-
బెంగళూరు క్రికెటర్ డానియల్ సామ్స్కు పాజిటివ్
చెన్నై: ఐపీఎల్ను కరోనా వైరస్ వదలడం లేదు. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆల్రౌండర్ డానియెల్ సామ్స్ పాజిటివ్గా తేలాడు. ఆస్ట్రేలియాకు చెందిన అతను ఈనెల 3న భారత్కు వచ్చాడు. అప్పుడు చేసిన పరీక్షలో నెగెటివ్గా వచ్చింది. కానీ బుధవారం చేసిన పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చిందని ఆర్సీబీ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఆర్సీబీ ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ వైరస్ బారి నుంచి కోలుకున్నాడు. బుధవారం అతని నమూనాలను పరీక్షించగా నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. రేపు చెన్నై వేదికగా ఐపీఎల్ 14వ సీజన్ మొదలవుతుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తో బెంగళూరు తలపడుతుంది. -
పడిక్కల్కు పాజిటివ్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కష్టకాలం వచ్చింది. ఈ లీగ్పై కరోనా వైరస్ పడగ విప్పినట్లుంది. అందుకే ఆటగాళ్లు, గ్రౌండ్ సిబ్బంది, ఈవెంట్ మేనేజర్లు వరుసగా కోవిడ్–19 వైరస్ బారిన పడుతున్నారు. తాజా పరిణామాలు, పాజిటివ్ రిపోర్టులు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్కి ఈ మహమ్మారి సోకింది. గత నెల 22న అతని నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా కోవిడ్ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో 20 ఏళ్ల యువ బ్యాట్స్మన్ను బెంగళూరులోని తన స్వగృహంలో క్వారంటైన్లో ఉంచారు. క్వారంటైన్ గడువు ముగిశాక వరుసగా రెండు ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ అని తేలితే అతన్ని బయో బబుల్లోకి తీసుకుంటామని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్సీబీ మెడికల్ టీమ్ అతనితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉందని అందులో పేర్కొంది. క్వారంటైన్ నేపథ్యంలో పడిక్కల్ ఈ నెల 9న జరిగే సీజన్ తొలి మ్యాచ్కు దూరం కానున్నాడు. చెన్నైలో మొదలయ్యే మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో ఆర్సీబీ తలపడుతుంది. లీగ్ ప్రారంభం కాకముందే కరోనా బారిన పడ్డ క్రికెటర్ల సంఖ్య మూడుకి చేరింది. నితీశ్ రాణా (కోల్కతా నైట్రైడర్స్) కరోనా నుంచి కోలుకోగా... అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్) ఐసోలేషన్లో ఉన్నాడు. ముంబై వేదికని మార్చలేదు: రాజీవ్ శుక్లా మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ కట్టుదిట్టమైన ముందు జాగ్రత్తలతో ముందుకెళ్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. ‘ముంబై వేదికని మార్చే నిర్ణయం తీసుకోలేదు. షెడ్యూల్ ప్రకారం అక్కడే మ్యాచ్లు జరుగుతాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బయో బబుల్ కూడా ఉంది. కేసుల తీవ్రత పెరిగితే తప్ప స్టాండ్బై వేదికలు (హైదరాబాద్, ఇండోర్) పరిశీలించం’ అని శుక్లా తెలిపారు. -
90 వేలకు చేరువలో కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ రోజు రోజుకీ పెరిగిపోతోంది. 80 వేల మార్క్ చూసిన మర్నాడే ఒక్క రోజులో 90 వేలకి దగ్గరలో కేసులు నమోదవడం ఆందోళన పుట్టిస్తోంది. కరోనా మొదటి వేవ్ కంటే రెండో వేవ్లో మూడు రెట్ల వేగంతో కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 89,129 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,92,260కి చేరుకుంది. కరోనా మరణాలు ఒక్క రోజులోనే రెట్టింపయ్యాయి. మొత్తంగా 714 మంది కరోనాతో మరణించినట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 6,58,909కి చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 5.32శాతంగా ఉన్నాయి. ► ఎనిమిది రాష్ట్రాల నుంచి కరోనా కేసులు అత్యధికంగా వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం కేసుల్లో 81.42% కేసులు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. ► దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 10 జిల్లాల నుంచే సగం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. పుణె, ముంబై, నాగపూర్, థానే, నాసిక్, బెంగుళూరు అర్బన్, ఔరంగాబాద్, ఢిల్లీ, అహ్మద్నగర్, నాందేడ్ జిల్లాల నుంచి కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ► గత రెండు నెలల కాలంలో యాక్టివ్ కేసుల్ని పరిశీలిస్తే మహారాష్ట్రలో తొమ్మిది రెట్లు అధికంగా కేసులు నమోదవుతూ ఉంటే, పంజాబ్లో ఏకంగా పన్నెండు రెట్లు అధికంగా కరోనా కేసులు వస్తున్నాయి. ► కరోనా మరణాల్లో 85శాతం ఆరు రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు నమోదు కాకపోవడం ఊరట కలిగించే అంశం. ఒడిశాలో 10 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ ఒడిశాలో ముందుజాగ్రత్తగా 10 జిల్లాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. సోమవారం నుంచి రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ వెల్లడించారు. రాష్ట్రంలో రోజుకి 500 వరకు కేసులు నమోదవుతున్నాయి. కనిమొళికి కరోనా పాజిటివ్ డీఎంకే లోక్సభ ఎంపీ కనిమొళికి కరోనా పాజిటివ్గా తేలింది. ఏప్రిల్ 6న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కరోనా సోకడంతో కనిమొళి ఎన్నికల సభలన్నీ రద్దు చేసుకొని ఆస్పత్రిలో చేరారని డీఎంకే వర్గాలు తెలిపాయి. -
ఐపీఎల్కు కరోనా సెగ
