారం(మే8) కూడా భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురవచ్చని పేర్కొంది.పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్. నాగర్ కర్నూల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని తెలిపింది. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. కాగా రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షం ప్రభావంతో జిల్లాల్లో పంట నష్టపోయి రైతులు ఇబ్బంది పడగా హైదరాబాద్ నగరంలో తీ వ్ర ట్రాఫిక్జామ్లతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. -
240 కోట్ల కార్మికులు ఎండలకు విలవిల!
తరచూ చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ప్రతి సంవత్సరం సగటున 240 కోట్ల మంది కార్మికులపై పడుతోంది. దీనికి సంబంధించిన వివరాలను అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) తన నూతన నివేదికలో అందించింది. దీనిలోప్రపంచవ్యాప్తంగా కార్మికుల భద్రత, వారి ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాలను వివరించారు.ప్రపంచంలోని 71 శాతం మంది కార్మికులు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ బారిన పడుతున్నారు. 2010లో ఇది 65.5 శాతంగా ఉండేది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంతగా కార్మికులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నివేదికలోని వివరాల ప్రకారం ప్రతి సంవత్సరం 2.3 కోట్ల మంది కార్మికులు తీవ్రమైన వేడి కారణంగా పని సమయంలో అనారోగ్యానికి గురవుతున్నారు. 18,970 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.అత్యధిక ఉష్ణోగ్రతల్లో పనిచేసే కార్మికులు కిడ్నీ సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో 2.62 కోట్ల మంది కార్మికులు ఉండవచ్చని అంచనా. ఈ నేపధ్యంలో అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ కార్మిక చట్టాలను పటిష్టం చేయాలని ప్రభుత్వాలకు పిలుపునిచ్చింది. తద్వారా కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించవచ్చని పేర్కొంది. అత్యధిక వేడి, వాయు కాలుష్యం మొదలైనవాటి నుంచి కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. -
వేముల రోహిత్ కేసు మూసేస్తున్నాం.. హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ స్కాలర్ వేముల రోహిత్ కేసుపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. రోహిత్ కేసు క్లోజ్ చేస్తున్నట్లు కోర్టుకు పోలీసులు తెలిపారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని కోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. ఆత్మహత్యకు కారణాలు, ఎవిడెన్స్ లేవన్న పోలీసులు.. వీసీ అప్పారావుకు సంబంధం లేదని తేల్చారు. పోలీసులు రోహిత్ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కాదని రిపోర్టులో తేల్చారు. కాగా, 2016 జనవరిలో రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. రోహిత్ వేముల ఆత్మహత్యపై గతంలో 306 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ సెక్షన్లు సైతం 8 సంవత్సరాల క్రితం పోలీసులు జోడించారు. పోలీసుల తాజా రిపోర్టులో రోహిత్ వేముల ఆత్మహత్యకు వీసీ కారణమని ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. -
‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ ఎన్కౌంటర్ కేసులో సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై పలువురు అధికారులు హైకోర్టు సింగిల్ బెంచ్ను ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల అనంతరం సిర్పూర్ కర్ కమిషన్ నివేదికపై విజయసేన్ రెడ్డి బెంచ్ స్టే ఇచ్చింది.10 మంది పోలీసు అధికారులు ఈ ఎన్కౌంటర్ ఘటనలో పాల్గొన్నారని, వీరందరిపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలని గతంలో కమిషన్ తెలిపింది. పోలీస్ అధికారులు సురేందర్, నరసింహా రెడ్డి, షేక్ లాల్ మదార్, సిరాజుద్దీన్, రవి, వెంకటేశ్వర్లు, అరవింద్ గౌడ్, జానకీ రామ్, బాలు రాథోడ్, శ్రీకాంత్ ఆ జాబితాలో ఉన్నారు. వీరిపై ఐపీసీ 302, సెక్షన్ 201 ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరపాలని కమిషన్ తెలిపింది. ఈ నివేదికపై అప్పటి షాద్నగర్ సీఐ శ్రీధర్తో పాటు తహసీల్దార్లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.ఎన్కౌంటర్ తర్వాత జరగాల్సిన ప్రొసిజర్స్లో లోపాలు ఉన్నాయన్న కమిషన్..‘దిశ’ నిందితులను ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపారని రిపోర్టు ఇచ్చింది. ఎన్కౌంటర్ వాడిన పిస్తోళ్ల వివరాలు కూడా సరిగ్గా లేవని నివేదికలో పేర్కొన్న కమిషన్.. అప్పటి ఎన్కౌంటర్ను పూర్తిగా తప్పుబట్టింది. కమిషన్ రిపోర్ట్పై ఇవాళ హైకోర్టు స్టే ఇచ్చింది -
బర్త్ సర్టిఫికెట్ కొత్త రూల్స్.. కేంద్రం కీలక మార్పులు?
