-
Video: మెట్రోలో సీటు ఇవ్వలేదని.. యువతిపై వృద్దుడి దౌర్జన్యం
చైనాలో ఓ మెట్రోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తనకు కూర్చోవడానికి సీటు ఇవ్వలేదన్న కోపంలో 50 ఏళ్ల వృద్దుడు ఆమెపై కర్రతో దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.బీజింగ్ సబ్వేలైన్ 10లో ఈ ఘటన వెలుగుచూసింది. మెట్రోలో ఒక వృద్ధుడు తన కోసం సీటు ఇవ్వాల్సిందిగా యువతిని అడిగాడు. అయితే తన సీటును వెరొకరికి ఇస్తాను కానీ.. అతనికి మాత్రం ఇవ్వనని చెప్పింది. దీంతో ఆగ్రహించిన వృద్ధుడు ఆమెపై అరవడం ప్రారంభించాడు. అంతేగాక ఆమె మీద మీదకు వచ్చి ఆయన చేతిలోని, కర్రతో యువతిని ఇబ్బంది పెట్టాడు. తన చేతులతోనే ఆమె భుజం మీద కొట్టాడు. అక్కడితో ఆగకుండా.. తన సీటు అడగడంలో తప్పేముందని చెప్పాడు. పోలీసులకు కాల్ చేయండి, మేము పోలీస్ స్టేషన్కి వెళ్తాము. నేను నిన్ను వేధిస్తున్నానని చెప్పు. నాకేం భయం లేదు అంటూ దబాయించడం వీడియోలో కనిపిస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జూన్ 24 న జరిగినట్లు తెలిపారు.Beijing China 🇨🇳- Young woman refused to give her seat to the old man. pic.twitter.com/ybCgv8oY6j— Githii (@githii) June 26, 2024 -
కొడుకులు బువ్వ పెడ్తలేరు
నెన్నెల: నవ మాసాలు మోసి ముగ్గురు కుమారులకు ఆ తల్లి జన్మనిచ్చింది. కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసింది. అందరికీ పెళ్లిళ్లు చేసి ఓ ఇంటి వారిని చేసింది. కానీ వృద్ధాప్యంలో ఆ మాతృమూర్తి కన్న పేగులకే బరువైంది. 13 ఎకరాల భూమి పంచుకున్న కుమారులు తల్లికి తిండి కూడా పెట్టకుండా ఒంటరిని చేసి ఓ గుడిసెలో వదిలేశారు. దీంతో కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టడం లేదని మంగళవారం పోలీసుస్టేషన్ మెట్లెక్కింది.ఈ సంఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని నందులపల్లి గ్రామానికి చెందిన చిన్నక్క, రాజయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజయ్య ఐదేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. చీటికి మాటికి కొడుకులు కొడుతూ ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని వేధిస్తుండడంతో విసిగి వేసారి ఆ తల్లి న్యాయం చేయాలని నెన్నెల ఎస్సై ప్రసాద్ ఎదుట కన్నీటి పర్యంతమైంది.పోలీసులు స్పందించి తనకు న్యాయం చేసి దారి చూపించాలని వేడుకుంది. ఎస్సై స్పందించి ఆమె ముగ్గురు కొడుకులతో ఫోన్లో మాట్లాడి బుధవారం పోలీస్స్టేషన్కు రావాలని ఆదేశించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వృద్ధురాలికి న్యాయం జరిగేలా చూస్తానని ఎస్సై చెప్పారు. కాగా, కుమారుల్లో ఒకరు సింగరేణి రిటైర్డు ఉద్యోగి కాగా, మరో ఇద్దరు వ్యవసాయం చేస్తుంటారు. -
90 ఏళ్ల వృద్దుడికి అరుదైన వ్యాధి..కడుపు ఛాతిలోకి చొచ్చుకుపోయి..
ఓ వృద్దుడు అత్యంత అరుదైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నూటికి ఒక్కరికి వచ్చే సమస్యతో నరకం చూశాడు. పాపం ఈసమస్యతో తినడం కూడా మానేశాడు. దీంతో రోజుల వ్యవధిలోనే ఐదు కిలోలు బరువు తగ్గిపోయాడు. వైద్యులు సైతం అతడి పరిస్థితిని చూసి విస్తుపోయారు. ఇంతకీ అతడికీ ఏం వ్యాధి వచ్చిందంటే..90 ఏళ్ల వృద్ధుడు గత కొద్ది రోజులుగా అత్యంత అరుదైన విరామ హెర్నియాతో బాధపడ్డాడు. దీని కారణంగా కడుపు ఛాతీ భాగంలోకి చొచ్చుకు వచ్చి.. తిన్న ఆహారం వాంతి రూపంలో బయటకు వచ్చేసేది. ఇక్కడ పొట్టలో ఆహారం ఇమడక వెనక్కి వాంతి రూపంలో వచ్చేటప్పుడూ ఉండే బాధకు తాళ్లలేకపోయాడు. దీంతో అతడు తినడమే మానేశాడు. దెబ్బకు ఆ వృద్ధుడి కేవలం 11 రోజుల వ్యవధిలోనే ఏకంగా 5 కిలోల మేర బరువు తగ్గిపోయాడు. ఇక్కడ హెర్నియా అనేది సాధారణ సమస్యే. ఒక అవయవం లేదా కణజాలం బలహీనమైన ప్రదేశం ద్వారా పొడుచుకు వచ్చినప్పుడు లేదా చుట్టుపక్కల కండరాలు లేదా బంధన కణజాలంలో చిరిగిపోయినప్పుడు అవి సంభవిస్తాయి. హెర్నియాలు తరచుగా ప్రాణాంతకం కానప్పటికీ, అవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఈ వృద్ధుడికి వచ్చిన పరిస్థితి కాస్త క్రిటికల్.అతని కడుపులోని కొంత భాగం డయాఫ్రాగమ్లోని ఓపెనింగ్ ద్వారా ఛాతీలోకి నెట్టబడి ఊపిరితిత్తు కుదించుకుపోయేలా తీవ్రమైన పరిస్థితిని కలిగిస్తుంది. దీన్ని సివియర్ హయాటల్ హెర్నియా అనిపిలుస్తారు. ఇక్కడ వృద్ధుడి అధిక వయసు రీత్యా చాలా క్లిష్టమైన ఆపరేషన్ చేశారు వైద్యులు. డయాఫ్రాగమ్ లోపంను మూసి వేసి కడుపుని ఉదరకుహరంలోకి యథావిధిగా అమర్చారు. సదరు వృద్ధుడు కోలుకోవడమే గాక డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోయాడు కూడా.(చదవండి: అత్యుత్తమమైన డైట్ ఇదే! నిర్థారించిన వైద్యులు!) -
Us: బైడెన్ వయసు.. హిల్లరీ క్లింటన్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ వయసు,జ్ఞాపకశక్తిపై దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బైడెన్ వయసుపై మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బైడెన్ వయసు సమస్య న్యాయమైనదేనని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. వయసు కారణంగా బైడెన్ జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఇటీవల ఓ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సమస్య వైట్ హౌస్ దృష్టిలోనూ ఉందని హిల్లరీ క్లింటన్ చెప్పారు. మరో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలోనూ వయసు సమస్య ఉందన్నారు. యువ ఓటర్లను ఆకర్షించడంలో ఇద్దరికీ ఇబ్బందులు తప్పకపోవచ్చన్నారు. వయసు ఒక సమస్యేనని, అయితే ఓటర్లు ఉత్తమ అభ్యర్థిని ఎన్నుకోవడం ముఖ్యమన్నారు. అధ్యక్షుడిగా బైడెన్ మరోసారి ఎన్నిక కావాలని హిల్లరీ ఆకాంక్షించారు. ఆయన ఎన్నో మంచి పనులు చేశారని కితాబిచ్చారు. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున జో బైడెన్, రిపబ్లికన్ల తరపున ట్రంప్ మళ్లీ తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా, బైడెన్ జ్ఞాపకశక్తి తగ్గిందనే విషయాన్ని ఇటీవలే ఒక నివేదిక తగిన సాక్ష్యాధారాలతో బహిర్గతం చేయడంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో చర్చనీయాంశమైంది. ఇప్పటికే బైడెన్ వృద్ధాప్యాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకున్న రిపబ్లికన్లకు తాజా నివేదిక మరో శక్తివంతమైన ప్రచారాస్త్రమైంది. అయితే ఈ నివేదికలోని అంశాలన్నీ తప్పు అని 81 ఏళ్ల బైడెన్ ఖండించారు. ఇదీ చదవండి.. అమెరికాలో చిన్నారిని ఓవెన్కు బలి చేసుకుంది -
వృద్ధాశ్రమాల్లో ఎయిర్ప్యూరిఫయర్లు, ఆక్సిజన్ సిలిండర్లు!
ఢిల్లీలో వాయుకాలుష్యం చెప్పనలవి కానంతగా పెరిగిపోయింది. ఫలితంగా శ్వాస సంబంధిత సమస్యలు కలిగినవారు ఊపిరి తీసుకునేందుకు సైతం తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపధ్యంలో డిల్లీ ప్రభుత్వం కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా వృద్ధాశ్రమాల్లో ఎయిర్ప్యూరిఫయర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ నగరంలోని వృద్ధాశ్రమంలో ఉంటున్నవారు వీలైంతవరకూ బయటకు వెళ్లకుంటూ ఉంటే మంచిదని, స్వల్ప వ్యాయామాలు, యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తర ఢిల్లీలోని రోహిణిలో ఉన్న శివ ఆశ్రయ్ వృద్ధాశ్రమం సెక్రటరీ రాజేశ్వరి మిశ్రా మాట్లాడుతూ పెరుగుతున్న వాయుకాలుష్యం కారణంగా అత్యవసర అవసరాల కోసం ఆశ్రమంలో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచామన్నారు. న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) పలుచోట్ల ‘ఎయిర్ ప్యూరిఫయర్లు’ ఏర్పాటు చేసింది. ఎన్డీఎంసీ వైస్-ఛైర్మెన్ సతీష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ తాము వృద్ధాశ్రమాలలో నివసించేవారి కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నామని, యోగా తరగతులను కూడా నిర్వహిస్తుంటామని, అయితే ఇప్పుడు పెరుగుతున్న కాలుష్య స్థాయిల దృష్ట్యా వృద్ధుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇది కూడా చదవండి: సీజేఐ ఎదుట సంకేత భాషలో జాతీయ గీతాలాపన! -
రాష్ట్ర వృద్ధుల్లో 31.6 శాతం మందికి ఆరోగ్య బీమా
సాక్షి, హైదరాబాద్: వృద్ధుల ఆరోగ్య బీమా పథకాల కవరేజీ తెలంగాణలో 31.6 శాతంగా ఉంది. ఈ విషయంలో మన రాష్ట్రం దేశంలో 11వ స్థానంలో ఉంది. జాతీయ సగటు 18.2 శాతం కంటే తెలంగాణ మెరుగ్గా ఉండటం గమనార్హం. మిజోరంలో దేశంలోనే అత్యధికంగా 66.5 శాతం మంది వృద్ధులకు ఆరోగ్య బీమా కవరేజీ ఉండగా అతితక్కువగా జమ్మూకశ్మీర్లో 0.2 శాతం మందికే ఉంది. ఈ మేరకు ఇండియా ఏజింగ్ రిపోర్ట్–2023 నివేదిక వెల్లడించింది. దీన్ని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ రూపొందించగా కేంద్ర సామాజిక, సాధికారత శాఖ తాజాగా విడుదల చేసింది. మిజోరం, ఒడిశా, ఛత్తీస్గఢ్, మేఘాలయా, అస్సాం, గోవా, రాజస్తాన్ ఆరోగ్య బీమా పథకాలకు ఎక్కువ కవరేజీని కలిగి ఉన్న రాష్ట్రాలు. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో 68.4 శాతం వృద్ధులకు ఆరోగ్య బీమా సౌకర్యాలు అందడంలేదు. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్ని రకాల ఆరోగ్య బీమాలు, ప్రైవేటు ఆరోగ్య బీమాలను కలిపి సర్వే చేశారు. దేశంలో 55 శాతం వృద్ధుల్లో ఆరోగ్య బీమాలపై అవగాహన లేదు. తెలంగాణలో రెండు అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక జబ్బులున్నవారు 30.7 శాతం మంది ఉన్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు... దేశ జనాభాలో 60 ఏళ్లు పైబడిన వారు 10 శాతం ఉండగా 2036 నాటికి వారి సంఖ్య 14.9 శాతానికి పెరుగుతుందని అంచనా. తెలంగాణలో 2021లో 11 శాతం వృద్ధులు ఉండగా 2036 నాటికి వారి సంఖ్య 17.1 శాతానికి పెరుగుతుంది. 60 ఏళ్లకు పైబడినవారిలో జీవన ఆయుర్ధా యం 2015–19 మధ్య రాష్ట్ర మహిళల్లో 18.3 శాతం, పురుషుల్లో 17.3 శాతం. 75 ఏళ్ల తర్వాత తెలంగాణలో సగటున అదనంగా 8.7 ఏళ్లు జీవిస్తున్నారు. తెలంగాణలో 60 ఏళ్లు పైబడినవారిలో పనిచేయలేని స్థితిలో ఉన్నవారు 14.6 శాతం మంది. ఇండియాలో 23.8 శాతం ఉన్నారు. 60 ఏళ్లు పైబడినవారిలో పేదరికంలో ఉన్నవారు తెలంగాణలో 15.8 శాతం, ఇండియా 21.7 శాతం ఉన్నారు. 60 ఏళ్లు పైబడినవారిలో ఎలాంటి ఆదాయం లేనివారు తెలంగాణలో 11 శాతం ఉన్నారు. ఇండియా 18.7 శాతం ఉన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లోనే వృద్ధులు ఎక్కువ అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఎక్కువ కాలం బతుకుతున్నారు. వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉండటం, అక్షరాస్యత ఎక్కువగా ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. – డాక్టర్ కిరణ్ మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కనీ్వనర్, తెలంగాణ -
ఇటలీలో పిల్లలు ఎందుకు పుట్టడం లేదు? మూడు నెలల్లో ఒక్క డెలివరీ కూడా లేదా?
