-
ఆరంభ లాభాలు ఆవిరి
ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగడంతో సోమవారం స్టాక్ మార్కెట్ ఆరంభ లాభాలను కోల్పోయి నష్టాల్లో ముగిసింది. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం, డాలర్తో రూపాయి మారకం విలువ 19 పైసలు నష్టపోయి 75.73కు చేరడం, పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ఆరంభం కావడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 659 పాయింట్లు లాభపడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 81 పాయింట్ల నష్టంతో 31,561 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9,440 పాయింట్లకు ఎగసిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 12 పాయింట్ల నష్టంతో 9,239 వద్దకు చేరింది. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 801 పాయింట్లు, నిఫ్టీ 220 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు..... కరోనా అనిశ్చితిని తట్టుకోవడానికి పలు ఆర్థిక రంగ కంపెనీలు కేటాయింపులు పెంచాయి. దీంతో మొండి బకాయిలు ఎగబాకుతాయన్న ఆందోళనతో ఈ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ► ఐసీఐసీఐ బ్యాంక్ 5% నష్టంతో రూ.320 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా పడిన షేర్ ఇదే. ► నేటి(మంగళవారం) నుంచి 15 రైళ్లు నడవనుండటంతో ఐఆర్సీటీసీ షేర్ 5 శాతం అప్పర్ సర్క్యూట్తో రూ.1,303 వద్ద ముగిసింది. ► దేశీయంగా విమాన సర్వీసులను ఈ నెల 18 నుంచి అనుమతించవచ్చన్న వార్తలతో స్పైస్జెట్, ఇండిగో షేర్లు 4% మేర లాభపడ్డాయి. ► కొన్ని ప్రాంతాల్లో షోరూమ్స్ ప్రారంభమై, వాహన విక్రయాలు మొదలుకావడంతో వాహన షేర్లు జోరుగా పెరిగాయి. మళ్లీ రూ. 10 లక్షల కోట్లకు రిలయన్స్ మార్కెట్ విలువ రైట్స్ ఇష్యూకు రికార్డ్ డేట్ను ఈ నెల 14గా నిర్ణయించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఇంట్రాడేలో 3.4% లాభంతో రూ.1,615కు ఎగసింది. ఆల్టైమ్ హై ధరకు మరో రూ.3 మాత్రమే తక్కువ. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ మళ్లీ రూ.10 లక్షల కోట్లకు ఎగబాకింది. గత 4 ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ 10% మేర ఎగసింది. చివరకు ఈ షేర్ 1% లాభంతో రూ.1,576 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ.9,99,565 కోట్లుగా ఉంది. -
11,500 పాయింట్ల దిగువకు నిఫ్టీ
రెండు రోజుల రికార్డ్ లాభాల నేపథ్యంలో మంగళవారం ఆరంభమైన లాభాల స్వీకరణ బుధవారం కూడా కొనసాగింది. వృద్ధిని మరింతగా కుంటుపరిచేలా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి పరిస్థితులు చోటు చేసుకోవడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్పై అభిశంసన విచారణ మొదలు కావడంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. వీటికి తోడు మన వృద్ధి అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ) కోత కోయడం, డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడం కూడా తోడవడంతో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 39,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,500 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ముడి చమురు ధరలు 1.6 శాతం పతనమైనా, మన మార్కెట్ పతనబాటలోనే కొనసాగింది. సెన్సెక్స్ 504 పాయింట్లు నష్టపోయి 38,594 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 148 పాయింట్లు పతనమై 11,440 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నిప్టీ మిడ్, స్మాల్క్యాప్ సూచీలు చెరో 2% పతనమయ్యాయి. ఒడిదుడుకులు