-
యమహా నుంచి 125 సీసీ స్కూటర్లు
చెన్నై: యమహా మోటార్ ఇండియా కంపెనీ 125 సీసీ స్కూటర్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఈ సెగ్మెంట్లో రెండు కొత్త మోడళ్లు– ఫ్యాసినో 125ఎఫ్ఐ, రేజర్125ఎఫ్ఐలను అందుబాటులోకి తెచ్చింది. ఫ్యాసినో స్కూటర్ ధరను రూ.67,430(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ గ్రూప్) రవీందర్ సింగ్ తెలిపారు. త్వరలో స్ట్రీట్ ర్యాలీ 125ఎఫ్ఐ మోడల్ స్కూటర్ను కూడా మార్కెట్లోకి తెస్తామని చెప్పారు. 110సీసీ స్కూటర్ మోడళ్లను దశలవారీగా మార్కెట్ నుంచి ఉపసంహరిస్తామని, భవిష్యత్తులో 125 సీసీ మోడళ్లను మాత్రమే విక్రయిస్తామని వివరించారు. ఈ ఏడాది 6.24 లక్షల టూవీలర్లను విక్రయిస్తామన్న అంచనాలున్నాయని సింగ్ చెప్పారు. వచ్చే ఏడాది 6.50 లక్షల టూవీలర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న తమ మార్కెట్ వాటాను 2025కల్లా పది శాతానికి పెంచుకోవడం లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలోనే ఎమ్15, ఆర్ 15 బైక్ మోడళ్లలో బీఎస్–సిక్స్ వేరియంట్లను కూడా కంపెనీ ఆవిష్కరించింది. ప్రస్తుత మందగమనం తాత్కాలికమేని, వాహన విక్రయాలు పుంజుకుంటాయని సింగ్ అభిప్రాయపడ్డారు. -
బీఎస్–6 వాహనాల క్యూ!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో బీఎస్–6 ప్రమాణాల అమలు గడువు దగ్గర పడుతుండటంతో వాహన కంపెనీలు కొత్త మోడళ్ల ఆవిష్కరణలను వేగవంతం చేశాయి. ఒకదాని వెంట ఒకటి బీఎస్–6 వేరియంట్లను సిద్ధం చేస్తున్నాయి. వాహన కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే భారత్ స్టేజ్–6 ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ కోసం ఆటోమొబైల్ సంస్థలు రూ.70– 80 వేల కోట్లను వెచ్చిస్తున్నాయి. మరోవైపు బీఎస్–4తో పోలిస్తే బీఎస్–6 వాహనం మోడల్నుబట్టి 15 శాతం వరకు ఖరీదు కానుంది. ద్విచక్ర వాహన కంపెనీ హోండా బీఎస్–6 వేరియంట్ యాక్టివా–125 స్కూటర్ను ఆవిష్కరించింది. స్కూటర్స్ విభాగంలో ఇదే తొలి బీఎస్–6 వాహనం. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్ బీఎస్–6 ధ్రువీకరణ దక్కించుకుంది. ఐషర్ ప్రో 2000 సిరీస్ లైట్ డ్యూటీ ట్రక్ను విడుదల చేసింది. లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ నాలుగు వేరియంట్లలో లాంగ్ వీల్ బేస్ ఈ–క్లాస్ సెడాన్తోపాటు ఎస్–క్లాస్ 350డీ మోడల్ను ప్రవేశపెట్టింది. టయోటా కిర్లోస్కర్ ప్రీమియం హ్యాచ్బ్యాక్ గ్లాంజాను విడుదల చేసింది. బీఎస్–6తో మూడు నాలుగు నెలల్లో పెట్రోల్, డీజిల్ వెహికిల్స్ను ప్రవేశపెడతామని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా చెప్పారు. మారుతి సుజుకి ఇండియా బాలెనో, ఆల్టో మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇతర మోడళ్లను ప్రస్తుతం పరీక్షిస్తోంది. డెడ్లైన్లోగా అన్ని మోడళ్లను బీఎస్–6 ప్రమాణాలతో ప్రవేశపెడతామని బజాజ్ ఆటో తెలిపింది. మోపెడ్స్ విభాగంలో ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్న టీవీఎస్.. బీఎస్–6 వేరియంట్ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ స్టేజ్ ప్రమాణాలు.. భారత్లో బీఎస్–1 ప్రమాణాలు 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చాయి. 