ప్రపంచంలో వృద్ధుల సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. చైనా, జపాన్ లాంటి దేశాలు దీనికి పెద్ద ఉదాహరణగా నిలిచాయి. ఇప్పుడు ఇటలీ కూడా ఈ జాబితాలో చేరింది. దీనికి కారణం అక్కడ పిల్లలు పుట్టకపోవడమే. పలు రిపోర్టులలో వెల్లడైన వివరాల ప్రకారం గత మూడు నెలలుగా ఇటలీలో ఏ ఒక్క శిశు జననం కూడా జరగలేదు. ఇది జాతీయ సమస్యగా పరిణమించింది.ఈ నేపధ్యంలో ఇటలీ ప్రధాని దీనిని జాతీయ అత్యవసర పరిస్థితిగా చూడాలన్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటలీ ఇటీవల వినూత్న ప్రపంచ రికార్డును సృష్టించింది. అయితే ఈ ప్రపంచ రికార్డులో సంతోషించాల్సిన విషయమేమీ లేదు. దేశం శరవేగంగా వృద్ధాప్య దశకు చేరుతోంది. ఈ నివేదిక ప్రకారం గత మూడు నెలల్లో ఇటలీలో ఒక్క శిశువు కూడా జన్మించలేదు. రాయిటర్స్ పేర్కొన్న వివరాల ప్రకారం నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో ఐఎస్టీఏటీ గణాంకాలను పరిశీలిస్తే.. జనవరి 2023 నుండి జూన్ 2023 వరకు ఇటలీలో జన్మించిన పిల్లల సంఖ్య జనవరి 2022- జూన్ 2022 మధ్య జన్మించిన వారి కంటే 3500 తక్కువ. దేశంలో 15 నుంచి 49 ఏళ్లలోపు మహిళల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. అంటే ఇటలీలో పునరుత్పత్తి వయసు గల మహిళల కొరత తీవ్రంగా ఉంది. ఈ వయసు కలిగిన మహిళల సంఖ్య 2021తో పోలిస్తే 2023లో చాలా వరకూ తగ్గింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ దీనిని జాతీయ ఎమర్జెన్సీగా భావిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఆమె ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని చాలా గట్టిగానే ప్రస్తావించారు. ఇటలీలో రోజుకు ఏడుగురు పిల్లలు పుడుతుండగా, అదే సమయంలో దేశంలో 12 మరణాలు నమోదువున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అక్కడి జనాభా వేగంగా తగ్గిపోతుందనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: హమాస్ను మట్టికరిపించిన 13 మంది మహిళలు -
ఈ పొరపాటు చేస్తే.. ఏజ్డ్ పర్సన్లా కనిపించడం ఖాయం!
ఇటీవలకాలంలో చాలామంది ఏజ్ పరంగా చూస్తే చిన్నవాళ్లే అయినా వారిని చూస్తే ఏజ్డ్లా కనిపిస్తారు. వాళ్లు చెబతేగానీ మనకు తెలయను కూడా తెలియదు. దీంతో ఒకరకంగా వారు కూడా సమాజంలో కాస్త ఇబ్బందిగా ఫీలవ్వడమే గాక ఆత్మనూన్యత గురయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల తొందరగా వృద్ధాప్య ఛాయలు కనిపించేలా చేసే వాటికి దూరంగా ఉండి వీలైనంతలో కొద్దిపాటు జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్య మీ ధరిచేరదంటున్నారు ఆరోగ్య నిపుణులు. తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకూడదంటే.. కొందరూ చూస్తే ఎంత ఏజ్ వచ్చినా కూడా స్మార్ట్గా యంగ్గా కనిపిస్తారు. అందుకు ప్రధాన కారణం మంచి నిద్ర అంటున్నారు డాక్టర్ పాల్విన్. మంచి నిద్ర మన ముఖవర్చస్సు కాంతివంతంగా యవ్వనంగా ఉండేలా చేస్తుందట. సుఖమైన నిద్ర మనిషి ఏజ్ని దాచేస్తుందంటున్నారు. ఎప్పుడూ నిద్ర విషయంలో అస్సలు అశ్రద్ధ కనబర్చకూడదట. ఇదే అన్ని రకాల వ్యాధులు అటాక్ చేసేందుకు ఒకరకంగా కారణమవుతుందని కూడా చెబుతున్నారు. ఈ నిద్ర మన జీర్ణవ్యవస్థపై అత్యంత ప్రభావం చూపుతుందంటున్నారు. కంటినిండా నిద్ర ఉంటే ఎలాంటి జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు ఎదురుకావట. అలాగే ఎన్ని ఒత్తిడులు ఉన్నా వాటన్నింటిని తేలిగ్గా తీసుకుని కొట్టిపడేసి ధైర్యంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ శరీరానికి అవసరమయ్యే నిద్రను మిస్ చేయకండని వార్నింగ్ ఇస్తున్నా డాక్టర్ పాల్విన్. ఇలా ఒక నెలపాటు వేళకు భోజనం చేస్తూ..కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు మంచిగా నిద్రపోవడానికి యత్నించి చూస్తే మీకే చక్కటి ఫలితం కనిపిస్తుందంటున్నారు. దీని వల్ల శరీరం స్వస్థత చెందడమేగాక మీకు తెలియకుండానే మీలో జీవక్రియలు మెరుగుపడటం, వ్యాధి నిరోధక శక్తి పెరగడం జరుగుతుందన్నారు. ఇదే సమయంలో మీ పడకగది కూడా మీరు వెళ్లగానే పడుకోవాలనిపించేంత ఆహ్లాదంగా పరిశుభ్రంగా ఉండాలని చెబుతున్నారు. సరైన నిద్రలేకపోవడం వల్ల రక్తపోటు, ఊబకాయం, స్ట్రోక్, మధుమేహం, గుండెబ్బులు వంటి రోగాలబారిన పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ధూమపానం, ఆల్కహాల్ తదితర చెడు అలవాట్లను సాధ్యమైనంత తొందరగా వదిలేయాలి. రోజువారి జీవనశైలిలో కొద్ది మార్పులు చేసి నిద్రకు సక్రమంగా షెడ్యూల్ని కేటాయించేలా చేస్తే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం రాదని అంటున్నారు. ఈ విధానం పాటిస్తే కచ్చితంగా ఏజ్డ్ పర్సన్లా కనిపించరని, ఆయుః ప్రమాణం పెరిగి మీరు చిన్నవారిలానే కనిపిస్తారని డాక్టర్ పాల్విన్ చెబుతున్నారు. (చదవండి: చిన్నారుల్ని ఇబ్బంది పెట్టే హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్!) -
వృద్ధులకు ఏడు ఫిజియోథెరపీ కేంద్రాలు
సాక్షి, అమరావతి: వృద్ధాప్యం కారణంగా కీళ్లు, కండరాల నొప్పులతో బాధపడేవారికి సేవలు అందించేందుకు రాష్ట్రంలో ఏడు ఫిజియోథెరపీ కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వాటి పరిధిలో వృద్ధులకు మరింతగా సేవలు అందించేందుకు ప్రస్తుత బడ్జెట్లో ప్రభుత్వం రూ.కోటి నిధులను కేటాయించింది. రాష్ట్రంలోని విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్), విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో ఫిజియోథెరపీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడు కేంద్రాల్లో నిపుణులైన ఫిజియోథెరపిస్టులు, వైద్యులు సేవలు అందిస్తున్నారు. గడిచిన ఏడాదికాలంలో వీటి ద్వారా 12వేల మందికిపైగా వృద్ధులు ఫిజియోథెరపీ సేవలు పొందారు. వీటితోపాటు వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు తెలుసుకుని వారికి తక్షణ వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వయోవృద్ధులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, మానసిక, వ్యక్తిగత సమస్యలు తెలుసుకుని వారికి తక్షణ సహాయం అందించేలా ఎల్డర్ లైన్–14567 టోల్ ఫ్రీ నంబర్తో జాతీయస్థాయిలో హెల్ప్లైన్ను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ప్రత్యేక ఫీల్డ్ రెస్పాన్స్ టీమ్స్తో ఎల్డర్లైన్ హెల్ప్లైన్ విభాగం సమర్థంగా పనిచేస్తోంది. మరోవైపు వయోవృద్ధులకు చేతికర్రలు, వినికిడి యంత్రాలు, మూడుచక్రాల కుర్చీలు వంటి పరికరాలు అందిస్తోంది. రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థలు(ఎన్జీఓ) నిర్వహిస్తున్న 70 వృద్ధాశ్రమాలకు ప్రభుత్వం గ్రాంట్ను నేరుగా అందిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019, జూన్ నుంచి వృద్ధాప్య పింఛనుకు వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. ఫలితంగా వైఎస్సార్ పింఛను పథకం కింద సుమారు 35లక్షల మంది వృద్ధులు ప్రతి నెల పింఛను పొందుతున్నారు. (చదవండి: ఇంకెన్నాళ్లీ ‘కలం’ కూట విషం?) -
35 ఏళ్ల తర్వాతా... ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టాలంటే?
