Raithu bandhu scheme
-
వీఆర్ఓ ఆత్మహత్య
నార్కట్పల్లి: పని ఒత్తిడి భరించలేక ఓ వీఆర్ఓ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పంగ కృష్ణయ్య (46) కట్టంగూర్ మండలం పరడ గ్రామంలో వీఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. పాసు పుస్తకాలు అందడం లేదని, రైతుబంధు పథకానికి దూరమవుతున్నామని పలువురు రైతులు ఇటీవల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్.. రైతుల సమస్యలను పరిష్కరించాలని ఇన్చార్జి తహసీల్దార్ మహ్మద్ అలీని ఆదేశించారు. దీంతో ఈ నెల 7న కృష్ణయ్యతో పాటు మరో ఐదుగురికి చార్జీ మెమోలు జారీ చేశారు. పని ఒత్తిడితో పాటు మెమో రావడంతో మనస్తాపానికి గురైన కృష్ణయ్య.. తన పొలం వద్ద పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల రైతులు గమనించి వెంటనే నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. పని ఒత్తిడితోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య పుష్పలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. బదిలీ చేయాలని విజ్ఞప్తి గ్రామంలో పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, తనను బదిలీ చేయాలని కృష్ణయ్య.. తహసీల్దార్ను కోరగా, ఈ నెల 20వ తేదీ తర్వాత చేస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈలోపే అతను ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
పట్టా.. పరేషాన్
సాక్షి, జనగామ: రైతులను పట్టాదారు పాస్బుక్కులు పరేషాన్ చేస్తున్నాయి. చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకొని రైతుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడానికి అవినీతి అధికారులు ప్రయత్నిస్తుండడంతో ఇక్కట్లు తప్పడం లేదు. అర్హత ఉన్నప్పటికీ పట్టాలు మాత్రం అందించడం లేదు. పట్టాదారు పాస్ బుక్కులు రాక పోవడంతో నిత్యం కార్యాలయాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. పట్టాలు చేతికి రాకపోవడంతో ప్రభుత్వపరంగా రైతులకు అందాల్సిన సౌకర్యాలు రాక పోవడంతో అరిగోస పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 12మండల్లాల్లో 5,62,573 ఎకరాల భూ విస్తీర్ణం ఉంది. అందులో 3,42,635 ఎకరాల సాగు భూమి ఉంది. 193 రెవెన్యూ గ్రామాల్లో 1,50,847 సర్వే నంబర్లలో భూమి విస్తీర్ణం విస్తరించి ఉంది. బచ్చన్నపేట: పై ఫొటోలో కనిపిస్తున్న మహిళా రైతు బచ్చన్నపేట మండలం ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన కాకల్ల పద్మ. 2011 సంవత్సరంలో తన భర్త (బాలయ్య) చనిపోగా పద్మ మామ అయిన కాకల్ల సాయిలు పేరు మీద ఉన్న నాలుగు ఎకరాల భూమిని తన ముగ్గురు కుమారుల పేరున 2017 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించాడు. ఒక్కొక్కరికి 1.14 ఎకరాల చొప్పున పట్టేదార్ పాస్ పుస్తకాలు కూడా వచ్చాయి. కానీ ఇంత వరకు రైతుబంధు, ప్రధానమంత్రి కిసాన్ యోజన డబ్బులు రావడం లేదు. ఇదేమిటని వ్యవసాయ అధికారులను అడిగితే రికార్డులు సరిగా చేయలేదని, అందుకే డబ్బులు రావడం లేదని అంటున్నారు. వ్యవసాయ కార్యాలయానికి వెళితే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లమని, అక్కడకు వెళితే ఇక్కడకు వెళ్లమని తిప్పించుకుంటున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఈ సమస్య ఒక్క పద్మదే కాదు జిల్లాలోని పలువురి రైతుల పరిస్థితి ఇలానే ఉంది. తప్పని తిప్పలు.. పట్టాదారు పాసుబుక్కుల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. 2017, సెప్టెంబర్ 17వ తేదీ జిల్లాలో భూ ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా 1,50,847 సర్వే నంబర్లను పరిశీలన చేశారు. ఇప్పటి వరకు 1,45,993 పట్టాదారు పాసు పుస్తకాలను అందించారు. 4,854 పట్టాదారు పాసు పుస్తకాలను పార్ట్–బీలో పెట్టారు. పెండింగ్లో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాల కోసం రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వసూళ్ల దందా.. పట్టాదారు పాసుబుక్కులను రైతులకు ఇవ్వడానికి రెవెన్యూ అధికారులు బహిరంగంగానే డబ్బులను డిమాండ్ చేస్తున్నారు. పట్టాదారు పాసుబుక్కులను తీసుకోవడానికి సాదాబైమానా పత్రాలను అనుమతి ఇచ్చింది. దీంతో క్షేత్రస్థాయిలోని వీఆర్ఓలు చేతివాటానికి తెరతీశారు. పట్టాదారు పాసుబుక్కుల కోసం మీ సేవలో మ్యూటేషన్ చేసిన రైతులకు కేవలం 45 రోజుల్లో పట్టాను అందించాల్సి ఉంది. కాని విచారణ పేరుతో రెవెన్యూ అధికారులు తమకు డబ్బులు కావాలని కాలయాపన చేస్తున్నారు. ఎకరానికి రూ.10 నుంచి రూ. 20వేల వరకు తీసుకుంటున్నారు. వ్యవసాయ భూములకు ధరలు పెరగడంతో అధికారులు సైతం ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు. ఎక్కువ ధర ఉన్న భూమలకు మరింత ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అధికారులు అడిగినంత ముట్టచెప్పినప్పటికీ పట్టాలు మాత్రం చేతికి అంతక ఇక్కట్లు పడుతున్నారు. పథకాలకు దూరం... పట్టాదారు పాసుబుక్కులు రాకపోవడంతో రైతులు ప్రభుత్వ పథకాలను అందుకోలేక పోతున్నారు. రైతుబంధు, రైతుబీమా, కిసాన్ యోజన వంటి పథకాలకు అర్హులు కాలేక పోతున్నారు. ప్రభుత్వ పథకాలకు నోచుకోక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు భూములు ఉన్నప్పటికీ పట్టాదారు పాసుబుక్కులు లేని కారణంగా ప్రభుత్వ పథకాలకు అర్హులు కాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. రెండేళ్లుగా తిరుగుతున్నా.. మా అమ్మ లచ్చవ్వ పేరు మీద ఉన్న బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామ శివారులో ఏడు ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని నా కుమారుడి పేరుమీద పట్టా చేయాలని వీఆర్ఓను సంప్రదించాను. దీనికి ఆయన కొంత డబ్బులు అవసరమని తెలపడంతో అడిగిన డబ్బులు ఇచ్చా. నా పనిని గత రెండేళ్లుగా పెండింగ్లో పెట్టాడు. రైతుబంధు, కిసాన్ యోజన డబ్బులు ఇంత వరకు రాలేదు. రైతు బీమా బాండ్లు కూడా రాలేదు. ఏ అధికారికి చెప్పినా సమస్యను పట్టించుకోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.– గొడుగు సిద్ధిరాములు, రైతు తిప్పుకుంటున్నారు.. స్టేషన్ఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామ శివారులో దాదాపు 40 ఏళ్ల క్రితం రెండు ఎకరాల భూమి కొనుగోలు చేశాం. అప్పటి నుంచి సదరు భూమిలో మేమే కాస్తులో ఉన్నాం. పట్టాదారు పాసుపుస్తకం కోసం తిరుగుతున్నా.. ఇంతవరకు అధికారులు స్పందించడం లేదు. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, బ్యాంకులో అందించే క్రాప్లోన్లు రావడం లేదు. రెవెన్యూ రికార్డులో తప్పుగా మరొకరి పేరు ఉండటంతో రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వడం లేదు. దీంతో ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. అధికారులు స్పందించి విచారణ చేపట్టి పట్టాదారు పుస్తకం అందించి ఆదుకోవాలి.– నీల ఇంద్రమ్మ, శివునిపల్లి వీఆర్వోలు మారిన పట్టా రాలేదు.. పట్టాదారు పాసుబుక్ కోసం తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. 1బీ పహణీలో వస్తున్నది. ఫొటో తప్పుగా వచ్చింది. తప్పుగా వచ్చిన ఫొటోను సరిగా చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటికీ ఇద్దరు వీఆర్వోలు మారిన కొత్త పట్టా పాస్బుక్ రాలేదు.– అనపర్తి చంద్రయ్య, వావిలాల రైతు -
రైతుబంధును గల్ఫ్ కార్మికులకు కూడా వర్తింపచేయండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న రైతుబంధు పథకాన్ని గల్ఫ్ వెళ్లిన రైతులకు కూడా వర్తింప చేయాలని తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాలలో ఉన్న సుమారు ఒక లక్షమంది సన్నకారు, చిన్నకారు రైతులకు వర్తింపచేయాలని మాజీ దౌత్యవేత్త, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి డా. బీ.ఎం.వినోద్ కుమార్, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ (ప్రవాసి సంక్షేమ వేదిక) అధ్యక్షులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి ఆదివారం కేంద్రమంత్రి కిషన్రెడ్డికి వినతిపత్రం అందించారు. దీనిపై గతంలోనే ముఖ్యమంత్రి కార్యాలయంలో వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. వలస వెళ్లిన వారిలో వ్యవసాయం దెబ్బతిని, బోర్లు తవ్వించి అప్పులపాలై పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లినవారే ఉన్నారని వారు అన్నారు. భూమిని నమ్ముకుని బతికిన బక్క రైతులు వ్యవసాయం దెబ్బతినడం మూలంగానే విదేశాలకు వెళ్లారని, అలాంటి వారిని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలి కోరారు. ‘‘ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి రైతులందరికీ కొత్త పాసుపుస్తకాలు, ఎకరాకు పంటకు రూ.4 వేల చొప్పున పెట్టుబడిసాయం, ప్రతీ రైతుకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. కానీ విదేశాలకు వలస వెళ్లిన బడుగు రైతులకు ఈ సాయం అందక ముఖ్యంగా గల్ఫ్కు వెళ్లిన వలసకార్మికులు నష్టపోతున్నారు. స్వయంగా భూ యజమాని వచ్చి తమ పేరిట ఉన్న పాసుపుస్తకాన్ని, రైతుబంధు చెక్కు అందుకోవాలని, బీమా ఫారంపై సంతకం చేయాలనే నిబంధన వలసరైతుల పాలిట శాపమైంది. గల్ఫ్ దేశాల నుండి ప్రత్యేకంగా ఇందుకోసం రావాయాలంటే ఎంతో వ్యయంతో కూడుకున్న పని’’అని వారు అభిప్రాయపడ్డారు. ఈమేరకు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ‘‘రైతుబంధు పెట్టుబడిసాయం చెక్కులను గల్ఫ్ వెళ్లిన రైతుల ఎన్ఆర్ఓ (నాన్ రెసిడెంట్ ఆర్డినరీ) బ్యాంకు అకౌంట్లలో లేదా వారి కుటుంబ సభ్యుల అకౌంట్లలో జమచేయాలి. మండల వ్యవసాయ అధికారి లేదా తహసీల్దార్ ఎన్నారై రైతుల నుండి ఇ-మెయిల్ ద్వారా ఒక అంగీకార పత్రాన్ని తెప్పించుకోవాలి. ఎన్నారై రైతుల వ్యవహారాలను చూడటానికి వ్యవసాయ శాఖ కమిషనరేట్ లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి’’ అని పేర్కొన్నారు. -
