-
గ్లోబల్ వార్మింగ్పై ఫైటర్.. ది మమ్మోత్
ఏటేటా పెరిగిపోతున్న వాహనాలు, పరిశ్రమలు.. వాటి నుంచి వెలువడే కాలుష్యం గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతోంది. వాతావరణంలో నిరంతరం పెరిగిపోతున్న కార్బన్డయాక్సైడ్ భూమి వేడెక్కిపోయేందుకు కారణమ వుతోంది. దీనికి పరిష్కారంగానే.. ప్రపంచ దేశాలన్నీ కర్బన ఉద్గారాలను తగ్గించుకోవడంపై ఫోకస్ పెట్టాయి. ప్రతి దేశానికి టార్గెట్లు పెట్టాయి.ఈ క్రమంలోనే ఐస్ ల్యాండ్కు చెందిన ‘క్లైమ్ వర్క్స్’ కంపెనీ సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి బదులు.. నేరుగా వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను తొలగించే సరికొత్త సెంటర్ను అందుబాటులోకి తెచ్చింది. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా..ఏటా 36 వేల టన్నుల మేర..గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్ ను వేరు చేసి.. దానిని నీటితో కలిపి, భూమిలోపలి పొరల్లోకి పంపేలా క్లైమ్ వర్క్స్ కంపెనీ ఓ భారీ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. దీని సాయంతో ఏటా 36 వేల టన్నుల కార్బన్డయాక్సైడ్ను గాలిలోంచి తొలగించి.. భూమి పొరల్లోకి పంపేలా నిర్మించింది. ఇది సుమారు 8 వేల డీజిల్ కార్లు ఏడాదంతా తిరిగితే వెలువడేంత కార్బన్డయాక్సైడ్తో సమానం కావడం గమనార్హం. చూడటానికి ఇది తక్కువే అనిపించినా.. ఇలాంటి ప్లాంట్లు భారీ సంఖ్యలో పెడితే.. గ్లోబల్ వార్మింగ్ సమస్యకు ఒక పరిష్కారంగా పనికొస్తుందని ‘క్లైమ్ వర్క్స్’ సంస్థ చెప్తోంది.దీనిలో నిలువునా గోడల్లా ఏర్పాటు చేసే ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి. వాటిలో ఒకవైపు భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. వాటి వెనకాల చిన్న చాంబర్ ఉంటుంది. అందులో కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించే ఫిల్టర్లు ఉంటాయి.ఫ్యాన్లను ఆన్ చేసినప్పుడు.. అవి వెనకాల చాంబర్ నుంచి గాలిని లాగి.. ముందు వైపునకు వదులుతాయి. ఈ క్రమంలో చాంబర్లోని ఫిల్టర్లు కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహిస్తాయి.ఫిల్టర్లు కార్బన్ డయాక్సైడ్తో నిండిపోతే.. ఆటోమేటిగ్గా చాంబర్ సీల్ అయిపోతుంది. అందులో చేసిన ప్రత్యేక ఏర్పాట్లతో 100 సెంటిగ్రేడ్ల మేరకు వేడెక్కుతుంది. దాంతో ఫిల్టర్లలోని కార్బన్ డయాక్సైడ్ ఆవిరి అవుతుంది.ఎలా పనిచేస్తుంది?ఈ ఆవిరిని ప్రత్యేక పైపుల ద్వారా భూగర్భంలోకి తరలిస్తారు. ఆ పైపుల్లోకి నీటిని పంపే ఏర్పాట్లు చేస్తారు. దీనితో కార్బన్ డయాక్సైడ్ నీటిలో కరిగి కార్బన్ వాటర్గా మారిపోతుంది. భూగర్భంలోకి ఆ కార్బన్ వాటర్ మెల్లగా గడ్డకట్టి రాళ్లుగా తయారవుతుంది.ఈ ప్రక్రియలో ఫ్యాన్ల కోసం, పైపుల ద్వారా కార్బన్ డయాక్సైడ్, నీరు పంపింగ్ చేయడం కోసం వాడే విద్యుత్ను ఆ ప్రాంతంలోని జియోథర్మల్ పవర్ ప్లాంట్ నుంచి తీసుకుంటున్నారు.ఇది వేడినీటి బుగ్గల నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్ కాబట్టి.. దాని వినియోగంతో పర్యావరణానికి సమస్యేమీ లేదని ‘క్లైమ్ వర్క్స్’ కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు.అమెరికాలోని లూసియానాలో 2030 నాటికి ఏటా 10 లక్షల టన్నుల కార్బన్డయాక్సైడ్ను సంగ్రహించగలిగే ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.– సాక్షి సెంట్రల్ డెస్క్ -
అన్నీ తెలిసినా అలసత్వమే!
సమస్య తెలుసు... దానికి పరిష్కారమూ తెలుసు... తక్షణమే అందుకు నడుము కట్టకపోతే మానవాళి జీవనానికే ప్రమాదమనీ తెలుసు. అన్నీ తెలిసినా ప్రపంచ దేశాలు ఇప్పటికీ ఒక్కతాటి మీదకు రాలేకపోతున్నాయంటే ఏమనాలి? ప్రపంచాన్ని పీడిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యభూతంపై పరిస్థితి సరిగ్గా అదే! సరికొత్త అంతర్జాతీయ ఒడంబడిక నిమిత్తం గత వారం ఒట్టావాలో జరిగిన సమావేశం స్పష్టమైన నిర్ణయాలేమీ తీసుకోకుండానే చప్పగా ముగిసింది. అందరిలోనూ అసంతృప్తి మిగిల్చింది. 192 దేశాల ప్రతినిధులు వారం పాటు సమావేశమై చర్చలు జరిపినా, ఆఖరి రోజున సమావేశాన్ని అర్ధ రాత్రి దాకా పొడిగించినా ఫలితం లేకపోయింది. ఒప్పందంపై ఒక నిర్ణయం కుదరలేదు. ప్లాస్టిక్ భూతాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని అధిక భాగం దేశాలు అంగీకరించినప్పటికీ, ఉత్పత్తిపై పరిమితులు విధించడం మీద ఒక్కతాటిపైకి రాలేకపోయాయి. ఇది నిరాశ కలిగించే పరిణామం.పెట్రోలియమ్ ఉప ఉత్పత్తులైన ప్లాస్టిక్లపై దేశాల ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయి. అభివృద్ధి చెందిన అనేక ధనిక దేశాల్లో ప్లాస్టిక్ల తయారీ, పంపిణీ పరిశ్రమ జోరుగా సాగుతోంది. సహజంగానే పెట్రోకెమికల్ పరిశ్రమ వృద్ధిచెందిన ఆ దేశాలు, పారిశ్రామిక గ్రూపులేమో ప్లాస్టిక్ ఉత్పత్తిపై పరిమితి విధించాలనే యోచనను వ్యతిరేకించాయి. ప్రస్తుతానికి వాటి మాటే పైచేయి కాగా, ఒడంబడికపై నిర్ణయం అక్కడికి ఆగింది. ప్లాస్టిక్పై అంతర్జాతీయ ఒడంబడిక ప్రక్రియ 2022లోనే మొదలైంది. ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించి, వాటి ఉత్పత్తిని ఆపేయడానికి ఒక నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. అందుకోసం ప్రభుత్వ ప్రతినిధులతో కూడిన అంతర్ ప్రభుత్వ చర్చల కమిటీని ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఒడంబడికను ఖరారు చేయాల్సి ఉంది. అందులో భాగంగానే తాజాగా ఒట్టావాలో నాలుగో విడత చర్చలు జరిగాయి. ఇవాళ వివిధ రకాల ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోయింది. అందుబాటు ధరల్లో ప్రత్యామ్నా యాలు లేని పరిస్థితి. ఇది పెద్ద ఇబ్బంది. గణాంకాలలో చెప్పాలంటే... ఏటా ప్లాస్టిక్ ఉత్పత్తి 1950లో 20 లక్షల టన్నులుండేది. 2019 నాటికి 4600 లక్షల టన్నులకు చేరింది. వచ్చే 2060 నాటికి అది అంతకు మూడింతలు అవుతుందని అంచనా. దానికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నానాటికీ తీసి కట్టుగా మారింది. పైపెచ్చు, భూమిలో కలవని ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రస్తుతం ఏటా 740 టన్నులుండగా, రానున్న 2050 నాటికి అది ఏటా 1220 లక్షల టన్నులకు చేరనుంది. విధానపరమైన మార్పులు చేపట్టకుంటే ఇది పెను సమస్యే. అందుకే, వ్యర్థాల లోపభూయిష్ట నిర్వహణను వచ్చే 2040 కల్లా సున్నా స్థాయికి తేవాలనేది లక్ష్యంగా ఒడంబడిక ప్రక్రియకు రెండేళ్ళ క్రితమే శ్రీకారం చుట్టారు. వ్యర్థాలే కాదు... అసలు ప్లాస్టిక్ ఉత్పత్తే పర్యావరణానికి పెను ప్రమాదం. ప్లాస్టిక్ భూమిలో కలసిపోదు గనక పర్యావరణానికీ, ప్రజారోగ్యానికీ పెద్ద దెబ్బ. ప్లాస్టిక్ ఉత్పత్తితో గ్రీన్ హౌస్ వాయు వులు వెలువడి భూతాపం పెరుగుతుంది. ప్లాస్టిక్ ఉత్పత్తికి ఉపకరించే పెట్రోకెమికల్స్ తయారీకై శిలాజ ఇంధనాల వెలికితీత, రిఫైనింగ్తో ఒక్క 2019లోనే 2.24 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వాతావరణంలోకి వదిలినట్టయిందట. పాత లెక్కల వంతున ఏటేటా 4 శాతం ప్లాస్టిక్ ఉత్పత్తి పెరిగినా సరే, వచ్చే 2050 నాటికి ఇది మూడు రెట్లై ఈ గ్రీన్హౌస్ వాయువుల పరిమాణం 6.78 గిగా టన్నులకు చేరుతుంది. ఒడంబడికతో ఈ పరిమాణాన్ని 26 శాతం మేర తగ్గించాలని లక్షించారు. మనం వాడే ప్లాసిక్లలో 16వేల రకాల రసాయనాలుంటాయి. వాటిలో కనీసం 4200 విషపూరితమే. వాటి వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో 2015లో అమెరికాలో 9200 కోట్ల డాలర్ల పైగా ఖర్చయింది. