-
ప్రమాదం అంచున మనదేశం
మీరు ఆరోగ్యంగా ఉన్నారా? అని ప్రశ్నిస్తే కొంతమంది తమ ఆరోగ్య సమస్యల గురించి ఏకరువు పెడతారు. మరికొందరు ‘నాకేమండీ, ఏ జబ్బూ లేదు’ అని ధీమాగా చెప్తారు. కానీ ఆరోగ్యంగా ఉండటమంటే జబ్బు లేకపోవడం మాత్రమే కాదు. ఆరోగ్యంగా ఉండటమంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా క్షేమంగా ఉండటమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. అలాగే మానసిక ఆరోగ్యం లేకుండా శారీరక ఆరోగ్యం ఉండదని హెచ్చరిస్తోంది. కానీ మనం శారీరక సమస్యల గురించి మాట్లాడుకున్నంత స్వేచ్ఛగా మానసిక సమస్యలగురించి మాట్లాడుకోం. మానసిక సమస్యల పట్ల సమాజంలో నెలకొన్న అపోహలే అందుకు కారణం. ఒక సైకాలజిస్టునో, సైకియాట్రిస్టునో కలిశారంటే.. పిచ్చి అని ముద్ర వేస్తారేమోననే భయం. ఈ అపోహలను, భయాలను దూరం చేసేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ‘మే’నెలను ‘మెంటల్ హెల్త్ మంత్’గా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మనదేశంలో మానసిక ఆరోగ్యం స్థితిగతులను, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? మానసిక ఆరోగ్యమంటే ఒక వ్యక్తి సైకలాజికల్గా, ఎమోషనల్గా క్షేమంగా ఉండటం. బాలెన్స్డ్ మైండ్, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని కలిగి ఉండటం. ఆలోచనల్లో, ప్రవర్తనలో, భావోద్వేగాల్లో బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు మానసిక అనారోగ్యం వస్తుంది. దీర్ఘకాలికంగా కొనసాగే తీవ్రమైన ఒత్తిడి, జీవసంబంధ కారకాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, ప్రతికూల ఆలోచనలు, ఆర్థిక సమస్యలు, ఒంటరితనం, కుటుంబ కలహాలు వంటి సమస్యలు కూడా మానసిక సమస్యలకు కారణమవుతాయి. దాదాపు 250కి పైగా మానసిక రుగ్మతలు ఉన్నాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ, ఫోబియా, ఈటింగ్ డిజార్డర్స్, మానసిక ఒత్తిడి సాధారణ మానసిక రుగ్మతలు. స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, క్లినికల్ డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీ, పర్సనాలిటీ డిజార్డర్స్ అనేవి తీవ్రమైన మానసిక రుగ్మతలు. వీటిలో కొన్నిటికి కౌన్సెలింగ్, సైకోథెరపీ సరిపోగా, మరికొన్నిటికి మందులు అవసరమవుతాయి. కానీ అన్నింటినీ ‘పిచ్చి’ అనే పరిగణించడం వల్ల కనీసం మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు. అపోహలను ఎలా ఎదుర్కోవాలి? మానసిక రుగ్మతలను పరిష్కరించుకోవాలంటే ముందుగా వాటి పట్ల ఉన్న అపోహలను ఎదుర్కోవాలి. అందుకోసం మీడియాతో పాటు మనమందరం కృషి చేయాలి. అందుకోసం ఈ కింది సూచనలు ఉపయోగపడతాయి. మానసిక అనారోగ్యం సర్వసాధారణం. అది మానసిక బలహీనతకు సంకేతం కాదు. గణాంకాలను చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. మానసిక రుగ్మత లక్షణాలు కనిపించగానే ఎవరో ఏదో అనుకుంటారని భయపడకుండా వెంటనే చికిత్స తీసుకోండి. మీరూ, మీ సమస్య వేర్వేరు. మీ సమస్యతో మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకోవద్దు. మీకు ‘బైపోలార్ డిజార్డర్’ ఉంటే, ‘నేను బైపోలార్’ అని కాకుండా ‘నాకు బైపోలార్ డిజార్డర్’ ఉంది అని చెప్పండి. మానసిక అనారోగ్యం గురించి అవగాహన లేనివారి నుంచి మీకు వివక్ష ఎదురుకావచ్చు. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. సమస్యను అర్థం చేసుకోలేకపోవడం వారి సమస్యగా పరిగణించండి. మానసిక అనారోగ్యం సిగ్గుపడాల్సిన విషయమేం కాదు. కాబట్టి దాని గురించి మాట్లాడండి. అప్పుడే ప్రజల్లో ఉన్న అపోహలు దూరమవుతాయి. మానసిక అనారోగ్యాల గురించి సరైన వ్యక్తుల నుంచి, సరైన సమాచారాన్ని సేకరించి విస్తృతంగా ప్రచారంలో పెట్టండి. మానసిక రుగ్మత లక్షణాలు నిరంతర ప్రతికూల ఆలోచనలు మరణం లేదా ఆత్మహత్య గురించి ఆలోచించడం ఏకాగ్రత లోపం ఎనర్జీ లెవెల్స్లో తీవ్ర మార్పులు ఎక్కువగా ఒంటరిగా గడపాలని కోరుకోవడం నియంత్రించలేని ప్రవర్తన, కోపం, విచారం ఎవరికీ వినిపించని శబ్దాలు వినిపించడం, రూపాలు కనిపించడం ఆత్మహత్యల రాజధానిగా దేశం మన దేశంలో ప్రతి అయిదుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో దాదాపు ఆరు నుంచి ఏడు కోట్ల మంది ప్రజలు సాధారణ, తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఒక సంవత్సరంలో 2.6 లక్షల ఆత్మహత్య కేసులతో భారతదేశం ప్రపంచ ఆత్మహత్యల రాజధానిగా మారడం బాధాకరమైన విషయం. భారతదేశంలో ప్రతి లక్ష మందికి సగటు ఆత్మహత్యల రేటు 10.9గా ఉందని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు చెబుతున్నాయి. మానసిక నిపుణుల కొరత దేశవ్యాప్తంగా కేవలం 43 ప్రభుత్వ మానసిక ఆరోగ్య సంస్థలు ఉన్నాయి. 11,500 మంది సైకియాట్రిస్టులు అవసరంకాగా కేవలం 3800 మాత్రమే అందుబాటులో ఉన్నారు. అంటే నాలుగు లక్షల మందికి ఒక సైకియాట్రిస్ట్ మాత్రమే ఉన్నారు. 17,250క్లినికల్ సైకాలజిస్టులు అవసరం కాగా కేవలం 900 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. అలాగే సైకియాట్రిక్ సోషల్ వర్కర్లు, సైకియాట్రిక్ నర్సులు, కౌన్సెలింగ్ సైకాలజిస్టులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. - సైకాలజిస్ట్ విశేష్ -
జీతం ఎంతైనా పర్లేదు.. అటెన్షన్.. బట్ నో టెన్షన్.. కోవిడ్ తెచ్చిన మార్పు
సాక్షి, అమరావతి: మానసిక ప్రశాంతత లేని కొలువుల్లో పనిచేసేది లేదని భారతీయ ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. ఇందుకోసం అధిక వేతనాలు వచ్చే ఉద్యోగాలను సైతం వదులుకునేందుకు సిద్ధపడుతున్నారు. కోవిడ్–19 తర్వాత ఉద్యోగులు మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించారు. అమెరికా ఆధారిత వర్క్ఫోర్స్ మేనేజ్మెంట్ సంస్థ యూకేజీ నిర్వహించిన సర్వేలో.. భారతదేశంలో 88 శాతం మంది ఉద్యోగులు మానసిక క్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు నివేదించింది. ఒత్తిడి లేని ఉద్యోగాల్లో తక్కువ జీతానికైనా పని చేసేందుకు వెనుకాడటం లేదని వెల్లడించింది. ఇదే అమెరికాలో 70 శాతం మంది ఉద్యోగుల అభిప్రాయంతో పోలిస్తే భారత్లోనే ఈ అభిప్రాయం గల ఉద్యోగులు అధికంగా ఉండటం విశేషం. భారత్తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లోని ఉద్యోగాల్లో వర్క్ఫోర్స్, ప్రోత్సాహకాలు, మానసిక ఆరోగ్యం తదితర అంశాలపై ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. కుటుంబానికే తొలి ప్రాధాన్యం భారతీయ ఉద్యోగుల్లో ఇటీవల కుటుంబ సభ్యులకు ఇచ్చే ప్రాధాన్యతలో తీవ్ర మార్పు వచ్చింది. 46 శాతం మంది ఉద్యోగం కంటే కుటుంబమే తొలి ప్రాధాన్యం అని అభిప్రాయపడుతున్నట్టు సర్వేలో తేలింది. రెండో స్థానంలో 37 శాతం మంది పని (ఉద్యోగం).. ఆ తర్వాతే ఆరోగ్యం, స్వీయ సంరక్షణ, వ్యాయామం, స్నేహితులతో సంబంధాలు కోరుకుంటున్నట్టు తెలిపింది. అయితే, ఇక్కడ చాలామంది ఉద్యోగులు తమ ఆందోళనలను మేనేజర్లతో పంచుకునేందుకు వెనుకాడుతున్నట్టు చెప్పింది. భారత్లో 51 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ప్రతి వారం తమ మేనేజర్తో పనిభారంపై చర్చిస్తుండగా.. 30 శాతం మంది నెలకు ఒకసారి కూడా మాట్లాడలేకపోతున్నారని నివేదించింది. ఒత్తిడి ఇంత పని చేస్తోందా! 33% భారతీయ ఉద్యోగులు ఆఫీసుల్లో ఎక్కువ గంటలు గడపటం పని సంబంధిత ఒత్తిడికి ప్రధాన కారణమని సర్వే పేర్కొంది. దీనివల్ల 34 శాతం మందిలో గతంతో పోలిస్తే పని గంటలు పెరగడంతో ఏకాగ్రత కోల్పోతున్నట్టు గుర్తించింది. 31 శాతం మందిలో సహాద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించలేని పరిస్థితి కనిపించింది. మిగిలిన వారిలో పని ఉత్పాదకత, సామర్థ్యం కొరవడుతున్నట్టు తేల్చింది. ఉద్యోగానికి ఉండే డిమాండ్, హార్డ్ వర్క్ చేయాలనే తపన కూడా ఒత్తిడికి కారణంగా పలువురు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ‘ఉద్యోగులకు కార్యాలయాల్లో సానుకూల వాతావరణం ఉండాలి. అప్పుడు వారు మెరుగ్గా పని చేయగలుగుతారు. సాంకేతిక వనరులపై పెట్టుబడులు పెంచడం ద్వారా ఉద్యోగులపై కొంతమేర ఒత్తిడిని తగ్గించవచ్చు. ఇది ఆ సంస్థ స్థిరత్వానికి ఎంతో దోహదం చేస్తుంది’ అని యూకేజీ ఇండియా కంట్రీ మేనేజర్ సుమిత్ దోషి చెప్పారు. -
జీతం కాదు.. మానసిక ప్రశాంతతే ముఖ్యం
మానవ సమాజానికి కరోనా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో నేర్పినన పాఠాలు అన్నీ ఇన్నీ కాదు. దాదాపు మూడేళ్ల క్రితం ప్రాణాంతక కోవిడ్ వైరస్ వ్యాప్తిలోకి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు ఏదో ఒక రూపంలో తీవ్రంగా ప్రభావితమైన తీరు తెలిసిందే. మళ్లీ కరోనా కేసుల పెరుగుదల, దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు, వివిధ రకాల ఇన్ఫ్లూయెంజా వైరస్ల వ్యాప్తి నేపథ్యంలో ఒత్తిళ్లకు దూరంగా జీవనం, మానసిక ప్రశాంతత వంటివి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. జీతం కంటే మానసిక ప్రశాంతతకే ఓటు వేస్తున్న ఉద్యోగుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరుగుతోంది. వివిధ దేశాల్లో అధిక శాతం ఉద్యోగులు పని ప్రదేశాల్లో మానసిక ఆరోగ్యం అనేది చాలా కీలకమని అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ సహా పది దేశాల్లోని ఉద్యోగులపై చేసిన ఓ తాజా అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అన్నిట్లోనూ మార్పు దిశగా అడుగులు మనుషులకు సవాళ్లు ఎదురైనప్పుడే వాటిని ఎలా అధిగమించాలనే దానిపై దృష్టి పెడతారు. జీవితం దుర్లభంగా మారుతోందనగానే దానిని ఎదుర్కొని అనుకూలంగా మార్చుకునేందుకు ఏమి చేయాలనే ఆలోచనలు వస్తాయి. పరిస్థితులకు తగ్గట్టుగా తమను తాము మార్చుకోవడం, జీవిత ప్రాధామ్యాల్లోనూ మార్పులు, చేర్పులు చేసుకోవడం జరుగుతుంది. ఏది చేస్తే మనసుకు, శరీరానికి స్వాంతన దొరుకుతుందనే దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మానసిక ప్రశాంతతకే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలనే ట్రెండ్ ఎప్పటికీ ఉంటుందా? అంటే ఇప్పుడే చెప్పలేం. కొంతకాలం మాత్రం తప్పకుండా ఉంటుంది. అందువల్లే చాలామంది ఆరోగ్యం మీద ఫోకస్ పెడుతున్నారు. పని పద్ధతులు, పని సమయాలు, తీసుకునే ఆహారం, ధరించే దుస్తులు.. ఇలా అన్నిటిలోనూ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. మనుషులపై కరోనా పరిస్థితులు తెచ్చిన ప్రభావం మాత్రం రాబోయే 4, 5 ఏళ్ల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ భారత్లో ఇలా.. ►పనిచేసే ప్రదేశాల్లో మానసిక ఆరోగ్య పరిరక్షణే ప్రధానమన్న అధిక శాతం ఉద్యోగులు ► ఒత్తిళ్లకు దూరంగా ప్రశాంతతతో జీవించేందుకు.. అధిక జీతాలొచ్చే ఉద్యోగాలు సైతం వదులుకునేందుకు సిద్ధమని 88% మంది చెప్పారు. ►71 శాతం మంది పని భారం వల్ల తలెత్తే ఒత్తిళ్లు వ్యక్తిగత జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ►వ్యక్తిగత సంబంధాలనూ ప్రభావితం చేస్తున్నాయన్న 62% మంది. ►కుటుంబ సభ్యులతో మెరుగైన సంబంధాలు, సంతోషకరమైన జీవితమే ముఖ్యమన్న 46% మంది. ►పని ఒత్తిళ్లతో సాయంత్రాని కల్లా నిస్త్రాణంగా మారుతున్నామని 26% మంది చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... ► ఇతర దేశాల ఉద్యోగులు సైతం మన దేశంలో మాదిరి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. ►అధిక జీతమొచ్చే ఉద్యోగం కంటే మంచి మానసిక ఆరోగ్యానికి అనువైన ఉద్యోగానికే 81% మంది మొగ్గు చూపారు. ►తమ పనితీరుపై మానసిక ఒత్తిళ్లు ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని 78% మంది చెప్పారు. ►తాము చేస్తున్న ఉద్యోగం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోందని 60% మంది పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది ప్రస్తుతం ఉద్యోగులతో పాటు అందరూ మానసిక ఆరోగ్యానికి బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మన జీవితాల్లో కరోనా పరిస్థితులు తెచ్చిన అనిశ్చితి అంతా ఇంతా కాదు. మహమ్మారి ఉధృతంగా ఉన్నప్పటి తీవ్రమైన భయం ఇప్పటికీ కొనసాగుతోంది. దాదాపు అన్నివర్గాల వారు డబ్బు ఆదా చేయడం కంటే మానసిక ప్రశాంతతే ముఖ్యమనే భావనకు వచ్చారు. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండేలా జీవనశైలిని మార్చుకోవాలనే శ్రద్ధ పెరిగింది. గతంలో ఇలాంటి పరిస్థితి అంతగా ఉండేది కాదు. కానీ కరోనాతో చాలా మార్పు వచి్చంది. ప్రతిఒక్కరూ మానసిక ప్రశాంతత కోరుకోవడం ఎక్కువైంది. – డాక్టర్ బి.అపర్ణా రెడ్డి, హెచ్ఆర్ నిపుణురాలు -