జనన వివరాల నమోదుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ కీలక మార్పులు చేయనుంది. కొత్తగా పుట్టిన శిశువుల తల్లిదండ్రులు ప్రస్తుతం ఉన్న 'కుటుంబ మతం' డిక్లరేషన్కు భిన్నంగా ప్రతిపాదిత బర్త్ రిపోర్ట్లో తమ మతాన్ని వేరువేరుగా, వ్యక్తిగతంగా నమోదు చేయాల్సి ఉంటుందని ‘ది హిందూ’ నివేదించింది. ఈ కథనం ప్రకారం.. కొత్త ఫారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మోడల్ రూల్స్కు అనుగుణంగా ఉంది. దీన్ని అమలులోకి తెచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలి. ఆయా ప్రభుత్వాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. కాగా దత్తత తీసుకునే తల్లిదండ్రులకు కూడా ఇదే వర్తిస్తుంది. వారు కూడా తమ మతాన్ని వ్యక్తిగతంగా నమోదు చేయాలి. జననాలు, మరణాల రికార్డుల భద్రత కోసం జాతీయ స్థాయి డేటాబేస్ ఏర్పాటు చేస్తారు. ఆధార్ నంబర్లు, ఆస్తి రిజిస్ట్రేషన్లు, రేషన్ కార్డ్లు, ఎలక్టోరల్ రోల్స్, పాస్పోర్ట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) సహా అనేక ఇతర డేటాబేస్లను రిఫ్రెష్ చేయడానికి ఈ డేటాబేస్ ఉపయోగపడుతుంది. జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు-2023ను పార్లమెంటు ఉభయ సభలు గతేడాది ఆగస్టులో ఆమోదించాయి. దీని ప్రకారం.. 2023 అక్టోబర్ నుండి విద్యా సంస్థలలో నమోదు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు, ఆధార్ నంబర్ పొందడం, వివాహాల నమోదు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు వంటి వివిధ ముఖ్యమైనవాటికి జనన ధ్రువీకరణ పత్రాన్నే ఏకైక పత్రంగా గుర్తిస్తారు. -
లగ్జరీ ఇళ్లకు భలే డిమాండ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విలాస గృహాల(లగ్జరీ ఇళ్లు)కు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. రూ.50 కోట్లు లేదా అంతకు మించి ధర ఉన్న లగ్జరీ ఇళ్లు విక్రయాలు గతేడాదిలో 51% పెరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. అమ్ముడైన మొత్తం 45 లగ్జరీ ఇళ్ల విలువ రూ.4,319 కోట్లుగా ఉంది. వీటిలో 58% అపార్ట్మెంట్లు, 42% బంగ్లాలు. అంతకు ముందు ఏడాది(2022)లో అమ్ముడైన 29 విలాస గృహాల విలువ రూ.2,859 కోట్లుగా ఉంది. మొత్తం 45 యూనిట్లలో ముంబైలో విక్రయమైన 29 లగ్జరీ ఇళ్ల విలువ రూ.3,031 కోట్లు, ఢిల్లీలోని ఎన్సీఆర్లో అమ్ముడైన 12 లగ్జరీ ఇళ్ల విలువ రూ.1,043 కోట్లు, బెంగుళూరు విక్రయమైన 4 లగ్జరీ ఇళ్ల విలువ రూ.245 కోట్లుగా ఉంది. ‘‘అత్యంత సంపన్నల నుంచి అధిక గిరాకీ ఉండటంతో లగ్జరీ ఇళ్ల విక్రయాలు పెరిగాయి. అమ్ముడైన 45 లగ్జరీ ఇళ్లలో రూ.100 కోట్లు లేదా అంతకు మించి ధర ఉన్న ఇళ్ల సంఖ్య 14గా ఉంది. వీటిలో అత్యధిక అమ్మకాలు ముంబై జరిగాయి. విలాసవంతమైన ఆస్తులపై సంపన్నులకు విశ్వాసం క్రమంగా పెరుగుతుండంతో భవిష్యత్తులోనూ లగ్జరీ అమ్మ కాలు పెరగొచ్చు’’ అని జేఎల్ఎల్ ఇండియా రీసెర్చ్ హెడ్ సమంతక్ దాస్ తెలిపారు. -
నిరుద్యోగ ‘యువ భారత్’
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగయువత అనేక సవాళ్లు ఎదు ర్కొంటోంది. భారత్లోని నిరుద్యోగుల్లో 83 శాతం యువతే ఉండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాథమికోన్నత విద్య (సెకండరీ) లేదా ఆపై ఉన్నతవిద్య (హయ్యర్) అభ్యసించిన యువత నిష్పత్తి క్రమంగా పెరుగుతోంది. వీరి శాతం 2000లో 35.2 శాతం ఉండగా, 2022 నాటికి అది 65.7 శాతానికి (నిరుద్యోగుల శాతం) పెరిగింది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యుమన్ డెవలప్మెంట్ (ఐహెచ్డీ) సంయుక్తంగా రూపొందించి తాజాగా విడుదల చేసిన ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్ 2024లో అనేక అంశాలు వెల్లడయ్యాయి. 