-
దేవ జాలం
మనుషులకు మంచి విషయాలు చెప్పడానికి పట్టాభిరామ్ ఇంద్రజాలాన్ని వాడుతారు అలా సమాజంలో అనుబంధాలను, ఆప్యాయతలను, అనురాగాలను పెంపొందించే కృషి చేశారు. మంచి చెప్పడానికి ఇంద్రజాలాన్ని వాడినప్పుడు దైవత్వాన్ని అనుభూతి చెందడానికి దేవజాలమే కరెక్ట్ మేజిక్ ఏమో కదా! మెజీషియన్, సైకాలజిస్ట్ డా.బి.వి.పట్టాభిరామ్ క్లినిక్కి వెళ్లినప్పుడు ఎదురుగా బోర్డుమీద ‘యు ఆర్ ది డిజైనర్ ఆఫ్ యువర్ డెస్టినీ’ (నీ తలరాతకి నువ్వే సృష్టికర్తవు) అనే అక్షరాలు ఆకట్టుకున్నాయి. ఈ మధ్య అతి చిన్న చిన్న సమస్యలే పెద్దవి అయిపోయాయి. మనుషులు మనస్తత్వాలు మరీ సున్నితమైపోయాయంటూ సబ్జెక్ట్లోకి వెళ్లిపోయారు పట్టాభిరామ్. సైకాలజీలో ఇటీవల రెండో పీహెచ్డీ వచ్చిందని ఆనందంగా వివరించిన ఆయన ‘నా వృత్తే నాకు దైవం’ అంటూ చెప్పుకొచ్చారు... దేవుడి గొప్పతనం మీకు మొదటిసారిగా ఎప్పుడు అర్థమైంది? (చిన్నగా నవ్వుతూ) నాకు దేవుడి గొప్పతనం కంటే ముందు మనిషి గొప్పతనం అర్థమైంది. వివరంగా చెబుతారా? నా చిన్నప్పుడు ఓసారి మా ఇంట్లో అంతా జాతకం చూపించుకుంటూ నా జాతకమూ చూపించారు. జ్యోతిష్యుడు నా జాతకం చూసి ‘వీడికి అక్షరమ్ముక్క అబ్బదు. ఈ కుటుంబంలో వీడు మహాదరిద్రుడు అవుతాడు. పైగా 16 ఏళ్ళకు మించి బతకడు’ అని చెప్పాడు. భయపడిపోయాను. మా అమ్మ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాను. ఆవిడ ఆ మాటను కొట్టి పడేస్తూ ‘ఒరే... మా నాన్న 80 ఏళ్లు బతికాడు. నువ్వూ అన్నేళ్లు బతుకుతావు. నీకు ఆయన గుణాలే వచ్చాయి. దిగులు పడకు’ అంది. ఇప్పుడు నా వయసు 66 ఏళ్లు. అమ్మ ఆ రోజు నన్ను అలా ‘మోటివేట్’ చేయకపోతే ఆ దిగులు నాలో అలాగే పడిపోయేదేమో. మనిషి గొప్పతనం మనిషి చేయగల మేజిక్ అప్పుడే నాకు అర్థమైంది. మరి దేవుడెప్పుడు తెలిశాడు? నేను టెన్త్ పాసయ్యాక మా అమ్మ తిరుపతి తీసుకెళ్లింది. గుండు చేయించుకోమంది. నేను చేయించుకోనన్నాను. ‘తప్పు, నేను దేవుడికి మొక్కుకున్నాను. మొక్కు తీర్చుకోవాల్సిందే. మొక్కు తీర్చుకోకపోతే దేవుడు శిక్షిస్తాడు’ అంది. నిజమే అనుకొని ‘టోపీ కొనిస్తే గుండు చేయించుకుంటా’న ని చెప్పాను. గుండు చేయించుకున్నాను. టోపీ పెట్టుకున్నాను. తిరిగి వస్తుండగా మా నాన్న నన్నే చూస్తూ ‘టోపీ ఎందుకు పెట్టుకున్నావురా.’ అన్నాడు. ‘అంతా నన్నే చూస్తున్నారు సిగ్గుగా ఉంది’ అన్నాను. ‘అంటే నీ మీద నీకు విశ్వాసం లేదన్నమాట. అమ్మ చెప్పింది కదా అని చేయించుకున్నావు. పైగా దేవుడు శిక్షిస్తాడు అంది కదా. శిక్షించేవాడు దేవుడెలా అవుతాడురా. గుండు చేయించుకోవడం అంటే ఆకర్షణ కారణంగా వచ్చిన అహాన్ని దూరం చేసుకున్నానని చెప్పడానికి సూచిక. అదేదో తప్పు అయినట్టు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు. ఇదెందుకు సిగ్గుపడే పని అయింది చెప్పు’ అన్నాడు. వాస్తవం అనిపించింది. టోపీ తీసి రోడ్డు మీదకు విసిరేశాను. మూఢంగా నమ్మడం అప్పటి నుంచే మానేశాను. లాజికల్గా ఆలోచించడం మొదలుపెట్టాను. అమ్మా నాన్నలు బిడ్డకు జన్మనివ్వడమే కాదు మంచి చెడులను చెప్పి జీవితంలో ఎదిగేందుకు చేయూతనిచ్చే దేవతలు. అమ్మనాన్నలను మించిన దేవతలు లేరు నాకు. ఆ తర్వాత నన్ను నిలబెట్టిన ఈ వృత్తి నాకు దైవం కన్నా ఎక్కువ. ఇంటి కన్నా గుడి పదిలం అన్నారు పెద్దలు. మీరు చెబుతున్నది చూస్తే గుడి కన్నా ఇల్లు పదిలం అన్నట్టుంది? మా అమ్మనాన్నలకు 15 మంది సంతానం. 11 మంది అన్నదమ్ములం. నలుగురు అక్కచెల్లెళ్లు. వాళ్లు అంతమందిని ఎలా పెంచారో తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యమే. మా నాన్న తిట్టడం, కొట్టడం చూళ్లేదు నేను. కొన్ని నియమాలు మాత్రం కఠినంగా ఉండేవి. అందరం ఒకేసారి కూర్చొని భోజనం చేయాలి, రాత్రి 9కి అందరూ పడుకోవాలి. కలిసి పంచుకొని తినడంలో ఆనందం, కంటి నిండా నిద్రపోవడంలో ఆరోగ్యం ఆయన నుంచి మేం నేర్చుకున్నాం. మా ఇంట్లో అందరూ కళాకారులే. నాకు మేజిక్ కళ అబ్బినట్టే అందరికీ ఒక్కో కళలో ప్రవేశం, ప్రావీణ్యం ఉన్నాయి. ఇప్పటికీ ప్రతి రెండవ శనివారం అందరం ఒకచోట కలుస్తుంటాం. ఆ రోజు మాకు పెద్ద పండగ. ఏ ఒక్కరు మిస్ అయినా వాళ్లేదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అవుతుంటారు. ఈ రోజుల్లో ఇంట్లో ఉండేది ఇద్దరో, ముగ్గురో.. అయినా ఒకరినొకరు మాట్లాడుకోరు. ఫోన్లలో చాట్ చేస్తూనో, టీవీ చూస్తోనో గడిపేస్తారు. మాట్లాడుకోవాలి, ఏది మాట్లాడకూడదో తెలుసుకొని ఆచరించాలి, కలిసి భోజనం చేయాలి, కుటుంబంలో అందరి మధ్య స్పర్శ ఉండాలి, ప్రశంస ఉండాలి, నవ్వు ఉండాలి.. ఇవి లేకనే బయటివారితో తమ ఆనందాలను వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్లను వదిలి గుళ్లూ, గోపురాలలో కాలక్షేపం చేస్తున్నారు. మిమ్నల్ని మీరు హిప్నటైజ్ చేసుకుంటారా? ప్రతి రోజూ హిçప్నటైజ్ చేసుకుంటాను. మనల్ని మనం తెలుసుకోవడం అవసరం. పాజిటివ్ ఆలోచనలు ఎంత పెంచుకుంటే అంత ప్రశాంతమైన జీవితం మనదవుతుంది. చెడు నన్ను పట్టుకుందా దాన్ని శుభ్రం చేసుకుంటాను. మంచి ఎక్కడైనా ఉందా అది తీసుకుంటాను. ఈ విధానంలో గొప్ప ప్రశాంతత చేకూరుతుంది. మీ దగ్గరకు వచ్చే కేసులలో ఈ కేసు దేవుడే డీల్ చేయాలని చేతులెత్తేసిన సందర్భం? అలాంటిదెప్పుడూ లేదు. పరిష్కారం చేయలేని కేసులంటూ ఏమీ ఉండవు. దాన్ని డీల్ చేసే విధానాలే వేరు వేరుగా ఉంటాయి. మనం చెప్పే విధానంలో ఆ క్లారిటీ ఉండాలి. నాకీ పని చేయడం రాదు, నేను ఇలాగే ఉంటాను అంటుంటారు కొందరు. అదొట్టి మూర్ఖత్వం. ముందు ఆచరణలో పెడితే తర్వాత అదే అలవాటవుతుంది. దేవుడి మహిమ వల్లే ఈ కేసు పరిష్కారం అయిందనుకున్న సందర్భం ఉందా? మీరు వచ్చే ముందే ఈ (‘సత్య నాదెళ్ల’ పుస్తకం చూపిస్తూ) పుస్తకం చదువుతున్నాను. ఈయనకి ఐఐటీలో సీటు రాలేదు. బిట్స్ పిలానీలో సీటు రాలేదు. డొనేషన్ కట్టి చదివాడు. కంప్యూటర్ ఇంజనీర్ కావాలన్నది ఆశయం. అతను ఇందులో చెప్పుకున్నాడు.. ‘నా గదిలో మా అమ్మ లక్ష్మీదేవి బొమ్మ పెట్టేది.. మా నాన్న కార్ల్మార్క్స్ బొమ్మ పెట్టేవాడు... నేను క్రికెటర్ జయసింహ ఫొటో పెట్టుకునేవాణ్ణి’ అని. ఆయన తన కలను నెరవేర్చుకోవడం కోసం కృషి చేశాడు. ఇప్పుడు మహామహా మేధావులు సైతం ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడతారు. ‘యు ఆర్ ది డిజైనర్ ఆఫ్ యువర్ డెస్టినీ’. నీ నుదుటి రాత దేవుడు రాయడు. పెన్ను, పేపర్ నీ చేతిలోనే ఉంది. నువ్వేది రాసుకుంటే అదే నీ జీవితం. నువ్వు కృషి చేయి. నీకు నేచర్ సపోర్ట్ చేస్తుంది. అంతేకానీ, దేవుడి మహిమలు అంటూ ఏమీ లేవు. మేజిక్ అంటే మాయ కదా! డబ్బు మాయ, పదవి మాయ, మోహం మాయ.. మనిషి ఏ మాయ నుంచి జాగ్రత్తగా ఉండాలి. డబ్బు గొప్పది. దీని కోసమేగా అందరం పనిచేసేది. మనిషి తనకు సరిపడా ఉన్నా ఇంకా ఇంకా సంపాదిస్తూనే ఉంటాడు. తరతరాలకు. ఆ డబ్బే అతన్ని సుఖపెడుతుంది. ఆ డబ్బే దుఃఖపెడుతుంది. డబ్బు మాయను అర్థం చేసుకొని ఆనందంగా బతికితే చాలు. మీ భార్యను మాయ చేసిన సందర్భం ఉందా? (నవ్వుతూ) మాయ అని చెప్పలేను. కానీ, వాస్తవంగా ఆలోచించినది ఆచరణలో పెట్టడానికి పెళ్లయ్యాక నాకు ఐదేళ్లు పట్టింది. మా ఆవిడకు గుళ్లకు వెళ్లడం, సంప్రదాయాలను పాటించడం చాలా ఇష్టం. అవి నన్నూ పాటించమంటే కష్టంగా ఉండేది. నా వృత్తికవి అడ్డంకి కూడా. ఇలా చెప్పి ఆమె మనసును నొప్పించకూడదు. అందుకని ఓ ప్లాన్ వేశాను. ‘ఏడాదిలో రెండుసార్లు అంటే, జనవరి 1న షిరిడీ వెళ్దాం. పెళ్లిరోజున తిరుపతిలో ఉందాం’ ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఈ ప్లాన్ ఇంకో పదేళ్లయినా అలాగే కంటిన్యూ అవుతుంది. సంప్రదాయాలను మూఢంగా కాకుండా లాజికల్గా ఆలోచించి చేయమని చెబుతుంటాను. ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందండీ అంటుంది. అలా అయితే బిల్గేట్స్ ఇంటి ముందు ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేయాలి చెప్పు అంటాను నవ్వేస్తూ.. ఆలోచనల్లో పడుతుంది. ముక్కోటి దేవతలు ఉండగా జనాలు మీతో మొరపెట్టుకోవడానికి వస్తారెందుకు? ఇక్కడే అర్థం అవుతుందిగా. దేవతలు సమస్యలు సాల్వ్ చేయరని. సైకాలజిస్ట్లు అంటే ఎవరు..? ఒకప్పటి తాతయ్యలు, నానమ్మలు. అప్పట్లో వాళ్లు అన్పెయిడ్ కౌన్సిలర్లు. ఇప్పుడు ఇళ్లలో వాళ్లు లేరు. అందుకే మా అవసరం వచ్చింది. మంచి, చెడులు చెప్పి బాంధవ్యాలు చక్కగా ఉండేలా చేసే పెద్దదిక్కులను ఆశ్రమాలకు పంపిస్తున్నాం. కనపడని దేవతలకు మొక్కుకుంటే ఎవరు వింటారు. ఆ ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేస్తారు. దేవుడి సైకాలజీ ఏమిటి? ప్రశాంతంగా ఉండటమే దేవుడి సైకాలజీ అనిపిస్తుంది. ప్రశాంతంగా ఉండే స్థలంలోనే కదా దేవుడు ఉంటాడు. మరి ఆ దేవుడిని పూజించే మనం ప్రశాంతంగా ఉంటున్నామా? చాలా మంది ఫ్యామిలీ ఇష్యూస్తో మా వద్దకు వస్తుంటారు. చెప్పిన మాట పిల్లలు వినడం లేదనో, భార్యాభర్తల బంధం సరిగా లేదనో.. అన్నీ కంప్లైంట్సే. చాలా చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద మనస్పర్ధలుగా మారి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. అశాంతికి విరుగుడు ప్రశాంతత అని అర్థం చేసుకోవాలి. దేవుడికి కష్టం చెప్పుకోవచ్చా? దేవుడికి కష్టం చెప్పుకుంటారు బానే ఉంది. వింటున్నాడనే నమ్మకం ఉందా. అలా అని నమ్ముతున్నారా? మరి మా దగ్గరకు వచ్చే జనం రోజు రోజుకూ పెరుగుతున్నారు ఎందుకు? అందుకే, మనం మనుషులతోనే మాట్లాడాలి. మనవాళ్లతో మనం మాట్లాడాలి. మన చుట్టూ ఉన్నవాళ్లతో మాట్లాడాలి. మాట కత్తికన్నా పదునైనది. నువ్వు మంచిగా మాట్లాడకపోయినా ఫర్వాలేదు. ఎదుటివారిని నొప్పించేవిధంగా మాత్రం మాట్లాడకూడదు. అది నీ ఆప్తులైనా సరే. అప్పుడే మనుషుల మధ్య బాంధవ్యాలు బాగుంటాయి. బాంధవ్యాలు బాగుంటే బతుకు బాగున్నట్టే. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
ఫెయిల్యూరా.. ఫీలవ్వొద్దు..
చరిత్ర ఎప్పుడూ విజేతలనే గుర్తుపెట్టుకుంటుంది.. పరాజితులను పట్టించుకునేవారెవరు? మేం పట్టించుకుంటాం అని అంటున్నారు శామ్యూల్ వెస్ట్. శామ్యూల్ ఓ సైకాలజిస్ట్. ఒక కొత్త ఆవిష్కరణ వెనుక వందలాది విఫలయత్నాలు ఉంటాయని చెబుతున్న శామ్యూల్.. ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీల కోసం ఓ మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నాడు. వచ్చే నెలలో స్వీడన్లో ‘మ్యూజియమ్ ఆఫ్ ఫెయిల్యూర్స్’ ప్రారంభమవనుంది. గత ఏడేళ్లుగా జయాపజయాలు.. వాటి గురించి జనం ఏమనుకుంటున్నారు? అనే అంశంపై శామ్యూల్ పరిశోధన చేశారు. ‘ఏదైనా కొత్త విషయం ఆవిష్కృతమయ్యే ముందు.. దానికి సంబంధించి 80 నుంచి 90 శాతం ప్రాజెక్టులు ఫెయిలవుతుంటాయి. ప్రతి విజయం వెనుక ఓ అపజయం ఉంటుందని తెలియజెప్పడానికే ఈ మ్యూజియం. అపజయం అంటూ భయపడితే.. నువ్వు కొత్త చరిత్రను సృష్టించలేవు’ అని శామ్యూల్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఫెయిలయిన 60 ఉత్పత్తులు, సేవల వివరాలను ఈ మ్యూజియంలో ఉంచుతారు. ఈ విఫల ఉత్పత్తుల్లో కోకోకోలా తెచ్చిన కాఫీ ఫ్లేవర్డ్ డ్రింక్, టూత్పేస్ట్ కంపెనీ కోల్గేట్ తెచ్చిన ఆహార ఉత్పత్తులు, హార్లే డేవిడ్సన్ పర్ఫ్యూమ్, మొబైల్ కమ్ గేమింగ్ కోసం నోకియా తెచ్చిన ఎన్గేజ్ వంటివి ఉన్నాయి. -
అతడు - ఆమె... ఇతడు - ఈమె
కథ ఎనిమిది గంటలప్పుడు ఎవడో ఎదురుగా వున్న స్టాల్లో న్యూస్పేపర్ కొంటున్నాడు. ఇంటికెళ్ళేవరకూ ఆగలేను అన్నట్టు అక్కడే పేపర్ విప్పి చదివేస్తున్నాడు. నిన్నటికీ ఇవాళ్టికీ మధ్య దేశమేమైపోయిందా అన్న ఆతృత కాబోలు. ఎదురుగా వస్తున్నవాడు సెల్ఫోన్లో మాట్లాడుతూ పెద్దగా నవ్వుతున్నాడు. అంతగా నవ్వే విషయం ఏవుందో మరి..!? ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి వున్నారు. చూడబోతే నేను తప్ప అందరూ ఆనందంగానే వున్నట్టున్నారు. ఛీ.. వెధవ జీవితం..! నేనే ఎందుకిలా ఉసూరంటూ ఏడుస్తున్నానో అర్థంకావడం లేదు. అజంతా హోటల్లోకి దారితీశాను. ఆహా..! ఇక్కడ ఇడ్లీ తినేసింతర్వాత చచ్చిపోయినా ఫర్లేదనిపించింది. టిఫిన్ ముగించి బైటికొచ్చాను. ఇప్పుడేం చేద్దాం..? ఆలోచించాను. కాసేపు ఒంటరిగా వుండాలి. ఒంటరిగా.. ప్రశాంతంగా.. ఏ వెధవా పలకరించకుండా వుండాలి. ఆటో ఎక్కి పార్క్కి చేరుకున్నాను. ఉదయం ఫూట గాబట్టి నేననుకున్నట్టే పార్క్లో జనం లేరు. ఏవేవో గుర్తుకొస్తున్నాయి. శరత్గాడు వాడి భార్య అంజలి.. ఆ జంటని తల్చుకుంటే ఆశ్చర్యంగా వుంటుంది. ఎలాంటి అరమరికలు, భేదాభిప్రాయాలు లేకుండా అంత అన్యోన్యంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఎలా వుండగలుగుతున్నారో..?! నాకెందుకు ఇలా అయింది? లోపం ఎక్కడుంది..? ఇంకెక్కడ.. కచ్చితంగా నాలోనే! నేనే అంతటికీ కారణం. ఎవరో సైకాలజిస్టు చెప్పాడట. భార్య కాఫీ ఇచ్చినప్పుడు ‘థాంక్స్’ అనే చిన్నమాట ఉపయోగిస్తే చాలు.. ఆమె ఎంతో సంతోషిస్తుందట. మంచి భోజనం పెట్టినప్పుడు ‘ఈరోజు నీ చేతి వంట అద్భుతం’ అంటే ఆమె పడిన కష్టాన్నంతా మర్చిపోయి ఉప్పొంగిపోతుందట. భార్యాభర్తల మధ్య ఇలాంటి చిన్న చిన్న విషయాలే వారి బంధం గట్టిపడ్డానికి ఎంతో సహకరిస్తాయట. మరి నేనెప్పుైడనా మా ఆవిడకి థాంక్స్ చెప్పానా..? చెప్పినట్టు గుర్తులేదు. అదలా వుంచితే ఒకరి పుట్టినరోజుకి మరొకరు హేపీ బర్త్ డే చెప్పుకోవడం, చిన్న చిన్న గిఫ్టులు ఇచ్చుకోవడం లాంటివి చెయ్యాలట. ఇవన్నీ శరత్ గాడే చెప్పాడు. మరి నేనేం చేశాను..? పెళ్ళయిన తర్వాత మొదటి పుట్టినరోజుకు శ్రావణికి హేపీ బర్త్ డే అయితే చెప్పాను గానీ తనకేదో బహుమతి ఇవ్వాలన్న ఆలోచనే రాలేదు. ఇక రెండో సంవత్సరం మరీ ఘోరం.. పని ఒత్తిడిలో పడి ఆరోజు ఆమె పుట్టినరోజన్న సంగతే మర్చిపోయాను. అవన్నీ అలా వుంచితే ఆరోజు జరిగిన విషయం.. అది