గత కొన్నేళ్ల కిందటి వరకు గర్భధారణకు పెరిగే వయసు లేదా పెద్దవయసు కాస్త ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చనీ, సాధారణంగా 28 లేదా 30 ఏళ్లలోపే గర్భధారణ జరగడంతో ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టే ఆస్కారం ఎక్కువనే మాటలు వినిపించేవి. అంతేకాదు... 35 ఏళ్లు పైబడ్డ తర్వాత గర్భధారణ జరిగితే పిల్లల్లో డౌన్స్ సిండ్రోమ్ వంటి కొన్ని అనర్థాలు కనిపించే అవకాశాలూ ఎక్కువేనంటూ ఆందోళన నిండిన సలహాలూ వచ్చేవి. అయితే ఆ మాటల్లో కొద్దిపాటి నిజాలున్నప్పటికీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. మెడికల్ పుస్తకాల్లో చెప్పినట్లుగా 35 వయసు దాటాక పుట్టిన పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు అరుదుగా ఉంటాయి. వాటి గురించి అంతగా ఆందోళన అవసరం లేదంటూ డాక్టర్లు చెబుతున్న సంగతులివి.... ఇటీవల కాలం అనేక మార్పులను తెస్తోంది. యువతులు సైతం బాగా చదువుకుంటూ, కెరియర్లో స్థిరపడిన తర్వాతే పిల్లలను కోరుకుంటున్నారు. దాంతో గర్భధారణ, పిల్లలు కలగడంలో ఆలస్యం సాధారణమవుతోంది. వయసు 35 ఏళ్లు దాటాక గర్భధారణ జరిగిన కేసుల్లో గర్భస్రావాలు జరిగే రేటు ఎక్కువనీ, ఆలస్యంగా గర్భధారణ జరిగినప్పుడు పుట్టే పిల్లలకు పుట్టుకతో వచ్చే జన్యుసమస్యలు వస్తాయనే అభిప్రాయాలు ఎక్కువగా ఉండేవి. అందులో కొద్దిపాటి సత్యం ఉంటే ఉండవచ్చేమోగానీ... అదే అక్షరసత్యమనీ, ఆ మాటలే శిలాక్షరాలని అనుకోడానికి వీల్లేదని వైద్యపరిశోధనలు వెల్లడిస్తున్నాయంటున్నారు డాక్టర్లు. అందుకే ‘అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్’, ‘జీరియాట్రిక్ ప్రెగ్నెన్సీ’ అనే పదాలను విని, చదివి కంగారు పడవద్దని చెబుతున్నారు. ఆలస్యపు గర్భధారణలో అనర్థాలు ఎందుకంటే..? ముప్ఫై ఐదేళ్ల తర్వాత జరిగే గర్భధారణల వల్ల పుట్టబోయే పిల్లల్లో అనేక ఆరోగ్యపరమైన రిస్క్లతో పాటు అబార్షన్స్కు అవకాశం ఎక్కువ. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవి... ► అండాశయం వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యకరమైన అండం విడుదల సక్రమంగా జరగడానికి అవకాశం తక్కువ. అండం నాణ్యతా తగ్గుతుంది. అంటే గర్భధారణకు అవకాశాలు పూర్తిగా తగ్గుతాయని కాదు. కానీ ఆలస్యపు గర్భధారణ విషయంలో క్రమం తప్పకుండా డాక్టర్ను సంప్రదిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ► అబార్షన్స్ రిస్క్ ఎక్కువ. ∙వయసు పెరుగుతున్న కొద్దీ అండంలో జరిగే కణవిభజన అంత సక్రమంగా ఉంకపోవచ్చు. దాంతో క్రోమోజోముల సంఖ్యలో విభజన సక్రమంగా జరకపోవచ్చు. ఇతర సమస్యల విషయానికి వస్తే... ► మహిళల్లో 30 ఏళ్లు దాటాక అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గర్భధారణపై ప్రభావం చూపవచ్చు. ► పీసీఓడీ, ఫైబ్రాయిడ్స్ సమస్యలూ, ఫెలోపియన్ ట్యూబులు మూసుకుపోవడం జరగవచ్చు. ► పెద్ద వయసు మహిళలకు పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశముంది. ► 35 ఏళ్లు దాటిన మహిళల్లో సహజ ప్రసవపు అవకాశాలు తగ్గి, సిజేరియన్కే అవకాశాలు ఎక్కువ. ఇటీవల ఆలస్యంగా కెరియర్లో స్థిరపడ్డ తర్వాత, అప్పటికీ స్వాభావికంగా గర్భధారణ జరగకపోతే 35 దాటిన తర్వాతే కృత్రిమ గర్భధారణకు వెళ్తున్నారు. అయినప్పటికీ ఆరోగ్యకరమైన గర్భధారణ, పండంటిబిడ్డ పుట్టే కేసులే చాలా ఎక్కువ. ఇందుకు కొన్ని సూచనలు, జాగ్రత్తలు పాటించాలి. కొంత రిస్క్ ఉన్నా... ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ కోసం... ఒకవేళ మహిళకు 35 ఏళ్లు దాటాక గర్భధారణ జరిగే అవకాశం ఉన్నప్పుడు కొన్ని స్క్రీనింగ్ పరీక్షలు చేయించాలి. అవి... ► సెల్–ఫ్రీ డీఎన్ఏ స్కీనింగ్ పరీక్ష ∙మెటర్నల్ బ్లడ్ స్క్రీనింగ్ (అయితే ఇలాంటి స్క్రీనింగ్ పరీక్షల వల్ల పుట్టబోయే చిన్నారిలోని లోపాలన్నీ నూరు శాతం తెలియకపోవచ్చు. కానీ రాబోయే ముప్పులు కొంత సూచనాత్మకంగా తెలిసే అవకాశాలు మాత్రం ఉంటాయి). ► న్యూకల్ ట్రాన్స్లుయెన్సీ (ఎన్టీ) స్కాన్ టెస్ట్ అనే పరీక్షను గర్భధారణ తర్వాత 14వ వారాల లోపు చేయించాలి. ► గర్భధారణ తర్వాత 20 వారాలప్పుడు అనామలీ స్కాన్ వంటి పరీక్షల్ని చేయించాలి. భవిష్యత్తుకోసం అండాల సంరక్షణ... రోజులు గడుస్తున్న కొద్దీ విడుదలయ్యే అండాల నాణ్యత, అందులో లోపాలు వస్తాయి. అందుకే జీవితంలో ఇంకా స్థిరపడని వారు తగిన సమయంలో ఆరోగ్యంగా ఉన్న అండాలను సేకరించి పెట్టుకోవడానికీ ఇప్పడు అవకాశం ఉంది. అన్నీ అనువుగా ఉన్న సమయంలో ఆ అండాలను గర్భధారణకు ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు... దురదృష్టవశాత్తూ చిన్నవయసులోనే మెనోపాజ్ రావడం లేదా ఏవైనా క్యాన్సర్లకు గురై అండాశయాలను తొలగించాల్సిన పరిస్థితులు రావడం వంటివి జరిగితే... ముందుగా సేకరించి పెట్టుకున్న ఆరోగ్యకరమైన అండాల సహాయంతో అటు తర్వాత కూడా ఆరోగ్యకరమైన రీతిలో గర్భధారణకు ఇప్పుడు అవకాశాలున్నాయి. చివరగా... 35 ఏళ్ల తర్వాత కూడా సురక్షితమైన గర్భధారణ కోసం ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే ముందుగానే సరైనరీతిలో డాక్టర్ సలహాలు పాటించడం, సమతులాహారం తీసుకోవడం, తగినంత బరువు ఉండేలా చూసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనవైలి వంటివి పండంటి బిడ్డ పుట్టేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి. గర్భధారణకు ముందునుంచే గైనకాలజిస్ట్ çసూచనలు అనుసరిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తే ఆరోగ్యకరమైన గర్భధారణకు వయసు ఒక అంకె మాత్రమే. గర్భధారణ కంటే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గర్భం ధరించాలనుకున్న కాస్త పెద్ద వయసు మహిళ గర్భధారణ కంటే ముందునుంచే కొన్ని సూచనలు, జాగ్రత్తలు పాటించాలి. ► తమ సాధారణ ఆరోగ్యం, జీవనశైలి, ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వాటి గురించి, కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి డాక్టర్కు విపులంగా వివరించాలి. ► అప్పటికే తీసుకున్న వ్యాక్సిన్ల వివరాలు తెలపాలి. తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు ఇంకేమైనా ఉన్నాయా అని వాకబు చేయాలి. జీవిత భాగస్వామి (భర్త) వారి వైపు ఆరోగ్య వివరాలు, కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి కూడా చెప్పాలి. (వయసు ఎక్కువైనా, తక్కువైనా గర్భధారణ కోరుకున్న మహిళలందరూ ఈ సూచనలు పాటించాలి.) ► డిప్రెషన్, హైబీపీ, మధుమేహం (డయాబెటిస్) లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్కు వివరించాలి. ► ప్రతిరోజూ 400 మైక్రోగ్రాములకు తగ్గకుండా ఫోలిక్ యాసిడ్తో పాటు మల్టీవిటమిన్ టాబ్లెట్లు వాడాలి. (పిండం పెరుగుదల సమయంలో ఈ పోషకాలన్నీ ప్రతి కణానికీ కావాలి. ఈ సప్లిమెంట్స్ వాడటం వల్ల పుట్టబోయే చిన్నారికి గ్రహణం మొర్రి వంటి సమస్యలతో పాటు వెన్నుపాము లోపాలు (న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్) నివారితమవుతాయి. ► గర్భధారణ సమయంలో ఉండాల్సిన బరువు కంటే... మరీ ఎక్కువ బరువు ఉండటం, అలాగని బరువు తక్కువగా ఉండటం ఈ రెండూ కొన్ని ముప్పులను ఆహ్వానిస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన రీతిలో ఆహారం తీసుకుంటూ, తగిన వ్యాయామం చేస్తూ ఉండాల్సినంత బరువు మాత్రమే ఉండేలా జాగ్రత్త పడాలి. ► గర్భధారణ సమయంలో ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ► పనిచేసే చోట లేదా ఇతరత్రా ప్రదేశాలలో హానికారకమైన రసాయనాలకు దూరంగా ఉండాలి. ఇలా హానికర రసాయనాలకు ఎక్స్పోజ్ కావడం బిడ్డలో పుట్టుకతో వచ్చే లోపాలకు దారితీయవచ్చు. (ఉదాహరణకు కెమికల్ లేదా పెయింట్స్ వంటి పరిశ్రమల్లో పనిచేసేవారి కోసం ఈ జాగ్రత్తలు). ► ఒత్తిడికి పూర్తిగా దూరంగా ఉండాలి. హాయిగా, ఆహ్లాదంగా ఉండటానికి ప్రయత్నించాలి. గర్భధారణ సమయమప్పుడు ఈ సూచనలు... ► అన్ని విధాలా ఆరోగ్యకరంగా ఉన్నామని ఫీలవుతున్నప్పటికీ... డాక్టర్లు నిర్దేశించిన ప్రకారం క్రమం తప్పకుండా వారి ఫాలో అప్లో ఉండాలి. ► గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల వివరాలు (ఫ్లూ షాట్ వంటివి) తెలుసుకుని, వాటిని తప్పక తీసుకోవాలి. ► ఆ సమయంలో డాక్టర్లు సూచించిన చికిత్స ప్రణాళికను పూర్తిగా అనుసరించాలి. ఇది తల్లి, కడుపులోని బిడ్డ... ఈ ఇరువురూ పూర్తిగా సురక్షితంగా ఉండేలా చేస్తాయి. ► సమతులాహారం తీసుకుంటూ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అంటే... క్యాల్షియమ్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్–డి వంటి అన్ని పోషకాలందేలా చూడాలి. శరీరానికి శ్రమ కలగని రీతిలోనే వ్యాయామం చేస్తూ, రోజంతా చురుగ్గా ఉండాలి. డాక్టర్ వరలక్ష్మి కె.ఎస్. సీనియర్ గైనకాలజిస్ట్ -
వృద్ధాప్యానికి చెక్.. తాజా పరిశోధన ఫలితాలతో కొత్త ఆశలు!
