-
5.85 శాతానికి టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం మాదిరే టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) సైతం నవంబర్లో గణనీయంగా తగ్గి 5.85 శాతానికి పరిమితమైంది. అంతకుముందు నెలలో (అక్టోబర్) ఇది 8.39 శాతంగా ఉంది. ఆహారం, చమురు, తయారీ ధరలు తగ్గుముఖం పట్టడం ద్రవ్యోల్బణం వేడి తగ్గేందుకు సాయపడ్డాయి. నవంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం సైతం అక్టోబర్లో ఉన్న 6.77 శాతం నుంచి 5.88 శాతానికి తగ్గడం తెలిసిందే. గతేడాది నవంబర్లో డబ్ల్యూపీఐ బేస్ అధికంగా ఉండడం, ఆహార ధరలు కొంత తగ్గడం ద్రవ్యోల్బణం నియంత్రణకు సాయపడినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ పరిశోధన పత్రంలో పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 4.83% తర్వాత, అతి తక్కువ స్థాయిలో నమోదు కావడం మళ్లీ ఇదే మొదటిసారి. విభాగాల వారీగా.. ► ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం అక్టోబర్లో 8.33% ఉంటే, నవంబర్లో 1.07%గా ఉంది. ► కూరగాయల ధరలు అయితే ఊహించని విధంగా నియంత్రణలోకి వచ్చాయి. కూరగాయలకు సంబంధించి ద్రవ్యోల్బణం అక్టోబర్లో 17.61 శాతంగా ఉంటే, నవంబర్లో ఏకంగా మైనస్ 20 శాతానికి (డిఫ్లేషన్) పడిపోయింది. ► ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 17.35 శాతంగా నమోదైంది. ► తయారీ ఉత్పత్తులకు సంబంధించి 3.59 శాతంగా ఉంది. మరింత తగ్గిస్తాం.. ప్రధాని మోదీ, మంత్రుల బృందం, అధికారులు ఎప్పటికప్పుడు జోక్యం చేసుకోవడం, చర్యలు తీసుకోవడం ఫలితాలనిచ్చాయి అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు తెలిపారు. సామాన్యుడి కోసం ద్రవ్యోల్బణాన్ని మరింత తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. -
భారత్కు చమురు సరఫరాలో రష్యానే టాప్
న్యూఢిల్లీ: భారత్కు అత్యధికంగా ముడిచమురు సరఫరా చేసే దేశాల జాబితాలో వరుసగా రెండో నెలా నవంబర్లోనూ రష్యా అగ్రస్థానంలో నిల్చింది. ఎనర్జీ ఇంటెలిజెన్స్ సంస్థ వర్టెక్సా గణాంకాల ప్రకారం రోజుకు 9.09 లక్షల బ్యారెళ్ల (బీపీడీ) ముడి చమురును సరఫరా చేసింది. అక్టోబర్లో ఎగుమతి చేసిన 9.35 లక్షల బీపీడితో పోలిస్తే ఇది కాస్త తక్కువే అయినా.. మిగతా దేశాల ద్వారా వచ్చిన క్రూడాయిల్తో పోలిస్తే అధికంగానే ఉంది. (గుడ్న్యూస్..ఈ ఐటీ కంపెనీలో కొలువులే కొలువులు) సాధారణంగా భారత్కు చమురు సరఫరా చేయడంలో ఇరాక్, సౌదీ అరేబియా అగ్రస్థానాల్లో ఉంటాయి. కానీ తాజాగా నవంబర్లో మాత్రం ఇరాక్ నుంచి 8.61 లక్షల బీపీడీ, సౌదీ అరేబియా నుండి 5.70 లక్షల బీపీడీ చమురు మాత్రమే దిగుమతయ్యింది. 4.05 లక్షల బీపీడీతో అమెరికా నాలుగో స్థానంలో ఉంది. భారత్కు రష్యా నుంచి చమురు ఎగుమతులు ఈ ఏడాది మార్చిలో కేవలం 0.2 శాతం స్థాయిలో ఉండేవి. (‘క్రోమా’ వింటర్ సీజన్ సేల్..బంపర్ ఆఫర్లు) కానీ ప్రస్తుతం భారత చమురు సరఫరాల్లో అయిదో వంతుకు పెరిగాయి. ఉక్రెయిన్తో యుద్ధం దరిమిలా పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో భారత్కు రష్యా డిస్కౌంటు రేటుకే ముడి చమురును అందిస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో రష్యా క్రూడాయిల్ దిగుమతులు గణనీయంగా పెరిగాయి. (ఎన్డీటీవీ బోర్డు: అదానీ గ్రూప్నకు 2 సీట్లు ఆఫర్) -
మేము బాధపడుతుంటే..భారత్ లాభపడుతోంది: ఉక్రెయిన్ మంత్రి ఫైర్
రష్యా సాగిస్తున్న దురాకమ్రణ యుద్ధంలో ఉక్రెయిన్లు ప్రతిరోజు చనిపోతుంటే..మీకు అది వరమైందంటూ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమెట్రో కులేబా భారత్పై విరుచుకుపడ్డారు. మా కారణంగానే మీకు రష్యా చమురును చౌకగా కొనుగోలు చేసే అవకాశం వచ్చిందంటూ మండిపడ్డారు. ఇది నైతికంగా భారత్కి తగనిది అని నొక్కి చెప్పారు. మా బాధల కారణంగా మీరు ప్రయోజనం పొందినట్లయితే మాకు మరింత సాయం చేయడం మంచిది అని కులేబా చురకలంటించారు. మరోవైపు ఇటీవలే ఈ విషయమై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ ఏడాదిలో కేవలం ఫిబ్రవరి, నవంబర్ నెలల మధ్య యూరోపియన్ యూనియన్ (ఈయూ) రష్యా నుంచి అత్యధిక స్థాయిలో శిలాజ ఇధనాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు. దీనికి ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా ఈయూ కూడా అదే పనిచేస్తోందని ఆవేదన చెందారు. భారత్ చౌకైన చమురు లభించడం వెనకాల బాధలనుభవిస్తున్న ఉక్రెయిన్లను చూడండి అని భారత్ని అభ్యర్థించారు. భారత్ రష్యాతో వ్యూహాత్మక సంబంధాన్ని కొనసాగిస్తూనే..యుద్ధం విషయంలో రష్యా తీరుని ఖండించింది కానీ ఐక్యరాజ్యసమితిలో మాస్కోకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి మాత్రం దూరంగా ఉందన్నారు. అలాగే ప్రధాని మోదీ ఇది యుద్ధం చేసేందుకు సమయం కాదు అని ఉక్రెయిన్కి మద్దతుగా ప్రోత్సాహకరమైన సందేశాలు ఇచ్చారు. అలాగే మోదీ తన స్వరంతో దేన్నైనా మార్చగలరన్నారు. అందువల్ల యుద్ధం ముగించడంలో ఢిల్లీ కూడా తన వంతు ప్రయత్నం చేయాలని, ఇది అత్యంత ముఖ్యమైనదని అన్నారు. ప్రస్తుతం సమష్టి కృషి చేయడం ముఖ్యం, అందువల్ల భారత్ ముందుగా ప్రయత్నించకపోతే ఏది కాదని డిమెట్రో కులేబా వ్యాఖ్యానించారు. అలాగే ఈ శీతకాలంలో సైతం కీవ్ తన సైనిక దాడిని ఆపదని చెప్పారు. తాము ఒక్క రోజు కూడా ఆగమని, ఎందుకంటే తాము తీసుకునే ప్రతి విరామంలో రష్యా ఉక్రెయిన్ ఆక్రమిత భూభాగాల్లో వారి రక్షణ రేఖలను బలోపేతం చేసుకునేందుకు యత్నిస్తుందన్నారు. అదీగాక గత కొద్ది వారాలుగా ఉక్రెయిన్ పౌర మౌలిక సదుపాయాలను, ప్రత్యేకించి విద్యుత్ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్ క్షిపణి దాడులకు దిగిందని చెప్పారు. (చదవండి: బహిరంగంగా విద్యార్థులకు ఉరి...మరోసారి వెలుగులోకి కిమ్ నిరంకుశపాలన) -
కాకినాడ: ఇండియన్ ఫుడ్స్ ఆయిల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం
-
వేడి నూనెలో వట్టి చేతులతో..
యశవంతపుర: సలసల మరుగుతున్న నూనె చుక్క పడినా బొబ్బలెక్కుతాయి. కానీ అదే వేడి నూనెలో ఉడుకుతున్న వడలను చేతితో బయటకు తీశారు భక్తులు. ఈ ఘటన ఉత్తర కన్నడ జిల్లా కుమట పట్టణంలో జరిగింది. పట్టణంలోని కామాక్షి దేవస్థానంలో దసరా తరువాత పౌర్ణమి రోజున ఘనంగా జాతర జరుగుతుంది. ఇందులో కళాయిలో వేగుతున్న వడలను తీసి భక్తిని చాటుకునే కార్యక్రమం ఉంటుంది. ఆదివారం సాయంత్రం జరిగిన జాతరలో కొందరు భక్తులు ఇలా వడలను తీశారు. ఎవరికీ బొబ్బలు ఎక్కలేదన్నారు. గోవా, మహారాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. (చదవండి: యాత్ర తర్వాత కొత్త రాహుల్ను చూస్తారు) -
చమురు ఉత్పత్తికి ఒపెక్ కోత, దేశంలో మళ్లీ పెట్రో ధరల మంట?