గుర్తుకొస్తే గుండెల్లో ముల్లు గుచ్చుకుంటున్నట్టే వుంటుంది. శ్రావణి నన్ను విడిచి వెళ్ళిపోతుందని నేను ఊహించలేదు. ఏదో కోపంలో వెళ్ళిపోయినా తిరిగి వచ్చేస్తుందిలే అనుకున్నాను. కానీ నిన్న తెలిసిన వార్త.. మనిషిని మనిషిలా వుంచడం లేదు.. గుండెల్లో మంట రేపుతోంది. శ్రావణి నామీద గృహ హింస కేసు పెట్టబోతోందిట. మా అత్తగారి వూళ్ళో వున్న ఓ చుట్టం ద్వారా విషయం తెలిసింది. అప్పట్నుంచి ఒకటే ఆలోచన.. ఏం కాదులే అని సర్దిచెప్పుకొని మనసు మళ్ళించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మళ్ళీ ఆలోచనలు అటే వెళ్తున్నాయి. లోపలెక్కడో వున్న ఆశ మళ్ళీ బైటికొచ్చింది. పోనీ శ్రావణికి ఒకసారి ఫోన్ చేస్తే..? ఆత్మాభిమానం వున్న ఏ ఆడదీ మీ దగ్గిర వుండలేదు.. మళ్ళీ నాకు ఫోన్ చెయ్యడానికి గానీ, నన్ను కలవడానికి గానీ ప్రయత్నించకండి.. శ్రావణి వెళ్ళిపోతూ నిప్పులు కురిపిస్తూ అన్న మాటలు గుర్తొచ్చాయి. ఛ.. ఛ.. ఫోన్ చెయ్యడానికి నాకైనా సిగ్గుండాలి. ఫోన్ చేసి ప్రాధేయపడి.. తప్పైపోయిందని ఒప్పుకొని... ఆమెని రమ్మని బ్రతిమాలుకొని.. వద్దు.. వద్దు.. ఇక జీవితాంతం ఆమె ముందు వెధైవపోతాడు. అదీ ఒక బతుకేనా..? ఏం చెయ్యాలిప్పుడు..? సమస్యల్ని తట్టుకోవడానికి ముందు మానసికంగా సిద్ధపడాలట. ఏం జరిగిపోదు అని మనకి మనవే ధైర్యం చెప్పుకోవాలట. ఒకరకంగా సెల్ఫ్ హిప్నాసిస్ లాంటిదన్నమాట. తర్వాత అసలు సమస్య మూలం ఏమిటి? దాన్ని పరిష్కరించుకోవడానికి ఏయే మార్గాలున్నాయి.. అని అన్వేషించాలట. అప్పటికి ఆ సమస్య కొంత తేలికైపోతుందట. ఇవన్నీ మొన్న ఓ వ్యాసంలో చదివాను. నేననుకునేదేమిటంటే ఒడ్డున నిలబడి ఇలాంటి ప్రవచనాలు ఎన్నయినా చెప్పొచ్చు.. సమస్యలో మునిగినోడికే దాని తీవ్రత తెలుస్తుంది. అయినా ఆ రోజెందుకు అలా జరిగిందో అర్థంకావడం లేదు.. ఇప్పుడు తల్చుకుంటే విధి లిఖితం అలా వుందేమో అన్పిస్తోంది. లేకపోతే నేనెందుకంత కోపం తెచ్చుకోవాలి..? జరిగింది మరోసారి నా కళ్ళముందు మెదిలింది. ఆరోజు ప్రమోషన్ వచ్చిన సందర్భంగా ఆనంద్గాడు పార్టీ ఇచ్చాడు. నిజానికి మందుకొట్టడం అనేది నాకేమాత్రం ఆసక్తి లేని విషయం. కానీ ఎప్పుడో ఇలాంటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సరిగ్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ మధ్య కూర్చున్నప్పుడు కాదంటే వాళ్ళెలాగూ విడిచిపెట్టరు కాబట్టి ఏదో కొంచెం అలా సిప్ చేస్తానంతే..! అయితే ఆరోజు మాటల్లో సిప్లు కొంచెం ఎక్కువయ్యాయి. ఇంటికొచ్చేసరికే శ్రావణి కోపంగా వుంది. అప్పటికే చాలాసార్లు నా సెల్కు ఫోన్ చేసిందట. కానీ నా సెల్ ఛార్జింగ్ అయిపోవడం నేను గమనించనే లేదు. మాటల్లోనూ మత్తులోనూ పడి ఇంటికి రావడం ఆలస్యమవుతుందని కూడా శ్రావణికి చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడో ఒకసారి తాగే నాలాంటి వాడికి మేనేజ్ చెయ్యడం చేతకాదు.. శ్రావణి వెంటనే పసిగట్టేసింది. తాగొచ్చారా..? అడిగింది. అసలు ఆ విషయం నేనే తనకి నెమ్మదిగా చెప్దామనుకున్నాను. పరిస్థితి చెప్తే ఆమె అర్థం చేసుకుంటుందనే నా నమ్మకం. అర్థం చేసుకునేదేమో కూడా.. కానీ శ్రావణి అలా ఫోర్స్గా ఒకేసారి అడిగేసరికి నా ఇగో దెబ్బతింది. అవును.. తాగే వచ్చాను. ఇప్పుడేంటి..? అసహనంగా అన్నాను. సాయంత్రం నుంచి ఫోన్లు చేస్తున్నాను. కనెక్ట్ కావడం లేదు.. కనీసం ఆలస్యమౌతుందని చెప్పాలని కూడా అనిపించలేదా..? అనిపించలేదు.. ఓహొ.. ఇంటికెందుకు వచ్చారయితే..? తెల్లార్లూ అక్కడే వుండాల్సింది.. తీవ్రంగా అంది. సరే.. ఈసారి అలాగే చేస్తాన్లే.. వాదన పెరిగిపోయింది. ఒక స్థాయిలో నేనేం చేస్తున్నానో నాకే తెలీలేదు. ఫలితం.. నా చేయి విసురుగా ఆమె చెంపను తాకింది. శ్రావణి నిర్ఘాంతపడి చూస్తుండిపోయింది. అప్పుడు చూశాను వెనక్కి.. శ్రావణి మేనత్త, మావయ్య! వెనక గది ద్వారం దగ్గర నిలబడి వున్నారు..! వాళ్ళొచ్చారన్న సంగతి నాకప్పటివరకూ తెలీదు. శ్రావణి వాళ్ళ ఇంటికి వచ్చి మా ఇల్లు కూడా దగ్గరే కాబట్టి చూసి పోదామని ఇక్కడికి వచ్చారట. తర్వాత్తెలిసింది నాకు. మా గలాటాకు నిద్రాభంగమై లేచినట్టున్నారు. ఒక్కసారిగా నా మత్తు దిగిపోయింది. కానీ అప్పటికే ఆలస్యమైంది..! శ్రావణి మనసు ముక్కలైంది. తర్వాత ఏం జరగాలో అదే జరిగింది.. నేను ఒంటరిగా మిగిలిపోయాను. పిచ్చెక్కేటట్టు వుంది.. ఏదయితే అదవుతుందని శ్రావణికి ఫోన్ చేశాను. ఆమె కోపంగా ఏమైనా అన్నా సహనంగా వుండాలి అనుకున్నాను. అట్నుంచి హలో.. ఎవరూ..? అని వినిపించింది. అది శ్రావణి గొంతు కాదు. నేను.. సురేష్ను మాట్లాడుతున్నాను.. శ్రావణి లేదా..? అడిగాను. నువ్వా బాబూ.. శ్రావణిని రమ్మని చెప్పడానికి చేశావా..? ఎందుకూ..? కొట్టి చంపెయ్యడానికా..? అది రాదులే బాబూ.. కోర్టు నుంచి నోటీసొస్తుంది.. అందుకో.. ఫోన్ కట్టయింది. ఆ గొంతు శ్రావణి మేనత్తది..! శ్రావణికి నా మీద కోపం తగ్గలేదన్న మాట.. కేసు పెట్టడానికే సిద్ధమైందన్న మాట..! అయిపోయింది.. అంతా అయిపోయింది.. సర్వనాశనం..! పరువు పోయినట్టే..! ‘వీడి మీదేరా.. పెళ్ళాం గృహహింస కేసు పెట్టింది.. స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు’ నాకు వినిపించేలా ఎవరూ అనరు.. నేను వెళ్తుంటే వెనక మాట్లాడుకుంటారంతే..! విరిగిన మనసులు అతకవన్నట్టు శ్రావణితో కలిసుండడం కూడా ఇక అసాధ్యమే అవుతుంది. ఇప్పుడేం చెయ్యాలి..? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? మధ్యాహ్నం రెండు గంటలు.. గది తలుపులు దగ్గరికి వేశాను. మనసంతా బరువుగా అయిపోయింది. ఎన్ని రకాలుగా ఆలోచించినా నేను చేస్తున్న పని కరక్టే అనిపించింది. వేరే దారి లేదు. నేనంటే వీధిలో.. ఆఫీసులో.. మా ఏరియాలో.. ఓ గుర్తింపు వుంది. మంచివాడు.. ఎవరి జోలికీ వెళ్ళడు.. అని. ఈరోజు.. ఇలాంటి మచ్చతో కాలనీలో నలుగురిలో తిరగడం అంటే.. లేదు.. లేదు.. అంతకంటే చావడం మంచిది. నా సమస్యా సమసిపోతుంది.. శ్రావణి మీద రివెంజ్ తీర్చుకున్నట్టు కూడా వుంటుంది.. అవును.. అదే కరెక్ట్..! జేబులో నుంచి బైటికి తీశాను.. విషం..! పంటలకు వాడేది.. పెస్టిైసడ్..! గేరంటీగా ఛస్తాను.. ఎంతసేపట్లో చస్తానో..? కడుపులో నొప్పేమైనా వస్తుందా..? సెల్ మోగింది. ఇప్పుడెవడు..? విసుగ్గా తీసి చూశాను. శరత్ గాడు.. ఇప్పుడెందుకు చేస్తున్నట్టో..? కట్టెయ్యబోయి మళ్ళీ మనసు మార్చుకుని పచ్చ బటన్ నొక్కాను. ఎక్కడున్నావ్ రా..? అర్జెంటుగా ఇంటికొచ్చేయ్.. పార్టీ చేసుకుందాం.. అన్నాడు. పార్టీయా..? అవును.. నీలాంటి ఆదర్శదాంపత్యం వున్నవాడికి ప్రతిరోజూ పండగే.. నాలాంటోడి బాధెవడికి చెప్పుకోను..? ఏం పార్టీ..? ఇప్పుడేంటి..? చెల్లెమ్మ ఇంట్లో లేదా..? అయినా నేనిప్పుడు రాలేను.. సహనంగా చెప్పాను. ఏం..? సెలవేగా ఈరోజు..? ఇంకేం చెప్పకు.. నువ్వు రావాల్సిందే.. లేదంటే నేనే మీ ఇంటికొచ్చేస్తాను. వాడి సంగతి నాకు తెలుసు. పట్టుపడితే వదిలే రకం కాదు.. వాడింటి నుంచి మా ఇంటికి రావడానికి ఐదు నిముషాలు కూడా పట్టదు. వస్తున్నాను.. ఇంకేమనాలో తోచక చెప్పాను. ఎందుకిలా జరుగుతోంది..? ఇది కూడా విధి లిఖితమేనా..? సరే.. కానీ.. ఒకసారి నిర్ణయించుకున్నాక నన్నెవడు ఆపగలడు..? కాకపోతే ఓ రెండు మూడుగంటల ఆలస్యం...