వృద్ధాప్యం. మనిషి పరిణామ క్రమంలో అనివార్యమైన దశ. చాలామందికి నరకప్రాయం, బాధాకరం అయిన దశ కూడా. ఒంట్లో అవయవాలన్నీ ఒక్కొక్కటిగా శిథిలమవుతూ పట్టు తప్పి క్రమంగా పనికి రాకుండా పోతుంటే, అన్నింటికీ ఇతరులపై ఆధారపడాల్సిన నిస్సహాయత కుంగదీస్తుంటే, నీడలా వెంట తిరుగుతూ దోబూచులాడే మృత్యువు ఎప్పటికి కరుణిస్తుందా అని ఎదురు చూస్తూ దుర్భరంగా గడుస్తుంటుంది. అలాంటి వృద్ధాప్యాన్ని వీలైనంత వరకూ వాయిదా వేయగలిగితే? ఆ దిశగా ఇప్పటికే పరిశోధనలు మహా జోరుగా జరుగుతున్నాయి. సౌరశక్తి సాయంతో వయసు పెరుగుదలను బాగా నెమ్మదింపజేయవచ్చని అటువంటి అధ్యయనమొకటి తాజాగా చెబుతుండటం ఆసక్తికరం! ఎండలో నిలబడితే ఏమొస్తుందంటే విటమిన్ డి అనేస్తాం. కదా! ఇకపై ఎండలో నిలబడటం ద్వారా ముసలితనానికి టాటా చెప్పేయొచ్చని, వయసు పెరుగుదలను బాగా తగ్గించుకోవచ్చని అంటోంది తాజా అధ్యయనమొకటి. ‘‘సౌరశక్తిని మానవ కణాలు నేరుగా వాడుకునేందుకు అవసరమైన రసాయన శక్తిగా మార్చడం ద్వారా వాటిని ఎక్కువ కాలం పాటు జీవించేలా చేయొచ్చు. కణాల్లోని కీలకమైన మైటోకాండ్రియాలో నిర్దిష్టమైన జన్యుమార్పులు చేయడం దీన్ని సాధించవచ్చు. ఇప్పటికిప్పుడే కాకపోయినా సమీప భవిష్యత్తులో ఇది సాధ్యమై తీరుతుంది’’ అంటూ అది కుండబద్దలు కొడుతుండటం ఆసక్తికరం! వృద్ధాప్యానికి దారి తీసే అంశాల్లో మనిషి కణజాలంలోని కీలకమైన మైటోకాండ్రియా పనితీరు మందగించడమే ప్రధాన కారణం. కాకపోతే ఎటువంటి జీవక్రియలు ఇందుకు కారణమవుతాయన్నది మనకింకా తెలియదు. ఈ సంక్లిష్ట ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ‘‘సౌరశక్తిని రసాయన శక్తిగా మార్చి నిర్దిష్ట పద్ధతితో కణ కేంద్రకంలోని ప్రోటాన్లను శక్తిమంతం చేస్తే మైటోకాండ్రియాలోని జీవన పరిమాణాన్ని పెంచేందుకు తోడ్పడే సమలక్షణాలు సమృద్ధిగా పెరుగుతాయి. యుక్త వయసులో ఇలా కణజాలంలోని మైటోకాండ్రియా సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వయసు పెరుగుదలను బాగా నెమ్మదింపజేయొచ్చు. వయో సంబంధిత వ్యాధులకు మరింత మెరుగైన చికిత్స కూడా అందజేయడం వీలు పడుతుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లోని రోచెస్టర్ మెడికల్ సెంటర్కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఇలా చేశారు...: మౌలిక జీవపరమైన సూత్రాలను అవగాహన చేసుకోవడానికి చిరకాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్న ఒకరకం నట్టలనే ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు. వాటి కణజాలంలోని మైటోకాండ్రియాలో జన్యుపరంగా మార్పుచేర్పులు చేశారు. అనంతరం సౌరశక్తి సాయంతో దాన్ని పరిపుష్టం చేశారు. సూర్యరశ్మిని గ్రహించడం ద్వారా మైటోకాండ్రియా పైపొరలోని అయాన్లన్నీ మరింత శక్తిమంతంగా మారి దాని సామర్థ్యంతో పాటు తాజాదనం కూడా బాగా పెరిగాయి. మైటోకాండ్రియా–ఓఎన్గా పిలుస్తున్న ఈ ప్రక్రియ ద్వారా మెటబాలిజం రేటులో వృద్ధి జరిగి సదరు నట్టలు మరింత ఆరోగ్యకరంగా మారాయి. పైగా వాటి జీవితకాలం కూడా 30 నుంచి 40 శాతం దాకా పెరగడం గమనించారు. ‘‘మా పరిశో ధనలు విజయవంతమయ్యాయి. వాటిని ఇంకాస్త ముందుకు తీసుకెళ్తే వయో మనుషుల్లోనూ సంబంధమైన వ్యాధులను మరింత మెరుగ్గా నయం చేయడమే గాక ఆరోగ్యకరంగా, నిదానంగా వృద్ధాప్యం వైపు సాగేలా చూసే మార్గం చిక్కుతుంది’’ అని పరిశోధనలో పాలు పంచుకున్న సీనియర్ ఆథర్ ఆండ్రూ వొజోవిక్ చెప్పుకొచ్చారు. ‘‘మనిషి శరీరంలో జీవక్రియలపరంగా మైటోకాండ్రియా పోషించే సంక్లిష్టమైన పాత్రను గురించి ఈ అధ్యయనం ద్వారా మరిన్ని విశేషాలు వెలుగులోకి వచ్చాయి. దీని ఫలితాలు జర్నల్ నేచర్లో పబ్లిషయ్యాయి. శక్తి కేంద్రం... మైటోకాండ్రియాను కణం తాలూకు శక్తి కేంద్రంగా చెప్పొచ్చు. కణాల్లో జరిగే జీవ క్రియలకు కావాల్సిన శక్తిని ఇవే తయారు చేస్తాయి. కణంలో రెండు పొరలతో కూడుకుని ఉండే మైటోకాండ్రియాలు స్థూప, గోళాకృతుల్లో ఉంటాయి. జీవ క్రియలు చురుగ్గా సాగే కణాల్లో వీటి సంఖ్య అపారంగా ఉంటుంది. మైటోకాండ్రియా పనితీరు ఎంతగా తగ్గుతుంటే అవయవాలు క్షీణించి శిథిలమయ్యే ప్రక్రియ అంతగా వేగం పుంజుకుంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తాతగారు టెన్త్ పాస్!
ఝరాసంగం (జహీరాబాద్): 70 సంవత్సరాల వృద్ధుడు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కొల్లూరు గ్రామానికి చెందిన రైతు గాల్రెడ్డి ఝరాసంగం గ్రామానికి చెందిన ఓపెన్ స్కూల్లో పదో తరగతి విద్యను అభ్యసించారు. 2021 – 22 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పది పరీక్షల్లో ఆయన ఉత్తీర్ణత సాధించారు. జూలైలో ఫలితాలు విడుదల కాగా శనివారం విద్యాశాఖ అధికారుల నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా గాల్రెడ్డిని శాలువాతో సన్మానించారు. సర్పంచ్గా పోటీ చేయాలంటే పదో తరగతి విద్యార్హత కలిగిన వారు అర్హులని ప్రభుత్వం ప్రకటించడంతో పదో తరగతి పరీక్ష రాశానని గాల్రెడ్డి తెలిపారు. (చదవండి: స్థలం కేటాయిస్తే సైన్స్ సిటీ ఏర్పాటు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి) -
వరల్డ్ ఓల్డెస్ట్ ప్రాక్టీసింగ్ డాక్టర్గా గిన్నిస్ రికార్డు!
నిండునూరేళ్లు బతకమని ఆశీర్వదిస్తుంటారు.. కానీ నిండునూరేళ్ల వయసులోనూ అలుపెరుగక సేవలందిస్తున్నారు యూఎస్కు చెందిన ఓ డాక్టర్. ఓహియోకు చెందిన న్యూరాలజిస్ట్ హోవర్డ్ టక్కర్ 2021 ఫిబ్రవరిలో.. అంటే ఆయనకు 98 ఏళ్ల 231 రోజుల వయసులోనే ఓల్డెస్ట్ ప్రాక్టీసింగ్ డాక్టర్గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇప్పుడు నూరేళ్ల వయసులోనూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు పనిచేస్తున్నారు. తన 100వ బర్త్డే తరువాత జూలైలో కోవిడ్ బారిన పడ్డారు. అప్పుడు కూడా జూమ్లో వైద్య సలహాలిచ్చారు. 1922 జూలై 10న జన్మించిన టక్కర్.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూఎస్ నేవీలో సేవలందించారు. 1950 కొరియా యుద్ధ సమయంలోనూ అట్లాంటిక్ ఫ్లీట్లో న్యూరాలజీ చీఫ్గా పనిచేశారు. విశ్రాంతి తీసుకోవడం దీర్ఘాయువుకు శత్రువు లాంటిదనే ఆయన... చేసే పనిని ప్రేమించినప్పుడు పదవీ విరమణ ఆలోచనే రాదంటున్నారు. ప్రాక్టీసింగ్ సైకోఎనలిస్ట్ అయిన టక్కర్ భార్య 89 ఏళ్ల స్యూ సైతం ఇంకా పనిచేస్తోంది. (చదవండి: ఫార్ములా ఈ రేస్తో హైదరాబాద్లో ట్రాఫిక్ టెన్షన్) -
వైఎస్సార్ పెన్షన్ కానుక.. అవ్వా తాతలకు పండగ
సాక్షి, అమరావతి: ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం 62.53 లక్షల మంది పెన్షనర్లకు రూ.1590.50 కోట్లు విడుదల చేసింది. ఉదయం 8 గంటల వరకు 31.84 శాతం పింఛన్ల పంపిణీ జరిగింది. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదన్న ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. చదవండి: ప్లీజ్.. తమ్ముళ్లూ ప్లీజ్.. టీడీపీ నేతలకు చంద్రబాబు లాలింపు సూర్యోదయానికి ముందే.. ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. ఇలాంటి లక్షలాది మందికి వారి ఇంటికే వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపి, వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది జగనన్న ప్రభుత్వం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెలా అయిదో తేదీలోగానే దాదాపుగా పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తోంది. అవ్వా తాతలు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. వీళ్లు ఎవ్వరూ ఇంటి గడప దాటకుండానే పింఛన్లు అందుకుంటున్నారు. సెప్టెంబర్ నెలకు గానూ 62.53 లక్షల మందికి ₹1,590.50 కోట్లు పంపిణీ చేస్తోంది. గత ఏడేళ్లలో ప్రతి సెప్టెంబర్ నెలలోనూ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి ఖర్చు చేసిన మొత్తం వివరాలివి... సంవత్సరం పంపిణీ చేసిన మొత్తం సెప్టెంబర్ 2022 ₹1,590.50 కోట్లు సెప్టెంబర్ 2021 ₹1,397 కోట్లు సెప్టెంబర్ 2020 ₹1,429 కోట్లు సెప్టెంబర్ 2019 ₹1,235 కోట్లు సెప్టెంబర్ 2018 ₹477 కోట్లు సెప్టెంబర్ 2017 ₹418 కోట్లు సెప్టెంబర్ 2016 ₹396 కోట్లు సెప్టెంబర్ 2015 ₹405 కోట్లు -
135 ఏళ్ల చైనా వృద్ధురాలు కన్నుమూత
బీజింగ్: చైనాలోనే అత్యంత వృద్ధురాలైన అలిమిహాన్ సెయిటి(135) కన్నుమూశారని జిన్జియాంగ్ ఉయ్గుర్ అటానమస్ ప్రాంత అధికారులు శనివారం వెల్లడించారు. షులే కౌంటీలోని కొముక్జెరిక్ టౌన్షిప్నకు చెందిన అలిమిహాన్ 1886 జూన్ 25వ తేదీన జన్మించినట్లు కౌంటీ రికార్డుల్లో నమోదై ఉందని అధికారులు చెప్పారు. 2013లో చైనా అసోసియేషన్ ఆఫ్ గెరంటాలజీ, జీరియాట్రిక్స్ విభాగం జారీ చేసిన జీవించి ఉన్న అత్యంత వృద్ధుల జాబితాలో అలిమిహాన్ పేరు టాప్లో ఉన్నట్లు అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. గురువారం తుదిశ్వాస విడిచే వరకు ఆమె చాలా సాధారణమైన రోజువారీ జీవితం గడిపారని పేర్కొంది. వేళకు ఆహారం తీసుకుంటూ, తన ఇంటి పెరట్లో ఎండలో గడిపేవారని, మునిమనవలకు సాయం చేసే వారని తెలిపింది. కాగా, 90 ఏళ్లకు పైబడి ఉన్న వృద్ధులు ఎక్కువగా ఉండే పట్టణంగా కొముక్జెరిక్కు పేరుంది. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం అందించే ఆరోగ్య పథకాలు కూడా ఇక్కడి వారికి దీర్ఘాయుష్షును అందిస్తున్నాయని జిన్హువా తెలిపింది. -
పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్కు ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ
న్యూఢిల్లీ: వృద్ధాప్యం మీదపడుతున్న పెన్షనర్లు సుదూరంలోని సంబంధిత కార్యాలయాలకు తాము నేరుగా వచ్చి లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించాల్సి వచ్చేది. అలాంటి వారికి లైఫ్ సర్టిఫికెట్ విషయంలో ఎంతగానో సాయపడే కొత్త రకం ఫేస్ రికగ్నేషన్ సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చింది. ప్రతీ సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా సంబంధిత ప్రభుత్వ శాఖకు సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్కు ఇకపై ఒక సాక్ష్యంగా పనికొచ్చే ‘యునీక్’ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని పెన్షన్ల శాఖ కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ప్రారంభించారు. పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ను డిజిటల్ రూపంలో ఇచ్చేందుకు ఇప్పటికే కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ ఒక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ‘యునీక్’ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ వారికి మరింతగా ఉపయోగపడనుందని మంత్రి చెప్పారు. 68 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతోపాటు ఈపీఎఫ్వో, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వారికీ ఈ టెక్నాలజీ సహాయకారిగా ఉంటుందన్నారు. -
అందాల పోటీలు.. 10 మందిని వెనక్కి నెట్టి విజేతగా 86 ఏళ్ల బామ్మ
జెరూసలేం: అలనాటి నాజీ మారణహోమం భయాందోళనలను భరిస్తూ జీవనం సాగించిన మహిళలను గౌరవించే నిమిత్తం రూపొందించిన వార్షిక ఇజ్రాయెల్ అందాల పోటీల్లో 86 ఏళ్ల బామ్మ కుకా పాల్మోన్ విజేతగా నిలిచి "మిస్ హోలోకాస్ట్ సర్వైవర్" కిరీటాన్ని గెలిపొందారు. ఈ మేరకు జెరూసలేంలోని ఒక మ్యూజియంలో ఈ పోటీలు నిర్వహించారు. అయితే ఈ పోటీల్లో సుమారు 10 మంది 79 నుంచి 90 సంవత్సరాల వయసు ఉన్న బామ్మలు మంచి హెయిర్ స్టైల్, మేకప్ వేసుకుని గౌనులాంటి చీరలను ధరించి క్యాట్వ్యాక్తో సందడి చేశారు. (చదవండి: వామ్మో! మొసలిని కౌగలింతలతో ఎలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో!!) ఈ మేరకు కుకా పాల్మోన్ మాట్లాడుతూ.."హోలోకాస్ట్లో గడిపిన తర్వాత నేను నా కుటుంబసభ్యులతో కలిసి జీవిస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, నలుగురు మనవరాళ్ళు, ఇద్దరు ముని మనవరాళ్ళు ఉన్నారు. పైగా నేను ఇక్కడకు వచ్చి పాల్గొంటానని కలలో కూడా అనుకోలేదు. ఈ వయసులో విజేతగా నిలిచి ఈ కిరిటాన్ని గెలుచకోవడం అద్భతమైన విషయం వర్ణించలేనిది". అంటూ చెప్పుకొచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో అప్పటి నాజీల మారణహోమం కారణంగా ఇజ్రాయెల్ పెద్ద సంఖ్యలో యువతను కోల్పోయింది. అప్పటి భయానక పరిస్థితులను భరిస్తూ ప్రాణాలతో బయటపడిన అతి కొద్ది మంది యూదు మహిళలను గౌరవించే నిమిత్తం ఈ అందాల పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఇజ్రాయెల్ అందాల పోటీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు కరోనా మహమ్మారి దృష్ట్యా గతేడాది నిర్వహించ లేకపోయినట్లు తెలిపారు. (చదవండి: ఇదే ఆఖరి రోజు!.. బతికే ఉన్నందుకు కృతజ్ఞతలు..) -
పెద్దవారికి పన్ను ఉపశమనం..
