-
ఆట గెలవడం కోసం ఇంతలా దిగజారాలా?
ఆటలో ప్రత్యర్థిని ఓడించాలంటే మేదస్సుకు పని పెట్టాల్సిందే. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టి గెలవడం మజాను పంచుతుంది. కానీ గెలవడం కోసం కొందరు అడ్డదారులు తొక్కుతారు. ప్రత్యర్థిని తమ కవ్వింపు చర్యలతో బుట్టలో వేసుకొని మ్యాచ్లు గెలవడం చూస్తుంటాం. తాజాగా పోకర్ గేమ్లో భాగంగా ఒక యువతి స్తనాలు చూపిస్తూతన ప్రత్యర్థులను రెచ్చగొట్టి ఆటను గెలవాలని ప్రయత్నించింది. అసలు విషయం తెలిశాకా మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. షషీమీ.. పోకర్ గేమ్లో స్పెషలిస్ట్. ఎప్పటిలాగే పోకర్ ఆడడానికి ఒక క్లబ్కు వచ్చింది. అయితే షషీమీ స్తనాలు కనిపించేలా డ్రెస్ను వేసుకొని వచ్చింది. అంతే.. ఆట మొదలైనప్పటి నుంచి ఆమె కన్ను పోకర్పై ఉంటే.. ప్రత్యర్థుల కళ్లు మాత్రం ఆమె స్తనాలపై ఉండేలా చూసుకుంది. ఈ క్రమంలోనే గేమ్లో అందరిని చిత్తు చేసి బాగా డబ్బులు సంపాదించింది. గేమ్ ముగిసిన తర్వాత షషీమీ చిన్నపాటి షాక్ ఇచ్చింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత తాను వేసుకొచ్చిన డ్రెస్ను అదే టేబుల్పై విడిచిపెట్టి వెళ్లిపోయింది. దీంతో ప్రత్యర్థి ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. అయితే ఆమె స్తనాలు కనిపించేలా డ్రెస్ వేసుకురాలేదు.. అసలు ఆమె తన స్తనాలను చూపించడం అంతా కల్పితమే. కళ్లను మోసం చేసేలా ఆమె డ్రెస్ ఉండడంతో ప్రత్యర్థులకు దిమ్మతిరిగింది. కానీ గేమ్ ఏదైనా నిజాయితీగా ఆడాలి కానీ.. గెలవడం కోసం ఇంతలా దిగజారడం కరెక్ట్ కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు. -
Hyderabad Police: జోకులేస్తే షాకులిస్తారు!
సాక్షి, హైదరాబాద్: ఓ నెటిజనుడు ట్విట్టర్ వేదికగా పోలీసులపై జోకు పేల్చాడు. దీనికి తమదైన శైలిలో స్పందించిన నగర పోలీసులు అతడికి షాక్ ఇచ్చారు. ఈ పోస్టు ఆదివారం సోషల్మీడియాలో వైరల్ అయింది. చికోటి ప్రవీణ్ వ్యవహారంతో గడిచిన కొన్ని రోజులుగా పేకాట, క్యాసినోలు వార్తల్లో నిలిచాయి. రాష్ట్రంలో అన్ని రకాలైన జూదాలపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలోనే సదరు నెటిజనుడు ట్విట్టర్లో నగర పోలీసు కమిషనర్ను ఉద్దేశించి ఓ ప్రశ్న సంధించాడు. ‘సర్ మా ఇంట్లో మేము పేకాట ఆడుకోవచ్చా? అది చట్టబద్ధమేనా? నియమ నిబంధనలు వివరిస్తారా?’ అని పోస్టు చేశాడు. దీనిపై హైదరాబాద్ సిటీ పోలీసు సోషల్మీడియా టీమ్ నగర పోలీసు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది. ‘సర్ మీ ఇంటికి సంబంధించిన పక్కా లొకేషన్ తెలుసుకోవచ్చా?’ అంటూ సమాధానం ఇచ్చింది. ఈ ట్వీట్ వైరల్గా మారడంతో.. కొద్దిసేపటికే సదరు నెటిజనుడు తన హ్యాండిల్ నుంచి పోస్టును తొలగించాడు. చదవండి: ఒకే మహిళను రెండోసారి పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు, కట్నం వద్దంటూనే -
టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వగ్రామంలో పేకాట
ఉరవకొండ: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వగ్రామం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌకుంట్లలో పేకాట స్థావరంపై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. పలువురు టీడీపీ నేతలతో సహా 56 మందిని అరెస్ట్ చేశారు. రూ.10.51 లక్షల నగదు, ఐదు కార్లు, 14 బైక్లు, 54 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉరవకొండలో గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప, సీఐ శేఖర్లు మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుక భాగంలోని ఖాళీ ప్రదేశంలో భారీ ఎత్తున పేకాట సాగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం సీఐ శేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. వై.రాంపురం గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయుడు, రౌడీషీటర్ ఎర్రిస్వామి, కౌకుంట్ల టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు శీనా సహా 56 మందిని అరెస్ట్ చేశారు. వీరంతా బెళుగుప్ప, కౌకుంట్ల, వై.రాంపురం తదితర గ్రామాలకు చెందిన వారు. టీడీపీ ముఖ్య నేత బోయ మారెప్ప ఆధ్వర్యంలో పేకాట స్థావరం కొనసాగుతున్నట్టు గుర్తించారు. చదవండి: (ఈ పాపం బాబుది కాదా?) -
పేరుకే స్పోర్ట్స్ క్లబ్.. లోపల పేకాట హబ్
