-
కాలువలతో చెరువుల అనుసంధానం
సాక్షి, అమరావతి: రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర తదితర కరువు ప్రాంతాల్లో కాల్వల ద్వారా చెరువులను అనుసంధానం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఉండాల్సిన చోట చెరువులు ఉన్నాయా? లేవా? ఉన్న చెరువుల పరిస్థితి ఏంటి? వాటికి నీరు చేరడంలో ఉన్న ఇబ్బందులు, తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని చెప్పారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు లాంటి ఆర్థిక సంస్థల సహాయంతో ఈ ప్రాజెక్టు కింద పనులను పరుగులు పెట్టించాలని సూచించారు. విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో (ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్) రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరువు ప్రాంతాల్లో చెరువులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. అవసరమైన చోట చెరువులు లేకపోతే.. అక్కడ కొత్తగా చెరువులు నిర్మించాలని ఆదేశించారు. ఈ చెరువులన్నింటికీ గ్రావిటీ ద్వారా నీరు ప్రవహించేలా కాల్వలతో అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. దీనివల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని, పర్యావరణ సమతుల్యత కూడా ఉంటుందన్నారు. చెరువు కింద చక్కగా భూముల సాగు జరుగుతుందని, వ్యవసాయం బాగుండడంతో ఉపాధి, ఆదాయాలు కూడా స్థిరంగా ఉంటాయని తెలిపారు. ఆ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెరగాలి విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో వివిధ రంగాలలో చేపట్టిన ప్రాజెక్టుల పనుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్ధేశిత సమయంలోగా ఆయా ప్రాజెక్టుల పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. న్యూ డెవలప్మెంట్ (ఎన్డీబీ)బ్యాంకు, ఏసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్బీ.. తదితర బ్యాంకుల రుణ సహాయంతో మొత్తం 10 ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25,497.28 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా గత చంద్రబాబు ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిపోయిన వంతెనల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్లును వెంటనే పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. పోర్టుల పరిధిలో సత్వర అభివృద్ధి రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడుల్లో మూడు పోర్టులు కడుతున్నామని, వీటి చుట్టుపక్కల అభివృద్ధి జరిగే అవకాశాలు బాగా ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాటి పరిధిలో ల్యాండ్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం అన్నది చాలా అవసరం అని స్పష్టం చేశారు. దీనివల్ల పోర్టు ఆధారితంగా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పరిశ్రమల శాఖ డైరెక్టర్ జి సృజన, ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీ పి రాజాబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబు ఎయిర్పోర్ట్ నిర్మించడమేంటి.. వినేవాడుంటే బాబు ఏదైనా చెప్తారు: కొడాలి నాని ఫైర్ -
400 ఏళ్ల క్రితమే పక్కా ప్లాన్తో బెంగళూరు నిర్మాణం.. నేటి దుస్థితికి కారణాలేంటి?
చెరువుల నగరంగా ఒకప్పుడు పేరున్న బెంగళూరులో ఆ చెరువులు, వాటి అనుబంధ కాలువలు ప్రభుత్వ నిర్మాణాలకు, కబ్జాల వల్ల అదృశ్యమైపోయాయి. ఫలితంగా వర్షాలు వస్తే ఆ నీరు ఒకప్పుడు జల వనరులు ఉన్న చోటికే వెళ్తోంది. చివరికి ముంపు తయారవుతోంది. దీనివల్ల లక్షలాది జీవితాలు అవస్థల పాలయ్యాయి. బెంగళూరు: నాలుగు వందల ఏళ్ల కిందటే నాడప్రభు కెంపేగౌడ పకడ్బందీ ప్రణాళికతో నిర్మించిన చారిత్రక నగరం బెంగళూరు నేడు మామూలు వర్షానికే గజగజ వణికిపోవడం చూస్తే పరిస్థితి ఎంత దుర్భరంగా తయారైందో ఇట్టే అర్థమవుతుంది. నగరంలో పకడ్బందీగా ఉన్న రాజ కాలువలు వారూ వీరూ అని తేడా లేకుండా ఆక్రమణలకు పాల్పడి ఇళ్లు, భవనాలు కట్టేయడం, చెరువులను చదును చేసి లేఔట్లు నిర్మించడం వల్ల నైసర్గిక స్వరూపాలే మారిపోయి విపత్తులు పుట్టుకొస్తున్నాయి. ఉన్న చెరువులు, కాలువల్లో కూడా పూడిక పెరిగిపోయింది. వాతావరణ మార్పుల వల్ల ఆకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడం మరో కారణం. వర్షపు నీరు రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోకి చొరబడటంతో ముంపు తలెత్తుతోంది. బెల్లందూరు చెరువు దుస్థితి బెంగళూరు నగరంలో చెరువుల స్థానంలో నిర్మించిన కట్టడాల వివరాలు ►శూలె చెరువులో ఇప్పుడు ఫుట్బాల్ స్టేడియం నిర్మాణమైంది. అక్కితిమ్మనహళ్లి చెరువు– హాకీ స్టేడియంగా, సంపంగి చెరువు –కంఠీరవ స్పోర్ట్ కాంప్లెక్సా్గ, ధర్మాంబుధి చెరువు–కెంపేగౌడ బస్టాండుగా, చల్లఘట్ట చెరువు–కర్ణాటక గోల్ఫ్ మైదానంగా మారిపోయాయి. ►కోరమంగల చెరువు– నేషనల్ గేమ్స్ కాంప్లెక్స్ మైదానం, సిద్దికట్టె చెరువు–కేఆర్.మార్కెట్గా, కారంజీ చెరువు–గాంధీ బజార్, కెంపాబుధి చెరువు–భూగర్భ డ్రైనేజీ సేకరణ ట్యాంక్గా మారిపోయాయి. ►నాగశెట్టిహళ్లి చెరువు– స్పేస్ డిపార్టుమెంట్, కాడుగొండనహళ్లి చెరువు–అంబేడ్కర్ మెడికల్ కాలేజీ, దుమ్మలూరు చెరువు–బీడీఏ లేఔట్, మిల్లర్స్ చెరువు–గురునానక్ భవన్ అయ్యాయి, ►సుభాష్ నగర చెరువు, కురబరహళ్లి చెరువు, కోడిహళ్లి చెరువు, సినీవాగిలు చెరువు, మారేనహళ్లి చెరువులు నేడు నివాస ప్రాంతాలుగా మారాయి. ►శివనహళ్లి చెరువు–క్రీడా మైదానం, బస్టాండుగా రూపాంతరం చెందాయి. ►చెన్నమనచెరువు –స్మశానం, పుట్టేనహళ్లి చెరువు– జేపీ నగర 6వ ఫేజ్, జక్కరాయనచెరువు – క్రీడా మైదానం అయ్యింది. మారతహళ్లిలో బోటులో వెళ్తున్న జనం నగరానికి ఏటా రూ.20 వేల కోట్లు ఖర్చు ప్రతి ఏడాది బెంగళూరు నగరాభివృద్ధి నిర్వహణ, అభివృద్ధి పనుల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ వరద ముంపు సమస్యను తప్పించడం సాధ్యం కావడం లేదు. బీబీఎంపీ బడ్జెట్ సుమారు రూ.11 వేల కోట్లు కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరో రూ.10 వేల కోట్ల నిధులు లభిస్తాయి. ఇలా ప్రతి ఏడాది రూ. 20 వేల కోట్లను బెంగళూరుపై ఖర్చు చేసినప్పటికీ ప్రజల సమస్యలు అలాగే ఉంటున్నాయి. ఒకనాటి పొలాలు, చిట్టడవులు మాయం ►అందుకే ఇంత ముప్పు! ప్రకృతిని కాపాడుకోకపోవడమే ఈ వరద ముంపునకు కారణమని పర్యావరణవాదులు పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షంతో జలమయమైన బెంగళూరులోని లేఔట్లు గతంలో పొలాలు, చెరువులు, అచ్చుకట్ట ప్రాంతాలు, చిట్ట అడవులతో కూడుకున్న ప్రదేశాలు. గత పది, ఇరవై ఏళ్లలో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో భారీఎత్తున లేఔట్లు, కట్టడాలు, రోడ్లు నిర్మించారు. ఇప్పుడు కుండపోత వర్షాలకు చెరువుల్లా తయారయ్యాయి. ఏ ప్రాంతంలో ముందు చెరువు ఉండేది, ఎక్కడ రాజ కాలువ ఉండేది అనేదానిని ప్రస్తుత ముంపు చాటిచెబుతోందని పరిసరవాదులు అభిప్రాయపడ్డారు. రెయిన్ బో లేఔట్లో తీరని ముంపు కష్టం ప్రధానంగా బెల్లందూరు, వర్తూరు, విభూతిపుర, సావళచెరువు, బేగూరు చెరువు చుట్టుపక్కల లేఔట్లు ప్రస్తుతం భారీ వర్షాలతో జలంలో చిక్కుకున్నాయి. ఈ చెరువుల విస్తీర్ణం గత 40 ఏళ్లతో పోలిస్తే సగానికి సగం తగ్గిపోయింది. ఈ చెరువులకు వెళ్లే రాజ కాలువలపై కట్టడాలు వెలిశాయి. అక్రమ కట్టడాలను తొలగించాల్సిన ప్రభుత్వం సక్రమ పథకంతో అనుకూలం చేయడం ప్రకృతికి మంచి చేయదని పరిసరవాది యల్లప్పరెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
