-
అక్కడ పనులు జరగడం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేపట్టడం లేదని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ పేర్కొంది. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు సంబంధించిన పనులు మాత్రమే ఇప్పటి వరకు చేపట్టినట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనానికి నివేదిక అందించింది. ఏపీ ప్రభుత్వం ధిక్కరణ చర్యలకు పాల్పడుతోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను బుధవారం జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ నెల 6న ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అందించిన నివేదికను ధర్మాసనం రికార్డులోకి తీసుకుంది. కృష్ణా బోర్డు, కేంద్రం నివేదికల్లో ఛాయాచిత్రాలు చూస్తుంటే ఉల్లంఘనలు జరిగినట్లు తెలుస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ ధర్మాసనానికి తెలిపారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు అయ్యాక ఏపీ ప్రభుత్వం పనులు నిలిపివేసిందని ఆరోపించారు. ధర్మాసనం అనుమతిస్తే డ్రోన్ల ద్వారా వీడియో ఆధారాలు అందజేస్తామని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచంద్రరావు తెలిపారు. ఆధారాలు ఏవైనా ఉంటే తమకు, ఏపీ ప్రభుత్వ న్యాయవాదులకు అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల వద్ద ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది వెంకటరమణి, అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ మాధురి దొంతిరెడ్డిలు ధర్మాసనానికి పునరుద్ఘాటించారు. ఉల్లంఘనలు జరిగాయని చర్యలు తీసుకొనే అధికార పరిధి ఎన్జీటీకి ఉందా.. అనే అంశంపై వాదనలకు అవకాశం ఇవ్వాలని కోరారు. పనులు నిలిపి వేశామని అండర్ టేకింగ్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. పర్యావరణ శాఖ నివేదిక ఇలా.. ► 2021 ఆగస్టులో కృష్ణా బోర్డు ఎన్జీటీకి నివేదిక సమర్పించిన విషయం గమనించాం. శ్రీశైలం రిజర్వాయర్లో నీటి నిల్వ 854 అడుగుల కంటే తక్కువ ఉన్న సమయంలో కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ డౌన్ స్ట్రీమ్ కోసం శ్రీశైలం కుడి ప్రధాన కాలువకు రోజూ మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ధ్యేయంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. ► ఈ ప్రాజెక్టు కోసం గాలేరు నగరి– సుజల స్రవంతి, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ, తెలుగు గంగ ప్రాజెక్టుల నిమిత్తం ఇచ్చిన పర్యావరణ అనుమతులు సవరించాలంటూ ప్రాజెక్టు యాజమాన్యం ప్రతిపాదనలు పంపింది. రివర్ వ్యాలీ, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిపుణుల మదింపు కమిటీ దీన్ని అంచనా వేస్తోంది. ► రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్నట్లుగా ప్రాజెక్టు ప్రాంతంలో ఎలాంటి గుర్తులు లేవు. గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన నిర్మాణ సామగ్రి మాత్రమే ఉంది. ఎన్జీటీ అనుమతించిన డీపీఆర్కు సంబంధించిన పనులు మాత్రమే చేపడుతున్నట్లు ప్రాజెక్టు యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిని తెలియజేసే ఛాయా చిత్రాలు పొందు పరుస్తున్నాం. -
ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టవచ్చా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ప్రెస్ నోట్ ఆధారంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ చేపట్టవచ్చా? బాధితుడి తరఫున ట్రిబ్యునల్ సభ్యుడు విచారణ ప్రారంభించవచ్చా? పార్టీతో ట్రిబ్యునల్ సభ్యుడు జతకట్టే అవకాశం లేదా?’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చట్టం–2010 ప్రకారం.. పత్రికల్లో వచ్చే కథనాలు, లేఖలు, విజ్ఞప్తులు ఆధారంగా ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టవచ్చా? అనే అంశంపై జస్టిస్ ఎం.ఎం.ఖానీ్వల్కర్, జస్టిస్ హృషికేశ్, జస్టిస్ సీటీ రవికుమార్తో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా వ్యర్థాల తొలగింపుపై ఎన్జీటీ సుమోటోగా విచారణ చేపట్టి, ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ గ్రేటర్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే కేరళలో క్వారీల ఏర్పాటుకు నివాస స్థలాల నుంచి కనీస దూర నియమాన్ని 200 మీటర్లు నుంచి 50 మీటర్లకు తగ్గించారంటూ వచ్చిన విజ్ఞప్తి ఆధారంగా ఎన్జీటీ ఆదేశాలపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. కేరళ కేసులో ఎన్జీటీకి అధికార పరిధి ఉందని హైకోర్టు నిర్ధారించినప్పటికీ కొత్త క్వారీల కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేసింది. నిబంధనలు సమగ్ర ప్రాతిపదికన చదవాలి ఎన్జీటీకి న్యాయ సమీక్ష చేసే అధికారం లేదని ఎన్జీటీ చట్టంలోని సెక్షన్ 14 చెబుతోందని థామ్సన్ అగ్రిగేట్స్, క్రిస్టల్ అగ్రిగేట్స్ సంస్థల తరఫు సీనియర్ న్యాయవాది వి.గిరి పేర్కొన్నారు. ట్రిబ్యునల్ పరిధి విస్తరణ నిర్ణయం విషయంలో సెక్షన్ 14(1), (2)లు కలిపి చదవాలని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ దరఖాస్తు స్వీకరించడానికి అవసరమైన షరతులను సెక్షన్ 14(3) వివరిస్తోందని, ఎవరైనా దరఖాస్తుతో వస్తే సెక్షన్ 14లోని సబ్సెక్షన్ 3 ప్రకారం స్వీకరించాలని, అంతేకానీ ఓ లేఖ ద్వారా విచారణ చేపట్టరాదని వి.గిరి తెలిపారు. ఆర్టికల్ 323ఏ ప్రకారం ఎన్జీటీ ఏర్పాటు కాలేదు ఆర్టికల్ 323ఏ ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్ ఎన్జీటీ కాదని కేరళ తరఫున్యాయవాది జైదీప్ గుప్తా తెలిపారు. అందుకే శాసన అధికారాలను సమీక్షించే అధికారం ఎన్జీటీకి లేదని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226, 32 కింద హైకోర్టు, సుప్రీంకోర్టులకు ఉన్న అధికారాలు ఎన్జీటీకి లేవన్నారు. ఎన్జీటీ చట్టంలోని ఏ ప్రొవిజన్ కూడా ట్రిబ్యునల్కు సుమోటో అధికారాలు ఉన్నాయని చెప్పలేదని గుర్తుచేశారు. ఎన్జీటీ సుమోటోగా కేసు చేపట్టాలంటే చట్టంలో ఉండాలని జైదీప్ తెలిపారు. అధికార పరిధి ఉన్న కోర్టులు కూడా చట్టబద్ధమైన నిబం« దనలకు వ్యతిరేకంగా వెళ్లవని వ్యాఖ్యానించారు. శాసన ఉద్దేశం అర్థం చేసుకోవాలి ఎన్జీటీకి సుమోటోగా విచారణ చేపట్టే అధికారం లేదు, ఎందుకంటే చట్టం ఆ మేరకు అవకాశం కల్పించలేదని ఓ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ధ్రువ్ మెహతా తెలిపారు. శాసనంలోని భాష నుంచి శాసన ఉద్దేశం అర్థం చేసుకోవాలన్నారు. పార్లమెంట్ ఉద్దేశపూర్వకంగా ట్రిబ్యునల్కు అలాంటి అధికారం ఇవ్వలేదన్నారు. ఒకవేళ ఎన్జీటీకి సుమోటో అధికార పరిధి ఉందని చెబితే, చట్టంలోని నిబంధనలు పక్కన పెట్టాల్సి వస్తుందని ధ్రువ్ మెహతా పేర్కొన్నారు. అధికారం లేకున్నా చట్టం ద్వారా నిరోధించలేం ఎన్జీటీకి సుమోటోగా విచారణ చేపట్టే అధికారం లేకున్నా చట్టం ద్వారా దాని పనితీరును నిరోధించలేమని కేంద్రం తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు. సుమోటో విచారణలో ఎన్జీటీ బాధ్యతాయుతంగా ఉంటుందన్నారు. అయితే, ట్రిబ్యునల్కు ఎలాంటి సుమోటో అధికారాలు లేవని ఆమె తెలిపారు. రాజ్యాంగబద్ధమైన కోర్టులకే అధికారం రాజ్యాంగబద్ధమైన కోర్టులే సుమోటో విచారణలు చేపట్టాలని అమికస్ క్యూరీగా హాజరైన సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ తెలిపారు. నేషనల్ ఎన్విరానిమెంటల్ అప్పీలేట్ అథారిటీ యాక్ట్ 1997 ప్రకారం ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఉన్నాయని చెప్పారు. కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ యాక్ట్–2010 వచ్చాకా అథారిటీ యాక్ట్ రద్దయిందన్నారు. ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ ఉందని గ్రోవర్ స్పష్టం చేశారు. ‘‘ఒకవేళ ట్రిబ్యునల్ దృష్టికి ఏదైనా అంశం వస్తే అప్పుడు తప్పనిసరిగా విచారణ చేపట్టాలి’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. లా కమిషన్ నివేదిక చెబుతోంది ఎన్జీటీకి సుమోటో అధికారాలు ఇవ్వకూడదనేది చట్టసభల ఉద్దేశమని 186వ లా కమిషన్ నివేదిక చెబుతోందని ఓ పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సాజన్ పూవయ్య వెల్లడించారు. ఎన్జీటీకి విస్తృత అధికారాలు ఇవ్వడాన్ని ‘స్థానిక’ అంశాలు డైల్యూట్ చేసినప్పటికీ సుమోటోగా కేసులు స్వీకరించే అధికారం పొందేంతగా లేదని స్పష్టం చేశారు. అప్లికేషన్ ద్వారానే విచారణ చేపట్టాలనే అధికార పరిధిని చట్టం పేర్కొందని, సుమోటో విచారణల ద్వారా కాదని తెలిపారు. ప్రతిపాదిత ట్రిబ్యునళ్ల పరిధి దాటి ఉద్దేశపూర్వకంగానే క్రిమినల్ అప్పీలేట్, న్యాయ సమీక్ష హైకోర్టుల పరిధిలోకి తీసుకొచ్చామని లాకమిషన్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. -