ఇల్లే నయా జిమ్
సాక్షి, అమరావతి: శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. జీవన నాణ్యతను మెరుగుపర్చుకోవడానికి ‘ఫిట్నెస్’ మంత్రం జపిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధుల ముప్పును తప్పించుకునేందుకు అత్యధికులు వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా దేశంలోని పట్టణాలు, నగరాలతోపాటు సెమీ అర్బన్, సబ్ అర్బన్ ప్రాంతాల్లోనూ ‘హోమ్ జిమ్’ ట్రెండ్ పెరుగుతోంది. గుండె ఆరోగ్యంపై దృష్టి గుండె, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడం, కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడటం వలన కార్డియోవాస్కులర్ వ్యాయామ పరికరాలను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇవే మార్కెట్ వాటాలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్నాయి. ఇందులో ట్రెడ్మిల్స్, స్టేషనరీ బైక్లు, రోయింగ్ యంత్రాలు, ఎలిప్టికల్స్ ఉన్నాయి. భారత్ టాప్.. తాజా గణాంకాల ప్రకారం భారత్లో గత ఏడాది గృహ ఫిట్నెస్ పరికరాల పరిశ్రమ మార్కెట్ విలువ 13,741.23 మిలియన్ డాలర్లుగా నమోదైంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇది ఆసియన్–పసిఫిక్ దేశాల్లోనే అత్యధిక మార్కెట్ విలువగా నమోదైంది. మరోవైపు ప్రపంచ దేశాలతో పోలిస్తే ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలు అత్యధికంగా ఫిట్నెస్కు ప్రాధాన్యం ఇస్తుండటం విశేషం. దేశంలో భౌగోళికంగా చూస్తే పశ్చిమ, మధ్య భారతం అతిపెద్ద మార్కెట్గా ఉంది. ఇక్కడ పట్టణీకరణ, పెరుగుతున్న తలసరి ఆదాయం దీనికి కారణంగా తెలుస్తోంది. తూర్పు, దక్షిణ భారత దేశంలోనూ ఫిట్నెస్ మార్కెట్ క్రమంగా వృద్ధి చెందుతున్నప్పటికీ ఇక్కడ ఎక్కువ శాతం ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆన్లైన్ ఆర్డర్ల వృద్ధి దేశంలో ఇటీవల గృహ వ్యాయామ పరికరాల కొనుగోలులో 45 శాతం ఆన్లైన్ ఆర్డర్లు పెరిగాయి. ముఖ్యంగా ట్రెడ్మిల్స్, ఎక్సర్సైజ్ బైక్లు, డంబెల్ సెట్లు, బెంచ్లు ఎక్కువగా ఉంటున్నాయి. సుమారు రూ.1,300–రూ.2,000 ధరలో వివిధ రకాల బరువులు, రాడ్లు, వెయిట్ బార్లు, జిమ్ ఉపకరణాలు లభిస్తున్నాయి. మరోవైపు యోగా మ్యాట్లు, రెసిస్టెన్స్ బ్యాండ్లు, ఫోమ్ రోలర్లు, టమ్మీ ట్రిమ్మర్లు వంటి సులభమైన వ్యాయామ పరికరాల విక్రయం విరివిగా ఉంటోంది. ఆన్లైన్ మార్కెట్ వ్యాపారం గత సంవత్సరం దాదాపు ఏడు రెట్లు పెరిగింది. చాలా కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ఒకే పరికరంపై 3కు పైగా వివిధ రకాల వ్యాయామాలు చేసుకునేలా డిజైన్లు చేస్తున్నాయి. ‘స్మార్ట్’గా వాడుతున్నారు ఫిట్నెస్ యాప్ల డౌన్లోడ్లు భారత్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా భారీగా పెరిగాయి. 2023లో స్మార్ట్వాచ్లు, ఫిట్నెస్ బ్యాండ్ల వంటి వేరియబుల్ టెక్నాలజీలు సరికొత్త ఫిట్నెస్ ట్రెండ్ను సృష్టించనున్నాయి. దీంతోపాటు ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్/వర్చువల్ ఫిట్నెస్ సెషన్లు పెరగనున్నాయి. ఇంతకు ముందు ఆన్లైన్ శిక్షణ గురించి పెద్దగా అవగాహన లేనివారు కూడా ఇప్పుడు ఆన్లైన్ శిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో మహిళలు ఎక్కువగా ఉండటం విశేషం. ఆసక్తి పెరిగింది కోవిడ్ తర్వాత హోమ్ జిమ్లు పెరిగాయి. తక్కువ ధరల్లో వ్యాయామ పరికరాలు వస్తుండటం, ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో చాలామంది స్వయంగా వ్యాయామాలు చేయడం నేర్చుకుంటున్నారు. కొంతమంది మా లాంటి ట్రైనర్స్ను పెట్టుకుంటున్నారు. హోమ్ జిమ్ ఇంటిల్లిపాదికి ఎంతగానో ఉపయోగపడుతోంది. – సందీప్, ఫిట్నెస్ ట్రైనర్, విజయవాడ -
మానసిక ఆరోగ్యం మీ గదే మీ మది
చిందర వందరగా ఉన్న ఇల్లు చిందర వందరగా ఉన్న మనసుకు కారణం. సర్దుకున్న ఇల్లు సేదతీరిన మనసుకు సూచన. ఎలా పడితే అలా ఉండి పనికిమాలిన వస్తువులతో నిండి కుదురుగా కనిపించని ఇంట్లో నివాసం స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఎందుకంటే స్త్రీలు ఎక్కువ సమయం గడిపే చోటు ఇల్లు గనుక. స్త్రీలు తమ పరిసరాలను సర్దుకోవడం, అందంగా మార్చుకోవడం వల్ల మీ మానసిక ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు నిపుణులు. కేస్ స్టడీ 1: సురేఖ వంటగదిలో ఎప్పుడూ చిరాగ్గా కోపంగా ఉంటుంది. పిల్లలు వెళితే కసురుతూ ఉంటుంది. ఆమె వంట చేస్తున్నప్పుడు ఆ సమయానికి పనిమనిషి ఇంకా రాకపోవడం వల్ల సింక్ నిండుగా ఉంటుంది. కావలిసిన వంట పాత్రలు వెంటనే దొరకవు. సరుకుల డబ్బాలను కుదురుగా పెట్టుకోవడాన్ని సురేఖ ఏనాడూ పట్టించుకోదు. కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా ఉండదు. తను శుభ్రంగా ఉన్నా, ఇంట్లో ఇతరత్రా ఏ సమస్యలు లేకపోయినా ఆ సమయంలో బయట వాతావరణం బాగున్నా వంటగదిలో సురేఖ మానసిక స్థితి మాత్రం ప్రశాంతంగా ఉండదు. అదే ఆమె వంట గదిని సరిగ్గా సర్దుకుని ఉంటే, వంట మొదలెట్టే సమయం కంటే ముందే వచ్చి పాత్రలు శుభ్రం చేసి వెళ్లే పని మనిషిని పెట్టుకుని ఉంటే, వంట గదిలో అనవసరమైన పాత గిన్నెలు, బూజు పట్టిన గంగాళాలు వదిలించుకుని ఉంటే ఆమె ప్రతి పూట హాయిగా వంట చేసుకుని ఉండేది. కేస్ స్టడీ 2: రాజేశ్వరి ఆఫీస్ నుంచి ఇల్లు చేరుకోగానే ఆమె చిరాకు నషాళానికి ఎక్కుతుంది. అప్పటికి పిల్లలిద్దరూ స్కూళ్ల నుంచి ఇంటికి వచ్చి ఉంటారు. చిప్స్ తిని రేపర్లు సోఫాలో పడేసి ఉంటారు. టవళ్లు కుర్చీలో పడేసి ఉంటారు. యూనిఫామ్ బట్టలు ఎలాగంటే అలా పడేసి ఉంటారు. పొద్దున చదివిన న్యూస్పేపర్లు చిందర వందరగా ఉంటాయి. తాళం కప్ప ఒకచోట, దాని తాళం ఇంకో చోట. పుస్తకాల సంచుల్ని టీవీ స్టాండ్ దగ్గర పడేసి ఉంటారు. వచ్చిన వెంటనే ఆమెకు ఇల్లు సర్దుకునే ఓపిక ఉండదు. హాల్లో కూచుందామంటే ఈ చిందర వందర అంతా ఆమెకు హాయినివ్వదు. పిల్లలు ఎన్నిసార్లు చెప్పినా వినరు. తాను ఇంటికి వచ్చేసరికి ఇల్లు శుభ్రంగా, కుదురుగా కనిపిస్తే వచ్చి హుషారుగా పలకరిద్దామని ఉంటుంది. కాని ఆ స్థితి లేకపోవడం వల్ల రోజూ రావడంతోటే పిల్లల్ని కసరడం, దాని వల్ల తాను బాధ పడటంతో మూడ్ ఆఫ్. ఇలా రోజు జరగడం అవసరమా? కేస్ స్టడీ 3: సంధ్య వాళ్ల ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండదు. ఇంటికి వచ్చిన వాళ్లు ఈ ఇంట్లో వాళ్లకు ఇల్లు సర్దుకోవడం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం రాదు అని ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది. వాళ్లు ఎక్కువ సేపు కూచోరు. సంధ్యకు ఇల్లు సర్దుకోవాలని ఉంటుందిగాని దానికి ఏదో ముహూర్తం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆదివారం సర్దుదామనుకుంటుంది... ఆ రోజు ఏదో పని పడుతుంది. హ్యాంగర్లకు మాసిన బట్టలు, కుర్చీల్లో ఉతికిన బట్టలు, వారం అయినా మంచాల మీద మారని దుప్పట్లు... సంధ్యకు ఏ పని చేయాలన్నా మనసు రాదు. ఐదు నిమిషాల పని పది నిమిషాలు పడుతుంటుంది. ఉండి ఉండి ఆందోళనగా అనిపిస్తుంటుంది. ఏదో ఇష్టం లేని ప్లేస్లో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంటుంది. శుభ్రమైన గదే శుభ్రమైన మదికి సాయం చేస్తుందని ఆమెకు ఎప్పటికి తెలుస్తుందో. రోడ్డు మీద వెళుతున్నప్పుడు చెత్త చెదారం కంట పడగానే మనసుకు ఒక రకమైన ఏహ్యభావం కలుగుతుంది. అలాగే మనం నివసించే ఇల్లు, గదులు కూడా చిందర వందరగా ఉంటే మనసుకు ఉల్లాసం పోతుంది. మనం నివాసం ఉండే ఇల్లుగాని, పని చేసే ఆఫీస్గాని సర్వకాల సర్వవేళల్లో శుభ్రంగా ఉండాలని ఆశించడం కుదరదు. కాని వీలున్నంత మటుకు ఎప్పటికప్పుడు సర్దుకోవడం వల్ల వస్తువుల అపసవ్యత దృష్టికి రాకుండా చూసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుందని, సరైన కెమికల్స్ విడుదలయ్యి ఒక ప్రశాంతత ఉంటుందని, ఫోకస్డ్గా పని చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కౌటుంబిక, ఆర్థిక సమస్యలు లేకపోయినా శుభ్రత లేని పరిసరాలు మీ నైపుణ్యాన్ని తగ్గిస్తాయి. మనసును చికాకు పెడతాయి. పరిసరాలు మనసును ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఇవి చేయాలి. 1. ఇల్లు మీ కార్యక్షేత్రంగా ఉందా లేదా చూసుకోవాలి. ప్రతి వస్తువుకు ఒక స్థలం ఉంటుంది. ఉండాలి. లేకపోతే కేటాయించుకోవాలి. చిన్న ఇల్లు అని వంక పెట్టవద్దు. చిన్న ఇల్లు కూడా చాలా నీట్గా సర్దుకోవచ్చు. 2. లాండ్రీ, గిన్నెలు, చెత్త పారేయడం... ఈ మూడు పనులు మీరు చేసుకున్నా పని మనిషి చేసినా పర్ఫెక్ట్గా ప్రతిరోజూ జరిగేలా చూసుకుంటే మనసుకు సగం ప్రశాంతత. 3. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలంటే పాతవి, అక్కర్లేనివి, కంటికి ఇబ్బంది కలిగించేవి నిర్దాక్షిణ్యంగా పారేయాలి. అతి తక్కువ వస్తువులతో జీవించాలని దీని అర్థం కాదు. మీకు అవసరమైన వస్తువులు మాత్రమే ఉంటే బాగుంటుంది. 4. ఇల్లు సర్దుకోవడానికి రోజులో కొంత సమయం కేటాయించాలి. ఇంటి సభ్యులందరూ ఏదో ఒక టైమ్లో ఇల్లు సర్దడానికి పది నిమిషాలు ఇవ్వాలి. నెలకోసారి సర్వ ప్రక్షాళన అనేది తప్పు భావన. కొద్ది కొద్దిగా నీట్గా చేసుకుంటూ రావడమే మంచిది. 5. పొందిగ్గా సర్దబడి, చక్కటి మొక్కలు ఉండి, గాలి వెలుతురు తగినంతగా వస్తూ ఉన్న ఇల్లు మీదైతే మీ మానసిక ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉండటానికి పూర్తి అవకాశం ఉంది. -
Unpaid Care Work: వేతనం లేని పనికి.. గుర్తింపు ఉండదా?!
