-
నేషనల్ కాన్ఫరెన్స్ యూ టర్న్
శ్రీనగర్: రానున్న లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కొనే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ దూరమవుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్ని కల్లో తమ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగు తుందని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా గురువారం ప్రకటించారు. కొద్దిసేపటికే పార్టీ నేత, ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా అలాందేమీ లేదంటూ ప్రకటించారు. ఇండియా కూటమిలోనే కొనసాగుతామని జమ్మూకశ్మీర్లోని ఎంపీ స్థానాల్లో పోటీపై భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కశ్మీర్ లోని అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీ ఇండియా కూటమితోపాటు ప్రాంతీయ గుప్కార్(పీఏజీడీ) అలయెన్స్లోనూ కీలకంగా ఉంది. -
లోక్సభ ఎన్నికల ముందు ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ..
ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు జమ్మూకశ్మీర్కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు లేకుండా నేషనల్ కాన్ఫరెన్స్ స్వతహాగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత ఫారుక్ అబ్దుల్లా వెల్లడించారు. ‘సీట్ల భాగస్వామ్యానికి సంబంధించినంతవరకు, నేషనల్ కాన్ఫరెన్స్ తన సొంత బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తుందని నేను స్పష్టం చేస్తున్నా. దీని గురించి రెండు అభిప్రాయాలు లేవు. ఇకపై దీనిపై ఎలాంటి ప్రశ్నలు లేవు’ అని పేర్కొన్నారు. కాగా మూడుసార్లు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫారుక్ అబ్దుల్లా ఇండియా కూటమిలో బలమైన పార్టీగా ఉంది. ప్రతిపక్ష కూటమి అన్ని సమావేశాలకు ఆయన హాజరయ్యారు. అయితే తన అనూహత్య నిర్ణయం వెనక కారణాలు మాత్రం అబ్దుల్లా వెల్లడించలేదు. చదవండి: బీజేపీ కొత్త వ్యూహం.. వారికి రాజ్యసభకు అవకాశం లేదు! సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ తప్పుకుంటున్నాయి. ఈ కూటమి ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించిన జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. మహాకూటమి ప్రభుత్వం నుంచి తప్పుకున్న ఆయన, ఎన్డీయే మద్దతుతో తొమ్మిదోసారి బిహార్ సీఎంగా ప్రమాణం చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీ, పంజాబ్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అలాగే టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రంలో కాంగ్రెస్తో పొత్తు ఉండబోదని ఇప్పటికే స్పష్టం చేశారు. గత నెలలో అబ్దుల్లా ఇండియా కూటమి సీట్ల షేరింగ్ ఏర్పాట్లపై ఏకాభిప్రాయం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఒప్పందానికి రావాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. దేశాన్ని రక్షించాలంటే, ముందుగా విభేదాలను మరచిపోయి దేశం గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇటీవలే కేంద్ర దర్యాప్తు సంస్థం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అబ్దుల్లాకు సమన్లు జారీ చేసింది. అయితే వీటిని ఆయన దాటవేసారు. -
Money Laundering Case: ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు
ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. జనవరి 11న విచారణకు హాజరు కావాలని ఈడీ కోరింది. శ్రీనగర్లోని ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA)లో జరిగిన అవకతవకలపై ఫరూక్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఫరూక్ అబ్దుల్లాపై ఈడీ 2022లో అధికారికంగా అభియోగాలు మోపింది. సంబంధం లేని పార్టీలు, JKCA ఆఫీస్ బేరర్లతో సహా వివిధ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు నిధులను బదిలీ చేయడం, అలాగే JKCA బ్యాంక్ ఖాతాల నుండి నగదు ఉపసంహరణలు చేయడం వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. అబ్దుల్లాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాఖలు చేసిన 2018 ఛార్జిషీట్లో దాఖలు చేసింది. అనంతరం ఈడీ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తర్వాత ప్రస్తుతం ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు దాఖలు చేసింది. గత ఏడాది ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్ బ్యాంకు మోసం కేసులో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నించింది. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక -
బలప్రయోగానికీ వెనుకాడం
బీజింగ్: తైవాన్ను చైనాలో ఐక్యం చేసుకొనే విషయంలో బలప్రయోగానికి సైతం వెనుకాడబోమని డ్రాగన్ దేశాధిపతి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ప్రధాన కార్యదర్శి షీ జిన్పింగ్ తేల్చిచెప్పారు. తైవాన్ ముమ్మాటికీ తమదేశంలో ఒక అంతర్గత భాగమేనని ఉద్ఘాటించారు. చైనా జాతీయ సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాల కోసం సైన్యాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తామని ప్రకటించారు. రాజధాని బీజింగ్లోని ‘ఆర్నేట్ గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్’లో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 20వ జాతీయ సదస్సులో జిన్పింగ్ ప్రసంగించారు. తైవాన్ విషయంలో తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంచేశారు. తైవాన్లో వేర్పాటువాద ఉద్యమాలకు అడ్డుకట్ట వేయడానికి అన్ని రకాల చర్యలు చేపడతామని వెల్లడించారు. బలప్రయోగానికైనా వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. ‘పూర్తిస్థాయి పునరేకీకరణ’ తప్పనిసరి చైనా పునరేకీకరణను పూర్తి చేస్తామని షీ జిన్పింగ్ ప్రతినబూనారు. పునరేకీకరణ అంటే తైవాన్ను చైనా ప్రధాన భూభాగంలో(మెయిన్ ల్యాండ్) కలిపేయడమే. జిన్పింగ్ ప్రతిజ్ఞకు సదస్సులో చప్పట్లతో పెద్ద ఎత్తున ఆమోదం లభించింది. తైవాన్ అంశంలో కమ్యూనిస్ట్ పార్టీ దృఢసంకల్పంతో వ్యవహరించాలని జిన్పింగ్ సూచించారు. పునరేకీకరణ విషయంలో చిత్తశుద్ధిని ప్రదర్శించాలన్నారు. ‘‘తైవాన్ సమస్యను పరిష్కరించుకోవడం అనేది పూర్తిగా చైనాకు సంబంధించిన వ్యవహారం. ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందే చైనానే’’ అని వ్యాఖ్యానించారు. పునరేకీకరణ విషయంలో శాంతియుత మార్గంలోనే ముందకెళ్తామని తెలిపారు. అదేసమయంలో బలప్రయోగానికి పాల్పడబోమన్న హామీని తాము ఇవ్వలేమన్నారు. ‘పూర్తిస్థాయి పునరేకీకరణ’ అనేది వాస్తవరూపం దాల్చడం తప్పనిసరి అని ఉద్ఘాటించారు. తైవాన్ సోదరుల సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నామని చెప్పారు. వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూనే ఉన్నామన్నారు. చైనా–తైవాన్ మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహిస్తామని వివరించారు. ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను కోరుకుంటున్నామని జిన్పింగ్ తెలియజేశారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) 2027లో వందేళ్లను పూర్తిచేసుకోనుందని అన్నారు. సైన్యాన్ని ఆధునీకరించాలన్న లక్ష్యాన్ని మరో ఐదేళ్లలో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆధునిక సోషలిస్ట్ దేశ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆహారం, ఇంధనం, పరిశ్రమలు, సప్లై చైన్స్, విదేశాల్లోని చైనీయుల హక్కుల విషయంలో మరింత సామర్థ్యంతో పని చేయాల్సి ఉందన్నారు. బ్రిక్స్, షాంఘై సహకార సంఘం(ఎస్సీఓ) వంటి వాటిలో చురుకైన పాత్ర పోషిస్తామని జిన్పింగ్ వివరించారు. హాంకాంగ్పై స్పష్టమైన ఆధిపత్యం సాధించామని చెప్పారు. అగ్రనేతలకు స్థానచలనం! కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సదస్సు దాదాపు వారం రోజులపాటు జరుగనుంది. చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ను వరుసగా మూడోసారి ఎన్నుకోనున్నారు. జిన్పింగ్ మినహా పార్టీలో అగ్రనేతలందరికీ ఈసారి స్థానచలనం తప్పదని తెలుస్తోంది. నంబర్–2గా పేరుగాంచిన లీ కెఖియాంగ్ను సైతం మార్చనున్నారు. ఆయన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. తొలిరోజు సదస్సులో 2,300 మందికిపైగా ‘ఎన్నికైన ప్రతినిధుల’తోపాటు కమ్యూనిస్ట్ పార్టీ మాజీ అగ్రనేతలు హూ జింటావో, సాంగ్పింగ్ తదితరులు పాల్గొన్నారు. 2002 దాకా అధ్యక్షుడిగా పనిచేసిన 96 ఏళ్ల జియాంగ్ జెమిన్ హాజరు కాలేదు. జిన్పింగ్ దాదాపు 45 నిమిషాలపాటు మాట్లాడారు. కీలక అంశాలను ప్రస్తావించారు. ఆయన ప్రసంగం పట్ల ఆహూతులంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. -
బీజేపీనే నెం.1.. థాక్రే ఖేల్ ఖతం: ఫడణవీస్
ముంబై: మహారాష్ట్రలో రెండు రోజుల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం తమదంటే తమదే అని అధికార బీజేపీ-శివసేన, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ప్రకటించుకున్నాయి. మొత్తం 16 జిల్లాల్లోని 557 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. తాము 259 చోట్ల గెలిచామని బీజేపీ చెబుతోంది. అలాగే తమ మిత్రపక్షం, సీఎం ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన బలపర్చిన 40 అభ్యర్థులు గెలిచినట్లు పేర్కొంది. ఈ ఫలితాలపై స్పందిస్తూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీనే నెంబర్-1 పార్టీ అన్నారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పని అయిపోయిందన్నారు. బాలాసాబెహ్ థాక్రే ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న షిండే వర్గమే అసలైన శివసేన అని స్పష్టం చేశారు. ఈ సమయంలో షిండే పక్కనే ఉన్నారు. అయితే మహావికాస్ అఘాడీ మాత్రం బీజేపీ ప్రకటనను తోసిపుచ్చింది. 494 గ్రామ పంచాయతీల ఎన్నికల ఫలితాలు మాత్రమే వచ్చాయని, అందులో తామే ఎక్కువ చోట్ల గెలిచినట్లు లెక్కలు చెప్పింది. వీటి ప్రకారం బీజేపీ 144 స్థానాల్లో, ఎన్సీపీ 126, కాంగ్రెస్ 62, షిండే-శివసేన 41, థాక్రే-శివసేన 37 సీట్లు గెలుపొందింది. దీంతో మొత్తంగా తాము 494కి 225 స్థానాలు గెలిచినట్లు ఎంవీఏ వివరించింది. అయితే గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగవు కాబట్టి వీటిని రాజకీయ పార్టీలు తమ విజయంగా చెప్పుకోవడం సరికాదని ఎన్పీపీ నేత అజిత్ పవార్ అన్నారు. ఒకవేళ గెలిచిన అభ్యర్థులు తాము ఈ పార్టీకే మద్దతిస్తామని చెబితే అప్పుడు లెక్కలోకి తీసుకోవచ్చన్నారు. 300 స్థానాల్లో గెలిచామని బీజేపీ-షిండే వర్గం చెబుతోందని ప్రశ్నించగా.. అలా అయితే నేను 400 స్థానాల్లో గెలిచామని చెబుతా అని బదులిచ్చారు. ఇవి పార్టీల గుర్తుపై జరిగే ఎన్నికలు కావు కాబట్టి లెక్కలు ఎంతైనా చెప్పుకోవచ్చని బీజేపీపై సెటైర్లు వేశారు. చదవండి: పంజాబ్ సీఎం నిజంగానే ఫుల్లుగా తాగారా? పౌర విమానయాన శాఖ దర్యాప్తు! -
చిన్న పార్టీలకు అధికారం దక్కకుండా చేయడమే బీజేపీ ఎజెండా
థానే/ముంబై: బీజేపీయేతర రాజకీయ పార్టీలను జాతీయ స్థాయిలో ఏకం చేసి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్(81) చెప్పారు. అయితే, వయోభారం దృష్ట్యా ఈ విషయంలో ఎలాంటి బాధ్యతను తీసుకునే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. థానేలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు బీజేపీయేతర పారీ్టలను ఏకం చేసే విషయంలో తన సహకారం మాత్రం ఉంటుందన్నారు. 2014 సాధారణ ఎన్నికలు మొదలుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందన్నారు. ‘ప్రతి గృహానికి కరెంటు, నీరు, మరుగుదొడ్లు వంటివి కల్పించడం, గ్రామాలను ఇంటర్నెట్తో అనుసంధానించడం వంటి ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు మాత్రం, 2024 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్తానంటూ కొత్తగా వాగ్దానం చేస్తోంది’అంటూ విమర్శించారు. చిన్న పార్టీలకు అధికారం దక్కకుండా చేయడమే బీజేపీ ఎజెండాగా మారిందన్నారు. ప్రతిపక్ష పార్టీలను భయపెట్టేందుకు సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ వంటి వాటిని వాడుకుంటోందని చెప్పారు. ‘మహారాష్ట్ర ఎన్సీపీ నేత అనిల్ దేశ్ముఖ్పై సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలు 110 దాడులు చేశాయంటే మీరు నమ్మగలరా? ఈ కేసులో రూ.100 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత రూ.4.07 కోట్లు, ఇప్పుడు రూ.1.71 కోట్లు మాత్రమేనని అంటున్నారు. నిజాలన్నీ కోర్టులోనే తేలుతాయి’అని పవార్ అన్నారు. ‘రాజకీయ ప్రత్యర్థులపై బీజేపీ చేస్తున్న దాడి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపైనే తప్ప మరొకటి కాదు. ఇది ఆందోళన కలిగించే అంశం. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను చీల్చి అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందుకు మహారాష్ట్ర తాజా ఉదాహరణ’అని అన్నారు. తమ తమ పార్టీల తరఫున గట్టిగా మాట్లాడినందుకే ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్, శివసేన నేత సంజయ్ రౌత్లను మోదీ ప్రభుత్వం జైలుపాలు చేసిందన్నారు. బిలి్కస్బానో కేసులో జీవిత ఖైదు పడిన 11 మందిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని సిగ్గుచేటుగా ఆయన అభివర్ణించారు. చదవండి: ఏం రాహుల్.. ఏం మాట్లాడుతున్నావ్.! -