రైతు రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి : కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 7 మాసాలు గడుస్తున్నా రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి సహాయం చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్.. ఈ అంశంపై ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. అసలు రుణమాఫీ ఒకేసారి చేస్తారా, విడతల వారీగా చేస్తారా అనే స్పష్టత ఇవ్వాలన్నారు. రైతు బంధు పథకం పై గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పవరకు కేవలం 50 శాతం రైతులకు మాత్రమే రైతు బంధు చెక్కులు అందాయన్నారు. రైతులు చెల్లించాల్సిన ఏడు శాతం వడ్డిలో ప్రభుత్వం నాలుగు శాతం చెల్లిస్తే మిగతా మూడు శాతం రైతులు చెల్లించి వడ్డీ లేకుండా లక్ష రూపాయల రుణం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. గత రుణం చెల్లిస్తినే కొత్త రుణం ఇస్తామని బ్యాంకులు చెప్పటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, దీనికి చర్యగా ప్రభుత్వం బ్యాంకులు వెంటనే కొత్త రుణాలను జారీ చేసేలా ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బ్యాంకర్స్తో మీటింగ్ ఏర్పాటు చేసి మిగతా నాలుగు శాతం కేంద్రం నాబార్డ్ ద్వారా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. -
పథకాలు బాగు.. ‘కారు’ సారే కావాలి
సాక్షి, నెట్వర్క్ : ‘ప్రభుత్వ పథకాలు బాగున్నాయి.. వీటిని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించాలి. అప్పుడే అందరికీ న్యాయం జరుగుతుంది..’ ‘సంక్షేమ పథకాల అమలు బాగానే ఉంది.. అయితే, ఆ మేరకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఏటా నిధుల శాతం పెంచాలి. అప్పుడే లబ్ధిదారుల జీవన ప్రమాణాలు మారతాయి..’ ‘రైతుబంధు భేష్.. రైతుబీమా ఇంకా బాగుంది. అయితే, భూమి పట్టా సమస్యలున్నాయి. వీటిని కూడా పరిష్కరిస్తేనే రైతులందరూ సంతోషంగా ఉంటారు..’ ‘నిరంతర విద్యుత్, మిషన్ కాకతీయ పథకాలు గణనీయమైన మార్పు తెచ్చాయి. వ్యవసాయ రంగం స్థితిగతులనే మార్చేశాయి..’ ఇవీ ‘సాక్షి’ రోడ్డు షోలో వివిధ వర్గాల ప్రజల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలు... తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బాగున్నాయని కితాబిచ్చిన ప్రజలు.. వాటిని నిరంతరం మెరుగుపరుస్తూ కొనసాగించాలని ఆకాంక్షించారు. అప్పుడే సమాజంలోని అన్ని వర్గాలకూ న్యాయం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కే మద్దతునిస్తామని పలువురు ముక్తకంఠంతో చెప్పారు. అయితే, బీజేపీ పెద్దనోట్ల రద్దుతో రోడ్డున పడ్డామని పలువురు వాపోయారు. తమ డబ్బులు తాము బ్యాంకుల నుంచి తీసుకోవడానికి కూడా నానాపాట్లు పడ్డామని గుర్తు చేసుకున్నారు. రేణుకా చౌదరి (కాంగ్రెస్), నామా నాగేశ్వరరావు (టీఆర్ఎస్), వెంకట్ (సీపీఎం).. తలపడుతున్న ఖమ్మం లోక్సభ స్థానంలో జనం స్పందన తెలుసుకునేందుకు ‘సాక్షి’ రోడ్డు షో నిర్వహించింది. రాష్ట్ర సర్కారు పాలన ఎలా ఉంది? ఈ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతునిస్తారు? కేంద్రంలో ఎవరు/ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?, పుల్వామా దాడులతో సహా ఇంకా ఏయే అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని అనుకుంటున్నారు? అని ‘సాక్షి’ ప్రశ్నించగా, పలువురు భిన్నంగా స్పందించారు. అభివృద్ధికి బాటలు వేసుకుంటాం.. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టి.. అమలు చేస్తున్న రైతుబంధు, రుణమాఫీ, నిరంతర విద్యుత్, మిషన్ కాకతీయ పథకాలు బాగున్నాయని, వీటి వల్ల వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వచ్చాయని పలువురు చెప్పారు. ముసలిమడుగుకు చెందిన వ్యవసాయ కూలీ సీహెచ్.సెల్వరాజ్, తల్లాడకు చెందిన దినసరి కూలీ జి. లక్ష్మణ్రావు, అన్నారుగూడెంకు చెందిన వ్యవసాయ కూలీ ఎస్.వెంకటేశ్వరరావు, రెడ్డిగూడెంకు చెందిన కౌలు రైతు వెంకటరెడ్డి మాట్లాడుతూ ‘మిషన్ కాకతీయతో చెరువులు నిండాయి. దీంతో రైతులకే కాక మత్స్యకారులకూ ఉపాధి లభిస్తోంది’ అని తెలిపారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగిన రోడ్డు షోలో ‘సాక్షి’ బృందం పలకరించిన వారిలో ఎక్కువ మంది ‘ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కే పట్టం కడతామని, అభివృద్ధికి బాటలు వేసుకుంటా’మని చెప్పడం విశేషం. పెద్దనోట్ల రద్దుతో మస్తు తిప్పలాయె.. ఈ లోక్సభ ఎన్నికల్లో అభివృద్ధి కాముకులకే పట్టం కడతామని జనం అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, బ్యాంకు లావాదేవీల్లో నెలకొన్న సమస్యల కారణంగా బీజేపీ సర్కారుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. మోదీ హయాంలో శాంతిభద్రతల విషయంలో కొంతమేర బాగానే ఉన్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థ మాత్రం చిన్నాభిన్నమైందని, తాము తీవ్ర ఇబ్బందులపాలయ్యామని రైతులు చెప్పారు. బ్యాంక్లో దాచుకున్న సొమ్ము సమయానికి చేతికందక విసిగి పోయామని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ హయాంలో పాలన ఆశించినంత బాగా జరగలేదని కొంతమంది కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మరికొందరు మాత్రం దేశంలోఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాహుల్గాంధీపై నమ్మకం లేదని కొందరు చెప్పగా, ఇంకొందరు మాత్రం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని, ప్రభుత్వం మారితే తప్ప సామన్యుడికి మేలు జరగదని అభిప్రాయపడ్డారు. ఎండిన పత్తి.. మిర్చి ‘సాక్షి’ బృందం ప్రయాణించిన వివిధ మార్గాల్లో భిన్న దృశ్యాలు కనిపించాయి. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల, కొండాపురం, చింతపల్లి, తిరుమలాయపాలెం మండలం తిరుమలాయపాలెం, పిండిప్రోలు, దమ్మాయిగూడెంలో ప్రధానంగా మిర్చి, పత్తి పొలాలు నీళ్లులేక ఎండిపోయిన దృశ్యాలు కళ్లకు కట్టాయి. ఖమ్మం నుంచి వరంగల్ వెళ్లే ప్రధాన రహదారి వెంబడి ఎక్కడ చూసినా ఎండిన చేలే కనిపించాయి. పంటలు ఎండిపోయి ఆర్థికంగా నష్టపోయామని తమను పలకరించిన రైతులు తెలిపారు. ప్రభుత్వం త్వరితగతిన సీతారామ పథకం ద్వారా సాగునీరు అందించాలని పాలేరు నియోజకవర్గ ప్రజలు కోరారు. సాగర్ జలాల ప్రభావం ఖమ్మం లోక్సభ నియోజకవర్గ ప్రాంతం నాగార్జునసాగర్ రెండో జోన్ పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వం యాసంగి పంటకు సాగర్ జలాలు అందటం లేదు. దీంతో రైతులు ఒకింత అసహనంతో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక దఫా, సండ్ర వెంకటవీరయ్య మరో దఫా సాగర్ జలాలను విడుదల చేయించారు. దీంతో చివరి దశలో పంటలకు జీవం పోసినట్లయింది. ‘సాగర్ జలాల విడుదల అంశం ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం చూపిస్తుంది’ అని చెప్పాడు ఖమ్మం శివార్లలోని టేకులపల్లికి చెందిన చిలకల నారాయణ. ‘సాగర్ జలాలు అందిన కొందరు రైతులు సంతోషంగా ఉన్నారు. అందని రైతులు పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు’ అని ఆయన పరిస్థితిని వివరించారు. పాలన మస్తుంది.. కేసీఆర్ పాలనలో అధికారులు పనులు వెంటనే చేస్తున్నారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా బాగున్నాయి. కేంద్రంలో మాత్రం మోదీ ప్రభుత్వమే రావాలి. – టి.మురళి, దినసరి కార్మికుడు కేంద్రంలోనూ ‘కారే’ రావాలి.. చిన్నచిన్న దుకాణాలు నడుపుకునే మాలాంటి వాళ్లకు కేసీఆర్ ఎంతో సహాయం చేస్తున్నారు. కేంద్రంలో కూడా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వస్తేనే బాగుంటుంది. అనుకున్న పనులను ఒత్తిడి తెచ్చి చేయించుకోవచ్చు. – షేక్ షమీన్, ఆరెంపుల ఓట్లప్పుడే వచ్చుడు.. మా గురించి ఎవరూ పట్టించుకునే వారెవరూ లేరు. ఓట్ల సమయంలోనే ఉరుక్కుంటూ మా దగ్గరికి వస్తరు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే మంచిది. కాంగ్రెస్ వస్తే కేంద్రంలో బాగుంటది. – టి.వీరభద్రం, తిరుమలాయపాలెం కౌలు రైతులకు సాయం టీఆర్ఎస్ సర్కారు అందిస్తున్న పెట్టుబడి సహాయంతో రైతులు సంతోషంగా ఉన్నారు. అలాగే కౌలు రైతులకు కూడా సహాయం చేయాలి. ఎక్కువ సీట్లు టీఆర్ఎస్కు వస్తే మంచిది. – తోట సైదులు, తిరుమలాయపాలెం ‘కారే’ రాబడతది.. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మోదీ పాలనలో బ్యాంకుల ముందు బారులు తీరినం. రాష్ట్రంలో టీఆర్ఎస్ గాలి వీస్తోంది. కేసీఆరే ఎక్కువ సీట్లు రాబడుతడు. – మిడియం లక్ష్మయ్య, ఆనందపురం ఆ పార్టీకే మొగ్గు.. గతంలో ఎన్నికలప్పుడు తండాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇంతవరకూ పనులు చేపట్టలేదు. ఈ ప్రభావం అధికార పార్టీ మీద తప్పకుండా ఉంటుంది. ఖమ్మంలో గెలుపు అవకాశాలు కాంగ్రెస్కే ఎక్కువ. కేంద్రంలో మాత్రం బీజేపీకే అవకాశం. – బి.రవి, వ్యాపారి. అధికారం మూడో ఫ్రంట్దే బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. బ్యాంక్లో దాచుకున్న డబ్బు సమయానికి చేతికి అందక విసిగిపోయాం. కేసీఆర్ చెబుతోన్న ఫెడరల్ ఫ్రంట్కే అవకాశం కనిపిస్తోంది. – జి.సోమేశ్వరరావు, పాల్వంచ. అందరి సంతోషం కోసం.. అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండాలంటే... అది కాం గ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం. బడుగు, బలహీన వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నేను కాంగ్రెస్కే మద్దతునిస్తా. – కొరదల సరస్వతి, మహిళా రైతు, సుజాతనగర్ -
శరత్ తప్పుదోవ పట్టించాడు