చెరువులకు చేవ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాన నీటిని ఒడిసిపట్టేందుకు ప్రభుత్వం చెరువులకు ఊపిరిపోస్తోంది. ఇప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు చేయడం.. అవసరమైతే కొత్తవి నిర్మించడానికి పూనుకుంది. కేంద్ర జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా ‘క్యాచ్ ది రెయిన్’ (వర్షపు నీటిని ఒడిసిపడదాం) పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమం సందర్భంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉండే అన్ని రకాల చెరువుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. వాగుల మధ్య చెక్ డ్యాంలను నిర్మించి కనీసం ఎకరం విస్తీర్ణంలో నీటిని నిల్వ ఉంచే అవకాశం ఉన్నవి మొదలుకొని మైనర్ ఇరిగేషన్ విభాగం పరిధిలో ఉండే పెద్దపెద్ద చెరువులను ఒక్కొక్క వాటర్ బాడీ (నీటిని నిల్వ ఉంచే చెరువు)గా వర్గీకరించగా.. అలాంటివి మొత్తం 1,90,726 ఉన్నట్లు గుర్తించారు. ప్రతీ వాటర్ బాడీ ఎంత విస్తీర్ణంలో ఉందన్న సమాచారంతో పాటు రేఖాంశాలు, అక్షాంశాలతో కూడిన శాటిలైట్ గణాంకాల ప్రకారం అధికారులు జియో ట్యాగింగ్ చేశారు. ఆ వివరాలన్నింటినీ ఆన్లైన్లో పొందుపరిచారు. ఇక రాష్ట్రంలో మొత్తం 13,371 గ్రామ పంచాయతీలతో పాటు 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీలు ఉన్నాయి. అంటే ప్రతి ఊరిలో సరాసరి 10–14 వరకు ఈ తరహా చెరువులున్నాయి. అత్యధికంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 50 వేల వరకు ఉండగా, అత్యల్పంగా ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలో నాలుగేసి వేలకు లోపునే ఉన్నాయి. ప్రస్తుతం పురోగతిలో 74,722 పనులు ఇక రాష్ట్రంలో అందుబాటులో ఉన్న చెరువులను సద్వినియోగం చేసుకునేందుకు వీలైనంత ఎక్కువ మొత్తంలో వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అన్ని శాఖలకు సంబంధించి వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా మొత్తం రూ.3,970 కోట్లతో వర్షపు నీటి నిల్వకు ఉపయోగపడే పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. చెరువుల్లో పూడికతీత, చెరువు కట్టలు బలోపేతం, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టడం వంటి 74,722 పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు తెలిపారు. అమృత్ సరోవర్లలో రాష్ట్రం రెండోస్థానం.. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ‘అమృత్ సరోవర్’ పేరిట వచ్చే ఏడాది కాలంలో ప్రతి జిల్లాలో కనీసం 75 చెరువుల చొప్పున కొత్తవి ఏర్పాటుచేయడం.. లేదా పాతవాటిని అభివృద్ధి చేయడం చేయాలని.. వీటిలో 20 శాతం మేర ఈ ఆగస్టు 15కే పూర్తిచేయాలని రాష్ట్రాలకు కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. వీటిలో ఇప్పటికే 20 శాతం కంటే ఎక్కువగా అంటే 519 చెరువులను అభివృద్ధిచేసి దేశంలోనే రెండో స్థానంలో నిలిచినట్లు అధికారులు వెల్లడించారు. -
కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తూ.. సడన్గా నది దగ్గర ఆగి..
మాలూరు(బెంగళూరు): కళాశాల ముగించుకుని తిరిగి ఇంటికి బయల్దేరిన ఇద్దరు విద్యార్థినులు కాలువలోకి దూకారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. ఈఘటన బెంగుళూరు రూరల్ జిల్లా ముగళూరు గ్రామం వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మృతురాలిని బెంగుళూరు రూరల్ జిల్లా హొసకోట తాలూకా బాగూరు గ్రామానికి చెందిన రాజప్ప కుమార్తె ఆర్.రాజేశ్వరి(17)గా గుర్తించారు. గల్లంతైన విద్యార్థిని సుప్రియ(17)ను మాలూరు తాలూకా కోడూరు గ్రామ పంచాయతీకి చెందిన మునియప్ప, లక్ష్మమ్మల కుమార్తెగా గుర్తించారు. ఆమె కోసం గాలిస్తున్నారు. ఎం.సుప్రియ, రాజేశ్వరిలు చదువుల్లో ప్రతిభావంతులు. మంగళవారం ఉదయం ఎప్పటిలానే కళాశాలకు వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు ఇంటికి వెళ్లాల్సి ఉండగా బెంగుళూరు రూరల్ జిల్లా ఆనేకల్ తాలూకా ముగళూరు సమీపంలో ప్రవహించే దక్షిణ పినాకిని నది కాలువ వద్దకు వెళ్లారు. సమీపంలోని బేకరిలో తినుబండారాలు కొన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో కాలువలోకి దూకారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అనుగొండనహళ్లి ఎస్ఐ సంగమేష్, అగ్నిమాపక సిబ్బంది వెళ్లి గాలించగా రాజేశ్వరి విగతజీవిగా కనిపించింది. మంగళవారం రాత్రి 9 గంటల వరకు కార్యాచరణ జరిపినా సుప్రియ ఆచూకీ కనిపించలేదు. తిరిగి బుధవారం ఉదయం నుంచి గాలిస్తున్నా జాడ తెలియలేదు. ఎమ్మెల్యే నంజేగౌడ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలన జరిపారు. వీరిద్దరూ కాలువలోకి దూకడానికి దారితీసిన కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. సూసైడ్ నోట్ లభ్యం మన పెళ్లికి ఎవరూ అంగీకరించేది లేదని, నీవు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు అంటూ సుప్రియ రాసినట్లుగా చెబుతున్న లేఖ ఘటన స్థలంలో లభించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: Loan Apps: లోన్యాప్ వేధింపులకు బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య! -
నాన్నకు ప్రేమతో.. తన తండ్రి పేరు గుర్తుండిపోవాలని..
సాక్షి,నరసన్నపేట(శ్రీకాకుళం): తన తండ్రి పేరు గుర్తుండిపోయేలా.. నిత్యం అంతా గుర్తు తెచ్చుకునేలా ఓ కుమారుడు మంచి పని చేశాడు. నరసన్నపేట మండలం సత్యవరం కూడలి వద్ద జాతీయ రహదారికి ఆనుకుని 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సుసరాం చెరువును తన తండ్రి పాగోటి రాములు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు పాగోటి రాజారావు బాగు చేయించారు. పూడికతో అధ్వానంగా ఉన్న ఈ చెరువును సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. రూ.50 లక్షలకు పైగా సొంత నిధులు వెచ్చించి ఆదర్శంగా నిలిచా రు. గుర్రపు డెక్క, పూడికతో అధ్వానంగా ఉన్న ఈ చెరువును అభివృద్ధి చేయాలని సత్యవరం గ్రామస్తులు అధికారుల చుట్టూ తిరిగారు. ప్రయోజనం లేకపోయింది. వర్షాలు అధికమైతే చెరువు నీరు పొలాల మీదకు వచ్చి పంటలను నష్ట పరుస్తుండేది. ఈ దశలో చెరువును అబివృద్ధి చేయాలని రాజారావును గ్రామస్తులు కోరగా ఆయన ముందుకు వచ్చి పనులు చేపట్టారు. దీంతో చెరువు రూపురేఖలు మారిపోయాయి. రెండు నెలల కిందట అధ్వానంగా కనిపించిన చెరువు ఇప్పుడు అందంగా మారింది. అలాగే మరో రూ. 5 లక్షలు వెచ్చించి వంద అడుగుల వెడల్పుతో మెట్లు నిర్మించారు. గట్టు చుట్టూ 200 కొబ్బరి మొక్కలు వేయించారు. సత్యవరం గ్రామస్తులతో పాటు నరసన్న పేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పాగోటి రాజారావును అభినందించారు. గ్రామాల్లో దాతలు ఈ విధంగా ముందుకు వచ్చి పూడుకుపోయిన చెరువులు అభివృద్ధి చేయాలని, భూగర్భ జలాలను పెంపొందించేందుకు సహకరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కాగా ఈ చెరువులో బోట్ షికార్ చేసేందుకు పంచాయతీ ఏర్పాట్లు చేస్తోంది. రాజారావు బోట్లను సమకూర్చుతుండగా దీని నిర్వహణ బాధ్యత పంచాయతీ తీసుకుంటుందని సర్పంచ్ బూరల్లి శంకర్ తెలిపారు. చదవండి: Extramarital Affair: మహిళతో వివాహేతర సంబంధం.. కొన్నాళ్లు గడిచాక.. -
శింగనమల ప్రజల 60 ఏళ్ళ ఆకాంక్ష నెరవేరిన వేళ
-
చెరువుల తవ్వకాల్లో బయటపడ్డ ఇటుకల గోడ...అది మౌర్య సామ్రాజ్యపు..