స్త్రీల ఇంటిపనికి ఎలాంటి గుర్తింపు, వేతనం ఉండదు. ఇదే విషయమై సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఒక అధ్యయనం చేసింది. పేద, ధనిక దేశాలలోనూ ఈ విషయంలో అంతరాలనూ చూపించింది. గుర్తింపు లేని పని కారణంగా స్త్రీలలో పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు, ఇంటి పనితో పాటు ఉపాధి పొందుతున్న మహిళలపై పడుతున్న అధిక భారం గురించి కూడా చేసిన ఈ అధ్యయనం అన్నివర్గాల వారినీ ఆలోచింపజేస్తోంది. ఇంటి పనులు, బాధ్యతలను సమతుల్యం చేయడం మహిళల నైతిక బాధ్యతగా అంతటా వాడుకలో ఉన్నదే. దీని వల్ల కలుగుతున్న నష్టాలనూ, భాగస్వామ్యంతో ఎలా సమన్వయం చేసుకోవాలో కూడా ఈ సంస్థ తెలిపింది. తేలిక భావన మహిళకు ఉదయం లేస్తూనే ఒక సాధారణ రోజుగా ప్రారంభమవుతుంది. ఊడవడం, తుడవడం, కడగడం, కుటుంబ సభ్యులకు భోజనం సిద్ధం చేయడం... ఈ రొటీన్ పనులన్నీ వీటిలో ఉండవచ్చు. వీటన్నింటి మధ్య వారు తమ భర్త లేదా పిల్లలు లేదా పెద్దలైన కుటుంబ సభ్యుల అవసరాలను చూస్తుంటారు. ఇక బయట ఉద్యోగం చేసే మహిళలైతే, ఇంటి పనులు పూర్తిచేయడంతో పాటు తమను తాము సిద్ధంగా ఉండటానికి సమయం కేటాయించాలి. ఆఫీస్ లోకి వచ్చాక ఆఫీస్ వర్క్ తో ముడిపడి ఉండాలి. పిల్లలు స్కూల్కి వెళ్లాక, భర్త ఆఫీసుకు వెళ్లినప్పుడు గృహిణులు ఊపిరి పీల్చుకోవడం లేదు. చేయాల్సింది చాలా ఉంటుంది. ఇంటి పనులను చూసుకోవడం, చేయడం మహిళలు మాత్రమే చేయదగినపనిగా పరిగణించబడుతోంది. దీనిని దాదాపు అందరూ స్త్రీలను తేలికగానే తీసుకుంటారు. ‘కాలక్రమేణా, వేతనంలేని శ్రమ కారణంగా పురుషుల కంటే స్త్రీలు మానసిక ఆందోళనకు గురవుతున్నార’ని హెల్త్ షాట్స్ సైకాలజిస్ట్ డాక్టర్ మాలినీ సబా తెలియజేస్తున్నారు. డబుల్ బైండ్ ఇంటి యజమానులుగా గుర్తించే మగవారు కార్యాలయంలో పెద్దగా పనులు చేయనప్పటికీ వారు చాలా బిజీగా ఉంటారు. కానీ ఇంటిపని, పిల్లల సంరక్షణతో సహా వేతనంలేని పనికి ఉపాధి పొందుతున్న మహిళలు బాధ్యత వహిస్తారు. డాక్టర్ సబా ప్రకారం, ‘గుర్తించబడని మహిళల శ్రమ రెండు రూపాలుగా ఆమెను సవాల్ చేస్తోంది. ఒకటి ఆమె శారీరక ఆరోగ్య సంరక్షణ తగ్గుతోంది. దీంతో పాటు మానసిక భారం అధికమవుతోంది.’ అసమానతకు నిదర్శనం ప్రపంచవ్యాప్తంగా ఉపాధి, నిరుద్యోగ మహిళలు జీతం లేని పనికి ఎక్కువ గంటలు వెచ్చిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ఈ ధోరణి మరీ ఎక్కువగా కనిపించింది. సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 2021లో పురుషుల 59 అదనపు గంటలతో పోలిస్తే మహిళలు 173 అదనపు గంటలు చెల్లింపు లేని ఇంటిపని, పిల్లల సంరక్షణ బాధ్యతలను తీసుకున్నారు. దిగువ, మధ్య ఆదాయ దేశాలలో ఈ అంతరం మరింత పెరిగింది. ఈ దేశాలలో మహిళలు పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువ గంటలు ఇల్లు, పిల్లలను చూసుకున్నారు. భారాన్ని పెంచిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుండి ఆఫీసు పని చేయడం చాలా మంది మహిళల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. మహిళలు వంట చేయడం, శుభ్రపరచడం, పిల్లలు, పెద్దవారిని చూసుకోవడం.. వంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. ఇంటి నుండి ఆఫీసు పని చేయడం అనేది చాలా మందికి కష్టతరమైనది. దాంతో ఎంతో సమయాన్ని కోల్పోతున్నారు. దీనివల్ల స్త్రీలకు ఏ విధమైన వినోదం, విశ్రాంతి లేదా కోలుకోవడానికి సమయం దొరకడం లేదు. శారీరక, మానసిక వేధింపుల కథనాలలో ఒకటైన వైద్యం అందుబాటులో లేకపోవడం కూడా సమతుల్యత దెబ్బతింటుంది. మహమ్మారి సమయంలో పరిమిత ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సంరక్షణ సవాళ్లు, పిల్లల సంరక్షణ లేకపోవడం వల్ల చాలా మంది మహిళలు తమ కుటుంబాలను చూసుకోవడం కోసం తమ వృత్తిని విడిచిపెట్టారని నిపుణులు గుర్తించారు. ఇది ముఖ్యంగా నెలవారీ తక్కువ ఆదాయం కలిగిన తల్లులలో ఎక్కువగా ఉంది. (క్లిక్ చేయండి: తక్కువ బడ్జెట్లో ఇంటి అలంకరణ.. వావ్ అనాల్సిందే!) న్యాయమైన వాటా పురుషులు ఇల్లు, పిల్లల పనుల్లోనూ వారి న్యాయమైన వాటాను తీసుకుంటే మహిళలపై చెల్లింపు లేని పని భారం తగ్గుతుంది. కలిసి పనులు చేసుకోవడంలోని అన్యోన్యత స్త్రీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది వారి ఆదాయ వనరుల అవకాశాలను కూడా పెంచుతుంది. భావోద్వేగ ఒత్తిడి కూడా తగ్గుతుంది. పురుషులకు అనువైన ఏర్పాట్లను సాధారణం చేస్తే, పితృస్వామ్య, పెట్టుబడిదారీ డిమాండ్లను చర్చించడంలో స్త్రీలకు సమయం కలిసివస్తుంది. -
అటెన్షన్గా లేకపోతే టెన్షనే! బయటపడటం కష్టమా? డాక్టర్లు ఏమంటున్నారు?
మారుతున్న కాలానికి అనుగుణంగా మానసిక జబ్బులకు గురవుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మంది ప్రతి చిన్న విషయానికీ తీవ్రంగా కలత చెందుతున్నట్లు వైద్యుల పరిశీలనలతో వెల్లడింది. ఎప్పుడూ ముభావంగా ఉండటం, నలుగురితో కలవకపోవడం, పలకరించినా స్పందించకపోతుండటంతో సదరు వ్యక్తులను తీసుకొని బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురంలోని సర్వజనాసుపత్రికి మానసిక రుగ్మతలతో వస్తున్న వారిని పరిశీలించగా.. మానసిక ఒత్తిళ్లు, మానసిక రుగ్మతలు ఎదుర్కొంటున్న వారిలో మహిళల కంటే పురుషులే అధికంగా ఉన్నారు. సగటున 45 ఏళ్ల వయసు వారు ఎక్కువగా మానసిక రుగ్మతలకు గురవుతున్నట్లు తేలింది. చాలా మంది మహిళలు లేదా పురుషులు ఈ రుగ్మతలు ఉన్నట్లు కూడా తెలుసుకోలేక నిర్లక్ష్యం చేస్తుండటంతో తీవ్రత పెరిగాక వస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆర్థిక, ఉద్యోగ సమస్యలతో.. మగవాళ్లు ఎందుకు ఎక్కువ మానసిక రుగ్మతల బారిన పడుతున్నారన్న విషయాన్ని వైద్యులు గుర్తించారు. ఆర్థిక, ఉద్యోగ సమస్యల్లో ఎక్కువ జోక్యం చేసుకోవడం, చెడు అలవాట్లకు బానిస కావడం ప్రధాన కారణాలని చెబుతున్నారు. అలాగే సరైన వ్యాయామం లేకపోవడంతో చిన్న చిన్న శారీరక సమస్యలకు కూడా మానసికంగా కుంగిపోతున్నారని తేల్చారు. జలుబు, దగ్గు లాంటివి ఎక్కువ రోజులు వేధించినా వారు తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. చిన్న విషయానికే నిరాశ.. వాస్తవానికి చెడు అలవాట్లు ఆడవాళ్లలో చాలా తక్కువ. అయినా సరే నిరాశకు గురై మానసిక ఆందోళన చెందుతున్న ఆడవాళ్ల సంఖ్య కూడా ఎక్కువేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్ (నిరాశ)కు గురవున్నారు. మహిళలు చిన్న చిన్న కుటుంబ విషయాలకు కూడా తీవ్రంగా స్పందించడం, ఆలోచించడం వల్ల మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటు న్నారని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో ఇమడలేక.. ఒంటరితనాన్ని భరించలేక మానసిక ఆందోళన చెందుతున్నారనేది వైద్యుల అభిప్రాయం. పట్టించుకోకపోతే ముప్పే.. మానసిక రుగ్మతలను పట్టించుకోకపోయినా ముప్పేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి వల్ల కోపం, బాధ లాంటివి పెరిగిపోవడంతో అసిడిటీ, అల్సర్ లాంటి సాధారణ సమస్యల నుంచి గుండె, బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యల దాకా అనేక రకాల జబ్బులను మోసుకొస్తాయని స్పష్టం చేస్తున్నారు. రాయదుర్గానికి చెందిన 42 ఏళ్ల యువకుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. డిసెంబర్ 21వ తేదీన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు పరిశీలించారు. అతను పనిచేసే ఆఫీసులో తీవ్ర ఒత్తిడి ఉంది. బాస్ నిత్యం వేధిస్తున్నారన్న భావన నెలకొంది. దీంతో రోజు రోజుకూ మానసికంగా కుంగిపోయి సొంతవూరికి వచ్చేశారని వైద్యులు తేల్చారు. ఉరవకొండకు చెందిన 36 ఏళ్ల మహిళ కొంతకాలంగా ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. ఏమి చెప్పినా ఆలకించే స్థితి దాటిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు. గత ఏడాది ఎస్ఎస్సీ పరీక్షల్లో కూతురుకు తక్కువ మార్కులు రావడంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లినట్లు డాక్టర్ తెలిపారు. బాధితులు ఎక్కువవుతున్నారు ఫలానా మానసిక రుగ్మత అందరికీ ఉండాలని లేదు. మగవాళ్లలో స్కిజోఫినియా ఎక్కువగా ఉంటుంది. అదే ఆడవాళ్ల విషయంలో డిప్రెషన్ ఎక్కువ. సోషియల్ ఎలిమెంట్స్ అంటే సామాజిక కారణాలు.. కుటుంబ, ఆర్థిక సమస్యలు వంటివి ఒక కారణం. చిన్న చిన్న సమస్యలకు కూడా కొందరు కుంగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరికి కౌన్సిలింగ్ కావాలి. – డా.విశ్వనాథరెడ్డి, మానసిక వైద్యనిపుణులు, జాతీయ హెల్త్మిషన్ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోంది కుటుంబ వ్యవస్థ బాగా దెబ్బతింటోంది ప్రధానంగా చిన్న చిన్న విషయాలకు కూడా బాగా రియాక్ట్ అవుతున్నారు. పిల్లలకు చదువులో మంచి మార్కులు రాకపోయిన, తమ గోల్ సాధించకపోయిన ఇలా ప్రతి అంశానికి సంబంధించి ఒత్తిడి ఉంటోంది. అన్ని వయస్సుల వారు ఒత్తిడి బారిన పడుతున్నారు.అలాగే వ్యసనాలకు అలవాటు పడటం, కుటుంబంలో ఒకరిపై ఒకరు ఆ«ధిపత్యం వంటి ఎన్నో ఒత్తిడికి కారణమవుతున్నాయి. సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యాన్ని అందిస్తున్నాం. – డాక్టర్ అనిల్కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ మానసిక ఒత్తిడికి చెక్పెట్టండిలా... ► కనీసం మనిషి రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలి. ► కచ్చితంగా రోజూ వ్యాయామం చేయాలి. 45 నిముషాల పాటు వాకింగ్, రన్నింగ్ చేసినా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ► యోగా, ధ్యానం చేస్తూ ఒత్తిడిని జయించవచ్చు. ► తీసుకునే ఆహారం కూడా ఒత్తిడిని తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. తాజా కూరగాయలు, పండ్లు, చేపలు, చిరు ధాన్యాల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, పొటీన్స్, విటమిన్స్తో పాటు మినరల్స్ ఉంటాయి. ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. -
శృతి ఆరోగ్యంపై వార్తలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ మెంటల్ హెల్త్ బాలేదని, ఆమె మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై శృతి స్పందించింది. ఈ వార్తలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ను షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేసింది. ‘నా ఫ్లూ సమస్య ఇలా మారిందన్నమాట’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించింది. ‘నా వైరల్ ఫివర్ కాస్తా ఇలా మెంటల్ హెల్త్గా బయటకు వెళ్లింది. నేను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి. ఇలాంటి వాటి వల్లే వారి మానసిక సమస్యలను బయటకు చెప్పుకునేందుకు భయపడేలా చేస్తున్నారు. నా ఆరోగ్యం, మెంటల్ హెల్త్ బాగానే ఉన్నాయి. ఓ సారి వైరల్ ఫివర్ వచ్చింది అంతే. దాన్ని ఇలా చిత్రీకరించారు. బాగా ట్రై చేశారు. మీకూ అలాంటి సమస్యలు ఉంటే గనుక తప్పుకుండ థెరపిస్ట్ను కలవండి’ అంటూ శృతి మండిపడింది. కాగా శృతి కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తానే స్వయంగా చెప్పినట్లు పలు బాలీవుడ్ మీడియాల్లో కథనాలు వచ్చాయి. అంతేకాదు ఆమె తన మానసిక సమస్యలకు చికిత్స కూడా తీసుకున్నట్లు పేర్కొన్నాయి. Nice try !! And Thankyou I’m recovering well from my viral fever pic.twitter.com/oxTYevcK1D — shruti haasan (@shrutihaasan) January 12, 2023 -
అనుమానిస్తున్నారని వేరేలా చూడకండి.. అది కూడా ఓ లాంటి జబ్బే..!