2000– 2019 సంవత్సరాల మధ్య యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు (అండర్ ఎంప్లాయ్మెంట్) తగ్గడం వంటివి భారీగా పెరగగా, కోవిడ్ సందర్భంగా మాత్రం కొంత తగ్గుదల నమోదైనట్టుగా ఈ నివేదిక పేర్కొంది. 2000– 2019 మధ్యలో యువత నిరుద్యోగిత శాతం దాదాపు మూడింతలు (5.7 – 17.5 శాతం) పెరిగింది. 2022 నాటికి అది 12.4 శాతానికి తగ్గింది’ అని ఈ నివేదిక చీఫ్ ఎకనమిక్ అడ్వయిజర్ వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. తెలంగాణ విషయానికొస్తే... సెకండరీవిద్య, ఆపై ఉన్నత చదువులు చదివినా తెలంగాణకు చెందిన యువత ఎక్కువగా నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నట్టుగా ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024లో నివేదిక వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం... ♦ 15–29 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 30.3 శాతం అమ్మాయిలు, 18.3% అబ్బాయిలు (మొత్తం 48.6%) నిరుద్యోగులుగా ఉన్నారు. అదే జాతీయ స్థాయిలో ఇదే కేటగిరిలో చూస్తే 65.7 శాతంగా ఉంది. ♦ రాష్ట్రంలో 2005 నుంచి యువతలో నిరుద్యోగిత శాతమనేది క్రమంగా పెరుగుతోందని ఈ నివేదిక తెలిపింది. 2005లో చూస్తే.. యువతలో 14.1నిరుద్యోగ శాతం ఉండగా, 2012కల్లా 14.9 శాతానికి, 2019 కల్లా 34.9 శాతానికి చేరుకుంది. ♦ అదే 2022 సంవత్సరంలో 21.7శాతానికి తగ్గుముఖం పట్టింది. అయితే 2022లో అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా సాధించారు. నిరుద్యోగిత శాతం అబ్బాయిల్లో 18.3 శాతం ఉండగా, అమ్మాయిల్లో అది 30.3 శాతంగా ఉంది. ♦ 2022లో రాష్ట్రంలో 27.5% మంది యువత ‘నాట్ ఇన్ ఎంప్లాయిమెంట్, ఎడ్యుకేషన్స్న్ ఆర్ ట్రైనింగ్’ (నీట్) కేటగి రిలో ఉన్నట్టు ఆ నివేదిక తెలిపింది. 2005 నుంచి 2019 మధ్యలో అది 17.9 శాతం నుంచి 34 మధ్యలో ఉంది. ♦ రాష్ట్రంలో పదిహేనళ్లకు పైబడిన క్యాజువల్ వర్కర్ల నెలవారీ వేతనం విషయానికొస్తే...2022లో మగవారిది రూ.10,175గా, మహిళలది రూ.6,642గా ఉంది. మనోళ్ల టెక్ స్కిల్స్ అంతంతే... దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే తెలంగాణ సాంకేతికంగా, టెక్ స్కిల్స్లో ఉన్నతస్థాయిలో నిలుస్తుందని అనుకుంటాం. కానీ... ♦దాదాపు 90 శాతం యువత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి పవర్పాయింట్ ప్రజెంటేషన్ లేదా కంప్యూటర్ ప్రోగ్రామ్ కూడా రాయలేకపోతున్నారు. ♦ అధికశాతం విద్యార్థులకు ఎమ్మెస్ ఎక్సెల్ తదితర అప్లికేషన్లలో విస్తృతమైన పరిజ్ఞానం, అవగాహన లేదు. ♦ 50 శాతానికి పైగా యువత అటాచ్మెంట్తో కూడిన ఈ–మెయిల్ను కూడా పంపించలేకపోతున్నారు. ♦ 53.83 శాతం యువత కాపీ చేసి ఫైల్ను మూవ్ చేయగలుగుతున్నారు. ♦ 50.4 శాతం మంది ఏదైనా ఫైల్ను కాపీ, పేస్ట్ చేయగలుగుతున్నారు. ♦ కేవలం 14.7 శాతం మాత్రమే సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఎలక్ట్రానిక్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. నిపుణులు ఏమంటున్నారంటే... ♦ తెలంగాణలోని అనేక స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లున్నా, సాంకేతిక అంశాలు బోధించే టీచర్లు, టెక్ నైపుణ్యం ఉన్నవారు లేకపోవడమే కారణమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ అంశాలన్నింటిని కూడా పాఠశాల బోధనాంశాల్లో చేర్చితేనే ప్రయోజనం ఉంటుందని వారు చెబుతున్నారు. -
సౌర విద్యుత్లో ఏపీ ముందడుగు
