Motion of No Confidence
-
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని టీఆర్ఎస్ విమర్శించింది. లోక్సభలో అవిశ్వాసం తీర్మానంపై చర్చ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ వినోద్కుమార్ మాట్లాడారు. ‘నాలుగేళ్ల క్రితం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ప్రజల్లో ఎన్నో ఆశలుండేవి. వాటిని నెరవేర్చడంలో కేంద్రం విఫలమైంది. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా తొలి కేబినెట్ సమావేశంలో పోలవరం ముంపు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపింది. ఈ మండలాలను మళ్లీ తెలంగాణలో కలిపేలా కేంద్రం విభజన చట్టాన్ని సవరించాలి. 7 ముంపు మండలాల్లో భాగమైన 500 మెగావాట్ల సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఏపీకే ఇవ్వడంతో మా రాష్ట్రంలోవిద్యుత్ సంక్షోభం ఏర్పడింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం సొంతంగా విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకొనేదాకా ఏపీ విద్యుత్ సరఫరా చేయాలన్న నిబంధన ఉన్నా అమలు కాలేదు. మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల మేం తీవ్రంగా నష్టపోయాం. ముంపు మండలాలను కలపకపోతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని బాబు పలు సందర్భాల్లో మీడియా సాక్షిగా అన్నారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు నిధులివ్వాలి ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు పూర్తి ఖర్చును భరిస్తామని విభజన చట్టంలో పేర్కొన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని ప్రాజెక్టును విస్మరించిందన్నారు. మాకు జీవనాధారమైన కృష్ణా, గోదావరి నదులపై చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులివ్వాలి. బాబు వల్లే హైకోర్టు ఆలస్యం ‘హైకోర్టు విభజన జరగకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణం. ఏపీ ప్రభుత్వం ముందుకొస్తే వెంటనే హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అప్పటి కేంద్ర న్యాయ మంత్రి స్పష్టం చేశారు. కానీ ఏపీ ఇప్పటికీ ముందుకు రాలేదు. సచివాలయం, అసెంబ్లీ కట్టుకున్న ఏపీ, హైకోర్టును ఎందుకు నిర్మించుకోలేకపోతోందో చెప్పాలి. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.19 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లివ్వాలని నీతిఆయోగ్ సిఫార్సు చేసింది. దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలి. గల్లా వ్యాఖ్యలపై సభలో దుమారం ఆంధ్రప్రదేశ్ను అప్రజాస్వామికంగా, అశాస్త్రీయంగా విభజించారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గల్లా తన ప్రసంగంలో రాష్ట్ర విభజన అప్రజాస్వామికం అనండంపై టీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి వెళ్లి ఆందోళన చేశారు. గల్లా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఆమోదంతోనే విభజన బిల్లు ఆమోదం పొందిందని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత జితేందర్రెడ్డి గుర్తు చేశారు. పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లు అప్రజాస్వామికమెలా అవుతుందని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటు ప్రజాస్వామికంగానే జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం చంద్రబాబు కేంద్రానికి రెండుసార్లు లేఖలు రాశారని గుర్తు చేశారు. ‘అప్రజాస్వామికం, అశాస్త్రీయం’ అనే మాటలను రికార్డుల్లోంచి తొలగించాలని స్పీకర్ను కోరారు. -
హోదాపై కేంద్రం అసత్యాలు
సాక్షి, న్యూఢిల్లీ: 14వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పిందంటూ కేంద్రం అసత్యాలు చెబుతోందని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఇచ్చిన హామీని విస్మరించిన వ్యక్తి ఎన్నటికీ మనిషి కాలేడని వ్యాఖ్యానించారు. ఏపీకి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ సందర్భంగా ఆయన మహేశ్బాబు నటించిన ‘భరత్ అను నేను’ సినిమాను ప్రస్తావించారు. ‘విభజన పాపంలో బీజేపీకి సగం వాటా ఉంది. నాటి ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీపై ప్రస్తుత ప్రధాని మోదీకి గౌరవం ఉందా? ప్రత్యేక హోదా ఐదు కాదు..పదేళ్లు ఇస్తామంటూ తిరుపతి, నెల్లూరు సభల్లో మీరిచ్చిన హామీలు గుర్తున్నాయా? చేతులు జోడించి నమస్కరిస్తున్నా.. మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి. ఢిల్లీని మించిన రాజధానిని ఆంధ్రప్రదేశ్కు నిర్మిస్తామని, వెనుకబడిన జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని నాడు మోదీ మాటిచ్చారు. చివరికి అమరావతి నిర్మాణానికి రూ.1,500 కోట్లు మాత్రం ఇచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటుకు రూ.3,000 కోట్లు, ఛత్రపతి శివాజీ విగ్రహానికి రూ.3,500 కోట్లు ఖర్చు పెడతారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.58 వేల కోట్లు ఇవ్వాల్సి ఉన్నా రూ.6 వేల కోట్లే ఇచ్చారు’ అని అన్నారు. ‘మోసగాడు’ వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతుండగా.. ప్రధాని మోదీ మోసగాడు అంటూ ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. ప్రధానిని మోసగాడు అనడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. శివప్రసాద్ వ్యాఖ్యలను రక్షణ మంత్రి సీతారామన్ ఖండించారు. ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాంటి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ పేర్కొన్నారు. సమీక్షించనేలేదు: రామ్మోహన్ విభజన చట్టం అమలుపై కేంద్రం ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని టీడీపీ ఎంపీ కె.రామ్మోహన్నాయుడు పేర్కొన్నారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు భూమి సిద్ధంగా ఉన్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఢిల్లీలో విలాసవంతమైన కార్యాలయాన్ని కట్టుకున్న బీజేపీ నాలుగేళ్లు అయినా ఏపీలో కేంద్ర సంస్థలను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. చట్టంలో హోదా లేదంటున్న బీజేపీ.. పోలవరం ముంపు మండలాలను ఏపీలో ఎలా కలిపారో అలా ఎందుకు చేయడం లేదని నిలదీశారు. -
టీడీపీ ‘కాగడాల ప్రదర్శన’ హడావుడి
ప్రదేశం: బందరు రోడ్డు బెంజిసర్కిల్ ప్రాంతం సమయం: సాయంత్రం 5 గంటల సమయం విషయం: ఒక్కసారిగా పోలీసులు రోడ్డు పైకి వచ్చి ట్రాఫిక్ ఆంక్షలు.. కారణం: సీఎం చంద్రబాబునాయుడు కాగడా ప్రదర్శనలో పాల్గొంటున్నారంటూ హడావుడి ఫలితం: ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు ముగిసిన సమయం: రాత్రి 8.15 సాక్షి, విజయవాడ: పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చ జరుగుతుండడంతో టీడీపీ అధినేత హైడ్రామాకు తెరతీశారు. రాష్ట్ర ఎంపీలకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా కాగడా ప్రదర్శనలు చేయాలని టీడీపీ పిలుపునిచ్చింది. విజయవాడలో నిత్యం రద్దీగా ఉండి భారీ వాహనాలు రాకపోకలు సాగించే బెంజి సర్కిల్లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని ప్రకటించారు. క్షణాల్లో ట్రాఫిక్ ఆంక్షలు: శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు ముగియడంతో ఇళ్లకు వెళ్లే వారితో కిటకిటలాడుతున్న బెంజి సర్కిల్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు కాగడా ప్రదర్శన నిర్వహిస్తారని తెలిసి డీవీ మ్యానర్ నుంచి బెంజి సర్కిల్ వరకు ట్రాఫిక్ను అనుమతించలేదు. అలాగే నిర్మలా కాన్వెంట్ నుంచి బెంజి సర్కిల్కు, ఎన్టీఆర్ సర్కిల్ నుంచి బెంజి సర్కిల్కు, స్క్రూ బ్రిడ్జి నుంచి బెంజిసర్కిల్కు వాహనాలను అనుమతించలేదు. సందుల్లోకి, గొందుల్లోకి ట్రాఫిక్ను మళ్లించారు. దీంతో నగర వాసులు ప్రత్యక్ష నరకాన్ని చూశారు. జాతీయ రహదారిపై కి.మీ మేర భారీ వాహనాలు నిలిచిపోయాయి. ఎటు వైపు నుంచి ఎటువైపు వెళ్లాలో తెలియక జనాలు చికాకు పడ్డారు. ముందుగా సమాచారం ఇవ్వకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంపై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గైర్హాజరు: పార్లమెంట్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం పూర్తి కాలేదంటూ సీఎం చంద్రబాబు కాగడా ప్రదర్శనకు గైర్హాజరయ్యారు. దీంతో రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడేప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకూమారి, జిల్లా చైర్మన్ గద్దె అనూరాధ, ప్రత్యేక హోదా జేఏసీ ప్రతినిధి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక ప్యాకేజీకి టీడీపీ ఒప్పుకుంది
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే అంగీకారం తెలిపిందనీ, తర్వాత రాజకీయ కారణాలతో యూటర్న్ తీసుకుందని విశాఖ బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు విమర్శించారు. శుక్రవారం లోక్సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీని విభజించాలని చంద్రబాబే లేఖ ఇచ్చి, ఇప్పుడు విభజనను తప్పుపడుతున్నారు. రాష్ట్రంపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. ఆ పార్టీకి రాజకీయాలే ముఖ్యం. కాంగ్రెస్కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే, ఈ రోజు చంద్రబాబు కాంగ్రెస్తో జట్టు కట్టారు. ఇది చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది. అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోంది. అంత చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలోనే ఆ విషయాన్ని ఎందుకు పెట్టలేదు? రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ నాయకులు హోదాపై ఎందుకు మాట్లాడలేదు? విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో 85 శాతం హామీలు అమలు చేసినందుకా? చట్టంలో ఇచ్చిన సంస్థలను పదేళ్ల కాలపరిమితిలో ఏర్పాటు చేయాలని ఉన్నా నాలుగేళ్లలోనే ఏర్పాటు చేసినందుకా? టీడీపీ అవిశ్వాసం పెట్టింది?’ అని నిలదీశారు. ఎస్పీవీ ఏర్పాటు చేయండి.. ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ చెప్పిన మాట వాస్తవమే. అయితే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల ఆ హామీ అమలు కాలేదు. అయినా ప్రత్యేక హోదా పేరు లేకుండా హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఇస్తున్న 90 శాతం నిధులను ఏపీకి ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి రూ.17,500 కోట్ల విలువైన ఈఏపీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈఏపీ ప్రాజెక్టుల మంజూరు ప్రక్రియ ఆలస్యమవుతున్నందున హడ్కో, నాబార్డు రుణాలిప్పించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్ఆర్బీఎం సమస్యలు తలెత్తే వీలుండడంతో స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. కానీ, ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎస్పీవీని ఏర్పాటు చేయలేదు. దీనివల్ల రాష్ట్రం రూ.17,500 కోట్లు నష్టపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీవీ ఏర్పాటు చేస్తే ఒక్క రోజులోనే నిధులు విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’ అని ఆయన తెలిపారు. -