డాక్టర్ మాధవ్ యూనివర్సిటీలో మాథ్స్ ప్రొఫెసర్. ఇల్లు, కాలేజీ, లైబ్రరీ తప్ప మరో లోకం తెలియదు. ఎలాంటి దురలవాట్లు లేవు. కానీ తన భార్యను నిరంతరం అనుమానిస్తుంటాడు. ఆమె మొబైల్ ఫోన్, మెయిల్స్, వాట్సప్ చాట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటాడు. దాంతో ఇంట్లో రోజూ గొడవలే. ఇరువైపుల పెద్దలు సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. అతను తన ప్రవర్తనను మార్చుకోవాలని ప్రయత్నించినా సఫలం కాలేదు. దాంతో మాధవ్ భార్య విడాకులు కోరుకుంటోంది. యూనివర్సిటీలో మాధవ్ టాలెంట్పై అందరికీ అపారమైన గౌరవం. క్లాస్ మొదలుపెట్టాడంటే స్టూడెంట్స్ అందరూ మొబైల్ చూడకుండా వింటారు. తన ఆధ్వర్యంలో పదిమంది పీహెచ్డీ అందుకున్నారు. ప్రస్తుతం రెండు ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పదిమంది రీసెర్చ్ స్కాలర్స్తో పనిచేయిస్తున్నాడు. కానీ అతనితో పనిచేయడమంటే నరకమని అందరూ భయపడుతుంటారు. ఎందుకంటే అతను ఎవ్వరినీ నమ్మడు. రీసెర్చ్ పేపర్స్ తీసుకెళ్తారేమోనని నిత్యం అనుమానిస్తుంటాడు. ఆయన ఎవ్వరితో కలవడని, రీసెర్చ్ స్కాలర్స్నే కాదు సహోద్యోగులను కూడా ఏ మాత్రం నమ్మడని చెప్పారు. అందరినీ అనుమానించే మాధవ్ తన కారు డ్రైవర్ను మాత్రం గుడ్డిగా నమ్మేస్తాడు. అదెందుకో ఎవ్వరికీ అర్థం కాలేదు. వ్యక్తిత్వంలోనూ రుగ్మతలుంటాయి ప్రొఫెసర్ మాధవ్ లాంటి వ్యక్తులు జీవితంలో ఎదురైనప్పుడు ‘అనుమానపు పక్షి’ అని ముద్ర వేసి అందరూ తప్పుకుంటారు. కానీ అలా అనుమానించడం కూడా ఒక మానసిక రుగ్మతేనని, దానికి చికిత్స ఉందని గుర్తించరు. మాధవ్కు ఉన్న సమస్యను పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ (పీపీడీ) అంటారు. అయితే ఇది డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మత కాదు, వ్యక్తిత్వ రుగ్మత. అంటే అనుమానించడం అతని మనస్తత్వంలో భాగంగా ఉంటుంది. అందువల్లనే దీన్ని గుర్తించడం కష్టం. ప్రతి వ్యక్తికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. జీన్స్తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు, ఎదురైన అనుభవాలు, ఎదుర్కొన్న కష్టాలు, స్నేహాలు వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో కొందరికి ఎదురైన అనుభవాలు వారి వ్యక్తిత్వంలో లోపాలు తీసుకొస్తాయి. ఆ వ్యక్తిత్వ లోపాలు తీవ్రమైనప్పుడు వ్యక్తిత్వ రుగ్మతలుగా మారతాయి. అలాంటి వ్యక్తిత్వ రుగ్మతలు పది రకాలున్నట్లు గుర్తించారు. అందులో పీపీడీ ఒకటి. అందరినీ అనుమానించడం దీని ప్రధాన లక్షణం. బాల్యంలో ఏర్పడిన గాయాలే కారణం పీపీడీ ఎందుకు వస్తుందనేది తెలియదు. ఆనువంశింకంగా వచ్చే జీన్స్తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు ఇందుకు కారణమవుతాయని గుర్తించారు. ముఖ్యంగా బాల్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం, నిరంతరం అనుమానించడం లేదా శారీరక, లైంగిక వేధింపులకు గురవ్వడం, తన భావోద్వేగాలను ఎవ్వరూ పట్టించుకోకపోవడం, ఒంటరిగా ఉండాల్సి రావడం, సోషల్ యాంగ్జయిటీ, హైపర్ సెన్సిటివిటీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఇలా బాల్యంలో ఎదురైన అనుభవాలు, ఏర్పరచిన గాయాలు మనస్తత్వంలో లోపాలుగా మారి 18 ఏళ్ల వయస్సు తర్వాత వ్యక్తిత్వ రుగ్మతలుగా బయటపడతాయి. దాదాపు 0.5 నుంచి 4.5 శాతం మందిలో ఈ రుగ్మత ఉంటుంది. స్కిజోఫ్రీనియా లేదా డెల్యూజనల్ డిజార్డర్ ఉన్నవారి బంధువుల్లో పీపీడీ కనిపిస్తుందని ఆధారాలున్నాయి. పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ లక్షణాలు.. అందరూ తనకు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తుంటారని భావించడం, అందరినీ అనుమానించడం ఎవ్వరినీ తేలిగ్గా నమ్మరు. స్నేహితులు, సహచరులు, భాగస్వామి... ప్రతివారినీ అనుమానంగా చూస్తారు ఎలాంటి ఆధారాలు లేకుండానే, జీవిత భాగస్వామి నమ్మకద్రోహం చేస్తున్నారని అనుమానిస్తుంటారు వారి అనుమానాస్పద ధోరణిని సమర్థించుకునేందుకు ఆధారాలను వెతుకుతూ ఉంటారు ఈ తరహా వ్యక్తిత్వం ఉన్నవారు రిలేషన్షిప్ను సరిగా నెరపలేరు ఏదైనా అంశంలో ఫెయిల్ అయినప్పుడు చాలా సెన్సెటివ్గా ఫీలవుతూ తాము అవమానానికి గురైనట్లు భావిస్తుంటారు. తీవ్రంగా పగబడతారు తాను ఏదైనా చెప్తే తనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారనే భయంతో ఇతరులతో సమాచారం పంచుకోవడాన్ని ఇష్టపడరు విశ్రాంతి తీసుకోవడం కష్టంగా ఉంటుంది ∙ శత్రుత్వం, మొండితనం, వాగ్వివాదం కలిగి ఉంటారు ∙కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకోవాలి ∙పీపీడీని నిరోధించడం సాధ్యం కానప్పటికీ, దాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ఆలోచనలను నియంత్రించుకుని సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు పీపీడీ ఉన్నవారు సాధారణంగా చికిత్సకు అంగీకరించరు. కాబట్టి కుటుంబసభ్యులే ఒప్పించి చికిత్స ఇప్పించాల్సి ఉంటుంది కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లేదా డయలెక్టిక్ బిహేవియర్ థెరపీ వంటివి కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్ను పెంచుకోవడానికి సహాయపడతాయి సైకోథెరపీ ద్వారా ఇతరులను అర్థం చేసుకోవడం, నమ్మకం పెంచుకోవడం, సరైన సంబంధాలను పెంచుకోవడం సాధ్యమవుతుంది పీపీడీకి దీర్ఘకాలిక చికిత్స అవసరం ఉంటుంది. అదంతా ఫీజు కోసమేనని థెరపిస్ట్ ఉద్దేశాలను కూడా అనుమానించే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకుని థెరపీకి తీసుకురావాల్సి ఉంటుంది. -సైకాలజిస్ట్ విశేష్ -
టెలి మానస భరతం!
