Natural Resource
-
యూట్యూబ్ సేద్యం
తాము బాగుండాలి. భూమి బాగుండాలి. సమాజం అంతా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో యువ రైతు సోదరులు దండవేని నరేష్, సురేష్ నడుము బిగించారు. జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలంలోని అల్లీపూర్ వారి స్వగ్రామం. 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో తల్లిదండ్రులు తోటి రైతుల మాదిరిగానే విరివిగా రసాయనిక ఎరువులు వాడటంతో భూమి తేమను నిలుపుకునే శక్తిని కోల్పోయింది. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో నీళ్లు లేక పంటలు పండలేదు. దీంతో, ఇంటి అప్పులు వడ్డీలతో కలిపి రూ.16 లక్షలకు పెరిగాయి. డిగ్రీ చదివిన అన్న నరేష్ దుబాయ్ వెళ్లాడు. కానీ, రెండు, మూడేళ్ల తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తమ్ముడు సురేష్ పదో తరగతి పూర్తి చేసి, రసాయన ఎరువులు వాడుతూ వ్యవసాయం చేస్తుండేవాడు. తదనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని, ఆ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాలను సందర్శించి అవగాహన పెంచుకున్నారు. దీనికి తోడు యూట్యూబ్ ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకొని ఆచరించడం మొదలుపెట్టారు. పిచ్చోడని ఇంట్లో వాళ్లే తిట్టారు..! ప్రకృతి సాగు పద్ధతిలో తొలి రెండేళ్లు అంతంతమాత్రంగానే పంట పండింది. ఆ ఏడాది పంటలకు ధరలు బాగున్నాయి. దీంతో, ఇంట్లోవాళ్లు ఇదేం పద్దతి, పంట కూడా రావడం లేదని, ఇద్దరు అన్నదమ్ములు పిచ్చోళ్లమాదిరిగా తయారయ్యారు అంటూ తిట్టారు. మా ఊరోళ్లు అయితే, ఈ పద్దతిలో మీరు వ్యవసాయం చేస్తే ఉన్న భూమి అమ్ముడు ఖాయం అంటూ ముఖం మీదే చెప్పడం చేసారు. అయినప్పటికి, మేము చేసే పనులను మేము చేసుకుంటూ పోయేవాళ్లం. గత రెండేళ్ల నుండి మిగత రైతులు పొలాలకు ఏదో ఒక జబ్బు వచ్చి పంట పోయేది. కానీ మా పొలంలో ఎప్పుడూ దెబ్బతినలేదు. ఇది చూసిన తర్వాత మా మీద నమ్మకం కుదిరి కుటుంబసభ్యులు సహకరించడం మొదలుపెట్టారు. పందిళ్ల కింద కూడా తోటలు.. గత నాలుగేళ్లుగా 2 ఎకరాలలో మామిడి, 4 ఎకరాలలో వరి, 2 ఎకరాలలో కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. మూడు ఆవుల మూత్రం, పేడతో ఘనజీవామృతం, జీవామృతం తయారు చేస్తున్నారు. తెగుళ్లు, పురుగుల నివారణకు అగ్నిస్త్రం, నీమాస్త్రం, దశపర్ణ కషాయం వాడతున్నారు.బీరకాయ, సొరకాయ, కాకర కాయలను పందిరి పద్దతిలో సాగు చేస్తున్నారు. ఆ పందిళ్ల కింద పాలకూర, తోటకూర, టమాట, బెండ, గోరు చిక్కుడు సాగు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ దుకాణం ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే 20 శాతం అదనపు ధరకు అమ్ముతున్నారు. బియ్యం, కందిపప్పు, శనగలు, పసుపు, కారం, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, నువ్వులను కూడా విక్రయిస్తున్నారు. వాకింగ్ క్లబ్ల వద్ద కూడా రసాయన అవశేషాల్లేని తమ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారు. మట్టి ద్రావణం.. సీవీఆర్ పద్ధతిలో భూమి పై నుంచి సేకరించిన 7 కిలోల మట్టి, భూమి 2 అడుగుల లోతు నుంచి తీసిన 7 కిలోల మట్టిని 200 లీటర్ల నీటిలో కలపాలి. కొంత సేపటి తర్వాత, గుడ్డతో ఆ మట్టి ద్రావణాన్ని వడపోసి పంటలపై పిచికారీ చేస్తే, మొక్కలకు అవసరమైన పోషకాలు అందుతాయి. ఇలా తయారు చేసిన మట్టి ద్రావణాన్ని వరి, కూరగాయలు, పండ్ల తోటలకు పిచికారీ చేస్తున్నారు. ఫిష్ అమినోయాసిడ్ ద్రావణం: కిలో చేపల(పనికిరాని వ్యర్థాల)ను చిన్న ముక్కలు చేసి, వీటికి కిలో బెల్లం కలిపి డ్రమ్ములో మురగబెట్టాలి. ఉదయం, సాయంత్రం కలుపుతూ ఉండాలి. 15 రోజుల తర్వాత గుడ్డలో వడపోసి, వచ్చిన ద్రావణాన్ని కూరగాయలు, వరి పొలానికి పిచికారీ చేస్తున్నారు. మొక్కల పెరుగుదలకు ల్యాబ్ కుండలో బియ్యం కడిగిన నీరు ఒక లీటరుకు 3 లీటర్ల అవు పాలను కలిపి.. నాలుగు రోజుల పాటు చల్లని ప్రదేశంలో ఉంచాలి. దీనివల్ల పైన పెరుగు గడ్డలాగా పేరుకుంటుంది. దాన్ని తీసివేసి కింది ద్రావణాన్ని మొక్కలకు పిచికారీ చేస్తున్నారు. లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా(లాబ్) అంటారు. ఇది మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కూరగాయల సాగు ఇలా.. ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేసిన ఘనజీవామృతాన్ని ఎకరానికి వంద కిలోల చొప్పున దుక్కిలో చల్లారు. కూరగాయ çపంటలపై ప్రతి 15 రోజుల కొకసారి జీవామృతాన్ని పిచికారీ చేస్తున్నారు. నీమాస్త్రం, అగ్నిస్త్రం, దశపత్ర కషాయాలతో తెగుళ్లను నియంత్రించారు. మొక్కల పెరుగుదలకు ‘ల్యాబ్’ను ఉపయోగించడంతో కూరగాయలు ఏపుగా పెరుగుతున్నాయి. వరి పంట కోసం... వరి పొలం దుక్కిలో ఘనజీవామృతం వాడారు. ప్రతి 15 రోజుల కొకసారి జీవామృతాన్ని నీటితో కలిపి ఇస్తున్నారు. నెల రోజుల తర్వాత ఫిష్ అమినోయాసిడ్ను పిచికారీ చేశారు. మొక్కల పెరుగుదలకు చాలా ఉపయోగపడింది. మొగి పురుగు నివారణకు నీమాస్త్రం, అగ్నిస్త్రం వాడారు. వరి పొట్ట దశలో సీవీఆర్ పద్ధతిలో మట్టి ద్రావణంతో పాటు పుల్లటి మజ్జిగను పిచికారీ చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి. మామిడి పంటకు.. ప్రతి 20 రోజుల కొకసారి డ్రిప్ ద్వారా జీవామృతం ఇస్తున్నారు. పూత దశలో జీవామృతాన్ని పిచికారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా తెగుళ్లు, పురుగుల నివారణకు అగ్నిస్త్రం, దశపర్ణ కషాయం, వరి పిండి ద్రావణాన్ని పిచికారీ చేశారు. మామిడి చెట్ల మొదళ్ల దగ్గర తేమ త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు పసుపు ఆకును ఆచ్ఛాదనగా వేశారు. పసుపు ఆకు తేమను కాపాడటంతో పాటు నెమ్మదిగా కుళ్లి సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. మా తోట వద్దకు వచ్చి చూడమంటాం! గతంలో రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడి చేతులు కాల్చుకున్నాం. మూడు ఆవులను కొనుగోలు చేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. పండించిన కూరగాయలు, బియ్యం తదితర ఉత్పత్తులను నేరుగా జనం వద్దకే వెళ్లి అమ్ముకుంటున్నాం. రసాయనాలు వాడకుండా పండించినవేనా అన్న అనుమానం ఉంటే.. వచ్చి మా తోటను చూడండని చెబుతుంటాం. ప్రతి రైతూ కొద్ది భాగంలోనైనే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరించడం మొదలు పెట్టాలి. ఇది భూమికి, రైతుకు.. అందరికీ మంచిది. ఆరోగ్యకరమైన సమాజమే మా లక్ష్యం. – దండవేని నరేష్, సురేష్ (96409 63372) అల్లీపూర్, రాయికల్ మండలం, జగిత్యాల జిల్లా – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి అగ్రికల్చర్, జగిత్యాల, ఫొటో: ఏలేటి శైలేందర్ రెడ్డి -
చందనపు చల్లన
వేసవి ఊపు మీద ఉంది. సూరన్న శివాలూగుతున్నాడు. రానున్న రెండు మూడు వారాలు కీలకమైనవి. జాగ్రత్త పడాల్సినవి. సూర్యుడి వేడి ప్రకృతికి ఒక సహజ అవసరం. ఈ సహజ అవసరంలోని తీవ్ర క్షణాలను సహజ రక్షణ కవచాలతోనే మనం ఎదుర్కోవాలి. అందుకు ఏం చేయాలి. వినండి.ఇంట్లోనే ఉన్నాం కదా అని సరిగా నీళ్లు తాగకుండా ఉండకూడదు. నీళ్లు తాగకపోవడం వలన డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. తగినన్ని నీళ్లు తాగకపోతే నిద్ర లేమి, అజీర్తి సమస్యలు కూడా తలెత్తుతాయి. కీర దోస, పుచ్చకాయ, నిమ్మరసం, కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, రాగి జావ వంటివి తీసుకుంటూ, కాఫీ, టీలను తగ్గించాలి. నిల్వ ఉన్న ఆహారం కాకుండా తాజాగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యమివ్వాలి. ఎండగా ఉన్నప్పుడు చల్లని పండ్ల రసాలు గొంతులోకి దిగుతుంటే, చల్లగా హాయిగా అనుభూతి కలుగుతుంది. అలాగని ఏవి పడితే అవి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. సోడా నీరు, శీతల పానీయాలు, ఐస్క్రీముల జోలికి పోకూడదు. పండ్లు కొనేటప్పుడు వాటి మీద క్రిమిసంహారక మందు ఎంత ఉందో పరిశీలించాలి. ఉదాహరణకు ద్రాక్ష పండ్ల వంటివి. తినడానికి ముందు వాటిని ఉప్పు నీటిలో రెండు సార్లు నానబెట్టి, శుభ్రపరచుకోవాలి. ప్రకృతి సహజసిద్ధంగా ప్రసాదించిన శీతల పానీయం కొబ్బరిబొండం. కొబ్బరి నీళ్లలో చిటికెడు ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే డీ హైడ్రేషన్ సమస్య ఉండదు. ఎండలో బయట నుంచి ఇంటికి వచ్చాక, ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుని కొబ్బరి నీళ్లతో ముఖం కడుక్కుంటే, ఎండవల్ల నల్లగా మారిన చర్మం తాజాదనాన్ని పొందుతుంది. గ్లాసుడు నీళ్లలో టీ స్పూను నిమ్మరసం, టీ స్పూను తేనె వేసి బాగా కలిపి తాగడం వల్ల శరీర వేడి తగ్గుతుంది.నారింజ లేదా కమలాపండ్ల రసం తీసి, అందులో కొద్దిగా పంచదార, తేనె కలిపి తాగితే కడుపు చల్లగా అవుతుంది. వేడి వాతావరణంలో కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. కీర దోసకాయ రసం తీసి, చెంచాడు తేనె, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే మంచిది.గుప్పెడు పుదీనా ఆకులు, చెంచాడు తేనె, రెండు చెంచాల నిమ్మరసం కలిపి మెత్తగా చేసి స్మూతీలా తీసుకుంటే మంచిది. నాలుగు పుచ్చకాయ ముక్కలను జ్యూస్గా తీసి అలాగే తాగడం మంచిది. ∙ జామకాయ రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల దీనిని వేసవికాలంలో తీసుకోవడం మంచిది. రసం తీసేటప్పుడు విత్తనాలను తొలగించడం మంచిది. ∙ అన్నిటి కంటె మంచినీళ్లు తాగడం చాలా ముఖ్యం. రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. జీవనశైలిని బట్టి, మరింత ఎక్కువగా నీళ్లు తాగాలని ఆయుర్వేదం చెబుతోంది. వేసవిని ఆయుర్వేదం ఆదాన కాలం అంటుంది. ఈ కాలంలో సూర్యుడు ప్రాణుల నుంచి శక్తిని తీసుకుంటాడు కాబట్టి దానికి ఆ పేరు. ఈ శక్తిని మళ్లీ సమకూర్చుకోవడం ఎలాగో ఆయుర్వేదం చెబుతుంది. ఈ కాలంలో వచ్చే మూత్రంలో మంట, అతిసారం లాంటి అనేక వ్యాధుల్ని వాటి నివారణను సూచిస్తుంది.పళ్లరసాలు తాగిన వెంటనే వాటి దోషాల నివారణగా కొద్దిగా వేడి నీళ్లలో శొంఠి, మిరియాల పొడి (ఒక్కొక్కటి చిటికెడు) కలిపి తాగాలి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే టోపీ కాని గొడుగు కాని వాడాలి.షడంగ పానీయంచందనం (మంచి గంధం), ముస్తా (తుంగ ముస్తలు), ఉశీరం (వట్టి వేరు) ఉదీచ్య (కురువేరు) నాగర (శొంఠి), పర్పాటక... వీటిని దంచి కషాయం కాచుకోవాలి. ఇలా తయారు చేసుకున్నకషాయాన్ని 30 మి.లీ. తీసుకుని అందులో కొంచెం పటికబెల్లం (మిశ్రి) కలిపి రోజూ తాగాలి.జంబీర పానీయం: గ్లాసుడు నీటిలో (300 మి.లీ.) చెంచాడు అల్లం రసం, ఒక చెంచాడు నిమ్మరసం, నాలుగు చెంచాల శర్కర, చిటికెడు ఉప్పు కలిపి తాగాలి.తక్ర పానీయం: పులుపు లేని మజ్జిగను పలుచగా చేసి కొద్దిగా నిమ్మరసం, అల్లం, ఉప్పు, కరివేపాకు, పుదీనా కలిపి వడగొట్టి రోజుకి రెండు మూడుసార్లు తాగాలి. – వి. ఎల్. ఎన్. శాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు -
‘ఇంటిపంట’ స్ఫూర్తితో బడిపంట!
పిల్లలకు రసాయనిక ఎరువులు లేకుండా, పురుగుమందులు లేకుండా సేంద్రియ సేద్యమనేది ఒక కల్టివేషన్ మెథడ్గా చెబితే.. భవిష్యత్తులో ఈ పిల్లలే బడులుగా మారిపోతారు! ఇన్నాళ్లూ రసాయనాలతో వ్యవసాయం చేస్తూ నష్టపోతున్న పెద్దలు..ఆ బడుల్లో పాఠాలు నేర్చుకుంటారు.. వ్యవసాయం బాగుపడుతుంది.. దేశం బాగుపడుతుందన్న మంచి ఆలోచనతో ‘ఇంటిపంట’ స్ఫూర్తితో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం.. ‘బడిపంట’గా మొదలయ్యింది. వర్థిల్లాలి. అందుకే ఈ కథనం.. ‘సాక్షి’ దినపత్రికలో గత ఏడేళ్లుగా ప్రచురితమవుతున్న ‘ఇంటిపంట’ కథనాల స్ఫూర్తితో గుంటూరు నల్లచెరువులోని కలాం థెరిస్సా ఐడియల్ స్కూల్ తన విద్యార్థులకు సేంద్రియ ‘బడిపంట’లపై పాఠాలు చెబుతూ వారిలో సామాజిక స్పృహను పెంపొందిస్తోంది. ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్థులకు రసాయనిక అవశేషాల్లేని ప్రకృతి ఆహారం ప్రాధాన్యతను తెలియజెప్తూ ‘బడిపంట’లను సాగు చేస్తున్నది. భవనం టెర్రస్ మీద గ్రోబ్యాగ్స్లో మట్టి, ఘనజీవామృతం, జీవామృతంతో బడిపంటల సాగుకు గత ఏడాది ఖరీఫ్లో శ్రీకారం చుట్టారు. మొదట్లో ఆకుకూరలు, కూరగాయలను విద్యార్థులతో స్కూలు భవనంపైనే గ్రోబ్యాగ్స్, బియ్యం బస్తాలలో సాగు చేయించారు. ఈ ఏడాది కూరగాయలతోపాటు మొక్కజొన్న, కొర్ర, సామలు, ఊదలు, అరికలు వంటి సిరిధాన్యాలను సైతం సాగు చేయిస్తున్నారు. 6–9 తరగతుల విద్యార్థులకు ప్రాజెక్టు వర్క్లో భాగంగా కొన్ని గ్రోబ్యాగ్స్ను, విత్తనాలు ఇచ్చి వారి ఇళ్ల దగ్గర ఇంటిపంటలు పెంచేలా ప్రోత్సహిస్తున్నారు. పెంచిన పంటలను విద్యార్థులకే పంచిపెడుతున్నారు. వ్యవసాయ విశ్రాంత విస్తరణాధికారి సత్యనారాయణ మూర్తి(94915 82181) మార్గదర్శకత్వంలో స్కూలు కరస్పాండెంట్ షేక్ మస్తాన్ ‘బడిపంట’ కార్యక్రమాన్ని చేపట్టారు. కొర్ర వంటి సిరిధాన్యాలను తాము ఇంతకుముందెన్నడూ చూడలేదని విద్యార్థులు మురిసిపోతూ చెప్పారు. అంతేకాదు.. పంట పొలాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 20 మంది అన్నదాతలను ఆహ్వానించి గత ఏడాది ఘనంగా సత్కరించడం ద్వారా అన్నదాతల్లో, విద్యార్థులలో స్ఫూర్తిని నింపడం విశేషం. పద్మశ్రీ పాలేకర్ ప్రశంసలు అందుకున్న ఈ స్కూలులో ‘బడిపంట’లను పలు స్కూలు యాజమాన్యాలు సందర్శించాయని మూర్తి తెలిపారు. ఇటీవల స్కూలు వార్షికోత్సవంలో ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు, కూరగాయలతోనే విందు ఏర్పాటు చేయడం శుభపరిణామం. స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులకు జేజేలు! మా ఇంటిపంటల రుచి బాగుంది! ఇంటిదగ్గర 11 గ్రోబ్యాగ్స్లో కొర్రలు, అలసందలు, మొక్కజొన్నలు పండిస్తున్నా. ఇంతకుముందు ఆకుకూరలు పండించి, వండుకు తిన్నాం. రుచి బాగుంది. పదిరోజులకోసారి స్కూల్లోనే జీవామృతం తయారు చేసుకొని తెచ్చి పోస్తున్నా. మంచి పని చేస్తున్నారు, మున్ముందు ఈ అనుభవం పనికొస్తుంది. బాగా చెయ్యమని మా అమ్మానాన్న అంటున్నారు. తర్వాత వంకాయలు పండిస్తా. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతా. – షేక్ సల్మా, 9వ తరగతి, నల్లచెరువు, గుంటూరు తన ఇంటిపంటలకు నీరు పోస్తున్న సల్మా ఇంటి పైన సామ,కొర్ర పండిస్తున్నా.. స్కూల్లో గ్రోబ్యాగ్స్లో మిరపకాయలు, బెండకాయలు, టమాటాలు, మొక్కజొన్న పండించాం. ప్రాజెక్టులో భాగంగా ఇంటిదగ్గర సామ, కొర్ర, అరికలు వంటి సిరిధాన్యాలు ఇప్పుడు కొన్ని గ్రోబ్యాగ్స్లో వేశాను. కంకులు వచ్చాయి. పురుగుమందులు, ఎరువులు వేయకుండా పంటలు పండిస్తే ఆరోగ్యకరమని తెలుసుకున్నాను. మా అమ్మానాన్నా కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇక ముందు కూడా ఇంటిపంటలు పండిస్తాను. – వీర్ల ప్రభు, 9వ తరగతి, నల్లచెరువు, గుంటూరు తమ ఇంటి మేడపైన కొర్ర కంకులు చూపుతున్న ప్రభు ఈ కాయగూరలు తింటే ఆరోగ్యం జీవామృతంతో పండిస్తే కాయగూరలు విషపూరితం కాకుండా ఉంటాయని మా బడిపంట ద్వారా తెలుసుకు న్నాను. వీటిని తింటే ఆరోగ్యం బాగుంటుంది. మంచిది. హేమంత్ సాయి భార్గవ్,6వ తరగతి, నల్లచెరువు, గుంటూరు ఎప్పటికీ ఇంటిపంటలు పండిస్తా! మెంతి విత్తనాలు వేస్తే వారంలో మెంతి కూర వచ్చింది. అందరికీ ఇచ్చా. తోటకూర కూడా జీవామృతం వేసి పెంచాను. మా స్కూల్లో చెప్పటం వల్ల రోగాలు రాకుండా పంటలు ఎలా పెంచాలో తెలిసింది. పెద్దయ్యాక కూడా వేస్తా. ఎస్.యామిని, 7వ తరగతి, నల్లచెరువు, గుంటూరు చైతన్యం కోసమే ‘బడిపంట’! సాక్షి ఇంటిపంట, సాగుబడి కథనాల స్ఫూర్తితో రెండు సీజన్ల నుంచి సేంద్రియ ‘బడిపంట’ల సాగును మా విద్యార్థులకు పరిచయం చేస్తున్నాం. మొదట ఆకుకూరలు, కూరగాయలతో ప్రారంభించాం. వ్యాధులను సైతం నయం చేయగల సిరిధాన్యాలను కూడా ఇప్పుడు స్కూల్లోను, పిల్లల ఇళ్ల దగ్గర కూడా గ్రోబ్యాగ్స్లో సాగు చేయిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను సత్కరించాం. పిల్లలకు పంటల సాగు సులువేనని తెలియజెప్పడంతోపాటు ప్రకృతి ఆహారంపై చైతన్యం కలిగించాలన్నదే మా ప్రయత్నం. షేక్ మస్తాన్ (70360 29365), కరస్పాండెంట్,కలాం థెరిస్సా ఐడియల్ స్కూల్, నల్లచెరువు, గుంటూరు నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
అడవిలో చల్లని తల్లి!