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ విక్రయాలపై లాభాలు కళ్లచూద్దామన్న ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్) ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. పెట్రోల్ ఉత్పత్తుల ధరలు దేశంలో ఆరు నెలలుగా ఒకే స్థాయిలో ఉండిపోయాయి. కేంద్ర ప్రభుత్వ పరోక్ష ఆదేశాలతో ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు రోజువారీ రేట్ల సవరణను నిలిపివేశాయి. చమురు ఉత్పత్తికి కోత పెట్టాలని చమురు ఉత్పత్తి దేశాల సమాఖ్య (ఒపెక్) తాజాగా తీసుకున్న నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో రేట్ల సవరణ కూడా ఇప్పట్లో చేపట్టే అవకాశాల్లేవని తెలుస్తోంది. చమురు ధరలు ఇటీవలి గరిష్టాల నుంచి కొంత తగ్గుముఖం పట్టాయి. దీంతో చమురును ఉత్పత్తి చేస్తున్న దేశాల కూటమి ఒపెక్ రోజువారీగా 2 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గించుకోవాలని బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ధరలు తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్న మన ఆర్థిక వ్యవస్థకు ఓపెక్ తాజా నిర్ణయం ప్రతికూలం కానుంది. మన దేశ ముడి చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ధరలను సవరించకపోవడం వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ధరలు తగ్గడంతో డీజిల్ మినహా పెట్రోల్, గ్యాస్పై అవి ఎదుర్కొంటున్న నష్టాలు సున్నా స్థాయికి చేరాయి. లీటర్ డీజిల్పై నష్టం రూ.5కు తగ్గింది. కానీ, తాజా పరిణామంతో తిరిగి ఆయిల్ కంపెనీలకు నష్టాలు పెరిగిపోనున్నాయి. మరోవైపు రూపాయి మారకం విలువ క్షీణించడం కూడా చమురుపై నష్టాలను పెంచనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. నష్టాల బాట.. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలన్న కేంద్ర సర్కారు లక్ష్యానికి అనుగుణంగా పెట్రోలియం ఉత్పత్తుల విక్రయ ధరలను సవరించకపోవడంతో ఆయిల్ కంపెనీల నష్టాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా జూన్ త్రైమాసికంలో మూడు ప్రభుత్వరంగ చమురు కంపెనీలు ఉమ్మడిగా రూ.18,480 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. భారత్ దిగుమతి చేసుకునే బ్యారెల్ ముడి చమురు ధర సెప్టెంబర్ 27 నాటికి 84.75 డాలర్లకు తగ్గగా, అక్టోబర్ 5 నాటికి తిరిగి 92.17 డాలర్లకు పెరిగిపోయింది. చమురు ధరల క్షీణత ఇలానే కొనసాగితే, ఏప్రిల్ నుంచి ఎదుర్కొన్న నష్టాల భారం నుంచి గట్టెక్కొచ్చన్న చమురు కంపెనీల ఆశలు తాజా పరిణామంతో చెదిరిపోయాయి. 2021 నవంబర్ 4 నుంచి ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ పెట్రోల్, డీజిల్ ధరల సవరణను నిలిపివేయడం గమనార్హం. మార్చి 22 తర్వాత తిరిగి ఇవి రేట్లను సవరించాయి. ఫలితంగా లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.10 మేర పెరిగింది. తిరిగి ఏప్రిల్ 7 నుంచి రేట్ల సవరణ నిలిచిపోయింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 చొప్పున ఉంది. -
పెట్రోనెట్ ఎల్ఎన్జీ, రానున్న 5 ఏళ్లలో రూ.40వేల కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: పెట్రోనెట్ ఎల్ఎన్జీ వచ్చే ఐదేళ్ల కాలానికి భారీ విస్తరణ ప్రణాళికతో ఉంది. రూ.40,000 కోట్లతో దిగుమతుల సదుపాయాలను విస్తరించుకోవడం, కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశించడం ద్వారా లాభాలను రూ.10,000 కోట్లకు తీసుకెళ్లనున్నట్టు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం పెట్రోనెట్ ఎల్ఎన్జీ గుజరాత్లోని దహేజ్, కేరళలోని కోచిలో రెండు ఎల్ఎన్జీ దిగుమతి కేంద్రాలను కలిగి ఉంది. పెట్రోకెమికల్స్ వ్యాపారంలోకి సైతం అడుగుపెట్టాలని చూస్తున్నట్టు సంస్థ వార్షిక నివేదిక తెలియజేస్తోంది. ‘‘వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల టర్నో వర్ సాధించాలి. పన్ను అనంతరం వార్షిక లాభం రూ.10,000 కోట్లుగా ఉండాలి. ఇందుకోసం రూ.40,000 కోట్ల పెట్టుబడులు పెట్టా లి’’అని పెట్రోనెట్ ఎల్ఎన్జీ ప్రణాళిక రచించుకుంది. దీన్ని సూచించే విధంగా ‘1–5–10– 40’ అనే విధానాన్ని వార్షిక నివేదికలో ప్రస్తావించింది. గడిచిన ఆర్థిక సంవత్సానికి పెట్రోనెట్ ఎల్ఎన్జీ లాభం రూ.3,352 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.43,169 కోట్లుగా నమోదైంది. ఈ ప్రకారం నికర లాభం రెండు రెట్ల మేర, ఆదాయం రెట్టింపు మేర పెంచుకోవాలన్నది సంస్థ వ్యూహంగా ఉంది. -
RIL AGM: దీపావళికల్లా రిలయన్స్ 5జీ
ముంబై: దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత దూకుడుగా విస్తరించనుంది. ఇందుకోసం రూ. 2.75 లక్షల కోట్ల పెట్టుబడులతో భారీ ప్రణాళికలు రూపొందించుకుంది. ఇందులో 5జీపై రూ. 2 లక్షల కోట్లు, కీలకమైన చమురు.. పెట్రోకెమికల్స్ వ్యాపారంపై వచ్చే అయిదేళ్లలో రూ. 75,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5జీ టెలికం సర్వీసులను అక్టోబర్లో (దీపావళి నాటికి) అందుబాటులోకి తేనుంది. అలాగే పోటీ దిగ్గజం అదానీ గ్రూప్ను ఢీకొట్టేందుకు ఎఫ్ఎంసీజీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. సోమవారం జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు వెల్లడించారు. అలాగే వారసత్వ ప్రణాళికలను కూడా ప్రకటించారు. ముగ్గురు సంతానం సారథ్యం వహించబోయే విభాగాలను కూడా వివరించారు. చౌకగా, నాణ్యమైన 5జీ సేవలు.. రిలయన్స్లోని టెలికం విభాగం రిలయన్స్ జియో 5జీ నెట్వర్క్పై రూ. 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీపావళి నాటికి నాలుగు మెట్రో నగరాల్లో, ఆ తర్వాత 2023 డిసెంబర్ ఆఖరు కల్లా దేశవ్యాప్తంగా ఈ సర్వీసులను అందుబాటులోకి తేనుంది. ‘సిసలైన పాన్–ఇండియా 5జీ నెట్వర్క్ నిర్మించేందుకు మేము రూ. 2 లక్షల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాం. వచ్చే రెండు నెలల్లో.. అంటే దీపావళి నాటికి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా సహా కీలకమైన మెట్రో నగరాల్లో జియో 5జీ సేవలను ప్రారంభిస్తాం’ అని ముకేశ్ అంబానీ వివరించారు. అత్యంత వేగవంతమైన 5జీ రాకతో కోట్ల కొద్దీ స్మార్ట్ సెన్సర్స్ను ఆవిష్కరిస్తామని, ఇవి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, నాలుగో పారిశ్రామిక విప్లవానికి ఊతమిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేకంగా భారత్ కోసం 5జీ సొల్యూషన్స్ రూపొందించేందుకు చిప్ తయారీ దిగ్గజం క్వాల్కామ్తో జట్టు కట్టినట్లు అంబానీ చెప్పారు. అలాగే, అత్యంత చౌకైన 5జీ స్మార్ట్ఫోన్స్ను అభివృద్ధి చేసేందుకు టెక్ దిగ్గజం గూగుల్తో కలిసి పనిచేస్తున్నట్లు వివరించారు. ప్రైవేట్ 5జీ నెట్వర్క్స్లోకి కూడా విస్తరిస్తున్నట్లు అంబానీ తెలిపారు. ఇటీవల ముగిసిన వేలంలో జియో రూ. 88,078 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. మరోవైపు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వంటి పవర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ కోసం కొత్తగా మరో గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే సోలార్ ప్యానెల్స్, ఎనర్జీ స్టోరేజీ, ఎలక్ట్రోలైజర్లు, ఫ్యూయల్ సెల్స్ ఉత్పత్తి కోసం నాలుగు గిగా ఫ్యాక్టరీలను రిలయన్స్ ప్రకటించగా ఇది ఐదోది కానుంది. ఎఫ్ఎంసీజీలో అదానీతో ఢీ.. వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది వినియోగ ఉత్పత్తుల (ఎఫ్ఎంసీజీ) విభాగంలోకి కూడా ప్రవేశిస్తున్నట్లు ముకేశ్ అంబానీ కుమార్తె, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) డైరెక్టర్ ఈశా అంబానీ తెలిపారు. ప్రజల రోజువారీ అవసరాలకు సంబంధించి అత్యంత నాణ్యమైన ఉత్పత్తులను, చౌకగా అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. తొలి దశలో ఫుడ్, బెవరేజెస్, వ్యక్తిగత సంరక్షణ, నిత్యావసరాలు వంటి విభాగాల్లో పటిష్టమైన బ్రాండ్స్తో కలిసి పనిచేయనున్నట్లు ఈషా చెప్పారు. అలాగే కంపెనీల విలీనాలు, కొనుగోళ్ల ద్వారా పోర్ట్ఫోలియోను విస్తరించనున్నట్లు తెలిపారు. ‘వచ్చే అయిదేళ్లలో ఒక కోటి మంది పైగా వ్యాపారస్తులతో భాగస్వామ్యాలు కుదుర్చుకునే దిశగా ముందుకు వెడుతున్నాం. దేశవ్యాప్తంగా 7,500 పట్టణాలు, 5 లక్షల గ్రామాలకు విస్తరించబోతున్నాం’ అని ఈషా పేర్కొన్నారు. ఇదే సందర్భంగా జియోమార్ట్లో కొనుగోళ్లకు వాట్సాప్ ద్వారా ఆర్డర్లు పెట్టడం, చెల్లింపులు జరిపే విధానాన్ని ఆమె ఆవిష్కరించారు. అటు, జియోమార్ట్తో జట్టుకట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ .. ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. రిలయన్స్లో రిటైల్ వ్యాపారాలకు ఆర్ఆర్వీఎల్ హోల్డింగ్ కంపెనీగా వ్యవహరిస్తోంది. దీని విలువ దాదాపు రూ. 2 లక్షల కోట్లు.. 2022 జూన్ 30 నాటికి రిలయన్స్ రిటైల్కు 15,866 స్టోర్స్ ఉన్నాయి. ఎఫ్ఎంసీజీలో ఎంట్రీతో ఆ విభాగంలో దిగ్గజంగా ఉన్న అదానీ గ్రూప్తో రిలయన్స్ నేరుగా తలపడనుంది. అదానీకి చెందిన అదానీ విల్మర్ వంట నూనెలు మొదలుకుని వివిధ ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులతో దేశంలోనే అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉంది. ఈ నేపథ్యంలో అదానీ ప్రధాన వ్యాపారమైన ఎఫ్ఎంసీజీలోకి అంబానీ ఎంట్రీ ప్రాధాన్యం సంతరించుకుంది. వారసులొచ్చేశారు.. ఆకాశ్కు టెలికం, ఈషాకు రిటైల్, అనంత్కు ఎనర్జీ.. ఏజీఎం వేదికగా ముకేశ్ అంబానీ (65) తమ వ్యాపార సామ్రాజ్యానికి వారసులను కూడా ప్రకటించారు. అంబానీకి ముగ్గురు సంతానం (ఇద్దరు కవలలు–ఆకాశ్, ఈషా) కాగా, రిలయన్స్ సామ్రాజ్యంలో ప్రధానంగా ఆయిల్ రిఫైనింగ్..పెట్రోకెమికల్స్, రిటైల్, టెలికం సహా డిజిటల్ సర్వీసులు అని మూడు వ్యాపార విభాగాలు ఉన్నాయి. వీటిని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున అంబానీ కేటాయించారు. ‘జియో (టెలికం విభాగం)లో ఆకాశ్ (30), రిటైల్లో ఈషా ఇప్పటికే సారథ్య బాధ్యతలు చేపట్టారు. కన్జూమర్ వ్యాపార విభాగాలను ప్రారంభించిన తొలినాళ్ల నుంచి వారు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక అనంత్ (26) కూడా మా కొత్త ఇంధన వ్యాపార విభాగం కార్యకలాపాల్లో ఎంతో ఆసక్తిగా పాలుపంచుకున్నారు‘ అంటూ ఎవరికి ఏయే వ్యాపార విభాగాల బాధ్యతలు ఇస్తున్నదీ ఆయన వెల్లడించారు. అయితే, వారసులను ప్రకటించినంత మాత్రాన తాను రిటైర్ అవుతున్నట్లుగా భావించరాదని ఆయన స్పష్టం చేశారు. ‘స్వర్ణ దశాబ్ది ముగిసే 2027 నాటికి రిలయన్స్ విలువ రెట్టింపయ్యేలా, గ్రూప్ సమగ్రంగా..సురక్షితంగా ఉండేలా ఈ ప్రణాళికలు దోహదపడగలవు’ అని అంబానీ చెప్పారు. మూడు వ్యాపార విభాగాలు ప్రస్తుతం దాదాపు ఒకే పరిమాణం స్థాయిలో ఉన్నాయి. జూన్లోనే ఆకాశ్.. జియో ప్లాట్ఫామ్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్గా నియమితులయ్యారు. ఈషా, అనంత్లు గ్రూప్ సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ముందుజాగ్రత్త .. వారసత్వ ప్రకటన ద్వారా, గతంలో తండ్రి ధీరూభాయ్ అంబానీ మరణానంతరం రిలయన్స్ వ్యాపార విభజనపై సోదరుడు అనిల్ అంబానీతో తనకు తలెత్తిన విభేదాల్లాంటివి, తన సంతానం విషయంలో జరగకుండా ముకేశ్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అయిందని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ధీరూభాయ్ అంబానీ 1973లో రిలయన్స్ను ప్రారంభించారు. టెక్స్టైల్స్ నుంచి చమురు, టెలికం వరకూ వ్యాపారాన్ని వివిధ విభాగాల్లోకి విస్తరించారు. అయితే, వీలునామాల్లాంటివేవీ రాయకుండా 2002లో ఆయన ఆకస్మికంగా మరణించడంతో రిలయన్స్ సామ్రాజ్యం బీటలు బారింది. ముకేశ్, ఆయన తమ్ముడు అనిల్ అంబానీల మధ్య విభేదాలు తలెత్తాయి. చివరికి వారి మాతృమూర్తి కోకిలాబెన్ జోక్యం చేసుకుని 2005లో రిలయన్స్ను విడగొట్టి సోదరులిద్దరికీ పంచారు. ముకేశ్కు రిఫైనింగ్, ఆయిల్, టెక్స్టైల్స్ వ్యాపారం లభించగా.. అనిల్కు టెలికం, అసెట్ మేనేజ్మెంట్ మొదలైనవి దక్కాయి. 2019 మార్చి ఆఖరు నాటికి రిలయన్స్లో అంబానీల వాటా 50.6 శాతంగా ఉంది. ప్రస్తుతం ముకేశ్ అంబానీ నికర సంపద విలువ 94 బిలియన్ డాలర్లుగా ఉంది. ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీగా కొనసాగుతుండగా, భార్య నీతా అంబానీ (59) కంపెనీ బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. -
దేశం కోసం.. ప్రజల కోసం ఆ పని: విదేశాంగ మంత్రి
బ్యాంకాక్/ఢిల్లీ: రష్యాతో భారత్ చమురు వాణిజ్యంపై అమెరికా చల్లబడినట్లుగానే అనిపిస్తోంది. ఉక్రెయిన్ యుద్దం తర్వాత అగ్రరాజ్యంతో పాటు చాలా పాశ్చాత్య దేశాలు భారత్ మీద మండిపడ్డాయి. అయినప్పటికీ భారత్ మాత్రం తగ్గేదేలే అన్నచందాన ముందుకు వెళ్తోంది. ఏప్రిల్ నుంచి గరిష్ఠ స్థాయిలో చమురు వాణిజ్యం జరుగుతోంది ఇరు దేశాల మధ్య. ఈ తరుణంలో రష్యాతో ఒప్పందం కొనసాగించాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న మరోసారి ఎదురైంది భారత్కు. మంగళవారం బ్యాంకాక్లో ఓ కార్యక్రమానికి హాజరైన భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ.. భారతీయులు చమురుకు అధిక ధరలు చెల్లించలేరని, అందుకే రష్యాతో ముడి చమురు ఒప్పందాలను కొనసాగిస్తున్నామని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం మేలిరకమైంది. భారత ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కొనసాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రతీ దేశం అధిక ఇంధన ధరలను తగ్గించడానికి సాధ్యమైనంత మేరకు.. ఉత్తమమైన ఒప్పందాలపై వైపు మొగ్గు చూపిస్తుంది. అలాగే భారత్ కూడా అదే పని చేసింది. ప్రస్తుతం ఆయిల్, గ్యాస్ ధరలు అధికంగా ఉన్నాయి. సంప్రదాయ పంపిణీదారులంతా యూరప్కు తరలిస్తున్నారు. అలాంటప్పుడు భారత్ ముందర ఇంతకన్నా మార్గం మరొకటి లేదని ఆయన నొక్కి చెప్పారు. నైతిక బాధ్యతగా పౌరుల గురించి ఆలోచించే తాము రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని తేల్చి చెప్పారాయన. అంతేకాదు ఈ విషయం అమెరికాకు కూడా అర్థమైందని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. రష్యాతో భారత్ చమురు వాణిజ్యంలో మొదటి నుంచి అమెరికా అభ్యంతరాలు చెబుతూ వస్తోంది. అయితే.. ఈ ఏప్రిల్లో అమెరికా, భారత్ మధ్య జరిగిన 2+2 స్థాయి సమావేశంలో.. రష్యాతో వాణిజ్యం గురించి అమెరికా నిలదీయడంతో.. భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇదీ చదవండి: హైదరాబాద్-బెంగళూరు మధ్య జర్నీ రెండున్నర గంటలే!! -
వినియోగదారులకు శుభవార్త, అదుపులోకి రానున్న సీఎన్జీ, పైప్డ్ గ్యాస్ ధరలు!
న్యూఢిల్లీ: పరిశ్రమలకు సరఫరా చేస్తున్న సహజవాయువును పట్టణ గ్యాస్, పైప్డ్ గ్యాస్ కోసం మళ్లించాలంటూ పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఆదేశించింది. సీఎన్జీ, పట్టణ పంపిణీ గ్యాస్ ధరలు 70% మేర పెరిగిపోవడంతో, వాటిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గృహాల్లో వినియోగించే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు వినియోగించే సీఎన్జీ డిమాండ్ తీర్చేందుకు వీలుగా, ఖరీదైన ఎల్ఎన్జీ దిగుమతితో లోటును అధిగమించాలని మూడు నెలల క్రితం పెట్రోలియం శాఖ ఆదేశించింది. ఇది ధరలు పెరిగేందుకు దారితీసింది. దీంతో దేశీయంగా ఉత్పత్తయ్యే గ్యాస్ను పట్టణాల్లో సరఫరాకే వినియోగించాలన్న పూర్వపు విధానానికి అనుకూలంగా పెట్రోలియం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో గ్యాస్ను పంపిణీ చేసే ఇంద్రప్రస్థ గ్యాస్కు, ముంబైలో గ్యాస్ పంపిణీలోని మహానగర్ గ్యాస్కు రోజువారీగా 17.5 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంఎస్సీఎండీ) నుంచి 20.78 ఎంఎంఎస్సీఎండీకి గ్యాస్ సరఫరా పెరగనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో సీఎన్జీ, పీఎన్జీ అవసరాలను 94% మేర తీర్చడానికి వీలవుతుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం 84% వరకు దేశీయ సరఫరా కాగా, మిగిలిన మొత్తానికి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. చదవండి👉భారత్కు ఎల్ఎన్జీ సరఫరాలో రష్యా డిఫాల్ట్! -
ఆపరేషన్ ఆర్కిటిక్.. మంచు ఖండం గర్భంలో అంతులేని సంపద