స్థానికేతరులకు ఓటు హక్కు ఇస్తే ఖబడ్దార్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఓటర్ల జాబితాలో స్థానికేతరుల పేర్లను చేరుస్తూ నిర్ణయం తీసుకుంటే సహించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా హెచ్చరించారు. కోర్టుకు వెళ్లయినా సరే కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. స్థానికేతరులకు ఓటు హక్కును ఎలా అడ్డుకోవాలన్న అంశంపై చర్చించేందుకు ఆయన సోమవారం అఖిలపక్ష నాయకులతో సమావేశయ్యారు. ఈ భేటీకి 9 పార్టీల నేతలు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేకతను, గుర్తింపును దెబ్బతీసే చర్యలకు పాల్పడొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఇక్కడ బయటి వ్యక్తులు ఓటు హక్కు ఇవ్వడం తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీని స్థానికేతరుల చేతుల్లో పెట్టొద్దని డిమాండ్ చేశారు. -
ఒమర్ అబ్దుల్లా కుటుంబం గృహనిర్బంధం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ పోలీసులు తనని, తన కుటుంబ సభ్యుల్ని, తన తండ్రి ఎంపీ అయిన ఫరూక్ అబ్దుల్లాని గృహ నిర్బంధంలో ఉంచార ని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. శ్రీనగర్లోని గుప్కార్ ప్రాంతం లో తన ఇంటి బయట ఉన్న పోలీసు వాహనా లకు సంబంధించిన ఫోటోల ను కూడా ఆయన షేర్ చేశారు. ‘‘ఆగస్టు, 2019 తర్వాత కనిపిస్తున్న కొత్త కశ్మీర్ ఇది. ఎలాంటి కారణం లేకుండా మమ్మల్ని మా ఇంట్లో ఉంచి తాళాలు వేశారు. పార్లమెంటు సభ్యుడైన నా తండ్రిని కూడా నిర్బంధించడం దారుణం. నా సోదరి, పిల్లల్ని కూడా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు’’ అని ఒమర్ అబ్దుల్లా ఆ ట్వీట్లో వెల్లడించారు. తమ ఇంట్లో పని చేసే సిబ్బం దినెవరినీ కూడా లోపలికి రానివ్వడం లేదని తెలిపారు. ‘‘ఎలాంటి కారణాలు లేకుండానే ఇంట్లో బంధించి ఉంచారు. ఇంటిలో పనులు చేసుకునే వారిని లోపలికి రానివ్వడం లేదు. మీ కొత్త ప్రజాస్వామ్యం అంటే ఇదేనా’’ అని ఒమర్ ప్రశ్నించారు. అయితే పోలీసులు మాత్రం పుల్వామా దాడి జరిగి రెండేళ్లయిన సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా, కొందరు వీఐపీలు, భద్రత కల్పించాల్సిన వారిని గృహనిర్బంధంలో ఉంచినట్టుగా తెలిపారు. వాళ్లు బయటకొచ్చి తిరిగితే ఎలాంటి వ్యతిరేకత వస్తుందోనని అలా చేసినట్టుగా శ్రీనగర్ పోలీసులు అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. -
తన వ్యాఖ్యలతో నవ్వుల్లో ముంచిన మాజీ సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో తాను గడిపిన జీవితాన్ని వివరిస్తూ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా నవ్వులు పూయించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో తన భార్యకు ముద్దు కూడా పెట్టలేకపోయానని చెప్పారు. ఇటీవల జరిగిన ఓ సభలో ఆయన తన లాక్డౌన్ జీవితాన్ని వివరించారు. లాక్డౌన్ సమయంలో ప్రజలతో పాటు తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఇతరులతో చేతులు కలపడానికి.. ఆలింగనం చేసుకోవడానికి భయపడ్డామని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. నిజాయతీగా చెబుతున్నాననంటూ ఆ భయంతోనే తన భార్యకు ముద్దు కూడా పెట్టలేదని చెప్పి అందరినీ నవ్వుల్లో ముంచారు. ఏమో ఏమైనా జరగొచ్చనే భయంతో మనసెంత కోరుకున్నా సరే తాను నియంత్రణలో ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా అంతమవ్వాలని ఆకాంక్షిస్తూనే కోవిడ్ టీకా రావడంపై మాజీ సీఎం హర్షం వ్యక్తం చేశారు. -
రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా మైక్పెన్స్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీదారుగా రిపబ్లికన్ పార్టీ తరఫున మైక్ పెన్స్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ సదస్సునుద్దేశించి పెన్స్ మాట్లాడుతూ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జియో బైడెన్ చైనా తొత్తు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కమ్యూనిస్ట్ చైనాకి చీర్ లీడర్ అయిన ఆయన లెఫ్ట్ పార్టీతో రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగిస్తారని ఆరోపించారు. శ్వేత సౌధంలో మరో నాలుగేళ్ల పాటు ట్రంప్ కొనసాగుతారని, అమెరికా ప్రజలు మళ్లీ రిపబ్లికన్లకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ‘‘బైడెన్ అధికారంలోకి వస్తే చైనా కంపెనీలపై విధించిన సుంకాలన్నీ రద్దు చేయాలని చూస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో చైనా నుంచి ప్రయాణాలు రద్దు చేసిన ట్రంప్ సర్కార్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదేం పద్ధతి’’అంటూ పెన్స్ విరుచుకుపడ్డారు. బైడన్ నాయకత్వంలో అమెరికన్లు సురక్షితం కాదన్నారు. ఈ సదస్సుకు అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ ఆకస్మికంగా హాజరై పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్య పరిచారు. మరోవైపు భారత సంతతికి చెందిన డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ తన తల్లి శ్యామల గోపాలన్ 19 ఏళ్ల వయసులోనే భారత్ నుంచి అమెరికాకు వచ్చారని చిన్నతనం నుంచి సమానత్వ సాధన గురించి తనకు పాఠాలు బోధించారని చెప్పారు. మహిళా సమానత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని కమలా హ్యారిస్ చిన్న వీడియో రూపంలో తన సందేశాన్ని ఇచ్చారు. తన తాతతో కలిసి చెన్నై వీధుల్లో ఉదయం వేళల్లో నడుచుకుంటూ తన తల్లి మహిళా సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ, మానవ హక్కుల గురించి తెలుసుకున్నారని, ఆమే తనకు స్ఫూర్తి అని చెప్పారు. -
కేంద్ర నిర్ణయం : ఏకమైన విపక్షాలు