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ల వినియోగం తగ్గించాలనీ, వాటిని రీసైక్లింగ్ చేయాలనీ ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కానీ, అవేవీ ఇప్పటి దాకా అనుకున్నంత విజయం సాధించలేదు. ఉత్పత్తిపై పరిమితులు విధించడం కన్నా, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంపై దృష్టి పెట్టాలని తాజా భేటీలోనూ ప్రధాన దేశాలు పట్టుబట్టాయి. అయితే, కేవలం వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్లతో ప్లాస్టిక్ సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టడం జరగని పని. నిష్ఠురమైనా అది నిజం. ప్రపంచంలో పోగైన ప్లాస్టిక్ వ్యర్థాల్లో 10 శాతమే ఇప్పటి దాకా పునర్వినియోగమైంది. మిగతా వ్యర్థాలన్నీ సముద్రాలు, నేలల్లో మిగిలాయి. ప్లాస్టిక్ ఉత్పత్తి మాత్రం ఏటేటా పెరుగుతూ పోతోంది. అందుకే, ప్లాస్టిక్ల ఉత్పత్తిపై నియంత్రణకు ప్రపంచ దేశాలు వీలైనంత తొందరగా ఒక అంగీకారానికి రావాల్సి ఉంది. ఒట్టావా సమావేశంలో కొంత పురోగతి సాధించినట్టు ఐరాస అంటున్నా, అది వట్టి కంటి తుడుపే!కొన్నేళ్ళుగా మైక్రో, నానో ప్లాస్టిక్లు మానవ రక్తంలో, చివరకు గర్భిణుల మావిలోనూ కనిపిస్తు న్నాయని శాస్త్రవేత్తల మాట. ఇది ఆందోళనకర పరిణామం. అందుకే, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ చాలదు. ఉత్పత్తిని బాగా తగ్గించడమే దీర్ఘకాలంలో ఉపయోగం. మన దేశం 2022లోనే ‘ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు’ తీసుకొచ్చి, 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించింది. అయితే, ప్రాంతానికో రకం నిబంధనలున్నందున వాటి వినియోగం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. దీనిపై దృష్టి సారించాలి. ప్రపంచ దేశాలు ఈ ఏడాదిలోనే మరో విడత బుసాన్లో సమావేశం కానున్నాయి. అప్పటికైనా అవి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మొదలైన వందేళ్ళ లోపలే మానవాళి మనుగడకు ప్రశ్నార్థకంగా మారిన ప్లాస్టిక్లపై పోరుకు ఒక్క మాట మీద నిలవాలి. ధనిక దేశాలు తమ వాణిజ్య ప్రయోజనాలకు పక్కనబెట్టి మరీ ప్లాస్టిక్ భూతాన్ని పారదోలే పనిలో మిగతా దేశాల చేయి పట్టుకొని ముందుకు నడవాలి. ప్రమాదం తెలుస్తున్నా పట్టించుకోకుండా, పరిష్కారంపై చర్చలను ప్లాస్టిక్ లాగా సాగదీస్తూ పోతే మనకే కష్టం, నష్టం. -
గరళ కంఠ భారతం
ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి అంటూ రొమ్ము విరుచుకుంటున్న మనకు ఇప్పుడు పెద్ద అపకీర్తి కిరీటమూ దక్కింది. ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత దేశాల్లో భారతదేశం ఒకటని తాజాగా తేలింది. స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ సంస్థ ‘ఐక్యూ ఎయిర్’ మొత్తం 134 దేశాలు, ప్రాంతాల్లోని 7,812 నగరాలలో 30 వేలకు పైగా వాయు నాణ్యతా పర్యవేక్షక కేంద్రాల నుంచి డేటా సేకరించి ఈ నివేదికను అందించింది. వారి ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక ప్రకారం అత్యంత కాలుష్యదేశాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ల తర్వాత మూడో స్థానం భారత్దే. 2022లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత్ ఒక్క ఏడాది కాలంలో కాలుష్యంలో మూడో ర్యాంకుకు చేరడం ఆందోళన రేపుతోంది. పైగా, ప్రపంచంలోకెల్లా అత్యంత కలుషిత రాజధాని అనే దుష్కీర్తి వరుసగా రెండో ఏడాది కూడా మన ఢిల్లీకే దక్కింది. అవి చాలదన్నట్టు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా బెగూసరాయ్ నిలవడం దిమ్మ తిరిగేలా చేస్తోంది. ప్రపంచంలో గత ఏడాది ఎదురైన ఆరోగ్య విపత్తు వాయు కాలుష్యమని నిపుణుల మాట. మన దేశంలో శిలాజ ఇంధనాల వినియోగం ప్రధాన కాలుష్యకారకం కాగా, ఉత్తరాదిన ఖరీఫ్ సీజన్లో పంట వ్యర్థాల్ని కాల్చే అలవాటుకు సరైన ప్రత్యామ్నాయం చూపడంలో పాలకుల వైఫల్యాలు సైతం ఢిల్లీ దుఃస్థితికి కారణమై వెక్కిరిస్తున్నాయి. అయితే, మెట్రోలు, గౌహతి – పాట్నా లాంటి ద్వితీయ శ్రేణి నగరాలే కాదు... బిహార్లోని బెగూసరాయ్, హర్యానాలోని రోహ్తక్, యూపీలోని మీరట్ లాంటి చిన్న పట్నాలు సైతం వాయు గరళంతో నిండిపోతున్నాయని నివేదిక తేల్చింది. ఐక్యూ ఎయిర్ జాబితాలోని 83 భారతీయ నగరాల్లో చాలావాటిలో కాలుష్య కారకాలు ఏమిటనే సమాచారం లేదు. అలాగే, బెగూసరాయ్ లాంటి చోట ఏడాది తిరగక ముందే కాలుష్యం 6 రెట్లు ఎలా పెరిగిందనేది కనిపెట్టాల్సి ఉంది. కారణాల్ని అంచనా వేస్తూనే, ముంచుకొచ్చిన ఈ ముప్పును విధానపరమైన పరిష్కారాలతో సమర్థంగా ఎదుర్కోవడం పాలకుల ముందున్న సవాలు. గాలిలో ధూళికణాల (పీఎం) సాంద్రత ఏ మేరకున్నదనే దాన్ని బట్టి వాయుకాలుష్య ర్యాంకులు నిర్ణయిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మార్గదర్శకాల ప్రకారం క్యూబిక్ మీటర్కు 5 మైక్రోగ్రాములు ఫరవాలేదు. అలాకాక, ధూళికణాలు 2.5 మైక్రాన్లు లేదా అంతకన్నా తక్కువ వ్యాసం (పీఎం 2.5) ఉన్నప్పుడు ఊపిరితిత్తుల, గుండె జబ్బులు, క్యాన్సర్, చిన్న వయసులోనే మర ణాలు సంభవిస్తాయి. కాబట్టి అది ప్రమాదఘంటికకు కొలమానం. 2023లో భారత్లో వార్షిక సగటు పీఎం2.5 సాంద్రత క్యూబిక్ మీటర్కు 54.4 మైక్రోగ్రాములుగా రికార్డయింది. అలా భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇక, క్యూబిక్ మీటర్కు 79.9 మైక్రోగ్రాములతో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో, క్యూబిక్ మీటర్కు 73.3 మైక్రోగ్రాములతో పాకిస్తాన్ రెండోస్థానంలో ఉన్నాయి. నిజానికి, మిగతా రెండు దేశాలతో పోలిస్తే, భారత్ పీఎం2.5 సాంద్రత 2021 నాటి నుంచి తగ్గింది. అప్పట్లో భారత్లో క్యూబిక్ మీటర్కు 58.1 మైక్రోగ్రాములు ఉండేది. ఇప్పుడది 54.4కు తగ్గిందన్న మాటే కానీ ఇవాళ్టికీ ప్రపంచ టాప్ 50 కాలుష్య నగరాల్లో 42 మన దేశంలోవే కావడం కలతపరిచే అంశం. దేశ జనాభాలో కొద్ది మంది మినహా దాదాపు 136 కోట్లమంది నిత్యం డబ్ల్యూహెచ్ఓ మార్గ దర్శకాలను మించి పీఎం2.5 ధూళికణ సాంద్రతకు లోనవుతున్నవారే! మరీ ముఖ్యంగా, మన దేశంలోని పట్టణప్రాంతాల్లో అధిక శాతం మంది ఇలా నిత్యం కాలుష్యం కోరల బారిన పడుతూ, శ్వాస కోశ సమస్యలతో డాక్టర్ల చుట్టూ తిరుగుతుండడం తరచూ కంటి ముందు కనిపిస్తున్న కథే. మిగిలి నవి అటుంచితే, భారత్లో ఉత్పత్తి అయ్యే విద్యుచ్ఛక్తిలో 70 శాతం థర్మల్ విద్యుత్తే అన్నది గమనార్హం. ఇప్పటికీ మనం పునరుత్పాదక శక్తి వనరుల మార్గం పట్టలేదు. పైపెచ్చు, దేశ ఆర్థిక వృద్ధి మరింత వేగవంతమయ్యేకొద్దీ ఇది పెను సవాలు కానుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇంటి పైకప్పులపై సౌరవిద్యుత్ ఫలకాల ఏర్పాటు లాంటి భారీ ప్రణాళికలు ప్రకటించింది. అయితే, ఇవన్నీ ఆచరణ లోకొచ్చి, ప్రభావం చూపడానికి మరికొంత సమయం పడుతుంది. ఇలాంటి ప్రయత్నాలు గణనీ యంగా ప్రభావం చూపాలంటే, మన విద్యుత్ విధానాలను సమూలంగా మార్చడం ముఖ్యం. అసలు ‘స్వచ్ఛమైన గాలి’ కూడా ప్రాథమిక జీవనహక్కే. కోర్టులు ఆ సంగతి పదేపదే చెప్పాయి. బరిలోకి దిగక తప్పని పరిస్థితిని ప్రభుత్వాలకు కల్పించాయి. అయితే, పౌర రవాణాలో సీఎన్జీ, మెట్రో వ్యవస్థ, ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ లాంటివి తీసుకొచ్చినా ఢిల్లీ లాంటి చోట్ల కాలుష్యం కోరలు చాస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు సమస్య అవగాహన, పరిష్కారానికై శాస్త్ర విజ్ఞానాన్ని ఆశ్రయించాలి. అలాగే, కాలుష్య నియంత్రణకు అవసరమైన రీతిలో జనజీవితంలో అలవాట్లు మారేలా ప్రోత్సాహకాలు, అతిక్రమిస్తే జరిమానాల పద్ధతి తేవాలి. సర్వజన శ్రేయస్సు కోసం పార్టీలన్నీ కాలుష్యంపై పోరును రాజకీయ అంశంగా తీసుకొని, ఎన్నికల మేనిఫెస్టోల్లో చోటివ్వాలి. నిజానికి, జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమాన్ని పటిష్ఠం చేస్తామంటూ 2019లో కాంగ్రెస్, బీజేపీలు తమ ఎన్నికల వాగ్దానపత్రంలో పేర్కొన్నాయి. ఇది కేవలం కేంద్రం పనే కాదని గుర్తించి, రాష్ట్రాల నుంచి మునిసిపాలిటీల దాకా అన్నీ తమ వంతుగా కాలుష్యంపై పోరులో చేతులు కలపాలి. వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యమే కాక, దరిమిలా సంక్లిష్టమైన పర్యావరణ ప్రక్రియలతో పుడమి వాతావరణమే దెబ్బతింటుందని శాస్త్రవేత్తల మాట. అందుకని ఈ విషానికి విరుగుడు కనిపెట్టడం అన్ని విధాలా అత్యవసరం. ఈ క్రమంలో తాజా ఐక్యూ ఎయిర్ నివేదిక మనకు మరో మేలుకొలుపు. -
విషపూరిత నురుగులు కక్కుతున్న యమునమ్మ, ఎవరూ పట్టించుకోరే?