కొనసాగుతాయ్... అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అభిశంసన ప్రతిపాదన కారణంగా అమెరికాలో రాజకీయ దుమారం చెలరేగడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. దీని ప్రభావం స్వల్పకాలికంగానే ఉండనున్నదని ఆయన భావిస్తున్నారు. మొండి బకాయిలకు సంబంధించి తాజా సమస్యలు, సెప్టెంబర్ వాహన అమ్మకాలు బలహీనంగా ఉండే అవకాశాలు, ఈ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రోజులో ముగియనుండటం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని వివరించారు. సెప్టెంబర్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు నేడు(గురువారం) ముగియనుండటంతో ఒడిదుడుకులు కొనసాగుతాయని నిపుణులంటున్నారు. వచ్చే నెల 4న ఆర్బీఐ పాలసీ, క్యూ2 ఫలితాలను బట్టి మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుందని వారంటున్నారు. రూ.1.84 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా రూ.1.84 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,84,484 కోట్లు తగ్గి రూ.1,46,88,764 కోట్లకు పడిపోయింది. పతనానికి ప్రధాన కారణాలు లాభాల స్వీకరణ డొనాల్ట్ ట్రంప్పై అభిశంసన ప్రక్రియ ట్రంప్ చైనా వ్యతిరేక వ్యాఖ్యలు పతనమైన ప్రపంచ మార్కెట్లు వృద్ధి అంచనాలను తగ్గించిన ఏడీబీ రూపాయి పతనం మార్కెట్ భారీగా నష్టపోయినా, ఇండియామార్ట్ ఇంటర్మెష్ షేర్ మెరుపులు మెరిపించింది. దేశంలోనే అతి పెద్ద బీ2బీ కంపెనీ అయిన ఇండియామార్ట్ ఇంటర్మెష్ షేర్ ఇంట్రాడేలో ఆల్టైమ్ హై, రూ.1,970ను తాకింది. చివరకు స్వల్ప లాభంతో రూ. 1,874 వద్ద ముగిసింది. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో లిస్టయిన ఈ కంపెనీ ఇష్యూ ధర, రూ.973తో పోల్చితే దాదాపు రెట్టింపైంది. గత నెల కాలంలోనే ఈ కంపెనీ షేర్ 70 శాతానికి పైగా పెరగడం విశేషం. -
మారుతీ లాభం 32 శాతం డౌన్
న్యూఢిల్లీ: దేశంలోనే అతి పెద్ద వాహన కంపెనీ మారుతీ సుజుకీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 32 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.2,015 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.1,377 కోట్లకు తగ్గిందని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. అమ్మకాలు తక్కువగా ఉండటం, తరుగుదల వ్యయాలు ఎక్కువగా ఉండటంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. ఆదాయం రూ.21,814 కోట్ల నుంచి రూ.18,739 కోట్లకు తగ్గిందని తెలిపింది. తరుగుదల, అమోర్టైజేషన్ వ్యయాలు రూ.720 కోట్ల నుంచి రూ.919 కోట్లకు పెరిగాయని పేర్కొంది. నిర్వహణ లాభం 39% తగ్గి రూ.2,048 కోట్లకు తగ్గిందని, మార్జిన్ 4.5% తగ్గి 10.4 శాతానికి చేరిందని తెలిపింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఈ కంపెనీ 10%కి మించి మార్జిన్ను సాధించడం విశేషమని నిపుణులంటున్నారు. కాగా ఈ క్యూ1లో మొత్తం అమ్మకాలు 18 శాతం తగ్గి 4,02,594 యూనిట్లుగా ఉన్నాయని మారుతీ తెలిపింది. దేశీయ అమ్మకాలు 19 శాతం తగ్గి 3,74,481 యూనిట్లకు చేరాయని, ఎగుమతులు 28,113 యూనిట్లుగా ఉన్నాయని పేర్కొంది. రూపాయిల్లో రాయల్టీ చెల్లింపులు... వరుసగా నాలుగో క్వార్టర్లోనూ అమ్మకాలు తగ్గాయని మారుతీ సుజుకీ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అజయ్ సేత్ పేర్కొన్నారు. వాహన పరిశ్రమలో నెలకొన్న మందగమనం తమపై బాగానే ప్రభావం చూపించిందని తెలిపారు. అయితే ఈ పరిస్థితి చక్రీయమేనని వివరించారు. దీర్ఘకాలంలో అమ్మకాలు బాగా ఉంటాయని భావిస్తున్నామని తెలిపారు. ఇప్పటిదాకా తమ మాతృ కంపెనీ సుజుకీ మోటార్ కార్పొకు రాయల్టీని