r narayanamurthy
-
రివైజింగ్ కమిటీకి వెళతా
‘‘బడా పారిశ్రామికవేత్తలు అప్పులు చేస్తే శిక్షలు వేయరు. కానీ రైతు అప్పు కట్టకపోతే పొలాల్ని, ఇంటిని జప్తు చేస్తారు. వాటిని నా ‘అన్నదాత సుఖీభవ’ చిత్రంలో చూపించా. సినిమాకి కీలకమైన ఆ సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బోర్డ్ చెప్పడం బాధ కలిగించింది. అసలు రైతుల బాధలను చూపించాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రం తీశా’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. ఈ నెల 14న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు చెప్పిన సన్నివేశాల తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బుధవారం నారాయణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘దేశానికి వెన్నెముక రైతు అంటారు. అన్నం పెట్టే అన్నదాత పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. నోట్ల రద్దు వల్ల కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీఎస్టీ వల్ల వేల కోట్ల ధనం ప్రజలు కోల్పోతున్నారు. ఈ అంశాలన్నింటినీ మా సినిమాలో ప్రస్తావించా. ఈ నెల 14న సినిమాను విడుదల చేయాలని మార్చిలో సెన్సార్కు అప్లై చేశా. వారం క్రితం సినిమా చూసిన సెన్సార్ బోర్డు నోట్ల రద్దు, జీఎస్టీ సన్నివేశాలను తొలగించాలని చెప్పడంతో ఒప్పుకున్నా. కానీ, సినిమాకి కీలకమైన రైతు సన్నివేశాలను తొలగించాలని చెప్పడంతో ఒప్పుకోలేదు. అందుకే నా సినిమాకు సెన్సార్ చేయలేదు. సెన్సార్ బోర్డు తీరుకు నిరసనగా నేను రివైజింగ్ కమిటీకి వెళ్తున్నా. 30 ఏళ్లుగా నేను ప్రజా సమస్యలపై మాత్రమే సినిమాలు తీస్తున్నా. సెన్సార్ విషయంలో శ్యామ్ బెనగల్ సూచనలను అమలు చేయాలని అన్ని ఇండస్ట్రీల నిర్మాతలు పోరాటాలు చేయాలి’’ అన్నారు. -
ఆ సీన్స్ తీసేయమంటున్నారు
హైదరాబాద్ : ‘అన్నదాత సుఖీభవ’ సినిమాలో జీఎస్టీపై డైలాగులు తొలగించాలని సెన్సార్బోర్డు సభ్యులు ఆదేశించడం పట్ల దర్శక నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై సినిమా తీస్తే సెన్సార్ బోర్డు వాళ్లు కొన్ని ముఖ్యమైన సీన్లు తొలగించాలని ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించినట్టు ఆయన తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా తాను సినిమాలు తీస్తున్నానని చెప్పారు. తాను ఎవరికీ వ్యతిరేకంగా సినిమాలు తీయడం లేదని, ప్రజా సమస్యలపై మాత్రమే సినిమాలు తీస్తున్నానని అన్నారు. సెన్సార్ బోర్డు వారు తన సినిమాలోని... ‘బడా పారిశ్రామిక వేత్తలు అప్పులు చేస్తే శిక్షలు వేయరు గానీ, రైతు అప్పుకట్టకపోతే పీడిస్తారు’ అనే ప్రధానమైన సీన్ను తొలగించాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఇదే తన సినిమాకి సోల్ అని చెప్పారు. అందుకే తన సినిమాకు సెన్సార్ చేయలేదని, తాను రివైవింగ్ కమిటీకి వెళ్తున్నట్లు చెప్పారు. -
రైతు బతకాలి.. ప్రపంచాన్ని బతికించాలి
‘‘రైతే రాజు అన్న నానుడి ఇప్పుడు లేదు. రైతు పరిస్థితి దయనీయంగా మారింది. గిట్టుబాటు ధర లేకపోవడమే ఇందుకు కారణం. 