కంచర్ల యాదగిరిరెడ్డి అక్షరాలా.. ఒక లక్ష అరవై నాలుగు వేల ముప్పై మూడు. 2021 సంవత్సరంలో భారత దేశంలో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య ఇది! కొంచెం అటు ఇటుగా నిమిషానికి ఇద్దరు బలన్మరణానికి పాల్పడుతున్నారన్నమాట!! కుటుంబ సమస్యలు, తీవ్రమైన వ్యాధుల బారిన పడటం ఇందుకు ప్రధాన కారణాలని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చెబుతున్నా, సంబంధిత నిపుణులు మాత్రం మానసిక సమస్యలే మూల కారణం అని స్పష్టం చేస్తుండటం గమనార్హం. చికిత్సలో వెనుకంజ.. ఎందుకీ పరిస్థితి? మానసిక సమస్యలంటే కేవలం పిచ్చి మాత్రమేనా? ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది? స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్లు ఏం చేయవచ్చు? అన్న దానిపై ప్రస్తుతం దేశంలో చర్చ కొనసాగుతోంది. భారతదేశం చాలా రంగాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండవచ్చు కానీ, అంతర్జాతీయంగా మానవాభివృద్ధికి సూచికలైన పలు అంశాల్లో ఇప్పటికీ వెనుకబడే ఉంది. వైద్యంలో, ముఖ్యంగా మానసిక సమస్యలకు చికిత్స విషయంలో మరీ వెనుకంజలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి లక్ష జనాభాకు ఉన్న సైకియాట్రిస్టులు కేవలం 0.3, సైకాలజిస్టులు 0.07 మాత్రమే. ఇంకా చెప్పాలంటే మానసిక సమస్యల చికిత్సకు ఈ దేశంలో దాదాపు అవకాశం లేనట్టే! ఇక నర్సులైతే 0.12, ఆరోగ్య సిబ్బంది 0.07% ఉన్నారు. పాశ్చాత్య దేశాల్లో ఆరోగ్య రంగానికి కేటాయించిన బడ్జెట్లో సుమారు 5–18 శాతాన్ని మానసిక సమస్యల పరిష్కారానికి ఖర్చు చేస్తుంటే భారత్లో ఇది 0.05 శాతాన్ని దాటడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి ప్రభావం దేశాభివృద్ధి, ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రంగానే కనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా బలవన్మరణాలకు పాల్పడు తున్న దేశాల్లో భారత్ ఒకటి. సుమారు 5.6 కోట్ల మనో వ్యాకులత బాధితులు, ఇంకో 4.3 కోట్ల మంది యాంగ్జైటీ రోగుల కారణంగా దేశంలో ఉత్పాదకత గణనీయంగా పడిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క కట్టింది. పనిచేసే సామర్థ్యమున్న 15– 39 ఏళ్ల మధ్య వయసు వారు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగించే విషయం. 2012– 2030 మధ్యకాలంలో ఈ నష్టం సుమారు రూ.84 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసిందంటే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. దేశంలో మార్పు మొదలైంది మానసిక సమస్యలపై దేశం దృష్టి కోణం ఇప్పుడిప్పుడే మారుతోంది. ఇంతకాలం మానసిక సమస్యల కారణంగా జరిగే ఆత్మహత్యలపైనే ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించగా, తాజాగా ఈ ఏడాది బడ్జెట్లో నిధుల కేటాయింపును పెంచింది. అంతేకాకుండా ఓ మోస్తరు మానసిక సమస్యల పరిష్కారానికి టెలి–మెంటల్ హెల్త్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 10న ‘టెలి–మానస్’ పేరుతో భారీ కార్యక్రమం ఒకటి మొదలుపెట్టింది. దీనిలో భాగంగా మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు 1–800–91–4416కు లేదా 14416కు ఫోన్ చేయడం ద్వారా సాయం పొందవచ్చు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్) ఆధ్వర్యంలో, ఐఐఐటీబీ సాంకేతిక సహకారంతో ఈ కార్యక్రమం అమలు కానుంది. 23 టెలి–మానస్ కేంద్రాలు దేశవ్యాప్తంగా మొత్తం 23 టెలి–మానస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటికి అదనంగా జిల్లా స్థాయిలో జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం/ వైద్య కళాశాలల సిబ్బంది ద్వారా కన్సల్టేషన్లు నిర్వహిస్తారు. లేదంటే ఈ– సంజీవని ద్వారా ఆడియో, వీడియో సంప్రదింపులూ జరపవచ్చు. మానసిక ఆరోగ్య నిపుణులు, కౌన్సెలర్లు అన్నిరకాల మానసిక సమస్యలకు సంబంధించి సాయం అందిస్తారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు ఈ టెలి–మానస్ కార్యక్రమం అనుసంధానమై ఉంటుంది. ఫలితంగా ఆయా కేంద్రాల్లోని అత్యవసర సైకియాట్రిక్ సౌకర్యాలు కూడా రోగులకు అందుబాటులోకి వస్తాయి. నిమ్హాన్స్ ఇప్పటికే దాదాపు 900 మంది టెలిమానస్ కౌన్సెలర్లకు శిక్షణ కూడా పూర్తి చేసింది. వ్యాయామం.. నిద్ర.. కీలకం ►రోజూ క్రమం తప్పకుండా కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. వారంలో 5 రోజుల పాటైనా వ్యాయామం చేయడం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ►సంతులిత ఆహారం, తగినన్ని నీళ్లు తాగడం కూడా అవసరం. తద్వారా శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుండ టం వల్ల చురుగ్గా ఉంటామన్నమాట. ►కంటినిండా నిద్రపోవాలి. నిద్ర నాణ్యత పెరిగిన కొద్దీ మనిషి మాన సిక ఆరోగ్యంలోనూ మెరుగుదల కనిపించినట్లు 2021 నాటి ఓ సమీక్ష స్పష్టం చేసింది. ►ప్రాణాయామం, ధ్యానం, వెల్నెస్ అప్లికేషన్ల సాయంతో వీలైనంత వరకూ మనసును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం జరగాలి. దినచర్యలను, సంఘటనలను రాసుకోవడం కూడా ఒత్తిడికి దూరం చేస్తుందని అంచనా. ►బంధుమిత్రులతో సత్సంబంధాలు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చిన్నచూపు తగదు మానసిక సమస్యలను దేశంలో ఇప్పటికీ చిన్నచూపు చూస్తున్నారు. బాధితులను హేళన చేయడం, వెకిలి మాటలతో హింసించడం కూడా సర్వసాధారణమవుతుండటం దురదృష్టకరమైన అంశం. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిని ఇది మరింత కుంగుబాటుకు గురిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సంపూర్ణ జీవితానికి ఓ సూచిక మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండటం సంపూర్ణ జీవితానికి ఓ సూచిక అన్నారు ఢిల్లీకి చెందిన మానసిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ విశాల్ ఛబ్రా. పదిహేనేళ్లుగా ప్రాక్టీసు చేస్తున్న ఛబ్రాకు గడచిన నాలుగైదేళ్లుగా కేసుల సంఖ్య పది రెట్లు పెరిగింది. ఇప్పుడు ఆయన రోజుకు 10 గంటలు పని చేస్తున్నా 25% మందికి మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు. ‘ఇటీవల కాలంలో మానసిక వ్యాధుల బారినపడుతున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అందులోనూ మహిళల సంఖ్య ఎక్కువ. పెరిగిపోతున్న పోటీతత్వం, విలాస వంతమైన జీవితాలు కావాలనుకోవడం, పొరుగు వారు లేదా సమీప బంధువులతో పోల్చుకోవడం వంటి వాటితో కుంగిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బతకాలని అనిపించలేదు: దీపిక పదుకునె ‘‘కనీసం ఒక్క ప్రాణాన్నైనా కాపాడలన్నది నా లక్ష్యం. అప్పుడే ఈ జీవితానికి సార్థకత’’.. ఏళ్లపాటు మనోవ్యాకులత సమస్యను ఎదుర్కోవడమే కాకుండా దాన్నుంచి విజయవంతంగా బయటపడి అంతర్జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి దీపికా పదుకునె ఇటీవల చేసిన వ్యాఖ్య ఇది. నృత్య దర్శకురాలు ఫరాఖాన్తో కలిసి దీపిక కొద్దిరోజుల క్రితం ‘‘కౌన్ బనేగా కరోడ్పతి’’ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో దీపిక మనోవ్యాకులత సమస్యను ఎలా ఎదుర్కొన్నది వివరించారు. ‘‘2014లో మొదటిసారి సమస్యను గుర్తించారు. అకస్మాత్తుగా చిత్రంగా అనిపించేది నాకు. పనిచేయాలని అనిపించేది కాదు. ఎవర్నీ కలవాలనిపించేది కాదు. బయటికి వెళ్లాలన్నా చిరాకు వచ్చేది. అసలు ఏమీ చేయకుండా ఉండిపోవాలనిపించేది. చాలాసార్లు ఈ జీవితానికి ఓ అర్థ్ధం లేదని, ఇంకా బతికి ఉండకూడదని అనిపించేది’’ అని తెలిపారు. ఈ సమయంలోనే తన తల్లిదండ్రులు తనను చూసేందుకు బెంగళూరు నుంచి ముంబై వచ్చారని చెబుతూ.. ‘‘వాళ్లు తిరిగి వెళ్లేటప్పుడు విమానాశ్రయంలో ఉన్నట్టుండి ఏడ్చేశా. ఏదో తేడాగా ఉందని అమ్మ గుర్తించింది. అది మామూలు ఏడుపు కాదని అనుకుంది. ఓ సైకియాట్రిస్ట్ను కలవమని సూచించింది. ఆ తర్వాత కొన్ని నెలలకు కానీ కోలుకోవడం సాధ్యం కాలేదు’’ అని దీపిక తెలిపారు. ‘‘మనోవ్యాకులత సమస్య నాకే అనుభవమైందంటే నాలాంటి వాళ్లు ఇంకెంతమంది ఉన్నారో? అని అప్పట్లో నాకనిపించింది. అందుకే ఒక్క ప్రాణాన్ని కాపాడగలిగినా ఈ జీవితానికి సార్థ్ధకత ఏర్పడినట్లే అనుకుంటున్నా..’’ అని దీపిక తెలిపారు. -
ఒత్తిడే శత్రువు.. స్థూలంగా మూడే రకాలు.. ‘యాంగ్జైటీ, మూడ్, స్కీజోఫ్రీనియా’
కంచర్ల యాదగిరిరెడ్డి వెర్రి వేయి విధాలు అంటుంటారు. అది ఇది ఒకటి కాకపోయినా మానసిక సమస్యల్లోనూ బోలెడన్ని రకాలున్నాయి. అంతేకాదు మానసిక సమస్యలు ఫలానా వారికే వస్తాయి. ఫలానా వారికి రావన్న మాటే ఉండదని.. ప్రాంతం, జాతి, స్త్రీ, పురుషులు, వయసు, ఆదాయం వంటి వాటన్నింటికీ అతీతంగా ఎవరికైనా రావొచ్చని మానసిక నిపుణులు చెప్తున్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులు, బాల్యంలో ఎదురైన అనుభవాలు, శారీరక, వైద్యపరమైన అంశాలు మన మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని.. చాలామంది బాధితుల్లో ఒకటి కంటే ఎక్కువ మానసిక సమస్యలు ఉంటాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం చెడిపోయేందుకు దోహదపడే అంశాల్లో.. మొట్టమొదట చెప్పుకోవాల్సింది సామాజిక, ఆర్థికపరమైన ఒత్తిళ్లు! మార్కులు బాగా రావాలని పిల్లలను డిమాండ్ చేయడం, మిత్రుడిలా విలాసవంతమైన కారు కొనుక్కోవాలన్న విపరీతమైన తపన వంటివి సామాజిక ఒత్తిళ్ల కోవకు వస్తాయి. ఆర్థికపరమైన ఒత్తిళ్ల గురించి కొత్తగా చెప్పే అవసరం లేదు. అవసరానికి తగిన డబ్బులు ఉండటం బాగుంటుందిగానీ లేనప్పుడే సమస్య. సమాజంలో ఆర్థికంగా అడుగున ఉన్నవారు మానసిక సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువని పలు అధ్యయనాల్లో వెల్లడైంది కూడా. 2015లో ఇరాన్లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. పేదరికంలో, వెలివాడలు లేదా ఊరికి దూరంగా ఉండటం వంటివి మానసిక ఆరోగ్యం దెబ్బతినేందుకు అవకాశం కల్పిస్తాయి. మరో అధ్యయనం ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళలు మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ. బాల్యంలోని అనుభవాలతో.. వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో బాల్యానిది కీలకమైన పాత్ర అని ఎన్నో శాస్త్రీయ అధ్యయనాలు విస్పష్టంగా చెప్పాయి. చిన్నతనంలో శారీరక, మానసిక, లైంగిక హింసను ఎదుర్కోవడం. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోవడం లేదా విడిపోవడం, తల్లిదండ్రుల్లో ఎవరైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుండటం వంటివి పిల్లల మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ అంశాలు కొన్నిసార్లు సైకోటిక్ సమస్యలకు దారితీస్తే.. మరికొన్నిసార్లు పీటీఎస్డీ (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్)కు కారణం కావచ్చని పేర్కొంటున్నాయి. జన్యువుల పాత్ర కూడా.. మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు జన్యుపరమైన కారణాలు కూడా ఉండవచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి. కుటుంబంలో నిర్దిష్ట జన్యువుల్లో మార్పులు కొనసాగుతూంటే వారికి మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ జన్యుమార్పులకు మరికొన్ని అంశాలు కూడా తోడైనప్పుడు అవి వ్యాధులుగా పరిణమించే అవకాశం ఉంటుంది. స్పష్టంగా చెప్పాలంటే.. ఏదైనా మానసిక సమస్యకు కారణమయ్యే జన్యువులు మనలో ఉన్నా అది తీవ్రమైన సమస్యగా మారుతుందని కచ్చితంగా చెప్పలేమని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా సామాజిక శాస్త్రాల విభాగం 2019 నాటి అధ్యయనంలో పేర్కొంది. ఇక ఇలాంటి నిర్దిష్ట జన్యువులు ఉన్నా, లేకున్నా మానసిక సమస్యలు తలెత్తవచ్చని తెలిపింది. ఇదే సమయంలో కేన్సర్, మధుమేహం, తీవ్రమైన నొప్పి వంటి శారీరక సమస్యలు మనోవ్యాకులత, ఆందోళన వంటి మానసిక సమస్యలకు దారితీయవచ్చని వివరించింది. స్థూలంగా మూడే.. ముందుగా చెప్పుకున్నట్టు మానసిక సమస్యల సంఖ్య పెద్దదే అయినా.. కొన్ని సాధారణ లక్షణాలున్న వాటన్నింటినీ కలిపి ‘యాంగ్జైటీ, మూడ్, స్కీజోఫ్రీనియా’ డిజార్డర్లు అనే మూడు రకాలుగా విభజించారు. ►ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణమైన మానసిక సమస్య యాంగ్జైటీ డిజార్డర్. దీనికి లోనైన బాధితుల్లో కొన్ని పరిస్థితులు, కొన్ని వస్తువుల విషయంలో విపరీతమైన ఆందోళన వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ పరిస్థితి తప్పించుకునేందుకు వారు విపరీతంగా ప్రయత్నిస్తుంటారు. యాంగ్జైటీ డిజార్డర్లో.. సాధారణ యాంగ్జైటీ డిజార్డర్తోపాటు ప్యానిక్ డిజార్డర్, ఫోబియాలు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ), పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ) వంటివి ఉంటాయి. ►మూడ్ డిజార్డర్ల విషయానికి వస్తే.. వీటిని డిప్రెసివ్ లేదా అఫెక్టివ్ వ్యాధులని కూడా పిలుస్తారు. వీటిలో బాధితుల మనోస్థితి తీవ్రమైన మార్పులకు లోనవుతూ ఉంటుంది. విపరీతమైన ఆనందం లేదా దుఖం, కోపం వంటి ఉద్వేగాలను ప్రదర్శిస్తుంటారు. మూడ్ డిజార్డర్లలో.. మనోవ్యాకులత, బైపోలార్ డిజార్డర్, సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్లు ఉంటాయి. ►స్కీజోఫ్రీనియా డిజార్డర్ల గురించి చెప్పాలంటే.. కొంచెం సంక్లిష్టమైన మానసిక సమస్యలన్నీ ఈ కోవకు చెందినవని చెప్పొచ్చు. సాధారణంగా ఈ రకమైన మానసిక సమస్యలు 16– 30 ఏళ్ల మధ్య వయసు లోనే వృద్ధి చెందుతాయి. ఆలోచనలు కుదురుగా ఉండకపోవడం స్కీజోఫ్రీనియా లక్షణాల్లో ఒకటి. చిత్త భ్రమ, పలవరింత, నిస్పృహ వంటివీ దీని లక్షణాలే. -
‘మతి’తప్పుతోంది! దేశం మాత్రమే కాదు.. ప్రపంచమే పరేషాన్లో ఉంది..