బాటిల్ని కప్ బోర్డ్ లో పెట్టేసి శరత్ దగ్గరికి బెల్దైరాను. ఆలోచించకు.. కాస్ట్లీ సరుకు.. వేసేయ్.. గ్లాసులో మందు నింపి నావైపు తోసి అన్నాడు. అప్పటికే వాడు గుర్రం ఎక్కి వున్నాడు. మందా..? ఇప్పుడా..? నా గొంతు ఏదోలా ధ్వనించింది. మందేన్రా.. ఏదో విషమన్నట్టు మాట్లాడతావేంటి..? విషం అన్న మాట వినగానే ఉలిక్కిపడ్డాను. ఇప్పుడెందుకీ పార్టీ ఇస్తున్నావో చెప్పనే లేదు.. కంగారును కప్పి పుచ్చుకుంటూ అన్నాను. ఓహో... చెప్తేగానీ తాగవా..? సరే.. అంజలి వూరికెళ్ళింది. మీ ఆవిడ వూరికెళ్ళినప్పుడెప్పుడూ నువ్వు పార్టీ ఇచ్చిన గుర్తు లేదే..?! కరెక్ట్.. ఇప్పుడు కూడా అందుకివ్వడం లేదు.. ఇదసలు పార్టీ కూడా కాదు.. నీతో కొన్ని విషయాలు చెప్పాలి. ఏం చెప్పాలి..? ముందు తాగు.. గద్దించినట్టు అన్నాడు. గ్లాస్ తీసుకొని గడగడా గొంతులో వొంపేసుకున్నాను. ఇప్పుడు చెప్పు.. అయినా భార్య వూరికెళితే విరహంలో మునిగి గంటకోసారి ఆమెకు ఫోన్ చేస్తూ నీ ప్రేమను గుర్తు చెయ్యాల్సినోడివి.. అదే గదా నీ ఫిలాసఫీ.. ఇప్పుడీ దుకాణం ఎందుకు పెట్టావో అర్థం కావడం లేదు.. విసుగ్గా అన్నాను. ట్రాష్.. అదే..నే చెప్పాలనుకుంటున్నది.. ప్రతీ చిన్న విషయంలో భార్యకు థాంక్స్ చెప్పడం, ఎప్పటికప్పుడు ఏదో రకంగా మన ప్రేమను వ్యక్తపరచడం.. అన్నీ ట్రాష్.. అరిచాడు వాడు. ఏమైంది వీడికి..? ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావ్..? కాస్త భయంగా అన్నాను. నరకం.. నరకం చూస్తున్నాన్రా.. ప్రతీ విషయంలో ఆవిడ చెప్పినట్టే వినాలి. నాకంటే పెద్ద జాబ్లో వుంది. ఎందుకులే అని ఎంతగానో కంట్రోల్ చేసుకుంటూనే వున్నాను.. అదేంట్రా.. భార్యాభర్తలు ఎలా వుంటే వారి బంధం బలపడుతుందని సైకాలజిస్టులు చెప్పారో అదే పాటిస్తుంటావ్.. నాక్కూడా పదే పదే చెప్తుంటావ్.. ఈరోజు నువ్వేమిటి ఇలా..?! నా గొంతులో ఎడతెగని ఆశ్చర్యం! నీ మొహం సైకాలజీ.. అవన్నీ నా పద్ధతులు కావు.. తనవి.. ఎమ్మే సైకాలజీ చదివింది నేను కాదు తను..! అక్కడికీ తను చెప్పినట్టు నడుచుకుంటూనే వున్నాను. కానీ నా సహనానికి కూడా ఓ హద్దుంటుంది కదా..! అయినా నిజంగా ఒకరి మీద ఒకరికి ప్రేమ వున్నవాళ్ళు దాన్ని ప్రతిసారీ ఏవో పదాల్లోనో లేక మరో రకంగానో వ్యక్తం చేసుకోవాలా..? అలా చేసుకుంటే అది రాన్రాను కృత్రిమంగా తయారౌతుంది. ఏం.. మీ ఆవిడ కాఫీ ఇచ్చినప్పుడల్లా నువ్వు థాంక్స్ చెబుతావా..? చెప్పకపోతే నీ ప్రేమ మీ ఆవిడకి అర్థం కాదా..? నీ కళ్ళు, నీ మాట తీరు, నీ బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ.. అసలివి కూడా అక్కర్లేదురా.. వైబ్రేషన్.. అవును.. ఇద్దరి మధ్య కనిపించని ఒక వైబ్రేషన్.. అది చాలు.. భార్యాభర్తల మధ్య అనురాగం నిలిచి వుండడానికి. అసలేమైందిరా..? గొంతు తగ్గించి నెమ్మదిగానే అడిగాను. నటన.. ముసుగు తగిలించుకొని నటించడం నా వల్ల కావట్లేదురా.. మొన్న.. తన పుట్టినరోజు నాడు అలిగింది.. ఉదయాన్నే హేపీ బర్త్ డే చెప్పాన్రా.. మంచి చీర కూడా ముందే కొనేసి వుంచాను. ‘ఎప్పుడూ అర్ధరాత్రి పన్నెండు దాటాక లేపి మరీ చెప్పేవాడివి.. ఈసారి తెల్లారాక తీరిగ్గా చెబుతున్నావ్.. నా మీద ప్రేమ అంతకంతకూ తగ్గిపోతోంది..’ అంది. ఓ వెర్రినవ్వు నవ్వేసి వూరుకున్నాను. అక్కడితో ఆపలేదు.. ఆ సొద కంటిన్యూ అవుతూనే వుంది. నేను బరస్ట్ అయ్యాను. ఇలా వుంటే మరీ కృత్రిమంగా అన్పిస్తోందని చెప్పాను. నా బర్త్ డే రోజు కూడా అర్ధరాత్రి లేపి చెప్పకు... చిరాగ్గా వుంటోంది.. ఇంక ఈ పిచ్చి పనులు చాలు.. ఈసారి మళ్ళీ ఇలా సైకలాజికల్ విషయాలు చెప్తే దవడ పగుల్తుందన్నాను.. అంతే..! యుద్ధం జరిగింది. ఆమె వెళ్ళిపోయింది. నాకంతా ఆశ్చర్యంగా వుంది.. అయినా బాధపడకురా.. ఏదో కోపం మీద వెళ్ళిపోయుంటుంది.. మళ్ళీ వచ్చేస్తుందిలే.. నాకు చేతైననట్టు ఓదార్చాను. రాదు.. మళ్ళీ రాదు.. ఆవిడ సంగతి నీకు తెలీదు.. ఆత్మ.. ఆత్మా.. అదేమిటది..? నాలిక తడబడింది వాడికి. ఆత్మాభిమానం.. అందించాను. అవును అదే.. ఆవిడకి టన్నులకొద్దీ వుందది.. అంచేత ఆవిడ రాదు.. నేను మనసులో విషం పెట్టుకుని ఇంతకాలం నటించానట.. విడాకుల పత్రాలు పంపిస్తుందట.. జీవితాంతం ఒంటరిగా బతికే ధైర్యం తనకి వుందట. మళ్ళీ నాదగ్గరికొచ్చేంత నీచమైన పని చెయ్యదట.. పోయింది.. అంతా పోయింది.. పరువూ మర్యాదా అంతా పోయింది.. నేను పిరికివాణ్ణి.. చాలా పిరికివాణ్ణి.. ఎలాగోలా బతికెయ్యగల గట్టి గుండె నాకు లేదు.. పెళ్ళాం వదిలేసి పోయిందని నలుగురూ అనుకుంటుంటే ఆ అవమానం తట్టుకొని మామూలుగా తిరిగే ధైర్యం అసలే లేదు.. అందుకే తాగాను.. విషం తాగాను.. నువ్వు రాకముందే.. నేను.. విషం.. వాడు టేబుల్ మీద తల వాల్చేశాడు. నా గుండెలు అదిరిపోయాయి.. విషం.. విషం తాగాడా వీడు..?! ఇప్పుడేం చెయ్యాలి..? కాళ్ళు చేతులు ఆడ్డం లేదు.. అంబులెన్స్.. అవును.. అంబులెన్స్కి ఫోన్ చెయ్యాలి.. నెంబరెంత..? చేతులు వొణుకుతున్నాయి.. నెంబర్ నొక్కాను. ఎమర్జెన్సీ వార్డ్ బైట కూర్చున్నాను.. సమయం ముళ్ళ మీద వున్నట్టుగా గడుస్తోంది.. ఎట్టకేలకు కొన్ని యుగాల తర్వాత శరత్ వున్న ఆ గది తలుపు తెరుచుకుంది. నా గుండె శబ్దం నాకే వినిపిస్తోంది. నేనేమీ అడక్కమునుపే మీవాడు సేఫ్.. సరైన సమయంలో తీసుకొచ్చారు.. ఇంకాస్త లేటైతే కష్టమయ్యేది.. అన్నాడు లోపల్నుంచి వచ్చిన డాక్టర్. హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్నాను. నేను మరో ఇద్దరు ఫ్రెండ్స్కు మాత్రమే ఫోన్ చేశాను. వార్త అలా అలా పాకిపోయింది. గంట గడిచేసరికి అక్కడకి చాలామంది చేరుకున్నారు. సెల్ మోగుతోంది.. చూశాను.. శ్రావణి చేస్తోంది.. నమ్మలేకపోయాను.. ఆన్సర్ చేశాను..