వృద్ధాప్యంలో పన్ను నిబంధనలు చాలా మందికి ఇబ్బందిగా అనిపిస్తాయి. పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పలు చర్యలను ప్రకటించారు. 75 ఏళ్లు నిండిన వారు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా చేశారు. కాకపొతే ఈ విషయంలో కొన్ని పరిమితులను కూడా నిర్దేశించారు. ఇందుకు సంబంధించి దాఖలు చేయాల్సిన డిక్లరేషన్ పత్రాలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. రిటర్నుల దాఖలు విషయంలోనే కాకుండా పలు ఇతర వెసులుబాట్లు కూడా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ వరకు పొడిగించిన నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు వీటిపై ఓ సారి దృష్టి సారించాల్సిందే.. 75 ఏళ్లు నిండిన వారికి ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడం ఇకమీదట తప్పనిసరి కాదు. 2021–22 ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. అంటే 2022–23 అసెట్మెంట్ సంవత్సరం నుంచి అమలవుతుంది. కాకపోతే ఇది అందరికీ వర్తించదు. పెన్షన్ ఆదాయం, డిపాజిట్పై వడ్డీ ఆదాయం ఉన్నవారికి ఈ వెసులుబాటు. పెన్షన్ ఖాతాలోనే డిపాజిట్పై వడ్డీ ఆదాయం వస్తున్నవారు ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఒక బ్యాంకులో పెన్షన్ ఖాతా ఉండి, మరో బ్యాంకులో డిపాజిట్పై వడ్డీ ఆదాయం అందుకునే వారికి రిటర్నుల దాఖలు మినహాయింపు లభించదని అర్థం చేసుకోవాలి. ఒకే బ్యాంకులో పెన్షన్, వడ్డీ ఆదాయం కలిగి ఉన్న వారు డిక్లరేషన్ పత్రాన్ని బ్యాంకుకు సమర్పిస్తే సరిపోతుంది. అప్పుడు సంబంధిత వ్యక్తి చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని బ్యాంకు మినహాయించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తుంది. ఇలా పన్నును గుణించేటప్పుడు చాప్టర్ 6ఏ కింద మినహాయింపులను బ్యాంకు అమలు చేస్తుంది. ప్రతీ ఏడాది 12బీబీఏ అనే పత్రాన్ని (డిక్లరేషన్) 75 ఏళ్లు నిండిన వారు బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. తమకు సంబంధిత బ్యాంకు శాఖలోనే పెన్షన్, వడ్డీ ఆదాయం తప్పించి మరే ఇతర ఆదాయం లేదన్న ధ్రువీకరణే ఇది. పేరు, చిరునామా, పాన్, పుట్టిన తేదీ, సంవత్సరం (75ఏళ్లు నిండినట్టు తెలియజేయడం) వివరాలను ఫామ్ 12బీబీఏలో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, పెన్షన్ ఖాతా బ్యాంకు వివరాలు, పెన్షన్ ఎవరి నుంచి అందుకుంటున్నారనే వివరాలు ఇవ్వాల్సి వస్తుంది. ఒక బ్యాంకు కంటే ఎక్కువ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న వారు, 75ఏళ్లలోపు వారు ఎప్పటి మాదిరే ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇతర రూపాల్లో ఆదాయం ఉన్న వారికి కూడా ఈ మినహాయింపు వర్తించదు. ఆయా అంశాలపై సమగ్రంగా నిపుణుల సూచనలు తీసుకోవాలి. అడ్వాన్స్ ట్యాక్స్ మినహాయింపు.. వ్యక్తులు ఏదైనా ఆర్థిక సంవత్సరంలో రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తే.. ముందస్తుగానే (అడ్వాన్స్ ట్యాక్స్) ఆ మొత్తాన్ని ఆదాయపన్ను శాఖకు జమ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు 2020–21లో రూ.15,000 పన్ను చెల్లించాల్సి వస్తే.. ఆర్థిక సంవత్సరం గడిచిపోయి, ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వరకు ఆగకూడదు. నిబంధనల ప్రకారం పన్ను మొత్తాన్ని అంచనా వేసుకుని నాలుగు వాయిదాల రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. రిటర్నులు దాఖలు చేసిన తర్వాత అదనంగా చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించడం.. ఒకవేళ ముందుగానే ఎక్కువ జమ చేసి ఉంటే ఆ మేరకు రిఫండ్ కోరడం చేయవచ్చు. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించకపోతే.. సెక్షన్ 234బీ, 234సీ కింద వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. చెల్లించాల్సిన పన్ను మొత్తంపై ప్రతీ నెలా (ఆలస్యమైన అన్ని నెలలకు) ఒక శాతం చొప్పున (ప్రతీ సెక్షన్కు కూడా) ఉంటుంది. అయితే 60ఏళ్లు నిండిన వారు వ్యాపారం లేదా వృత్తి రూపంలో లాభాలు, ఆదాయం లేనట్టయితే అడ్వాన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందొచ్చు. ఇతర మినహాయింపులు.. పన్ను చెల్లింపుదారులు.. తనకు, తన కుటుంబ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు చెల్లించే ప్రీమియంను సెక్షన్ 80డీ కింద రూ.25,000 వరకు.. ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. అయితే 60ఏళ్లు పైబడిన వారికి ఈ మొత్తం రూ.50,000 పరిమితిగా ఉంది. దీనికితోడు సెక్షన్ 80డీడీబీ కింద తనకు, తనపై ఆధారపడిన వారికి సంబంధించి కొన్ని ప్రత్యేక వ్యాధులకు చేసే చికిత్సా వ్యయాలు రూ.40,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు (60ఏళ్లలోపువారికి) లభిస్తుంది. 11డీడీలో ఈ వ్యాధుల వివరాలు లభిస్తాయి. ప్రాణాంతక కేన్సర్లు, ఎయిడ్స్, మూత్రపిండాల వైఫల్యం, పార్కిన్సన్స్, డిమెన్షియా ఇవన్నీ కూడా ఈ జాబితాలోనివే. 60ఏళ్లు నిండిన వారు ఈ వ్యాధుల కోసం చేసే చికిత్సా వ్యయాలు ఒక రూ.లక్ష వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం నుంచి మినహాయించి చూపించుకోవచ్చు. బ్యాంకు డిపాజిట్లపై (సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 మొత్తంపైనా వృద్ధులకు పన్ను లేదు. కోపరేటివ్ బ్యాంకులు, పోస్టల్ డిపాజిట్లకూ సెక్షన్ 80టీటీబీ కింద ఈ మినహాయింపు లభిస్తుంది. 60ఏళ్లలోపు వారికి అయితే ఈ పరిమితి రూ.10,000గానే (సెక్షన్80టీటీఏ) ఉంది. బ్యాంకులు, కోపరేటివ్లు, పోస్టాఫీసుల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం రూ.40,000 మించితే 10 శాతం టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత)ను మినహాయిస్తారు. అదే 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000 మించినప్పుడే టీడీఎస్ అమలవుతుంది. తమ ఆదాయం పన్ను చెల్లించాల్సినంత లేనప్పుడు బ్యాంకులకు ఫామ్ 15హెచ్ సమరి్పంచినట్టయితే టీడీఎస్ను మినహాయించకుండా చూసుకోవచ్చు. ఇక 75 ఏళ్లు నిండి, ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేని వారికి కూడా టీడీఎస్ నిబంధనలు వర్తించవు. వేర్వేరు పన్ను శ్లాబులు 60ఏళ్లు పైబడినవారు ఒక ఆర్థిక సంవత్స రంలో రూ.3లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.3–5 లక్షల ఆదాయంపై 5%, రూ.5–10 లక్షల ఆదాయంపై 20 %, రూ.10లక్షలు మించిన ఆదాయంపై 30% పన్ను రేటు అమలవుతుంది. అదే 80ఏళ్లు నిండిన వారు రూ.5లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.5–10 లక్షల మధ్య ఆదాయంపై 20%, అంతకుమించిన ఆదాయంపై 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విద్యా సెస్సు, సర్చార్జ్ అన్నవి పన్ను చెల్లింపుదారులు అందరికీ వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వం నూతన పన్ను విధానాన్ని ఐచ్చికంగా ప్రవేశపెట్టడం తెలిసిందే. నూతన విధానాన్ని ఎంపిక చేసుకుంటే అందులో ఈ తరహా వయసు ఆధారంగా పన్ను రేట్లలో మార్పులనేవి ఉండవు. అందరికీ ఒకవిధమైన పన్ను రేట్లు అమలవుతాయి. పైగా పాత విధానంలో ఎన్నో రకాల పన్ను మినహాయింపులన్నవి నూతన విధానంలో వినియోగించుకోవడానికి అవకాశం ఉండదు. కనుక నూతన విధానానికి మారే ముందు పన్ను నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. అయితే నూతన పన్ను విధానంలోనూ రూ.5 లక్షల వరకు ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రూ.12,500 పన్ను రాయితీని పొందొచ్చు. -
16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచార యత్నం
సాక్షి, మల్లాపూర్(కరీంనగర్): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ఓ గ్రామంలో బాలిక(16) ఓ వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. బాలిక రెండ్రోజుల క్రితం కిరాణానికి సరుకుల కోసం వెళ్లింది. అదే సమయంలో వృద్ధుడు(60) అక్కడికి వచ్చి బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగకుండా అత్యాచారానికి యత్నించాడు. భయాందోళనకు గురైన బాలిక కేకలు వేసింది. దీంతో వృద్ధుడు అక్కడి నుంచి పరారయ్యాడు ఇంటికి వెళ్లిన బాలిక విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. వారు బాలికతో కలిసి పోలీస్స్టేషన్కు వెళ్లారు. వృద్ధుడిపై ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిసింది. చదవండి: హైటెక్ వ్యభిచారం.. తప్పించుకోవడానికి రహస్య మార్గం.. -
దారుణం: ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం
సాక్షి, నేలకొండపల్లి(ఖమ్మం): మోటాపురంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మోటాపురానికి చెందిన భార్యాభర్తలు బుధవారం తమ ఆరేళ్ల కుమార్తెను ఇంట్లో వదిలి కూలీ పనికి వెళ్లారు. ప్రతీరోజు ఇలాగే వెళ్తుండగా పాప చుట్టుపక్కల పిల్లలతో ఆడుకునేది. దీనిని ఆసరాగా చేసుకుని వారి ఎదురు ఇంట్లో ఉండే దీప్లానాయక్(60) ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కూలీ పనులకు వెళ్లొచ్చాక ఆమె తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోవటంతో గ్రామం అంతా వెతికారు. అయినా దొరకపోవడంతో విలపిస్తూ అనుమానంతో దీప్లానాయక్ ఇంట్లోకి వెళ్లి చూడగా వివస్త్రగా పడి ఉంది. దీంతో విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు సీడీపీఓ బాలాత్రిపుర సుందరికి సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా నేలకొండపల్లి ఎస్సై జి.అశోక్రెడ్డి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాలికను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. చదవండి: ప్రేమించాలని ‘యువతి’ వేధింపులు.. -
