Neena Gupta
-
పెళ్లికాకుండా బిడ్డను కనకుండా ఉండాల్సింది: నటి
నీనా గుప్తా.. నటనకు నిర్వచనం! వివియన్ రిచర్డ్స్.. క్రికెట్ సంచలనం! ఆమె అతని ఫ్యాన్.. అతని జీవన సహచరిగా కూడా కావాలనుకుంది.. కుదరలేదు.. ఆ వైఫల్యం మనసు నిండా బాధను నింపింది.. ఆ ప్రేమ ఇచ్చిన గుర్తును గుండెకు హత్తుకొని ముందుకు సాగింది.. అలా మొదలైంది.. 1980ల నాటి సంగతి.. ఇండియాతో సిరీస్ ఆడ్డానికి వెస్ట్ ఇండీస్ టీమ్ ఇక్కడికి వచ్చింది. ఆ సమయంలో వెస్ట్ ఇండీస్ టీమ్ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్. ఆటగాడిగా ఎంత ఫేమస్సో లేడీస్ మన్గానూ అంతే పాపులర్. మ్యాచ్ షెడ్యూల్లో భాగంగా ముంబై చేరుకుందా టీమ్. ఒకరోజు పేజ్ త్రీ పార్టీకి హాజరయ్యాడు రిచర్డ్స్. ఆ పార్టీకి నీనా గుప్తా కూడా వచ్చింది. రిచర్డ్స్ అంటే వెర్రి అభిమానం ఆమెకు. అక్కడ అతను కనిపించేసరికి తన కళ్లను తానే నమ్మలేకపోయింది. అంతలోనే నీనా సన్నిహితులు ఆమెను రిచర్డ్స్కు పరిచయం చేశారు ‘మీ అభిమాని’ అంటూ. తనను చూసినప్పుడు నీనా కళ్లల్లో మెరిసిన మెరుపు అతణ్ణి కట్టిపడేసింది. నీనా అభిమానం ఆమె ముందు నుంచి కదలనివ్వకుండా చేసింది. ఆ ఇద్దరి మధ్య స్నేహం ఇంకా నిలదొక్కుకోకముందే ఆకర్షణ ఆ జంటను ప్రేమలోకి తోసింది. అప్పటికే రిచర్డ్స్ ఇద్దరు పిల్లల తండ్రి కూడా.. రిచర్డ్స్ అప్పటికే వివాహితుడు.. ఇద్దరు పిల్లల తండ్రి కూడా! ‘నువ్వంటే ఇష్టం.. నిన్ను ప్రేమిస్తున్నాను’ అని నీనా అన్నప్పుడే తనకు పెళ్లయిన విషయం చెప్పేశాడు అని అంటారు ఆ జంట లవ్ స్టోరీ తెలిసిన సన్నిహితులు. అయినా నీనా .. రిచర్డ్స్ ప్రేమను ఆస్వాదించింది. సిరీస్ అయిపోయాక రిచర్డ్స్ స్వదేశం వెళ్లిపోయాడు. షూటింగ్స్ లేని ఖాళీ సమయాలను రిచర్డ్స్తోనే వెచ్చించింది.. అతని దేశంలో. ఆ సమయంలో రిచర్డ్స్ తన భార్యకు దూరంగా.. విడాకుల ఆలోచనలో ఉన్నాడని.. అయినా నీనా, రిచర్డ్స్ల మధ్య పెళ్లి ప్రస్తావన రాలేదని అప్పటి మీడియాలో వార్త. రిచర్డ్స్ ప్రేమలో ప్రపంచాన్ని మరచిపోయింది. ఆ సంతోషంలో ఆమె గ్రహించిన విషయం.. తాను తల్లిని కాబోతున్నానని. సంబరపడాల్సిందే కానీ.. పెళ్లి కాకుండా .. కరెక్ట్కాదు.. అన్నారు నీనా కుటుంబ పెద్దలు. మసాబా పుట్టింది.. రిచర్డ్స్ నుంచి ఏదైనా అనుకూలమైన నిర్ణయం వస్తుందేమోనని చూసింది నీనా. రాలేదు.. ‘పెళ్లి చేసుకోలేను’ అనే మాటను మార్చలేదు రిచర్డ్స్. అది నీనా మనసును కష్టపెట్టింది. అతని తీరు చూసి నీనా స్నేహితులూ హెచ్చరించారు..‘నువ్వు నీ గురించే ఆలోచించుకుంటున్నావ్ తప్ప పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించట్లేదు. పుట్టబోయే ఆ బిడ్డను సఫర్ చేయడం తప్ప నువ్వేం సాధించలేవు’ అని. వినలేదు నీనా. బిడ్డను కనాలనే తీర్మానించుకుంది. మసాబా పుట్టింది. సింగిల్ పేరెంట్.. ఒంటరి తల్లిగానే మసాబాను పెంచింది. ఆ ప్రయాణంలో నీనా తండ్రి ఆమెకు అండగా ఉన్నాడు. అయినా చాలా సమస్యలు ఎదుర్కున్నారు ఇటు నీనా.. అటు మసాబా కూడా. 42ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమ పండిట్ జస్రాజ్ కొడుకు శారంగ్దేవ్ పండిట్ నీనాతో ప్రేమలో పడ్డాడు. నిశ్చితార్థమూ జరిగింది. కానీ ఎందుకో అది పెళ్లిదాకా రాలేదు. దాంతో నీనా చాలా కుంగిపోయింది. ఇంక పెళ్లి గురించి ఆలోచించలేదు. కానీ.. తన 42వ ఏట.. అంటే 2002లో ఢిల్లీకి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ మిశ్రా.. నీనాతో ప్రేమలో పడ్డాడు. దాదాపు ఆరేళ్లు కొనసాగిన ఆ ప్రేమ 2008లో పెళ్లిగా మారింది. ఆ వైవాహిక బంధం సంతోషంగా సాగిపోతోంది. ఒకసారి ముంబై మిర్రర్ ప్రతినిధి నీనా గుప్తాను ‘గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల్లో దేని గురించైనా పునరాలోచించాల్సివస్తే దేన్ని పరిగణనలోకి తీసుకుంటారు?’ అని అడిగితే.. ‘పెళ్లికాకుండా బిడ్డను కనకుండా ఉండాల్సింది. ప్రతి బిడ్డకు తల్లి, తండ్రి ఇద్దరి ఆప్యాయత, సంరక్షణ అత్యంతవసరం. సింగిల్ పేరెంట్గా నేను ఏలోటు రానివ్వకుండా మసాబాను పెంచినా చెంత తండ్రి లేకుండా తనెంత సఫర్ అయిందో నాకు తెలుసు’ అని చెప్పింది. నాకు అమ్మ, నాన్న ఇద్దరి పట్లా అంతే ప్రేమ, గౌరవం ఉన్నాయి. ఇద్దరు ఎవరికి వారే గొప్ప వాళ్లు. నా చిన్నప్పుడు నాన్నతో స్పెండ్ చేసిన టైమ్ ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం. ఆయనతో మేము, మాతో ఆయన ఉండిపోలేదు కానీ సెలవుల్లో మాత్రం నాన్న దగ్గరకు వెళ్లి ఆయనతో గడిపేవాళ్లం. – మసాబా గుప్తా జీవితంలో నాకు రిగ్రెట్స్ ఉన్నాయి. పెళ్లి కాకుండా బిడ్డను కనేకంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సింది. అలా చేసుంటే నా జీవితం ఇలా ఇన్ని మలుపులు తిరిగుండకపోయేది! – నీనా గుప్తా ‘సచ్ కహూ తో’ అనే తన ఆత్మకథలో నిర్భయంగా, నిజాయితీగా చాలా విషయాలనే రాసింది నీనా గుప్తా. ∙ఎస్సార్ చదవండి: శిల్పా శెట్టి, రాజ్కుంద్రాలపై పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు 'స్పిరిట్'కు ప్రభాస్ రికార్డు స్థాయి పారితోషికం! -
గుండె బద్దలైపోయింది.. ఇది నమ్మలేకపోతున్నాను :నటి
చిన్నారి పెళ్లికూతుర(బాలికా వధు)ఫేమ్ సురేఖ సిఖ్రి మృతిపై సీనియర్ నటి నీనా గుప్తా స్పందించారు. సిఖ్రి ఇక లేరన్న విషయం తెలిసి గుండె బద్దలైపోయింది. ఇది నమ్మలేకపోతున్నాను. ఆమెతో బధాయి హో అనే సినిమాలో కలిసి నటించాను. షూటింగ్ బ్రేక్లో చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. స్పాట్లో రెగ్యులర్గా కలిసే తినేవాళ్లం. ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది. సిఖ్రి మరణవార్త జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది అంటూ నీనా గుప్తా ఎమోషనల్ అయ్యారు. 2018లో వచ్చిన బధాయి చిత్రం ఘన విజయం సాధించింది. ఈ మూవీలో సురేఖ సిఖ్రి నీనా గుప్తాకు అత్తగా నటించారు. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతరు) ఫేమ్ లెజెండరీ నటి సురేఖ సిఖ్రి (75) గుండెపోటుతో శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఖ్రి ఈ ఉదయం తుదిశ్వాస విడిచింది. 'కిస్సా కుర్సి కా' చిత్రంతో తెరంగేట్రం చేసిన సురేఖ సిఖ్రి తమాస్ (1988), మమ్మో (1995) బధాయ్ హో (2018) చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా మూడు నేషనల్ అవార్డులు సంపాదించుకుంది. -
సినిమాల్లోకి రాకముందే పెళ్లి.. ఏడాదిలోపే విడిపోయాం: నటి