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఒకటవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్, వామపక్షలు, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్లు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఎన్నో ఏళ్లుగా కశ్మీర్కు కొనసాగుతున్న స్వయం ప్రతిపత్తి హోదాను కొనసాగించాలని, అలాగే కశ్మీర్ విభజనను రద్దు చేయాలని ఆయా పార్టీల అధినేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ను బీజేపీ సర్కార్ ముక్కలుగా చేసిందని, ఇది స్థానిక ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది ఆగస్ట్ 5న కేంద్ర ప్రభుత్వం తీసుకునన ఏకపక్ష నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు అన్ని పార్టీల నేతలు కలిసి కట్టుగా పోరాటం చేయాలని శ్రీనగర్లో శనివారం నిర్వహించిన ఓ సమావేశంలో తీర్మానించారు. అంతేకాకుండా పబ్లిక్ సేఫ్టీ చట్టం కింద అరెస్ట్ కాబడిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ నేతలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా లాంటి నేతలు విడుదలైనా కశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ ఇప్పటికీ నిర్బంధంలోనే ఉన్నారు. -
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఒమర్ అబ్దుల్లా
-
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఒమర్ అబ్దుల్లా
సాక్షి, ఢిల్లీ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఢిల్లీలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవకాశవాది అని విమర్శించారు. చంద్రబాబు కోసం తన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా తన సొంత ఎన్నికలు వదులుకొని ఏపీకీ ప్రచారానికి వెళ్లారని గుర్తుచేశారు. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి క్లీన్స్వీప్ చేస్తారని తెలిసినా తన తండ్రి బాబు తరపున ప్రచారం చేయడానికి వెళ్లారన్నారు. బాబు ఓడిపోతున్నారన్న విషయం ఆయనకు తప్ప అందరికి తెలుసన్నారు. కానీ తాము హౌజ్ అరెస్ట్లో ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు కనీసం ఒక్క మాట మాట్లాడకపోగా కనీస మద్దతుగా ఒక ప్రకటన కూడా చేయలలేకపోయారన్నారు. అందుకే చంద్రబాబు నమ్మదగిన నేత కాదంటూ అబ్దుల్లా మండిపడ్డారు.(‘వేల ఏళ్లుగా ఉన్న రామ మందిరాన్ని ఎవరు ధ్వంసం చేశారు’) ఒమర్ అబ్దుల్లా మార్చి నెలలో నిర్బంధం నుంచి విడుదలయ్యారు. పబ్లిక్ సేఫ్టీచట్టం కింద ఆయనను 8నెలల కింద గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. 370 అధికరణ కింద జమ్మూ, కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసిన అనంతరం గతేడాది ఆగస్టు 5 నుంచి ఆయన ఆ రాష్ట్ర గెస్ట్ హౌస్ హరినివాస్లో ఉన్నారు. ఆయన తండ్రి, మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా కూడా 221 రోజుల నిర్బంధం నుంచి ఈ ఏడాది మార్చి 13న విడుదలయ్యారు. -
బీజేపీలో చేరిన అత్యంత సంపన్న ఎంపీ
సాక్షి, ముంబై: లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయపాలైన విపక్షాలకు ఫలితాల అనంతరం కూడా వరుస షాకులు తగులుతున్నాయి. అనేక మంది కీలక నేతలు బీజేపీకి గూటికి చేరుతున్నారు. తాజాగా కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు విపక్షా పార్టీలకు మరో షాక్ తగిలింది. ఎస్సీపీ ఎంపీ, ఛత్రపతి శివాజీ 13వ వారసుడు సతారా సిట్టింగ్ ఎంపీ ఉదయన్రాజ్ భోంస్లే బీజేపీలో చేరారు. ఇటీవల ఎస్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన భోంస్లే.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో శనివారం కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ, అమిత్ షా నాయకత్వంలో దేశ అభివృద్ధి పథకంలో దూసుకుపోతోందని అన్నారు. ఫడ్నవిస్తో కలిసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామినైతానని తెలిపారు. కాగా ఆయన రాజీనామాతో ఎస్సీపీ, కాంగ్రెస్ శ్రేణులు విస్మయానికి గురయ్యారు. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు సీనియర్ నేతలు ఇలా పార్టీని వీడటం నేతలను కలవరానికి గురిచేస్తోంది. కాగా రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరి కంటే సంపన్నుడిగా ఎంపీ ఉదయన్రాజే భోంస్లే నిలిచిన విషయం తెలిసిందే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున సతారా నుంచి మళ్లీ పోటీ చేస్తున్న ఆయన.. తనకు రూ.199 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. రూ.185.5 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.13.38కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల పేరిట రూ.89 లక్షల డిపాజిట్, రూ.1.45 కోట్ల మేర షేర్లు ఉన్నాయి. -
సత్వర ఆచరణే కీలకం
జమ్మూ–కశ్మీర్కి ఉన్న ప్రత్యేక హక్కులు, అధికారాలను రద్దు చేయాలని, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని నిర్ణయించిన మూడురోజుల తర్వాత ఆ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దాదాపు 40 నిమిషాలు సాగిన ఆ ప్రసంగంలో సాధ్యమైనంత త్వరగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తి, స్థానిక యువతకు విద్య, ఉద్యోగావకాశాలు వగైరాలు ప్రస్తావనకొచ్చాయి. ప్రభుత్వాలు ప్రకటించే ఏ విధాన నిర్ణయంపైన అయినా అనుకూల, ప్రతికూతలు వ్యక్తం కావడం సర్వసాధా రణం. ప్రస్తుత నిర్ణయం కశ్మీర్కి సంబంధించింది కనుక వాటి తీవ్రత అధికంగానే ఉంది. అయితే జమ్మూ–కశ్మీర్లో వర్తమాన స్థితిగతులెలా ఉన్నాయో, కేంద్రం తీసుకున్న చర్యలపై అక్కడి పౌరుల మనోభావాలెలా ఉన్నాయో, వారి స్పందనేమిటో తెలియడానికి మరికొంతకాలం పడుతుంది. పరి స్థితులన్నీ కుదుటపడి, ఇప్పుడు విధించిన ఆంక్షలన్నీ రద్దయ్యాక మాత్రమే అవి తెలిసే అవకాశం ఉంది. జనం కదలికలపై ఆంక్షలు విధించాక గత అయిదురోజులుగా సాధారణ ప్రజానీకం అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చానెళ్లలో వస్తున్న కథనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆంక్షల్ని క్రమేపీ సడలిస్తామని ఈ ప్రసంగంలో మోదీ హామీ ఇచ్చారు గనుక పరిస్థితులు త్వరలోనే కుదుటపడతాయని ఆశించాలి. వచ్చే సోమవారం బక్రీద్ పర్వదినం. ఈలోగానే అంతా చక్కబడితే సాధారణ ప్రజానీకం ఉత్సాహంగా పండుగ చేసుకోగలుగుతారు. దేశ విభజన నాటినుంచీ కశ్మీర్పై కన్నేసిన పాకిస్తాన్ అక్కడ ఏదో విధంగా చిచ్చు రేపాలని ప్రయత్నిస్తూనే ఉంది. 