నెన్నెల (బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన యువ రైతు కొండపల్లి శరత్ సీఎం కేసీఆర్కు అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాడని కొండపల్లి శంకరమ్మ కూతురు జ్యోతి ఆరోపిం చారు. మాభూమిని వీఆర్వో కరుణాకర్ తమకు తెలియకుండా కొండపల్లి శంకరమ్మ పేరిట పట్టా చేశారని శరత్ ఫేస్బుక్ పేజీలో లైవ్ వీడియో ఉంచడం, సీఎం స్పందించి రైతుతో మాట్లాడి సమస్య పరిష్కరించిన విషయం తెలిసిందే. ఈ విషయమై జ్యోతి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో విలేకరులతో మాట్లా డారు. భూవివాదంపై ఇరువర్గాలతో చర్చించి సమన్యాయం చేయాల్సి ఉండగా సీఎం ఏకపక్ష ఆదేశాలతో అధికారులు తమకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. తాము హైదరాబాద్లో ఉండడం లేదని, రైతుబంధు డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఉద్యోగ రీత్యా శ్రీరాంపూర్లో నివసిస్తున్నామని తెలిపారు. ఫోన్లో భూమి ఎవరి పేరు మీద పట్టా మార్పిడి అయిందన్న కేసీఆర్.. పట్టా అయిన వారు మీకు ఏమవుతారని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కొండపల్లి శంకరయ్య సాగు చేస్తున్న 7.01 ఎకరాల భూమి, తామం తా సాగు చేస్తున్న 2.25 ఎకరాల భూమి ఉమ్మడి ఆస్తి అని, అందరికీ సమానంగా పంచి తమకు న్యాయం చేయాలని జ్యోతి కోరింది. ఈ విషయమై శరత్ స్పందిస్తూ.. 30 ఏళ్ల నుంచి సర్వే నం.271/1ఏ లో ఉన్న భూమిని తామే సాగు చేసుకుంటున్నామని, తమకు సొంత పట్టా ఉందని పేర్కొన్నాడు. అసలు జరిగింది ఇదీ సేత్వార్ రికార్డు ప్రకారం సర్వే నం.270 విస్తీర్ణం 2.25 ఎకరాల భూమికి కొండపల్లి రాజలింగు పట్టాదారు కాగా సర్వే నం.271 విస్తీర్ణం 8.1 ఎకరాల భూమికి కొండపల్లి మల్లయ్య తండ్రి చంద్రయ్య పట్టాదారుగా ఉన్నాడు. మల్లయ్య మరణానంతరం అతని కుమారుడైన కొండపల్లి శంకరయ్యకు వారసత్వంగా 8.01 ఎకరాల భూమి పట్టా అయింది. అనంతరం శంకరయ్య ఎకరం భూమిని ఇతరులకు విక్ర యించగా 7.01 ఎకరాల భూమి అతడి పేరుపై పట్టా, యాజమాన్య హక్కులు కొనసాగుతూ వచ్చాయి. భూప్రక్షాళనలో ఇట్టి భూమి అదే గ్రామానికి చెందిన కొండపల్లి శంకరమ్మ ఖాతాలోకి మార్చబడింది. ఇరువురి మధ్య తరచూ పంచాయితీలు నడుస్తూ వచ్చాయి. పట్టా మార్చిన తహసీల్దార్ సస్పెన్షన్ బెల్లంపల్లి: సంచలనం సృష్టించిన భూపట్టా మార్పిడి కేసులో తహసీల్దార్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నెన్నెల మండల తహసీల్దార్గా పనిచేసి బదిలీపై వెళ్లిన రాజలింగును సస్పెండ్ చేస్తూ గురువారం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజలింగు 2018 జనవరి 26న ఉద్యోగ బాధ్యతలు స్వీకరించా రు. భూ రికార్డుల ప్రక్షాళనలో నందులపల్లికి చెందిన కొండపల్లి శంకరయ్య పేరు మీద ఉన్న సర్వే నంబర్ 271/1ఎలోని 7.01 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కొండపల్లి శం కరమ్మ పేరుమీద పట్టా మార్పిడి జరిగింది. వీఆర్వో కరుణాకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెద్దిరాజు కుమ్మక్కై పట్టా బదిలీ చేశారు. కలెక్టర్ విచారణ చేపట్టి తక్షణమే ఆర్ఐ, వీఆర్వోను సస్పెండ్ చేయగా తాజాగా తహసీల్దార్పై వేటు వేశారు. ప్రస్తుతం రాజలింగు కరీంనగర్ జిల్లా శంకరపట్నం తహసీల్దార్గా పని చేస్తున్నారు. కోర్టులో తేల్చుకోండి: కలెక్టర్ 2015 సంవత్సరం వరకు కొండపల్లి శంకరయ్య పేరు మీద భూమి ఉందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి అన్నారు. వీఆర్వో చేసిన తప్పిదం వల్ల కొండపల్లి శంకరమ్మ పేరు మీద మారిందని చెప్పారు. దీనిని ఈ నెల 25న సవరించేందుకు ఏర్పాట్లు చేశారని. కానీ ధరణి వెబ్సైట్ ఇబ్బందుల కారణంగా కాలేదన్నారు. సీఎం ఆదేశాలతో మరోసారి 27న మార్చినట్లు తెలిపారు. గతంలో భూమి పేరు మీద ఉంటే కోర్టులో అప్పీల్ చేసుకోవాలి. కోర్టు ఆదేశాల ప్రకారం ఎవరి పేరు మీద వస్తే వారి పేరు మీద మార్చుతామని చెప్పారు. లేదా కుటుంబ సభ్యులంతా కలసి వారసత్వం, వీరాసత్ చేసుకోండని సలహా ఇచ్చారు. గతంలో రైతుబంధు చెక్కు ఎవరికీ ఇవ్వలేదని, రైతుబంధు చెక్కు, పాసుపుస్తకం కొండపల్లి శంకరమ్మకు ఇచ్చినట్లు శరత్ తప్పుడు సమచారం ఇచ్చాడని కలెక్టర్ పేర్కొన్నారు. -
పెద్ద రైతులకు రేషన్ బంద్..!
సాక్షి, నేలకొండపల్లి: తప్పుడు వివరాలతో రేషన్ పొందుతున్న పెద్ద రైతులకు రైతుబంధు పథకం కష్టాన్ని తెచ్చింది. వివరాలను రేషన్ సర్వర్తో అనుసంధానం చేయటంతో పదెకరాలు, అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూములున్న రైతులకు రేషన్ నిలిచిపోతున్నాయి. ఇప్పటి వరకు తక్కువ భూమి ఉన్నట్లు చూపించి పలువురు పెద్ద రైతులు ఆహార భద్రత కార్డులు పొందారు. మరికొందరు భూమి ఉన్నా సేద్యంలో లేదంటూ తప్పుడు ధృవీకరణ పత్రాలు చూపించి రేషన్ తీసుకుంటున్నారు. అలాంటి రైతులకు పథకంతో తెరపడింది. రేషన్ సర్వర్కు దీనిని అనుసంధానం చేయటంతో ఎక్కువ భూములు ఉన్న రైతులకు రేషన్ నిలిచిపోయింది. పెట్టుబడి సాయం పొందేందుకు సాగులో లేని భూములను సైతం సేధ్యం చేస్తున్నామంటూ రైతులు తప్పుడు పత్రాలు చూపి రెండు పర్యాయాలు లబ్ధి పొందారు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రైతుబంధు లబ్ధిదారుల వివరాలను తెప్పించుకొని తమ శాఖ సర్వర్కు అనుసంధానం చేయడంతో పెద్ద రైతుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ఫుడ్ సెక్యూరీటీ యాక్ట్ 2013 ప్రకారం వారిని రేషన్, రైతుబంధుకు అనర్హులుగా ప్రకటించింది. విచారించాలని డీఎస్ఓలకు ఆదేశాలు.. జిల్లాలో పది ఎకరాల పైన ఉన్న రైతులు ఎవరెవరు ఉన్నారో విచారించాలని జాయింట్ కలెక్టర్ల ద్వారా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా ఆదేశాలు అందాయి. పెద్ద రైతులు, వారి భూముల వివరాలు విచారించి నివేదికలను పంపాలని అన్ని మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. ఇప్పటికే డీఎస్ఓ లకు లిఖిత పూర్వక ఆదేశాలు అందాయి. రైతు బంధుతో .. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు 8 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందజేస్తోంది. దీంతో ఏ రైతుకు ఎంత భూమి ఉందో లెక్క తేలిపోయింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆకున్ సబర్వాల్ రైతుల ఆధార్ నంబర్ను పీడీఎస్ రైస్ ఈ పాస్ సర్వర్కు అనుసంధానం చేయటంతో అనర్హులు దొరికిపోయారు. ప్రస్తుతం రేషన్ దుకాణాలల్లో ఈ పాస్ విధానంలో బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద రైతులు రేషన్ దుకాణానికి వెళ్లి ఈ పాస్ మిషన్ పై వేలిముద్ర వేస్తు ఇన్వాలీడ్ అని వస్తోంది. దీంతో డీలర్లు రేషన్ను నిలిపివేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 669 దుకాణాలు ఉండగా వాటిలో 3,95,857 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. అర్హులకు ఇబ్బంది లేదు.. తక్కువ భూమి ఉన్న రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక వేళ రేషన్ ఆగిపోతే స్థానిక తహసీల్దార్కు దరఖాస్తు కోవాలి. విచారించి రేషన్ అందేలా చర్యలు తీసుకుంటాం. పది ఎకరాలు అంత కంటే ఎక్కువగా భూమి ఉన్న రైతులకు ఈనెల నుంచి రేషన్ను నిలిచిపోతుంది. ఇప్పటికే కమీషనర్ కార్యాలయంలో బ్లాక్ చేశారు. – కె.వెంకటేశ్వర్లు, ఇన్చార్జ్ డీఎస్ఓ, ఖమ్మం -
రైతుబంధులో కేంద్ర ‘పెట్టుబడి’ విలీనం!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో రైతుబంధు పథకం అమలవుతోంది. ఇప్పటికే ఖరీఫ్, రబీలకు రెండు విడతలుగా సొమ్ము విడుదల చేశాం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని (పీఎంకేఎస్ఎన్వై–పీఎం కిసాన్) ప్రవేశపెట్టింది. దాని ఉద్దేశం కూడా ఇదే. పైగా కేంద్రం కంటే తెలంగాణలోనే అధికంగా పెట్టుబడి సాయం చేస్తున్నాం. కేంద్ర లక్ష్యం ప్రకారం తెలంగాణలో 90% మంది ఐదెకరాలలోపు సన్న, చిన్నకారు రైతులకు రైతుబంధు సొమ్ము అందింది. ఈ నేపథ్యంలో కేం ద్రం తన పథకం కింద తెలంగాణకు రావాల్సిన సొమ్ము వాటాను రైతుబంధులో కలపాలి’అని కోరే ఆలోచన ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రైతుబంధు పథకం తెలంగాణలో తప్ప మరే రాష్ట్రంలోనూ అమలవట్లేదు. దీన్ని ఆధారం చేసుకొనే కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తాజా బడ్జెట్లో ప్రవేశపెట్టడం తెలిసిందే. అయితే ఇప్పటికే తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున కేంద్రం మళ్లీ వేరుగా రైతులకు సొమ్ము ఇవ్వడంలో అర్థంలేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అలా చేస్తే ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తోం దన్న తప్పుడు సంకేతాలు ఇతర వర్గాల ప్రజల్లోకి వెళ్లే అవకాశముందని చెబుతున్నాయి. అందువల్ల రాష్ట్రం లో ఐదెకరాలలోపు రైతుల సంఖ్యకు అనుగుణంగా కేంద్రం పెట్టుబడి సొమ్మును తమ ఖాతాలో వేస్తే సం బంధిత రైతులందరికీ రైతుబంధు కింద అందజేస్తామని, ఆ మేరకు యుటిలైజేషన్ సర్టిఫికేట్ (యూసీ) కూడా సమర్పిస్తామని పేర్కొంటున్నాయి. నేడు హైదరాబాద్కుకేంద్ర అధికారి... ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషితో చర్చించేందుకు కేంద్ర వ్యవసాయశాఖ అదనపు కార్యదర్శి వసుధ మిశ్రా మంగళవారం హైదరాబాద్ రానున్నారు. సీఎస్తో సమావేశానికి వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, ఐటీశాఖలకు చెందిన ఉన్నతాధికారులూ హాజరుకానున్నారు. తెలంగాణలో రైతుబంధు పథకాన్ని ఎలా అమలు చేశారన్న సమాచారంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఎలా అమలు చేయవచ్చన్న అంశంపై ఆమె చర్చించే అవకాశమున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఇప్పటికే రైతుబంధును విజయవంతంగా అమలు చేస్తున్నందున ఇక్కడి అనుభవాలను కూడా రాష్ట్ర ఉన్నతాధికారులు ఆమెకు వివరించే అవకాశముంది. మరోవైపు తెలంగాణలో కేంద్ర పెట్టుబడి పథకాన్ని వేరుగా అమలు చేయడం కాకుండా రైతుబంధులో విలీన అంశాన్ని కూడా రాష్ట్ర అధికారులు చర్చించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రం నిధులు ఇస్తున్నందున అవసరమైతే ఈ పథకాన్ని ‘రైతుబంధు– పీఎంకేఎస్ఎన్వై’గా (పీఎం కిసాన్) మార్చడానికి కూడా అభ్యంతరం లేదన్న ప్రతిపాదనను కూడా ముందుకు తేవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర పథకాన్ని రాష్ట్రంలో ఎలా అమలు చేయాలో నిర్ణయిస్తామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో గత ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి తెలంగాణ ప్రభుత్వం రైతులకు రూ. 10 వేల కోట్లకుపైగా పెట్టుబడి సాయం చేయడం తెలిసిందే. అందులో 90 శాతం సన్నచిన్నకారు రైతులకే అందింది. ఈ నేపథ్యంలో కేంద్రం సాయం చేస్తే రూ. 2,800 కోట్లకుపైగా తెలంగాణ ప్రభుత్వానికి కలిసొచ్చే అవకాశముందని అంటున్నారు. అయితే తెలంగాణ ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరిస్తుందా లేదా అన్న అంశంపై వ్యవసాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమ ప్రతిపాదనను కేంద్రం అంగీకరిస్తే అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా ఇస్తామని అంటున్నారు. -
బ్యాంకుల చుట్టూ రైతన్నలు..రైతుబంధు సాయానికి కొర్రీలు.!