బాలీవుడ్ నటి నీనా గుప్తా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నటిగా కంటే కూడా ఆత్మవిశ్వాసం మెండుగా కల మహిళగానే ఆమెకు గుర్తింపు ఎక్కువ. దాదాపు 20 ఏళ్ల క్రితమే సింగిల్ పేరెంట్గా మారి.. తల్లీతండ్రి తానే అయి మసాబా గుప్తాను పెంచారు. తాజాగా విడుదలైన నీనా గుప్తా ఆత్మకథ ‘సచ్ కహూ తో’ సినీ అభిమానులతో పాటు సామాన్యులను కూడా బాగా అలరించింది. తన కుటుంబ సభ్యులకు తప్ప బయటి వారికి తెలియని తన జీవిత విశేషాలను దీనిలో వెల్లడించారు నీనా గుప్తా. మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్తో సహజీవనం కంటే ముందే అంటే సినిమాల్లో రాకముందే తనకు వివాహం అయ్యిందని.. కానీ ఆ బంధం ఏడాది పాటు కూడా నిలవలేదని తన ఆత్మకథలో వెల్లడించారు నీనా గుప్తా. ఆ వివరాలు.. ‘‘నా మొదటి భర్త పేరు అమ్లాన్ కుమార్ ఘోస్. మేమిద్దరం ఓ ఇంటర్ కాలేజ్ ఇవేంట్లో కలుసుకున్నాం. ఆ పరిచయం అలా పెరిగి ప్రేమగా మారింది. అప్పుడు అమ్లాన్ ఢిల్లీ ఐఐటీలో చదవుతుండేవాడు. నేను డిగ్రీ చదువుతున్నాను. మేం ఎక్కువగా ఢిల్లీ ఐఐటీ పరిసరాల్లో కలుసుకునేవాళ్లం. చాలా రోజుల పాటు మా ప్రేమ గురించి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాం’’ అని చెప్పుకొచ్చారు నీనా గుప్తా. ‘‘కానీ కొన్నాళ్ల తర్వాత మా ప్రేమ గురించి మా అమ్మకు చెప్పాను. ఆమెకు ఈ విషయం ఏమాత్రం నచ్చలేదు. అప్పటి నుంచి నన్ను మరింత కంట్రోల్ చేయడం ప్రారంభించింది. ఓ సారి అమ్లాన్ తన స్నేహితులతో కలిసి శ్రీనగర్ వెళ్తున్నాడు. వారితో నేను వెళ్లాలని భావించాను. కానీ మా అమ్మ అందుకు ఒప్పుకోలేదు. అతడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్లు అన్నది. అప్పటికే మాపై నిఘా ఎక్కువ్వయ్యింది. వీటన్నింటిని భరించే బదులు వివాహం చేసుకోవడం మేలని భావించాం’’ అని చెప్పుకొచ్చారు నీనా గుప్తా. ‘‘నేను బెంగాలీ అమ్మాయిని కాకపోవడంతో అమ్లాన్ తల్లిదండ్రులు, బంధువులు మా వివాహానికి అంగీకరించరని మాకు తెలుసు. వారికి మా పెళ్లి గురించి చెప్పలేదు. అందుకే నా కుటుంబ సభ్యులు, మా ఇద్దరి స్నేహితుల సమక్షంలో ఆర్మ సమాజ్లో వివాహం చేసుకున్నాం. ఆ తర్వాత మేం రాజేంద్ర నగర్లో ఓ చిన్న ఇంటికి మారం. అమ్లాన్ ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. నేను డిగ్రీ పూర్తి చేసి ఢిల్లీ యూనివర్శిటీలో సాంస్క్రిట్లో మాస్టర్ డిగ్రీ చేయడానికి జాయిన్ అయ్యాను’’ అన్నారు నీనా గుప్తా. ‘‘కానీ తర్వాత నాకు నాటకాలవైపు మనసు మళ్లింది. థియేటర్ యాక్టర్ కావాలని కలలు కన్నాను. నటన మీద నాకున్న ఆసక్తి అప్పుడే నాకు తెలిసింది. కాకపోతే దురదృష్టం కొద్ది అమ్లాన్ ఆలోచలను ఇందుకు భిన్నంగా ఉన్నాయి. తను కేవలం ఇంటిని, తనను బాగా చూసుకునే భార్య కావాలని కోరుకున్నాడు. నేను ఇంటి పట్టునే ఉండి, తనను చూసుకోవాలని ఆశించాడు. దాంతో మా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి’’ అని రాసుకొచ్చారు నీనా గుప్తా. ‘‘పెళ్లైన ఏడాదిలోపే మా ఇద్దరి దారులు వేరని మాకు అర్థం అయ్యింది. మేం కలిసి ఉండలేమని కూడా తెలిసింది. దాంతో విడిపోయాం. అమ్లాన్ అంకుల్ ఒకరు మా విడాకుల విషయంలో సాయం చేశారు. నేను నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాను. ఆ తర్వాత నటిగా మారడం, రిచర్డ్స్తో ప్రేమ, సహజీవనం, మసాబా జననం జరిగిపోయాయి. నేను, అమ్లాన్ ఎప్పుడు పెద్దగా అరుచుకుని గొడవపడలేదు.. ఒకరి మీద ఒకరం ఆరోపణలు చేసుకోలేదు. స్నేహపూర్వకంగానే విడిపోయాం. తను చాలా మంచి వ్యక్తి’’ అని చెప్పుకొచ్చారు నీనా గుప్తా. -
నీనా గుప్తా ఆత్మకథ..‘నిజం చెప్పాలంటే’
తన జీవితాన్నితాను ఇష్టపడినట్టుగా జీవించడానికి తన మార్గాన్ని కొనసాగించడానికి ఎప్పుడూ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన నటి నీనా గుప్తా తన ఆత్మకథ ‘సచ్ కహూ తో’ వెలువరించింది. సినిమా అభిమానుల కంటే స్త్రీలు తప్పక చదవాల్సిన ఆత్మకథ కావచ్చు ఇది. పెంగ్విన్ సంస్థ ఇటీవల ప్రచురించిన నటి నీనా గుప్తా ఆత్మకథ ‘సచ్ కహూ తో’ (నిజం చెప్పాలంటే) సినిమా అభిమానులను, పాఠకులను కుతూహల పరుస్తోంది. అందులో నీనా గుప్తా తన జీవితంలోని అనేక అంశాలను ‘దాదాపుగా నిజాయితీ’తో చెప్పే ప్రయత్నం చేసిందని విమర్శకులు అంటున్నారు. అందులో కొన్ని విశేషాలు: సతీష్ కౌశిక్తో పెళ్లి ‘నటుడు సతీష్ కౌశిక్ నాకు కాలేజీ రోజుల నుంచి తెలుసు. స్నేహితుడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నేను చేరడానికి కారణం అతడే. ముంబైలో నాకు అండా దండగా ఉండేవాడు. నేను వివియన్ రిచర్డ్స్తో గర్భం దాల్చి మసాబాకు జన్మనిచ్చాక సతీష్ ‘నన్ను పెళ్లి చేసుకో. నీ బిడ్డకు తండ్రిగా నా పేరు ఉంటుంది’ అన్నాడు. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. సింగిల్ మదర్గా నేను, తండ్రి లేని పిల్లగా నా కూతురు మనలేరు అని అతడు నా కోసం బాధ పడ్డాడు.’ అని రాసింది నీనా. బయటపడ్డ ప్రాణాలు ‘మసాబా పుట్టిన మూడు నెలలకే నేను పని చేయడం మొదలెట్టాను. ది స్వోర్డ్ ఆఫ్ టిపూ సుల్తాన్ సీరియల్లో చిన్న పాత్ర దొరికింది. అది చేస్తున్నప్పుడే సెట్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. సంజయ్ ఖాన్ సకాలంలో స్పందించి మంటలార్పే ప్రయత్నంలో తనూ సగం కాలిపోయాడు. సెట్ బయట మసాబా ఉందప్పుడు. తనకు ఆరోగ్యం బాగలేదు. ఎలా ఉందో చూద్దామని నేను బయటకు వెళ్లినప్పుడే ప్రమాదం జరగడంతో బతికిపోయాను. ఆ ప్రమాదంలో 55 మంది చనిపోయారు’ అని రాసిందామె. సుభాష్ ఘాయ్ ‘చోలీ’ ‘ఖల్ నాయక్ సినిమాలో చోలీ కే పీఛే క్యాహై పాటలో నేను, మాధురి నటించాలి. నాకు రాజస్థాని డ్రస్ వేసి తీసుకువెళ్లి చూపించారు. ఆయనను నన్ను చూసి హతాశుడై ‘నో.. నో.. ఏదైనా కొంచెం నింపి తీసుకురండి’ అన్నాడు. ఇది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అతడు నా వక్షం నిండుగా ఉండాలని సూచించాడు. ఇందులో వ్యక్తిగతం ఏమీ లేదు. దర్శకుడిగా తనకు ఏది కావాలో ఆ ఊహకు తగినట్టుగా నేను ఉండాలనుకున్నాడు. ఆ రోజు షూటింగ్ జరగలేదు. మరుసటి రోజు ప్యాడెడ్ బ్రా వేసి నా కాస్ట్యూమ్స్ సిద్ధం చేశారు. అప్పుడు అతను సంతృప్తి చెందాడు. మంచి దర్శకుడు రాజీపడడు. సుభాష్ ఘాయ్ అందుకే మంచి దర్శకుడు’ అని రాసిందామె. ఇలాంటివే అనేక విశేషాలు ఆమె ఆత్మకథలో ఉన్నాయి. ∙ -
సేల్స్గర్ల్గా మారిన నటి!: నీనా గుప్తా అసహనం..