దేశంలో ఒక పక్క సార్వత్రిక ఎన్నికలు, లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంటోంది. మరో పక్క రోజు రోజుకి కాలుష్య కాసారంగా మారిపోతున్న పవిత్ర యమునా నదీ తీరం మరోసారి కాలుష్య సెగలు కక్కుతోంది. టన్నుల కొద్దీ మురుగునీరు, పారిశ్రామిక, గృహ వ్యర్ధాలతో విషపూరిత నురుగుతో నిండిపోయింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో అనూహ్యంగా పెరిగిపోతున్న కాలుష్యానికి సాక్షీభూతంగా నిలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. యమున ఉపరితలంపై విషపూరిత నురుగు తేలుతున్న వీడియోలు గతంలో చాలా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి .అలాగే కోవిడ్ లాక్డౌన్ కాలంలో యమునకు కాలుష్యం స్థాయి చాలావరకు తగ్గి ప్రశాంతంగా కనిపించడం గమనార్హం. తీవ్రమైన కాలుష్యంతో యమునా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీని దుష్ప్రభావాలు, పొంచివున్న ముప్పుపై వాతావరణ నిపుణులు, శాస్త్రజ్ఞులు ఎంత మొత్తుకుంటున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. తక్షణమే కనీస జాగ్రత్తలు చేపట్టాలని కోరుతున్నారు. Kalindi Kunj ... Yamuna Delhi . Beautiful poisonous pink water froth with chemicals ,, @ArvindKejriwal promised clean Yamuna in 2017 ,,nothing happened@SwatiJaiHind @AtishiAAP ... IIT quota admission , is useless pic.twitter.com/svcQ3wdYGw — No Conversion (@noconversion) May 19, 2023 నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఢిల్లీ, హర్యానా ,ఉత్తరప్రదేశ్ నుండి శుద్ధి చేయని మురుగునీటిలో ఫాస్ఫేట్లు, సర్ఫ్యాక్టెంట్లు (రసాయన సమ్మేళనాలు) యమునలో కలిసిపోతున్నాయి. ఇదే విషపూరిత నురుగుకు కారణం. ఈ రెండింటిలోనూ 99 శాతం గాలి, నీటిలో కలిసి పోతుంది.ఫలితంగా అనేక బాధలు తప్పవు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు లాంటి సమస్యలొస్తాయి. ఈ రసాయనాలతో జీర్ణకోశ సమస్యలు ,టైఫాయిడ్ వంటి వ్యాధులు రావచ్చు. దీర్ఘకాలం పాటు ఈ పారిశ్రామిక కాలుష్య కారకాలకు ఎక్స్పోజ్ అయితే నరాల సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడతాయి. ఒక్కోసారి ఇది ప్రాణాంతకం కూడా కావచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఢిల్లీ పొల్యూషన్.. వరల్డ్లోనే టాప్ ర్యాంక్ !
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని స్విస్కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023లో వెల్లడించింది. ఈ సర్వేలో 2018 నుంచి వరుసగా నాలుగుసార్లు ఢిల్లీ అత్యంత కాలుష్య రాజధానిగా టాప్లో ఉంటూ వస్తోంది. 2022లో ఢిల్లీ పీఎం 2.5 లెవెల్స్ క్యూబిక్ మీటర్కు 89.1 మైక్రో గ్రాములు ఉండగా 2023లో ఇది 92.7 గ్రాములకు చేరింది. ఇక బీహార్లోని బెగుసరాయ్ పట్టణం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పట్టణమని ఐక్యూ ఎయిర్ తెలిపింది. క్యూబిక్ మీటర్కు 54.4 మైక్రోగ్రాముల పీఎం 2.5 కాన్సంట్రేషన్తో ప్రపంచంలోనే మూడవ అత్యంత కాలుష్య దేశంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ల తర్వాత భారత్ ఉందని వెల్లడించింది. ఐక్యూ ఎయిర్ కాలుష్య దేశాల ర్యాంకుల్లో 2022లో భారత్ ర్యాంకు 8గా ఉండగా 2023లో 3వ ర్యాంకుకు ఎగబాకింది. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి.. వందేళ్ల కక్రితం కరెంట్ లేకుండానే పనిచేసిన ఫ్రిడ్జ్ -
విద్యుత్ వాహనాలతో వాతావరణ కాలుష్యం..!
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచవ్యాపంగా ఎన్నో విధానాలను అసుసరిస్తున్నారు. ప్రధానంగా వాతావరణ కాలుష్యం నిత్యం వినియోగిస్తున్న వాహనాల నుంచి వెలువడే పొగద్వారే ఏర్పడుతుంది. దాంతో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈవీలు అందుబాటులోకి వచ్చాయి. భారత్లో కూడా ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లు, ఆటోలను విక్రయిస్తున్నాయి. అయితే, పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఈవీలు కాస్త అధిక కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయని కొన్ని సంస్థలు చెబుతున్నాయి. ఎమిషన్ అనలటిక్స్ అనే సంస్థ రెండు రకాల కార్లలోని బ్రేకింగ్, టైర్ల నుంచి విడుదలయ్యే రేణువులపై అద్యయనం చేసి ఆసక్తికర విషయాలను తెలిపింది. సాధారణ కార్ల ఇంజిన్ కంటే ఈవీల్లోని బ్యాటరీలు ఎక్కువ బరువుగా ఉంటాయి. దీంతో బ్రేక్ వేసినప్పుడు టైర్లపై అధిక ఒత్తిడి ఏర్పడి హానికారక రసాయనాలను గాలిలోకి విడుదల చేస్తున్నాయని తెలిపింది. ఇది పెట్రోల్, డీజిల్ కార్లలో విడుదలయ్యే వాటి కంటే అధికమని వెల్లడించింది. ఇదీ చదవండి..ఫేమ్-2 పథకం పొడిగింపుపై కేంద్రం వ్యాఖ్యలు సింథిటిక్ రబ్బర్, ముడి చమురుతో టైర్లను తయారు చేస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని నివేదికలో పేర్కొంది. పర్యావరణ హితం కోసం చాలా దేశాల్లో ఈవీలకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందిస్తున్నారు. క్రమంగా వీటి వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తయారీదారులు ఈవీల బ్రేకింగ్ వ్యవస్థ, టైర్ల నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారించాలని ‘ఎమిషన్ అనలటిక్స్’ సంస్థ సూచించింది. గతంలో ఐఐటీ కాన్పూర్ నిర్వహించిన అధ్యయనం ఇదే విషయాన్ని వెల్లడించింది. -
ముంపు అంచున అగ్రరాజ్యం
భూతాపోన్నతి, కాలుష్యం, కార్చిచ్చులు అన్నీ కలిసి ధ్రువపు మంచును వేగంగా కరిగించేస్తున్నాయి. కొత్తగా వచి్చచేరిన నీటితో సముద్ర మట్టాలు అమాంతం పెరిగి తీరప్రాంతాలను తమలో కలిపేసుకోనున్నాయి. ఇలా సముద్రమట్టాల పెరుగుదలతో ముంపు ముప్పును అమెరికాలోని 24 తీరప్రాంత నగరాలు ఎదుర్కోనున్నాయని తాజా అధ్యయనం ఒకటి ప్రమాదఘంటికలు మోగించింది. ఇప్పటికైనా తేరుకోకపోతే అనూహ్యంగా పెరిగే సముద్రమట్టాలను ఆపడం ఎవరితరమూ కాదు. అమెరికాలోని ప్రభావిత 32 తీరనగరాలకుగాను 24 నగరాల వెంట సముద్రమట్టం ప్రతిసంవత్సరం 2 మిల్లీమీటర్ల మేర పెరుగుతోంది. వీటిలోని 12 నగరాల్లో అయితే అంతర్జాతీయ సముద్రమట్టాల సగటు పెరుగుదల రేటును దాటి మరీ జలాలు పైపైకి వస్తున్నాయి. వీటికితోడు ఈ నగరాల్లోని ప్రతి 50 మంది జనాభాలో ఒకరు దారుణమైన వరదలను చవిచూడక తప్పదని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ పరిశోధన తాలూకు సమగ్ర వివరాలు జర్నల్ ‘నేచర్’లో ప్రచురితమయ్యాయి. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకి వాతావరణంలో అనూహ్య ప్రతికూల మార్పులు సంభవిస్తున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా తరచూ హీట్వేవ్లు, కరువులు సంభవించి, కార్చిచ్చులు చెలరేగి సగటు ఉష్ణోగ్రతలను అంతకంతకూ పెచ్చరిల్లుతున్నాయి. దీంతో ధృవాల వద్ద హిమానీనదాలు గతంలో కంటే వేగంగా కరిగిపోతున్నాయి. దీంతో అమెరికా, భారత్సహా పలు ప్రపంచదేశాల తీరప్రాంతాలకు ముంపు ప్రమాదం హెచి్చందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేశారు. మరిన్ని వరదలు 2050 సంవత్సరంకల్లా అమెరికా తీరప్రాంతాల వెంట సముద్రం దాదాపు 0.30 మీటర్లమేర పైకి ఎగిసే ప్రమాదముంది. దీంతో జనావాసాలను సముద్రపు నీరు ముంచెత్తి జనజీవనం అస్తవ్యస్తంకానుంది. సముద్రపు నీటితో కుంగిన నేలలు, రోడ్లు ఇలా ప్రజారవాణా వ్యవస్థ మొత్తం దెబ్బతిననుంది. కొన్ని ప్రాంతాలు మరింతగా కుంగిపోయే ప్రమాదముందని గణాంకసహితంగా అధ్యయనం పేర్కొంది. వచ్చే 30 సంవత్సరాల్లో ప్రతి 35 ప్రైవేట్ ఆస్తుల్లో ఒకటి వరదల బారిన పడి నాశనమయ్యే అవకాశముంది. గత అంచనాలను మించి విధ్వంసం తప్పదని అధ్యయనం హెచ్చరించింది. మట్టం పెరగడంతో లక్షలాది మంది తీరప్రాంత ప్రజల జీవనం ప్రశ్నార్ధకంగా మారనుంది. అమెరికాలో 109 బిలియన్ డాలర్లమేర ఆస్తినష్టం సంభవించవచ్చని ఓ అంచనా. ఈ అధ్యయనంలో పంజాబ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ వారి బృందం సైతం పాలుపంచుకుంది. అమెరికా తీరప్రాంతంలో ముంపును ఎదుర్కోనున్న ప్రాంతాల అంచనా గణాంకాలను సిద్దంచేసింది. ‘నక్షత్రాలు నేలరాలితే ఏం చేయగలం?. చిన్నపాటి వర్షం కూడా పడవ వేగంగా మునగడానికి ప్రబల హేతువు కాగలదు. అలాగే తీరాల వెంట మట్టాలు పెరిగితే కలిగే విపత్తులు, విపరిణామాలు దారుణంగా ఉంటాయి’ అని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త రాబర్ట్ నెకొలస్ ఆందోళన వ్యక్తంచేశారు. ముంపు అవకాశమున్న 32 నగరాలు బోస్టన్, న్యూయార్క్ సిటీ, జెర్సీ సిటీ, అట్లాంటిక్ సిటీ, వర్జీనియా బీచ్, విలి్మంగ్టన్, మేర్టల్ బీచ్, చార్లెస్టన్, సవన్నా, జాక్సన్విల్లే, మయామీ, నేపుల్స్, మొబిల్, బిలోక్సీ, న్యూ ఓర్లీన్స్, స్లైడెల్, లేక్ చార్లెస్, పోర్ట్ ఆర్ధర్, టెక్సాస్ సిటీ, గాల్వెస్టన్, ఫ్రీపోర్ట్, కార్పస్ క్రిస్టీ, రిచ్మండ్, ఓక్లాండ్, శాన్ ప్రాన్సిస్కో, సౌత్ శాన్ ప్రాన్సిస్కో, ఫాస్టర్ సిటీ, శాంటాక్రూజ్, లాంగ్ బీచ్, హటింగ్టన్ బీచ్, న్యూపోర్ట్ బీచ్, శాండియాగో – సాక్షి, నేషనల్ డెస్క్ -