సాక్షి, అమరావతి: మన రాష్ట్రం సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ టాప్ 5 రాష్ట్రాల్లో స్థానం సంపాదించే దిశగా సాగుతోంది. సోలార్ వ్యర్థాలపై విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ ఈ నివేదిక రూపొందించింది. దేశంలో గతేడాది (2022–23లో) సుమారు 100 కిలో టన్నుల సౌర వ్యర్థాల ఉత్పత్తి జరిగిందని, 2030 నాటికి వీటి ఉత్పత్తి 600 కిలో టన్నులకు చేరుతుందని వెల్లడించింది. సౌర వ్యర్థాల్లో దాదాపు 67 శాతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే వస్తున్నట్లు పేర్కొంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనే సౌర విద్యుత్ ప్రాజెక్టులు భారీగా పెరుగుతుండటమే ఇందుకు కారణమని తెలిపింది. మన దేశంలో 2070 నాటికి కాలుష్యపూరితమైన కర్బన ఉద్గారాలను పూర్తిగా సున్నా స్థాయికి తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. 2030 నాటికి ఒక మిలియన్ టన్నుల కాలుష్యాన్ని వాతావరణం నుంచి పారద్రోలాలని రాష్ట్రాలకు చెప్పింది. ఇందులో భాగంగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచుతోంది. మన దేశం 2040 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకొంది. దీనికి తోడ్పాటునందిస్తున్న మొదటి పది రాష్ట్రాల్లో ఏపీ ఇప్పటికే స్థానం సంపాదించింది. ఇప్పటికే 4.76 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గించి ఆదర్శంగా నిలిచింది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో రాష్ట్రం 42 ఇంధన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.9.57 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తి కూడా పెంచుతూ రాష్ట్రం టాప్ 5 రాష్ట్రాల్లో నిలిచిందని తాజా నివేదిక వెల్లడించింది. రీసైక్లింగ్ చేస్తే సరి వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం, తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరుల కారణంగా ప్రపంచం మొత్తం పునరుత్పాదక ఇంధనం వైపు దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పదేళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 23 రెట్లు పెరిగింది. రానున్న ఆరేళ్లలో (2030 నాటికి) 292 గిగావాట్ల స్థాపిత సౌర సామర్థ్యాన్ని పెంచాలనేది లక్ష్యం. అయితే సోలార్ మాడ్యూల్స్, ఫీల్డ్ నుండి వచ్చే వ్యర్థాలు ఓ సవాలుగా మారనున్నాయి. నిజానికి ఫోటో వాల్టాయిస్ (పీవీ)ల జీవిత కాలం 25 ఏళ్లు. ఆ తర్వాత అవి వ్యర్ధాలుగా మారతాయి. కాకపోతే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు కొన్ని పీవీలు పగిలిపోవచ్చు. కొంత కాలం తరువాత కొన్ని పనిచేయకపోవచ్చు. కొన్ని నాణ్యత పరీక్షల్లో విఫలమై పక్కన పడవచ్చు. రవాణా సమయంలో కొన్ని దెబ్బతింటాయి. అలాంటివి వ్యర్థాలుగా మారుతుంటాయి. ఈ మాడ్యూల్స్లో సిలికాన్, కాపర్, టెల్లూరియం, కాడ్మియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. దేశంలో ఇప్పుడున్న సౌర విద్యుత్ ప్రాజెక్టుల నుంచే 2030 నాటికి సుమారు 340 కిలోటన్నుల వ్యర్ధాలు రావచ్చని అంచనా. ఈ వ్యర్ధాల్లో 10 టన్నుల సిలికాన్, 18 టన్నుల వెండి, 16 టన్నుల కాడ్మియం, టెల్లూరియం ఉంటాయి. కొత్తగా వచ్చే ప్రాజెక్టులతో కలిపి వ్యర్ధాలు 600 కిలోటన్నులకి చేరుకోవచ్చు. 2050 నాటికి దాదాపు 19,000 కిలో టన్నులకి పెరుగుతాయని అంచనా. వ్యర్ధాలను తొలగించడం కోసం రీసైక్లింగ్ వ్యవస్థలను ప్రోత్సహించడమే సరైన మార్గం. అంతేకాదు రసాయన ప్రక్రియల సహాయంతో రీసైక్లింగ్ చేస్తే వెండి, సిలికాన్ను కూడా తిరిగి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.