80 ఏళ్ల బామ్మః జ్యూస్ స్టాల్
అమృత్సర్: పంజాబ్లోని అమృత్సర్ నగరంలో పండ్ల రసం దుకాణం నిర్వహిస్తున్న 80 ఏళ్ల వృద్ధురాలి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్న సదరు బామ్మను చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. తమ వంతు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. ఏడాది క్రితం ఢిల్లీలోని ‘బాబా కా దాబా’ వృద్ధ దంపతుల కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చిన ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ ఇటీవల అమృత్సర్ బామ్మ ఉదంతాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. 30 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను కొద్ది రోజుల్లోనే 90 లక్షల మందికి పైగా నెటిజన్లు తిలకించారు. అమృత్సర్లోని ఉప్పల్ న్యూరో ఆసుపత్రి సమీపంలో రాణి దా బాగ్ వద్ద ఆమె స్వయంగా జ్యూస్ స్టాల్ నడిపిస్తున్నారు. 80 ఏళ్ల బామ్మ బత్తాయి రసం తయారు చేసి, విక్రయిస్తున్న దృశ్యం జనం మనసులను కదలిస్తోంది. ఆమెపై సానుభూతి వెల్లువెత్తుతోంది. ఆవేదన పంచుకుంటామని, ఆర్థిక సాయం అందిస్తామని చాలామంది బామ్మ బ్యాంకు ఖాతా వివరాల కోసం ఆరా తీస్తున్నారు. బామ్మ దుకాణంలో పండ్ల రసం తాగి, ఆమెకు ఆర్థికంగా తోడ్పాటు అందించాలంటూ అమృత్సర్ ప్రజలకు సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నారు. జీవనోపాధి కోసం జ్యూస్ స్టాల్ నడిపిస్తున్న బామ్మకు హ్యాట్సాప్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇదే అసలైన ఆత్మనిర్భర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నేటితరం యువత ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని కొనియాడుతున్నారు. వృద్ధుల కోసం కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని ఓ నెటిజన్ అభ్యర్థించాడు. -
పెద్దలకు పరిపూర్ణ రక్షణ
మన దేశ జనాభాలో వృద్ధులు (సీనియర్ సిటిజన్లు) 2015 నాటికి 8 శాతానికి చేరారు. 2050 నాటికి 19 శాతం వృద్ధులే ఉంటారని అంచనా. ప్రతీ ఇంటిలోనూ 60 ఏళ్లు నిండిన వయసు వారు ఆ కుటుంబానికి ఓ పెద్ద ఆస్తి వంటివారే. కుటుంబం కోసం అప్పటి వరకు వారు ఎంతో పాటు పడి, ఎంతో శ్రమకోర్చి ఉంటారు. కానీ, వృద్ధాప్యంలో వారిని చుట్టుముట్టే ఆరోగ్య, జీవనశైలి సమస్యలెన్నో. వీటి కోసం చేయాల్సిన ఖర్చు కొన్ని సందర్భాల్లో భారీగానూ ఉంటుంది. వయసుతోపాటు పెరిగే ఆరోగ్య సంరక్షణ వ్యయాలకు ప్రతీ కుటుంబం తగినంత సన్నద్ధతతో ఉండాలి. అయితే, సీనియర్ సిటిజన్లు, వారి పిల్లలు హెల్త్ కవరేజీ విషయంలో తగినంత రక్షణతో లేనట్టు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇటీవల నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. ‘‘ఉమ్మడి కుటుంబాలు కాస్తా ఏక కుటుంబంగా మారుతున్న రోజుల్లో.. పిల్లలు పెద్ద పట్టణాలకు, విదేశాలకు జీవనోపాధి కోసం తరలిపోతుండడంతో పెద్దల జీవనం, వారి సంరక్షణ సవాలుగా మారుతున్నాయి’’ అని ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సీఈవో మయాంక్ భత్వాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో సంక్షేమం, ఆరోగ్యం కోసం అవసరమైన చర్యలను ముందు నుంచే తీసుకోవడం ద్వారా నిశ్చితంగా ఉండొచ్చు. ఇందుకోసం వైద్య బీమా తీసుకోవడంతోపాటు ఇతరత్రా చర్యలు కూడా అవసరమేనని సూచించే కథనమే ఇది. ఆరోగ్య అత్యవసర నిధి 50 ఏళ్లకు వచ్చిన వారికి పదవీ విరమణ తీసుకునేందుకు మరో 10 ఏళ్ల వరకు సమయం మిగిలి ఉంటుంది. ఈ కాలాన్ని వైద్య అత్యవసర నిధి సమకూర్చుకునేందుకు వినియోగించుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ రూపంలో పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అవసరమైనంత నిధిని సమకూర్చుకోవచ్చని సెబీ రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు రేణు మహేశ్వరి సూచించారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ తన వంతుగా రోగి చెల్లించాల్సి వస్తే అందుకోసం వైద్య అత్యవసర నిధి అక్కరకు వస్తుంది. అవుట్ పేషెంట్గా తీసుకునే చికిత్సలకు పాలసీలు అన్నింటిలోనూ కవరేజీ ఉండకపోవచ్చు. కనుక అవుట్ పేషెంట్ వైద్య సేవలకు చేసే చెల్లింపులు, ఆస్పత్రికి రాను, పోను చార్జీలు ఇవన్నీ రోగి తన పాకెట్ నుంచే పెట్టుకోవాల్సి రావచ్చు. ఒక్కసారి నిధిని సిద్ధం చేసుకున్న తర్వాత.. మొత్తాన్ని ఒకే చోట కాకుండా.. సేవింగ్స్ డిపాజిట్, లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఉంచుకోవాలి. గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్లో చోటు ఉద్యోగం చేసే చోట గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీని సంస్థ ఆఫర్ చేస్తుంటుంది. ఇందులో తమ తల్లిదండ్రుల పేర్లను కూడా యాడ్ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే సాధారణంగా గ్రూప్ హెల్త్ కవరేజీలో ప్రీమియం కొంచెం తక్కువగా ఉంటుంది. ముందు నుంచే తల్లిదండ్రులను యాడ్ చేసుకోవడం ద్వారా ప్రీమియం భారం తక్కువగా ఉండేలా చూసుకోవచ్చు. దీనికి తోడు తల్లిదండ్రులకు విడిగా హెల్త్ కవరేజీ కూడా తీసుకోవాలి. ‘‘చాలా కార్పొరేట్ సంస్థలు తల్లిదండ్రులకు దీర్ఘకాలం పాటు కవరేజీని ఆఫర్ చేయడం లేదు. అందుకే ముందు తల్లిదండ్రులను గ్రూపు హెల్త్ ఇన్సూరెన్స్లో చేర్చుకున్నా కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత ఖర్చులను తగ్గించుకునేందుకు తొలగించాల్సి రావచ్చు. పైగా ఈ పాలసీల్లో పెద్దలకు కవరేజీ తక్కువగా రూ.2–3 లక్షల వరకే ఉంటుంది. ఉద్యోగం మానివేసినా, లేక సంస్థ మారినా ఈ కవరేజీని కోల్పోవాల్సి వస్తుంది’’ అని నిపుణులు పేర్కొంటున్నారు. అవసరమైన కవరేజీ.. వయసు పెరుగుతున్న కొద్దీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అధికమవుతుంది. ‘‘మెట్రో నగరంలోనా లేక చిన్న పట్టణంలో నివసిస్తున్నారా?, మీ జీవన శైలి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు.. వీటి ఆధారంగా ఎంత మేర సమ్ ఇన్సూర్డ్ (బీమా మొత్తం) తీసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది’’ అని మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు. మెట్రోలో ఉంటున్న వారు, ఆస్పత్రిలో సింగిల్రూమ్ కోరుకునే వారు అధిక కవరేజీ తీసుకోవడం అవసరం. వృద్ధ దంపతులకు రూ.10–20 లక్షల కవరేజీ, ఆ వయసులో విడిగా ఒకరికి అయితే రూ.7–10 లక్షల వరకైనా బీమా తీసుకోవాలి. కఠిన నిబంధనలు 50 ఏళ్లకి వచ్చే సరికి దంపతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వైద్య బీమా అన్నది తగినంత లేకపోతే సూపర్ టాపప్ ద్వారా దాన్ని పెంచుకోవాలి. అదే 60 ఏళ్లు నిండిన తర్వాత కొత్తగా హెల్త్ పాలసీ తీసుకోవాలన్నా, సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని పెంచుకోవాలన్నా లేక సూపర్ టాపప్ తీసుకోవాలన్నా అది కష్టంగా మారుతుంది. ‘‘ఒక వ్యక్తి 60 ఏళ్ల వయసులోకి ప్రవేశించారంటే వారికి కఠిన అండర్రైటింగ్ నిబంధనలు అమలవుతాయి. ఉదాహరణకు పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి’’ అని సిక్దర్ తెలిపారు. ముందస్తు వ్యాధులున్న వారికి బీమా కంపెనీలు బీమాకు నిరాకరిస్తున్నాయి కూడా. సీనియర్ సిటిజన్ల కోసం ఉద్దేశించిన పాలసీలు నేడు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ముందస్తు వ్యాధులకు ఇవి కవరేజీని ఆఫర్ చేస్తున్నప్పటికీ.. ఎన్నో పరిమితులను విధిస్తున్నాయి. వెయిటింగ్ పీరియడ్ ఆప్షన్లు పాలసీల్లో రెండు రకాల వెయిటింగ్ పీరియడ్ ఆప్షన్లు ఉంటుంటాయి. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు కవరేజీ ఒకటి. పాలసీ తీసుకున్న అనంతరం రెండు నుంచి నాలుగేళ్లు గడిచిన తర్వాతే వీటికి కవరేజీనిస్తాయి. కేటరాక్ట్, మోకీలు మార్పిడి తదితర చికిత్సలకు కవరేజీ కోసం పాలసీ తీసుకున్న అనంతరం రెండేళ్ల పాటు ఆగాల్సి రావడం మరొకటి. అంటే ఈ కాలంలో చికిత్సలు చేయించుకోవాల్సి వస్తే అందుకు అయ్యే వ్యయాలను పాలసీదారులే పెట్టుకోవాలి. ఉప పరిమితులు బీమా సంస్థలు చెల్లింపుల్లో ఉప పరిమితులను కూడా విధిస్తుంటాయి. అంటే, ఫలానా వ్యాధికి గరిష్టంగా ఇంత మొత్తమని లేదా సమ్ ఇన్సూర్డ్లో నిర్ణీత శాతాన్ని చెల్లిస్తామన్న నిబంధనలు పాలసీల్లో ఉంటాయి. ఉదాహరణకు గుండె సంబంధిత సమస్యలకు గరిష్టంగా రూ.3 లక్షలే చెల్లిస్తామనే పరిమితి ఉండొచ్చు. అదే కేటరాక్ట్ సర్జరీ అయితే గరిష్ట చెల్లింపులను రూ.25,000కు పరిమితం చేస్తాయి. ఒకవేళ ఇంతకు మించి వ్యయం అయితే ఆ మొత్తాన్ని పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. అలాగే అన్ని పాలసీల్లో కాకపోయినా కొన్నింటిలో రూమ్ రెంట్, ఐసీయూ రెంట్ పరంగా ఉప పరిమితులు కూడా ఉంటుంటాయి. ఈ పరిమితులతో మొత్తం పాలసీ చెల్లింపులు కూడా మారిపోతాయి. అందుకే పాలసీ తీసుకునే ముందు పూర్తి అవగాహనకు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ సర్వే అంశాలు ► 18 శాతం తల్లిదండ్రులకే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉంది. అంటే మెజారిటీకి కవరేజీ లేదు. ► 26 శాతం తల్లిదండ్రులు వైద్య పరంగా అత్యవసర పరిస్థితుల్లో చెల్లింపులకు పిల్లలపైనే ఆధారపడుతున్నారు. అంటే నాలుగింట మూడొంతులు మందికి తగినంత పెట్టుబడులు, పొదుపు నిధుల్లేవు. ► 29 శాతం మంది తమ తల్లిదండ్రులను కంపెనీ లేదా ప్రభుత్వ వైద్య బీమా కవరేజీలో భాగం చేసినట్టు చెప్పారు. వీరికి ప్రత్యేకంగా కవరేజీ అవసరం కూడా ఉంది. కొన్ని పాలసీలను చూస్తే... బీమా కంపెనీ ప్లాన్ పేరు వార్షిక ప్రీమియం రెలిగేర్ హెల్త్ కేర్ సీనియర్ రూ.39,374 స్టార్ హెల్త్ సీనియర్ సిటిజన్ రెడ్కార్పెట్ రూ.43,135 ఆదిత్యబిర్లాహెల్త్ యాక్టివ్కేర్స్టాండర్డ్ రూ.55,598 అపోలోమ్యునిక్హెల్త్ ఆప్టిమారీస్టోర్ రూ.61,312 హెడీఎఫ్సీ ఎర్గో హెల్త్సురక్షా గోల్డ్స్మార్ట్ రూ.65,785 నోట్: మెట్రోలో నివసించే 63 ఏళ్ల వృద్ధుడు, 61 ఏళ్ల ఆయన జీవిత భాగస్వామికి రూ.10 లక్షల కవరేజీ కోసం ప్రీమియం వివరాలు ఇవి.. కో పేమెంట్ ఎంత..? పాలసీల్లో ఎక్కువ వాటిల్లో కో పేమెంట్ ఆప్షన్ ఉంటోంది. అంటే వైద్య చికిత్సా వ్యయాల్లో రోగి తన వంతుగా చెల్లించాల్సిన వాటా. ఇది పాలసీలను బట్టి 10–30% మధ్య ఉండొచ్చు. -