కంచర్ల యాదగిరిరెడ్డి మీకేమైనా మెంటలా? అని ఎవరైనా అన్నారంటే.. ఒంటికాలిపై లేస్తాం.. చెడామడా తిట్టేస్తాం.. కానీ ఈ భూమ్మీద ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారు తెలుసా? భయం, ఒంటరితనం, మనోవ్యాకులత, యాంగ్జైటీ వంటివన్నీ మానసిక సమస్యలేనని.. తగిన చికిత్స, సాయం అందకపోతే ఇవి శారీరక ఆరోగ్య సమస్యలుగా మారుతాయని ఎందరికి తెలుసు? మానసిక సమస్యల సంక్షోభం కొత్తేమీకాదుగానీ.. కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ఇది మరింత జటిలమైపోయింది! నిమిషానికో ఆత్మహత్య, మత్తుమందుల విచ్చలవిడి వాడకంతో లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న మానసిక సమస్యల మహాభూతంపై సమగ్ర కథనాలు మీకోసం.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇదో పాత సినిమా డైలాగ్. కానీ మానసిక సమస్యల విషయానికొస్తే దేశం మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచమే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటోంది. ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లకు చేరువవుతున్న ఈ తరుణంలో అందులో వంద కోట్ల మంది ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెప్తున్నాయి. అంతేకాదు బాధితుల్లో ఎక్కువ మంది పేదదేశాలకు చెందిన వారే కావడం.. వీరిలో 75 శాతం మంది తమ జీవితకాలంలో దీనికి చికిత్స పొందలేని పరిస్థితి ఉండటం గమనార్హం. మానసిక సమస్యల్లో సగం మేర లేత వయసులోనే మనిషిని చుట్టేస్తాయని, స్పష్టంగా చెప్పాలంటే పద్నాలుగేళ్ల వయసు నుంచే ఈ సమస్య మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. ఆ ఘర్షణ ప్రభావం ఎందరు పసిమనసులపై పడి ఉంటుందో ఊహించుకోవచ్చు. మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకునేదెవరు? భూమ్మీద ఇలాంటి ఘర్షణలు, ప్రకృతి విపత్తులు, మరికొన్ని అత్యవసర పరిస్థితుల కారణంగా 16 కోట్ల మందికిపైగా ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి మానవతా సాయం అందాల్సిన అవసరముందని ఒక అంచనా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు మానసిక సమస్యల బారినపడుతుంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. కోవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు 93శాతం దేశాల్లో మానసిక ఆరోగ్యం కోసం చేపట్టిన అంతర్జాతీయ కార్యక్రమాలు స్తంభించిపోయాయి. వాస్తవానికి మానసిక ఆరోగ్యం గురించి పట్టించుకునే దేశాలు, ప్రభుత్వాలు చాలా తక్కువ. ఆరోగ్య బడ్జెట్లో రెండు శాతానికి మించి నిధులు ఈ విభాగంపై ఖర్చు పెట్టడం లేదు. ఫలితంగా రానున్న పదేళ్లలో కేవలం కుంగుబాటు (డిప్రెషన్) అనే మానసిక సమస్యను పరిష్కరించేందుకే బోలెడంత వ్యయం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. మానసిక సమస్య అంటే? మనలో చాలా మందికి అసలు మానసిక సమస్య అంటే ఏమిటో స్పష్టంగా తెలియదు. బాధపడటం కూడా మానసిక సమస్యేనా? అని కుంగుబాటు, ఆందోళన వంటివాటిని తేలిక చేస్తూంటారు. దీనివల్ల చికిత్సగానీ, మాట సాయం అవసరమనిగానీ గుర్తించని పరిస్థితి నెలకొంటుంది. మానసిక సమస్య అంటే ఏమిటనేది సింపుల్గా చెప్పుకోవాలంటే.. మన ఆలోచనల్లో, ప్రవర్తనలో, ఉద్వేగాల్లో అసాధారణమైన మార్పులు వస్తే మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం పడినట్టుగా భావించాలి. మన మానసిక ఆరోగ్యం దైనందిన జీవితం, ఇతరులతో మన సంబంధాలను మాత్రమేకాదు భౌతిక ఆరోగ్యాన్నీ ప్రభావితం చేయగలదు. చిత్రమైన విషయం ఏమిటంటే.. మన దైనందిన జీవితం, ఇతరులతో సంబంధాలు, శరీరక సమస్యలు కూడా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. వ్యాయామాలు, మంచి ఆహారం, మంచి జీవనశైలి ద్వారా మంచి ఆరోగ్యం కోసం ప్రయత్నించినట్టే.. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని, అప్పుడే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలరని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎవరూ అతీతులు కారు! మానసిక సమస్యల్లో బోలెడన్ని రకాలున్నాయి. అవి ఫలానా వారికే వస్తాయి. కొందరికి రానే రావు అన్న వెసులుబాటు ఏమీ ఉండదు. వయసు, స్త్రీపురుషులు, ఆదాయం, జాతి వంటి వాటన్నింటికి అతీతంగా ఎవరికైనా మానసిక సమస్యలు రావొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితులు, బాల్యంలో ఎదురైన అనుభవాలు, శారీరక, వైద్యపరమైన అంశాలు వంటివన్నీ మన మానసిక ఆరోగ్యాన్ని నిర్ణయించే విషయాలు. చాలామంది బాధితుల్లో ఒకటి కంటే ఎక్కువ మానసిక సమస్యలు ఉంటాయి. మానసిక సమస్యల లెక్క ఇదీ.. ►35 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా కుంగుబాటు సమస్య ఎదుర్కొంటున్న వారి సంఖ్య ►8,00,000.. ఏటా ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి సంఖ్య. మలేరియా వల్ల కోల్పోతున్న ప్రాణాలకు ఇది రెట్టింపు ►20,63,52,50,00,00,000 రూపాయలు.. మానసిక సమస్యల కారణంగా ఏటా జరుగుతున్న ఆర్థిక నష్టం(ఉత్పాదకత తగ్గడం, అనారోగ్యం వంటి కారణాలతో..) ►రానున్న రెండు దశాబ్దాల్లో కేన్సర్, మధుమేహం, శ్వాసకోశ వ్యాధులకు పెట్టే ఖర్చు కంటే ఎక్కువగా మానసిక సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాల్సి ఉంటుందని వరల్డ్ ఎకనమిక్ ఫోరం చెబుతోంది. ►మానసిక ఆరోగ్య పరిరక్షణకు పెట్టే ప్రతి పైసా ఖర్చుకు వచ్చే సామాజిక, ఆర్థిక లాభాలు 3.3 నుంచి 5.7 రెట్లు ఎక్కువ! -
Seher Mir: అమ్మలు మెచ్చిన కూతురు
‘నా కూతురు వయసు కూడా లేదు. ఈ అమ్మాయి నాకు ఏం చెబుతుంది’ అనుకుంది ఒక అమ్మ. అయితే ఆ అమ్మాయి చెప్పిన మంచిమాటలు విన్న తరువాత, ఆ అమ్మ తన దగ్గరకు వచ్చి ‘చల్లగా జీవించు తల్లీ’ అని ఆశీర్వదించింది. నలుగురికి ఉపయోగపడే పనిచేస్తే అపూర్వమైన ఆశీర్వాదబలం దొరుకుతుంది. అది మనల్ని నాలుగు అడుగులు ముందు నడిపిస్తుంది... పుల్వామా (జమ్ము–కశ్మీర్) జిల్లాలోని పంపోర్ ప్రాంతానికి చెందిన పదిహేడు సంవత్సరాల సెహెర్ మీర్ క్లాస్రూమ్లో పాఠాలు చదువుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. సమాజాన్ని కూడా చదువుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో సమస్యల గురించి తెలుసుకుంది. వాటి గురించి విచారించడం కంటే తన వంతుగా ఏదో ఒకటి చేయాలనుకుంది. తన ఆలోచనలో భాగంగా మిత్రులతో కలిసి ‘ఝూన్’ అనే స్వచ్ఛందసంస్థను ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, శుభ్రమైన న్యాప్కిన్ల వాడకం, రుతుక్రమం, అపోహలు... ఇలా ఎన్నో విషయాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది మీర్. మొదట్లో ‘ఈ చిన్న అమ్మాయి మనకేం చెబుతుందిలే’ అన్నట్లుగా చూశారు చాలామంది. కొందరైతే సమావేశానికి పిలిచినా రాలేదు. ఆతరువాత మాత్రం ఒకరి ద్వారా ఒకరికి మీర్ గురించి తెలిసింది. ‘ఎన్ని మంచి విషయాలు చెబుతుందో’ అని మెచ్చుకున్నారు. నెలసరి విషయాలతో పాటు మానసిక ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ గురించి కూడా తన బృందంతో కలిసి ఊరూరు తిరుగుతూ అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది మీర్. కొద్దిమందితో మొదలైన ‘ఝూన్’లో ఇప్పుడు యాభై మందికి పైగా టీనేజర్స్ ఉన్నారు. ‘ఝూన్లో పనిచేయడం ద్వారా నాకు తెలిసిన నాలుగు మంచి విషయాలను పదిమందికి తెలియజేయడంతో పాటు, రకరకాల గ్రామాలకు వెళ్లడం ద్వారా సామాజిక పరిస్థితులను తెలుసుకోగలుగుతున్నాను’ అంటుంది నుహా మసూద్. ‘తెలిసో తెలియకో రకరకాల కారణాల వల్ల నెలసరి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల చాలామంది అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో మహిళలు శానిటరీ న్యాప్కిన్లను కొనకపోవడానికి కారణం డబ్బులు లేక కాదు, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకోవడం, ఇది చాలా రహస్య విషయం, ఎవరికీ తెలియకూడదు అనుకోవడం! ఈ పరిస్థితులలో మెల్లగా మార్పు తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది’ అంటుంది మీర్. ‘ఝూన్’ ఎన్నో భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుంది. వాటిని అందుకోవడానికి చురుగ్గా అడుగులు వేస్తోంది. -
మనసులో అలజడి
మనసు దృఢంగా ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు. కానీ అదే మనసు కల్లోలమైతే జీవితమే అంధకారమవుతుంది. కోవిడ్ రక్కసి మానసిక అలజడులకూ కారణమైంది. తీవ్రమైన ఆర్థిక సామాజిక ఇబ్బందుల వల్ల ఎంతోమంది మనో వ్యాకులతకు గురయ్యారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పలుచోట్ల జాగృతి కార్యక్రమాలు జరిగాయి. బనశంకరి: కోవిడ్ మహమ్మారి వేటుకు సమాజంలో ఎక్కువమంది బడుగులు, మధ్య తరగతి వారే కాదు సంపన్నులు కూడా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కుంగిపోయారు. వైరస్ భయం, లాక్డౌన్, ఉద్యోగాలను, ఆప్తులను కోల్పోవడం వంటి ఎన్నో వ్యతిరేకాంశాలతో క్లేశం అనుభవించారు. కర్ణాటకలో కోవిడ్ వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు మానసిక అనారోగ్యానికి గురయ్యారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం రాష్ట్రంలో మానసిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స పొందినవారి సంఖ్య ఏడాదిలో 10 లక్షలు ఉంది. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం. కానీ ఇంకా ఎక్కువమందే మానసిక సమస్యలతో ఆస్పత్రులకు వెళ్లి ఉంటారని ఎన్జీవోల అంచనా. కోవిడ్ సమస్యలతో కుంగుబాటు మానసిక సమస్యలకు కారణాలు అనేకం. కోవిడ్ వల్ల, ఆపై తలెత్తిన ఒంటరితనం ప్రధాన కారణం. ఉద్యోగాలు, వ్యాపారాలను కోల్పోవడం, ప్రేమ వైఫల్యం, జీవితంపై అభద్రత తదితర కారణాలతో ప్రజలు తీవ్రంగా కలత చెందారు. బాధితుల్లో చిన్నపాటి మానసిక సమస్యలు 34 శాతం ఉండగా, మతి చలించడం వంటి తీవ్ర సమస్యకు లోనైనవారు 18.4 శాతం ఉన్నారు. మద్య వ్యసనం, ఓ మోస్తరు మానసిక సమస్యల కేసులు 11.2 శాతం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. కౌన్సెలింగ్ సెంటర్లకు వరదలా కాల్స్ కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మానసిక కౌన్సెలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో కాల్స్ వచ్చాయి. 27 లక్షల మందికి పైగా ప్రజలు ఫోన్ చేసి ధైర్యంగా ఉండడానికి సాయం కోరారు. 2020–21 లో 9 లక్షల మంది సంప్రదించగా, ఈ ఏడాది 10 నెలల్లోనే 8.65 లక్షల మంది ఫోన్ చేశారు. దీనిని బట్టి కోవిడ్ తరువాత మానసిక సంఘర్షణ ఏమాత్రం తగ్గలేదని రుజువైంది. కోవిడ్ వేళ టీవీల్లో, సోషల్ మీడియాలో వచ్చిన మృతుల దృశ్యాలు మహిళలను ఎక్కువగా భయాందోళనకు గురిచేశాయి. బలవన్మరణాల బెడద బలవన్మరణాల బెడద 2021లో దేశవ్యాప్తంగా 1.64 లక్షలమంది ఆత్మహత్యకు పాల్పడగా, అందులో 18 ఏళ్లలోపు వారు 13,089 మంది ఉన్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు వారు 37 వేలమంది ప్రాణాలు తీసుకున్నారు. కర్ణాటకలో 2021లో 13 వేలమంది ఆత్మహత్య చేసుకోగా, ఈ సమస్య ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు 3వ స్థానంలో ఉంది. నగరంలో 2,292 మంది ఆత్మహత్యకు ఒడిగట్టారు. మానసిక ఆరోగ్యంపై జాగృతి మానసిక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రజల్లో జాగృతం చేయాలి. మానసిక రోగుల పట్ల చిన్నచూపు తగదు అని నిమ్హాన్స్ డైరెక్టర్ డాక్టర్ ప్రతిమా మూర్తి అన్నారు. మంచి అలవాట్లు ముఖ్యం నిమ్హాన్స్ మానసిక విజ్ఞాన విభాగ అధ్యాపకుడు డాక్టర్ మనోజ్కుమార్ శర్మ మాట్లాడుతూ సోయల్ మీడియాను అతిగా వినియోగించిన వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని అన్నారు. దీనికి బదులు బయట వాకింగ్, వ్యాయామం చేయడం, అందరితో కలవడం, ఖాళీగా లేకుండా చూసుకోవడం ముఖ్యమని సూచించారు. (చదవండి: రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని..) -