ఉదయం మీరు ఫోన్ చేశారా..? అడుగుతోంది. అవును.. మీ మేనత్త మాట్లాడింది.. చెప్పాను. ఆవిడ నాకు చెప్పనే లేదు.. ఇప్పుడే కాల్ లిస్టులో చూశాను.. అడిగితే చెప్పింది. ఆవిడ కోర్టు నోటీసు అదీ ఇదీ అంటోందేమిటి..? ఎంత వొద్దనుకున్నా నా గొంతు కొంచెం వణికింది. అదా.. ఆవిడ కొంచెం ఫెమినిస్టు భావాలున్నావిడ.. మీకు తెలీదా ఏంటి..? అబ్బాయిని కొంచెం జడిపిస్తే గానీ దార్లోకి రాడంది. అక్కడికీ నేను వొద్దని చెప్తూనే వున్నాను.. మరి మీ పెదనాన్న కొడుక్కి నిన్న ఫోన్ చేస్తే అతను కూడా అలాగే అన్నాడు..?! వాడే కదా మీకు బాగా దోస్తు.. వాడికి మీరు చేస్తారని ఆవిడకి తెలుసు. అందుకే ఒకవేళ మీరు ఫోన్ చేస్తే అలాగే చెప్పమని గట్టిగా ఆర్డరేసింది.. నిజమా.. అంతేనా.. నామీద కోపం లేదా నీకు..? ఆశ్చర్యంగా అడిగాను. ఎందుకు లేదు..? మనింటి కెళ్ళాక చూసుకుందాం.. చెప్పింది శ్రావణి. ఆ గొంతులో కోపం లేదు. నా మనసు దూదిపింజలా తేలిైకపోయింది. సారీ శ్రావణి.. ఏదో మత్తులో.. కోపంలో చెయ్యి చేసుకున్నాను.. తప్పే..! ఇంటికెప్పుడొస్తున్నావ్..? ఇప్పుడు బయల్దేరుతున్నాను.. మీరు ఇంటి దగ్గరే వున్నారు కదా.. అడిగింది. నేనెక్కడున్నదీ చెప్పి.. శరత్ విషం తాగిన సంగతి చెప్పాను. అలా ఎలా జరిగింది..? ఆశ్చర్యంగా అడిగింది శ్రావణి. అదంతా నువ్వొచ్చాక చెప్తాన్లే.. అన్నాను. సరేనంటూ ఫోన్ కట్ చేసింది. లోపలికెళ్ళాను. శరత్ గాడు కొంచెంగా తేరుకున్నాడు. బలహీనంగా మాట్లాడుతున్నాడు. నన్నెందుకు బతికించావంటూ అడిగాడు. ఆ మాత్రం మాట్లాడుతున్నాడంటే ఇంక వాడికి ఫర్వాలేదనుకున్నాను. అక్కడ మిగతా వాళ్ళకి చూసుకోమని చెప్పి కాసేపట్లో వస్తానని బయటకొచ్చాను. రోడ్డు మీద కొచ్చి కనిపించిన ఆటో ఎక్కి మా ఇంటి అడ్రస్ చెప్పి పొమ్మన్నాను. శ్రావణికి వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి రావడానికి అరగంట కూడా పట్టదు. నేను విషం బాటిల్ పెట్టిన కప్ బోర్డ్ శ్రావణిది.. తనొచ్చేలోగా ఆ బాటిల్ని తీసి పారెయ్యాలి..! - ఎం. రమేష్ కుమార్ -
ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు
కడప కల్చరల్ : జీవితం దేవుడిచ్చిన వరం అంటారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వీలైతే మరో నలుగురికి ఉపయోగపడాలని పెద్దలు సూచించారు. కానీ పెంచుకున్న ఆశలు కరిగిపోయినపుడు నిరాశ, నిస్పృహలకు లోనై విలువైన జీవితాలకు మధ్యలోనే చరమగీతం పాడుతున్నారు. ముఖ్యంగా యువతలో ఆత్మహత్యల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక సమస్యలతో కొందరు, ప్రకృతి కరుణించక కరువు కాటుతో మరికొందరు, కుటుంబ కలహాలు తదితర కారణాలతో ఇంకొందరు జీవితాన్ని బలవంతంగా ముగిస్తున్నారు. చచ్చి సాధించేది ఏమి ఉండదని, బతికి సమస్యలను ఎదుర్కొని ఓడించినపుడే నలుగురికి ఆ జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రముఖ మనస్తత్వ శాస్త్ర నిపుణుడు ఓ.వెంకటేశ్వరరెడ్డి పేర్కొంటున్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఆయనతోl‘సాక్షి’ ఇంటర్వ్యూ... సాక్షి : ఆత్మహత్యలు సాధారణంగా ఎందుకు చేసుకుంటారు? ఓవీ రెడ్డి : కోరికలు నెరవేరలేదని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, అనుకున్నది సాధించలేక పోతున్నామని, అవమానాలకు గురవుతున్నామని భావించేవారు, బలహీనమైన మనసు గల వారు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. సాక్షి : అది ఆవేశమేనా? ఓవీ రెడ్డి : ఇలాంటి వారు మానసికంగా చాలా ఉద్వేగంగా ఉంటారు. మరణమే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారమన్న భావనతో ఉంటారు. సమస్యను రెండవ కోణం నుంచి చూసేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయరు. పైగా క్షణ క్షణం కసిని పెంచుకుంటారు. ఆ భావోద్వేగమే వారిని ఆత్మహత్యలకు పురిగొల్పుతుంది. సాక్షి : యువతలోనే ఎక్కువ..? ఎందుకు..? ఓవీ రెడ్డి : జీవితాన్ని పూర్తిగా చూసి ఉండరు గనుక యువతలో ఆత్మహత్యలు ఎక్కువ. పెద్దలను ఎదిరించడం గొప్పగా భావించి తమకు అన్నీ తెలుసనే భావనతో ఉంటారు. తమ నిజమైన శ్రేయోభిలాషులెవరో నిర్ణయించుకోలేని ఊగిసలాటలో ఉంటారు. తాము వెళ్లే దారి మంచిదో కాదో కూడా తెలుసుకునే అనుభవం ఉండదు. అందుకే సమస్యలు వస్తే మరణమే పరిష్కారమని భావిస్తారు. సాక్షి : యువతలో ఈ ఆలోచన మాన్పలేమా? ఓవీ రెడ్డి : తప్పకుండా మాన్పించవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఎదిగిన పిల్లలతో స్నేహితుల్లా ఉండాలి. సానుకూల దృక్పథాన్ని, సమస్యను విభిన్న కోణాల్లో విశ్లేషించే గుణాన్ని పెంచాలి. పిల్లల సమస్యల పరిష్కారంలో వారి స్నేహితులకు భాగస్వామ్యం కల్పించాలి. సమస్యల పాలైన పిల్లలపై కోప్పడితే.. సమస్య మరింతగా పెరిగి వారిలో మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. సాక్షి : ప్రేమ ఆత్మహత్యల మాటేమిటి? ఓవీ రెడ్డి : తల్లిదండ్రులు, పిల్లల మధ్య మానసిక దూరమే నూతన వ్యక్తుల అభిమానం పొందాలన్న కాంక్షను కలిగిస్తుంది. యువతలో భౌతిక ఆకర్షణ ఎక్కువ. అందుకే నిండైన జీవితాన్ని ప్రాక్టికల్గా చూసే స్థితి ఉండదు. తమ నిర్ణయంపై విమర్శను అవమానంగా భావిస్తారు. తమ నిర్ణయమే సరైనదన్న మూర్ఖత్వం తప్పుడు నిర్ణయాలకు దారి తీస్తోంది. అలాంటి వారికి ప్రేమతోపాటు ఎంతో బతుకు ఉందని, ఎన్నో కోణాలలో సమాజంలోని ఎందరికో తమ ప్రేమను పంచాల్సిన బాధ్యత ఉందన్న అవగాహన కల్పించాలి. సాక్షి : రైతు ఆత్మహత్యల సంగతేమిటి? నివారించడం కష్టమా? ఓవీ రెడ్డి : దీన్మి సామాజిక సమస్యగా భావించాల్సి ఉంది. ప్రజాస్వామ్యంలో వ్యక్తి కంటే వ్యవస్థ ప్రభావమే ఎక్కువ. రైతుల్లో ఎక్కువగా పంట నష్టాలే ఆత్మహత్యలకు పురి గొల్పుతుంటాయి. వారికి ప్రభుత్వం సామాజిక భద్రత కల్పిస్తే గణనీయంగా తగ్గుతాయి. ఆత్మహత్య శాశ్వత పరిష్కారం కాదని వారు గ్రహించాలి. అలాంటి ధోరణిని వారిలో గమనిస్తే ఆత్మీయులు, కుటుంబ సభ్యులు సమస్య నుంచి ఆలోచనను మళ్లించాలి. -
28న సైకాలజిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
న్యూశాయంపేట : ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఈ నెల 28న హన్మకొండలోని హౌసింగ్బోర్డ్ కాలనీ రోడ్డులో గల మైండ్కేర్ సెంటర్లో ఎన్నికోనున్నట్లు అసోసియేషన్ జాతీయ సంయుక్త కార్యదర్శి బరుపాటి గోపి తెలిపారు. గురువారం హన్మకొండ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సైకాలజీ పూర్తి చేసిన వారు రూ.300 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. సభ్యత్వం ఉన్నవారే ఎన్నికల్లో పాల్గొనాలని సూచించారు. అదే రోజున సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు కమలాకర్, రాష్ట్ర కార్యదర్శి వేదప్రకాశ్ హాజరవుతారని చెప్పారు. సమావేశంలో అప్పన మనోజ్కుమార్, కుసుమ రమేష్, ఎం.విజయభాస్కర్రెడ్డి, భుజేందర్రెడ్డి, ఎన్.శ్రీనివాస్,జి.రామాచారి పాల్గొన్నారు. -
వృత్తి నైపుణ్యంపై రాయలసీమ సైకాలజిస్ట్లకు శిక్షణ
అనంతపురం సిటీ : ఈ నెల 13 నుంచి రెండ్రోజుల పాటు వృత్తి నైపుణ్యంపై రాయలసీమ ప్రాంత సైకాలజిస్ట్కు శిక్షణ ఉంటుందని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోషియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవికుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శిక్షణ పొంద దలచిన వారు కర్నూలులోని కె.వి.ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, రైల్వే స్టేషన్ దగ్గర, ఎస్ఆర్పేటకు రావాల్సిందిగా సూచించారు. మరింత సమాచారం కోసం 9441371817లో సంప్రదించాలని కోరారు. -
మాట్లాడుకుందాం రా..!
నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినం కుదిరితే కప్పు కాఫీ.. వీలైతే నాలుగు మాటలు.. ఇన్డెప్త్గా ఈ సినిమా డైలాగ్లో మానసిక ఆరోగ్యానికి కావాల్సినంత మెడిసిన్ దొరుకుతుంది. మంచి ఉద్యోగం.. చక్కటి సంపాదన.. కుటుంబం.. ఇన్నీ ఉన్నా చాలామంది హ్యాపీగా ఉండలేకపోతున్నారు. కామన్మ్యాన్ నుంచి కరోడ్పతి వరకు మనసులోని బాధలకు బందీలైపోతున్నారు. ఎదను తొలిచే బాధను మొహమాటంతోనో.. ధైర్యం చాలకో.. ఇతరులతో పంచుకోకుండా అందరిలో ఉన్నా ఒంటరైపోతున్నారు. నాలుగు మాటలతో మానసిక బలాన్ని తిరిగి పొందొచ్చని చెబుతున్నారు సైకాలజిస్ట్లు. ఒత్తిడిని జయించడానికి కౌన్సెలింగ్కు మించిన మందు లేదంటున్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినం సందర్భంగా నాలుగు మంచి మాటలు. - సత్యబాబు ఒక సమస్య తీవ్రమైన మానసిక క్షోభకు దారితీయడానికి దానిని ఇతరులతో పంచుకోకపోవడమే ప్రధాన కారణం. కుటుంబసభ్యులకో.. దగ్గరి స్నేహితుడి కో.. మీ సమస్యలు చెప్పుకుంటే.. గుండె బరువు కాస్త దిగుతుంది. అయితే ఇప్పటి బిజీ లైఫ్లో మనలోని బాధలు చెప్పుకునే వ్యక్తులు కనబడరు. ఒకవేళ చెప్పినా మనల్ని ఎలా అంచనా వేస్తారోనన్న భయంతో చాలా మంది సమస్యలను పెదవి దాటనివ్వడం లేదు. ఏ ఎమోషనైనా షేర్ చేసుకోవడం వల్లే మానసిక ఆరోగ్యం కలుగుతుందని చెబుతున్నారు సైకాలజిస్ట్లు. రిలేషన్ బ్రేకప్స్.. చాలా వరకు తీవ్రమైన మానసిక సమస్యలకు కారణం రిలేషన్షిప్ మెయింటనెన్సే. ఐటీ ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తల మధ్య ఈగో ప్రాబ్లమ్స్.. చినికి చినికి గాలివానలా మారి తీవ్రస్థాయికి వెళ్తున్నాయి. ఆఫీస్ టెన్షన్స్ ఇంటి కంపౌండ్లోకీ చొరబడి భార్యాభర్తల అనుబంధంపై ప్రభావం చూపుతున్నాయి. టీనేజర్స్లో లవ్ ఫెయిల్యూర్ డిప్రెషన్కు దారి తీస్తున్నాయి. కౌన్సెలింగ్ సెంటర్స్కు వస్తున్న వారిలో చాలా మంది లవ్ ఫెయిల్యూర్సే ఉంటున్నారు. పియర్ ప్రెషర్స్.. వేగంగా ఎదిగే అవకాశాలున్న ఐటీ వంటి రంగాల్లో పనితో పాటు మానసిక ఒత్తిడీ ఎక్కువే. మిగతావాళ్లు ఎదిగిపోతున్నారన్న కంపారిజన్ పియర్ ప్రెషర్కు కారణం అవుతోంది. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఈ ప్రాబ్లమ్కు చెక్ పెట్టొచ్చని అంటున్నారు వైద్యులు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి దశలవారీగా ప్రాక్టీస్ చేయాలని సూచిస్తున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాస్త డెవలప్ అయిన తర్వాత ఎలాంటి టెన్షన్ అయినా అధిగమించే శక్తి వస్తుంద ంటున్నారు. కౌన్సెలింగ్ క్యాప్సుల్... మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి కోసం నగరంలో ఎన్నో కౌన్సెలింగ్ సెంటర్లు వెలిశాయి. అలా ఏర్పా టైందే ‘సేవ’ సంస్థ. ఐటీ రంగంలో ఉన్నతస్థానంలో ఉన్న త్యాగరాజన్ ఈ సంస్థ నెలకొల్పారు. పదహారేళ్లుగా నాలుగు మాటలతో ఎందరికో ఉచితంగా మానసిక బలాన్నిస్తున్నారు. ‘పద్మారావునగర్లో మా సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. మానసిక సమస్యలతో వ్యక్తిగతంగా కలసిన వారికి ఇక్కడ కౌన్సెలింగ్ ఇస్తాం. అలాగే గాంధీ ఆస్పత్రి వంటి పలు హాస్పిటల్స్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామ’ని ఆయన తెలిపారు. -
మగాళ్ల మర్యాద కాపాడడానికి...
మన కోసం ముంబై కేంద్రంగా పురుషుల హక్కుల కోసం పని చేస్తుంది ‘మెన్స్ రైట్స్ అసోసియేషన్’(యంఆర్ఎ) యంఆర్ఎ ఎజెండా ఇది... బాధిత పురుషులకు న్యాయసహాయం అందించడం. నిరాశానిస్పృహల్లో కూరుకుపోయిన పురుషులకు మానసిక బలాన్ని చేకూర్చడానికి సైకాలజిస్ట్ల చేత కౌన్సెలింగ్ ఇప్పించడం. చట్టాల గురించి అవగాహన కలిగించడం. పురుషులపై సాగుతున్న దుష్ర్పచారాన్ని గురించి వివరించి, దానిని ఖండించడానికి అవసరమైన అవగాహన కలిగించడం. పురుషులపై జరిగే హింసను తగ్గించడం. పురుషుల హుందాతనాన్ని, మర్యాదను కాపాడడం. సమాజంలో లింగవివక్షత లేకుండా చేయడానికి ప్రయత్నించడం. నిస్సహాయ పురుషులకు అండగా నిలవడం. -
బతుకు... బతికించు
నాన్నకు కాసింత జ్వరం వస్తే ఆ కన్న కూతురు తట్టుకోలేదు. దగ్గరుండి మాత్రలు వేసి, తల్లిలా గోరుముద్దలు తినిపిస్తేనే గానీ ఆమెకు శాంతి లభించదు. అదే కూతురు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంటే ఆ తండ్రి ఎంత క్షోభ అనుభవిస్తాడు? ‘అమ్మా... నాకు ఉద్యోగం వచ్చేసిందిగా... మరేం ఫర్వాలేదు. మన జీవితాలు మారిపోతాయి. నీకు ఏ లోటూ లేకుండా చూసుకుంటానమ్మా...’అని ప్రేమగా చేతిలో చేయి వేసి చెప్పిన కొడుకు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణం తీసుకుంటే ఆ తల్లిపేగు ఎంతగా బాధపడుతుంది? ‘ఇంకొంచెం కష్టపడితే చాలురా... ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫ్యామిలీని బాగా చూసుకుంటా’ అని చెప్పిన మిత్రుడు తెల్లారితే ఫ్యాన్కు వేలాడుతూ కనిపిస్తే స్నేహితులు ఎంత నరకం అనుభవిస్తారు? జీవితంలో అన్ని ప్రశ్నలకూ ఆత్మహత్యలో సమాధానం వెతుక్కునే వారు ఆఖరుకు తమ వారికి ఇలాంటి ప్రశ్నలనే మిగిల్చి వెళుతున్నారు. జిల్లాలోనూ ఆత్మహత్యల ఘటనలు ఎక్కువైపోతున్నాయి. విజయనగరం క్రైం: కాలేజ్లో లెక్చరర్ తిట్టారని ఒక విద్యార్థిని, భర్త వేధింపులు తాళలేక మరో వి వాహిత, ఉద్యోగం రాలేదని ఓ యువకుడు... ఇలా కారణాలేవైనా నిండు ప్రాణా లు బలి తీసుకుంటున్నారు. సమస్యలతో పోరాడలేక జీవితాన్ని బల వంతంగా ముగించేస్తున్నారు. క్షణికావేశంలో కొం దరు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అయినవారి గుండెల్లో ఆరని మంట రగులుస్తున్నాయి. తీరని వేదన మిగులుస్తున్నాయి. కష్టాలు ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోవాలని, ఆత్మహత్య వల్ల సమస్యలు వస్తాయి గానీ సమసిపోవని నిపుణులు చెబుతున్నారు. ఇంకా... ముందుగా తెలియజేస్తారు... ఆత్మహత్యకు మొదటి కారణం ఒత్తిడి. తమకు ఆత్మహత్య ఆలోచన వస్తున్నప్పుడు ఆ ప్రయత్నాలను సీరియస్గా చేయాలకున్న వ్య క్తులు వివిధ రకాల సిగ్నల్స్తో తమ వారిని తెలియజేస్తారు. తమకు ఇష్టమైన వస్తువులను ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలని చూడవచ్చు. ఉత్తరాలూ రాయవచ్చు. ఆత్మహత్య చేసుకుంటాడు అన్న అనుమానం ఉన్న వారిని ఒంటరిగా ఉండనీయకూడదు. తమ విలువ కుటుంబంలో ఎంత ఉందో తెలుసుకోవాలని కొందరు సరదాగా ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు. కాని ఒక్కోసారి సీరియస్ అవ్వవచ్చు. తరచూ ఆ మాటలు అనే వారిని వీలైనంత ఆదరణ, అత్మీయత, ప్రేమను కలుగుజేయాలి. కొందరు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కావాలని తమ మాటల్లోనే నెగ్గాలని భావిస్తారు. వారిది హిస్టిరికల్ పర్సనాలిటీ. ఇలాంటి వారికి లొంగుతూ వెళ్తే వారు అలాగే కొనసాగుతారు. అసూయ, ఓర్వలేని తనం తన మాట నెగ్గకపోతే నానా హైరానా చేసే వారు అందరి దృష్టి తమవైపు తిప్పుకోవడం కోసం ఏ పనైనా చేస్తారు. తాము ఎవరిని ఆకర్షించాలని అనుకుంటున్నారో వారి సమక్షంలోనే చేయాలనుకుంటారు. డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకునే వారికి వీరు పూర్తి వ్యతిరేకం. ప్రస్తుతం దేశంలో ప్రతి ఆరు నిమిషాలకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే..? మీకు తెలిసిన వారికి ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే మొదట అత్మీయులకు బాధను చెప్పుకోవాలి. అలా చెప్పుకోనేలా ఆత్మీయులు వారిని ప్రోత్సహించాలి. వీలైనంత వరకు ఒంటరిగా ఉండనీయరాదు. ఏ మాత్రం అనుమానం వచ్చిన సైకాలజిస్ట్ను కలవడం ఉత్తమం. డిప్రెషన్లో ఉన్నప్పుడు... ఆత్మహత్యలు ఒత్తిడిలో ఉన్నప్పుడు చేసుకుంటారు. అలాంటి వారిని ముందుగానే గుర్తించవచ్చు. ప్రత్యేక పరిస్థితులను బట్టి ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న వారు ముందుగానే ఇండికేషన్ ఇస్తారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచంలో గుండె జబ్బు తర్వాత రెండో వ్యాధిగా మానసిక వ్యాధిని గుర్తించారు. ప్రతి ఆరు నిముషాలకు ఒక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకోకుండా డిప్రెషన్లో ఉన్నవారిని ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా మార్చవచ్చును. - డాక్టర్ ఎస్.వి.రమణ, సైకాలజిస్ట్ ప్రశాంతి మానసిక వ్యాధుల కౌన్సిలింగ్ కేంద్రం -
మీ టాలెంట్ మీకు తెలుసా?