సాక్షి, మంచిర్యాల: పత్తాలాట రాష్ట్రంలో పత్తాలేకుండా పోయినా సరిహద్దుల్లో దాని జాడలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పేకాట, మట్కా వంటి జూదాలను ప్రభుత్వం నిషేధించడంతో సరిహద్దుల్లో పేకాట స్థావరాలు వెలిశాయి. మన రాష్ట్రంలో రహస్యంగా ఎక్కడైనా ఆడితే పోలీసు, టాస్క్ఫోర్స్కు చిక్కే ప్రమాదముందని భయపడిన జూదరులు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర సరిహద్దుల్లో ‘చేతివాటం’ప్రదర్శిస్తున్నారు. చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో స్పోర్ట్స్ క్లబ్ల పేరుతో పేకాట దందా సాగుతోంది. భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు ఆనుకుని మహారాష్ట్రలోని సిరోంచ తాలూకా అంకీసా, దుబ్బపల్లి, నందిగాంలో, నిర్మల్ జిల్లా సరిహద్దు నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పట్టణం, బాసర సమీప గ్రామం నవీపేటలో పేకాట జోరుగా నడుస్తోంది. రోజూ వందలాది మంది జూదరులు రూ.లక్షలు పెట్టి పేకాట ఆడుతున్నారు. జూదరుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ, సినీప్రముఖులు, అధికారులు, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. క్లబ్లో సకల సౌకర్యాలు పత్తాలాట నిర్వాహకులు ఏసీ గదుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆడిఆడి అలసిపోతే అక్కడే పడుకోవచ్చు. టాయిలెట్లు, బాత్రూముల వసతి కూడా ఉంది. తాగునీరు, టీ, స్నాక్స్, జ్యూస్లు, చికెన్, మటన్తో కోరిన భోజనం అందిస్తుంటారు. కొందరైతే రోజుల తరబడి అక్కడే బస చేస్తున్న సందర్భాలున్నాయి. జూదరుల జేబులు ఖాళీ అయితే నమ్మకస్తులకు ఒంటి మీది బంగారం, వాహనం కుదవ పెట్టుకుని అప్పులు కూడా ఇస్తుంటారు. ఆటలో నగదుతోపాటు గూగుల్ పే, ఫోన్ పే తోనూ చెల్లిస్తున్నారు. జూదరులకు రానుపోను వాహన ఖర్చులు, ప్రతి ఒక్కరికీ రూ.వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఇస్తున్నారు. సిరోంచకు మంచిర్యాల జిల్లా చెన్నూరు మీదుగా, ఇటు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మీదుగా మంచిర్యాల, ఆసిఫాబాద్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నుంచి జూదరులు వస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాకు చెందిన జూదరులు సరిహద్దు ఉన్న ధర్మాబాద్ వైపు వెళ్తున్నారు. అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్గఢ్లోనూ ఓ క్లబ్ వెలిసినప్పటికీ మావోయిస్టుల ప్రభావంతో దానిని మూసివేశారు. మహారాష్ట్రలో మైండ్ గేమ్గా.. దేశంలో ‘పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867’ప్రకారం నేరుగా డబ్బులతో ఆటలు ఆడటం నిషేధం. చాలా రాష్ట్రాలు పేకాటను పూర్తిగా నిషేధించాయి. మహారాష్ట్ర, గోవా లో షరతులతో కూడిన మైండ్గేమ్గా పిలిచే రమ్మీ ఆడుకోవచ్చు. కానీ, డబ్బులు పెట్టి ఆడటం నిషేధం. మహారాష్ట్రలో ఇండోర్ స్పోర్ట్స్ క్లబ్ల సభ్యులకు పేకాట అనుమతి ఉన్నా డబ్బులు పెట్టి ఆడరాదు. దీనిని ఆసరా చేసుకుని మహారాష్ట్రలో చట్టబద్ధమైన ఆట అని ప్రచారం చేస్తూ తెలంగాణ పేకాట రాయుళ్లకు వల వేస్తున్నారు. గడ్చిరోలి జిల్లా సిరోంచ, నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పట్ట ణం, శివారు నవీపేటలో గోదావరిఖని, మంచిర్యాల, కరీంనగర్, జగిత్యాలకు చెం దిన వాళ్లే క్లబ్లు నిర్వహిస్తున్నారు. ఇటీవల చంద్రాపూర్ జిల్లా రాజురా, పోడ్సా క్లబ్లను అక్కడి అధికారులు మూసివేశారు. రోజుకు రూ. లక్షల్లో ఆర్జన పేకాట నిర్వాహకులకు రోజుకు రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. క్లబ్లో కనీసం రూ.5 వేలు నుంచి రూ.20 వేలతో పేకాట ఆడే టేబుళ్లు ఉన్నాయి. ప్రతి టేబుల్కు తొమ్మిది మంది చొప్పున ఉంటారు. ఇందులో ఒకరి డబ్బులు నిర్వాహకులు తీసుకుంటారు. ఐదువేల టేబుల్కు రూ.ఐదు వేలు, రూ.20 వేల టేబుల్కు రూ.20 వేలు తీసుకుంటారు. ఆటలో గెలిచినవారికి మిగతా డబ్బులు ఇస్తారు. ఒక్కో క్లబ్లో కనీసం ఆరు నుంచి పది టేబుళ్లు ఉన్నాయి. ప్రతి టేబుల్కు ఓ డీలర్ ఉంటాడు. అతడు పేక ముక్కలు పంచడం, లెక్కలు వేయడం, డబ్బులు తీసుకోవడం చేస్తుంటాడు. రోజూ మధ్యాహ్నం మొదలై తెల్లవారు జామున 4 గంటల వరకు పత్తాలాట సాగుతోంది. గతంలో నిమిషాల్లో రూ.లక్షలు ఆవిరి చేసే కట్ పత్తా లాంటి ఆటలు ఆడగా, ప్రస్తుతం రమ్మీ మాత్రమే నడుస్తున్నాయి. ఈ దందాకు స్థానిక రాజకీయ నాయకుల అండదండలు దండిగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
భీమిలి హయగ్రీవ రిసార్ట్స్లో పేకాట
తగరపువలస (విశాఖ): విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం పంచాయతీలోని హయగ్రీవ రిసార్ట్స్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై శనివారం అర్ధరాత్రి తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) అధికారులు దాడిచేసి 22 మందిని అరెస్టు చేశారు. పేకాట ఆడుతున్న వీరి నుంచి రూ.5,70,270 నగదు, ఎనిమిది కార్లు, 23 సెల్ఫోన్లు, నగదుకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్న రూ.21.53 లక్షల విలువైన 323 ప్లాస్టిక్ కాయిన్లు స్వాధీనం చేసుకున్నారు. మధురవాడ జోన్ ఏసీపీ చుక్కా శ్రీనివాసరావు, సీఐ జి.వి.రమణ ఆదివారం భీమిలి పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఎస్ఈబీ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇన్స్పెక్టర్లు పి.