-
Rajasthan political crisis: గెహ్లాట్ వర్గం ధిక్కారం!
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్లో రాజకీయ ప్రతిష్టంభన ముదురుపాకాన పడింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పు కోసం కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రయత్నం కాస్తా బెడిసికొట్టి సంక్షోభంగా మారింది. పార్టీ అధ్యక్ష ఎన్నిక వేళ తలనొప్పులను మరింతగా పెంచుతోంది. అధ్యక్ష బరిలో దింపాలని భావించిన సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ రాజస్తాన్ సీఎం పీఠం వదులుకోవడానికి సుముఖంగా లేకపోవడంతో పార్టీ పెద్దలకు ఎటూ పాలుపోవడం లేదు. సీఎంగా కొనసాగుతూనే అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని గెహ్లాట్ భీష్మించుకున్నారు. ఒకరికి ఒకే పదవి నిబంధన ఈ విషయంలో వర్తించదని ఆయన వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఫలితాలు వచ్చేదాకా గెహ్లాట్నే సీఎంగా కొనసాగించాలన్న డిమాండ్పై వెనక్కు తగ్గేందుకు ఆయన వర్గం ఎమ్మెల్యేలు కూడా ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో వారంతా అధిష్టానాన్నే ధిక్కరించేలా వ్యవహరించి గట్టి షాకిచ్చారు! గెహ్లాట్ స్థానంలో ఆయన రాజకీయ ప్రత్యర్థి సచిన్ పైలట్ను సీఎం చేయాలన్న అధిష్టానం యోచనను వ్యతిరేకిస్తూ 108 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏకంగా 82 మంది ఆదివారం స్పీకర్కు రాజీనామా సమర్పించడం తెలిసిందే. పరిస్థితిని చక్కదిద్దేందుకు మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్లను ఆదివారం రాత్రి హుటాహుటిన రాజస్తాన్కు పరిశీలకులగా పంపిన అధిష్టానానికి మింగుడు పడని రీతిలో మరిన్ని షాకులు తగిలాయి. ఎమ్మెల్యేలు కనీవినీ ఎరగని స్థాయిలో ధిక్కార స్వరం విన్పించారు. దీనిపై బీజేపీ కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరింది. పార్టీ నుంచి నేతల నిష్క్రమణ, వరుసగా ఓటములు తదితరాలతో ఇప్పటికే కుదేలైన కాంగ్రెస్ అధిష్టానం ఈ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలతో గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరిలోకి దిగడం అనుమానంగా మారింది. అధిష్టానానికి విశ్వాసపాత్రులైన మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్సింగ్, కమల్నాథ్, సుశీల్కుమార్ షిండే, ముకుల్ వాస్నిక్, కుమారి సెల్జా పేర్లు విన్పిస్తున్నాయి. తాను పోటీ చేయబోనని దిగ్విజయ్ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. కమల్నాథ్ కూడా సోమవారం అదే మాట చెప్పారు. పరిశీలకులకు గెహ్లాట్ వర్గం షాకులు సీఎం గెహ్లాట్ నివాసంలో ఖర్గే, మాకెన్ ఆదివారం రాత్రి అత్యవసరంగా సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. కానీ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలంతా దాన్ని బహిష్కరించడంతో వారు దిమ్మెరపోయారు! చాలాసేపు ఎదురు చూసినా ఎమ్మెల్యేలు రాకపోవడంతో భేటీని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. చివరికి ఒక్కొక్కరిగా వచ్చి తమతో సమావేశం కావాల్సిందిగా ఆదేశించినా ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. పైగా అదే సమయంలో వారంతా కలిసి ఓ మంత్రి ఇంట్లో విడిగా సమావేశమయ్యారు! ‘‘గెహ్లాట్ను తప్పిస్తే ప్రభుత్వ మనుగడే ప్రమాదంలో పడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా చిక్కుల్లో పడుతుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీని తాలూకు వీడియో కూడా మీడియాకు లీకైంది! అనంతరం నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉందంటూ ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాలకు వెళ్లిపోయారు! అనంతరం ఎమ్మెల్యేల తరఫున మంత్రులు శాంతి ధరీవాల్, మహేశ్ జోషి, ప్రతాప్సింగ్ పరిశీలకులతో భేటీ అయ్యారు. ‘‘సీఎం ఎవరనే దానిపై అక్టోబర్ 19 తర్వాత కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడే నిర్ణయం తీసుకోవాలి. రెండేళ్ల క్రితం పైలట్ తిరుగుబాటు సమయంలో ప్రభుత్వానికి విధేయులుగా నిలిచిన ఎమ్మెల్యేల నుంచే సీఎంను ఎన్నుకోవాలి. ఒక్కో ఎమ్మెల్యేలతో విడిగా కాకుండా అందరితో కలిసే మీరు భేటీ అవాలి’’ అంటూ షరతుల చిట్టాను వారి ముందుంచారు. ముందుగా ఎమ్మెల్యేల అనుమానాలను అధిష్టానం నివృత్తి చేయాలని చీఫ్ విప్ మహేశ్ జోషి కూడా డిమాండ్ చేశారు. ఎవరిని సీఎం చేసినా అభ్యంతరం లేదంటూనే, అది తమకు అంగీకారయోగ్యంగా ఉండాల్సిందేనంటూ కుండబద్దలు కొట్టారు. దాంతో విస్తుపోవడం ఖర్గే, మాకెన్ వంతయింది. ఈ వరుస భంగపాట్ల నేపథ్యంలో వారిద్దరూ సోమవారం ఉదయమే హస్తినకు తిరుగుముఖం పట్టారు. అధినేత్రి సోనియాగాంధీ నివాసానికి వెళ్లి జరిగిందంతా వివరించారు. దాంతో ఆగ్రహించిన సోనియా మొత్తం ఉదంతంపై లిఖితపూర్వక మంగళవారానికల్లా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గెహ్లాట్తో సన్నిహిత సంబంధాలున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు కమల్నాథ్ను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించారు. ఆయన సోనియాతో గంటపాటు భేటీ అయ్యారు. గెహ్లాట్ను రాజీకి రప్పించేందుకు కమల్నాథ్ను నియోగించవచ్చంటున్నారు. తీర్మానంలో షరతులా: మాకెన్ గెహ్లాట్ వారసున్ని నిర్ణయించే అధికారాన్ని పార్టీ చీఫ్కు కట్టబెడుతూ సీఎల్పీ భేటీలో ఏకవాక్య తీర్మానం ఆమోదింపజేయాలని ఖర్గే, మాకెన్ తలపోయగా, అధ్యక్షునిగా ఎన్నికయ్యేదాకా గెహ్లాట్ సీఎంగా కొనసాగుతారంటూ అందులో చేర్చాలని ఆయన వర్గం ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఇది క్రమశిక్షణ రాహిత్యమేనంటూ మాకెన్ మండిపడ్డారు. సోనియాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తీర్మానమంటే కేవలం ఏకవాక్యంతో ఉంటుంది. అంతే తప్ప షరతులతో కూడిన తీర్మానాలు కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేవు. సీఎల్పీ భేటీకి డుమ్మా కొట్టి విడిగా సమావేశం కావడం క్షమించరాని విషయం’’ అంటూ ఆగ్రహించారు. ‘‘సీఎంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సింది గెహ్లాటే. తర్వాత అధ్యక్ష పదవికి పోటీ పడేదీ ఆయనే. గెలిస్తే తను సీఎంగా కొనసాగాలో లేదో నిర్ణయించేదీ ఆయనే. ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవదా?’’ అంటూ మండిపడ్డారు. -
గెహ్లాట్ క్షమాపణ!.. బీజేపీ స్పందన
న్యూఢిల్లీ/జైపూర్: ఆదివారం రాత్రి జరిగిన హైడ్రామా.. రాజస్థాన్ రాజకీయాన్ని కీలక మలుపు తిప్పింది. సచిన్ పైలట్కు సీఎం బాధ్యతలు అప్పజెప్పాలన్న అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గెహ్లాట్ వర్గానికి చెందిన 82 మంది ఎమ్మెల్యేల రాజీనామా కలకలం రేపింది. ఆపై ఇవాళంతా ఢిల్లీ పెద్దల రాజస్థాన్ పర్యటన నేపథ్యంలో పెద్ద హైడ్రామానే నడిచింది. అయితే ఈ పరిణామాలపై బీజేపీ నేత అమిత్ మాలవియా స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల కోసం అశోక్ గెహ్లాట్ నామినేషన్ వేస్తారో? లేదో? తెలియదు. కానీ.. ఆయన వర్గం మాత్రం సోనియా గాంధీ రాజకీయ స్థాయిని అమాంతం తగ్గించేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఎవరు అధ్యక్షుడు అయినా సరే.. బలహీనంగా ఉన్న గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా తిరుగుబాటు తలెత్తే అవకాశాలే ఎక్కువంటూ జోస్యం చెప్పారు. అంతేకాదు.. తమను తాము అజేయంగా భావిస్తూ వచ్చిన గాంధీ కుటుంబం ఇప్పుడు కుప్పకూలిందని ఎద్దేవా చేశారాయన. अशोक गहलोत कांग्रेस अध्यक्ष चुनाव के लिए नामांकन करें या नहीं, पर उनकी बग़ावत ने सोनिया गांधी के राजनीतिक कद को बहुत छोटा कर दिया है। अब अध्यक्ष कोई भी बने, लेकिन कमज़ोर गांधी परिवार के ख़िलाफ़ बग़ावत फिर हो सकती है। गांधी परिवार का तथाकथित ‘अजेय’ आभामंडल अब ध्वस्त हो चुका है। — Amit Malviya (@amitmalviya) September 26, 2022 గెహ్లాట్ క్షమాపణ! ఇదిలా