ప్రేరణ ప్రతిఒక్కరిలో అంతర్గతంగా ప్రత్యేకమైన నైపుణ్యం, ప్రజ్ఞ ఉంటాయి. వాటిని గుర్తించి, వెలికితీస్తే అద్భుతాలు సృష్టిస్తారు. బాల్యంలో మందమతులుగా ముద్రపడినవారు సైతం తమ ప్రతిభాపాటవాలతో ప్రపంచాన్ని అబ్బురపరిచారు. వారు ఆ స్థాయికి ఎలా చేరుకున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. ప్రముఖ బ్రిటిష్ నృత్యకారిణి గిలియన్ లైనీ ఉదంతం కూడా అలాంటిదే. గిలియన్ లైనీ ఎనిమిదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆమె చదువుకుంటున్న పాఠశాల ఉపాధ్యాయురాలి నుంచి ఆమె తల్లికి ఓ ఉత్తరం వచ్చింది. స్కూల్లో గిలియన్ ప్రవర్తనపై సదరు టీచర్ ఫిర్యాదు చేస్తూ పెద్ద ఉత్తరం రాసింది. చిన్నారి చదువుపై ఆసక్తి చూపడం లేదని, ఎప్పుడూ మందకొడిగా ఉంటోందని అందులో తెలిపింది. అంతేకాకుండా హోమ్వర్క్ కూడా సమయానికి పూర్తి చేయదని, ఇక ఆమె చేతిరాత చాలా ఘోరంగా ఉందని విమర్శించింది. గిలియన్కు లెర్నింగ్ డిజార్డర్ ఉందనే అనుమానం తనను వేధిస్తోందని, ఆమెను అలాంటి విద్యార్థులకు ఉద్దేశించిన స్పెషల్ స్కూల్లో చేర్పిస్తే మంచిదని సలహా కూడా ఇచ్చింది. అంతర్గత నైపుణ్యం మేల్కొంది టీచర్ నుంచి వచ్చిన ఉత్తరం చదివిన గిలియన్ తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది. టీచర్ ఇచ్చిన సలహాను పాటించడం కంటే ముందు తన బిడ్డ ఎదుర్కొంటున్న సమస్య, దాని పరిష్కారం కోసం చిన్నారిని సైకాలజిస్టు దగ్గరికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. వెంటనే గిలియన్ను తీసుకొని వెళ్లి ఒక సైకాలజిస్టును కలిసింది. ఆయన గిలియన్ ముఖ కవళికలను, కాళ్లు, చేతుల కదలికలను నిశితంగా పరిశీలించాడు. దాదాపు 20 నిమిషాల తర్వాత.. వ్యక్తిగతంగా మాట్లాడాలంటూ ఆమె తల్లిని బయటకు తీసుకెళ్లాడు. బయటకు వెళ్లేటప్పుడు గదిలోని రేడియోను ఆన్ చేసి, సౌండ్ పెంచాడు. గదిలో గిలియన్ మాత్రమే ఉంది. ఆమెలో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యం ఒక్కసారిగా మేల్కొంది. కుర్చీలోంచి లేచి రేడియోలో వస్తున్న పాటలకు అనుగుణంగా కాళ్లు, చేతులను లయబద్ధంగా కదపసాగింది. ఇప్పుడు ఆమె ముఖం ఆనందంతో మెరిసిపోతోంది. గది బయట ఉన్న సైకాలజిస్టు కిటికీలోంచి ఈ దృశ్యాన్ని ఆమె తల్లికి చూపించాడు. ఆమె తన కళ్లను తానే నమ్మలేకపోయింది. అంతులేని ఆశ్చర్యానికి లోనైంది. గిలియన్లో ఎలాంటి లోపం లేదని సైకాలజిస్టు తేల్చిచెప్పాడు. ఆమె నృత్యంలో ప్రతిభ చూపుతుందని, శిక్షణ కోసం డ్యాన్స్ స్కూల్లో చేర్పించమని సూచించాడు. సాన పెడితే వజ్రమే అదృష్టవశాత్తూ గిలియన్ తల్లి ఆ సూచనను అమల్లో పెట్టింది. ఇక మిగిలిందంతా చరిత్రే. గిలియన్ లైనీ గొప్ప నృత్యకారిణిగా పేరుగాంచింది. ప్రపంచంలో అత్యుత్తమ కొరియోగ్రాఫర్గా గుర్తింపు పొందింది. తనలోని టాలెంట్తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. తక్కువ కాలంలోనే అత్యంత సంపన్నురాలిగా ఎదిగింది. ఇక్కడ తప్పకుండా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది సైకాలజిస్టుకే. ఎనిమిదేళ్ల బాలికలోని ప్రతిభను ఆయన గుర్తించడం వల్లే ఒక గొప్ప డ్యాన్సర్ ప్రపంచానికి లభించింది. ఒక వైద్యుడిగా ఆమెకు మందులు ఇవ్వడం లేదా స్పెషల్ స్కూల్కు పంపడం వంటివి చేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఆయన గిలియన్లోని సహజ ప్రతిభను పసిగట్టాడు. ఆ ప్రతిభకు సాన పెట్టుకోవడంతో గిలియన్ వజ్రంగా మారింది. మార్కులే కొలమానం కాదు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ కచ్చితంగా ఉంటుందని అనేక పరిశోధనల్లో తేలింది. మరి వాటినెందుకు గుర్తించలేకపోతున్నారు? మన ప్రతిభను మనం తెలుసుకోకుండా బయటి నుంచి చాలా ఒత్తిళ్లు పనిచేస్తుంటాయి. స్కూల్లో పిల్లల ప్రతిభను మార్కుల ఆధారంగా మాత్రమే కొలుస్తుంటారు. మంచి మార్కులు రాకపోతే వారిని అసమర్థులు, బుద్ధిహీనులుగా పరిగణిస్తారు. చదువుపై అంతగా ఆసక్తి లేని పిల్లలకు మరో రంగంలో బ్రహ్మాండమైన టాలెంట్ ఉండొచ్చు. దాన్ని గుర్తించి వెలికితీసే అవకాశం ఉండాలి. స్కూల్లో మంచి మార్కులు సాధించేవారు మరో రంగంలో వెనుకబడి ఉండొచ్చు. విద్యార్థుల ప్రతిభకు మార్కులు ఒక్కటే కొలమానం కాదని తెలుసుకోవాలి. కలలను నిజం చేసుకోండి మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నలుగురిలో నిలిపే విశిష్టమైన టాలెంట్ మీలో ఉందా? కలలను నిజం చేసుకొనేందుకు శ్రమించండి. ఎవరికి తెలుసు.. మీలోని ప్రతిభ మిమ్మల్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లొచ్చు. గిలియన్లోని ప్రతిభను కనిపెట్టిన సైకాలజిస్టు అందరికీ అవసరమే. ఆ సైకాలజిస్టు.. మన తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులు, బంధువుల్లో ఎవరైనా కావొచ్చు. కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన వారిలో ఏదైనా ప్రత్యేక ప్రతిభ ఉంటే వారికి తెలియజేయండి. -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో.. -
డాక్టర్ టీఎస్ రావ్కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం
విజయవాడ, న్యూస్లైన్ : విజయవాడకు చెందిన ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు, పుస్తక రచయిత డాక్టర్ టీఎస్ రావుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది. ఈ మేరకు తనకు అప్రూవల్ లేఖ అందినట్లు ఆయన తెలిపారు. యువతరంలో చైతన్యం తెచ్చే విధంగా ‘యువతరానికి ఆత్మీయ లేఖ’ పేరుతో 70 అడుగుల పొడవైన లేఖను(పుస్తక రూపంలో 140 పేజీలు) రచించి ప్రదర్శించినట్లు తెలిపారు. ఈ సుదీర్ఘమైన లేఖలో యువత నేర్చుకోవాల్సినవి, విడిచి పెట్టాల్సినవి, పాటించాల్సినవి, తీర్చిదిద్దుకోవాల్సినవి, సాధించాల్సినవి ఇలా నూటొక్క అంశాలను అయిదుగా విభజించి పొందుపరచి ప్రదర్శించానన్నారు. 16,500 పదాలతో వంద అంశాలతో, 101 ప్రముఖుల కొటేషన్లతో కూర్చి అందులో విశేషంగా మనం అనే మాటను 150 సార్లు, సమాజం అనే పదాన్ని 23 సార్లు, ప్రపంచం అనే పదాన్ని 13 సార్లు, పాజిటివ్ అనే పదాన్ని 21 సార్లు, సాధిద్దాం అనే పదాన్ని 20 సార్లు ఉపయోగించడాన్ని ఈ లేఖ ప్రత్యేకతగా గుర్తిస్తున్నట్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థానక అధ్యక్షులు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి తనకు పంపిన లేఖలో పేర్కొన్నారని రావు చెప్పారు. రెండున్నర దశాబ్ధాలుగా కౌన్సిలింగ్ రంగంలో విశేష సేవలందిస్తుండగా, ఒకభాషకు సంబంధించి ప్రపంచ రికార్డ్స్ సంస్థగా ఆవిర్భవించిన తెలుగు బుక్ ఆఫ్ రిక్డార్డ్స్లో తన లేఖ నమోదు కావడం సంతోషంగా ఉందని డాక్టర్ టీఎస్ రావు ఆనందం వ్యక్తం చేశారు. -
అయ్యా...పిల్లల మీద అరవకండి!