యెన్ కరెన్సీలో చెల్లించామని, రానున్న మూడు సంవత్సరాల్లో రాయల్టీని రూపాయిల్లో చెల్లించనున్నామని తెలిపారు. గ్రామీణ అమ్మకాలు తగ్గుతున్నాయ్ గతంలో జోరుగా ఉన్న గ్రామీణ ప్రాంత అమ్మకాలు కూడా తగ్గుతున్నాయని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి పేర్కొన్నారు. భారత్ స్టేజ్–సిక్స్(బీఎస్–6) పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉండే వాహనాలను ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తెస్తామని వివరించారు. బీఎస్–సిక్స్ వాహనాలను 2020 కల్లా అందుబాటులోకి తేవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అధికంగా అమ్ముడయ్యే ఐదు మోడళ్లు–ఆల్టో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్, బాలెనోలను ఇప్పటికే బీఎస్–సిక్స్ పర్యావరణ నియమాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి అందుబాటులోకి తెచ్చామని కల్సి వివరించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో మారుతీ సుజుకీ షేర్ 0.7 శాతం లాభంతో రూ.5,806 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయి రూ.5,685కు పతనమైంది. -
ఇన్వెస్టెర్రర్ 2.0
విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను విషయంలో ఊరట లభించగలదన్న అంచనాలు ఆవిరవ్వడంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 38,500 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,500 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. అంతంతమాత్రంగానే ఉన్న కంపెనీల ఆర్థిక ఫలితాలు, వినియోగం మందగించడం, నైరుతి రుతు పవనాల విస్తరణ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. వరుసగా మూడు రోజుల పాటు నష్టపోతూ వచ్చిన డాలర్తో రూపాయి మారకం విలువ పుంజుకున్నా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోత విషయమై సానుకూల సంకేతాలివ్వడంతో ప్రపంచ మార్కెట్లు పెరిగినా, మన మార్కెట్ పతన బాటలోనే పయనించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 560 పాయింట్లు పతనమై 38,337 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 178 పాయింట్లు నష్టపోయి 11,419 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది సెన్సెక్స్, నిఫ్టీలకు ఇవే రెండో అత్యధిక రోజువారీ నష్టాలు. ఈ రెండు సూచీలు రెండు నెలల కనిష్టానికి పడిపోయాయి. బడ్జెట్ రోజు సెన్సెక్స్ ఈ ఏడాదిలో అత్యధికంగా 793 పాయింట్లు నష్టపోయింది. విద్యుత్తు, కన్సూమర్ డ్యూరబుల్స్ సూచీలు మినహా మిగిలిన అన్ని బీఎస్ఈ రంగాల సూచీలు క్షీణించాయి. వాహన, బ్యాంకింగ్ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 399 పాయింట్లు, నిఫ్టీ 133 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. లాభాల్లో ఆరంభమైనా... ఈ నెలాఖరులో జరిగే సమావేశంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంచనాలను మించి రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని ఫెడరల్ రిజర్వ్ కీలక అధికారి ఒకరు వ్యాఖ్యానించడంతో ఆసియా మార్కెట్లు జోరుగా పెరిగాయి. ఈ దన్నుతో మన మార్కెట్ కూడా మంచి లాభాలతో ఆరంభమైంది. అయితే ఆ తర్వాత వెంటనే సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారిపోయాయి. ఒక దశలో 161 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, మరో దశలో 626 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 787 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 43 పాయింట్లు పెరిగి, ఆ తర్వాత 198 పాయింట్లు పతనమైంది. ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. డాలర్తో రూపాయి మారకం 5 పైసలు లాభపడి 68.92 వద్ద ముగిసింది. ఇక ముడిచమురు ధరలు 1.7 శాతం ఎగిశాయి. మరిన్ని విశేషాలు.... ► మొత్తం 31 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు–ఎన్టీపీసీ, పవర్గ్రిడ్, టీసీఎస్, ఓఎన్జీసీలు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► 500కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. మారుతీ సుజుకీ, యస్ బ్యాంక్, గెయిల్ ఇండియా, మహీంద్రా, ఐషర్ మోటార్స్, అరబిందో ఫార్మా, ఫోర్స్ మోటార్స్, వొడాఫోన్ ఐడియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినా, హెచ్డీఎఫ్సీ ఏఎమ్సీ షేర్ ఆల్టైమ్ హై, 2,370ను తాకింది. చివరకు 7%(రూ.147)లాభంతో రూ.2,317 వద్ద ముగిసింది. కంపెనీ ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో గత నాలుగు రోజుల్లో ఈ షేర్ 20 శాతానికి పైగా ఎగసింది. పతనానికి కారణాలు ► పన్ను విషయమై తగ్గేది లేదు... సంపన్నులపై విధించిన పన్ను(విదేశీ ఇన్వెస్టర్లకు ఈ పన్ను వర్తిస్తుంది) కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తరలిపోతాయనే వాదనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపడేశారు. గురువారం ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె ఈ పన్ను విషయమై పునరాలోచన లేదని తెగేసి చెప్పారు. ఎఫ్పీఐలు కంపెనీగా వ్యవహరిస్తే, ఈ పన్ను పోటు ఉండదని ఆమె పేర్కొన్నారు. ఎఫ్పీఐలకు పన్ను విషయంలో ఊరట లభించకపోవడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ► అమ్మకాల్లో తగ్గని ఎఫ్పీఐలు ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం, పన్ను పోటు కారణంగా విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. శుక్రవారంతో కలుపుకొని వరుసగా 14వ రోజూ నికర అమ్మకాలు జరిపారు. ఒక్క గురువారం రోజే రూ.1,405 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ నికర కొనుగోళ్లు జరిపిన ఎఫ్పీఐలు ఈ నెలలో ఇప్పటిదాకా రూ.7,000 కోట్ల మేర విక్రయాలు జరిపారు. ► జోష్నివ్వని ఆర్థిక ఫలితాలు... ఇప్పటివరకూ వెల్లడైన కంపెనీల ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లలో జోష్ని నింపలేకపోయాయి. ఒక్క ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్ మినహా ఇతర కంపెనీల ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. యస్బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, మైండ్ట్రీ, విప్రో, డీసీబీ బ్యాంక్ ఫలితాలు నిరాశపరిచాయి. ఫలితాలు ఓ మోస్తరుగా ఉంటాయన్న అంచనాలను కూడా కొన్ని కంపెనీలు అందుకోలేకపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీస్తోంది. ► వర్షాలు.. అంతంతే.... ఈసారి నైరుతి రుతుపవనాలు నిరాశపరిచాయి. సాధారణ వర్షపాతం కంటే 16 శాతం తక్కువగా వర్షాలు కురవడంతో వర్షాధార వ్యవసాయ దేశమైన మన దేశంలో ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండగలవన్న ఆందోళన నెలకొన్నది. ► జీడీపీ అంచనాలు తగ్గించిన ఏడీబీ భారత దేశ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపించింది. 2 రోజుల్లో రూ. 3.79 లక్షల కోట్లు ఆవిరి గత రెండు రోజుల నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.3.79 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్డైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ విలువ రూ.3.79 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.145.35 లక్షల కోట్లకు పడిపోయింది. శుభవార్తల కోసం మన స్టాక్ మార్కెట్ మొహం వాచిపోయి ఉంది. కంపెనీల డిఫాల్ట్లు కొనసాగుతుండటం, పన్నులు అధికంగా ఉండటం, కంపెనీల ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉండటం, ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉండటం.. ఇవన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. – జగన్నాథమ్ తునుగుంట్ల, సెంట్రమ్ బ్రోకింగ్ అనలిస్ట్ -