సాక్షి, కమాన్పూర్: రైతులకు పంట పెట్టుబడి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం రబీ సాగుకోసం ఎకరాకు రూ. 4 వేలు చెల్లిస్తుంది. ఖరీఫ్ సాగుకు మొదటి విడతలో రైతులకు ప్రభుత్వం నేరుగా చెక్కుల రూపంలో అందజేసింది. రబీసాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అంత సిద్ధం చేసింది కాని ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పెట్టుబడి సాయం రైతులకు నేరుగా ఇవ్వరాదని, నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేయాలని ఎన్నికల కమిషన్ అదేశాలు జారీ చేసింది. పెట్టుబడి సహయాన్ని బ్యాంకు అధికారులు రైతులను ఏలాంటి ఇబ్బందులు పెట్టకుండా నేరుగా రైతులకు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల పంట పెట్టుబడి సహయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. డబ్బులు తీసుకునేందుకు బ్యాంకు వెళ్లిన రైతులకు బ్యాంకు సిబ్బంది లేని పోని కొర్రీలు పెడుతున్నారు. రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలు రెన్యువల్ చేసుకోలేదని డబ్బులు తీసుకోకుండా ఖాతాలోని డబ్బులను హోల్డ్( తాత్కాలికంగా నిలిపివేత)లో పెట్టడంతో రైతుల చేతికి డబ్బులు రాకపోవడంతో బ్యాంకు చుట్టు తిరుగుతున్నారు. రబీసాగు ప్రారంభం కావడంతో పెట్టుబడి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో పది రెవెన్యూ గ్రామాల పరిధిలో 4048 మంది రైతులకు పంట పెట్టుబడి సహాయం కోసం రైతులు వ్యవసాయాధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందించారు. వ్యవసాయశాఖ అధికారులు దరఖాస్తులను ఆన్లైన్ చే యడంతో రైతులకు నేరుగా డబ్బులను మండల కేంద్రంలోని ఎస్బీఐ. కేడీసీసీలతో పాటు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. డబ్బులు జమ కావడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ డబ్బులు తీసుకోవడానికి కమాన్పూర్ ఎస్బీఐ బ్యాంకు వెళ్లి విత్ డ్రా చేద్దామనుకుంటే డబ్బులు హోల్డ్ చేశామని చెప్పడంతో ఇందేందని బ్యాంకులోని ఫీల్డ్ ఆఫీసర్ వద్దకు వెళ్లీ వివరాలు అడిగితే పంట రుణాలను రెన్యూవల్ చేసుకోలేదు అందుకు ఖాతాలోని డబ్బులను హోల్డ్ చేశామని అనడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. గిదేంది ప్రభుత్వం రైతులు నేరుగా బ్యాంకులకు వెళ్లీ పెట్టుబడి సహయాన్ని తీసుకోండి అని అంటుంటే మీరు ఇలా అంటున్నారేంటి అంటే సదురు బ్యాంకు అధికారులు రైతులకు సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. రబీసాగు మొదలైంది. నారుమడి దున్ని నారుపోసుకునేందుకు డబ్బులు తీసుకునేందుకు వస్తే బ్యాంకు అధికారుల తీరుతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విషయంపై బ్యాంకు మేనేజర్ను వివరణ కోరగా రైతులు గతంలో తీసుకున్న పంట రుణాలను రెన్యూవల్ చేసుకోకపోవడంతో ఆటోమేటిక్గా రైతుల ఖాతాలోని డబ్బులు హోల్డ్ చేస్తున్నారని వివరణ ఇచ్చారు. -
రైతుబంధు దేశానికే ఆదర్శం...
మేడిపెల్లి : రైతుబందు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే భూమిలేని వారికి కూడా రైతుబీమా వర్తింపజేసేలా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్బాబు అన్నారు. గురువారం మేడిపెల్లి మండల కేంద్రంతో పాటు కమ్మరిపేట, భీమారం, రంగాపూర్, కొండాపూర్, విలాయతబాద్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో మహిళలు మంగళహారతులు, బతుకమ్మలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం డప్పు చప్పుళ్ల మధ్య అన్ని గ్రామాలలోని ప్రధాన వీధులలో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాలలో రమేశ్బాబు పార్టీ జెండాలను ఎగురవేసారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన మాట్లాడుతూ రైతులను రాజుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకొన్నట్లు చెప్పారు. దీని కోసం ఇప్పటికే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుండగా పంట పెట్టుబడి కింద ఏడాదికి ఏకరానికి రూ.8వేలు, రైతుభీమా కింద చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5లక్షల ప్రమాద భీమా ఇస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి మరోసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ కుందారపు అన్నపూర్ణ, జడ్పీటీసీ నెల్లుట్ల పూర్ణిమ, పార్టీ మండల శాఖ అధ్యక్షులు సుధవేని గంగాధర్గౌడ్, ఏనుగు మనోహర్రెడ్డి, యూత్ అధ్యక్షుడు నల్ల మహిపాల్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు వొద్దినేని హరిచరణ్రావు, మిట్టపెల్లి భూమరెడ్డి, కాటిపెల్లి లింగారెడ్డి, ఎంపీటీసీలు, పాల్గొన్నారు. ఎన్ఆర్ఐలకు ప్రత్యేక ప్యాకేజీ ఎన్ఆర్ఐలకు ప్రత్యేక ప్యాకేజీ విషయమై టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు వేములవాడ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్బాబు అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడిపెల్లి మండలంలోని భీమారంకు వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్బాబును స్థానిక యువకులు ఎన్ఆర్ఐ పాలసీపై అడిగారు. ఈ విషయమై రంగాపూర్లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ఆర్ఐలకు ప్రత్యేక ప్యాకేజీ విషయం చేర్చినట్లు చెప్పారు. మేడిపెల్లి మండల కేంద్రంలోని పీఎన్ఆర్ గార్డెన్లో గురువారం నాయిబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో పలువురు నాయీ బ్రాహ్మణులు టీఆర్ఎస్లో చేరారు. మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ కుందారపు అన్నపూర్ణ, జడ్పీటీసీ నెల్లుట్ల పూర్ణిమ, నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, నాయీబ్రాహ్మణులు పాల్గొన్నారు. -
రైతుబంధు..ఆర్ అండ్ బీకి నిధులు బందు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ (ఆర్అండ్బీ) నిధుల కటకటతో సతమతమవుతోంది. ఈ ప్రభావం వివిధ అభివృద్ధి పనులపై పడుతోంది.ఆర్అండ్ బీ నిధులను ‘రైతుబంధు’పథకానికి మళ్లించడంతోనే ఈ పరిస్థితులు తలెత్తాయని తెలుస్తోంది. ఆ విషయాన్ని సూటిగా చెప్పని ప్రభుత్వం రోడ్లు భవనాల శాఖను నిధుల కోసం బ్యాంకుల వద్ద అప్పు తీసుకోమని సూచించింది. ఆ యత్నానికి ముందస్తు ఎన్నికలు బ్రేకులు వేయడంతో ఆర్ అండ్ బీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఆగడంతో వారు అధికారులపై ఒత్తిళ్లు పెంచుతున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని వారి చుట్టూ తిరుగుతున్నారు. కొత్త పనులు ప్రారంభించినా... ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్అండ్ బీకి కేటాయించిన రూ.5,600 కోట్ల నిధులు సకాలంలోనే వస్తాయని భావించిన ఆ శాఖ అధికారులు ఏప్రిల్లో ఆర్థిక సంవత్సరం మొదలవగానే.. పాత బిల్లులతోపాటు కొత్త పనుల అప్పగింతకు ముందుకెళ్లారు. ఇలా ఈ ఏడాది దాదాపుగా రూ.20వేల కోట్లకుపైగా విలువైన పనులను కాంట్రాక్టర్లు చేపట్టారు. అదే సమయంలో ఆర్అండ్ బీకి ప్రభుత్వం నుంచి నిధులు రాలేదు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. ఆర్అండ్బీకి నిధులురావని, రూ.3000 కోట్లు బ్యాంకుల నుంచి రుణం కోసం ప్రయత్నించమని అధికారులకు సలహా ఇచ్చింది. దీనికోసం అధికారులు ప్రయత్నిస్తే... ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని 4 బ్యాంకులు కన్సార్షియంగా ఏర్పడ్డాయి. ఈలోగా ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో రుణం మంజూరుకు బ్యాంకులు వెనకంజవేశాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో అక్టోబరు తొలి వారంలోనే తెలంగాణ బిల్డర్ల అసోసియేషన్ పనులు నిలిపివేసింది. వారిని చర్చలకు పిలిచిన ప్రభుత్వం రూ.5,600 కోట్లు మంజూరుకు హామీ ఇచ్చింది. ఆ మేరకు వారు పనులు మొదలు పెట్టినా, నవంబరు ఆరంభం వరకూ నిధులు అందలేదు. ఈ విషయమై వారు పలుమార్లు సీఎస్, మంత్రి తుమ్మల, కేటీఆర్ల వద్ద చర్చలు జరిపినా పురోగతి రాలేదు. దీంతో వారు రెండోసారి సమ్మె యోచన చేశారు. చివరికి ఇటీవల సీఎస్ రూ.10 కోట్లు మంజూరు చేసి, రూ.10 లక్షల్లోపు బిల్లులకు బకాయిలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మె వాయిదా వేశారు. సీఎం పేషీ నుంచే ఆదేశాలు..! వాస్తవానికి అక్టోబరులో ఆర్ అండ్ బీ అధికారులు ప్రభుత్వంతో పలుమార్లు సమావేశమయ్యారు. బ్యాంకులు రుణం ఇవ్వడం లేదని, ప్రభుత్వమూ నిధులు ఇవ్వకపోతే.. పరిస్థితి ఇబ్బందికరమని తేల్చిచెప్పారు. దీంతో సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం నిధుల మంజూరుకు హామీ ఇచ్చింది. చివరికి నవంబరు తొలి వారంలో నిధులు రావడం లేదంటూ సీఎం పేషీ నుంచి ఆర్ అండ్ బీ అధికారుల నెత్తిన పిడుగులాంటి వార్త వచ్చి పడింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆర్ అండ్ బీ శాఖకు రావాల్సిన నిధులను ‘రైతు బంధు ’పథకానికి బదిలీ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఇలా రోడ్లుభవనాల శాఖ చెల్లింపులకు చేతులెత్తేయాల్సిన పరిస్థితిలో పడింది. ఆశ్రయించిన బ్యాంకులూ ఎన్నికల నేపథ్యంలో వెనుకడుగు వేశాయి. ప్రస్తుతం ఈ ప్రభావం వివిధ అభివృద్ధిపనులపై ప్రభావం చూపుతోంది.పనులు చేసిన కాంట్రాక్టర్లూ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. -
దేశం చూపు.. తెలంగాణ వైపు