దొడ్డ శ్రీనివాసరెడ్డి ఆర్కిటిక్ ఖండంలో శరవేగంగా కరుగుతున్న మంచు ప్రపంచ దేశాల నైసర్గిక స్వరూపాన్నే మార్చేస్తోంది. 40 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పటికే 50 శాతం మంచు కరిగిపోయింది. 2040 సంవత్సరం నాటికి మరో 25 శాతం మంచు మాయమౌతుందని అంచనా. ప్రపంచ పర్యావరణానికి ప్రమాదకరమైన ఈ పరిణామం కొన్ని దేశాలకు కొత్త అవకాశాలను తెచ్చి పెట్టనుంది. ఆర్కిటిక్లో దాగున్న అపార సంపదపై ఇప్పుడు అనేక దేశాల చూపు పడింది. ఉత్తర ధ్రువం చుట్టూ ఆవరించి ఉన్న ఆర్కిటిక్ మంచు అడుగున అపార ఖనిజ సంపద ఉందని గతంలోనే వెల్లడైంది. ప్రపంచ చమురు నిల్వల్లో 25 శాతం.. అంటే 9,000 కోట్ల బ్యారెళ్లు అక్కడ ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ గతంలో అంచనావేసింది. ప్రపంచ సహజవాయు నిల్వల్లో 30 శాతానికిపైగా దాగున్నట్టు ఓ అంచనా. ద్రవ రూపంలో మరో 4,400 కోట్ల బ్యారళ్ల సహజ వాయువు అక్కడ ఉందట. యురేనియం, బంగారం, వజ్రాల వంటి అతి విలువైన ఖనిజ సంపదకు ఆర్కిటిక్ ఆలవాలం. దాంతో ఈ మంచు ఖండంపై ఆధిపత్యం కోసం దేశాలు అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. ఆధిపత్యమెవరిదో! నిజానికి ఆర్కిటిక్ ఎవరి సొంతమూ కాదు. కానీ ఆ సముద్రం హద్దుగా ఉన్న ఎనిమిది దేశాలు ఇప్పుడు వ్యూహాత్మకంగా అక్కడి పలు ప్రాంతాలను తమ సరిహద్దులుగా పేర్కొంటున్నాయి. వాటిని అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనది రష్యా. అమెరికా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్.. ఆర్కిటిక్ సరిహద్దు దేశాలే. ఇవి తమ వివాదాల పరిష్కారానికి ఆర్కిటిక్ కౌన్సిల్ను ఏర్పాటు చేసుకున్నాయి. భారత్ సహా 13 దేశాలు ఇందులో పరిశీలక హోదాలో చేరాయి. ఈ దేశాల సరిహద్దుల నిర్ధారణకు ఐరాస 234 ఆర్టికల్ను రూపొందించింది. దీని ప్రకారం అవి తమ తీరాల నుంచి 200 మైళ్ల వరకు చేపలు పట్టడం, ఖనిజాన్వేషణ వంటి కార్యకలాపాలు చేసుకోవచ్చు. మిగతా ప్రాంతంపై ఎవరికీ హక్కు లేదు. అది ప్రపంచ మానవాళి ఉమ్మడి సంపద. నిప్పు రాజుకుంటోంది ఐరాస సూత్రీకరణలు ఎలా ఉన్నా ఆర్కిటిక్పై ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నాలకు సరిహద్దు దేశాలు పదును పెడుతున్నాయి. ఆర్కిటిక్తో అక్షరాలా 24,000 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉన్న రష్యా ఈ విషయంలో అందరికంటే ముందుంది. రెండేళ్లుగా ఆర్కిటిక్ వైపు బలగాల మోహరింపును ముమ్మరం చేస్తోంది. కొత్తగా ఆర్కిటిక్ బ్రిగేడ్ను ఏర్పాటు చేసింది. మూతబడ్డ నౌకా స్థావరాలన్నింటినీ పునరుద్ధరిస్తోంది. వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఈ జలాల్లో ముందస్తు అనుమతి లేకుండా నౌకాయానానికి వీల్లేదని, అనుమతి పొందిన నౌకలు టోల్ ట్యాక్స్ కట్టాలని వాదిస్తోంది. అవసరమైతే 1859 సంవత్సరంలో అమెరికాకు ఇచ్చేసిన అలాస్కాను వెనక్కు తీసుకుంటామని రష్యా పార్లమెంటు ‘డ్యూమా’ చైర్మన్ ఇటీవలే ప్రకటన చేశారు. రాజుకుంటున్న నిప్పుకు ఇది సూచన మాత్రమేనని విశ్లేషణలు వెలువడ్డాయి. దీంతో అమెరికా చకచకా పావులు కదుపుతోంది. అలాస్కా నుంచి నౌకా మార్గానికి అనువుగా ఆర్కిటిక్లో కొంత భాగాన్ని తమదిగా చెబుతూ కొత్త మ్యాప్లు తయారు చేస్తోంది. కెనడా అయితే తమ దేశం నుంచి ఉత్తర ధ్రువం దాకా ఉన్న ప్రాంతమంతా తమదేనని తెగేసి చెబుతోంది! సరికొత్త మార్గాలు ఆర్కిటిక్ మంచు కరిగి సముద్రంగా మారిపోతున్న కొద్దీ సరికొత్త నౌకా మార్గాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. ఆర్కిటిక్ ప్రస్తుతం నౌకాయానానికి కొంతమేరకే అనువుగా ఉంది. దీని మార్గం ద్వారా ఏడాదికి వంద నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. మున్ముందు ఈ మార్గం వేలాది నౌకల రాకపోకలతో రద్దీగా మారనుంది. ప్రస్తుతం పనామా కాల్వ మార్గంలో ఏడాదికి 14 వేలు, సూయజ్ కాల్వ మార్గంలో 20 వేల నౌకలు ప్రయాణిస్తున్నాయి. ఆర్కిటిక్ సముద్ర మార్గం పూర్తిగా తెరుచుకుంటే యూరప్, ఆసియా ఖండాల మధ్య దూరం 40 శాతం పైగా తగ్గిపోతుంది. సరుకు రవాణా ఖర్చులు ఆ మేరకు తగ్గుతాయి. భారత్ వైఖరేమిటి? ఆర్కిటిక్ వాతావరణం భారత్లో రుతుపవనాల తీరుతెన్నులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. దాంతో భారత్ ఇటీవల ఆ ప్రాంతంపై దృష్టి సారించింది. ఆర్కిటిక్ పాలసీ పేరిట అధికారిక నివేదిక విడుదల చేసింది. ఆర్కిటిక్లో శాశ్వత స్థావరం ఏర్పాటుతో పాటు ఉపగ్రహాలను అనుసంధానించే గ్రౌండ్ స్టేషన్లు, పరిశోధన కేంద్రాల నిర్మాణానికి యోచిస్తోంది. -
తగ్గనున్న వంట నూనె ధరలు..ఎప్పటి నుంచంటే..?
సామాన్యులకు శుభవార్త. వంట నూనె ధరలు మరింత దిగిరానున్నట్లు తెలుస్తోంది. ఇండోనేషియా ఆగస్ట్ 31 వరకు అన్ని పామాయిల్ ఉత్పత్తులకు ఎగుమతి సుంకాన్ని రద్దు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో భారత్లో వంటనూనెల ధరలు తగ్గనున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ సంక్షోభం తలెత్తినా ఆ ప్రభావం ఇతర దేశాలపై ఉంటుంది. ఉదాహరణకు..ఉక్రెయిన్ నుంచి భారత్ 70శాతం సన్ఫ్లవర్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటుంది. అదే సమయంలో ఉక్రెయిన్ - రష్యా యుద్ధం కారణంగా భారత్లో ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. యుద్ధానికి ముందు రూ.135 నుంచి 150 మధ్యలో ఉన్న వంట నూనె రూ.200కి చేరింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి నూనె రావడం లేదని వ్యాపారస్తులు వాటి ధరల్ని భారీగా పెంచారు. ధరల్ని తగ్గించాలి ఈ నేపథ్యంలో కేంద్రం ఆయిల్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెరిగిపోతున్న నిత్యవసర ధరల నుంచి సామాన్యులకు ఉపశమనం కల్పించేలా వెంటనే ఆయిల్ ధరల్ని రూ.15 తగ్గించాలని సూచించింది. ఈ తరుణంలో పామాయిల్ ఉత్పత్తులపై ఎగుమతి సుంకాన్ని ఇండోనేషియా రద్దు చేయడంతో..దేశీయ ఆయిల్ కంపెనీలు నూనెల ధరల్ని తగ్గించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వంట నూనె ధరలు ఎప్పుడు తగ్గుతాయంటే! 'విదేశాల నుంచి భారత్కు రవాణా అయ్యే సరకు జులై 15 ముందు నుంచే ప్రారంభమవుతుంది. జులై 25కల్లా భారత్కు చేరుతుంది. కాబట్టి.. అదే నెలలో (జులై) వంట నూనెల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఆ తర్వాతి నెల నుంచి ధరలు తగ్గుతాయని' అదానీ విల్మార్ ఎండీ, సీఈవో అంగ్షు మాలిక్ అన్నారు. ఆయిల్ ధరల్ని తగ్గించాయి భారత్లో కొన్ని ఆయిల్ కంపెనీలు వాటి ధరల్ని తగ్గించాల్సి ఉంది. అదే సమయంలో అదానీ విల్మార్, మదర్ డెయిరీ, ఇమామి ఆగ్రోటెక్ పాటు ఇతర సంస్థలు గత నెలలో ఆయిల్ ఉత్పత్తులపై రూ .10 -15 ధరని తగ్గించాయి. -
గుడ్న్యూస్: భారత్లో తగ్గనున్న వంటనూనె ధరలు..కారణం ఇదే!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా రేట్లు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దిగుమతి చేసుకున్న వంటనూనెల ధరలను వారం రోజుల్లోగా లీటరుకు రూ. 10 వరకూ తగ్గించాలని తయారీ సంస్థలను కేంద్రం ఆదేశించింది. అలాగే, ఒక బ్రాండ్ ఆయిల్పై దేశవ్యాప్తంగా ఒకే ఎంఆర్పీ (గరిష్ట చిల్లర ధర) ఉండాలని సూచించింది. వంటనూనెల తయారీ సంస్థలు, అసోసియేషన్లతో బుధవారం భేటీ అయిన సందర్భంగా కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే ఈ విషయాలు తెలిపారు. గడిచిన వారం రోజుల్లోనే అంతర్జాతీయంగా రేట్లు 10 శాతం తగ్గడంతో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించాలని, ఎంఆర్పీని తగ్గించాలని సూచించినట్లు ఆయన చెప్పారు. పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ వంటి దిగుమతి చేసుకునే అన్ని రకాల వంటనూనెల ధరలను వారం రోజుల్లోగా తగ్గిస్తామని ప్రధాన తయారీ సంస్థలన్నీ హామీ ఇచ్చినట్లు వివరించారు. ఆ తర్వాత మిగతా నూనెల ధరలనూ తగ్గిస్తామని తెలిపినట్లు పాండే చెప్పారు. జూలై 6 నాటి గణాంకాల ప్రకారం పామాయిల్ సగటు రిటైల్ ధర (లీటరుకు) రూ. 144.16, సన్ఫ్లవర్ ఆయిల్ రూ. 185.77, సోయామీన్ ఆయిల్ రూ. 185.77, ఆవ నూనె రూ. 177.37, పల్లీ నూనె రూ. 187.93గాను ఉంది. మరోవైపు, తూకం విషయంలోనూ వస్తున్న ఫిర్యాదులపై కూడా తయారీ సంస్థలతో చర్చించినట్లు వివరించారు. 15 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్యాకింగ్ చేసినప్పుడు 910 గ్రాముల పరిమాణం ఉన్నట్లు ప్యాకెట్లపై కంపెనీలు ముద్రిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఆ ఉష్ణోగ్రతల్లో ఆయిల్ వ్యాకోచించడం వల్ల వాస్తవ బరువు 900 గ్రాములే ఉంటుందన్నారు. ఇలాంటివి జరగకుండా 30 డిగ్రీల సెల్సియస్ వద్ద ప్యాకింగ్ చేయాల్సి ఉంటుందని పాండే వివరించారు. -
'ఏం కొనేటట్టు లేదు.. తినేటట్టు లేదు' తగ్గిన అమ్మకాలతో కంపెనీలు లబోదిబో!