బాలీవుడు సీనియర్ నటి నీనా గుప్తా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తన గురించి వచ్చిన ఓ ఫేక్ ఆర్టీకల్ గురించి తాజాగా గుర్తు చేసుకున్నారు. కాగా ‘సచ్ కహున్ తో’ అనే పేరుతో నినా స్వయంగా తన ఆత్మకథను రాసుకున్న సంగతి తెలిసిందే. ఈ బుక్ను ఇటీవల ఆమె విడుదల చేశారు. ఈ బయోగ్రఫి ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఆత్మకథకు సంబంధించిన విషయాలపై ముచ్చటించారు. ఈ నేపథ్యంలో కేరీర్ ప్రారంభంలో సేల్స్గర్ల్గా పని చేసినట్లు వచ్చిన తప్పుడు ఆర్టికల్ చదివి షాకయ్యానని చెప్పారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘నా గురించి ఎన్నో సార్లు తప్పుడు వార్తలు వచ్చాయి. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ మ్యాగజైన్లో శ్యామ్ ఆహుజా షాప్లో నేను సేల్స్గర్ల్గా చేరినట్లు తప్పుగా రాసినట్లు నాకు ఇప్పటికి గుర్తుంది. అయితే ఆ సమయంలో నాకు నిజంగా శ్యామ్ ఆహుజా ఎవరో తెలియదు. ఆ ఆర్టికల్ చదివాక నా స్నేహితులను అడిగాను. అప్పుడు వారు ఆయన ఓ వ్యాపారవేత్త అని ఆయనకు ఓ కార్పెట్ షాప్ ఉందని చెప్పారు. అది విని నేను షాక్ అయ్యాను. అలాంటి తప్పుడు వార్తలు ఎలా రాస్తారో అర్థం కాదు. నేను ఎందుకు ఆయన షాప్లో పని చేస్తాను’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. అలాగే తను సినిమాలకు ఎందుకు దూరమయ్యారో కూడా చెప్పారు. ‘నేను నా జీవితంలోకి ఓ తప్పుడు వ్యక్తిని ఆహ్వానించాను. అది నా ప్రొఫెషనల్ లైఫ్పై ప్రభావం చూపింది. అందుకే నటిగా సక్సెఫుల్ కెరీర్లో ఉన్నప్పటికి నటనను ఆపేశాను’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె నేటి తరం యువతులకు ఓ సందేశం కూడా ఇచ్చారు. ఎప్పుడు మీ పని మీదే దృష్టి పెట్టండని, పురుషులపై పెట్టకండి అంటూ సలహా ఇచ్చారు. ఓ ఒంటరి మహిళ తన కూతురు(మసాబా) పెంచడంతో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, సినీ పరిశ్రమలో నటిగా ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి నీనా గుప్తా తన ఆత్మకథలో వివరించారు. చదవండి: పాచిపని అయినా చేద్దామనుకున్నా: నటి -
నా ఆటోబయోగ్రఫీ ఇచ్చాను.. ఆయన భయపడ్డారు: సీనియర్ నటి
ముంబై: సినీ గేయ రచయిత గుల్జార్ను కలిసి తన జీవతచరిత్రను అందజేసినట్లు సీనియర్ నటి నీనా గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ముఖంపై నవ్వుతో పాటు, కాస్తంత భయాన్ని కూడా చూశానని సరదాగా వ్యాఖ్యానించారు. నీనా గుప్తా జీవితం సంచలనాలకు కేంద్ర బిందువు అన్న సంగతి తెలిసిందే. విండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్తో సహజీవనం ఆమె.. పెళ్లికాకముందే ఆయన బిడ్డకు జన్మనిచ్చారు. పాపకు మసాబాగా నామకరణం చేసి ఒంటరిగానే ఆమె బాధ్యతలు స్వీకరించి, తనను పెంచి పెద్ద చేసి.. డిజైనర్గా స్థిరపడేలా ప్రోత్సాహం అందించారు. ఈ క్రమంలో నీనా పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు కూడా. ఇక బాలీవుడ్లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నీనా గుప్తా.. ఇటీవలే తన ఆటోబయోగ్రఫీ ‘సచ్ కహూ తో’ను విడుదల చేశారు. తన జీవితంలోని ముఖ్య విషయాలన్నింటినీ ఇందులో లిఖించుకున్న ఆమె.. తన ప్రియమైన వ్యక్తులకు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలోని గుల్జార్ నివాసంలో ఆయనను కలిసిన నీనా గుప్తా.. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాలో షేర్ చేశారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గేటు బయటే గుల్జార్ను కలిసిన ఆమె.. ‘‘ చదివి ఎలా ఉందో చెప్పండి.. నిజం చెప్పాలంటే ఆయన సంతోషించారు.. అలాగే భయపడ్డారు కూడా’’ అంటూ సరదా క్యాప్షన్ జతచేశారు. అందుకే నాపై ఆయన అరిచారు.. తన ఆటోబయోగ్రఫీలో ఎన్నెన్నో విషయాలు వెల్లడించిన నీనా గుప్తా.. దర్శకుడు సుభాష్ ఘాయ్పై ప్రశంసలు కురిపించారు. ఖల్నాయక్ సినిమాలో చోళీ కే పీచే క్యా హై పాట కోసం.. నిండుగా కనిపించాలంటూ అరిచిన విధానాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘‘నా అవుట్ఫిట్ చూసి ఆయన పెద్దగా అరిచారు. పాట అర్థానికి తగ్గట్టుగా వక్షస్థలం నిండుగా కనిపించేలా చూసుకోమని సూచించారు. ఆ మాట వినగానే నాకు ఏదోలా అనిపించింది. కానీ ఆలోచిస్తే నిజమే కదా.. అనిపించింది. మరుసటి రోజు.. లోదుస్తులతో ఆ ఖాళీని పూడ్చి షూట్కు వెళ్లాను. చిన్న విషయాన్ని కూడా ఆయన పట్టించుకుంటారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. అందుకే గొప్ప డైరెక్టర్ గుర్తింపు పొందారు’’ అని రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Neena Gupta (@neena_gupta) చదవండి: సౌత్ నిర్మాత రాత్రంతా గదిలో ఉండమన్నాడు : నటి -
సౌత్ నిర్మాత రాత్రంతా గదిలో ఉండమన్నాడు : నటి
బాలీవుడ్ నటి నీనా గుప్తా తన బయోగ్రఫీ 'సచ్ కహున్ తో'లో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. పెళ్లి, విడాకులు, పెళ్లికి ముందే గర్భం దాల్చడం, కెరీర్లో ఆటంకాలు, ఒంటరి తల్లిగా తాను ఎదుర్కొన్న చీదరింపులు, సమస్యల సుడిగుండాలు, వాటిని ఎదుర్కొన్న తీరు.. ఇలా అన్నింటినీ ఏకరువు పెట్టింది. అలాగే ఇండస్ట్రీలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్కు గురయ్యానని సంచలన విషయాన్ని బయటపెట్టింది. దక్షిణాది చిత్రాల నిర్మాత ఒకరు నన్ను హోటల్కు ఆహ్వానించారు. అది ముంబైలోని పృథ్వీ థియేటర్కు దగ్గర్లోనే ఉంటుంది. అప్పటికే షూటింగ్లో ఉన్న నేను ఆరోజు షెడ్యూల్ పూర్తవగానే నిర్మాతకు ఫోన్ చేశాను. అతడు తన గదిలోకి రమ్మని పిలిచాడు. నా మనసెందుకో కీడు శంకించింది. మీరే లాబీలోకి రావచ్చు కదా అని అడిగాను. ఆయన ఒప్పుకోలేదు. దీంతో నేనే మెట్లెక్కుతూ పైన అతడి గదిలోకి వెళ్లాను. అక్కడ సోఫాలో కూర్చోగానే అతడు ఉపన్యాసం ప్రారంభించాడు' 'ఎంతోమంది తారలను దక్షిణాది ఇండస్ట్రీకి పరిచయం చేశానని బీరాలు పలికాడు. నాకో మంచి పాత్ర ఇవ్వబోతున్నా అంటూ ఆ పాత్ర వివరాలు చెప్పాడు. కానీ అది చాలా చిన్న పాత్ర అని అర్థమై నిరాసక్తిగా అక్కడి నుంచి వెళ్లిపోతాను అని చెప్పాను. దీంతో అతడు అదేంటి? ఈరోజు రాత్రికి నాతో ఉండవా? అని అడిగాడు. ఆ మాట వినగానే బకెట్ ఐస్ వాటర్ నా నెత్తిన గుమ్మరించినట్లనిపించింది. నా రక్తం గడ్డకట్టుకుపోయింది. ఇంతలో అతడు నా బ్యాగు తీసుకుని చేతిలో పెడుతూ బిందులో బలవంతం ఏమీ లేదు.. అని చెప్పాడు. వెంటనే పరుగు లంకించుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాను' అని నీనా చెప్పుకొచ్చింది. చదవండి: గర్భవతిగా ఉన్నా పెళ్లి చేసుకుంటానన్నాడు: నటి ‘రామాయణ్’ ఫేమ్ చంద్రశేఖర్ కన్నుమూత -
గర్భవతిగా ఉన్నా పెళ్లి చేసుకుంటానన్నాడు: నటి
బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె జీవితం సినిమా స్టోరీకి తీసిపోదు. తెరమీద ఎంత అందంగా వెలిగిపోయారో.. నిజ జీవితంలో అంతకు మించిన ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. సింగిల్ పేరెంట్స్ని ఇప్పటికి వింతగా చూస్తారు మన సమాజంలో. అలాంటిది ఆమె 90లలోనే సింగిల్ పేరెంట్గా మారారు. మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్తో సహజీవనం చేశారు. ఇక ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో అతడి నుంచి విడిపోయారు. ఆ తర్వాత మసాబాకు జన్మనివ్వడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. ఈ క్రమంలో నీనా గుప్తా తన ఆత్మకథ ‘సచ్ కహున్ తో’లో తాను గర్భవతిగా ఉన్నప్పుడు జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి తెలిపారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...‘‘గర్భవతిగా ఉన్నప్పుడు ఒకసారి నా స్నేహితుడు సతీష్ కౌశిక్ నా దగ్గరకు వచ్చాడు. ‘‘దీని గురించి ఏం బాధపడకు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పుట్టబోయే బిడ్డ మన బిడ్డ అవుతుంది. తను నీలా తెల్లగా పుడితే ఇబ్బంది లేదు. అలా కాకుండా డార్క్ కలర్లో ఉంటే.. నా పోలిక అని చెప్పవచ్చు. అప్పుడు ఎవరు అనుమానించరు’’ అన్నాడు’’ అని చెప్పుకొచ్చారు నీనా గుప్తా. సతీష్ కౌశిక్, నీనా గుప్తా ఇద్దరు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రోజుల నుంచి స్నేహితులు. అయితే సతీష్ ప్రతిపాదనను తిరస్కరించారు నీనా. ఆ తర్వాత 2008లో నీనా గుప్తా ఢిల్లీకి చెందిన అకౌంటెంట్ వివేక్ మెహ్రాను వివాహం చేసుకున్నారు. తనకు వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక అంశాలను తన బయోగ్రఫీలో వెల్లడించారు నీనా గుప్తా. ఇక పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనివ్వడంతో ఇండస్ట్రీ తనను చెడుగా చూసేదని చెప్పారు. ఆ ప్రభావం తన కెరీర్ మీద కూడా పడిందని వివరించారు. ఫలితంగా తనకు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఇచ్చేవారని వెల్లడించారు. 2018 నుంచి తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టారు. ఆ తర్వాత బదాయి హో, వీరి దే వెడ్డింగ్ ముల్క్ వంటి చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆమె చేతి నిండా ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు నీనా గుప్తా. చదవండి: నిజం చెప్పాలంటే.. -
పాచిపని అయినా చేద్దామనుకున్నా: నటి
కూతురిని ప్రయోజకురాలిని చేసి సింగిల్ మదర్గా జీవించగలనని నిరూపించింది బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా. అయితే ఇందుకు తన తల్లే కారణమంటోంది. స్వతంత్రంగా ఎలా బతకగలమనేది తల్లి నుంచే నేర్చుకున్నాననంటోంది. తనను పెంచి పెద్ద చేయడానికి పాచిపని చేసేందుకైనా సిద్ధపడ్డాను కానీ ఎవరినీ సాయం కోసం చేయి చాచి అడగలేదని చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో నీనా గుప్తా మాట్లాడుతూ.. 'నేను ఎవరి మీదా ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాను. అది డబ్బు విషయమే కావచ్చు, మరేదైనా కావచ్చు. పొట్టకూటి కోసం ఏ పని చేసినా అందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదన్న విషయాన్ని నా తల్లి దగ్గర నేర్చుకున్నాను. ఇళ్లు ఊడ్వడం, అంట్లు తోమడం సహా ఎలాంటి పనులు అయినా చేస్తాను కానీ ఎవరి దగ్గరా పైసా అడగకూడదనుకున్నా. ఆఖరికి నా కుటుంబం, స్నేహితుల దగ్గర నుంచి కూడా ఎప్పుడూ ఆర్థిక సాయం కోరలేదు' అని చెప్పుకొచ్చింది. నీనా కూతురు మసాబా గుప్తా ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. నీనా సినిమాల విషయానికి వస్తే.. అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'గుడ్బై' సినిమాలో నటిస్తోంది. ఆమె చివరగా నటించిన 'సర్దార్ కా గ్రాండ్సన్' మూవీ ఇటీవలే నెట్ఫ్లిక్స్లో రిలీజైంది. చదవండి: సర్దార్ కా గ్రాండ్సన్ రివ్యూ: నానమ్మ కోరికను హీరో నెరవేరుస్తాడా? -
Sardar Ka Grandson: ‘సర్దార్ కా గ్రాండ్సన్’ మూవీ రివ్యూ
పిల్లలు ఉన్న చోట పెద్దలు ఉండక తప్పదు. కాని ఆ పెద్దలకు ఒక బాల్యం ఉంటుంది. బతికిన ఒక ఊరు ఉంటుంది. ఏదో ఒక స్థలంతో, ఆవాసంతో బంధం ఉంటుంది. తమ చివరి రోజుల్లో వాటిని ఒకసారి చూసుకోవాలని వారికి ఉంటుంది. పిల్లలకు అది పట్టదు. కాని వారిని అర్థం చేసుకుంటే ఆ కోరిక నెరవేరుస్తే వారు పొందే ఆనందం చాలా విలువైనది. ‘సర్దార్ కా గ్రాండ్సన్’లో ఒక నానమ్మ చివరి సందర్శనను మనవడు నెరవేరుస్తాడు. ఆదివారం సినిమా పరిచయం. వృద్ధాప్యంలో జ్ఞాపకం పెద్ద ఊతంగా ఉంటుంది. గతం ఒక ఓదార్పుగా ఉంటుంది. ఎన్నో చేదు అనుభవాలు కూడా వాటిలో ఉంటాయి. కాని వాటి గాఢత, ఆ సందర్భాలను దాటి రావడం వల్ల పూర్తిగా తగ్గి, ఆ అనుభవాల పునఃసందర్శనకు కూడా శక్తి ఉంటుంది. ఇక మంచి జ్ఞాపకాలనైతే వెతుక్కుంటూ వెళ్లాలని ఉంటుంది. వృద్ధాప్యంలో ఉన్నవారి మనసుల్లో ఏం కోరిక ఉందో పిల్లలకు పెద్దగా పట్టదు. వారిని బాగా చూసుకుంటున్నాం కదా అనుకుంటారు. మహా అయితే పుణ్యక్షేత్రాలకు తీసుకువెళతారు. కాని ఇవాళ్టి వృద్ధులు ఒకప్పటి యవ్వనవంతులు, యువతీ యువకులు, భార్యాభర్తలు, ఉద్యోగులు, సంసారులు. వారి జీవనంతో పెనవేసుకున్న విషయాలు ఎన్నో ఉంటాయి. వాటిలో కొన్నింటిని వారు ఆఖరిశ్వాస వరకూ పూర్తిగా అంటి పెట్టుకుని ఉంటారు. తాము పోయేలోపు ఆ ఫలానా స్థలాన్నో, వ్యక్తినో, ఊరినో తిరిగి చూడాలనుకుంటారు. ఆ కోరిక తీరిస్తే వారికి కలిగే ఆనందం అనంతం. ‘సర్దార్ కా గ్రాండ్’ ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైన సినిమా. అమృత్సర్లో స్థిరపడిన శ్రీమంతురాలైన 90 ఏళ్ల వృద్ధురాలి కథ అది. ఆమె పిల్లలు బాగా స్థిరపడ్డారు. ఆమె కూడా ఇక హాయిగా చివరి శ్వాస తీసుకోవచ్చు. కాని ఆమె మనసులో ఒక కోరిక. తాను మరణించేలోపు తను ఇష్టపడి కట్టుకున్న ఇంటిని చూడాలనేది. అదేం పెద్ద కోరిక అనుకోవచ్చు. కాని ఆ ఇల్లు లాహోర్లో ఉంది. దేశ విభజన సమయంలో దానిని ఆమె విడిచి వచ్చేసింది. అక్కడ ఉండగా భర్తతో ఎంతో ఇష్టపడి ఆ ఇంటిని కట్టుకుంది. అందులోనే తొలి బిడ్డకు జన్మనిచ్చింది. అందులోనే నాటి అల్లర్లలో భర్త ప్రాణం విడిచాడు. ఆ ఇంటిని చూసుకోవాలని ఉంటుంది. కాని ఆమె ఆరోగ్యరీత్యా వేరే కారణాల రీత్యా ఎవరూ ఆ కోరికను మన్నించరు. కాని ఆమె మనవడు ఆమె కోరికను అర్థం చేసుకుంటాడు. దానిని నెరవేర్చాలనుకుంటాడు. అక్కడే సమస్య వస్తుంది. ఇంటినే కదిలించి అమృత్సర్లో ఉన్నవారు పాకిస్తాన్కు వెళ్లిరావడం పెద్ద సమస్య కాదు. కాని మనవడికి వీసా వస్తుంది కాని నానమ్మకు రాదు. దానికి కారణం గతంలో ఒక క్రికెట్ మేచ్లో ఆమె చేసిన అల్లరే కారణం. అందుకని మనవడు లాహోర్ వెళతాడు. ఏ ఇంటికైతే తన నానమ్మ రాలేదో ఆ ఇంటినే అమృత్సర్కు తీసుకువస్తాడు. అంటే దానిని పునాదులతో సహా పెకలించి ట్రక్కు మీద పెట్టి అమృత్సర్ తీసుకువస్తాడు. అయితే అదంత సులువు కాదు. దాని కోసం అతడు ఏమేమి తిప్పలు పడ్డాడనేది కథ. కొంచెం హాస్యం, కొంచెం సెంటిమెంట్తో సినిమా మొదటి పదిహేను నిమిషాలు స్లోగా ఉన్నా తర్వాత అందుకుంటుంది. నీనా గుప్తా సర్వమై ఈ సినిమా గత నెల విడుదలైంది. ఆశించినంత స్పందన రాలేదు. దానికి కారణం ఈ స్క్రిప్ట్ ఇంకా బాగుండొచ్చు. అయితే ఈ సినిమా ఒకసారి చూసేంతగా ఆకట్టుకోవడానికి కారణం వృద్ధురాలిగా నటించిన నీనా గుప్తా నటన. ఆమె మన మనసులోని భావాలను, నాటి అనుభవాల గాఢతను తెర మీద వ్యక్తం చేయడంలో గొప్ప నటన చూపించింది. ఈ సినిమా చూసినంత సేపు మన ఇంట్లో నానమ్మో, తాతయ్యో, ఇరువురో ఉంటే ‘మీకేం కావాలి... మీరేం చూడాలనుకుంటున్నారు... మీరెవరిని కలవాలనుకుంటున్నారు’ అని అడిగేలా ఉంటుంది. మిగిలిన పాత్రల్లో అర్జున్ కపూర్, రకుల్ప్రీత్ సింగ్ నటించారు. లాహోర్ ఫ్లాష్బ్యాక్లో జాన్ అబ్రహామ్, అదితి రావ్ హైదరీ మెప్పిస్తారు. జాన్ అబ్రహామ్ దీని నిర్మాత. -
అమ్మ ఆత్మకథ కలిచివేసింది: మసాబా
ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ నీనా గుప్తాది విభిన్నమైన వ్యక్తిత్వం. తన జీవితానికి సంబంధించిన విషయాలను ఎలాంటి సంకోచం లేకుండా వెల్లడించేవారు. నీనా గుప్తా మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్తో సహజీవనం చేయడం.. మసాబాకు జన్మనివ్వడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. కాగా నీనా ఆటో బయోగ్రఫీలోని ఓ ఆసక్తికర విషయాన్ని ఆమె కూతురు, ఫ్యాషన్ డిజైనర్ మసాబా తాజాగా ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. రిచర్డ్స్తో విడిపోయాక.. మసాబా జన్మించే సమయానికి తన దగ్గర కేవలం 2000 రూపాయలు మాత్రమే ఉన్నాయని, దీంతో తాను సాధారణ ప్రసవం కోసం చూసినట్లు నీనా తన ఆత్మకథలో రాసుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇప్పుడు తాజాగా మసాబా షేర్ చేస్తూ తన తల్లి ఆత్మకథ చదివానని, దానిని నుంచి చాలా విషయాలను నేర్చుకున్నానంటూ భావోద్యేగానికి లోనయ్యింది. బుక్లోని ఈ పేజీని షేర్ చేస్తూ.. ‘అమ్మ నీనా గుప్తా ఆత్మకథ ‘సచ్ కహున్ తో’లో.. మా అమ్మ నాకు జన్మనిచ్చే సమయంలో తన వద్ద కేవలం బ్యాంకు ఖాతాలో కేవలం రూ. 2 వేలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఆమె సాధారణ డెలివరి కావాలని కోరుకుంది. ఎందుకంటే అప్పుడు ఆపరేషన్ అంటే 10 వేల రూపాయలు కావాలని. లక్కీగా సమయానికి ట్యాక్స్ రీయింబర్స్మెంట్ పెరగడంతో తన ఖాతాలో 9 వేలు జమ అయ్యాయి. చివరకు తన డెలివరి సమయానికి బ్యాంకులో 12 వేల రూపాయలు అయ్యాయి. ఇప్పుడు నేను సీ-సెక్షన్ శిశువు. తన ఆత్మకథ చదివి చాలా విషయాలు నేర్చుకున్నాను. తను నన్ను ఈ భూమి మీదకు తీసుకువచ్చేందుకు ఎంతటి కష్టాలు భరించిందో తెలుసుకున్నాను. ఆ సంఘటన నన్ను కలిచివేసింది. అందుకే నా జీవితంలో ప్రతి రోజు.. ప్రతి క్షణం ఆమె రుణం తీర్చుకునేందుకే కష్టపడతాను’ అంటూ మసాబా రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Masaba (@masabagupta) -
చుక్కలు చూపిస్తున్న కరోనా.. అక్కడికి వెళ్లిపోయిన నటి
కరోనా వచ్చిన పేషెంట్ ఇంట్లో ఉంటే ఒక విడి గది ఇచ్చే వీలు లేని సామాన్యులు కోట్లాదిమంది ఉన్నారు. అదే సమయంలో కరోనా నుంచి రక్షించుకోవడానికి నగరాలకు దూరంగా వెళ్లే సెలబ్రిటీలు ఉన్నారు. కరోనా వార్తలు గత సంవత్సరం వచ్చిన వెంటనే నటి నీనా గుప్తా నైనిటాల్కు సమీపంగా ఉండే ముక్తేశ్వర్లోని తన విడిది గృహానికి షిఫ్ట్ అయ్యింది. అక్కడే ఉండి తగ్గాక వచ్చింది. ఇప్పుడు మళ్లీ కరోనా ఉధృతం కాగానే ఆమె ముక్తేశ్వర్లో ప్రత్యక్షమయ్యారు. కరోనా సెకండ్ వేవ్ బాలీవుడ్కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా విలన్ అశుతోష్ రాణాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంకా ఎంతమందికి రానుందో తెలియదు. ముంబై ఏమాత్రం సేఫ్ కాదని తెలిసిన చాలామంది ఫామ్హౌస్ల బాట పట్టారు. నటుడు సల్మాన్ ఖాన్ గత సంవత్సరం నుంచి దాదాపుగా తన పాన్వెల్ ఫామ్హౌస్లోనే ఉంటున్నారు. కరోనా నుంచి రక్షణ పొందడానికి నటి నీనా గుప్తా కూడా గత సంవత్సరం ముక్తేశ్వర్ లో ఉన్న తన విడిదింటికి వెళ్లిపోయారు. అక్కడే ఏడెనిమిది నెలలు ఉన్నారు. ఆ తర్వాత ముంబైకి తిరిగి వచ్చినా ప్రస్తుత పరిస్థితి దృష్టా మళ్లీ ముక్తేశ్వర్ చేరుకున్నారు. ముక్తేశ్వర్ నైనిటాల్కు సమీపంగా ఉండే గొప్ప టూరిస్ట్ స్పాట్. ప్రశాంతంగా ఉండే పర్వత ప్రాంతం. ‘ఇక్కడి ప్రజలు, వాతావరణం ప్రశాంతంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఉతికిన గుడ్డలను బయట ఆరవేయడం వారికి నచ్చదు. బట్టలు బాగా ఎండకు ఆరితే తప్ప నాకు అవి ఆరినట్టుగా అనిపించదు. అయినా బట్టలు ఉతికి ఆరేస్తేనే కదా అది ఇల్లు అనే భావన వస్తుంది’ అని నీనా గుప్తా ముక్తేశ్వర్లో తన విడిదింటి నుంచి తాజా వీడియోలో పేర్కొంది. నీనా గుప్తా కుమార్తె మసాబా ఫ్యాషన్ రంగంలో పని చేస్తోంది. తల్లీకూతుళ్లు కలిసి నటిస్తున్నారు కూడా. అయినా ఆ పనులకు బ్రేక్ ఇచ్చి సురక్షితంగా ఉండాలి అని నీనా భావిస్తున్నందుకు ఆమెను అభినందించాలి. ఆమె స్టే బాగా గడవాలని కోరుకుందాం. చదవండి: అమితాబ్కి భార్యగా..'నా కల నెరవేరింది' ఆసక్తికర విషయాలు వెల్లడించిన నీనా గుప్తా -
ఒంటరి తల్లులకు భరోసా ఏదీ?
‘నేను కేవలం స్త్రీని. నాకు పురుషుని తోడు అన్ని వేళలా అవసరం అని స్త్రీ అనుకుంటూ ఉంటే కనుక ఆమెకు స్వయం జీవనం కల్పించడంలో వ్యవస్థ విఫలమైనట్టే. ప్రభుత్వ పథకాలు స్త్రీలకు ముఖ్యం గా ఒంటరి స్త్రీలకు లేదా ఒంటరి తల్లులకు తగిన భరోసా కల్పించడంలో విఫలమైనట్టే’ అని మొన్న శనివారం కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. దత్తత ఇచ్చిన తన బిడ్డను తిరిగి వెనక్కు తెచ్చుకోవడానికి ఒక మహిళ హైకోర్టును ఆశ్రయించగా ఆమె వాదనల సమయంలో న్యాయమూర్తులు ముహమ్మద్ ముష్టాక్, కౌసర్ ఎడప్పగత్ ఈ వ్యాఖ్య చేశారు. కేసు ఏమిటి? కేరళలో ఒక మహిళ తన సహచరునితో లివ్ - ఇన్ రిలేషన్లో ఉండేది. దానివల్ల వారికి సంతానం కలిగింది. అయితే ఆ తర్వాత వాళ్లు విడిపోయారు. ఆ సంతానం తల్లి దగ్గర ఉండిపోయింది. ఒంటరి తల్లిగా బిడ్డను పెంచడం ఈ సంఘంలో చాలా పెద్ద సవాలు అని భావించిన ఆ తల్లి ఆ బిడ్డను దత్తతకు ఇచ్చేసింది. ఇప్పుడు ఆ తండ్రి తిరిగి వచ్చాడు. వారు మళ్లీ కలిసి జీవించదలిచి దత్తత ఇచ్చిన బిడ్డ కోసం కోర్టు మెట్లెక్కారు. ఆ కేసు వాదనలు వింటూ న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యానం చేశారు. ఇంత ఆందోళన ఎందుకు? ‘తన బిడ్డను దత్తత ఇచ్చే ముందు ఆ తల్లి ఒక సామాజిక కార్యకర్తతో చేసిన చాట్స్ చూశాం. అందులో ఆమె ఎంత ఒత్తిడికి లోనయ్యిందో తెలుస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా ఏ మద్దతు ఒంటరి తల్లులకు లభించదని, కనుక బిడ్డను పెంచలేనని ఆ తల్లి భావించింది. జన్మనిచ్చిన బిడ్డను దత్తత ఇచ్చేసింది. ఈ విధంగా చూసినట్టయితే ఒక ఒంటరి తల్లి ధైర్యంగా బతికేలా చేయడంలో ఈ వ్యవస్థ విఫలమైనట్టే. ప్రభుత్వం సింగిల్ మదర్స్ కోసం ఏం ఆలోచనలు చేస్తున్నట్టు? వారు ఆర్థికంగా, సామాజికంగా తగిన గౌరవంతో బతకడానికి ఎటువంటి చైతన్యం కలిగిస్తున్నట్టు’ అని కోర్టు అంది. మగతోడు లేకుండా బతకలేమా? అయితే ఒక రకంగా చూస్తే ఇది ‘మధ్యతరగతి’ సమస్యా? అనిపిస్తుంది. ఆర్థికంగా దిగువ వర్గాల్లో ఒంటరి తల్లులు ధైర్యంగా బతకడం చూడొచ్చు. సంపన్న వర్గాల్లో పెళ్లిని నిరాకరించి మరీ సింగిల్ మదర్స్ అవుతున్నవారు ఉన్నారు. అందరికీ తెలిసిన ఉదాహరణలు ఏక్తా కపూర్, సుస్మితాసేన్. దీనికి చాలా ఏళ్ల ముందు సింగిల్ మదర్గా తాను జీవించగలనని నీనా గుప్తా నిరూపించింది. మరోవైపు దిగువ వర్గాల్లోగాని, ఉన్నత వర్గాల్లో కాని విడాకులు ఒక సమంజసమైన పరిష్కారంగా భావించి విడిపోయే జంటలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత పిల్లలతో మిగిలిన తల్లులు ధైర్యంగా బతకడం కనిపిస్తూనే ఉంటుంది. ఎటొచ్చి మధ్యతరగతి మర్యాదలలో ‘మగతోడు’ ఒక తప్పనిసరి సాంఘిక చిహ్నంగా, భద్రతగా, రక్షణగా భావించే పరిస్థితితులు ఉన్నాయి. మధ్యతరగతి సమాజం లిఖించుకున్న విలువలు చాలామటుకు స్త్రీని ప్రశ్నించే, నిలదీసే, సరిదిద్దడానికే ప్రయత్నించేలా ఉంటాయి. అందుకే విడాకులకు వెరచి గృహహింసను భరించే స్త్రీలు, ఒంటరి స్త్రీలుగా ఉంటూ పిల్లలను పెంచడానికి భయపడే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. చుట్టూ సవాళ్లు ఒకసారి భర్తతో లేదా సహజీవనం నుంచి విడిపోయాక స్త్రీలు ఒంటరిగా జీవించడానికే ఇష్టపడి తమ పిల్లలను ఒంటరిగానే పెంచుకుందామని అనుకున్నా వారికి సవాళ్లు చాలానే ఉంటాయి. ముఖ్యంగా వీరికి అద్దెకు ఇళ్లు దొరకడం ఒక సమస్య. ఇంటిపని, సంపాదన చూస్తూ పిల్లల అవసరాల గురించి సమయం పెట్టాలంటే వీలు కాదు. నమ్మకమైన బేబి సిట్టర్స్ దొరకడం ఒక సమస్య. సమాజం నుంచి మద్దతు దొరకదు. ఆర్థిక ఆలంబన ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఏమీ అందదు. మరో పెళ్లి చేసుకోమని సమాజం నుంచి వచ్చే వొత్తిడి. అవకాశంగా తీసుకుని అడ్వాన్స్ అయ్యే పురుషులతో సమస్య. ఇన్ని సమస్యలు ఉన్నాయి. అందుకే బహుశా ఆ కేరళ తల్లి తన బిడ్డను దత్తతకు ఇచ్చి ఉండవచ్చు. కోర్టు ఈ వ్యాఖ్యానాలు చేయడం వెనుక ఈ నేపథ్యం అంతా ఉంది. సమాజంలో చట్ట పరిధికి లోబడి తమకు నచ్చిన రీతిలో బతికే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. సింగిల్ మదర్గా ఎవరైనా జీవించదలిస్తే వారిని సమాజం లో భాగంగా చేసుకోవడం. గౌరవించడం, మద్దతు గా నిలవడం చేయవలసిన వ్యవస్థ సంపూర్ణంగా తయారు కాలేదని కేరళ ఉదంతం తెలియచేస్తోంది. - సాక్షి ఫ్యామిలీ -