35 ఏళ్లక్రితం కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరించిన అపసవ్య విధానాలు ఉగ్రవాదం వేళ్లూనుకోవడానికి తోడ్పడ్డాయి. ఇదే అదునుగా పాకిస్తాన్ తన కోరలు చాచడం మొదలుపెట్టింది. తదనంతరకాలంలో వచ్చిన ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కూడా ఫలించకపోగా పరిస్థితులు మరింత వికటించడానికి కారణమయ్యాయి. భద్రతాబలగాలపై దాడులు, నిరవధిక ఉద్యమాలు, ఆందోళనలు యధావిధిగా సాగుతూనే వచ్చాయి. అంతర్గతంగా కశ్మీర్లో అధికారం చలాయించడానికి సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉన్నా అంతర్జాతీయంగా కశ్మీర్ సమస్యలో మూడో పక్షం జోక్యాన్ని అవి గట్టిగా వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రద్దు చేసిన రాజ్యాంగ అధికరణలు 370, 35ఏ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగకపోగా అవి ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని విస్తరింపజేసేందుకు పాకిస్తాన్కు తోడ్పడ్డాయ న్నది మోదీ అభియోగం. కనుక కేంద్రం ఈ సమస్య మూలాల్ని కొత్త కోణం నుంచి చూస్తున్నదని అర్ధమవుతుంది. ఈ రెండు అధికరణల తొలగింపుతో పరిస్థితులు చక్కబడి, అభివృద్ధికి బాటలు పడతాయని ఆయన ఆశిస్తున్నారు. అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, రోడ్డు రవాణా తదితర మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యమిస్తామని ఆయన ఇచ్చిన హామీ అయినా... ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటు చేస్తామని, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చేసిన వాగ్దానమైనా ఆచరణలోకొస్తే యువతకు ఎంతో మేలు కలుగుతుంది. ఇటీవలికాలంలో సివిల్ సర్వీసులకు జమ్మూ–కశ్మీర్ నుంచి ఎంపికవుతున్న యువత సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే అక్కడివారికి దేశంలోని ఇతర ప్రాంతాల్లో చదువుకునేందుకు ఇప్పుడు కల్పిస్తున్న అవకా శాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఉపాధి కల్పించడంలోనూ ఆ దృక్పథమే ఉండాలి. అలాంటి చర్యలు ఈ దేశంలో తామూ భాగమేనన్న విశ్వాసాన్ని వారికి కలిగిస్తాయి. కశ్మీర్ లోయలో ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అందరికీ ఆందోళన కలిగి స్తూనే ఉన్నాయి. ప్రధాన స్రవంతి పార్టీల నేతలంతా ఈపాటికే ఈ సంగతి గ్రహించారు. మధ్యేవాద హుర్రియత్ కాన్ఫరెన్స్ వంటి సంస్థలకే దిక్కుతోచని స్థితి ఏర్పడితే నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీడీపీ వంటి పార్టీల గురించి చెప్పనవసరం లేదు. ఎన్సీ, పీడీపీలది స్వయంకృతం. అవి రెండూ గతంలో కేంద్రంతో తాము పోరాడుతున్నామని, రాష్ట్రానికి అవసరమైనవి సాధిస్తున్నామని చెప్పేం దుకు ప్రయత్నించేవి. కానీ ఇటీవలి కాలంలో ఆ పార్టీలు కేంద్రంలో ఎవరుంటే వారితో పొత్తు కుదుర్చుకోవడానికి, రాజీ పడేందుకు సిద్ధపడ్డాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా హోరాహోరీ సంఘర్షించిన పీడీపీ, బీజేపీలు ఎన్నికలయ్యాక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పర్చటం వీటన్నిటికీ పరాకాష్ట. ఇదే సమయంలో ఐఎస్ వంటి ఉగ్ర సంస్థల జాడలు నేరుగా కనబడకపోయినా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభావితులైనవారు అనేకులు ఈమధ్యకాలంలో సాయుధ బాట పట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని భావించింది. ఒక రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీయడమన్నది స్వాతంత్య్రం వచ్చాక మొట్టమొదటిసారి జమ్మూ–కశ్మీర్ విషయంలోనే జరిగింది. సాధారణంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటపుడు ప్రభుత్వాలు ఆ దిశగా ప్రజాభిప్రాయాన్ని మలిచేందుకు అవసరమైన రాజకీయ ప్రచారాన్ని ముమ్మరం చేస్తాయి. కానీ జమ్మూ–కశ్మీర్ రక్షణపరంగా సున్నితమైన ప్రాంతం. దాని సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా ఉన్నాయి. కనుకనే ఆ తరహా చర్య సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందన్న సందేహం కేంద్రా నికి కలిగి ఉండొచ్చు. అయితే తీసుకునే చర్య ఎలాంటిదైనా స్థానికులను విశ్వాసంలోకి తీసుకోవాలి. అప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది. మెరుగైన ఫలితాలు వస్తాయి. ఏదేమైనా జనానికి మేలు కలిగించే భిన్న చట్టాల అమలు, భారీ యెత్తున ఉద్యోగాల భర్తీ, మౌలికసదుపాయాల కల్పన, ఉన్నత శ్రేణి విద్యాసంస్థలు, క్రీడల కోసం శిక్షణ కేంద్రాలు వంటివి ఏర్పాటు చేస్తామన్న మోదీ వాగ్దానాలు సాధ్యమైనంత త్వరగా ఆచరణరూపం దాలిస్తే నిజంగానే నయా కశ్మీర్కు ఆ చర్యలు దోహదపడతాయి. -
సీపీఐ కొత్త సారథి డి.రాజా
సాక్షి, హైదరాబాద్: సీపీఐ జాతీయ స్థాయి నాయకత్వంలో మార్పు చోటు చేసుకుంది. సురవరం సుధాకర్రెడ్డి స్థానంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం సీపీఐ జాతీయ సమితి ఆమోద ముద్ర వేసింది. ఢిల్లీలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ, జాతీయ సమావేశాలు ఆదివారంతో ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సీపీఐ ప్రధానకార్యదర్శిగా పార్టీ అత్యున్నత బాధ్యతలను సురవరం సుధాకర్రెడ్డి నుంచి డి.రాజా స్వీకరిస్తారు. పార్టీ అత్యున్నత పదవి కోసం డి.రాజాతో పాటు సీనియర్ నేతలు అతుల్ కుమార్ అంజాన్, అమర్జిత్ కౌర్ పేర్లను నాయకత్వం పరిశీలించింది. తమిళనాడు నుంచి ఎంపీగా కొనసాగుతున్న రాజా రాజ్యసభ సభ్యత్వం త్వరలోనే ముగియనుంది. దళిత వర్గ నేతగా, రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా ఉండడంతో జాతీయస్థాయిలో రాజకీయ పార్టీల అగ్రనేతలతో ఆయనకు పరిచయాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొత్త రక్తం నింపడంతో పాటు వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు చేరువ కావాలనే వ్యూహంలో భాగంగానే రాజా వైపు జాతీయ సమితి మొగ్గు చూపినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే గెలుపొందడంతో పాటు దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం, క్రియాశీలంగా మార్చడం వంటివి రాజాకు సవాళ్లేనని పరిశీలకులు అంటున్నారు. సురవరం ఎందుకు వైదొలిగారంటే.. ఆరోగ్యం సహకరించని కారణంగా ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తనను తప్పించాలని మేలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో సురవరం సుధాకర్ రెడ్డి(77) కోరినట్టు పార్టీ వర్గాల సమాచారం. 2019 లోక్సభ ఎన్నికల వరకే పదవిలో ఉంటానని పార్టీకి ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఆ పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించి, నిర్ణయం తీసుకున్నారు. జాతీయ ›ప్రధాన కార్యదర్శిగా 2012లో బాధ్యతలను చేపట్టిన సురవరం, వరసగా మూడు పర్యాయాలు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుత పదవీకాలం 2021 వరకు ఉంది. -