న్యూఢిల్లీ: కొబ్బరినూనె, బిస్కెట్లు, సబ్బులు, కాస్మోటిక్స్ వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) పరిశ్రమలో ఏప్రిల్, మే, జూన్ త్రైమాసికంలో డిమాండ్ మందగమనంలో సాగింది. ప్రధాన కంపెనీలు డాబర్, మారికో, గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (జీసీపీఎల్) త్రైమాసిక నివేదికలు స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశాయి. ద్రవ్యోల్బణం తీవ్రత ఆదాయాలపై ప్రభావం చూపుతున్నందున, వినియోగదారులు ప్రధాన వస్తువులపై ఖర్చు చేయడానికి వెనుకాడారని సంస్థలు వెల్లడించాయి. దేశీయ ఎఫ్ఎంసీజీ పరిశ్రమ ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిల కారణంగా భారీగా దెబ్బతిందని పేర్కొన్నాయి. అమ్మకాలపై ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించాయి. వంట నూనెలు, తేనె, ఇతర వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించి సంస్థల స్థూల మార్జిన్లు ప్రభావితం అయ్యే స్థాయిలో వినియోగం పడిపోయిందని ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు తెలిపాయి. అంతేకాకుండా, పట్టణ మార్కెట్లతో పోలిస్తే గ్రామీణ మార్కెట్ల వృద్ధి జూన్ త్రైమాసికంలో నెమ్మదించిందని వెల్లడించాయి. గోద్రెజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, మారికోలు తమ భారతీయ వ్యాపార పరిమాణం క్షీణ దిశలో ఉందని కూడా ఆందోళన చెందుతుండడం గమనార్హం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం డిమాండ్ను తగ్గిస్తుండడం దీనికి కారణం. ఇప్పటివరకూ అందిన సమాచారాన్ని బట్టి ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు డిమాండ్ ధోరణులు, సంస్థల పనితీరు గురించి తొలి అంచనాలను తమ అప్డేటెడ్ నివేదికల్లో పేర్కొన్నాయి. జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి వాటి సంబంధిత బోర్డులు సంస్థల ఆర్థిక ఫలితాలను ఆమోదించిన తర్వాత వివరణాత్మక ఆర్థిక ఫలితాలు వెల్లడవుతాయి. మూడు సంస్థలు ఈ మేరకు తమ జూన్ త్రైమాసిక అప్డేటెడ్ తొలి నివేదికలను వెల్లడించాయి. అంతర్జాతీయ వ్యాపారం ఓకే... ప్రపంచ అనిశ్చితి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ జూన్ త్రైమాసికంలో అంతర్జాతీయ వ్యాపారం నుండి వృద్ధిని నమోదుచేసుకున్నట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు తెలిపాయి. వార్షిక ప్రాతిపదిక చూస్తే, కన్సాలిటేడెడ్ ఆదాయాలు పెరిగినట్లు మారికో పేర్కొంది. డాబర్ ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, బలమైన వృద్ధిని నమోదుచేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేసింది. దాదాపు అన్ని విభాగాల్లో తమ మార్కెట్ వాటా వృద్ధిని నమోదుచేసుకుంటోందని తెలిపింది. కాగా గోద్రెజ్ మాత్రం తమన కంపెనీకి భారత్ తరువాత అతిపెద్ద మార్కెట్ అయిన ఇండోనేయాలో వినియోగం, మార్జిన్లు దెబ్బతింటున్నట్లు తెలిపింది. ఆఫ్రికా, అమెరికా, పశ్చిమాసియాల్లో మాత్రం వృద్ధి రెండంకెల్లో నమోదవుతుందన్న భరోసాను వ్యక్తం చేసింది. వినియోగమంటే భయం ప్రస్తుత పోకడల ప్రకారం చూస్తుంటే, వినియోగదారులు కొన్ని అనవసరమైన వస్తువుల కొనుగోళ్లను మానేశారు. అవసరమైన వస్తువుల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తక్కువ ధర బ్రాండ్వైపు మళ్లడం, చిన్న ప్యాక్లకు మారడం వంటి ధోరణులను అవలంభిస్తున్నారు. కొన్ని ఉత్పత్తుల అమ్మకాలు క్షీణతలోకి కూడా జారిపోయాయి. సఫోలా ఆయిల్స్ను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. సఫోలా నూనెలను మినహాయించి, భారతదేశ వ్యాపారం స్వల్ప పరిమాణంలో వృద్ధిని నమోదు చేసింది. పారాచూట్ కొబ్బరి నూనె స్వల్ప పరిమాణంలో క్షీణతను నమోదు చేసింది. – మారికో ఆదాయాలు పరిమితం 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 35.4 శాతం ఆదాయ వృద్ధి నమోదయ్యింది. అయితే తాజాగా ముగిసిన జూన్ త్రైమాసికంలో ఈ రేటు ఒకంకెకు పరమితం అవుతుంని అంచనావేస్తున్నాం. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాలు అమ్మకాలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే తాజా పరిస్థితుల ప్రతికూల ప్రభావాలను భారత్ క్రమంగా అధిగమిస్తుందని విశ్వసిస్తున్నాం. తగిన వర్షపాతం, ద్రవ్యోల్బణం తగ్గుదల ఇందుకు దోహదపడతాయని అంచనా. – డాబర్ -
రిలయన్స్కు భారీ దెబ్బ: బ్యారల్పై 12 డాలర్ల మార్జిన్ ఫట్!
న్యూఢిల్లీ: దేశీయ ముడి చమురు ఉత్పత్తి, ఇంధన ఎగుమతులపై ప్రభుత్వం విధించిన విండ్ఫాల్ ట్యాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు (ఆర్ఐఎల్) రిఫైనింగ్ మార్జిన్లలో బ్యారెల్కు 12 డాలర్ల వరకూ కోత పెట్టనుంది (ప్రస్తుత మార్జిన్ 25 డాలర్లు). ఇక ఓఎన్జీసీ ఆదాయంపై కూడా ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. కొత్త పన్నుల వల్ల ప్రభుత్వానికి రూ. 1.3 లక్షల కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని బ్రోకరేజ్ సంస్థలు పేర్కొన్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురు సంస్థలకు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలతో భారీ లాభాలు వచ్చి పడుతున్నాయి. దీంతో దేశీయంగా ఉత్పత్తి చేసే టన్ను ముడి చమురుపై రూ.23,250 పన్ను లేదా బ్యారల్కు 40 డాలర్లు (విండ్ఫాల్ ట్యాక్స్) విధించింది. ఇక్కడి నుంచి ఎగుమతి చేసే లీటర్ పెట్రోల్పై రూ.6, విమాన ఇంధనం ఏటీఎఫ్పై రూ.6, లీటర్ డీజిల్ ఎగుమతిపై రూ.13 పన్ను విధిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ‘‘ఇటీవలి కాలంలో క్రూడ్ ధరలు గణనీయంగా పెరిగాయి. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న కంపెనీలకు ఇది అనుకూలంగా మారింది. అంతర్జాతీయ ధరలకే దేశీ రిఫైనరీలకు అవి ముడి చమురును విక్రయిస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ముడి చమురు ఉత్పత్తి చేసే సంస్థలు భారీ లాభాలనార్జిస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నాం’’ అని ఆర్థిక శాఖ తెలిపింది. జూలై 1 నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. దీనితోపాటు పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 5 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 10.75 శాతం నుంచి 15 శాతానికి చేరింది. ఆయా అంశాలపై బ్రోకరేజ్ సంస్థల నివేదికలు పరిశీలిస్తే... రవాణా ఇంధనాలపై రూ.68,000 కోట్లు గత సంవత్సరంలో డీజిల్, గ్యాసోలిన్ ఎగుమతి పరిమాణం ఆధారంగా 2022–23 అంచనాలను మేము లెక్కగట్టాం. మేము మూడు రవాణా ఇంధనాలపై (పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్) రూ. 68,000 కోట్ల అదనపు ఆదాయాలను అంచనా వేస్తున్నాము. అదేవిధంగా, ముడి చమురుపై విండ్ఫాల్ పన్నులు అదనపు ఆదాయాలలో రూ. 70,000 కోట్లను పెంచే వీలుంది. దీనివల్ల రిలయన్స్ మార్జిన్ల విషయంలో బ్యారెల్కు 12 డాలర్ల మేర (వార్షిక ప్రాతిపదికన రూ. 47,000 కోట్లు) ప్రభావం చూపగలవని అంచనా. – నోమురా లోటు భర్తీ లక్ష్యం... : 2022 మేలో ప్రభుత్వం పెట్రోల్పై లీటరుకు రూ. 8, డీజిల్పై రూ. 6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల కేంద్రం ఆదాయాలు ఒక లక్ష కోట్లు తగ్గాయని అంచనా. అదనపు ఎక్సైజ్ సుంకం (విండ్ఫాల్ ట్యాక్స్) విధింపు ప్రకటన ఇప్పుడు వెలువడింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2022 మేలో తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఆదాయ అంతరాన్ని పూరించడమే లక్ష్యంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది. తాజా నిర్ణయం వల్ల రూ. 1.2 లక్షల కోట్ల ప్రభుత్వం ఆదాయాన్ని ఆర్జిస్తుందని భావిస్తున్నాం. దీనితోపాటు దేశీయ మార్కెట్ నుండి ఉత్పత్తుల ఎగుమతిని కూడా నిరుత్సాహపరచడానికి కూడా తాజా నిర్ణయం దోహదపడుతుందని భావిస్తున్నాము. క్రూడ్ ఉత్పత్తిపై విండ్ ఫాల్ ట్యాక్స్ వల్ల రూ.65,600 కోట్లు, ఎగుమతి ఉత్పత్తులపై పన్నులు ఏడాది పాటు కొనసాగితే మరో రూ.52,700 కోట్ల ఆదాయం సమకూరుతుందని మా అంచనా. కొత్త పన్ను వల్ల ఓఎన్జీసీ ఆదాయాలు ఒక్కో షేరుకు రూ.30 తగ్గే అవకాశం ఉంది. ఆర్ఐఎల్పై దీని ప్రభావం రూ.36గా ఉంటుందని అంచనా. అయితే ఆర్ఐఎల్ దేశీయ మార్కెటింగ్ మార్జిన్లో నష్టం... ఎగుమతి పన్ను కంటే ఇంకా ఎక్కువగా ఉందని మేము విశ్వసిస్తున్నాము. అందువల్ల ఆర్ఐఎల్ గణనీయమైన మొత్తాలలో ఎగుమతి చేయడాన్ని కొనసాగించవచ్చని మేము భావిస్తున్నాము. – హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ భారీ పన్ను రాబడులు: ఇదే నిర్ణయం ఇకముందూ కొనసాగితే, పన్నుల వల్ల వార్షిక ప్రాతిపదికన కేంద్రానికి రూ. 1.3 లక్షల కోట్ల అదనపు పన్ను రాబడులు వస్తాయని భావిస్తున్నాం. 2023 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 లక్ష కోట్ల ఆదాయం ఒనగూడుతుందని అంచనా. - కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ 1.38 లక్షల కోట్ల అదనపు పన్ను : అదనపు పన్నుల ద్వారా ప్రభుత్వం ఏటా రూ. 1.38 లక్షల కోట్లను సేకరించవచ్చన్నది మా అంచనా. – యూబీఎస్ అంచనా -