మామూలుగా అయితే వేసవి వస్తుందంటే పిల్లలకు సెలవులు, అభిమానులకు ఐపీఎల్ మ్యాచ్లు ఉంటాయి. ఈ ఆహ్లాదపరిచే ఆనందం ముందు మండే ఎండలైనా చిన్నబోతాయి. కానీ గతేడాది నుంచి ట్రెండ్ మారింది. కొత్త వైరస్ (కరోనా) దాపురించింది. ఐపీఎల్ను వణికిస్తోంది. ఆటగాళ్లను, సిబ్బందిని బెంబేలెత్తిస్తోంది. మొత్తానికి ఈ ఏడాదీ కరోనా సెగ లీగ్కు తాకింది. ముంబై: ఐపీఎల్ టి20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభానికి వారమైనా లేదు. కరోనా వైరస్తో ఈ టోర్నీలో అలజడి రేపింది. లీగ్ ఏర్పాట్లలో కలకలం మొదలైంది. శ్రీకారానికి ముందే వైరస్ సైరన్ మోగింది. భారత ఆల్రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్ సహా ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బంది, పలువురు ఈవెంట్ మేనేజర్లు వైరస్ బారిన పడ్డారు. ఇది లీగ్ వర్గాలను ఠారెత్తించినా... గత అనుభవాల దృష్ట్యా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దగా కంగారు పడకుండా చేయాల్సిన పనుల్ని చక్కబెడుతూ, ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా చేయాలని నిర్ణయించింది. ఐసోలేషన్లో అక్షర్... ఢిల్లీ ఆటగాడు అక్షర్ పటేల్కు పాజిటివ్ రిపోర్టు వచ్చిందని జట్టు వర్గాలు తెలిపాయి. ముంబైలో తను బసచేసిన హోటల్లో గత నెల 28న అతనికి పరీక్ష చేయగా అప్పుడు నెగెటివ్ వచ్చింది. కానీ మరోసారి కోవిడ్ టెస్టు చేస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా అక్షర్ ఇంకా బయో బబుల్లోకి వెళ్లలేదు. కాబట్టి జట్టు సన్నాహక శిబిరానికి, ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్కు ఎలాంటి ఇబ్బంది లేదని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. మొదట కోల్కతా నైట్రైడర్స్ హిట్టర్ నితీశ్ రాణా వైరస్ బారిన పడ్డట్లు రిపోర్టులో వచ్చింది. ఈ సీజన్లో ఇదే తొలికేసు. అయితే తదుపరి పరీక్షలో తను నెగెటివ్ అని తేలడంతో ఆటగాళ్లకు సంబంధించి తొలి పాజిటివ్ అక్షర్ ఖాతాలోకి వెళ్లింది. ఐపీఎల్ కరోనా ప్రోటోకాల్ ప్రకారం అక్షర్ 10 రోజులు క్వారంటైన్లో గడపాలి. క్వారంటైన్ గడువు ఈనెల 12న ముగియనుంది. ఆ తర్వాత వరుసగా రెండు ఆర్టీ–పీసీఆర్ టెస్టుల్లో కూడా అతనికి నెగెటివ్ రావాలి. అప్పుడే అతను జట్టుతో కలవగలడు. ఫలితంగా ఈనెల 10న చెన్నై సూపర్ కింగ్స్తో... 15న రాజస్తాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్ల్లో అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలో దిగే అవకాశాలు కనిపించడంలేదు. మరోవైపు చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) ఆటగాడికి కూడా కోవిడ్ సోకినట్లు తెలిసింది. అయితే అతని పేరు మాత్రం బయటకు పొక్కలేదు. పది మంది సిబ్బందికి... మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో ముంబైలోని వాంఖెడే స్టేడియం సిబ్బందిలో 10 మందికి కూడా కోవిడ్ సోకింది. దీంతో పాటు మరో ఆరుగురు ఈవెంట్ మేనేజర్లు కూడా కరోనా బారిన పడటంతో బీసీసీఐ ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలో ముంబైలో జరగాల్సిన మ్యాచ్లను హైదరాబాద్ లేదంటే ఇండోర్లో నిర్వహించనున్నారనే వార్తలు వెలువడ్డాయి. కానీ బీసీసీఐ మాత్రం బయో బబుల్ ఏర్పాట్లు ఉన్నపళంగా మార్చలేమని, ఏదేమైనా కట్టుదిట్టమైన చర్యలతో ముంబైలోనే మ్యాచ్లు నిర్వహించేందకు ప్రయత్నిస్తామని చెప్పింది. ‘స్టాండ్బై స్టేడియాలలో హైదరాబాద్ ఒకటి. కానీ ఇప్పటికైతే ఆగమేఘాలపై ముంబై మ్యాచ్ల్ని అక్కడికి తరలించాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కొద్ది సమయంలోనే మరో బబుల్ ఏర్పాటు అంత సులభం కాదు’ అని ఒక సీనియర్ బీసీసీఐ అధికారి వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం వాంఖెడే మైదానంలో ఈ నెల 10 నుంచి 25 వరకు 10 లీగ్ మ్యాచ్లు జరగాల్సివుంది. శుక్రవారం సాయంత్రం దాకా 8 పాజిటివ్ కేసులుంటే శనివారానికి ఆ సంఖ్య పదికి చేరిందని, ఆరేడు మంది ఈవెంట్ మేనేజర్లు కూడా వైరస్ బారిన పడ్డారని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. -
అలియాకు కరోనా: తల్లి సోని ఆందోళన
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కరోనా బారిన పడిని సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోంక్వారంటైన్లో ఉన్న అలియా త్వరలో మహమ్మారి నుంచి బయటపడాలని కోరుకుంటూ పలువురు బాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలియా భట్ తల్లి సోని రజ్ధాన్ కూతురి ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఆమె ట్వీట్ చేస్తూ ఈ వైరస్ వ్యాప్తి నుంచి ఎలా రక్షించుకోవాలో అర్థం కావడం లేదంటూ ట్విటర్లో ఇలా రాసుకొచ్చారు. ‘ఇది సాధారణ తరంగం కాదు… ఈ వైరస్ ప్రతిచోటా ఉంది. ప్రతి ఇళ్లలో ఉంది, మన జుట్టులో ఉంది. ఇది తలచుకుంటుంటే చాలా భయంగా ఉంది. ఇది సాధారణ తరంగం కాదు.. ఈ మహమ్మరి ప్రతిచోటా ఉంది. ఇక మనం ఎలా ముందుకు సాగాలి. దీని నుంచి ఎలా బయటపడాలి. అసలు ఇది రాకుండ ఉండేందుకు ఎలా జాగ్రత్త పడాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న మహమ్మారి వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. ప్రతి ఇల్లు, ప్రతి కార్యాలయం, ప్రతి వీధి, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం.. ఎక్కడ లేదని చెబుతాం. ప్రతి చోటా ఉంది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా అలియా తనకు కరోనా పాజిటివ్గా తెలినట్లు స్వయంగా ప్రకటించారు. డబుల్ హోమ్ క్వారంటైన్ను ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు హీరోయిన్ ఆలియా భట్. సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తున్న సినిమా ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమా షూటింగ్లో దర్శకుడు సంజయ్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆలియా కూడా క్వారంటైన్లోకి వెళ్లారు. ఇలా హోమ్ క్వారంటైన్ను పూర్తి చేశారో లేదో అలా మరోసారి క్వారంటైన్కి వెళ్లారు ఆలియా. ఈసారి ఆలియాకు కరోనా సోకింది. This is no ordinary wave ...it’s everywhere. In our houses, in our hair. I’m getting a bit of a scare. It’s no ordinary wave.. it’s everywhere ... don’t know how we shall fare .. how do we begin to care... about so many here and there... it’s everywhere, it’s everywhere 🦠🦠🦠 — Soni Razdan (@Soni_Razdan) April 2, 2021 చదవండి: రెండుసార్లు క్వారంటైన్కు వెళ్లిన స్టార్ హీరోయిన్ అలియా భట్కి షాకిచ్చిన ముంబై కోర్టు -
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వెన్నులో వణుకు...