లేటరైట్ కొండలను పరిశీలించిన విశాఖ కలెక్టర్
నాతవరం: విశాఖ జిల్లాలో లేటరైట్ నిక్షేపాలున్న కొండలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున బుధవారం పరిశీలించారు. నాతవరం మండలంలో సుందరకోట శివారు బమ్మిడికలొద్దు ప్రాంతంలో లేటరైట్ తవ్వకాల కోసం అటవీ ప్రాంతంలో చెట్లను నరికేశారని గునుపూడికి చెందిన కె.మరిడయ్య జాతీయ హరిత ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. దీంతో కలెక్టర్ లేటరైట్ నిక్షేపాలున్న కొండలను సందర్శించారు. కొండపైకి కారు వెళ్లే అవకాశం లేదు. దీంతో జీపులో, ద్విచక్రవాహనంపై కొంత దూరం ప్రయాణించి, సుమారు రెండు కిలోమీటర్లు నడిచి కొండలను చేరుకున్నారు. అటవీ, రెవెన్యూ భూములు, వాటి సరిహద్దుల మ్యాప్లను తహసీల్దార్ జానకమ్మ వివరించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదీ మరిడయ్యతో మాట్లాడారు. ఫిర్యాదులో ఉన్న విషయాలకు, క్షేత్రస్థ్ధాయిలో కనిపిస్తున్న దానికి పొంతన లేకపోవడం, భారీ వృక్షాలు లేకపోవడంపై ఫిర్యాదీని ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ లేటరైట్ తవ్వకాల కోసం వేసిన రోడ్లను పరిశీలించామని చెప్పారు. నిబంధనలను పాటించారా లేదా అన్న విషయంపై అటవీ, మైనింగ్, కాలుష్య నియంత్రణ, పర్యావరణ, రెవెన్యూ శాఖల అధికారులతో మాట్లాడి, రికార్డులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. కలెక్టర్తోపాటు జేసీ వేణుగోపాలరెడ్డి. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఎల్లమురుగన్, సైంటిస్టు సురేష్బాబు, ఇతర అధికారులు ఉన్నారు. -
మరో అధికారిని నియమించగానే ‘సీమ’ ఎత్తిపోతల పరిశీలన
సాక్షి, అమరావతి: కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సీఈ దేవేందర్రావు స్థానంలో అదే స్థాయి కలిగిన మరో అధికారిని నియమించాక కమిటీని ఏర్పాటు చేసి రాయలసీమ ఎత్తిపోతలను పరిశీ లించి నివేదిక ఇస్తామని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) దక్షిణ మండల బెంచ్(చెన్నై)కు కృష్ణా బోర్డు తెలిపింది. ఎత్తిపోతలపై తుది నివేదిక సమర్పించేందుకు మూడు వారాల గడువు ఇవ్వాలని కోరుతూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే శుక్రవారం ఎన్జీటీకి మధ్యంతర నివేదిక అందజేశారు. మధ్యంతర నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. ► రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టనున్న ప్రదేశాన్ని పరిశీలించి వాస్తవ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని మార్చి 4న ఎన్జీటీ ఆదేశాలు జా రీ చేసింది. ఇందుకు అనుగుణంగా ఎత్తిపోతల పరిశీలనకు కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ని ర్ణయించాం. సీడబ్ల్యూసీ ప్రతినిధిని నియమించాలని కోరగా కృష్ణా–గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్(కేజీబీవో)లో సీఈగా ఉన్న పి.దేవేం దర్రావును నియమించింది. ఆయనతోపాటు కృష్ణా బోర్డు అధి కారులతో సీమ ఎత్తిపోతల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేశాం. ► జూలై 23న ఎన్జీటీ జారీ చేసిన ఆదేశాల మేరకు రాయలసీమ ఎత్తిపోతలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఈనెల 5న పర్యటించాలని భావించాం. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన పి.దేవేందర్రావును కమిటీలో నియమించడంపై ఈనెల 3న ఎన్జీటీ వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఈనెల 4న ఎన్జీటీ స్పందిస్తూ రెండు రాష్ట్రాలతో సంబంధం లేని అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి ఎత్తిపోతలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ► ఈ పరిణామాల నేపథ్యంలో మరో అధికారిని సీడబ్ల్యూసీ నియమించిన వెంటనే కమిటీని ఏర్పాటు చేసి సీమ ఎత్తిపోతలను పరిశీలించి నివేదిక ఇస్తాం. -
ఏపీ అభ్యంతరాలపై కృష్ణా బోర్డు వివరణ కోరిన ఎన్జీటీ
సాక్షి, చెన్నై/ అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) బుధవారం విచారణ చేపట్టింది. ప్రాజెక్ట్ తనిఖీ బృందంలో తెలంగాణ స్థానికత ఉన్న సీడబ్ల్యూసీ అధికారిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఈ ఆంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ రామకృష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ డాక్టర్ సత్యగోపాల్తో కూడిన ఎన్జీటీ చెన్నై బెంచ్ ఏపీ అభ్యంతరాలపై కృష్ణా బోర్డు వివరణ కోరింది. దీంతో తెలుగు రాష్ట్రాల వ్యక్తులు లేకుండా తనిఖీకి వెళ్లేందుకు సిద్ధమని కృష్ణా బోర్డు పేర్కొంది. ఈనెల 9న నివేదిక అందజేయాలని ఎన్జీటీ కృష్ణా బోర్డును ఆదేశించింది. -
Krishna, Godavari Board: ఏమీ తేల్చలేదు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం వెలువరించిన కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీల ఉమ్మడి భేటీ అసంపూర్తిగా ముగిసింది. బోర్డుల పూర్తి స్థాయి భేటీ నిర్వహించాకే సమన్వయ కమిటీల సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేసిన తెలంగాణ మంగళవారం నాటి భేటీకి గైర్హాజరయ్యింది. కాగా ఆంధ్ర ప్రదేశ్.. గెజిట్లోని పలు అంశాలపై తమకు అభ్యంతరాలున్నాయని, వాటిపై కేంద్రానికి లేఖ రాసి అక్కడినుంచి స్పష్టత వచ్చాకే అన్ని అంశాలపై స్పందిస్తామని తెలిపింది. ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్లు), నిధులు సహా ఏ ఇతర అంశాలైనా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాకే ముందుకెళతామని అధికారులు చెప్పారు. సీఎం సూచనలతోనే దూరం! కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే, గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండ్యల అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో ఈ ఉమ్మడి సమావేశం జరిగింది. ఏపీ తరఫున ఈఎన్సీ నారాయణరెడ్డితో పాటు ఇతర ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి సోమవారమే తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్కు వివరించారు. అయితే ఈ భేటీకి దూరంగా ఉండాలని ఆయన సూచించినట్లు తెలిసింది. దీంతో తెలంగాణ ఇంజనీర్లు ఎవరూ మంగళవారం నాటి సమావేశానికి హాజరు కాలేదు. బోర్డుల పూర్తిస్థాయి భేటీ తర్వాతే సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని సోమవారం గోదావరి బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ.. మంగళవారం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. మా ప్రభుత్వంతో చర్చించాక చెబుతాం: ఏపీ ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తేవడం, వాటి అనుమతులు, అనుమతుల్లేని ప్రాజెక్టుల వివరాలు, సీఐఎస్ఎఫ్ భద్రత, నిధుల విడుదల, విద్యుదుత్పత్తి వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసే విషయాన్ని బోర్డులు ప్రస్తావించినట్లు తెలిసింది. తమకు సహకరించాలని, అవసరమైన నివేదికలు, వివరాలు ఇవ్వాలని బోర్డులు ఏపీని కోరాయి. దీనిపై స్పందించిన ఏపీ ఇంజనీర్లు.. అన్ని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తేవడం, పర్యవేక్షణకు సిబ్బంది కేటాయింపులు, నిధుల విడుదల వంటి అంశాలపై తమకు కొన్ని అభ్యంతరాలున్నాయని తెలిపారు. దీనిపై త్వరలోనే కేంద్ర జల శక్తి శాఖకు లేఖ రాస్తామని చెప్పారు. ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వడం, నిధుల విడుదల, ప్రాజెక్టులకు అనుమతుల విషయాలపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయాలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. గోదావరిలో మున్ముందు తీవ్ర సమస్యలు: ఏపీ ఈఎన్సీ ఉమ్మడి భేటీ ముగిసిన తర్వాత ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ అభ్యంతరాలపై ఓ స్పష్టత వచ్చాకే నోటిఫికేషన్ అమలుపై పూర్తి స్థాయిలో స్పందిస్తామని బోర్డుకు చెప్పామని తెలిపారు. అన్ని ప్రాజెక్టులు, గెజిట్లో సూచించిన అన్ని అంశాలపై బోర్డు పర్యవేక్షణ అక్కర్లేదని, కేవలం క్లిష్టమైన అంశాలను మాత్రమే బోర్డులు చూస్తే సరిపోతుందని అన్నారు. ఇదే సమయంలో గోదావరి జలాల వినియోగం, మళ్లింపు అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మున్ముందు కృష్ణాలో కన్నా గోదావరిలో తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ‘గోదావరిలో ఉమ్మడి ఏపీకి 1,430 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇందులో 1,350 టీఎంసీలను వినియోగించేలా తెలంగాణ కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ, దేవాదుల వంటి పథకాలు చేపడుతోంది. గోదావరిలో మిగులు జలాలు లేవు. ఎగువ రాష్ట్రాలు వినియోగించుకోలేని నీరు మాత్రమే దిగువకు వస్తోంది. ఆయా రాష్ట్రాలు వినియోగం మొదలు పెట్టినా, తెలంగాణ 1,350 టీఎంసీలు వాడినా పూర్తి దిగువ రాష్ట్రమైన ఏపీలోని పోలవరం, గోదావరి డెల్టా సిస్టమ్( జీడీఎస్)కు తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. ఇది ఏపీకి తీరని నష్టం చేకూర్చుతుంది..’ అని తెలిపారు. పోలవరం, పట్టిసీమలతో మళ్లిస్తున్న గోదావరి జలాలకు గానూ తమకు 45 టీఎంసీల వాటా ఇవ్వాలని తెలంగాణ కోరడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణ సైతం 241 టీఎంసీల మేర గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు మళ్లిస్తోందని, మరి దీని మాటేమిటి? అని ఆయన ప్రశ్నించారు. సముద్రంలోకి పూర్తి వృధాగా పోతున్న సందర్భంలో తాము మళ్లించుకునే నీటిని వినియోగ వాటాల కింద పరిగణించరాదని కోరుతున్నా తెలంగాణ వినిపించుకోవడం లేదని తెలిపారు. వృధాగా పోతున్న నీటిని వినియోగించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. 5న రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతంలో పర్యటన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతంలో పర్యటించే అంశం భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఈ నెల 5న జరిగే ఈ పర్యటనకు సహకరించాలని ఏపీని బోర్డు కోరింది. ఇందుకు అంగీకరించిన ఏపీ.. కమిటీలో తెలంగాణ ఇంజనీర్లు లేకుండా చూడాలని షరతు పెట్టింది. దీనిపై బోర్డు ఎలాంటి నిర్ణయం చేసిందీ తెలియలేదు. అయితే తెలంగాణ కోరుతున్నట్లుగా ఈ 12న పూర్తి స్థాయి బోర్డుల భేటీ జరిగే అవకాశం ఉందని తెలిసింది. -
AP: ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించలేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘించలేదని, తమకు అలాంటి ఉద్దేశం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని, అందులో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జీటీలో ఇటీవల కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్లో ప్రధానాంశాలు ఇవీ.. ► కృష్ణా ట్రిబ్యునల్–1 కేటాయింపుల మేరకే శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగులు కన్నా దిగువన ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు వాటా నీటిని తీసుకునే అవకాశం లేదు. ► 800 అడుగుల వద్ద నీటిని తీసుకునేందుకు ప్రతిపాదిత పథకాన్ని చేపట్టాం. ఈ నీటిని శ్రీశైలం కుడికాలువ, తెలుగు గంగ ద్వారా చెన్నై నగరానికి తాగునీరు, తెలుగు గంగ ప్రాజెక్టు, గాలేరు–నగరి సుజల స్రవంతి, ఎస్ఆర్బీసీకి తరలించాలి. రోజుకు మూడు టీఎంసీల చొప్పున ఆయా ప్రాజెక్టులకు కేటాయించిన 101 టీఎంసీల మేరకు శ్రీశైలం కుడి ప్రధాన కాలువకు తరలించేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపడుతున్నాం. నీటి మట్టం 854 అడుగుల కంటే దిగువన ఉన్నప్పుడు కేటాయింపులున్నా నీటిని వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. అందువల్లే కేటాయించిన వాటా నీటిని వినియోగించుకునేందుకే 800 అడుగుల నుంచి నీటిని తీసుకునేలా సీమ ఎత్తిపోతలకు ప్రణాళిక రూపొందించాం. అది కూడా పాత ప్రాజెక్టుల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకే. ► 2020 జూలై 13న రాయలసీమ ఎత్తిపోతల పథకం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టెండర్లు పిలిచేందుకు అనుమతిస్తూ అవసరమైన అధ్యయనం చేయాలని ఎన్జీటీ పేర్కొంది. తదనుగుణంగా తక్కువ ధరకు బిడ్ చేసిన బిడ్డర్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడానికి ముందుకొచ్చారు. ► 2020 అక్టోబర్ 29న ఇచ్చిన ఆదేశాల్లో ట్రిబ్యునల్ పలు సూచనలు చేసింది. బిడ్డర్ సమగ్ర సర్వే చేయాలని, ముచ్చుమర్రి వద్ద భూసేకరణను నివారించడంలో భాగంగా మరే ఇతర ప్రాంతంలోనైనా పథకం నిర్మాణం చేపట్టవచ్చా? అనే అంశంపై సర్వే చేయాలని సూచించింది. ఈ క్రమంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎడమ వైపున రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని బిడ్డర్ తెలిపారు. ► బిడ్డర్ నివేదికను సాంకేతిక కమిటీ పరిశీలించి అనుమతించింది. అనంతరం పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద పథకం నిర్మాణం నిమిత్తం తనిఖీ చేయాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2020 డిసెంబర్ 4న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫీజిబిలిటీ నివేదిక ఇచ్చింది. నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంత కన్జర్వేటర్ను అభిప్రాయాలు చెప్పాలని కోరగా బిడ్డర్ సూచించిన ప్రాంతం ఎకో సెన్సిటివ్ జోన్లోకి రాదని నివేదించారు. ఈ మేరకు మార్పులు చేసిన వివరాలను ఎన్జీటీ ముందు ఉంచుతున్నాం. మార్పుల ప్రకారం కొత్తగా సాగులోకి వచ్చే ప్రాంతం ఏమీ లేదు. ప్రస్తుత కాలువ సామర్థ్యం కూడా పెరగదు. ► పథకంలో మార్పులు చేసిన అనంతరం సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఈ ఏడాది జూన్ 30న కేంద్ర జల సంఘానికి, జూలై 1న కృష్ణా బోర్డుకు అందచేశాం. మార్పులు చేసిన ప్రతిపాదిత పథకానికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఈ ఏడాది జూన్ 9న కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. జూన్ 17, జూలై 7న నిర్వహించిన సమావేశాల్లో జలశక్తి నిపుణుల కమిటీ మార్పుల ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుంది. దీనికి సంబంధించి కొన్ని వివరణలు కోరింది. అది పెండింగ్లో ఉంది. ► సాగు, తాగు నీరు నిమిత్తం కేటాయించిన జలాలను తీసుకునేందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించారని నిపుణుల కమిటీ తేల్చింది. ఎత్తిపోతల ద్వారా తీసుకునే జలాలు ఇప్పటికే పర్యావరణ అనుమతులు ఉన్న తెలుగు గంగ ప్రాజెక్టు, ఎస్ఆర్బీసీ, గాలేరు నగరి సుజల స్రవంతి కోసమేనని, కొత్తగా సాగు ప్రాంతం ఏమీ లేదని, పర్యావరణ అనుమతులు అవసరం లేదని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. మార్పులు చేసిన ప్రతిపాదనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జీటీ ఆదేశాల మేరకు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసింది. ► ఎన్జీటీ ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉత్తరం వైపు ఎలాంటి కాంక్రీట్ పనులు జరగడం లేదు. ప్రతిపాదిత కొత్త స్థలంలో ఫౌండేషన్ నిమిత్తం తనిఖీలు మాత్రమే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 అక్టోబర్ 29 నాటి ఆదేశాలను ఉల్లంఘించలేదు. పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదు. ఆ పిటిషన్ను కొట్టివేసి భారీ జరిమానా విధించాలని కోరుతున్నాం. -