పెట్రోలు సంక్షోభం, చేతులెత్తేసిన ప్రధాని
కొలంబో: దేశ ఆర్థికవ్యవస్థ చాలా దారుణంగా తయారైందని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం, ఇంధనం, విద్యుత్ కొరతకు మించిన గడ్డు పరిస్థితులు దేశంలో నెలకొన్నాయని స్వయంగా ప్రధాని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. ఆహారం, ఇంధనం, విద్యుత్ కొరతతో నెలల తరబడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక ఆర్థికవ్యవస్థ కుప్పకూలిందని ప్రధాని బుధవారం పార్లమెంటులో చెప్పారు. మన ఆర్థిక వ్యవస్థ చాలా తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది, పూర్తిగా కుప్పకూలిపోయిందని ప్రధాని విక్రమ సింఘే ప్రకటించారు. పెట్రోలియం కార్పొరేషన్ భారీ అప్పుల కారణంగా దిగుమతి చేసుకున్న ఇంధనాన్ని కూడా కొనుగోలు చేయలేకపోతోందన్నారు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే పనిలో ఉన్న ఆర్థికమంత్రి, ప్రధాని పేర్కొన్నారు. పరిస్థితిని చక్కదిద్దే అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోయిందని, ఇంకా అట్టడుగు స్థాయికి పడిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం, సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ 700 మిలియన్ల డాలర్ల అప్పులో ఉందని, ఫలితంగా, ప్రపంచంలోని ఏ దేశం లేదా సంస్థ ఇంధనాన్ని అందించడానికి సిద్ధంగా లేదన్నారు. నగదు కోసం ఇంధనాన్ని అందించడానికి కూడా వారు సమ్మతించడం లేదన్నారు. రెస్క్యూ ప్యాకేజీపై అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చల ఫలితం వచ్చే వరకు ఈ సంవత్సరం తిరిగి చెల్లించాల్సిన 7 బిలియన్ల డాలర్లు విదేశీ రుణాన్ని తిరిగి చెల్లించడాన్ని నిలిపి వేస్తున్నట్లు శ్రీలంక ఇప్పటికే ప్రకటించింది. 2026 నాటికి సంవత్సరానికి సగటున 5 డాలర్లు బిలియన్లు చెల్లించాల్సి ఉంది. దీనిపై చర్చించేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి అధికారులు శ్రీలంకలో ఉన్నారు. దీనిపై జూలై చివరి నాటికి సిబ్బంది స్థాయి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని విక్రమసింఘే తెలిపారు. -
'మమ్మల్ని ఆదుకోండి సార్',కేంద్రం తలుపు తట్టిన చమురు కంపెనీలు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పటికీ, పెట్రోల్ ఉత్పత్తుల ధరలు వరుసగా రెండు నెలల పాటు ఎటువంటి మార్పు ల్లేకుండా కొనసాగించడం వల్ల నష్టాలను ఎదుర్కొంటున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు (బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ) చెబుతున్నాయని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఈ విషయంలో తమకు ఉపశమనం కావాలంటూ అవి ప్రభుత్వం తలుపు తట్టినట్టు చెప్పారు. లీటర్ పెట్రోల్పై రూ.17.10, డీజిల్పై రూ.20.40 చొప్పున నష్టాలను ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. ప్రైవేటు చమురు రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసి, రిఫైన్డ్ చేసిన తర్వాత అమెరికాకు ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తున్నాయన్న వార్తలపై స్పందించారు. అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల చమురు, గ్యాస్ కంపెనీలు ఆర్జించే అసాధారణ లాభాలపై విండ్ఫాల్ ట్యాక్స్ విధించడం అన్నది ఆర్థిక శాఖ పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. మన కార్పొరేట్ సంస్థలు అన్నీ బాధ్యతగానే పనిచేస్తాయన్నారు. గత నెలలో పెట్రోల్ లీటర్పై రూ.8, డీజిల్ లీటర్పై రూ.6 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును తగ్గించడం తెలిసిందే. చమురు కంపెనీలు దీన్ని తమ నష్టాల భర్తీకి సర్దుబాటు చేసుకోకుండా.. వినియోగదారులకు బదిలీ చేయడం గమనార్హం. ప్రైవేటులో రిలయన్స్ బీపీ, నయాయా ఎనర్జీ (షెల్)కి మాత్రమే రిఫైనరీలు, దేశవ్యాప్తంగా పెట్రోల్ విక్రయ కేంద్రాలు ఉండడం గమనార్హం. ధరలు పెరగడంతో ఇవి స్థానికంగా విక్రయాలు తగ్గించుకుని.. ఎగుమతి చేయడం ద్వారా భారీ లాభాలను ఆర్జిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. -
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. బిందెలు, డబ్బాలతో ఎగబడ్డ జనం
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ట్యాంకర్ నుంచి లీకైన వంట నూనె కోసం ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. వివరాల ప్రకారం.. ముంబై-అహ్మాదాబాద్ జాతీయ రహదారిపై పాల్ఘర్ జిల్లాలోని తవా గ్రామ సమీపంలో 12వేల ఆయిల్ తరలిస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. గుజరాత్లోని సూరత్ నుంచి ముంబైకి నూనెను ట్యాంకర్లలో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ట్యాంకర్ నుంచి లీకైన నూనె కోసం ఎగబడ్డారు. బిందెలు, క్యాన్లలో వంటనూనెను నింపుకునేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. పోలీసుల అధికారులు 3 గంటలపాటు శ్రమించి పరిస్థితిని చక్కదిద్దారు. A tanker carrying 12,000 litres of edible oil for processing from #Surat in #Gujarat to #Mumbai overturned on the busy Mumbai-#Ahmedabad highway at #Palghar in #Maharashtra. A number of locals rushed to the spot and looted the #oil overflowing from the tanker.#ACCIDENT #News pic.twitter.com/GktU2tztkd — Chaudhary Parvez (@ChaudharyParvez) May 22, 2022 -
మొండిఘటం: పుతిన్ నెక్ట్స్ టార్గెట్ ఇదే..ఆ దేశాలకు రివర్స్ ఝులక్!
రష్యా అధ్యక్షుడు పుతిన్ యురప్ దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఓ వైపు యుద్ధంతో ఉక్రెయిన్తో పాటు శత్రు దేశాల్ని వణికిస్తూనే.. నెక్ట్స్ టార్గెట్గా ఆయా దేశాల అవసరాల్ని ఆసరాగా చేసుకొని దెబ్బకొట్టేలా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1నుంచి గ్యాస్ కొనాలంటే ఖచ్చితంగా రష్యా రూబల్స్లోనే చెల్లించాలని హుకుం జారీ చేశారు. లేని పక్షంలో శత్రు దేశాలుగా భావిస్తామని హెచ్చరించారు. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య కొనసాగుతుంది. వారాల తరబడి యుద్ధం చేస్తున్న రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యూహాలు రచయిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ను టార్గెట్గా ఐరోపాలో పర్యటించారు. ఆ పర్యటన ముగిసింది. అదే సమయంలో అమెరికా దాని మిత్ర దేశాల ఆంక్షల కారణంగా రష్యా ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. యూరో- యూఎస్ డాలర్తో పోలిస్తే రష్యా రూబెల్స్ విలువ ఘోరంగా పతనమైంది. ఈ క్రమంలో ఉక్రెయిన్పై దండయాత్ర చేస్తున్న రష్యాపై ఆర్ధిక ఆంక్షలు విధిస్తున్న దేశాలకు భారీ ఝలక్ రష్యా అధ్యక్షుడు పుతిన్. తమ నుంచి గ్యాస్ కొనాలంటే ఖచ్చితంగా రష్యా రూబల్స్లోనే చెల్లింపులు చేయాలని షరతు విధించారని రష్యన్ మీడియా సంస్థ 'రియా నోవోష్ఠి' కథనాన్ని ప్రచురించింది. వీళ్లంతా మా శత్రువులే ఇప్పటికే తమ దేశంపై ఆంక్షలు విధించిన దేశాల్ని పుతిన్ తమ శత్రు దేశాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రష్యా 48 దేశాలతో ఓ జాబితాను విడుదల చేశారు. అమెరికా నార్వే, జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్తో పాటు అన్నీ యూరప్ దేశాలను ఈలిస్ట్లో చేర్చారు పుతిన్. ఈ దేశాలేవీ తమకు మిత్రపక్షాలు కావని స్పష్టం చేశారు. ఇప్పుడీ దేశాలు రష్యా రూబెల్స్లోనే రష్యా నుంచి గ్యాస్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
ఉక్రెయిన్లో హింస ఆపండి
న్యూఢిల్లీ: ఉక్రెయిన్లో హింసాకాండకు సాధ్యమైనంత త్వరగా ముగింపు పలకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్కు సూచించారు. ఉక్రెయిన్లో సంక్షోభానికి తెరపడాలని కోరుకుంటున్నామని, శాంతి యత్నాలకు తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. భారత పర్యటనకు వచ్చిన లావ్రోవ్ శుక్రవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్లోని తాజా పరిణామాలను మోదీ దృష్టికి తీసుకొచ్చారు. ఉక్రెయిన్తో రష్యా శాంతి చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత స్వతంత్ర వైఖరి ప్రశంసనీయం ఉక్రెయిన్ సంక్షోభంపై భారత ప్రభుత్వ ‘స్వతంత్ర’ వైఖరిని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రశంసించారు. ఆయన శుక్రవారం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్తో సమావేశమయ్యారు. భారత్ చాలా ముఖ్యమైన దేశమని, అమెరికా ఒత్తిడికి లొంగబోదని తెలిపారు. రక్షణ రంగంలో భారత్తో పరస్పర సహకారానికి రష్యా కట్టుబ డి ఉందని లావ్రోవ్ చెప్పారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయాలని భారత్ కోరుకుంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దోపిడీ వ్యవస్థ మనకొద్దు పశ్చిమ దేశాలే రష్యాను యుద్ధంలోకి నెట్టాయని సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. భారత విదేశాంగ విధానం, రష్యా విదేశాంగ విధానం ఒకే విధంగా ఉన్నాయన్నారు. జాతీయ కరెన్సీలతో