-
మళ్లీ లాక్డౌన్ తప్పదేమో: ఉద్ధవ్ ఠాక్రే
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉధృతి పెరుగుతుండడంతో మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. అయితే, ఇప్పటికిప్పుడు లాక్డౌన్ ప్రకటన చేయడం లేదన్నారు. లాక్డౌన్కు ప్రత్యామ్నాయం లభించకపోతే రానున్న రెండు మూడు రోజుల్లో కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని స్పష్టం చేశారు. మహారాష్ట్రను కరోనా హడలెత్తిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం రాత్రి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుతం లాక్డౌన్ మినహా ప్రత్యామ్నాయం కనిపించడం లేదన్నారు. ఏదైనా మార్గం ఉంటే సూచించాలని ప్రజలను కోరారు. తాను కూడా నిపుణులతో దీనిపై చర్చిస్తున్నానని తెలిపారు. ప్రజల ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదన్నారు. రాజకీయ పార్టీలు ఈ విషయంపై రాద్ధాంతం చేయకుండా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు సహకరించాలని ఉద్ధవ్ ఠాక్రే విన్నవించారు. కరోనా వైరస్ను నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఠాక్రే పేర్కొన్నారు. దేశంలో ఇతర రాష్ట్రాల కంటే అధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని గుర్తుచేశారు. ఆసుపత్రుల సంఖ్య, ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. మళ్లీ లాక్డౌన్ విధించాలని తాము కోరుకోవడం లేదన్నారు. నిపుణులతో చర్చించి రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. -
దేశంలో కరోనా విలయం, ఒక్కరోజే 81,466 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 81,466 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,03,131కి చేరుకున్నట్టు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన వెల్లడించింది. దేశవ్యాప్తంగా 469 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,63,396కి చేరుకుంది. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్గఢ్, కర్ణాటకలలో కరోనా ఉధృతి ఆందోళన పుట్టిస్తోందని కేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్లో కరోనా కట్టడికి కొన్ని పట్టణ ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి లాక్డౌన్ విధించారు. ఏప్రిల్ 5 వరకు ఈ లాక్డౌన్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రెండో డోసు తీసుకున్నా కరోనా పాజిటివ్ ఉత్తర ప్రదేశ్కి చెందిన సీనియర్ పోలీసు అధికారికి కోవిడ్–19 రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్గా తేలింది. తాను రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఐజీ) రాజేశ్ పాండే ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు. తన భార్య కరోనా టీకా ఒక డోసు తీసుకున్నారని, ఆమెకి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. మూడు రోజుల క్రితం వాళ్లబ్బాయికి కరోనా సోకింది. రాబర్ట్ వాద్రాకు కరోనా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రాకు కోవిడ్–19 పాజిటివ్గా తేలింది. దీంతో ప్రియాంకా శుక్రవారం ఐసోలేషన్లోకి వెళ్లారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో విడుదల చేశారు. అస్సాంలో శుక్రవారం, తమిళనాడులో శనివారం, కేరళలో ఆదివారం పాల్గొనాల్సిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ‘నాకు కోవిడ్–19 నెగెటివ్గా నిర్థారణ అయినప్పటికీ వైద్యుల సూచన మేరకు కొన్ని రోజుల పాటు ఐసోలేషన్లో ఉంటాను’ అని ఆమె తెలిపారు. రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ ఓ వైపు కరోనా కేసులు బెంబేలెత్తిస్తుంటే మరోవైపు జనం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి బారులు తీరుతున్నారు. 45 ఏళ్ల వయసు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తూ ఉండడంతో 24 గంటల్లో 36.7 లక్షలకుపైగా మంది కోవిడ్–19 టీకాలు తీసుకున్నారు. ఒకే రోజులో ఈ స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. యొత్తంగా 36,71,242 వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. 33,65,597 మంది మొదటి డోసు తీసుకుంటే, 3,05,645 మంది రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6.87 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ మహారాష్ట్ర కోవిడ్–19 గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. రాష్ట్రంలో ఒకే రోజు 43,183 కేసులు నమోదయ్యాయి. పుణేలో గత రెండు రోజులుగా 8 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో శనివారం నుంచి వారం రోజులు రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయించారు. మాల్స్, సినిమాహాళ్లు, రెస్టారెంట్లు, బార్లు వారం రోజుల పాటు సాయంత్రం 6 గంటలకే మూసేయాల్సి ఉంటుందని ఆదేశించారు. -
లాక్డౌన్ దిశగా మహారాష్ట్ర!
