-
ఆన్లైన్ గేమ్ ఆడి.. రూ.95 లక్షలు ఓడి
షాబాద్: తల్లిదండ్రులకు తెలియకుండా నష్టపరిహారం కింద వచ్చిన రూ.95 లక్షలతో ఆన్లైన్ గేమ్ ఆడి పోగొట్టుకున్నాడు ఒక యువకుడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ గురువయ్యగౌడ్, గ్రామస్తుల కథనం ప్రకారం.. షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన చన్వల్లి శ్రీనివాస్రెడ్డి, విజయలక్ష్మి దంపతుల కుమారుడు హర్షవర్ధన్రెడ్డి నగరంలోని నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గ్రామంలో శ్రీనివాస్రెడ్డి కౌలు చేస్తున్న 10 ఎకరాల భూమిని ప్రభుత్వం తన అవసరాల కోసం తీసుకొని ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. ఈ డబ్బుతో శంషాబాద్ మండలం మల్లాపూర్ వద్ద భూమి కొనేందుకు శ్రీనివాస్రెడ్డి దంపతులు ఒప్పందం చేసుకున్నారు. రెండు రోజుల్లో భూ లావాదేవీలు జరగనున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ ఖాతాలో ఉన్న డబ్బును కుమారుడి ఖాతాలోకి బదిలీ చేశారు. ఈ క్రమంలో హర్షవర్ధన్రెడ్డి కింగ్ 567 అనే ఆన్లైన్ గేమ్ను డౌన్లోడ్ చేసుకుని ఆడాడు.. తన ఖాతాలోని రూ.95 లక్షలు పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న సోదరుడు శ్రీపాల్రెడ్డి, కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం సైబర్క్రైమ్ గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ముంబై, బెంగళూరులను మించిపోయిన రంగారెడ్డి జిల్లా
నల్లగొండ జిల్లా కట్టంగూరుకు చెందిన యాదగిరి ఉన్న ఊర్లో ఉపాధి కరువై బతుకుదెరువు కోసం ఐదేళ్ల క్రితం కుటుంబంతో సహా శేరిలింగంపల్లికి చేరుకున్నాడు. ఓ అపార్ట్మెంట్లో వాచ్మన్గా చేరాడు. భార్య అదే అపార్ట్మెంట్లోని ఫ్లాట్లలో పనికి కుదిరింది. యాదగిరి నెలకు రూ.15 వేలు వేతనం, భార్యకు ఒక్కో ఫ్లాట్ నుంచి రూ.2,500 చొప్పున పది ఫ్లాట్ల నుంచి రూ.25 వేలు వస్తున్నాయి. ఇంటి యజమానులు ప్రేమగా పెంచుకుంటున్న కుక్కలను ఉదయం, సాయంత్రం బయట తిప్పినందుకు రూ.5 వేలు, వారి వ్యక్తిగత వాహనాలను శుభ్రం చేసినందుకు నెలకు రూ.500–700 చొప్పున సంపాదిస్తున్నారు. ఇలా ఈ జంట సగటున రూ.50 వేలకుపైగా సంపాదిస్తోంది. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ ఏజెంటుగా మారిన ఒకప్పటి నిరుద్యోగి ప్రస్తుతం నెలకు రూ.లక్షకుపైగా సంపాదిస్తుండటం విశేషం. సాక్షి, రంగారెడ్డిజిల్లా: సగటు వార్షిక ఆదాయంలో రంగారెడ్డి జిల్లా దేశ ఆర్థిక రాజధాని ముంబైని మించిపోయింది. ముంబై వాసి వార్షికాదాయం రూ.6.43 లక్షలు ఉండగా, ఈ జిల్లా సగటు వ్యక్తి ఆదాయం రూ.6.59 లక్షలు ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (టీఎస్డీపీఎస్) తాజా నివేదికలో వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, అహ్మదాబాద్, కోయంబత్తూరు, ఎర్నాకులం ఉన్నాయి. హైదరాబాద్ రూ.3.51 లక్షలు, మేడ్చల్ రూ.2.40 లక్షలు, వికారాబాద్ రూ.1.32 లక్షలుగా నమోదయ్యాయి. ఉపాధి అవకాశాలు.. రూ.లక్షల్లో వేతనాలు హైదరాబాద్ నగరంతో జిల్లా మిళితమై ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు నగరం చుట్టూ 158.50 కిలోమీటర్ల పొడవు ఎనిమిది లేన్ల ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ విశాలమైన భూములు ఉండటం, తక్కువ వేతనాలకే కావాల్సిన మానవ వనరులు లభిస్తుండటంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ప్రతిష్టాత్మాక గూగుల్, యాపిల్, ఫేస్బుక్, ట్విట్టర్, అమేజాన్, మహేంద్ర, ఇతర టెక్సంస్థలు కేంద్ర కార్యాలయాలు తెరిచాయి. సుమారు ఏడు లక్షల మంది ప్రత్యక్షంగా, మరో పది లక్షల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరి నెలసరి వేతనాలు రూ.లక్షల్లో ఉండడంతో తమ ఆదాయాన్ని ఇళ్లు, భూములు, ఇతర ఆస్తుల కొనుగోలుకు వెచ్చిస్తున్నారు. ఫలితంగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అప్పటి వరకు ఆకుకూరలు, కాయగూరలు సాగు చేసుకుంటూ జీవనం సాగించిన రైతులు రాత్రికి రా త్రే కోటిశ్వరుల జాబితాలో చేరిపోయారు. చేతి నిండా డబ్బు ఉండటంతో ఖర్చుకు వెనకాడటం లేదు. నివాసయోగ్యమైన ప్రాంతం ఢిల్లీ, ముంబై, ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే గ్రేటర్ జిల్లాలు జీవనయోగ్యమైన జాబితాలో ఇప్పటికే గుర్తింపు పొందాయి. ఇటు సమశీతోష్ణ పరంగానే కాకుండా అటు సురక్షితం కావడంతో కీలకమైన రక్షణ, ఎయిర్ఫోర్స్, మిలట్రీ శిక్షణ కేంద్రాలు, పరిశోధక కేంద్రాలు కొలువుదీరాయి. ప్రభుత్వం సిటిజన్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే పోలీస్ కంట్రోల్ టవర్లను నిర్మించి నిరంతర నిఘా ఏర్పాటు చేసింది. సిటీలోనే కాదు శివారు ప్రాంతాల్లోనూ చీమచిటుక్కుమన్నా ఇట్టే గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. నిరంతరాయ విద్యుత్ సరఫరా, కొత్త పారిశ్రామికవాడలు, టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమలకు సత్వర అనుమతుల జారీ వంటి అంశాలు కూడా జిల్లావాసుల సగటు ఆదాయం పెరుగుదలకు దోహదపడుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. (క్లిక్ చేయండి: మీరూ అవ్వొచ్చు ట్రాఫిక్ పోలీసు.. ఎలాగంటే!) -
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వాంగ్మూలం నమోదు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: మొయినాబాద్ ఫామ్హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో 5వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డి.దేవేందర్ బాబు.. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ కేసులో ఫిర్యాదీ తాండూరు శాసనసభ్యుడు పైలెట్ రోహిత్ రెడ్డి వాంగ్మూలాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 ప్రకారం అధికార పరిధిలో లేని మేజిస్ట్రేట్ నమోదు చేయాల్సి ఉంది. సరూర్నగర్ పోలీసులు ప్రత్యేక భద్రత మధ్య ఎమ్మెల్యేను కోర్టులో హాజరు పరిచారు. -
భూమి కోసం ప్రాణం తీశాడు
యాచారం: భూమి కోసం ఓ కసాయి కొడుకు కన్న తండ్రినే కడతేర్చాడు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. తమ్మలోనిగూడకి చెందిన కర్రె మల్లయ్య(75)కు గ్రామంలో రెండెకరాల పొలం ఉంది. కొన్నేళ్ల క్రితం ఎకరా భూమిని విక్రయించి కొడుకు వెంకటయ్యకు రూ.30 లక్షలు, కూతురు సుగుణమ్మకు రూ.30 లక్షలు ఇచ్చాడు. మిగిలిన ఎకరా పొలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని వెంకటయ్య, భార్య మంగమ్మతో కలిసి తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. భౌతిక దాడులకు సైతం పాల్పడ్డారు. తన ప్రాణం పోయేంత వరకు భూమిని ఇచ్చేది లేదని మల్లయ్య తేల్చి చెప్పాడు. దీంతో తండ్రిని మట్టుబెట్టాలని పథకం వేశాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి భార్యాభర్తలు కలిసి మల్లయ్య మొహంపై దిండు పెట్టి శ్వాస ఆడకుండా చంపేశారు. ఆదివారం తెల్లవారుజామున ఏమీ తెలియనట్టు ‘అయ్యో.. మా నాన్న చనిపోయాడు’అంటూ విలపించాడు. తండ్రీకొడుకుల మధ్య భూవివాదం నడుస్తున్న సంగతి తెలిసిన గ్రామస్తులకు అనుమానం వచ్చి వెంకటయ్యను చితకబాదారు. పోలీసులు విచారించగా భూమి కోసం తండ్రిని హత్య చేసినట్టు అంగీకరించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లింగయ్య తెలిపారు. -
గేటు పడింది.. గుండె ఆగింది