అప్పలరాజు, నమ్మి గణేష్, జగదీష్, ఎస్ఐలు సంతోష్, ఖగేష్, అమాన్రావు, జ్ఞానేశ్వరి, పద్మావతి దాడులు జరిపారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాలకు చెందిన 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు టీడీపీ ఇన్చార్జ్ బడేటి రాధాకృష్ణయ్య కూడా ఉండడం గమనార్హం. స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, ప్లేయింగ్ కార్డులు, నగదు, ప్లాస్టిక్ కాయిన్లు వీరే సూత్రధారులు విశాఖ నగరానికి చెందిన దాట్ల కృష్ణంరాజు, చేబోలు శ్రీనివాస్పై పేకాట నిర్వహణ, క్రికెట్ బుకీలుగా నగరంలోని పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి. వీరే బెంగళూరు తదితరచోట్ల ఉన్న పరిచయాలతో వివిధ జిల్లాలకు చెందిన వారితో వీకెండ్లలో పేకాట డెన్లు నిర్వహిస్తున్నారు. అరెస్టు అయింది వీరే.. అరెస్టైన వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సాగిరాజు శ్రీనివాసరాజు(జక్కవరం, కాళ్ల మండలం), కుంచంపూడి రామకృష్ణంరాజు(గణపవరం మండలం), గాదిరాజు శరత్ (భీమవరం), సాగిరాజు హరివర్మ(జువ్వలపాలెం, కాళ్ల మండలం), వేగేశ్న ఆదిత్య (భీమవరం), మంతెన నాగరాజు (మలవని దిబ్బ, కాళ్ల మండలం), నరహరిశెట్టి రాధాకృష్ణ (మేడవల్లి, ఏలూరు), అడ్డాడ సోమరాజు (ఏఎస్ఆర్ నగర్, భీమవరం) ఉన్నారు. విశాఖకు చెందిన వారిలో దాట్ల కృష్ణంరాజు(విశాలాక్షినగర్), సప్పా రవి(మాధవధార), కంతేటి శేషుబాబు(రామ్నగర్), చేబోలు శ్రీనివాస్(విశాలాక్షినగర్), కొల్లిమల్ల నాగ అప్పలరాజు (అనకాపల్లి), ఆడారి జగ్గారావు(చింతల అగ్రహారం), ఆడారి వేణుగోపాలకృష్ణ(అక్కయ్యపాలెం) ఉన్నారు. కృష్ణాజిల్లాకు చెందిన వారిలో చల్లగుల్ల శ్రీకృష్ణ (పెద పాలపర్రు, ముదినేపల్లి మండలం), బలుసు హరికిరణ్ (అడ్డాడ, పామర్రు మండలం), పొట్లూరి మురళీధర్ (దొండపాడు, గుడివాడ మండలం), కొర్ని నాగరాజు(భూషణగుళ్ల, పెద్దపారుపూడి మండలం), తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారిలో యడ్ల రాజారమేష్(వేమగిరి, కడియం మండలం), కూనదరాజు సత్యనారాయణరాజు(మణికిపురం, రాజోలు మండలం) ఉన్నారు. రిసార్ట్స్ యజమాని చిలుకూరి జగదీశ్వరుడు, మేనేజర్ పాతూరి కృష్ణకాంత్లను అరెస్ట్ చేయాల్సి ఉంది. -
ప్రాణం తీసిన పేకాట.. దీపావళి రోజు పోలీసులకు చిక్కి..
సాక్షి, కామారెడ్డి: పేకాట ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడని మృతుడి బంధువులు ఆరోపిస్తుండగా.. తామెమరినీ కొట్టలేదని పోలీసులు పేర్కొంటున్నారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి. బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో ఈ నెల 4న (దీపావళి పండుగ రోజు) కొందరు పేకాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. అక్కడ తొమ్మిది మంది పోలీసులకు చిక్కారు. అందులో భూమబోయి (55) అనే వ్యక్తి అక్కడే పడిపోయి అస్వస్థతకు గురయ్యాడు. అతడిని బాన్సువాడ ఆస్పత్రికి, అక్కడి నుంచి నిజామాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులు కొట్టడం మూలంగానే తలకు గాయమై భూమబోయి అస్వస్థతకు గురయ్యాడని బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తూ 5వ తేదీన పోలీసు స్టేషన్కు తరలివచ్చి ఆందోళనకు దిగారు. రోజంతా అక్కడే ఆందోళన చేశారు. తామెవరినీ కొట్టలేదని పోలీసులు వారికి స్పష్టం చేశారు. నిజామాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో మూడు రోజుల పాటు చికిత్స పొందిన భూమబోయి పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గాంధీ ఆస్పత్రిలో మృతదేహాన్ని ఇవ్వాలన్నా, పోస్టుమార్టం చేయాలన్నా ఎఫ్ఐఆర్ నమోదై ఉండాలని అక్కడి అధికారులు పేర్కొన్నారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులు కొట్టడం మూలంగానే చనిపోయాడని ఫిర్యాదు చేయడాని కి సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు, మృతుడి బంధువుల మధ్య గురు, శుక్రవారాల్లో రెండు రో జుల పాటు చర్చలు జరిగాయి. పోలీసుల తప్పిదం ఏమీలేదని, కొట్టలేదని పోలీసు అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరికి నియోజక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు తలదూర్చి మృతుడి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇవ్వడంతో వారు శాంతించినట్టు సమాచారం. అనారోగ్యంతో చనిపోయినట్టు ఫిర్యాదు ఇవ్వడానికి మృతుడి బంధువులు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వివాదం సద్దుమణిగింది. పోలీసులు కొట్టారన్నది అవాస్తవం శాంతాపూర్ గ్రామంలో పేకాడుతున్నారన్న సమాచారంతో ఈ నెల 4న పోలీసు పార్టీ గ్రామానికి వెళ్లింది. అక్కడ పేకాడుతున్న వారిని పట్టుకున్నారు. అందులో భూమబోయి ఉన్నారు. ఆయనకు ఏదో అనారోగ్య సమస్య ఉండడంతో పడిపోయారు. అతడిని ఆస్పత్రికి తరలించారు. పేకాడుతున్న వారిలో ఏ ఒక్కరినీ పోలీసులు కొట్టలేదు. భూమబోయి మరణానికి పోలీసులు కారణం కాదు. – శోభన్, సీఐ, బిచ్కుంద గుండెపోటుతోనే మరణించాడు కామారెడ్డి అర్బన్: శాంతాపూర్ గ్రామానికి చెందిన భూమబోయి(55) గుండెపోటు కారణంగా మృతి చెందారని ఎస్పీ శ్వేత శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గాంధీ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన డెత్ సమ్మరీలో భూమబోయి గుండెపోటుతో మరణించినట్టు ఉందని పేర్కొన్నారు. మృతుడు భూమబోయి వైద్య చరిత్ర, పేకాట వీడియోగ్రఫీ వివరాలు, అక్కడి సంఘటన వివరాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
పేకాటలో ప్రజాప్రతినిధులు?