పాట్నా: కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మిషన్ అమృత్ సరోవర్ పనుల్లో భాగంగా బీహార్లోని పాట్నాలో కుమ్రహర్ ప్రాంతంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) తవ్వకాలు చేపట్టింది. ఈ తవ్వకాల్లో ఒక పురాతనమైన గోడల అవశేషాలు బయటపడ్డాయి. ఇవి రెండు వేల ఏళ్ల నాటి మౌర్య సామ్రాజ్యపు గోడల అవశేషాలని ఆర్కియాలజిస్ట్ గౌతమి భట్టాచార్య అన్నారు. అంతేకాదు బహుశా కుషాన్ యుగం నుంచి కూడా ఉండవచ్చని చెబుతున్నారు. వాస్తవానికి మిషన్ అమృత్ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా పాట్నాలో రక్షిత చెరువులను పునరుజ్జీవింప చేసే పనులను చేపట్టామని తెలిపారు. అందులో భాగంగా ఈ తవ్వకాలు జరుపుతున్నప్పుడు చెరువులో ఈ పురాతన గోడల అవశేషాలు గుర్తించామని చెప్పారు. ఈ గోడలోని ఇటుకలు క్రీస్తు శకం 30వ శతాబ్దం నుంచి 375 కాలంలోని మధ్య ఆసియా(అంటే ప్రస్తుత ఆప్గనిస్తాన్)ని పాలించిన కుషాన్ యుగానికి చెందినవని తెలుస్తోందన్నారు. ఈ విషాయాన్ని న్యూఢిల్లీలోని ఏఎస్ఐ ప్రధాన కార్యాలయంలోని సీనియర్ అధికారులకు కూడా తెలియజేశాం అని గౌతమి పేర్కొన్నారు. ఈ మేరకు బీహార్లోని పాట్నాలో మొత్తం పదకొండు రక్షిత నీటి వనరులను పునరుజ్జీవింప పనులు చేపట్టింది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ). (చదవండి: ఈ జంట మరీ వైల్డ్! పూల దండలుగా) -
అనంతపురం: నెరవేరిన నాలుగున్నర దశాబ్దాల కల
శింగనమల రంగరాయల చెరువు ఆయకట్టుదారుల కల నాలుగున్నర దశాబ్దాలకు సాకారమైంది. చెరువుకు ఒక టీఎంసీ కృష్ణా జలాలు కేటాయిస్తూ మంగళవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీంతో ఈ ప్రాంతవాసుల కలతో పాటు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంకల్పమూ నెరవేరినట్లయ్యింది. ఆరువేల ఎకరాల్లో సాగుకు సానుకూలమైంది. రైతులు, వ్యవసాయ కూలీలే కాదు.. మత్స్యకారుల మోముల్లోనూ సంతోషం వెల్లివిరిసింది. సాక్షి,శింగనమల(అనంతపురం): శింగనమలలోని రంగరాయల చెరువు జిల్లాలోనే అతిపెద్దది. శింగనమల, గోవిందరాయునిపేట, సోదనపల్లి, ఈస్ట్ నరసాపురం, పెద్దమట్ల గొంది, చీలేపల్లి, శివపురం, సి.బండమీదపల్లి, పోతురాజుకాల్వ, చక్రాయిపేట, పెరవలి గ్రామాల వరకు అధికారిక, అనధికారికంగా దాదాపు ఆరువేల ఎకరాల ఆయుకట్టు ఉంది. చెరువులో నీరుంటే ఈ గ్రామాలతో పాటు నాయనవారిపల్లి, చిన్నమట్ల గొంది, ఆనందరావుపేట, చిన్నజలాలపురం, గురుగుంట్ల, మదిరేపల్లి, నీలాంపల్లి, పాత చెదుల్ల, కొత్త చెదల్ల, కొర్రపాడు గ్రామాల వరకు భూగర్భజలం పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చెరువును లోకలైజేషన్ చేయాలన్నది ఈ ప్రాంత రైతుల డిమాండ్. వీరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు లోకలైజేషన్ అంశాన్ని 1978 నుంచి ఎన్నికల హామీగా మార్చేశాయి. ఒకానొక దశలో టీడీపీ హయాంలో ‘లోకలైజేషన్’ జీఓ తెచ్చామని ఆ పార్టీ నాయకులు ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. అయితే ప్రజలు వారి మాటలను నమ్మలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నాలుగేళ్లపాటు శింగనమల చెరువుకు నీళ్లు వచ్చాయి. నార్పలలో నిర్వహించిన బహిరంగ సభలో ‘లోకలైజేషన్’ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆయన అకాల మరణంతో హామీ నెరవేరలేదు. కనీసం చెరువుకు నీరు విడిపించే దిక్కు లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చొరవ తీసుకుని పలు దఫాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి చెరువుకు నీరు విడుదల చేయించారు. నేటికీ నీటితో చెరువు కళకళలాడుతోంది. వైఎస్సార్ హయాంలో ఇచ్చిన హామీని.. తనయుడు సీఎం వైఎస్ జగన్ ద్వారా నెరవేర్చడంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సఫలీకృతులయ్యారు. ఏటా పంటలు శింగనమల రంగరాయల చెరువుకు ప్రతి ఏటా ఒక టీఎంసీ కృష్ణా జలాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. హంద్రీ–నీవా కాలువ ద్వారా పీఏబీఆర్, అటు నుంచి నుంచి మిడ్ పెన్నార్ (ఎంపీఆర్), అక్కడి నుంచి దక్షిణ కాలువ ద్వారా శింగనమల చెరువుకు నీళ్లు రానున్నాయి. చెరువు నీటి నిల్వ సామర్థ్యం ఒక టీఎంసీ. నీరు వదిలితే ఏటా పంటలు పండుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులకు ఉపాధి చెరువులో నీరు ఉంటే చేపల వేటకు ఢోకా ఉండదు. 300 మత్స్యకార కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి ఉన్నాయి. మత్స్యకారులకు ఎప్పుడూ చేపల వేట ఉంటుంది. తద్వారా జీవనోపాధి మెరుగుపడనుంది. ఆనందంగా ఉంది శింగనమల చెరువుకు నీటి కేటాయింపు అనేది ఎన్నో ఏళ్లపాటు హామీగానే నిలిచిపోయింది. ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు. కానీ ఎవ్వరూ నెరవేర్చలేకపోయారు. కానీ జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి మా చెరువుకు నీటిని కేటాయించడానికి ఎంతో కృషి చేశారు. చెరువు కింది ఆయకట్టు రైతులు, వ్యవసాయ కూలీలు చాలా సంతోషంగా ఉన్నారు. – గోవిందరెడ్డి, చెరువు ఆయకట్టు రైతు సంఘం నాయకులు, శింగనమల జలప్రదాత పద్మావతి శింగనమల చెరువుకు నీటి కేటాయింపునకు కృషి చేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి మత్స్యకారులు జీవితాంతం రుణపడి ఉంటారు. చెరువులో నీరు లేక ఎన్నో సంవత్సరాలు చేపల పెంపకం చేపట్టలేకపోయాం. కానీ ఎమ్మెల్యే పద్మావతి చెరువుకు నీటి కేటాయింపులు చేయించి మాకు జలప్రదాతగా మారింది. – వెంకటనారాయణ, మత్స్యకారుడు, శింగనమల మాట ఇచ్చారు.. నెరవేర్చారు దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి నార్పల బహిరంగసభలో చెరువు లోకలైజేషన్ చేస్తామని మాట ఇచ్చారు. ఆయన మృతి చెందిన తర్వాత అధికారంలోకి వచ్చిన వారు పట్టించుకోలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత చెరువు సమస్యను వివరించా. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు శింగనమల చెరువుకు ఒక టీఎంసీ నీరు కేటాయించారు. శింగనమల ప్రజల చిరకాల కోరికను నెరవేర్చాం. చాలా సంతోషంగా ఉంది. – ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, శింగనమల -
మద్యానికి బానిసైన భర్త... భార్య ఇద్దరు పిల్లలను నీటిలో ముంచి...