జగన్ మాటే.. జయదేవ్ నోట
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం మోసగిస్తున్న వైనాన్ని మూడేళ్ల క్రితం అసెంబ్లీలో ఎలుగెత్తిన సందర్భంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించిన అంశాలనే శుక్రవారం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పేర్కొనటం గమనార్హం. జయదేవ్ మాట్లాడిన విషయాలను గమనిస్తే ముందు నుంచి హోదా విషయంలో మడమతిప్పని వైఎస్సార్ సీపీ వైఖరినే అనుసరించినట్లైంది. అలాగే చంద్రబాబు కూడా మీడియా సమావేశంలో ప్రత్యేక హోదాకు 14 ఆర్థిక సంఘం నిబంధనలు అడ్డు వచ్చాయని మోదీ చెప్పడం సరికాదన్నారు. హోదా రద్దు చేయమని ఎక్కడా చెప్పలేదు.. 2015 సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రానికి హోదా సాధించుకోవడంలో టీడీపీ సర్కారు మెతక వైఖరిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ఇదే సమయంలో కేంద్రం చేస్తున్న మోసాన్ని కూడా ప్రస్తావించారు. ‘ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అసలు ప్రత్యేక హోదాను రద్దు చేయాల్సిందిగా తాము ఎక్కడా సిఫార్సు చేయలేదని స్వయంగా 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవీ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు..’ అని వైఎస్ జగన్ అసెంబ్లీలో ఆధారాలతో సహా వివరించారు. ‘ప్రత్యేక హోదాను రద్దు చేయాల్సిందిగా తాము ఎక్కడా సూచించలేదని కమిషన్ సభ్యులు అభిజిత్సేన్ లేఖ రాశారు. మరో సభ్యుడు గోవిందరావు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు’ అని మూడేళ్ల క్రితమే వైఎస్ జగన్ శాసనసభ దృష్టికి తెచ్చారు. ప్రత్యేక హోదాకు మించి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందంటూ సీఎం చంద్రబాబు పేర్కొనడాన్ని జగన్ అప్పట్లోనే తప్పుబట్టారు. మూడేళ్ల క్రితం నాడు అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించిన అవే అంశాలను ఇప్పుడు పార్లమెంట్లో టీడీపీ ఎంపీ జయదేవ్, మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రస్తావించడం విశేషం. -
‘రాఫెల్’లో రాహుల్కు ఝలక్
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో కుదిరిన ఒప్పంద వివరాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో అధికారంలో ఉన్న బీజేపీ అవినీతికి పాల్పడిందంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ చేసిన ఆరోపణలను రక్షణ మంత్రి నిర్మల తిప్పికొట్టారు. ఆ ఒప్పందం రహస్య సమాచార పరిధిలోకే వస్తుందని, రాఫెల్ ఒప్పంద వివరాలను బహిర్గతం చేయలేమని స్పష్టం చేశారు. రహస్య సమాచార పరిరక్షణకు సంబంధించి ఫ్రాన్స్, భారత్ల మధ్య ఒక ఒప్పందం 2008లోనే కుదిరిందని గుర్తు చేశారు. రాఫెల్ ఒప్పందం ఆ పరిధిలోకే వస్తుందన్నారు. ‘ఇది గోప్యతా ఒప్పందం. సున్నిత సమాచారాన్ని పరిరక్షించాల్సి ఉంది. రాహుల్కు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ, భారత చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రన్ మాట్లాడుతూ ఒప్పంద వాణిజ్య విషయాలు బహిర్గతం చేయకూడదని అన్నారు. రాహుల్ చెప్పినదంతా అబద్ధం’ అని నిర్మల తిప్పికొట్టారు. రాఫెల్ ఒప్పందంలో అసలు గోప్యతా నిబంధనలే లేవన్న రాహుల్ ఆరోపణలు నిరాధారమన్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వం రాహుల్ ఆరోపణలపై స్పందించింది. రాఫెల్ విమానాల కొనుగోలు వివరాలను బహిర్గతం చేయడానికి తమకేం అభ్యంతరం లేదని మేక్రన్ తనకు చెప్పారని లోక్సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఫ్రెంచ్ ప్రభుత్వం తప్పుబట్టింది. ‘2008లో చేసుకున్న భద్రతా ఒప్పందానికి రెండు దేశాలు కట్టుబడి ఉండాల్సిందే. రక్షణ రంగంపై ప్రభావం చూపే అంశాలను రహస్యంగా ఉంచాలన్న నిబంధన ఆ ఒప్పందంలో ఉంది’ అని పేర్కొంది. సున్నితమైన అంశాలతో కూడిన ఒప్పందం వివరాలను భారత్, ఫ్రాన్స్లలో ఎక్కడా బహిర్గతం చేయొద్దని 2018 మేలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతిని కూడా ఫ్రాన్స్ ఆ ప్రకటనలో గుర్తుచేసింది. బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు రాహుల్ పార్లమెంట్ను తప్పుదోవ పట్టించారని బీజేపీ ఆరోపించింది. రాఫెల్ జెట్ విమానాల కొనుగోలు ఒప్పందంపై రక్షణమంత్రి అబద్ధాలు చెబుతున్నారంటూ లోక్సభలో రాహుల్ ఆరోపించడంతో బీజేపీ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. పార్లమెంట్లో రాహుల్ పిల్లాడిలా ప్రవర్తించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్కుమార్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘రాహుల్ అపరిపక్వతతో పిల్లాడిలా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎదగకపోవటం దురదృష్టకరం. సభలో సభ్యుడిపై ఎవరైనా ఆరోపణలు చేయాలనుకుంటే ముందుగా స్పీకర్కు తెలియజేయాల్సి ఉంటుంది. ఆరోపణలకు సమర్ధనగా ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండా ఆయన నిరాధార ఆరోపణలు చేశారు’ అని అన్నారు. అనంతరం బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషి రాహుల్పై సభాహక్కుల నోటీసు ఇచ్చారు. రాఫెల్ ఒప్పందం నేపథ్యం ఫ్రెంచి కంపెనీ డసాల్ట్ నుంచి 36 రాఫెల్ విమానాలు కొనుగోలు చేసేందుకు భారత్ 2016 సెప్టెంబర్లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.58 వేల కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. గత యూపీఏ ప్రభుత్వం 126 విమానాలను కొనుగోలు చేయాలనుకున్నా, తరువాత వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఆ సంఖ్యను 36కు తగ్గించింది. ఈ ఒప్పందం కింద డసాల్డ్.. భారత్కు చెందిన డీఆర్డీఓ, హెచ్ఏఎల్ తదితర సంస్థలతో విమానాల తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఇరు దేశాల మధ్య కుదిరిన ఇంటర్ గవర్నమెంటల్ ఒప్పందాన్ని ‘రాఫెల్ డీల్’గా పేర్కొంటున్నారు. యూపీఏ సమయంలో కుదిరిన దాని కన్నా ఒక్కో విమానం ధర మూడు రెట్లు ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఒప్పందం వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తోంది. -
అవిశ్వాసం: తెలుగుదేశంలో అంతర్మథనం!
సాక్షి, అమరావతి: బీజేపీతో లోపాయికారీ ఒప్పందంతో అవిశ్వాస తీర్మానం పెట్టి లబ్ధి పొందాలని చూస్తే మొత్తానికి మునిగి పోయామని, పరువు పోగొట్టుకున్నామని తెలుగుదేశం పార్టీ ఆందోళన చెందుతోంది. అవిశ్వాసం వల్ల పార్టీకి ఉపయోగం లేకపోగా ఇన్నాళ్లూ దాచిన రహస్యాలన్నీ పార్లమెంట్ సాక్షిగా బట్టబయలయ్యాయని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. ‘‘అవిశ్వాసానికి వివిధ పార్టీల మద్దతు కూడగడుతున్నాం.. చంద్రబాబు అమరావతి నుంచే చక్రం తిప్పుతున్నారు. తన అనుభవంతో విపక్షాలన్నింటినీ ఏకం చేస్తున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వివిధ పార్టీలతో కలిసి కేంద్రాన్ని ఎండగడతాం.. ప్రధాని మోదీని నిలదీస్తాం’’ అంటూ హడావుడి చేసినా అదేమీ జరగలేదని టీడీపీ సీనియర్లు వాపోతున్నారు. పార్లమెంట్లో ఇతర పార్టీల నుంచి మద్దతు లభించకపోగా, బీజేపీ వైఖరితో పూర్తిగా ఇబ్బందుల్లో పడ్డామనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. లోక్సభలో అవిశ్వాసంపై జరిగిన చర్చ తీరు మనకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదని, చివర్లో జరిగిన పరిణామాలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని చంద్రబాబు టీడీపీ ముఖ్య నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. మోదీ వ్యాఖ్యలతో ఇబ్బందికర పరిస్థితి చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లినా తమకు మిత్రుడేనని, ఇప్పుడే కాదు ఎప్పటికీ ఆయనతో స్నేహం ఉంటుందని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ చెప్పడం ద్వారా టీడీపీ–బీజేపీ లోపాయికారీ వ్యవహారాలను తేటతెల్లం చేశాయని టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్లు అధికారంలో కొనసాగి, రాజకీయ లాభం కోసం బీజేపీ నుంచి విడిపోయినా రహస్యంగా ఆ పార్టీతో చంద్రబాబు అనుబంధం కొనసాగిస్తున్నారనే అనుమానాలు మొదటి నుంచే వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీ ప్రసంగంతో తమ అధినేత బండారం మొత్తం బయటపడినట్లు టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు అంగీకారంతోనే ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని, అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతోందని, ఏపీలో సమస్యలు పరిష్కారం కాలేదని సాక్షాత్తూ ప్రధానమంత్రే చెప్పడం తమకు ఇబ్బందికరమేనని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. లోక్సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర పార్టీల నేతలు తమ పార్టీకి మద్దతు ఇవ్వకపోగా, ప్రత్యేక హోదా గురించి కనీసం ప్రస్తావించకపోవడాన్ని బట్టి చూస్తే చంద్రబాబు వ్యూహం ఫలించలేదనే విషయం స్పష్టమవుతోందంటున్నారు. ప్రజల దృష్టిని మళ్లిద్దాం.. తాజా పరిణామాలన్నీ టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు కూడా మదన పడుతున్నట్లు సమాచారం. ఉదయం నుంచి పార్లమెంట్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న ఆయన మంత్రులతో మాట్లాడుతూనే తన అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ వాదనను లోక్సభలో సరిగ్గా వ్యక్తం చేయలేకపోయామని, అనుకున్న మైలేజీ రాలేదని అంటున్నట్లు సమాచారం. మోదీ నేరుగా తనను టార్గెట్ చేసి మాట్లాడుతారని తాను ఊహించలేదని ఆయన వాపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మోదీ మాట్లాడిన తర్వాత నష్ట నివారణ కోసం అర్ధరాత్రి 12 గంటలకు చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. తాజా పరిస్థితి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. -