2005లో బీఎస్–2, బీఎస్–3 2010లో వచ్చాయి. ఇప్పుడున్న బీఎస్–4 ప్రమాణాలు 2017 ఏప్రిల్లో మొదలయ్యాయి. దేశంలో కాలుష్యం అంతకంతకూ పెరుగుతుండడంతో బీఎస్–5కు బదులుగా బీఎస్–6 ప్రమాణాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీఎస్–4 వాహనం 50 పీపీఎం (పార్ట్స్ పర్ మిల్లియన్) సల్ఫర్ను విడుదల చేస్తే, బీఎస్–6 వెహికల్ విషయంలో ఇది 10 పీపీఎం ఉంటుంది. డీజిల్ కార్లలో నైట్రోజన్ ఆక్సైడ్స్ 70 శాతం వరకు తగ్గితే, పెట్రోల్ కార్లలో 25 శాతం తగ్గుతుంది. బీఎస్–4 కోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన తయారీ సంస్థలు అతి తక్కువ కాలంలోనే నూతన టెక్నాలజీ కోసం పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. భారీ పెట్టుబడులతో... భారత్ స్టేజ్–6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను అభివృద్ధి చేసేందుకు, విడిభాగాలను స్థానికంగా తయారు చేసేందుకై ప్యాసింజర్ వెహికల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు రూ.35,000– 40,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ఇక్రా వెల్లడించింది. అలాగే ద్విచక్ర వాహన తయారీ సంస్థల నుంచి రూ.15,000 కోట్ల వరకు పెట్టుబడులు ఉండొచ్చని సమాచారం. మొత్తంగా వాహన పరిశ్రమ రూ.70–80 వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ చెబుతోంది. బీఎస్–6 గ్రేడ్ ఫ్యూయెల్స్ కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.28,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. బీఎస్–6 నూతన సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు మహీంద్రా ప్రకటించింది. హోండా మోటార్సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా రూ.800 కోట్లు వెచ్చిస్తోంది. 2019–20లో విస్తరణ నిధులు రూ.1,500 కోట్లు ఉండొచ్చని హీరో మోటోకార్ప్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పనున్న కొత్త ప్లాంటుతోపాటు బీఎస్–6 అప్గ్రెడేషన్కు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు కంపెనీ సీఎఫ్వో నిరంజన్ గుప్తా తెలిపారు. ఫోర్స్ మోటార్స్ రూ.250 కోట్లు వెచ్చిస్తోంది. వచ్చే మూడేళ్లకుగాను యమహా ఇండియా రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది. -
కార్ల విక్రయాలు 8 శాతం డౌన్
న్యూఢిల్లీ: కస్టమర్ల నుంచి అంతగా డిమాండ్ లేకపోవడంతో ఫిబ్రవరిలో వాహనాల అమ్మకాలు తగ్గాయి. గతేడాది ఫిబ్రవరిలో 15,79,349 యూనిట్లు అమ్ముడవగా గత నెలలో 8.06 శాతం క్షీణించి 14,52,078 యూనిట్లకు తగ్గాయి. ఇక కార్ల అమ్మకాలు..గతేడాది ఫిబ్రవరిలో 2,34,632 యూనిట్లు అమ్ముడు కాగా ఈసారి 8.25 శాతం క్షీణించి 2,15,276 యూనిట్లకు పరిమితమయ్యాయి. మరోవైపు ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా 7.97 శాతం క్షీణించి 12,22,883 యూనిట్స్ నుంచి 11,25,405 యూనిట్స్కు తగ్గాయి. ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య ఎఫ్ఏడీఏ బుధవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ‘సంవత్సరాంతపు క్లియరెన్స్ సేల్, కొత్త మోడల్స్ లాంచింగ్తో జనవరిలో గణనీయంగా అమ్మకాలు జరిగాయి. కానీ నెల తిరిగేసరికి ఫిబ్రవరిలో మళ్లీ పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గతనెలలోనే విక్రయాలు గణనీయంగా తగ్గాయి‘ అని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ ఆశిష్ హర్షరాజ్ కాలె తెలిపారు. సమీప భవిష్యత్లో ఆశావహ సూచనలేమీ కనిపించకపోతుండటంతో.. గత ఆరు నెలల నుంచి దేశీయంగా ఆటోమొబైల్స్ విక్రయాలు క్షీణ బాటలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్లో బీమాపరమైన వ్యయాలు భారీగా పెరిగిన దగ్గర్నుంచి ఒకదానితర్వాత మరొకటిగా అన్నీ ప్రతికూల పరిణామాలే చోటు చేసుకుంటూ ఉండటంతో వినియోగదారులు కార్ల కొనుగోలు ఆలోచనలను వాయిదా వేసుకుంటూ వస్తున్నారని ఆశిష్ చెప్పారు. మొత్తం మీద వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా మారిందని పేర్కొన్నారు. పేరుకుపోతున్న నిల్వలు.. దేశవ్యాప్తంగా డీలర్లందరి దగ్గర వాహనాల నిల్వలు గణనీయంగా పేరుకుపోయాయని ఆశిష్ చెప్పారు. గత రెండు నెలల్లో కొంత తగ్గినప్పటికీ.. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ‘కొందరు ద్విచక్ర వాహనాల డీలర్ల దగ్గర ఆందోళనకర స్థాయిలో, కనీవినీ ఎరుగనంతగా ఏకంగా 100 రోజులకు సరిపడే స్టాక్ పేరుకుపోయింది. ఈ అంశం గురించి మేం పదే పదే చెబుతూనే ఉన్నాం. ఇక వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు మొదలైనవి పెరగడంతో డీలర్ల నిర్వహణ వ్యయాలూ భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో డీలర్లు అర్జంటుగా నిల్వలను తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నారు‘ అని ఆశిష్ చెప్పారు. పరిశోధన సంస్థలకూ వాహనాల బల్క్ డేటా విక్రయం ఆటోపరిశ్రమ వృద్ధికి కొత్త విధానం ఆటోమొబైల్ రంగానికి తోడ్పాటునిచ్చే దిశగా కేంద్రం కొత్త విధానాన్ని ఆవిష్కరించింది. దీనితో ఇకపై అర్హత కలిగిన వ్యాపార సంస్థలు, వ్యక్తులు, పరిశోధకులు వాహన రిజిస్ట్రేషన్ డేటాను బల్క్గా కొనుగోలు చేసేందుకు వెసులుబాటు లభించనుంది. ఇందుకోసం ఏడాదికి రూ. 3 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ‘బల్క్ డేటా అవసరమైన వ్యాపార సంస్థలు, ఇతరత్రా వ్యక్తులు 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూ. 3 కోట్లు కట్టాల్సి ఉంటుంది. పరిశోధన అవసరాల కోసం విద్యా సంస్థలు తీసుకునేట్లయితే రూ. 5 లక్షలు మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. అయితే, ఆయా సంస్థలు ఈ డేటాను కచ్చితంగా అంతర్గతంగానే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది’ అని ‘బల్క్ డేటా షేరింగ్ విధానం, ప్రక్రియ’ నిబంధనల్లో పేర్కొన్నారు. డేటాను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవడంతో సర్వీసులు మెరుగుపడేందుకు ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
వెరైటీ పెళ్లి శుభలేఖలు
వివాహ వేడుక రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. కార్డుల దగ్గరి నుంచి కల్యాణం వరకు నూతన ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రతి అడుగులోనూ నూతనత్వం కనిపిస్తోంది. ఇప్పుడు శ్రావణ మాసం.. పెళ్లిళ్ల సీజన్. ఒక్కటి కాబోతున్న జంటలు.. సరికొత్తగా ఆలోచిస్తూ వినూత్నంగా ఆహ్వానం పలుకుతున్నాయి. పాస్పోర్టు, ఏటీఎం, కాఫీ కప్ తరహా ఇన్విటేషన్స్తో ఆకట్టకుంటున్నాయి. ఇప్పుడిది నగరంలో నడుస్తున్న ట్రెండ్. సాక్షి, హైదరాబాద్ : ‘తామెల్లరూ సకుటుంబ సమేతంగా విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించి... మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి మమ్ములను ఆనందింపజేయగలరని ప్రార్థన’.. ఇదంతా ఒకనాటి పెళ్లి పత్రికల సంగతి. ఇప్పుడింత చదివే ఓపిక ఎవ్వరికీ లేదు. అందుకే సింపుల్, సూపర్బ్గా ఉండాలని విభిన్నంగా ఆలోచిస్తోంది యువత. ఒకప్పుడు శుభలేఖలు వేయించడం పెద్దల పని. కానీ ఇప్పుడు వధూవరులే తమకు నచ్చిన డిజైన్లు ఎంపిక చేసుకుంటున్నారు. అవి సృజనాత్మకతంగా ఉండాలని యోచిస్తున్నారు. కొత్తకొత్తగా.. భారీ స్థాయిలో శ్లోకాలు, పద్యాలు, పెద్దల వివరాలు... ఇవన్నీ పాతచింతకాయ పచ్చడి జాబితాలోకి చేరిపోయాయి. కేవలం పది లైన్లలో మొత్తం సమాచారం వచ్చేయాలి. శుభలేఖ డిజైన్ చూడగానే ఇట్టే ఆకట్టుకోవాలి. కాబోయే జీవిత భాగస్వామి కోసం తాను కంటున్న కలలు, తమ మదిలో భాగస్వామికి ఇచ్చిన స్థానం, ప్రేమ వీటన్నింటినీ వ్యక్తపరుస్తూ.. భలే చూడముచ్చగా ఉంటున్నాయి శుభలేఖలు. ఇక ఫలానా తేదీన, ఫలానా సమయానికి వివాహ సుముహూర్తం అనే మాటకు కాలం చెల్లింది. ‘మీ వాచీ ఫలానా సమయాన్ని సూచించే సరికి, మనమంతా ఒక్కటిగా కలిసి, మన బంధంలోకి కొత్త వ్యక్తిని ఆహ్వానించా’లంటూ సరికొత్త స్వాగతాలు పలుకుతున్నాయి. బాక్స్.. భలే కొంతమంది యువతీ యువకులు మరో అడుగు ముందుకేశారు. ప్రతి ఒక్కరికీ అవసరమైన