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో మళ్లీ లాక్డౌన్ విధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించారు. నాందేడ్, బీడ్తోపాటు మరికొన్ని జిల్లాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమలవుతోంది. పలు జిల్లాల్లో పాక్షిక లాక్డౌన్తోపాటు ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. అయినప్పటికీ కరోనా అదుపులోకి రావడం లేదు. అందుకే మళ్లీ లాక్డౌన్ విధించడంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. 43 వేలు దాటిన కేసులు రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ హడలెత్తిస్తోంది. గురువారం ఒక్కరోజే ఏకంగా 43,183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 249 మంది మృతి చెందారు. గురువారం 32,641 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,66,533 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ముంబై నగరంలో కరోనా బాధితుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. గురువారం 8,646 కేసులు రికార్డయ్యాయి. 18 మంది కరోనాతో కన్నుమూశారు. ముంబైలో ఆంక్షలను మరింత కఠినతరం చేయడం ఖాయమన్న సంకేతాలను మేయర్ కిషోరి ఫెడ్నేకర్ ఇచ్చారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదు: రాజేష్ టోపే మహారాష్ట్రలో లాక్డౌన్కు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ టోపే చెప్పారు. లాక్డౌన్ విధించాలని తాము కోరుకోవడం లేదన్నారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పారు. లాక్డౌన్ కాకుండా ఏమేం చేయొచ్చు అనేదానిపై నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేశామన్నారు. -
మళ్లీ కరోనా పడగ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒక్కసారిగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. గత 24 గంటల్లో 72,330 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 22 లక్షల 21వేల 665కి చేరుకుంది. గత ఏడాది అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో ఒక్క రోజు కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కరోనా మరణాలు 459 నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 1,62,927కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,84,055గా ఉన్నట్టు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా కేసుల్లో 4.78శాతంగా ఉంది. 45 ఏళ్ల వయసు పై బడిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైన రోజే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. వ్యాక్సినేషన్ను ముమ్మరం చేస్తే కరోనా కేసుల్ని కట్టడి చేయవచ్చునని శాస్త్రవేత్తలు సూచించారు. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర నుంచి 61శాతం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. యువతే క్యారియర్లా ? దేశంలో కరోనా కేసులు పెరిగిపోవడానికి యువతరం క్యారియర్లగా మారుతోందన్న ఆందోళనలు నెలకొన్నాయి. రోడ్లపైకొచ్చి స్వేచ్ఛగా, నిర్భీతిగా తిరుగుతున్న యువతే కారణమన్న అంచనాలున్నాయి. కరోనా సోకినా తమకేం కాదులే అన్న ధీమాతో ఉన్న యువతరం కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా తిరుగుతున్నారని, దీంతో వైరస్ వారినేం చేయకపోయినా యువత నుంచే పెద్దవారికి, వ్యాధులున్నవారికి సోకుతోందని న్యూఢ్లిలీలోని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. బ్రిటన్లో క్రిస్మస్ సమయంలో నెలకొన్న పరిస్థితి ప్రస్తుతం భారత్లో హోలీ పండుగ సమయంలో వచ్చిందని అన్నారు. వైరస్ మ్యుటేషన్ చెందినప్పుడు కేసులు అత్యధికంగా వెలగులోకి వస్తాయని కేంద్రం ఏర్పాటు చేసిన కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు కూడా అయిన డాక్టర్ రణదీప్ చెప్పారు. నగర ప్రాంతాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదు కావడానికి సెంట్రలైజ్డ్ ఏసీలున్న చోట్ల ప్రజలు ఎక్కువ సేపు గడపడమే కారణమని న్యూరో ఎక్విలిబ్రియమ్ సంస్థ వ్యవస్థాపకుడు రాజ్నీష్ భండారీ అన్నారు. వేసవికాలం వచ్చినప్పటికీ అత్యంత చల్లగా ఉండే ఏసీ గదుల్లో గడపడం వల్ల కేసులు పెరిగిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. సెలవు రోజుల్లోనూ వ్యాక్సినేషన్ కరోనా ఉధృతిని కట్టడి చేయాలంటే ప్రజలందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ జరగాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు ఏప్రిల్ నెలంతా నిరంతరాయంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఏప్రిల్ నెల 30 వరకు సెలవు దినాల్లో కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆ లేఖలో సూచించింది. మార్చి 31న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య శాఖ చర్చించిన అనంతరం గెజిటెడ్ హాలీడేస్ల్లో కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయానికొచ్చింది. కరోనా వ్యాక్సినేషన్ మరింత ముమ్మరంగా జరగాలంటే ప్రైవేటు సెక్టార్ ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ మూడో విడత మొదలైంది. 45 ఏళ్ల వయసుపైబడిన వారందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడం మొదలు పెట్టారు. 6.5కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల్ని ఫ్రంట్లైన్ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందితో పాటుగా 60 ఏళ్ల వయసు పైబడిన వారు, వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల వయసు పైబడిన వారికి ఇచ్చారు. -
దేవెగౌడ దంపతులకు కోవిడ్
సాక్షి, బెంగళూరు: జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, ఆయన సతీమణి చెన్నమ్మకు బుధవారం పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. వారిద్దరూ బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని దేవెగౌడ కోరారు. తనను కలిసేందుకు రావద్దని సూచించారు. దేవెగౌ డకు ఎలాంటి లక్షణాలు లేకున్నా, టెస్టుల్లో పాజిటివ్గా తేలింది. వైద్యుల సూచన ప్రకారం కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. దేవెగౌడకు ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ చేసి పరామ ర్శించారు. ప్రధాని ఫోన్ చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దేవెగౌడ త్వరగా కోలుకోవాలని కోరుతూ సీఎం బీఎస్ యడి యూరప్ప ట్వీట్ చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో కరోనా రెండో దశ ఉధృతంగా ఉంది. నిత్యం సుమారు రెండు వేల పాజిటివ్లు నమోదవుతున్నాయి. -