ఇబ్రహీంపట్నం రూరల్: ఆర్థిక ఇబ్బందులు ఓ కుటుంబాన్ని బలితీసుకున్నాయి. కుటుంబ యజమాని భార్య, ఇద్దరు పిల్లలను చెరువులో ముంచి, అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరేందర్ కథనం ప్రకారం.. హైదరాబాద్ సంతోష్నగర్కు చెందిన మహమ్మద్ ఖుద్దూస్ (37), ఫాతిమా (27) దంపతులకు మెహక్బేగం (9), ఫిర్దోస్ బేగం (6) సంతానం. వీరు అదే ప్రాంతంలోని సలావుద్దీన్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఖుద్దూస్ బడంగ్పేట్లో వెల్డింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ప్రమాదానికి గురై నడుం నొప్పితో బాధపడుతున్న ఖుద్దూస్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో సాఫీగా సాగుతున్న సంసారంలో కలతలు మొదలయ్యాయి. పైగా ఆర్థిక ఇబ్బందులు తోడవంతో భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. రెండు రోజుల క్రితం బావమరిది హమీద్ను రూ.10 వేలు అప్పు ఇప్పించాలని ఖుద్దూస్ అడగగా.. రెండు మూడు రోజుల తర్వాత చూద్దామని చెప్పాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన ఖుద్దూస్.. భార్యను,ఇద్దరు పిల్లలను షాహీనగర్కు వెళదామని చెప్పి తన ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మల్లాపూర్ చౌరస్తా నుంచి నేరుగా వెళ్లకుండా వాహనాన్ని కుర్మల్గూడ వైపు దారి మళ్లించాడు. రాత్రి 10.30 గంటల సమయంలో కుర్మల్గూడ అంతిరెడ్డి చెరువు వద్ద ద్విచక్ర వాహనం నిలిపాడు. ముందుగా పిల్లలు, భార్యను చెరువులో ముంచి, అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలను చెరువులో ముంచుతుండగా.. అరుపులు వినిపించడంతో గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తుల సహకారంతో ఖుద్దూస్, చిన్న కూతురు ఫిర్దోస్ బేగం మృతదేహాలను వెలికితీసి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మంగళవారం ఉదయం భార్య ఫాతిమా బేగం, మెహక్బేగం మృతదేహాలను బయటికి తీశారు. ఖుద్దూస్ బావమరిది హమీద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: ఫేస్బుక్ లవ్.. లవర్ కోసం నదిలో ఈది భారత్లోకి వచ్చాక.. షాకింగ్ ట్విస్ట్) -
ష్.. ఆ ఫిష్ తిన్నారో.. ఆరోగ్య సమస్యలు వద్దన్నా వస్తాయ్!
కొందరి స్వార్థం సమాజానికి హానికరంగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు గడించాలన్న దురాశ ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. ఎంతో హానికరమైన క్యాట్ ఫిష్ను ప్రభుత్వం నిషేధించినా.. చాటు మాటుగా పెంపకాలు జరుగుతూనే ఉన్నాయి. కొర్రమీను పేరుతో హోటల్స్లో ఆహార పదార్థాల విక్రయాలు చేస్తున్నారు. వీటికి ఆహారంగా కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తుండటం అనేక అనార్థాలకు దారి తీస్తోంది. మరో వైపు చెరువు పరిసర ప్రాంతాలు, భూగర్భ జలాలు కలుషితమై పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. చెరువుల గట్లపై పడిన చికెన్ వ్యర్థాలను పక్షులు తీసుకెళ్లడంతో వ్యాధులు ప్రబలే అవకాశాలు లేకపోలేదు. సాక్షి, నెల్లూరు: క్యాట్ ఫిష్.. ఇది కుళ్లిన మాంసాన్ని తిని పెరిగే చేప. కేవలం ఆరు నెలల్లోనే ఇరవై కేజీల బరువు వరకు పెరుగుతుందటే అర్ధం చేసుకోవచ్చు. ఈ చేపల పెంపకంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమవుతుంది. చేపల చెరువుల మధ్యలో చిన్న చిన్న చెరువుల్లో వీటి పెంపకాన్ని చేపట్టి కొందరు కాసులు వెనకేసుకుంటున్నారు. చేపల్లో బాగా డిమాండ్ ఉండే కొర్రమీనును పోలి ఉండే ఈ చేపలను మీసాలు పీకేసి కొర్రమీను పేరుతో ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. కిలో కోరమీను రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతుంది. క్యాట్ ఫిష్ను కిలో రూ.150లకే యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలోనే.. జిల్లాలోని పెన్నాపరీవాహక ప్రాంతంలోని కోవూరు నియోజకవర్గంలో నిషేధిత క్యాట్ఫిష్ పెంపకం చేస్తోన్నారు. కోవూరు, ఇనమడుగు, దామరమడుగు, బుచ్చిరెడ్డిపాళెం, పెనుబల్లి ప్రాంతాల్లో దాదాపు 1,500 ఎకరాల్లో మంచినీటి చేపల పేరుతో క్యాట్ఫిష్ పెంపకం చేస్తున్నట్లు తెలిసింది. వీటిని దొడ్డిదారిన జిల్లాతో పాటు చెన్నై, బెంగళూరు నగరాలకు రవాణా చేస్తున్నారు. కొర్రమీను పేరుతో.. క్యాట్ ఫిష్ చూసేందుకు కొర్రమీనును పొలి ఉంటుంది. కొర్రమీనులో ఒకే ముల్లు ఉంటుంది. కానీ క్యాట్ ఫిష్లో ముళ్లే ఉండవు. చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయనే వైద్యులు, డైటిషియన్ల సూచనలతో చాలా మంది చేపలను తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే పెద్ద పెద్ద నగరాల్లో దుకాణాల్లోనే కాకుండా సాధారణ, స్టార్ హోటళ్లలో కొర్రమీను పేరుతో క్యాట్ ఫిష్ను విక్రయిస్తున్నారు. ఖర్చు తగ్గుతుందని.. చేపలకు ఆహారంగా తవుడు, సోయాబీన్ తదితర వాటితో ఉత్పత్తి చేసిన మేతను వాడతారు. ఇది కిలో ధర రూ.28 నుంచి రూ.30 వరకు మధ్య ఉంటుంది. మేత ద్వారా కిలో చేపను పెంచడానికి సుమారు రూ.55 వెచ్చించాల్సి ఉంటుంది. అదే కోళ్ల వ్యర్థాలు చికెన్ సెంటర్ల నుంచి కిలో రూ.10 వంతున కోనుగోలు చేసి వీటి ద్వారా చేప పెంచడానికి రూ.25 సరిపోతుండడంతో కోళ్ల వ్యర్థాలను వాడుతున్నారు. ముఖ్యంగా క్యాట్ ఫిష్లు త్వరగా పెరగాలన్నా.. బరువు రావాలన్నా.. మాంసం వ్యర్థాలనే వినియోగిస్తున్నారు. మాంసం వ్యర్థాలనే క్యాట్ ఫిష్లు బాగా తింటాయి కాబట్టి ఆహారంగా వేస్తున్నారు. వ్యర్థాలే మేత ఈ చేపలకు కోళ్ల వ్యర్థాలే మేతగా ఉపయోగిస్తున్నారు. జిల్లాలో లభించే వ్యర్థాలతో పాటు చిత్తూరు, తిరుపతి, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి వ్యర్థాలు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్లాస్టిక్ డమ్ముల్లో నింపి ఆటోలు, లారీల్లో చేపల గుంతల వద్దకు తరలించి మేతగా వేస్తున్నారు. కిలో వ్యర్థాన్ని రూ.8 నుంచి రూ.10 వంతున కొనుగోలు చేసి మేతగా వినియోగిస్తున్నారు. 2016 లో రాష్ట్ర ప్రభుత్వం కోళ్ల వ్యర్థాలను చేపల చెరువులకు మేతగా వేయడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. క్యాట్ ఫిషతో అనర్థాలు ఈ చేపలను తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్యాట్ ఫిష్లో ఉండే ఒమేగా ఫ్యాట్ 6 ఆమ్లాలతో నరాల వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా కేన్సర్ ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ రకం చేప దవడ కింద ఉండే ముల్లు తింటే ప్రాణాలకే ప్రమాదమని చెబుతున్నారు. అయితే అధికారుల పర్యవేక్షణ లోపంతో వీటి పెంపకం, అమ్మకాలు జరిగిపోతున్నాయి. ఒక వైపు కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగనిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు చేపలను తినాలని వైద్యులు చెబుతుండగా ఇలా కొర్రమీను పేరుతో క్యాట్ ఫిష్ను విక్రయాలు భారీగా పెరిగాయి. అధికారులకు తెలిసినా నిషేధిత క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నారని, కోళ్ల వ్యర్థాలు వినియోగిస్తున్నట్లు తరచూ పోలీసు దాడులు ద్వారా తెలిసినా మత్స్యశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కోవూరు ప్రాంతంలో జరుగుతున్న క్యాట్ ఫిష్ సాగు పక్కా సమాచారం ఉన్నా.. వారు తెలియనట్లు నటి స్తున్నారన్న ఆరోపణలున్నాయి. క్యాట్ ఫిష్ సాగుదారులు అధికారులకు మామూళ్లు సమర్పించుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. చర్యలు తీసుకుంటాం క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే తప్పక చర్యలు తీసుకుంటాం. చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలు వాడకూడదనే ఆదేశాలున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కోళ్ల వ్యర్థాలు వాడితే గరిష్టంగా రూ. 50 వేలు వరకు జరిమానా విధించే అధికారం మత్స్యశాఖ అధికారులకు ఉంది. రెండో సారి పునరావృతం చేస్తే సాగుదారుల లైసెన్స్ రద్దు చేసి సరుకు స్వాధీనం చేసుకుంటారు. ఎక్కడైనా క్యాట్ ఫిష్ సాగవుతున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – నాగేశ్వరరావు, జేడీ, మత్స్యశాఖ చదవండి: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రప్రథమం... భూవివాదాలకు చెక్..! -