సాక్షి, హైదరాబాద్: అది పేరుకు దీపావళి పార్టీ.. కానీ అక్కడ జరిగింది మాత్రం పేకాట. ఓవైపు అంతటా టపాసుల మోత మోగుతుంటే.. ఆ అపార్ట్మెంట్ టెర్రస్పై మాత్రం పత్తాలాట జోరుగా సాగింది. ఆ పేకాట పార్టీలో ఉన్నది మామూలు వాళ్లు కాదు.. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ, కొందరు ఉన్నతాధికారులు కూడా హాజరైనట్టు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ బేగంపేట సమీపంలోని మోతీలాల్ నెహ్రూనగర్లో ఉన్న మారుతి బసేరా అపార్ట్మెంట్ టెర్రస్పై జరిగిన ఈ తతంగం సంచలనంగా మారింది. ఆ పార్టీకి ఓ మంత్రి కూడా హాజరయ్యారని, ఆ మంత్రి సహకారంతోనే సదరు ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారం నుంచి బయటపడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీకి వీఐపీలు సహా అంత మంది హాజరైనా.. పోలీసులు కేవలం ఐదుగురు మాత్రమే పట్టుబడినట్టు చూపడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్థానికుల ఫిర్యాదుతో.. దీపావళి రోజున బసేరా అపార్ట్మెంట్ టెర్రస్పై జరిగిన పార్టీలో.. పదుల సంఖ్యలో ఉన్నవారి అరుపులు, కేకలతో అపార్ట్మెంట్ వాసులతోపాటు పక్కనున్న ఇళ్లవారు గందరగోళానికి గురయ్యారు. కాలనీకి వచ్చే రోడ్డు బ్లాక్ అవడం, మొత్తం వీవీఐపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టిక్కర్లతో ఉన్న వాహనాలు, ఉన్నతాధికారులు, వ్యాపారస్తుల హడావుడి కనిపించడంతో ఆశ్చర్యపోయారు. ఇదేమిటని ఆరా తీసి.. పార్టీ చాటున పేకాట హంగామా సాగుతోందని తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతా వీఐపీలే.. స్థానికులు ఫిర్యాదు చేయడంతో బేగంపేట పోలీసులు టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి బసేరా అపార్ట్మెంట్ వద్దకు వెళ్లారు. అసలేం జరుగుతోందని తేల్చేందుకు ఒకరిద్దరు మామూలుగా పైకి వెళ్లి చూశారు. అక్కడ ఓ మంత్రితోపాటు ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్నట్టుగా గుర్తించినట్టు తెలిసింది. మంత్రిని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించి.. వెంటనే దాడి చేసినట్టు సమాచారం. అయితే పట్టుబడ్డ వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ఉండటంతో పోలీసులు ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. వారిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే, హైదరాబాద్కు చెందిన మరో ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీతోపాటు పాలవ్యాపార నిర్వహణలో పేరు గడించిన ఓ ప్రముఖ వ్యక్తి, నిజామాబాద్కు చెందిన ఓ నేత, వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే తమ్ముడు ఉన్నట్టు సమాచారం. ఇదే సమయంలో సదరు మంత్రి ఫోన్ చేసి ఒత్తిడి చేయడంతో ప్రజాప్రతినిధులు, ఇతర వీఐపీలను వదిలేశారని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడిలో 30 మందికిపైగా పట్టుబడినా కేవలం ఐదుగురిని చూపడం ఏమిటని మండిపడుతున్నారు. దాడికి ముందే ఉన్నతాధికారులు! అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి ఆహ్వానం మేరకు సదరు పార్టీకి వెళ్లిన ముగ్గురు సీనియర్ అధికారులు.. పోలీసుల దాడికి కొద్దినిమిషాల ముందే హడావుడిగా వెళ్లిపోవడం మరో రకమైన చర్చకు తావిస్తోంది. అందులో ఓ విభాగం ప్రిన్సిపల్ సెక్రెటరీ, మరో ఇద్దరు సెక్రటరీ హోదా అధికారులు, ముగ్గురు రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆరితేరిన వాడే.. బసేరా అపార్ట్మెంట్పై పేకాట పార్టీ నిర్వాహకుడు, వ్యాపారవేత్తగా పేరు పొందిన అరవింద్ అగర్వాల్కు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులతో పరిచయాలున్నాయి. క్యాసినో, పోకర్, మూడు ముక్కలాట నిర్వహణలో చేయితిరిగిన వ్యక్తిగా పేరుంది. ఈయన కస్టమర్లలో ఎక్కువమంది ప్రజాప్రతినిధులేనని, అన్ని రాజకీయ పార్టీల కీలక నాయకులతోపాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో కూడా సంబంధాలు ఉన్నాయని పోలీస్ వర్గాలే చెప్తున్నాయి. పేకాటలో పోలీసులకు చిక్కినా బాధ్యత తనదే అంటూ భరోసా కల్పించడం అతడి నైజమని పేర్కొంటున్నాయి. వీఐపీలను గోవా, సింగపూర్, శ్రీలంకలకు తీసుకెళ్లి కోట్ల రూపాయలు క్యాసినోలు ఆడిస్తున్నట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాంటిదేమీ లేదు: బేగంపేట పోలీసులు పేకాట వ్యవహారంపై బేగంపేట పోలీసులను వివరణ కోరగా.. తమకు వచ్చిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి దాడులు చేశామని, పార్టీకి వచ్చిన 85 మందిలో అందరూ వెళ్లిపోయారని తెలిపారు. దాడి సమయంలో అక్కడున్న ఐదుగురు ఓ టేబుల్పై పోకర్ గేమ్ ఆడుతున్నారని, టేబుల్పై ఉన్న రూ.10 వేలను స్వాధీనం చేసుకొని.. వారిని తనిఖీ చేయగా రూ.12.56 లక్షలు దొరికాయని వెల్లడించారు. 53 ప్లేకార్డులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంతేతప్ప తమకు పట్టుబడ్డ వారిలో ప్రజాప్రతినిధులు గానీ, ఇతర ప్రముఖులు గానీ ఎవరూ లేరని పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో అరవింద్ అగర్వాల్తోపాటు డబీర్పురాకు చెందిన జాఫర్ యూసఫ్, బేగంపేటకు చెందిన సిద్ధార్థ్ అగర్వాల్, మలక్పేటకు చెందిన భగేరియా సూర్యకాంత్, కరీమాబాద్కు చెందిన అబ్దుల్ అలీ జిలానీ ఉన్నట్టు తెలిపారు. -
అటవీ ప్రాంతంలో పేకాట..