రాజేంద్రనగర్లో కోవిడ్ కలకలం
సాక్షి, రాజేంద్రనగర్: రాజేంద్రనగర్లో గురువారం కరోనా కలకలం సృష్టించింది. ఎస్టీ హాస్టల్తో పాటు ప్రభుత్వ పాఠశాలలోని పలువురు విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని తెలుసుకున్న స్థానికులు కలవరానికి గురయ్యారు. ఒకే సారి 26 మందికి కరోనా రావడంతో ఇదే విషయమై చర్చించుకున్నారు. మధ్యాహ్నానికి ఎప్పుడు రద్దీగా ఉండే రాజేంద్రనగర్ చౌరస్తా బోసిపోయి కనిపించింది. విద్యార్థులకు కరోనా సోకిందన్న విషయంతో స్థానిక వ్యాపారస్తులు సైతం మధ్యాహ్నం దుకాణాలను మూసివేశారు. ఇతర హాస్టల్లలో... రాజేంద్రనగర్ ప్రాంతంలో గిరిజన హాస్టల్తో పాటు ఎస్సీ, బీసీ, బాలిక, బాలుర హాస్టల్స్ ఉన్నా యి. ఈ ఐదు హాస్టల్స్లోని విద్యార్థులంతా స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యభ్యాసంసం కొనసాగిస్తున్నారు. వైద్య బృందం హాస్టల్స్లో ఉదయం పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు, ఇతర సిబ్బంది అందరికి నెగటీవ్గా వచ్చింది. ఆందోళనలో తల్లిదండ్రులు... రాజేంద్రనగర్ జెడ్పీహెచ్ఎస్లో చదువుతున్న 24మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడంతో ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కోరుతున్నారు. -
పాజిటివ్గా తేలడంతో దారుణానికి పాల్పడ్డ రైతు
సాక్షి, ధారూరు(వికారాబాద్): కరోనా పాజిటివ్ అని తేలడంతో భయపడిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ధారూరు మండలం నాగసమందర్లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ సురేష్, గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నాగసమందర్కు చెందిన ముతికె శాంత్కుమార్(54) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయన మూడు రోజులుగా దగ్గు, దమ్ము, జ్వరంతో బాధపడుతున్నాడు. సోమవారం ఉదయం తాండూరులోని జిల్లా అస్పత్రికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన ఇంటికి వచ్చి దులానికి ఉరివేసుకునే ప్రయత్నం చేశాడు. ఇది గుర్తించిన కుటుంబీకులు, గ్రామస్తులు అడ్డుకుని, నచ్చజెప్పారు. అందరినీ నమ్మించిన ఆయన సాయంత్రం వేళ భార్య నాగవేణి(50)ని నీళ్లు తీసుకురమ్మని ఇంట్లో నుంచి పంపించి దులానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి వచ్చిన భార్య గుండెలు బాధుకుంటూ ఇతరుల సహాయంతో కిందకు దింపి చూడగా అప్పటికే శాంత్కుమార్ మరణించాడు. మృతుడి కుమారుడు భీమలింగం పోలసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ సురేష్ సిబ్బందితో వెళ్లి సంఘటన స్థలానికి డాక్టర్ను పిలిపించి పోస్టు మార్టమ్ చేయించారు. కోవిడ్ నిబంధనల మేరకు అంత్యక్రియలు జరిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. మృతుడికి భార్యతో పాటు కొడుకులు శివశంకర్, భీమలింగ్లు ఉన్నారు. వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని జవనం గడుపుతున్న శాంతుకుమార్ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
ఉపాధ్యాయులకు కరోనా, ఆందోళనలో ఎమ్మెల్యే..
సాక్షి, వికారాబాద్: మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ సోకింది. ఈమేరకు వైద్యాధికారులు నిర్ధారించారు. జిల్లా కేంద్రంలోని శివారెడ్డి సమీపంలో ఉన్న పాఠశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది మొత్తం 40 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ సోకింది. విద్యార్థుల్లోనూ కొందరికి వైరస్ లక్షణాలు ఉన్నాయని వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 100 మందికి పైగా 8, 9, 10తోపాటు ఇంటర్ చదువుతున్నారు. వైద్యాధికారులు వారినుంచి నమూనాలు సేకరించి గురువారం ల్యాబ్కు తరలించారు. విద్యార్థుల్లో కొందరు జ్వరం తదితర లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఫలితాల అనంతరమే నిర్ధారణ అవుతుందని చెబుతున్నారు. పాఠశాలలో మహమ్మారి వ్యాప్తి చెందడానికి కారణమైన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. పాఠశాలలో ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ రావడంతో బడిలో కోవిడ్ నిబంధనలు పాటి స్తున్నారా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పిల్లలకు వైరస్ సోకితే ఎవరు బాధ్య త వహిస్తారని ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా భయంతో అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శివరెడ్డిపేట్ సమీపంలో ఉన్న గురుకుల మైనారిటీ స్కూల్లో తన అనుచరులతో ప్రచారం చేశారు. పార్టీ అభ్యర్థి వాణీదేవికి ఓటేయాలని ఉపాధ్యాయులను కోరారు. ఎమ్మెల్యే సుమారు గంటసేపు పాఠశాలలో సమవేశమయ్యారు. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు పాజిటివ్ రావడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులకు సైతం కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. -
ఒకే అపార్టుమెంటులో 103 మందికి కరోనా
బెంగళూరు: ఒకే అపార్టుమెంటులో నివసిస్తున్న దాదాపు 103 మంది ఒకేసారి కరోనా వైరస్ బారిన పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇటీవల అపార్టుమెంటులో నిర్వహించిన పార్టీలో దాదాపు 45 మంది పాల్గొన్న అనంతరం 103 మందికి కరోనా పాజిటివ్ తేలిందని అధికారులు తెలిపారు. ఆ పార్టీ కారణంగానే అపార్టుమెంటు వాసులకు కరోనా సోకినట్లుగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. బీబీఎమ్పీ అధికారుల సమాచారం మేరకు.. బెంగళూరులోని ఎస్ఎన్ఎన్ రాజ్ లేక్వ్యూ అపార్టుమెంటులో ఫిబ్రవరి 6న ఓ పార్టీ జరిగింది. ఈ పార్టీలో అపార్టుమంటు నివాసితులు 45 మంది పాల్గొన్నట్లు సమాచారం.దీంతో ఆది, సోమవారల్లో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఈ అపార్టుమెంటులోని వాచ్మెన్, డ్రైవర్, వంటవాళ్లతో సహా మొత్తం 103 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. కాగా ఇందులో ఉన్న మొత్తం 435 ప్లాట్స్లో 1500 మందిపైగా నివసిస్తున్నారు.