షాద్నగర్ రూరల్: రైల్వేగేటు పడటంతో సకాలంలో ఆస్పత్రికి తరలించలేక ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జరిగిన ఈ సంఘటన వివరాలివి. ఫరూఖ్నగర్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామానికి చెందిన శ్రీశైలం (33)కు శుక్రవారం ఉదయం హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం షాద్నగర్కు తీసుకొస్తుండగా.. మార్గమధ్యలో చటాన్పల్లి వద్ద రైల్వే గేటు పడటంతో వారి వాహనం ఆగిపోయింది. దీంతో వారు షాద్నగర్ శివారు బైపాస్ నుంచి అన్నారం వై జంక్షన్ మీదుగా చుట్టూ తిరిగి షాద్నగర్కు తీసుకొచ్చారు. ఆస్పత్రికి చేరు కునేలోపే శ్రీశైలం మృతి చెందాడు. రైల్వే గేటు ప్రాణం తీసిందంటూ వారి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మరొకరికి ప్రాణనష్టం జరగకముందే రైల్వేగేట్ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ధరణితోనే సమస్యలు
తుక్కుగూడ: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి యాప్తో రైతులకు భూ సమస్యలు ఎదురవుతున్నాయని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ విశ్వవిద్యాలయ అనుబంధ ఆచార్యులు ‘భూమి’ సునీల్ అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో ఏర్పాటు చేసిన భూ న్యాయ శిబిరంలో ఆయన మాట్లాడారు. భూ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు న్యాయవాదులు, రెవెన్యూ నిపుణులు న్యాయ సలహాలు అందించారు. భూ సమస్యలతో రైతులు ఆందోళన చెందుతున్నారని, వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నామని సునీల్ పేర్కొన్నారు. తెలంగాణలో రీసర్వే చేస్తేనే భూసమస్యలు పరిష్కారమవుతాయని, దీనికోసం ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సూచించారు. సమగ్ర సర్వే చేస్తేనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని తెలంగాణ సోషల్ మీడియా ఫోరం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి చెప్పారు. రైతులకు ఉచిత న్యాయ సలహాలు అందించడం కోసమే ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ సొసైటీ (లీఫ్స్) ఉపాధ్యక్షుడు జీవన్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పి.నిరూప్ రెడ్డి, తెలంగాణ తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, రైతు నాయకులు కోదండరెడ్డి, భూదా న్ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫైనాన్స్ వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య
మొయినాబాద్: ఫైనాన్స్ సంస్థ ప్రతినిధుల వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం అమ్డాపూర్వాసి మద్యపాగ అశోక్ (25) కొంతకాలం కిందట ఫైనాన్స్లో ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో వాయిదాలు సరిగా చెల్లించకపోవడంతో ఫైనాన్స్ ప్రతినిధులు వేధించసాగారు. మనస్తాపం చెందిన అశోక్.. దీపావళి రోజున రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు ఇంట్లో చూసేసరికి వేలాడుతూ కనిపించాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. -
గ్రేటర్ హైదరాబాద్లో కెనడా విల్లా
సాక్షి, హైదరాబాద్: ఇన్నాళ్లు సినిమాల్లో కనిపించిన చెక్క ఇళ్లు ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేశాయి. అచ్చం కెనడా, అమెరికాలో కనిపించే ఇళ్ల తరహాలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నిర్మించారు. తుమ్మలూర్ రెవెన్యూ పరిధి హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి పక్కన మ్యాక్ ప్రాజెక్ట్స్లో ఈ కెనడియన్ వుడ్ విల్లాలను నిర్మించారు. అధునాతన నిర్మాణ పద్ధతిలో, ఎక్కువ శాతం చెక్కను ఉపయోగించి నిర్మాణం పూర్తి చేశారు. అడవులకు వీలైనంత వరకు హాని కలిగించకుండా.. ప్రత్యేకంగా పెంచిన చెట్లనుంచి చెక్క సేకరించి నిర్మాణం కోసం వాడారు. ఈ కెనడియన్ వుడ్ విల్లాను హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. కార్యక్రమానికి గౌరవ అతిథులుగా కెనడా హైకమిషనర్ కెమెరాన్ మాకే హాజరయ్యారు. కెనడియన్ విల్లాల నిర్మాణం చేపడుతున్న మ్యాక్ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరక్టర్ నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ తమ ప్రాజెక్ట్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్ 2021లో ప్రారంభం కాగా కేవలం 12నెలలోనే ఇళ్ల నిర్మాణం పూర్తికావడం విశేషమని తెలిపారు. బ్రిటిష్ కొలంబియా కెనడా ధృవీకరించిన కలపతో విల్లాను నిర్మించామని తెలిపారు. కెనడియన్ వుడ్తో మ్యాక్ ప్రాజెక్ట్ కలిసి భాగస్వామ్యం కావడం విశేషమన్నారు. హైదరాబాద్ నగరం రోజురోజుకు శివారు ప్రాంతాలకు విస్తరిస్తోందని, బంగారు భవిష్యత్తుకు విల్లాలను కొనుగోలు చేయడమే మంచిదన్నారు. చదవండి: (వన్ప్లస్ దివాలీ సేల్.. కళ్లు చెదిరే డీల్స్) -
పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా?: సీఎం కేసీఆర్
-
Ground Report: మంత్రి సబిత ఇంటికి వెళ్తే.. ఆ పార్టీ నాయకులకు చిక్కులే!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మూడు ముక్కలైంది. ఇన్నాళ్లు ఉమ్మడి జిల్లాను శాసించిన నేతలు ఇప్పుడు తమ నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. టోటల్గా జిల్లాను లీడ్ చేసే నేతలు ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. ఒకరి ఇలాకాలో మరొకరు వేలు పెడితే... అగ్గిమీద గుగ్గిలంలా భగ్గుమంటున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారిన రంగారెడ్డి జిల్లా రాజకీయాలపై స్పెషల్ రిపోర్ట్. అధికార పార్టీలో ఎవరికి వారే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై గులాబీ పార్టీ పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించినా... నేతల మధ్య సమన్వయలోపం ఇబ్బందికరంగా మారింది. వికారాబాద్, తాండూరు, చేవెళ్ల, రాజేంద్ర నగర్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సొంత క్యాడర్ ఉంది. నేరుగా మంత్రితో మాట్లాడే చొరవ ఉన్న నేతలు ఉన్నారు. ఇది ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు రుచించడం లేదు. నేరుగా మంత్రి దగ్గరకు వెళ్లే నేతలను ఎమ్మెల్యేలు టార్గెట్ చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారని వాపోతున్నారు. మంత్రి ఇంటికి వెళ్లగానే ఎమ్మెల్యేలు కాల్ చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని పలువురు ఎంపీపీ, జడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డిది మరో దారి. తమ కుటుంబ రాజకీయ ప్రత్యర్థి సబితా రెడ్డి జిల్లాలో మంత్రిగా ఆధిపత్యం చలాయించడం ఆమెకు ఇబ్బందిగా మారింది. ఎంపీ రంజిత్ రెడ్డి కూడా జిల్లాపై పట్టు కోసం, సొంత క్యాడర్ కోసం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నా... ఎమ్మెల్యేలు మాత్రం అడ్దుకుంటూనే ఉన్నారు. వికారాబాద్ జిల్లాలో జడ్పీ ఛైర్పర్సన్ సునీతారెడ్డికి, ఎమ్మెల్యేలకు మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీరి పంచాయతీ ప్రగతిభవన్కు చేరడంతో కొంత సద్దుమణిగింది. మేడ్చల్ జడ్పీ ఛైర్మన్ శరత్చంద్రారెడ్డికి, మంత్రి మల్లారెడ్డికి అంతర్గతపోరు ఆగడంలేదు. మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంత్రావు, వివేక్, భేతి సుభాష్రెడ్డి ఎవరికివారుగానే కొనసాగుతున్నారు. కాంగ్రెస్కు మాజీలే మిగిలారు ఇక కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలో నిస్సత్తువగా మారిపోయింది. టీపీసీసీ ఇచ్చే ఆదేశాలు అమలు చేసేందుకు జిల్లా నేతలు సిద్ధంగా లేరా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గత ఎన్నికల తరువాత జిల్లాలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొంత కాలంగా రాష్ట్ర స్థాయి నేతల నుంచి.. కింది స్థాయి వరకు నాయకులను నిస్సత్తువ ఆవహించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఎవరు ఇప్పుడు పార్టీలో లేరు. అందరూ మాజీలు మాత్రమే మిగిలారు. వారిలో కూడా ఏ ఒక్కరూ క్రియాశీలంగా పని చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఫేస్ వ్యాల్యూ ఉన్న నాయకులు లేకపోవడం పెద్ద లోటనే చెప్పాలి. గత ఎన్నికల్లో టీడీపీకి వదిలేసిన రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ క్యాడర్ చిన్నాభిన్నామైంది. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అసలు పార్టీలో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి. పార్టీకి రాజీనామా లేఖ ఇచ్చారు. కానీ ఇంకా ఆమోదించలేదు. చేవెళ్ల నుంచి పోటీ చేసిన రత్నం.. మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీలో చేరిపోయారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మూడు స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. గెలిచినవారిని నిలుపుకోలేకపోయింది. ఇక మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్రెడ్డి.. పార్లమెంట్ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా తయారు చేసుకోలేకపోయారు. కమలనాథుల పరిస్థితి అంతంతే.. ఉమ్మడి జిల్లాలో కమలనాథుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం నాయకులు పని చేస్తుంటే... జిల్లా నేతల మధ్య సమన్వయం లోపించిందనే వార్తలు వస్తున్నాయి. కాషాయపార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ప్రత్యేక నజర్ పెట్టింది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం ఇప్పటికే తొలిదశ సెర్చ్ పూర్తయింది. వికారాబాద్ జిల్లాలో మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో నేతల మధ్య కొత్త వివాదం తలెత్తింది. రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులుగా ఎల్బీ నగర్కు చెందిన సామ రంగారెడ్డి, రూరల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బొక్క నర్సింహారెడ్డి మధ్య సమన్వయం లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. రాజేంద్రనగర్, మహేశ్వరం రెండూ నియోజకవర్గాలు సగం అర్బన్లో, మరో సగం రూరల్లో ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం ఎవరు పనిచేసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్లు సంపాదిస్తే చేవెళ్ల పార్లమెంట్ స్థానం గెలవవచ్చని బీజేపీ భావిస్తోంది. అందుకుతగ్గ స్థాయిలో లెక్కలు వేస్తున్నారు కమలనాథులు. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి గతంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ వియ్యంకుడు జనార్ధన్రెడ్డి పోటీ చేసి.. రెండు లక్షల ఓట్లు సంపాదించారు. బలమైన అభ్యర్థిని బరిలో దింపితే చేవెళ్ల నుంచి గెలుస్తామని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఇక మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని బీజేపీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్సీ నుంచి ఎంపీ వరకు ఎన్నిక ఏదైనా తానే బరిలో దిగుతానంటారు మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బలమైన నేతను దించడానికి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి లాంటి నేతను బీజేపీలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఇప్పటికే కుత్బుల్లాపూర్లో కూన శ్రీశైలంగౌడ్ బీజేపిలో చేరడంతో కొంత బలం చేకూరిందని చెప్పవచ్చు. -
సడన్ బ్రేక్.. ఒకదాని వెనుక మరోటి ఢీ.. వరుసగా 9 వాహనాలు ధ్వంసం
సాక్షి, షాద్నగర్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ శివారులోని బైపాస్ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం తొమ్మిది వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. వివరాలివీ.. మహబూబ్నగర్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు డ్రైవర్ ముందు వెళ్తున్న బస్సును ఓవర్టేక్ చేయబోయి సడన్గా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న తొమ్మిది వాహనాలు ఒకదానికికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది వాహనాలు దెబ్బతిన్నాయి. వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రోడ్డు క్రాసింగ్ ఉండటంతో వాహనాలు కొంతమేర నిదానంగా వెళ్తున్నాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. (క్లిక్: కారులో ఇద్దరు ఎక్కడికి వెళ్లారు..?) ఓవర్టేక్ చేయబోయి.. అదుపు తప్పిన బైక్.. వ్యక్తి దుర్మరణం చేవెళ్ల: ముదు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి బైక్పై ఉన్న వ్యక్తి అదుపుతప్పి కిందిపడిన ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు.. చేవెళ్ల మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన ఎల్వేర్తి నరేశ్(30) గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం బైక్పై ఆలూరు నుంచి గేట్కు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్నాడు. మార్గమధ్యలో ముందు వెళ్తున్న బోలేరోను ఓవర్టేక్ చేయబోతుడంగా బైక్ ఆదుపు తప్పి పడిపోయాడు. తలకు తీవ్రగాయం కావటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు అతడి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య సంతోష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (క్లిక్: కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రేమకథ) -
నార్సింగిలో విషాదం: ఫంక్షన్కు వచ్చి స్విమ్మింగ్పూల్లో పడిపోయిన బాలుడు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్ స్విమ్మింగ్పూల్లో పడి శ్యామ్ అనే బాలుడు మృతి చెందాడు. కుటుంబంతో కలిసి బంధువుల ఇంట్లో ఫంక్షన్కు వచ్చిన శ్యామ్... స్విమ్మింగ్పూల్ వద్ద ఆడుకుంటూ నీటిలో పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ఆసుత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయవాడకు చెందిన శ్యామ్ తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు తెలిసింది. (చదవండి: మహిళా సర్పంచ్కు వరకట్న వేధింపులు) -
‘కారు’లో లుకలుకలు.. ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికే ..!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: గులాబీ పార్టీకి సొంత పార్టీ నేతలే షాక్ ఇస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్‡్ష మంత్రాన్ని ఆచరించి.. సంఖ్యాబలం లేకున్నా పురపాలికలను చేజిక్కించుకున్న ఆ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గెలిచిన పార్టీలకు ఝలక్ ఇస్తూ కారెక్కిన నేతలు.. ఇప్పుడు సొంతగూటి బాట పడుతున్నారు. కొన్నాళ్ల క్రితం తుక్కుగూడ పురపాలక సంఘం చైర్మన్, తాజాగా బడంగ్పేట నగరపాలక సంస్థ మేయర్ గులాబీకి గుడ్బై చెప్పడం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్/మేయర్ పదవులను దక్కించుకునేందుకు తగినన్నీ సీట్లు రాకపోవడం టీఆర్ఎస్ను నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థి పార్టీల విజేతలకు వల విసరడం ద్వారా మేజిక్ ఫిగర్ను చేరుకోగలిగింది. ఈ క్రమంలోనే బీజేపీ సీటు ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్గా గెలిచిన మదన్మోహన్కు తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. అదే తరహాలో బడంగ్పేటలో పారిజాత నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్గా గెలవడమేగాకుండా.. తన మద్దతుదారులను కూడా భారీ సంఖ్యలో గెలిపించగలిగారు. దీంతో ఈ కార్పొరేషన్ ప్రత్యర్థుల వశంకాకుండా పావులు కదిపిన మంత్రి సబితారెడ్డి.. కాంగ్రెస్ కార్పొరేటర్లను టీఆర్ఎస్లోకి ఆహ్వానించడం ద్వారా మేయర్ పదవిని పారిజాతకు దక్కేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో వలసనేతలకు గులాబీ అగ్రనేతలతో మనస్పర్థలు రావడం మొదలైంది. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ మదన్మోహన్ కాషాయతీర్థం పుచ్చుకోగా.. తాజాగా బడంగ్పేట మేయర్, మరో నలుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ పరిణామాలు మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ నేతలను ఆత్మరక్షణలో పడేశాయి. దీనికితోడు మీర్పేట నగరపాలక సంస్థ కార్పొరేటర్లు కూడా కొందరు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదిబట్లలోనూ అదే సీను.. తుక్కుగూడ, బడంగ్పేట పరిధిలో చోటుచేసుకున్న పరిణామాలే ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఆదిబట్ల మున్సిపాలిటీలోనూ చోటుచేసుకు న్నాయి. ఇక్కడ కాంగ్రెస్ మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్నా.. పార్టీని చీల్చి అదే పార్టీకి చెందిన కౌన్సిలర్ కొత్త హరితకు చైర్పర్సన్ గిరిని కట్టబెట్టడం ద్వారా టీఆర్ఎస్ ఖాతాలో ఈ పురపాలికను వేసుకోగలిగింది. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డితో ఏర్పడ్డ అభిప్రాయబేధాలతో హరిత..‘కారు’ దిగి హస్తం గూటికి చేరారు. ఇదిలావుండగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోనూ రాజకీయాలు వేడెక్కాయి. కౌన్సిలర్లు, చైర్పర్సన్ మధ్య గ్రూపులుగా విడిపోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ కూడా పలువురు కౌన్సిలర్లు పక్క చూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది. -
అసైన్డ్పై రియల్ కన్ను! ఎకరాకు రూ.20 లక్షలకు చెల్లింపు, ధరణిలోనూ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసైన్డ్ భూములపై కొంత మంది రియల్టర్ల కన్నుపడింది. వీటిని అమ్మడం, కొనడం నేరమని తెలిసినా చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా వీటిని స్వాధీనం చేసుకోవచ్చని స్థానికంగా ప్రచారం చేస్తూ.. రైతులను భయాందోళనకు గురిచేస్తున్నారు. వీరి నుంచి తక్కువ ధరకు కొల్లగొట్టే కుట్రకు తెరలేపారు. రెవెన్యూ శాఖలోని లొసుగులకు తోడు అధికార పార్టీ పెద్దల అండదండలు వీరికి కలిసొస్తోంది. న్యాయపరమైన చిక్కులు, అధికారులతో ఏ సమస్యలు ఎదురైనా అన్నీ తామే చూసుకుంటామని నమ్మబలుకుతున్నారు. రిజిస్ట్రేషన్కు ముందే అసైన్డ్దారుల పేరుతో ఎన్ఓసీ సంపాదించి రూ.కోట్లు విలువ చేసే భూములను చవక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకోవాల్సిన యంత్రాంగం వీరిచ్చే కమీషన్లకు కక్కుర్తి పడి అడ్డగోలుగా ఎన్ఓసీలు జారీ చేసి, రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూ అగ్రిమెంట్ సమయంలో అసైన్డ్ దారులకు వ్యాపారులునగదు రూపంలో కాకుండా చెక్కుల రూపంలో చెల్లిస్తుండటం గమనార్హం. అబ్దుల్లాపూర్మెట్లో.. పెద్దఅంబర్పేట్లోని సర్వే నంబర్ 244లో నాలుగెకరాలు, సుర్మాయిగూడ సర్వే నంబర్ 128లో వంద ఎకరాలకుపైగా, బాటసింగారం సర్వే నంబర్ 10లో సుమారు 20 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. రూ.కోట్లు విలువ చేసే ఈ భూములపై వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు, అనుచరుల కన్నుపడింది. రెవెన్యూలోని లొసుగులను అడ్డుపెట్టుకుని అసైన్డ్ దారుని పేరుతోనే ఎన్ఓసీ పొందేందుకు యత్నిస్తున్నారు. అగ్రీమెంట్లు చేసుకుని, కొంత అడ్వాన్స్ కూడా ఇస్తున్నట్లు తెలిసింది. అబ్దుల్లాపూర్మెట్ కొత్త పోలీసు స్టేషన్ వెనుకభాగంలో సర్వే నంబర్ 283లోని 350పైగా ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ప్రస్తుతం వంద ఎకరాల వరకు ఖాళీగా ఉంది. దీనిపై రియల్టర్ల కన్ను పడింది. మహేశ్వరంలో.. మహేశ్వరం మండలం మహబ్బుత్నగర్లో రంగనాథసాయి పేరిట 9.06 ఎకరాల భూములున్నాయి. ప్రభుత్వం వీటిని 1988లోనే సీలింగ్ భూములుగా గుర్తించి, స్వాధీనం చేసుకుని స్థానిక తహసీల్దార్కు అప్పగించింది. ఆ తర్వాత ఇందులోని ఆరెకరాలను అప్పటి ఆర్డీఓ ఉత్తర్వుల (ఎ/ 6345/1987) మేరకు 1989 జనవరిలో భూమిలేని ఆరుగురు పేదలకు అసైన్ చేశారు. మరో 3.06 ఎకరాలను ఇద్దరు ఎక్స్ సర్వీస్మెన్లకు కేటాయించారు. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం దీని విలువ ధర రూ.60 కోట్ల పైమాటే. విలువైన ఈ భూమిపై ఓ ప్రముఖ సంస్థ కన్నుపడింది. పక్కనే ఉన్న తమ భూమిలో అసైన్డ్ భూములను కలిపేసుకుంది. ఇందుకు సంబంధించిన పత్రాలను బ్యాంకులో తనఖా పెట్టి రుణం కూడా తీసుకుంది. ఈ విషయం బ్యాంకు, రెవెన్యూ అధికారులకు తెలిసి ఒత్తిడి చేయడంతో.. తీసుకున్న లోన్ డబ్బులు తిరిగి చెల్లించింది. కానీ సదరు భూమి మాత్రం ఇప్పటికీ సంస్థ ఆధీనంలోనే ఉండటం, స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తుండటం విశేషం. ఇబ్రహీంపట్నంలో చెర్లపటేల్గూడ రెవెన్యూలోని సర్వే నంబర్ 710లో 83 ఎకరాల భూమిని 70 మందికి అసైన్ చేశారు. కొంత సాగుకు అనుకూలంగా ఉండగా, మరికొంత ప్రతికూలంగా ఉంది. ఈ భూమిని దక్కించుకునేందుకు కొంత మంది రియల్టర్లు యత్నిస్తున్నారు. నల్లగొండ, వరంగల్ జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు, వారి అనుచరులు, వ్యాపారులు ఈ భూములపై కన్నేశారు. స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కూడా వీరికి సహకరిస్తున్నారు. పొల్కపల్లి, దండుమైలారం, రాయపోలు రెవెన్యూ పరిధిలో కూడా అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. యాచారంలో.. మొండిగౌరెల్లి, నల్లవెల్లి, కొత్తపల్లి, తక్కెళ్లపల్లి, మా ల్, మంతన్గౌరెల్లి రెవెన్యూ పరిధిలో అసైన్డ్ భూము లు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే కుర్మిద్ద, తాడిపర్తి, నానక్నగర్, నక్కర్తమేడిపల్లిలోని సుమారు పది వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో సేకరించింది. బాధితులకు రూ.8 లక్షలు నష్టపరిహారంగా ఇచ్చింది. ఫార్మాసిటీ భూ సేకరణను బూచిగా చూపిస్తున్న రియల్టర్లు మిగిలిన గ్రామాల్లోని రైతులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. రైతుకు ఎకరాకు రూ.17 లక్షలు చెల్లిస్తూ, మరో రూ.2 లక్షలు మధ్యవర్తులు కమీషన్గా తీసుకుంటున్నారు. ఇప్పటికే 60– 70 ఎకరాలకు అడ్వాన్స్లు కూడా చెల్లించినట్లు సమాచారం. మొండిగౌరెల్లిలో సర్వే నంబర్ 19లో 575.30 ఎకరాలు ఉండగా, సర్వే నంబర్ 68లో 625.20 గుంటలు, సర్వే నంబర్ 127లో 122.22 ఎకరాల భూమి ఉంది. వీటిపై నగరానికి చెందిన కొంత మంది రియల్టర్ల కన్నుపడింది. ఈటల వ్యవహారంతో కలకలం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హేచరీస్ ఆధీనంలో (మెదక్ అచ్చంపేట) ఉన్న ఎనిమిది సర్వే నంబర్లలో 85.19 ఎకరాల అసైన్డ్ భూమిని 65 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో జిల్లాలోని అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మన జిల్లాలోని 26 మండలాల పరిధిలో 321 గ్రామాల్లో 6,471.03 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా, 5,440 మందికి 6,198.11 ఎకరాలు అసైన్ చేశారు. వీటిలో ఇప్పటికే చాలా భూములు పరాధీనమయ్యాయి. రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసిన రియల్టర్ల నుంచి మళ్లీ భూములు స్వాధీనం చేసుకునేందుకు అనేక మంది యత్నిస్తుండటంతో వీటిని కొనుగోలు చేసిన రియల్టర్లలో ఆందోళన మొదలైంది. అమ్మడం, కొనడం నేరం అసైన్డ్ భూములు అమ్మడం, కొనడం నేరం. వీటిని రిజిస్ట్రేషన్ చేయలేము. అమ్మిన రైతులతో పాటు కొనుగోలు చేసిన వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేస్తాం. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. –వెంకటాచారి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం -
అమ్మను కొడుతుండు.. కాపాడండి
ఇబ్రహీంపట్నం రూరల్: ‘సార్ మా నాన్న తాగొచ్చి అమ్మను ఇష్టమొచ్చినట్టు కొడుతుండు. జర మీరే కాపాడాలి’ అంటూ ముగ్గురు చిన్నారులు పోలీసులను వేడుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. సీఐ నరేందర్ కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన పంతంగి రాజీవ్, పద్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు దీపు (10), శివరామకృ ష్ణ (7), లక్ష్మీకాంత్ (6) సంతానం. ఆదిభబట్ల టీసీఎస్ కాలనీలో ఉంటున్నారు. రాజీవ్ నిత్యం తాగొచ్చి పద్మను వేధించే వాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం భార్యను విచక్షణారహితంగా కొట్టాడు. అడ్డొచ్చిన వృద్ధులైన పద్మ తల్లిదండ్రులపైనా చేయిచేసుకున్నాడు. దీంతో ముగ్గురు పిల్లలు ఆదిబట్ల పోలీస్స్టేషన్కు వచ్చి తండ్రిపై ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఐ.. పోలీసులను ఇంటికి పంపారు. నిందితుడు రాజీవ్ను స్టేషన్కు తీసుకొచ్చారు. మద్యం సేవించి ఉండటంతో రాజీవ్కు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
కుర్మల్ గూడలో కుటుంబం ఆత్మహత్య
-
అంతా ‘హస్త’వ్యస్తం!.. ఎవరికి వారే యమునా తీరే..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ పరిస్థితి జిల్లాలో ‘హస్త’వ్యస్తంగా తయారైంది. ఒకప్పుడు ఆ పార్టీకి కంచుకోటలా ఉన్న జిల్లా ప్రస్తుతం చిన్నాభిన్నమైంది. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉన్నప్పటికీ.. లీడర్ల మధ్య అంతర్గత విభేదాలు దెబ్బతీస్తున్నాయి. మహేశ్వరం, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నంలో పార్టీకి మంచి పట్టు ఉన్నప్పటికీ స్థానిక నేతల్లో అంతర్గత విభేదాలు వెంటాడుతున్నాయి. ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్కు మినహా మిగిలిన నియోజకవర్గాలకు ఇన్చార్జిలు లేకపోవడంతో కీలకమైన సమయంలో కేడర్ను సమన్వయం చేయలేకపోతున్నారు. ప్రజా సమస్యలపై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఇచ్చిన పిలుపునకు జిల్లా అధ్యక్షుడు సహా ఒకరిద్దరు నేతలు మాత్రమే స్పందిస్తున్నారు. చదవండి👉: గవర్నర్ వ్యవస్థను దుర్మార్గంగా మార్చేశారు: సీఎం కేసీఆర్ ఇబ్రహీంపట్నంలో.. జిల్లాలోని ఇతర నియోజకవర్గాలతో పోలీస్తే ఇక్కడ క్షేత్రస్థాయిలో కేడర్ బలంగా ఉంది. ఆదిబట్ల, తుర్కయంజాల్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు ఆ పార్టీ అభ్యర్థులే గెలుచుకున్నారు. మంచాల, అబ్దుల్లాపూర్మెట్ జెడ్పీటీసీలు సహా అబ్దుల్లాపూర్మెట్ ఎంపీపీ కూడా ఆ పార్టీ అభ్యర్థే. ఇక్కడి నాయకులు రెండు వర్గాలుగా చీలిపోవడం తీరని నష్టాన్ని తెచ్చిపెడుతోంది. వీరిలో మల్రెడ్డి బ్రదర్స్ టీపీసీసీ చీఫ్ రేవంత్ వర్గంలో ఉంటే.. మిగిలిన వారు ఎంపీ కోమటిరెడ్డితో టచ్లో ఉంటున్నారు. ఒకరు హాజరైన కార్యక్రమానికి మరొకరు గైర్హాజరవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఎవరికి వారు తామే ఎమ్మెల్యే అభ్యర్థులమని చెప్పుకొంటుండటం పార్టీ శ్రేణులను ఇరకాటంలో పడేశాయి. మహేశ్వరంలో.. ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. మంత్రి సబితా రెడ్డి గతంలో ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత అధికారపార్టీలో చేరారు. ఆమెతో పాటే కేడర్ కూడా చాలా వరకు పార్టీని వీడింది. నియోజకవర్గ ఇన్చార్జి అంటూ ఇప్పటి వరకు ఎవరూ లేరు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, సీనియర్ నాయకుడు దేప భాస్కర్రెడ్డి నియో జకవర్గంలో కలియతిరుగుతున్నారు. ఇద్దరి మధ్య పెద్దగా సయోధ్య లేనప్పటికీ సభ్యత్వ నమోదులో ఎవరికి వారే పోటీపడ్డారు. నియోజకవర్గంలో నా యకత్వ లోపం స్పష్టంగా కన్పిస్తోంది. ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో నిరాదరణకు గురైన కార్యకర్తలను కలుపుకొని వెళ్తే కానీ పార్టీ నిలబడలేని పరిస్థితి. చేవెళ్లలో.. మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుంది. గతంలో ప్రస్తుత మంత్రి సబితారెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా తొలుత ఇదే పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన అధికార టీఆర్ఎస్లో చేరారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు అభిమానులు ఉన్నప్పటికీ.. నియోజవర్గస్థాయిలో కలుపుకొని వెళ్లే నేతలు లేకపోవడం పారీ్టకి మైనస్గా మారింది. ఇక్కడ ఉన్న లీడర్లు ఎవరికి వారే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తూ ఓటర్లకు పార్టీ కార్యకర్తలకు చేరువయ్యే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయడం లేదనే విమర్శలున్నాయి. షాద్నగర్లో.. మాజీ ఎమ్మెల్యే చోళపల్లి ప్రతాప్రెడ్డి అధికారపార్టీలో చేరడంతో ఆయనతో పాటే కేడర్ కూడా కొంత వరకు ఆ పార్టీని వీడింది. ప్రస్తుతం నియోజకవర్గంలో వీర్లపల్లి శంకర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ఆయనకు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసమీకరణలో ఆయన ఇతరులకంటే ముందున్నారనే గుర్తింపు ఉంది. అంతర్గతంగా నెలకొన్న వర్గ విభేదాలు పార్టీకి నష్టదాయకంగా మారాయి. కల్వకుర్తిలో.. నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఇన్చార్జి అంటూ లేరు. గతంతో పోలీస్తే ప్రస్తుతం పార్టీ బలహీనపడింది. మాజీ ఎమ్మెల్యే వంశీచందర్రెడ్డి ఏఐసీసీ కార్యదర్శిగా నియమితులై, ఢిల్లీకే పరిమితం కావడంతో లీడర్లు అందుబాటులో లేకుండా పోయారు. కడ్తాల్ మినహా ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో పార్టీ అస్తవ్యస్తంగా తయారైంది. మాడ్గుల ఎంపీపీ, జెడ్పీడీసీలిద్దరూ కాంగ్రెస్ నుంచే గెలిచినా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదనే విమర్శ లేకపోలేదు. ఆ నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి.. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు బలమైన కేడర్ ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సుధీర్రెడ్డి ఆ తర్వాత పార్టీని వీడి అధికార టీఆర్ఎస్లో చేరడంతో ఆయనతో పాటే కొంత కేడర్ వెళ్లిపోయింది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జి కూడా ప్రజా సమస్యలపై పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఓటర్లు, కేడర్ను కలుపుకెళ్లే నేత లేకపోవడం పార్టీకి మైనస్ పాయింట్. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా చెప్పుకొంటున్న నలుగురు లీడర్లు మినహా క్షేత్రస్థాయిలో పారీ్టకి పెద్దగా పట్టు లేదు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. -