నెల్లూరు(క్రైమ్): ఓ అటవీప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 18 మందిని అరెస్టు చేసి వారినుంచి రూ.10,45,500 స్వాధీనం చేసుకున్న ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లూరులోని ఉమేష్చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్హాల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) జేడీ కె.శ్రీలక్ష్మి మంగళవారం వివరాలను వెల్లడించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి మండలం అనంతవరం అటవీ ప్రాంతంలో పేకాట సాగుతోందన్న సమాచారం సెబ్ కమిషనర్ వినీత్బ్రిజ్లాల్, జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావుకు అందింది. వారి ఆదేశాల మేరకు జేడీ, నెల్లూరు రూరల్ డీఎస్పీ వై.హరినాథ్రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఈబీ (సెబ్) బృందం, బుచ్చిరెడ్డిపాళెం సీఐ సీహెచ్ కోటేశ్వరరావు సిబ్బందితో కలిసి ఈ నెల 20వ తేదీన పేకాట కేంద్రంపై దాడులు చేశారు. దీంతో పేకాట ఆడుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన హరిబాబు, పి.జవహర్ఖాన్, షేక్ జమాల్, పి.కొండయ్య, జి.బాబు, పి.సత్తిబాబు, జి.గుర్రప్ప, కె.వెంకట్రావు, గుంటూరుకు చెందిన కె.హనుమంతరావు, ఎం.తులసీకృష్ణ, ఒ.రాంబాబు, విజయవాడకు చెందిన షేక్ మౌలాలీ, డి.వరప్రసాద్, వి.సంజీవ్, పి.అర్జున్, ప్రకాశం జిల్లాకు చెందిన సీహెచ్ పిచ్చయ్య, కె.శ్రీను, ప్రొద్దుటూరుకు చెందిన వై.మల్లికార్జునను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10,45,500, 16 సెల్ఫోన్లు, తొమ్మిది బైక్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా వీరిపై త్వరలో సస్పెక్టెడ్ షీట్లు తెరవనున్నట్లు జేడీ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. పేకాట కేంద్రంపై దాడి చేసి నిందితులను అరెస్టు చేసిన సెబ్, పోలీసులను జేడీ శ్రీలక్ష్మి అభినందించారు. సెబ్ జేడీ టీమ్ ఇన్స్పెక్టర్ హుస్సేన్బాషా తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కమ్యూనిటీ హాల్: ముక్కేసి..పెగ్గేయ్రా!
సాక్షి, ముషీరాబాద్: బాగ్లింగంపల్లిలోని ఓ ప్రభుత్వ కమ్యూనిటీ హాల్ పేకాట క్లబ్గా మారింది. మందుకు, విందుకు నిలయమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గురువారం రాత్రి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చెందిన నలుగురు ఎస్ఐలు దాడిచేసి ఆరుగురిని అరెస్టు చేశారు. డబ్బును స్వాదీనం చేసుకున్నారు. వివరాలు.. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రం వెనుకగల ఎల్ఐజీ క్వార్టర్స్లో ఇటీవల 75 లక్షల రూపాయల నిధులతో ప్రభుత్వం నైబర్హుడ్ కమ్యూనిటి హాల్ను ప్రారంభించింది. తాజాగా ఒక ప్రభుత్వ ఉద్యోగి జన్మదినం సందర్భంగా స్నేహితులు, నాయకులు కొందరు విందును ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ హాల్ రెండు గేట్లకు తాళం వేసి మందు, విందు, పేకాట ఆడుతూ జల్సాలు చేసుకంటున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు చిక్కడపల్లి పోలీస్స్టేషన్ అడ్మిన్ ఎస్సై వెంకట్రమణ, నర్సింహారావు, శ్రీనివాస్రెడ్డి, కోటేష్ల ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ గోడలు దూకి పేకాట ఆడుతున్న వీడియోలను చిత్రీకరించారు. పోలీసులు వచి్చన విషయాన్ని గుర్తించిన పేకాట రాయుళ్ళు కొంతమంది గోడదూకి పరారయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసి డబ్బు స్వా«దీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. విషయం తెలిసిన వెంటనే కొంత మంది ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి విడుదల చేయాలని కోరారు. అనంతరం గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అధికార పారీ్టకి చెందిన నాయకులే జనావాసాల మధ్య ఉండే ఓ ప్రభుత్వ కమ్యూనిటి హాల్లో పేకాట ఆడటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ: రమ్మీ, బెట్టింగ్లపై నిషేధం
సాక్షి, అమరావతి: సమాజంలో చెడు ధోరణులకు కారణమవుతోన్న ఆన్లైన్, ఆఫ్లైన్ రమ్మీ, పోకల్ వంటి జూదం, బెట్టింగ్లను నిషేధిస్తూ ఏపీ గేమింగ్ యాక్ట్–1974కు చేసిన సవరణలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆడేవాళ్లకు ఆరు నెలల జైలు శిక్ష, నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష, జరిమానా.. రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించాలని నిర్ణయించింది. వెలగడిపూడిలోని సచివాలయంలో గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాకు వెల్లడించారు. ♦ వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు నగదు బదిలీ పథకానికి ఆమోదం. ♦ అక్టోబర్ 5 నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభించాలని మంత్రి వర్గం సూత్రప్రాయంగా నిర్ణయించింది. తదుపరి కేంద్రం జారీ చేసే మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకోనుంది. ♦ పంచాయితీరాజ్ శాఖలో మెరుగైన పాలన కోసం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ (డీడీవో) పోస్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయం. ♦ జాయింట్ కలెక్టర్లకు కింద ఎంపీడీవో (మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్)లకు పైన డిప్యూటీ డైరెక్టర్ కేడర్లో డీడీవో పోస్టుల ఏర్పాటు. ఎంపీడీవోలకు పదోన్నతుల ద్వారా డీడీవో పోస్టుల భర్తీ. రహదారుల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి ♦ రహదారుల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా పెట్రోలు, డీజిల్పై లీటరుకు ఒక రూపాయి చొప్పున రోడ్ సెస్ విధించాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి వర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇందుకు విధి విధానాలు రూపొందిం చాల్సిందిగా మంత్రివర్గం అధికారులను అదేశించింది. ♦ రహదారుల నిర్మాణం, నిర్వహణ కోసం గతంలోనే ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేషన్ పేరిట రూ.3,000 కోట్లు అప్పు చేసి ఇతర అవసరాలకు మళ్లించారు. దీంతో ఇప్పటి ప్రభుత్వ హయాంలో రహదారులు నిర్వహణకు నిధుల లభ్యత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రత్యేక సెస్ విధించి ఆ మొత్తాన్ని ఖజానాకు మళ్లించకుండా కార్పొరేషన్ దగ్గరే ఉంచాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్డీసీకి ఆమోదం ♦ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్డీసీ) ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన జీవో ఎంఎస్ నంబర్ 80కి ఆమోదం. వంద శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఏపీఎస్డీసీ ఏర్పాటు. ♦ నాడు–నేడు (మనబడి), నాడు–నేడు (వైద్యం), అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా పథకాల అమలుకు ప్రణాళిక, ఫండింగ్ (నిధుల సమీరణ)తోపాటు సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల అమలుకు అవసరమైన ప్రణాళికను ఈ కార్పొరేషన్ రూపొందిస్తుంది. వైద్య కళాశాలలకు భూమి కేటాయింపు ♦ గుంటూరు జిల్లా బాపట్ల మండలం మూలపాలెం, జమ్ములపాలెం గ్రామాల్లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 51.07 ఎకరాల భూమి కేటాయింపు. ♦ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 41.97 ఎకరాల భూమిని కేటాయింపు. మావోయిస్టుపార్టీపై మరో ఏడాది నిషేధం ♦ మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంఘాల మీద మరో ఏడాదిపాటు నిషేధం పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ♦ రాడికల్ యూత్ లీగ్ (ఆర్వైఎల్), రైతు కూలీ సంఘం (ఆర్సీఎస్) లేదా గ్రామీణ పేదల సంఘం (జీపీఎస్), రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ), సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస), విప్లవ కార్మిక సమాఖ్య(వికాస), ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎస్ఎఫ్)లపై మరో ఏడాదిపాటు నిషేధం. మత్స్య విశ్వవిద్యాలయానికి గ్రీన్ సిగ్నల్ ♦ పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ కోసం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఆర్డినెన్స్–2020కి మంత్రివర్గం ఆమోదం. ♦ మత్స్య రంగంలో సమగ్ర అభివృద్ధి కోసం ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు. దీని ద్వారా రాష్ట్రంలో మత్స్య, ఆక్వా రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ఈ యూనివర్సిటీ కోసం రానున్న ఐదేళ్లలో రూ.300 కోట్ల వ్యయం. ♦ ఆక్వా రంగంలో నిపుణుల కొరత కారణంగా ఏడాదికి సుమారు రూ.2,500 కోట్లు నష్టపోతున్నామని, వర్సిటీ ఏర్పాటు ద్వారా ఆ నష్టాన్ని నివారించవచ్చని అంచనా. తద్వారా సుమారు 90 వేల మంది ఆక్వా రైతులు, దీనిపై ఆధారపడ్డ మరో ఎనిమిది లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆంచనా. కృష్ణాపై రూ.2,565 కోట్లతో మరో రెండు బ్యారేజీలు ♦ కృష్ణా డెల్టా చౌడు బారకుండా పరిరక్షించేందుకు ప్రకాశం బ్యారేజీకి దిగువన మరో రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బ్యారేజీ నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. సముద్రపు నీరు ఎగదన్నదు. కృష్ణా డెల్టాను పరిక్షించవచ్చు. తాగునీటికి ఇబ్బందులకు పరిష్కారం. రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి రూ.2,565 కోట్ల వ్యయం. ♦ ప్రకాశం బ్యారేజీకి 12 కిలోమీటర్ల దిగువన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురం మధ్య కృష్ణా నదిపై 2.70 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం. దీనికి రూ.1,215 కోట్ల వ్యయం. ♦ ప్రకాశం బ్యారేజీకి 62 కిలోమీటర్ల దిగువన హంసలదీవికి ఎగువన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బండికోళ్లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం తూరుపుపాలెం మధ్య కృష్ణా నదిపై 3.25 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మాణం. దీనికి రూ.1,350 కోట్ల వ్యయం. ♦ పల్నాడు తాగు, సాగునీటి అవసరాలు తీర్చడం కోసం వరికపూడిశెల ఎత్తిపోతల పథకం చేపట్టాలని నిర్ణయం. ఈ పథకం ద్వారా గుంటూరు జిల్లా వెల్ధుర్తి, దుర్గి, బొల్లాపల్లి మండలాలు సస్యశ్యామలం అవుతాయి. ఈ ఎత్తిపోతల పథకానికి రూ.1,273 కోట్ల వ్యయం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి గ్రీన్ సిగ్నల్ ♦ ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి, సస్యశ్యామలం చేయడానికి బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ♦ 63.2 టీఎంసీల నీటిని తరలించి.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాల సాగునీటిని అందించాలని నిర్ణయం. ఈ పథకానికి రూ.15,389.80 కోట్ల వ్యయం అవుతుంది. ♦ దుర్భిక్ష రాయలసీమ ప్రాంతంలో 14 రిజర్వాయర్లు, ఎత్తిపోతల పథకాల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించిన పరిపాలనా పరమైన అనుమతులకు మంత్రివర్గం ఆమోదం. రాయలసీమ కరవు నివారణ ప్రణాళికలో భాగంగా ఈ పనులు చేపట్టాలని నిర్ణయం. (మద్యం ధరలను తగ్గించిన ఏపీ ప్రభుత్వం) -
రూ 38 కోట్లు ముంచిన ఉద్యోగిపై వేటు
బెంగళూర్ : ఆన్లైన్ గేమ్లో నష్టాలతో అప్పుల్లో మునగడంతో కంపెనీ నిధుల నుంచి రూ 38 కోట్ల సొమ్మును తన ఖాతాల్లోకి మళ్లించిన గోల్డ్మన్శాక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అశ్వని ఝంఝన్వాలాను తొలగించామని కంపెనీ బుధవారం వెల్లడించింది. అశ్వని ఝంఝన్వాలాను తక్షణమే డిస్మిస్ చేశామని, అతనిపై క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు పోలీసు అధికారులకు సహకరిస్తామని గోల్డ్మన్ శాక్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. కంపెనీ ఇండియన్ సబ్సిడరీ ఫిర్యాదుపై అశ్వనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 420 కేసు నమోదు చేశారు. ఛీటింగ్ కేసులో నిందితుడిని స్ధానిక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించిందని మరథహల్లి సీఐ ఎస్పీ గిరీష్ తెలిపారు. కాగా, తన కింది ఉద్యోగులు గౌరవ్ మిశ్రా, అభిషేక్ యాదవ్, సుజిత్ అప్పయ్యల సహకారంతో అశ్వని కంపెనీ డబ్బును స్వాహా చేశాడు. శిక్షణ పేరుతో వారి ఆఫీస్ సిస్టమ్స్లో అశ్వని లాగిన్ అయ్యేవాడని, వారిని మంచినీళ్లు తీసుకురమ్మని, ఇతర పనులను అప్పగించి నిధుల దోపిడీకి పాల్పడేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇండస్ర్టియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనాకు అక్రమంగా రూ 38 కోట్ల సంస్థ నిధులను బదిలీ చేశాడని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. చదవండి : అప్పుల్లో మునిగి పనిచేసే సంస్థకు కన్నం -
రండి..పేకాట ఆడుకోండి!