ఆమె చేయి చలవ. ఎంత చలవంటే.. ఎంతటి విషమైనా కళ్లు తేలేయాల్సిందే! ఆకులను రెండు చేతులతో నలిపి రసం పిండిందంటే.. ఏ జబ్బయినా ఇట్టే తట్టా బుట్టా సర్దేయాల్సిందే. అది కేవలం ఆమె నిండు మనసుతో ఇచ్చే మందు శక్తి మాత్రమే కాదు. ఆమె నోటి నుంచి జాలువారే చల్లని మాటలు రోగులకు కొండంత ధైర్యాన్నిస్తాయి. తాము త్వరలోనే కోలుకుంటామన్న భరోసానిస్తాయి. అందుకే అందరూ ఆమెను ‘అడవిలో అమ్మ’ అని ఆప్యాయంగా పిలుస్తుంటారు. ఆమె అసలు పేరు లక్ష్మీ కుట్టి. 75 ఏళ్లు. కేరళలోని తిరువనంతపురం జిల్లా కల్లార్ అటవీ ప్రాంతంలో కొండకోనల్లో తాటాకు గుడిసే ఆమె నివాసం.పురుగో, పుట్రో, పామో, తేలో కుట్టిందంటే.. ఎక్కడెక్కడి నుంచో కొండలు ఎక్కి మరీ లక్ష్మీ కుట్టి దగ్గరకు వస్తుంటారు కేరళవాసులు. లక్ష్మీ కుట్టికి అడవి అన్నా, ఔషధ మొక్కలన్నా పంచప్రాణాలు. 50వ దశకంలో చదువుకున్న తొలి గిరిజన బాలిక ఆమే. తండ్రి చదువెందుకన్నా.. పట్టుపట్టి బడికెళ్లింది. రోజూ పది కిలోమీటర్లు నడిచి వెళ్లి కష్టపడి చదువుకుంది. ఆ బడిలో 8వ తరగతి వరకే ఉండటంతో అక్కడితో చదువు ఆగిపోయింది. తల్లి దగ్గర్నుంచి వైద్యం అడవిలోని కనీసం 500 రకాల వ్యాధులు, రుగ్మతలకు మూలికా వైద్యం చేయటం లక్ష్మీ కుట్టి ప్రత్యేకత. అయితే, పాము లేదా తేలు కుట్టిన సమస్యలతోనే ఎక్కువ మంది తన దగ్గరకు వస్తున్నారని ఆమె అంటారు. తన తల్లి దగ్గరి నుంచే ఈ వైద్యం నేర్చుకున్నానని, ఒక్కటి కూడా మరచిపోలేదంటారు. అయితే, ఈ వందలాది ఔషధ మొక్కల గుణగణాల గురించి, వైద్య పద్ధతుల గురించి ఇప్పటి వరకు ఎక్కడా రాసి పెట్టలేదు. ఇది గమనించిన కేరళ అటవీ శాఖ అరుదైన ఈ సంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని గ్రంధస్థం చేయాలని ప్రయత్నిస్తోంది. అందుకు లక్ష్మీ కుట్టి సహకారం తీసుకుంటోంది. ప్రకృతి నుంచి ఫార్మసీ ఈ అడవి బామ్మను వెతుక్కుంటూ అవార్డులు వచ్చాయి. 1995లో తొలిగా ‘నాటు వైద్య రత్న’ అవార్డుతో కేరళ ప్రభుత్వం సత్కరించింది. ఈ అవార్డు వచ్చిన తర్వాత దూర ప్రాంతాల నుంచి కూడా జనం ఆమె వద్దకు వైద్యం కోసం వస్తున్నారు. అవార్డుల పరంపరలో తాజాది భారతీయ జీవవైవిధ్య కాంగ్రెస్ అవార్డు(2016). తనతోపాటు రోజూ బడికి వచ్చి చదువుకున్న మేనబావ మతన్ కానిని 16వ ఏట ఆమె పెళ్లాడింది. ‘నేను తీసుకున్న నిర్ణయాల్లో, సాధించిన విజయాలన్నిటిలోనూ ఆయన నాకు తోడు నీడగా ఉన్నాడు. నేను లేకపోయినా నువ్వు ఇవన్నీ సాధించేదానివే. ఎందుకంటే నువ్వు అంతటి ధీర వనితవు అని అంటూ ఉండేవాడు. ‘‘గత ఏడాది చనిపోయే వరకు నాకు సరైన జీవిత భాగస్వామిగా ఉన్నాడు’ అందామె. వారికి ముగ్గురు మగ సంతానం. విషాదం ఏమిటంటే పెద్ద కొడుకును ఏనుగు చంపేసింది. చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో అకాల మరణం పాలయ్యాడు. (రెండో కొడుకు రైల్వే చీఫ్ టిక్కెట్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు). అయినా ఆమె కుంగిపోలేదు, అడవినీ, వైద్యాన్నీ వదల్లేదు. వ్యంగ్య రచయిత్రి కూడా! లక్ష్మీ కుట్టి మూలికా వైద్యురాలిగా మాత్రమే కాదు, వ్యంగ్యం పండించిన కవిగా, రచయిత్రిగా కూడా కేరళలో ప్రసిద్ధి పొందారు! గిరిజన సంస్కృతీ సంప్రదాయాల గురించి, అడవుల ప్రాముఖ్యత గురించి ఆమె వ్యాసాలు రాశారు. వీటి సంకలనం ప్రచురితమైంది. ‘వీటిని గిరిజన భాషలో కాదు, మళయాళంలోనే రాశాను. అలతి పదాలనే వాడాను. పామరులైనా సులువుగా పాడుకునేలా’ అంటారామె. ‘ఈ అడవే నా ప్రపంచం. బయటి ప్రపంచం నాకు చాలానే ఇచ్చింది. అవార్డులు, సత్కారాలతోపాటు పుస్తకాలనూ ఇచ్చింది. అయినా, నేను అడవిని వదలి బయటికి రాలేను. అడవిలో జీవించాలంటే, ధైర్యం ఉండాలి’ అంటున్నది ఒంటరిగానే అడవిలోనే ఉంటున్న ఈ బామ్మగారు. – పంతంగి రాంబాబు -
భేరుండ బ్రహ్మాండ
గండ భేరుండం అంటే చాలా పెద్దది.. గొప్పది అని అర్థం.పట్టు, డిజైనర్ చీరల మీద.. ఆభరణాల మీదగండభేరుండ చిహ్నం గొప్ప లుక్ని, గ్రాండ్నెస్ని తీసుకొస్తుంది.రాచరికపు హంగు ఈ చిహ్నం సొంతం. అందుకే ఇప్పుడు ఫ్యాషన్ ఆకాశంలో గండభేరుండం ఎగురుతోంది.కొన్నిసార్లు జీవితంలో అంతగా పట్టింపులేని, పట్టించుకోని అంశాల వెనుక ఓ పెద్ద చరిత్ర ఉంటుంది. వాటి పూర్వాపరాలు తెలుసుకునే ప్రయత్నంలో కళాకారుల సృష్టి వెనక దాగున్న ఎన్నో నిజాలు తెలుస్తాయి. ఆ కోవకి చెందినదే గండభేరుండ. వస్త్రాల మీద, ఆభరణాల పైనా గ్రాండ్గా కొలువు దీరుతోంది. ఒక శరీరం రెండుతలలు గండభేరుండ అనేది రెండుతలల పక్షి. ఈ పక్షి ప్రాచీనకాలంలో ఉన్నట్లు రుజువులు లేవు. ఇదొక పౌరాణిక గాధ అని చెబుతారు. వేల ఏళ్ల క్రితం గండభేరుండకు సంబంధించి కథనాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో– రాక్షసుడైన హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహస్వామిని శాంతింపజేయడానికి శివుడు శరభ మృగ రూపం ధరించాడని, దానిని ఎదిరించేందుకు నరసింహస్వామి అయిన విష్ణువు రెండుతలలతో, విశాలమైన రెక్కలతో, పదునైన కోరలతో, నల్లని రూపంతో గండభేరుండంలా అవతరించాడని.. అది గరుత్మంతునికన్నా బలమైనదని కథనాలు ఉన్నాయి. కర్నాటకలోని బేలూర్లో గల చెన్నకేశవాలయంలో గల గండభేరుండ శిల్పాకృతి ప్రకృతిలోని జీవులన్నింటిలో గండభేరుండం బలమైనదని చాటుతుంది. గ్రాండ్గా ఆవిష్కరించారు దక్షిణభారతదేశంలో గండభేరుండకు గల ఘనమైన ఖ్యాతి చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. దేవాలయాల మీద, చారిత్రక కట్టడాల మీద రాచరికానికి హంగుగా ఉన్న భేరుండాన్ని పట్టుదారాలతో చీరల మీద చిత్రించారు నేతకారులు. అపారమైన దైవశక్తికి ప్రతీకగా ఉండే గండభేరుండం డిజైన్తో పల్లూ మొత్తం నింపేశారు. మోటిఫ్స్గా చిన్న చిన్న భేరుండ బొమ్మలను తీసుకున్నారు. ఆభరణాలలో భేరుండం స్వర్ణకారుల ఆభరణాలలోనూ గండభేరుండం అందంగా అమరింది. ముత్యాలు, రత్నాలతో ముచ్చటైన రూపం సంతరించుకుంది. ఘన చరిత గల గండభేరుండ డిజైన్ ఉన్న చీర ఒక్కటైనా∙వార్డ్రోబ్లో ఉండాలని, తమ ఆభరణాలలో చిన్న రూపుగా అయినా కావాలని కోరుకుంటున్నారు. ప్రాచీన కళలోని గ్రాండ్నెస్ను ఇష్టపడుతున్నారు కనుకే గండభేరుండ గ్రాండ్గా వెలిగిపోతోంది. రాచరికపు హంగు కర్నాటకలోని వొడయార్ రాజుల పాలనలో తమ రాజ్యశక్తికి గండభేరుండ చిహ్నాన్ని వాడేవారు. స్వాతంత్య్రానంతరం కర్నాటక ప్రభుత్వం గండభేరుండ పక్షిని తమ రాష్ట్ర అధికారిక చిహ్నంగా తీసుకుంది. మైసూర్ప్యాలెస్ ద్వారం మీదా ఈ పక్షి రూపం చూడచ్చు. తెలుగునాట కాకతీయుల చారిత్రక కట్టడాల మీద, రామేశ్వరం, బృహదీశ్వరం వంటి ప్రాచీన దేవాలయాల మీదా ఈ పక్షి రూపాన్ని తిలకించవచ్చు. విజయనగర సామ్రాజ్యాధీశులు 500 ఏళ్లక్రితమే భేరండ చిహ్నాన్ని తమ అధికారక నాణేల మీద వాడినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. - నిర్వహణ: ఎన్.ఆర్. -
పరిమళం తగ్గుతోంది!
ఇదివరకటి కాలంలో వసంతం వచ్చిందంటే చాలు, పూల వనాలు పరిసరాలను పరిమళ భరితం చేసేవి. ఇప్పటి కాలంలో వసంతమైతే వస్తోంది గాని, పూల వనాలు ఇదివరకటి స్థాయిలో పరిమళించడం లేదు. ప్రకృతి ధర్మసూత్రాలకు లోబడి వసంతంలో మొక్కలకు ఆకులు చిగురించి, పూలు పూస్తూనే ఉన్నా, పూల పరిమళంలోని గాఢత మాత్రం క్షీణిస్తూ వస్తోందని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్కు చెందిన బ్రిటిష్ శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ గర్లింగ్ చెబుతున్నారు. డీజిల్తో నడిచే వాహనాల నుంచి వెలువడే వాయువుల ప్రభావం వల్ల పూలలో పరిమళం తగ్గిపోతోందని ఆయన వెల్లడిస్తున్నారు. రాయల్ హార్టికల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలో వాయు కాలుష్యం ఫలితంగా పూల పరిమళం గణనీయంగా తగ్గిపోతున్నట్లు తేలింది. లావెండర్, డఫోడిల్స్, మల్లెలు, గులాబీలు వంటి పూల పరిమళం ఇదివరకటి కాలంలో చాలా దూరం నుంచే నాసికకు తెలిసేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలను ‘న్యూ సైంటిస్ట్’ జర్నల్లో ప్రచురించారు. -
వాన నీరే స్వచ్ఛమైన తాగునీరు!
నీరు.. మనుగడకు ప్రాణావసరం. మారుమూల గ్రామీణులు సైతం క్యాన్ నీటిని కొనుక్కొని తాగుతున్న పరిస్థితులున్న కాలం ఇది. ఇక ఎండాకాలం వచ్చిందంటే తాగు నీటి కోసం పడని పాట్లుండవు. అయితే, చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఒక కుటుంబం కేవలం తమ ఇంటిపైన కురిసిన వాన నీటినే పట్టుకొని తాగుతున్నది. ఒకటి కాదు, రెండు కాదు.. గత ఆరేళ్లుగా వాన నీటినే పట్టుకొని, శుద్ధి చేసి, భూగర్భ ట్యాంకులో దాచుకొని ఏడాదంతా తాగుతూ పూర్తి ఆరోగ్యంగా ఉంటున్నదో కుటుంబం. అంతేకాదు.. ప్రతి కుటుంబమూ ఇలాగే వాన నీటిని ఒడిసిపట్టుకొని ఏడాదం తా తాగితే నీటి సమస్య తీరడంతోపాటు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండడమూ సాధ్యమేనని ప్రచారం చేస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. ఇది నిజం.., ఎం.సి.వి. ప్రసాద్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. 70 ఎకరాల ఆసామి. ప్రకృతి వ్యవసాయదారుడు. మదనపల్లి సమీపంలోని ‘ప్రకృతివనం’ వారి వ్యవసాయ క్షేత్రం. బోర్వెల్స్లో నీటి మట్టం అట్టడుగుకు వెళ్లేకొద్దీ టీడీఎస్ (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్) పెరిగిపోవడం వల్ల తాగడానికి పనికిరాకుండా పోతూ ఉంటాయి. మదనపల్లి ప్రాంతంలో భూగర్భ జలం లోతు టీడీఎస్ 1,500 నుంచి 3,000 మధ్యలో ఉంటుంది. పోనీ క్యాన్లలో అమ్మే ఆర్.ఓ.(రివర్స్ ఆస్మోసిస్ పద్ధతిలో శుద్ధి చేసిన) నీరు కొనుక్కొని తాగుదామా అంటే.. ఆర్.ఓ. నీటిలో టీడీఎస్ మరీ తక్కువగా(20 నుంచి 35) ఉంటున్నాయి. పి.హెచ్. 5–6 వరకు ఉండటం వల్ల ఆమ్ల గుణాన్ని సంతరించుకొని ఉంటూ.. ఆరోగ్యానికి హానికరంగా తయారయ్యాయని ప్రసాద్ భావించారు. అటువంటి పరిస్థితుల్లో నిపుణులను సంప్రదించి.. తగు జాగ్రత్తలు తీసుకుంటూ వాననీటిని దాచుకొని తాగుతున్నారు. రాయలసీమవాసులకే కాదు, ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ ప్రాంత వాసులకే కాదు... ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా ఆరోగ్యదాయకమైన తాగు నీరు వాన నీటి సంరక్షణ ద్వారానే సాధ్యమని ప్రసాద్ చెబుతున్నారు. వాన నీటిని పట్టుకొనేదిలా... రాయలసీమలో 500 మి.మీ. వర్షం కురుస్తుంది. డాబా ఇంటి పైకప్పు మీద ప్రతి చదరపు అడుగుకు 50 లీటర్ల చొప్పున వాన నీటిని ఒడిసిపడుతున్నారు. ఇంటిపై నుంచి పైపుల ద్వారా కిందికి వచ్చే నీరు తొలుత రెయిన్ ఫిల్టర్ ద్వారా ప్రవహించి మట్టి, ఆకులు, చెత్త లేకుండా క్లీన్ అవుతాయి. వాన నీరు స్వచ్ఛమైనది. అయితే, అందులో లవణాలు ఉండవు. కానీ, లవణాలతో కూడిన నీరే ఆరోగ్యదాయకమైనది కాబట్టి, ఆ నీటికి లవణాలు కలపాలి. అదీ సులభమే. వాన నీటిని మినరలైజేషన్ ట్యాంకులో నుంచి ప్రవహించేలా ఏర్పాటు చేసుకుంటే సరి. సున్నపురాయి, కుండ పెంకులు, బొగ్గులు, ఇసుక, గులకరాళ్లను పొరలుగా వేసి ఉండడం వల్ల ఈ ట్యాంకులో నుంచి ప్రవహించే నీరు ఆరోగ్యదాయకమైన తాగు నీరుగా మారతాయి. ఆ నీటిని భూమిలో నిర్మించుకున్న ట్యాంకులోకి పంపి నిల్వ చేసుకుంటున్నారు. అలా నిల్వ చేసుకునే నీటిని మోటారు ద్వారా లేదా చేతి పంపు ద్వారా ప్రతి రోజూ పంప్ చేసుకొని తాగునీరుగా ఉపయోగించుకుంటున్నారు. భూగర్భ ట్యాంకులో నిల్వ ఉండే తాగునీటికి గాలి, వెలుతురు తగలకుండా జాగ్రత్తపడితే చాలు... నాచు పట్టదు. నీరు పాడవదు. ఇలా ప్రతి ఏటా 40 వేల లీటర్ల వాన నీటిని పట్టుకొని, శుద్ధి చేసుకొని, జాగ్రత్త చేసుకున్న నీటినే ఏడాది పొడవునా ప్రసాద్ కుటుంబంలోని ఆరుగురు, ప్రకృతివనంలో పనిచేసే 50 మంది పనివారు, అతిథులు పిల్లాపాపలతో సహా నిరభ్యంతరంగా తాగుతూ ఆరేళ్లుగా ఆరోగ్యంగా ఉన్నారు. తొలుత బెంగళూరులోని కర్ణాటక ప్రభుత్వ మహిళా శిశుసంక్షేమ శాఖ వద్ద, ఇటీవల ఎస్సెన్ అండ్ కో లోనూ పరీక్షలు చేయించి నీటి నాణ్యతను నిర్థారించుకున్నామని ప్రసాద్ తెలిపారు. తాము తాగే నీటిని పరీక్షిస్తే టీడీఎస్ 208, పి.హెచ్. 7.13 మధ్య ఉందని, ఇది ఆరోగ్యదాయకమైన ఆల్కలైన్ వాటర్ అన్నారు. ఇంతకీ ఎంత ఖర్చవుతుంది? వాన నీటిలో నుంచి డస్ట్ క్లీన్ చేసే రెయిన్ ఫిల్టర్ రూ. 7,500, మినరలైజేషన్ ట్యాంకు స్టీల్దైతే రూ. 10 వేలు(సిమెంటుదైతే రూ. 4 వేలు) ఖర్చవుతుంది. భూగర్భంలో నీటి నిల్వ ట్యాంకు నిర్మాణానికి లీటరుకు రూ. 4–5 ఖర్చవుతుంది. 1500 చదరపు అడుగుల ఇంటి కప్పు నుంచి వాన నీటిని సేకరించి నిల్వ చేసుకోవడానికి సుమారు రూ. 50,000 వరకు ఖర్చవుతుంది. ఆ తర్వాత ఏ ఖర్చూ లేకుండానే.. మబ్బుల్లో నుంచి వచ్చే స్వచ్ఛమైన, అమూల్యమైన చెలమ నీటిని తాగొచ్చని ప్రసాద్ అనుభవపూర్వకంగా చెబుతున్నారు. సొంత ఇల్లు లేక లేదా మరే ఇతర కారణంగానైనా ఆర్.ఓ. నీటిని తాగే వారు కూడా.. ఆరోగ్యదాయకమైన ఆల్కలైన్ వాటర్ స్వంతంగా తయారు చేసుకొని తాగడానికీ మరో మార్గం ఉందని ప్రసాద్ అంటున్నారు. ఆర్.ఓ. వాటర్ను మినరలైజేషన్ ట్యాంకులో పోసుకొని.. 4 గంటల తర్వాత.. ఆ నీటిని పట్టుకొని తాగవచ్చని, ఈ నీరు కూడా ఆరోగ్యదాయకమైన అల్కలైన్ వాటరేనని ప్రసాద్ చెబుతున్నారు. మినరలైజేషన్ ట్యాంకును 30–50 లీటర్లు పట్టే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రతో లేదా మట్టి పాత్రతో ఎవరికి వారు తయారు చేసుకోవచ్చు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలున్నా తీర్చడానికి, వీడియో కాల్ చేస్తే ‘ప్రకృతివనం’లో తాము వాడుతున్న ఫిల్టర్లను చూపడానికి కూడా సంసిద్ధంగా ఉంటామని ప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల వారు వెంకట్రెడ్డి– 89198 96367, ఎం.సి.వి. ప్రసాద్– 94401 68816 నంబర్లలో సంప్రదించవచ్చు. -
మన్య దీపిక!