కమలం వికసించేనా?.. కేడర్ ఉన్నా లీడర్ల మధ్య సఖ్యత కరువు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికలకు ముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ వరుస విజయాలతో బీజేపీ దూకుడు పెంచింది. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తెలంగాణకు గుండెకాయలాంటి రంగారెడ్డి జిల్లాలో మాత్రం కమల వికాసం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో పార్టీకి మంచి కేడర్ ఉన్నప్పటికీ లీడర్ల మధ్య సఖ్యత కొరవడింది. చదవండి: కామారెడ్డి: కాంగ్రెస్లో కుమ్ములాటలు.. రచ్చకెక్కిన విభేదాలు ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నేతలు పోటీకి సిద్ధమవుతుండటం.. ప్రజా సమస్యలపై సమష్టిగా కాకుండా ఎవరికి వారే కార్యక్రమాలు రూపొందిస్తుండడం.. అంతర్గత విభేదాలు బహిర్గతమవుతుండటం.. అధినాయకత్వం జిల్లాపై దృష్టి సారించకపోవడం.. నియోజకవర్గాల వారీగా సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలు పార్టీ వెను కబాటుకు కారణమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు ఉండగా, అధికార పారీ్టకి ఐదు చోట్ల గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని, సమష్టిగా కృషి చేస్తే రాబోయే ఎన్నికల్లో విజయావకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు. కల్వకుర్తిలో.. జిల్లాలో మొదటి నుంచి పార్టీకి మంచి పట్టున్న నియోజకవర్గం ఇదే. గ్రామం నుంచి మండల స్థాయి వరకు కమిటీలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టిపోటీ ఉండనుంది. జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలోకి దిగి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీసీ కమిషన్ సభ్యుడి హోదాలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. నెలలో 20 రోజులు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఆమనగల్లు మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో 12 బీజేపీ గెలిచినప్పటికీ.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదనే అపవాదు పారీ్టకి లేకపోలేదు. షాద్నగర్లో.. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇక్కడ పార్టీ కొంత బలపడినప్పటికీ.. ఎన్నికల్లో పోటీకి ఆశించిన ప్రజా మద్దతును కూడగట్టలేకపోయింది. మొదటి నుంచి అదే పార్టీలో కొనసాగుతున్న శ్రీవర్ధన్రెడ్డి సహా మాజీ ఎంపీ జితేందర్రెడ్డి తనయుడు మిథున్రెడ్డి, టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్థన్రెడ్డి టికెటు ఆశిస్తున్నారు. బూత్ లెవల్లో పార్టీ పటిష్టత కోసం పాటుపడటం లేదనే విమర్శలు ఉన్నాయి. మారుమూల గ్రా మాల్లోనే కాదు పట్టణ ప్రాంతాల్లోనూ మరింత బలపడాల్సిన అవసరం ఉంది. చేవెళ్లలో.. ప్రధాని మోదీపై ఉన్న అభిమానంతో యువత బీజేపీ వైపు ఆకర్షితులవుతోంది. ఇక్కడ అధికారపార్టీని ప్రభావితం చేయగలిగే లీడర్లు లేకపోవడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నాయకుడు వస్తే తప్ప పట్టు సాధించలేని పరిస్థితి. మొదటి నుంచి పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్ నేతలు సైతం అధికారపార్టీ అభ్యర్థితో పోటీపడలేకపోతున్నారు. ఇక్కడ పాగా వేయాలంటే కేడర్ శక్తికి మించి కష్టపడాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో.. అంతర్గత కుమ్ములాటలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి. ఏదైనా సమస్యపై అధిష్టానం పిలుపు ఇస్తే కానీ కేడర్ రోడ్డుపైకి రావడం లేదు. ప్రజల్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం కూడా పెద్దగా చేయడం లేదంటున్నారు. గత ఎన్నికల్లో కొత్త అశోక్గౌడ్ పార్టీ తరఫున పోటీ చేసి 17 వేల ఓట్లు మాత్రమే సాధించారు. తుర్కయంజాల్, పెద్ద అంబర్పేట్, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఒకటి రెండు సీట్లకే పరిమితమైంది. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేస్తే కానీ పోటీలో నిలబడలేని పరిస్థితి. రాజేంద్రనగర్లో.. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇక్కడ పార్టీ బలపడింది. ప్రాబల్యమున్న ప్రాంతాలు మినహా అన్ని చోట్ల పట్టు సాధించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఐదు డివిజన్లు ఉండగా, వీటిలో మూడు గెలుచుకుంది. శంషాబాద్ పట్టణం.. మండలాల్లో కేడర్ పటిష్టంగా ఉంది. మైలార్దేవులపల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి, బుక్క వేణుగోపాల్ పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల లోక్సత్తా రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోల్కర్రెడ్డి సైతం బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఆ పారీ్టకి కలిసి వచ్చే అంశం. క్షేత్రస్థాయి లీడర్లు, కేడర్ కలిసికట్టుగా పని చేస్తే విజయానికి అవకాశం లేకపోలేదు. మహేశ్వరంలో.. జీహెచ్ఎంసీలోని ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్లు సహా తుక్కుగూడ చైర్మన్ స్థానం బీజేపీ కైవసం చేసుకుంది. బడంగ్పేట్, మీర్పేట్, జల్పల్లి మున్సిపాలిటీల్లోనూ పార్టీ ప్రభావం చూపింది. కందుకూరు ఎంపీపీ కూడా ఆ పార్టీ అభ్యర్థే. మహేశ్వరం మండలం లోని పలు గ్రామాల్లోని ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలు పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, సీనియర్ నేత అందెల శ్రీరాములు యాదవ్, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్గౌడ్ ఇక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. సంస్థాగతంగా పార్టీ బలంగా ఉన్నప్పటికీ లీడర్ల మధ్య అంతర్గత విభేదాలు పుట్టిముంచే ప్రమాదం ఉందంటున్నారు. -
చెప్పుల్లేని విద్యార్థులు.. చలించిన మంత్రి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మిట్ట మధ్యాహ్నం.. సూరీడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఆ సమయంలో కొందరు విద్యార్థులు కాళ్లకు చెప్పుల్లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ విద్యాశాఖ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి కంటపడ్డారు. ఆమె వెంటనే కాన్వాయ్ని ఆపి విద్యార్థులతో మాట్లాడి వారికి మంచినీళ్లు, చాక్లెట్లు, షూస్, స్నాక్స్ అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం ఉదయం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం అటు నుంచి మహేశ్వరం నియోజకవర్గానికి రోడ్డుమార్గంలో బయల్దేరారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండల్లో మామిడిపల్లి వద్ద పలువురు విద్యార్థులు కాళ్లకు చెప్పుల్లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ మంత్రి కంటపడ్డారు. చలించిన మంత్రి వారిని దగ్గరికి పిలిచి ఆప్యాయంగా పలకరించారు. టీఆర్ఎస్ నేత నిమ్మల నరేందర్గౌడ్కు ఫోన్ చేసి, వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వెంటనే ఆయన ఆయా విద్యార్థులకు షూస్ సహా స్నాక్స్, నీరు అందజేశారు. దీంతో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేవు. -