సాక్షి సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టుతో అన్ని కాలాల్లో ప్రతి గ్రామానికి గోదావరి నీటిని అందించే బృహత్తర పథకాన్ని చేపట్టిన తెలంగాణ వైపు దేశం మొత్తం చూస్తోందని నీటి పారుదల మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. జిల్లా కేంద్రంలో హజ్ యాత్రికులకు సన్మానం, పెద్దకోడూరులో రూ.3 కోట్లతో నిర్మించిన పాలిటెక్నిక్ హాస్టల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. గతంలో ప్రాజెక్టులు నిర్మించడానికి 30 ఏళ్లు పట్టేదని, తెలంగాణ వచ్చాక 20 నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు. దసరా నాడు అటూ ఇటూ గోదావరి నీటి ని తరలిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు బీమా పథకంతో ధీమాను ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. రూ.వెయ్యి కోట్లతో రాష్ట్రంలోని ప్రతి మండలంలో గోదాంలను నిర్మించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో సివిల్, ఎలక్ట్రికల్ కోర్సులకు మంచి డిమాండ్ ఉందని, ప్రభు త్వ, ప్రైవేటు రంగంలోనూ అవకాశాలున్నాయన్నా రు. మైనార్టీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని చెప్పారు. ఏడాదిలో ఎల్కతుర్తి జాతీయ రహదారి... ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ సమయంలో వరంగల్–ఎల్కతుర్తి జాతీయ రహదారి నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చుచేసే విధంగా కేంద్ర ప్రణాళికలో చేర్పించామని హరీశ్రావు వెల్లడించారు. సిద్ది పేట జిల్లాలో రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. జిల్లాకు రెండు జాతీయ రహదారులు మంజూరు కావడంతో పారిశ్రామికంగా సిద్దిపేట మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. సిద్దిపేట పరిసర ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రంగనాయక సాగర్ ద్వారా లక్షా పది వేల ఎకరాలకు సాగు నీరు అందించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. సమావేశం లో ఎమ్మెల్యే బాబూమోహన్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్రెడ్డి, ఫరూఖ్ హుస్సేన్ పాల్గొన్నారు. -
‘ముఖ్యమంత్రి బంధు’
ఇల్లందకుంట(హుజూరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రైతులకు కాదని, ముఖ్యమంత్రి బంధువుల పథకమని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. మండల కేంద్రంతోపాటు సిరిసేడు, చిన్నకోమటిపల్లి తదితర గ్రామాల్లో శనివారం బూత్లెవల్ సమావేశా లు నిర్వహించారు. పొన్నం మాట్లాడుతూ తెలంగాణ వస్తే మా నీళ్లు, మా ఉద్యోగులు మాకు వ స్తాయని గొప్పలు చెప్పిన కేసీఆర్.. తర్వాత మాట మార్చారన్నారు. తెలంగాణ అమరుల కుటుంబాలను పట్టించుకోవడం లేదన్నారు. ఆర్థికశాఖ మం త్రి ఈటల రాజేందర్ ఇలాఖలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తికాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. దళితులకు మూడెకరాలు భూమి పంపిణీ చేస్తామని చెప్పి మాట తప్పారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరికి రూ.2 వేలు, మొక్కజొన్నకు రూ.2 వేలు, పత్తికి రూ.7 వేలు, మిర్చికి రూ.10 వేల మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధులు తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్యాట రమేశ్, పాడి కౌశిక్రెడ్డి, పరిపాటి రవీందర్రెడ్డి, జిల్లెల తిరుపతిరెడ్డి, సర్పంచ్ పెద్ది స్వరూపకుమార్, పర్లపల్లి రమేశ్ పాల్గొన్నారు. -
కేసీఆర్ బంధువుల పథకంగా ‘రైతుబంధు’
చందుర్తి(వేములవాడ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకం కేసీఆర్ బంధువుల పథకంగా మారిందని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్గౌడ్ విమర్శించారు. చందుర్తి మండలం కట్టలింగంపేట, మల్యాల, చందుర్తి, మర్రిగడ్డ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ సమావేశాలు బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పొన్నం ప్రభాకర్గౌడ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు పథకంతో సమాన్య రైతులకన్నా భూస్వాములకే ప్రయోజనం చేకూరిందన్నారు. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న రైతులకు ఒరిగిందేమి లేదన్నారు. రాష్ట్ర ఆవిర్భావ విషయమై సోనియాగాంధీని సీఎం కేసీఆర్ విమర్శించడం సరికాదన్నారు. తెలంగాణను తామే తెచ్చామని ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్ చెప్పుకుంటే ప్రజలు బొందపెడతారని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ప్రగతిభవన్, కేసీఆర్ ఫామ్హౌస్లో బందీగా మారిందన్నారు. కేంద్రం లో నరేంద్రమోదీకి అధికారమిస్తే పెద్దనోట్లురద్దు చేసి పేదప్రజలను నిండా ముంచారని తెలిపారు. ఇప్పటి వరకు ఎంతమొత్తంలో నల్లధనం వెలికితీశారో లెక్కచెప్పాలని డిమాండ్ చేశా రు. కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని జోష్యం చెప్పారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలోని 200 గ్రామాల్లో ఇప్పటి వరకు పర్యటించానని తెలిపారు. ఏ ఒక్క గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన లబ్ధిదారులకు పక్కనే మరోగది నిర్మించుకునేందుకు రూ.లక్ష ఇస్తామన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, మహిళ సంఘానికి రూ.లక్ష ఉచితంగా ఇస్తామన్నారు. ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్, టీపీసీసీ సభ్యులు ఏనుగు మనోహర్రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ముకిడే చంద్రశేఖర్, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ ఇన్చార్జి నాగం కుమార్, జిల్లా నాయకులు చిలుక అంజిబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు పొద్దుపొడుపు లింగారెడ్డి, వేములవాడ బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ముస్కు పద్మ తదితరులు పాల్గొన్నారు. -
అది ‘కౌలు రైతుబంధు’ కాదు
సాక్షి, హైదరాబాద్ : రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’పథకాన్ని అమలు చేస్తోందని.. కౌలు రైతుల కోసం ఎంత మాత్రం కాదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మరోసారి స్పష్టం చేశారు. ఇది రైతు బంధు పథకమే తప్ప, కౌలు రైతుబంధు పథకం కాదని పేర్కొన్నారు. సమాజంలో అనేక రకాల ఆస్తులను ఇతరులకు కొం త కాలం కోసం లీజుకు ఇస్తారని, అలా లీజుకు తీసుకున్న వారెవరూ ఆ ఆస్తులకు హక్కుదారులు కారని చెప్పారు. అలా ఇతర ఆస్తుల విషయంలో లేని నిబంధన కేవలం రైతులకే ఎందుకు ఉండాలని, రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టాలని వ్యాఖ్యానించారు. రైతు బంధు పథకాన్ని కౌలు రైతులకు వర్తింపచేయాలనే డిమాండ్ అర్థరహితమైనదని, ఆ వాదన న్యాయ సమ్మతం కూడా కాదని పేర్కొన్నారు. శనివారం ప్రగతి భవన్లో ‘రైతుబంధు’పథకంపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆ డిమాండ్ సరికాదు.. రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి ఏటా రూ.8 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని చేపట్టిందని సమీక్షలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘ఈ పథకం కేవలం రైతులకు ఉద్దేశించిందే తప్ప, కౌలు రైతులకు సంబంధించినది కాదు. రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నది. బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. శాసనసభ ఆమోదించిన బడ్జెట్ ప్రకారమే రాష్ట్రంలో భూమిపై యాజమాన్య హక్కులున్న రైతులకు, ప్రభుత్వం గుర్తించిన ప్రతి రైతుకు సాయం అందిస్తున్నాం. దీన్ని ఎవరూ తప్పుపట్టడానికి లేదు. కౌలు రైతులను ఎలా విస్మరిస్తారని, వారికి కూడా రైతుబంధు సాయం అందించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ అర్థరహితమైనది. ఆ వాదనలో న్యాయం లేదు. అసలు కౌలురైతులు ఎవరన్నది ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. ప్రభుత్వం దగ్గరా కౌలు రైతుల వివరాలేవీ లేవు. ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా కౌలు రైతులకు సంబంధించిన వివరాలు నమోదు కాలేదు. ఏ రైతు కూడా కౌలు రైతులను గుర్తిం చలేదు. కౌలు రైతులుగా పిలిచే వారికి భూమి పై ఎలాంటి హక్కు లేదు, ఉండదు. అలాంటి వారికి ఏ ప్రాతిపదికన పెట్టుబడి సాయం అందించాలి..’’అని కేసీఆర్ ప్రశ్నించారు. ఏ హక్కూ లేనివారికి ఎలా ఇస్తాం? కేవలం రైతులకే సాయం ఇవ్వాలన్నది ప్రభుత్వ విధానమని కేసీఆర్ చెప్పారు. ఇది ప్రజాధనంతో కూడుకున్న అంశమని, ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి అసెంబ్లీ ఆమోదం ఉండాలని.. ఆ ఖర్చుకు ఆడిట్ ఉంటుందని పేర్కొన్నారు. ఎవరికి పడితే వారికి డబ్బు పంచిపెట్టడం సాధ్యం కాదన్నారు. ఏ హక్కూ లేని వారికి, భూమిపై ఎలాంటి పత్రం లేని వారికి డబ్బులు ఇవ్వాలన్న వాదన న్యాయ సమ్మతం కాదని వ్యాఖ్యానించారు. అలా ఏ హక్కూ లేని వారికి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు చెల్లిస్తే తప్పవుతుందని.. ప్రభుత్వం అలాంటి తప్పు చేస్తే ప్రశ్నించాలేగానీ, అంతా సవ్యంగా జరుగుతుంటే తప్పు పట్టడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఏ హక్కూ, ఆధారం లేని వారికి ప్రభుత్వం సాయం అందిస్తే, ఎవరు పడితే వారు తమకూ సాయం కావాలని అడిగే అవకాశముందని.. అలాంటి వారికి డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. లీజుకు తీసుకుంటే హక్కు రాదు.. కేవలం రైతులు మాత్రమే కాకుండా.. చాలా మంది తమ ఆస్తులను ఇతరులకు కిరాయికి, లీజుకు ఇస్తారని.. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, ఇళ్లు, ఆటోలు, కార్లు, ఫంక్షన్ హాళ్లు.. ఇలా చాలా రకమైన వాటిని నిర్ణీత సమయం కోసం కిరాయికి ఇస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘లీజుకు తీసుకున్న వారు ఎన్నటికీ యజమానులు కారు. ఆ ఆస్తులపై ఎన్నటికీ వారికి హక్కులు లభించవు. అలాంటి వాటి విషయంలో లేని డిమాండ్ కేవలం రైతుల విషయంలో మాత్రమే ఎందుకు వస్తుంది. సమైక్య పాలనలో రైతులు చితికిపోయారు. నష్టపోయి ఉన్నారు. అలాంటి రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని ప్రభుత్వం రైతుబంధు అమలు చేస్తున్నది. దీనికి కొర్రీలు పెట్టడం సమంజసం కాదు. కౌలు రైతుల పేరుతో అసలు రైతుకు అన్యాయం చేయాలని చూడడం మంచిది కాదు. రైతులు ఒక్కో పంట కాలానికి ఒక్కొక్కరికి తమ భూమిని కౌలుకు ఇస్తారు. ఒకే ఏడాది ఇద్దరు ముగ్గురికి కూడా కౌలుకు ఇస్తారు. అలాంటప్పుడు ప్రభుత్వం కౌలుదారును ఎలా గుర్తిస్తుంది. అసలు ఏ రైతు అయినా తన భూమిని కౌలుకు ఇస్తున్నట్టు లిఖితపూర్వకంగా అంగీకరిస్తాడా? అలాంటప్పుడు ప్రభుత్వానికి కౌలు రైతును గుర్తించడం ఎలా సాధ్యమవుతుంది?..’’అని ప్రశ్నించారు. అందువల్ల రైతు బంధు పథకాన్ని కచ్చితంగా రైతుల కోసమే అమలు చేయాలని, కౌలు రైతులకు సాయం అందించాలనే డిమాండ్ నెరవేర్చడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
‘రైతుబంధు’ మాయం.!