లో ఫిబ్రవరి 6న నిర్వహించిన రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోని ఒక కార్యక్రమాని దాదాపు 45 మంది సమావేశమయ్యారు. అయితే ఇందులో చాలామందికి కరోనా లక్షణాలు లేవని, కనీసం ఈ లక్షణాలతో బాధపడుతున్నట్లు కానీ, ఆస్పత్రిలో చేరిన దాఖలాలు లేవని అధికారులు పేర్కొన్నారు. మొదట ఫిబ్రవరి 10న ఈ అపార్టుమెంటులోని వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలిందని, అనంతరం అపార్టుమెంటు వాసలంతా గృహనిర్భందంలోకి వెల్లినట్లు బీబీఎమ్పీ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం అపార్టుమెంటుతో పాటు చూట్టు పరిసర ప్రాంతాల్లో శానిటైజేషన్ చేయించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ఆదివారం 513 మందికి, సోమవారం 600 మందికి కరోనా పరీక్షలు చేయించామని, ఇవాళ(మంగళవారం) మిగిలిన 300 మందికి పరీక్షలు చేయాల్సి ఉందని బీబీఎమ్పీ సీనియర్ అధికారి చెప్పారు. అనంతరం అపార్టుమెంటు సెక్రటరీ, సిబ్బందితో సమావేశమై వారు పాటించాల్సిన కోవిడ్ ప్రోటోకాల్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చెర్చించినట్లు తెలిపారు. (చదవండి: మరోసారి ఈ నగరాల్లో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు) (కరోనా వైరస్.. 7 కొత్త లక్షణాల కథ..) (యూకేకు ప్రయాణం మరింత కఠినం) -
కోవిడ్–19 కిట్ల పెళ్లి
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయి అంటారు. రాజస్థాన్లో ఓ పెళ్లి మాత్రం కోవిడ్ సెంటర్లో జరగాలని దేవతలు నిర్ణయించినట్టున్నారు. ఇటీవల రాజస్థాన్ బారాలో ఒక జంట కెల్వారా కోవిడ్ సెంటర్లో పెళ్లితో ఒక్కటయ్యింది. నవ వధువు, వరుడు, వారి తల్లిదండ్రులు, పెళ్లి జరిపించే çపురోహితుడు పిపిఇ కిట్లు ధరించి మరీ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇలాంటి పెళ్లి జరగడం దేశంలో ఇదే మొదటిదిగా చెప్పుకోవచ్చు. కరోనా మహమ్మారి కారణంగా వివాహవేడుకలపై అనేకానేక ఆంక్షలు తప్పడం లేదు. పెళ్లిళ్లలో మాస్కులు ధరించకపోయినా, ఎక్కువ సంఖ్యలో హాజరైనా, సరైన జాగ్రత్తలు తీసుకోకపోయినా పోలీసులు జరిమానాలు విధించిన సంఘటనలు చూశాం. కొన్ని పెళ్ళిళ్లలో వెయిటర్లు పిపిఇ కిట్లు ధరించడమూ చూశాం. కానీ, పెళ్లిలో వధూవరులు పిపిఇ కిట్లు ధరించడం మాత్రమే ఇప్పుడే చూస్తున్నాం. ఇందులో పెళ్లికూతురెవరో, పెళ్లికొడుకెవరో ఎత్తును బట్టి కొంత తెలుసుకోవచ్చు కానీ, మిగిలిన అతిథులలో ఎవరు ఎవరో ఎవరికీ తెలియదు. పురోహితుడంటే ప్రత్యేకంగా తెల్లసూటేసుకున్నాళ్లెండి. విషయమేమంటే.. రాజస్థాన్లోని బరాన్ జిల్లాలో ఛతర్గంజ్ గ్రామానికి చెందిన వధువుకు దంతా గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి కొన్ని రోజుల ముందు వధువు తల్లి అనారోగ్యానికి గురైంది. ఆమె కోవిడ్–19 పరీక్ష చేయించుకుంది. పాజిటివ్ అని వచ్చింది. ఆ తరువాత వధువు కూడా పరీక్ష చేయించుకుంది. పెళ్లి జరిగే రోజున వధువుకు కరోనా పాజిటివ్ అని రిజల్ట్ వచ్చింది. దీంతో వాయిదా వేయలేక అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపించాలనుకున్నారు పెద్దలు. అందుకు పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. అయితే, ఈ పెళ్లిలో వధువు, వరుడు, వారి తల్లిదండ్రులు, పురోహితుడితోపాటు మొత్తం 7 గురు పిపిఇ కిట్లు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ పెళ్లి తంతు ముగించారు. పిపిఇ కిట్లతో వివాహం జరుపుకున్న జంటగా ఈ రాజస్థానీ వధూవరులు వార్తల్లో నిలిచారు. ఈ వివాహ వేడుక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయ్యింది. -
5 రోజుల్లో 1,500 పడకల ఆస్పత్రి
బీజింగ్: బీజింగ్ దక్షిణ ప్రాంతంలో కరోనా కేసులు తిరిగి నమోదవుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం కేవలం 5 రోజుల్లోనే 1,500 పడకలుగల ఆస్పత్రిని శనివారానికి నిర్మించిందని జిన్హువా న్యూస్ ఏజన్సీ వెల్లడించింది. హెబెయ్ ప్రావిన్సుల్లో మొత్తం ఆరు ఆస్పత్రులను నిర్మించేందుకు సిద్ధం కాగా అందులో ఇది మొదటిది. మొత్తం 6,500 పడకలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 130 కొత్త కేసులు రాగా, వాటిలో 90 కేసులు హెబెయ్ ప్రావిన్సులోనే వచ్చాయి. గత శుక్రవారం నాటికి షిజాఝంనంగ్ నగరంలో కోటి కరోనా వైరస్ టెస్టులు చేసినట్లు అక్కడి మీడియా తెలిపింది. -
క్వారంటైన్కు 47 మంది టెన్నిస్ ప్లేయర్లు
మెల్బోర్న్: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్స్లామ్ టోర్నీని కరోనా వదిలేలా కనిపించడం లేదు. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ కోసం మెల్బోర్న్కు ప్రత్యేక విమానంలో వచ్చిన ముగ్గురికి తాజాగా పాజిటివ్గా తేలడంతో నిర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు. వారితో ప్రయాణించిన మొత్తం 47 మంది ప్లేయర్లను 14 రోజుల పాటు కఠిన క్వారంటైన్కు తరలించారు. క్వారంటైన్ సమయంలో ఆటగాళ్లంతా హోటల్ గదులకే పరిమితం కావాల్సిందిగా ఆదేశించారు. శనివారం లాస్ ఏంజెలిస్ నుంచి వచ్చిన విమానంలో ఇద్దరు, అబుదాబి ఫ్లయిట్లో ఒక్కరు పాజిటివ్గా తేలినట్లు ఆరోగ్య అధికారులతో పాటు, టెన్నిస్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ రెండు విమానాల్లోని ఆటగాళ్లెవరూ వైరస్ బారిన పడకపోవడం ఊరటనిచ్చే అంశం. ఫిబ్రవరి 8 నుంచి జరిగే ఈ టోర్నీ కోసం నిర్వాహకులు 15 ప్రత్యేక విమానాల ద్వారా విదేశీ ఆటగాళ్లను, సహాయక సిబ్బందిని మెల్బోర్న్కు తీసుకొస్తున్నారు. -
చెన్నై లగ్జరీ హోటల్.. కోవిడ్ హాట్స్పాట్
చెన్నై: చెన్నై నగరం గిండీలో ఉన్న లగ్జరీ హోటల్ ఐటీసీ గ్రాండ్ చోళ కోవిడ్ హాట్స్పాట్గా మారింది. ఈ హోటల్ సిబ్బందిలో 85 మందికి కోవిడ్ పాజిటివ్గా తేలడం కలకలం రేపుతోంది. గురు, శుక్రవారాల్లో హోటల్లో సేకరించిన 609 శాంపిళ్లకు గాను 85 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. వీరిని ఇళ్లకు పంపించి చికిత్స అందజేస్తున్నామన్నారు. ఈ పరిణామంతో ఉలిక్కి పడ్డ మునిసిపల్ అధికారులు నగరంలోని 25 లగ్జరీ హోటళ్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడంతోపాటు వాటి సిబ్బంది, అతిథులందరికీ పరీక్షలు చేపట్టారు. గ్రాండ్ చోళ చెఫ్ ఒకరికి డిసెంబర్ 15వ తేదీన మొదటిసారిగా కోవిడ్గా తేలింది. ఈ హోటల్కు సమీపంలోనే ఉన్న మద్రాస్ ఐఐటీకి చెందిన 200 మంది విద్యార్థులు ఇటీవల కరోనా బారినపడ్డారు. -
మంత్రి పువ్వాడ అజయ్కు కరోనా..