రైతులు.. అందులోనూ గిరిజనులు.. ఇక చెప్పేదేముంది! దిగుబడులు వస్తున్నాయంటే.. దళారుల పంట పండినట్లే కదా!! కానీ, రోజులన్నీ ఒకేలా ఉండవు.. కాలంతోపాటు శ్రీకాకుళం జిల్లా సీతంపేట ప్రాంత అమాయక గిరిజన రైతులూ ఇప్పుడు తెలివి తెచ్చుకుంటున్నారు. రసాయనాల్లేకుండా ప్రాణానికి ప్రాణంగా సాగు చేసిన తమ పంటలకు ఇప్పుడు తామే ధర నిర్ణయించుకుంటున్నారు. ‘మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ’ని ఏర్పాటు చేసుకున్నారు. తమ ప్రతి ఒక్కరి తలరాతను కలసికట్టుగా తిరగరాసుకుంటున్నారు. కల్లాకపటం లేని ఆ గిరిజన రైతు కలల కంపెనీకి వెలుగుబాట చూపుతున్న మార్గదర్శి.. పడాల భూదేవి! ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చైతన్య దీప్తికి ‘సాగుబడి’ నుంచి జేజేలు! కొండకోనల్లో, ప్రకృతి ఒడిలో కపటం లేని జీవించే గిరిజన రైతులు అవగాహన లేక, దారిచూపేవారు లేక, ఐక్యత లేక, దళారుల దోపిడీ వల్ల అనాదిగా పేదరికంలో మగ్గిపోతున్నారు. అయితే, శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని హిర, సీతంపేట, ఎల్ఎన్పేట, కొత్తూరు, వీరఘట్టం మండలాల్లో రైతుల సంగతి వేరు. ఈ మండలాల్లో చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం ఆధ్వర్యంలో సుమారు 4 వేల మంది గిరిజన రైతులు సంఘటితమై భూమి హక్కులను సాధించుకోవడం ద్వారా పేదరికాన్ని అధిగమిస్తున్నారు. ఉమ్మడి భూమి హక్కులు సాధించుకున్నారు. మెరుగైన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకొని, స్వల్ప ఖర్చుతోనే అధికోత్పత్తి సాధిస్తున్నారు. అంతేకాదు.. నాబార్డు సహాయంతో 10 నెలల క్రితం ‘మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్’ను ఏర్పాటు చేసుకొని తాము పండించిన పంటకు తామే ధర నిర్ణయించుకొని పడాల భూదేవి నేతృత్వంలో అధిక నికరాదాయాన్ని పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గిరిజన నేత, తన తండ్రి దివంగత చిన్నయ్య అడుగుజాడల్లో నడుస్తూ భూదేవి గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆధునిక పోకడలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరచుకుంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించే పంటకు అధికాదాయం పొందవచ్చని గిరిజన రైతులను చైతన్య పరచి ఆమె ముందుకు నడిపిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న తీరు.. భూదేవి మాటల్లోనే.. ఎకరానికి 13 క్వింటాళ్ల చిరుధాన్యాల దిగుబడి గత 13 సంవత్సరాలుగా సేంద్రియ సాగు విధానాన్ని మా గిరిజన రైతులకు అలవాటు చేశాం. ఇదే క్రమంలో చిరుధాన్యాలు సాగు ప్రారంభించాం. వ్యవసాయ యాంత్రీకరణ, సాగులో ఆధునిక విధానాలు అలవాటు చేస్తున్నాం. రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలను పాత పద్ధతిలో కేవలం ఎకరాకు మూడు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే సాధించేవారు. కొత్త పద్ధతులు అలవాటు చేసిన తరువాత మొక్కలు నాటే ‘గులి’ పద్ధతిలో సాగు చేసి, ఎకరానికి 13 క్వింటాళ్ల దిగుబడి సాధించే స్థాయికి చేరుకున్నారు. సీతంపేట ఐటీడీఏ, నాబార్డు, ఆత్మ, వ్యవసాయశాఖలతో పాటు మరి కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో చిరుధాన్యాలు, సేంద్రియ సాగుతో లాభాల బాట పడుతున్నాం.. దాదాపు 3 వేల ఎకరాల్లో రెండు వేల మంది గిరిజన రైతులు చిరుధాన్యాల సాగు చేస్తున్నారు. ఏటా రాగి వంద టన్నులు, కొర్రలు 50, జొన్న 35, సజ్జ 25 టన్నుల వరకూ దిగుబడి వస్తోంది. సొంత విత్తనాలనే వాడుకుంటున్నారు. ఈ సంవత్సరం ఏపీ సీడ్స్ సంస్థకు 9 టన్నుల రాగి విత్తనాలు కిలో రూ.36 చొప్పున పంపిణీ చేశాం. 11 మంది డైరెక్టర్లలో ఆరుగురు మహిళలు ఈ ప్రాంతంలో గిరిజన రైతులు ఎక్కువగా చిరుధాన్యాలను, పప్పుధాన్యాలను సాగు చేస్తున్నారు. వారి ఉత్పత్తులను దళారులకు, లేదా స్థానిక సంతల్లో వచ్చిన ధరకు అమ్మేసుకుంటూ ఉండటం వల్ల ఎంతో ఆదాయాన్ని నష్టపోతుండేవారు. రైతు ఉత్పత్తిదారుల కంపెనీని ఏర్పాటు చేసుకున్నాక తాము నిర్ణయించుకున్న గిట్టుబాటు ధరకు అమ్ముకోగలుగుతున్నాం. ఇందులోని 11 మంది డైరెక్టర్లలో నాతో పాటు ఆరుగురం మహిళా గిరిజన రైతులమే. మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత తమ ఉత్పత్తులకు మేమే ధర నిర్ణయిస్తున్నాం. ఐటీడీఏ సమకూర్చిన గోదాములో సుమారు రూ.5–6 లక్షల ఖరీదైన ప్రాసెసింగ్ యంత్రాలను నెలకొల్పాం. కంపెనీలో సీఈవోతోపాటు పార్ట్టైమ్ సిబ్బంది సహా 30 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు. చిరుధాన్యాల నుంచి బిస్కెట్ల వరకు.. కొర్ర బియ్యం, సామ బియ్యం, ఊద బియ్యం, జొన్నలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలు.. కంది పప్పు, మినప్పప్పు, ఉలవలు, చీపుర్లు, చింతపండు.. వంటి 25 రకాల సరుకులను శుద్ధి చేసి, చక్కగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నాం. శ్రీకాకుళం రైతుబజారులో, సీతానగరం ఐటీడీఏ ఆవరణలో ప్రత్యేక స్టాల్స్ను నిర్వహించడంతోపాటు.. విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంతోపాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు కూడా సరుకును నేరుగా వినియోగదారులకు, దుకాణదారులకు విక్రయిస్తున్నాం. అంతకుముందు కుంచం(3 కిలోలు) సేంద్రియ కందులు రూ.90లకు రైతులే స్థానికంగా అమ్ముకునేవాళ్లు. ఇప్పుడు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా రూ. 120కు బయట మార్కెట్లలో అమ్మగలిగాం. కొర్ర ధాన్యాన్ని రైతు నుంచి కిలో రూ. 40కు కొనుగోలు చేసి, శుద్ధిచేసి ప్యాకెట్లలో నింపి రిటైల్గా కిలో రూ. 80కు విక్రయిస్తున్నాం. గత పది నెలల్లో 325 మంది రైతులు తమ ఉత్పత్తులను రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా విక్రయించారు. ఇప్పటికి నెలకు రూ. 4 లక్షల టర్నోవర్ జరుగుతున్నది. విదేశీ మార్కెట్ల కోసం అన్వేషణ.. మా సేంద్రియ ఉత్పత్తులను మొదట మేము తింటున్నాం. ఉత్పత్తులను మా ప్రాంత హాస్టల్ పిల్లలకు, వివిధ రాష్ట్రాల ప్రజలకు అందిస్తున్నాం. ఇక్కడ మార్కెట్కు ఇవ్వగా మిగిలే ఉత్పత్తులను విదేశీ మార్కెట్లలో అమ్మేందుకు కూడా మార్గాలను అన్వేషిస్తున్నాం. పీజీఎస్ సర్టిఫికేషన్ పొందే దశలో ఉన్నాం. అడవి తల్లి ఒడిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగైన మా ఉత్పత్తులను వ్యక్తులు, సంస్థలు ఎవరైనా నేరుగా కొనుగోలు చేయవచ్చు. ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపుతాం. (వివరాలకు.. మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ–హిరమండలం, శ్రీకాకుళం జిల్లా– డైరెక్టర్ పడాల భూదేవి: 73820 98533, సీఈఓ కైలాస్ సాహు: 88978 65521) హాస్టళ్లకు రాగి పిండి, చిరుధాన్యాల బిస్కెట్లు.. శ్రీకాకుళం జిల్లాలోని 47 గిరిజన సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ కోసం ఏడాది కాలంగా నెలకు 9 టన్నుల రాగి పిండిని అందిస్తున్నారు. గిరిజన కుటుంబాల్లో వివిధ కారణాల వల్ల అనేక మంది ఒంటరి మహిళలుగా మిగిలిపోతున్నారు. వీరిలో 15 మందికి ఉపాధి కల్పించేందుకు చిరుధాన్యాలతో రుచికరమైన వంటకాల తయారీని ప్రారంభించాం. చిరుధాన్యాల పిండితో బిస్కెట్లు, కేక్, జంతికలు, మిక్చర్, పకోడి, రాగిపిండితో అంబలి, సంగటి, అట్లు, రొట్టెలు, లడ్డూలు తయారు చేస్తున్నాం. వాటిని రైతుబజార్లతో పాటు ప్రైవేట్ దుకాణాలకు సరఫరా చేస్తున్నాం. వాసన్ స్వచ్ఛంద సంస్థ, కృషి విజ్ఞాన కేంద్రం సాంకేతిక సహకారంతో చిరుధాన్యాలతో నెలకు రూ. 5 లక్షల బిస్కెట్లను తయారు చేస్తున్నాం. ఐటీడీఏ సహకారంతో రోజుకు 11 వేల బిస్కెట్లు గిరిజన విద్యార్థులకు అందిస్తున్నాం. – అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం ఫొటోలు: కుప్పిలి జయశంకర్, సాక్షి ఫొటో జర్నలిస్టు. -
అమ్మా! మియ్యావ్
ప్రకృతిని కూడా పుస్తకాల్లోనే చూసి నేర్చుకోవడం అలవాటైపోయింది! అయితే పుస్తకాలు తెరవకముందే పిల్లల ఆలోచనల్ని తెరిపిస్తుంది ప్రకృతి. ‘‘బుక్లో ఏమేమున్నాయి? చూద్దామా కృతి బంగారూ’’ గారంగా కూతుర్ని ఒళ్లోకి తీసుకుంది అమ్మ.అమ్మ చేతిలోని ‘మై ఫస్ట్ ఎబిసి’ బుక్ లాక్కుని తనే ఓపెన్ చేసింది కృతి. సి పేజీ ఓపెన్ అయింది.క్యాట్ అని చెప్పాలా... మాతృభాషలో పిల్లి అని నేర్పించాలా... తల్లికి మీమాంస.‘‘అమ్మా! మియ్యావ్’’ అంటూ రెండు చేతులను గొంతు కిందకు చేర్చి కళ్లు పెద్దవి చేసి మూతిని సున్నాలా చుట్టింది ఒకటిన్నర ఏళ్ల కృతి.పేజీలు తిప్పుతున్నారిద్దరూ. హెచ్ పేజీలో కోడి ఉంది. ‘హెన్’ పలకడం ఈజీ, మాటలు పూర్తిగా నేర్చుకున్న తర్వాత ‘కోడి’ అని నేర్పించవచ్చు... అనుకునే లోపే...‘‘అమ్మా! బోబు... బో బ్బో బ్బో... కొక్కొక్కో...’’ రెక్కలు విచ్చినట్లు చేతుల్ని చాచి చెప్పింది కృతి. తల్లి మురిపెంగా చూసింది కృతిని.పిల్లలకు తల్లే తొలి గురువు. తల్లి కంటే ముందు ప్రకృతే గురువు. ఆ తల్లికి చిన్నప్పుడు నేర్పించింది కూడా ప్రకృతే. పెద్దయ్యాకే పుస్తకాలు నేర్పించాయి. పుస్తకాలతో నేర్చుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి ప్రకృతిని కూడా ప్రకృతిలో కాకుండా పుస్తకాల్లోనే నేర్చుకోవడం అలవాటైపోయింది! అయితే పుస్తకాలు తెరవకముందే పిల్లల ఆలోచనల్ని తెరిపిస్తుంది ప్రకృతి.ప్రకృతిలో భాగంగానే నేర్పేవారు ఉంటారా లేక ప్రకృతే నేర్పుతుందా అని వర్డ్స్ వర్త్ ఓ చోట సంశయపడతాడు. నేర్పేవారు ఎవరైనప్పటికీ నేర్చుకోవడం అన్నది మనిషి ప్రవృత్తి. ఆ ప్రవృత్తే మనిషిని ప్రకృతి దగ్గరకు తీసుకెళుతుంది. ఆ తర్వాతే పుస్తకాలు. గురువర్యులు. -
ఉద్యోగం కన్నా ప్రకృతి సేద్యం మిన్న
ఇంటికి దూరంగా వెళ్లి చిన్నా చితకా ఉద్యోగాలు చేయటం కన్నా ఇంటి పట్టునే ఉండి సొంత భూమిలో ప్రకృతి వ్యవసాయం చేసుకోవడమే మిన్న అని భావించాడా యువకుడు. అతని పేరు కె. వేణుగోపాలనాయుడు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం కె. సీతారాంపురం గ్రామం అతని స్వస్థలం. వ్యవసాయ కుటుంబానికి చెందిన వేణు మెకానికల్ ఇంజినీరింగ్లో డిప్లొమా చేసిన తర్వాత వైజాగ్లో ఆర్నెల్లు ఉద్యోగం చేశారు. ఈ లోగా తమ లచ్చయ్యపేటలోని చెరకు ఫ్యాక్టరీ ఆవరణలో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా తరగతులు జరగడంతో తండ్రి రత్నాకర్తో కలసి ఆసక్తిగా హాజరయ్యారు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి తండ్రికి తోడుగా ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేయాలని వేణు నిర్ణయించుకున్నారు. ఆ విధంగా 9 నెలల క్రితం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 4 ఎకరాల్లో కో–4, కో–3 పశుగ్రాసం, ఎకరంలో వరి, 15 సెంట్లలో యాపిల్ బెర్ను సాగు చేయడం ప్రారంభించారు. పశుగ్రాసం సాగుకు ప్రభుత్వం నుంచి సహాయం పొందారు. సాళ్ల మధ్య 2.5 అడుగులు, మొక్కల మధ్య అడుగు దూరంలో పశుగ్రాసం నారును 4 నెలల క్రితం నాటారు. వారం, పది రోజులకోసారి స్వయంగా తానే తయారు చేసుకునే జీవామృతాన్ని డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. ఎకరంలో పెంచే పశుగ్రాసాన్ని ఇతర రైతులకు చెందిన 8 పాడి పశువులకు పచ్చిమేతగా కిలో రూ.1 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఏటా ఎకరానికి రూ. 9వేల కౌలు, రూ. 40 వేలను ప్రోత్సాహకంగా అందజేస్తున్నదని తెలిపారు. రెండేళ్ల వరకు ఇలా రైతులకు పచ్చిమేత ఇవ్వాల్సి ఉంటుందని, పదేళ్ల వరకు పచ్చిగడ్డి వస్తూనే ఉంటుందని వేణు తెలిపారు. తెలిసిన రైతు దగ్గర నుంచి 40 ఆపిల్ బెర్ మొక్కలు తెచ్చి ఎటు చూసినా 8 అడుగుల దూరంలో 15 సెంట్లలో నాటుకున్నారు. తొలి కాపుగా చెట్టుకు 3–5 కిలోల నాణ్యమైన ఆపిల్ బెర్ పండ్ల దిగుబడి వచ్చింది. జీవామృతం క్రమం తప్పకుండా డ్రిప్ ద్వారా ఇస్తున్నారు. పురుగు కనిపించినప్పుడు అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం పిచికారీ చేశారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఈ పండ్లు రుచిగా ఉన్నాయన్నారు. తొలి పంట కాబట్టి అందరికీ పంచిపెట్టానని తెలిపారు. నీలగిరి మొక్కల వల్ల పొలం పాడవుతున్నదని గ్రహించి, ఆ మొక్కలను పీకించి చెరువు మట్టి తోలించారు. ఎకరంలో వరిని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ప్రకృతి సేద్యంలో తొలి పంట కావడంతో 18 (80 కిలోలు) బస్తాల ధాన్యం దిగుబడి వచ్చిందని వేణు తెలిపారు. ఇతరులు ఎరువులు, పురుగుమందులకు ఎకరానికి రూ. 7–8 వేలు ఖర్చు చేశారని, తనకు రూ. వెయ్యి వరకు ఖర్చయిందని తెలిపారు. మొత్తం మీద ప్రకృతి వ్యవసాయం తొలి ఏడాది కూడా తమకు లాభదాయకంగానే ఉందని, మున్ముందు దిగుబడులు మరింత పెరుగుతాయని భావిస్తున్నట్లు యువ రైతు వేణు(96403 33128) సంతృప్తిగా తెలిపారు. – పోల కోటేశ్వరరావు, సాక్షి, సీతానగరం, విజయనగరం జిల్లా -
సిరిధాన్యాల విత్తనాలు ఉచితం!