చంద్రబాబు మాకు మిత్రుడే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ బంధం బలమైనదని లోక్సభ సాక్షిగా మరోసారి నిరూపితమైంది. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకొచ్చినా ఈ రోజుకీ ఆయన మా మిత్రుడే. ఇకపై కూడా మా మిత్రుడిగానే కొనసాగుతారు. మా బంధం తెగిపోయేదికాదు’ అని శుక్రవారం లోక్సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ అన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీకి కేటాయించిన నిధులు, సాయంపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల ఏర్పడిన సమస్యలేంటో మాకు తెలుసు. ఏపీ అభివృద్ధికి ఎంత సాయం అవసరమో అంతా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విభజన చట్టాన్ని ఇప్పటికే చాలా వరకు అమలు చేశాం. నూతన రాజధాని నిర్మాణానికి రూ. 1,500 కోట్లు ఇచ్చాం. గుంటూరు, విజయవాడకు అదనంగా రూ. వెయ్యి కోట్లు ఇచ్చాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 6,764 కోట్లు విడుదల చేశాం. ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ విషయంలో ఒక స్పష్టత వస్తుంది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.1,050 కోట్లు ఇచ్చాం. అవసరమైతే ఇంకా ఇస్తాం. రిసోర్స్ గ్యాప్ భర్తీకి రూ.3, 979 కోట్లు విడుదల చేశాం. 2015–20 కాలానికి ఆర్థిక లోటును రూ. 22,113 కోట్లతో భర్తీ చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఇందుకోసం 2015–18 మధ్య కాలంలో రూ. 15,959 కోట్లు విడుదల చేశాం. ఇవి కాకుండా ఏపీకి అదనంగా సెంట్రల్ యూనివర్శిటీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, అమరావతి చుట్టూ వంద కిలోమిటర్లు రింగురోడ్డు, ఎయిమ్స్, అగ్రికల్చర్ వర్సిటీకి రూ. 135 కోట్లు మంజూరు చేశాం. వైజాగ్–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు అనుమతులిచ్చాం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా ఏపీకి 2015–20 కాలానికి కేంద్రం నుంచి రూ. 2,06,910 కోట్లు మంజూరు కానున్నాయి. 2016 సెప్టెంబర్లో ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రూ.8,140 కోట్ల విలువైన ఈఏపీ ప్రాజెక్టులకు అనుమతించాం. టీడీపీ ఇక ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనపెట్టి ఇప్పటి వరకు మంజూరు చేసిన ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని అభివద్ధి చేయడంపై దృష్టి సారించాలి’ అని సూచించారు. సిక్కుల ఊచకోతే అతిపెద్ద మూకదాడి.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన సిక్కుల ఊచకోతే అతిపెద్ద మూకదాడి అని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇలాంటి ఘటనల నివారణకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని, కానీ రాష్ట్రాలే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల జరుగుతున్న వరస మూకహత్యలపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న ప్రతిపక్షాలకు గట్టి సమాధానమిచ్చారు. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లే అతిపెద్ద మూకహత్యా ఘటనలని, ఇందిరా గాంధీ హత్యానంతర పరిస్థితులను ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో తమ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిందని, సిక్కు వర్గానికి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించిన ప్రతిపక్షాల్లోనే ఒకరిపై ఒకరికి విశ్వాసం లేదని హేళన చేశారు.‘ఎవరిపై మీరు అవిశ్వాసం ప్రకటించారు? ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాది కుటుంబాలు స్వచ్ఛందంగా గ్యాస్ సబ్సిడీని వదులుకున్నాయి. కానీ ప్రతిపక్షాల్లోనే ఒకరిని మరొకరు విశ్వసించే పరిస్థితి లేదు. తమ నాయకుడు, విధానాల గురించి వాళ్లకే స్పష్టత లేదు’ అని అన్నారు. -
కప్పిపుచ్చుకునేందుకే బాబు యూటర్న్
2014 ఎన్నికల తరువాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ మధ్య ప్రతిసారీ సమస్యలు వస్తుండేవి. కొన్నిసార్లు గవర్నర్, కొన్నిసార్లు హోంమంత్రి, నేను కూర్చొని రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరిం చేందుకు కృషి చేసేవాళ్లం. కేసీఆర్ కొంత మెచ్యూరిటీ చూపించారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో మునిగిపోయింది. ఏపీలో సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కావడం లేదు. ఏపీ, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అంగీకారంతోనే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు కూడా తెలిపారు. కానీ, ఇప్పుడు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి యూటర్న్ తీసుకున్నారు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శుక్రవారం లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘వాజ్పేయి హయాంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు, గొడవలు లేవు. అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకొని ఎవరిదారి వారు చూసుకున్నారు. మూడు రాష్ట్రాలు ఇప్పుడు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నాయి. అయితే, యూపీయే ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా సభ ఆర్డర్లో లేకపోయినా పార్లమెంట్ తలుపులు మూసి రెండు రాష్ట్రాలుగా విభజన చేసింది. గల్లా జయదేవ్ చెప్పినట్టు నేను ఆనాడు చెప్పా. తెలుగు మా తల్లి.. తెలుగు స్ఫూర్తి దెబ్బతినకుండా చూడాలని ఆనాడే అన్నాను. కాంగ్రెస్ పార్టీ బిడ్డను రక్షించి, తల్లిని చంపేసింది. మనం ఇద్దరినీ రక్షించుకోవాలని చెప్పా. తెలుగు స్ఫూర్తిని రక్షించాలి. ఇప్పటికీ నేను ఇదే నమ్ముతాను. 2014లో కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రం పోతే మరో రాష్ట్రంలో మనుగడ సాధించవచ్చని అనుకుంది. కానీ, ఆ పార్టీకి రెండూ దక్కలేదు. ఎందుకంటే ప్రజలు చాలా తెలివైనవారు. కాంగ్రెస్ గతంలో భారత్–పాకిస్తాన్ను విడదీసింది. ఇప్పటికీ రెండు దేశాల మధ్య సమస్యలు పరిష్కారం కాలేదు. అలాగే ఏపీ, తెలంగాణను విభజించింది. ఆ రాష్ట్రాల సమస్యలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు. 2014 ఎన్నికల తరువాత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ మధ్య ప్రతిసారి సమస్యలు వస్తుండేవి. కొన్నిసార్లు గవర్నర్, కొన్నిసార్లు హోంమంత్రి, నేను కూర్చొని రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కారించేందకు కృషి చేసేవాళ్లం. కేసీఆర్ కొంత మెచ్యూరిటీ చూపించారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో మునిగిపోయింది. ఏపీలో సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కావడం లేదు. ఏపీ, తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎన్డీయే ప్రభుత్వం హమీ ఇచ్చింది. ఇప్పటికీ మేం దానికి కట్టుబడి ఉన్నాం. ఏపీ ప్రజలకు విశ్వాసం కల్పిస్తున్నా... 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల వల్ల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయాం. అందుకే ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాం. ఇదే తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ సభ్యుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ బాగుందని అన్నారు. 2016 సెప్టెంబర్లో ప్యాకేజీ ప్రకటించాం. అది కూడా చంద్రబాబు అంగీకారంతోనే. ఈ ప్యాకేజీపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఆర్థిక మంత్రిని అభినందిస్తూ తీర్మానం చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన ప్రతి హామీని, ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోంది. కానీ, చివరికి చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు యూటర్న్ తీసుకున్నారు. చంద్రబాబు ఎన్డీయే నుంచి వైదొలిగే ముందు నేను ఆయనకు ఫోన్ చేసి చెప్పాను. మీరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో చిక్కుకుంటున్నారని చెప్పాను. ఈ వ్యూహంలో చిక్కుకుంటే మనుగడ సాధించలేరని కూడా తెలిపాను. ఈ పరిణామాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి, రైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం చేయాల్సిందంతా చేస్తాం’’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ‘‘ఒక రాష్ట్రానికి రాయితీలు ఇస్తే మరో రాష్ట్రంపై ప్రభావం పడుతుంది. ఇలా ఇస్తే రాష్ట్రాల మధ్య అసమానత ఏర్పడుతుందని మూడేళ్ల క్రితం కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ ఇదే సభలో అన్నారు. ఇది చాలా పెద్ద అంశమని పేర్కొన్నారు. మీరు కేవలం ఆర్బిట్రేటర్ మాత్రమేనని మొయిలీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను విశ్వాసం కల్పిస్తున్నాను. కేంద్ర సర్కారు ఏపీ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. ఏపీకి అండగా ఉంటాం’’ అని మోదీ ఉద్ఘాటించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని కేశినేని నాని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్కు(నాని) లోక్సభలో ప్రధానమంత్రి జవాబు అనంతరం మాట్లాడేందుకు అవకాశం రాగా ఆయన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. కేంద్రం చేసిన వాదనలను తిప్పికొట్టేందుకు ప్రయత్నించాల్సి ఉండగా.. కేవలం విమర్శలతో సరిపెట్టారు. దీంతో సభాపతి వెంటనే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. -
రాజ్నాథ్ వ్యాఖ్యలతో వారి బంధం సుస్పష్టం: పవన్