సాక్షి, హైదరాబాద్: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మంగళవారం ట్విటర్లో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారు ఐసోలేషన్కు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం అయన ఆరోగ్యం బాగానే ఉందని స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నట్లు మంత్రి ట్వీటర్లో పేర్కొన్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు 2,78,599 సంఖ్యకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 2,69,828 మంది డిశ్చార్జ్ కాగా.. 1,499 మంది మృతి చెందారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 7,272 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ తాజా నివేధికలో వెల్లడించింది. -
ఫార్ములా వన్ చాంపియన్ హామిల్టన్కు కరోనా
మనమ: కరోనా వైరస్ సామాన్యుల నుంచి సెలబ్రిలను సైతం వదలడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది దేశాధినేతలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు, బడా వ్యాపావేత్తలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ కూడా కరోనా బారిన పడ్డాడు. ఆదివారం బహ్రెయిన్లో జరిగిన 11వ గ్రాండ్ ప్రిని సొంతం చేసుకున్న హామిల్టన్కు కరోనా సోకడంతో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆయనలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హామిల్టన్ ఆరోగ్యం బాగానే ఉందని మెర్సిడెజ్ ఏఎంసీ పెట్రొనాస్ టీం తెలిపింది. అయితే త్వరలో జరిగే సాఖిర్ గ్రాండ్ ప్రికి హామిల్టన్ దూరమవుతున్నట్లు టీమ్ వెల్లడించింది. కాగా 7 సార్లు ఫార్ములా వన్ చాంపియన్గా నిలిచిన హామిల్టన్ రేసింగ్లో చరిత్ర సృష్టించాడు. అయితే ఆయనకు గత వారంలో మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా ప్రతిసారి నెగెటివ్ వచ్చింది. ఈ తరుణంలో ఆదివారం కూడా ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఆయనకు కరోనా పాజిటివ్గా తెలింది. దీంతో హామిల్టన్ ప్రస్తుతం బహ్రెయిన్లోనే ఐసొలేషన్లో ఉన్నాడు. కాగా ఆయనలో స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని, ఎలాంటి ఇబ్బంది లేదని టీమ్ సభ్యులు తెలిపారు. -
మణిపూర్ సీఎం బిరెన్ సింగ్కు కరోనా
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బిరెన్ సింగ్కు కరోనా వైరస్ పాజిటివ్గా తెలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్బుక్లో ఆదివారం ప్రకటించారు. దీంతో ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారు ఐసోలేషన్కు వెళ్లాలని సూచించారు. ‘ఫ్రెండ్స్ నాకు కరోనా పాజిటివ్గా తెలింది. కొన్ని రోజులుగా నేను కరోనా లక్షణాలతో బాధపడుతున్న. ఈ నేపథ్యంలో ఆదివారం కోవిడ్ పరీక్షలు చేసుకోగా పాజిటివ్ వచ్చింది. కావున ఇటీవల నన్ను కలిసి వారంతా కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని, క్వారంటైన్లో ఉండాలని విజ్ఞప్తి’ అంటూ సీఎం తన పోస్ట్లో రాసుకొచ్చారు. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఆరు కరోనా మృతి కేసులు నమోదు కాగా మరణాల సంఖ్య 213కు చేరుకున్నట్లు ఆరోగ్య శాఖ తాజా హల్త్ బులెటిన్లో వెల్లడించింది. (చదవండి: ప్రముఖ నటుడు కన్నుమూత) -
చిరంజీవి కోసం లారెన్స్ ప్రత్యేక పూజ
చెన్నై: కరోనా బారిన పడిన మెగాస్టార్ చిరంజీవి త్వరగా కోలుకోవాలని అభిమానులు గుళ్లో పూజలు చేస్తున్నారు. అదే విధంగా సినీ ప్రముఖులు సైతం ఆయన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ కూడా చిరంజీవి మహమ్మారి నుంచి త్వరగా బయటపడాలని ఆకాంక్షిస్తూ గురువారం ట్వీట్ చేశారు. ఇందుకోసం తన ఇష్టదైవమైన రాఘవేంద్ర స్వామిని వేడుకుంటున్న ఫొటోను ట్విటర్లో పోస్టు చేస్తూ.. ‘అందరికి శుభ గురువారం.. ఈ రోజు మా గుడిలో ప్రత్యేక పూజ జరిగింది. చిరంజీవి అన్నయ త్వరలో కరోనాను జయించాలని రాఘవేంద్ర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజ నిర్వహించాను. ఆయన తొందరగా మహమ్మారి నుంచి పూర్తి ఆరోగ్యంతో బయటపడాలని స్వామిని గట్టిగా వేడుకున్నా’ అంటూ చేతులు జోడించిన మూడు ఎమోజీను జత చేశారు. అయితే తమిళనాడులోని తిరువళ్లే ప్రాంతంలో ఆయన సొంత ఖర్చులతో రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. (చదవండి: టైటిల్లో మార్పులు.. కొత్త పోస్టర్ విడుదల) Happy Thursday everyone! Today a special pooja is happening at my temple for Chiranjeevi annaiya to recover soon from covid. I pray ragavendra swamy for his speed recovery 🙏🏼🙏🏼 @KChiruTweets pic.twitter.com/EFaoxhJjct — Raghava Lawrence (@offl_Lawrence) November 12, 2020 ప్రస్తుతం రాఘవ లారెన్స్ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెలుగు ‘కాంచన’ మూవీని హిందీలో ‘లక్ష్మిబాంబ్’ పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫాం నవంబర్ 7 విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కాగా లాక్డౌన్ అనంతరం తిరిగి షూటింగ్లు ప్రారంభం కావడంతో చిరంజీవి తన తాజా చిత్రం ‘ఆచార్య’ షూటింగ్లో తిరిగి పాల్గొనేందుకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఈ పరీక్షలో తనకు కోవిడ్ పాజిటివ్ తెలిందని, ప్రస్తుతం తను హోంక్వారంటైన్లో ఉన్నానని వెల్లడిస్తూ గతవారం ట్వీట్ చేసిన విషయం తెలిసందే. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేకపోయిన కరోనా పాజిటివ్ వచ్చిందని, ఇటీవల కాలంలో ఆయనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలిందిగా చిరంజీవి సూచించారు. (చదవండి: పాజిటివ్... కానీ లక్షణాలు లేవు) -
క్వారంటైన్లో డబ్ల్యూహెచ్వో చీఫ్
జెనీవా: కరోనా సోకిన వ్యక్తిని కలిసిన కారణంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియేసస్ డబ్ల్యూహెచ్వో నిబంధనల ప్రకారం తాను క్వారంటైన్లో ఉంటున్నట్టు ట్విట్టర్లో వెల్లడించారు. అయితే తనకు ఎటువంటి లక్షణాలు లేవని టెడ్రోస్ తెలిపారు. టెడ్రోస్ కలిసిన కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎవరో ఆయన వెల్లడించలేదు. ఐక్యరాజ్యసమితికి చెందిన డబ్ల్యూహెచ్వో జెనీవా కేంద్రంగా పనిచేస్తోంది. ఐదు లక్షల జనాభా గలిగిన జెనీవాలో రోజుకి 1000 కొత్త కరోనా కేసులు నమోదౌతున్నాయి. జెనీవాలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో ఆదివారం కఠిన ఆంక్షలు విధించారు. ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కోవిడ్ని కట్టడి చేసే కర్తవ్యనిర్వహణలో టెడ్రోస్ ముందుభాగాన ఉండి పోరాడుతున్నారు. రానున్న రోజుల్లో డబ్ల్యూహెచ్వో నియమాల ప్రకారం ఇంటి నుంచే పనిచేస్తానని టెడ్రోస్ వెల్లడించారు. కోవిడ్ని దాచిన బ్రిటన్ యువరాజు బ్రిటన్ యువరాజు విలియమ్స్కు ఏప్రిల్లో కరోనా సోకినప్పటికీ దాన్ని రహస్యంగా ఉంచారని, అప్పటికే ఆయన తండ్రి ప్రిన్స్ చార్లెస్ కోవిడ్తో క్వారంటైన్లో ఉన్నారని, అందుకే సన్నిహితులెవ్వరూ బాధపడకూడదని ఎవ్వరికీ చెప్పలేదన్న విషయాన్ని బ్రిటన్ మీడియా బయటపెట్టింది. బ్రిటిష్ సింహాసనాన్ని అధిష్టించే వరుసలో రెండో స్థానంలో ఉన్న ప్రిన్స్ విలియమ్స్కి కోవిడ్ సోకడంతో ప్రభుత్వ నియమాలను అనుసరించి, ప్యాలెస్లోని వైద్యులు తూర్పు ఇంగ్లాండ్లోని నార్ఫోల్క్లోని సొంత ఇంటిలో క్వారంటైన్లో ఉంచి వైద్యం అందించినట్లు మీడియా పేర్కొంది. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఏప్రిల్లో దాదాపు 14 టెలిఫోన్ కాల్స్, వీడియో కాల్స్ని యువరాజు మాట్లాడారని, బర్టన్లోని క్వీన్స్ ఆసుపత్రికి చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ వర్కర్స్తో మాట్లాడారని ఆ కథనం పేర్కొంది. యువరాజు కరోనా వైరస్తో తీవ్రంగా ప్రభావితం అయ్యారని లండన్లోని ఇంటికే పరిమితమయ్యారని ఆ కథనం పేర్కొంది. భారత్లో కొత్త కేసులు 45 వేలు దేశంలో గత 24 గంటల్లో 45,231 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,29,313కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 496 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,22,607కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 75,44,798కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 5,61,908 గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 6.83 శాతం ఉన్నాయి. కరోనా రోగుల రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 91.68 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల శాతం 1.49గా ఉంది. గత 24 గంటల్లో సంభవించిన కరోనా మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 113 మంది మరణించారు. ఈ నెల 1 వరకూ 11,07,43,103 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఆదివారం మరో 8,55,800 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది. -
రొనాల్డో మళ్లీ ‘పాజిటివ్’
ట్యూరిన్ (ఇటలీ): మేటి ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డోను కరోనా వదలడం లేదు. అతనికి మూడోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ కోవిడ్–19 పాజిటివ్గా తేలాడు. చాంపియన్స్ లీగ్లో యువెంటస్ (ఇటలీ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఈ పోర్చుగల్ స్టార్ ఫార్వర్డ్కు మంగళవారం సాయంత్రం పరీక్షలు నిర్వహించగా అతనిలో ఇంకా వైరస్ లక్షణాలు ఉన్నాయని తేలింది. దాంతో బుధవారం రాత్రి చాంపియన్స్ లీగ్ గ్రూప్ ‘జి’లో భాగంగా స్టార్ ప్లేయర్ లయెనల్ మెస్సీ ప్రాతినిధ్యం వహిస్తోన్న బార్సిలోనా క్లబ్ జట్టుతో జరిగిన మ్యాచ్కు రొనాల్డో దూరమయ్యాడు. రెండు వారాల క్రితం వైరస్ బారిన పడిన రొనాల్డో ప్రస్తుతం ఇటలీలో ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. చదవండి: ‘కరోనా వైరస్’ ఓ పెద్ద మోసం: రొనాల్డో సోదరి