‘నరేంద్ర మోదీని జైల్లో పెడతాను’
కశ్మీర్ : సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు జావేద్ అహ్మద్ రానా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హంతకుడని, తనకు అధికారం ఉంటే ఆయన చేత ఊచలు లెక్కబెట్టించేవాడిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూంచ్లో ఓ కార్యక్రమానికి హాజరైన జావేద్ ప్రసంగిస్తూ.. మోదీ దేశ వ్యాప్తంగా విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. ముఖ్యంగా ఓ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ప్రజలను ఉసి గొల్పుతున్నారు. గతంలో హిందూ, ముస్లింల మధ్య సోదర భావం ఉండేది. కానీ మోదీ దాన్ని నాశనం చేశాడు. దీని వెనక ఉన్న మరో నేరస్తురాలు మీడియా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. #WATCH National Conference leader, Javed Ahmed Rana, in Poonch: Khuda ki kasam, agar mera bas chale, to mai is desh ke pradhanmantri ke khilaf, jitne bhi qatl hue hain Jammu-Kashmir mein aur desh mein, mai isko qatl ke case mein andar thok dunga. (27.03.19) pic.twitter.com/o5wD5YDCzO — ANI (@ANI) March 28, 2019 అంతేకాక ‘ఈ రోజు జమ్మూకశ్మీర్లోనే కాక దేశ వ్యాప్తంగా జరుగుతున్న మారణహోమానికి మోదీనే కారణం. నా చేతిలో గనక అధికారం ఉంటే ఈపాటికే మోదీని జైల్లో పెట్టించేవాడనం’టూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జావేద్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో మోదీని ఉద్దేశిస్తూ.. ‘మానవత్వ హంతకుడు’ అంటూ కామెంట్ చేశారు. మరోసారి ప్రభుత్వ సంస్థలు మోదీ, ఆర్ఎస్ఎస్ ఇచ్చే డబ్బులకు ఆశపడి.. రాళ్లు రువ్వేవారిని తయారు చేస్తున్నాయంటూ వ్యాఖ్యనించారు. -
‘లోక్సభ’ కోసం ‘బాలాకోట్’లో దాడులు..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రధాని మోదీ హవా తగ్గడంతో.. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో బాలాకోట్లో వైమానిక దాడులను కేంద్రం నిర్వహించిందని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో మోదీ హవా బాగా నడిచిందని, ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో పాక్ను దెబ్బకు దెబ్బ తీయగలమని ప్రజలను నమ్మించడానికి బాలాకోట్ దాడులకు ఆర్మీని కేంద్రం ఆదేశించిందని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. ‘పాకిస్థాన్ను దెబ్బతీశామని అంటున్నారు. కానీ బాలాకోట్ దాడి తర్వాత పాక్ ప్రతిదాడితో మనం కూడా సొంత యుద్ధ విమానాన్ని కోల్పోయాం. ఆ వైమానిక దాడుల్లో 300 మందిని చంపామంటున్నారు. అంతమందిని చంపడం తప్పుకాదా? ఇది అంతర్జాతీయ సమాజానికి దుఃఖ సంఘటనే కదా! దీన్ని ప్రశ్నించిన వాళ్లను జాతి ద్రోహులుగా, పాకిస్థానీయులుగా చిత్రీకరిస్తున్నార’ని ఆయన మండిపడ్డారు. హనుమంతుడినని నమ్మించే ప్రయత్నం ‘అయోధ్య రామమందిర వివాద ప్రస్తావన ఇప్పుడెవరూ తీసుకురారు. బాలాకోట్ దాడులకు ముందు అందరూ (బీజేపీ) రామమందిరం గురించే మాట్లాడేవారు. కానీ ఇప్పుడా విషయాన్ని మరుగునపడేశారు. తాను హనుమంతుడినని, పాక్ను ఢీకొనే సత్తా తనకు మాత్రమే ఉందని ప్రజలను నమ్మించే ప్రయత్నాల్లో వాళ్లు (బీజేపీ) బిజీగా ఉన్నార’ని ఫరూక్ అబ్దుల్లా చురకలంటించారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన జమ్మూకశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్.. ఫరూక్ అబ్దుల్లా ఎంపీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల కమిషన్కు అభ్యంతరాలు తెలపడానికి సిద్ధమయ్యారు. జమ్మూకశ్మీర్లోని 6 లోక్సభ సీట్లలో ఎన్నికలు 5 దశల్లో జరుగనున్నాయి. బారాముల్లా, జమ్మూ నియోజకవర్గాల్లో పోల్స్ను మొదటి విడతలో నిర్వహించనున్నారు. శ్రీనగర్, ఉద్ధంపూర్లో రెండో విడతలో, అనంత్నాగ్లో నాలుగు, ఐదు విడతల్లో.. లడఖ్లో 5వ దశలో ఎన్నికలు జరుగుతాయి. -
సివిల్స్ టాపర్ సంచలన నిర్ణయం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్కు చెందిన యువ ఐఏఎస్ అధికారి షా ఫజల్ బుధవారం తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2009లో జరిగిన సివిల్ సర్వీస్ పరీక్షలో ఆయన మొదటి ర్యాంకు సాధించారు. ఫస్ట్ ర్యాంకు సాధించిన మొదటి కశ్మీరీగా ఆయన చరిత్ర సృష్టించారు. ఐఏఎస్ అధికారి అయినప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ.. ప్రజల సమస్యలపై నిత్యం స్పందిం చే వారు. కశ్మీర్లో జరుగుతున్న నిరంతర హత్యలకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. హత్యలను అరికట్టేం దుకు కేంద్రం చర్యలు తీసుకో వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామాకు గల కారణాలను తన ఫేస్బుక్ పేజీలో రాశారు. కొన్ని హిందుత్వ శక్తుల చేతుల్లో 20 కోట్ల భారతీయ ముస్లింలు వివక్షకు గురవుతు న్నారని,వారిని పక్కకు పెడుతున్నారని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కశ్మీర్లో జరుగుతున్న అత్యాచారాలపై స్పందిస్తూ.. ఫజల్ ఆరు నెలల కింద ఓ ట్వీట్ చేశారు. వెంటనే ఆయనపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ తర్వాత శిక్షణ కోసం విదేశాలకు వెళ్లి ఇటీవలే వచ్చిన ఫజల్.. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పేరు ప్రస్తావించకుండా.. కేంద్రంపై పలు విమర్శలు చేశారు. ‘ఆర్బీఐ, సీబీఐ, ఎన్ఐఏ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన గొప్ప కట్టడాన్ని కూలదోయాలని చూస్తున్నారని, దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. ఫజల్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో చేరతారని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బారాముల్లా నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. -
భారత్, పాక్ మధ్య చర్చలే శరణ్యం