అరిక.. 5 నెలల పంట. దీన్ని ఖరీఫ్లో ఆరుద్ర కార్తెలో మాత్రమే విత్తుకోవాలి. కొర్ర, అండుకొర్ర, ఊద, సామ, బరిగలు 3 నెలల పంటలు. వీటిని ఖరీఫ్లోను, రబీలోనూ సాగు చేసుకోవచ్చని డా.వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ వివరించారు. ఆయన ‘సాగుబడి’కి అందించిన వివరాలు.. ► ఎకరానికి 3 కిలోల విత్తనం అవసరం. పొలాన్ని మడులుగా విభజించి.. ఈ చిరుధాన్యాలన్నిటినీ ఒక ఎకరంలో సాగు చేసుకోవచ్చు. అవి కలిసిపోకుండా కందిని సరిహద్దు పంటగా వేసుకోవచ్చు. ► మూడు తడులు ఇవ్వడానికి నీటి సదుపాయం ఉంటే.. ఎకరానికి 8 క్వింటాళ్ల వరకూ సేంద్రియ సిరిధాన్యాలను పండించుకోవచ్చు. ఎకరానికి రూ. 2,300 ఖర్చు అవుతుంది. ► సాలు దున్నిన తర్వాత సిరిధాన్యాలు విత్తుకొని, విత్తనాలపైకి మట్టి పడేలా ఇరవాలు దున్నాలి. 5 సెం.మీ. లోతు దున్నితే చాలు. అంతకంటే లోతులో పడిన సిరిధాన్య విత్తనాల మొలక పైకి రాలేదు. ► విత్తిన వెంటనే తడి ఇవ్వాలి. రెండో తడి 30 రోజులకు, మూడో తడి 60 రోజులకు ఇస్తే చాలు. డ్రిప్, స్ప్రింక్లర్, పారించడం.. ఏ పద్ధతిలోనైనా తడి ఇవ్వొచ్చు. ► వరి కోసిన పొలాల్లో, వేరుశనగ పీకిన పొలాల్లో, కూరగాయలు పండించిన పొలాల్లో.. ఎటువంటి భూమి అయినా.. పంటల మార్పిడి కోసం ఈ రబీలో సిరిధాన్యాలను సాగు చేసుకోవచ్చు. కోతలు పూర్తయిన తర్వాత మోళ్లను భూమిలో కలియదున్నితే భూమి సారవంతమవుతుంది. ► సిరిధాన్యాల పంట నుంచి ఎకరానికి రెండు ట్రాక్టర్ల నాణ్యమైన, పశువులు బాగా ఇష్టపడే గడ్డి వస్తుంది. ► సిరిధాన్యాలను నూర్చే టప్పుడు ప్లాస్టిక్ బరకాలను ఉపయోగించి, ఇసుక, మట్టి కలవకుండా జాగ్రత్తపడాలి. ► అరిక, కొర్ర, అండుకొర్ర, ఊద, సామ, బరిగల ప్రత్యేకత ఏమిటంటే.. పొట్టు తీయని ధాన్యాలను రెండేళ్ల వరకు నిల్వ చేసుకోవచ్చు. పురుగు రాదు. రెండేళ్లు నిల్వ ఉన్నవి కూడా విత్తనానికి నిక్షేపంగా పనికొస్తాయి. విత్తనాలను గోనె సంచుల్లోనే గాలి, వెలుతురు తగిలే చోట నిల్వ చేయాలి. ప్లాస్టిక్ సంచుల్లో నిల్వచేస్తే.. ఉక్కిపోయి మొలక శాతం తగ్గవచ్చు. ► సిరిధాన్యాల బియ్యానికి మాత్రం రెండు, మూడు నెలల తర్వాత సన్న పురుగు వస్తుంది. మిక్సీతో అవసరం ఉన్నప్పుడు పొట్టు తీసుకునే మెలకువ తెలిసింది కాబట్టి, ఒకేసారి ఎక్కువ మొత్తంలో మిల్లు పట్టించుకొని అమ్ముకోలేక తిప్పలు పడాల్సిన అవసరం లేదు. ► సిరిధాన్యాలను రైతులు వెంటనే అమ్మేయకుండా.. నిల్వ చేసుకోవాలి. మిక్సీతో శుద్ధి చేసి తయారు చేసిన బియ్యాన్ని రైతు కుటుంబాలు ఇంటిల్లపాదీ అన్ని వయసుల వారూ తిని పూర్తి ఆరోగ్యవంతులుగా మారాలి. తమ గ్రామాలు, దగ్గర్లోని పట్టణాలు, నగరాల్లో వినియోగదారులకు ఏడాది పొడవునా నేరుగా అమ్ముకునే ఏర్పాట్లు చేసుకుంటే.. రైతులు అధిక నికరాదాయం పొందవచ్చు. ► రసాయనిక ఎరువులు వాడనవసరం లేదు. యూరియా ఎక్కువ వేస్తే పంట అతిగా పెరిగి పడిపోతుంది. పడిపోయిన పంటను కోయటం అధిక శ్రమ, ఖర్చుతో కూడిన పని. పైగా పడిపోయిన కంకుల్లో నుంచి గింజలను అన్ని రకాల పక్షులూ సులువుగా తినేస్తాయి. కాబట్టి రైతుకు చేతికి వచ్చే దిగుబడి బాగా తగ్గిపోతుంది. ► నిలబడి ఉన్న చిరుధాన్య పంట గింజలను జీనిగ, బుల్బుల్ వంటి అతి చిన్న పిట్టలు మాత్రమే తినగలవు. ఇవి ఎంత ఎక్కువ తిన్నా ఎకరానికి క్వింటాకు మించి తినలేవు. 7 క్వింటాళ్ల దిగుబడి మనకు వస్తుంది. ► వర్షాకాలపు పంటలో జొన్న, కొర్రలకు ఎర్రదిమ్మ తెగులు వస్తుంది. కానీ, రబీలో ఇవేవీ రావు. వరికి వచ్చే కాండం తొలిచే పురుగు, తెల్లమచ్చ(మజ్జిగ) తెగులు సిరిధాన్య పంటల జోలికి రావు. ► డ్వాక్రా మహిళా సంఘాలు, చిరు వ్యాపారులు సిరిధాన్యాలతో టిఫిన్లు, రకరకాల పిండివంటలు తయారు చేసి అమ్ముకుంటే మంచి పౌష్టికాహారాన్ని జనానికి అందించినట్టవుతుంది. మంచి ఆదాయమూ పొందవచ్చు. సిరిధాన్య వంటలకు వరిపిండి, శనగపప్పు పిండితో చేసే పిండివంటలకు ఖర్చయ్యే నూనెలో సగం సరిపోతుంది. ► రాబోయే ఖరీఫ్ కోసమైతే.. ఎకరానికి 2.5 కిలోల సిరిధాన్యాల విత్తనాలు, అరకిలో నాటు రకం కంది విత్తనాలను రైతులకు ఉచితంగా ఇప్పుడే ఇస్తాను. 2019 నాటికి తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఊళ్లలో ఐదారు రకాల సిరిధాన్యాలు పండాలి. అందరూ తినాలి. ఆసుపత్రులు వద్దు.. సిరిధాన్యాలు ముద్దు.. ► సిరిధాన్యాల ఉచిత విత్తనాలు, సాగు మెలకువల కోసం విజయకుమార్ (వెలమవారిపాలెం, వేంపల్లె మండలం, డా.వైఎస్సార్ కడప జిల్లా)ను సంప్రదించాల్సిన ఫోన్: 98496 48498. సేకరణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ‘మిక్సీ.. సిరిధాన్యాల మిల్లు’ కథనానికి విశేష స్పందన ‘మిక్సీ.. సిరిధాన్యాల మిల్లు’ శీర్షికతో గత మంగళవారం ‘సాగుబడి’లో ప్రచురించిన కథనానికి రైతుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సిరిధాన్యాలను సాగు చేసినప్పటికీ తగిన ప్రాసెసింగ్ మిల్లులు అందుబాటులో లేక నానా ఇబ్బందులు పడుతున్న రైతులకు అందుబాటులో ఉండే మిక్సీ ప్రత్యామ్నాయం గొప్ప ఊరట కలిగింది. కేవలం మిక్సీ ద్వారా సిరిధాన్యాల బియ్యాన్ని ఇంటిపట్టునే కావాలనుకున్నప్పడు సిద్ధం చేసుకునే అవకాశం ‘బుచ్చి పద్ధతి’ ద్వారా అందుబాటులోకి వచ్చినందుకు చాలా మంది రైతులు సంబరపడుతున్నారు. సిరిధాన్యాలలోని విశిష్ట ఔషధ గుణాల గురించి డాక్టర్ ఖాదర్ ప్రచారం చేస్తుండడంతో వినియోగదారుల్లో వీటి పట్ల ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో సిరిధాన్యాల శుద్ధికి మిక్సీ ఉంటే చాలన్న సమాచారం రైతుల్లో పెద్ద సంచలనమే కలిగించింది. డాక్టర్ ఖాదర్, బాలన్, మహబున్నీలకు అనేక మంది ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కొర్ర తదితర ఐదు రకాల సిరిధాన్యాల విత్తనాలు కావాలని, ఈ రబీలోనే సాగు చేస్తామని రైతులు ముందుకు వస్తుండటం విశేషం. అటవీ వ్యవసాయ పద్ధతిలో సిరిధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు, బుచ్చి పద్ధతిలో సిరిధాన్యాల శుద్ధిపై సంక్రాంతి తర్వాత తెలుగునాట రైతు శిక్షణా శిబిరం నిర్వహిస్తామని, విత్తనాలను అందుబాటులోకి తెస్తామని బాలన్ తెలిపారు. ఇదిలాఉండగా, ఎకరంలో విత్తడానికి సరిపోయే 3 కిలోల సిరిధాన్యాల విత్తనాలను రైతులకు ఉచితంగా ఇస్తానని డా. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త విజయకుమార్ ప్రకటించారు. ఎంత మంది రైతులకైనా ఎకరానికి విత్తనం ఉచితంగా ఇస్తానని, అంతకు మించి కావాలనుకుంటే కిలో రూ. 40కి ఇస్తాననటం విశేషం. -
ప్రకృతి సేద్యానికి కేరాఫ్ ఏపీ
సాక్షి, అమరావతి బ్యూరో: ‘‘ప్రకృతి సేద్యానికి కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. దేశానికే కాదు మొత్తం ప్రపంచానికే చిరునామాగా నిలుస్తుంది’’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ ప్రాంతంలో ఆదివారం ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం’పై రాష్ట్రస్థాయి శిక్షణ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 2018 సంవత్సరాన్ని ఆంధ్రప్రదేశ్కు ప్రకృతి సేద్య నామ సంవత్సరంగా నామకరణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయంలో పాత పద్ధతులకు స్వస్తి పలకాలని, ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాలని రైతులకు సూచించారు. సుభాష్ పాలేకర్ వద్ద మంచి ప్రాజెక్టు ఉందని, తాను మార్కెట్ మేనేజర్గా మారి దాన్ని ప్రమోట్ చేస్తానని బాబు వివరించారు. ప్రకృతి సేద్యంతో అధిక దిగుబడులు రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు ఏకైక మార్గం ప్రకృతి వ్యవసాయమేనని పద్మశ్రీ సుభాష్ పాలేకర్ తెలిపారు. ప్రకృతి సేద్యం ద్వారా సాగు చేసిన పంటలు వైపరీత్యాలను తట్టుకుని మంచి దిగుబడులు ఇస్తున్నాయని చెప్పారు. మూడేళ్లలో ప్రకృతి వ్యవసాయంలో ప్రపంచంలో ఏపీ రోల్మోడల్గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతే నా ధ్యాస రాష్ట్ర ప్రగతి, ప్రజలందరి పురోగతే తన నిరంతర ధ్యాస అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందరి శ్రేయస్సు, సంక్షేమం, సర్వతోముఖ వికాసానికి తాను దీక్ష తీసుకున్నానని, రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ నమూనాగా నిలపాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బాబు ఆదివారం రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా లేఖను విడుదల చేశారు. తెలుగువారు ఎక్కడున్నా ఈ పండక్కి వచ్చి సొంతగడ్డ రుణం తీర్చుకోవాలని కోరారు. తెలుగు ప్రజలందరికీ సీఎం చంద్రబాబు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
ఓ విహంగ వీక్షణం
చాలా ముద్దుగా కూడా ఉండి ఉంటుంది, ఆ పక్షి. పసుపు రంగు మెడతో ఉన్న బుజ్జి పక్షి. ఆ పిల్లవాడి తుపాకీ దెబ్బకి రాలిపోయింది. అప్పుడు ఆలోచించాడా అబ్బాయి, ఈ పక్షి పేరేమై ఉంటుందని! ఏ జాతిదై ఉంటుందని! ఆ మృత విహంగాన్నే తీసుకుని వెళ్లి మేనమామను అడిగాడు. ఆయన ప్రకృతిని ప్రేమించేవాడే. పక్షులని వేటాడుతూ ఉండేవాడే. కానీ ఆయనకీ తెలియలేదు. మేనల్లుడి ప్రశ్నల ధాటికి తట్టుకోలేక అంతో ఇంతో పరిచయం కలిగిన బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ కార్యదర్శి డబ్లు్య ఎస్ మిల్లార్డ్ దగ్గరకు తీసుకుపోయాడు. ఆ పిల్లవాడి ఆసక్తి చూసి మిల్లార్డ్ కొంత చెప్పాడు. మిల్లార్డ్కీ ముచ్చట తీరలేదు. తను సేకరించిన పక్షుల బొమ్మలను చూపించాడు. నిజానికి వాటికి ప్రాణం లేదు. పట్టుకున్న తరువాత వాటి లోపలి మాంసాన్ని తొలగించి, దూది కుక్కి మళ్లీ నిండుగా తయారుచేసే స్టఫ్డ్ పక్షులు. ఎన్ని జాతులు! ఎన్ని రంగులు! ఎన్ని పరిమాణాలు! వాటిని చూశాకే ఆ అబ్బాయిలో పక్షుల మీద ఉన్న ఆసక్తికి హఠాత్తుగా రెక్కలు వచ్చాయి. అలా ప్రపంచ పక్షిశాస్త్రానికి కొత్త వెలుగును ఇచ్చిన ఒక శాస్త్రవేత్త పుట్టాడు. ఆయనే డాక్టర్ సలీం అలీ (నవంబర్ 12, 1896– జూలై 27, 1987). ఆ పిచ్చుక అలీ జీవితం మీద ఎంత ప్రభావం చూపిందో చెప్పలేం. తన జీవిత చరిత్రకు, ‘ఒక పిచ్చుక పతనం’ అని పేరు పెట్టారాయన. ‘నువ్వు ఎగిరిపోవాలనుకుంటే, అన్నీ వదిలిపెట్టెయ్! అప్పుడే బరువు తగ్గుతుంది’ అంటాడొక తత్వవేత్త. సలీం అలీ చేసింది అదే. ఇదే విషయాన్ని తన వాస్తవ అనుభవంతో ఇంకాస్త లోతుగా చెప్పారు అలీ– ‘నీవు పక్షుల మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు చాలా విషయాలను పట్టించుకోకుండా వదిలిపెట్టాలి’. పక్షులతో ఆయన అనుబంధం ఇలా ఒక తాత్విక స్థాయికి చేరుకుంది. జీనత్ ఉన్నిసా, మొయిజుద్దీన్ దంపతుల తొమ్మిది మంది సంతానంలో నాలుగో సంతానమే సలీం. మూడో ఏటకే అమ్మానాన్న కన్నుమూశారు. ‘గోరొంక గూటికే చేరావు చిలుక’ అన్నట్టు మేనమామ అమీరుద్దీన్ తాయబ్జీ ఆయనను పెంచుకున్నాడు. ఆయనకీ పిల్లలు లేరు. ప్రకృతి అన్నా, వేట అన్నా మహా ఇష్టం. మేనల్లుడిని తాయబ్జీ మొదట జనానా బైబిల్ మెడిసిన్ మిషన్ గరల్స్ హైస్కూలులో చేర్చాడు. తరువాత సెయింట్ జేవియర్ హైస్కూలుకు మార్చాడు. ఇలా స్కూలుకి వెళ్లడం బొత్తిగా నచ్చలేదు సలీంకి. అందుకే 1913లో బొంబాయి యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ పట్టా తీసుకోగలిగాడు. అప్పుడు బీయస్సీలో చేరాడు. కానీ అల్జీబ్రా, లాగర్దమ్స్ అంటే బొత్తిగా సరిపడలేదు. మొదటి సంవత్సరంతోనే ఆగిపోయింది డిగ్రీ చదువు. మళ్లీ పక్షుల వీక్షణానికి అనుకోకుండా అవకాశం వచ్చింది. చదువు పట్ల ఏ మాత్రం శ్రద్ధ లేని సలీంని బర్మాలో ఉంటున్న అతని కుటుంబం దగ్గరికి పంపించాడు మేనమామ. అప్పటికే పెళ్లి కూడా అయింది. ఆమె పేరు తెహమినా బేగం. బర్మాలో (నేటి మైన్మార్) తేవీ అనేచోట వారి కుటుంబానికి కలప, గనుల వ్యాపారం ఉండేది. అంటే మళ్లీ అటవీ ప్రాంతానికే. కాబట్టి పక్షులను చూస్తూ కాలం గడపవచ్చు. ఏడేళ్లు చేసిన పని అదే. ఆ తరువాత భారతదేశానికి వచ్చేశాడు. మళ్లీ కాలేజీలో చేరాలని అనిపించింది. దావర్స్ కాలేజీలో వాణిజ్యశాస్త్రం చదవడానికి చేరాడు. కానీ పద్దులు కాదు, పక్షులే కళ్ల ముందు కదిలేవి. శ్రద్ధ పెట్టలేకపోయాడు. దీనిని గమనించి అప్పటి ప్రిన్సిపాల్ ఫాదర్ ఎథెల్బర్ట్ బ్లాటర్ ఉదయం పూట వాణిజ్యశాస్త్రం చదవడానికీ, సాయంత్రం జంతుశాస్త్ర తరగతులకు హాజరు కావడానికీ అనుమతించాడు.సలీం అలీ కళ్లెప్పుడూ పక్షుల కోసమే వెదుకుతూ ఉండేవన్న మాట నిజం. ఆయన వేకువనే లేచేవారు. చుట్టూ చెట్లు చేమలు, వాటి మధ్య వారి ఇల్లు ఉండేది. ఆ చెట్ల మీద గిజిగాడి గూళ్లు ఉండేవి. పోర్సిలిన్ పూలకుండీ అంతటి కళాత్మకతను గడ్డిపోచల అల్లికతోనే సాధించిన ఆ పక్షుల ప్రతిభ విస్మయ పరిచేది. ప్రతి చెట్టుకూ గూడే. అన్ని గూళ్లు ఎందుకు కడతాయి? అన్నది కూడా ఆయన శోధిం^è దలిచాడు. డాక్టర్ అలీ చాలా చిత్రమైన విషయం కనుగొన్నాడు. గిజిగాడి గూళ్లను మగ పక్షులు నిర్మిస్తాయి. గూడు సిద్ధమైన తరువాత ఆడపక్షి వచ్చి గుడ్లు పెట్టి పొదుగుతుంది. పెంచుతుంది. ఇంతలో ఆ మగపక్షి అక్కడే ఇంకో కొమ్మకు మరో గూడు కడుతుంది. కానీ ఈసారి పాత ఆడపక్షి కాదు, మరొక ఆడపక్షి వచ్చి గుడ్లు పెడుతుంది. ఈ విషయాన్నే ఆయన మొదటిసారి ఒక అంతర్జాతీయ సైన్సు పత్రికలో ప్రచురించాడు. మొదట చర్చ వచ్చినా, తరువాత అంతా అంగీకరించారు.సాయం వేళ చదువుతో జంతుశాస్త్రంలో డిగ్రీ తెచ్చుకున్నాడు సలీం. కానీ ఎంఎస్సీ లేదా పీహెచ్డీ పట్టా లేదు కాబట్టి బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీలో ఉద్యోగం రాలేదు.దేశంలో అప్పటికి ఏ విశ్వవిద్యాలయంలోను పక్షిశాస్త్రం లేదు. అప్పటికే ఒంటరి పోరాటంలో ఉన్న అలీకి తన పనిలో కొత్తదనం కనిపించలేదు. అప్పుడే బెర్లిన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఇర్విన్ స్ట్రెస్మాన్ ఆహ్వానించాడు. అలీ జర్మనీ వెళ్లాడు. అక్కడే చాలామంది పక్షిశాస్త్రవేత్తలతో కలసి తిరిగాడు. మళ్లీ 1930లో స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఒక విదేశీ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొంది వచ్చినా వలస భారతంలో ఆయనకు అనుకున్న ఉద్యోగం రాలేదు. బొంబాయి దగ్గరే ఉన్న కిహిమ్ అనే గ్రామానికి వెళ్లాడు. అక్కడ పక్షుల మీద పూర్తి స్థాయిలో పరిశోధన చేశాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ సారథ్యం ఆయనకే అప్పగించారు. వందేళ్ల చరిత్ర ఉన్నప్పటికీ అప్పటికే కడగండ్లతో కాలం గడుపుతున్న ఆ సొసైటీని డాక్టర్ సలీం కాపాడారు. భారత ప్రభుత్వం ఎంతో సహకరించింది. పక్షిశాస్త్రవేత్తగా (ఆర్నిథాలజీ) డాక్టర్ సలీం సేవలు అసమానమైనవి. ఆయన రాసిన పుస్తకాలు, ప్రచురించిన వ్యాసాలు ఈ విషయాన్ని నిస్సందేహంగా నిరూపిస్తాయి. పక్షుల జీవన సరళిని పరిశీలించడం కూడా శాస్త్రంలో భాగమేనని తేల్చారు. ఆయన పరిశోధనలో పక్షుల అలవాట్లు, ఆహారం, గుడ్లు, పిల్లల పోషణ ప్రధానంగా చోటు చేసుకున్నాయి. జీవావరణ పరిస్థితులనే ఆయన ఎక్కువ అధ్యయనం చేశారు. భారతదేశంలో పక్షుల వర్గీకరణ అనేది ఆయన వచ్చిన తరువాత మరింత శాస్త్రీయతను సంతరించుకోవడం విశేషం. ఆయన పరిశోధన వల్ల జరిగిన మేలు అసాధారణమైనది. ప్రపంచంలో దాదాపు 8,580 జాతుల పక్షులు ఉన్నాయని అంటారు. ఇందులో 1,200 జాతులు భారతదేశంలో నివసిస్తున్నాయన్న సంగతి మనకు చెప్పినవారు డాక్టర్ అలీయే. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భరత్పూర్ పక్షి సంరక్షణ కేంద్రం కొనసాగిందంటే అందుకు కారకుడు డాక్టర్ సలీం అలీ. 250 ఏళ్ల చరిత్ర కలిగిన భరత్పూర్ పక్షి రక్షణ కేంద్రం ఒక అద్భుతం. రాజస్థాన్లో ఇది ఉంది. దీనికే కియోలదేవ్ (స్థానికంగా శివుడిపేరు) ఘానా జాతీయ సంరక్షణ కేంద్రంగా తరువాత నామకరణం చేశారు. అక్కడ ఉన్న కియోలదేవ్ ఆలయం కారణంగా ఆ పేరు వచ్చింది. భరత్పూర్ సంస్థానంలో ఘానా అనేచోట ఇది సహజంగా ఏర్పడింది. దాదాపు 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించి ఉంది. శీతాకాలంలో కొన్నివేల పక్షులు వస్తాయి. స్థానికంగా 250 రకాలు ఎప్పుడూ ఉంటాయి. 