Copernicus Climate Change Service: ఏడాదంతా భూతాపం 1.5 డిగ్రీల పెరుగుదల
న్యూఢిల్లీ: కాలుష్యం, భూతాపం కారణంగా భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయన్నది తెలిసిన సంగతే. కానీ, 2023 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి దాకా ఏడాదంతా భూసగటు ఉష్ణోగ్రత 1.52 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదైనట్లు యూరోపియన్ యూనియన్కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసు (సీ3ఎస్) గురువారం వెల్లడించింది. 1850–1900 నాటి ఉష్ణోగ్రతల సగటుతో పోలిస్తే ఏడాది పొడవునా 1.52 డిగ్రీలు అధికంగా నమోదు కావడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని చెప్పడానికి ఇదొక సంకేతమని తెలియజేసింది. ఈ ఏడాది జనవరి నెల అత్యంత వేడి జనవరిగా రికార్డుకెక్కిందని వివరించింది. 1850–1900 నాటి కంటే ఈ జనవరిలో 1.66 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. వాతావరణంలో ఎల్ నినో పరిస్థితులే ఇందుకు కారణమని అభిప్రాయపడింది. వాతావరణ మార్పులతోపాటు సెంట్రల్ పసిఫిక్ సముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడం వల్ల భూఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని కోపరి్నకస్ క్లైమేట్ చేంజ్ సరీ్వసు స్పష్టం చేసింది. -
ఢిల్లీని కమ్మేసిన పొగ మంచు
ఢిల్లీ: ఢిల్లీలో దట్టమైన కాలుష్యానికి తోడు పొగ మంచు అలుముకుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పొగ మంచు ప్రభావంతో 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. క్యాట్ -3 టెక్నాలజీ లేని విమానాలపై పొగ మంచు ప్రభావం పడుతోంది. ఢిల్లీ వాయు నాణ్యత 328 పి.ఎం.తో వెరీ పూర్ కేటగిరికి చేరింది. కాలుష్యం, పొగ మంచుతో ప్రజలకు అనారోగ్య సమస్యలు తెలుత్తుతున్నాయి. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. చలితీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు చేశారు. వృద్ధులు, చిన్నపిల్లలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మాస్క్లు తప్పనిసరిగా వాడాలని పేర్కొన్నారు. CAT III లేని విమానాలు ప్రభావితం కావచ్చని విమానయాన అధికారులు తెలిపారు. సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత ఎయిర్లైన్ను సంప్రదించాలని కోరారు. అసౌకర్యం ఏర్పడనున్న నేపథ్యంలో విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అటు.. పొగ మంచు కారణంగా 30 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదీ చదవండి: నేడు కేంద్ర అఖిలపక్ష భేటీ -
అక్కడ ప్రతి ఐదు వాహనాల్లో ఒకటి ఈవీ.. భారీ రాయితీలే కారణమా?
నిత్యం కాలుష్యంతో సతమతవుతున్న దేశ రాజధాని ఢిల్లీ వాతావరణ కాలుష్య కోరల్లో నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో ఒకటి సంప్రదాయ ఇంధన వాహనాలను తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం. ఇది సఫలమైనట్టుగానే కనిపిస్తోంది. వాహనాల ఉద్గారాలను తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న దేశ రాజధాని ఢిల్లీ డిసెంబర్ నెలలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయంలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం.. ఢిల్లీలో మొత్తం వాహన విక్రయాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా నవంబర్ 2023లో 9.5 శాతం ఉండగా డిసెంబర్లో 19.5 శాతానికి పెరిగింది. ఢిల్లీలో డిసెంబరు నెలలో అమ్ముడుపోయిన ప్రతి ఐదు వాహనాల్లో ఒకటి ఎలక్ట్రిక్ వాహనం కావడం గమనార్హం. 2020 ఆగస్ట్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించిన ప్రతిష్టాత్మక ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ వల్లే ఇది సాధ్యమైందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం ఈ పాలసీ కింద ఈవీల కొనుగోలుదారులు, తయారీదారులకు వివిధ ప్రోత్సాహకాలు, రాయితీలను అందిస్తోంది. వీటిలో భాగంగా ఎలక్ట్రిక్ కార్లకు రూ. 1.5 లక్షల వరకు క్యాష్బ్యాక్, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఈ-రిక్షాలు, సరుకు రవాణా వాహనాలకు రూ. 30,000 వరకు రాయితీ ఇస్తోంది. దీంతోపాటు పాత పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలకు మార్చుకోవాలనుకునే వారికి స్క్రాపింగ్ ఇన్సెంటివ్లు సైతం ప్రకటించింది. ఒక సంవత్సరంలో నగరం అంతటా 200 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం, పాలసీ అమలును పర్యవేక్షించడానికి 'స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ బోర్డ్'ని ఏర్పాటు చేయడం కూడా ఈ పాలసీ లక్ష్యం. ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థలోని వాటాదారులందరి మధ్య సమన్వయం, సహకారం కోసం త్వరలో ఢిల్లీ ఈవీ ఫోరమ్ను ప్రారంభించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. -
‘పెట్రోల్, డీజిల్ వాహనాలు కొనుగోలు చేయం’.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఏటా 70లక్షల మందికి పైగా ప్రాణాలను కబళిస్తోంది. వాతావరణంలోకి చేరుతున్న సూక్ష్మ ధూళి కణాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండెపోటు వస్తున్నాయి. ముఖ్యంగా ఎదుగుతున్న దశలో పిల్లల శ్వాస, నాడీ వ్యవస్థలను వాయు కాలుష్యం తీవ్రంగా దెబ్బతీస్తోంది. దాంతో పిల్లల్లో న్యుమోనియా కేసులు అధికమవుతున్నాయి. పెచ్చరిల్లుతున్న వాయు కాలుష్యం వాతావరణంలోనూ అనూహ్య మార్పులు తీసుకొస్తోంది. మొత్తంగా ఇది కంటికి కనిపించని శత్రువుగా పరిణమించింది. భారత్లోనూ ఈ సమస్య పోనుపోను తీవ్రతరమవుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంప్రదాయంగా పెట్రోల్, డీజిల్లతో నడిచే వాహనాల కొనుగోళ్లపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలేవీ కూడా 2024 జనవరి ఒకటో తేదీ (సోమవారం) నుంచి డీజిల్, పెట్రోల్లతో నడిచే వాహనాలను కొనుగోలు చేయవద్దని ఆదేశించారు. ఈ నిర్ణయం ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించడంతోపాటు ‘గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ ప్రదేశ్’ లక్ష్య సాధనకు దోహదం చేస్తుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఒకవేళ ప్రభుత్వ శాఖలు పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు కొనాలంటే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తప్పనిసరి అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 185, ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాలు 2733గా ఉందని సీఎం తెలిపారు. ఇదీ చదవండి: అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..! ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల నుంచి సేకరించిన సమాచారంతో స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ ఏటా వాయు ప్రమాణాలను అధ్యయనం చేస్తోంది. దాని ఆధారంగా ప్రపంచ వాయు నాణ్యత నివేదికను రూపొందిస్తుంది. ఈ ఏడాది మార్చిలో వెలువరించిన నివేదికలో ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత దేశాల జాబితాలో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. -
గ్యాస్ చాంబర్గా రాజధాని.. కనిపించని సూర్యుడు!
దేశరాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు అలముకుంది. న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 6.2 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువ. డిసెంబర్లో రెండోసారి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా శనివారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత తొమ్మిది డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశం ఉంది. శనివారం ఢిల్లీలో నాలుగు నుండి 10 కిలోమీటర్ల వేగంతో ఆగ్నేయ దిశ నుండి ఓ మోస్తరు గాలులు వీచే అవకాశం ఉంది. ఢిల్లీలో డిసెంబర్ 28 వరకు ఉదయం పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గాలి దిశలో మార్పు, తగ్గిన వేగం కారణంగా రాజధాని మరోసారి గ్యాస్ ఛాంబర్గా మారింది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా జనం కళ్ల మంటలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఎన్సిఆర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 409గా నమోదయ్యింది. ఇది తీవ్రమైన విభాగంలో ఉంది. ఇది గురువారం కంటే 48 సూచీలు ఎక్కువ. శుక్రవారం మధ్యాహ్నానికి కూడా సూర్యుడు కనిపించలేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఢిల్లీలోని 24 ప్రాంతాల్లో గాలి తీవ్రమైన కేటగిరీలో నమోదైంది. ఇది కూడా చదవండి: ‘జనవరి 22.. ఆగస్టు 15 లాంటిదే’ -
ఢిల్లీలో మరింత దిగజారిన గాలి నాణ్యత
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్లో గత నెల రోజులుగా కాలుష్య తీవ్రత కొనసాగుతోంది. దీపావళికి ముందు కురిసిన వర్షంతో ఇక్కడి జనం కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ, దీపావళి నుండి కాలుష్యం ‘అతి పేలవమైన’ స్థాయికి చేరడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం కూడా ఢిల్లీలో గాలి నాణ్యత సూచి(ఏక్యూఐ) 300 కంటే ఎక్కువగా ఉంది. అంటే అతి పేలవమైన కేటగిరీలో ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత స్థాయి 360 దాటింది. ఆనంద్ విహార్లో ఏక్యూఐ 350, ఆర్కె పురంలో 325, పంజాబీ బాగ్లో 332, ఐటీవోలో 328గా ఉంది. శనివారం నుంచి గాలి వేగం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ ఏక్యూఐ శుక్రవారం 324గా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో గాలి వేగం తక్కువగా ఉంది. పగటిపూట గాలి వేగం సాధారణంగా గంటకు పది కిలోమీటర్ల కంటే తక్కువగానే ఉంటుంది. అందుకే ఇక్కడి గాలిలో కాలుష్య కణాలు ఎక్కువ కాలం ఉంటాయి. శనివారం, ఆదివారాల్లో ఢిల్లీవాసులు ప్రాణాంతక కాలుష్యం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో గాలి వేగం గంటకు 12 నుంచి 16 కిలోమీటర్లు ఉండవచ్చు. బలమైన గాలి ప్రభావం కారణంగా కాలుష్యం తగ్గే అవకాశాలున్నాయి. శుక్రవారం ఆకాశం నిర్మలంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా 25.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. శనివారం కూడా ఉదయం తేలికపాటి పొగమంచు, పగటిపూట నిర్మలమైన ఆకాశం ఉండనుంది. గరిష్ట ఉష్ణోగ్రత 25, కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చు. శని, ఆదివారాల్లో ఈదురు గాలులు వీస్తాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉన్నందున ఉదయం, సాయంత్రం వేళల్లో చలి పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: హాయిగా నడుస్తూ వెళ్తున్న వ్యక్తికి హఠాత్తుగా పులి ఎదురైతే? -
పేద దేశాలకు ‘వాతావరణ మార్పుల’ నష్టపరిహారం
దుబాయి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయి నగరంలో కాప్–28 సదస్సు గురువారం ప్రారంభమైంది. 12 రోజులపాటు సదస్సు జరగనుంది. తొలిరోజు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. శిలాజ ఇంధనాల వాడకం మితిమీరుతుండడం, తద్వారా పెరుగుతున్న కాలుష్యం, సంభవిస్తున్న వాతావరణ మార్పుల వల్ల పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వాతావరణ మార్పుల్లో ఆయా దేశాల పాత్ర తక్కువే. అయినప్పటికీ నష్టాన్ని మాత్రం భరించాల్సి వస్తోంది. అందుకే వాటికి పరిహారం చెల్లించాలన్న ప్రతిపాదనకు కాప్–28 సదస్సులో ఆమోద ముద్ర వేశారు. -
కోపాన్ని పెంచేస్తున్న కాలుష్యం..
దేశరాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం ప్రజల మానసిక ఆరోగ్యంపై తీవ్రం ప్రభావం చూపుతోంది. వాయు కాలుష్యం కారణంగా ఇక్కడి జనంలో చికాకు, కోపం, ఒత్తిడి తదితర సమస్యలు పెరుగుతున్నాయి. అత్యంత కలుషిత నగరాల్లో నివసించే జనం డిప్రెషన్, నిద్రలేమి, తలనొప్పి, ప్రవర్తనలో మార్పులు, మానసిక అలసట లాంటి సమస్యలను ఎదుర్కొంటారని పలు పరిశోధనలు చెబుతున్నాయి. కాలుష్యం మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా మనిషిలో కోపం, హింసాత్మక ప్రవర్తన పెరుగుతుంది. విషపూరితమైన గాలిలో ఉండే హానికరమైన పదార్థాలు మనిషి మెదడుకు చేరి, దానిని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా కాలుష్యపూరిత ప్రాంతాల్లో నివసించేవారు అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం అనేది మెదడును దెబ్బతీస్తుంది. నాడీ కణాల మధ్య కమ్యూనికేషన్ను అడ్డుకుంటుంది. జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాధులకు కారణమవుతుందని నిరూపితమయ్యింది. ఎవరైనా కలుషితమైన గాలిని పీల్చినప్పుడు, శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్రావం పెరుగుతుంది. ఈ హార్మోన్లు మనిషి మెదడును ప్రభావితం చేస్తాయి. దాని సాధారణ పనితీరులో జోక్యం చేసుకుంటాయి. ఫలితంగా అసౌకర్యం, ఆందోళన, ఒత్తిడిని ఎదురవుతుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిర్ణయం తీసుకునే శక్తి కూడా తగ్గుతుంది. రాజధానిలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా చాలామంది బయటకు వెళ్లడం లేదు. మునుపటిలా స్నేహితులు, బంధువులను కలవడం తగ్గించేశారు. కనీసం పార్కుకు వెళ్లడం లేదా బయట నడవడం కూడా మానుకున్నారు ఫలితంగా ఒంటరితనం, నిరాశకు గురవుతున్నారు. ఫలితంగా అలాంటి వారిలో చికాకు, కోపం పెరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: ఒకవైపు కాలుష్యం.. మరోవైపు వణికిస్తున్న చలి! -
ఒకవైపు కాలుష్యం.. మరోవైపు వణికిస్తున్న చలి!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజల ఊపిరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి దిశలో మార్పు, వేగం తగ్గడం వల్ల ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మళ్లీ తీవ్ర వర్గానికి చేరుకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీసీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం జహంగీర్పురిలో 434, బవానాలో 441, ద్వారకలో 412, బురారీలో 441, ఆనంద్ విహార్లో 387, అశోక్ విహార్లో 386గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) నమోదైంది. ఢిల్లీ-ఎన్సిఆర్లో పొగమంచు కమ్మేయడంతో పాటు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. పర్వతాలపై మంచు కురుస్తుండటంతో మైదాన ప్రాంతాల్లో చలి పెరుగుతోంది. సాయంత్రం వేళల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఫలితంగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా 10.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. సగటు గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదైంది. ఇదిలా ఉండగా వాయు కాలుష్య నియంత్రణకు అనుసరిస్తున్న విధానం తదుపరి దశకు చేరుకుంది. దీంతో రాజధానిలో జీఎన్జీ, బీఎస్4 డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులు మినహా ఇతర బస్సుల ప్రవేశాన్ని నిషేధించనున్నారు. టూరిస్ట్ బస్సులు, కాంట్రాక్ట్ బస్సులు, రాష్ట్ర రవాణా బస్సులు, డీజిల్ బస్సులు మినహా ఇతర రాష్ట్రాల్లోని అన్ని రకాల పర్మిట్లు కలిగిన బస్సులు ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని నిషేధించనున్నట్లు ఒక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: నేపాల్లో మరోమారు భూకంపం.. 4.5 తీవ్రత నమోదు! -
ఢిల్లీలో మరో మూడు,నాలుగు రోజులు విష గాలులే!