మానసిక ఆరోగ్యంపై పెరిగిన దృష్టి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో రోజువారీ ప్రాధాన్యాలు, లక్ష్యాలు మారిపోతున్నాయి. శారీరకంగా ధృఢంగా, చురుకుగా ఉండడం (ఫిజికల్ ఫిట్నెస్) కంటే కూడా మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించడం పెరిగింది. సగటు మనిషి జీవనంలోని పలు అంశాలపై మానసిక ఆరోగ్యం చూపే ప్రభావంపై క్రమంగా అవగాహన పెరుగుతోంది. గత రెండున్నరేళ్ల కరోనా మహమ్మారి ప్రభావిత కాలంలో చోటుచేసుకున్న అనేక మార్పులతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం వంటి వాటికి పెరిగిన ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది. మానసిక ప్రశాంతత కొరవడిన వ్యక్తులపై వివిధ సమస్యలు ఏ విధంగా ప్రభావితం చూపుతున్నాయనేది క్రమంగా ప్రపంచానికి తెలిసొస్తోంది. మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే అది నేర్చుకునే గుణం, పనిలో మెరుగైన ఉత్పాదకత, ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలు పెంపొందించుకోవడంపై ప్రభావం చూపుతున్నట్టు వివిధ పరిశోధనలు, అధ్యయనాల్లో గుర్తించారు. ఈ పరిశీలనల్లో భాగంగా కోవిడ్ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా జాబ్మార్కెట్ ఒడిదొడుకుల్లో ఉద్యోగులు మానసికస్థితి ఒత్తిళ్లకు గురవుతున్నట్లు గుర్తించారు. 2022 జూన్లో డబ్ల్యూహెచ్వో విడుదల చేసిన నివేదికలో ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది ఏదో ఒక రూపంలో మానసికంగా ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్లు వెల్లడైంది. సోమవారం ‘వరల్డ్ మెంటల్ హెల్త్డే’ సందర్భంగా ఆయా అంశాలు, విషయాలు చర్చనీయాంశమయ్యాయి. మానసిక ఆరోగ్య పరిరక్షణ అనేది ముఖ్యం.. ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక ఆరోగ్య పరిరక్షణ చాలా ముఖ్యం. గత రెండున్నరేళ్ల కరోనా కాలంలో భవిష్యత్పై అనిశ్చితితో అధిక శాతం మంది జీవన ప్రమాణాలు దిగజారడం, తగిన ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడంతో చాలా కుటుంబాల్లో మానసిక ఒత్తిళ్లు పెరిగాయి. దాంతో మానసిక ప్రశాంత సాధనతోపాటు మానసిక ఆరోగ్యం కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఏర్పడింది. డబ్ల్యూహెచ్వో కూడా ‘మెంటల్ వెల్నెస్’పై దృష్టి పెట్టాలని చెబుతోంది. అయితే ప్రభుత్వాలు మన దగ్గర ఇప్పటిదాకా ‘మెంటల్ హెల్త్’పై ప్రత్యేక దృష్టి పెట్టలేదు. కోవిడ్ మహమ్మారి తీసుకొచ్చిన పరిస్థితుల ప్రభావంతో ఈ దృష్టిలో మార్పు వచ్చింది. ఇన్ని రోజులుగా పట్టించుకోని ముఖ్యమైన అంశంపై తప్పక దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. శారీరకంగా ఎదురయ్యే అనేక సమస్యలకు మానసిక అనారోగ్యం కారణమవుతోంది. వాస్తవాలను అంగీకరించే స్థితికి చేరుకుంటే మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. మానసిక ఆరోగ్యంతోనే ఉత్పాదకత పెరగడం, మెరుగైన కుటుంబ సంబంధాలతో శారీరక ఆరోగ్యం కూడా మెరుగౌతుంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
Podcast: ఆత్మీయనేస్తంగా పాడ్కాస్ట్! యూత్కు దగ్గరైన జానర్లలో అగ్రస్థానం దానిదే
కోవిడ్ టైమ్లో యూత్కు సన్నగా పరిచయం అయిన ‘పాడ్కాస్ట్’ ఇప్పుడు వారికి ఆత్మీయనేస్తం అయింది. హైదరాబాద్లోని మణికొండకు చెందిన చరితకు పాటలు వినడం అంటే ఇష్టం. అయితే ఇప్పుడు ఆమె పాడ్కాస్టింగ్లో పాటలు ఒక భాగం మాత్రమే. ‘నాకు పాటలు వినడం అంటే ఎంత ఇష్టమో ట్రావెల్ చేయడం అంటే కూడా అంతే ఇష్టం. ముసాఫిర్ స్టోరీస్లాంటి ట్రావెల్ పాడ్కాస్ట్ల ద్వారా ఎప్పటికప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నాను’ అంటుంది చరిత. నాగ్పుర్కు చెందిన భానుకు రాత్రి ఒక పట్టాన నిద్ర పట్టదు. అయితే ఎవరైనా కబుర్లు చెబుతుంటే, వింటూ వింటూ నిద్రపోతుంటాడు! ఇప్పుడు అతడికి పాడ్కాస్ట్ అనేది ఆత్మీయనేస్తం అయింది. ఎన్నో రంగాలకు చెందిన కబుర్లు వింటూ వింటూ నిద్రపోతుంటాడు. పద్దెనిమిది నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారి నుంచి పాడ్కాస్ట్కు అమితమైన ఆదరణ లభిస్తున్నట్లు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. యూత్కు దగ్గరైన పాడ్కాస్ట్ జానర్లలో ‘మెంటల్ హెల్త్’ అగ్రస్థానంలో ఉంది. భోపాల్కు చెందిన తన్వీకి అకారణ దిగులు. ఎలాంటి సమస్యా లేదు...మరి దిగులెందుకో తెలియదు! స్నేహితుల సలహా మేరకు ‘ది హ్యాపీ టైమ్స్’ ‘ఎమోషనల్ ఫీల్’ ‘బుద్ధిస్ట్ సొల్యూషన్స్ ఫర్ లైఫ్స్ ప్రాబ్లమ్స్’....మొదలైన పాడ్కాస్ట్లు వింటూ ఉంది. ఇప్పుడు ఆ అకారణ దిగులు మాయం అయినట్లు చెబుతుంది తన్వీ. యూత్కు స్ట్రెస్ బస్టర్గా పాడ్కాస్టింగ్ ఉపయోగపడుతోంది. తెలుసుకోవడం, నేర్చుకోవడం, పరిష్కారాలు అందిపుచ్చుకోవడానికి మాత్రమే పరిమితం కావడం లేదు. సృజనాత్మకంగా స్వీయవ్యక్తీకరణకు పాడ్కాస్టింగ్ను బలమైన వేదికలా ఉపయోగించుకుంటోంది యూత్. చదవండి: Diet Tips To Control Asthma: ఆస్తమా ఉందా? వీటిని దూరం పెట్టండి.. ఇవి తింటే మేలు! -
ఉద్యోగుల్లో తరుముకొస్తున్న..మానసిక ముప్పు, భయపెట్టిస్తున్న షాకింగ్ రిపోర్ట్!
న్యూఢిల్లీ: ఉద్యోగుల మానసిక సమస్యలు సంస్థలపై పెద్ద భారాన్నే మోపుతున్నాయి. ఏ స్థాయిలో అంటే 14 బిలియన్ డాలర్ల మేర (రూ.1.2 లక్షల కోట్లు). డెలాయిట్ తూచ్ తోమత్సు ఇండియా ఇందుకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. మానసిక అనారోగ్యం కారణంగా విధులకు గైర్హాజరు కావడం, తక్కువ ఉత్పాదకత, వలసలు కలసి కంపెనీలు ఈ స్థాయిలో నష్టపోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయంగా ఉద్యోగుల్లో మానసిక అనారోగ్య సమస్యలు పెరుగుతూ పోతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా మానసిక అనారోగ్యం వల్ల పడే భారంలో భారత్ వాటా 15 శాతంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గణాంకాలు చెబుతున్నాయి. భారత ఉద్యోగుల్లో మానసిక ఆరోగ్యం ఎలా ఉంది, సంస్థలపై దాని ప్రభావం ఏ మేరకు అనే విషయాలను తెలుసుకునేందుకు డెలాయిట్ ఈ సర్వే నిర్వహించింది. పని ఒత్తిళ్లు ఎక్కువే.. పనిలో ఉండే ఒత్తిళ్లు తమ మానసిక ఆరోగ్యానికి దెబ్బతీస్తున్నట్టు 47 శాతం మంది నిపుణులు చెప్పారు. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు, కరోనా మహమ్మారిని వారు కారణాలుగా పేర్కొన్నారు. ఈ ఒత్తిళ్లు అన్నవి వ్యక్తిగతంగా, వృత్తి పరంగా, సామాజికంగానూ ఉద్యోగులపై చూపిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగులు పనికి వచ్చినా, వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల వల్ల కారణంగా ఉత్పాదకత తక్కువే ఉంటున్న విషయాన్ని ఈ నివేదిక ఎత్తి చూపింది. గడిచిన ఏడాది కాలంలో 80 శాతం ఉద్యోగులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. గణాంకాలు భయపెట్టే విధంగా ఉన్నా.. 39 శాతం మంది సామాజిక నిందల భయంతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది. పని ప్రదేశాల్లో మానసిక అనారోగ్యం ఉన్నప్పటికీ 33 శాతం మంది తాము ఎప్పటిమాదిరే విధులకు హాజరవుతున్నామని చెప్పగా.. 29 శాతం మంది కొంత సెలవు తీసుకోవడం చేస్తున్నట్టు చెప్పారు. ఇక 20 శాతం మంది రాజీనామా చేసి ఒత్తిడి తక్కువగా ఉండే మెరుగైన ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నట్టు డెలాయిట్ సర్వేలో వెల్లడించారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రాధాన్య అంశంగా సంస్థలు పరిగణించాలని.. మానసిక అనారోగ్యానికి మూల కారణాలను తెలుసుకుని పరిష్కారాలపై దృష్టి పెట్టాలని డెలాయిట్ సూచించింది. -
Health Tips: ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారా? అయితే...
Health Tips In Telugu: సంతోషకరమైన జీవితం ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి లేని జీవన శైలిని అలవరుచుకోవాలి. దీనిపై పెద్దవాళ్లు, అనుభవజ్ఞులు, ఆయుర్వేద వైద్యనిపుణులు స్పష్టమైన ఆరోగ్యసూత్రాలను ఎప్పుడో చెప్పారు. వాటిని పాటించడం వల్ల మానసిక దృఢత్వం కలుగుతుంది. ఉండవలసిన దినచర్య ►యోగా చేయడం ►ఏడెనిమిది గంటలకు తగ్గకుండా మంచి నిద్ర ►తొందరగా నిద్ర లేవడం ►జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్, డాన్సింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్సైజ్లు చేయడం. ►తోటివారితో కరుణతో వ్యవహరించడం, పెద్దలు, ఇతరుల పట్ల గౌరవం కలిగి ఉండడం. ►దినచర్య, రుతుచర్య పాటించడం, దయతో వ్యవహరించడం. ►పరోపకార గుణం కలిగి ఉండడం. ►ఆధ్యాత్మిక భావాలు ఉంటే పూజ చేసుకోవడం, పవిత్ర గ్రంథాలు పఠించడం ►కుటుంబంతో ఉల్లాసంగా గడపడం. ►రీడింగ్, సింగింగ్, గార్డెనింగ్, పేయింటింగ్, మ్యూజిక్ వినడం వంటి అలవాట్లతో ఒత్తిడిని దూరం చేసుకోవడం. ►అనవసర జోక్యాలు లేకుండా మనసును నియంత్రించడం చేయకూడనివి ►ఆలస్యంగా నిద్ర పోవడం, ఆలస్యంగా లేవడం, అసలు నిద్ర పోకుండా ఉండడం ►పగటి నిద్ర పోవడం ►శారీరక శ్రమ, వ్యాయామం లేకుండా అధికంగా కూర్చుని ఉండే జీవన సరళి కలిగి ఉండడం ►అధికంగా ఒత్తిడి కలిగి ఉండడం ►కామం, క్రోధం, లోభం వంటివాటిపై నియంత్రణ లేకపోవడం ►సామాజిక నిబంధనలు, నైతిక విలువలు పాటించక, అసహజ ప్రవర్తన కలిగి ఉండడం ►అతిగా ఆలోచించడం, ఏవో పాత సంఘటనలని తలచుకుని నిరంతరం బాధపడుతుండడం, ఆందోళన పడటం ►నిరంతరం టీవీ, మొబైల్ చూడటం.. దీనివల్ల సెన్స్ ఆర్గాన్స్పై ఒత్తిడి ►కోపం, భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవడం ►అతిగా భయం, కామం వంటి వాటికి లోనయ్యే చర్యలకు పాల్పడడం చదవండి: Diet For Mental Health: మానసిక దృఢత్వం కోసం.. ముడి పెసలు, ఉసిరి.. ఇంకా! ఇవి మాత్రం మానేయాలి! Health Tips: కాలీఫ్లవర్, క్యారెట్లు, బీట్రూట్, పుట్టగొడుగులు అతిగా తింటే అంతే సంగతులు! కాస్త.. -
Health: మానసిక దృఢత్వం కోసం.. ముడి పెసలు, ఉసిరి.. ఇంకా! ఇవి మాత్రం తినొద్దు!