1938లో అప్పటి వైస్రాయ్ లిన్లిత్గో ఆ ఏడాది 4,273 పక్షులను వేటాడాడు. 1958 ప్రాంతంలో స్థానికులు ఈ పక్షి కేంద్రాన్ని వ్యవసాయ క్షేత్రంగా మార్చడానికి ప్రయత్నం చేశారు. దీనితో సలీం అలీ నేరుగా నెహ్రూను కలసి పక్షి రక్షణ కేంద్రంగా ప్రకటింపచేశారు. 1971లో దీనికి ప్రపంచ హెరిటేజ్ సైట్గా గుర్తింపు వచ్చింది. కేరళలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కు రక్షణలో కూడా ఆయన కృషి ఉంది. ఇది కూడా ఒక అద్భుత పక్షి కేంద్రమే. 1847లో దీనిని గుర్తించారు. 90 కిలోమీటర్ల వ్యాసార్థంలో విస్తరించుకొని ఉంది. 1970 దీనికి సమీపంలో ఒక జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలని యోచించారు. దీనితో సేవ్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం మొదలయింది. చివరికి ప్రభుత్వం ఆ ప్రాజెక్టు ప్రతిపాదనను విరమించుకుంది. ఈ పార్కుతో డాక్టర్ అలీకి విశేష అనుబంధం కూడా ఉంది. ‘బర్డ్స్ ఆఫ్ కేరళ’ అని ఆయన ప్రత్యేకంగా ఒక పుస్తకమే రాశారు. మరొక పుస్తకం ‘ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్’. పక్షుల గురించి శోధనకు వెళ్లినప్పుడు అలీకి ఇంకేమీ పట్టేది కాదు. ఆయన విహంగాలను వెతుక్కుంటూ ప్రపంచమంతా తిరిగారు. ఇబ్బంది కలిగించే వాతావరణం గాని, కొండలూ కోనలూ గాని ఆయన గవేషణకు అడ్డం కాలేకపోయాయి. భారతదేశం నలుమూలలా కూడా ఆయన అన్వేషణ సాగింది. పక్షుల కోసం వెతుకుతున్నప్పుడు ఆయన కళ్లు డేగ కళ్లయిపోతాయని మిత్రులు చమత్కరించేవారు. ఖాకీ యూనిఫారమ్లో, ఆకుపచ్చ టోపీతో నెరిసిపోయిన జుట్టుతో, చిరుగెడ్డంతో కనిపించేవారాయన. ఇంకో మిత్రుడు ‘తెల్ల వెంట్రుకల బుల్బుల్ వస్తోంది!’ అనేవాడు. ‘నేను బాగా పాడతాను కాబట్టి, ఆ పేరు సరిగానే ఉంది. కానీ నాకు రాబందు అన్న పేరైతే బావుంటుంది’ అని డాక్టర్ అలీ చెప్పేవారు. మెడలోఒక బైనాక్యులర్ వేసుకుని, చేతిలో పేజీలు నలిగిన చిన్న డైరీతో అడవుల వెంట, కొండల వెంట, చెట్ల మధ్య నుంచి ఆయన మైళ్ల తరబడి నడిపోతున్న దృశ్యం మిత్రులకు నిరంతరం ఆశ్చర్యంగా అనిపించేంది. ఎనిమిది పదులు దాటిన తరువాత కూడా ఆయనలో అదే తృష్ణ కనిపించేది. రెక్కలు సాచి విహాయసంలో ఎగిరే పక్షిని చూస్తూ ఉండడం ఆయనకొక వ్యసనం. ఆయన పక్షుల మనస్తత్వం ఎంత బాగా గ్రహించారో చూస్తే వింతనిపిస్తుంది. చాలా విమానాశ్రయాలకు పక్షుల బెడద మొదలైంది. ఈ విషయం ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. పక్షులు అక్కడికి ఎందుకు వస్తున్నాయో దర్యాప్తు చేయండని సలహా ఇచ్చారు. నిజమే, అంత గడబిడ ఉన్నచోటకి ఆ చక్కని ప్రాణులు ఎందుకు వస్తాయి? పరిశోధించిన అధికారులకు ఒక విషయం తెలిసింది. ఇలాంటి ఫిర్యాదు వచ్చిన విమానాశ్రయాలకు సమీపంలో కబేళాలు ఉన్నాయి. అందుకే పక్షులు అక్కడికి చేరుతున్నాయి. వాటి తప్పు కాదు. ఆయన 91వ ఏట కన్నుమూశారు. అప్పటికి మూడేళ్ల ముందు కూడా ఆయన ఒడిశాలోని తూర్పు కనుమలలో తిరిగారు. నల్లమెడ కొంగను చూడడం కోసం లద్ధాక్ చలిలో తిరిగారు. ఫ్లెమింగో పక్షి గూడును చూడ్డానికి ఏం చేశారో తెలుసా? రాణ్ ఆఫ్ కచ్లో ఒంటె మీద పదిగంటల పాటు ప్రయాణించారు. కానీ ఆ గూడును చూడడం సాధ్యపడలేదు. అయినా నిరుత్సాహపడలేదు. భారత్,పాక్ దేశపు పక్షులు అన్న అంశంతో ఆయన చేసిన పరిశోధనను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రెస్ వారు 1968, 1974 సంవత్సరాల మధ్య పది వాల్యూమ్లుగా ప్రచురించారు. ఏడు దశాబ్దాల పాటు పక్షుల గురించి అన్వేషించి, ఒక శాస్త్రాన్ని మథించినా జీవితపు చరమాంకంలో ఆయన అన్న మాట అందరినీ విస్తుపోయేటట్టు చేస్తుంది. ‘నాకు ఇంత కీర్తిప్రతిష్టలు రావడం బాగానే ఉంది కానీ, పక్షిశాస్త్ర శోధనలో ఇక్కడ దాదాపు ఏమీ జరగలేదనే అనుకుంటాను. నేను నూతిలో కప్పలాంటి వాడిని. లేదంటే, అందరూ గుడ్డివాళ్లే ఉన్నచోట ఒంటికన్నువాడిని’ అని సవినయంగా చెప్పుకున్నారు. ప్రఖ్యాత జీవావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ మాత్రం అలీ గురించి గొప్ప మాట అన్నాడు. ‘ఈ 20వ శతాబ్దంలో జీవజాలం మీద ఏ ఒక్కరు చేయనంత కృషి ఆయన ఒక్కరే చేశారు.’ చివరికి ఆ పక్షిప్రేమికుడు కేన్సర్ వ్యాధికి గురయ్యారు. 91వ ఏట హంస ఎగిరిపోయింది. ∙డా. గోపరాజు నారాయణరావు -
'నేను చిన్న చీమలా ఉన్నా'
ప్రకృతి ఎవరినైనా అలరిస్తుంది. అందునా హిమాలయాల అంచున ఉన్న ధర్మశాల ప్రకృతి అందాలకు ఎవరినా ఫిదా అవ్వాల్సిందే. భారత కోచ్ రవిశాస్త్రి సైతం ఇందుకు అతీతుడు కాదు. ధర్మశాల చుట్టూ ఉన్న ప్రకృతి ఆయను విపరీతంగా నచ్చిందంట. అంతే ఇంకేముంది సోషల్ మీడియా ట్విట్టర్లో ధర్మశాల, పక్కనే ఉన్న హిమాలయాలను పొగుడుతూ పోస్టుపెట్టేశాడు. చుట్టూ ఉన్న భారీ అందాల మధ్య తానో చిన్న చీమగా ఉన్నానంటూ వ్యాఖ్యానించాడు. హిమాలయాల అందాలు అద్భుతంగా ఉన్నాయని, క్రికెట్కు చాలా అనుకూలంగా ఉందంటూ ధర్మశాలను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక భారత్-శ్రీలంకల మధ్య జరగున్న మొదటి వన్డే మ్యాచ్కు రంగం సిద్ధమౌతోంది. ఇప్పటికే 1-0 తేడాతో టెస్టు సిరీస్ గెలుకున్న విరాట్ సేన వన్డేల్లోను తన సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ ఇప్పటికే ధర్మశాలలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. Feel like an ant with the giant in the background. THE MIGHTY HIMALAYAS. What a setting for #cricket #TeamIndia pic.twitter.com/hPoseRuo6H — Ravi Shastri (@RaviShastriOfc) December 8, 2017 Breathe easy in Dharamsala #TeamIndia #INDvSL pic.twitter.com/DpvQZ7KQfq — Ravi Shastri (@RaviShastriOfc) December 8, 2017 -
అటవీ జంతువుల ఆత్మీయ క్షేత్రం!
వన్యప్రాణులతో సామరస్యపూర్వక జీవనానికి ఈ క్షేత్రం నిలువుటద్దం. పండించే పైరు, నేలలో జీవరాశిని ఇన్నాళ్లు రైతు నేస్తాలంటున్నారు. సమీప జనావాసాలపై విరుచుకుపడే అటవీ జంతువులు కూడా ప్రకృతిసేద్యం పుణ్యమాని ఇప్పుడు రైతు మిత్రులుగా మారాయి. ప్రకృతి సేద్యం గొప్పతనాన్ని ఇదీ అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతున్నాయి. ప్రకృతిసేద్యంలో నేల బాగుపడటమే కాదు పర్యావరణ వ్యవస్థ యావత్తూ పదికాలాల పాటు పదిలంగా ఉంటుందనటానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ తేయాకు క్షేత్రం. అటవీ జంతువులకు ముఖ్య విహారయాత్రా స్థలంగా మారిన ఆ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సృష్టించిన ఆ అభ్యుదయ రైతు టెన్జింగ్ బోడోసా. అస్సాంలోని ఉదలగురి జిల్లా కచిబారీ అతని స్వగ్రామం. ప్రకృతి సేద్యంలో పర్యావరణ వ్యవస్థ సమతుల్యత ఏర్పడుతుందనటానికి తన పొలాన్ని ప్రత్యక్ష ఉదాహరణగా నిలిపాడు. తండ్రి చనిపోవటంతో ఆరో తరగతిలో చదువు మానేసి మలేసియాకు చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీలో పనికి కుదిరాడు. 2006లో తిరిగి ఇల్లు చేరి రసాయన సేద్యంలో టీ తోటల సాగు చేపట్టాడు. పురుగుమందుల పిచికారీతో తరచూ అస్వస్థతకు గురవ్వటం, కుంటలోని చేపలు చనిపోవటం అతన్ని ఆలోచనలో పడేశాయి. ప్రతి ఒక్కరూ టీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. అలాంటి వారికి టీతో పాటు కాస్త విషం కూడా ఇస్తున్నామా అని అంతరాత్మ నిలదీసినట్టనిపించేది. కొంత అంతర్మథనం తరువాత సేంద్రియ పద్ధతుల్లో టీ తోటలను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. 2007లో సేంద్రియ తేయాకు తోటల పెంపకాన్ని ప్రారంభించి అనతికాలంలోనే నాణ్యమైన పంటను అధిక దిగుబడిని సాధించాడు. అస్సాం రాష్ట్రంలోనే తొలి సేంద్రియ తేయాకు రైతుగా గుర్తింపు పొందాడు. శ్రమకోర్చి అమెరికా, జర్మనీ వంటి పలు దేశాలకు సేంద్రియ తేయాకును ఎగుమతి చేశాడు. ఏటా రూ. 60–70 లక్షల ఆదాయం ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు. 30 వేల మంది రైతులకు సేంద్రియ తేయాకు తోటల సాగులో టెన్జింగ్ శిక్షణ ఇచ్చారు. అంతేకాదు ప్రపంచంలోనే తొట్టతొలి ఏనుగుల స్నేహపూర్వక వ్యవసాయ క్షేత్రాలుగా టñ న్జింగ్ టీ తోటలు గుర్తింపు పొందాయి. అటవీ జంతువులకు ఆటపట్టు అక్కడ తేయాకు తోటల రైతులు ఏనుగుల మందలను పొలాల్లోకి రాకుండా బెదర గొట్టేందుకు చెట్లను నరికి మంటలు వేయటం, కంచె వేయటం చేసేవారు. టెన్జింగ్ పొలం అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉంది. అతను అటవీ జంతువులతో వైరానికి బదులు చెలిమిని పెంచుకున్నాడు. 7 ఎకరాల్లో సేంద్రియ తేయాకుతో పాటు రకరకాల పండ్లు, కూరగాయ పంటలను కలిపి మిశ్రమ పంటలుగా సాగుచేయటం ద్వారా పర్యావరణ సమతుల్యం ఏర్పడింది. అనుకూలమైన వాతావరణం ఏర్పడటంతో అనేక అటవీ జంతువులు, పక్షులకు అతని పొలం ఆవాసంగా మారింది. అడవి పందులు, నెమళ్లు, జింకలకు అది ఇష్టమైన విహార స్థలం. అక్కడ జంతువులు అడవిలో ఉన్నట్టే ప్రవర్తిస్తాయి. తోటలో స్వేచ్ఛగా సంచరిస్తాయి. వచ్చిపోయే అటవీ జంతువులతో పొలం కళకళలాడుతుంది. బారులు తీరుతున్న పర్యాటకులు ఏనుగులకయితే టెన్జింగ్ పొలం ముఖ్య విహార యాత్రా స్థలం గా మారింది. అవి ఇష్టంగా తినే వెదురు చెట్లను పొలం చుట్టూ నాటాడు. అక్కడ గడపటాన్ని ఏనుగులు అమితంగా ఇష్టపడతాయి. కొన్నిసార్లు 70–80 ఏనుగుల మందలు గుంపులు గుంపులుగా కలసి తోటలో తిరుగుతుంటాయి. అప్పుడప్పుడు వాటి తొక్కిసలాటల్లో కొంతమేర పంట నష్టం జరుగుతుంది. ఒకసారి అవి ఇంటిని కూడా నాశనం చేశాయి. ‘అయితే అడవి జంతువుల కోసం కూడా నేను పంటలను సాగు చేస్తున్నానని భావిస్తా.. అవి నా జీవితంలో సంతోషం నింపాయి’ అని మురిసిపోతారాయన. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రపంచ దేశాల నుంచి ఏటా వందల మంది పర్యాటకులు వస్తారు. కొందరు నెలల తరబడి అక్కడే ఉంటారు. రెండేళ్ల క్రితం పొలంలో ఏనుగులమధ్య పోట్లాట జరిగింది. ఒక ఏనుగు చనిపోవటంతో టెన్జింగ్ పొలం వార్తల్లోకి వచ్చింది. ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్’ సంస్థ అధికారులు పొలాన్ని సందర్శించి.. ఆ తోటలో ఏనుగులు స్వేచ్ఛగా సంచరించటాన్ని చూసి సంతోషించారు. ప్రపంచంలోనే తొలి ఏనుగుల స్నేహపూర్వక వ్యవసాయ క్షేత్రంగా టెన్జింగ్ తేయాకు తోటను ధ్రువీకరించారు. మనుషుల సుఖసంతోషాలకు దగ్గరి దారి ప్రకృతిని గౌరవించటం మాత్రమే అని టెన్జింగ్ తరచూ చెబుతుంటారు. ఆయన నమ్మకాన్ని అక్కడి అటవీ జంతువులు అనుక్షణం నిజం చేస్తుండటం ప్రకృతి సాక్షిగా ఒక అద్భుతం! – సాగుబడి డెస్క్ . -
ప్రకృతి ప్రేమికుడు వైఎస్ఆర్
సింహాద్రిపురం : ప్రకృతి ప్రేమికుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అని.. ప్రకృతి విధ్వంసకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైఎస్సార్సీపీ రైతు విభాగపు రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన సింహాద్రిపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతుల పాలిట ప్రకృతి జగనన్న అని, సకాలంలో సరిపడా వానలు కరుణిస్తేనే రైతాంగం సులువుగా బయటపడుతారన్నారు. ఇంతకమునుపు చంద్రబాబు పాలనలో ప్రకృ తి వైఫరీత్యాలు రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయన్నారు. వైఎస్సార్ హయాంలో ప్రకృతి కరుణించి సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండాయని, లాభసాటి ధరలతో రైతాంగం సంతోషంగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో గత మూడేళ్లు వర్షాలు లేక కరువు కాటకాలతో రాయలసీమ ప్రజలు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితి నెలకొందన్నారు. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల ఖరీఫ్లో చాలావరకు పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రకృతి ప్రేమికులైన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ పాదయాత్ర మొదలయ్యే తెల్లవారుజామున భారీ వర్షం కురవడం ఇందుకు నిదర్శనమన్నారు. ప్రకృతి దేవత స్వాగతం పలికందన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ఎక్కడ కార్యక్రమం చేపట్టినా ప్రకృతి వర్షం ద్వారా స్వాగతిస్తూనే ఉందన్నారు. ప్రకృతి కరుణవల్ల వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమన్నారు. రాబోవు రోజుల్లో తిరిగి వైఎస్సార్ పాలన చూస్తారన్నా రు. అంతకముందు వైఎస్ విగ్రహానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రైతు విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అరవిందనాథరెడ్డి, భరత్కుమార్రెడ్డి, కర్నూలు జిల్లా రైతు విభాగపు అధ్యక్షుడు శివరామిరెడ్డి, కర్నూలు జిల్లా రైతు విభాగపు జనరల్ సెక్రటరీ భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయదారుల సమ్మేళనం
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి రెండో సమ్మేళనం అక్టోబర్ 14వ తేదీ(శనివారం)న విజయవాడలో జరగనుంది. మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఫార్మసీ కాలేజీ ఆవరణలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి ప్రకృతి వ్యవసాయదారులు తరలిరావాలని ఏపీ గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం అగ్ర నేత కుమారస్వామి(94401 27151) పిలుపునిచ్చారు. సిరిధాన్యాల ‘అటవీ కృషి’పై డా. ఖాదర్ శిక్షణ అరిక, సామ, కొర్ర తదితర సిరిధాన్యాలను ‘అటవీ కృషి’ పద్ధతుల్లో సాగు చేయడం, శుద్ధి చేయడం, సిరిధాన్యాలను ప్రధాన ఆహారంగా తినడం ద్వారా జబ్బులను పారదోలడంపై కర్ణాటకకు చెందిన స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ మైసూర్ సమీపంలోని తన సిరిధాన్య క్షేత్రంలో రైతులకు, ఔత్సాహికులకు సెప్టెంబర్ 30 – అక్టోబర్ 1 తేదీల్లో శిక్షణ ఇస్తారు. ‘అటవీ చైతన్యం’ అనే ప్రకృతి సేద్య ద్రావణాన్ని తయారు చేసుకోవడం, వాడటం ఎలాగో నేర్పిస్తారు. ఈ పద్ధతిలో సాగయ్యే మిశ్రమ పంటల క్షేత్రాన్ని చూపిస్తారు. 28వ తేదీలోగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. ప్రవేశ రుసుము: రూ. 2 వేలు. వివరాలకు 097422 58739 నంబరులో వాట్సప్/మెసేజ్ ద్వారా సంప్రదించవచ్చు. గో ఆధారిత ప్రకృతిసేద్యంపై అక్టోబర్ 10న బసంపల్లిలో శిక్షణ అనంతపురం జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు తాడిమర్రి నాగరాజు దేశీ గో ఆధారిత ప్రకృతిసేద్యంపై రైతులకు ప్రతి నెలా మొదటి సోమవారం శిక్షణ ఇస్తున్నారు. అక్టోబర్ 10న సీకే పల్లి మండలం బసంపల్లి గ్రామంలో ఉదయం 9 గం. నుంచి సా. 4.30 వరకు శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల రైతులు ముందుగా ఫోన్ చేసి పేర్లు నమోదు చేయించుకోవాలి. ప్రవేశ రుసుము రూ. 100. ఇతర వివరాలకు నాగరాజు (94407 46074) పార్థసారధి (96633 67934)లను సంప్రదించవచ్చు. 1న వరి, కూరగాయల సాగుపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో అక్టోబర్ 1న వరి, కూరగాయల ప్రకృతి సేద్యంపై ఉద్యాన అధికారి రాజా కృష్ణారెడ్డి, రైతు ధర్మారం బాజీ శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863 2286255 నంబర్లలో సంప్రదించవచ్చు. -
కువకువల సంధ్యారాగం
ఎర్రటి సూరీడు నల్లటి మబ్బుల మాటుకు జారుకుంటున్న వేళ..నీలాకాశం కాషాయం కాటుక దిద్దుకుని మెరిసిపోతుంటే.. పగలంతా అలసిసొలసిన గువ్వలు ఆ ప్రకృతి కాన్వాస్పై ఒక్క చోట చేరి ఆత్మీయ సరాగాలు ఆలపిస్తున్నట్లుంది కదూ ఈ చిత్రం. ఈ మనోహర దృశ్యం ప్రత్తిపాడు సమీపంలోని పాత మద్రాసు రోడ్డు వెంబడి శుక్రవారం కనువిందు చేసింది. –ప్రత్తిపాడు -
సహజ ఎరువుపై శ్రద్ధలేదు!