2009 నుంచి ఇప్పటివరకు దాదాపు మూడు లక్షలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం మన దౌర్భాగ్యం. రైతు బతకాలి. ప్రపంచాన్ని బ్రతికించాలి’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్. నారాయణమూర్తి నటిస్తూ, రూపొందిస్తున్న చిత్రం ‘అన్నదాతా సుఖీభవ’. ఆయన మాట్లాడుతూ– ‘‘స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించాం. వ్యవసాయం దండగ కాదు. పండగ అని చెప్పే చిత్రమిది. ఈ సినిమాలో వంగపండు రాసిన పాటను బాలసుబ్రహ్మణ్యంగారు ఎంతో చక్కగా పాడారు. ఆయనకు హ్యాట్సాఫ్. గద్దరన్న, గొరేటి వెంకన్న, సుద్దాల అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాను మా గురువుగారు దాసరి నారాయణరావుగారికి అంకితం చేస్తున్నాం’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ– ‘‘డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ డిమాండ్స్కు వ్యతిరేకంగా ఇప్పుడు దక్షిణాది సినిమా పరిశ్రమ చేస్తున్న పోరాటం గొప్పది. సినిమా పరిశ్రమలు గురవుతున్న దోపిడీకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటమిది. హాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమల్లో లేని రేట్స్ మన ప్రాంతీయ సినిమాపైనే ఎందుకు? ఈ పోరాటానికి ప్రజలు కూడా సహకరించాలి’’ అని అన్నారు. -
అవార్డులపై మూర్తిగారి ఆవేదన
సాక్షి, హైదరాబాద్ : గతంలో సంస్కృతి, విలువలకు పట్టం కట్టేవారు. కానీ, ఇప్పుడు అవార్డులంటే ఓటు బ్యాంకు రాజకీయాల్లా మారాయి అని సీనియర్ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ మార్కెట్ యార్డ్ లో తన కొత్త సినిమా షూటింగ్ అనుమతి కోసం ఆయన గురువారం అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా నంది అవార్డులు-విమర్శలపై మీడియా ఆయన్ను ప్రశ్నించింది. రుద్రమదేవి చిత్రానికి అవార్డు రావాల్సింది. సిపాయిల తిరుగుబాటులో భారతదేశానికి ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్ర ఎలాంటిదో.. తెలుగు జాతికి రుద్రమదేవి అలాంటిది. అయినా ఈ మధ్య కమర్షియల్ చిత్రాలకు అవార్డులు ఇవ్వటం ఆనవాయితీగా మారిందని ఆయన అన్నారు. చారిత్రక నేపథ్యంల, కుటుంబ చిత్రాలను కూడా ఆదరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా, వినోదపరంగా బాహుబలి చిత్రం తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్లిందన్న ఆయన... అందుకు ఆ చిత్ర దర్శకుడు రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అన్నారు. కానీ, ఆ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు ఇచ్చినప్పుడే అవార్డులపై నమ్మకం పోయిందని నారాయణమూర్తి తెలిపారు. -
ఎప్పటికీ హీరోగానే కొనసాగుతా..!
విప్లవ చిత్రాలతో పీపుల్స్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్ననటుడు ఆర్.నారాయణమూర్తి. కొంత కాలంగా సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించలేకపోతున్న ఆర్ నారాయణమూర్తి ఈ సారి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. హెడ్ కానిస్టెబుల్ వెంకట్రామయ్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న నారాయణమూర్తి సినిమా ప్రమోషన్లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్న సంక్రాంతి సీజన్లో సినిమాను రిలీజ్ చేస్తున్న పీపుల్స్ స్టార్.. భవిష్యత్తులోనూ హీరోగానే కొనసాగుతానే తప్ప క్యారెక్టర్ రోల్స్ చేయనని ప్రకటించాడు. అందుకే టెంపర్ సినిమాలో పూరి జగన్నాథ్ ఇచ్చిన పాత్రను తిరస్కరించానని తెలిపాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్న సినిమాలకు థియేటర్లు దొరికే పరిస్థితి లేదని చిన్న సినిమాను పూర్తిగా తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదలవాడ శ్రీనివాస రావు తెరకెక్కిస్తున్న ఈసినిమాలో జయసుథ, నారాయణమూర్తి భార్యగా నటిస్తోంది. -
పూరీని కాదని.. కొత్త దర్శకుడితో..