ఢిల్లీని మరోమారు పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఫలితంగా విజిబులిటీ దెబ్బతినడమే కాకుండా జనం విషవాయువులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంగళవారం రాజధానిలోని ఐదు ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400 లేదా అంతకంటే ఎక్కువ అంటే ‘తీవ్రమైన’ విభాగంలోకి చేరుకుంది. మరో మూడు నాలుగు రోజులపాటు ఈ విషపూరితమైన గాలి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఢిల్లీ ప్రజలకు లేదని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా గాలి దిశ, వేగం మారడంతో శని, ఆదివారాల్లో కాలుష్య స్థాయిలో కొంత మెరుగుదల కనిపించింది. అయితే ఇప్పుడు గాలిలో ఉధృతి ఏర్పడిన కారణంగా కాలుష్య స్థాయి మళ్లీ పెరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత సూర్యరశ్మి బలహీనంగా మారి వాతావరణంలో పొగమంచు కమ్ముకుంది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం సఫ్దర్జంగ్ వాతావరణ కేంద్రం వద్ద మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు దృశ్యమాన స్థాయి 1500 మీటర్ల వరకు ఉంది. సాధారణంగా రెండు వేల మీటర్లు ఉండాలి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఢిల్లీలో ఏక్యూఐ 372గా నమోదైంది. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రత 11.5 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదైంది. గాలిలో తేమ స్థాయి 95 నుంచి 56 శాతంగా నమోదైంది. లోధి రోడ్డు అత్యంత శీతల ప్రాంతం. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 26.0 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 11.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బుధవారం కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది కూడా చదవండి: అమేథీలో మళ్లీ రాహుల్ Vs స్మృతి? -
Climate Change: డేంజర్ మార్క్ దాటేశాం
భయపడుతున్నంతా అవుతోంది. మితిమీరిన కాలుష్యం, ఇంధన వాడకం, అడ్డూ అదుపూ లేని పారిశ్రామికీకరణ, విచ్చలవిడిగా అడవుల నరికివేత భూమిని శరవేగంగా వినాశనం వైపు నెడుతున్నాయి. వీటివల్ల భూతాపోన్నతి అతి త్వరలో ‘2 డిగ్రీ’ల అంతిమ హద్దును దాటుతుందని, అదే జరిగితే సర్వనాశనమేనని పర్యావరణప్రియులు, శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా హెచ్చరిస్తుండటం తెలిసిందే. ఈ పెను విపత్కర పరిస్థితిని నివారించడమే ఏకైక లక్ష్యంగా చిన్నా పెద్దా దేశాలన్నీ దశాబ్దాలుగా మేధోమథనం చేస్తున్నాయి. గ్లోబల్ వారి్మంగ్కు అడ్డుకట్ట వేసేందుకు భారీ లక్ష్యాలు నిర్దేశించుకుంటూ వస్తున్నాయి. అందుకు వందల కోట్ల డాలర్లను కేటాయిస్తున్నట్టు ప్రకటనలు చేస్తున్నాయి. అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని, ఆ లక్ష్యాల సాధనకు క్షేత్ర స్థాయిలో చేస్తున్నదేమీ లేదని తేలిపోయింది. నవంబర్ 17న అంతటి విపత్కర పరిస్థితిని భూమి తొలిసారిగా రుచిచూసింది. భూతాపంలో గత శుక్రవారం తొలిసారి ఏకంగా 2 డిగ్రీల పెరుగుదల నమోదైంది! భూగోళాన్ని మనం శరవేగంగా వినాశనం దిశగా నెడుతున్నామనేందుకు ఇది తాజా హెచ్చరిక సంకేతమేనని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు...! వినాశనమే...? గ్లోబల్ వారి్మంగ్తో ఎదురయ్యే ప్రమాదాన్ని కళ్లకు కట్టేందుకు పర్యావరణవేత్తలు భూతాపాన్ని పారిశ్రామికీకరణకు ముందు నాళ్లతో, అంటే 1850–1900 మధ్య కాలంతో పోల్చి చెబుతుంటారు. అప్పటితో పోలిస్తే భూతాపం ఇప్పటికే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా పెరిగిపోయింది. దానికే కొన్నేళ్లుగా కనీవినీ ఎరగని ఉత్పాతాలతో ప్రపంచమంతా అతలాకుతలమైపోతోంది. అలాంటిది, నవంబర్ 17న సగటు భూతాపంలో పెరుగుదల కొద్దిసేపు ఏకంగా 2.06 డిగ్రీలుగా నమోదైందని యూరప్లోని కోపరి్నకస్ వాతావరణ మార్పుల సంస్థ సోమవారం ప్రకటించింది! 1991–2020 మధ్య నమోదైన భూతాప సగటుతో పోలి్చనా ఇది ఏకంగా 1.17 డిగ్రీలు ఎక్కువని సంస్థ డిప్యూటీ డైరెక్టర్ సమంతా బర్గెస్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆమె చేసిన పోస్టు పర్యావరణవేత్తల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ‘‘గ్లోబల్ వారి్మంగ్కు అడ్డుకట్ట వేయకుంటే సర్వనాశనం తప్పదన్న హెచ్చరికలను సంపన్న దేశాలు పెడచెవిన పెడుతున్నాయని తేలిపోయింది. భూమిపై జీవజాలాన్ని తుడిచిపెట్టగల ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నామన్న మాటలు నీటి మూటలేనని రుజువైంది’’ అంటూ వారు మండిపడుతున్నారు. మానవాళి చరిత్రలో నవంబర్ 17 దుర్దినమేనని సైంటిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కాప్’ లక్ష్యాలన్నీ గాలికి... గ్లోబల్ వారి్మంగ్ను 2 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి, సరిగ్గా చెప్పాలంటే 1.5 డిగ్రీలకు పరిమితం చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పారిస్ పర్యావరణ సదస్సులో ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి. దాని సాధనే ప్రధాన లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏటా కాప్ సదస్సులు నిర్వహించుకుంటూ వస్తున్నాయి. కాప్–27 పర్యావరణ సదస్సు గతేడాది నవంబర్లో జరిగింది. పర్యవారణ లక్ష్యాల సాధనకు ఆర్థిక వనరుల్లేని పేద దేశాలకు వందలాది కోట్ల డాలర్లు గ్రాంట్గా అందజేసేందుకు సంపన్న దేశాలన్నీ అంగీకరించాయి. గ్లోబల్ వారి్మంగ్కు అడ్డుకట్ట వేసేందుకు తామంతా కూడా చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రకటించాయి. ముఖ్యంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని దాదాపుగా తగ్గించేస్తామని చెప్పుకొచ్చాయి. కానీ వాస్తవంలో జరుగుతున్నది వేరు... ► చాలా దేశాలు శిలాజ ఇంధనోత్పత్తిని 2030కల్లా రెట్టింపు, అంతకంటే ఎక్కువ చేయనున్నాయని ఐరాస గత వారం విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది! ► గ్లోబల్ వారి్మంగ్ 1.5 శాతానికి పెరగకుండా ఉండాలంటే కర్బన ఉద్గారాలను 2030కల్లా 45 శాతం తగ్గించాల్సి ఉంది. గత కాప్ సదస్సులో దేశాలన్నీ నిర్దేశించుకున్న లక్ష్యం కూడా అదే. కానీ అన్ని దేశాలూ తమ తమ పర్యావరణ లక్ష్యాలను సాధించినా కర్బన ఉద్గారాలు 2030కల్లా 9 శాతం పెరుగుతాయని హెచ్చరించింది. ► గ్లోబల్ వార్మింగ్ ఉత్పాతానికి అడ్డుకట్ట వేసేందుకు దేశాలు చేయాల్సినంత ప్రయత్నం చేయడం లేదని పలు అంతర్జాతీయ పర్యావరణ నివేదికలు కూడా ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. ► ముఖ్యంగా గ్రీన్హౌజ్ వాయువుల ఉద్గారాన్ని తగ్గించేందుకు కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడం చాలా అవసరమని బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్లో క్లైమేట్ సైన్స్ ప్రొఫెసర్ రిచర్డ్ అలన్ స్పష్టం చేస్తున్నారు. ► గత సదస్సుల వాగ్దానాలేవీ ఆచరణలోకి రాలేదన్న పెదవి విరుపుల మధ్య మరో రెండు వారాల్లో దుబాయ్లో కాప్–28 సదస్సు జరగనుంది. అందులో ఏమేం చర్చిస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి! వినాశనమే...? ఉష్ణోగ్రతలో ఒకట్రెండు డిగ్రీల పెరుగుదలతో ఏమవుతుంది లెమ్మనుకుంటే చాలా పొరపాటు. భూమి సగటు ఉష్ణోగ్రత అతి తక్కువగా పెరిగినా తీవ్ర పర్యవసానాలుంటాయి. అలాంటిది ఒక డిగ్రీ పెరిగిందంటే అది తీవ్ర ప్రభావమే చూపుతుంది. పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే అదే జరుగుతోంది! గత వందేళ్లలో భూతాపం విపరీతంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే సగటున ఒకటిన్నర డిగ్రీల మేరకు పెరిగిపోయింది. దాంతో నానారకాల పర్యావరణ ఉత్పాతాలతో మానవాళి అతలాకుతలం అవుతోంది. అదే ఉష్ణోగ్రతలో పెరుగుదల గనక 2 డిగ్రీలకు చేరితే కనీవినీ ఎరగని వినాశనం, కష్టనష్టాలు తప్పవని పర్యావరణవేత్తలు ఎప్పట్నుంచో నెత్తీనోరూ బాదుకుంటున్నారు. భూతాపోన్నతి 1.5 డిగ్రీలను దాటిన కొద్దీ దారుణాలు జరుగుతాయి. అదే 2 డిగ్రీలు పెరిగిందంటే... ► పెను తుఫాన్లు, తీవ్ర దుర్భిక్షం వంటి అతి దారుణ పరిస్థితులు తలెత్తుతాయి. ► పర్యావరణ సంతులనాన్ని కాపాడటంలో అతి కీలకమైన కోరల్ రీఫ్లు, ధ్రువ ప్రాంతపు మంచు పొరలు సమూలంగా తుడిచిపెట్టుకుపోతాయి. ► పర్యావరణ వ్యవస్థ మరింకెప్పటికీ ఎన్నటికీ బాగుచేయలేనంతగా పాడైపోతుంది. ► క్రమంగా భూమి నివాసయోగ్యం కాకుండా పోతుంది. ► జీవ, జంతు జాలాల మనుగడ ప్రమాదంలో పడుతుంది. ► అత్యుష్ణ పరిస్థితులు స్థిరంగా కొనసాగితే జీవజాలం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. ► గత 12 నెలలు ఆధునిక ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడి నెలలుగా రికార్డుకెక్కాయి. గత ఏడాది కాలంలో పాకిస్తాన్, ఉత్తర అమెరికాలో తీవ్ర వరదలు, ఆస్ట్రేలియా, అమెరికాల్లో కార్చిచ్చులు, మంచు తుఫాన్ల వంటి వైపరీత్యాలతో ప్రపంచం అల్లాడింది. ► మన దేశంలో చూసుకుంటే పారిశ్రామికీకరణకు ముందు చెన్నై సగటు ఉష్ణోగ్రత 28 డిగ్రీలుండేది. ఇప్పుడది 29.5 డిగ్రీలు దాటేసింది! ఇదే ధోరణి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ప్రతిఫలిస్తోంది. ► ఇటీవలే ఉత్తరాఖండ్లో భూమి బీటలుబారడం తెలిసిందే. భూతాపంలో పెరుగుదల 2 డిగ్రీల సెంటీగ్రేడ్ల సరిహద్దును దాటింది కొద్దిసేపు మాత్రమే. కానీ భూమి నానాటికీ ఆమోదయోగ్యం కానంతగా వేడెక్కిపోతోందనేందుకు ఇది అతి పెద్ద సంకేతం. ఇదే ధోరణి ఇంకొంతకాలం కొనసాగితే దిద్దుబాటు అసాధ్యమే కావచ్చు! – సమంతా బర్గెస్, డిప్యూటీ డైరెక్టర్, కోపర్నికస్ వాతావరణ మార్పుల సంస్థ – సాక్షి, నేషనల్ డెస్క్ -
దక్షిణాసియాలోనే అధిక కాలుష్యం ఎందుకు? కట్టడి ఎలా?