శ్రీనగర్ : కశ్మీర్లో శాంతిని నెలకొల్పాలంటే భారత్,పాకిస్తాన్ మధ్య శాంతి చర్చలే శరణ్యమని నేషనల్ కాన్ఫెరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ కేంద్ర వర్కింగ్ కమిటీ (సీడబ్య్లూసీ) సమావేశంలో బుధవారం ఈ మేరకు ఏకగ్రీవం తీర్మానం చేసింది. రెండు రోజుల పాటు శ్రీనగర్లో జరిగిన పార్టీ సమావేశాల్లో చివరి రోజు ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా భారత్, పాక్ మధ్య కొనసాగుతున్న వైరుద్యాలకు చర్చల ద్వారా చరమగీతం పాడాల్సిన అవసరముందని ఫరూక్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య చర్చలతో అటు సరిహద్దు సమస్యతో పాటు కశ్మీర్లో సాగుతున్న మారణకాండకూ ఓ పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. ‘‘సమైక్యత, సమగ్రత, ప్రత్యేకతకు కశ్మీర్ కట్టుబడి ఉంది. పాక్,భారత్ విదేశాంగ మంత్రుల మధ్య జరగాల్సిన చర్చలు విఫలం కావడంతో తాము ఎంతో నిరాశ చెందాము. పాక్తో చర్చలకు కశ్మీర్ ప్రజలకు ఎంతో కాలం నుంచి ఎదురుచుస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ మేరకు చొరవ తీసుకోవాలి’’ అని ఫరూక్ అన్నారు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370, 35A లపై కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయాన్ని తెలపాలని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 35ఎ కొనసాగింపుపై తమ నిర్ణయాన్ని తెలిపేంత వరకు ఏ ఎన్నికలకు వెళ్లబోమని ఎన్సీ తేల్చిచెప్పింది. సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలకు నిరసనగా ఐరాస వేదికగా జరగాల్సిన భారత్,పాక్ విదేశాంగ మంత్రుల సమావేశంను భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. -
ఆ ఎన్నికలను బహిష్కరించనున్న పార్టీ
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో జరగనున్న పంచాయతీ, స్థానిక ఎన్నికలను బహిష్కరించనున్నట్లు ‘‘నేషనల్ కాన్ఫరెన్స్’’ పార్టీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 35ఎ కొనసాగింపుపై తమ నిర్ణయాన్ని తెలిపేంత వరకు ఎన్నికలకు వెళ్లబోమని ఎన్సీ తేల్చిచెప్పింది. ఆర్టికల్ 35ఎ పై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇచ్చేవరకు ఎన్నికలకు వెళ్లేదిలేదని పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు. బుధవారం జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టికల్ 35ఎ పై అనవసర జోక్యం చేసుకోవటం వల్ల చోటుచేసుకునే పరిణామాలను పట్టించుకోకుండా పంచాయతీ, స్థానిక ఎన్నికలపై హుటాహుటిన నిర్ణయం తీసుకుందని అన్నారు. రాష్ట్రంలో నాలుగు దశలలో పంచాయతీ, స్థానిక ఎన్నికలు జరగనున్నట్లు జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆగస్టు 30న ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఎన్నికలకు తొందరేంటి?
శ్రీనగర్ : తాజా రాజకీయ పరిస్థితులపై జమ్ము కశ్మీర్ గవర్నర్ నిర్వహించిన అఖిలపక్ష భేటీ అసంపూర్తిగా, అస్పష్టంగా ముగిసింది. శుక్రవారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ఆధ్వర్యంలో అన్ని పక్షాల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే తక్షణమే అసెంబ్లీని రద్దు చేయాలని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు డిమాండ్ చేయగా, పీడీపీ మాత్రం ఎన్నికలకు తొందరేంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఒకానోక దశలో భేటీలో గందరగోళం చెలరేగగా, నేతలు అసంతృప్తితోనే బయటకు వచ్చినట్లు స్థానిక ఛానెళ్లు కథనాలను ప్రచురించాయి. కశ్మీర్ లోయలో పరిస్థితులను ఎలా సాధారణ స్థితికి తీసుకురావటం, రాజకీయ పరస్పర సహకారం ప్రధాన ఎజెండాలుగా భేటీలో గవర్నర్ వోహ్రా ప్రతిపాదన చేశారు. అయితే బలగాల మోహరింపు ద్వారానే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుందని ప్రధాని పార్టీలన్నీ గవర్నర్తో స్పష్టం చేశాయి. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీని రద్దు చేయటమే ఉత్తమమని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు గవర్నర్తో తేల్చి చెప్పాయి. ‘ఇప్పటికే అన్ని పార్టీలు తమకు మెజార్టీ లేదన్న విషయం చెప్పేశాయి. పైగా ఎలాంటి పొత్తులు ఉండబోవని తేల్చాయి. ఇలాంటి సమయంలో ఇంకా అసెంబ్లీని కొనసాగించటం సబబు కాదు. ఇది గందరగోళాన్ని, రాజకీయ అస్థిరతను సృష్టించే అవకాశం ఉంటుంది. రాజ్యాంగాన్ని అనుసరించి గవర్నర్ అసెంబ్లీని తక్షణమే రద్దు చేయాలి. వెంటనే ఎన్నికలు నిర్వహించాలి’ అని కాంగ్రెస్ జమ్ము చీఫ్ గులాం అహ్మద్ మీర్ కోరారు. మరోవైపు ఎన్సీ అధినేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే వాదనను వినిపించినట్లు సమాచారం. పీడీపీ, బీజేపీలు మాత్రం... అయితే పీడీపీ మాత్రం కాంగ్రెస్, ఎన్సీల డిమాండ్ను తోసిపుచ్చింది. పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అఖిలపక్ష భేటీకి హాజరుకాకపోవటంతో ఆమె తరపున ఆ పార్టీ కార్యదర్శి దిలావర్ మీర్ మీటింగ్కు హాజరయ్యారు. ‘ఇది సున్నితమైన అంశం. గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు చాలా సమయం ఉందనే అనుకుంటున్నాం. ఇలాంటి దశలో అసెంబ్లీని రద్దు చేయటం కన్నా కొనసాగించటమే మంచిది. ఆర్టికల్ 35-ఏ, ఆర్టికల్ 370 (ప్రత్యేక హోదా అంశం)లపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. మరోవైపు కథువా కేసు కూడా విచారణ దశలో ఉంది. ఇలాంటి స్థితిలో రాజకీయ గందరగోళం ఆయా అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పరిస్థితులు మెరుగుపడ్డప్పుడే ఎన్నికలు కూడా నిర్వహించటం మంచిదని ముఫ్తీ భావిస్తున్నారు’ అని సమావేశం అనంతరం మీర్ మీడియాకు వివరించారు. ఇక బీజేపీ మాత్రం ఈ వ్యవహారంపై మౌనంగా ఉంది. ‘అమర్నాథ్ యాత్రకు సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి తరుణంలో నేతలంతా క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయాలి. ప్రశాంత వాతావరణంలో యాత్ర కొనసాగేలా చూడాలి. పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. ముందు ఆ ఎన్నికలు జరిగేలా చొరవ చూపాలి’ అని బీజేపీ నేత, మాజీ మంత్రి సత్ శర్మ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి సమావేశం అనంతరం బయటకు వచ్చిన నేతలు అసంతృప్తిగానే మీడియాతో మాట్లాడి వెళ్లిపోవటం గమనార్హం. -
శరణార్థి సంక్షోభం!