ఉంటే.. రాజస్థాన్ గ్రూప్ రాజకీయంపై అధిష్టానం సీరియస్గా ఉంది. గెహ్లాట్ మద్దతుదారులకు ఇప్పటికే హైకమాండ్ నోటీసులు జారీ చేసింది. రాజస్థాన్ పరిణామాలను పార్టీ సీనియర్లు అజయ్ మాకెన్, మల్లికార్జున ఖర్గేలు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి వివరించారు. ఈ క్రమంలో లిఖితపూర్వక నివేదిక ఇవ్వాలని సోనియా స్వయంగా గెహ్లాట్ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక సోమవారం మధ్యాహ్నం పార్టీ కీలక నేత మల్లికార్జున ఖర్గే, గెహ్లాట్ను కలిసి రెబల్ పరిణామాలపై చర్చించారు. అయితే ఈ చర్చల్లోనే ఆయన క్షమాపణ చెప్పినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల తిరుగుబాటుపై ఖర్గేకు అశోక్ గెహ్లాట్ క్షమాపణ చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తనకు సంబంధం లేదని, జరిగి ఉండాల్సింది కాదని గెహ్లాట్.. జరిగిన పరిణామాలపై తాను కలత చెందినట్లు ఖర్గే వద్ద వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే ఇకపై తన చేతుల్లో ఏం లేదని ఆయన పేర్కొన్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. ఇక ఈ సంక్షోభ పరిష్కారానికి కాంగ్రెస్ సీనియర్ కమల్నాథ్ మధ్యవర్తిత్వం వహించే ఛాన్స్ ఉంది. కానీ, కమల్నాథ్ మాత్రం ఈ పరిణామాలపై పెదవి విప్పడం లేదు. అంతేకాదు.. అధ్యక్ష పోటీ నుంచి గెహ్లాట్ తప్పుకోవడం కూడా దాదాపుగా ఖరారైనట్లు సమాచారం అందుతోంది. పార్టీలో తిరుగుబాటు కలకలం రేపడం, పైగా సీనియర్ల నుంచి అభ్యంతరాల నేపథ్యంలో ఆయన పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో.. దిగ్విజయ్ సింగ్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఉండే అవకాశం ఉందన్న కథనాలు వెలువడుతున్నాయి. -
‘అదే జరిగితే.. రాజస్థాన్లో కాంగ్రెస్కు పంజాబ్ తరహా ఓటమి’
జైపూర్: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అశోక్ గెహ్లాట్ తన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి రావటంపై రాజస్థాన్లో తీవ్ర సంక్షోభానికి దారి తీసిన సంగతి తెలిసింది. గెహ్లాట్ సీఎంగా ఉండాలని ఆయన మద్దతుదారులు 80 మందికిపైగా తమ రాజీనామాను స్పీకర్ సీపీ జోషికి అందించారు. రాజీనామాలు అందించేందుకు ముందు ఎమ్మెల్యేలు సమావేశమైన ఓ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్ నివాసంలో ఆదివారం సమావేశమయ్యారు గెహ్లాట్ మద్దతు ఎమ్మెల్యేలు. ఈ వీడియోలో.. కాంగ్రెస్ హైకమాండ్ను ధరివాల్ హెచ్చరిస్తున్నట్లు వినబడుతోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ను తొలగిస్తే.. పార్టీకి తీరని నష్టం జరుగుతుందని, పంజాబ్లో మాదిరిగా ఘోర ఓటమి తప్పదని పేర్కొన్నారు. ‘అశోక్ గెహ్లాట్ ప్రస్తుతం ఎలాంటి రెండు పదవులు అనుభవిస్తున్నారని హైకమాండ్లోని ఎవరైనా చెప్పగలరా? ప్రస్తుతం సీఎం పోస్ట్ను వదులుకోవాలని ఎందుకు అడుగుతున్నారు? ఆయన రెండో పదవి పొందినప్పుడు దాని గురించి మాట్లాడతాం. ఇలాంటి కుట్ర కారణంగానే పంజాబ్ను కోల్పోయాం. ఇప్పుడు రాజస్థాన్ను కోల్పోయే అంచున ఉన్నాం. ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ను తొలగిస్తే ఓటమి తథ్యం.’ అని పేర్కొన్నారు ధరివాల్. సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు 80 మంది స్పీకర్ను కలిసి తమ రాజీనామాలను ఆదివారం అందించారు. గెహ్లాట్ స్థానంలో సచిన్ పైలట్ను ముఖ్యమంత్రిని చేయాలని హైకమాండ్ భావిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఆందోళన చెందారు. పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలని రాహుల్ గాంధీ ఇటీవలే స్పష్టం చేసిన క్రమంలో అధ్యక్ష పదవి కోసం గెహ్లాట్ సీఎం పదవిని వదులుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదీ చదవండి: రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: గెహ్లాట్ను రేసు నుంచి తప్పించాలంటూ ఫిర్యాదు -
‘గెహ్లాట్ను రేసు నుంచి తప్పించాల్సిందే!’
రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. అశోక్ గెహ్లాట్ స్థానంలో రాజస్థాన్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే వ్యవహారం.. పార్టీలో కల్లోలం రేపింది. అధిష్టాన అనుకూలుడైన సచిన్ పైలెట్ పేరును వ్యతిరేకిస్తూ గెహ్లాట్ మద్దతుదారుల రాజీనామా ఎపిసోడ్తో ప్రభుత్వమే కుప్పకూలే పరిస్థితికి చేరుకుంది. ఈ తరుణంలో.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు స్పందించారు. న్యూఢిల్లీ: అశోక్ గెహ్లాట్ను కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పించాలని కాంగ్రెస్ అధినేత్రి(తాతాల్కిక) సోనియా గాంధీని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వేరే ఎవరినైనా ఎంపిక చేయాలంటూ కోరుతున్నారు. ఆయన మీద నమ్మకంతో.. బాధ్యతలు అప్పగించడం ఏమాత్రం సరికాదు. పార్టీ అధిష్టానం ఆయన అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలించాలి అని కోరుతున్నారు సీడబ్ల్యూసీ సభ్యులు. ఎమ్మెల్యేలను నియంత్రించకుండా.. తెర వెనుక ఉంటూ ఆయన డ్రామాలు ఆడిస్తున్నారంటూ కొందరు సభ్యులు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఆదివారం సాయంత్రం నాటి పరిణామాలను సోనియా గాంధీకి వివరించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మీడియాకు వెల్లడించారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంతా కట్టుబడి ఉండాలని, పార్టీలో క్రమశిక్షణ ఉండి తీరాల్సిందేనని సోమవారం మధ్యాహ్నాం గెహ్లాట్తో భేటీ అనంతరం ఖర్గే వ్యాఖ్యానించారు. ఇక గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉండి.. సీనియర్ సభ్యుడిగా ఉన్న వేరే ఎవరినైనా అశోక్ గెహ్లాట్ స్థానంలో ఎంపిక చేయండని కోరుతున్నారు సీడబ్ల్యూసీ సభ్యులు. ఇదిలా ఉంటే..ఆదివారం సాయంత్రం జరిగిన సీఎల్పీ(కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ) భేటీకి గెహ్లాట్ క్యాంప్లోని ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం, మంత్రి శాంతి ధారివాల్ ఇంట్లో వేరుగా భేటీ కావడం, స్పీకర్ సీపీ జోషికి 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించడంతో.. రాజస్థాన్లో రాజకీయ సంక్షోభ కలకలం రేగింది. ఈ పరిణామాలపై అధిష్టానం గుర్రుగా ఉంది. భేటీకి హాజరుకాని ఎమ్మెల్యేలకు అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడాలని నిర్ణయించిన అశోక్ గెహ్లాట్.. ముఖ్యమంత్రిగానూ కొనసాగాలని భావించారు. అయితే, ఒకే వ్యక్తికి రెండు పదవులు కుదరవని రాహుల్ గాంధీ చెప్పడంతో అసలు రచ్చ మొదలైంది. సీఎం పీఠం నుంచి తప్పుకుంటూనే తనకు విశ్వాసపాత్రుడైన వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టాలని గెహ్లాట్ భావించారు. కానీ, అధిష్ఠానం మాత్రం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్ను సీఎం చేయాలని భావించింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గెహ్లాట్ మాత్రం ప్రస్తుతం స్పీకర్గా ఉన్న సీపీ జోషికి ఆ పదవిని కట్టబెట్టాలని భావించారు. రెండేళ్ల క్రితం గెహ్లాట్ సర్కారుపై సచిన్ పైలట్ తిరుగుబాటు చేశారు. ఇప్పుడిదే ఆయనను సీఎం కాకుండా అడ్డుపడుతోంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన వ్యక్తికి సీఎం పీఠం ఎలా అప్పగిస్తారన్నది గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల అభ్యంతరం. అప్పట్లో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన వారిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో గెహ్లాట్ను గనుక తప్పిస్తే.. శశిథరూర్తో పాటు దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్ లాంటి కొందరు నేతలు రేసులో నిల్చునే అవకాశాలు కనిపిస్తున్నాయి.