‘పాలమూరు–రంగారెడ్డి’ పరిశీలనకు కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలోని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించేందుకు సంయుక్త కమిటీని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ చెన్నై ప్రాంతీయ కార్యాలయ సీనియర్ అధికారి లేదా హైదరాబాద్ అధికారి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ శాస్త్రవేత్త, మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్, జియాలజీ మైనింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లేదా డైరెక్టర్ సూచించిన సాయిల్ టెక్నాలజీ సీనియర్ అధికారి, నేషనల్ ఎన్విరానిమెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సీనియర్ శాస్త్రవేత్తలను ఇందులో సభ్యులుగా పేర్కొంది. ఉల్లంఘనలు గుర్తిస్తే కేంద్ర జల సంఘం సీనియర్ అధికారిని అదనపు సభ్యుడిగా చేర్చనున్నట్లు ఎన్జీటీ తెలిపింది. తాగునీటి ప్రాజెక్టు అయినా.. సాగు కోసం తెలంగాణ ప్రభుత్వం రిజర్వాయర్లు నిర్మిస్తూ నిబంధనలు ఉల్లంఘించిందంటూ మరో పిటిషన్లో ఆరోపించిన విషయాన్ని ఎన్జీటీ ప్రస్తావించింది. ఈ అంశంపై కూడా కమిటీ పరిశీలించాలని సూచించింది. ‘తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ చట్టాల ఉల్లంఘన చేసిందా? పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ) అధ్యయనం చేయకుండా, పర్యావరణ నిర్వహణ ప్రణాళిక లేకుండా, ఈఐఏ నోటిఫికేషన్, 2006 నిబంధనలను ఉల్లంఘించిందా? పర్యావరణ నష్టం ఎంత? తాగునీటి కోసమే చేపడుతున్నారా లేదా సాగునీటికి కూడా విస్తరించే అవకాశం ఉందా? ప్రాజెక్టు నిమిత్తం ప్రజలను తరలించారా?’అనే అంశాలు కమిటీ పరిశీలించాలని ఎన్జీటీ ఆదేశించింది. తనిఖీ కోసం మహబూబ్నగర్ జిల్లా కాకుండా ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తే ఆయా జిల్లాల కలెక్టర్లను కో–ఆప్ట్ సభ్యులుగా చేర్చుకోవచ్చని తెలిపింది. ఆగస్టు 27 లోగా కమిటీ నివేదిక ఇవ్వాలని పేర్కొంది. కడప జిల్లాకు చెందిన డి.చంద్రమౌళీశ్వరరెడ్డి సహా 9 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్ను ఈనెల 15న జస్టిస్ కె.రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్య గోపాల్ విచారించిన విషయం తెలిసిందే. -
సింగరేణి అక్రమ మైనింగ్పై ఎన్జీటీ ఆగ్రహం
న్యూఢిల్లీ: సింగరేణి అక్రమ మైనింగ్పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శనివారం ఆగ్రహం వ్యక్త చేసింది. అనుమతులు లేకుండా అదనపు మైనింగ్ చేస్తున్నారని మండిపడింది. నందునాయక్, శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్లపై ఎన్జీటీ చెన్నై బెంచ్లో విచారణ చేపట్టింది. కాగా, అదనపు మైనింగ్పై ఎన్జీటీకి నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. అయితే పర్యావరణ అనుమతులు లేకుండా మైనింగ్ చేయొద్దని సింగరేణిని ఎన్జీటీ ఆదేశించింది. ఇప్పటికే చేపట్టిన అక్రమ మైనింగ్కు నష్టపరిహారం చెల్లించాని పేర్కొంది. కాలుష్య బారిన పడిన బాధితులకు తక్షణమే పరిహారం చెల్లించాలని తెలిపింది. అంతేకాకుండా గ్రీన్బెల్ట్పై నివేదిక సమర్పించాలని నిపుణుల కమిటీని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. కాగా తదుపరి విచారణను వచ్చేనెల(ఆగస్టు) 12కు వాయిదా వేశారు. -
పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయా?
సాక్షి, న్యూఢిల్లీ: పాలమూరు – రంగారెడ్డి ప్రాజె క్టులో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయా లేదా.. అనే అంశంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై ధర్మాసనం నివేదిక కోరింది. ఈ మేరకు నిపుణుల కమిటీని నియమించింది. ఈ ప్రాజెక్టులో పర్యా వరణ ఉల్లంఘనలు జరిగాయని కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం జస్టిస్ రామకృష్ణన్ బెంచ్ విచారించింది. ఉదండా పూర్ రిజర్వాయర్ కోసం 16 కిలోమీటర్ల అడ్డుకట్ట (బండ్) నిర్మాణానికి భారీగా చెరువులను తవ్వుతు న్నారని పిటిషనర్ ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మా ణంలో పర్యావరణ నిబంధనలు పాటించడం లేదని పేర్కొన్నారు. కాగా, 2016లో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలను తాగునీటి ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపడితే ఇప్పుడు కేసు వేయడం నిర్ధేశిత లిమిటే షన్ సమయానికి విరుద్ధమని తెలంగాణ అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్రావు ధర్మాసనానికి నివేదించారు. అయితే పిటిషనర్.. ప్రాజెక్టును సవాలు చేయడం లేదని, పర్యావరణ ఉల్లంఘనలపై కేసు దాఖలు చేశారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ విచారణ చేపడతా మని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ సాగునీటి శాఖ, మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ఎస్ఈ, గనుల శాఖ, మహబూబ్నగర్ జిల్లా అసి స్టెంట్ డైరెక్టర్లకు ధర్మాసనం నోటీసులు జారీ చేసిం ది. పర్యావరణ అనుమతుల ఉల్లంఘనలు జరి గాయో.. లేవో.. తేల్చేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. వాస్తవ పరిస్థితిని పరిశీలించి ఆగస్టు 27 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా వేసింది. -
పుట్టినగడ్డకూ బాబు 'వెన్నుపోటు'
సాక్షి, అమరావతి: తాను జన్మించిన ప్రాంతమంటే సహజంగానే ఎవరికైనా కాస్తంత ప్రేమ ఉంటుంది. ఎంతదూరంలో ఉన్నా ఆ మమకారం పోదు. వీలైతే సొంతగడ్డకు సేవ చేసి రుణం తీర్చుకోవాలి. పోనీ అది కుదరలేదనుకుంటే కనీసం అపకారం తలపెట్టకూడదు. టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం సొంత జిల్లా చిత్తూరు అభివృద్ధినే అడ్డుకుంటున్నారు. తాను చేయకపోగా ఇతరులు సంకల్పిస్తే సహించలేకపోతున్నారు. లక్ష ఎకరాలకుపైగా సస్యశ్యామలం చేసే ప్రాజెక్టును నిలిపివేయాలంటూ తాజాగా ఎన్జీటీలో ఆ పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషనే ఇందుకు నిదర్శనం. ప్రాజెక్టును ఆపాలంటూ టీడీపీ పిటిషన్.. గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను అనుసంధానం చేసి దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడు రిజర్వాయర్లతో కూడిన ప్రాజెక్టును నిలుపుదల చేయాలంటూ టీడీపీ నేత, చిత్తూరు జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు జి.గుణశేఖర్నాయుడుతోపాటు ఆ పార్టీకే చెందిన 13 మంది నేతలతో జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ), చెన్నై బెంచ్లో చంద్రబాబు రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని, పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన ఈ ప్రాజెక్టును నిలుపుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఎన్జీటీని అభ్యర్థించారు. కేంద్ర జలసంఘానికి, కేంద్ర జల్ శక్తి శాఖకూ ఫిర్యాదులు చేశారు. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు, పర్యావరణ అనుమతులు లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేస్తోందని, వీటిని వెంటనే నిలిపివేసేలా ఆదేశించాలని ఎన్జీటీలో గత నెల 27న రిట్ పిటిషన్ దాఖలు చేయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చిత్తూరు జిల్లాలోని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాల్లో 1.10 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. దుర్భిక్ష పశ్చిమ మండలాల రూపురేఖలను సమూలంగా మార్చేసే ఈ ప్రాజెక్టును అడ్డుకునే యత్నం చేయడం ద్వారా చివరకు సొంత జిల్లా ప్రజలకూ చంద్రబాబు అన్యాయం చేశారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. అనుసంధానంతో... హంద్రీ– నీవా ద్వారా చిత్తూరు జిల్లాకు నీళ్లు రావడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను అనుసంధానం చేయడం ద్వారా ఎనిమిది టీఎంసీలను తరలించి చిత్తూరు జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. కండలేరు నుంచి నీటిని తరలించి చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తున్నారు. తద్వారా జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తుంటే చంద్రబాబు సొంత ప్రాంతం అభివృద్ధినే అడ్డుకుంటూ కేసులు దాఖలు చేయిస్తున్నారు. ఇది పూర్తిగా దిగజారుడుతనానికి నిదర్శనమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ ప్రాజెక్టు.. ►వైఎస్సార్ కడప జిల్లాలో గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువలో 56 కి.