పాస్పోర్టు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సెల్ఫోన్, కాఫీ కప్పు, మ్యాచ్ బాక్స్, పుస్తకం తరహాలో శుభలేఖల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు ఎక్కువగా బాక్స్ కార్డ్స్, కష్టమైజ్డ్ కార్డుల ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు పెళ్లి విందు గురించో, చేసిన ఏర్పాట్ల గురించో బంధువులు ముచ్చటించుకునేవారు. కానీ ఇప్పుడు వెరైటీ శుభలేఖలతో పెళ్లి ముచ్చట్లు, చర్చలు మొదలవుతున్నాయి. ఖర్చు తక్కువే.. సాధారణ శుభలేఖలకు అయ్యే ఖర్చులోనే ట్రెండీ ఇన్విటేషన్స్ అందిస్తున్నాం. ధరలు ఎక్కువేమీ లేవు. కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ తమ దగ్గరికి వచ్చి... ఆ విధంగా కావాలని అడుగుతున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా కార్డులు తయారు చేసిస్తున్నాం. – టి.ప్రదీప్, గౌలిగూడ -
బజాజ్ డిస్కవర్ కొత్త బైక్స్ వచ్చేశాయ్..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ రెండవ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో రెండు కొత్త బైక్లను లాంచ్ చేసింది. అంతర్జాతీయంగనూ దేశీయ మార్కెట్లో అమ్మకాలను పెంచుకునే లక్ష్యంతో తన పాపులర్ మోడల్ బజాజ డిస్కవర్ 2018 మోడల్స్ను విడుదల చేసింది. ఇందులో డిస్కవర్ 110 డిస్కవర్ 125 పేరుతో కొత్త మోడల్స్ను అందించనున్నట్లు కంపెనీ పేర్కొంది.కొత్త ఇంజీన్, కొత్త ఫీచర్లు, కొత స్టయిల్గా సరికొత్తగా వీటిని రూపొందించింది. బజాజ్ డిస్కవర్ 110, డిస్కవర్ 125 ధరలను రూ. 50,176 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) రూ. 53,171 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. బజాజ్ డిస్కవర్ 110 ఒకవేరియంట్లోనూ,బజాజ్ డిస్కవర్ 125 (డ్రమ్ బ్రేక్ , డిస్క్ బ్రేక్) రెండు వేరియంట్స్లోనూ అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 53,171, రూ. 55,994 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండనున్నాయి. ట్విన్ ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ లాంప్స్, పార్ట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫస్ట్ ఇన్కాస్ల్ పీచర్లను 2018 మెడల్ బైక్స్లో జోడించింది. బజాజ్ డిస్కవర్ 110: 110 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ మోటార్, 8.5 బీహెచ్పీ వపర్, 9 ఎన్ఎం గరిష్ట టార్క్ బజాజ్ డిస్కవర్ 125: 125 సీసీ సింగిల్ సిలిండర్ , ఎయిర్ కూల్డ్ మోటార్,11 బీహెచ్పీ వపర్, 10.8 ఎంఎం గరిష్ట టార్క్ 5 స్పీడ్ ట్రాన్సిమిషన్ ప్రధాన ఫీచర్లు -
భారత్లోకి ‘స్కాట్ బాబర్’ మోడల్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన కల్ట్ బైక్స్ తయారీ కంపెనీ ‘ఇండియన్ మోటార్సైకిల్’ తాజాగా ‘స్కాట్ బాబర్’ మోడల్ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దేశంలో దీని ప్రారంభ ధర రూ.12.99 లక్షలు. ఇందులో 1,133 సీసీ ఇంజిన్, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ తెలిపింది. పొలారిస్ ఇండియా కంట్రీ హెడ్, ఎండీ పంకజ్ దూబే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్కాట్ బాబర్ చాలా మంది కస్టమర్లను ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. అద్భుతమైన పనితీరుతో ఇండియన్ మోటార్సైకిల్ పేరును మరింత బలోపేతం చేస్తుందన్నారు. కాగా పొలారిస్ ఇండస్ట్రీస్కు చెందిన పూర్తి అనుబంధ సంస్థే ఇండియన్ మోటార్ సైకిల్. ఇది అమెరికా తొలి మోటార్సైకిల్ కంపెనీ. -
కొత్త బెంజ్ కార్లు లాంచ్