ప్రపంచ మార్కెట్ల పతన ప్రభావం
మూడు రోజుల స్టాక్ మార్కెట్ లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు పతనం కావడంతో ఇక్కడి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఆరోగ్య కారణాల రీత్యా తనకు ఎలాంటి పదవీ బాధ్యతలు అప్పగించవద్దని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. మే సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో అధిక స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, ఇంట్రాడేలో డాలర్తో రూపాయి మారకం విలువ 18 పైసలు పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపించింది. ఇంట్రాడేలో 329 పాయింట్ల వరకూ నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 248 పాయింట్లు పతనమై 39,502 పాయింట్ల వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు తగ్గి 11,861 పాయింట్ల వద్ద ముగిశాయి. లోక్సభ ఎన్నికల్లో బీజీపీ ఘన విజయం నేపథ్యంలో గత మూడు రోజులుగా సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డ్ స్థాయిల్లో క్లోజవుతున్నాయి. ఈ రికార్డ్ లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారని, బ్యాంక్, లోహ, వాహన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయని నిపుణులంటున్నారు. తగ్గుతున్న బాండ్ల రాబడులు... మూడు నెలల అమెరికా బాండ్ల రాబడులు కన్నా, పదేళ్ల బాండ్ల రాబడులు తగ్గాయి. ఇది మాంద్యానికి సూచన అని విశ్లేషకులంటున్నారు. మరోవైపు అమెరికా–చైనాల మధ్య ఒప్పందంపై అనిశ్చితి కొనసాగుతుండటం కూడా ప్రభావం చూపడంతో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. భారత్లో కూడా బాండ్ల రాబడులు తగ్గాయని, ఆర్బీఐ వచ్చేవారంలో కీలక రేట్లను తగ్గించగలదన్న అంచనాలు దీనికి కారణమని శాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ సునీల్ శర్మ పేర్కొన్నారు. అమెరికా, భారత్ల్లో బాండ్ల రాబడులు తగ్గుతుండటంతో మన దేశం నుంచి విదేశీ పెట్టుబడులు అభివృద్ది చెందిన దేశాలకు తరలిపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 347 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్ సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనప్పటికీ, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ ఒక దశలో 18 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 329 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 347 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ► ఇటీవలే జీవిత కాల గరిష్ట స్థాయికి చేరిన ఎస్బీఐలో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో ఈ షేర్ 3.2 శాతం నష్టపోయి రూ.348 వద్ద ముగిసింది. త్వరలోనే ఈ బ్యాంక్ క్యూఐపీ విధానంలో రూ.15,000–18,000 కోట్ల మేర నిధులు సమీకరించనున్నదన్న వార్త కూడా ప్రభావం చూపింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఈ ర్యాలీ నెలే! ఈ ఏడాది చివరి కల్లా సెన్సెక్స్ 42,000 పాయింట్లకు చేరగలదన్న గతంలో వెల్లడించిన లక్ష్యాలను ఫ్రాన్స్ బ్రోకరేజ్ సంస్థ, బీఎన్పీ పారిబా కొనసాగించింది. ఎన్నికల ఫలితాల అనంతరం వచ్చిన ర్యాలీ నెల రోజుల్లో సమసిసోతుందని ఈ సంస్థ అంచనా వేస్తోంది. -
ఇవన్నీ చూశాకే జీవిత బీమా..