మీ. నుంచి రోజుకు రెండు వేల క్యూసెక్కుల చొప్పున హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి ఎత్తిపోస్తారు. దీన్ని చక్రాయిపేట ఎత్తిపోతలుగా వ్యవహరిస్తారు. ఇందులో 450 క్యూసెక్కులను రాయచోటి నియోజకవర్గం సాగు, తాగునీటి అవసరాల కోసం సరఫరా చేస్తారు. మిగతా 1,550 క్యూసెక్కుల్లో 800 క్యూసెక్కులను హంద్రీ–నీవా రెండో దశలోని పుంగనూరు బ్రాంచ్ కెనాల్(పీబీసీ)కు, 750 క్యూసెక్కులను అడవిపల్లి రిజర్వాయర్కు తరలిస్తారు. ►అడవిపల్లి రిజర్వాయర్ నుంచి రోజుకు 800 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 8 టీఎంసీలను పీబీసీకి తరలిస్తారు. పీబీసీలో 125.4 కి.మీ వద్ద నుంచి గ్రావిటీ ద్వారా కొత్తగా 2 టీఎంసీల సామర్థ్యంతో చిత్తూరు జిల్లా పశ్చిమాన కురుబలకోట మండలం ముదివేడు వద్ద నిర్మించే రిజర్వాయర్ను నింపుతారు. ఈ జలాశయం కింద 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 15 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు. ►పీబీసీలో 180.4 కి.మీ నుంచి నీటిని ఎత్తిపోసి పుంగనూరు మండలం నేతిగుంటపల్లి వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్ను నింపుతారు. ఈ రిజర్వాయర్ కింద కొత్తగా పది వేల ఎకరాలకు నీళ్లందిస్తారు. ఐదు వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తారు. ►పీబీసీలో 210 కి.మీ నుంచి గ్రావిటీపై నీటిని తరలించి సోమల మండలం ఆవులపల్లి వద్ద 3.50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్ను నింపుతారు. ఈ రిజర్వాయర్ పనులకు రూ.667.20 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిద్వారా కొత్తగా 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తారు. 20 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ఈ పనులకు ఆగస్టులో టెండర్లు నిర్వహించిన ప్రభుత్వం మూడేళ్లలోగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఆది నుంచి అదే నైజం.. 1995 నుంచి 2004 వరకూ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కృష్ణా బేసిన్లో ఎగువన కర్ణాటక అక్రమంగా ఆల్మట్టి ప్రాజెక్టును నిర్మిస్తుంటే నోరు మెదపకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. కర్ణాటక ప్రభుత్వం చిత్రావతిపై పరగోడు.. పెన్నాపై నాగలమడక బ్యారేజీలను నిర్మిస్తూ దుర్భిక్ష అనంతపురం జిల్లా ప్రజల నోళ్లు కొడుతుంటే నిర్లిప్తంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన తర్వాత పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల ఎత్తిపోతల సహా ఎనిమిది అక్రమ ప్రాజెక్టులను చేపట్టి 178.93 టీఎంసీల కృష్ణా జలాలను తెలంగాణ అక్రమంగా తరలిస్తుంటే ఓటుకు కోట్లు కేసుల భయంతో నోరు విప్పలేదు. ఇప్పుడు సొంత జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టును స్వాగతించకుండా అడ్డుపుల్లలు వేయడం ద్వారా తన వైఖరిని మరోసారి రుజువు చేసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పోలవరంలో ఎన్జీటీ బృందం
పోలవరం రూరల్: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మూలలంక ప్రాంతంలోని డంపింగ్ యార్డు మట్టి జారిపోకుండా తీసుకున్న చర్యలు, ఇంకా చేపట్టాల్సిన పనులను జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బృందం మంగళవారం పరిశీలించింది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శేషశయనారెడ్డి నాయకత్వంలో బృంద సభ్యులు కోట శ్రీహర్ష, టి.శశిధర్, ఎస్.మన్నివరం, హెచ్డీ వరలక్ష్మి, డి.సురేష్ పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డులు, ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డంపింగ్ యార్డులను పరిశీలించి ప్రాజెక్టు సీఈ ఎం.సుధాకర్బాబు, ఎస్ఈ కె.నరసింహమూర్తిల నుంచి వివరాలు తెలుసుకున్నారు. బీసీ కాలనీ సమీపంలో ఉన్న 203 ఎకరాల డంపింగ్ యార్డు ఏమైనా జారిపోయిందా, మొక్కలు నాటారా.. కాలువ పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను పరిశీలించారు. 902 హిల్ ప్రాంతంలోని స్పిల్ చానల్ మట్టిని పోస్తున్న రెండు ప్రదేశాలను కూడా చూశారు. హిల్ వ్యూ పై నుంచి స్పిల్ వే రేడియల్ గేట్ల అమరిక, ఎగువ కాఫర్డ్యామ్, ట్విన్టన్నెల్స్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బృందం సభ్యులు మూలలంక డంపింగ్యార్డు కోసం తీసుకున్న 203 ఎకరాల భూములకు పరిహారం చెల్లించారా లేదా అనే విషయాలను ఆరా తీశారు. 30 మంది రైతులు పరిహారం తీసుకోలేదని, వారికి సంబంధించిన సొమ్ము కోర్టులో జమచేశామని అధికారులు తెలిపారు. ఈ బృందం బుధవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించి ఆ ప్రాంత వాసుల నుంచి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుంటుంది. ఆర్డీవో వైవీ ప్రసన్నలక్ష్మి, తహసీల్దార్ బి.సుమతి, ఈఈ మల్లికార్జునరావు, మేఘ జీఎం ఎ.సతీష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
పోలవరంలో పర్యావరణ పర్యవేక్షణకు కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పర్యావరణ పర్యవేక్షణకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ నియమిస్తామని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పేర్కొంది. విశ్రాంత న్యాయమూర్తి ఎవరనేది ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ఏకే గోయెల్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో డంపింగ్ యార్డ్పై పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది. 2015 నుంచి పలు దఫాలుగా పర్యావరణ ఉల్లంఘనలపై కేసులు వేసినా సమస్య పరిష్కారం కాలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్కుమార్ తెలిపారు. 2016లో అదనపు భూసేకరణ జరిపి పర్యావరణ అనుమతులు లేకుండా, డంపింగ్ వల్ల తలెత్తే ప్రభావాల్ని అధ్యయనం చేయకుండా ప్రాజెక్టు వ్యర్థాలను డంపింగ్ చేయడం ప్రారంభించారని తెలిపారు. అనాలోచిత డంపింగ్ వల్ల 2018, 2019 ఫిబ్రవరిలో భూప్రకంపనలు రావడంతోపాటు ప్రాజెక్టు సమీపంలో రహదారులు పగుళ్లు వచ్చాయని తెలిపారు. కాఫర్ డ్యాం నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఎగువ ప్రాంతాలు భారీగా మునిగి ప్రజలు నష్టపోయారని తెలిపారు. కమిటీలు పలు సూచనలు చేసినా అమలు చేయలేదన్నారు. పర్యావరణ ఉల్లంఘనలపై కేసు వేసినందుకు పిటిషనర్, కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. పర్యావరణ ప్రభావంపై ప్రాజెక్టు నిర్మాణ తొలి దశ నుంచే అంచనా చేయాలి కానీ సమస్యలు ఉత్పన్నమయ్యాక కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్కు పరిహారం అందజేయాలని ధర్మాసనం పేర్కొంది. ప్రాజెక్టు పనులు చేపట్టడానికి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని తర్వాత బాధ్యత ఇతరులపై వేయడం సరికాదని విషయ నిపుణుడు నాగిన్నందా వ్యాఖ్యానించారు. పర్యావరణ పర్యవేక్షణ కమిటీలో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ రీసెర్చ్ సహా పలువురు నిపుణులు ఉంటారని ధర్మాసనం పేర్కొంది. కమిటీకి అవసరమైన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలని సూచించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అందించిన నివేదికను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ధర్మాసనం తెలిపింది. పూర్తి లిఖిత పూర్వక ఆదేశాలు బుధవారం వెలువడనున్నాయి. -
కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిల్ దాఖలైంది. 3 టీఎంసీల నీటిని పంప్లైన్ సిస్టమ్ ద్వారా తరలించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ఇంజనీర్ ఫోరమ్ కన్వినర్ దొంతుల లక్ష్మినారాయణ పిల్ దాఖలు చేశారు. హైకోర్టు గురువారం ఈ పిల్పై విచారణ చేపట్టింది. 3 టీఎంసీల పద్దతి ద్వారా నీటి తరలింపు చేస్తే రూ.8 వేల కోట్లు ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు 2 టీఎంసీల నీటి తరలింపు ప్రక్రియను కెనాల్ గ్రావిటేషనల్ టన్నల్ అండ్ లిఫ్ట్ సిస్టం ద్వారా తరలించారని పిటిషనర్ హైకోర్టుకు వివరించారు. ప్రతి ఏటా వెయ్యి కోట్ల రూపాయల మెయింటనెన్స్ ఖర్చు అవుతుంది. 3 టీఎంసీ పైప్లైన్ పద్ధతి ద్వారా తరలిస్తే భూసేకరణ సమస్యతో పాటు, విద్యుత్ తదితర సమస్యలు ఎదురవుతాయి. (భారత్కు రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్) తెలంగాణ రాష్ట్రంలో సీడబ్ల్యూసీ (సెంట్రల్ వాటర్ కమిషన్) అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మించొద్దని ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు కాలువల ద్వారానే పనులు జరగాయి' అని పిటిషనర్ హైకోర్టుకు వివరించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం, కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇరిగేషన్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మినిస్టర్, ఎన్విరారమెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ శాఖలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని ప్రతివాదులను హైకోర్ట్ ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
టపాసులు కాల్చేందుకు 2 గంటలే
సాక్షి, అమరావతి: దీపావళి రోజున టపాసులు కాల్చే వారికి కేవలం రెండు గంటల సమయమే ఇచ్చారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వ పధాన కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. వాయు కాలుష్యం పెరగడం వల్ల కోవిడ్ ప్రభావం ఎక్కువయ్యే అవకాశాలున్నాయని, దీన్ని నియంత్రించేందుకే కేవలం రెండు గంటల సమయం ఇచ్చినట్టు ఈనెల 5న నేషనల్ గ్రీన్ట్రిబ్యునల్ పేర్కొంది. ఈ ఆదేశాల మేరకు రెండు గంటల సమయం ఇచ్చామని, టపాసులు అమ్మే షాపులు కూడా 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని సూచించారు. షాపుల ముందు క్యూలు ఉండకుండా చూడాలని ఆదేశించారు. దీనిపై కలెక్టర్లు, పోలీసు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పర్యవేక్షణ చేయాలన్నారు. -
దేశ రాజధానిలో టపాసులపై నిషేధం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దీపావళికి టపాసులు కాల్చడంతోపాటు అమ్మకాలను కూడా నిషేధిస్తున్నట్లు జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. ‘‘ప్రజలకు స్వచ్ఛమైన గాలిని పీల్చుకొనే హక్కు ఉంది’’ అని పేర్కొన్న ఎన్జీటీ దేశ రాజధానితోపాటు గాలి నాణ్యత చాలా తక్కువగా ఉన్న నగరాల్లోనూ నిషేధాజ్ఞలు ఉంటాయని పేర్కొంది. ఈ నిబంధనలు సోమవారం అర్ధరాత్రి నుంచి నవంబర్ 30 అర్ధరాత్రి వరకు అమలులో ఉంటాయని తెలిపింది. గాలి నాణ్యత మోడరేట్ నుంచి కింది స్థాయి ఉన్న నగరాల్లో హరిత క్రాకర్స్కు అనుమతిచ్చింది. టపాసులు కాల్చడం ద్వారా దేశ రాజధాని ప్రాంతంలో వచ్చే కాలుష్యంపై నివారణ చర్యలు కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను విచారించిన జస్టిస్ ఆదర్శకుమార్ గోయెల్ ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. ఆదేశాల్లో ముఖ్యాంశాలు ► దేశరాజధాని పరిధిలో ఈనెల 9 అర్ధరాత్రి నుంచి 30 అర్ధరాత్రి వరకు అన్ని రకాల క్రాకర్స్ అమ్మకం, కాల్చడంపై నిషేధం విధించడం. ► గతేడాది నవంబర్లో గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా గాలి నాణ్యత పూర్ ఆపై స్థాయి ఉన్న అన్ని నగరాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ► గాలి నాణ్యత మోడరేట్ అంతకన్నా తక్కువస్థాయి ఉన్న నగరాల్లో దీపావళి, ఛట్, క్రిస్మస్, న్యూఈయర్ సందర్భంగా ఆయా రాష్ట్రాలు తమ నిబంధనల ప్రకారం కేవలం 2 గంటలపాటు మాత్రమే గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు. టపాసులు నో.. చిచ్చుబుడ్లు ఓకే టపాసుల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు శివసేన నాయకత్వంలోని ముంబై మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) ప్రకటించింది. తక్కువ కాలుష్యం విడుదల చేసే టపాకాయలను, చిచ్చుబుడ్లను ఇళ్ళవద్ద కాల్చవచ్చునని బీఎంసీ తెలిపింది. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండడానికి ఈ చర్యలు చేపట్టినట్లు బీఎంసీ తెలిపింది. -
నవంబర్ 30 వరకు బాణాసంచాపై పూర్తి నిషేధం
న్యూఢిల్లీ: ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో నవంబర్ 9(సోమవారం) అర్థరాత్రి నుంచి నెలాఖరు వరకు బాణాసంచా అమ్మకం, వినియోగంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) పూర్తి నిషేధం విధించింది. దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత మరింత క్షీణించకుండా ఉండటానికి గాను ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో బాణాసంచా వినియోగానికి అనుమతిస్తే.. పరిస్థితి మరింత దిగజారిపోతుందనే ఉద్దేశంతో ట్రిబ్యూనల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఉత్తర్వు నేషనల్ క్యాపిటర్ రీజియన్(ఎన్సీఆర్)లో భాగమైన నాలుగు రాష్ట్రాల్లోని 2 డజనుకు పైగా జిల్లాలకు వర్తిస్తుంది. అంతేకాక దేశవ్యాప్తంగా "గత ఏడాది నవంబర్లో సగటు పరిసర గాలి నాణ్యత" అధ్వాన్నంగా ఉన్న నగరాలు, పట్టణాలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని గ్రీన్ ట్రిబ్యునల్ తెలిపింది. అలానే గాలి నాణ్యత మోడరేట్గా ఉన్న నగరాలు, పట్టణాల్లో తక్కువ కాలుష్య కారకాలుగా పరిగణించబడే గ్రీన్ క్రాకర్స్ని మాత్రమే అనుమతించింది. అది కూడా పరిమిత సమయం వరకు మాత్రమే. "సంబంధిత రాష్ట్రం పేర్కొన్న విధంగా పర్వదినాల్లో బాణాసంచా కాల్చే సమయం రెండు గంటలకు మాత్రమే పరిమితం చేయబడింది. దీపావళి, గురుపూర్లలో రాత్రి 8-10 గంటల మధ్యన, ఛత్లో ఉదయం 6-8 గంటల మధ్య.. క్రిస్మస్, న్యూ ఇయర్ రోజున రాత్రి 11.55 గంటల నుంచి తెల్లవారు జామున 12.30 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చేందుకు అనుమతించబడినట్లు" ఉత్తర్వుల్లో పేర్కొన్నది.(చదవండి: బాణాసంచా బ్యాన్పై కర్ణాటక యూటర్న్) ఇక గాలి నాణ్యత మెరుగ్గా ఉన్న ఇతర ప్రాంతాల్లో ట్రిబ్యూనల్ క్రాకర్స్ నిషేధాన్ని ఐచ్చికం చేసింది. "కోవిడ్ -19 తీవ్రతను దృష్టిలో పెట్టుకుని గాలి కాలుష్యానికి కారణం అయ్యే చర్యలని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి" అని ఎన్జీటీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని కోరింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో.. గాలి నాణ్యత అధ్వన్నంగా ఉన్న తరుణంలో.. కాలుష్యాన్ని మరింత పెంచే బాణాసంచా వాడకాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ని విచారించిన ఎన్జీటీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పండుగ కాలంలో వాయు కాలుష్యం కారణంగా రోజుకు 15,000 కేసులు నమోదవుతాయని కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖలు చేసిన హెచ్చరికలను గుర్తు చేసింది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 7,745 కేసులు నమోదయ్యాయి. (అలర్ట్ : కరోనాకు కాలుష్యం తోడైతే.. ) ఏటా, ఉత్తర భారతదేశంలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. శీతాకాలంలో విషపూరితంగా మారుతుంది, అక్టోబర్ నుండి రైతులు పంట వ్యర్థాలను కాల్చడంతో గాలి నాణ్యత క్షీణిస్తుంది. గత మూడు రోజులుగా, జాతీయ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత చాలా దారుణంగా ఉంది. తీవ్రమైన వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యాలని ప్రభావితం చేస్తుంది. అక్టోబర్ నుంచి ఢిల్లీలోని వాయు కాలుష్యం 17.5 శాతం కోవిడ్ కేసుల పెరుగుదలకిదారితీసిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధం వెల్లడించింది. -