శీతాకాలం రాగానే ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా దేశంలోని అనేక నగరాలు వాయు కాలుష్యానికి లోవుతుంటాయి. పొగ మంచు దుప్పటిలో దూరిన విషపూరిత వాయు కాలుష్యం ప్రజల జీవనాన్ని అవస్థలపాలు చేస్తోంది. కాలుష్యం కారణంగా ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలలో పరిస్థితి చాలా దారుణంగా మారింది. అయితే చలికాలంలో కాలుష్యం అంతలా ఎందుకు తీవ్రమవుతుందని, దీని ప్రభావం దక్షిణాసియాపైనే ఎందుకు అధికంగా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిపుణుల అభిప్రాయం ప్రకారం గత రెండు దశాబ్దాలలో దక్షిణాసియా ప్రాంతంలో వేగంగా పారిశ్రామికీకరణ జరిగింది. ఆర్థికాభివృద్ధి ఊపందుకుంది. జనాభా కూడా అంతే వేగంగా పెరిగింది. వీటన్నింటి కారణంగా డీజిల్,పెట్రోల్, ఇతర ఇంధన వనరుల వినియోగం అత్యధికం అయ్యింది. ఫలితంగా కాలుష్య స్థాయి కూడా పెరిగింది. వీటన్నింటికీతోడు దక్షిణాసియాలో దారుణమైన కాలుష్యం వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి.ఢిల్లీ-ఎన్సిఆర్లో శీతాకాలపు కాలుష్యానికి అతిపెద్ద కారణం పంజాబ్, హర్యానాలో రైతులు పంటలను కాల్చడం. ఈ ప్రాంతంలో 38 శాతానికి పైగా కాలుష్యం వరి పొలాల్లోని వృథా గడ్డిని కాల్చడం కారణంగానే ఏర్పడుతోంది. దీనికితోడు గత కొన్నేళ్లుగా ఢిల్లీలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీటి నుంచి వెలువడే పొగ కూడా కాలుష్యానికి కారణంగా నిలుస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీ రోడ్లపై దాదాపు 80 లక్షల వాహనాలు నడుస్తున్నాయి. ప్రతి వెయ్యి మందికి 472 వాహనాలు ఉన్నాయి. అంటే ఢిల్లీలో ప్రతి ఇద్దరికి సగటున ఒక వాహనం ఉంది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వాలు అనేక పద్ధతులను అవలంబిస్తున్నప్పటికీ అవేవీ తగినంతగా లేవని తేలింది. భారతప్రభుత్వం హరిత ఇంధనాలపై దృష్టి సారించింది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్నాహాన్ని అందిస్తోంది. అయినా కాలుష్య నియంత్రణకు అడ్డుకట్ట పడటం లేదు. ఢిల్లీ-ఎన్సిఆర్తో సహా దక్షిణాసియాలోని ప్రధాన నగరాల్లో కాలుష్య సమస్య నుండి బయటపడటం కష్టమైన పని కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని కోసం విధాన రూపకర్తలు తమ సంకల్ప శక్తిని ప్రదర్శించాలంటున్నారు. ప్రభుత్వాలు స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని చట్టాలను రూపొందించాలని, వ్యవసాయం, ఇతర కార్యకలాపాల నుండి ఉత్పన్నమయ్యే వ్యర్థాలను తగిన విధంగా పారవేయాలని సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: పాక్కు చైనా అందిస్తున్న ఆయుధ సహకారమెంత? -
ఢిల్లీలో రోడ్లు కనిపించక జనం అవస్థలు!
ఢిల్లీలో వాయుకాలుష్యం కారణంగా జనజీవనం కష్టతరంగా మారింది. డిల్లీ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కాలుష్య స్థాయిలలో గణనీయమైన మెరుగుదల కనిపించడంలేదు. గురువారం ఢిల్లీలో వాయు నాణ్యత మరోసారి ‘తీవ్ర’ కేటగిరీలో కనిపించింది. కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు పలు అవస్థలు పడుతున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఢిల్లీలోని బవానాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)442, ఐటీఓలో 415, జహంగీర్పురిలో 441, ద్వారకలో 417, అలీపూర్లో 415, ఆనంద్ విహార్,ఢిల్లీ విమానాశ్రయంలో 411గా నమోదయ్యింది. రాజధానిలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు, పాదచారులకు ఎదుటనున్నవి స్పష్టంగా కనిపించడం లేదు. విజిబులిటీ మరింతగా క్షీణించింది. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం గురించి హర్షిత్ గుప్తా అనే యువకుడు మాట్లాడుతూ తాను యూపీ నుంచి వచ్చానని, ఢిల్లీలో ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తున్నదని వాపోయాడు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం క్షీణించడం ఖాయమని గుప్తా పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: గడచిన పదేళ్లలో ఘోర రైలు ప్రమాదాలివే.. #WATCH | A layer of haze covers Delhi as the air quality in several areas in the city remains in 'Severe' category. (Visuals from Akshardham, shot at 7:20 am) pic.twitter.com/u7Iuqgf4mZ — ANI (@ANI) November 16, 2023 -
ఇంకా తెల్లారని ఢిల్లీ.. పొగమంచు వీడేనా?
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాయు నాణ్యత ‘తీవ్రం’గానే ఉంది. దీపావళి తర్వాత, దేశ రాజధానిలో కాలుష్య సంక్షోభం తిరిగి తలెత్తింది. నగరం విషపూరిత పొగమంచుతో నిండిపోయింది. విజిబులిటీ మరింతగా క్షీణించింది. ఈ పరిస్థితుల నేపధ్యంలో అన్ని వయసుల వారూ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (బుధవారం) ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో గాలిలో కాలుష్యాన్ని కొలిచే సగటు వాయు నాణ్యత సూచిక (ఎక్యూఐ) ‘తీవ్రమైన’ కేటగిరీలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉదయం 6 గంటలకు నమోదు చేసిన డేటా ప్రకారం ఎక్యూఐ ఆర్కే పురంలో 417, ఆనంద్ విహార్లో 430, ఐజీఐ విమానాశ్రయంలో 403, నరేలాలో 430, పంజాబ్ బాగ్లో 423గా నమోదైంది. ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలో ప్రతి సంవత్సరం చలికాలం ప్రవేశించడంతోనే వాయు నాణ్యత మరింతగా క్షీణిస్తుంది. వాహనాల నుంచి వచ్చే కాలుష్యం, పరిశ్రమలు, నిర్మాణ కార్యకలాపాల దుమ్ము, పొలాల్లో గడ్డిని కాల్చడం మొదలైనవి కాలుష్య కారకాలుగా నిలుస్తున్నాయి. ఇది కూడా చదవండి: సుబ్రతా రాయ్కు అమితాబ్తో దోస్తీ ఎలా కుదిరింది? #WATCH | Air quality across Delhi continues to be in the 'Severe' category as per the Central Pollution Control Board (CPCB). (Visuals from IIT Delhi, shot at 6:30 am) pic.twitter.com/AxgNPrXBOv — ANI (@ANI) November 15, 2023 -
ఢిల్లీని బెంబేలెత్తిస్తున్న కాలుష్య స్థాయిలు
దీపావళి తర్వాత ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యం మరింతగా పెరిగింది. గాలి నాణ్యత ‘పేలవమైన’ కేటగిరీకి పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం ఢిల్లీ-ఎన్సిఆర్లో గాలి నాణ్యత స్థాయి 450కి చేరుకుంది. ఆనంద్ విహార్లో ఏక్యూఐ 360, ఆర్కె పురంలో 422, పంజాబీ బాగ్లో 415గా ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీ-ఎన్సిఆర్లో కాలుష్యంతో పాటు పొగమంచు కమ్మేయనుంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ)దీపావళి సందర్భంగా ఢిల్లీలోని 31 ప్రదేశాలలో శబ్ద కాలుష్యాన్ని అంచనా వేసింది. వీటిలో ఏడు నిశ్శబ్ద మండలాలు, ఎనిమిది నివాస ప్రాంతాలు, 11 వాణిజ్య, ఐదు పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. నజాఫ్గఢ్లో అత్యల్ప స్థాయి శబ్ధ కాలుష్యం, కరోల్ బాగ్లో అత్యధిక శబ్ధ కాలుష్యం నమోదైంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ విశ్లేషణ ప్రకారం, దేశ రాజధానిలోని దాదాపు అన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లలో గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం కాలుష్య స్థాయిలు మరింతగా పెరిగాయి. దీపావళి (ఆదివారం) నాడు ఢిల్లీలో 24 గంటల సగటు పార్టికల్ మీటర్(పీఎం)10 గాఢత ఒక క్యూబిక్ మీటరుకు 430 మైక్రోగ్రాములుగా ఉంది. గత సంవత్సరం క్యూబిక్ మీటరుకు 322 మైక్రోగ్రాములు, 2021లో క్యూబిక్ మీటరుకు 748 మైక్రోగ్రాములుగా నమోదయ్యింది. అలీపూర్, పట్పర్గంజ్, నజాఫ్గఢ్, కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్లలో 2022తో పోలిస్తే 2023లో పార్టికల్ మీటర్ 10 సాంద్రతలు పెరిగాయని డీపీసీసీ డేటా వెల్లడించింది. ఇది కూడా చదవండి: గాజాపై హమాస్ పట్టుకోల్పోయింది: ఇజ్రాయెల్ -
కాలుష్య కోరల్లోకి మరో రెండు నగరాలు.. టాప్-10లోకి చేరిన ఇండియన్ సిటీలు ఇవే..
ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలోకి ఢిల్లీతో పాటు మరో రెండు భారతీయ నగరాలు చేరాయి. దేశమంతా ఆదివారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ మొత్తంలో బాణాసంచా కాల్చడంతో ఆ విషపూరిత పొగ గాలిని కమ్మేసింది. ఫలితంగా గాలి నాణ్యత బాగా తగ్గిపోయింది. ప్రపంచంలో వాతావరణ కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల జాబితాను స్విట్జర్లాండ్కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో ఎప్పటిలాగే దేశ రాజధాని ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా అగ్ర స్థానంలో నిలించింది. ప్రస్తుతం అక్కడ గాలి నాణ్యత సూచీ 420 ఉండటంతో దీన్ని 'ప్రమాదకర' కేటగిరీలో చేర్చింది. టాప్-10 లో మరో రెండు నగరాలు అత్యంత కాలుష్యపూరిత నగరాల టాప్ 10 జాబితాలోకి భారత్ చెందిన మరో రెండు నగరాలు చేరాయి. 196 ఏక్యూఐతో కోల్కతా నాల్గవ స్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై 163 ఏక్యూఐతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఏక్యూఐ స్థాయి 400-500 ఆరోగ్యవంతమైన వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఉన్న వ్యాధులు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. ఇక 150-200 స్థాయి ఆస్తమా, ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఏక్యూఐ స్థాయి 0-50 ఉంటే అది మంచిదిగా పరిగణిస్తారు. -
వృద్ధాశ్రమాల్లో ఎయిర్ప్యూరిఫయర్లు, ఆక్సిజన్ సిలిండర్లు!
ఢిల్లీలో వాయుకాలుష్యం చెప్పనలవి కానంతగా పెరిగిపోయింది. ఫలితంగా శ్వాస సంబంధిత సమస్యలు కలిగినవారు ఊపిరి తీసుకునేందుకు సైతం తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపధ్యంలో డిల్లీ ప్రభుత్వం కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా వృద్ధాశ్రమాల్లో ఎయిర్ప్యూరిఫయర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ నగరంలోని వృద్ధాశ్రమంలో ఉంటున్నవారు వీలైంతవరకూ బయటకు వెళ్లకుంటూ ఉంటే మంచిదని, స్వల్ప వ్యాయామాలు, యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తర ఢిల్లీలోని రోహిణిలో ఉన్న శివ ఆశ్రయ్ వృద్ధాశ్రమం సెక్రటరీ రాజేశ్వరి మిశ్రా మాట్లాడుతూ పెరుగుతున్న వాయుకాలుష్యం కారణంగా అత్యవసర అవసరాల కోసం ఆశ్రమంలో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచామన్నారు. న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) పలుచోట్ల ‘ఎయిర్ ప్యూరిఫయర్లు’ ఏర్పాటు చేసింది. ఎన్డీఎంసీ వైస్-ఛైర్మెన్ సతీష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ తాము వృద్ధాశ్రమాలలో నివసించేవారి కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నామని, యోగా తరగతులను కూడా నిర్వహిస్తుంటామని, అయితే ఇప్పుడు పెరుగుతున్న కాలుష్య స్థాయిల దృష్ట్యా వృద్ధుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇది కూడా చదవండి: సీజేఐ ఎదుట సంకేత భాషలో జాతీయ గీతాలాపన! -
‘సరి- బేసి’తో ఎంత ప్రయోజనం? గతంలో ఏం తేలింది?
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది దీపావళి మరుసటి రోజు ఉదయం అంటే నవంబర్ 13 నుండి ప్రారంభంకానుంది. ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) గత కొన్ని రోజులుగా నిరంతరం 450కు పైననే ఉంటూ వస్తోంది. ఏక్యూఐ 201 నుంచి 300 మధ్య ఉంటే గాలి పీల్చుకోవడానికి ‘చెడు’ అయినదిగా పరిగణిస్తారు. ఇది 301-400 మధ్య ఉంటే ‘చాలా పేలవంగా’ ఉన్నట్లులెక్క. 401-500 మధ్య ఉంటే ‘తీవ్రమైనది’గా పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువగా ఉంటే ‘చాలా తీవ్రమైనది’గా పరిగణిస్తారు. నవంబరు 13-20 తేదీల మధ్య గత ఏడేళ్లుగా ఢిల్లీలో సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు. తొలుత దీనిని 2016లో ప్రారంభించారు. సరి-బేసి విధానం అంటే ఏమిటి? రెండు చేత భాగింపబడని సంఖ్యను బేసిగా పరిగణిస్తారు. ఉదాహరణకు 1, 3, 5…. ఇక సరి (ఈవెన్) అంటే రెండు చేత పూర్తిగా భాగింపబడే సంఖ్య. ఉదాహరణకు 2, 4, 6.. ఇవి సరి సంఖ్యలుగా పరిగణిస్తారు. ‘బేసి-సరి’ నియమం ప్రకారం డ్రైవింగ్ చేయడం అంటే.. సరి సంఖ్యగల తేదీలలో.. రిజిస్ట్రేషన్ నంబర్ సరి సంఖ్యతో ముగిసే వాహనాలు మాత్రమే ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఉంటుంది. అదేవిధంగా బేసి సంఖ్యల తేదీలలో.. రిజిస్ట్రేషన్ నంబర్ బేసి సంఖ్యతో ముగిసే వాహనాలు మాత్రమే ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతి కల్పిస్తారు. ఈ పథకాన్ని అమలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం విషయానికొస్తే.. ఢిల్లీ ప్రభుత్వం రోడ్లపై కార్ల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించాలనుకుంటోంది. ఇలా చేయడం వలన వాయు నాణ్యత మెరుగుపడుతుందని భావిస్తోంది. గతంలో ప్రభుత్వం దీనిని అమలు చేసినప్పుడు, టాక్సీలు (సీఎన్జీతో నడిచేవి), మహిళలు నడిపే కార్లు, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు, అన్ని ద్విచక్ర వాహనాలతో సహా అనేక వర్గాల వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో దాదాపు 75 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగాడుతున్నాయి. ఈ 75 లక్షల వాహనాల్లో మూడో వంతు కార్లు. బేసి-సరి పథకం అమలయినప్పుడు ప్రతి రోజు దాదాపు 12.5 లక్షల కార్లు (ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మినహా) ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అవకాశం ఉండదు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏడాది పొడవునా ఉంటుంది. అయితే కొన్ని నెలల్లో (ముఖ్యంగా దీపావళి వచ్చే మాసంలో) వాయు కాలుష్యం మరింత తీవ్రంగా మారుతుంది. పంజాబ్, హర్యానాలలో పంట చేతికొచ్చాక గడ్డిని కాల్చివేస్తుంటారు. ఇది కూడా వాయు కాలుష్యానికి కారణంగా నిలుస్తుంది. అక్కడి నుంచి వచ్చే పొగ ఢిల్లీ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి చైనా, మెక్సికో, ఫ్రాన్స్లోని నగరాల్లో సరి-బేసి విధానాలను అమలు చేస్తున్నారు. అయితే ఈ విధానం ఎంత ప్రభావవంతంగా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. 2019లో ఢిల్లీలో సరి-బేసి విధానం అమలు చేసినప్పుడు నోయిడా, ఘజియాబాద్లలో స్వల్పంగా వాయు కాలుష్యంలో తగ్గుదల కనిపించిందని తేలింది. రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించడం వల్ల తీవ్రమైన కాలుష్య స్థాయిలు ఖచ్చితంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎంత మేరకు ఉంటుందనేది అంచనా వేయడం కష్టమని అంటున్నారు. 2016 జనవరిలో సరి-బేసి విధానాన్ని అమలు చేసినప్పుడు.. ఈ ప్రణాళిక ‘వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో విఫలమైంది’ అని ఒక అధ్యయనం పేర్కొంది. ఇది కూడా చదవండి: కాలుష్యంతో ఏఏ క్యాన్సర్లు వస్తాయి?