పట్టణీకరణ వేగంగా జరుగుతుండటంతో సామాన్యుల జీవన ప్రమాణాలు గణనీయంగా మారుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే యువత పనివేళలు, ఆహారపు అలవాట్లు మారడమే కాకుండా వృత్తిపరంగా విపరీతమైన ఒత్తిడిని ఎదర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరికి జీవిత బీమా రక్షణ అనేది తప్పనిసరిగా మారింది. మనపై ఆధారపడి జీవించే వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇందుకోసం అనేక బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిలో దేన్ని ఎంచుకోవాలన్నదే అసలు సమస్య. ప్రతీ బీమా పథకంలో ఉండే లాభ నష్టాలను పరిశీలించడం కష్టమే. కానీ పాలసీ తీసుకునేటప్పుడు కనీసం ఈ ఐదు అంశాలను పరిశీలిస్తే ఆ పాలసీకి మన అవసరాలను తీర్చే శక్తి ఉందా లేదా అన్న విషయంపై స్పష్టత వస్తుంది. జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు తప్పకుండా పరిశీలించాల్సిన అంశాలు ఇవీ.. ఇప్పుడు అనేక బీమా పథకాలు అందుబాటులోకి వచ్చాయి. ఒక పథకంతో మరో పథకానికి పోలిక ఉండదు. కాబట్టి తీసుకునే పాలసీ మీ ఆర్థిక లక్ష్యాలు, ఇతర అవసరాలను తీర్చే విధంగా ఉందా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించడం అత్యంత ప్రధానం. అలాగే మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్లు బీమా రక్షణ ఉండే విధంగా చూసుకోండి. బీమా రక్షణ ఎంత కావాలన్న విషయం పరిశీలించేటప్పుడు అప్పటికే ఏమైనా వ్యాధులు ఉంటే వాటిని, అలాగే రుణాలు ఉంటే వాటి మొత్తాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి. కంపెనీ చరిత్ర... పాలసీని ఎంచుకున్న తర్వాత ఆ కంపెనీ చరిత్రను పరిశీలించండి. ఆ కంపెనీ ప్రమోటర్లు, వారి చరిత్రతో పాటు, బీమా కంపెనీ పనితీరును కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఈ వివరాలు ఆన్లైన్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఆ బీమా కంపెనీ సర్వీసులు ఏ విధంగా ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏ విధంగా ఉంది, పాలసీదారుల సమస్యలకు ఎలా స్పందిస్తోంది. ఆ కంపెనీ సేవలపై ఏమైనా ఫిర్యాదులున్నాయా వంటివి చూడండి. క్లెయిమ్స్ ఎలా ఉన్నాయి?... ఒక కంపెనీని ఎంచుకునేటప్పుటు క్లెయిమ్ రేషియో కూడా చాలా ముఖ్యం. వచ్చిన క్లెయిమ్స్లో ఎన్నింటిని పరిష్కరించింది, ఎన్నింటిని తిరస్కరించిందన్నది క్లెయిమ్ రేషియో తెలుపుతుంది. క్లెయిమ్ రేషియో ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ పనితీరు బాగుందని లెక్క. మీరు కచ్చితమైన సమాచారం ఇస్తే క్లెయిమ్స్ తిరస్కరించే అవకాశం ఉండదు. ఈ విషయంలో మన నియంత్రణ సంస్థలు నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఫండ్ పనితీరు కూడా.. ఒక వేళ మీరు యులిప్ పాలసీని తీసుకుంటే కనుక ఆ పథకంలోని ఫండ్స్ పనితీరును కూడా పరిశీలించండి. మీ రిస్క్ సామర్థ్యం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఫండ్స్ను ఎంచుకునే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు అన్ని బీమా కంపెనీలు ఎన్ఏవీలను వెబ్సైట్స్లో అందుబాటులో ఉంచుతున్నాయి. ఇందులో మంచి పనితీరు కనపరుస్తున్న ఫండ్ను మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఎంచుకోండి. పాలసీని అర్థం చేసుకోండి.. ఒకసారి పాలసీని ఎంచుకున్న తర్వాత ఆ పథకంలోని ఇతర ఫీచర్స్ను పరిశీలించండి. పాలసీ కాలపరిమితి, ప్రీమియం ఎంత కాలం చెల్లించాలి, మెచ్యూర్టీ తేదీ, మధ్యలో ఏమైనా ఇతర చార్జీలను చెల్లించాల్సి ఉంటుందా అన్న విషయాలను అడిగి తెలుసుకోండి. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత రెండో ఆలోచన వస్తే కనుక పాలసీని రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రతీ బీమా కంపెనీ పాలసీని కొనుగోలు చేసిన తర్వాత 15 రోజుల ‘ఫ్రీ లుక్ పీరియడ్’ను ఇస్తాయి. తీసుకున్న పాలసీ నచ్చకపోతే 15 రోజుల్లోగా రద్దు చేసుకుంటే మీ ప్రీమియం తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. - అంజలి మల్హోత్రా చీఫ్ కస్టమర్, మార్కెటింగ్ ఆఫీసర్, అవైవా లైఫ్