క్రమం తప్పకుండా ఆదాయం
వృద్ధాప్యంలో క్రమం తప్పకుండా ఆదాయాన్నిచ్చే మార్గం కచ్చితంగా ఉండాలి. కొన్ని లక్ష్యాల కోసం స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారూ ఉంటారు. అవసరం ఏదైనా కానీ.. క్రమం తప్పకుండా ఆదాయం పొందేందుకు మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (క్రమానుగతంగా ఉపసంహరణ) మంచి సాధనం. ఈ విభాగంలో నిపుణులు సూచిస్తున్న మంచి పథకాలపై సమాచారాన్ని అందించే ‘ప్రాఫిట్ ప్లస్’ స్టోరీ. ఒక పథకంలో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత నిర్ణీత కాలానికి.. అంటే పక్షానికి, నెలకు, త్రైమాసికానికి, ఆరు నెలలకు, సంవత్సరానికి ఒక్కసారి చొప్పున నిర్ణయించిన మేర ఉపసంహరించుకోవడాన్ని ఎస్డబ్ల్యూపీ సాధనంగా పేర్కొంటారు. పెట్టుబడిపై అప్పటి వరకు వచ్చిన రాబడి వరకే ఉపసంహరించుకోవచ్చు. లేదా తమకు ఎంత అవసరమో ఆ మేరకు ఉపసంహరణను నిర్ణయించుకోవచ్చు. దీనివల్ల క్రమం తప్పకుండా ఆదాయం లభించడమే కాకుండా.. ఫండ్లో మిగిలి ఉన్న పెట్టుబడి వృద్ధి చెందుతూనే ఉంటుంది. గ్రోత్, డివిడెండ్ ప్లాన్లలోనూ ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ అందుబాటులో ఉంది. మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ప్రకటించే డివిడెండ్పై పంపిణీ పన్నును ఎత్తివేయడంతో ఈ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీ ఆప్షన్ మరింత ఆకర్షణీయంగా మారిందని చెప్పుకోవాలి. ఈ విభాగంలో మెరుగైన రాబడులను ఇస్తున్న పథకాలను పరిశీలించినట్టయితే.. కెనరా రొబెకో కన్జర్వేటివ్ హైబ్రిడ్ రిస్క్ పెద్దగా కోరుకోని సంప్రదాయ ఇన్వెస్టర్లు, అదే సమయంలో కొంత వరకు ఈక్విటీ ఎక్స్పోజర్ ఉన్నా ఫర్వాలేదనుకునే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. ఈ పథకం 21–25 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించి, మిగిలినదంతా డెట్ సాధనాల్లో పెట్టుబడులుగా పెడుతుంది. ఈ విభాగంలో సాధారణం కంటే మెరుగైన పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఇది కూడా ఒకటి. గడిచిన మూడేళ్ల కాలంలో వార్షికంగా 6.6 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 6.9 శాతం రాబడులను అందించింది. అధిక నాణ్యత కలిగిన సాధనాల్లోనే ఈ పథకం పెట్టుబడులు పెడుతుంటుంది. ఈక్విటీలకు కేటాయించిన కొద్ది పెట్టుబడుల్లోనూ మూడింట రెండొంతులు లార్జ్క్యాప్ స్టాక్స్నే ఎంచుకుంటుంది. దీనివల్ల ఈక్విటీ మార్కెట్లు కరెక్షన్లోకి వెళ్లినా కానీ నష్టాలు పరిమితంగానే ఉంటాయి. అంతేకాదు, మార్కెట్ల ర్యాలీతో కాస్త అధిక రాబడులకూ అవకాశం ఉంటుంది. డెట్ విభాగంలో ఏఏఏ రేటెడ్ సాధనాలనే ఎంచుకుంటుంది. అధిక నాణ్యతకు ఏఏఏ సూచిక. ప్రతి నెలా 5, 15, 20, 25వ తేదీలను ఎస్డబ్ల్యూపీ కోసం ఎం చుకునేందుకు ఈ పథకం అవకాశం ఇస్తోంది. ఐడీఎఫ్సీ బ్యాంకింగ్ అండ్ పీఎస్యూ డెట్ బ్యాంకింగ్ అండ్ పీఎస్యూ డెట్ విభాగంలో ఏఏఏ/ఏ1ప్లస్ రేటెడ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో ఇది కూడా ఒకటి. బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల డెట్ పేపర్లలో ప్రధానంగా ఇన్వెస్ట్ చేస్తుంటుంది. గడిచిన ఏడాదిగా అస్థిరతలు పెరిగిపోవడంతో.. పెట్టుబడుల సగటు మెచ్యూరిటీని అప్పటి వరకు ఉన్న 3.7 సంవత్సరాల నుంచి 2.8 సంవత్సరాలకు ఫండ్ మేనేజర్ తగ్గించుకున్నారు. దీనివల్ల రిస్క్ తగ్గుతుంది. ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 13.2 శాతం, మూడేళ్లలో వార్షికంగా 9.4 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 8.6 శాతం చొప్పున రాబడులను ఇవ్వడం గమనార్హం. పెట్టుబడులపై రాబడులను లేదా తాము కోరుకున్నంత నిర్ణీత కాలానికి ఉపసంహరించుకునేందుకు ఈ పథకం అవకాశం ఇస్తోంది. ప్రతి నెలా 10, 20వ తేదీలను ఎంచుకోవచ్చు. ఎల్అండ్టీ షార్ట్ టర్మ్ బాండ్ షార్ట్ టర్మ్ డ్యురేషన్ ఫండ్స్ విభాగంలోని పథకాలు సాధారణంగా ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధి కలిగిన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అదే విధంగా రాబడులు, ఆదాయం, భద్రత, లిక్విడిటీ అంశాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుకూలంగా ఉన్న సాధనాలనే పెట్టుబడులకు ఎంచుకుంటాయి. ఈ విభాగంలో అధిక రేటింగ్ కలిగిన (నాణ్యతతో కూడిన) డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో ఎల్అండ్టీ షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్ కూడా ఒకటి. వైవిధ్యం కోసం 160 రకాల డెట్ పేపర్లను ప్రస్తుతానికి తన పోర్ట్ఫోలియోలో కలిగి ఉంది. రాబడులను గమనించినట్టయితే.. గడిచిన ఏడాది కాలంలో 11.4 శాతం ప్రతిఫలాన్నిచ్చింది. మూడేళ్ల కాలంలో వార్షికంగా 8.3 శాతం, ఐదేళ్లలో 8.2 శాతం చొప్పున ఇచ్చింది. ప్రతి నెలా 1, 5, 7, 10, 15, 20, 25వ తేదీలను ఎస్డబ్ల్యూపీకి ఎంచుకోవచ్చు. కోరుకున్నంత లేదా కేవలం రాబడుల వరకే ఉపసంహరించుకోవడం అన్నది ఇన్వెస్టర్ ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది. ఎంపిక ఎలా? ఎంపిక చేసుకున్న ఫండ్స్లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసి ఉన్నా.. లేదా ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసిన అనంతరం ఎస్డబ్ల్యూపీని ప్రారంభించుకోవచ్చు. ఇందుకోసం ఏఎంసీకి ఒక దరఖాస్తు ఇస్తే చాలు. లేదా రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్కు ఇచ్చినా సరిపోతుంది. చాలా ఏఎంసీలు, ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లు, క్యామ్స్ వంటి రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు, ఎంఎఫ్ యుటిలిటీ సంస్థ ఆన్లైన్ నుంచే ఎస్డబ్ల్యూపీని ప్రారంభించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. కొన్ని ఏఎంసీలు స్థిరంగా నిర్ణయించిన మేర ఎస్డబ్ల్యూపీకి అనుమతిస్తుంటే.. ఐడీఎఫ్సీ, ఎల్ అండ్టీ వంటి ఫండ్ సంస్థలు పెట్టుబడులపై రాబడుల వరకే ఉపసహరించుకునేందుకూ అవకాశం ఇస్తున్నాయి. క్రమం తప్పకుండా ఆదాయం వద్దనుకుంటే.. నమోదు చేసుకున్న ఎస్డబ్ల్యూపీని తిరిగి రద్దు కూడా చేసుకోవ చ్చు. ఒకవేళ మీ పెట్టుబడులు ఇక ఏమీ మిగలని సందర్భాల్లో ఎస్డబ్ల్యూపీ దానంతట అదే రద్దయిపోతుంది. పన్నుల విషయానికి వస్తే... మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎస్డబ్ల్యూపీ ఉపసంహరణలు పన్ను పరిధిలోకి వస్తాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసిన ఏడాది లోపు వెనక్కి తీసుకున్నట్టయితే.. ఆర్జించిన రాబడులపై 15 శాతం స్వల్పకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇన్వెస్ట్ చేసిన 12 నెలల తర్వాత నుంచి ఎస్డబ్ల్యూపీని ఆరంభించినట్టయితే.. అప్పుడు రాబడులపై 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాలి. కాకపోతే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అన్నది ఒక ఆర్థిక సంవత్సరంలో రాబడులు రూ.లక్ష మించినప్పుడే చెల్లించాల్సి వస్తుంది. రాబడులు రూ.లక్ష లోపు ఉన్నట్టయితే పన్ను బాధ్యత ఉండదు. అదే స్వల్పకాల మూలధన లాభాల పన్ను ఎంత మొత్తం ఉన్నా కానీ దానిపై 15 శాతం పన్ను పడుతుంది. ఇక డెట్ ఫండ్స్లో పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసిన తర్వాత నుంచి 36 నెలలలోపు ఉపసంహరించుకుంటే వచ్చిన రాబడులు స్వల్పకాల మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తాయి. ఇన్వెస్టర్ ఆదాయపన్ను శ్లాబు ఏ రేటులో ఉంటే ఆ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన 36 నెలల తర్వాత డెట్ ఫండ్స్ నుంచి ఉపసంహరణలు చేస్తే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను అమలవుతుంది. వచ్చిన రాబడుల నుంచి ద్రవ్యోల్బణ రేటును మినహాయించి మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఇన్వెస్టర్ తన రిస్క్ స్థాయిని బట్టి ఈక్విటీయా లేక డెట్ పథకమా లేక హైబ్రిడ్ ఫండ్ వీటిల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. అధిక రిస్క్ తీసుకునే వారు ఈక్విటీ పథకాన్ని పరిశీలించొచ్చు. మోస్తరు నుంచి తక్కువ రిస్క్ కోరుకునే వారు డెట్ ఫండ్ లేదా హైబ్రిడ్ ఫండ్ను ఎంచుకోవచ్చు. -
డీఎన్ఏ పోగు తగ్గితే... వృద్ధాప్య లక్షణాలు!