న్యూఢిల్లీ: లగ్జరీ కార్మేకర్ మెర్సిడెస్ బెంజ్ కొత్త హై ఎండ్మోడల్ కార్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఏఎంజీ సీఎల్ఏ- 45, జీఎల్ఏ-45 మోడళ్లను అప్గ్రేడ్ చేసి సరికొత్తగా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాలుగు సిలిండర్ల ఇంజీన్తో ఏఎంపీ ఫెరఫామన్స్ మోడల్స్ను విడుదల చేసింది. వీటితోపాటు ఏఎంజీలో ఏరో ఎడిషన్లో రెండు మోడల్స్ను తీసుకొచ్చింది. సీఎల్ఏ 45 ఏరో ధరను రూ.77.69 లక్షలుగాను, జీఎల్ఏ-45 ఏరో ధరను రూ. 80.6 లక్షలు (ఎక్స్-షోరూము)గా నిర్ణయించింది. మెర్సిడెస్ ఏఎంజీసీఎల్- 45 సెడాన్, జీఎల్ఏ-45 ఎస్యూవీని అందుబాటులోకి తెచ్చింది. వీటి ధర (ఎక్స్-షోరూము) వరుసగా రూ.. 75.20 లక్షలు , రూ. 77.85 లక్షలుగా నిర్ణయించింది. ఈ రెండు వాహనాలు గరిష్టంగా గంటలకు 250కి.మీ. వేగాన్ని అందుకుంటాయి. భారతదేశంల కార్ల విభాగం వేగంగా వృద్ధి చెందిందని, పరిశ్రమ వృద్ధికి కొత్త మోడల్స్ ఆవిష్కరణ కీలకమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ రోలాండ్ ఫోల్గర్ వ్యాఖ్యానించాడు. అంతిమ డ్రైవింగ్ పనితీరుతో ఆకట్టుకునేలా తీసుకొస్తున్న రాడికల్ ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. -
భారత్లోకి మూడు ఆడి కొత్త కార్లు
సాక్షి, న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీదారి ఆడి తన ఏ5 రేంజ్లో మూడు కొత్త మోడల్స్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఏ5 స్పోర్ట్బ్యాక్, ఏ5 కాబ్రియోలెట్, ఎస్5 స్పోర్ట్ బ్యాక్ పేర్లతో వీటిని ఆడి తీసుకొచ్చింది. వీటి ధరలు ఎక్స్షోరూం ఢిల్లీలో రూ.54.02 లక్షలు, రూ.67.15 లక్షలు, రూ.70.60 లక్షలుగా ఉన్నాయి. మొదటి రెండు మోడల్స్ పూర్తిగా కొత్తవి కాగ, ఎస్5 ప్రస్తుతమున్న ప్రొడక్ట్కు అప్డేటడ్ మోడల్. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూలకు గట్టి పోటీ ఇవ్వడానికి ఈ కార్లను ఆడి మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఏ5 మోడల్2.0 లీటరు ఇంజిన్ను, 190బీహెచ్పీ పీక్ పవర్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ టాప్ స్పీడు 235 కేఎంపీహెచ్. 7.9 సెకన్లలో 0-100 కేఎంపీహెచ్ను సాధించగలదని కంపెనీ చెప్పింది. ఎస్5 మోడల్ చాలా పెద్దది, చాలా వేగవంతమైనది. 3 లీటరు ఇంజిన్ను కలిగి ఉన్న ఈ కారు 354కేహెచ్పీ పీక్ పవర్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మోడల్ టాప్ స్పీడు 250 కేఎంపీహెచ్. 4.7 సెకన్లలో 0-100 కేఎంపీహెచ్ను ఇది చేరుకోగలదు. -
వంగడాలతోనూ ‘పట్టు’సాధించొచ్చు
మల్బరీ సాగులో నూతన వంగడాలతో అధిక దిగుబడులు - పట్టు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేపీ కిరణ్కుమార్ కళ్యాణదుర్గం: మల్బరీ సాగులో నూతన వంగడాలతో రైతులు అధిగ దిగుబడి సాధించొచ్చని పట్టు పరిశోధన విస్తరణ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేపీ కిరణ్కుమార్ పేర్కొన్నారు. మల్బరీలో నూతన వంగడాలు, వాటి ప్రాముఖ్యత, పంట కాలం తదితర విషయాలపై రైతులకు వివరించారు. పట్టుపురుగులు, పట్టుదారం ఉత్పత్తికి కావాల్సిన ముడి పదార్థాలు దాదాపుగా 70 శాతం మల్బరీ ఆకుల నుంచే లభిస్తాయన్నారు. మల్బరీ సాగు చేసే రైతులు మొక్కల రకాలు, వాటి ప్రాముఖ్యత, మొక్కల సామర్థ్యంపై అవగాహన పెంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు. వీ1 వంగడం: ఈ వంగడం మొక్కను కత్తిరిస్తే వెంటనే చిగురుస్తుంది. వేరు ఉత్పత్తి సామర్థ్యం 94 శాతం ఉంటుంది. ఆకులు చీలిక లేకుండా అండాకారంలో, వెడల్పుగా, మందంగా ఆకుపచ్చ రంగులో దాదాపు 5.2 సెం.మీ ఉండి తళతళలాడుతూ ఉంటాయి. కణువుల నిడివి 5.2 సెం.మీ ఉండి ఆకుమచ్చ, బూడిద తెగులును, ఆకు తుప్పు రోగాలను తట్టుకునే శక్తిఉంటుంది. ఆకులు 78 శాతం తేమాంశం, 27 శాతం ప్రొటీన్లు, 26 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. హెక్టారుకు ఏడాదికి 50–60 మెట్రిక్ టన్నుల దిగుబడి ఇస్తుంది. జీ4 వంగడం : ఈ వంగడం మొక్క ఆకులు వెడల్పుగా, చీలికలు లేకుండా హృదాయాకారంలో ఉంటాయి. ముదురు ఆకుపచ్చ రంగులో ఉపరితలము అలలుగా ఉంటాయి. ఈ వంగడం మొక్కను కత్తిరించినా వెంటనే చిగురువస్తుంది. వేరు ఉత్పత్తి సామర్థ్యం 92 శాతం ఉంటుంది. కణువుల మధ్య నిడివి 3.9 సెం.