Private Colleges Management
-
ప్రమాణాల్లేని కాలేజీలపై వేటే
సాక్షి, అమరావతి: ఇప్పటికే పాఠశాల విద్యతోపాటు ఉన్నత విద్యా రంగంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇక ఇంటర్మీడియెట్ విద్యను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఇంటర్ విద్యలో ప్రైవేట్ కాలేజీలదే పెత్తనం. ప్రమాణాల మేరకు నడుస్తున్న ప్రైవేట్ కాలేజీల సంఖ్య అంతంతమాత్రమే. కనీస ప్రమాణాలు పాటించని ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై వేటు వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ కాలేజీల్లో తనిఖీల కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రాష్ట్రంలోని పలు ప్రైవేట్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించింది. ప్రైవేట్ రంగంలోని కొన్ని జూనియర్ కాలేజీలు ప్రమాణాలకు పాతరేసి, ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తేల్చింది. కనీస మౌలిక వసతులు ఉన్నా కూడా కొన్ని కాలేజీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని గుర్తించింది. న్యాయ శాఖతో సంప్రదింపులు ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం ఉన్న ఇంటర్మీడియెట్ బోర్డు చట్టంలో వెసులుబాటు లేదని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి కాలేజీల అనుమతులను రద్దు చేసేందుకు బోర్డు చట్టంలో సవరణలు తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించారు. ఇందుకు సంబంధించిన కసరత్తును చేపట్టారు. చట్టంలో ఎలాంటి సవరణలు తీసుకురావాలన్న దానిపై విద్యా శాఖ అధికారులు న్యాయ శాఖను సంప్రదిస్తున్నారని ముఖ్యమంత్రి అదనపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి.వి.రమేశ్ తెలిపారు. చట్టంలో సవరణలకు వీలైతే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుందని పేర్కొన్నారు. కనీస ప్రమాణాలు పాటించని 500 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, 200 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపును రద్దు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని పి.వి.రమేశ్ తెలిపారు. -
50 ప్రైవేటు కాలేజీలపై కొరడా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేటు ఇంటర్మీడియేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా ఝళిపించింది. దసరా సెలవుల్లో నిబంధనలను అతిక్రమించి తరగతులు నిర్వహించిన 50 కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు భారీగా జరిమానా విధించింది. రోజుకు రూ.లక్ష చొప్పున కొన్ని కాలేజీలకు రూ.7 లక్షల వరకు జరిమానా విధించింది. ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించి తరగతులను నిర్వహించిన ఆ 50 కాలేజీల్లో 2, 3 మినహా మిగతావన్నీ శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలే ఉన్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ఆయా కాలేజీలు జరిమానా చెల్లించేందుకు నవంబర్ 2 వరకు గడువు ఇచ్చింది. ఆలోగా యాజమాన్యాలు జరిమానా చెల్లించకపోతే ఆ కాలేజీల అనుబంధ గుర్తింపు రద్దు చేస్తామని, ఆయా కాలేజీల్లో చదివే విద్యార్థులను ప్రభుత్వ కాలేజీల నుంచి పరీక్షలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. బోర్డుకు ఫిర్యాదులు.. రాష్ట్రంలో గత నెల 28 నుంచి ఈ నెల 9 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ నెల 20 వరకు సెలవులను ప్రభుత్వం పొడిగించింది. అయితే ఆ నిబంధనలను కొన్ని కాలేజీలు అమలు చేసినా, కొన్ని కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు అమలు చేయలేదు. వాటిపై తల్లిదండ్రుల సంఘాలు, విద్యార్థి సంఘాలు బోర్డుకు ఫిర్యాదు చేశాయి. దీంతో బోర్డు అధికారులు సెలవు దినాల్లో తరగతులు నిర్వహించవద్దని సూచించినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు నోటీసులు జారీ చేసినా కార్పొరేట్ యాజమాన్యాలు స్పందించలేదు. దీంతో ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు సీరియస్గా తీసుకుని ఆయా కాలేజీలకు జరిమానా విధించింది. -