‘నాన్న.. దుబాయ్ నుంచి రాంగ సెల్ఫోన్ తీసుకురా అన్నావే’
సాక్షి,ధర్మపురి: ‘నాన్న.. దుబాయ్ నుంచి రాంగ సెల్ఫోన్, టీవీ తీసుకురా.. ఇక్కడ చెల్లె నేను మంచిగ చదువుకుంటున్నం అంటూ రోజూ ఫోన్లో మాట్లాడినవు.. నీ మాటలు దూరమయ్యాయి. బిడ్డా నువ్వు వెళ్లిపోయావా.. దుబాయ్ నుంచి నీ కోసం అచ్చిన లే బిడ్డా’.. అంటూ తండ్రి కిషన్.. ‘మరో మూడు నెలల్లో రావాలని అనుకుంటే నాన్నను ఇప్పుడే నీ దగ్గర కు రప్పించుకున్నావా కోడుకా’.. అంటూ తల్లి పుష్పలత రోదించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. మండలంలోని తుమ్మెనాల చెరువులో ఆదివారం ఈత కోసం వెళ్లి ముగ్గరు చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్న విసయం తెలిసిందే. చివరిచూపు కోసం.. చెరువులో ఆదివారం మృతిచెందిన మారంపెల్లి శరత్, పబ్బతి నవదీప్ల మృతదేహాలను తుమ్మెనాలలో బాడీ ప్రీజర్లలో భద్రపరిచారు. సోమవారం మధ్యాహ్నం మృతుడు శరత్ మృతదేహానికి తండ్రి సతీశ్ దహన సంస్కారాలు నిర్వహించాడు. ఈక్రమంలో మంగళవారం నవదీప్కు తుమ్మెనాల గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. దుబాయ్ నుంచి తండ్రి కిషన్ కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించాడు. తల్లిదండ్రులకు తలకొరివి పెట్టాల్సిన కొడుకుకే తండ్రి తలకొరివి పెట్టడం అందరినీ కంటతడి పెట్టించింది. చదవండి: Bholakpur Corporator: పోలీసులకు వార్నింగ్.. కేటీఆర్ సీరియస్.. ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్ -
‘కొడుకా.. ఎంత పని జేత్తివి బిడ్డా.. ’
సాక్షి,ధర్మపురి(కరీంనగర్): ‘కొడుకా.. ఒక్కగానొక్కడివి.. అల్లారు ముద్దుగా పెంచితిమి.. మంచి సదువులు సదివి ముసలోల్లమయ్యాక మమ్మల్ని సాకుతవని ఆశపడ్తిమి.. నీ మీద ఎన్నో కలలు కంటిమి.. మధ్యల నువ్ గిట్ల జేత్తివి బిడ్డా.. ఇక మేం ఎవరి కోసం బతుకుడు బిడ్డా’ అంటూ మారంపెల్లి శరత్ తండ్రి మారంపెల్లి సతీశ్ రోదించిన తీరు కంటతడి పెట్టించింది. తుమ్మెనాలకు చెందిన మారంపెల్లి శరత్(12,) పవ్బం నవదీప్(12), యాదాద్రి భువనగిరి జిల్లా దాసారం గ్రామానికి చెందిన గొలుసుల యశ్వంత్(13) ఆదివారం ఈతకోసమని పాఠశాల సమీపంలోని చెరువులోకి వెళ్లి నీట మునిగి చనిపోయిన విషయం విదితమే. కన్నకొడుకు చనిపోయాడనే సమాచరం అందుకున్న సతీశ్.. బెహరాన్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. స్వగ్రామంలో ఉపాధి లేక, కొడుకు, భార్యను సాకేందుకని సురేశ్ 4నెలల క్రితమే బెహరాన్ వెళ్లాడు. అతడి భార్య రజిత గ్రామంలో కూలీ పనులు చేస్తూ కొడుకును అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. మరో ఇద్దరు మిత్రులతో కలిసి ఈత కోసం చెరువులోకి వెళ్లి కొడుకు మృతి చెందడంతో ఆమె కలలు కల్లలయ్యాయి. బెహరాన్ నుంచి వచ్చిన సురేశ్.. ప్రీజర్లో ఉంచిన కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. కుమారుడి చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తిచేశాడు. ఉపాధ్యాయుల సంతాపం ముగ్గురు విద్యార్థుల మృతికి ప్రధానోపాధ్యాయుడు గాదె శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాఠశాలలో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. విషాదంలో నవదీప్ కుటుంబం.. కిషన్ – పుష్పలత దంపతులకు కుమారుడు పబ్బతి నవదీప్, ఓ కూతురు ఉంది. కిషన్ ఉ పాధి కోసం విదేశాలకు వెళ్లాడు. అతడు మంగళవారం స్వగ్రామానికి వచ్చే అవకాశం ఉంది. నవదీప్ మృతదేహాన్ని ఫ్రీజర్లో ఉంచా రు. తండ్రి వచ్చాక అంత్యక్రియలు పూర్తిచేస్తారు. మృతి చెందిన మరో విద్యార్థి గొలు సుల యశ్వంత్ మృతదేహాన్ని స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లాకు తీసుకెళ్లారు. చదవండి: దొంగతనం కేసు.. సెల్ఫీ వీడియో తీసి.. -
చెరువు మెరిసి.. చేను మురిసి!
2021–22వ సంవత్సరానికి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 934 మి.మీ కాగా, మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా రికార్డు స్థాయిలో 1,485 మి.మీ వర్షపాతం నమోదైంది. 2021 ఖరీఫ్ సీజన్లో 1,90,955 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి 1,77,075 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇందులో వరి 37,950 హెక్టార్లలో, వేరుశెనగ 94,629 హెక్టార్లలో, ఇతర పంటలు 44,496 హెక్టార్లలో సాగు చేశారని అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. పంటలకు అవసరమైన నీరు అందుబాటులో ఉండడం వల్ల, చెరువులు నిండు కుండల్లా ఉండటంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. అదే విధంగా వర్షాలకు కురిసిన నీటిని సంరక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధుల వివరాలను పరిశీలిస్తే.. సాక్షి ప్రతినిధి, తిరుపతి: గ్రామీణ సామాజిక ఆర్థిక వ్యవస్థకు ఆధారాలుగా ఉన్న చెరువులను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత సర్కారు చేసిన తప్పిదాల వల్ల అనేక మంది రైతులు, ప్రజలు నష్టపోయే పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ, నూతన చెరువులు, ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఈ పనులకు వందల కోట్లు వెచ్చిస్తోంది. కాలువల తవ్వకానికి రూ.193.23 కోట్లు చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్ జలాశయం నుంచి గంగాధరనెల్లూరు, పెనుమూరు మండలాల్లోని చెరువులకు నీరు సరఫరా చేసేందుకు వరద కాలువ తవ్వకాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.193.23 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఆ తర్వాత విజయవాడకు చెందిన ఎస్ఎల్టీసీ అనుమతితో టెండర్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వరద ప్రవాహ కాలువల ప్రక్రియ పూర్తి కాగానే 2,439 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. అభివృద్ధి పనులు ఇలా.. ► శ్రీకాళహస్తి, ఏర్పేడులలో కమ్యూనిటీ బేస్డ్ ట్యాంక్స్ పునరుద్ధరణ కింద 48 చెరువుల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14.40 కోట్లు మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ నిర్వహించి పనులు ప్రారంభించనున్నారు. ఈ పనులు పూర్తి కాగానే 13,050 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని అంచనా. ► ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో జిల్లా వ్యాప్తంగా 187 చెరువుల అభివృద్ధికి రూ.54.39 కోట్లు మంజూరు చేశారు. ► గత ఏడాది నవంబర్లో తుఫాను కారణంగా దెబ్బతిన్న 617 చెరువులు, కాలువలు, ఇతర నీటి పారుదల కట్టడాల తాత్కాలిక మరమ్మతులకు రూ.11.37 కోట్లు ఖర్చు చేశారు. ► చిత్తూరు, బంగారుపాళ్యం, గుడిపాల, జీడీనెల్లూరు, సత్యవేడు, వరదయ్యపాళ్యం మండలాల్లో చెరువులు, సరఫరా కాలువల అభివృద్ధికి 15 పనులకు రూ.18.60 కోట్లు మంజూరు చేశారు. ఇవి పూర్తయితే 3,850 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని అంచనా. ► చిత్తూరు, తవణంపల్లి, ఐరాల, మొలకలచెరువు, కలకడ, గంగాధరనెల్లూరు, గుడిపాల, పెనుమూరు, గుర్రంకొండ, కలికిరి మండలాల్లో చెరువుల అభివృద్ధి పనులకు రూ.13.36 కోట్లు మంజూరు చేశారు. పనులు పురోగతిలో ఉన్నాయి. ఇవి పూర్తయితే 2,790 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని అంచనా. ► ఏపీఐఎల్ఐపీ–2 పథకంలో భాగంగా 53 చెరువులకు రూ.32.82 కోట్లు మంజూరయ్యాయి. ► పిచ్చాటూరు మండలంలో అరణియార్ ప్రాజెకు పునరుద్ధరణకు రూ.35.64 కోట్లకు పరిపాలన ఆమోదం లభించింది. కార్వేటినగరంలో కృష్ణాపురం ప్రాజెక్టును ఆధునీకరించేందుకు రూ.31.80 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. ఈ పనులు పూర్తయితే 26,626.78 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని ఇరిగేషన్ ఎస్ఈ విజయ్కుమార్ రెడ్డి వెల్లడించారు. చెరువుల అభివృద్ధికి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి చర్యలు చేపడుతోంది. జిల్లా వ్యాప్తంగా పనుల పురోగతిపై ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. చెరువులను పునరిద్ధరించడం, ప్రాజెక్టుల పనులతో రైతులకు, ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. జిల్లా మొత్తం మంజూరైన పనులను వేగవంతంగా నిర్వహించి పురోగతి చూపేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నాం. – హరినారాయణన్, జిల్లా కలెక్టర్ -