మీ వరకు ఉంటుంది. ఒక హెక్టారుకు ఏడాదికి 65 మెట్రిక్ టన్నుల దిగుబడి ఇస్తుంది. ఆకులు 75 శాతం తేమాంశం, 26 శాతం ప్రోటీన్లు, 25 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. జీ2 వంగడము : వంగడం మొక్క ఆకులు వెడల్పుగా, చీలికలు లేకుండా ఉంటాయి. ముదురు ఆకుపచ్చ రంగులో ఉపరితలము అలలుగా ఉంటాయి. ఈ వంగడం మొక్కను కత్తిరించినా వెంటనే చిగురువస్తుంది.ఆకులు 80 శాతం తేమాంశం, 27 శాతం ప్రొటీన్లు, 25 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. వేరు ఉత్పత్తి సామర్థ్యం 94 శాతం ఉంటుంది. కణువుల మధ్య నిడివి 4.0 సెం.మీ. వరకు ఉంటుంది. ఒక హెక్టారుకు ఏడాదికి 36–38 మెట్రిక్ టన్నుల దిగుబడి ఇస్తుంది. యస్ 13 వంగడం : ఈ వంగడం అధిక వేరు ఉత్పత్తి 80 శాతం కలిగి ఉంటుంది. ఆకులు చిన్నవిగా అండాకారంలో ఉండి ఆకుపచ్చ రంగులో తళతళలాడుతూ ఉంటాయి. కణువుల మధ్య దూరం 3.2 సెం.మీ ఉండి, ఆకుమచ్చతెగులు, బూడది రోగం, ఆకు తుప్పు రోగం తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి. అలాగే తుక్రా రోగమును తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి. ఇవి హెక్టారుకు 13–16 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఆకులు 78 శాతం తేమాంశం, 23 శాతం ప్రోటీన్లు, 27 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. యస్ 34 వంగడం : ఈ వంగడం ఆకులు చిన్నవిగా హృదయాకారంలో చీలికలు లేకుండా ఉంటాయి. వేరు ఉత్పత్తి 75 శాతం కలిగి ఉంటుంది. ఇవి ఆకుమచ్చతెగులు, బూడది రోగం, ఆకు తుప్పు రోగం తట్టుకునే శక్తి కలిగి ఉంటాయి. ఆకులు 75 శాతం తేమాంశం, 24 శాతం ప్రోటీన్లు, 26 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. ఇవి హెక్టారుకు 13–16 మెట్రిక్ టన్నులు ఉంటుంది. యస్ 36 వంగడం: ఈ వంగడం మొక్కను కత్తిరించినా వెంటనే ఉత్పత్తి అవుతుంది. 48 శాతం వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది. ఆకులు వెడల్పుగా చీలికలు లేకుండా హృదయాకారంలో లేత పసుపు రంగులో తళతళలాడుతూ ఉంటాయి. ఆకులు 78 శాతం తేమాంశం, 25 శాతం ప్రోటీన్లు, 25 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. 3.53 సెం.మీల తక్కువ కణువుల నిడివి కలిగి ఉండి, ఆకుమచ్చ, బూడిద తెగులు, ఆకు తుప్పు రోగాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆకు దిగుబడి సామర్థ్యం 28 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. యస్.జీ2 వంగడం: ఈ వంగడం మొక్కను కత్తిరించినా వెంటనే ఉత్పత్తి అవుతుంది. 89 శాతం వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది. ఆకులు మధ్యమ వెడెల్పుతో హృదయాకారంలో నునుపుగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కణువుల మధ్య నిడివి 4.2 సెం.మీ ఉండి, ఆకుమచ్చ, బూడిద తెగులు, ఆకు తుప్పు రోగాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆకు దిగుబడి సామర్థ్యం 22–23 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. ఆర్.సి.1 వంగడం: ఈ వంగడం ఆకులు పెద్దవిగా, హృదయాకారంలో చీలికలు లేకుండా ముదురు ఆకుపచ్చరంగులో మృధువుగా ఉంటాయి. ఈ మొక్కలు కత్తిరించినా, ఆకుకోత వెంటనే ఉత్పత్తి అవుతుంది. వేరు ఉత్పత్తి సామర్థ్యం 85 శాతం ఉంటుంది. కణువుల మధ్య దూరం 4.3 సెం.మీ ఉండి, ఆకుమచ్చ, బూడిద తెగులు, ఆకు తుప్పు రోగాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆకు దిగుబడి సామర్థ్యం 23– 25 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. ఆర్.