అప్పా–మన్నెగూడ రహదారి విస్తరణకు మోక్షం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎప్పుడెప్పుడా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్లే ఎన్హెచ్–63 (అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు.. 46 కి.మీ) నాలుగులేన్ల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.956 కోట్ల అంచనాలతో చేపట్టే ఈ పనుల కాంట్రాక్ట్ను సాగునీటి ప్రాజెక్టులు ఇతర నిర్మాణ రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన మెఘా ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్ సంస్థ చేజిక్కించుకుంది. కేటాయించిన నిధుల్లో రూ.786 కోట్లు రహదారి నిర్మాణానికి ఖర్చు చేయనుంది. మిగిలిన మొత్తాన్ని భూ సేకరణకు వెచ్చించనుంది. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గ్రామాలకు సర్వీసు రోడ్లు సైతం అందుబాటులోకి వస్తాయి. రోడ్డుకిరువైపులా గ్రామీణ ప్రజల సౌకర్యార్థం మొత్తం 18 ప్రాంతాల్లో అండర్ పాస్లు రానున్నాయి. వీటిలో మొయినాబాద్ అండర్ పాస్ (100 మీటర్లు) పెద్దది. (క్లిక్: హైదరాబాద్లో ఫుట్పాత్ల వైశాల్యం ఎంతో తెలుసా?) ఈ రోడ్డు పనులు పూర్తయితే మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, వికారాబాద్ ప్రాంత ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రయాణం సులభతరం కావడంతో పాటు రోడ్డు ప్రమాదాలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఇదిలాఉండగా చేవెళ్ల సమీపంలో రోడ్డుకు ఇరువైపులా భారీ మర్రి, ఇతర వృక్షాలు ఉన్నాయి. వీటి తొలగింపుపై ఇప్పటికే పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఎలా సంరక్షిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. (క్లిక్: ‘సిటీ’జనులకు షాక్..! బస్ పాస్ చార్జీలు భారీగా పెంపు) -
111 జీవో ఎత్తివేస్తే.. భూముల ధరలకు రెక్కలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జీవో 111 ఎత్తివేత ప్రభావం భూముల విలువలపై దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు, ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల దృష్టి జీవో 111 ప్రాంతాలపై పడనుండడం జీహెచ్ఎంసీ పరిధిలోని ఇతర ప్రాంతాల భూలావాదేవీలపై ప్రభావం చూపనుంది. ఈ జీవో ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో.. జీవో పరిధిలోనికి వచ్చే ప్రాంతాల్లో అప్పుడే భూముల ధరలకు రెక్కలు రాగా అవి చుక్కలనంటుతాయనే చర్చ జరుగుతోంది. శంకర్పల్లి, చేవెళ్ల, శంషాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్, షాబాద్ మండలాల్లో ప్రస్తుతం గరిష్టంగా ఎకరం ధర రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పలుకుతుండగా సమీప భవిష్యత్తులోనే అది రూ.15–20 కోట్ల వరకు పెరగనుందని రియల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం గజం రూ.లక్షకు పైగా పలుకుతున్న కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కోకాపేట, నార్సింగి (ఐటీ కారిడార్) వంటి ప్రాంతాలతో పాటు రాజధాని నలుదిక్కులా ఉండే ఇతర శివార్లలో కొంత స్తబ్దత నెలకొనే అవకాశముందని అంటున్నారు. అడ్డగోలు ధరలకు తాత్కాలికంగా కళ్లెం జీవో పరిధిలో 84 గ్రామాలు ఉండగా వీటి పరిధిలో 1,32,600 ఎకరాల భూమి ఉంది. ఇందులో 18,332 ఎకరాలు ప్రభుత్వ, 9,235 ఎకరాల అసైన్డ్, 2,660 ఎకరాల సీలింగ్, 1,256 ఎకరాల భూదాన, ఇలా.. మొత్తం 31,483 ఎకరాల ప్రభుత్వ భూము లు ఉన్నాయి. 111 జీవో ఎత్తివేయడం, సవ రించడం వల్ల ఆ భూములన్నీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ భూములను చేజిక్కిం చుకుని తమ సంస్థలను నెలకొల్పాలని జాతీయ, అంతర్జాతీయ ఐటీ అనుబంధ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు భావిస్తున్నాయి. వాస్తవానికి హైదరాబాద్ విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లు కాగా, అదే 111 జీవో పరిధిలోని భూ విస్తీర్ణం 538 చ.కి.మీ.గా ఉంది. అంటే హైదరాబాద్ విస్తీర్ణం కంటే.. జీవో ఎత్తివేత, సవరణల కారణంగా అందుబాటులోకి వచ్చే భూవిస్తీర్ణమే అధికం అన్నమాట. న్యాయపరమైన చిక్కులు లేకుండా, ఓ ప్రణాళిక బద్ధంగా, పర్యావరణహితంగా సరికొత్త మాస్టర్ప్లాన్తో ప్రభుత్వం ముందుకెళ్తే..హైదరాబాద్ లాంటి మరో అద్భుత, అహ్లాదకరమైన నగరం కళ్ల ముందు ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. అంతేకాదు పెద్దయెత్తున భూమి అందుబాటులోకి రానుండటంతో ఇప్పటివరకు పలు ప్రాంతాల్లో అడ్డగోలుగా పెరుగుతున్న భూముల ధరలకు తాత్కాలికంగా కళ్లెం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూముల అమ్మకంపై రైతుల్లో పునరాలోచన జీవో కారణంగా ఈ జోన్ పరిధిలోని నిర్మాణాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ..గతకొంత కాలంగా ఫాం హౌస్ల పేరుతో ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాఫీగానే సాగుతోంది. భూముల ధరలకు రెక్కలు రావడంతో శిఖం భూములన్నీ కబ్జాకు గురయ్యాయి. ఇప్పటికే ఇక్కడ అనేక అక్రమ నిర్మాణాలు వెలిశాయి. 426 లే అవుట్లలో 10,907 ఇళ్లు, గ్రామాల్లో 4,527 ఇళ్లు, 1,920 వాణిజ్య భవనాలు వెలిశాయి. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు అప్పుడప్పుడు స్పందించి అక్రమ నిర్మాణాలు కూల్చివేసినా.. ఆగకపోగా మరింత పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు స్థానికుల డిమాండ్ నేపథ్యంలో ఈ జీఓను ఎత్తి వేయనున్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించడంతో భూములకు మరింత డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భూములు అమ్ముకోవడం కంటే..మరికొంత కాలం ఎదురు చూడటమే ఉత్తమని రైతులు భావిస్తున్నారు. అడ్వాన్సులు తీసుకున్న కొందరు డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు. గతంలో ఒక్కో డాక్యుమెంట్ రైటర్ రోజుకు సగటున 10–15 రాస్తే..ప్రస్తుతం ఒకటి, రెండు డాక్యుమెంట్లకే పరిమితమవుతుండటం ఇందుకు నిదర్శనం. -
సాక్షి ఎఫెక్ట్: హెచ్ఎండీఏ భూముల పరిశీలన
సాక్షి, శంషాబాద్: కోట్లాది రూపాయలు విలువ చేసే భూముల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎండీఏ స్థానిక అధికారుల తీరుపై రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో పాటు హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు శుక్రవారం ఆరా తీసినట్లు సమాచారం. ప్రైవేట్ వెంచరు పరిధిలోకి వెళ్లిన భూమి వివరాలను పూర్తిగా నివేదించాలని అధికారులను కోరినట్లు తెలిసింది. పట్టణంలోని సర్వేనంబరు 626/1 ఉన్న హెచ్ఎండీఏకు 360 ఎకరాల భూమి ఉండగా అందులో పక్కనే ఉన్న ఓ ప్రైవేట్ వెంచర్లో 5.15 ఎకరాల భూమి, రైతుల ఆధీనంలో మరో 6.29 ఎకరాల భూమి ఉన్నట్లు తాజాగా రెవిన్యూశాఖ చేపట్టిన సర్వేలో తేలింది. ఈ విషయమై శుక్రవారం ‘సాక్షి’ ‘ఆ స్థలం సర్కారుదే’ అన్న శీర్షికతో వచ్చిన కథనం అటు అధికార వర్గాల్లో.. ఇటు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పరిశీలించిన అధికారులు మున్సిపల్, రెవిన్యూ అధికారులు మరో మారు హెచ్ఎండీఏ స్థలాన్ని పరిశీలించారు. హెచ్ఎండీఏ స్థలంలో ఉన్న రహదారితో పాటు ఓ వ్యక్తికి సంబంధించిన ప్రహరీ, మరో వ్యక్తి ఇంటికి సంబంధించి ఓ పిల్లర్తో పాటు ఓ గది కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని హెచ్ఎండీఏ అధికారులకు వివరించారు. త్వరలో హెచ్ఎండీఏ అధికారులు పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ లేదా ఎదైనా ఇతర సరిహద్దులను ఏర్పాటు చేసి విలువైన స్థలాలను పరిరక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: ఐదుగురు పోలీసులపై వేటు తప్పదా..!) -
ఆ స్థలం సర్కారుదే.. వెలుగులోకి కబ్జా పర్వం