కోరుట్ల(జగిత్యాల జిల్లా): ‘రండి మా దగ్గర నిశ్చింతగా పేకాట ఆడుకోండి. విమాన చార్జీలు మేమే ఇస్తాం. హైక్లాస్ భోజన వసతి కల్పిస్తాం. 3 రోజుల పాటు మా దగ్గర హాయిగా పేకాట ఆడుకుంటూ ఉండొచ్చు. కేవలం రూ. 25–50 వేలు తెచ్చుకోండి’.. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన పేకాట రాయుళ్లకు పొరుగు రాష్ట్రాల క్లబ్లు ఇస్తున్న బంపర్ ఆఫర్. ఈ ప్రాంతం నుంచి పేకాటరాయుళ్లను పొరుగు రాష్ట్రాలకు తరలించేందుకు ఏకంగా కమీషన్ ఏజెంట్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సాగని ఆటలు! ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ 3 జిల్లాల్లో పోలీసులు నిత్యం పదుల సంఖ్యలో పేకాటరాయుళ్లను అరెస్ట్ చేస్తున్నారు. లక్షల్లో నగదు స్వాధీనం చేసుకుంటూ 10 నుంచి 20కి మించి కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో స్థానికంగా పేకాట ఆడేందుకు పేకాటరాయుళ్లు సుతరామూ ఇష్టపడటం లేదు. మూడు ముక్కలాటకు అలవాటుపడ్డ కొందరు తమ అడ్డాలను గ్రామశివారుల్లోని అటవీ ప్రాంతాలు, మామిడి తోటలను అడ్డాలుగా చేసుకుంటున్నారు. పోలీసులు ఆ స్థావరాలనూ కనిపెట్టి దాడులు చేస్తుండటంతో స్థానికంగా పేకాట ఆడి కేసులు పాలుకావడం కన్నా.. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లడానికి పేకాటరాయుళ్లు మొగ్గుచూపుతున్నారు. కమీషన్ ఏజెంట్ల హవా ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన పేకాటరాయుళ్లు మహారాష్ట్రలోని పేకాట క్లబ్ల కన్నా కర్ణాటకలోని క్లబ్లకు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న క్లబ్లకు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి నిత్యం 350–500 మంది పేకాట ఆడేందుకు వెళ్తున్న ట్లు తెలిసింది. ఈ మూడు జిల్లాలోని కీలక పట్టణాల్లో పొరుగు రాష్ట్రాలకు చెందిన క్లబ్ల నిర్వాహకులు కమీషన్లు ఇస్తూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. పేకాట ఆడేందుకు ఒకరిని బెంగళూరుకు తీసుకెళ్తే రూ.1000 నుంచి రూ.2,500 కమీషన్ ఇస్తున్నట్లు సమాచారం. వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరు వెళ్లే వారిని హైదరాబాద్ ఎయిర్పోర్టు వరకు తీసుకెళ్లడానికి కొందరు అద్దెకార్ల డ్రైవర్లు ఉండటం.. వీరికి ఎంతో కొంత కమీషన్ ముట్టడం విశేషం. ఆట తప్ప అంతా ఫ్రీ పేకాటరాయుళ్లను బెంగళూరుకు తరలించే కమీషన్ ఏజెంట్లు పేకాటరాయుళ్లను హైదరాబాద్ వరకు కార్లలో ఫ్రీగా తరలిస్తున్నారు. అక్కడి నుంచి విమాన టికెట్లు బుక్చేసి బెంగళూరుకు పంపుతున్నారు. కొందరు ఏజెంట్లు పేకాటరాయుళ్లతోపాటే ఉండి బెంగళూరులోని పేకాట క్లబ్లకు తీసుకెళ్తున్నారు. పేకాటరాయుళ్లకు బెంగళూరులోని హైక్లాస్ లాడ్జీల్లో వసతి, ఖరీదైన భోజనం ఉచితంగా అందిస్తున్నారు. అక్కడి క్లబ్లలో ఉన్న హాలులో పది నుంచి పన్నెండు టేబుళ్లు ఏర్పాటు చేసి రమ్మీ, త్రీ కార్డ్స్ (మూడు ముక్కలు) ఆడిస్తున్నారు. ఒక్కో ఆటకు రూ.3,000–రూ.5,000 వరకు డబ్బులు పెట్టి ఆడాల్సి ఉంటుంది. ఒక్కో టేబుల్ నుంచి క్లబ్ నిర్వాహకులు ఒక్కో ఆటకు రూ.5 వేలు తీసుకుంటున్నట్లు సమాచారం. మూడు రోజుల పాటు అక్కడే ఉండి పేకాట ఆడుతున్న వ్యసనపరులు కొందరు జేబులు గుల్లచేసుకుని వస్తుండటం గమనార్హం. మొత్తంమీద పేకాట వ్యసనం ఇతర రాష్ట్రాల్లోని క్లబ్లకు లాభాల పంట పండిస్తోంది. -
జీవితాలతో పేకాట!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు జూదక్రీడకు స్వర్గధామంగా విలసిల్లుతున్నాయి. పేద, మధ్య తరగతి జీవితాలను నరకప్రాయం చేస్తున్నాయి. విచ్చల విడిగా జూదాలు నిర్వహిస్తూ కొందరు లక్షలాది రూపాయలను అప్పనంగా సంపాదిస్తున్నారు. పట్టణంలోని కొన్ని చోట్ల నిత్యం జూదం జరుగుతున్నా పోలీసులు, అధికారులు అటువైపు కన్నెత్తి చూడకుండా కొంతమంది బడాబాబులు, నాయకు లు లోపాయికారీగా ‘మేనే జ్’ చేస్తున్నట్టు తెలిసింది. ఎప్పటి నుంచో సాగుతున్న ఈ దందా గురించి కొందరు పోలీసు అధికారులకు తెలిసినా చూసీ చూడకుండా వ్యవహరిస్తూ నెలవారీ మామూళ్లు దండుకుంటున్నారని సమాచారం. జూదం ద్వారా ఎన్నో కుటుంబాల ఆస్తులను లాగేసుకుంటున్న నిర్వాహకులు.. ఆటలో గెల్చిన వారిపైనా అల్లరిమూకలతో దాడులు చేయించిన సంఘటనలు కూడా ఉన్నాయి. పరువు పోతుందన్న భయంతో బాధితులు ఈ విషయాలను బయటకు చెప్పుకోలేకపోతున్నారు. తాజాగా