సీ.2 వంగడం: ఈ వంగడం ఆకులు చిన్నవిగా, హృదయాకారంలో ముదురు ఆకుపచ్చరంగులో మృదువుగా ఉంటాయి. ఈ మొక్కలు కత్తిరించినా, ఆకుకోత వెంటనే ఉత్పత్తి అవుతుంది. వేరు ఉత్పత్తి సామర్థ్యం 89 శాతం ఉంటుంది. కణువుల మధ్య దూరం 4.4 సెం.మీ ఉండి, ఆకుమచ్చ, బూడిద తెగులు, ఆకు తుప్పు రోగాలను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఆకు దిగుబడి సామర్థ్యం 21– 23 మెట్రిక్ టన్నుల వరకు ఉంటుంది. ఏ ఆర్ 12 వంగడం: ఈ వంగడం అధిక వేరు ఉత్పత్తి సామర్థ్యం 90 శాతంగా ఉండి ఆకులు వెడల్పుగా, హృదయాకారంలో చీలికలు లేని ముదురు ఆకుపచ్చరంగులో మృధువుగా ఉంటాయి. కణువుల మధ్య దూరం 3.75 సెం.మీ కలిగి ఉంటుంది. ఆకుతుప్పు తట్టుకునే సామర్థ్యం మధ్యస్థంగా ఉంటుంది. ఈ వంగడం ఆకులు 74 శాతం తేమాంశం, 23 శాతం ప్రోటీన్లు, 21 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. ఆకు దిగుబడి ఏడాదికి 16–24 మెట్రిక్ టన్నుల వరకు ఇస్తుంది. సహన వంగడం: ఈ వంగడం ఆకులు వెడెల్పుగా, చీలిక లేకుండా హృదాయాకారంలో ముదురు ఆకుపచ్చ రంగులో తళతళలాడుతూ ఉంటాయి. ఆకు దిగుబడి హెక్టారుకు ఏడాదికి 25–30 మెట్రిక్ టన్నులు ఇస్తుంది. అధిక వేరు ఉత్పత్తి సామర్థ్యం 80 శాతంగా ఉంటుంది. ఆకుమచ్చ తెగులు తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే ఆకుతుప్పు, తూక్రా తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం మధ్యస్తంగా ఉంటుంది. ఆకుల పోషక విలువలు 73 శాతం తేమాంశం, 27 శాతం ప్రోటీన్లు, 22 శాతం కార్పొహైడ్రేట్లు కలిగి ఉంటుంది. నీటి వసతి గల కొబ్బరి తోటలలో అంతర పంటగా వేయిటకు సిఫారసు చేయబడింది. -
స్పీడు పెంచిన హ్యుందాయ్..8 కొత్త కార్లు లాంచ్
చెన్నై : దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ మరింత స్పీడు పెంచింది. కొత్తకొత్త మోడల్స్తో వినియోగదారులను అలరించేందుకు సిద్ధమైంది. వచ్చే నాలుగేళ్లలో ఎనిమిది కొత్త మోడల్స్ను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు హ్యుందాయ్ మోటార్స్ టాప్ అధికారి చెప్పారు. 2017లో హ్యుందాయ్ ఇండియాలో రెండంకెల వృద్ధిని నమోదుచేయనుందని పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో కంపెనీ మొత్తం 10 ప్రొడక్ట్లను లాంచ్ చేయబోతుంది, దానిలో ఎనిమిది కొత్త మోడల్స్ అని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ వైకే కూ చెప్పారు. మిగతా రెండు మోడల్స్ అప్గ్రేడ్స్ చేసేవని తెలిపారు. లోనిక్యూ హైబ్రిడ్ మోడల్ను న్యూఢిల్లీలో జరుగబోతున్న ఆటోషో 2018లో కంపెనీ షోకేసు చేయబోతుందని తెలిపారు. మిగతావి భవిష్యత్తులో లాంచ్ చేయబోతున్నట్టు పేర్కొన్నారు. కాంపాక్ట్ కారు సెగ్మెంట్లో హ్యుందాయ్ చాలా స్ట్రాంగ్గా ఉందని, ఐ10, ఐ20 లాంటి మోడల్స్తో 51 శాతం ఇండియన్ కారు మార్కెట్ను హ్యుందాయ్ సొంతం చేసుకుందని చెప్పారు. మిడ్ సెగ్మెంట్ పోర్ట్ ఫోలియోను మరింత బలోపేతం చేసేందుకు కంపెనీ కృషిచేస్తుందని తెలిపారు. -
కార్తీకం కట్టు
కార్తీకంలో చీకటిని చీల్చడానికి దీపాలు వెలుగులు విరజిమ్ముతుంటాయి. ఆ వెలుతురులో చలి ముసుగేసుకుంటుంది. పెళ్లి వేడుకలు కూడా ఈ కాలంలో ఎక్కువే. డిజైనర్ దుస్తులు సరే, చలిని తట్టుకోవాలంటే ఎలా? వాటి మీద స్వెటర్ వేసుకోవాలా! అనేవారికి మహత్తరమైన ఆలోచనలతో ప్రసిద్ధ డిజైనర్స్ కొత్త కొత్త మోడల్స్ను మన ముందుకు తీసుకువస్తున్నారు. ఆ కొత్త డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోండి. చలిని దూరంగా తరిమేయండి. వెచ్చగా వివాహ వేడకల్లో దీపాకాంతిలా వెలిగిపోండి. చలికాలం పెళ్లి వేడుకలు ఓ రమణీయకాంతిని కళ్లకు కడతాయి. దీపాల వెలుగుల్లో ఎంతో అందంగా మెరిసిపోవచ్చు అతివలంతా