సాక్షి, అమరావతి: లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్సింగ్.. ‘ఏపీ ముఖ్యమంత్రి మాకు ఇంకా మంచి మిత్రుడే’ అంటూ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ – బీజేపీలు ఇంకా కలిసే ఉన్నాయని స్పష్టమవుతోందని జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ.. రెండు పార్టీలూ కలిసి ఏపీ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంటున్నాయనిపిస్తోందని తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో హోదా డిమాండ్కు సంబంధించి తెలుగుదేశం పార్టీ అత్యంత పేలవమైన, బలహీనమైన వాదనలు వినిపించిందని దుయ్యబట్టారు. చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మూడున్నరేళ్లుగా ప్రత్యేక హోదా అంశానికి తూట్లు పొడిచి.. ఇప్పుడు అవిశ్వాసంపై జరిగిన చర్చలో వ్యర్థమైన ప్రసంగాలు చేసి ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న నాయకులకు కేంద్రం చేస్తున్న వంచన తెలియడానికే ఇన్నేళ్లు పట్టిందంటే నమ్మాలా.. అని ప్రశ్నించారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న మీరు మాత్రం.. ఇప్పుడే పుట్టిన పాలుగారే పసిపిల్లలాగా ‘కేంద్రం మోసగించింది’ అంటే జనం నమ్ముతారా.. అని ధ్వజమెత్తారు. హోదా అడిగిన వారిని తిడుతూ.. ప్యాకేజీ ఇస్తామన్న బీజేపీ నాయకులకు సన్మానాలు చేసిన వారికి.. మోసం తెలుసుకోవడానికి ఇన్నేళ్లు పట్టిందా.. అని పవన్ విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంలో ప్రతి దశలోనూ బీజేపీ నాయకత్వంతో టీడీపీ కుమ్మక్కై రాజీ పడుతూ వచ్చిందని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం హోదా డిమాండ్నే తాకట్టు పెట్టిన టీడీపీ.. రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలకు అన్యాయం చేయవద్దని కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. నేడు, రేపు విజయవాడలో పవన్కల్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ శని, ఆదివారాల్లో విజయవాడలో ఉంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. శనివారం హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకుంటారని, ఆదివారం రాజధాని ప్రాంత రైతులతో భేటీ అవుతారని తెలిపాయి. -
అవిశ్వాస తీర్మానంపై నేడు స్పందించనున్న జగన్
సాక్షి, అమరావతి: లోక్సభలో అవిశ్వాస తీర్మాన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ట్వీటర్లో పేర్కొన్నారు. పార్లమెంట్లో జరిగిన పరిణామాలపై శనివారం ఉదయం 8.30 గం.కు ప్రెస్మీట్లో స్పందిస్తానని వైఎస్ జగన్ తెలిపారు. -
‘ఓయ్ పిల్లాడా ! ప్రియా వారియర్ కంటే..’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సహా వివిధ దేశాధినేతలను ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలి ఆలింగనంతో (బేర్ హగ్) చిత్తు చేస్తే, ఆయనకు విపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ రూపంలో ఆలింగనంలో పోటీ ఎదురైందనే సరదా చర్చ సాగుతోంది. శుక్రవారం లోక్సభలో ఎన్డీఏ సర్కార్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ తన ప్రసంగంతో, ఆ తర్వాత మోదీని ఆప్యాయంగా కౌగిలించుకుని, ఆ వెంటనే సహచర ఎంపీలను ఉత్సాహపరుస్తూ కొంటెగా కన్నుగీటడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాహుల్ చేష్టలన్నింటినీ వివిధ జాతీయ టీవీ ఛానళ్లు పదేపదే చూపాయి. ఈ ఘట్టాలు ట్విట్టర్ సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో హాస్యపూర్వక వ్యాఖ్యలు, చర్చలకు దారితీశాయి. ► ‘ఓయ్ పిల్లాడా ! ప్రియా ప్రకాష్ వారియర్ (కన్నుగీటిన సీన్ల ద్వారా పాపులర్ అయిన మలయాళీ నటి) కంటే మెరుగ్గా రాహుల్ కన్నుగీటారు. మున్నాభాయ్ కంటే బాగా ఆలింగనం చేసుకున్నారు. దీనికి ఆస్కార్ అవార్డ్ రావొచ్చేమో?’ నంటూ గౌతమ్ జోషి ట్వీట్ చేశారు. ► ‘ప్రియా వారియర్ కంటే కూడా నిట్టనిలువునా మనిషిని పడగొట్టేలా కన్నుకొట్టడమంటే ఇదే’నని ఆకాష్ సిన్హా పేర్కొన్నారు ► ఈ కౌగిలింత ప్రభావం ఎంతో తీవ్రంగా ఉండబోతోంది. ప్రియా వారియర్ కంటే కూడా ఈ కన్నుగీటడం మరింత ఎక్కువగా అంటురోగంగా వ్యాపిస్తుందేమోనన్న సందేహాన్ని గీతాశర్మ వెలిబుచ్చారు. ► అయితే రాహుల్ కన్నుగీటడంపై స్వయంగా ప్రియా వారియర్ ‘ఈ విధంగా కన్నుగీటడం తియ్యటి సంజ్ఞ, చేష్ట. ఇది నాకు సంతోషాన్ని కలిగించింది’ అంటూ స్పందించింది. ► అవిశ్వాసంపై చర్చను పక్కన పెట్టి మోదీపై దాడే రాహుల్ ఏకైక లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రసంగం బదులు ప్రదర్శన ఇచ్చారు. చిన్నపిల్లాడి మాదిరిగా అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేయడం తప్ప ఓ విజనూ లేదూ, రోడ్డు మ్యాపూ లేదు’ అంటూ మరో ట్విటరాటీ సంజూ శర్మ విరుచుకుపడ్డారు ► ప్రధానిని రాహుల్గాంధీ ఆలింగనం చేసుకోవడం, ఆ తర్వాత చౌకబారుగా కన్నుగీటడం ఆయన అపరిపక్వతను, స్థాయి లేమి తనాన్ని స్పష్టం చేస్తోంది’ అంటూ ఘోస్ స్పాట్ అకౌంట్ ట్వీట్ చేశారు. ► ముఖ్యమైన అవిశ్వాసంపై చర్చ సందర్భంగా పార్లమెంట్ మర్యాదను, నిబంధనలను రాహుల్ తక్కువచేశారు. జప్పీ (కౌగిలింత) తర్వాత కన్నుగీటడం చూస్తుంటే ఆయన ప్రతిపక్ష నేతా లేక మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి పాత్రా? సిగ్గుచేటు...షెహజాద్ జై హింద్ ట్విటర్ అకౌంట్ నుంచి పేర్కొన్నారు ► ఆలింగనం తర్వాత కన్నుకొట్టడమా? భారతీయులను మూర్ఖులను చేయాలనే యత్నం వద్దు రాహుల్. పార్ల మెంట్లో కామెడీ షో ఏం జరగడం లేదు. పార్లమెంట్లో వాస్తవాలు మాట్లాడేటపుడు సీరియస్గా వ్యవహరించు. ప్లీజ్ పరిణతి ప్రదర్శించు...బర్ఖా ట్రెహాన్ ట్వీట్ చేశారు. ► ‘వావ్..వావ్ ! ఏమి హగ్ అండీ. ఎంత అద్భుతమైన రోజు ఇది’ అని సంజుక్త బసు వ్యాఖ్యానించారు. ► ‘న్యూ వైల్డ్ స్టోన్ యాడ్ మాదిరిగా ఉంది ఇది’ అని ఓజాస్ ట్వీటారు. ► రాహుల్ తన ప్రసంగంలో బీజేపీ వైఫల్యాలు ఎండగట్టి, ఆ తర్వాత ఆలింగనం చేసుకోవడం ద్వారా మోదీ, బీజేపీ కంటే తాను, కాంగ్రెస్పార్టీ ఏ విధంగా భిన్నమైందో చెప్పారు అని శ్రీవత్స పేర్కొన్నారు. -
అవిశ్వాసం పెట్టినా ఫలితం లేకుండా పోయింది
సాక్షి, అమరావతి: ‘‘ఎన్డీయే ప్రభుత్వానికి బలం ఉందని తెలుసు. అవిశ్వాసంతో ప్రభుత్వం పడిపోదనీ తెలుసు.. కానీ రాష్ట్రానికి న్యాయం కోసమే అవిశ్వాస తీర్మానం పెట్టాం.. అయినా ఫలితం లేకుండా పోయింది’’అని సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసిన అనంతరం శుక్రవారం అర్ధరాత్రి ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అహంకారంతో అవిశ్వాస తీర్మానం పెట్టారని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అనడం సరికాదని, అధికారం ఉందనే ధీమాతో ప్రధానే అహంకారంతో మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘‘నాకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు గొడవలున్నాయని ప్రధాని మాట్లాడారు. ఆయన అలా చెప్పడం కరెక్టు కాదు. ఏపీ, తెలంగాణ మధ్య గొడవలు లేకుండా నన్ను, కేసీఆర్ను కూర్చోబెట్టి మాట్లాడాలని చెప్పినా ప్రధాని పట్టించుకోలేదు. సమస్యను పరిష్కరించాలని చెబితే ఆ కోణంలో ఆలోచించకుండా రాజకీయ ఎదురుదాడి చేస్తున్నారు’’అని మండిపడ్డారు. ప్రధాని చులకనగా మాట్లాడారు.. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఎంతో ఆసక్తిగా, ఈసారైనా న్యాయం చేస్తారని చూసినా నిరాశే ఎదురైందని చంద్రబాబు అన్నారు. ‘‘ఏపీ అంటే ప్రధాని చులకనగా మాట్లాడారు. నేనేదో యూటర్న్ తీసుకున్నానని చెబుతున్నారు. ప్రధాని మోదీని ఎదుర్కోవడానికి, ఆయన్ని గద్దె దించడానికే అవిశ్వాసం పెట్టినామట... అహంకారంతో నో కాన్ఫడెన్స్ పెట్టామట.. అహంకారం నాకు కాదు. ప్రధానికే’’అని ఆయన పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరుతూ అన్ని ప్రయత్నాలు చేశామని, ఫలితం లేకపోవడంతో చివరి అస్త్రంగా అవిశ్వాస తీర్మానం పెట్టామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని చెప్పే ప్రధానమంత్రి నాలుగేళ్లుగా ఒక్కపని కూడా చేయకుండా అన్యాయం చేయలేదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం నిబంధనలు అడ్డువచ్చాయని ప్రధాని చెప్పడం సరికాదన్నారు. ప్రధాని స్థాయి వ్యక్తి చవకబారుగా మాట్లాడటం చూసి బాధవేసిందన్నారు. రాష్ట్రానికి న్యాయం చేస్తానని కనీసం 10 నిమిషాలు ఎందుకు మాట్లాడలేకపోయారని ప్రధానిని నిలదీశారు. ‘‘ఆ అహంభావం ఎందుకు? అరవై ఏళ్లు కష్టపడ్డాం. న్యాయం చేయమని అడిగాం. అందులో తప్పేముంది? రాష్ట్ర విభజన జరిగినా అందరం కష్టపడి రెండంకెల వృద్ధి రేటు సాధించాం. అయినప్పటికీ దక్షిణాదిలో అన్ని రాష్ట్రాలకంటే ఆదాయంలో వెనుకబడి ఉన్నాం.. ఆదుకోవాల్సిన బాధ్యత మీకు లేదా?’’అని సీఎం అన్నారు. న్యాయం చేయాలని 29 పర్యాయాలు ఢిల్లీ చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదన్నారు. ప్యాకేజీకి అంగీకరించింది అందుకే.. ప్రత్యేక హోదాకు ఇచ్చే అన్ని రకాల ప్రయోజనాలతో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే అంగీకరించామని చంద్రబాబు పేర్కొన్నారు. చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా అన్ని పార్టీలు ఒక్కటయ్యాయని, ఇది ఎంతో అరుదైన విషయమని అన్నారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదని, న్యాయం జరిగేవరకూ ఆందోళ నలు చేస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. శనివారం రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాను ఢిల్లీ వెళ్లి అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపి, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నేషనల్ మీడియాకు వివరిస్తానని చెప్పారు. -
కేంద్రంపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. ప్రజలకు కాపలాదారుగా ఉంటానంటూ నాడు అధికారంలోకి వచ్చిన మోదీ నేడు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు సహా అనేక అంశాల్లో అవినీతిపరులతో చేతులు కలిపి భాగస్వామిగా మారారని రాహుల్ ఆరోపించారు. మోదీ గిమ్మిక్కులకు, అబద్ధాలకు ప్రజలు బలవుతున్నారన్న రాహుల్.. పెద్దనోట్ల రద్దుతో ఏం సాధించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తనను బీజేపీ అవమానించినా, ‘పప్పు’ అని సంబోధించినా ఆ పార్టీపై, నాయకులపై తనకు ద్వేష భావం లేదనీ, ప్రేమను పంచడమే తన, కాంగ్రెస్ సిద్ధాంతం అని రాహుల్ చెప్పారు. ‘ఆరెస్సెస్, బీజేపీల అగ్రనేతలు కోపం, ద్వేషాలకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. ‘కాంగ్రెస్ నేత, భారతీయుడు, శివుడు, హిందువు’ అనే పదాలకు అర్థాన్ని తెలిపినందుకు వారికి ధన్యవాదాలు’ అని అన్నారు. గంటకు పైగానే ప్రసంగించిన రాహుల్.. అనంతరం మోదీ వద్దకు వెళ్లి ఆయనను కౌగిలించుకున్నారు. మోదీ ఒత్తిడి వల్లే ఆమె మాట తప్పారు ఫ్రాన్స్తో భారత్ చేసుకున్న రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై రాహుల్ మాట్లాడుతూ.. ‘మోదీ ఒత్తిడి తెస్తుండటం వల్లే నిర్మలా సీతారామన్ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ ఒప్పందంతో ప్రభుత్వం ఎవరికి సాయం చేస్తోంది? మోదీ, నిర్మల.. దయచేసి దేశానికి చెప్పండి’ అని రాహుల్ కోరారు. దీంతో సభను రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని నిర్మల పేర్కొనడంతో కొద్దిసేపు బీజేపీ, విపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. భారత్, ఫ్రాన్స్ల మధ్య రహస్య ఒప్పందం కారణంగా రాఫెల్ యుద్ధ విమానాల ధరలను బయటపెట్టలేమని ఇక్కడ ప్రభుత్వం అంటోందనీ, ఇదే విషయమై ఫ్రాన్స్ అధ్యక్షుడితో తాను మాట్లాడితే అలాంటి రహస్య ఒప్పందాలేవీ లేవని ఆయన తనకు చెప్పినట్లు రాహుల్ తెలిపారు. ‘కొంత మందితో మోదీకి ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలిసిందే. ప్రధాని తన ‘మార్కెటింగ్’ కోసం ఖర్చు చేస్తున్న డబ్బంతా ఎవరెవరు ఇస్తున్నారో కూడా అందరికీ తెలుసు. అలా ఇస్తున్న వారిలో ఓ వ్యక్తి చేతికే రాఫెల్ ఒప్పందం వెళ్లింది. వారికి ప్రస్తుతం రూ.35 వేల కోట్ల అప్పు ఉండగా ఈ ఒప్పందం వల్ల రూ. 