మానసికం బయట ఎన్ని పనులున్నా, వాటి తాలూకు ఒత్తిడి ఉన్నా, ఎన్ని సమస్యలున్నా...ఇంట్లోకి వచ్చాక మాత్రం ప్రశాంతంగా ఉండడం, కుటుంబంతో సంతోషంగా గడపడం అనేది ‘గృహస్థు లక్షణం’ అంటారు పెద్దలు. కాని కొందరు తండ్రులు మాత్రం బయటి ప్రపంచం ఒత్తిడి, కోపాన్నంతా ఇంట్లో ప్రదర్శిస్తుంటారు. ‘‘నాన్న...మా స్కూల్లో ఇవ్వాళి’’ అని పిల్లాడు తన క్లాసులో జరిగిన విషయాన్ని చెప్పబోతుంటే- ‘‘అబ్బ... రాగానే మెదడు తింటావు.... వెళ్లు’’ అంటూ కసురుకుంటారు కొందరు. పిల్లాడు నాన్స్టాప్గా ఏడవడానికి ఇంతకుమించిన కారణం అక్కర్లేదు కదా! అయితే ఇదేమీ అషామాషీగా తీసుకోవల్సిన విషయం కాదు అంటున్నారు మానసిక విశ్లేషకులు. తరచుగా పిల్లల మీద అరవడం వల్ల, అది వారి ప్రవర్తన మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందట. అలాగే, క్రమశిక్షణ పేరుతో పిల్లలని శిక్షించడం వల్ల మార్పు రాక పోగా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ‘‘పిల్లల పెంపకంలో శాస్త్రీయ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. తరచుగా అరవడం వల్ల...పిల్లల్లో నాన్న అంటే ఒక రకమైన భయం ఏర్పడుతుంది. అది మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది, ఈ ప్రభావం వల్ల పిల్లలు ఇతరులతో కలవలేని పరిస్థితి ఏర్పడుతుంది’’ అంటున్నాడు డెన్మార్క్కు చెందిన సైకాలజిస్ట్ ఎరిక్ సిగార్డ్. -
విశ్లేషణం: విప్లవాత్మక సృజనజీవి...
‘‘నేనంటే చాలామందికి నచ్చకపోవచ్చు... వాళ్లు నన్ను విమర్శించవచ్చు, అది వాళ్లిష్టం. కానీ నేనెలా ఆలోచిస్తానో మరొకరికి ఎలా తెలుస్తుంది? నా మనసులో ఏముందో వారెలా విశ్లేషిస్తారు?’’ అని ఓ సందర్భంలో వర్మ మండిపడ్డారు. ఆయన లాంగ్వేజ్, బాడీలాంగ్వేజ్, జీవనశైలి ద్వారా ఆయన ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని కొంతవరకైనా తెలుసుకోవచ్చు, విశ్లేషించవచ్చు. స్వార్థపర తత్త్వవేత్త... వర్మ మాట్లాడుతున్నప్పుడు కాళ్లు కుదురుగా ఉండవు... వాటిని షేకాడిస్తుంటాడు. స్వరం మంద్రస్థాయిలో ఉంటుంది. వీటినిబట్టి వర్మది అనుభూతి ప్రధాన వ్యక్తిత్వమని చెప్పవచ్చు. తనకెలాంటి సెంటిమెంట్సూ లేవని వర్మ పదేపదే చెప్పినా... ఆయన భావోద్వేగాలకే అధిక ప్రాధాన్యమిస్తాడు... అయితే అది తన ఫీలింగ్స్కు మాత్రమే. ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని తన దృష్టిలోనే చూస్తుంటాడు. నా పాయింట్ ఏంటంటే... అంటూ తన వాదనను వినిపిస్తుంటారు. దీన్నే ‘ఫస్ట్ పర్సెప్చువల్ పొజిషన్’ అంటారు. ఈ పొజిషన్లోనే ఆగిపోయినవారు ప్రపంచానికి పచ్చి స్వార్థపరులుగా కనిపిస్తారు. తను స్వార్థపరుడినని కూడా వర్మ ఓపెన్గా అంగీకరిస్తాడు. అంతేకాదు స్వార్థమే పరమార్థం అని సిద్ధాంతీకరిస్తాడు. కానీ వర్మ మాటలను నిశితంగా గమనిస్తే ఆయన తరచూ ‘ఫిఫ్త్ పర్సెప్చువల్ పొజిషన్’ నుంచి ప్రపంచాన్ని చూస్తుంటాడనే విషయం తెలుస్తుంది. ఇది సుప్రీమ్ పొజిషన్, గాడ్ పొజిషన్. ఈ దృక్కోణంలో ప్రపంచాన్ని చూసేవారు తత్త్వవేత్తలు లేదా మహాగురువులవుతారు. ‘నేను’ అనే మాటను కాస్త పక్కన పెట్టి గమనిస్తే... ఆయన మాటల్లో ఓ గురువు కనిపిస్తాడు. అతని మాటల్లో సత్యం అర్థమవుతుంది. ఓషో రజనీష్, యూజీ కృష్ణమూర్తిలానే వర్మ ఆలోచనలు కూడా విధ్వంసకరంగా కనిపిస్తాయి. అందుకే ఆయనను ప్రేమించాలి లేదా ద్వేషించాలి, మధ్యస్థంగా ఉండటం కుదరదు. ఎందుకంటే ఆయన వ్యక్తులను ప్రశ్నించడు, వారిలోని ప్రాథమిక భావనలను ప్రశ్నిస్తాడు, వారి ఆలోచనలోని లోపాల్ని ఎత్తి చూపుతాడు, వారున్న కంఫర్ట్ జోన్స్ను బద్దలు కొడతాడు. అది నచ్చినవారు ‘భక్తుల’వుతారు, నచ్చనివారు శత్రువులవుతారు. ఆయన చేతులూ మాట్లాడతాయి... మాట్లాడేటప్పుడు వర్మ తరచూ చూపుడువేలును తలకు ఆనించుకుంటాడు. ఎదుటివారిని అతను విశ్లేషిస్తుంటాడనే విషయాన్ని ఇది వెల్లడిస్తుంది. తానెంత ఓపెన్గా మాట్లాడినా ఒక్కోసారి తన భావాలను దాచుకునే ప్రయత్నం చేస్తాడని పెదవులకు వేళ్లు/చేయి అడ్డుగా పెట్టుకోవడం వల్ల తెలుస్తుంది. వర్మ నోటితోనే కాదు చేతులతోనూ మాట్లాడతాడు. అదెలాగంటారా? వర్మ మాట్లాడేటప్పుడు ఆయన చేతులు, వేళ్ల కదలికలను గమనిస్తే మీకే తెలుస్తుంది. మాటలకు, చేతుల కదలికలకు మధ్య అద్భుతమైన లయ కనిపిస్తుంది. దీన్నిబట్టి మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాడనే విషయం మనకు తెలుస్తుంది. ఈ క్షణంలోనే జీవిస్తా... సమాజం గురించి నేనెప్పుడూ ఆలోచించను. అందులో ఉన్నాను కాబట్టి ఆ చట్టాలను గౌరవిస్తాను, ఆచరిస్తాను. నాకు నచ్చిందే నేను చేస్తాను... అనడంలో వర్మలోని వ్యక్తివాదం వెల్లడవుతుంది. అలాగని ఇతరులను గౌరవించడనుకుంటే పొరపాటే. ఇతరులను చాలా గౌరవిస్తాడు... అయితే అది తన జీవితంలో చొరబడనంతవరకూ మాత్రమే. ఆయన వ్యక్తులకన్నా, సంఘటనలకన్నా.. ఆలోచనలు, అనుభూతుల గురించే ఎక్కువగా మాట్లాడతాడు. సినిమాకన్నా అది క్రియేట్ చేసే ఫీలింగ్, ఎమోషన్ నాకు ముఖ్యం అని చెప్తాడు. పెళ్లెప్పుడు చేసుకున్నానో నాకు గుర్తులేదు... రేపేం చేస్తానో నాకే తెలియదు... ఇప్పుడేం చేస్తానన్నదే నాకు ముఖ్యం... అన్నప్పుడు ఆయన ఈ క్షణంలోనే జీవిస్తాడనే విషయం తెలుస్తుంది. ‘లివ్ నౌ’ అన్నదే అనేక తత్త్వాల సారాంశం. రామ్ గోపాల్ వర్మ చేసేదీ అదే. - విశేష్, సైకాలజిస్ట్