అమితాబ్కి భార్యగా..'నా కల నెరవేరింది'
‘‘నా కల నెరవేరింది. ఎంతో ఉద్వేగంగా ఉంది. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను’’ అంటున్నారు నటి నీనా గుప్తా. ఈ ఉద్వేగానికి, ఆనందానికి కారణం అమితాబ్ బచ్చన్ సరసన నటించే అవకాశం ఆమెకు దక్కడమే. తొలిసారి బచ్చన్తో నీనా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సినిమా ‘గుడ్ బై’. ఇందులో అమితాబ్ భార్యగా నటిస్తున్నారామె. వీరి కూతురిగా రష్మికా మందన్నా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి నీనా గుప్తా మాట్లాడుతూ – ‘‘దర్శకుడు వికాశ్ బహల్ ఈ కథ గురించి చెప్పినప్పుడు థ్రిల్ అయ్యాను. అంత అద్భుతంగా ఉంది. నా పాత్రను బాగా రాశారు. మంచి కథ, అమితాబ్తో నటించాలనే నా కల నెరవేర్చిన చిత్రంగా ‘గుడ్ బై’కి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంటుంది’’ అన్నారు. ఇదిలా ఉంటే.. నీనా గుప్తా నటించిన ‘బధాయీ హో’ (2018)ని అమితాబ్ చూశారు. చూడడమే కాదు.. ‘అద్భుతంగా నటించావ్ నీనా..’ అంటూ స్వహస్తాలతో ఓ లేఖ రాసి, ఆమెకు పంపారు కూడా! బిగ్ బి ప్రశంసలు అందుకున్న నీనా చాలా ఆనందపడ్డారు. ఇప్పుడు ఆయన సరసన నటిస్తున్నందుకు డబుల్ ఆనందంలో ఉన్నారు. -
క్రిస్మస్ రోజు నేను చనిపోయాననుకుంది
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, నటి మసాబా చేసిన పనికి ఆమె తల్లి, సీనియర్ నటి నీనా గుప్తాకు ఒక్క క్షణం గుండాగినంత పనైందట. ఇంతకీ ఆమె ఏం చేసిందనుకుంటున్నారు.. మరేం లేదు. పండగ పూట త్వరగా నిద్ర లేవాల్సింది పోయి బారెడు పొద్దెక్కినా ఆదమరిచి నిద్రపోయారట. దీంతో మసాబా చనిపోయిందా? ఏంటని ఆమె తల్లికి చెమటలు పట్టాయట. ఈ విషయాన్ని మసాబా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వెల్లడించారు. "శుభోదయం నీనాజీ. నాకసలు ఆలస్యంగా నిద్ర లేచే అలవాటే లేదు. కానీ క్రిస్మస్ రోజు ఆలస్యంగా తొమ్మిదిన్నర వరకు నిద్ర లేవలేదు. దీంతో భయపడిపోయిన అమ్మ నేను బతికున్నానా? లేదా? అని నా దగ్గరకు వచ్చి చెక్ చేసింది" అని చెప్పుకొచ్చారు. ఈ మేరకు నీనా తన ఫోన్ను పట్టుకున్న ఫొటోను షేర్ చేశారు. అమ్మ కంగారును పోగొట్టేందుకు మసాబా త్వరగా రెడీ అయి పండగ వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం అభిమానులతో పంచుకున్నారు. అయితే సత్యదీప్ మిశ్రాను మిస్ అవుతున్నానని బాధ పడ్డారు. కాగా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్, నీనా గుప్తాల కూతురైన మసాబా నెట్ఫ్లిక్స్ సిరీస్ 'మసాబా మసాబా'తో నటనా రంగంలోకి అడుగు పెట్టారు. ఇందులో తల్లి నీనాతో కలిసి నటించారు. (చదవండి: ఈసారి ఫుల్ మీల్స్) మసాబా వ్యక్తిగత విషయానికి వస్తే.. 2015లో ప్రముఖ ఫిల్మ్ మేకర్ మధు మంతెనను ఆమె పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువకాలం నిలవలేదు. ఈ నేపథ్యంలో తామిద్దరం విడిపోతున్నామంటూ మధు, మసాబా 2018లో ప్రకటన విడుదల చేశారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం ఆమె నటుడు సత్యదీప్ మిశ్రాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సత్యదీప్, మసాబా ఆ మధ్య ఇన్స్టాలో షేర్ చేసిన ఫొటోలు ఈ వదంతులకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇక సత్యదీప్ సైతం తన భార్య, ప్రముఖ హీరోయిన్ అదితీ రావ్ హైదరీ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. 2009లో ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట 2013లో తమ బంధానికి స్వస్తి పలికారు. (చదవండి: విడాకులు: మళ్లీ ప్రేమలో పడిన నటుడు!) -
మా ఆత్మకథ చెబుతాం
ఎవరో రాసిన కథల్లో, ఎవరో సృష్టించిన పాత్రలకు, ఇంకెవరో రాసిన డైలాగులు చెబుతుంటారు యాక్టర్స్. మంచి కథల్ని స్క్రీన్ మీదకు తీసుకొస్తారు. మంచి పాత్రల్ని మర్చిపోకుండా చేస్తారు. కానీ అవేవీ వాళ్లు కాదు. అది కేవలం స్క్రీన్ మీద చేసిన నటనే. స్క్రీన్ వెనక వాళ్లదైన కథ ఒకటుంటుంది. అది చాలామందికి తెలియదు. ఆ కథను చెప్పబోతున్నాం అంటున్నారు కొందరు స్టార్స్. వాళ్ల కథను చెప్పడానికి రెడీ అయిపోయారు. వాళ్ల ఆత్మకథను చెబుతారట. ప్రస్తుతం ఆత్మకథలు రాసుకుంటున్న స్టార్స్ విశేషాలివి. ఇంకా పూర్తవలేదు బాలీవుడ్ సూపర్స్టార్ నుంచి హాలీవుడ్ హీరోయిన్గా ఎదిగారు ప్రియాంకా చోప్రా. హాలీవుడ్లోనూ వరుస సినిమాలు చేస్తూ భారతీయ ఖ్యాతిని పెంచుతున్నారు. ఇప్పుడు ప్రియాంక జీవితాన్ని పుస్తకరూపంలో ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారామె. తన జీవిత కథతో ‘అన్ఫినిష్డ్’ (ఇంకా పూర్తవలేదు) పేరుతో ఓ పుస్తకాన్ని రాశారామె. ఇందులో తన బాల్యం, హీరోయిన్గా మారడం, బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి షిఫ్ట్ అయ్యే విశేషాలు అన్నీ చర్చించారట. ఈ పుస్తకం వచ్చే ఏడాది జనవరి 19న విడుదల కానుంది. రక్షకుడిని కాదు లాక్డౌన్ సమయంలో ఎందరో వలస కార్మికుల పాలిట ఆపద్బాంధవుడు అయ్యారు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. అందర్నీ సురక్షితంగా తమ ప్రాంతాలకు పంపే బాధ్యతను నవ్వుతూ భుజాన వేసుకున్నారు. లాక్డౌన్ సమయంలో జరిగిన కథను పుస్తకరూపంలో తీసుకొస్తున్నారు సోనూ సూద్. ‘ఐయామ్ నో మెసయ్య’ (నేను రక్షకుడిని కాదు) పేరుతో ఈ పుస్తకం విడుదల కాబోతోంది. ‘ఇలా సహాయం చేసే బాధ్యతను నాకు కలిగించినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది నా కథ కాదు.. వలస కార్మికుల కథ కూడా’ అన్నారు సోనూ సూద్. ఈ పుస్తకం డిసెంబర్లో మార్కెట్లోకి వస్తుంది. రాయాలనిపించింది రాస్తున్నా! బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా కూడా తన ఆత్మకథను రాస్తున్నారు. లాక్డౌన్లో అందరూ ఇళ్లలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆత్మకథ రాయాలనే ఆలోచన వచ్చిందట ఆమెకు. లాక్డౌన్ సమయాన్ని మొత్తం ఈ పుస్తకం రాస్తూ గడిపారట. ‘మీ జీవితకథను పుస్తకరూపంలో ఎందుకు తీసుకురాకూడదు? అని చాలా మంది అడిగేవారు. నేనంత ఎక్స్ట్రార్డినరీగా ఏమీ చేయలేదే అనుకుంటూ ఉండేదాన్ని. కానీ వీలు దొరికింది.. రాసేశాను. కొన్ని నెలల్లో నా కథ బయటకు రాబోతోంది. నచ్చితే చదవండి. బోర్ అనిపిస్తే పక్కన పెట్టేయండి’ అని అన్నారు నీనా గుప్తా. ఆమె ఆత్మకథ పేరు ‘సచ్ కహూ తో’ (నిజం చెప్పాలంటే). వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ పుస్తకం మార్కెట్లోకి రానుంది. గుర్తుగా ఉంటుందని.. ‘జీవితం ఎప్పుడూ పరిగెడుతూ ఉంటుంది. కొన్ని విషయాల్ని రికార్డ్ చేసుకుంటే ఎప్పుడైనా తిరిగి చూసుకోవడానికి బావుంటుంది. అందుకే ఆటోబయోగ్రఫీ రాస్తున్నాను’ అంటున్నారు సైఫ్ అలీఖాన్. ఆత్మకథ రాస్తున్నాను అని ఇటీవలే ప్రకటించారు సైఫ్. యాక్టర్గా ఎలా మారారు, ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, తన కుటుంబం.. ఇలా ప్రతి విషయాన్నీ ఈ పుస్తకంలో ప్రస్తావించాలనుకుంటున్నారట. ఈ పుస్తకం వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. -
నా పెళ్లి గురించి మసాబా ఏమన్నదంటే..
ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ నీనా గుప్తాది విభిన్నమైన వ్యక్తిత్వం. తన జీవితానికి సంబంధించిన విషయాలను ఎలాంటి సంకోచం లేకుండా వెల్లడిస్తారు. యాభైలలో నీనా గుప్తా మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్తో సహజీవనం చేయడం.. మసాబాకు జన్మనివ్వడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. రిచర్డ్స్తో విడిపోయిన తర్వాత 2008లో నీనా గుప్తా ఢిల్లీకి చెందిన వివేక్ మెహ్రాను వివాహం చేసుకున్నారు. అప్పుడు మసాబాకు 19 సంవత్సరాలు. అయితే వివేక్ను వివాహం చేసుకోవాలనుకుంటున్న విషయం గురించి మసాబాతో చెప్పినప్పుడు తాను ఎలా స్పందించింది అనే విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు నీనా గుప్తా. (చదవండి: విడాకుల విషయం విని కుప్పకూలిపోయా..) ఈ సందర్భంగా నీనా గుప్తా మాట్లాడుతూ.. ‘వివేక్-నేను ఓ పదేళ్ల పాటు కలిసి తిరిగాము. తను నా కోసం ముంబై వచ్చేవాడు.. నేను అతడి కోసం ఢిల్లీ వెళ్లేదాన్ని. ఇవన్ని మసాబాకు తెలుసు. ఇక మేం పెళ్లి చేసుకోవాలని భావించినప్పుడు దీని గురించి మసాబాకు చెప్పాను. అప్పుడు తన వయసు 19 ఏళ్లు. పెళ్లి గురించి చెప్పగానే తను అడిగిన మొదటి ప్రశ్న.. ఎందుకు వివాహాం చేసుకోవాలనుకుంటున్నావు అని. అప్పుడు నేను ఈ సమాజంలో గౌరవంగా బతకాలంటే పెళ్లి తప్పని సరి అని చెప్పాను’ అన్నారు. అయితే దీని గురించి మసాబాతో చెప్పడానికి తాను కొంత ఇబ్బంది పడ్డానన్నారు నీనా గుప్తా. కానీ మసాబా నన్ను అర్థం చేసుకుంది. నా ఆనందం కోసం తను ఏమైనా చేస్తుంది. అది తనకు నచ్చినా.. నచ్చకపోయినా. కాబట్టి నేను ఆందోళన చెందలేదు అన్నారు. ఇక నీనా గుప్తా, వివేక్ మెహ్రాల వివాహం 2008లో జరిగింది. -
నిజం చెప్పాలంటే..
లాక్డౌన్లో ఒక్కొక్కరూ ఒక్కో పనిలో బిజీగా ఉంటే బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా ఆమె బయోగ్రఫీ పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారట. ఈ విషయాన్ని గురువారం ప్రకటించారు. దీని గురించి మాట్లాడుతూ –‘‘మీ ఆత్మకథ ఎందుకు రాయకూడదు? అని చాలా మంది చాలాసార్లు నన్ను అడిగారు. కానీ నేనంత ఎక్స్ట్రార్డనరీ పనేం చేయలేదు కదా అని రాయాలనుకోలేదు. కరోనా వల్ల ఇంటికే పరిమితం కావడంతో రాయాల్సి వచ్చింది.. రాసేశాను. జనం చదువుతారో లేదో నాకు తెలియదు. చదివితే నచ్చుతుందో లేదో తెలియదు. నా ఆటోబయోగ్రఫీ నాలుగైదు నెలల్లో బయటకు రాబోతోంది. ఒకవేళ కుదిరితే చదవండి. బోర్గా అనిపిస్తే పక్కన పెట్టేయండి. నా ఆటోబయోగ్రఫీ పేరు ‘సచ్ కహు తో (నిజం చెప్పాలంటే)’’ అన్నారు నీనా గుప్తా. -
‘పని మీద దృష్టి పెట్టండి. పురుషుల మీద కాదు’
ముంబై : నటి నీనా గుప్తా పేరు ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నారు. నేహా ధుపియా నిర్వహిస్తున్న టెలివిజన్ ‘నో ఫిల్టర్ నేహా’ షోలో ఇటీవల నీనా గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకవేళ మీరు యుక్త వయస్సులో ఉంటే మీకు మీరు ఇచ్చుకునే సలహా ఏంటని నేహా ప్రశ్నించగా... దీనిపై స్పందించిన నీనా ‘పని మీద దృష్టి పెట్టండి. పురుషుల మీద కాదు’ అంటూ సమాధానమిచ్చారు. అయితే నీనా ఇలా చెప్పడం మొదటి సారి కాదు. తన జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని తరచూ అభిమానులతో పంచుకుంటారన్న విషయం తెలిసిందే. యువత సరైన దారిలో ఎలా నడుచుకోవాలో కూడా సందేశాలు ఇస్తూ ఉంటారు. (వివాహితుడిని ప్రేమించకండి: నటి) కాగా నేహా ధూపియా షో ఐదో సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమోను మంగళవారం విడుదల చేశారు. ఈ ప్రోమోలో నీనా గుప్తాతోపాటు, రానా దగ్గుబాటి, కపిల్ దేవ్, రాహుల్ ద్రవిడ్ సైఫ్ అలీఖాన్, సోనూసూద్, అదితి రావ్ వంటి ప్రముఖులను కూడా ఇంటర్య్వూ చేస్తున్నట్లు కన్పిస్తోంది. ఈ షో ఆగస్ట్ 28న ప్రారంభం కాబోతుంది. (విడాకుల విషయం విని కుప్పకూలిపోయా..) View this post on Instagram 5 years of unfiltered fun. 5 years of your favorite celebrity talkshow! #NoFilterNeha Season 5 at Home Edition is finally here! Join us every week as we bring down the roof - of our very own homes, of course! Premiering exclusively on @JioSaavn Pro, co-produced by @wearebiggirl A post shared by Neha Dhupia (@nehadhupia) on Aug 25, 2020 at 12:51am PDT వెస్టిండీస్ క్రికెటర్, వివాహితుడైన వివియన్ రిచర్డ్స్ను ప్రేమించిన నీనా గుప్తా... పెళ్లి కాకుండానే 1989లో కూతురికి జన్మనిచ్చారు. ఆమే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా. కూతురికి జన్మనిచ్చిన తర్వాత వివియన్ రిచర్డ్స్, నీనా విడిపోయారు. అనంతరం నీనా గుప్తా వేరే వ్యక్తినిపెళ్లి చేసుకున్నారు. బదా యీ హో, సర్వమంగళ్ జ్యాదా సావధాన్ సినిమాలలో ఇటీవల తెరపై కనిపించిన ఆమె బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. -
అతిథిగా అదితి?
అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఓ హిందీ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం ఈ చిత్రానికి నిర్మాత. నీనా గుప్తా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బామ్మ, మనవడికి మధ్య నడిచే కథ ఇదని సమాచారం. నీనా గుప్తా బామ్మగా, అర్జున్ కపూర్ మనవడి పాత్రలో కనిపిస్తారు. ప్రముఖ హీరోయిన్ అదితీ రావ్ హైదరి అతిథి పాత్రలో మెరవనున్నారని సమాచారం. నీనా గుప్తా యవ్వనంలో ఉన్న పాత్రలో అదితి కనిపిస్తారట. అదితీకి జోడీగా జాన్ అబ్రహాం నటించనున్నారట. లాక్ డౌన్ ముందు చిత్రీకరణ ప్రారంభం అయింది. ఈ నెలాఖరులో మళ్లీ చిత్రీకరణ మొదలుపెడతారట. ఈ చిత్రానికి కాశవీ నాయర్ దర్శకత్వం వహిస్తున్నారు. -
ప్రతి స్త్రీకి ప్లాన్ బి ఉండాలి
హాలీవుడ్లో హీరోయిన్ పాత్రలు చేయాలంటే వయసుతో సంబంధం లేదు. యాభై, అరవై ఏళ్లు దాటినవాళ్లు కూడా అక్కడ హీరోయిన్లుగా చేస్తుంటారు. కానీ భారతీయ సినిమా సీన్ వేరు. ఒకప్పుడు 30 ఏళ్లు దాటితే కెరీర్ ముగిసినట్లే. ఇప్పుడు ఒక 35–40 వరకూ ఓకే అనే పరిస్థితి. ఆ తర్వాత మాత్రం నో చాన్స్. ఇండస్ట్రీలో కొనసాగాలంటే అక్క, వదిన పాత్రలకు మారక తప్పదు. ఇదే విషయం గురించి బాలీవుడ్ నటి నీనా గుప్తా మాట్లాడుతూ –‘‘దాదాపు 30 ఏళ్లు నేను సినిమాలు చేశాను. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ‘బదాయి హో’ (2018) తెచ్చిపెట్టినంత పాపులార్టీ నాకు అంతకు ముందు రాలేదు. నేను అమితాబ్ బచ్చన్ని కాదని నాకు తెలుసు. మహిళలకు చాలా అరుదుగా పవర్ఫుల్ పాత్రలు రాస్తారు. నా వయసున్న (నీనా వయసు 61) మగవాళ్లు హీరోలుగా చేస్తున్నారు. కానీ స్త్రీలు చేయకూడదు. నా వయసువారి కోసం పాత్రలు రాయడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది’’ అన్నారు. అలాగే మహిళలకు ఓ సలహా ఇచ్చారు నీనా. ‘‘మహిళలకు ప్లాన్ బి ఉండాలి. ప్రతి స్త్రీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. ఆ విషయంలో ఎవరి మీదా ఆధారపడకూడదు. మన దగ్గర డబ్బుంటే ఎలాంటి సమస్యని అయినా పరిష్కరించుకోవచ్చు. అందుకే ప్రతి మహిళకు సొంత డబ్బు ఉండాలి. అదే ప్లాన్ బి’’ అన్నారు నీనా గుప్తా. -
చేతిలో చీపురు.. ఈ సెలబ్రిటీ ఎవరు?!