సాక్షి, శంషాబాద్: కోట్లాది రూపాయల విలువజేసే హెచ్ఎండీఏ భూ కబ్జా గుట్టు రట్టయింది. ఆరోపణలు, ఫిర్యాదులు వాస్తవమేనని సర్వే తేల్చిచెప్పింది. శంషాబాద్ పట్టణం నడిబొడ్డున చేసిన అక్రమ వెంచర్లో 5.15 ఎకరాల హెచ్ఎండీఏ భూమి అన్యాక్రాంతమైనట్లు తేలింది. దాదాపు రూ.50 కోట్ల పైచిలుకు విలువ చేసే ఈ భూమి అన్యాక్రాంతంపై హెచ్ఎండీఏ నిండా నిర్లక్ష్యం వహించినా స్థానికులు పోరు చేసి వాస్తవాలను బయటికి రప్పించారు. అసలేం జరిగింది? ► శంషాబాద్ పట్టణంలోని సర్వేనంబరు 626బై1 హెచ్ఎండీఏకు సంబంధించి 360 ఎకరాల భూమి ఉంది. ఓఆర్ఆర్ నిర్వాసితులతో పాటు విమానాశ్రయంలో ఇళ్లు, భూములు కోల్పోయిన వారికి ఇక్కడ ప్లాట్లు కేటాయించడంతో పాటు ఖాళీ స్థలాలున్నాయి. దీని పక్కనే ఆరేళ్ల క్రితం సర్వేనంబరు 551 నుంచి 600 వరకు సర్వే ఉన్న భూమిలో భారీ వెంచర్ ఏర్పాటు చేశారు. దీని పక్కనే హెచ్ఎండీఏకు సంబంధించిన సర్వే నంబరు 626బై1ని ఆనుకుని ఉంది. ► ఇది పూర్తిగా గుట్ట ప్రాంతంతో పాటు కొన్ని దేవాలయాలు కూడా ఉండేవి. కార్పొరేట్ స్థాయి వ్యక్తులు వెంచర్లు ఏర్పాటు చేసినప్పటికీ కొందరు స్థానిక నేతలే ఇందులో భారీగా క్రయ విక్రయాలు దగ్గరుండి మరీ చూసుకున్నారు. క్రమంగా అభివృద్ధి చేసిన వెంచర్లో పురాతన దేవాలయాలను తొలగించడంతో పాటు పక్కనే ఉన్న హెచ్ఎండీఏ 5.15 ఎకరాల భూమిని కూడా అందులో కలిపేసుకున్నారు. ► ఈ స్థలంలో రహదారులు వేసి అభివృద్ధి కూడా చేశారు. ఇందులో అధికార పార్టీ నేతల నుంచి కొందరు హెచ్ఎండీఏ మాజీ అధికారులు కూడా సహకరించినట్లు సమాచారం. ఇదే సర్వేనంబరు హెచ్ఎండీఏకు సంబంధించిన మరో 6.29 ఎక రాల భూమిలో రైతులు కబ్జాలో కొనసాగుతున్నారు. ఇది ప్రారంభం నుంచి వివాదాస్పదంగానే ఉంది. (క్లిక్: దృశ్యం సినిమా తరహాలో తప్పించుకునేందుకు యత్నం) నిండా నిర్లక్ష్యం ► పునరావాసం కింద కేటాయించిన స్థలాలతో పాటు హెచ్ఎండీఏ మిగులు స్థలాలపై ఆది నుంచీ నిండా నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఇదే అదనుగా ఇప్పటికే కొందరు నకిలీ దస్తావేజులతో ఒకే ప్లాటు నలుగురైదుగురికి విక్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతేడాది ఆర్డీఓ జారీ చేసినట్లు నకిలీ పట్టా సర్టిఫికెట్లు సృష్టించిన వైనంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఆర్డీఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అక్రమార్కులను కటకటాల్లోకి పంపారు. ► ఇటీవల హెచ్ఎండీఏ భూమి కబ్జాపై స్థానికులతో పాటు కొందరు ప్రజాప్రతినిధులు కూడా సీఎంఓ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డిసెంబరు 29 రెవిన్యూ అధికారులు సర్వే పనులు షురూ చేశారు. రెండు రోజుల క్రితం సర్వే పూర్తి చేసి అధికారులకు నివేదిక అందించారు. కబ్జా జరిగింది వాస్తవమేనని తేల్చారు. త్వరలోనే సంబంధిత భూమిని స్వాధీనం చేసుకునేందుకు హెచ్ఎండీఏ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. (క్లిక్: హెచ్ఎండీఏ ప్లానింగ్లో దళారుల దందా : ఆమ్యామ్యాలు లేకుంటే పెండింగే) కబ్జా వాస్తవమే.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని సర్వేనంబరు 626బై1 ఉన్న హెచ్ఎండీఏకు సంబంధించిన 360 ఎకరాలతో పాటు సమీపంలో ఉన్న స్థలాను సర్వే పూర్తి చేశాం. హెచ్ఎండీకు సంబంధించిన 5.15 ఎకరాల భూమి వెంచర్లో కలిసినట్లు తేలింది. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా హెచ్ఎండీఏ, మున్సిపాలిటీలకు సూచించాం. సర్వే నివేదికలను ఉన్నతాధికారులకు అందజేశాం. – జనార్దన్రావు, శంషాబాద్ తహసీల్దార్ -
బీర్ పీనా.. దూద్ దేనా !
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధిక పాల దిగుబడి కోసం గేదెలు, ఆవులకు మోతాదుకు మించి బీర్దాణా (బీర్ తయారు చేయగా మిగిలిన వ్యర్థాల లిక్విడ్) తాగిస్తున్నారు. ఇలా చేయడం వలన ప్రత్యక్షంగా పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు.. పరోక్షంగా పాలు తాగిన చిన్నారుల అనారోగ్యానికి కారణమవుతున్నారు. సాధారణంగా పాలిచ్చే గేదెలు, ఆవులకు రైతులు అధిక పాల దిగుబడి కోసం కడుపునిండా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, పల్లిపట్టి, బెల్లంపట్టి, కుసుమ నూనె తీయగా మిగిలిన కిల్లి, తవుడు, కందిపొట్టు, మొక్కజొన్నతో తయారు చేసిన సంప్రదాయ దాణా వాడుతుంటారు. వీటిలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. అయితే బహిరంగ మార్కెట్లో ఈ దాణా ధరలు రెట్టింపవడంతో వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు కొంతమంది పక్కదారిపట్టారు. ధర తక్కువ బీర్ తయారీ కంపెనీలు ట్యాంకర్ల ద్వారా రహస్యంగా సరఫరా చేస్తున్న బీర్దాణాను డ్రమ్ముకు రూ.900 నుంచి రూ.1,000 చొప్పున కొనుగోలు చేసి పశువులకు అందిస్తున్నారు. సంప్రదాయదాణాలో ఐదు శాతానికి మించి బీర్దాణా వాడకూడదు. కానీ తక్కువ ధర.. 20–30 శాతం పాలు ఎక్కువగా ఇస్తుండడంతో రైతులు ఒక్కో పశువుకు రోజుకు సగటున నాలుగు నుంచి ఐదు కిలోల చొప్పున వాడుతున్నారు. పశువుల ఆరోగ్యానికి ఇది హానికరమని వైద్యులు హెచ్చరించినా పెడ చెవిన పెడుతున్నారు. ఫలితంగా పశువుల జీవితకాలం పదిహేనేళ్ల నుంచి పదేళ్లకు పడిపోతోంది. ఎనిమిది నుంచి పది ఈతలు ఈనాల్సిన గేదెలు నాలుగైదు ఈతలకే పరిమితమవుతున్నాయి. ఆరోగ్యపరిస్థితి క్షీణించి, త్వరగా మృత్యువాత పడుతున్నాయి. పశువుల పాకలోని డ్రమ్ముల్లో బీర్ లిక్విడ్ డిమాండ్ ఎక్కువ కావడంతో.. పశువైద్యశాఖ అధికారుల అంచనా ప్రకారం జిల్లా లో 1,88,182 పశువులు ఉండగా, వీటిలో 1,22, 58 7 గేదెజాతివి ఉన్నాయి. విజయ, మదర్ డెయి రీలు 8,570 మంది రైతుల నుంచి పాలు సేకరిస్తున్నాయి. గ్రేటర్ వాసులకు రోజుకు కనీసం 25–30 లక్షల లీటర్ల పాలు అవసరమవుతుండగా, ప్రస్తుతం జిల్లాలో 2.50 లక్షల లీటర్లకు మించి సరఫరా కావడం లేదు. బహిరంగ మార్కెట్లో లీటర్ పాలను రూ.70 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. దిగుబడికి, డిమాండ్కు మధ్య భారీ వ్యత్యాçసం ఉండడంతో రైతులు పశువుల నుంచి అధిక దిగుబడి సాధించేందుకు బీర్దాణాను వాడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 4,144 పాడిపశువులను 75 శాతం నుంచి 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేశారు. పశుగ్రాస సాగు కోసం ఈ ఏడాది ఇప్పటి వరకు 140.2 మెట్రిక్ టన్నుల విత్తనాలు సరఫరా చేశారు. సొంతంగా పొలం ఉన్న వారు గడ్డినిసాగు చేసినప్పటికీ.. పొలం లేనివారు పశువులకు ఆహారంగా బీర్దాణాను వినియోగిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రభుత్వం సరఫరా చేసిన పశువుల్లో ఇప్పటికే 417 చనిపోవడం గమనార్హం. ఆరోగ్య సమస్యలు వస్తాయి సాధారణంగా మక్క, తవుడు, వేరుశశగ చెక్క, కందిపొట్టుతో తయారు చేసిన దాణాను పశువులకు వాడుతుంటారు. కిలో రూ.25 నుంచి రూ.30 వరకు ఖర్చవుతుంది. బీర్దాణాకు లీటర్కు రూ.పదిలోపే దొరుకుతోంది. ఇందులో ఆల్కాహాల్ శాతం ఎక్కువగా ఉండడంతో పశువులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పాలల్లో ఎసిడిటీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగిన పిల్లలకు జీర్ణకోశ సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదముంది. – డాక్టర్ శంకర్,వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, తలకొండపల్లి -
ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును చేధించిన రాచకొండ పోలీసులు
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును రాచకొండ పోలీసులు గురువారం చేధించారు. మట్టారెడ్డి గ్యాంగే హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. మట్టారెడ్డితో పాటు ముగ్గురు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మట్టారెడ్డి, మొహినుద్దీన్, నవీన్తోపాటు మరో ఇద్దురిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్రెడ్డి, రాఘవేందర్రెడ్డిని కాల్చి చంపింది సుపారీ గ్యాంగ్గా తేల్చారు. మోహినుద్దిన్ మట్టారెడ్డి వాచ్మెన్గా, నవీన్ శ్రీనివాస్రెడ్డి బినామీగా పోలీసులు గుర్తిచారు.