ఆ అవసరాలకు సీమ ఎత్తిపోతల అవసరమే
సాక్షి, అమరావతి: రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఉద్దేశించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) గురువారం తన నిర్ణయాన్ని వెలువరించింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు ఆవశ్యకమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అందచేసిన ఈ ప్రాజెక్టు స్కీంను పరిశీలిస్తే ప్రధానంగా రాయలసీమ కరువు తీర్చేందుకు తాగు, సాగునీటి అవసరాల కోసం రోజూ 8 టీఎంసీల వరద నీటిని మళ్లించి, వీలైనంత తక్కువ వరద జలాలు సముద్రంలో కలిసేందుకు ఉద్దేశించిన పథకమని తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టులో సాగునీటి అంశం కూడా ముడిపడి ఉన్నందున నిర్మాణానికి ముందు పర్యావరణ అనుమతి అవసరమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.(చదవండి: సాఫీగానే ‘సీమ ఎత్తిపోతల’) ఈ ఎత్తిపోతలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)ను కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు (కేఆర్ఎంబీ)కు సమర్పించకుండా ముందుకెళ్లవద్దంటూ కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిందని హరిత ట్రిబ్యునల్ గుర్తు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేఆర్ఎంబీ నుంచి ముందస్తు అనుమతి అవసరమా? లేదా? అన్న అంశం జోలికి తాము వెళ్లడం లేదని పేర్కొంది. ఈ మేరకు ఎన్జీటీ దక్షిణ ప్రాంత బెంచ్ జ్యుడీషియల్ మెంబర్ జస్టిస్ కె.రామకృష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ సైబల్ దాస్ గుప్తాలతో కూడిన ధర్మాసనం 134 పేజీల తీర్పు వెలువరించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేవని, ఈ పథకం వల్ల తెలంగాణలోని పలు ప్రాజెక్టుల ఆయకట్టుతో పాటు హైదరాబాద్కు తాగునీటి సమస్య ఏర్పడుతుందంటూ తెలంగాణ, నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాదనలు వినిపించిన సంగతి విదితమే.(చదవండి: రూ.17,300 కోట్లతో వైద్య రంగానికి చికిత్స) -
కాళేశ్వరంపై ఎన్జీటీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పును వెల్లడించింది. ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్లు ఎన్జీటీ మంగళవారం పేర్కొంది. ఈ సందర్భంగా ఎన్జీటీ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినందున ఇప్పుడు ఉపశమన చర్యల తీసుకోవాల్సిన బాధ్యత ఉందిని తెలిపింది. సరైన పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టరాదని స్పష్టం చేసింది. అయితే, ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడంతో పర్యావరణ ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలు, పర్యావరణ అనుమతులపై కమిటీ ఏర్పాటు అవసరమని ఎన్జీటీ అభిప్రాయపడింది. ఈ మేరకు ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. 2008 నుంచి 2017 వరకు పర్యావరణ అనుమతుల లేకుండా చేసిన నిర్మాణాలకు.. జరిగిన పర్యావరణ నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. నిర్వాసితులకు పరిహారం, పునరావసం అంశాలను కూడా అధ్యయనం చేయాలని చెప్పింది. ఇందుకు సంబంధించి నెల రోజుల్లో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తర్వాత నెల రోజుల్లో అధ్యయనం పూర్తి చేయాలని కమిటీకి ఆదేశాలిచ్చింది. కమిటీ పురోగతిని కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ తన తీర్పులో వెల్లడించింది. ప్రాజెక్టు విస్తరణపై సీడబ్ల్యూసీ నిర్ణయం ప్రకారం పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని తేల్చి చెప్పింది. ఇటీవల అపెక్స్ కౌన్సిల్లో చెప్పినట్లు డీపీఆర్లు సమర్పించి, కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకెళ్లొచ్చని ఆదేశాలు జారీ చేసింది. -
నవంబరు 9లోగా నివేదిక అందించాలి
సాక్షి, న్యూఢిల్లీ/చెన్నై: తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఓపెన్కాస్ట్ మైన్ కారణంగా ఉత్పన్నమయ్యే కాలుష్య పరిస్థితుల గురించి అధ్యయనం చేసేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను నవంబర్ 9లోగా అందించాలని ఆదేశించించింది. ఈ కమిటీలో కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ పర్యావరణ శాఖ, తెలంగాణ గనుల శాఖ, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్పప్లోసివ్స్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని తెలిపిన ఎన్జీటీ చెన్నై బెంచ్.. కమిటీ సమన్వయ బాధ్యతను కేంద్ర పర్యావరణ శాఖ చెన్నై ప్రాంతీయ అధికారికి అప్పగించింది. కాగా సత్తుపల్లిలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్యంపై స్థానిక ఎన్టిఆర్ కాలనీవాసి బానోతు నందు నాయక్ పిటిషన్ దాఖలు చేశాడు. జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ దీనిపై మంగళవారం విచారణ చేపట్టింది. (చదవండి: ఎన్జీటీ ఆదేశాల అమలు నిలిపివేత ) ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. నందు నాయక్ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ గత ఏడాది జూన్లో విచారణ జరిపించినా కమిటీ సిఫార్సులను అమలు చేయలేదని తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల్లో పేలుళ్ల వల్ల ఎన్టిఆర్ కాలనీ లో 700 ఇళ్లు దెబ్బతిన్నాయని.. వాయు, శబ్దం కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని పేర్కొన్నారు. జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ మైన్ లో కొంత భాగం బొగ్గు ఉత్పత్తి ఆపివేసినా.. మైన్ క్లోజింగ్ ప్లాన్ అమలు చేయలేదని వివరించారు. ఇందుకు స్పందించిన బెంచ్.. కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి కాలరీస్ సంస్థ, ఖమ్మం జిల్లా కలెక్టర్ తదితరులకు నోటీసు జారీ చేసింది. -
రాయలసీమ ఎత్తిపోతల పథకం: ముగిసిన వాదనలు
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకం కేసుకు సంబంధించి చెన్నైలోని జాతీయ హరిత న్యాయస్థానం(ఎన్జీటీ)లో ఇరువైపుల వాదనలు ముగిశాయి. మంగళవారం జరిగిన కోర్టు విచారణలో రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే తమకు వాటాగా రావాల్సిన నీళ్లనే తీసుకుంటున్నామని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇది పాత పథకమేనని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో తమ వైఖరేంటో వారం రోజుల్లో తెలపాలని కోర్టు కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది. (కరువు సీమకు నీటిని సరఫరా చేస్తామంటే వివాదమెందుకు?) కాగా ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే. కాగా పర్యావరణ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల పనులను నిలుపుదల చేయాలంటూ తెలంగాణలోని పాత మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మే 20న విచారణ చేపట్టిన ఎన్జీటీ ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయాలని స్టే ఇచ్చింది. అయితే తన వాటా జలాలను వినియోగించుకునేందుకు ఈ పథకం చేపట్టామని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీలో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీని వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని నివేదించింది. దీనిపై జూలై13న విచారించిన ఎన్జీటీ ఎత్తిపోతల పనుల టెండర్ ప్రక్రియ చేపట్టేందుకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. (పర్యావరణ అనుమతి అక్కర్లేదు) -