వయసు ఎంత పెరిగినా.. చర్మం ముడుతలు పడకుండా.. వెంట్రుకలు రాలిపోకుండా చేయవచ్చా? అవునంటున్నారు అలబామా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. కణాల్లోని మైటోకాండ్రియా పనితీరును సరిచేయడం ద్వారా దీన్ని సుసాధ్యం చేయవచ్చునని వీరు ప్రయోగాత్మకంగా నిరూపించారు. వయసు పెరుగుతున్న కొద్దీ కణాల్లోని మైటోకాండ్రియా పనితీరు మందగిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చాలాకాలం క్రితమే గుర్తించారు. మైటోకాండ్రియల్ డీఎన్ఏ పొడవు తగ్గుతున్న కొద్దీ మధుమేహం, వృద్ధులకు వచ్చే నాడీ సంబంధ సమస్యలు, కేన్సర్ వంటి వ్యాధులు వస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. అంతేకాకుండా దశాబ్ద కాలంలో మనిషి మైటోకాండ్రియల్ డీఎన్ఏలో నాలుగు కాపీలు తగ్గిపోతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అలబామా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొన్ని ఎలుకలపై ప్రయోగాలు చేశారు. యాంటీబయాటిక్ల ద్వారా వాటి మైటోకాండ్రియల్ డీఎన్ఏ తగ్గిపోయేలా చేసినప్పుడు కొన్ని వారాల్లోనే వెంట్రుకలు రాలిపోవడంతోపాటు, చర్మం ముడుతలు పడటం మొదలైంది. ఇవన్నీ వృద్ధాప్యంతో వచ్చే లక్షణాలే. కాకపోతే వేగంగా చోటు చేసుకున్నాయి. యాంటీబయాటిక్లను నిలిపివేసిన వెంటనే పరిస్థితి చక్కదిద్దుకుంటున్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి వృద్ధాప్య లక్షణాలకు, మైటోకాండ్రియల్ డీఎన్ఏ తగ్గుదలకు సంబంధం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ ప్రక్రియ ద్వారా వ్యాధులకు చికిత్స చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని కేశవ్సింగ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. -
ఓ గొప్ప మజిలీ
జీవితానికి ఒకే వృద్ధాప్యం. 80వ మజిలీకి సైన్పోస్ట్. జీవితం ఆఖరు దశకి ముఖద్వారం. ఒకనాడు అందంగా అలంకరింపబడి అలసిపోయిన ముసలి తోరణం. ఇది ప్రయత్నించినా రిటర్న్ టికెట్టు లేని ప్రయాణం. రెండు రోజుల్లో నేను 80. చాలా కారణాలకి ఇది చాలా గొప్ప మజిలీ. ఈ దేశంలో గొప్పతనా నికి మన్నిక లేకపోవచ్చుకానీ వయస్సుకి ఉంది. అది సుఖ వంతమైన జీవితానికి పెట్టు బడి. ఈ వయస్సులో శషబి షలు చెల్లిపోతాయి. ఇచ్చకా లకు కొత్త అర్థం వస్తుంది. ఎవరినయినా, ఎప్పుడైనా నిరంతరాయంగా విమర్శించవచ్చు. నచ్చితే మెచ్చుకుం టారు. నచ్చకపోతే ‘పాపం, ఆయనకి వయస్సు మీద పడిందయ్యా’ అని పక్కకి తిరిగి నవ్వుకుంటారు. నడకలో హుందాతనం పెరుగుతుంది. కుర్చీ లోంచి చక్రవర్తిలాగా ఠీవిగా లేవవచ్చు. అవి కీళ్ల నొప్పు లని మనకి తెలుస్తాయి. హుందాతనమని చూసినవారు సరిపెట్టుకుంటారు. తెలిసి తెలిసి తప్పులు చెయ్య వచ్చు. వయస్సు కనుక అందరూ అర్థం చేసుకుం టారు. అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలు చెప్ప వచ్చు. చాలామంది ముఖాలు గుర్తున్నా మరిచిపోయి నట్టు నటించవచ్చు. ‘నువ్వు వెంకటరావు కొడుకువి కదా?’ అని తెలిసి తెలిసి పలకరిస్తే– ‘కాదండీ. నేను చిన్నారావు మనుమడినని’ ఎదుటి వ్యక్తి నుంచి సమాధానం వస్తుంది. కుర్రకారుని ‘మీకేం తెలీద’ని అదిలించ వచ్చు. ఇదివరకులాగా ఆ మనిషి కోపం తెచ్చుకోడు. మనసులో ‘పిచ్చి ముండాకొడుకు’ అనుకున్నా బయ టికి చిరునవ్వు నవ్వుతాడు. వాడు అలా అనుకుంటు న్నాడని నీకు తెలుసు. అనుకున్నా వాడిని తిట్టగలిగినం దుకు నీకు ఆనందంగా ఉంటుంది. ఎన్నాళ్ల కోరిక అదో! ఇది పాత ‘మచ్చ’ని తడువుకునే పిచ్చి సుఖం. పచ్చి సుఖం. ముసలివాడులెమ్మని అందరూ నిన్ను అర్థం చేసుకున్నట్టు నటిస్తారు. నటిస్తున్నారని నీకర్థ మవుతూ ఉంటుంది. ఏ సమస్యమీదయినా నీ అభి ప్రాయాలను గుప్పించవచ్చు. చెల్లితే అనుభవం. చెల్లక పోతే ముసలితనం దిగజారుడు.వయస్సు మీద పడింది లెమ్మని అందరూ నిన్ను అర్థం చేసుకున్నట్టు నటిస్తారు. నటిస్తున్నారని నీకర్థమ వుతూ ఉంటుంది. నీ ఆలోచనల అవసరం లేకుండా నీ అభిప్రాయాలను విరివిగా గుప్పించవచ్చు. అవి నీ ‘అమోఘమైన’ ఆలోచనతో చెప్పే హితవులాగా అందరూ వింటారు. కానీ వాళ్లు తలలూపుతున్న గొర్రె లని నీ మనస్సు చెప్తూంటుంది. నీ మనస్సు నవ్వు కుంటుంది. వాళ్ల మనస్సూ ఆ పనే చేస్తోందని నీకు తెలుస్తూంటుంది. రెండురకాల ‘ఆత్మవంచన’ వ్యాయామానికి ఈ దశ ప్రారంభం. ఇష్టంలేని వాళ్ల ముఖంమీద చెడామడా తిట్ట వచ్చు. నీ పెద్దరికం కారణంగా కడుపులో రగులు తున్నా ‘పోండి సార్! మీరు మరీనూ!’ అని పిచ్చి నవ్వు నవ్వుతారు. ఆ పిచ్చి నీకు కిర్రెక్కిస్తుంది. వయస్సులో నువ్వు చేసిన తప్పిదాలను నీ భార్య సరిపెట్టుకుంటుంది. ఇప్పుడిక చేసేది లేదు కనుక. అది కేవలం సరిపెట్టుకోవడమేనన్న నీ ‘వంకర’ బుద్ధి నిన్ను ‘చక్కిలిగింత’ పెడుతుంది. పాత జ్ఞాపకం– గుర్తొచ్చిన ‘దురద’ లాంటిది. మరోసారి గోకినా ‘సుఖం’గానే ఉంటుంది. ‘ఈ కుర్రకారు తగలబడి పోతోందని’ తరచుగా పెదవులు విరవొచ్చు. ఆ కుర్ర కారు చస్తే మారదని నీకూ తెలుసు. ఇది పాత ‘దురద’ని లేకపోయినా గోక్కోవడం లాంటిది. రాసిన ప్రతీ విషయాన్నీ– ఇప్పుడు– ఎవరూ సీరి యస్గా తీసుకోరు. బాగులేని కథని చదివి ‘ముస లాడిలో సరుకయిపోయిందనుకుంటూ’ ‘ఆహాహా! మీరు కాకపోతే ఎవరు రాస్తారు సార్ ఇది!’ అని లుంగలు చుట్టుకుపోతాడు. ఇంకాస్త జుత్తుంటే ‘గండ పెండేర మంటారు. సగమయినా ఊడితే రెండు యూని వర్సిటీల ‘డాక్టరేట్లు’ంటాయి. మరీ జుత్తు పండి– ఇంకా బతికుంటే ఓ ‘పద్మా..’ అవార్డ్ మొహంమీద పారేస్తారు. ఎనభయ్యో పడిలో కదలలేకపోయినా మోసుకెళ్లి రెండు మూడు సన్మానాలు– మీ కోసం కాదు– ఆయా సంస్థల గొప్పతనం కోసం– చేస్తారు. రచనలన్నీ వెదికి వెదికి పునర్ముద్రణలు చేస్తారు. నువ్వే మరిచిపోయిన గతాన్ని తవ్వి అలనాడు బట్టలు ఎండేసే తాడుమీద వాలిన కాకి నీలో ఎలా మొదటి కవితా వైభవాన్ని మేలుకొలిపిందో ఓ కవి గానం చేస్తాడు– ఆవేశంగా కన్నీటి పర్యంతం అవుతూ. ఇంతకూ ఏం జరిగింది? ఇంక నువ్వు ఎక్కువ కాలం బతకవని వాళ్లకి నమ్మకం కుదిరింది. ‘నువ్వు పోయే కాలం వచ్చిందని వాళ్లకి ధైర్యం వచ్చింది. ఇప్పుడు నిన్ను మెచ్చుకోవడం ‘వారి’ అభిరుచిగా తర్జుమా చేసుకుంటారు. ఇది ‘సాహిత్య పరిణామ కంపు’. గతాన్ని అటకెక్కించే గౌరవ వందనం. అయ్యో! ఈ 80 ఏళ్ల వయస్సు ఏ 40 ఏళ్లకిందటో వచ్చి ఉంటే ఎంత బాగుండును అనిపిస్తుంది. కానీ జీవితానికి ఒకే వృద్ధాప్యం. 80వ మజిలీకి సైన్పోస్ట్. జీవితం ఆఖరు దశకి ముఖద్వారం. ఒకనాడు అందంగా అలంకరింపబడి అలసిపోయిన ముసలి తోరణం. ఇది ప్రయత్నించినా రిటర్న్ టికెట్టు లేని ప్రయాణం. ముందుకు వెళ్తున్న ప్రతీ క్షణమూ మళ్లీ తెరుచుకోని తలుపుల్ని ఒక్కొక్కటే మూసుకుంటూ ముందుకు సాగిపోయే ప్రస్థానంలో గంభీరమైన మజిలీ–80. గొల్లపూడి మారుతీరావు