గత ఆదివారం అర్ధరాత్రి వర కు పట్టణ శివార్లలో జూదం జరిగింది. కొవ్వొత్తుల లైటింగ్లో మట్టిరోడ్డుకు సమీపంలోని గుడారాల్లో ఇదంతా జరిగినట్లు తెలిసింది. విచిత్రమేమిటంటే మామూలు రోజులు కన్నా వారాంతాల్లో జరుగుతున్న ఆటల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఇవే జూదానికి అడ్డాలు పట్టణంలో రోజూ కొన్ని లాడ్జీలు, హోటళ్లలోని గదులు ప్రత్యేకంగా జూదం కోసమే బుక్ అవుతున్నాయి. పేకాట కోసం తీసుకునే గదులకు సాధారణ రేటు మీద రెట్టింపు వసూలు చేస్తూ చతుర్ముఖ పారాయణానికి అవసరమైన సరాంజామా సమకూరుస్తున్నట్టు కొందరు జూదప్రియులే చెబుతున్నారు. ఇక పట్టణంలోని పి.ఎన్.కాలనీ, అంబేద్కర్ కూడలి, దమ్మల వీధి, మంగువారితోట ప్రాంతాల తోపాటు సమీపంలోని ఫరీదుపేట, చల్లపేట తోటలు, తోటపాలెం, కిళ్లిపాలెం గ్రామ ప్రాంతాల్లో రోజూ సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పేకాట జరుగుతున్నట్టు పోలీసుల వద్ద సమాచారం ఉంది. గతంలో మండలవీధిలో పేకాట జరుగుతున్నప్పుడు తలెత్తిన ఘర్షణ లో ఓ వ్యక్తి మృతి చెందడంతో కొన్నాళ్లపాటు అక్కడ జూదం ఆపేశారని, మరికొన్నాళ్లు పెదపాడు రోడ్డులో రహస్యంగా జూదగృహం నిర్వహించేవారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల రెండు వర్గాల మధ్య జూదం విషయమై ఘర్షణ చోటు చేసుకోవడంతో ఓ వ్యక్తిపై దుండగులు మద్యం సీసాతో దాడి చేసిన సంఘటన కూడా ఉంది. ‘సూట్’లదే హవా.. పేకాట నిర్వహించాలంటే దమ్మూ ధైర్యంతో పాటు పోలీసుల రాకను పసిగట్టగలిగే నిఘా నెట్వర్క్ కూడా అవసరం. పట్టణానికి కొంతమంది గ్రూపుగా ఏర్పడి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి జూదగృహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రూపులను ‘సూట్’లుగా వ్యవహరిస్తుంటారు. ఎక్కడ ఆట జరిగినా ఈ గ్రూపు సభ్యులుంటారు. తెలియని వ్యక్తుల్లా జూదంలో చేరి సిండికేట్గా ఏర్పడి కొత్తగా ఆటకు వచ్చిన వారి నుంచి డబ్బు రప్పించుకోవడంలో వీరు కీలకపాత్ర వహిస్తుంటారు. కొత్తవ్యక్తులను రెచ్చగొట్టి ముగ్గులోకి దించడమే వీరి ప్రధాన విధి. పేకాటకు వచ్చే వారికి కొన్ని ఆఫర్లు కూడా ఇస్తున్నారు. కార్లలో వచ్చే వారికి కనీసం రూ.3 వేలు, ద్విచక్ర వాహనంపై వచ్చే వారికి రూ.500 నజరానాగా ఇస్తున్నారు. అదే విధంగా లైటింగ్, టెంట్ ఏర్పాటు చేయడం, ఎవరికీ ఇబ్బంది లేకుండా చూడడం కూడా వీరి బాధ్యతగా పేకాట రాయుళ్లు చెబుతున్నారు. వాహనాల్లో తరలింపు ఇతర ప్రాంతాల నుంచి జూదానికి రప్పించేందుకు హైటెక్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. పేకాట స్థావరం వివరాలను ఎస్సెమ్మెస్ రూపంలో జూదరులకు పంపిస్తున్నారు. అక్కడికి కొంత దూరంలో ఓ వాహనాన్ని ఉంచుతారు. ఆ సమాచారం కూడా పంపిస్తారు. సాయంత్రం వచ్చే జూదరులను వాహనాల్లో స్థావరానికి తరలిస్తున్నారు. ఇలా తరలించేందుకు ఒక్కో ఆటోకూ రూ.500 చెల్లిస్తున్నారు. పోలీసుల రాకను పసిగట్టే కాపలాదారులకు కూడా రోజుకు రూ. 500 చొప్పున చెల్లిస్తున్నారు. వచ్చిన మొత్తానికి మరింత కలిపి డ్రైవర్లు కూడా ఆటలో దిగుతున్నారు. లొసుగులే ఆధారం చట్టంలోని లొసుగుల ఆధారంగానే జిల్లాలో భారీగా జూదం జరుగుతున్నట్టు తెలుస్తోంది. పేకాట సమయంలో డబ్బు దొరక్కుండా నిర్వహకులు జాగ్రత్త పడుతుంటారు. కాయిన్ల రూపంలో పెట్టుబడి పెట్టి గెలిచినవారికి డబ్బు చెల్లించడం రహస్యంగా జరుగుతోంది. పోలీసులకు పట్టుబడితే ‘సూట్’దారులే బెయిల్ తెప్పించడం, వాహనాల్ని విడిపించడం కూడా చేస్తుంటారు. నాయకులతో అధికారులపై ఒత్తిళ్లు తెస్తుంటారు. అవసరమైతే ముందస్తు బెయిల్కూ ప్రయత్నిస్తుంటారు. ఇదంతా జరగకుండా ఉం డాలంటే స్థానిక పోలీసులకు నెలవారీ మామూళ్లు చాలు అన్న ధోరణి కనిపిస్తోంది. పోలీస్ కేసు అం టే.. వీరి దృష్టిలో కోర్టులో జరిమానా కట్టడం వ రకే అన్నట్టుగా ఉంటోంది. ‘కాయిన్లే’ కాసులు పేకాట జరిగే చోట డబ్బు అసలు ఉండదు. ప్లాస్టిక్ కాయిన్లనే డబ్బుగా ఉపయోగిస్తుంటారు. రంగు ఆధారంగా కాయిన్కు వెలకడుతుంటారు. పోలీసులొస్తే కాయిన్లే చూపిస్తారు తప్పితే సొమ్ము దొరకదు. అయితే వేరే చోట డబ్బు సంచులతో నిర్వాహకులు ఉంటారు. గెలిచిన వ్యక్తులు అక్కడికి వెళ్లి తమ వద్ద ఉన్న కాయిన్లు ఇస్తే వాటి విలువ ఆధారంగా సొమ్ము చెల్లిస్తుంటారు. ఒక కాయిన్ విలువ కనీసం రూ.1000 ఉంటుంది.