అశ్వారావుపేటరూరల్ : అశ్వారావుపేటలో సుమారు 228 ఎకరాలకు సంబంధించిన 14 రైతుబంధు చెక్కులు మాయమయ్యాయి. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా.. రెవెన్యూ అధికారుల వద్ద ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ వద్ద ఉన్నాయని రెవెన్యూ అధికారులు పేర్కొంటూ తప్పించుకుంటున్నారు. పెట్టుబడి సాయం కోసం రైతులు నెల రోజుల నుంచి తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. పాస్ పుస్తకాలిచ్చారు కానీ.. అశ్వారావుపేట రెవెన్యూలోని ఊట్లపల్లి సమీపంలో శీమకుర్తి సాయిబాబా అనే రైతుకు ఖాతా నంబరు 154లో.. సర్వే నంబరు 302/ఆ/1లో 2.03 ఎకరాలు, 303/ఆ సర్వే నంబర్లో 6.10 ఎకరాలు, 304అ/1 నంబర్లో 3–39 ఎకరాలు, 306 సర్వే నంబర్లో 2–16 ఎకరాలు, 307/ఆ నంబర్లో 1–12, 339/1 సర్వే నంబర్లో 2–39 ఎకరాలతోపాటు మరికొన్ని నంబర్లలో మొత్తం సుమారు 28 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూములకు సంబంధించిన రైతుబంధు చెక్కులు అందలేదు. శీమకుర్తి చక్రధరరావు, శీమకుర్తి రామలింగం, శీమకుర్తి కైలాస్నా«థ్, జల్లిపల్లి నారాయణరావు, జల్లిపల్లి లక్ష్మి, కొనకళ్ల నాగేశ్వరరావులకు చెందిన సుమారు 200వందల ఎకరాలకు సంబంధించి సుమారు రూ.7లక్షల పెట్టుబడి సాయం చెక్కులు గల్లంతయ్యాయి. వీళ్లందరికీ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం కింద చెక్కులు మంజూరు కాగా వీటిని ఆయా రైతులు తీసుకునేందుకు గత నెల 10న అశ్వారావుపేటలో జరిగిన పంపిణీ కార్యక్రమానికి వెళ్లారు. ఆ సమయంలో పాస్ పుస్తకాలు, పెట్టుబడి సాయం చెక్కులు మంజూరైనట్లు అధికారులు రైతులకు చూపించి, పాస్ పుస్తకాల్లో పొలాలకు సంబంధించిన చిన్న పొరపాటు ఉందని చెప్పి పంపిణీ చేయకుండా నిలిపి వేశారు. దీంతో రైతులు తమ వద్ద ఉన్న పాత రికార్డులు, ఆధారాలతో స్థానిక రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా అందించారు. విచారణ చేసిన రెవెన్యూ అధికారులు ఎలాంటి పొరపాట్లు లేవని ధ్రువీకరిస్తూ పత్రాన్ని ఇచ్చారు. ఆ పత్రాన్ని వ్యవసాయ శాఖ అధికారులకు సమర్పించగా కేవలం పాస్ పుస్తకాలు పంపిణీ చేసి, పెట్టుబడి సాయం చెక్కులు మాత్రం ఇవ్వలేదు. అప్పటి నుంచి రైతులు అటు రెవెన్యూ, ఇటు వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ చెక్కులు మాయమయ్యాయని, అందుకే ఇరు శాఖల అధికారులు తేల్చిచెప్పడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. రైతుబంధు సాయాన్ని స్వాహా చేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. నెల రోజులుగా తిరుగుతున్నా నాకు పెట్టుబడి సాయం కింద చెక్కులు మంజూరయ్యాయి. వాటి కోసం గడిచిన నెల రోజులుగా కార్యాలయాల చూట్టు తిరుగుతున్నాను. వ్యవసాయ కార్యాలయానికి వెళ్తే, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లమని, ఇక్కడికి వెళ్లితే అక్కడికే వెళ్లమని తిప్పుతున్నారు. గట్టిగా నిలదీస్తే చెక్కులు గల్లంతైనట్లు చెప్పారు. వికలాంగుడైన నేను 70 ఏళ్ల వయసులో ఇంకా ఎన్ని రోజులు తిరగాలి. –శీమకుర్తి సాయిబాబా, బాధిత రైతు, అశ్వారావుపేట చెక్కులు కనిపించడం లేదు కొందరు రైతులకు మంజూరైన పెట్టుబడి సాయం చెక్కులు కనిపించని మాట వాస్తవమే. తొలిరోజు పంపిణీ కార్యక్రమంలో ఈ చెక్కులు గల్లంతైనట్లు గుర్తించాం. ఉన్నతాధికారులకు లేఖ రాసి, ఆయా రైతులకు తిరిగి చెక్కులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. మరోసారి పూర్తిస్థాయిలో పరిశీలించి చెక్కుల గల్లంతుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. – నవీన్, ఏవో, అశ్వారావుపేట మాకు సంబంధమే లేదు పెట్టుబడి సాయం చెక్కుల పంపిణీ బాధ్యత వ్యవసాయ శాఖదే. కనిపించకుండా పో యిన చెక్కులకు, రెవెన్యూ శా ఖకు సంబంధం లేదు. వ్యవసాయ శాఖ నుంచి కూడా ఎ లాంటి నివేదికా రాలేదు. చెక్కులు మాయమైన విషయం శనివారమే నా దృష్టికి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధ్యుడైన వ్యవసాయాధికారికి సూచించాను. –యలవర్తి వెంకటేశ్వరరావు, తహసీల్దార్, అశ్వారావుపేట -
అర్చకులకే ‘దేవాలయ’ పాస్ పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్: దేవాలయాల భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలను తమకే ఇవ్వా లని అర్చకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ప్రోత్సాహకం కూడా వారికే ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, దేవాదాయ శాఖ కమిషనర్ శివశంకర్ను కలిసి వారి సమస్యలను విన్నవించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల అర్చకుల పేర్ల పహాణీలో అనుభవదారు పేర్లు తొలగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్కు టీఆర్ఎస్, టీడీపీలు కవలలు
సదాశివపేట(సంగారెడ్డి): కాంగ్రెస్కు కవల పిల్లలుగా టీఆర్ఎస్, టీడీపీలు పనిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కర్ణాటకలో టీఆర్ఎస్, టీడీపీల పరోక్ష మద్దతుతోనే సీఎం పదవి చేపట్టినట్లు కుమారస్వామి వెల్లడించారని చెప్పారు. టీఆర్ఎస్కు ఓట్లు వేస్తే కాంగ్రెస్ను సమర్థించినట్లేనని, కాంగ్రెస్కు ఓట్లు వేస్తే టీఆర్ఎస్ను సమర్థించినట్లేనని చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్న బస్సు యాత్రలతో టీఆర్ఎస్కే లాభం చేకూరుతుందన్నారు. సంగారెడ్డి జిల్లాకు కేంద్రం ఇప్పటి వరకు రూ.375.52 కోట్ల నిధులు కేటాయించిందని చెప్పారు. ప్రతీ గ్రామపంచాయతీకి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.30 లక్షల వరకు కేంద్రం మంజూరు చేసిందన్నారు. రైతుబంధు పథకం మోతుబరి రైతులు, బినామీలకే ఎక్కువ ఉపయోపడుతుందన్నారు. రైతుబంధు పథకం కౌలు రైతులకు ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. రైతుబంధు పథకం ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకే ఉపయోగపడుతుందని, ప్రజాధనంతో ఓట్లు కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో రాష్ట్రంలో పల్లెబాట, పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించి టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ల గురించి ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం కృషి సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరానికి టీఏసీ అనుమతులు లభించడంపై లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అనుమతుల మంజూరీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణానికి వెంట వెంటనే అనుమతులిస్తూ త్వరితగతిన పూర్తి చేయడానికి కేంద్రం విశేషంగా కృషి చేస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
బక్క ‘రైతు బంధు’ కాదు : జీవన్రెడ్డి
సాక్షి, జగిత్యాల: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా కాకుండా అప్పుల నిలయంగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూనుకున్నారని సీఎల్పీ ఉపనేత టి. జీవన్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ 5 ఏళ్ల పాలనలో 56 వేల కోట్లు అప్పు చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలోనే లక్షా నలభై వేల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని ఊదరగొట్టిన కేసీఆర్ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 12 వేల ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన ఏ హామీ సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. అసాధ్యమైన హామీలివ్వడం కేసీఆర్కు అలవాటేనని జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలని సవాల్ చేశారు. రైతు బంధు పథకం పేదల కన్నా వందల ఎకరాలు ఉన్న పెద్ద రైతులకే మేలు చేస్తోందని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 62 శాతం మంది రైతులు 45 గుంటల కన్నా తక్కువ భూమి కలిగిన వాళ్లేనని, పెట్టుబడి సాయంతో బక్క రైతు బాగు పడేదెప్పుడని ఆందోళన వ్యక్తం చేశారు. -
అబ్బే.. వదులుకోం!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : రైతుబంధు పథకం కింద ప్రభుత్వం అందజేసే పెట్టుబడి సాయాన్ని వదులుకునేందుకు జిల్లాలోని బడా రైతులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఆర్థికంగా ఉన్న వారు పెట్టుబడి సాయం కింద అందుకునే చెక్కులను ‘గివ్ ఇట్ అప్’ ద్వారా తిరిగి ఇవ్వొచ్చని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అలా వచ్చిన నగదును రైతు సమన్వయ సమితి ఖాతాలో జమ చేసి రైతుల సంక్షేమానికి వినియోగిస్తామని స్పష్టంగా పేర్కొంది. అయితే ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ప్రజాప్రతినిధులు, పెద్ద రైతులు పలు వేదికల మీద తమకు వచ్చే చెక్కులను తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. జిల్లాలో 3.36లక్షల మంది జిల్లాలో మొత్తం 3,36,131 మంది రైతులు ఉన్నారు. వీరి చేతుల్లో దాదాపు 8,90,387 వ్యవసాయ భూమి ఉంది. అయితే వీరిలో ఇప్పటి వరకు ప్రభుత్వానికి పెట్టుబడి సాయాన్ని తిరిగిచ్చిన వారు కేవలం 24 మంది మాత్రమే. ఇలా ఇప్పటి వరకు ప్రభుత్వానికి ‘గివ్ ఇట్ అప్’ కింద రూ.4,06,220 విలువైన చెక్కులే అందాయి. చెక్కులు తిరిగి ఇచ్చిన ప్రజాప్రతినిధుల్లో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మాత్రమే ఉన్నారు. ఇప్పటి వరకు రూ.277 కోట్ల పంపిణీ... వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కోసం పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.4వేలు చొప్పున అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు జిల్లాకు రూ.355 కోట్లు విడుదల చేసింది. ఈ విలువతో 3,40,764 చెక్కులు జారీ అయ్యాయి. మే 10 నుంచి 18 వరకు అన్ని గ్రామాల్లో చెక్కులు పంపిణీ చేసిన అధికారులు వివాదాస్పద భూములు, పార్ట్–బీలో ఉన్న భూములకు సంబంధించిన చెక్కులను మాత్రం నిలిపేశారు. ఈ మేరకు ఇప్పటి వరకు రూ.277 కోట్ల విలువైన 2,49,436 చెక్కులను పంపిణీ చేశారు. స్పందన కరువు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందజేసే ఎకరానికి రూ.4వేలు వదులుకునే విషయంలో సర్కారు విజ్ఞప్తికి జిల్లాలో స్పందన కరువైంది. పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం సాయం చేస్తోంది. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న వారు, లేదా పెద్ద రైతులు పెట్టుబడి సాయాన్ని తిరిగి ఇవ్వొచ్చని ప్రభుత్వం పేర్కొంది. ఇలా అందే సొమ్మును రైతు సంక్షేమానికే వినియోగిస్తామని స్పష్టంగా పేర్కొంది. కానీ జిల్లాలో వదులుకునేందుకు పెద్దగా ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. జిల్లాలో మొత్తం 3,36,131 మంది రైతుల్లో కేవలం 24 మంది మాత్రమే పెట్టుబడి సాయాన్ని ఇప్పటివరకు తిరిగిచ్చారు. జిల్లాలో మొత్తం రూ.277 కోట్లు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు కేవలం రూ.4లక్షలు మాత్రమే తిరిగి వచ్చినట్లు అధికార గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా.. నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు పెట్టుబడి సాయాన్ని వెనక్కి ఇచ్చే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఎకరానికి రూ.4వేల చొప్పున వచ్చే సాయాన్ని వదులుకోవడంపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బహిరంగసభల వేదికలపై ప్రకటనలు జారీ చేస్తున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రైతుబంధు చెక్కులు తిరిగి ఇచ్చిన 24 మందిలో అతి తక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. చాలా వరకు సన్న, చిన్నకారు రైతులే చెక్కులను తిరిగిచ్చి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. జిల్లాలో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఒక పార్లమెంట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఇందులో చాలా మందికి వ్యవసాయ భూములు ఉన్నాయి. అయినా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి రూ.51,200, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి రూ.32,900 విలువైన చెక్కులను తిరిగి ఇచ్చారు. మిగతా వారి నుంచి స్పందన కానరావడం లేదు. ఇక జిల్లాలో మొత్తం 26 మండలాలకు గాను ఏడు మండలాల నుంచి మాత్రమే చెక్కులు తిరిగొచ్చాయి. అత్యధికంగా జిల్లాలో కోయిల్కొండ మండలంలో ఎనిమిది మంది, భూత్పూరు మండలంలో ఐదుగురు, బాలానగర్, ధన్వాడ మండలాల నుంచి ముగ్గురు, అడ్డాకుల, దేవరకద్ర మండలాల నుంచి ఇద్దరు చొప్పున, మక్తల్ మండలం నుంచి ఒకరు మాత్రమే చెక్కులు తిరిగి ఇచ్చారు. -
25 రోజుల్లో 100%
సాక్షి, హైదరాబాద్: రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని 25 రోజుల్లో వంద శాతం పూర్తి చేయాలని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. జిల్లాకు ఒకరు చొప్పున మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఇన్చార్జులుగా నియమిం చాలని నిర్ణయించారు. పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాకో ఐఏఎస్ అధికారిని స్పెషలాఫీసర్గా నియమించారు. ఈ నెల 24 నుంచి జూన్ 20 వరకు 25 రోజుల పాటు అధి కార యంత్రాంగమంతా ఇదే కార్యక్రమంలో నిమగ్నం కావాలని చెప్పారు. బుధవారం ప్రగతిభవన్లో బుక్కులు, చెక్కుల పంపిణీపై సీఎం కేసీఆర్ ఆరు గంటలపాటు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ముఖ్య కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘‘ఈ రోజు వరకు జరిగిన భూముల అమ్మకం, కొనుగోలు వివరాలన్నీ నమోదు చేయాలి. అన్ని రకాల మ్యుటేషన్లు చేయాలి. వారసత్వ హక్కులు తేల్చాలి. కొత్తగా నమోదైన వివరాలతో పాస్ బుక్కులు ముద్రించి పంపిణీ చేయాలి. ఇప్పటికే జారీ చేసిన పాస్ పుస్తకాల్లో తప్పులుంటే వెంటనే వాటిని సవరించి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి. గుంట భూమికి కూడా యజమాని ఎవరో తేల్చాలి. జరిగిన ప్రతీ అమ్మకం, కొనుగోలును నమోదు చేయాలి. వారసత్వ హక్కులను తేల్చాలి. భూ యాజమాన్యానికి సంబంధించిన అన్ని మార్పులను నమోదు చేయాలి. పెండింగ్లో పెట్టొద్దు. జూన్ 20 నాటికి వివరాల నమోదు కార్యక్రమం పూర్తి కావాలి. ఆ వివరాలను పొందు పరుస్తూ ‘ధరణి’వెబ్సైట్ రూపొందించాలి. భూమికి సంబంధించి ఇకపై ఒకటే లెక్క ఉండాలి’’అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. ఆన్లైన్ ఫ్రీజింగ్ ఎత్తివేత భూమి వివరాలను నమోదు చేయడానికి ఆన్లైన్ ఫ్రీజింగ్ను ఎత్తివేయాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 27 నుంచి ఫ్రీజింగ్ ఎత్తివేసి ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడానికి తహసీల్దార్లకు అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. వంద రోజుల పాటు భూరికార్డుల ప్రక్షాళన జరిగినప్పటికీ, కొన్నిచోట్ల రికార్డుల్లో తప్పులు దొర్లడం, అసమగ్ర వివరాలుండటం పట్ల సీఎం అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక కారణాలతోపాటు మానవ తప్పిదాలు కూడా ఉన్నాయని, దీనివల్ల రైతులకు కొంత అసౌకర్యం కలిగిందని, కొందరికి పాస్ పుస్తకాలు అందలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించినప్పుడు కొన్ని సమస్యలు తప్పవని, ఈ పరిస్థితిని సవాల్గా తీసుకుని, మరింత ప్రభావవంతంగా పనిచేయాలని సూచించారు. కొత్త జిల్లాలతో కలెక్టర్లకు పర్యవేక్షణ సులభమైందని, దీన్ని సానుకూలాంశంగా తీసుకుని మరింత చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలన్నారు. వచ్చేనెల నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానంతోపాటు రైతులకు జీవిత భీమా పథకం అమల్లోకి వస్తుందని, ఇవి సవ్యంగా సాగాలంటే భూరికార్డులు సరిగా ఉండాలని పేర్కొన్నారు. ప్రక్షాళన విజయవంతం భూముల సమస్యలను పరిష్కరించడానికి గత ప్రభుత్వాలు ఎన్నడూ శ్రద్ధ పెట్టలేదని సీఎం అన్నారు. ‘‘ప్రభుత్వ శాఖల మధ్య కూడా భూ వివాదాలున్నాయి. రెవెన్యూ, అటవీ శాఖ మధ్య గొడవలున్నాయి. భూరికార్డులు సరిగా లేకపోవడం వల్ల గ్రామాల్లో గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. వీటన్నింటికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతోనే భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టాం. దేశంలో మరే రాష్ట్రం కూడా ఈ సాహసానికి పూనుకోలేదు. ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతమైంది. అధికారులు ఎంతో శ్రమకోర్చి రికార్డుల ప్రక్షాళన చేశారు’’అని చెప్పారు. ప్రతి రైతుకు బీమా పట్టా ప్రతి రైతుకు బీమా పట్టా అందిస్తామని సీఎం చెప్పారు. ‘‘రైతులు భూమిని నమ్ముకుని బతుకుతున్నారు. చాలామంది చిన్న, సన్నకారు రైతులే. ఒక్క ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 18 లక్షల మంది ఉన్నారు. అలాంటి పేద రైతు చనిపోతే వారి కుటుంబం ఉన్నట్టుండి అగాథంలో పడిపోతుంది. కాబట్టి మరణించిన రైతు కుటుంబానికి 5 లక్షల బీమా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్ఐíసీ ద్వారా బీమా సౌకర్యం కల్పిస్తాం. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ప్రతి రైతుకు బీమా పట్టా అందిస్తాం. రైతులు కోరుకున్న వారినే నామినీగా చేర్చాలి. బీమా పథకం అమలుకు సంబంధించి ఎల్ఐసీ అధికారులతో చర్చలు జరుపుతున్నాం. రైతు చనిపోయిన వెంటనే ఆయన కుటుంబానికి పరిహారం అందేలా రూపకల్పన చేయాలి’’అని అధికారులకు సూచించారు. కల్యాణలక్ష్మికి కుల ధ్రువీకరణ వద్దు రంజాన్ పండుగ ఏర్పాట్లు, రాష్ట్రావతరణ వేడుకలు, కల్యాణలక్ష్మి, హరితహారం తదితర కార్యక్రమాలపై సీఎం కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. రంజాన్ సందర్భంగా నియోజకవర్గాల వారీగా ముస్లింలకు దుస్తుల పంపిణీ చేయాలన్నారు. పేదలందరికీ కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నందును కుల ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని పేర్కొన్నారు. జూన్ 1 నుంచే పాఠశాలల ప్రారంభం అవుతున్నందున జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహించాలని సూచించారు. సీఎం తీసుకున్న కీలక నిర్ణయాలివీ.. – అసైన్డ్ భూములు కొన్న వారు పేదలైతే వారి పేరిటే యాజమాన్య హక్కులు కల్పించాలి. వారికి రైతు బంధు పథకం వర్తింపచేయాలి – స్వస్థలానికి రాలేకపోతున్న ఎన్నారైలకు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ప్రత్యేక విధానం అనుసరించాలి – ఆధార్ నంబరు అనుసంధానం చేయడానికి ముందుకు రాని వారి పాస్ పుస్తకాలను పక్కన పెట్టాలి – భూమికి సంబంధించిన అన్ని వివరాలతో ‘ధరణి’వెబ్సైట్ నిర్వహించాలి – భూరికార్డులను నిర్వహించే విషయంలో అవినీతికి పాల్పడే వారిపట్ల అత్యంత కఠినంగా ఉండాలి. తప్పులు చేసిన వారిని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి – పాస్ పుస్తకాల పంపిణీ, చెక్కుల పంపిణీ కార్యక్రమం వంద శాతం పూర్తయ్యే బాధ్యతను కలెక్టర్లతో పాటు మంత్రులు స్వీకరించాలి – ప్రతీ మండలంలో వందశాతం బుక్కులు, చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తయ్యే బాధ్యతను ఆయా మండలాల తహసీల్దార్లకు అప్పగించాలి. జిల్లాలో మంత్రి, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలి. చెక్కుల పంపిణీకి స్పెషలాఫీసర్లు వీరే.. పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీ పర్యవేక్షణకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా నియమించింది. ఆ వివరాలివీ.. ఆదిలాబాద్– వికాస్రాజ్, భద్రాద్రి కొత్తగూడెం–అధర్ సిన్హా, జగిత్యాల–సందీప్కుమార్ సుల్తానియా, జనగామ–అజయ్మిశ్రా, జయశంకర్ భూపాలపల్లి–అరవింద్కుమార్, జోగులాంబ గద్వాల–రజత్కుమార్ సైనీ, కామారెడ్డి–టి.కె.శ్రీదేవి, కరీంనగర్–స్మితా సబర్వాల్, ఖమ్మం– నీతూకుమారి ప్రసాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్–టి.చిరంజీవులు, మహబూబాబాద్–క్రిస్టినా చోంగ్తు, మహబూబ్నగర్–దానకిశోర్, మంచిర్యాల–నవీన్మిట్టల్, మెదక్–రంజీవ్ ఆర్.ఆచార్య, మేడ్చల్ మల్కాజ్గిరి–జయేశ్ రంజన్, నాగర్ కర్నూల్–వి.అనిల్కుమార్, నల్లగొండ–సోమేశ్కుమార్, నిర్మల్– శశాంక్ గోయల్, నిజామాబాద్–రామకృష్ణారావు, పెద్దపల్లి–ఎన్.శ్రీధర్, సిరిసిల్ల–సునీల్శర్మ, రంగారెడ్డి– శైలజ రామయ్యర్, సంగారెడ్డి–మాణిక్ రాజ్, సిద్దిపేట– చిత్రా రామచంద్రన్, సూర్యపేట– వై.శ్రీలక్ష్మీ, వికారాబాద్–ఎన్.శివశంకర్, వనపర్తి–అనితా రాజేంద్ర, వరంగల్ అర్బన్– ఎం.వీరబ్రహ్మయ్య, వరంగల్ రూరల్– ఎం.జగదీశ్వర్, యాదాద్రి భువనగిరి– శాంతికుమారి. -
ఫెడరల్ ఫ్రంటే గేమ్ చేంజర్: ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ దేశ రాజకీయాల్లో గేమ్ చేంజర్గా నిలుస్తుందని ఎంపీ కె. కవిత అన్నారు. ఢిల్లీలోని ఇండియన్ విమెన్స్ ప్రెస్ కార్ప్లో మంగళవారం జరిగిన చర్చాగోష్ఠిలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురాలేకపోయిందని విమర్శించారు. ఎన్నికలకు ఏడాదే గడువు ఉండటంతో ఇప్పటికైనా రైతులకు మేలు చేస్తుందేమో చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను పరిగణనలోకి తీసుకోకుండా మోదీ సర్కార్ విధానాలు రూపొందించడం సరైంది కాదని చెప్పారు. తమది బలమైన పార్టీ కాబట్టే బీజేపీ ఏజెంట్, కాంగ్రెస్ ఏజెంటూ అంటూ టీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వ్యవస్థలో మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైందని, విధానాలు నచ్చి తమతో కలసి వచ్చే వారందరినీ స్వాగతిస్తామని చెప్పారు. రైతులను అప్పుల ఊబి నుంచి గట్టెక్కించేందుకే సీఎం కేసీఆర్ రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారని, ఇది రైతులను వడ్డీ వ్యాపారుల బారి నుంచి రక్షిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