ప్రాక్టికల్ మాయ
ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ అంతా మాయగా మారింది. జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ప్రయోగశాలలు మచ్చుకైనా కనిపించవు. ఉన్న వాటిల్లో పరికరాల బూజు దులపని పరిస్థితి. తరగతులు ప్రారంభమై మూడునెలలు గడుస్తున్నా ఒక్క ప్రయోగం కూడా నిర్వహించని దుస్థితి ఉంది. సబ్జెక్టుల వారీగా వారానికి రెండు క్లాసులు నిర్వహించాల్సి ఉంది. ఒక్కటంటే ఒక్క క్లాసు కూడా జరగలేదు. ఓ వైపు విద్యార్థుల్లో ఆందోళన నెలకొనుండగా.. మరోవైపు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ యాజమాన్యాల అడుగులకు మడుగులొత్తుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లూరు (టౌన్): జిల్లాలో 174 ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ 58, ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు 116 ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్యానికి సంబంధించి ప్రభుత్వ కళాశాలలు 26, ఎయిడెడ్ కళాశాలలు 11, మోడల్ స్కూళ్లు 7, సోషల్ వెల్ఫేర్ కళాశాలలు 11, ఏపీ రెసిడెన్షియల్ కళాశాల 1, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలు 2 ఉన్నాయి. ప్రభుత్వ, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో జిల్లా వ్యాప్తంగా 60వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ప్రథమ, ద్వితీయసంవత్సరానికి సంబంధించి బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఏ కళాశాలలో ప్రాక్టికల్స్ చేపట్టలేదని అధ్యాపకులే చెప్పడం గమనార్హం. ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలు బ్రాంచీల పేరుతో పెద్ద ఎత్తున కళాశాలలను ఏర్పాటు చేశాయి. బ్రాంచీల్లో ఎక్కడా ప్రయోగశాలలు లేవని తెలుస్తోంది. నెలకు బైపీసీకి 32, ఎంపీసీకి 16 క్లాసులు ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ విద్య అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు వారానికి రెండు సార్లు ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించాలి. అంటే నాలుగు సబ్జెక్టులకు 8 క్లాసులు ఉంటాయి. ఈ లెక్కన నెలకు బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ జువాలజీలకు సంబంధించి 32, ఎంపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్టీలకు సంబంధించి 16 ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ నిర్వహణ కొంత మెరుగుగా ఉంది. కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ఒక్క క్లాసు కూడా తీసుకోలేదు. ద్వితీయ సంవత్సరంలో మొక్కుబడిగా ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహిస్తున్నారు. కళాశాలలు ప్రారంభించి 3 నెలలు దాటినా ఒక్క ప్రాక్టికల్ తరగతి నిర్వహించిన పరిస్థితి లేదు. ప్రాక్టికల్స్కు ల్యాబ్లు, రసాయన పదార్థాలు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వాటి జోళికి వెళ్లడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు .. ప్రాక్టికల్స్ను పర్యవేక్షించాల్సిన ఇంటర్ బోర్డు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో పూర్తి స్థాయిలో పరికరాలు, రసాయనాలు లేవు. ప్రాక్టికల్స్ పరీక్షల సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.200 ఇంటర్ బోర్డు అధికారులకు అప్పజెప్పి మార్కులు వేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అటు కళాశాలల యాజమాన్యాలు, ఇటు ఇంటర్ బోర్టు అధికారులు ప్రాక్టికల్స్ నిర్వహణలో నోరు మెదపడం లేదని తెలిసింది. ఇప్పటికైనా ఇంటర్ ప్రాక్టికల్స్పై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని తల్లి,దండ్రులు కోరుతున్నారు. కళాశాలలను తనిఖీ చేస్తున్నాం. కళాశాలల్లో ప్రయోగశాలల నిర్వహణపై ఇప్పటికే కొన్ని కళాశాలలను తనిఖీ చేశాం. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అన్ని కళాశాలల్లో ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించాలి. ప్రధానంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తప్పకుండా ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించాల్సి ఉంది. ఈ తరగతులు నిర్వహణపై విద్యార్థులను అడిగి తెలుసుకుంటాం. ప్రాక్టికల్స్ నిర్వహించని కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఆర్ఐఓ -
విద్యార్థినితో ఇన్విజిలేటర్ అనుచిత ప్రవర్తన
ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష రాయడానికి వచ్చిన మరో కళాశాల విద్యార్థినితో ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉన్న అధ్యాపకుడు అనుచితంగా ప్రవర్తించిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగుచూసింది. సాక్షి, మానకొండూర్(కరీంనగర్) : ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష రాయడానికి వచ్చిన మరో కళాశాల విద్యార్థినితో ఇన్విజిలేషన్ డ్యూటీలో ఉన్న అధ్యాపకుడు అనుచితంగా ప్రవర్తించిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పరీక్ష నిర్వహించాల్సిన ఇన్విజిలేటర్ విద్యార్థిని పట్ల అనుచితంగా వ్యవహరించడంతో బాధితురాలు తాను చదివే కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చే సింది. ఈ మేరకు యాజమాన్యం సదరు అధ్యాపకుడిని పిలిపించి మందలించగా, విద్యార్థులు దాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలి కథనం ప్రకారం.. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతు న్న విద్యార్థిని జేఎన్టీయూ నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షలు రాస్తోంది. ఇదే మండలంలోని మరో ప్రైవేటు కళాశాలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. రోజులాగే సోమవారం పరీక్ష కేంద్రానికి వెళ్లగా, ఇన్విజిలేటర్గా బి.వెంకటేశ్ను కేటాయించారు. పరీక్ష కేంద్రానికి వచ్చిన సదరు ఇన్విజిలేటర్ పరీక్ష రాస్తున్నంత సేపు తనను వేధించినట్లు విద్యార్థిని తెలిపింది. అవసరం లేకున్నా తన వద్దకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడని, పరీక్ష పూర్తయ్యే సమయంలో ఫోన్ నంబర్ ఇవ్వమని ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన గురించి మంగళవారం తాను చదివే కళాశాల యజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కళాశాల చైర్మన్ అధ్యాపకుడిని కళాశాలకు పిలిపించి మందలించారు. విషయం తెలిసి అక్కడికి చేరిన విద్యార్థులు సదరు అధ్యాపకుడికి దేహశుద్ధి చేశారు. చైర్మన్ పోలీసులకు సమాచారం అందించడంతో గొడవ సద్దుమణిగింది. అధ్యాపకుడిని ఎల్ఎండీ పోలీస్స్టేషన్కు తరలించారు. -
‘నీట్’ టాపర్స్లో మనవాళ్లు నలుగురు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు విద్యార్థులు బుధవారం విడుదలైన నీట్ ఫలితాల్లో టాప్–50లో ర్యాంకులు సాధించి సత్తా చాటారు. మన రాష్ట్రానికి చెందిన ఖురేషి అస్రా 690 మార్కులతో జాతీయ స్థాయిలో 16వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు దక్కించుకుంది. 685 మార్కులతో పిల్లి భాను శివతేజ జాతీయ స్థాయిలో 40వ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించాడు. మరో విద్యార్థి సొదం శ్రీనందన్రెడ్డి 685 మార్కులే సాధించి 42వ ర్యాంక్ పొందాడు. తెలంగాణకు చెందిన మాధురిరెడ్డి 695 మార్కులతో జాతీయ స్థాయిలో 7వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. మన రాష్ట్రం నుంచి 57,798 మంది నీట్కు దరఖాస్తు చేసుకోగా 55,200 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 39,039 మంది అర్హత సాధించారు. తెలంగాణలో 67.44 శాతంతో 33,044 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది తగ్గిన ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి 70.72 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. నీట్–2018లో 72.55 శాతం మంది క్వాలిఫై అయ్యారు. నీట్లో ఉత్తీర్ణతా శాతం ఆధారంగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. కాగా, గతేడాది జనరల్ విభాగంలో కటాఫ్ మార్కు 107 కాగా ఈసారి 134కు పెరిగింది. ఈ ఏడాది నీట్ ప్రశ్నపత్రం సులువుగానే ఉండటంతో ఎక్కువ మంది 500 మార్కులకు పైగానే సాధించారు. అయితే గతేడాది కంటే ఎక్కువ మార్కులు సాధించినా ర్యాంకులు తగ్గాయి. ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లీనాకు గతేడాది 464 మార్కులు రాగా జాతీయ స్థాయిలో 37,050వ ర్యాంక్ వచ్చింది. లీనా ఈ ఏడాది నీట్లో 500 మార్కులు సాధించినా ర్యాంకు 49,261కి చేరింది. ఇలా చాలామంది 500 మార్కులు దాటినా సీటు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు భారీగా మార్కులు సాధించినా అంచనాకు తగ్గట్టు ర్యాంకులు రాలేదు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో ఒక్కో సీటుకు 16.98 మంది పోటీలో ఉన్నారు. గతేడాది కంటే ఈసారి పోటీ మరింత పెరిగింది. తుది ‘కీ’ తో అన్యాయం మే 29న నీట్ ప్రిలిమినరీ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. జూన్ 1 వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి బుధవారం ఫలితాలతోపాటు తుది ‘కీ’ని ప్రకటించింది. దీనిపై విద్యా నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట విడుదల చేసిన ప్రాథమిక ‘కీ’ కెమిస్ట్రీలో రెండు, ఫిజిక్స్లో రెండు ప్రశ్నలకు ఇచ్చిన జవాబులను తుది ‘కీ’లో మార్చినట్లు చెబుతున్నారు. మొదటి ‘కీ’లో ఇచ్చిన జవాబులు సరైనవని, వాటినే మన విద్యార్థులు రాశారని అంటున్నారు. తుది ‘కీ’లో వీటిని మార్చడంతో మన విద్యార్థులకు అన్యాయం జరిగిందని పేర్కొంటున్నారు. ప్రాథమిక ‘కీ’లో వచ్చిన మార్కులు తుది ‘కీ’లో పోయాయంటున్నారు. ఇలా 8 మార్కులు, వాటికి మైనస్ మార్కులతో కలిపి 10 మార్కులు విద్యార్థులు కోల్పోయారని వివరించారు. దీంతో ర్యాంకుల్లో భారీ తేడా వచ్చిందంటున్నారు. గతేడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు మొదటి 50 ర్యాంకుల్లో ఏడు ర్యాంకులుంటే, ఈసారి నాలుగు ర్యాంకులే ఉన్నాయన్నారు. 15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సెలింగ్ నీట్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్గా, ఎస్టీ, ఎస్సీ, బీసీలకు 40 పర్సంటైల్గా, దివ్యాంగులకు 45 పర్సంటైల్గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15% సీట్లను నేషనల్ పూల్లోకి తీసుకున్నారు. వీటన్నింటినీ అలిండియా కౌన్సెలింగ్లో భర్తీ చేస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగా రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. ఇక రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్లో ప్రవేశాలకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. ఇందుకోసం రాష్ట్ర స్థాయి నీట్ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్నారై, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు. నిపుణుల అంచనా ప్రకారం.. నీట్లో జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో 1,500 నుంచి 2 వేల లోపు ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారికి కన్వీనర్ కోటాలోనే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. నీట్లో 470 నుంచి 480 మార్కుల వరకు వచ్చిన వారికి కూడా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కార్డియాలజిస్టునవుతా నీట్ ఏడో ర్యాంకర్ జి.