కాన్ఫ్లిక్ట్ జోన్ జమ్మూ వర్సెస్ కశ్మీర్ జమ్మూ కశ్మీర్లోని బీజేపీ– పీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని మరో వివాదం చుట్టుముట్టింది. దేశ విభజన సమయంలో పశ్చిమ పాకిస్తాన్ నుంచి భారత్కు తరలివచ్చిన శరణార్థులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం తాజా వివాదానికి కారణం. ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమని, ఇది రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని నీరుగార్చడమేనని నేషనల్ కాన్ఫరెన్స్, వేర్పాటువాద నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు బీజేపీ, వీహెచ్పీ, శ్రీరామ్సేన, పాంథర్స్ పార్టీలు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. – సాక్షి, సెంట్రల్ డెస్క్ ఏమిటీ గుర్తింపు పత్రాలు? దేశ విభజన అనంతరం, పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన వారిని శరణార్థులుగా గుర్తిస్తూ వారి పేరు, తల్లిదండ్రుల పేర్లతో పాటు ఫొటో ముద్రించి ఉన్న గుర్తింపు ధ్రువపత్రాలను ప్రభుత్వం జారీ చేస్తోంది. నైబ్ తహసీల్దార్ వీటిని జారీ చేస్తారు. అవిభాజ్య భారత్లో నివసిస్తున్న సదరు వ్యక్తి, దేశ విభజన అనంతరం భారత్కు తరలివచ్చినట్లు, ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లోని పలానా ప్రాంతంలో అతడు నివసిస్తున్నట్లు ఈ నివాస గుర్తింపు ధ్రువపత్రం తెలియజేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో శరణార్థులకు ఇది ఉపయోగపడుతుంది. ఎంతమంది తరలివచ్చారు? తాజా గణాంకాలు అందుబాటులో లేవు. 1951 వివరాల ప్రకారం విభజన సమయంలో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్), పశ్చిమ పాకిస్తాన్ నుంచి 72,95,870 మంది భారత్కు తరలివచ్చారు. వారిలో సుమారు 47 లక్షల మంది పశ్చిమ పాకిస్తాన్ నుంచి తరలివచ్చిన హిందువులు, సిక్కులు. 5,764 కుటుంబాలు మినహా, మిగిలిన వారందరూ పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ముంబైలలో స్థిరపడ్డారు. జమ్మూకు తరలివచ్చిన ఆ 5,784 కుటుంబాలకు చెందిన వారిని మాత్రం జమ్మూ కశ్మీర్ స్థిర నివాసులుగా గుర్తించలేదు. గత ఏడు దశాబ్దాల్లో ఈ కుటుంబాలు 19,760 కుటుంబాలుగా విస్తరించాయి. వీటిలో 20 ముస్లిం కుటుంబాలు కూడా ఉన్నాయి. ఎవరు వ్యతిరేకిస్తున్నారు? నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో పాటు వేర్పాటువాద నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. లోయలో నిరసనలకు వేర్పాటువాద నేతలు పిలుపునిచ్చారు. ముస్లిం మెజారిటీ రాష్ట్రంలో.. జనాభాలో మార్పు తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని వారు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అయితే శరణార్థులు గత ఏడు దశాబ్దాలుగా కశ్మీర్లో నివసిస్తున్నారని, అలాంటప్పుడు జనసంఖ్యలో ఎలా మార్పు వస్తుందని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్న వారు ప్రశ్నిస్తున్నారు. ‘రోహింగ్యా ముస్లింలకు ప్రభుత్వం మద్దతు తెలిపితే సమస్య లేదు కానీ పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులకు మద్దతిస్తే సమస్య వస్తోందా?’ అని శరణార్థులు వేర్పాటువాద నేతలను ప్రశ్నిస్తున్నారు. రోహింగ్యాలతో సమస్య ఏమిటి? మయన్మార్లో సుమారు పది లక్షల జనాభా ఉన్న బలమైన ముస్లిం సామాజిక వర్గమే రోహింగ్యాలు. అయితే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చారనే కారణంగా అక్కడి ప్రభుత్వం వీరిలో చాలామందికి పౌరసత్వం కల్పించలేదు. విచారణ నుంచి తప్పించుకునేందుకు చాలా మంది భారత్, బంగ్లాదేశ్, థాయ్లాండ్, ఇండొనేసియా దేశాలకు పారిపోయారు. ప్రస్తుతం భారత్లో సుమారు 40 వేల నుంచి 50 వేల మంది రోహింగ్యాలు నివసిస్తున్నట్లు అంచనా. జమ్మూ కశ్మీర్లో సుమారు 7 వేల–8 వేల మంది నివసిస్తున్నారు. వీరిలో చాలా మంది ఇళ్లలోనూ, ప్రైవేటు వాణిజ్య సంస్థల్లో కార్మికులుగా జీవిస్తున్నారు. రోహింగ్యాల జనాభా వాస్తవంగా ఇంకా ఎక్కువగానే ఉంటుందని చాలా మంది జమ్మూ ప్రజల విశ్వాసం. నిధులు, నియామకాలు ఎక్కువగా కశ్మీరీ ముస్లింలకే దక్కుతున్నాయని భావిస్తున్న హిందూ ప్రాబల్య జమ్మూ ప్రజలు... రోహింగ్యా ముస్లింలు స్థిరపడుతుండడాన్ని అనుమానంతో చూస్తున్నారు. జమ్మూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రోహింగ్యాలు స్థానికులను వివాహం చేసుకోవడం, తద్వారా ఆ ప్రాంత జనాభాలో మార్పు తెచ్చే ప్రయత్నం జరుగుతోందని వారు భావిస్తున్నారు. పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, రోహింగ్యా ముస్లింల విషయంలో జమ్మూ, కశ్మీర్ మధ్య çకొత్త వివాదం తలెత్తింది.