45 వేల కోట్ల లాభం వస్తోంది’ అని రాహుల్ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఏఎల్ నుంచి తప్పించి ఈ ప్రాజెక్టును ప్రైవేటు పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడంలో ఆంతర్యమేంటని ఆయన ప్రశ్నించారు. మీ వాళ్లే ఓడిస్తారు.. ప్రతిపక్షాలవే కాకుండా బీజేపీలోని ఓ వర్గం నేతల ఆవేదనను కూడా తన ప్రసంగం ద్వారా తాను బయటకు తెస్తున్నాననీ, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి కోసం ప్రతిపక్షాలే కాకుండా సొంత పార్టీ లోని వారు కూడా ప్రయత్నిస్తారని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్కు అధికారం ఉన్నా లేకున్నా ఒకటేననీ, కానీ మోదీ, అమిత్ షా మాత్రం బీజే పీ అధికారంలో లేకపోతే జీర్ణిం చుకోలేరన్నారు. ‘మోదీ నవ్వుతుండటం నేను చూస్తున్నా. అయినా లోలోపల ఆయన గాభరా పడుతున్నారు. ఆయన నా కళ్లలోకి కాకుండా ఎక్కడెక్కడో చూస్తున్నారు’ అని అన్నారు. దీంతో బీజేపీ సభ్యులు తమ నిరసనను మరింత పెంచారు. సూటు వేసుకుంటేనే రుణమాఫీనా? 15–20 మంది బడా పారిశ్రామిక వేత్తలు తీసుకున్న రూ. 2.5 లక్షల కోట్ల అప్పులను గత నాలుగేళ్లలో మాఫీ చేసిన ప్రభుత్వం, రైతుల రుణాలను మాత్రం రద్దు చేయడం లేదని రాహుల్ విమర్శించారు. రైతులు సూటుబూటు వేసుకోకపోవడమే అందుకు కారణమా అని ప్రశ్నించారు. ప్రజల బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షల నగదును జమ చేస్తానని మోదీ ఇచ్చిన హామీ లాగానే తాజాగా పంటలకు మద్దతు ధర కూడా అబద్ధంగా మిగిలిపోతుందన్నారు. చరిత్రలో తొలిసారిగా, భారత్లో మహిళలకు రక్షణ లేదనే మాట ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోందన్నారు. అవాక్కైన మోదీ రాహుల్ తన ప్రసంగం అనంతరం మోదీ సీటు వద్దకు వెళ్లడంతో ఆయన కాస్త అయోమయానికి గురయ్యారు. లేచి నిలబడాల్సిందిగా రాహుల్ మోదీని కోరినా ఆయన అయోమయంలో ఉండటంతో స్పందించ లేదు. దీంతో మోదీ కూర్చొని ఉండగానే రాహుల్ ఆయనను కౌగిలించుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి మోదీ సహా సభలోని సభ్యులంతా ఆశ్చర్యపోయారు. అనంతరం తేరుకున్న మోదీ.. అప్పటికే రాహుల్ వెళ్లిపోతుండటంతో ఆయ నను వెనక్కు పిలిచి కరచాలనం చేసి భుజంపై తట్టి కొన్ని మాటలు చెప్పారు. తర్వాత తన సీటు వద్దకు వచ్చిన రాహుల్ ‘ఇదీ హిందుత్వం అంటే’ అని అన్నారు. కూర్చున్నాక పక్కన ఉన్న సహచరుడి వంక చూసి నవ్వుతూ కన్ను కూడా కొట్టారు. -
ఎటో వెళ్లిన అవిశ్వాసం.. స్వీయ అజెండాలకే పరిమితం
సాక్షి, అమరావతి: అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశమే ప్రధాన అంశంగా మారుతుందని రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో నిరీక్షించారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని మళ్లీ చట్టసభలోనే సరిదిద్దుతారని ఆశించారు. ఏపీకి జరిగిన నష్టాన్ని దేశం దృష్టికి తెచ్చి న్యాయం జరగాలని కోరుకున్న తెలుగు ప్రజలకు హోదాపై చర్చ జరగకుండా పక్కదారి పట్టడంతో చివరకు తీవ్ర నిరాశే మిగిలింది. ఆధిపత్యానికి వేదికగా... కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు వాటి ద్వారా ఏపీకి జీవన్మరణ సమస్య లాంటి హోదా అవసరాన్ని కనీసం ప్రస్తావనకు తేవడంలో ఘోరంగా విఫలం కావడంతో అసలు విషయం మరుగున పడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ తన ప్రసంగంలో హోదా అంశానికి ప్రాధాన్యం లేకుండా ఇతర జాతీయ అంశాలు, మోదీపై విమర్శలకే పరిమితమయ్యారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ చివరకు బీజేపీ, కాంగ్రెస్ల రాజకీయ విమర్శలు, ఆధిపత్యానికి వేదికగా మారింది. చివరకు చేతులెత్తేసి..: విభజన హామీలు అమలుకాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ భారీగా నష్టపోతున్న వైనంపై విపక్షాల మద్దతు కూడగట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటంలో టీడీపీ పూర్తిగా విఫలమైంది. ఏపీకి జరిగిన అన్యాయంపై లోక్సభలో తమ వాణి గట్టిగా వినిపిస్తామని, ప్రధాని మోదీని నిలదీస్తామని, కడిగేస్తామని హడావుడి చేసిన టీడీపీ అసలు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను చర్చకు వచ్చేలా చేయలేక చేతులెత్తేసింది. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాధాన్యంతోపాటు ఏపీ దుస్థితిని పార్లమెంటులో ఆవిష్కరించడంలో టీడీపీ విఫలమైంది. అవిశ్వాసంపై చర్చను ప్రారంభించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన ప్రసంగంలో 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదాను ఇవ్వొద్దని చెప్పలేదని, స్వయంగా ఆర్థిక సంఘం సభ్యులే ఈ విషయాన్ని చెప్పారని, దీనిపై కేంద్రం అసత్యాలు చెబుతోందని పేర్కొన్నారు. అయితే ఇదే అంశాలను మూడేళ్ల క్రితమే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అసెంబ్లీలోనే స్పష్టం చేయడం గమనార్హం. స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం.. అవిశ్వాసంపై రోజంతా చర్చించినా బీజేపీ, కాంగ్రెస్ ఆరోపణలు, ప్రత్యారోపణలు, జాతీయ రాజకీయాల చుట్టూనే నడిచింది. ప్రధానిపై రాహుల్ వ్యక్తిగత విమర్శలు చేయడం, మోదీ తన ప్రసంగంలో రాహుల్ని వెక్కిరించడం, కాంగ్రెస్ను తూర్పారబట్టడంపైనే ఎక్కువ సమయం గడిచిపోయింది. మోదీ తన ప్రసంగంలో రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబే యూటర్న్ తీసుకున్నారని, ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి బాబే అంగీకరించారని స్పష్టంగా తేల్చి చెప్పారు. ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన చర్చలో బీజేపీ, కాంగ్రెస్లు స్వీయ రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వగా మిగిలిన పార్టీలు తమ రాష్ట్ర వ్యవహారాలు, ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడాయి. ఏ పార్టీ కూడా చర్చలో విభజన హామీలు, ఏపీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించలేదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాలు, మోదీ ప్రభుత్వ వైఫల్యాలపైనే ఎక్కువగా మాట్లాడింది. రాహుల్గాంధీ ఏపీపై సానుభూతి ఉన్నట్లు ఒక్కమాట చెప్పి మిగిలినవన్నీ తనకు అవసరమైన రాజకీయ అంశాలనే ప్రస్తావించారు. ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గే కూడా జాతీయ అంశాలే మాట్లాడి చివర్లో కొసమెరుపుగా నాడు ప్రధాని హోదాలో మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని సరిపెట్టారు. తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీ, ఏఐఏడీఎంకే, ఎన్సీపీ తదితర పార్టీలేవీ అసలు టీడీపీని పట్టించుకోలేదు. చివరికి సీపీఎంను సైతం ఏపీ గురించి ప్రస్తావించేలా ఒత్తిడి చేయటంలో టీడీపీ విఫలమైంది. బృందాలను పంపి లేఖలు రాసినా... లోక్సభలో జరిగిన చర్చలో పాల్గొన్న వారు ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించకపోవడం, మద్దతు ఇవ్వకపోవటానికి టీడీపీ వైఫల్యమే కారణమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అవిశ్వాసంతో చంద్రబాబు ఏమీ సాధించలేకపోగా విభజన హామీలు సభలో కనీసం ప్రస్తావనకు వచ్చేలా విపక్షాల మద్దతు కూడగట్టలేకపోయారు. బీజేపీని వ్యతిరేకిస్తూ విపక్షాలు అవిశ్వాసానికి మద్దతు తెలిపినా ఇతర అంశాలను పట్టించుకోలేదు. దేశంలోని అన్ని పార్టీల మద్దతు కూడగట్టడానికి చంద్రబాబు టీడీపీ ఎంపీలతో బృందాలు ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాలకు పంపినా ఒనగూరింది శూన్యమే. స్వయంగా చంద్రబాబు పలు పార్టీలకు చెందిన నేతలతో మాట్లాడి లేఖలు రాసినా ఏమీ సాధించలేకపోయారు. చంద్రబాబు సొంత రాజకీయాల కోసమే ఇదంతా చేస్తున్నారనే అభిప్రాయంతోనే విపక్షాలు టీడీపీని పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ సభ్యులు లోక్సభలో ఆందోళన పేరుతో హడావుడి చేసినా రక్తి కట్టించలేకపోయారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు అవిశ్వాసం సమయంలో టీడీపీ ఎంపీల విన్యాసాలు, వైఫల్యాలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగింది. -
ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నారు.. ఇకనైనా మారండి
ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్సభలో వాడి, వేడి చర్చ జరిగింది. కొన్ని నాటకీయ పరిణామాలూ చోటు చేసుకున్నాయి. చర్చలో పాల్గొన్న విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని పలు ప్రజా సమస్యలపై తూర్పారపట్టాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. చౌకీదార్(కాపలాదారుడు)నని చెప్పుకునే ప్రధాని.. నిజానికి అవినీతి, అక్రమాల్లో భాగీదార్(భాగస్వామి) అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మూకదాడులు, మహిళలపై హింస, రాఫెల్ ఒప్పందంలో లొసుగులు సహ పలు అంశాలను లేవనెత్తారు. చివరగా, తనపై బీజేపీకి ఎంత కోపం ఉన్నా.. తనకు మాత్రం వారిపై వీసమెత్తు ద్వేషం కూడా లేదంటూ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం అకస్మాత్తుగా ప్రధాని మోదీ కూర్చున్న స్థానం వద్దకు వెళ్లి ఆయనను కౌగిలించుకున్నారు. ఆ తరువాత తన సీట్లో కూచుని సహచరుడిని చూస్తూ నవ్వుతూ రాహుల్ కన్నుగొట్టారు. విపక్ష సభ్యుల ప్రసంగాల అనంతరం చర్చకు మోదీ సమాధానమిచ్చారు. రాహుల్ సహా విపక్షాల విమర్శలకు తనదైన శైలిలో, దీటుగా బదులిచ్చారు. రాహుల్ కౌగిలింతను, కన్నుగీతనూ ప్రస్తావించారు. పనిలోపనిగా, అవిశ్వాస తీర్మానం పెట్టిన తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు ‘యూటర్న్’ పాలసీనీ సభకు తేటతెల్లం చేశారు. మోదీ ప్రసంగం అనంతరం జరిగిన ఓటింగ్లో ప్రభుత్వ పక్షం సునాయాసంగా గెలిచింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. న్యూఢిల్లీ: విపక్షాలపై పార్లమెంటు వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. అవిశ్వాసం తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ.. ప్రభుత్వంపై విమర్శలు చేసిన కాంగ్రెస్ సహా ఇతర విపక్షాల తీరును ఎండగట్టారు. అవిశ్వాసం పేరుతో నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్డీయేని గద్దె దించేందుకు అందరూ ఏకమవుతున్నారని.. వారెన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించబోరన్నారు. ఎవరినైనా గద్దె దించే బాధ్యత 125 కోట్ల ప్రజలదేనన్నారు. 30 ఏళ్ల తర్వాత సంపూర్ణ మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి దేశ ప్రజలనే అవమానించారన్నారు. తమవి ఓటుబ్యాంకు రాజకీయాలు కావన్న ప్రధాని.. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’ నినాదంతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్నారు. ప్రధాని పీఠంలో కూర్చోవాలని రాహుల్ అనుకుంటున్నారని.. దీనికి అంత తొందర అవసరం లేదని ఎద్దేవా చేశారు. విపక్షాలకు అవిశ్వాసం అవకాశం ఇకపై ఉండదని.. వీలుంటే 2024లో మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మీకు నా శుభాకాంక్షలు’ అని మోదీ పేర్కొన్నారు. డోక్లాం, రాఫెల్ డీల్లపై.. భారత్–చైనాల మధ్య విభేదాలకు కారణమైన డోక్లాం వివాదం నెలకొన్న విషయంలో రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరునూ సభా వేదిక ద్వారా మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఆయనకేమైనా సందేహాలుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. కానీ చైనా రాయబారితో సమావేశమయ్యారు. ఇది దేశాన్ని అవమానించడం కాదా?’ అని మోదీ ప్రశ్నించారు. చైనా రాయబారితో మాట్లాడి రాహుల్ దేశం పరువుతీశారన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలోనూ కాంగ్రెస్ వ్యవహరించిన తీరు దారుణమని ప్రధాని అన్నారు. దేశ భద్రతకు సంబంధించిన ఎలా వ్యవహరించాలో కూడా వారికి తెలియదన్నారు. ‘ప్రజలు మిమ్మల్ని విసుక్కుంటున్నారు. కనీసం ఇప్పటికైనా మారండి. రాఫెల్ ఒప్పందం రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం. రాజకీయ పార్టీల మధ్య కాదు.. రెండు బాధ్యతగల ప్రభుత్వాల మధ్య జరిగింది. అది కూడా పూర్తి పారదర్శకంగా. మీరు చేసిన వ్యాఖ్యలపై ప్రజల్లో అపోహలు తొలగించేందుకు ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ప్రకటనలు విడుదల చేయాల్సి వచ్చింది’ అని మోదీ మండిపడ్డారు. జవాన్లకూ అవమానమేనా? సర్జికల్ స్ట్రైక్స్ ఓ బూటకమని రాహుల్ వ్యాఖ్యానించడంపై ప్రధాని తీవ్రంగా మండిపడ్డారు. ‘దేశ సైన్యాధ్యక్షుడిపై ప్రయోగించే భాష విషయంలో.. సైనికుల త్యాగాలను గుర్తించే విషయంలోనూ అవమానకరంగా మాట్లాడతారా? సర్జికల్ దాడులు అబద్ధమంటారా? ప్రాణాలకు తెగించి సరిహద్దులు కాపాడుతు న్న వారిని గౌరవించడం నేర్చుకోండి’ అని మోదీ ఘాటుగా అన్నారు. ఓటుకు నోటిచ్చి.. అవిశ్వాస తీర్మానం ఇచ్చాక తమ వద్ద సరిపోయేంత సంఖ్య ఉందని కాంగ్రెస్ నేతలు పేర్కొనడాన్ని మోదీ ఎద్దేవా చేశారు. సంఖ్యాబలం లేదన్న విలేకరులపై మీకెవరు చెప్పారంటూ జవాబిచ్చిన అహంకారాన్ని చూడండన్నారు. 1999లోనూ అవిశ్వాస తీర్మానం అనంతరం అవసరమైన బలముందని తప్పుడు లెక్కలు చెప్పి కంగుతిన్నదెవరో ప్రజలు మరిచిపోలేదన్నారు. 1971లో చరణ్ సింగ్కు మద్దతిస్తామని చెప్పి తర్వాత చేయిచ్చారని మోదీ వ్యాఖ్యానించారు. దేవేగౌడ, గుజ్రాల్, ములాయం సింగ్ ఇలా ప్రముఖులందర్నీ కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొన్న కాంగ్రెస్.. ఓటుకు నోటు ఇచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందని గుర్తుచేశారు. సౌదాగర్ను మాత్రం కాను! ‘చౌకీదార్నని చెప్పుకున్న మోదీ.. అవినీతిలో భాగీదార్ (భాగస్వామి)గా మారిపోయార’న్న రాహుల్ ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. తను చౌకీదార్నేనని.. రాహుల్ చెప్పినట్లుగా తను భాగీదార్ని కూడానన్నారు. దేశానికి చౌకీదార్గా పనిచేయడంతోపాటు.. దేశం యువత సాధిస్తున్న విజయాల్లో, రైతుల జీవితాల్లో వెలుగులు నింపడంలో దేశాన్ని కొత్త దిశలో తీసుకెళ్లడంలో తను భాగీదార్నే అని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లాగా సౌదాగర్ (వ్యాపారి) ను మాత్రం కాదన్నారు. తప్పుడు వార్తనలు ప్రచారం చేసి జనాల్లో భయాందోళనలు సృష్టించడం కాంగ్రెస్కు అలవాటేనన్నారు. 2014లో ఆర్థికంగా అస్తవ్యస్తం ‘బీజేపీ అధికారంలోకి రాగానే.. ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. లెక్కలు చూస్తుంటే ఒకదాని తర్వాత మరొక ఆశ్చర్యం కలిగించే అంశాలు బయటకొచ్చాయి. 2008లో మొదలైన కాంగ్రెస్ లూటీ 2014వరకు నిర్విఘ్నంగా సాగింది’ అని మోదీ వెల్లడించారు. 60 ఏళ్ల భారతంలో దేశంలో మొండి బకాయిలు (ఎన్పీఏ) రూ.18లక్షల కోట్లుంటే.. 2008 నుంచి 2014 మధ్యలో ఈ మొత్తం రూ.52లక్షల కోట్లకు చేరిందనే విషయాన్ని మోదీ బయటపెట్టారు. తమ ప్రభుత్వం ఎన్పీఏలను సమీక్షించడంతోపాటు.. బ్యాంకింగ్ రంగానికి రూ. 2.10 లక్షల కోట్ల మూలధనాన్ని ఇచ్చిందన్నారు. దివాళా చట్టాన్ని, రుణ ఎగవేతదారుల చట్టాన్ని తీసుకొచ్చి అమలుచేస్తున్నామన్నారు. మా ప్రభుత్వం ఏం చేస్తుందంటే.. బీజేపీ అధికారంలోకి రాకముందు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని మోదీ విమర్శించారు. నాలుగేళ్లలోనే 18వేల గ్రామాల్లో విద్యుదీకరణ పూర్తయిందన్నారు. పేదలు బ్యాంకు అకౌంట్లు తెరుచుకుని రూ.80వేల కోట్లు దాచుకున్నారని తెలిపారు. ప్రజాసంక్షేమ పథకాల వల్ల దేశంలో పేదరికం తగ్గుతోందంటూ అంతర్జాతీయ సూచీలు వెల్లడిస్తున్నాయన్నారు. ఆయుష్మాన్ భారత్ తో బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చనున్నామన్నారు. భీమ్ యాప్ ద్వారా 41వేల కోట్ల లావాదేవీలు జరిగి.. ప్రజలు దేశవ్యాప్తంగా ఓ సానుకూల మార్పుకు సిద్ధమవుతున్నా.. విపక్షాలకు ప్రభుత్వంపై విశ్వాసం లేదన్నారు. దేశానికి, ప్రపంచానికి, దేశంలోని సుప్రీంకోర్టు, రిజర్వ్ బ్యాంకు, కాగ్, ఎన్నికల సంఘం వంటి ఉన్నత సంస్థలకు తమపై నమ్మకముందన్న మోదీ.. పిడికెడు మందికే తమపై విశ్వాసం లేక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. ప్రధాని ప్రసంగం పేలవం: రాహుల్ ప్రధాని ప్రసంగం పేలవంగా, బలహీనంగా ఉందని రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటు నుంచి రాహుల్ బయటకు వస్తున్నప్పుడు విలేకరులు ‘మోదీ ప్రసంగం ఎలా ఉంది?’ అని అడగ్గా రాహుల్ ‘బలహీనం’అని చెప్పారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా కూడా మోదీ ప్రసంగం ఎప్పటిలా వాగాడంబరంలా, నిజాలను దాచి ప్రజలను మభ్యపెట్టేలా ఉందన్నారు. కళ్లలోకి చూసే సాహసం చేయలేను ప్రధాని తన కళ్లలోకి చూడలేక పోతున్నారన్న రాహుల్ వ్యాఖ్యలపై మోదీ మాట్లా డుతూ.. ‘మీరు గొప్ప పేరున్న వారు (నామ్దార్). నేను పనివాడిని (కామ్దార్). మీ కళ్లలోకి కళ్లు పెట్టి చూసేంత సాహసం చేయలేను. సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, చంద్ర శేఖర్, మొరార్జీ దేశాయ్, జయప్రకాశ్ నారాయణ్, చరణ్ సింగ్, ఐకే గుజ్రాల్, ప్రణబ్ ముఖర్జీ, దేవెగౌడ తదితర నేతలంతా మీ కళ్లలో కళ్లు పెట్టి చూసేందుకు యత్నించారు. ఫలితం ఏంటో, వాళ్లకెంతటి అవమానాలు జరిగాయో అందరికీ తెలుసు. శరద్ పవార్ కూడా ఇదే యత్నం చేస్తే ఏం చేశారో తెలియదా? కళ్లలో కళ్లు పెట్టేవారిని ఎలా అవమానించారో.. ఒక కుటుం బం కోసం.. ఏం చేశారో దేశమంతటికీ తెలుసు’ అని అన్నారు. వీగిపోయిన అవిశ్వాసం లోక్సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం వీగిపోయింది. అధికార, ప్రతిపక్షాలు 12 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. అనంతరం సభను వాయిదా వేశారు. ఓటింగ్ సమయంలో టీఆర్ఎస్, బీజేడీ, శివసేన సభ్యులు సభలో లేరు. ఎవరేమన్నారంటే... విభజన చట్టం హామీల్ని నెరవేర్చలేదు: కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో కేంద్రం ఇచ్చిన హామీని బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని కాంగ్రెస్ లోక్సభ పక్షనేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. బీజేపీ బాబాసాహెబ్ అంబేడ్కర్ సిద్ధాంతాలు, విలువలకు వ్యతిరేకంగా ముందుకు పోతోందని ఆరోపించారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఏపీ పునర్విభజన చట్టం–2014లో చేర్చిన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను బీజేపీ ఇవ్వలేదు. అలాగే చట్టంలోని ఇతర కీలకమైన హామీల్ని నెరవేర్చలేదు. మోదీ ప్రభుత్వం విభజించు–పాలించు అనే విధానాన్ని అనుసరిస్తోంది. ఎప్పుడూ అదానీలు, అంబానీల గురించి మాట్లాడే మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కనీసం పట్టించుకోలేదు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు సంగతేమో కానీ రైతన్నల ఆత్మహత్యలు మాత్రం భారీగా పెరిగాయి. మీకు(మోదీకి) పెద్ద మనసు లేకపోయినా ప్రజాస్వామ్యంపై చాలా పెద్దపెద్ద మాటలు చెబుతారు. విదేశాల్లో మూలుగుతున్న రూ.80 లక్షల కోట్లను తెచ్చి ప్రతిఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు ఎప్పుడు డిపాజిట్ చేస్తారు? మోదీ అధికారం నుంచి దిగిపోతేనే దేశానికి మంచిరోజులు వస్తాయని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు’ అని అన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి పరాజయమే: టీఎంసీ నియోజకవర్గాల వారీగా ప్రతిపక్షాలన్నీ ఏకమై పోటీచేస్తే, 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత సౌగత రాయ్ చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాయ్ లోక్సభలో మాట్లాడుతూ.. ‘అధికార బీజేపీ ఇప్పటికే మిత్రపక్షాలు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రభుత్వంపై ఎన్డీయే కూటమి నుంచి బయటికెళ్లిన మిత్రపక్షం టీడీపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, మరో మిత్రపక్షం శివసేన ఈ చర్చల్ని ఏకంగా బహిష్కరించడమే ఇందుకు నిదర్శనం. ఇటీవల జరిగిన లోక్సభ ఉపఎన్నికల్లో, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ కమలనాథులు కచ్చితంగా చిత్తుగా ఓడిపోతారు. వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల కూటమి, బీజేపీ మధ్య ద్వైపాక్షిక పోటీ మాత్రమే ఉండనుంది’ అని విమర్శించారు. తమిళనాడుపై సవతితల్లి ప్రేమ: అన్నాడీఎంకే నిధుల కేటాయింపులో తమిళనాడుపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని చర్చ సందర్భంగా అన్నాడీఎంకే నేత పి.వేణుగోపాల్ ఆరోపించారు. ‘కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో తమిళనాడు వాటా గణనీయంగా ఉంటోంది. కానీ ఇందుకు ప్రతిఫలంగా మాకు చాలా తక్కువ నిధులు లభిస్తున్నాయి. జనాభా నియంత్రణతో పాటు ఆర్థిక పురోగతి సాధించిన తమిళనాడును కేంద్రం శిక్షిస్తోంది. నిధుల కేటాయింపు విషయంలో మోదీ ప్రభుత్వం తమిళనాడుపై సవతితల్లి ప్రేమను చూపుతోంది. దేశంలో నదీజలాల వివాదాలను పరిష్కరించకుండా కేంద్రం డ్యామ్ భద్రతా బిల్లును తీసుకురాకూడదు’ అని వేణుగోపాల్ అన్నారు. నల్లధనం డిపాజిట్లు 50% పెరిగాయ్: సీపీఎం లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమయిందని సీపీఎం నేత మొహమ్మద్ సలీం విమర్శించారు. ‘2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తెస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. కానీ ఒక్క 2017లోనే స్విస్ బ్యాంక్లలో భారతీయుల నల్లధనం 50 శాతం మేర పెరిగింది. అప్పుడు నల్లధనం తెస్తామన్న వాళ్లు ఇప్పుడేమో అదంతా తెల్లధనమేనని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. నల్లధనం జమయింది కానీ ఎంతమొత్తం వచ్చిందో మాత్రం ఇంకా తెలియదని ఆర్థికమంత్రి సెలవిస్తారు. గత 70 ఏళ్లలో జరగని దాన్ని నాలుగేళ్లలో చేసి చూపామని బీజేపీ నేతలు ఓసారి అంటారు. మరోవైపు గత 70 ఏళ్లలో దేశం సర్వనాశనమైపోయిందని వాళ్లే చెబుతారు. అంటే గత 70 ఏళ్లలో జరిగిన వినాశనాన్ని బీజేపీ నేతలు నాలుగేళ్లలోనే చేసి చూపారా?’ అని సలీం విమర్శనాస్త్రాలు సంధించారు. రైతులు, వ్యాపారులు నాశనమయ్యారు: ఎస్పీ బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలతో రైతులు, వ్యాపారులు, నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయారని సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆయన లోక్సభలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం దేశంలో సంతోషంగా ఉన్నవాళ్లు ఒక్కరూ లేరు. చివరికి బీజేపీ నేతలు కూడా సంతోషంగా లేరు. తమ రాజకీయ జీవితాలు నాశనమైపోయాయని వాళ్లంతా బాధపడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మీద సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు. దేశంలో రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు, ఎరువులు, నీళ్లు, రవాణా ప్రతిఒక్కటీ ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. కేంద్రం నిర్ణయాలతో నిరుద్యోగ యువతతో పాటు రైతులు, వ్యాపారులు నాశనమయ్యారు’ అని ములాయం పేర్కొన్నారు. మూకహత్యలపై మోదీ మౌనం: ఎన్సీపీ దేశంలో మైనారిటీలు, దళితుల్ని అల్లరిమూకలు కొట్టిచంపడంపై ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారని ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ విమర్శించారు. ‘దేశంలో మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. అమాయకుల్ని అల్లరిమూకలు కొట్టిచంపుతుంటే ప్రధాని మాత్రం మౌనం వహిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఆదాయపు పన్ను శాఖ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది’ అని విమర్శించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను వింటున్న సోనియా గాంధీ -
మూడు పార్టీలు : ఎన్ని‘కల’ అవిశ్వాసం..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పేరుతో శుక్రవారం లోక్ సభ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలతో చర్చను రక్తి కట్టించారు. అయితే, అవిశ్వాస తీర్మానంపై జరిగిన మొత్తం చర్చను లోతుగా విశ్లేషిస్తే... అంతిమంగా సాధించిందేమిటి? రాష్ట్రానికి ఒరిగిందేమిటి? అన్న ప్రశ్నకు మాత్రం ఎక్కడా సమాధానం దొరకదు. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు రాజకీయ కోణంలో తమదైన డ్రామాను కొనసాగించాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకూ(ఆఖరి పది నిమిషాల్లో ఓటింగ్ జరిగింది) రోజంతా సాగిన ఈ తతంగం వల్ల సాధించిందేంటో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. ప్రధాని మోదీ మాట్లాడుతూ చంద్రబాబే ప్రత్యేక హోదా వద్దని అన్నారని, ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారని లోక్సభలో పేర్కొనడంతో టీడీపీ ఇరకాటంలో పడింది. అవిశ్వాస తీర్మానం చర్చను ప్రారంభిస్తూ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ బీజేపీ సర్కారును విమర్శించారు. దానికి ప్రతిగా ప్రభుత్వం పక్షాన హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, చంద్రబాబు మాకు మిత్రుడేనని, ఇప్పటికీ, ఎప్పటికీ మిత్రుడే, విడిపోయే బంధం కాదన్నారు. ఆ మాటలకు టీడీపీ సభ్యులు ఖండించకపోగా మౌనం పాటించడం గమనార్హం, అలాగే, రాష్ట్రానికి ఏఏ రంగాలకు ఎన్నెన్ని నిధులు కేటాయించారో హోం మంత్రి చెప్పినప్పుడు కూడా టీడీపీ సభ్యులు మౌనంగా వింటూపోయారు. ఇదిలావుండగా, చంద్రబాబు మా స్నేహితుడే అని రాజ్ నాధ్ చెప్పగా బీజేపీకే చెందిన ఎంపీలు రాకేష్ సింగ్, కంభంపాటి హరిబాబులు మాత్రం, టీడీపీ కాంగ్రెస్ తో దోస్తీ కట్టిందని విమర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే చర్చలో టీడీపీ లేవనెత్తిన డిమాండ్లను ప్రస్తావిస్తూ మద్దతు పలికారు. టీడీపీని ఉద్దేశించి ఇటు కాంగ్రెస్ నేతలు, అటు రాజ్ నాధ్ సింగ్ మాట్లాడిన అంశాలపై సభలోనే ఉన్న ఆ పార్టీ సభ్యులు స్పందించకపోవడం గమనార్హం. చర్చను ప్రారంభించినప్పుడు టీడీపీ నేతలు బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించగా, సర్కారు తరఫున మంత్రి టీడీపీ మిత్రపక్షమనే చెప్పడం, పార్టీ తరఫున బీజేపీ ఎంపీలు మాత్రం టీడీపీపై ప్రతివిమర్శలు చేయడం, కాంగ్రెస్- టీడీపీలు కలిసిపోయాయంటూ ఎద్దేవా చేయడం వంటి మాటలతో ఆ మూడు పార్టీల నేతలు పరస్పరం ఒక పథకం ప్రకారం డ్రామాను నడిపించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే ఫైలుమీదే చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అవిశ్వాస చర్చ సందర్భంగా అసలు ఆ ప్రస్తావనే చేయలేదు. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైన సందర్భంలో టీఆర్ఎస్ ఎంపీ జోక్యం చేసుకుని రాష్ట్ర విభజన బిల్లును అప్రజాస్వామిక చర్యగా చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. గడిచిన ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలుగా ఎన్నికల్లో విజయం సాధించడం, ఆ తర్వాత అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఇరు పార్టీలు పరస్పరం భాగస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అందరికీ తెలిసిందే. నాలుగు సంవత్సరాల పాటు ఈ రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకుని సాగాయి. మరికొన్ని లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో రెండు చోట్లా ప్రభుత్వాల నుంచి కేంద్రంలో టీడీపీ, రాష్ట్రంలో బీజేపీ వైదొలగింది. ఈరోజు లోక్సభలో టీడీపీ లేవనెత్తిన అంశాలన్నీ గడిచిన నాలుగు సంవత్సరాలుగా అనేక రూపాల్లో చర్చ జరగడం, ప్రజాందోళనలు జరగడం, అసెంబ్లీలో చర్చకు రావడం, సమావేశాలు, నిరసన దీక్షలు ఎన్నో జరిగిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా వంటి అంశంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో అనేక ఆందోళనలు జరిగాయి. కీలకమైన ఆ అంశం జీవంతో ఉండటానికి జగన్ మోహన్ రెడ్డి మాత్రమే కారణమన్నది అందరూ అంగీకరించే విషయమే. విభజన చట్టంలో ఇచ్చిన హామీలతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇచ్చిన అనేక హామీలు నెరవేరడం లేదని గడిచిన నాలుగేళ్ల పాటు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పుడు అధికార టీడీపీ వాటిని తీవ్రంగా వ్యతిరేకించింది. పైపెచ్చు బీజేపీ నిర్ణయాలను అభినందిస్తూ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్మానం ఆమోదించారు. నాలుగేళ్ల పాటు అధికారంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉంటూ అత్యంత సులభంగా సాధించాల్సిన అంశాలపై విషయాలను కూడా టీడీపీ పట్టించుకోలేదు. పైగా ప్రత్యేక హోదా అవసరమే లేదని చెప్పిన చంద్రబాబే మళ్లీ యూ టర్న్ తీసుకోవడం వంటి చర్యలతో ప్రజల్లో తీవ్ర విమర్శలపాలయ్యారు కూడా. నాలుగేళ్లుగా ప్రజలను మోసపుచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి ఎత్తుగడలతో ముందుకొచ్చినప్పటికీ అందులోనైనా చిత్తశుద్ధితో వ్యవహరించిందా అంటే అదీ లేదు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక పార్టీల మద్దతు కూడగడుతామన్న టీడీపీ తీరా సమయానికి చేతులెత్తేసింది. ఏ రాజకీయ పార్టీ కూడా టీడీపీ అవిశ్వాసానికి అనుగుణంగా కాకుండా ఎవరి ప్రాధాన్యతల మేరకు వారన్నట్టు తమ వైఖరులను మాత్రమే ప్రస్తావించారే తప్ప టీడీపీ ప్రతిపాదించిన తీర్మానానికి మద్దతునివ్వలేకపోవడం ఆ పార్టీ వైఫల్యమే అవుతుంది. మరోవైపు నాలుగేళ్ల పాటు చెప్పిన మాటలకు, చేసిన పనులకు విరుద్ధంగా సభలో భిన్నంగా మాట్లాడి బొర్లా పడింది. పైపెచ్చు రాష్ట్రానికి అన్యాయం చేసిందని ప్రభుత్వం అవిశ్వాసం పెట్టిన టీడీపీ తీరా చర్చ సందర్భంగా ఆ విషయాన్ని మరిచి వ్యవహరించింది. పార్లమెంట్ సాధారణ సమావేశాల్లో వివిధ అంశాలపై చర్చ సందర్భంగా కోరినట్టుగా తాము లేవనెత్తిన అంశాలపై ప్రధానమంత్రి సమాధానం చెప్పాలని మాత్రమే టీడీపీ సభ్యులు గల్లా జయదేవ్, రామ్మోహన్ లు కోరిందే తప్ప ఏ రకంగా ఆ డిమాండ్లను సాధించవచ్చో, ఏ విధంగా సాధిస్తామో చెప్పడంలో విఫలమయ్యారన్న మాట సొంత పార్టీ నుంచే వినిపించింది. మొత్తంమీద అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంత ఆర్భాటం చేసిందో చివరకు ఏమీ సాధించలేక అంతే స్థాయిలో చతికిలపడిందన్న విమర్శను మూటగట్టుకుంది. మాజీ మంత్రి ఎందుకు మౌనం వహించారు లోక్సభలో అవిశ్వాస తీర్మానం చర్చలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు నోరు మూయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. నాలుగేళ్ల పాటు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు అశోక గజపతి రాజు ద్వారా చంద్రబాబు అనేక పనులు చేయించుకున్నారని, చర్చకు సమాధానం సందర్భంగా అవెక్కడ తెరమీదకు తెస్తారో అన్న అనుమానంతో ఆ మాజీ మంత్రిని మౌనంగా ఉండమని ఆదేశించినట్టు తెలిసింది. బాబు ఆదేశాలతో ఏం చేయలేక అశోకగజపతిరాజు చర్చ ఆసాంతం మౌనముద్ర దాల్చారు. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, కాకినాడ : లోక్సభలో అవిశ్వాస తీర్మాన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ట్వీటర్లో పేర్కొన్నారు. పార్లమెంట్లో జరిగిన పరిణామాలపై రేపు ఉదయం ప్రెస్మీట్లో స్పందిస్తానని వైఎస్ జగన్ చెప్పారు. కాకినాడ జేఎన్టీయూకు ఎదురుగా ఉన్న పాదయాత్ర శిబిరంలో ప్రెస్మీట్ ఉంటుందని వైఎస్సార్సీపీ మీడియా సెల్ తెలిపింది. Keenly following the happenings at the Loksabha #NoConfidenceMotion. I will react on this episode at tomorrow’s 8:30am press conference. — YS Jagan Mohan Reddy (@ysjagan) July 20, 2018 -
జయదేవ్ నోట జగన్ పలుకులు ..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాపై కేంద్రం మోసపూరిత వైఖరిని మూడేళ్ల కిందట అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండగడుతూ చెప్పిన అంశాలనే అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదాకు 14వ ఫైనాన్స్ కమిషన్ అభ్యంతరం చెప్పలేదని, ప్రత్యేక హోదాను రద్దు చేయాలని తాము సిఫార్సు చేయలేదని స్వయంగా 14వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవీ రెడ్డి పలు సందర్భాల్లో వెల్లడించిన విషయాన్ని అసెంబ్లీలో జగన్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను రద్దు చేయాలని తాము సూచించలేదని పేర్కొంటూ కమిషన్ సభ్యులు అభిజిత్ సేన్ లేఖ రాశారని, మరో సభ్యుడు గోవిందరావు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారని అసెంబ్లీలో జగన్ తేల్చిచెప్పారు. హోదాను మించి కేంద్రం ప్యాకేజ్ రూపంలో సాయంచేస్తుందని చెబుతూ ప్యాకేజ్ను సీఎం చంద్రబాబు స్వాగతించడాన్ని జగన్ తప్పుపట్టారు. అయితే లోక్సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా సరిగ్గా జగన్ ప్రస్తావించిన అంశాలనే గల్లా జయదేవ్ లోక్సభలో వల్లె వేశారు. -
‘ఎంపీ ప్రశ్నలు.. టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్ సభలో బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాసంపై టీడీపీని హరిబాబు ఉక్కిరిబిక్కిరి చేశారు. తన ప్రశ్నలతో టీడీపీ ఎంపీలను నిలదీశారు. కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు విభజన చట్టంలో చేర్చలేదని ఎంపీ ప్రశ్నించారు. అంతేకాక ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదని కంబంపాటి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల దగ్గరకెళ్లి టీడీపీ నాయకులు చర్చలు జరపడంపై ఆయన మండిపడ్డారు. మీ చర్యలతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తోందని తనదైన శైలిలో బీజేపీ ఎంపీ నిప్పులు చెరిగారు. ‘కాంగ్రెస్కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఎన్టీఆర్ జీవితమంతా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాడారు. మీరు నిస్సిగ్గుగా కాంగ్రెస్తో చేతులు కలిపారు. కాంగ్రెస్ నేతలతో టీడీపీ నేతలు ఫ్లోర్ కోఆర్డినేషన్ చేశారు. రాష్ట్రం విడిపోతే ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ నమ్మింది. రాష్ట్ర విభజన చేయాలని టీడీపీనే లేఖ ఇచ్చింది. హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు. ప్రత్యేక ప్యాకేజీకి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. నాబార్డు, హడ్కో ద్వారా సాయం చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. ఏపీ నుంచి వినతులను అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారు. మీకు హోదా అనే పేరు ముఖ్యమా లేక ఆర్థిక సాయం ముఖ్యమా? పోలవరం ప్రాజెక్ట్కు ఇప్పటి వరకు రూ. 6,374 కోట్లు ఇచ్చాం. పోలవరం ప్రాజెక్ట్ను కేంద్రమే పూర్తి చేస్తుంది. కడప స్టీల్ ప్లాంట్నుపై కమిటీ వ్యతిరేక రిపోర్టు ఇచ్చింది. అయినా స్టీల్ ప్లాంట్పై కేంద్రం టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది’. అని ఎంపీ కంభంపాటి హరిబాబు పేర్కొన్నారు. -
హరిబాబు ప్రశ్నలు.. టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి
-
‘దేశవ్యాప్తంగా కౌగిలింతల దినోత్సవం’
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం ఎంత వాడి వేడి చర్చ జరిగిందో అంత కంటే ఎక్కువ సరదా సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. అవి కూడా ఇంతవరకూ ఎన్నడూ ఏ లోక్సభ సమావేశంలో కనిపించని దృశ్యాలు. ఈ రోజు రాహుల్ గాంధీ చేసిన పని లోక్సభ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదనుకుంటున్నారు జనాలు. అవిశ్వాస తీర్మానంపై చాలా ఉద్రేకపూరితంగా మాట్లాడిన రాహుల్ గాంధీ చివరలో అనూహ్యంగా సరాసరి మోదీ వద్దకు వెళ్లి ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పక్కన ఉన్న వారిని చూస్తూ కన్నుగీటారు. దాంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా దీని గురించే చర్చ జరుగుతుంది. ఇప్పటికే నెటిజన్లు రాహుల్ చేసిన పనిని విమర్శిస్తుండగా తాజాగా వీరి కోవలోకి బాలీవుడ్ జనాలు కూడా వచ్చి చేరారు. రాహుల్ కౌగిలింత ఫలితంగా నేడు ‘దేశవ్యాప్తంగా కౌగిలింతల దినోత్సవం’ జరుపుకోవాలంటూ పిలుపునిచ్చారు బాలీవుడ్ నటీనటులు. ‘క్వీన్’ నటుడు రాజ్కుమార్ రావ్ తన ట్విటర్లో ఓపెనింగ్ షాట్ సన్నివేశాన్ని అనుకరిస్తూ ‘ఈ రోజు కౌగిలింతల దినోత్సవం’ అంటూ ప్రకటించారు. రాజ్ కుమార్ ట్వీట్కు స్పందిస్తూ సోనమ్ కపూర్ రెండు హగ్ ఎమోషన్స్ను రీ ట్వీట్ చేశారు. వీరిద్దరి ట్వీట్లను అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు. Today is official,”Hug day.” 🤗🤗 — Rajkummar Rao (@RajkummarRao) July 20, 2018 🤗 🤗 https://t.co/KLaVs8P8ma — Sonam K Ahuja (@sonamakapoor) July 20, 2018 బీజేపీ రాహుల్ చేసిన పనిని చిన్న పిల్లల చేష్టలా ఉందని విమర్శిస్తున్న నేపధ్యంలో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దడ్లాని మాత్రం రాహుల్కు మద్దతు తెలిపారు. విశాల్ దడ్లాని తన ట్విటర్లో ‘రాహుల్ చేసిన పనిని విమర్శించడం కాదు. ఆలింగనం కంటే ముందు అతని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మేమంతా దాని కోసం ఎదురు చూస్తోన్నాం’ అంటూ బీజేపీపై మండి పడ్డారు. What's childish about a hug? It was sorta sweet, actually. BJP should accept it with grace & perhaps send some love back, instead of being negative and churlish. Also, it would be more becoming of the govt. to answer each point Rahul made pre-hug. That's what we want to hear. https://t.co/Bl2gM8osPI — VISHAL DADLANI (@VishalDadlani) July 20, 2018 -
ప్రజల నమ్మకాన్ని టీడీపీ నాయకులు కోల్పోయారు
-
పురాణాలతో సరిపెడుతున్న మోదీ సర్కార్
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్పై లోక్సభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో మోదీ సర్కార్ వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టారు. బీజేపీ తరహాలో తాము నియంతృత్వ వైఖరితో వ్యవహరిస్తే దేశంలో ప్రజాస్వామ్యం మిగిలేది కాదని వ్యాఖ్యానించారు. తాము ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే పాలక పక్షం పురాణాలు చెబుతూ కాలక్షేపం చేసిందని దుయ్యబట్టారు. బీజేపీ భావజాలం అంబేడ్కర్ ఆలోచనలకు వ్యతిరేకమని, బీజేపీ..మోదీ విభజించి, పాలించు సూత్రాన్ని పాటిస్తున్నారని విమర్శించారు. ఏపీకి ఐదేళ్ల పాటు హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని, సభలో మన్మోహన్ ఇచ్చిన మాటను బీజేపీ నిలబెట్టుకోలేకపోయిందని ఖర్గే ఆరోపించారు. -
ఎంతైనా లేట్ లేటే అవుతుందీ రాహుల్!
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆద్యంతం ఆవేశంతోనే మాట్లాడారు. ఎక్కడా వేడి తగ్గకుండా రాఫెల్ విమానాల రాకెట్ దగ్గరి నుంచి దేశంలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, మహిళలపై జరుగుతున్న దాడుల వరకు మోదీని నిలదీశారు. హిందీ భాషలో అనర్గళంగా మాట్లాడడంలో అక్కడక్కడా మాటలు తడబడినా, తలకిందులైనా, సర్దుకొని ముందుకు సాగారు. చివరలో ‘నేనంటే మీకు ద్వేషం. మీ దృష్టిలో నేనొక పప్పూను. కానీ మీరంటే నాకు ద్వేషం లేదు. నేను కాంగ్రెస్ను, నేను అందరినీ ప్రేమిస్తాను’ అంటూ ప్రసంగాన్ని ముగించిన రాహుల్ సరాసరి మోదీ వద్దకు వెళ్లి ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. దీనికి ఆశ్చర్యచకితుడైన మోదీ, రాహుల్ గాంధీని వెనక్కి పిలిచి అభినందన పూర్వకంగా కరచాలనం చేశారు. ఈ సంఘటనతో అప్పటి వరకు వేడిగా ఉన్న సభా వాతావరణం ఒక్కసారిగా చల్లబడినట్లు అయింది. రాత్రి సభా చర్చకు సమాధానం ఇవ్వనున్న నరేంద్ర మోదీ రాహుల్ విమర్శలను ఎలా తిప్పి కొడతారో చూడాలి! ఈ రోజున తనకు చిక్కిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకొన్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని తానన్నట్లు విరుచుకుపడిన మోదీ, నిర్మలా సీతారామన్, ఇతర నాయకుల విమర్శలకు సరైన సమాధానం ఇవ్వడంలో మాత్రం చాలా తాత్సారం చేశారు. ‘నేను వరుసలో చివర నిల్చున్న వాడికి అండగా నిలబడతాను. సమాజంలో వెనకబడిన వాడికి, దోపిడీకి, దగాకు, అన్యాయానికి గురైన వాడి పక్కనుంటాను. వారి కులం, మతం, విశ్వాసాలతో నాకు సంబంధం లేదు. బాధ పడుతున్నవాడిని హత్తుకుంటాను, భయాన్ని, ద్వేషాన్ని పారద్రోలుతాను. ప్రాణం ఉన్న వాటన్నింటిని నేను ప్రేమిస్తాను. నేను కాంగ్రెస్ను’ అని ఈ నెల 17వ తేదీన రాహుల్ గాంధీ తనపై వచ్చిన విమర్శలకు బదులుగా ట్వీట్ చేశారు. ‘ది గుడ్ మేన్ ఈజ్ ది ఫ్రెండ్ ఆఫ్ ఆల్ లివింగ్ థింగ్స్’ అన్న జాతిపిత మహాత్మాగాంధీ సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ వ్యాఖ్యాలను ఎవరో సలహాదారులు రాహుల్కు రాసినట్లున్నారు. ఎవరు రాసినా సరే రాహుల్ సకాలంలో స్పందించలేకపోయారు. రాహుల్ గాంధీ, ముస్లిం మేధావులతో ఈ నెల 11వ తేదీన సమావేశమయ్యారు. ‘కాంగ్రెస్ ముస్లింల పార్టీ’ అన్నట్లు 12వ తేదీన ‘ఇంక్విలాబ్’ ఉర్దూ పత్రిక వార్తను ప్రచురించింది. దేశంలో జరిగే అల్లర్లకు ఇక నుంచి రాహుల్ గాంధీయే బాధ్యత వహించాలంటూ 13వ తేదీన సీతారామన్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ముస్లిం పురుషుల పక్షమా, ముస్లింల మహిళల పక్షమా? అంటూ 14వ తేదీ నుంచి వరుసగా మోదీ విమర్శిస్తూ వస్తున్నారు. 17వ తేదీన రాహుల్ తాపీగా స్పందించారు. ‘లేట్ బెటర్ ద్యాన్ నెవర్’ అనుకొని ఉండవచ్చేమో. కానీ రాజకీయాల్లో లేట్ చేస్తే ‘లేట్’గానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.