సందేశాత్మక చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్ధానం సంపాదించుకున్న నటుడు ఆర్.నారాయణమూర్తి. ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో ఎదిగిన నారాయణమూర్తి కొంత కాలంగా తన స్వీయ దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కే సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. దాసరి లాంటి దిగ్దర్శకుల సినిమాల్లో హీరోగా నటించిన నారాయణమూర్తి.., ఈ జనరేషన్ దర్శకులు పిలిచి అవకాశాలు ఇచ్చినా కాదనేశారు. టెంపర్ సినిమా సమయంలో పూరి జగన్నాథ్, ఓ కీలక పాత్రకు ఆర్ నారాయణమూర్తిని సంప్రదించినా.. బయటి దర్శకులతో కలిసి పనిచేసే ఉద్దేశం లేదంటూ కాదన్నారు. అయితే ఓ కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు అంగీకరించారు పీపుల్స్ స్టార్. బిచ్చగాడు సినిమాతో నిర్మాతగా సక్సెస్ సాధించిన చదలవాడ శ్రీనివాసరావు దర్శకుడిగా మారి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. సందేశాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా కథ నచ్చటంతో నారాయణమూర్తి టైటిల్ రోల్ పోషించేందుకు అంగకీరించారు. ఈ సినిమాలో నారాయణమూర్తి జంటగా స్టార్ హీరోయిన్ జయసుథ నటిస్తుండటం విశేషం. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందిస్తున్నాడు. -
‘రాములమ్మ’కు స్ఫూర్తి అతనే! :దాసరి
‘‘సినీ చరిత్రలో ఎన్నో ప్రయోగాలు చేసిన దర్శకులున్నారు. రకరకాల కోవలకు చెందిన సినిమాలు తీసిన ప్రతిభావంతులున్నారు. కానీ ఒకే ధ్యేయంతో, ఒకే తరహా సినిమాలు తీసి విజయాలను అందుకున్న ఏకైక దర్శకుడు మాత్రం ఒక్క ఆర్.నారాయణమూర్తే. స్టార్ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాని ఇమేజ్ అతని సొంతం’’ అని దాసరి నారాయణరావు అన్నారు. ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘రాజ్యాధికారం’. ఆర్.నారాయణమూర్తే స్వరాలు కూడా అందించిన ఈ చిత్ర గీతాలను హైదరాబాద్లో విడుదల చేశారు. దాసరి ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని కె.రాఘవేంద్రరావుకు అందించారు. దాసరి ఇంకా చెబుతూ - ‘‘పేదవాడి కష్టాలను, వ్యవస్థపై ఉన్న కసిని సినిమా రూపంలో చూపించే ఏకైక దర్శకుడు నారాయణమూర్తి. నేను ‘ఒసేయ్ రాములమ్మ’ తీయడానికి స్ఫూర్తి తనే. జనాల్లోకి వెళితే అతని వ్యక్తిత్వానికి, మాటకు విలువ ఉంటుంది. కానీ... ఎందరడిగినా తాను రాజకీయాలకు దూరమనే చెప్పాడు. తన సినిమాకొచ్చే ప్రతి రూపాయినీ తన ఊరి అభివృద్ధికే ఉపయోగిస్తాడు. నారాయణమూర్తితో నా బంధం మాటల్లో చెప్పలేను. అతను నాకు వీరభక్త హనుమాన్ లాంటివాడు’’ అన్నారు. నారాయణమూర్తి మాట్లాడుతూ, ‘‘రాజకీయనాయకుల దిగజారుడు తనాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నా. తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరాం, తెలంగాణ శకుంతల లాంటివారి నటన, ప్రజా కవుల సాహిత్యం ఈ చిత్రానికి ఆభరణాలు. పది రోజుల్లో తొలి కాపీ వస్తుంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కె.రాంబాబు.