భారత్, ఇతర భాగస్వామ్య దేశాలతో వాణిజ్య వ్యాపార లావాదేవీలు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. భారత్–రష్యా మధ్య రూపాయి, రూబుల్తో లావాదేవీలు జరగాలన్నారు. డాలర్ ఆధారిత చెల్లింపులకు స్వస్తి పలకాలన్నారు. రాత్రికి రాత్రే మన సొమ్మును దోచేసే దొంగల వ్యవస్థ మనకు అక్కర్లేదన్నారు. సొంత కరెన్సీల్లో చెల్లింపుల వ్యవస్థను ఇప్పటికే అభివృద్ధి చేసుకున్నామని వివరించారు. గతంలో చాలాసార్లు సంక్లిష్ట సమయాల్లోనూ ఇరు దేశాల నడుమ సంబంధాల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. సంబంధాలు స్థిరంగా ఉండాలి: జైశంకర్ భేదాభిప్రాయాలను, వివాదాలను చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే భారత్ విధానమని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. ఉక్రెయిన్–రష్యా మధ్య సంక్షోభం త్వరగా పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. తమ ఎజెండాను విస్తృతం చేయడం ద్వారా సహకారాన్ని విస్తరింపజేస్తామని అన్నారు. సంక్లిష్టమైన అంతర్జాతీయ పరిణామాల మధ్య లావ్రోవ్తో తన భేటీ జరిగిందని తెలిపారు. ఆర్థిక, సాంకేతిక రంగాలతోపాటు భారత్–రష్యా ప్రజల మధ్య సంబంధాలు స్థిరంగా ఉండడం చాలా అవసరమని ప్రధాని అన్నారు. జైశంకర్, లావ్రోవ్ ద్వైపాక్షిక అంశాలతోపాటు వాణిజ్యం, పెట్టుబడులపై చర్చించుకున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అఫ్గానిస్తాన్, ఇరాన్, ఇండో–పసిఫిక్, అసియాన్పైనా లావ్రోవ్తో చర్చించినట్లు జైశంకర్ ట్వీట్ చేశారు. రష్యా నుంచి చౌక ధరతో ముడిచమురు కొనుగోలు చేయాలని భారత్ ఇప్పటికే నిర్ణయించుకుంది. ఈ విషయంలో అమెరికా హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా ముందడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ భారత ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రితో సమావేశమై చర్చించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలుపై తీవ్ర పరిణా మాలు ఉంటా యని అమెరికా హెచ్చరిస్తున్న సంగతి తెలి సిందే. చైనా గనుక యుద్ధం ప్రారంభిస్తే భారత్ను రష్యా రక్షించబోదని అమెరికా చెబుతోంది. ఇది చదవండి: పుతిన్కు పెరిగిన పాపులారిటీ.. రష్యాలోనూ ‘హీరో’గా ఫుల్ సపోర్ట్! -
భారత్కు ముడి చమురు ఎగుమతి చేసేందుకు ఇరాన్ సిద్ధం!..నేరుగానే డీల్
Rupee-rial trade mechanism: ఇరాన్ భారతదేశానికి రెండవ అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఉండేది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో అణు ఒప్పందం నుంచి వైదొలగడంతో దాని చమురు ఎగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించడంతో న్యూ ఢిల్లీ టెహ్రాన్ నుంచి దిగుమతులను నిలిపివేయవలసి వచ్చింది. ఒపెక్ సభ్యునికి వ్యతిరేకంగా ఆంక్షల ఎత్తివేతపై ప్రపంచ దేశలు, టెహ్రాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నందున భారత్కి ముడి చమురు అవసరాలను తీర్చడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని భారత్లోని ఇరాన్ రాయబారి డాక్టర్ అలీ చెగేని పేర్కొన్నారు. అంతేకాదు రూపాయి-రియాల్ ట్రేడ్ మెకానిజంతో రెండు దేశాల కంపెనీలకు ఒకరితో ఒకరు నేరుగా డీల్ నిర్వహించు కోగలుగుతారని అలీ చెగేని అన్నారు. దీని వల్ల మధ్యవర్తిత్వ వ్యయాలను తగ్గుతాయి అని కూడా చెప్పారు. ఇరాన్కి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు, వినియోగదారు అయిన భారత్ ముడి చమురు అవసరాలలో 80% దిగుమతులతో కవర్ చేస్తుంది. భారతీయ రిఫైనర్లు ఇరాన్ చమురును స్థానిక బ్యాంకుకు రూపాయిలలో చెల్లిస్తున్న వ్యాపారాన్ని పరిష్కరించేందుకు భారత్, ఇరాన్ ఒక బార్టర్ లాంటి యంత్రాంగాన్ని రూపొందించాయి ఆ నిధులను టెహ్రాన్ భారతదేశం నుంచి దిగుమతులకు చెల్లించడానికి ఉపయోగించింది. ఆంక్షల కారణంగా భారత్-ఇరాన్ వాణిజ్యం మార్చి 2019 ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మది నెలలు నుంచి దాదాపు రూ. 1700 కోట్లు వాణిజ్యం ఈ ఏడాది మొదటి 10 నెలల ఏప్రిల్ నుంచి జనవరిలో 200 కోట్ల కంటే తక్కువగా పడిపోయింది. పైగా రెండు దేశాలు రూపాయి-రియాల్ వాణిజ్య విధానాలను ప్రారంభిస్తే, ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని చెగేని అన్నారు. (చదవండి: ఈ యుద్ధం జెలెన్ స్కీని హీరోని చేసింది...అందరి నోట అతని పేరే!) -
ఫ్లీజ్ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్కు రష్యా బంపరాఫర్!
ఉక్రెయిన్పై రష్యా దాడి ఆ దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. యుద్ధంతో ప్రపంచ దేశాల నుంచి ఎదరవుతున్న ఇబ్బందుల నుంచి ఆర్ధికంగా తమను ఆదుకోవాలంటూ రష్యా భారత్ను అర్జిస్తుంది. ఇందులో భాగంగా భారత్.. తమ దేశ దేశంలోని ఆయిల్, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికాతో పాటు ఇతర నాటో దేశాలు గుర్రుగా ఉన్నాయి. అందుకే రష్యా నుంచి దిగుమతులపై పూర్తి స్థాయిలో నిషేధం విధించాయి. దీంతో గత రెండు వారాలుగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. శనివారం ఈ ఏడాది చివరి నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేస్తామని జర్మనీ కీలక ప్రకటన చేసింది. ప్రతి రోజు, ప్రతి గంటకు మేము రష్యన్ దిగుమతులకు వీడ్కోలు పలుకుతున్నాంటూ జర్మన్ ఆర్థిక శాఖ మంత్రి రాబర్ట్ హబెక్ ప్రముఖ మీడియా 'ఫ్రాంక్ఫర్టర్ ఆల్జెమీన్ జైటుంగ్' కు తెలిపారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం..జర్మనీ ప్రస్తుతం చమురులో 3వ వంతు, బొగ్గులో 45శాతం రష్యా నుండి దిగుమతి చేసుకుంటోంది. అయినా సరే ఈ నెల ముగిసే సమయానికి బొగ్గు కొనుగోళ్లను, సంవత్సరం చివరి నాటికి చమురు కొనుగోళ్ల నిలిపివేస్తామని మీడియా కు వెల్లడించారు. అదే సమయంలో క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పాటు రష్యా వద్ద చమురు ధరలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రష్యా అమెరికాకు ప్రతిరోజు 7లక్షల బ్యారల్ల చమురును ఎగుమతి చేసేది. అంతేకాకుండా, ప్రపంచ చమురు అవసరాల్లో 12శాతం, సహజవాయివుల్లో 16శాతం అవసరాల్ని రష్యా తీరుస్తుంది. ఇప్పుడు ఆ చమురును కొనేవారు లేకపోవడంతో ఆ చమరును భారత్కు అతి తక్కువ ధరకే అమ్ముతామంటూ రష్యా..,భారత్కు ఆఫర్ చేసింది. ఇప్పటికే రష్యా నుంచి భారత్కు చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 1బిలియన్లకు చేరుకున్నాయి. ఇతర దేశాల నిషేదంతో రష్యాలో..భారత్ ఆయిల్, గ్యాస్ పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీతో మంతనాలు జరుపుతుంది. భారత్ అందుకు అంగీకరిస్తే తాము భారత్లో కంపెనీల ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నామంటూ రష్యా ఉప ప్రధాని నోవాక్ భారత్ను సంప్రదించారంటూ భారత పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఒకవేళ రష్యా ఇస్తున్న ఈ ఆఫర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. కానీ రష్యాతో స్నేహం కారణంగా అమెరికాతో పాటు నాటో దేశాలకు దూరం కావాల్సి ఉంది. ఇదే అంశంపై ప్రధాని మోదీ వేచి చూసే ధోరణిలో ఉన్నారని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: 'చిత్ర' విచిత్రమైన కథ..ఆ 'అజ్ఞాత' యోగి కేసులో మరో ఊహించని మలుపు!! -
భారీగా పామాయిల్ సాగు
న్యూఢిల్లీ: దేశీ రైతులు పండించిన నూనెగింజలను కొనుగోలు చేస్తూ వారికి మద్దతుగా నిలవాలని ప్రైవేటు కంపెనీలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అదే సమయంలో వంట నూనెల దిగుమతులు తగ్గించుకోవాలని సూచించారు. ఇది ఇరు వర్గాలకు ప్రయోజనకరమన్నారు. భారత్ వచ్చే 3–4 ఏళ్లలో వంట నూనెల ఉత్పత్తిని 50 శాతం పెంచుకునే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్’ కార్యక్రమం కింద పెద్ద ఎత్తున పామాయిల్ సాగుకు పుష్కలంగా అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. ‘వ్యవసాయ రంగంపై బడ్జెట్ 2022 సానుకూల ప్రభావం’ అనే అంశంపై ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘‘వీటికి (కాయధాన్యాలు, నూనె గింజలకు) దేశంలో భారీ డిమాండ్ ఉంది కార్పొరేట్ ప్రపంచం ముందుకు రావాలి. మీకు భరోసానిచ్చే మార్కెట్ ఉంది. దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు? ఎంత పరిమాణంలో కాయధాన్యాలు, నూనె గింజలను కొనుగోలు చేస్తారో రైతులకు ముందే చెప్పండి’’అని మోదీ అన్నారు. పంట నష్టానికి రక్షణగా వ్యవసాయ బీమా యంత్రాంగం ఉన్నట్టు చెప్పారు. మనమంతా కలసి పనిచేయడం ద్వారా మన దేశ అవసరాలకు కావాల్సిన ఆహార ఉత్పత్తులను స్థానికంగానే పండించేలా చూడాల్సి ఉందన్నారు. దేశ వంట నూనెల అవసరాల్లో 60–65 శాతాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిని ప్రధాని గుర్తు చేశారు. వంట నూనెల దిగుమతి బిల్లు 2020–21 సీజన్లో రూ.1.17 లక్షల కోట్లుగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. చిరుధాన్యాల సంవత్సరం 2023 అధిక పోషక విలువలు కలిగిన భారతీయ మిల్లెట్స్ (చిరు ధాన్యాలు)కు బ్రాండింగ్, ప్రచారానికి సహకారం అందించాలని కార్పొరేట్ సంస్థలను ప్రధాని కోరారు. 