అన్ని జిల్లాల్లో మొక్కుబడిగా సాగుతున్న కంపోస్టు పిట్స్ల నిర్మాణం ♦ మంజూరైన కంపోస్టు పిట్స్ 1,68,725 ♦ నిర్మాణంలో ఉన్నవి 19,631 ♦ నిర్మాణాలు పూర్తయినవి5,669 ♦ ప్రారంభానికి నోచుకోనివి1,43,425 పశువుల పేడ, వ్యర్థా ల కోసం నిర్మించు కునే కంపోస్టు పిట్ల కోసం ఒక్కో రైతుకు రూ.4,040 చొప్పున చెల్లిస్తున్నారు. ఇక ప్రత్యేకంగా నిర్మించే వర్మీ/నాడెప్ కంపోస్టు పిట్స్ల కోసం రూ.12 వేలు చెల్లిస్తున్నారు. వీటిని తమ ఇంటి ఆవరణలో గానీ, వ్యవ సాయ భూమి వద్ద గానీ నిర్మించు కునే వెసులుబాటు కల్పించారు. జనగామ నుంచి ఇల్లందుల వెంకటేశ్వర్లు : వ్యవసాయ రంగానికి చేయూత అందించేందుకు ప్రవేశపెట్టిన పథకాలు నిర్వీర్యమవుతున్నాయి. పథకం ప్రారంభంలో చూపిన శ్రద్ధ చివరివరకు కొనసాగకపోవడంతో ఈ పథకాలు అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోతున్నాయి. సహజ ఎరువు తయారీని ప్రోత్స హించి రైతులకు పెట్టుబడిని తగ్గించడానికి తీసుకొచ్చిన ‘వర్మీ/ నాడెప్ కంపోస్టు పిట్స్’ నిర్మాణం ముందుకు సాగడం లేదు. వీటి తయారీపై రైతులకు అవగాహన కల్పించకపోవడం, అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో ఈ పథకం కాగితాలకే పరిమితమైంది. ప్రచారం లేక పురోగతి శూన్యం.. రైతులు ఇంటి ఆవరణలో సహజ ఎరువులు తయారు చేసుకోవడా నికి ఏర్పాటు చేసుకునే నిర్మాణాలకు ప్రభుత్వమే నిధులు సమకూ రుస్తున్నదన్న విషయం రైతులకు తెలియజేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఈ కారణం వల్లే ఆయా జిల్లాలకు కేటాయించిన నిధులు సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. నిర్మాణాల కోసం నిధులు.. సాధారణంగా రైతులు పశువుల పెంటను ఎరువుగా ఉపయోగిస్తారు. దీన్ని పెరట్లోనో, ఇంటి సమీపంలోనో ఏర్పాటు చేసుకుంటారు. అయి తే దీని చుట్టూ గోడ లాంటి నిర్మాణం ఏర్పాటు చేసి ఓ పద్ధతి ప్రకారం పెంటను ఎరువుగా మార్చుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధు లను మంజూరు చేస్తోంది. అయితే ఈ విషయం రైతులకు తెలీదు. నిర్మాణాలు అంతంత మాత్రమే.. కంపోస్టు పిట్స్ల నిర్మాణాల్లో వరంగల్ రూరల్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా రంగారెడ్డి, జోగులాంబ, ఖమ్మం జిల్లాలు చివరి స్థానాల్లో ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లాకు 10,878 కంపోస్టు పిట్స్ మంజూరైతే 1,224 కంపోస్టు పిట్స్ను మాత్రమే నిర్మించారు. ఇక రంగారెడ్డి, జోగులాంబ, ఖమ్మం జిల్లాల్లో ఒక్క నిర్మాణం కూడా పూర్తి కాలేదు. జయశంకర్, వరంగల్ అర్బన్, కొమురం భీం, మహబూబా బాద్, భద్రాద్రి, మేడ్చల్, నిర్మల్, వనపర్తి, సిరిసిల్ల, కరీంనగర్, పెద్ద పల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, వికారాబాద్ జిల్లాలు కంపోస్టు పిట్స్ నిర్మాణాల్లో బాగా వెనుకబడి ఉన్నాయి. -
‘సిరి’ధాన్యాలే నిజమైన ఆహార పంటలు!
► కర్ణాటకలో సంప్రదాయ ప్రకృతి సేద్య పద్ధతి ‘అటవీ కృషి’ (కాడు కృషి) పునరుద్ధరణ ► ‘కాడు చైతన్యం’ పేరిట ద్రవరూప ఎరువే అటవీ కృషికి మూలాధారం ► రసాయనాల్లేకుండా వర్షాధారంగానే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల మిశ్రమ సాగే అసలైన వ్యవసాయమని ప్రచారోద్యమం ► కొర్రలు, అండుకొర్రలు, అరికలు, ఊదలు, సామలు వంటి సిరిధాన్యాలు తింటే కేన్సర్, మధుమేహం తదితర జబ్బులన్నీ వాటికవే నయమవుతాయంటున్న అరుదైన స్వతంత్ర శాస్త్రవేత్త ► అమెరికాలో పెద్ద ఉద్యోగం వదిలి వచ్చి మైసూరు ప్రాంతంలో స్థిర నివాసం.. ► 20 ఏళ్లుగా ఊరూరా తిరిగి ప్రచారం చేస్తూ జన్మ సార్థకం చేసుకుంటున్నడాక్టర్ ఖాదర్ స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. వ్యక్తి కాదు.. శక్తి!! ప్రజల ఆహారపు అలవాట్లను, రైతుల సాగు పద్ధతిని రసాయన రహితంగా, పంటల సరళిని అత్యంత ఆరోగ్యదాయకమైన రీతిలోకి, ప్రకృతికి అనుగుణమైన పద్ధతుల్లోకి మార్చేందుకు గత రెండు దశాబ్దాలుగా విశేష కృషి చేస్తున్నారు డాక్టర్ ఖాదర్. వర్షాధారంగా కొద్దిపాటి నీటి(200 ఎం.ఎం.)తో పండే చిరుధాన్యాలే అసలైన ఔషధ విలువలున్న ఆహార పదార్థాలని, మానవాళిని పీడిస్తున్న ఈ కాలపు సకల రోగాలకు ఈ ‘సిరి’ధాన్యాలే ప్రకృతి మనకు ప్రసాదించిన సంపూర్ణ ఆహారమంటూ డాక్టర్ ఖాదర్ ప్రచారోద్యమం చేపట్టారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పేద కుటుంబంలో జన్మించినప్పటికీ శ్రద్ధగా చదువుకొని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో స్టెరాయిడ్స్పై పీహెచ్డీ పూర్తి చేశారు. అమెరికా వెళ్లి పర్యావరణ సంబంధమైన అంశాలపైన, రసాయనాలకు విరుగుడు కనుగొనే అంశాలపైన వివిధ కంపెనీలలో పదేళ్ల పాటు పనిచేశారు. ఆధునిక మానవ సమాజం తినకూడనివి తింటూ దారుణమైన రోగాల పాలు కావడంతోపాటు.. భూమాతను రసాయనిక వ్యవసాయంతో నాశనం చేసుకుంటూ ఉండటం ఆయనను అమెరికాలో నిలువనీయకుండా చేసింది. 1997లో తిరిగి వచ్చి మైసూరులో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. పురాతన భారతీయ ప్రకృతి సేద్య పద్ధతి అయిన ‘అటవీ కృషి’ (కాడు కృషి)ని పునరుద్ధరించి, కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరిగి రైతులకు, గిరిజనులకు పరిచయం చేస్తున్నారు. 2009 నుంచి స్వయంగా 7 ఎకరాల్లో కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, సామలు, అరికలు వంటి సిరిధాన్యాలతోపాటు నూనెగింజలు, పప్పుధాన్య పంటలను కలిపి పండిస్తూ ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. మధుమేహం, కేన్సర్, థైరాయిడ్ తదితర దీర్ఘకాలిక జబ్బులతోపాటు రైతుల ఆత్మహత్యలను సైతం పారదోలే వజ్రాయుధాలు ‘సిరిధాన్యాలే’నని ఎలుగెత్తి చాటుతున్నారు! వేలాది మంది రైతులు, రోగులకు ఆపద్బాంధవుడిగా మారారు. ఇటీవల విజయవాడ విచ్చేసిన డా. ఖాదర్తో ‘సాగుబడి’ ముఖాముఖిలో ముఖ్యాంశాలు.. ► శాస్త్రవేత్తగా అమెరికాలో పదేళ్లు పని చేసి, కర్ణాటకలోని మైసూరుకు తిరిగి వచ్చి ‘కాడు కృషి’ అనే అటవీ వ్యవసాయ పద్ధతికి రూపకల్పన చేశారు. అంతరించిపోతున్న ‘సిరి ధాన్యాలను స్వయంగా సాగు చేస్తూ.. ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు కదా.. వీటి గురించి వివరిస్తారా..? భారతదేశంలో మానవులంతా వెయ్యేళ్ల క్రితం నుంచే మన ముందు తరాల వాళ్లు అద్భుతమైన ‘సిరిధాన్యాల’ను రోజువారీ ప్రధాన ఆహారంగా తింటూ వచ్చారు. కొర్రలు, అండు కొర్రలు, ఊదలు, సామలు, అరికలు.. ఈ ఐదూ దేవుడు ప్రసాదించిన అత్యద్భుతమైన నిజమైన ఆహార ధాన్యాలు. అందుకే వీటికి నేను ‘సిరి ధాన్యాలు’ అని పేరుపెట్టాను. ఇవే పండించుకొని మరీ తింటున్నాను. కర్ణాటకలోని గ్రామాల్లో తిరిగి రైతులను స్వయంగా కలిసి వారికి వీటి విత్తనాలు ఇచ్చి, పండించమని ప్రోత్సహిస్తున్నాను. కనీసం వెయ్యి చోట్లకు వెళ్లి మీటింగ్లు పెట్టి చెప్పాను. ఇప్పుడు కర్ణాటక అంతటా సిరిధాన్యాలు పెంచడం, వాడకం పెరిగాయి. మానవులు ఆధునికత పేరిట ఇవ్వాళ కంపెనీల మాటలు విని తినకూడనివి తింటున్నారు. ఇవ్వాళ మధుమేహం, కేన్సర్, ఊబకాయం, మోకాళ్ల నొప్పులు, థైరాయిడ్ వంటి ఎన్నో జబ్బులు ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నాయి. పండించకూడని పంటలు రసాయనిక పద్ధతుల్లో పండిస్తున్నారు. హరితవిప్లవం వల్ల 48 శాతం పంట భూములు పూర్తిగా నిర్జీవమై నిస్సారమై మరుభూములుగా మారిపోతున్నాయి. అమెరికాలో శాస్త్రవేత్తగా పనిచేస్తూ నిశితంగా అధ్యయనం చేసి.. తినే తిండికి కొత్త జబ్బులకు ప్రత్యక్ష సంబంధం ఉందని గ్రహించాను. ఈ గ్రహింపు వచ్చినదే తడవుగా ‘నేను చేయాల్సింది ఉద్యోగం కాదు స్వదేశంలో రైతులు, ప్రజలతో కలిసి పనిచేయాలి’ అనిపించింది. అంతే.. ఉద్యోగం వదిలేసి వచ్చి 20 ఏళ్లుగా మైసూరు ప్రాంతంలో స్వతంత్రంగా పనిచేస్తున్నాను. అంతరించిపోతున్న సిరిధాన్యాల విత్తనాలను సేకరించి రైతులకిచ్చి సాగుచేయించాను. 2009లో 7.5 ఎకరాల బంజరు కొని నేను కూడా ‘అటవీ కృషి’ చేస్తున్నాను. ► సిరిధాన్యాల ప్రాధాన్యం ఏమిటి? సిరిధాన్యాలు మన దేశంలో మాత్రమే ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. బ్రిటిష్ వాళ్లు మన దేశానికి వచ్చిన తర్వాత వీటిని చిన్నచూపు చూడడం ప్రారంభమైంది. చిరుధాన్యాలని, తృణధాన్యాలని అంటూ వీటిని తినాల్సిన అవసరం లేదన్న భావన కల్పించడం వల్ల ఈ పంటలు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. కేవలం 128 ఏళ్ల నుంచి మాత్రమే మనం వరి బియ్యం తింటున్నాం. నీటి వసతి బాగా ఉన్న దగ్గరే వరి, గోధుమ పండేవి. మొదట్లో అడపాదడపా పండుగలకో పబ్బాలకో తినే వాళ్లం. వరి, గోధుమలు, చెరకు వంటి అధికంగా నీరు అవసరమయ్యే పంటలను రసాయనాలతో పండిస్తున్నాం. కిలో వరి బియ్యం పండించడానికి 8 వేల లీటర్ల నీరు అవసరం. అడవుల నరికివేత కారణంగా నదులు, రిజర్వాయర్లు ఖాళీ అయిపోతున్నాయి. ఇంకెన్నాళ్లీ దుర్గతి? కానీ, కిలో కొర్రలు పండించడానికి 200 లీటర్ల నీరు చాలు. నాలుగు వర్షాలు పడితే చాలు 3 నెలల్లో పంట పండుతుంది. అండు కొర్రలు 75 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. ► మీ ‘అటవీ వ్యవసాయం’ ప్రత్యేకత ఏమిటి? కన్నడలో కాడు అంటే అడవి అని అర్థం. వ్యవసాయం అనే మాట నాకు ఇష్టం లేదు. అడవిని నాశనం చేసి వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం పేరుతో, ఆధునిక పద్ధతుల పేరుతో వాణిజ్య పంటలను కంపెనీల మాటలు విని రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు కుమ్మరించి సాగు చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదన ఆశ చూపించి బీటీ పత్తి, చెరకు, వరి, గోధుమ వంటి అధిక నీరు అవసరమయ్యే ఏక పంటలను రైతుల చేత సాగు చేయిస్తున్నారు. భూమి తల్లిని సర్వనాశనం చేస్తున్నాం, మనల్ని మనం సర్వనాశనం చేసుకుంటున్నాం. ఇప్పటికే 38 శాతం సాగు భూములు మరుభూములుగా మారాయి. భూమి తల్లి ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇది అందరూ తెలుసుకోవాలి. అందుకే వ్యవసాయం అనే మాట నాకు ఇష్టం లేదు. అటవీ కృషి అని అంటున్నాను. నిజమైన ఆహార పంటలు పండించుకుంటూనే భూమి తల్లిని, జంతుజాలాన్ని కాపాడుకోవడానికి అటవీ కృషిని ప్రారంభించాం. గుప్పెడు అడవి మట్టితో తయారు చేసి వాడుకునే ‘అటవీ చైతన్యం’ అనే ద్రవరూప ఎరువు.. ప్రతి రైతూ తన సాగు భూమిలో కనీసం 20% విస్తీర్ణంలో పొలం పక్కనే అడవిని పెంచడం.. ఆకులు, అలములు పొలంలో వేసుకోవటం ముఖ్యమైన విషయాలు. ఒకే పంటను పండిస్తే చీడపీడల సమస్యలు తలెత్తుతాయి. కొర్రలు తదితర 5 రకాల సిరిధాన్యాలు (ఏకదళ పంటలు), పప్పుధాన్యాలు (ద్విదళ పంటలు), నూనె గింజ పంటలను మిశ్రమ సేద్యం చేయాలి. మా పొలంలో 12 పంటలు కలిపి పండిస్తున్నాం. చీడపీడల సమస్యే రాలేదు. ► ప్రతి రైతూ పొలం పక్కనే 20 శాతం విస్తీర్ణంలో తానే అడవిని పెంచుకోవాలని మీరు చెబుతున్నారు. కేవలం ఎకరం, రెండకరాలున్న రైతులకు ఇదెలా సాధ్యం? 7.5 ఎకరాల బీడు భూమిని 2009లో కొనుగోలు చేసి, 3 ఎకరాల్లో అడవిని, 4.5 ఎకరాల్లో పంటలను పెంచుతున్నాను. 3 ఎకరాల అడవి 10 ఎకరాల్లో పంటను కాపాడుతుంది. అడవిలో చెట్లకు రాలే ఆకులు, రెమ్మలను ఏరి ఎండాకాలంలో తెచ్చి పొలంలో వేసుకోవాలి. అడవిలో చెట్ల ఆధారంగా కొన్ని పక్షులు, చిన్నా చితకా జంతువులు కూడా పెరుగుతాయి. ఆకులు అలములను వీటి మలమూత్రాల్లోని సూక్ష్మజీవులు సహజ ఎరువుగా మార్చుతాయి. అందుకే దీన్ని ‘అటవీ ప్రసాదం’ అంటున్నాం. దీన్ని తెచ్చి వేసవిలో పొలంలో వేసుకోవాలి. సిరిధాన్య పంటలు పొలంలో వేస్తే కంకులు కోతకొచ్చే సమయంలో 15 రోజులపాటు పక్షుల గుంపులు మన పొలంలోకి పిలవని అతిథులుగా వచ్చేస్తాయి. కొంతమేరకు పంటను అవి తినేస్తాయి. అయినా, పర్వాలేదు. ఎందుకంటే.. అవి తినే గింజల ఖరీదు కన్నా అవి మన పొలంలో వేసే రెట్టలు ఎంతో విలువైన పోషకాలతో భూమిని సారవంతం చేస్తాయి. ఎక్కడో ఒక రైతు సిరిధాన్యాలు పండిస్తే పక్షుల వల్ల నష్టం ఎక్కువగానే ఉంటుంది. కానీ, ఆ ప్రాంతంలో కొందరు రైతులు సిరిధాన్యాలు వేస్తే రైతుకు నష్టం తెలియనంత తక్కువగా ఉంటుంది. పొలంలో అక్కడక్కడా చిన్న, చిన్న నీటి కుంటలు తవ్వుకుంటే.. అందులోకి చేరే నీటిలోకి ఈ పక్షుల రెట్టల్లోంచి వచ్చి చేరే సూక్ష్మజీవరాశి ఆ నీటిని పోషక జలంగా మార్చేస్తాయి. పక్షులు పురుగులను ఏరుకొని తినేస్తాయి. అడవి పక్కన ఉండే పొలంలో చీడపీడల బెడదే ఉండదు. ఎకరం, రెండెకరాలున్న చిన్న రైతులు కూడా తమ భూమిలో కనీసం 20 శాతం విస్తీర్ణంలోనైనా అడవిని కూడా పెంచుకోవాలి. అప్పుడు అడవిని ప్రత్యేకంగా ఎక్కడో పెంచాల్సిన అవసరం ఉండదు. ప్రకృతిలో పరస్పరాధారిత జీవనచక్రాన్ని మనమే తెంపేశాం. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు వాడకుండా దీన్ని తిరిగి మనమే నిర్మించుకోవాలి. ‘అటవీ కృషి’ పద్ధతి మూలసూత్రం ఇదే. కర్ణాటకలో వందల వేల రైతులు ఈ పద్ధతిలో ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. ► సిరిధాన్యాల సాగు రైతుల ఆత్మహత్యలు ఆపగలదా? సిరిధాన్యాల సాగు చాలా సులువు. తెలుగు రైతులు సిరిధాన్యాల సాగును పెద్ద ఎత్తున చేపట్టినా తగినంత మార్కెట్ ఉంది. కేవలం ఆహారం వల్లనే హైదరాబాద్లో నూటికి 38 మందికి మధుమేహం వచ్చింది. వచ్చే ఐదేళ్లలో ఇది 60 శాతానికి చేరుతుంది. వీరికి సిరిధాన్యాల గురించి తెలిస్తే బ్రహ్మాండమైన మార్కెట్ ఇక్కడే ఏర్పడుతుంది. పేద రైతులు పండించే సిరిధాన్యాలను మంచి ధరకు పట్నవాసులు కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలు ఎలా ఆగుతాయి? ప్రభుత్వాలు కంపెనీలతో కలసి పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాల మీద ఆధారపడితే రైతులు స్వావలంబన దిశగా ముందుకు వెళ్లలేరు. కొన్నాళ్లకు ప్రభుత్వ వ్యవస్థలో కూడా మార్పు వస్తుంది. ∙ (డాక్టర్ ఖాదర్ను 094485 61472, , musk123rt@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. ఆయన సాధారణంగా రైతుల సమావేశాల్లో, హోమియో వైద్యంలో బిజీగా ఉంటారు..) సిరిధాన్యాలకు ఆ ఔషధ గుణాలెలా వచ్చాయి? జొన్నలు, సజ్జలు, రాగులు ఈ పరిధిలోకి రావా? ఏదైనా ఒక ఆహారపదార్థం ఎంత ఆరోగ్యకరమైనది, ఎంత ఔషధగుణం కలిగినది అనేది చూడాలంటే.. అందులో పీచుపదార్థం (ఫైబర్) ఎంత ఉంది? పిష్టపదార్థం (కార్బోహైడ్రేట్లు) –పీచుపదార్థం మధ్య నిష్పత్తి ఎంత ఉంది? అనే విషయాలు చూడాలి. వరి బియ్యం, గోధుమలు తింటూ ఉంటే ఆరోగ్యం బాగుపడదు. వరి బియ్యంలో పీచు 0.2 శాతం. పిష్టపదార్థం 79 శాతం. పీచుపదార్థం – పిష్టపదార్థం నిష్పత్తి 385. ముడిబియ్యం తిన్నా ఈ నిష్పత్తిలో పెద్దగా తేడా ఉండదు. 5 రకాల సిరిధాన్యాల్లో పీచు 8 నుంచి 12.5 శాతం వరకు.. పిష్టపదార్థం 60 – 69 శాతం వరకు ఉంది. వీటి నిష్పత్తి 5.5 నుంచి 8.8 మధ్యలో ఉంటుంది. ఇది 10 కన్నా తక్కువగా ఉంటే రోగాలను సైతం తగ్గించే శక్తిగల ఆహారంగా భావించాలి. తిన్న తర్వాత నెమ్మదిగా 6–8 గంటల్లో సమతుల్యంగా గ్లూకోజ్ను రక్తంలోకి విడుదల చేస్తాయి. అవసరానికి మించి గ్లూకోజ్ రక్తంలోకి విడుదల చేయకపోవడం, అనేక సూక్ష్మపోషకాలు, ప్రొటీన్లు కలిగి ఉండటం వీటి విశిష్టత. సిరిధాన్యాలను తిన్న వారికి వ్యాధి తీవ్రతను బట్టి.. మధుమేహం, కేన్సర్, ఊబకాయం వంటి మొండి జబ్బులు కూడా 6 నెలల నుంచి 2 ఏళ్లలోగా వాటంతట అవే తగ్గిపోతాయి. సిరిధాన్యాలు పోషకాలను పుష్కలంగా అందించడమే కాకుండా దేహంలో నుంచి రోగకారకాలను తొలగించి శుద్ధి చేస్తాయి. సిరిధాన్యాల్లో పీచు ఎక్కువ కాబట్టి కనీసం 2 గంటలు నానబెట్టి వండుకొని తినాలి. ఈ 5 రకాల సిరిధాన్యాలను రోజుకు ఒక రకం చొప్పున మార్చి మార్చి తింటే చాలు. 2 గంటలు నానబెట్టడం వల్ల సిరిధాన్యాల బియ్యంతో అన్నం బాగా ఒదుగుతుంది. కిలో వండితే పది మందికి సరిపోతుంది. జొన్నలు, రాగులు, సజ్జలు తటస్థ ధాన్యాలు. వీటిల్లో పీచు శాతం 4–6 శాతం. తిన్న 2 గంటల్లోనే గ్లూకోజ్ రక్తంలో కలిసిపోతుంది. అందువల్ల ఆరోగ్యసిరినిచ్చే సిరిధాన్యాలే నిజమైన ఆహారం. ‘అటవీ చైతన్యం’ ద్రావణం తయారీ ఎలా? ‘అటవీ చైతన్యం’ తయారీకి కావలసిన పదార్థాలు: 1. అభయారణ్యంలో నుంచి తెచ్చిన గుప్పెడు మట్టి 2. ఐదు రకాల సిరిధాన్యాల పిండి పావు కిలో 3. పప్పుధాన్యాల పిండి పావు కిలో 4. తాటి బెల్లం 50 గ్రాములు 5. 30 లీటర్ల నీరు మట్టి కుండను కుతిక వరకు నేలలో పాతిపెట్టి.. అందులో 30 లీటర్ల నీటిని పోసి మట్టి, పిండి, తాటిబెల్లం కలిపి.. కుండపై మూత పెట్టాలి. కుండపై నేరుగా ఎండ పడకుండా నీడను కల్పించాలి. రోజూ కలియదిప్పాల్సిన పని లేదు. 5 రోజులకు అటవీ చైతన్యం వాడకానికి సిద్ధమవుతుంది. 6వ రోజు నుంచి 21వ రోజు వరకు దీన్ని వాడుకోవచ్చు. అప్పటి వరకు సూక్ష్మజీవరాశి పుష్కలంగా ఉంటుంది. అటవీ చైతన్యం తయారీ కోసం ప్రతిసారీ అభయారణ్యంలోకి వెళ్లి మట్టి తేనవసరం లేదు. అటవీ చైతన్యం ద్రావణాన్ని ఒక లీటరు తీసి పక్కన పెట్టుకొని.. 21 రోజుల లోగా.. మళ్లీ తయారు చేసుకోవాలి. మట్టికి బదులు ఈ ద్రావణాన్ని కుండలో వేసుకోవాలి. అంటే సిరిధాన్యాల పిండి, పప్పుల పిండి, తాటి బెల్లం మళ్లీ కలుపుకొని.. ఈ లీటరు అటవీ చైతన్యం ద్రావణాన్ని కలుపుకుంటే చాలు. 5 రోజుల తర్వాత అది వాడకానికి సిద్ధమవుతుంది. ఇలా ఎన్ని సంవత్సరాలైనా జీవితాంతం తిరిగి కలుపుకుంటూ ఉండవచ్చు. మైసూరు దగ్గరలోని మా క్షేత్రాన్ని సందర్శించే వారికి ఒక లీటరును ఉచితంగా ఇస్తున్నాం. పిచికారీ పద్ధతి: ద్రవ రూప ఎరువు ‘అటవీ చైతన్యం’ ఒక లీటరు తీసుకొని 20 లీటర్ల నీటిలో కలిపి.. ఆ ద్రావణాన్ని ఎకరం పొలంలో మట్టిపైన, సూర్యాస్తమయం సమయంలో, పిచికారీ చేయాలి. కొత్త స్ప్రేయర్తో పిచికారీ చేయవచ్చు లేదా చేతితోనైనా చల్లవచ్చు. వారానికి రెండు సార్లు చల్లాలి. ఇలా 6 వారాలు చేస్తే.. భూమి సారవంతమై పంటల సాగుకు అనువుగా మారుతుంది. రసాయనిక వ్యవసాయం వల్ల బాగా పాడైపోయిన భూమిని కూడా ఇలా తిరిగి పునరుజ్జీవింపచేసుకోవచ్చు. ఎటువంటి రసాయనిక ఎరువులు, కలుపుమందులు చల్లకుండా.. వరుసగా రెండేళ్లు అటవీ చైతన్యాన్ని ఇలా పిచికారీ చేస్తే ఇక ఆ భూమిలో చల్లకపోయినా పర్వాలేదు. భూమిని సారవంతం చేయడానికే కాదు.. పంటలపైన పిచికారీ చేసినా సరిపోతుంది. వందల ఎకరాలు సాగు చేసే రైతులు అందుకు అవసరమైనన్ని కుండల్లో అటవీ చైతన్యాన్ని తయారు చేసుకోవచ్చు. తొలి దశలో నాగలితో భూమిని దున్నాలి. భూమి గుల్లబారిన తర్వాత నేలను కుళ్లగించే చేతి పరికరాలతో నేలను తవ్వితే సరిపోతుంది. అటవీ చైతన్యాన్ని క్రమం తప్పకుండా చల్లుతూ ఉంటే 3 నుంచి 6 నెలల్లోగా ఎటువంటి బీడు భూమినైనా పంటల సాగుకు అనువుగా మార్చుకోవచ్చు. – ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటో: కందుల చక్రపాణి, ఫొటో జర్నలిస్టు, విజయవాడ -
దేశీ విత్తనం.. ఆరోగ్యం.. ఆదాయం!
రసాయన సేద్యం చేసేటప్పుడు అప్పుల కోసం తిరిగి తిరిగి అనునిత్యం అనుభవించిన వేదనను అధిగమించి ప్రకృతి సేద్యంలో దేశీ వరి వంగడాల సాగు ద్వారా ప్రశాంత జీవనానికి బాటలు వేసుకున్న ఆ యువ రైతు బైరపాగ రాజు. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ ఆయన స్వగ్రామం. పదో తరగతి వరకు చదివి 2004లో కుటుంబ సేద్యం చేపట్టాడు. బలం వీర్యవృద్ధికి దోహదం చేసే మాప్లా సాంబ, సాధారణ ప్రసవం కోసం కూల్కర్ రకం, పలు ఔషధ విలువలున్న మైసూర్ మల్లిగ వంటి వందలాది దేశీ వరి రకాలను ఆయన సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది మార్చిలో రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని చినజీయర్ ఆశ్రమంలో జరిగిన పాలేకర్ శిబిరంలోనే రాజు తొలిసారి శిక్షణ పొందాడు. అనేక సంవత్సరాలుగా సాక్షి ‘సాగుబడి’ పేజీలో పెట్టుబడిలేని ప్రకృతి సేద్యంపై వచ్చే కథనాలను ఆసక్తిగా చదివి ఆకళింపు చేసుకుంటున్నాడు. ఆ కథనాల స్ఫూర్తితో 2014 ఖరీఫ్లో తొలిసారిగా ప్రకృతి సేద్య విధానంలో 25 సెంట్లలో ఆర్ఎన్ఆర్ –15048 రకం వరిని ప్రయోగాత్మకంగా సాగుచేశాడు. ఖరీఫ్లో ఆరు, రబీలో 8 బస్తాల దిగుబడి వచ్చింది. 2015 ఖరీఫ్లో అరెకరంలో 12 బస్తాల దిగుబడి వచ్చింది. దీంతో రాజుకు ప్రకృతి సేద్యంపై గురి కుదిరింది. 2016లో ‘సాగుబడి’ పేజీలో వార్తను చూసి హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ‘సేవ్’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన దేశీ విత్తన పంపిణీ కార్యక్రమానికి హాజరై 70 రకాల దేశీ విత్తనాలను రాజు తెచ్చుకున్నాడు. ఖరీఫ్లో రెండెకరాల్లో సాగు చేశాడు. నారుమడిని భాగాలుగా చేసి ఒక్కో భాగంలో ఒక్కో రకం విత్తనాన్ని పోసుకున్నారు. అట్టముక్కలపై రకాల పేర్లు రాసి సూచికలు ఏర్పాటు చేశారు. తొలుత బీజామృతంతో విత్తన శుద్ధి చేశారు. రెండుసార్లు నీటి ద్వారా జీవామృతం అందించారు. నాటుకునే ముందు నారును కట్టలుగా కట్టి బీజామృతంలో ముంచి శుద్ధి చేశారు. దమ్ములో ఎకరాకు 100 కిలోల ఘన జీవామృతం వేశారు. మడికి 4 రకాల చొప్పున నాట్లు వేశారు. రకానికి రకానికి మధ్యన 3 అడుగుల ఎడం కాలిబాటలు వదిలారు. నాట్లు వేసిన 10, 35, 65, 100 రోజుల దశలో ఎకరాకు 200 లీటర్ల చొప్పున జీవామృతాన్ని నీటి ద్వారా అందించారు. చీడపీడల నివారణకు అగ్నిఅస్త్రం చల్లారు. దేశీ విత్తనాలకు ఎలాంటి తెగుళ్లు ఆశించలేదు. నాట్లు,కోత దశలో కొంచెం శ్రమ పెరిగింది. ఎకరాకు 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. విత్తన వరి మడుల మధ్య దూరం వదిలేయడం వల్ల కొంత భూమి వృథా అయ్యిందని, అందువల్ల ఎక్కువ రకాల విత్తనోత్పత్తి చేసినప్పుడు దిగుబడి తక్కువగా ఉంటుందని రాజు చెప్పారు. విత్తనాలను కిలో రూ. 50 చొప్పున రైతులకు విక్రయించారు. అయినా, సాగు ఖర్చు తక్కువ కాబట్టి, ఎకరాకు రూ. 20 వేల నికరాదాయం లభించింది. ప్రకృతిసేద్యంలో నేల గుల్లబారటం వల్ల కలుపు సులభంగా చేతికొస్తుంది. శ్రమతో పాటు కూలి ఖర్చు సగం తగ్గింది. పొలంలో సాలీళ్లు, ఆరుద్ర పురుగులు, సీతాకోక చిలుకలు, తేనెటీగలతో పాటు పలు రకాల మిత్ర పురుగులు, వానపాముల సంఖ్య పెరిగింది. మైసూర్ మల్లిగ, కాలాబట్టిపై ప్రత్యేక శ్రద్ధ ఈ ఖరీఫ్లో ఒక ఎకరంలో మైసూర్ మల్లిగ (సన్నరకం), మరో ఎకరంలో కాలాబట్టి (దొడ్డు రకం.. నల్ల బియ్యం) రకాలను.. మరో ఎకరంలో బాసుమతి, కులాకర్, మాపిళ్లై సాంబ, ఇల్లప్సాంబ, కె5, నవార రకాలను రాజు సాగు చేస్తున్నాడు. కాలాబట్టి నాటిన 40 రోజుల్లో మనిషి ఎత్తున ఎదిగింది. మైసూర్ మల్లిగ 40 బస్తాల ధాన్యం దిగుబడితో మంచి ఆదాయమూ వస్తుందని రాజు ఆశిస్తున్నారు. మహిళలకు, ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు రోజువారీ తినడానికి ఈ రకం బాగుంటుంది. కాలాబట్టి దొడ్డు రకం నల్లబియ్యం రకం. పాయసం వండుకోవడానికి ఇది శ్రేష్టమైనది. తన కుటుంబ సభ్యులు పిండి (రసాయనిక ఎరువులు) వేయకపోతే లాభం ఎక్కువ రాదని అంటున్నారని, ప్రకృతి వ్యవసాయంలోనే ఈ ఏడాది మంచి దిగుబడితోపాటు అధిక నికరాదాయం సాధించి వారికి కూడా పూర్తిస్థాయి సంతృప్తి కలిగించగలనన్న భరోసా ఇటీవలి వర్షాల వల్ల కలిగిందని రాజు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉత్సాహంతో కూరగాయలను సైతం సాగు చేసేందుకు రాజు సిద్ధమవుతున్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం.. ప్రత్యేక ఔషధ గుణాలకు తాతల కాలం నాటి దేశీ వరి వంగడాలు పెట్టింది పేరు. పోషక విలువలు పుష్కలంగా కలిగి ఉండటంతోపాటు వీటిని సేవ్ సంస్థ విజయరామ్, శివప్రసాద రాజుల ప్రోత్సాహంతో శ్రద్ధగా సాగు చేస్తున్నా. రైతులకు విత్తనాలు, ప్రజలకు బియ్యం అందిస్తున్నా. ఆరోగ్యవంతమైన సమాజం కోసమే ప్రకృతి సేద్యం చేస్తున్నా. హేళన చేసిన వారే మెచ్చుకుంటున్నారు. – బైరపాగ రాజు (81868 86807), గుమ్మకొండ, నాగర్ కర్నూల్ – చింతకింది లింగం, సాక్షి, తిమ్మాజీపేట, నాగర్ కర్నూల్ జిల్లా -
వీటితో స్వైన్ ఫ్లూకు దూరంగా ఉండండి..
సాక్షి, హైదరాబాద్: దేశంలో స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది దేశవ్యాప్తంగా 25,864 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇది గతేడాది నమోదైన కేసులకన్నా 14 రెట్లు ఎక్కువ. ఇక 2016లో 1,786 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ వ్యాధితో మరణించే వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. స్వైన్ఫ్లూ శ్వాసకోస వ్యాధి కావండంతో త్వరగా విస్తరిస్తోంది. వ్యాధిని గుర్తించడంలో నిర్లక్ష్యం వహించడం, సకాలంలో వైద్యం అందకపోవడంతో ఈ వ్యాధి మరణాల సంఖ్య పెరుగుతోంది. వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడంతోనే స్వైన్ ఫ్లూకు దూరంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. సహజంగా లభించే ఆహార పదార్థాలతో వ్యాధినిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఇది చల్లని వాతవారణంలో త్వరగా వ్యాప్తి చెందుతోంది కాబట్టి ఈ మన్సూన్ సీజన్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ కింది వాటితో వ్యాధినిరోధక శక్తి పెంచుకోవచ్చు.. ♦వేడి నీరు, నిమ్మ రసం, తేనేల మిశ్రమాన్ని ఉదయాన్నే పడిగడుపున తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు. ♦ హెర్బల్ టీలతో కూడా వ్యాధినిరోధక శక్తి పెంచుకోవచ్చు. దీంతో ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చు. తులసి, అల్లం, నిమ్మ, బ్రాహ్మి టీలతో ఈ వ్యాదికి దూరంగా ఉండవచ్చు. ♦ఉసిరి జ్యూస్లో తేనేను కలిపి తాగడం వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఇందు యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రో న్యూట్రిన్లు పుష్కలంగా ఉంటాయి. ♦పసుపు మానవ శరీరానికి మంచి ఔషదంలా పనిచేస్తోంది. యాంటి బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ గా పనిచేస్తూ వ్యాధినిరోధక శక్తిని పెంపోందిస్తుంది. ఇది మనం వంటలలో రోజు వాడేదే. ♦ నల్లమిరియాలు శరీరంలో వేడిమిని తగ్గించడమే కాకుండా వ్యాధినిరోధక శక్తి పెంపొందిస్తాయి. మిరియాలను కూడా మన ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తాం. ♦ దాల్చిన చెక్కతో జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పిలను తగ్గించడమే కాకుండా ఎలాంటి వైరస్లు ధరిచేరకుండా చేస్తోంది. దాల్చిన చెక్క పౌడర్ను తేనేలో కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. -
చిన్న రిక్వెస్ట్ బాస్!