‘‘ఏ పనీ చిన్నది కాదు. గ్లామర్వాలా అయినా సఫాయీ వాలా అయినా ఒకటే అని నీనా గుప్తా నాకు ఎప్పుడూ చెబుతూ ఉంటారు’’ అని ప్రముఖ ప్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా తన పెంపకంలో తల్లి అవలంబించిన విధానాన్ని అభిమానులతో పంచుకున్నారు. తల్లి నీనా గుప్తా చిన్నతనంలో తనను అందంగా ముస్తాబు చేసిన ఫొటోతో పాటు చేతిలో చీపురు పట్టుకుని ఉన్న ఫొటో షేర్ చేసి ఈ విధమైన క్యాప్షన్ జతచేశారు. కాగా బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా- వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ల కూతురైన మసాబా గుప్తా ఫ్యాషన్ డిజైనర్గా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనం కపూర్, ఆమె సోదరి, నిర్మాత రియా కపూర్ తదితర సెలబ్రిటీలకు ఆమె వైవిధ్యమైన, ట్రెండీ దుస్తులు డిజైన్ చేసి ఫ్యాషన్ ప్రియుల మన్ననలు అందుకున్నారు. (వారి విడాకుల విషయం కుంగదీసింది: నటి) కాగా వివాహితుడైన రిచర్డ్స్ను ప్రేమించిన నీనా గుప్తా... పెళ్లి కాకుండానే 1989లో మసాబాకు జన్మనిచ్చారు. సింగిల్ మదర్గా ఉన్నప్పటికీ తన తండ్రి సాయంతో బిడ్డకు ఎటువంటి లోటు రాకుండా అపురూపంగా పెంచుకున్నారు. ఇటీవల తన మనోభావాలను వెల్లడించిన నీనా... పెళ్లైన వ్యక్తి ప్రేమలో పడి తాను తప్పుచేశానని.. సమాజం నుంచి ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కొన్నానంటూ కూతురి పెంపకంలో తనకు ఎదురైన సవాళ్ల గురించి చెప్పుకొచ్చారు. ఇక 2015లో ప్రముఖ ఫిల్మ్ మేకర్ మధు మంతెనను వివాహం చేసుకున్న మసాబా.. ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు విడాకుల విషయం తెలిసి తాను విషాదంలో మునిగిపోయానని.. తనపై తీవ్ర ప్రభావం చూపిన విషయం ఇదేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మసాబా ప్రస్తుతం ఆమె అదితీరావ్ హైదరీ మాజీ భర్త, నటుడు సత్యదీప్ మిశ్రాతో ప్రేమలో పడినట్లు బీ- టౌన్ టాక్. గోవాలోని సత్యదీప్ ఇంట్లో వీరిద్దరు లాక్డౌన్ను ఎంజాయ్ చేస్తున్నట్లు వదంతులు వ్యాపిస్తున్నాయి.(హీరోయిన్ మాజీ భర్త ప్రేమలో మసాబా!?) View this post on Instagram @neena_gupta used to tell me all the time - Koi kaam chhota nahin hota 🙏🏼 Na toh ‘Glamour’ wala na ghar ki safai wala A post shared by Mufasa✨🌙 (@masabagupta) on May 25, 2020 at 4:06am PDT -
విడాకుల విషయం విని కుప్పకూలిపోయా..
తన కూతురు మసాబా విడాకుల విషయం తెలిసి తాను విషాదంలో మునిగిపోయానని బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా అన్నారు. తనపై తీవ్ర ప్రభావం చూపిన విషయం ఇదేనని పేర్కొన్నారు. వెస్టిండీస్ క్రికెటర్, వివాహితుడైన వివియన్ రిచర్డ్స్ను ప్రేమించిన నీనా గుప్తా... పెళ్లి కాకుండానే 1989లో కూతురికి జన్మనిచ్చారు. ఆమెకు మసాబాగా నామకరణం చేసి.. తల్లీతండ్రీ తానే అయి అపురూపంగా పెంచుకున్నారు. ఈ క్రమంలో మసాబా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్గా ఎదిగి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా 2015లో ప్రముఖ ఫిల్మ్ మేకర్ మధు మంతెనను వివాహం చేసుకున్న మసాబా.. రెండేళ్ల క్రితం వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. మధు, మసాబా ఈ మేరకు 2018 ఆగస్టులో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కోర్టు మ్యారేజీ ద్వారా పెళ్లి చేసుకున్న తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం బాంద్రా ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. బుధవారం వారికి విడాకులు మంజూరయ్యాయి.(వివాహితుడిని ప్రేమించకండి: నటి) ఈ విషయం గురించి తాజాగా మసాబా తల్లి నీనా గుప్తా మాట్లాడుతూ.. మధు, మసాబాల విడాకుల గురించి తెలిసి తాను దుఃఖ సాగరంలో మునిగిపోయానని తెలిపారు. ‘‘నిజానికి ఈ విషయం తెలిసిన తర్వాత బాధ నుంచి తేరుకోలేకపోయాను. అప్పుడు మసాబానే నాకు సహాయం చేసింది. నేను అస్సలు ఈ విషయాన్ని అంగీకరించలేకపోయాను. నాపై ఇది తీవ్ర ప్రభావం చూపింది’’అని తన ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా... ‘‘నా కూతురి పెంపకంలో నా తండ్రి నాకు ఎంతగానో సహాయం చేశారు. నా కోసం ఆయన ముంబైకి షిప్ట్ అయ్యారు. నా కోసం అంతగా కష్టపడిన నాన్నకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. సింగిల్ పేరెంట్గా ఉన్న నాకు వెన్నెముకగా నిలిచారు’’ అని తన కూతురి పెంపకంలో ఎదురైన సవాళ్లను గుర్తుచేసుకున్నారు. కాగా కూతురికి జన్మనిచ్చిన తర్వాత వివియన్ రిచర్డ్స్, నీనా విడిపోయారు. అనంతరం నీనా గుప్తా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. బదా యీ హో, సర్వమంగళ్ జ్యాదా సావధాన్ సినిమాలలో ఇటీవల తెరపై కనిపించారు. ఇక కొన్నిరోజుల క్రితం ఓ వీడియోను విడుదల చేసిన నీనా గుప్తా.. పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడవద్దంటూ తన అనుభవాల గురించి పంచుకున్న సంగతి తెలిసిందే. -
ఆల్రెడీ పెళ్లైన వారితో ప్రేమలో పడకండి: నటి
ఒక మహిళ.. అమ్మ అని పిలుపుకై పడే ఆరాటం వర్ణనాతీతం. కానీ పెళ్లయ్యాక అమ్మ అని పిలిపించుకోవడం వేరు. పెళ్లికి ముందే తల్లి కావడం వేరు. అలా పెళ్లికి ముందే తల్లై సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు బాలీవుడ్ నటి నీనా గుప్తా. డేటింగ్ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే వెస్ట్ ఇండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్తో పీకల్లోతు ప్రేమలో మునిగారు. ఫలితంగా పెళ్లి కాకుండానే 1989లో కూతురికి జన్మనిచ్చారు. ఆమే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా. కానీ కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయి వేర్వేరుగా వివాహాలు చేసుకున్నారు. (ఆ విషయం విని షాక్ అయ్యా!) తాజాగా ఆమె తన జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఏదేమైనా సరే కానీ, వివాహితుడితో మాత్రం ఎలాంటి సంబంధం పెట్టుకోకండని సూచించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘అతను తన భార్య అంటే ఇష్టం లేదంటాడు. ఇంకా ఎంతోకాలం కలిసి ఉండలేం అని చెప్తాడు. అది నిజమేనని నమ్మి నువ్వు అతన్ని గాఢంగా ప్రేమిస్తావు. నీ భార్యతో ఇంకెప్పుడు విడిపోతావని పోరాడితే దానికింకా సమయం ఉందని చెప్పి దాటవేస్తాడు. ఎప్పటికైనా నీవాడే అవుతాడని కలలు కంటూ అతన్ని రహస్యంగా కలుస్తూ, షికార్లకు తిరుగుతూ, రాత్రిళ్లు ఏకాంతంగా గడుపుతూ ఇలా అన్నింటికీ ఒప్పుకుంటావు. అలా చాలారోజులు గడిచిపోతాయి. మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చి.. త్వరగా నీ భార్యకు విడాకులిచ్చేస్తే మనం పెళ్లిపీటలెక్కవచ్చు అని ఆతృతగా చెప్తావు. ('అది నీ సినిమా అని ఎలా చెప్పుకుంటావ్?') కానీ ఈసారి అతను కాస్త కటువుగా.. తర్వాత చూద్దాంలే, అయినా విడాకులు అంత సులువు కాదు అంటూ ఏవేవో కుంటిసాకులు చెప్తూ మాట మార్చేస్తాడు. అప్పుడు అసలు నిజం ఏంటో నీకు గోచరిస్తుంది. కానీ ఆ సమయానికి నువ్వు ఏకాకిగా మారుతావు, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో చిక్కుకుంటావు. చివరాఖరకు అన్ని విధాలా ఆలోచించి నువ్వు ప్రేమించిన వ్యక్తికి దూరమయ్యేందుకే సిద్ధపడుతావు. నా జీవితంలోనూ సరిగ్గా ఇలాంటిదే జరిగింది. ఆ సమయంలో ఎంతో వేదన అనుభవించా. అందుకే చెప్తున్నా.. దయచేసి ఎవరూ అలాంటి పిచ్చిపనులు చేయకండి. పెళ్లైన వ్యక్తితో అస్సలు ప్రేమలో పడకండి’ అంటూ సలహా ఇచ్చారు. (టాలెంట్కు వయసుతో సంబంధమేముంది : నీనా గుప్తా) View this post on Instagram #sachkahoontoe A post shared by Neena ‘Zyada’ Gupta (@neena_gupta) on Mar 2, 2020 at 1:51am PST