ముచ్చటపడిపోతుంటారు. అయితే వారి ఆనందాన్ని తగ్గించడానికా అన్నట్టు చలి వణికించేస్తుంటుంది. శాలూవాతో అందమైన డ్రెస్సులను కప్పేయకుండా డ్రెస్సులనే చలిని తరిమేసేలా డిజైన్ చేస్తే... చలికే వణుకుపుట్టడం ఖాయం. బ్రైట్ కలర్స్ చలికాలం మూడ్స్ కాస్త డల్గా ఉంటాయి. హుషారు తెప్పించాలంటే మాంచి కలర్ఫుల్ దుస్తులను ఎంపిక చేసుకోవాలి. పసుపు, ఎరుపు, పచ్చ, నీలం.. కాంతివంతమైన రంగులను ఎంచుకోవాలి. వేసవి కాలం హెవీ ఎంబ్రాయిడరీ దుస్తులను ధరించి సౌకర్యంగా ఉండలేరు. కానీ, చలికాలం ఎంత హెవీ ఎంబ్రాయిడరీ దుస్తులైనా అట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి. లాంగ్ స్లీవ్స్ - హై నెక్స్... శారీ, అనార్కలీ సూట్, లెహంగా... సంప్రదాయ దుస్తులు ఏవైనా ఫుల్ స్లీవ్స్ ఈ కాలానికి మంచి ఎంపిక. ఇది ప్రస్తుత ట్రెండ్. భారతీయ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ, రోహిత్బాల్, మనీష్మల్హోత్రా... వింటర్ బ్రైడల్ వెడ్డింగ్ దుస్తులకు ఎక్కువగా ఫుల్ ఎంబ్రాయిడరీ స్లీవ్స్, అందంగా అలంకరించిన హై నెక్ డిజైన్స్పై ప్రధాన దృష్టి ఉంచుతారు. బెనారస్ టు వెల్వెట్స్... లెహంగాలకే కాదు బ్లౌజ్లకూ చలికాలం వెల్వెట్ మంచి ఎంపిక. చలికి వెచ్చదనాన్ని ఇచ్చే వెల్వెట్ క్లాత్ మీద చేసిన జరీ ఎంబ్రాయిడరీ వర్క్ చూపు తిప్పుకోనివ్వదు. లెహంగా, శారీ.. రెండింటిపైనా ఈ తరహా బ్లౌజ్లను వాడచ్చు. సెలబ్రిటీల శారీస్, వెడ్డింగ్ డ్రెస్ ఫొటోగ్రఫీని చూస్తే ఈ విషయం మీకే స్పష్టం అవుతుంది. పొరలు పొరలుగా... చలిని అందంగా తిప్పికొట్టాలంటే చక్కని ఐడియా లేయర్ దుస్తులఎంపిక. అమెరికాలో చలిని తట్టుకోవడానికి స్వెటర్, జాకెట్, షాల్, స్క్రార్ప్.. ఇలా ఒకదానిమీద ఒకటి ఎలా ధరిస్తారో.. ఇదే థీమ్తో మీ వెడ్డింగ్ వేర్ను డిజైన్ చేయించుకోవచ్చు. బాలీవుడ్ తారల వెడ్డింగ్ డ్రెస్, వింటర్ ఫ్యాషన్ షోలను చూస్తే మీకే అర్థమవుతుంది. పొరలు పొరలుగా ఉండేలా పట్టు, బెనారస్, వెల్వెట్, నెటెడ్, షిఫాన్... మిక్సింగ్లతో లెహంగాలను, అనార్కలీలను రూపుకట్టవచ్చు. షార్ట్ లెంగ్త్ ఫుల్లీ ఎంబ్రాయిడరీ జాకెట్ వేసుకొని, దాని మీద మరో లాంగ్ లెంగ్త్ జాకెట్ ధరిస్తే స్టైల్గా మెరిసిపోవచ్చు. వింటర్లో వెచ్చగా ఉండచ్చు. ఇతర అలంకరణలోనూ... వివాహ వేడుకల్లో ఇతర అలంకరణ వస్తువుల్లోనూ ఎంబ్రాయిడరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇవి మార్కెట్లో ఆకర్షణీయమైన డిజైన్లలో లభిస్తున్నాయి. అలాగే క్లచ్లు ధరించిన దుస్తుల డిజైన్లకు, రంగులకు సరిపోయేవి ఎంపిక చేసుకోవాలి. - ఎన్.ఆర్ -
ఫియట్ నుంచి రెండు కొత్త మోడళ్లు
* పుంటో అబర్త్, క్రాసోవర్ అబర్త్ అవెంచుర * ధర రూ. 9.95 లక్షలు న్యూఢిల్లీ: ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ కంపెనీ రెండు కొత్త మోడళ్లను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ప్రీమియం హ్యాచ్బాక్ పుంటో అబర్త్, క్రాసోవర్ అబర్త్ అవెంచుర మోడళ్లను అందిస్తున్నామని ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ కెవిన్ ఫ్లిన్ చెప్పారు. ఈ రెండు మోడళ్ల ధరనూ ఒకేస్థాయిలో రూ.9.95 లక్షలుగా నిర్ణయించారు. పండుగ సీజన్లో ఈ రెండు కార్లు మంచి అమ్మకాలు సాధిస్తాయన్న ఆశాభావాన్ని కెవిన్ వ్యక్తం చేశారు. కార్ల ప్రత్యేకతలు: ఈ రెండు కార్లలో 1.4 లీటర్ టి-జెట్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 5 గేర్లు వంటి ఫీచర్లున్నాయని కెవిన్ పేర్కొన్నారు. ఫియట్ అబర్త్ పుంటోలో సెకండరీ ఎయిర్డ్రమ్స్, స్పోర్టీయర్ రియర్ బంపర్, 16 అంగుళాల డ్యుయల్-టోన్ అలాయ్ వీల్స్, 7 ఎయిర్బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్(ఈబీడీ)తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు.