-
ఉత్తమ మహిళా రైతుగా రాష్ట్ర ప్రభుత్వం అవార్డ్
-
చిరుధాన్యాలతో అద్భుతం.. చూడచక్కని ఐటీసీ పోస్టల్ స్టాంప్
న్యూఢిల్లీ: ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుతున్న నేపథ్యంలో వ్యాపార దిగ్గజం ఐటీసీ, తపాలా శాఖ కలిసి మిల్లెట్స్పై ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించాయి. ఐటీసీ హెడ్ (అగ్రి బిజినెస్) ఎస్ శివకుమార్, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాస్ చౌదరి, తపాలా శాఖ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ మంజు కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా చిరుధాన్యాలపై అవగాహన పెంచే లక్ష్యంతో ఈ స్టాంపును తీర్చిదిద్దారు. మిల్లెట్లను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నట్లు ఎస్ శివకుమార్ తెలిపారు. ‘శ్రీ అన్న’ను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను కైలాశ్ చౌదరీ ఈ సందర్భంగా వివరించారు. -
రైతులకు లాభాలు తెచ్చే చిరుధాన్యాల సాగు ఎప్పుడూ డిమాండే
-
ఈ కేక్ చాలా హెల్తీ.. మిల్లెట్స్తో చేసుకోండి ఇలా
ఫింగర్ మిల్లెట్ కేక్ తయారీకి కావల్సినవి: ఫింగర్ మిల్లెట్ (రాగి) పౌడర్ – 80 గ్రాములు, గుడ్లు – 8 గడ్డపెరుగు – 800 గ్రాములు (నీళ్లు పోయకుండానే.. ఒక బాటిల్లో వేసి.. 1 నిమిషం పాటు బాగా గిలకొట్టాలి) పంచదార – అర కప్పు, నెయ్యి – కొద్దిగా ఫింగర్ మిల్లెట్ కేక్ తయారీ విధానమిలా ముందుగా ఒక బౌల్లో గిలకొట్టుకున్న పెరుగు, రాగి పౌడర్, పంచదార వేసుకుని హ్యాండ్ బ్లెండర్తో పంచదార కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో గుడ్లు కూడా వేసుకుని మరోసారి మొత్తం కలుపుకోవాలి. చివరిగా కేక్ బౌల్కి నెయ్యి పూసి.. అందులో ఈ మిశ్రమాన్ని వేసి.. ఓవెన్లో పెట్టుకుని బేక్ చేసుకోవాలి. అనంతరం నచ్చిన విధంగా కేక్ని గార్నిష్ చేసుకుని, ముక్కలు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. -
కొర్రలకు ‘మద్దతు’ ఇవ్వండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొర్రల సాగును ప్రోత్సహించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రైతులకు భరోసా కల్పించేలా కొర్రలను మద్దతు ధర పంటల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటివరకు చిరుధాన్యాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్నకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తోంది. అయితే అనంతపురం, కడప, సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఎక్కువగా కొర్రలను సాగు చేస్తున్నారు. మంచి దిగుబడులు రావడం, మార్కెట్లో డిమాండ్ ఉండటంతో రైతుకు లాభసాటిగా మారింది. మరోవైపు ప్రభుత్వం కూడా సాంప్రదాయ పంటల నుంచి చిరుధాన్యాల సాగువైపు రైతులను నడిపించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి పౌరసరఫరాల శాఖ కాన్ఫరెన్స్లో.. కొర్రలను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేసేలా వెసులుబాటు కల్పించాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో ఏపీ పౌరసరఫరాల సంస్థ సమగ్ర వివరాలతో కొర్రలకు మద్దతు ధర కోసం ప్రతిపాదనలు పంపే పనిలో నిమగ్నమైంది. పీడీఎస్ ద్వారా పంపిణీకి చర్యలు.. రాష్ట్రంలోని 1.47 కోట్ల రైస్ కార్డుదారులకు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. రెండు నెలల నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్రలోని 13 జిల్లాల్లో రాగులు, జొన్నలను పంపిణీ చేస్తున్నారు. కార్డుదారుల ఐచ్చికం మేరకు 2 కేజీల బియ్యం బదులు వీటిని అందిస్తుండగా.. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాయలసీమ, ఉత్తరాంధ్రలో రాగులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో పీడీఎస్లో జొన్నల కంటే రాగులకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే 8 వేల టన్నులకు పైగా రాగులను పంపిణీ చేశారు. తాజాగా కొర్రలను కూడా పీడీఎస్ జాబితాలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానికంగా రైతుల నుంచే కొనుగోలు చేసి తిరిగి ప్రజలకు సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. గ్రామాల్లో సర్వే.. మరోవైపు రాష్ట్రంలోని అన్ని మునిసిపాల్టీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని పంపిణీ చేస్తున్నారు. కార్డుకు కిలో చొప్పున రూ.16కు ప్రత్యేక ప్యాకింగ్లో దీనిని అందిస్తున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో గోధుమ పిండి వినియోగం తక్కువ ఉండటంతో.. కొత్తగా సర్వే చేపట్టి వచి్చన ఫీడ్బ్యాక్ ప్రకారం పంపిణీకి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే బియ్యం బదులుగా కూడా గోధుమ పిండిని తీసుకునే వెసులుబాటు కల్పించి.. ఇప్పుడిచ్చే ధర కంటే తక్కువకే సరఫరా చేసే యోచనలో పౌరసరఫరాల శాఖ ఉంది. పౌష్టికాహారం తప్పనిసరి ఆరోగ్య రక్షణ దృష్ట్యా ప్రతి ఒక్కరూ బలవర్థక ఆహారం తీసుకోవాల్సిన అవసరముంది. అందుకే పేదలకు పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే నిత్యావసరాల్లో చిరుధాన్యాలను అందిస్తున్నాం. ఇప్పటివరకు రాగులు, జొన్నలు ఇచ్చాం. ఇకపై కొర్రలను కూడా పంపిణీ చేసే ఆలోచన చేస్తున్నాం. దీని ద్వారా రైతులకు, వినియోగదారులకు లాభం కలుగుతుంది. ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని గ్రామీణ ప్రాంతాల్లోని కార్డుదారులు కూడా కోరుకుంటే అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలకు పెరిగిన డిమాండ్
-
ఆదివాసీల ప్రాణాలు కాపాడే , చిరు ధాన్యాల ఉద్యమం..
-
బలవర్ధకమైన ఆరిక అన్నం గురించి ఈ విషయాలు తెలుసా?
మొలిచిన తర్వాత 40–50 రోజులు వర్షం లేకపోయినా.. బతికి ఉండటమే కాదు చక్కని దిగుబడినిచ్చే అద్భుత ఆహార పంట.. ఆరిక అన్నం గురించి ఈ విషయాలు మీకు తెలుసా? ఆరిక అన్నం ఇంటిల్లపాదికీ అత్యంత బలవర్ధకమైన, ఔషధ గుణాలున్న ఆహారం. ఖరీఫ్లో మాత్రమే సాగయ్యే చిరుధాన్య పంట ఆరిక మాత్రమే. ఆరిక 160–170 రోజుల పంట. విత్తిన తర్వాత దాదాపు 6 నెలలకు పంట చేతికి వస్తుంది. ఆరికలు విత్తుకోవడానికి ఆరుద్ర కార్తె (జూన్ 22 నుంచి జూలై 6 వరకు) అత్యంత అనువైన కాలం. మొలిచిన తర్వాత 40–50 రోజులు వర్షం లేకపోయినా ఆరిక పంట నిలుస్తుంది. ఇతర పంటలు అంతగా నిలవ్వు. చిరుధాన్యాల్లో చిన్న గింజ పంటలు (స్మాల్ మిల్లెట్స్).. ఆరిక, కొర్ర, సామ, ఊద, అండుకొర్ర. ఆరిక మినహా మిగతా నాలుగు పంటలూ 90–100 రోజుల్లో పూర్తయ్యేవే. చిరుధాన్యాల సేంద్రియ సాగులో అనుభవజ్ఞుడు, వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త కె.విజయకుమార్ ‘సాక్షి సాగుబడి’కి వివరించారు. సేంద్రియ పద్ధతుల్లో ఆరికల సాగులో మెలకువలను ఆయన మాటల్లోనే ఇక్కడ పొందుపరుస్తున్నాం.. ఆరిక గింజలు ఒక్క వర్షం పడి తేమ తగలగానే మొలుస్తాయి. ఒక్కసారి మొలిస్తే చాలు. గొర్రెలు తిన్నా మళ్లీ పెరుగుతుంది ఆరికె మొక్క. మొలిచిన తర్వాత దీర్ఘకాలం వర్షం లేకపోయినా తట్టుకొని బతకటం ఆరిక ప్రత్యేకత. మళ్లీ చినుకులు పడగానే తిప్పుకుంటుంది. అందువల్ల సాధారణ వర్షపాతం కురిసే ప్రాంతాలతో పాటు అత్యల్ప వర్షపాతం కురిసే ప్రాంతాలకూ ఇది అత్యంత అనువైన పంట. నల్ల కంకి సమస్యే ఉండదు. దిబ్బ ఎరువు/గొర్రెల మంద ఆరిక పంటకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు అవసరం లేదు. పొలాన్ని దుక్కి చేసుకొని మాగిన పశువుల దిబ్బ ఎరువు ఎకరానికి 4–5 ట్రాక్టర్లు(12 టన్నులు) వెదజల్లాలి. లేదా గొర్రెలు, మేకలతో మందగట్టడం మంచిది. గొర్రెలు, మేకలు మూత్రం పోసిన చోట ఆరిక అద్భుతంగా దుబ్బు కడుతుంది. శ్రీవరి సాగులో మాదిరిగా 30–40 పిలకలు వస్తాయి. పొలాన్ని దుక్కి చేసి పెట్టుకొని.. మంచి వర్షం పడిన తర్వాత ఆరికెలను విత్తుకోవాలి. వెదజల్లటం కన్నా గొర్రుతో సాళ్లుగా విత్తుకోవడం మంచిది. గొర్రుతో విత్తితే విత్తనం సమాన లోతులో పడుతుంది. ఒకరోజు అటూ ఇటుగా మొలుస్తాయి. ఒకేసారి పంటంతా కోతకు వస్తుంది. 8 సాళ్లు ఆరికలు విత్తుకొని, 1 సాలు కందులు, మళ్లీ 8 సాళ్లు ఆరికలు, ఒక సాలు ఆముదాలు విత్తుకోవాలి. ఎకరానికి 3 కిలోల ఆరిక విత్తనం కావాలి. కంది విత్తనాలు ఎకరానికి ఒకటిన్నర కిలోలు కావాలి. కిలోన్నర కందుల్లో వంద గ్రాములు సీతమ్మ జొన్నలు, 50 గ్రాములు తెల్ల / చేను గోగులు కలిపి విత్తుకోవాలి. ఎకరానికి 3 కిలోల ఆముదం విత్తనాలు కావాలి. ఎకరానికి పావు కిలో నాటు అలసందలు /బొబ్బర్లు, అర కిలో అనుములు, వంద గ్రాముల చేను చిక్కుళ్లు ఆముదాలలో కలిపి చల్లుకోవాలి. ఆరికలు విత్తుకునేటప్పుడు కిలో విత్తనానికి 4 కిలోల గండ్ర ఇసుక కలిపి విత్తుకోవాలి. ఆరికల విత్తనాలు ఎంత సైజులో ఉంటాయో అదే సైజులో ఉండే ఇసుక కలిపి గొర్రుతో విత్తుకోవాలి. కందులు, ఆముదం తదితర విత్తనాలను అక్కిలి / అక్కిడి కట్టెలతో విత్తుకోవాలి. ఆరికలను మిశ్రమ సాగు చేసినప్పుడు పెద్దగా చీడపీడలేమీ రావు. వ్యయ ప్రయాసలకోర్చి కషాయాలు పిచికారీలు చేయాల్సిన అవసరం లేదు.ఐదారు రకాల పంటలు కలిపి సాగు చేయడం వల్ల చీడపీడలు నియంత్రణలో ఉంటాయి. రైతు కుటుంబానికి కవాల్సిన అన్ని రకాల పంటలూ చేతికి వస్తాయి. ఆహార భద్రత కలుగుతుంది. కంది, సీతమ్మ జొన్న తదితర పంట మొక్కల పిలకలు తుంచేకొద్దీ మళ్లీ చిగుర్లు వేస్తూ పెరుగుతాయి. పక్షి స్థావరాలుగా కూడా ఇవి ఉపయోగపడతాయి. చేను చిక్కుళ్లు వర్షానికే పెరుగుతాయి. అనుములు, అలసందలు 35–40 రోజుల నుంచే కాయలు కోతకు వస్తాయి. రైతు కుటుంబానికి ఆహార భద్రత కలుగుతుంది. ఆర్నెల్లకు మంచి ఆదాయం కూడా వస్తుంది. వీటిని ఒకసారి విత్తితే చాలు. తర్వాత పెద్దగా చేయాల్సిన పనులేమీ ఉండవు. ఆరుద్ర కార్తెలో విత్తుకుంటే డిసెంబర్ చివర్లోనో, జనవరి మొదట్లోనో కోత కోసుకోవచ్చు. కోతల తర్వాత ఆరిక దుబ్బు మళ్లీ చిగురిస్తుంది. అది పశువులకు మంచి బలమైన మేత. ఆరిక గడ్డి వరి గడ్డి కన్నా గట్టిది. త్వరగా కుళ్లిపోదు. అందువల్ల ఎయిర్ కూలర్లలో వాడుతుంటారు. ఎకరాకు రూ. 60 వేల నికరాదాయం వర్షాధారంగా మెట్ట భూముల్లో ఆరికలు సాగు చేస్తే ఎకరానికి ఎంత లేదన్నా 6–8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కందులు 3 క్వింటాళ్లు వస్తాయి. ఆముదాలు 5 క్వింటాళ్లు వస్తాయి. అలసందలు, అనుములు, జొన్నలు ఇంకా అదనం. ఆరికలు ప్రధాన పంటగా ఈ పద్ధతిలో సాగు చేస్తే ఎకరానికి రూ. 40 వేల నుంచి 60 వేల వరకు రైతుకు నికరాదాయం వస్తుంది. నీటి వసతి ఉండే రైతులు నాలుగు తడులు ఇస్తే దిగుబడి ఇంకా పెరుగుతుంది. ఆరు నెలల పంటైనందున ఆరికలను ఆరుద్ర కార్తెలోనే విత్తుకోవడం అనాదిగా రైతులు అనుసరిస్తున్న పద్ధతి. ఆరికలతోపాటు ఇతర సిరిధాన్యాలను కూడా ఈ కాలంలో విత్తుకోవచ్చు. పూర్తిగా ఎండిన తర్వాతే కోయాలి పక్వానికి రాక ముందే కోయకుండా జాగ్రత్తవహించిన రైతులకు నాణ్యమైన ఆరిక ధాన్యం దిగుబడి వస్తుంది. విత్తిన తర్వాత ఆరికలను 160–170 రోజులు పొలంలో ఉంచాల్సిందే. పూర్తిగా పంట ఎండి గింజ, కర్ర నలుపు రంగులోకి రావాలి. అటూ ఇటూ కాకుండా ఊదా రంగులో ఉన్నప్పుడు కొయ్యకూడదు. తొందరపడి ముందే కోస్తే తాలు గింజ ఎక్కువగా వస్తుంది. 8 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 5 క్వాంటాళ్లే వస్తుంది. పైగా అవి విత్తనంగా పనికి రావు. బియ్యం దిగుబడి కూడా తగ్గిపోతుంది. అందువల్ల వ్యాపారులు రైతులకు మంచి ధర ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. పక్వానికి వచ్చే వరకు ఆగి కోసి, కుప్పపై కొద్ది రోజులు ఉంచి నూర్పిడి చేయాలి. అప్పుడు మంచి తూకం వస్తుంది. అన్నం కూడా మంచి రుచి వస్తుంది. ♦ కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, బరిగెలు, గోల్డు బరిగలను సాగు చేయవచ్చు. వీటి పంటకాలం 10–80 రోజులు. ఎకరానికి 8–9 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి నేలల్లోనైనా పండుతాయి. ఎకరాకు 3 కిలోల విత్తనం చాలు. ♦ కొర్రలో జడ కొర్ర, ముద్ద కొర్ర రకాలుంటాయి. ముద్ద కొర్ర కంకిపై నూగు పీచు అధికంగా ఉంటుంది. కాబట్టి పిచుకలు తినడానికి అవకాశం ఉండదు. 85–95 రోజుల్లో కోతకు వస్తాయి. నల్లరేగడి, తువ్వ, ఎర్రచెక్క, ఇసుక నేలల్లో ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. చౌడు గరప నేలల్లో దిగుబడి తక్కువగా వస్తుంది. ఎకరానికి 3 కిలోల విత్తనం చాలు. ♦ ఊదలు ఎటువంటి నేలల్లోనైనా సాగు చేయవచ్చు. ఒకమాదిరి జిగట, ఉప్పు నేలల్లోనూ, నీరు నిలువ ఉన్న నేలల్లోనూ సాగు చేయవచ్చు. భూమిని తేలికపాటుగా మెత్తగా దున్ని పశువుల ఎరువు ఎకరానికి 5 టన్నులు వేసి కలియదున్నాలి. అది లేకపోతే గొర్రెలు, ఆవుల మందను పొలంలో మళ్లించాలి. కలుపు లేకుండా చూసుకోవాలి. ♦ రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. భూమి సారవంతంగా ఉంటే 8–10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వంద నుంచి 110 రోజుల పంటకాలం. 5 సార్లు నీరు పారించాల్సి ఉంటుంది. వర్షాకాలంలో నీరు కట్టాల్సిన అవసరం లేదు. ♦ అండుకొర్రను ఏడాది పొడవునా సాగు చేయవచ్చు. ఎటువంటి నేలల్లోనైనా పండుతుంది. నీరు నిల్వ ఉండే భూములు పనికిరావు. దీన్ని పల్చగా విత్తుకోవాలి. ఎకరానికి 2 కిలోల విత్తనం సరిపోతుంది. పలచగా ఉంటే ఎక్కువ పిలకలు వస్తాయి. రసాయనిక ఎరువులు వాడకూడదు. యూరియా వేస్తే బాగా పెరిగి పడిపోతుంది. 90–105 రోజుల్లో పంట వస్తుంది. ♦ పంట పక్వానికి రాక ముందే కోస్తే గింజలు నాసిరకంగా ఉంటాయి. బియ్యం సరిగ్గా ఉండవు. పిండి అవుతాయి. సిరిధాన్యాలు ఏవైనా సరే గింజ ముదరాలి. కర్రలు బాగా పండాలి. అప్పుడు కోస్తేనే మంచి నాణ్యత వస్తుంది, మంచి ధర పలుకుతుంది. సిరిధాన్యాలు సాగు చేసిన భూమి ఏగిలి మారి సారవంతమవుతుంది. ♦ విత్తనాలు వేసుకునే ముందు విధిగా మొలక పరీక్ష చేసుకోవాలి. కొబ్బరి చిప్పలోనో, ప్లాస్టిక్ గ్లాసులోనో అడుగున చిన్న చిల్లి పెట్టి, మట్టి నింపాలి. తగుమాత్రంగా నీరు పోసి 2 గంటల తర్వాత 10–20 విత్తనాలు వేసి తేలికగా మట్టి కప్పేయాలి. రకాన్ని బట్టి 3–7 రోజుల మధ్య మొలక వస్తుంది. మొలక తక్కువగా ఉంటే ఆ ధాన్యం విత్తనానికి పనికిరాదని గుర్తించాలి. ♦ సిరిధాన్యాల సాగుపై సలహాల కోసం విజయకుమార్ (98496 48498) ను ఆంధ్రప్రదేశ్ రైతులు ఉ. 6–9 గం. మధ్యలో, తెలంగాణ రైతులు సా. 6–9 గం. మధ్య సంప్రదించవచ్చు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రైతు శాస్త్రవేత్త కె.విజయకుమార్ -
తక్కువ నీటి వినియోగ పంటలపై దృష్టి
న్యూఢిల్లీ: ఎక్కువ లాభదాయకత, తక్కువ నీటి వినియోగం వంటి సౌలభ్యతలున్న చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల వైపు దృష్టిని మళ్లించేలా రైతులను ప్రోత్సహించాలని నాబార్డ్కు ఆరి్థకశాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు. బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) సమీక్షా సమావేశంలో ఆమె ఈ మేరకు కీలక ఉపన్యాసం చేశారు. గ్రామీణ ఆదాయాన్ని పెంపొందించడంతోపాటు స్థానికంగా సమర్ధత పెంపొందడానికి, చక్కటి ఫలితాలను అందించడానికి కృషి చేయాలని అగ్రి–ఫైనాన్స్ సంస్థకు సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘2023 అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం’’ను పురస్కరించుకుని ’శ్రీ అన్న’ ఉత్పత్తి, మార్కెటింగ్కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే తృణధాన్యాల కింద ఉన్న భూమి సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి రైతులను ప్రోత్సహించాలని కోరారు. ఇప్పటికే తృణ ధాన్యాలను పండిస్తున్న రైతుల ఆరి్థక ప్రయోజనాల పరిరక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. నేడు చింతన్ శిబిర్... కాగా, కేంద్ర బడ్జెట్, అలాగే ఫ్లాగ్íÙప్ పథకాల నుండి నిధులు సమకూర్చిన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడానికి, ఆయా అంశాల సమీక్షకు జూన్ 17న ’చింతన్ శిబిర్’ నిర్వహించినట్లు ఆరి్థక మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్లో తెలిపింది. -
తృణధాన్యాల ప్రాధాన్యంపై పాట..
న్యూయార్క్: తృణధాన్యాల ప్రాధాన్యతను చాటిచెప్పేందుకు ప్రత్యేకంగా రాసిన పాటను గ్రామీ అవార్డు విజేత, భారతీయ అమెరికన్ ఫల్గుణి షాతో కలిసి ప్రధాని మోదీ పాడారు. ఈ పాటను‘అబండేన్స్ ఇన్ మిల్లెట్స్’అనే పేరుతో ఈ నెల 16న ఫల్గుణి, ఆమె భర్త గాయకుడు గౌరవ్ షా కలిసి ప్రపంచవ్యాప్తంగా అన్ని స్ట్రీమింగ్ వేదికలపైనా ఇంగ్లిష్, హిందీ భాషల్లో విడుదల చేశారు. ముంబైలో జన్మించిన గాయని, పాటల రచయిత ఫల్గుణి షాను ఫాలు అనే పేరుతో ప్రసిద్ధురాలయ్యారు. పిల్లల కోసం ఈమె రూపొందించిన ‘ఎ కలర్ఫుల్ వరల్డ్’ఆల్బమ్కు 2022లో ప్రసిద్ధ గ్రామీ అవార్డు దక్కింది. గ్రామీ అవార్డు గెలుచుకున్న అనంతరం గత ఏడాది ప్రధాని మోదీని ఆమె ఢిల్లీలో కలిశారు. ఆ సమయంలో ప్రపంచ ఆకలిని తీర్చే సామర్థ్యమున్న, మంచి పోషక విలువలు కలిగిన తృణధాన్యాల గొప్పదనంపై ప్రజలకు అవగాహన కల్పించేలా ఒక పాట రాయాలని ప్రధాని మోదీ సూచించారని చెప్పారు. ఇందుకు సహకారం అందించేందుకు కూడా ప్రధాని మోదీ అంగీకరించారని వివరించారు. ఒక వైపు పాట కొనసాగుతుండగానే తృణధాన్యాల గొప్పదనంపై స్వయంగా రాసిన మాటలను ప్రధాని మోదీ వినిపిస్తారని ఫాలు పీటీఐకి తెలిపారు. భారత్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి 2023ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన విషయం తెలిసిందే. -
200 ఎకరాల్లో మిల్లెట్స్ మోడల్ ఫార్మ్ - ఒప్పందానికి గ్రీన్ సిగ్నెల్
హైదరాబాద్: యూపీఎల్ కంపెనీ గయానా ప్రభుత్వంతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. రిపబ్లిక్ ఆఫ్ గయానా సహకారంతో 200 ఎకరాల్లో ‘మిల్లెట్స్ మోడల్ ఫార్మ్’’ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై యూపీఎల్ గ్రూప్ సీఈవో జైష్రాఫ్, గయానా వ్యవసాయ శాఖ మంత్రి జుల్ఫికర్ ముస్తఫా ఏప్రిల్ 21న అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసినట్టు తెలిపింది. ఈ పార్క్లో మిల్లెట్స్ సాగుకు కావాల్సిన సాంకేతిక సహకారం, వ్యవసాయ ముడి సరుకులను యూపీఎల్ అందించనుంది. సాగుకు కావాల్సిన 200 ఎకరాల భూమి, కార్మికులను గయానా ప్రభుత్వం సమకూర్చనుంది. -
ఏపీలో మే 1 నుంచి చిరుధాన్యాల పంపిణీ
-
మహిళల ఘన విజయం: విత్తనం పరిరక్షణకు‘చిరు’యత్నం
‘ఇంటర్నేషనల్ సీడ్ డే’... ఇలాంటి ఓ రోజు ఉందా! ఉంది... అయితే ప్రచారమే పెద్దగా ఉండదు. ఇది గ్లామర్ మార్కెట్ వస్తువు కాకపోవడమే కారణం. ఈ రోజును రైతు మహిళలు నిర్వహించారు. ‘చిరు’సాగు చేసి కళ్లాల్లో రాశులు పోసిన చేతులవి. విత్తనాన్ని కాపాడాలనే ముందుచూపున్న చేతలవి. రాగి ముద్ద స్టార్ హోటల్ మెనూలో కనిపిస్తోంది. స్మార్ట్గా ఆర్డర్ చేస్తే అందమైన ప్యాక్తో ఇంటిముందు వాలుతోంది. అలాగే సజ్జ ఇడ్లీ, ఊదల దోసె, కొర్రల కర్డ్ మీల్, జొన్న రొట్టె, మిల్లెట్ చపాతీ, మిల్లెట్ పొంగలి... ఇలా బ్రేక్ ఫాస్ట్ సెంటర్లు కొత్త రూపుదిద్దుకున్నాయి. ఎక్కడో మారుమూల గ్రామాల్లో నీటి వసతి లేని నేలను నమ్ముకుని బతికే వాళ్ల ఆకలి తీర్చిన చిరుధాన్యాలు ఇప్పుడు బెంజ్కారులో బ్రేక్ఫాస్ట్కి వెళ్లే సంపన్నుల టేబుల్ మీదకు చేరాయి. ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలు నేడు సిరిధాన్యాలుగా మన దైనందిన జీవితంలో ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. వీటి వెనుక నిరుపేద మహిళల శ్రమ ఉంది. పాతికేళ్లుగా ఈ నిరుపేద మహిళలు చిరుధాన్యాలతోనే జీవించారు, చిరుధాన్యాల పరిరక్షణ కోసమే జీవించారు. సేంద్రియ సేద్యంతో చిరుధాన్యాల జీవాన్ని నిలిపారు. అంతర్జాతీయ విత్తన దినోత్సవం (ఏప్రిల్ 26) సందర్భంగా బుధవారం వీరంతా మెదక్ జిల్లా, జహీరాబాద్ మండలం, పస్తాపూర్లో తమ దగ్గరున్న పంటల విత్తనాలను సగర్వంగా ప్రదర్శించారు. హైబ్రీడ్ వంగడాల మాయలో పడకుండా మన విత్తనాలను మనం కాపాడుకోవాలని ఒట్టు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ బోర్డు సభ్యులు రుక్మిణీరావు సాక్షితో పంచుకున్న వివరాలివి. ఈ నేల... ఈ విత్తనం... మన సొంతం ‘‘చిరుధాన్యాల పట్ల అవగాహన కోసం ఈ ఏడాదిని ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’ నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది సీడ్ డే రోజున మేము చిరుధాన్యాల విత్తనాల పరిరక్షణ, ప్రదర్శన నిర్వహించాం. పస్తాపూర్ కేంద్రంగా జరిగిన ఈ కార్యక్రమంలో 26 పరిసర గ్రామాల నుంచి వందకు పైగా మహిళలు వారు పండించి, పరిరక్షించిన విత్తనాలను తీసుకువచ్చారు. చిరుధాన్యాలతోపాటు పప్పుధాన్యాలు, నూనె గింజల విత్తనాలు మొత్తం యాభైకి పైగా పంటల విత్తనాలకు ఈ ప్రదర్శన వేదికైంది. ఇవన్నీ సేంద్రియ సేద్యంలో పండించినవే. ఆహారం –ఆకలి! ఆహారం మన ఆకలి తీర్చాలి, దేహానికి శక్తినివ్వాలి. ‘వరి అన్నం తిని పొలానికి వెళ్తే పని మొదలు పెట్టిన గంట సేపటికే మళ్లీ ఆకలవుతుంది. రొట్టె తిని వెళ్తే ఎక్కువ సేపు పని చేసుకోగలుగుతున్నాం. అందుకే మేము కొర్రలు, జొన్నలు తింటున్నాం’ అని ఈ మహిళలు చెప్పిన మాటలను తోసిపుచ్చలేదు సైంటిస్టులు. వారి అనుభవం నుంచి పరిశోధన మొదలు పెట్టారు. అందుకే మిల్లెట్స్లో దాగి ఉన్న శక్తిని ప్రపంచ వేదికల మీద ప్రదర్శించగలిగారు. అలాగే ఈ మహిళలు విదేశాల్లో రైతు సదస్సులకు హాజరై తమ అనుభవాలను వారితో పంచుకున్నారు. భూగోళం ఎదుర్కొంటున్న మరో విపత్తు క్లైమేట్ చేంజ్. ఈ పంటలైతే వాతావరణ ఒడిదొడుకులను ఎదుర్కుని పంటనిస్తాయి. పదిహేను రోజులు నీరు అందకపోయినప్పటికీ జీవాన్ని నిలుపుకుని ఉంటాయి. చిరుధాన్యాలకు గాను మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటి మీద హక్కులను కార్పొరేట్ సంస్థలు తన్నుకుపోకుండా చూసుకోవాలి. అవసరమైతే ఉద్యమించాలి. ఇదే మనం డీడీఎస్ స్థాపకులు మిల్లెట్ మ్యాన్ పీవీ సతీశ్గారికి ఇచ్చే నివాళి’’ అన్నారు రుక్మిణీరావు. చిరుధాన్యాలను పండించడంలో ముందడుగు వేసేశాం. ఇక మన ముందున్న బాధ్యత ఈ విత్తనాలను కాపాడుకోవడం. ఈ విత్తనాల మీద పూర్తి హక్కులు ఈ పేద రైతు మహిళలవే. – రుక్మిణీరావు, బోర్డు సభ్యులు, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ – వాకా మంజులారెడ్డి -
మే నుంచి చిరుధాన్యాల పంపిణీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం కార్డుదారులకు పూర్తిస్థాయిలో నిత్యావసరాలను అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ఆయా పంట ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2023ను మిల్లెట్ ఇయర్గా ప్రకటించిన నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి రాయలసీమ జిల్లాల్లో చిరుధాన్యాల (జొన్నలు, రాగులు) పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి జొన్న ఉత్పత్తులను సేకరించగా.. కర్ణాటక ప్రభుత్వం నుంచి ఎఫ్సీఐ ద్వారా రాగులు కొనుగోలు చేయనుంది. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచేలా.. పేదలకు పీడీఎస్ కింద పౌష్టికాహార ఉత్పత్తులను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో ఖరీఫ్ నుంచి చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా రైతులు మిల్లెట్లు పండించేలా అవగాహన కల్పించనున్నారు. చిరుధాన్యాల ఉత్పత్తులను స్థానికంగానే రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేసి పీడీఎస్లో పంపిణీ చేయనున్నారు. ఫలితంగా రైతులకు మార్కెట్లో పక్కా ధర భరోసా దక్కనుంది. వచ్చే ఖరీఫ్లో కందుల కొనుగోలు రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి సుమారు 4లక్షల టన్నుల వరకు కందుల దిగుబడి నమోదవుతోంది. ఈ క్రమంలోనే పీడీఎస్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఖరీఫ్లో నేరుగా రైతుల నుంచి కందులు సేకరించేలా పౌరసరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 1.45 కోట్ల రైస్ కార్డులు ఉండగా.. ఇందులో ప్రతి నెలా సగటున 5,500 టన్నుల కందిపప్పు అవసరం అవుతున్నది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో కందిపప్పు సాధారణ రకం రూ.120–రూ.125, ఫైన్ వెరైటీ రూ.130 వరకు పలుకుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం సబ్సిడీపై కిలో కందిపప్పును రూ.67కే అందిస్తోంది. ఫలితంగా ఏప్రిల్లో ఏకంగా 7,100 టన్నుల కందిపప్పును వినియోగదారులకు సరఫరా చేసింది. బియ్యం బదులు గోధుమ పిండి కేంద్ర ప్రభుత్వం పీడీఎస్ కింద నెలకు 1,800 టన్నులు మాత్రమే గోధుమ ఉత్పత్తులను రాష్ట్రానికి కేటాయిస్తుండగా.. వాటిని తొలి ప్రాధాన్యత కింద వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పంపిణీ చేస్తున్నారు. కిలో రూ.16 చొప్పున కార్డుకు గరిష్టంగా రెండు కిలోలు సరఫరా చేస్తున్నారు. అయితే గోధుమను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు వినియోగదారుల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలను సేకరించనున్నారు. ఇక్కడ ప్రతినెలా ఇచ్చే రేషన్లో కేజీ బియ్యం బదులు ఉచితంగా గోధుమ పిండి ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. స్థానిక అవసరాలకు అనుగుణంగా.. రాష్ట్రంలో ప్రజా పంపిణీకి అవసరమైన నిత్యావసరాల ఉత్పత్తులను స్థానికంగా రైతుల నుంచి కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఫలితంగా రైతులకు మద్దతు ధర భరోసా దక్కడంతో పాటు.. కేంద్ర ప్రభుత్వం సరుకు ఇచ్చే వరకు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. – హెచ్.అరుణ్కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
చిరుధాన్యాల సాగుకు ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం
-
జై శ్రీ అన్నా
గతంతో పోల్చితే చిరుధాన్యాల పెద్ద ఉపయోగాల గురించి పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విస్తృత అవగాహన పెరిగింది. దీనికి సాక్ష్యంగా నిలిచే వీడియోను ప్రధానమంత్రి నరేంద్రమోదీ షేర్ చేశారు. ‘వైబ్రెంట్ విలేజెస్’ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒక గ్రామంలోకి వెళ్లారు. ఆ గ్రామంలోని ఒక మహిళ మంత్రిగారికి చిరుధాన్యాలతో చేసిన సంప్రదాయ వంటల రుచి చూపించడమే కాదు... జొన్నె రొట్టె నుంచి రాగి లడ్డు వరకు చిరుధాన్యాలు చేసే మంచి గురించి మంచిగా మాట్లాడింది. ప్రధాని ప్రశంస అందుకొంది. ‘ప్రతి పల్లెలో ఇలాంటి దృశ్యం కనిపించాలి’... ‘క్షేత్రస్థాయి నుంచి మొదలైన స్పృహ, చైతన్యం వేగంగా విస్తరిస్తుంది’... ‘కనుల విందు చేసే వీడియో’... ఇలాంటి కామెంట్స్ కనిపించాయి. -
‘చిరు’ధాన్యాల సాగుకు పెద్ద ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఈ ఆర్థిక ఏడాది(2023–24) 1,66,736 హెక్టార్లలో చిరుధాన్యాలు పండించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థి క ఏడాదితో పోల్చితే ఇది 39,365 హెక్టార్లు అధికం. అలాగే గత ఆర్థిక ఏడాది 3.22 లక్షల మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలు ఉత్పత్తి చేయగా.. ఈసారి 4.11 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సాగు విస్తీర్ణం, వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు ప్రజలు ఆహారంగా తీసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్రెడ్డి ఆదేశాలిచ్చారు. జిల్లాల వారీగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం లక్ష్యాలను నిర్ధారించారు. అందుకు అనుగుణంగా రైతులు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని సీఎస్ ఆదేశించారు. వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద.. వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలో 160 చిరుధాన్యాల ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పే వారికి తగిన విధంగా ప్రోత్సాహకాలను అందించాలన్నారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చిరుధాన్యాల స్టాల్స్ ఏర్పాటు చేసి ఆయా ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఆదేశించారు. మహిళా మార్టుల్లోనూ వీటిని విక్రయించాలని సూచించారు. చిరుధాన్యాలను ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కనీస మద్దతు ధరను కూడా ప్రభుత్వం ప్రకటించింది. అనేక జబ్బులకు చిరుధాన్యాలతో చెక్ జొన్నలు, సజ్జలు, రాగులు తదితరాల్లో పిండి పదార్థాలు ఎక్కువ. ఇవి దైనందిన అవసరాలకు సరిపడా 70 నుంచి 80 శాతం శక్తిని అందిస్తాయి. నిత్యం వీటిని ఆహారంగా వినియోగిస్తే గుండె జబ్బులు, షుగర్, బీపీ తదితర జబ్బులు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగుల్లో ఖనిజాలు ముఖ్యంగా కాల్షియం అధికంగా ఉండటంతో.. మూత్ర రోగాలను అరికట్టడంతో పాటు దేహపుష్టిని కలుగజేస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం మనం తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలను వినియోగించాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. -
100 మంది మహిళలతో మిల్లెట్ ఔట్లెట్లు
సాక్షి, హైదరాబాద్: మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా వారిని వ్యాపారవేత్తలుగా మలిచేందుకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని టీఎస్ ఆగ్రోస్ చర్య లు చేపట్టింది. మార్కెట్లో డిమాండ్గల చిరుధాన్యా ల ఉత్పత్తుల వ్యాపారంలో మహిళలను భాగస్వాములను చేయాలని, స్టార్టప్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వారితో రాష్ట్రవ్యాప్తంగా చిరుధాన్యాలు, వాటి ఉత్పత్తులను విక్ర యించేందుకు ఔట్లెట్స్ ఏర్పాటు చేయించనుంది. ఈ దిశగా కసరత్తులో భాగంగా గురువారం హైద రాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పలు జిల్లాల నుంచి వంద మందికిపైగా ఔత్సాహిక మహిళలు హాజరయ్యా రు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ విజయసింహారెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రా వు, ప్రత్యేక కమిషనర్ హనుమంతు, ఆగ్రోస్ ఎండీ రాములు, అక్షయపాత్ర, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రతినిధులు పాల్గొన్నారు. తొలి దశలో... మిల్లెట్ ఔట్లెట్లను తొలిదశలో జిల్లా కేంద్రాల్లో ఒకట్రెండు చొప్పున, జీహెచ్ఎంసీ పరిధిలో పది ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని టీఎస్ ఆగ్రోస్, అక్షయపాత్ర నిర్ణయించాయి. త్వరలోనే ఔత్సాహిక మహిళల్ని ఎంపిక చేసి వారికి ఔట్లెట్లు కేటాయించేలా కసరత్తు జరుగుతోంది. మిల్లెట్ ఔట్లెట్లలో అక్షయపాత్ర కీలకపాత్ర పోషించనుంది. వ్యాపారానికి అవసరమైన చిరుధాన్యాలను, వాటి ఉత్పత్తులను ఈ సంస్థనే సరఫరా చేయనుంది. దీంతోపాటు ప్రత్యేకంగా షాప్ అద్దెకు తీసుకోలేని వారి కోసం ప్రత్యేకంగా కంటెయినర్ షాప్లను కూడా అక్షయపాత్ర రూపొందించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే టీఎస్ ఆగ్రోస్, అక్షయపాత్ర మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. చిన్నారులు మొదలుకొని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధుల వరకు అవసరమైన చిరుధాన్యాల ఆహారాలను ఈ సంస్థ అందించనుంది. మొత్తం 68 రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచనుంది. ముఖ్యంగా చిన్నపిల్లల కోసం చిరుధాన్యాలతో నూడుల్స్, బిస్కెట్స్ వంటి వాటిని కూడా తయారు చేస్తోంది. ఔత్సాహిక మహిళలు పూచీకత్తు సమర్పించాల్సిన అవసరం లేకుండానే హెచ్డీఎఫ్సీ బ్యాంకు ద్వారా టీఎస్ ఆగ్రోస్ రుణాలు ఇప్పించనుంది. సదస్సులో పాల్గొన్న బ్యాంక్ ప్రతినిధులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఒక్కొక్కరికీ వ్యాపార విస్తరణ, పెట్టుబడిని బట్టి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రుణాలు అందించేందుకు బ్యాంకు ముందుకొచ్చింది. ఈ కార్యక్రమం అనంతరం ఔత్సాహిక మహిళలకు ఏర్పాటు చేసిన భోజనంలో మిల్లెట్ పులిహోర, మిల్లెట్ సాంబార్ ఫుడ్, మిల్లెట్ కర్డ్ ఫుడ్, మిల్లెట్ రోటీ, మిల్లెట్ ఐస్క్రీం వంటి వాటిని అందించారు. -
ప్రాంతాన్నిబట్టి ప్లాన్
‘అన్నం మానండి, సాయంత్రం చపాతీ తినండి,ఉదయం మిల్లెట్స్ బెటర్..’ మధుమేహంతో బాధపడే వారికి ఇలాంటి సూచనలు,సలహాలు సాధారణమే. అయితే వేర్వేరు ఆహారపు అలవాట్లు ఉన్న రోగులందరికీ ఒకే రకమైన డైట్ చార్ట్ సరైనదేనా?అంటే కానేకాదు అంటున్నారు వైద్య నిపుణులు. ప్రాంతాల వారీగా, జీవనశైలులకు అనుగుణంగా కస్టమైజ్డ్ (కావలసిన విధంగా) డైట్ చార్ట్ రూపొందించాల్సిందే అంటున్నారు. దీని కోసం దేశవ్యాప్తంగా విస్తృత అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. ఇందులో వేలాదిగా వైద్యులు, రోగులు భాగంపంచుకోనున్నారు. సాక్షి, హైదరాబాద్: ‘మన దేశపు ఆహారపు అలవాట్లలో ఉన్న విస్తృతమైన వ్యత్యాసాల కారణంగా, మధుమేహాన్ని నియంత్రించడానికి అందరికీ ఒకే రకంగా సరిపో యే డైట్ చార్ట్ లేదని తాజాగా పరిశోధకులు తేల్చారు. దీని ఫలితంగానే ట్రాన్స్కల్చరల్ డయాబెటిస్ న్యూట్రిషన్ అల్గోరిథం (టీడీఎన్ఏ) పుట్టింది..’అని చక్కెర వ్యాధి నిపుణులు డాక్టర్ ఒసామా హమ్డీ, పోషకాహార నిపుణులు డాక్టర్ ఇర్ఫాన్ షేక్ చెప్పారు. ఈ టీడీఎన్ఎపై అవగాహన కార్యక్రమాలకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీడీఎన్ఏ అనేది టైప్ 2 డయాబెటిస్, ప్రీడయాబెటిస్లకు గొప్ప ఉపశమనంగా మారుతుందని వీరు పేర్కొన్నారు. ప్రాంతాల వారీగా.. వివిధ ప్రాంతాల ప్రజల విభిన్న ఆహారపు అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలను అధ్యయనం చేసి ఆయా ప్రాంతాల్లోని రోగుల్లో మధుమేహ నియంత్రణకు అవసరమైన ఆహారపు అలవాట్లను (ఆహార ప్రణాళిక) సూచించేదే టీడీఎన్ఏ. ఈ ఆల్గోరిథమ్ను రూపొందించడానికి, భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ, పశ్చిమ, మధ్య, తూర్పు, ఈశాన్య జోన్లుగా విభజించారు. ఆయా ప్రాంతాల ఆహారపు అలవాట్లు పరిగణనలోకి తీసుకుని మధుమేహానికి పరిష్కారాలు అన్వేషించాలనేది ఈ విభజన ఉద్దేశం. ఉదాహరణకు.. కేరళలోని తక్కువ ఆదాయ వర్గాల్లో ఎక్కువగా కనిపించే మధుమేహానికి కారణం.. వీరు ఎక్కువ కార్బోహైడ్రేట్, తక్కువ ప్రోటీన్ తీసుకోవడమట. ఆ ప్రాంతంలో కాసావా (కర్ర పెండలం) ఎక్కువగా తీసుకుంటారు. ఈ కాసావా ప్రోటీన్ ద్వారా కాలేయంలో శరీరానికి తగ్గట్టుగా ఫిల్టర్ కావాలి. అయితే శరీరంలో ఉన్న తక్కువ స్థాయి ప్రోటీన్ల కారణంగా ఇది జరగడం లేదు. ఇది ప్యాంక్రియాస్ (క్లోమ గ్రంథి)లో కాల్షియం ఏర్పడటానికి, అంతిమంగా మధుమేహానికి దారి తీస్తోందని తేల్చారు. ఇలాంటి పలు అధ్యయన ఫలితాల నేపథ్యంలో ప్రాంతాల వారీ డైట్ చార్ట్ (టీడీఎన్ఏ) తయారీ ఆవశ్యకత ఏర్పడింది. అందరూ చేయాల్సిందిదే.. చక్కెర వ్యాధి పెరగడానికి ప్రధాన కారణాల్లో.. ప్రోటీన్లతో పోలిస్తే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్ అధిక వినియోగం వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మధుమేహులు టీడీఎన్ఏ పాటించడంతో పాటు ఆహారాన్ని నిదానంగా తీసుకోవడం, అర్ధరాత్రి అత్యధిక కేలరీలతో కూడిన ఆహార వినియోగాన్ని తగ్గించడం, ఎక్కువగా ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లను మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లాంటివి తప్పకుండా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహం విస్తృతి తెలంగాణలో ఎక్కువ ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నివేదిక ప్రకారం, గత మూడు దశాబ్దాలుగా దేశంలో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య 150% పెరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల విస్తృతి 16.6% కాగా, ముంబై (7.5%), చెన్నై (13.5%), బెంగళూరులో 11.7% మేర పెరుగుదల ఉంది. డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు గుండె జబ్బులు, దృష్టి లోపం, మూత్రపిండాల రుగ్మతలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. మధుమేహం నియంత్రణలో జీవనశైలిలో మార్పులదే కీలక పాత్ర. అలాగే ప్రత్యేకమైన పోషకాహార సప్లిమెంట్స్ కూడా చాలా అవసరం. – డాక్టర్ ఇర్ఫాన్ షేక్, మెడికల్ అఫైర్స్ హెడ్, అబాట్ న్యూట్రిషన్ మన దగ్గర రైస్ వినియోగమే సమస్య డయాబెటిస్ నియంత్రణలో డైట్ అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంత మాత్రాన అందరికీ చపాతి/పుల్కా తినేయమని చెప్పేయడం కుదరదు. తరతరాలుగా, ప్రాంతాల వారీగా అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు మన దగ్గర రైస్ బాగా తీసుకుంటారు. సాధారణ అన్నం లాగే కాకుండా బిర్యానీ, పులిహోర తదితరాల రూపంలో కూడా రైస్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. తద్వారా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతున్నాయి. దీనిని తగ్గించడం/నియంత్రించడానికే డైట్ ప్లాన్ను ఇస్తుంటాం. ఉదాహరణకు అన్నం మానలేమనేవారికి పరిమాణం తగ్గించమని, రాత్రి పడుకునే ముందు తినే అలవాటున్నవారికి 7 గంటల కల్లా ముగించమని చెబుతుంటా. ఉదయం పూటి ఎక్కువమంది ఇడ్లీ తీసుకుంటారు. కానీ మేం ఇడ్లీ, దోశ బదులు పెసరట్టు తినమంటాం. కాదు కూడదనే ఇడ్లీ ప్రియులకు.. ఇడ్లీ పిండిలో చిక్కుళ్లు, పెసలు, కేరట్ తురుము, రాజ్ మా గింజలు... వంటివి కలుపుకో మంటాం. తద్వారా కార్బ్స్ శాతాన్ని తగ్గించడం, ప్రోటీన్, ఫైబర్ని పెంచడానికి ప్రయతి్నస్తాం. – డా.పద్మనాభ వర్మ, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, ఎస్ఎల్జీ హాస్పిటల్స్, హైదరాబాద్ నియంత్రణే ముఖ్యం.. మధుమేహులు దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్న ఆహారపు అలవాట్లను మానుకుని ఆరోగ్యకరమైన ఆహారం వైపు మళ్లక తప్పదు. అయితే దీనికి కట్టుబడి ఉండే రేటు 38% కంటే తక్కువ. ఈ నేపథ్యంలో రోగుల జీవనశైలి, ఆహారపు అలవాట్ల చరిత్రకు అనుగుణంగా రూపొందించే ప్రత్యేకమైన ఆహార జాబితాయే టీడీఎన్ఏ. బరువు తగ్గడం, గ్లైసెమిక్ నియంత్రణ, నిర్వహణలో ఇది రోగికి తోడ్పడుతుంది – డాక్టర్ ఒసామా హమ్డీ, మెడికల్ డైరెక్టర్ జోస్లిన్ డయాబెటిస్ సెంటర్ -
ప్రత్యామ్నాయ సాగుకు బ్రాండ్ అంబాసిడర్
పీవీ సతీశ్ 1987లో రిలయన్స్ కప్ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేసిన దూరదర్శన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తన మిత్రులతో కలిసి ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామీణ, నిరక్షరాస్య, దళిత మహిళల చేత కెమెరా పట్టించి క్రికెట్ మ్యాచ్లకు ఏమాత్రం తీసిపోని అంతర్జాతీయ పురస్కారాలు పొందే విధంగా తీర్చిదిద్దడం మామూలు విషయం కాదు. చిరు ధాన్యాల గురించి 30 ఏళ్ల ముందు మాట్లాడినప్పుడు అందరూ వెర్రివాడని అనుకున్నా, పట్టుబట్టి వాటిని పండించడమే కాక, ఏకంగా చిరుధాన్యాలతో చేసిన వంటకాలను అందించే హోటల్ను ప్రారంభించిన ఆయన ధైర్యాన్ని మెచ్చు కోకుండా ఉండలేము. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రపంచం అంతా జరుపుకొంటున్న ఈ 2023 సంవ త్సరంలోనే సతీశ్ అసువులు బాయడం కాకతాళీయం. వ్యవసాయం, జీవ వైవిధ్యం, సంప్రదాయ పద్ధతులు, విత్తనాలు, మెట్ట వ్యవసాయం – ఇలా ఆయన స్పృశించని అంశమే కనపడదు. 25 ఏళ్ళ ముందు జీవవైవిధ్య జాతరలు మొదలు పెట్టి గ్రామాల్లో వాటి ఆవశ్యకతను అందరికీ తెలి సేలా చేస్తూ, వాటిలో గ్రామస్థుల భాగస్వామ్యం సాధించాడు. ప్రత్యామ్నాయ రేషన్ షాప్ అన్న కలను సాకారం చెయ్యడం కోసం గ్రామాలలో పడావుగా ఉన్న భూములలో జొన్నలను పండించి, గ్రామీణ రైతు కూలీలకు పని కల్పించి, పండిన జొన్నలను సేకరించి, తిరిగి గ్రామాలలోనే పేదవారికి తక్కువ ధరకు అందించడం అనే మహత్తరమైన కార్యక్రమాన్ని దిగ్వి జయంగా నిర్వహించాడు. జహీరాబాద్ ప్రాంతంలో రబీలో కేవలం మంచుకే పండే పంటలను ‘సత్యం’ పంటలుగా ప్రాచుర్యానికి తెచ్చి, వాటి పోషక విలువలను అందరికీ తెలియచేశాడు. అందరూ గడ్డి మొక్కలుగా తీసిపారేసే వాటిని ‘అన్కల్టివేటెడ్ ఫుడ్స్’ (సాగు చేయని ఆహారాలు)గా ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ‘ఎకనామిక్స్ ఆఫ్ ఎకొలాజికల్ అగ్రికల్చర్’ అనే ప్రాజెక్టును మొదలుపెట్టి ఎటువంటి రసాయన ఎరువులు, పురుగు మందులు లేని పంటలను పండించే రైతుల అనుభవాలను క్రమబద్ధంగా డాక్యుమెంట్ చెయ్యడం ద్వారా వారికి ఎటువంటి సహాయం అందాలో అక్షరబద్ధం చేశాడు. కమ్యూనిటీ మీడియా ట్రస్టును ఏర్పాటు చేసి గ్రామీణ, దళిత మహిళల చేత వీడియో డాక్యు మెంట్లను తీయించడమేకాక, అంతర్జాతీయ వేదికలలో ఈక్వేటర్ ప్రైజ్ సాధించే స్థాయిలో వారిని నిలబెట్టాడు. దేశంలో మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ను నెల కొల్పడం, కేవలం 10వ తరగతి చదివిన ఇద్దరు అమ్మాయి లతో దాన్ని నడపడం ఆషామాషీ కాదు. విత్తన బ్యాంక్ ద్వారా దాదాపు 75 గ్రామాలలో విత్తనాలను సకాలంలో అందే ఏర్పాటు చేసి మంచి పంటలు పండించుకునేలా చెయ్యడం చిన్న విషయం కాదు. బడి మానేసిన పిల్లల కోసం ‘పచ్చ సాల’ ఏర్పాటు చేసి, దానిలో పదవ తరగతి పూర్తి చేసేలోపు కనీసం ఆరు రకాల లైఫ్ స్కిల్స్లో ప్రావీణ్యం సంపాదించేలా వాళ్లకు తర్ఫీదు ఇప్పించి వారి కాళ్ళ మీద వాళ్ళు బతికే ధైర్యం కల్పించడంలో ఆయన పాత్ర కీలకం. పీజీఎస్ (పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం) వంటి ఒక ప్రత్యామ్నాయ సర్టిఫికేషన్ పద్ధ తిని మన దేశంలో తీసుకువచ్చి అమలు చేయడం, ఆర్గానిక్ ఫార్మింగ్ సొసైటీలో వ్యవస్థాపక పాత్ర అనేవి చిన్న విజ యాలు కాదు. జన్యుమార్పిడి పంటలపై అలుపెరగని పోరాటం చెయ్యడం ఆయన జీవితంలో ఒక ముఖ్య భూమిక పోషించింది. దీనికోసం ప్రత్యేకంగా సౌత్ ఎగైనెస్ట్ జెనెటిక్ ఇంజి నీరింగ్ అనే వేదికను ఏర్పాటు చేసి, చాలా దేశాలలోని స్వచ్ఛంద సంస్థలను ఒకే తాటిమీదకు తెచ్చి, అసత్య ప్రచారం చేస్తున్న కంపెనీల మాయాజాలాన్ని రుజువులతో సహా ఎండ గట్టి కొన్ని రకాలపై నిషేధం విధించే స్థాయి పోరాటం నెరిపాడు. మిల్లెట్స్ నెట్వర్క్ను మొదలుపెట్టి, దేశంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలలో చిరుధాన్యాల మీద చర్చా వేది కలు ఏర్పాటు చేసి వినియోగదారులకు చైతన్యం కలిగించే పనిని నెత్తికెత్తుకుని ప్రపంచం దృష్టిని మిల్లెట్స్ వైపు మరల్చారు.ఇన్ని వైవిధ్యభరితమైన పనులతో నిమిషం తీరిక లేని జీవితం గడిపిన సతీశ్ మన వ్యవసాయ రంగం గురించి కన్న కలలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే సాకారమవుతున్నాయి. ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులకే ఒక బ్రాండ్గా నిలిచారు సతీశ్. ఆయన ప్రస్థానంలో నాకూ భాగం కల్పించిన ఆ ప్రియ మిత్రుడికి అశ్రు నివాళి. సక్ఖరి కిరణ్ వ్యాసకర్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వికాస స్వచ్ఛంద సంస్థ -
మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్ ఇకలేరు..
హైదరాబాద్: మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్(77) తుదిశ్వాస విడిచారు. కొన్ని సంవత్సరాలుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న పీవీ సతీష్.. చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా, సేంద్రీయ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాలుగా కృషి చేసినందుకు గానూ ఈయనను మిల్లెట్ మ్యాన్గా పిలుస్తారు. అయితే, 1945 జూన్ 18న కర్ణాటకలో జన్మించిన పీవీ సతీష్.. ఉద్యోగరీత్యా హైదరాబాద్లోని దూరదర్శన్లో డైరెక్టర్గా పని చేశారు. అనంతరం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ స్థాపించారు. జహీరాబాద్ ప్రాంతంలో దళిత మహిళా సాధికారతకు పీవీ సతీశ్ కుమార్ విశేషంగా కృషి చేశారు. అలాగే, వాతావరణ మార్పుల నేపథ్యంలో రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులకు ప్రత్యామ్నాయంగా.. సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహన కల్పించారు. అంతేకాకుండా.. హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై తొలి మిల్లెట్స్ కేఫ్ ఏర్పాటుకు తన వంతు కృషి చేశారు. 30 సంవత్సరాల కిందట మొదటిసారిగా ప్రపంచవ్యాప్త చర్చలో.. చిరుధాన్యాలను ప్రవేశపెట్టడంలో సఫలీకృతమయ్యారు.సేంద్రీయ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాలుగా కృషి చేశారు. ప్రత్యేకించి చిన్న కమతాల్లో పెట్టుబడి లేకుండా.. చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం, వినియోగం పెంపు కోసం కృషి చేశారు. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చడంలో.. 2018 సంవత్సరాన్ని కేంద్రం జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వీరి కృషికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఇక, సతీష్ మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జహీరాబాద్లో జరుగనున్నాయి. -
మినరల్ వాటర్.. మిల్లెట్ భోజనం!
సాక్షి, హైదరాబాద్ : సభలు, సమావేశాలు, నిరసన ర్యాలీలు, ప్రముఖుల పర్యటనలు... భాగ్యనగరంలో దాదాపు నిత్యం ఎక్కడో ఒక చోట రోడ్లపై కనిపించే దృశ్యాలివి. దీనికితోడు నగరానికి ప్రముఖల రాకపోకల హడావుడి ఓవైపు.. ఏటా అట్టహాసంగా జరిగే గణేశ్ నిమజ్జనాలు, బోనాల వంటి పండగ సంబరాలు మరోవైపు... ఇలాంటి కార్యక్రమాలకు భారీ బందోబస్తు చేపట్టడం నగర పోలీసులకు కత్తిమీద సామే.. మరి అలాంటి సిబ్బంది ఆహార అవసరాలు తీర్చేందుకు ఇప్పటివరకు హెవీ, జంక్ ఫుడ్ అందిస్తున్న హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ తాజాగా తృణధాన్యాలతో చేసిన పౌష్టికాహారం అందిస్తోంది. దే శంలో మరే ఇతర పోలీసు విభాగం ఇప్పటివరకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు. నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దీన్ని అమలు చేస్తున్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న అధికారులకు మిల్లెట్స్ ఫుడ్తోపాటు మినరల్ వాటర్ కూడా అందిస్తున్నారు. నగరం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థకు ఆర్డర్ ఇవ్వడం ద్వారా ఈ మిల్లెట్ ఫుడ్ ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. ప్రస్తుతం ‘ప్లాన్డ్ బందోబస్తు’ల వరకు మాత్రమే అమలవుతున్న ఈ విధానాన్ని ‘సడన్ బందోబస్తు’లకూ వర్తింపజేయాలని ఆనంద్ యోచిస్తున్నారు. అనారోగ్య సమస్యలకు అనేక కారణాలు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, కమిషనరేట్లతో పోలిస్తే హైదరాబాద్ సిటీ పోలీసుల పనితీరు పూర్తి భిన్నంగా ఉంటుంది. వాళ్లు ఏటా కనిష్టంగా 100 నుంచి 150 రోజులు బందోబస్తు విధుల్లో ఉండాల్సి వస్తుంది. వేళాపాళా లేని ఈ విధులతో సమయానికి ఆహారం, నిద్ర ఉండకపోవడంతోపాటు ఇంకా అనేక కారణాల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా మంది బీపీ, షుగర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలతోపాటు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఫిట్ కాప్తో 12 వేల మంది స్క్రీనింగ్... ఈ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోందని, సిబ్బందిలో అకాల మరణాలు సైతం సంభవిస్తున్నాయని గుర్తించిన నగర కొత్వాల్ సీవీ ఆనంద్... ఈ పరిణామం వ్యవస్థ పనితీరుపై ప్రభావం చూపుతుండటంపై ఆందోళన చెందారు. ఈ పరిస్థితులను మార్చేందుకు హెల్పింగ్ హ్యాండ్ సంస్థ సహకారంతో ఫిట్కాప్ పేరుతో ప్రత్యేక యాప్ను రూపొందించారు. మహారాష్ట్రలోని పుణే పోలీసు విభాగం కోసం అందుబాటులో ఉన్న హెల్త్కేర్ సర్వీసెస్ ప్రొవైడర్ యాప్ స్ఫూర్తితోనే ఫిట్కాప్కు రూపమిచ్చారు. ఈ యాప్ ‘3 డీస్’గా పిలిచే డయాగ్నైస్, డెవలప్, డూ విధానంలో పనిచేస్తోంది. ఇప్పటికే 12 వేల మందికి స్క్రీనింగ్ చేసిన పోలీసు విభాగం అందులో అనేక మంది జీవనశైలికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించింది. వారంతా వెంటనే ఆహార అలవాట్లు మార్చుకోవాలని వైద్యులు సూచించడంతో ఈ మార్పును బందోబస్తు డ్యూటీల నుంచే అమలులోకి తీసుకురావాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ విధుల్లో ఉన్న వారికి ఏళ్లుగా బిర్యానీ ప్యాకెట్లు సరఫరా చేయడం ఆనవాయితీగా కొనసాగుతుండగా దీన్ని మారుస్తూ మిల్లెట్ భోజనం అందించడానికి శ్రీకారం చుట్టారు. మిల్లెట్ బిర్యానీ, మిల్లెట్ కిచిడీ, మిల్లెట్లతోపాటు బెల్లంతో రూపొందించిన స్వీట్లు, మిల్లెట్ కర్డ్ రైస్, మినరల్ వాటర్ను అందిస్తున్నారు. హఠాత్తుగా తలెత్తే వాటికి ఎలా..? సిటీ పోలీసులకు ప్రధానంగా రెండు రకాలైన బందోబస్తు డ్యూటీలు ఉంటాయి. ఏళ్లుగా నిర్వహిస్తూ వస్తున్న గణేష్ ఉత్సవాలు, బోనాలు, ఎన్నికలు తదితరాలు ప్లాన్, స్కీమ్ ఉంటాయి. దీంతో ఏ రోజు? ఎక్కడ? ఎంత మంది విధుల్లో ఉంటారనేది స్పష్టంగా తెలుస్తుంది. దీని ఆధారంగా ఆ స్వచ్ఛంద సంస్థకు ఆర్డర్ ఇచ్చి మిల్లెట్ ఫుడ్ తయారు చేయిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో హఠాత్తుగా బందోబస్తు విధులు వచ్చిపడతాయి. ఈ అన్ప్లాన్డ్ విధుల్లో ఉన్న వారికి ప్రస్తుతం మిల్లెట్ ఫుడ్ అందించలేకపోతున్నారు. అయితే వారికీ కచ్చితంగా ఇచ్చేందుకు మార్గాలను ఉన్నతాధికారులు అన్వేషిస్తున్నారు. పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు.. అధికారులు, సిబ్బంది ఎంత ఆరోగ్యంగా ఉంటే ప్రజలకు అంత మెరుగైన సేవలు అందించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఫిట్కాప్కు రూపమిచ్చాం. దీనికి కొనసాగింపుగానే మిల్లెట్ ఫుడ్ను పరిచయం చేశాం. సాధారణ భోజనాలకు అయ్యే ఖర్చుకు అదనంగా 30 నుంచి 40 శాతం దీనికి ఖర్చవుతుంది. దీనిపై సిబ్బంది నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. ఆహారం తీసుకోవడం ఆలస్యమైనా ఏ ఇబ్బందీ లేదని చెబుతున్నారు. అలాగే భోజనం చేసేప్పుడే కాకుండా ఎప్పుడైనా అధికారులు, సిబ్బందికి మినరల్ వాటర్ అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. – ‘సాక్షి’తో సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ -
ఆహార సంక్షోభానికి ‘చిరు’ పరిష్కారం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆహార సంక్షోభానికి చిరుధాన్యాలు పరిష్కారం కాగలవని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అంతేగాక తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే రోగాలను కూడా ఇవి దూరం చేస్తాయన్నారు. ‘‘ప్రస్తుతం భారత్లో చిరుధాన్యాల వాడకం 5 నుంచి 6 శాతమే ఉంది. దీన్ని ఇతోధికంగా పెంచి, ఆహారంలో చిరుధాన్యాలు తప్పనిసరిగా మారేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలి’’ అని పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ ప్రపంచ చిరుధాన్యాల (శ్రీ అన్న) సదస్సును ఆయన ప్రారంభించారు. అందులో పాల్గొంటున్న దేశ, విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచం నేడు రెండు రకాల ఆహార సవాళ్లను ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘దక్షిణార్ధ గోళంలోని దేశాల్లోనేమో పేదలకు తినడానికి తిండి దొరకని దుస్థితి! ఉత్తరార్ధ గోళంలోనేమో తప్పుడు ఆహారపుటలవాట్ల వల్ల రోగాలు కొనితెచ్చుకుంటున్న పరిస్థితి. ఒకచోట ఆహార సంక్షోభం. మరోచోట అలవాట్ల సమస్య. సాగులో రసాయనాల మితిమీరిన వాడకంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. వీటన్నింటికీ చిరుధాన్యాలు చక్కని పరిష్కారం’’ అని వివరించారు. పలు రాష్ట్రాలు ప్రజా పంపిణీ పథకంలో చిరుధాన్యాలను కూడా చేర్చాయని చెప్పారు. మిగతా రాష్ట్రాలూ దీన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో కూడా చిరుధాన్యాలకు స్థానం కల్పించాలన్నారు. అలాగే పొలం నుంచి మార్కెట్ దాకా, ఒక దేశం నుంచి మరో దేశం దాకా చిరుధాన్యాలకు పటిష్టమైన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. చిన్న రైతులకు భాగ్యసిరి చిరుధాన్యాలు గ్రామాలు, పేదలతో ముడిపడి ఉన్నాయని మోదీ అన్నారు. చిన్న, సన్నకారు రైతులకు అవి సిరులు కురిపించగలవని అభిప్రాయపడ్డారు. ‘‘దాదాపు 2.5 కోట్ల మంది రైతులు వీటిని పండిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన చిరుధాన్యాల ప్రచారం వారికి ఎంతో మేలు చేయనుంది. వీటిని రసాయనాల అవసరం లేకుండా, తక్కువ నీటితో పండించవచ్చు. తద్వారా వాతావరణ మార్పుల సమస్యకు కొంతవరకు అడ్డుకట్ట వేయవచ్చు. గనుకనే వీటికి శ్రీ అన్న అని నామకరణం చేశాం’’ అని చెప్పారు. చిరుధాన్యాలు దేశమంతటా సమగ్ర ఆహారపుటలవాట్లకు మాధ్యమంగా మారుతున్నాయన్నారు. భారత్ తన వ్యవసాయ పద్ధతులను ప్రపంచ దేశాలతో పంచుకోవడానికి, వారి అనుభవాల నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. చిరుధాన్యాలపై 500కు పైగా స్టార్టప్లు పుట్టుకొచ్చాయన్నారు. హైదరాబాద్లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐసీఏఆర్)ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ప్రకటించారు. ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్న నేపథ్యంలో అందుకు గుర్తుగా పోస్టల్ స్టాంపును, 75 రూపాయల నాణాన్ని మోదీ విడుదల చేశారు. -
ఆరోగ్య సిరులు.. పోషకాహార లోపాన్ని నివారించే చిరుధాన్యాలు
సాక్షి, అమరావతి: పోషకాహార లోపాన్ని నివారించి, ఆరోగ్యాన్ని పెంపొందించే చిరు ధాన్యాల (మిల్లెట్స్)ఉత్పత్తి పెంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్తో సహా దేశంలో ఏడు రాష్ట్రాలు మిల్లెట్ మిషన్లను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, అస్సోం, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు మిల్లెట్ మిషన్లు ఏర్పాటు చేశాయని వివరించింది. ఈ ఏడాది అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా జరుపుకుంటున్న నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు చిరుధాన్యాల ఉత్పత్తిని, స్థానిక వినియోగాన్ని పెంచడంపై దృష్టి సారించినట్లు కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. చిరుధాన్యాల ఉత్పత్తి, డిమాండ్ను పెంచేందుకు రాష్ట్రాలకు సహకారం అందిస్తున్నట్లు తెలిపింది. దేశంలో 170.67 లక్షల టన్నుల చిరుధాన్యాల ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్రంలో 4.64 లక్షల టన్నులు ఉత్పత్తి అవుతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచంలో అత్యధికంగా చిరుధాన్యాలు పండించేంది భారతదేశంలోనే. భారతదేశంలోనే 41 శాతం చిరుధాన్యాలు పండిస్తున్నారు. దేశవ్యాప్తంగా చిరు ధాన్యాల వేడుకలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంవత్సరం అంతా చిరుధాన్యాల వేడుకలను నిర్వహిస్తున్నాయి. 2023–24లో దేశాన్ని చిరుధాన్యాలకు గ్లోబల్ హబ్గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాయి. మిల్లెట్స్ ఉత్పత్తి, డిమాండ్ పెంచేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఉత్పాదకతను పెంచడం, వినియోగం, ఎగుమతి, విలువను బలోపేతం చేయడం, బ్రాండింగ్, సృష్టించడం వంటి వాటిపై దృష్టి పెట్టాయి. వీటి వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెలవారీ కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నాయి. చిరుధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు అవసరమైన సాంకేతికత, మెరుగైన వ్యవసాయ పనిముట్లు, వనరులు, సీడ్ హబ్ల ఏర్పాటులో విషయంలో కేంద్రం రాష్ట్రాలకు సహకారం అందిస్తోంది. 2023–24 సంవత్సరమంతా కేంద్ర మంత్రిత్వ శాఖలు చిరుధాన్యాలతో కూడిన తినుబండారాలనే అందించనున్నాయి. విమానాలు, రైళ్లలో చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించనున్నారు. అన్ని బహిరంగ ప్రదేశాల్లో మిల్లెట్ వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేస్తారు. డిఫెన్స్ ఫుడ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్, పోలీస్ ఫోర్స్ క్యాంటీన్లలోనూ చిరుధాన్యాల ఆహారాన్ని అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చర్యలు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా మిల్లెట్ మిషన్ ఏర్పాటు చేసింది. చిరుధాన్యాలు పండించే రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. పోషకాహార లోపం నివారణకు చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తోంది. జగనన్న గోరుముద్దలో భాగంగా పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి మార్చి 2 నుంచి రాగి జావ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాదంతా చిరుధాన్యాల వేడుకలను నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. -
మిల్లెట్స్ వాల్ క్యాలెండర్
2023ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల పునరుజ్జీవానికి కృషి చేస్తున్న బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘సహజ సమృద్ధ’ మిల్లెట్స్పై ఓ వాల్ క్యాలెండర్ను ప్రచురించింది. నాబార్డ్ సహాయంతో ఆర్.ఆర్.ఎ. నెట్వర్క్తో కలసి సహజ సమృద్ధ ఈ క్యాలెండర్ను ఆంగ్లం, తెలుగు, కన్నడ తదితరప్రాంతీయ భాషల్లోనూ రూపొందించింది. ఈ క్యాలెండర్లో వర్షాధార వ్యవసాయ పరంగా చిరుధాన్యాలప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు.. పౌష్టికాహార లోపాన్ని పారదోలే అద్భుత చిరుధాన్య వంటకాలను తయారు చేసుకునే పద్ధతులను,ప్రాసెసింగ్ యంత్రాల సమాచారాన్ని సైతం ఇందులో సచిత్రంగా వివరించారు. మిల్లెట్లను పునరుద్ధరించడంలో, సాంప్రదాయ మిల్లెట్ ఆహార వ్యవస్థను సజీవంగా ఉంచడంలో రైతులు, గిరిజనులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు నిర్వహిస్తున్న పాత్రను ఈ క్యాలెండర్ గుర్తు చేస్తుంది. ఈ 24 పేజీల క్యాలెండర్. క్యాలెండర్ ధర రూ.150 (కొరియర్ ఖర్చుతో సహా). ఇతర వివరాల కోసం... 99720 77998 నంబరుకు కాల్ చేయవచ్చు.