కాళేశ్వరం విస్తరణపై ఎన్జీటీలో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణపై వేముల్గాట్ భూనిర్వాసితులు దాఖలు చేసిన పిటిషన్ను జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ విచారించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే భారీ విస్తరణ పనులు చేపట్టారని పిటిషనర్లు ధర్మాసనానికి నివేదించారు. కాళేశ్వరం ద్వారా రెండు టీఎంసీలు ఎత్తిపోసేందుకు మాత్రమే పర్యావరణ అనుమతులు ఉన్నాయని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా పనులు జరపరాదని ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖ లైన పిటిషన్ ఢిల్లీ బెంచ్లో పెండింగ్లో ఉన్న విషయంపై చెన్నై బెంచ్ ఆరాతీసింది. ఒకే ప్రాజెక్టుపై 2 బెంచ్ల్లో విచా రణ సాధ్యమేనా అని చెన్నై బెంచ్ న్యాయ విభాగం సభ్యుడు జస్టిస్ రామకృష్ణన్ ప్రశ్నించారు. కాగా, ఢిల్లీలో పెండింగ్ కేసుకు, ప్రస్తుత కేసుకు సంబంధం లేదని, తెలంగాణ చెన్నై బెంచ్ పరిధి లో ఉన్నందువల్ల సౌత్ జోన్ బెంచ్లో కేసు వేశామని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ నివేదించారు. కేసును చెన్నై బెంచ్ విచారిం చినా, ఢిల్లీ ప్రధాన బెంచ్కు బదిలీ చేసినా తమకు అభ్యంతరం లేదని విన్నవించారు. ఢిల్లీ బెంచ్లో కాళేశ్వరం ప్రాజెక్టు కేసు పెండింగ్లో ఉన్నందు వల్ల చెన్నైలో విచారణ సరికాదని తెలంగాణ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రాంచందర్రావు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణపై దాఖలైన పిటిషన్ చెన్నై బెంచ్ విచారించవచ్చా లేదా అనేదానిపై ఆదేశాలివ్వాలని ఢిల్లీ ప్రధాన బెంచ్ను కోరుతూ కేసు తదుపరి విచారణను ఆగస్టు 5కు వాయిదా వేసింది. -
ఎన్జీటీ ఆదేశాల అమలు నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు ఊరట లభించింది. రంగారెడ్డి జిల్లాలో జీవో 111ను ఉల్లంఘించి ఫాంహౌజ్ నిర్మాణం చేశారనే ఆరోపణలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది. ఈ నెల 5న ఎన్జీటీ ఇచ్చిన నోటీసులను, కమిటీ ఏర్పాటుకు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. రిట్ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి, జస్టిస్ పి.నవీన్రావుల ధర్మాసనం బుధవారం స్టే ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రతివాదులైన మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. ఆధారాలు లేకుండా రాజకీయ కక్షతో రేవంత్రెడ్డి పిటిషన్ దాఖలు చేస్తే ఎన్జీటీ నోటీసులివ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని కేటీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్రెడ్డి వాదించారు. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయిందని, దీంతో రేవంత్ తన ఉనికి కోసం పిటిషనర్కు సంబంధం లేని నిర్మాణంపై ఎన్జీటీలో కేసు వేశారని చెప్పారు. జీవో 111ను ఉల్లంఘించి నిర్మాణం జరిగి ఉంటే ఆరు నెలల్లోగా ఎన్జీటీని ఆశ్రయించాలన్న చట్ట నిబంధనకు వ్యతిరేకంగా రేవంత్ కేసు వేశారని, ఈ విషయాలను ఎన్జీటీ పట్టించుకోకుండానే పిటిషనర్కు నోటీసు జారీ చేసి కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చిందన్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన రేవంత్పై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని, బెయిల్పై ఆయన విడుదలయ్యారని తెలిపారు. ఏనాడో జరిగిన నిర్మాణాలపై రేవంత్ తప్పుడు ఫిర్యాదు చేశారని, ఈ విషయంపై గూగుల్ మ్యాప్లను కూడా సమర్పించారని, వీటిని ఎన్జీటీ పరిగణనలోకి తీసుకోకుండానే ఉత్తర్వులిచ్చిందని పేర్కొన్నారు. పిటిషనరే నిర్మాణం చేసినట్లుగా ఆధారాలు లేకుండా రేవంత్ ఫిర్యాదు చేస్తే దానిపై ఎన్జీటీ ఉత్తర్వులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమన్నారు. ఇదిలాఉండగా తనను ప్రతివాదిగా చేయకుండా ఎన్జీటీ ఉత్తర్వులు ఇవ్వడం చెల్ల దని, వాటిని కొట్టేయాలని ఫాంహౌజ్ యజమాని బి.ప్రదీప్రెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఫాంహౌజ్ ప్రదీప్రెడ్డిదని, ఆయనకు తెలియకుండానే ఎన్టీటీ ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదని సీనియర్ న్యాయవాది శ్రీరాం రఘురాం వాదించారు. వాదనల తర్వాత ఎన్జీటీ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి విచారణను వాయిదా వేసింది. -
కేటీఆర్కు ఊరట.. రేవంత్కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఫాంహౌస్ వ్యవహారంలో తెలంగాణ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు బుధవారం స్టే విధించింది. జీవో 111కు విరుద్ధంగా హైదరాబాద్ శివార్లలోని జన్వాడ ప్రాంతంలో మంత్రి కేటీఆర్ ఫాంహౌస్ నిర్మించారని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దాఖలు చేయడంతో కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా జీవో 111 ఉల్లంఘనలపై తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. (రేవంత్రెడ్డికి పోసాని హితవు) అయితే ఎన్జీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా ఆ వివాదస్పద ఫాంహౌస్ తనది కాదని స్పష్టం చేస్తూ హైకోర్టుకు నివేదిక అందించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం రేవంత్ పిటిషన్పై ఎన్జీటీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఇక అంతకుముందు ఎన్జీటీ జారీ చేసిన నోటీసులపై కేటీఆర్ ఆసహనం వ్యక్తం చేశారు. ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకందని, ఇందులో రాజకీయ కక్షపూరిత పిటిషన్ అని ఆరోపించారు. నిజానిజాలు పరిశీలించకుండానే ఎన్జీటీ ఉత్తర్వులు జారీచేసిందని, దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తానని కేటీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. (పదవికి దూరంగా ఉండి నిరూపించుకోలేరా?) ఇక జీవో 111కు విరుద్దంగా నగర శివార్లలో కేటీఆర్ ఫాంహౌస్ కట్టారని రేవంత్ రెడ్డి ఎన్టీటీని ఆశ్రయించారు. జస్టిస్ రామకృష్ణన్, సభ్య నిపుణుడు సైబల్ దాస్ గుప్తాతో కూడిన చెన్నై బెంచ్ ఈ పిటిషన్ను విచారించింది. పిటిషనర్ న్యాయవాది కె.శ్రవణ్కుమార్ వాదనలు వినిపిస్తూ.. జీవోలు, చట్టాలు అమలు చేయాల్సిన మంత్రే వాటిని ఉల్లంఘించారని, జీవో 111 ఉల్లంఘనలపై గతంలో ఎన్జీటీ ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదని నివేదించారు. నాలాను కబ్జా చేసి రోడ్డు నిర్మించారని చెప్పారు. దీనిపై ఎన్జీటీ స్పందిస్తూ.. అక్రమ నిర్మాణం, జీవో 111 ఉల్లంఘనలపై తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. (వివాదాస్పద ఫాంహౌస్పై నిజ నిర్ధారణ కమిటీ) కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, హెచ్ఎండీఏ ప్రతినిధులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వెల్లడించింది. కట్టడం అక్రమమైతే పర్యావరణ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, వసూలు చేయాల్సిన పరిహారం అంచనా వేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 2018లో జీవో 111 ఉల్లంఘనలపై ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వుల అమలు నివేదికను కూడా ఇవ్వాలని ఎన్జీటీ పేర్కొంది. -
దివీస్ ఫార్మా కంపెనీకి ఎన్జీటీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : దివీస్ ఫార్మా కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు జారీ చేసింది. కాలుష్యాన్ని వెదజల్లుతూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన కాలుష్య పరిరక్షణ సమితి ఎన్జీటిని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జరిపిన జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ఎన్జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సహా దివీస్ ఫార్మా కంపెనీకి నోటీసులు జారీ చేసింది. (ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లు కూడా..) అలాగే ఫార్మా కాలుష్యంపై విచారణ జరిపేందుకు ఎన్జీటీ చౌటుప్పల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా కేంద్ర పర్యావరణ శాఖ ఫార్మా వ్యవహారాల విభాగం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ శాఖ, యాదాద్రి జిల్లా కలెక్టర్ను చేర్చింది. చౌటుప్పల్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఫార్మా కంపెనీలు వ్యవహరిస్తూ కాలుష్యానికి కారణమైతే తీసుకోవాల్సిన చర్యలను నివేదించాలని పేర్కొంది. తదుపరి విచారణను ఆగష్టు 21కి వాయిదా వేసింది. (వారికి వైఎస్ జగనే కరెక్ట్ : నాగబాబు)