చెరువులను పరిరక్షించండి
సాక్షి, సిటీబ్యూరో: హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల అభివృద్ధి, పరిరక్షణకు, చెరువుల సుందరీకరణకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు చేపట్టాలని అధికారులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హెచ్ఎండీఏ కార్యకలాపాలు, చేపట్టిన ప్రాజెక్టులపై శనివారం నానక్రామ్ గూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ పరిధిలో చేపడుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన అంశాలపై అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చెరువుల సంరక్షణపై ప్రత్యేకంగా చర్చించారు. నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెరువుల సంరక్షణకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని కేటీఆర్ సూచించారు. హెచ్ఎండీఏతో పాటు జీహెచ్ఎంసీ కూడా అనేక చెరువులను అభివృద్ధి చేస్తోందని, ఈ మేరకు రెండు సంస్థలు సమన్వయంతో ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. గండిపేట సుందరీకరణను మరింత వేగంగా విస్తృతస్థాయిలో చేపట్టాల్సిన అవసరం ఉందని, ఇది అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారుతుందన్నారు. భూముల భద్రతపై దిశానిర్దేశం.. మరోవైపు హెచ్ఎండీఏ అదీనంలోని ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రేడియల్ రోడ్లు, మూసీ ప్రక్షాళన, మూసీపై బ్రిడ్జీల నిర్మాణం, హెచ్ఎండీఏ ల్యాండ్ పూలింగ్ ప్రణాళికలు, లాజిస్టిక్ పార్కుల నిర్మాణం, రానున్న స్వల్ప , దీర్ఘకాలిక భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రణాళికలపై అధికారులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. -
రూ.70 కోట్లతో ఎస్టీపీల అభివృద్ధి
మల్కాజిగిరి: మల్కాజిగిరి నియోజకవర్గంలోని ముఖ్యమైన చెరువుల వద్ద సుమారు రూ.70 కోట్లతో ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి అన్నారు. సఫిల్గూడలోని ఎస్టీపీతో పాటు నూతనంగా ఏర్పాటు చేయనున్న బండ చెరువు ప్రాంతాలను శనివారం ఆయన జలమండలి, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సఫిల్గూడ లోని 0.5 ఎంఎల్డీ ప్లాంట్ సామర్థ్యాన్ని సుమారు రూ.12.45 కోట్లతో 5.5 ఎంఎల్డీ సామర్థ్యం గల ఎస్టీపీగా మార్చుతున్నామన్నారు. బండచెరువు వద్ద సుమారు 28.15 కోట్లతో 15 ఎంఎల్డీ ఎస్టీపీ సామర్థ్యం గల ఎస్టీపీ ఏర్పాటు కోసం పిల్లి నర్సింగరావు కాలనీలో సుమారు మూడెకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించామన్నారు. ఆల్వాల్ కొత్త చెరువు వద్ద సుమారు రూ.28.90 కోట్లతో 15.5 ఎంఎల్డీ సామర్థ్యం గల ఎస్టీపీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు, నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఎమ్మెల్యే వెంట జలమండలి ప్రాజెక్ట్ అధికారి నరేందర్కుమార్, జీఎం సునీల్కుమార్, డీజీఎంలు స్రవంతి రెడ్డి, భాస్కర్, జీహెచ్ఎంసీ మల్కాజిగిరి సర్కిల్ డీసీ జి.రాజు, ఈఈ లక్ష్మణ్, డీఈ మహేష్, తహసీల్దార్ వినయలత, ఉన్నారు. చెరువుల ప్రక్షాళనకు చర్యలు.. అల్వాల్: అల్వాల్లో చెరువుల ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం ఆయన అధికారులు, కార్పొరేటర్లతో కలిసి అల్వాల్ కొత్త చెరువును పరిశీలించారు. భూగర్భ జలాలను పెంచడానికి ఉపయోగపడుతున్న అల్వాల్లోని మోత్కుల కుంట చెరువు, కొత్త చెరువు, చిన్నరాయుడి చెరువులలో మురుగు నీరు కలుస్తుండటంతో నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు. చెరువులలోకి వరదనీటిని మళ్లించడంతో పాటు వ్యర్థాలను శుద్ధి చేయడానికి ప్రత్యేక ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఇందుకోసం రూ.1 50 కోట్ల నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు చింతల శాంతి శ్రీనివాస్రెడ్డి, రాజ్ జితేంద్రనాథ్, ప్రేంకుమార్, డీసీ నాగమణి, అధికారులు నాగేందర్, నిర్మల, పవన్కుమార్, ఈఈ రాజు, డీఈలు మహేష్ , ప్రశాంతి, ఏఈ, లక్ష్మీ, జలమండలి జనరల్ మేనేజర్ సునీల్ ఉన్నారు. ప్రణాళికాబద్ధంగా వసతుల కల్పన అల్వాల్: వెంకటాపురం డివిజన్లో అన్ని కాలనీల్లో ప్రణాళికాబద్ధంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రూ.1.03 కోట్ల వ్యయంతో భూదేవినగర్, సుభాష్నగర్, ఇందిరానగర్లో పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన కార్పొరేటర్ సబితాకిషోర్తో కలిసి ప్రారంభించారు. -
ఓ రాత్రంతా చెరువులో.. మరోరాత్రి ఆస్పత్రిలో..
సాక్షి, యడ్లపాడు(చిలకలూరిపేట): ప్రమాదవశాత్తు చెరువులో బైక్తో సహా పడి.. రాత్రంతా నిస్సాహాయంగా అక్కడే ఉండిపోయిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఉన్నవ గ్రామం సూర్యనగర్ కాలనీ చెందిన రాజుపాలెం ప్రసాద్ (22) రాడ్బెండింగ్ పనులు నిర్వహిస్తుంటాడు. ఈనెల 20వ తేదీన ఉన్నవకు వచ్చిన తన స్నేహితుడిని బైక్పై కొప్పర్రు గ్రామంలో విడిచి రాత్రి 11.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యాడు. కొప్పర్రు దాటి అరకిలోమీటరు దూరంలోకి రాగానే మలుపు వద్ద బైక్ అదుపుతప్పింది. సమీపంలోని చెరువులోకి నేరుగా దూసుకెళ్లింది. చెరువులో పడ్డ ప్రసాద్ మీద బైక్ పడటంతో తిరిగి లేవలేకపోయాడు. ప్రమాదం నుంచి రక్షించమని కోరేందుకు ఇరువురుకి ఫోన్ చేయగా అర్థరాత్రి కావడంతో ఎవరూ ఫోన్ ఎత్తలేదు. చెరువు నీటిలో తడవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దీంతో ప్రసాద్ రాత్రంతా చెరువులోనే బైక్ కింద నిస్సహాయంగా ఉండిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆ వైపుగా పొలం పనులకు వెళ్తున్న రైతులు గమనించి చెరువు నుంచి బయటకు తీశారు. వివరాలను అడిగి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించి, 108 వాహనం ద్వారా గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పెదనందిపాడు పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడంతో ఉన్నవకు తీసుకువచ్చారు. దీంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: ('ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు') ఆ తండ్రి బాధ తీర్చలేనిది.. మృతుడి తండ్రి రమణయ్యకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు. పదేళ్ల కిందట భార్య రాగమ్మ అనారోగ్యంతో చనిపోయింది. నాటి నుంచి ఒక్కగానొక్క కుమారుడిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ త్వరలోనే పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. వేగం రూపంలో మృత్యువు ముంచుకొచ్చి పెళ్లీడుకొచ్చిన కొడుకుని మింగేసింది. తనకు ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇలా అకాల మృత్యువు బారిన పడడంతో ప్రసాద్ మృతదేహాన్ని చూసిన తండ్రి రమణయ్య విలవిల్లాడి పోయాడు. ఆ తండ్రి ఆవేదనను చూసి చూపరుల హృదయాలు సైతం ద్రవించాయి. ఆదివారం సాయంత్రం గ్రామంలో కోవిడ్ నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిగించారు. -
మూడు రోజులుగా చెరువులోనే..చలించిపోయిన ఎస్సై..!