మా కోరికలేవీ పెద్దవి కావు బాస్. చిన్న చిన్న విఘ్నాలు తొలగిస్తే చాలు. ఫ్యామిలీ ఫ్యామిలీ నీకు ఉండ్రాళ్లు పెడుతూ తరిస్తాం. విపత్తులు, ఉత్పాతాలు, విలయాలు... వాటి పని మీరే చూసుకుంటారు. చికాకులు, చిర్రుబుర్రులు, చివాట్లు, చిక్కులు... ఇవి మా ప్రాబ్లమ్స్. ఇవే విఘ్నాలు. నిన్ను దేవుడూ అని పిలుస్తూ ఎక్కడో దూరంగా ఉంచాలని లేదు. మనసుకు దగ్గరగా ఉంటావ్... బాగా క్లోజ్గా అనిపిస్తావ్. ఏదైనా చెప్పేసుకోవచ్చు... అన్నంత క్లోజ్గా అనిపిస్తావ్ బాస్. మా విన్నపం మన్నించండి. కొంచెం కన్సిడర్ చేయండి బాస్. ఇది ఓ ఫ్యామిలీకి కంబైన్డ్గా వచ్చిన కల. వినాయకుణ్ణి ఏం కోరుకున్నారో సరదాగా చదవండి. పత్రితో నీకు పూజలు చేస్తాం. పచ్చగా ఉండే ఇళ్లను ఇవ్వు. గొడుగు నీకు అమరుస్తాం. ప్రకృతి గొడుగు గతి తప్పకుండా చూడు. ఉండ్రాళ్లు సమర్పిస్తాం. ఆకలిగొన్న కడుపు ఒక్కటీ లేకుండా చూడు. అత్తగారు ఊరి నుంచి ఆవకాయతో దిగుతుంది. తెల్లారి లేచే సరికి కొడుకు కిచెన్లో కేరెట్ తరుగుతుంటాడు. ‘అదేమిటే అమ్మాయ్. అబ్బాయి చేత కూరగాయలు తరిగిస్తున్నావ్. రేపటి నుంచి విమ్ సోప్ చేతిలో పెట్టి అంట్ల ముందు కూర్చోబెడతావా ఏంటి? వాడు ఉద్యోగానికి వెళ్లొద్దూ?’ అంటుంది అత్తగారూ. ‘నేనూ బేవార్సుగా లేను కదా అత్తయ్యా. నేనూ జాబ్కు వెళ్లాలి కదా. ఇంట్లో ఆ మాత్రం సాయం చేయకపోతే పనులెలా అవుతాయ్’ అంటుంది కోడలు. అక్కడి నుంచి ఆ ఇంట్లో శాంతికి విఘ్నం. అలా కాకుండా అత్తగారు కిచెన్లో కష్టపడుతున్న కోడలిని చూసి ‘ఏరా అబ్బాయ్. అమ్మాయి ఒక్కత్తే ఎంత పనని చేసుకుంటుంది. కూర్చుని పేపర్ చదువుకోకపోతే ఆ కేరెట్ కాస్త కట్ చేసి పెట్టరాదూ’ అనంటే ఎంత బాగుంటుంది.నువ్వు స్నానానికి వెళ్లమ్మాయ్. ఈలోపు నేను కేరేజీ కట్టేస్తానుగా’ అంటే ఎంత బాగుంటుంది. ‘సాయంత్రం ఉరుకులు పరుగుల మీద వచ్చేయకండి. కలిసి సినిమాకెళ్లి హోటల్లో ఏదైనా తినేసి రండి. నాదేముంది ఈ పూట శనివారం. నేను ఉపవాసం. వస్తూ నాకేదైనా లైట్గా పట్రండి’ అంటే ఎంత బాగుంటుంది. అలా అని ఆశీర్వదించు స్వామీ. పిల్లలు పిడుగులు. తండ్రి ఆఫీసుకు వీరభక్తుడు. ఆదివారం పూటైనా కృష్ణకాంత్ పార్క్కు వెళ్లి కోన్ ఐస్క్రీమ్ తినిపించు డాడీ’ అని వాళ్ల మారాము. మా బాస్ కొంటె కృష్ణుడు. పెండింగ్ వర్క్ పూర్తి చేయకపోతే మెమోతో ముద్దిస్తాడు’ అని తండ్రి హైరానా. పిల్లల అలక. తండ్రి ఆగ్రహం. తల్లి పీచుపీచు. ఇక ఆ ఇంటి మనశ్శాంతికి విఘ్నం. అలా కాకుండా ఆ బాస్ను ఏ అండమానో చెక్కేసేలా చేస్తే ఎంత బాగుంటుంది. డాడీగారు జాంజామ్మని సాయంత్రానికే ఇల్లు చేరుకుని బైక్ మీద ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని జి.వి.కె మాల్లో మాలామాల్ చేయిస్తే ఎంత బాగుంటుంది. మళ్లీ రెండు వారాల దాకా అడక్కుండా ఉండేలా ఫన్ జోన్లో ఆడించి, ఫుడ్ కోర్ట్లో తినిపించి, బిగ్ స్క్రీన్ మీద మహేశ్బాబు మాస్ మూవీ చూపించి తెస్తే ఎంత బాగుంటుంది. అలా అని ఆశీర్వదించు స్వామీ. భర్తగారికి ఊరుకూరికే ఆకలేస్తుంటుంది. భార్యగారికి చీటికి మాటికి నిద్ర కమ్ముకొస్తోంది. షుగరా అని భర్తకు డౌటు. థైరాయిడ్డేమో అని భార్య నలుగుబాటు.శనివారం ఎర్లీమార్నింగ్ ల్యాబ్లో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినప్పటి నుంచి రిపోర్ట్సు వచ్చేంత వరకూ అనుక్షణంఆత్మశాంతికి విఘ్నం. ఆనందానికి విఘ్నం. ఆలోచనకు విఘ్నం.అలా కాకుండా అది షుగరూ కాదూ పాడూ కాదు మనిషి గుమ్మటంలా ఉన్నావ్ అని రిపోర్టు వస్తే? థైరాయిడ్డు లేదూ ఏమీ లేదు మనిషి దంగల్ లేడీలా ఉందని కౌంట్ తేల్చి చెప్తే?ఎంత హాయిగా ఉంటుంది. మరెంత హొయలుగా అనిపిస్తుంది. వానాకాలంలో జలుబు, ఎండాకాలంలో కాసిన్ని చెమటకాయలు, చలికాలంలో చుండ్రు తప్ప జీవితంలో ఎప్పుడూ ఏ అనారోగ్యం రాకుండా ఉంటే? అలా అని కరుణించు స్వామీ. ఈ లైఫ్ను హాస్పిటల్ మెట్లక్కనీయకుండా ఆశీర్వదించు స్వామీ. జూబ్లీహిల్స్లో కలిగిన వారి కల్యాణానికి వెళ్లాం. బెంగుళూరు నుంచి వచ్చిన చిట్టిరోజాలతో కట్టిన మండపం. ఒక సెల్ఫీ. ఒక మూలగా మద్రాస్ అయ్యంగార్ వయొలిన్ కన్సర్ట్. ఒక సెల్ఫీ. ఆహూతులలో సన్నాసన్నని తమన్నా. ఒక సెల్ఫీ. బఫే దగ్గర డబుల్ బిరియానీతో ఒక సెల్ఫీ. ఆలూ అల్బత్తాతో ఒక సెల్ఫీ. ఇవన్నీ తీసుకుని ఇంటి కొచ్చి ‘ఫ్యామిలీ గ్రూప్’లో వాట్సప్ చేసి వాట్ యార్ అని పోజు కొడదామంటే వైఫై పని చేయకపోతే? దేర్ ఈజ్ నో ఇంటర్నెట్ కనెక్షన్ అని మెసేజ్ చూపిస్తుంటే? ఆ యొక్క అతిశయానికి ఆ యొక్క ప్రదర్శనానందానికి ఎంతటి విఘాతం. మరెంతటి విఘ్నం. అలా కాకుండా ఆల్వేస్ వైఫై పని చేసేలా ఉంటే? నట్టింట నెట్ కళకళలాడుతుంటే?అలా అని హండ్రెడ్ ఎంబిపిఎస్తో ఆశీర్వదించు స్వామీ. అబ్బాయికి మీసం కర్వ్ తిరిగే ఏజ్ వచ్చింది. అమ్మాయికి ఊరికూరికే నవ్వొచ్చే ప్రాయం వచ్చింది. అబ్బాయి ఎక్కడ తిరుగుతాడో తెలియదు.అమ్మాయిని ఎవరు తనవైపు తిరిగేలా చేసుకుంటారో తెలియదు. అది కాదూ..’ అని తల్లి ఏదో చెప్పబోతుంది. నీకేం తెలియదు ఊర్కో’ అని విసురు.అది కాదురా’ అని తండ్రి ఏదో అనబోతాడు. నస ఆపు డాడీ’ అని రుసురు.ఏ వయసు ముచ్చట ఆ వయసులో ఉండాల్సి వున్నా అది హద్దు అదుపుల్లో ఆరోగ్యకరమైన అంచుల్లో లేకపోతే మరి ఆ తల్లిదండ్రులకు ఎంతటి ఘాతం. మరెంత విఘాతం.అలా కాకుండా పిల్లలు తమ మంచి చెడ్డలను తల్లిదండ్రులతో పంచుకుంటే ఎంత బాగుంటుంది. వారిని తమ జర్నీలో తోడుగా ఉంచుకుంటే మరెంత అందంగా ఉంటుంది. అలా అని ప్రతి సంతానానికీ వారి కన్నవారికీ వెలుగు పంచు స్వామీ.నలుగురి హృదయాలలో ఆనందాన్ని వెలిగించు స్వామీ. ఒక భర్తగారికి వాటర్ అలెర్జీ. అతను వైన్ షాప్లో దొరికేదానినే వాటర్ అనుకుని పుచ్చుకుంటూ ఉంటాడు. ఒక హజ్బెండ్ గారికి ఇల్లంటే రోత. వారు పేకాట క్లబ్బునే తన ఆవాసం చేసుకుంటూ ఉంటారు. ఒక మొగుడు మహాశయునికి కరెన్సీయే ఆక్సిజన్. దాని వేటలో ఇంటికే రారు. ఒక పురుషుడు వేళ్లతో వాట్సప్లో ఎవరెవరితోనో మాట్లాడటం తప్ప ఇంట్లో నోరు తెరవడు. ఒక మగ అతనికి నిలువెల్లా అనుమానం. మరో మగపురుగుకి చేయి దురుసు జాస్తి.ఏ ఇంటికైనా ఇంతకు మించిన విఘ్నం ఉంటుందా?ఆ ఇంటి ఇల్లాళ్లకు పిల్లలకు అంతకు మించిన విఘాతం ఉంటుందా?సరదాలు వ్యసనాలుగా మారని, విసుగులు ఉత్పాతాలుగా రూపాంతరం చెందని, అసంతృప్తులు ఆజ్యంగా మారి పైకప్పులను తగలబెట్టని ఇళ్లు కావాలి. దంపతులు మార్నింగ్ పూట కలిసి చిర్నవ్వుతో టీ సేవించే, పిల్లలు నవ్వుకుంటూ స్కూలు విషయాలు చెబుతూ ఒడిలో కూర్చునే, అమ్మానాన్నలూ తరుచూ వచ్చిపోయే లేదంటే పిల్లల దగ్గరే ఉండిపోయే, నెలకోసారైనా ఆత్మీయులు చేయి కడిగే, ఆనందానికి తప్ప దుఃఖానికి చెమర్చని కళ్లు ఉండే, ఇరుగు పొరుగులతో సామరస్యం ఉండే, చక్కని వంట కుదిరే, పండే పక్క కుదిరే, తృప్తిగా నిదుర పట్టే, నిర్మలమైన వేకువ తట్టి లేపే ఇళ్లు ఉంటే ఎంత బాగుంటుంది?అలాంటి ఇళ్లను కటాక్షించు స్వామీ.బయట జోళ్ళు, ఇంట్లో వెచ్చాలు, అవసరాలు తీర్చగల డబ్బు ఉండే ఏటీఎం కార్డులు, బాల్కనీలో పూలు పూసే కుండీలు, అవసరానికి సాయం చేసే చేతులు, దేవుని ఆశీర్వాదాలు, చెదరని దరహాసాలు... ఇవి ఉండే ఇళ్లను ప్రసాదించు స్వామీ. పత్రితో నీకు పూజలు చేస్తాం.పచ్చగా ఉండే ఇళ్లను ఇవ్వు.గొడుగు నీకు అమరుస్తాం.ప్రకృతి గొడుగు గతి తప్పకుండా చూడు.ఉండ్రాళ్లు సమర్పిస్తాం.ఆకలిగొన్న కడుపు ఒక్కటీ లేకుండా చూడు.నిన్ను చల్లగా నిమజ్జనం చేస్తాం.సకల అసంతృప్తులను అసమానతలను అమానవీయ ఆలోచనలను ఏటిలో కలుపు.అస్తు దేవా. తథాస్తు గణేశా. – కె -
నాకు క్యూటీ కావాలి!
పిట్ట కథ ఓ పదిహేను రోజులక్రితం... టైం ఎనిమిదవుతుంది... నేనింకా నిద్రలోనే ఉన్నా.. బాల్కనీ గోడ పక్కన ఓ కొత్త సవ్వడి.. ఇంతకు ముందు విన్నపక్షుల సవ్వడిలా లేదు. బలవంతంగా నిద్రలేచి తలుపు తీసి చూశాను. ఏం కనిపించలేదు. కానీ ఆ కొత్త సవ్వడి మాత్రం వినిపిస్తూనే ఉంది. మొహం కడుక్కుని స్నానం చేసేలోపు ఓ ఐదారుసార్లు వినిపించింది ఆ సౌండ్ పిట్ట మాత్రం కనిపించలేదు. ఇలా కాదని జాగ్రత్తగా సీతాఫలం చెట్టు ఆకుల మధ్యలోంచి నెమ్మదిగా చూశాను.. అప్పుడు కనిపించింది.. నేను ఊహించినట్టే ఓ కొత్త పక్షి. చాలా చిన్నగా... పిచ్చుకలో సగం సైజే ఉంది. బూడిదరంగు శరీరం... తోకమాత్రం భలే అందంగా ఉంది. నెమలీకను బీడీ సైజ్ లో కట్ చేసి అతికించినట్టుంది. అది సీతాఫలం చెట్టు ఆకు వెనకాల దాక్కుంది.. ఆ ఆకు దానిని పూర్తిగా కవర్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. అదెంత ఉందో. కానీ చూడ్డానికి మాత్రం భలే ముద్దుగా ఉంది. అరుపు కూడా ప్రత్యేకంగా ఉంది కాబట్టి నాకు ఆసక్తి పెరిగింది. రెండోరోజు చూస్తే సీతాఫలం చెట్టు మీదే చిన్న గూడు కట్టుకుంది.. అసలా గూడు చూస్తే హాశ్చర్యపోతారు. కేవలం మూడంటే మూడే ఆకులతో ఎంత చక్కగా గూడు కట్టిందంటే, భలే ముచ్చటగా ఉందిలే. వెంటనే మా ఆవిడను పిలిచి చూపించాను. ముచ్చటగా కట్టుకున్న దాని ఇల్లు చూసి ముక్కున వేలేసుకుంది. మా అబ్బాయికయితే ప్రపంచ వింత చూస్తున్నంత సంబరం. వాడు స్కూల్లో టాంటాం వేశాడు తనకు కొత్త ఫ్రెండ్ అని, దాని పేరు క్యూటీ అనీ, దాని గూడు బాగుందనీ ఇలా... క్యూటీతో చిక్కేంటంటే.. అలికిడి వినిపిస్తే గూట్లోంచి ఎగిరిపోయేది.. అందుకే మెల్లగా.. బెడ్ రూం డోర్ తీసి మెత్తగా అడుగులు వేస్తూ చిన్నగా మెడ పైకెత్తి చూస్తే దాని గూడు కనిపించేది. అందులో తలపైకెత్తి పడుకునేది. చిన్న మొహం.. పూసల్లాంటి కళ్లు.. చిన్నముక్కు.. పదేపదే చూడాలనిపించేది కానీ సెకనులో వెయ్యోవంతులో ఎగిరిపోయేది. కొన్ని రోజులు ఇదే తంతు. మేమైతే భలే ఎంజాయ్ చేస్తున్నాం ఇదంతా.. వారం రోజుల్లోనే దాంతో చిన్న అటాచ్మెంట్ పెరిగింది. దానికి కూడా నమ్మకం కుదిరిందేమో. ఇంతకు ముందులా మరీ వేగంగా పారిపోవడం లేదు. లేకపోతే చప్పుడు చేయకుండా చూడడం నాకు అలవాటయిందో మరి.. చెట్ల ఆకుల మధ్యలో కూర్చుని ఆ చిన్న అందమైన తోకని బోరింగ్ కొట్టినట్టు పైకీ, కిందకీ ఊపుతూ బోలెడు పాటలు పాడేది. మేం జాగ్రత్తగా తలుపు కొంచమే తెరిచి దానిని చూస్తుండేవాళ్లం. వేడివేడి టీకప్పుతో కిటీకీ దగ్గర నిల్చుని బయట దానిని చూడడం నాకు గొప్పగా అనిపించేది.ఆ మధ్య రెండు రోజులు వర్షం పడింది.అర్ధరాత్రి మెలకువొచ్చింది.. జోరున వర్షం పడుతున్న శబ్దం నా మనసులో ఏదో అలజడి. పే...ద్ద గాలి వాన. మా తలుపు సందులోంచి సన్నగా నీళ్లు లోపలికి వస్తున్నాయ్. అమ్మో.. ఇంత గాలివాన.. క్యూటీ ఎలా ఉందో... సిమెంట్తో కట్టిన ఇంట్లోకే నీళ్లొస్తున్నాయ్.. దాని ఆకుల గూడు ఎలా ఉందో! మనసులో ఒకటే దడదడ. ఫోన్లో టార్చ్ ఆన్ చేసుకుని నెమ్మదిగా డోర్ తెరిచి ఆకుల మధ్యలోంచి లైట్ వేసి చూశాను. ఆశ్చర్యం.. దాని గూడు ఏమాత్రం తడవలేదు.. గాలికి దాని గూడు ఊగుతుంటే ఊయల ఊగినట్టు.. లోపల హాయిగా నిద్రపోతుంది. ఈసారి మాత్రం ఎగిరిపోలేదు.. దానిని అంత స్పష్టంగా చూడడం అదే మొదలు. ఇక నాకు ఇదే అలవాటైపోయింది.. పొద్దున్నే వాటి సవ్వడితో లేవడం... ఓసారి దాని గూట్లోకి తొంగిచూడడం.. బయటికెళ్లి రాగానే దాన్నోసారి పలకరించడం... ఆ చిన్న పిట్ట పుణ్యమాని మా ఇంట్లోనూ చిన్న చిన్న మార్పులు... ‘‘ఇదిగో, పొరపాటున కూడా ఆ గోడ పక్కన ఏదీ విసిరేయకు.. దాని గూడుకి తగిలితే కష్టం. నీళ్లు.. గింజలు పెట్టావా? మరిచిపోయావా? వాడిమీద అరిచేటప్పుడు కాస్త హాల్లోకి వెళ్లు.. ఆ చిన్నప్రాణం భయపడితే కష్టం...’’ ఇలా ఉండేవి నా హెచ్చరికలు..మొత్తానికి నిద్రలేవడం మొదలు.. అర్ధరాత్రి దాకా దాని గురించి బోలెడు మాటలు. ఓ కుక్కనీ, పిల్లిని, చిలుకను పెంచుకునే వాళ్లలాగ మాకు ఓ బుజ్జి పిట్ట..! ఇలా ఇరవై రోజులు గడిచాయి.మూడు రోజుల క్రితం పొద్దున్నే దాని అలికిడి లేదు! ఏదో పోగొట్టుకున్నట్టుంది. లేచి బాల్కనీలోంచి తొంగిచూశాం. గూడు ఖాళీగా ఉంది.. ఏమైంది? పొద్దున్నే వెళ్లిపోయింటుందా?ఆ రోజు ఇలా నాలుగైదు సార్లు చూసినా ఎప్పుడూ గూడు ఖాళీగానే కనిపిస్తోంది. నా మనసేమో కాస్త సున్నితం. అందుకే దిగులుగా ఉంది.. ఇక మా అబ్బాయి నాలుగు రోజులుగా ఒకటే ప్రశ్న ‘‘నాన్నా.. క్యూటీ ఎక్కడికి వెళ్లిందీ’’ అని. వారమైనా పత్తాలేదు.. రోజు రోజుకు నాకు దిగులు పెరిగిపోతోంది. ఇలా లాభంలేదని ఓ కర్ర తీసుకొచ్చి నెమ్మదిగా ఆ గూడును కదిపి చూశాం. ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. లోపల క్యూటీ నిర్జీవంగా పడుంది. తలెత్తి మిటుకు మిటుకు మంటూ చూస్తే తల పక్కకు వాలిపోయి ఉంది... జాగ్రత్తగా గమనించాను.. గూట్లో తెల్లగా పౌడర్.. చెట్టునిండా.. ఆకుల మీదకూడా. ఏం జరిగుంటుంది..? ఎవరైనా పిండి పడేసుంటారా? ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది. మా ఆవిడ రాగానే అడిగాను ఆ తెల్లపౌడర్ ఏంటని? గుర్తు చేసుకుని చెప్పింది. నాలుగు రోజుల క్రితం మూడు ఇళ్ల అవతల ఒకరోజంతా బోర్ వేశారు.. నీళ్లు పడలేదు సరికదా.. పెద్ద శబ్దం. కింద బండ ఉందేమో.. తెల్లటి పౌడర్ కాలనీ అంతా. తను చెబుతూనే ఉంది.. బాల్కనీ తలుపుమీద.. కిటికీమీద, నేలమీద...ఒక ఇంచు మేర ఆ బూడిద పరుచుకుందనీ.. అదంతా కడిగేసరికి తల ప్రాణం కాళ్లకొచ్చిందనీ.నాకు విషయం అర్థమైపోయింది.. ఆ పేద్ద శబ్దాలు, విపరీతంగా రేగిన బూడిద దెబ్బకు ఈ చిన్న ప్రాణం తట్టుకోలేకపోయిందనీ, ఊపిరాడక ఉన్నచోటే ప్రాణమొదిలేసిందనీ... జడివానకు, సుడిగాలికి తట్టుకునేలా గూడు నిర్మించుకుందనుకుందిగానీ, పిచ్చిది. మనుషుల సంగతి దానికేం తెలుసు? తప్పెవరిది? అమాయకంగా మా మధ్యలోకొచ్చిన ఆ చిన్ని ప్రాణానిదా? మనలాంటి జీవులు కూడా ఈ ప్రకృతిలో భాగమేనని ఆలోచించని మనుషులదా? - వాసవీ మోహన్ -
పర్యావరణంలో మనిషి బంధం పెంచుకోవాలి