2023 సంవత్సరాన్ని మిల్లెట్స్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించారు. నానో ఫెర్టిలైజర్ విభాగంలో కంపెనీలకు అపార అవకాశాలున్నట్టు గుర్తు చేశారు. దీనితోపాటు ఆహారశుద్ధి, ఇథనాల్ తయారీ సాగు ముఖచిత్రాన్ని మార్చేవిగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా భూసార పరీక్షా కేంద్రాల నెట్వర్క్ ఏర్పాటుకు స్టార్టప్లు, ఇన్వెస్టర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భూముల సారాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 2022–23 బడ్జెట్ భారత్ వ్యవసాయ రంగాన్ని ఆధునికంగా, స్మార్ట్గా మార్చడంపై దృష్టి సారించినట్టు ప్రధాని పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో సాగు, వాణిజ్య అంశాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిగా మార్చేస్తుందన్నారు. అగ్రి స్టార్టప్లను ప్రోత్సహించినప్పుడే సాగులో డ్రోట్ టెక్నాలజీ మరింత అందుబాటులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. గత మూడు నాలుగేళ్లలో 700 వ్యవసాయాధారిత స్టార్టప్లు ప్రారంభమైనట్టు చెప్పారు. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం ‘‘రైతుల ఆదాయం పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, రైతులకు ఆధునిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం. రైతులకు అద్దెపై వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను అందించే వ్యవస్థను కార్పొరేట్లు ఏర్పాటు చేయాలి. సహజ, సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేయడంపై అవగాహన పెంచేందుకు యూనివర్సిటీలు, శాస్త్రవేత్తలు కృషి చేయాలి’’ అని ప్రధాని కోరారు. గడిచిన ఆరేళ్లలో వ్యవసాయానికి బడ్జెట్ ఎన్నో రెట్లు పెంచామని, వ్యవసాయ రుణాలు ఏడేళ్లలో రెండున్నర రెట్లు పెరిగినట్టు ప్రదాని గుర్తు చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం చిన్న రైతులకు మద్దతుగా నిలుస్తోందంటూ.. 11 కోట్ల మంది రైతులకు రూ.1.75 లక్షల కోట్ల రుణాలను ఈ పథకం కింద అందించినట్టు ప్రకటించారు. చమురులో 20 శాతం ఇథనాల్ను కలిపే లక్ష్యం దిశగా పనిచేస్తున్నట్టు, ఇప్పటికే ఇది 8 శాతానికి చేరినట్టు గుర్తు చేశారు. కేంద్ర బడ్జెట్ 2022: వ్యవసాయ రంగంపై సానుకూల ప్రభావం అన్న అంశంపై జరిగిన వెబినార్లో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ -
ఏపీ లక్ష్యం 6.68 ఎంటీవోఈ చమురు ఆదా
సాక్షి, అమరావతి: కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర ఇంధనశాఖ రాష్ట్రాలకు కార్యాచరణ రూపొందించింది. దీనిలో భాగంగా రాష్ట్ర ఇంధన శాఖకు 6.68 మిలియన్ టన్నుల ఆయిల్ ఈక్వలెంట్ (ఎంటీవోఈ) చమురును ఆదా చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నాకి తగ్గించాలనే కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర విద్యుత్శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ద్వారా రాష్ట్ర ఇంధన సామర్థ్య కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వ ఇంధన కార్యదర్శులతో వెబినార్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 2030 నాటికి 750 బిలియన్ యూనిట్లకు సమానమైన 887 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించే క్రమంలో రాష్ట్రాలన్నీ కలిసి 150 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన ఇంధనాన్ని ఆదాచేయాలని కేంద్ర ఇంధనశాఖ సూచించింది. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో చంద్రశేఖరరెడ్డి ఆదివారం మీడియాకు వివరించారు. కేంద్ర మంత్రి ప్రశంసలు రాష్ట్రంలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలపై ఇంధనశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ వివరించారు. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ)–2017 ద్వారా బిల్డింగ్ బైలాస్లో సవరణలు చేసి, తప్పనిసరిచేసిన కొద్ది రాష్ట్రాల్లో ఏపీ ఒకటని ఆయన తెలిపారు. ఎకో నివాస్ సంహిత (ఈఎన్ఎస్)–2018 ద్వారా ఏపీలో నిరుపేదలకు జగనన్న కాలనీల పేరుతో నిర్మిస్తున్న 28.3 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. వీధి దీపాల జాతీయ కార్యక్రమం (ఎస్ఎల్ఎన్పీ) అమలులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 6.02 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 23.54 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కె సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ఇంధన పొదుపు లక్ష్యాలను చేరుకోవడానికి కీలక శాఖలతో సమన్వయం చేసుకుని ఫాస్ట్ ట్రాక్ మోడ్లో అమలు చేయాలని, ఈఎన్ఎస్ని రాష్ట్ర బిల్డింగ్ బైలాస్లో చేర్చాలన్నారు. జగనన్న కాలనీలు, ఇతర విభాగాల్లో ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్యక్రమాలను ఇంత పెద్ద ఎత్తున అమలు చేయడం ద్వారా ఏపీ గ్రీన్హౌస్ వాయు ఉద్గార తగ్గింపు చర్యలకు అత్యంత ఊతమిస్తోందని ప్రశంసించారు. అన్నిచోట్లా ఈవీ స్టేషన్లు ప్రధాన నగరాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలని బీఈఈ అధికారులు సూచించారు. ఇంధన రిటైల్ అవుట్లెట్లు, మునిసిపల్ పార్కింగ్, మెట్రో పార్కింగ్, రైల్వే స్టేషన్లు, ఏయిర్పోర్టులు, షాపింగ్ కాంప్లెక్స్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలు వంటి ఇతర ప్రదేశాలలో పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ వెబినార్లో కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి ఆలోక్కుమార్, బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్కుమార్, సెక్రటరీ ఆర్కే రాయ్, డైరెక్టర్ మిలింద్ డియోర్,తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ పోలీస్.. టార్గెట్ న్యూ ఇయర్ పార్టీస్!
సాక్షి, సిటీబ్యూరో: డిసెంబర్ 31 రాత్రి జరగనున్న న్యూ ఇయర్ వేడుకలను టార్గెట్గా చేసుకున్న డ్రగ్ పెడ్లర్లు దందా వేగం పెంచారు. గంజాయికి బదులుగా దాని కంటే తేలిగ్గా రవాణా చేయగలిగే హష్ ఆయిల్పై దృష్టి పెట్టారు. దీనిని గమనించిన నగర పోలీసు విభాగం నిఘా ముమ్మరం చేసింది. ఫలితంగా నగర టాస్క్ఫోర్స్ పోలీసులు ముగ్గురిని పట్టుకుని, రూ.25 లక్షల విలువైన 3.5 లీటర్ల ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఓఎస్డీ పి.రాధాకిషన్రావు, డీసీపీ చక్రవర్తి గుమ్మిలతో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ► విశాఖపట్నం జిల్లా, పాయకరావుపేటకు చెందిన సంపతి కిరణ్కుమార్ ఐటీఐ పూర్తి చేశాడు. ఆపై విజయవాడ, కాకినాడల్లో ఉద్యోగాలు చేసినా నిలదొక్కుకోలేదు. పాడేరు ఏజెన్సీకి చెందిన గంజాయి విక్రేతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. ► గత ఏడాది మేలో గంజాయి రవాణా చేస్తూ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పోలీసులకు చిక్కాడు. మూడు నెలలకు బెయిల్పై బయటకు వచ్చిన ఇతగాడు నగరానికి వచ్చి మణికొండ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ► గత కొద్ది కాలంగా పోలీసులు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో రవాణా చేĶæడానికి అనువుగా మారిన హష్ ఆయిల్పై ఇతడి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో పాడేరు ప్రాంతానికి చెందిన వినోద్తో పరిచయం పెంచుకున్నాడు. ► వినోద్ స్థానికంగా లభించే గంజాయి మొక్కలతో ఈ ఆయిల్ తయారు చేస్తున్నాడు. అక్కడ తక్కువ రేటుకు 1.5 లీటర్లు ఖరీదు చేసిన కిరణ్ ట్రావెల్స్ బస్సులో సిటీకి తెచ్చాడు. విక్రయించడానికి ప్రయత్నిస్తూ గోల్కొండ వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. ► జహనుమ, యాప్రాల్ ప్రాంతాలకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్, షేక్ కమల్ దూరపు బంధువులు. చిన్న చిన్న పనులు చేసే వీరు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం అక్రమ మార్గం పట్టారు. పాడేరుకు చెందిన గౌతమ్ నుంచి హష్ ఆయిల్ కొంటున్నారు. ► తొలినాళ్లల్లో వీళ్లే వినియోగించే వారు. అయితే న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో ఈ సరుకు డి మాండ్ పెరగడంతో దందా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల సింహాచలం వరకు వెళ్లి గౌతమ్ నుంచి 2 లీటర్ల కొని తీసుకువచ్చారు. ► దీనిని విక్రయించే ప్రయత్నాల్లో ఉండగా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు ఫల క్నుమ ప్రాంతంలో పట్టుకున్నారు. వీడ్ ఆయిల్గానూ పిలిచే దీన్ని ఒక్కో మిల్లీ లీటర్ రూ.700 నుంచి రూ.1000 వరకు అమ్ముతున్నారు. ► న్యూ ఇయర్ సీజన్లో ఇది రూ.2000కు చేరే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ పార్టీలపై కన్నేసి ఉంచామని, పబ్ ఓనర్లనూ హెచ్చరించామని కొత్వాల్ పేర్నొఆ్నరు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై కన్నేసి ఉంచాలని సూచించారు. చదవండి: నవవధువు ఆత్మహత్య: భర్త వేధింపుల వల్లే మా కుమార్తె చనిపోయింది