మాధురీరెడ్డి శిరివెళ్ల: నీట్–2019 ఫలితాల్లో కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లెకు చెందిన గంగదాసరి మాధురీరెడ్డి జాతీయ స్థాయిలో 7వ ర్యాంక్ సాధించింది. ఏపీ ఎంసెట్లోనూ 5వ ర్యాంకుతో సత్తా చాటింది. హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ మెడికల్ అకాడమీలో చదువుతూ నీట్ రాసిన మాధురి 720 మార్కులకు గాను 695 మార్కులు సాధించి సత్తా చాటింది. ఢిల్లీ ఎయిమ్స్లో చేరతానని, కార్డియాలజిస్టు కావడమే తన లక్ష్యమని తెలిపింది. మాధురి తండ్రి తిరుపతిరెడ్డి ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా, తల్లి పద్మ గృహిణి. రేడియాలజిస్టునవుతా నీట్ 40వ ర్యాంకర్ భానుతేజ సాక్షి, విశాఖపట్నం: నీట్ ఫలితాల్లో విశాఖ నగరానికి చెందిన భానుతేజ జాతీయ స్థాయిలో 40వ ర్యాంకు సాధించాడు. విశాఖ చైతన్య కళాశాలలో ఇతను ఇంటర్మీడియట్ చదివాడు. ర్యాంకు వచ్చిన సందర్భంగా భానుతేజ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ర్యాంకు సాధించడానికి రెండు నెలల పాటు రోజుకు 15 గంటలు కష్టపడి చదివాను. నీట్ రాశాక 500 లోపు ర్యాంకు వస్తుందని భావించాను. 40వ ర్యాంకు రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. అమ్మ సూర్యమణి విశాఖ కేజీహెచ్లో డాక్టర్. నాన్న శ్రీకాకుళంలో ఎంవీ ఇన్స్పెక్టర్. అక్కలు ఇద్దరూ వైద్యులే. నాకు చిన్నప్పట్నుంచి రేడియాలజీ అంటే ఇష్టం. అందుకే భవిష్యత్తులో రేడియాలజిస్టునవుతాను. నాకు ఉత్తమ ర్యాంకు రావడంలో నా తల్లిదండ్రులు, చైతన్య కాలేజీ అధ్యాపకుల ప్రోత్సాహం ఉంది.’ అని వివరించాడు. శ్రీనందన్రెడ్డికి ఫిజిక్స్లో 180కి 180 కడప ఎడ్యుకేషన్: నీట్లో కడపకు చెందిన శ్రీనందన్రెడ్డి 42వ ర్యాంకు సాధించాడు. అంతేకాకుండా ఫిజిక్స్ సబ్జెక్టులో ఇతను 180కి 180 మార్కులు సాధించాడు. శ్రీనందన్రెడ్డి ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఇతను కడపలోని సంకల్ప కోచింగ్ సెంటర్లో ఫౌండేషన్ కోర్సులో శిక్షణ తీసుకున్నాడు. శ్రీనందన్రెడ్డి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు రామిరెడ్డి, ప్రసూన, సంకల్ప్ డైరెక్టర్ వంశీ హర్షం వ్యక్తం చేశారు. -
విద్యలో వెనకబడి ఉన్నాం
డిప్యూటీ సీఎం కడియం హైదరాబాద్: అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే విద్యాపరంగా మనం వెనకబడి ఉన్నామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణలో నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆర్టీసీ కల్యాణమండపంలో ఆదివారం తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం డైరీని ఆయన ఆవిష్కరించారు. కడియం మాట్లాడుతూ... అందరి భాగస్వామ్యంతోనే తెలంగాణ వచ్చిందని, దాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రైవేట్ కళాశాలల మేనేజ్మెంట్లు ఆరోగ్యశ్రీ, డబుల్ బెడ్రూమ్లు అడిగారని, అయితే ఆసరా పథకం కోరతారేమోనని కంగారుపడ్డానని పరోక్షంగా చురకలు వేశారు. రాష్ర్టంలో 80 లక్షల మంది విద్యార్థులుంటే అందులో 50 శాతం మంది ప్రైవేట్ విద్యాలయాల్లోనే చదువుతున్నారన్నారు. అందరికీ తమ ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని, అయితే ప్రభుత్వ విద్యాలయాలను గాలికొదిలేసి ప్రైవేటు సంస్థలను ఏ ప్రభుత్వం ప్రోత్సహించదన్నారు. రానున్న బడ్జెట్లో ఫీజు బకాయిలను పూర్తిగా చెల్లించేందుకు కృషి చేస్తామన్నారు. యాభై ఏళ్లలో జరగనిది ఐదేళ్లలో చేస్తాం: ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... బల్దియా ఎన్నికల్లో ఒక్కసారి తమకు అవకాశం ఇస్తే, యాభై ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపిస్తామన్నారు. తెలంగాణ వస్తే విద్యుత్ సమస్యగా మారుతుందని ఏపీ చివరి సీఎం కిరణ్కుమార్రెడ్డి అన్నారని, కానీ.. కిరణ్ దీపం ఆరిపోయింది గానీ, ఇక్కడ ఎండాకాలం కూడా కరెంట్ కోతలు లేవన్నారు. ఎమ్మెల్యే జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎ.వరదారెడ్డి, అధ్యక్షుడు వి.నరేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, జాహ్నవి కళాశాలల చైర్మన్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.