కాంగ్రెస్ నేతలు పరిగలు ఏరుకోవాల్సిందే
సాక్షి, సిద్దిపేట: ‘సీఎం కేసీఆర్ స్వయానా రైతు బిడ్డ. అందుకోసమే రైతును రాజుగా చూడాలని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం వర్షాకాలానికి ముందుగా ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి సహాయం అందిస్తోంది. దీంతో రైతులు ఎరువులు, విత్తనాల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసే దుస్థితి తప్పింది. ఇంత మంచి పని చేసిన కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు సమర్థి స్తున్నారు. ప్రతిచోట బ్రహ్మరథం పడుతున్నారు. ఇక కాంగ్రెస్ నాయకులు వచ్చే ఎన్నికల్లో పరిగలు ఏరుకోవడం మినహా.. చేసేది ఏమీ లేదు’అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. బుధవారం సిద్దిపేట నియోజకవర్గం రంగధాంపల్లి, గజ్వేల్ నియోజకవర్గం బూరుగుపల్లిలో రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు పథకంతో ప్రజలు గ్రామగ్రామాన పండగ జరుపుకుంటున్నారని, సాగుకు ముందే సహాయం అందడంతో రైతు లు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభు త్వం మద్దతు ధర, నిరంతర విద్యుత్, పెట్టుబడి సహాయం అందించడంతో పాటు సాగునీరిచ్చేందుకు కష్టపడుతోందని చెప్పారు. -
బ్యాంకుల్లో బారులు
సాక్షి, నిర్మల్: ఈనెల 10న ప్రారంభమైన రైతుబంధు పథకం జిల్లాలో ప్రశాంతంగా సాగుతోంది. సోమవారం వరకు సుమారు 64వేల మంది రైతులు చెక్కులు పొందారు. ఇందులో 4,855మంది రైతులు సంబంధిత బ్యాంకుల్లో చెక్కుల ద్వారా రూ.5.70కోట్లు తీసుకున్నారు. గ్రామాల్లో చెక్కులు పొందిన రైతన్నలు బ్యాంకుల బాట పడుతుండగా అవి ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. బ్యాంకుల వద్ద టెంట్లు, తాగునీటి వసతి కల్పించినా.. తరచూ కొన్ని బ్యాంకుల్లో సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో గంటలపాటు నిరీక్షించాల్సి వస్తోంది. బ్యాంకుల్లో సందడి షురూ.. రైతుబంధు పథకం ఈనెల 10న ప్రారంభమైంది. రైతులు చెక్కులు పొందినప్పటికీ డబ్బులు తీసుకునే అవకాశం సోమవారం వరకు రాలేదు. రెండో శనివారం, ఆదివారం బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. అధికారులు కూడా చాలా గ్రామాల రైతుల చెక్కులపై ఈనెల 14 తర్వాత తీసుకునే తేదీలను వేశారు. ఈనేపథ్యంలో సోమవారం నుంచే బ్యాంకుల్లో సందడి ప్రారంభమైంది. జిల్లాలో నిర్మల్ అర్బన్ మండలంలో కార్పొరేషన్ బ్యాంకు ద్వారా, తానూరు, కుంటాల, కుభీర్, దస్తురాబాద్, మామడ మండలాల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా, లోకేశ్వరం, దిలావర్పూర్ మండలాల్లో ఆంధ్రాబ్యాంకు ద్వారా, మిగతా 11మండలాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా రైతులకు చెక్కులను పంపిణీ చేస్తున్నారు. పొద్దున్నుంచే బారులు.. జిల్లాకేంద్రంతో పాటు వివిధ మండలాల్లో ఉన్న బ్యాంకుల వద్ద సోమవారం ఉదయం నుంచే రైతులు బారులుతీరారు. ఐదురోజులుగా పంపిణీ పూర్తిచేసిన గ్రామాలకు చెందిన రైతులు బ్యాంకులకు తరలివస్తున్నారు. బ్యాంకు అధికారులు టెంట్లతో పాటు, వారి కోసం తాగునీటి వసతులు ఏర్పాటు చేస్తున్నారు. క్యూలైన్ పాటిస్తూ.. వరుసక్రమంలో చెక్కులను అందజేస్తూ డబ్బులు తీసుకుంటున్నారు. జిల్లాకేంద్రంలోని సంబంధిత బ్యాంకులు కిక్కిరిసిపోతున్నాయి. రైతులతో పాటు రోజువారీగా వచ్చే ఖాతాదారులతో నిండిపోతున్నాయి. ఈక్రమంలో రైతులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి చెక్కులను అందజేస్తున్నారు. కొన్ని బ్యాంకుల్లో మాత్రం సర్వర్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో గంటల పాటు రైతులు వేచిచూడాల్సి వస్తోంది. నమ్మి మోసపోవద్దు.. బ్యాంకుల వద్ద చెక్కులు డ్రా చేసుకునేప్పుడు రైతులు ఎవరి మాటలను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి వద్ద నుంచి డబ్బులు కాజేసే ప్రయత్నం చేసేవాళ్లూ ఉంటారని హెచ్చరిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని పలు బ్యాంకులను సోమవారం పట్టణ సీఐ జాన్దివాకర్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా క్యూలైన్ల ద్వారా వెళ్లేలా సిబ్బందిని ఉంచామని చెప్పారు. అలాగే అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దని అవగాహన కల్పిస్తున్నామని సీఐ పేర్కొన్నారు. ప్రశాంతంగా సాగుతున్న పంపిణీ.. జిల్లావ్యాప్తంగా రైతుబంధు చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీ ప్రశాంతంగా సాగుతోంది. కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ తదితరులు సారంగపూర్ మండలం జామ్ గ్రామానికి వచ్చారు. పలువురు రైతులకు చెక్కులు, పాసుబుక్కులు అందించడంతో పాటు స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. యాసంగికి సంబంధించి నవంబర్ నెలలో ఎకరాకు రూ.4వేల చొప్పున చెల్లించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో మొత్తం రైతులు : 1, 65, 670 మొత్తం చెక్కులు : 1,67,153 పెట్టుబడి సాయం : రూ.175.01కోట్లు ఐదురోజుల్లో చెక్కుల పంపిణీ : 64,000 డబ్బులు పొందిన రైతులు : 4,855 డ్రా చేసుకున్న మొత్తం : రూ.5,70,07,830 పైసల కోసం అచ్చిన సార్లు ఊరికి అచ్చి చెక్కు ఇచ్చిండ్రు. మా దగ్గర బ్యాంకు లేదు. పైసల కోసం నిర్మల్ అచ్చిన. సర్కారు చేస్తున్న సాయం మంచిగున్నది. కొంచెం పైసలు తీసుకునతందుకే తిప్పలైతుంది. – లింగన్న, గోపాల్పేట్, సారంగపూర్ మండలం వేచిచూడాల్సి వస్తోంది రైతుబంధు చెక్కులు డ్రా చేసుకునేందుకు వచ్చిన రైతుల కోసం బ్యాంకుల్లో ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. ఒక్కోసారి సర్వర్ పని చేయడం లేదని చెబుతున్నారు. దీంతో చాలాసేపు వేచిచూడాల్సి వస్తోంది.– లోకమాన్య, భాగ్యనగర్, నిర్మల్రూరల్ మండలం అపరిచితులను నమ్మవద్దు చెక్కులు డ్రా చేసుకునేందుకు వచ్చే రైతులు బ్యాంకుల వద్ద ఎవరినీ నమ్మవద్దు. గుర్తు తెలియని వ్యక్తులతో సంబంధం లేకుండా నేరుగా బ్యాంకు అధికారుల నుంచే డబ్బులు తీసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే పోలీసులను సంప్రదించాలి.– జాన్దివాకర్, పట్టణ సీఐ, నిర్మల్ -
అభివృద్ధిలో తెలంగాణ నంబర్వన్
సాక్షి, తలమడుగు(బోథ్) : అనతికాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే తెలంగాణ నంబర్వన్ రాష్ట్రంగా అవతరించిందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామంలో రైతుబంధు పథకంలో భాగంగా సోమవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్నతో కలిసి ఆయన రైతులకు పెట్టుబడి చెక్కులు, పట్టాదారు పాస్పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 40 శాతం భూరికార్డులు వివాదాలతో ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతో 96శాతం వరకు ఎలాంటి వివాదాలు లేకుండా భూ సమస్యలు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. నాలుగైదు నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు సహకరించిన రెవెన్యూ యంత్రాంగంతో పాటు ఇతర శాఖల అధికారులను అభినందించారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పాస్ పుస్తకాలను 17 రకాల సైక్యూరిటీతో రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇక నకిలీ పాస్బుక్లకు కాలం చెల్లినట్లే అన్నారు. రాష్ట్రంలో 58 లక్షల పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని అన్నారు. దేశంలో రైతు సంక్షేమానికి సుమారు రూ.50 వేల కోట్లు వరకు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా చేస్తాం: మంత్రి పోచారం వ్యవసాయం అంటే పండుగలా మారుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతు సమన్వయ సంఘాలు రైతులకు సాగులో అండగా ఉంటూ వారికి సంబంధిత అధికారుల ద్వారా సూచనలు, సలహాలు అందేలా కృషి చేయనున్నట్లు తెలిపా రు. అలాగే మార్కెట్లో గిట్టుబాటు ధర అందని పక్షంలో రైతు సమన్వయ సంఘాల ద్వారా పంట దిగుబడులను కొనుగోలు చేస్తామన్నారు. దేశంలో రైతులను పట్టించుకున్న నాయకుడు ఒక్క కేసీఆర్ మాత్రమే అన్నారు. వచ్చే జూన్ 2నుంచి రైతులకు బీమా పథకం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఇందుకు గాను ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రైతుబంధు చెక్కులను పెట్టుబడి ఖర్చులకు వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. రైతుకు అండగా సీఎం : మంత్రి రామన్న పెట్టుబడి కోసం రైతుల పడే ఇక్కట్లను గుర్తించిన సీఎం కేసీఆర్ అన్నదాతకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాగంగా ఎకరానికి ఏడాదికి రూ.8వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించి రైతులకు తొలివిడత చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు పథకం దేశానికే ఆదర్శం : ‘గుత్తా’ రైతుబంధు పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుం దని రైతు సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. రైతు సమితీలు గ్రామాల్లో కీలకపాత్ర పోషించాలన్నారు. అనంతరం గ్రామంలోని రైతు లకు పట్టా పాస్ పుస్తకాలు, చెక్కలు పంపిణీ చేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ గోడాం నగేశ్, మాజీ మంత్రి వేణుగోపాలచారి, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్, పాడి పరిశ్రమ సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, కలెక్టర్ దివ్య దేవరాజన్, ఎస్పీ విష్ణువారియర్, జిల్లా రైతు సమన్వయకర్త అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్రెడ్డి, సహకార సంఘ చైర్మన్ కృష్ణారెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, తహసీల్దార్ రాంరెడ్డి, ఎం పీపీ మంజుల శ్రీధర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, ఎంపీడీవో భూమయ్య, సర్పంచ్ సంగీత, ఎంపీటీసీ లక్ష్మీరమణ, ఏడీఏ రమేశ్, వైద్యాధికారి రాజీవ్రాజు,మండల రైతు సమన్వయకర్తలు గోవ ర్ధన్రెడ్డి, కేదారేశ్వర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.