రాయపర్తి: సాయంత్రం పూట అలా బయటికి వెళ్తేనే చలి వణికిస్తోంది. కానీ చెరువులో దుస్తులు లేకుండా అచేతన స్థితిలో మూడు రోజులుగా పడి ఉన్నాడో వృద్ధుడు. ఈ హృదయ విదారక సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురంలో చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ తరువాత మంగళవారం అటుగా వెళ్లిన గొర్రెల కాపరులకు కొండాపురం ఊర చెరువులో అచేతనంగా ఓ వృద్ధుడు కనిపించాడు. వెంటనే వార్త గ్రామమంతా వ్యాపించింది. సర్పంచ్ కోదాటి దయాకర్రావు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై బండారి రాజు వృద్ధుడిని చూసి చలించిపోయారు. గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో దుస్తులు తొడిగించి, చెరువులోంచి మోసుకొచ్చాడు. 108 వాహనంలో ఆస్పత్రికి తరలించాడు. కరుకుగా కనిపించే ఖాకీ బట్టలమాటున మంచి మనసుందని నిరూపించాడు. ఆ వృద్ధుడు ఎవరు? ఎక్కడినుంచి వచ్చాడన్న విషయం ఇంకా తెలియరాలేదు. -
జీవితం మీద విరక్తి.. చెరువులోకి దూకిన కుటుంబం
సాక్షి, బెంగళూరు(దొడ్డబళ్లాపురం): ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జీవితం మీద విరక్తి చెంది చెరువులోకి దూకగా, ముగ్గురు మృతిచెందిన సంఘటన మాగడి తాలూకా దమ్మనట్టె గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెదిన సిద్ధమ్మ (55), ఈమె కుమార్తె సుమిత్ర (30), అల్లుడు హనుమంతరాజు (35), వీరి కుమార్తె కీర్తన (11)లు ఆత్మహత్య చేసుకోవాలని గ్రామం సమీపంలోని చెరువులో దూకారు. వీరిలో ముగ్గురు మృత్యువాత పడగా, ప్రాణాలతో ఉన్న కీర్తనను గ్రామస్తులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. వీరి కుటుంబానికే చెందిన ఒక బాలిక (10)కు విషయం ముందే తెలిసి పారిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇల్లరికం వచ్చిన హనుమంతరాజు మద్యానికి బానిసై నిత్యం ఇంట్లో గొడవ పడేవాడని, దీంతో కుటుంబ కలహాలు పెరిగి ఆత్మహత్య బాటపట్టారని గ్రామస్తులు చెబుతున్నారు. కీర్తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కుదూరు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. చదవండి: (బజారున పడ్డ ప్రేమ పెళ్లి.. తాళి తెంచి, కూతురిని..) -
చేపలవేటకు వెళ్లి.. మృత్యుఒడికి
సాక్షి, వికారబాద్: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని చిగురాల్పల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొంపల్లి నర్సింలు(43) గ్రామ శివారులోని చెరువులో నిత్యం చేపలు పడుతుండేవాడు. ఈక్రమంలో మంగళవారం తెల్లవారుజామున 4:30 గంటలకు గ్రామానికి చెందిన పసుల నరేష్తో చేపల వేటకు వెళ్లాడు. నీటిలోకి వెళ్లిన నర్సింలు ఎంత సేపటికీ బయటకు రాలేదు. దీంతో నరేష్ గ్రామంలోకి వచ్చి విషయం స్థానికులకు తెలిపాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాలించారు. ఎంతవెతికినా మృతదేహం లభించకపోవడంతో ఎస్ఐ విఠల్రెడ్డి చెరువులో దిగి గాలించి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృతుడి తల్లి శాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
చేపల వేటకు వెళ్లి నలుగురు గల్లంతు
పళ్లిపట్టు(చెన్నై): చేపల వేటకు వెళ్లి చెరువులో గల్లంతైన నలుగురిలో ముగ్గురిని గ్రామస్తులు కాపాడగా, యువకుడు మృతిచెందాడు. 18 గంటల తర్వాత మంగళవారం అతని మృతదేహాన్ని వెలికి తీశారు. పళ్లిపట్టు సమీపంలోని వెంకట్రాజుకుప్పానికి చెందిన నలుగురు యువకులు సోమవారం సాయంత్రం లవ నదిలో చేపల వేటకు వెళ్లి వరదలో చిక్కుకున్నారు. వారి కేకలు విన్న స్థానికులు ముగ్గురిని కాపాడారు. గల్లంతైన బాలాజీ (22) కోసం అగ్నిమాపక సిబ్బంది రాత్రంతా గాలించారు. ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు మంగళవారం ఉదయం పళ్లిపట్టు–షోళింగర్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. మృతదేహం లభించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి: పూజారిగా ఏడేళ్ల బాలుడు.. కోర్టు ఏం చెప్పిందంటే.. -
సెల్ఫీ సరదా రెండు నిండు ప్రాణాలను తీసింది
మైసూరు(బెంగళూరు): చెరువు కట్ట పైన నిలబడి మొబైల్ ఫోన్లో సెల్ఫీ తీసుకుంటు ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. ఈ సంఘటన హుణసూరు తాలూకాలోని హోసకోటె దగ్గర కెంచన చెరువులో చోటు చేసుకుంది. మృతులు అబ్దుల్లా (21), తన్వీర్ (20). ముగ్గురు కలిసి చెరువు చూడడానికి వచ్చారు. కట్టపై నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఇద్దరు జారిపడ్డారు. చెరువు లోతుగా ఉండడంతో ఈదలేక మృత్యువాత పడ్డారు. హుణసూరు గ్రామీణ పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. రౌడీషీటర్ అరెస్ట్ శివమొగ్గ: వ్యాపారుల ను బెదిరించి దందాలు చేయడంతోపాటు అనేక నేరాలతో సంబంధం కలిగి ముంబైలో తలదాచుకున్న శివమొగ్గ నగరంలోని టిప్పు నగర్కు చెందిన పేరుమోసిన రౌడీషీటర్ బచ్చన్(29)ను శివమొగ్గ పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. ఇతనిపై జిల్లాలోని అనేక పోలీస్స్టేషన్లలో 53 కేసులున్నాయి. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో బసవనగుడికి చెందిన మహ్మద్ తౌహిద్(19), మహ్మద్ బిలాల్(21)ను నవంబర్ 16న పోలీసులకు పట్టుబడ్డారు. వారు ఇచ్చిన ఆధారాలతో పోలీసులు ముంబై వెళ్లి బచ్చన్ను పట్టుకొచ్చారు. చదవండి: అయ్యో భగవంతుడా.. తండ్రి కారు కాటికి పంపింది -
పొట్ట కూటి కోసం చేసే పనే పొట్టన పెట్టుకుంది..
సాక్షి,మంచిర్యాల: పొట్టకూటి కోసం ట్రాక్టర్ డ్రైవర్ పనిచేస్తున్న ఓ దినసరి కూలీని రాళ్లవాగు మింగేసింది. ఇసుక తోడేందుకు వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందిన ఘటన ఆదివారం జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఒడ్డెర కాలనీకి చెందిన కనుకుంట్ల దుర్గయ్య తన ట్రాక్టర్ ద్వారా ఇసుక సరఫరా చేస్తుంటాడు. ఆదివారం ఉదయం 5 గంటలకు ఇసుక తరలించేందుకు బొంతల శంకర్ (27)తోపాటు మరో ఇద్దరు కూలీలను తీసుకెళ్లాడు. ఉదయం 9 గంటల సమయంలో శంకర్ నీటిలో మునిగి మృతి చెందాడని, వెంట వెళ్లిన కూలీలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శంకర్ అనారోగ్యంతో ఉన్నా ట్రాక్టర్ యజమాని బలవంతంగా పనిలోకి తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో ట్రాక్టర్ యజమాని దుర్గయ్య ఇంటి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన దిగారు. సమాచారం అందుకున్న ఎస్సై ప్రవీణ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుడికి భార్య పప్పి, ఇద్దరు కుమార్తెలు హేమలత, యేసుమణి, కుమారుడు ఏసుమంత్ ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే.. రాళ్లవాగు నీటి నుంచి అక్రమంగా ఇసుక తోడుతున్నారని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ యజమానులు కూలీలతో ప్ర మాదకరంగా నీటి అడుగుభాగం నుంచి ఇసుక ను వెలికితీస్తున్నారని వారు పేర్కొంటున్నారు. రోజుకు వందలాది ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. ప్రమాదకరంగా వాగుల నుంచి ఇసు క తోడుతున్న ట్రాక్టర్ యజమానులపై కఠిన చ ర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: -
‘లే అమ్మా, లే చెల్లె.. మా అమ్మ కావాలే’
సాక్షి,దుబ్బాక( మెదక్): ప్రమాదవశాత్తు చెరువులో మునిగి తల్లీకూతురు మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని ఎనగుర్తి గ్రామానికి చెందిన చెప్యాల రోజా(26) గ్రామ శివారులో ఉన్న చెరువు వద్ద బట్టలు ఉతకడానికి తన ఇద్దరు కుమారైలతో కలిసి వెళ్లింది. బట్టలు ఉతుకుతున్న క్రమంలో చిన్న కుమార్తె చైత్ర(5) చెరువులో ఆడుకుంటూ నీటి లోతులోకి వెళ్లింది. గమనించిన తల్లి చైత్రను కాపాడటానికి ముందుగా తన చీరను విసిరింది. చీరను అందుకోకపోవడంతో తానే నీటి లోతులోకి వెళ్లి కుమార్తెను కాపాడాలనుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరూ నీటమునిగి ఊపిరాడకపోవడంతో మృతి చెందారు. చెరువు గట్టుపై ఉన్న పెద్దకుమార్తె రషి్మక, మరో ఇద్దరు చిన్నారులు కేకలు వేయడంతో పంట పొలాల వద్ద ఉన్న వారు గమనించి మృతదేహాలను బయటకు తీశారు. రోజాకు మిరుదొడ్డి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నరేష్తో వివాహం జరిగింది. భర్త ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో రోజా ఇటీవలె తల్లిగారింటికి వచ్చింది. బతుకమ్మ పండగ రోజు తల్లీ కూతురు మృతి చెందడంతో ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మా అమ్మ కావాలే..లే అమ్మా తల్లి, చెల్లి మృతి చెందడంతో రష్మిక ఏమి చేయలేని స్థితిలో బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్నది. తల్లిదండ్రులను కోల్పోయిన రష్మిక ఆలనాపాలనా చూసేవారు కరువయ్యారు. నాకు మా అమ్మ కావాలి.. నువ్వు లే అమ్మా అంటూ ఆ చిన్నారి ఏడవడంతో అందరూ కంటతడి పెట్టారు. చెల్లి చేతులు పట్టుకుని లే చెల్లె ఆడుకుందాం అంటూ ఏడ్చేసింది. చదవండి: Hyderabad: రాజేంద్రనగర్లో మహిళపై సామూహిక అత్యాచారం -
ఒక్కగానొక్క కొడుకు.. సరదాగా స్నేహితులతో బయటకు.. మృతదేహమై ఇంటికి
సాక్షి,లావేరు( శ్రీకాకుళం): స్నేహితులతో చెరువుకు వెళ్లిన కుర్రాడు మృతదేహమై ఒడ్డుకు చేరాడు. గార, లావేరు మండలాల్లో జరిగిన ఈ ఘటనలతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మండలంలోని కేశవరాయునిపురం గ్రామంలో చెరువులో మునిగి అదే గ్రామానికి చెందిన ఇనపకుర్తి సూర్య(12) సోమవారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన సూర్య లావేరు హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. ద సరా సెలవులు కావడంతో ఇంటి వద్ద ఉన్న విద్యార్థి అదే గ్రామానికి చెందిన మరో నలుగురు విద్యార్థులతో సోమవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో గ్రామంలోని ఎర్ర చెరువులో స్నానానికి వెళ్లాడు. ఇటీవలే ఆ చెరువులో జేసీబీతో మట్టి తీశారు. స్నానానికి దిగిన సూర్య లోపలకు వెళ్లి ఆ గోతుల్లో చిక్కుకుని మునిగిపోయాడు. మిగిలిన విద్యార్థులు భయపడి ఇళ్లకు వచ్చేశారు. రాత్రి 7 గంటలు దాటినా సూర్య ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు గ్రామంలో వెతకగా.. విద్యార్థి చెరువుకు వెళ్లాడని తెలిసింది. అంతా కలిసి చెరువుకు వెళ్లి గాలించగా సూర్య మృతదేహం లభించింది. ఒక్కగానొక్క కుమారుడు ఇలా పన్నెండేళ్లకే చనిపోవడంతో తల్లిదండ్రులు రమేష్, రాణి దంపతులు గుండెలవిసేలా రోదించారు. చదవండి: పెళ్లి సంబంధాలు రావడం లేదని.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. -
పలమనేరు అసలు పేరు తెలుసా..?
సాక్షి, చిత్తూరు: ఈతరం పిల్లలకు ఉంటున్న ఊరు పేరెందుకొచ్చిందో తెలియని వారు చాలామంది ఉన్నారు. కనీసం ఊరి పేరు ఎందుకొచ్చిందో గూగూల్ తల్లిని అడిగినా పెద్దక్లారిటీ ఉండదు. అందుకే పలమనేరుకు ఆపేరెలా వచ్చిందో తెలిపే ప్రయత్నం చేద్దాం. పూర్వం పలమనేరు ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించే వారు. పట్టణానికి పడమటి వైపు ఓ చెరువును తవ్వించి దానికి పల్లవన్ ఏరి అనే నామకరణం చేసినట్లు తెలుస్తోంది. పల్లవన్ ఏరి అంటే చెరువు వద్ద ఉన్న గ్రామమని అర్ధం. ఈ పల్లవనేరే కాలక్రమేణ పల్నేరు ఆపై పలమనేరుగా రూపాంతరం చెందింది. పలమనేరు పట్టణ వ్యూ ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 2244 అడుగుల ఎత్తున ఉండడంతో ఇక్కడ వేసవిలోనూ వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే ఈ పట్టణాన్ని పేదవాని ఊటిగా పిలుస్తారు. పలమనేరు పట్టణం మూడు రాష్ట్రాల కూడలిగా ఉండడంతో ఇక్కడ తెలుగు,తమిళం, కన్నడ భాషలను మాట్లాడుతారు. ఇప్పటికీ ఈ మూడు సాంప్రదాయలు, సంస్కృతులు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి నుంచి గుడియాత్తం, క్రిష్ణగిరి, మదనపల్లె, కుప్పం, బెంగుళూరులకు రోడ్డు మార్గాలున్నాయి. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణానికి పులకించిన అప్పటి యూరోపియన్, బ్రిటిష్ అధికారులు దీన్ని వారి వేసవి విడిదిగా ఉపయోగించారు. పలమనేరులోని నాటి బ్రిటీష్భవనాలు దానికి సంబంధించిన విడిది గృహము ఇప్పటికీ ఉపయోగంలో ఉంది. (ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయం). వీటితో పాటు పీర్ల రహదారి, సర్కెట్ హౌస్, వైట్ సైడ్ అతిథి గృహాల పేర్లు ఉన్నాయి. దీంతో పాటు అమెరికన్ ఆర్కాడ్ మిషన్చే ఓ అతిథి గృహం 1932లోనే నిర్మితమైంది. అప్పట్లోనే నెలకు దీని అద్దె రూ.40గా వసూలు చేసేవారట. ఇక ఫారెస్ట్ గెస్ట్ హౌస్తో పాటు క్రిస్టియన్లకు సంబంధించిన పలు సుందరమైన పురాతన భవనాలు నేటికీ చెక్కుచెదరలేదు. పలమనేరులోని నాటి బ్రిటీష్భవనాలు ఇక్కడి సీఎస్ఐ ప్రాంగణంలో గాంధీ మహాత్ముడు సేద తీరిన మర్రి చెట్టు ఉంది. ప్రతి శుక్రవారం పట్టణంలో జరిగే వారపు సంత, పశువుల సంత అనాదిగా జరుగుతోంది. పలమనేరు టమోటా, పట్టు, చింతపండు, పాలుకు ప్రసిద్ది చెందింది. జిల్లాలోనే టమోట, పట్టు సాగులో పలమనేరు ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ పాల ఉత్పత్తి ఎక్కువ. దీన్ని మిల్క్ సిటీగా కూడా పిలుస్తారు. చదవండి: అంతరిస్తున్న ఆదిమానవుడు