ఇటీవలి కాలంలో మానసిక వ్యాధులు అధికం అవుతున్నాయి. అతి సున్నితమైన మనస్తత్వం వల్ల, చిన్నప్పటినుంచి ఎక్కువ గారాబంగా పెరగడం వల్ల, జీవితంలో ఏదయినా అనుకోని సంఘటనలు ఎదుర్కొనవలసి రావడం వల్ల మానసిక వ్యాధులు కలుగుతాయి. అలా మానసిక వ్యాధులు రాకుండా ఉండాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి.... మానసికంగా దృఢంగా ఉండాలంటే మన జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఏయే పదార్థాలు తీసుకోవాలి, ఏయే పదార్థాలు తీసుకోకూడదో చూద్దాం. Foods That Boost Mental Health: ఇవి తీసుకోవాలి ►ఎక్కువ పాలిష్ చేయని బియ్యం ►ముడి పెసలు ►తాజా పాలు ►నెయ్యి ►గోధుమలు ►వెన్న ►బూడిద గుమ్మడికాయ ►పరిశుభ్రమైన ఆహారం ► సీజనల్ పండ్లు, కూరగాయలు ►ద్రాక్ష ►దానిమ్మ ►ఉసిరి ►చేపలు ►కొవ్వు ఎక్కువగా ఉండని మాంసం ►యాపిల్ ►ఆర్గానిక్ ఎగ్స్. మానేయవలసినవి ►కలుషిత ఆహారం అంటే రోడ్డు వెంట దొరికే అపరిశుభ్రమైన ఆహారం తినడం ►రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాల్ ►కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం (దీనివల్ల న్యూరోట్రాన్స్మిటర్స్ పనితీరుపై ప్రభావం పడుతుంది) ►స్మోకింగ్, గుట్కాలు తినడం ►ఫాస్ట్ఫుడ్కు అలవాటు పడటం ►ఊరగాయలు, కారాలు, మసాలాలు అధికంగా ఉన్న ఆహారం ►డీప్ ఫ్రీజర్లో నిల్వ ఉంచిన కోల్డ్ ఫుడ్ ►అధికంగా పుల్లగా ఉండే పదార్థాలు (పులియబెట్టినవి, వెనిగర్ లాంటివి) ►అతి కష్టంమీద జీర్ణమయ్యే ఆహారం ►బూజు పట్టిన, పాడైన, కుళ్లిన ఆహారం తీసుకోవడం ►అధికంగా తినడం, తీసుకున్న ఆహారం అరగకముందే మళ్లీ తినడం ►పాలు–గుడ్డు లేదా చేపలు, వేడి–చల్లని పదార్థాలు కలిపి తీసుకోవడం, పండ్లు–పాలు కలిపి తీసుకోవడం. చదవండి: Benefits Of Onion Juice: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! నల్లని, ఒత్తైన కురులు..! Health Tips: కాలీఫ్లవర్, క్యారెట్లు, బీట్రూట్, పుట్టగొడుగులు అతిగా తింటే అంతే సంగతులు! కాస్త.. -
చుట్టూ అందరూ ప్రేమించేవాళ్లే.. కానీ ఒంటరిగా ఫీలయ్యా!
టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి మానసిక రుగ్మతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక అథ్లెట్గా మానసిక సమస్యను భరించడం కష్టమని.. అది మనలో ఎంతో ఒత్తిడి నింపుతుందని పేర్కొన్నాడు. అలాంటి అనుభవం నాకు కూడా ఎదురైందని కోహ్లి తెలిపాడు. ఒక దశలో చుట్టూ అందరూ ప్రేమించేవాళ్లు ఉన్నప్పటికి ఒంటరిగా ఫీలయ్యానని చెప్పుకొచ్చాడు. కొంత గ్యాప్ తర్వాత ఆసియాకప్ 2022కు సన్నద్ధమవుతున్న కోహ్లి ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్య్వూలో అథ్లెట్లకు ఉండే మానసిక ఒత్తిడిని ఎలా జయించాలనే దానిపై మాట్లాడాడు. ''సాధారణంగా అథ్లెట్ ఒక ఆటగాడిగా ఉత్తమమైన వాటిని తీసుకురావాలి. అదే సమయంలో ఉండే ఒత్తిడి మన మానసిక ఆరోగ్యంపై ప్రతికూలం ప్రభావితం చూపిస్తోంది. దీనిని దరి చేరనీయకుండా ఉండాలంటే కసరత్తులపై దృష్టి పెట్టాలి. మంచి ఫిట్నెస్ ఉంటే ఆటోమెటిక్గా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనం చేయాలనుకుంటున్న పనిపై కూడా శ్రద్ద పెరుగుతుంది. ఈ సందర్భంగా ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నా. ఇలాంటి అనుభవం నాకు ఎదురైంది. ఒకసారి నేను వెళ్లిన గదిలో నా చుట్టూ ఉన్నవాళ్లంతా నన్ను ప్రేమించేవాళ్లో లేక అండగా నిలబడేవాళ్లు ఉన్నారు. అయినప్పటికి నేను ఒంటరిగా ఫీలయ్యా. ఎవరితో సరిగ్గా కలవలేకపోయాను. కానీ ఆ తర్వాత నాకు నేను సర్దిచెప్పుకొని కలిసిపోయాను. అందుకే మన మూడ్ సరిగా లేకపోయినప్పటికి నిరంతరం అందరితో మంచి రిలేషన్ కొనసాగిస్తూనే ఉండాలి. మీకున్న ఒత్తిడి తొలగించుకోవడానికి ఇదే మంచి మార్గం'' అని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ పర్యటన తర్వాత జట్టుకు దూరమైన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆసియా కప్-2022 టోర్నీ నేపథ్యంలో తిరిగి మైదానంలో దిగనున్నాడు.ఇటీవల ముంబైలోని బికేసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న కోహ్లి.. తాజాగా జిమ్లో వర్కౌట్లు చేస్తున్న వీడియో షేర్ చేశాడు. వెయిట్ లిఫ్టింగ్తో పాటు... కఠిన వ్యాయామాలు పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించేందుకు కష్టపడుతున్నాడు. చదవండి: జిమ్లో చెమటోడుస్తున్న కోహ్లి.. వీడియో వైరల్! కింగ్.. ఒక్క సెంచరీ ప్లీజ్! Andre Russell: 'బలిపశువులా బస్సు కిందకు తోయాలనుకుంటున్నారు!' -
టీమిండియా మెంటల్ హెల్త్ కోచ్గా మళ్లీ అతనే..!
టీమిండియా మెంటల్ హెల్త్ కండీషనింగ్ కోచ్గా ప్యాడీ అప్టన్ మళ్లీ నియమితుడయ్యాడు. గతంలో పలు సందర్భాల్లో టీమిండియా తరఫున ఈ బాధ్యతలు నిర్వహించిన అప్టన్ను ఈ ఏడాది చివర్లో జరుగనున్న టీ20 వరల్డ్కప్ కోసం బీసీసీఐ ఏరికోరి ఎంపిక చేసింది. అప్టన్ ఎంపిక తక్షణమే అమల్లోకి వస్తుందని, అతను విండీస్ పర్యటనలో ఉన్న టీమిండియాతో జాయిన్ అవుతాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అప్టన్ 2011లో టీమిండియా వన్డే వరల్డ్కప్ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. అటగాళ్ల మానసిక ఒత్తిడిని దూరం చేయడంలో అప్టన్కు నిపుణుడిగా మంచి పేరుంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో అప్టన్కు మంచి సంబంధాలు ఉండటంతో ఈ ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. ద్రవిడ్ టీమిండియాలో సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి వీరిద్దరికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ ఐపీఎల్లో (ద్రవిడ్-రాజస్థాన్ రాయల్స్, అప్టన్-ఢిల్లీ డేర్డెవిల్స్) కూడా వివిధ ఫ్రాంచైజీలకు పని చేశారు. చదవండి: 'అతడిని సరిగ్గా ఉపయోగించుకోండి.. మరో ఏడేళ్ల పాటు భారత్కు' -
మాల్ పార్కింగ్లో శవమై కనిపించిన టిక్టాక్ స్టార్
లాస్ ఏంజెల్స్: అమెరికన్ టిక్టాక్ స్టార్ కూపర్ నోరిగ(19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం(జూన్ 9న) లాస్ ఏంజిల్స్లోని మాల్లో పార్కింగ్ లైన్లో శవమై కనిపించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా అతడు మృతి చెందడానికి కొన్ని గంటల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో బెడ్పై సేద తీరుతున్న కూపర్ 'యుక్త వయసులోనే చనిపోతామేమో అని ఎవరు ఆలోచిస్తున్నారు?' అని ఫ్యాన్స్ను ప్రశ్నించాడు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటలకే అతడు నిర్జీవంగా కనిపించడం గమనార్హం. కొంతకాలంగా కూపర్ మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 5న టిక్టాక్లో అతడు ఓ వీడియో షేర్ చేస్తూ.. 'మీ సాదకబాధకాలను నాతో చెప్పుకోండి. ఎందుకంటే మానసిక ఒత్తిడి మనల్ని ఎంతగా బాధిస్తుందనేది నాకు తెలుసు, మీరు ఒంటరి కాదు.. మీకు నేనున్నాను' అని చెప్పుకొచ్చాడు. ఇక కూపర్కు టిక్టాక్లో 1.77 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఫన్నీ స్కేట్ బోర్డింగ్ వీడియోలతో పాటు ఫ్యాషన్ వీడియోలను సైతం టిక్టాక్లో అప్లోడ్ చేసి ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేసేవాడు కూపర్. చదవండి: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య, ఎమోషనలైన ఉపాసన నా సినిమా ఫ్లాప్ అయినా కూడా రానా బాగుందనేవాడు -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు చల్లని కబురు.. ఒత్తిడిని దూరం చేసేందుకు ప్లాన్స్!
సాక్షి, హైదరాబాద్: నూతన ప్రాజెక్టులు, తీరిక లేకుండా సదస్సులు, సమావేశాలు, కొత్త ప్రోగ్రాంలతో కుస్తీ పట్టే ఐటీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు పలు ఐటీ కంపెనీలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఒత్తిడితో సతమతమవుతున్న ఐటీ ఉద్యోగుల శాతం ఏటా పెరుగుతోందని.. గతేడాది సుమారు 79 శాతం మంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు ఐటీ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్, సెమినార్లు, మోటివేషనల్ తరగతులు నిర్వహించేందుకు పలు ఐటీ కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తుండడం విశేషం. నగరంలో చిన్న, మధ్యతరహా, కార్పొరేట్ ఐటీ కంపెనీలు 1500 వరకు ఉన్నాయి. వీటిలో సుమారు 80 శాతం కంపెనీలు ఈ శిక్షణ తరగతుల నిర్వహణకు శ్రీకారం చుట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. నియామకాల్లోనూ నయా పద్ధతి.. ► గ్రేటర్ సిటీకి ఐటీ కంపెనీల వెల్లువ మొదలైంది. దీంతో ఉద్యోగుల పని విధానంలో సమూల మార్పులు చేయడంతోపాటు.. సమీప భవిష్యత్లో నియామకాల్లో సైతం సాంకేతికతను విరివిగా వినియోగించేందుకు ఐటీ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు, ఇంటర్వ్యూలు, పదోన్నతులు అన్నీ వర్చువల్ విధానంలో జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్చైన్ టెక్నాలజీతో ఉద్యోగార్థుల బయోడేటాలను తనిఖీ చేయనున్నారు. ► వీడియో స్ట్రీమింగ్ ద్వారా అభ్యర్థి భావోద్వేగాలు, ఆలోచనలు,వ్యక్తిత్వాన్ని అంచనా వేయనున్నారు. కాగా కోవిడ్ తరుణంలోనూ గతంలో నగరంలో పలు కంపెనీలు వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించి వేలాదిమందికి ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొంటున్నారు. నగరంలోని కంపెనీలు 54 శాతం మందిని,విదేశీ కంపెనీలు 49 శాతం మందిని ఈ విధానంలో నియమించుకున్నట్లు హైసియా వర్గాలు తెలిపాయి. ► ఐటీ రంగంలో నూతన సాంకేతికతకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ), కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్తో పని విధానం సమూలంగా మారనుందని అభిప్రాయపడుతున్నారు. ఏఐ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో భవిష్యత్లో ఉద్యోగాల కల్పనకు మరింత ఊతమిచ్చే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. (క్లిక్: ఓయూలో అడోబ్ పరిశోధనాకేంద్రం) -
నిద్రలేమి అనారోగ్యాలను తీవ్రతరం చేస్తున్న కోవిడ్!
నిద్రలేమి వల్ల రోగనిరోధక శక్తి తగ్గడం... దాంతో అనేక అనారోగ్యాలు కలుగుతాయన్నది తెలిసిందే. కానీ నిద్రలేమితో బాధపడేవారికి కోవిడ్ సోకితే... దానివల్ల అనారోగ్య సమస్యలు మరింత పెరుగుతాయనీ... పైగా మానసిక అనారోగ్యాలూ కలుగుతాయని తాజాగా నిరూపితమైంది. మంచి ఆరోగ్యం కోసం ఎంతసేపు నిద్రపోవాలన్న అంశం చర్చనీయాంశమైనప్పటికీ... సాధారణంగా యువతీ–యువకులకు కనీసం ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాలని, కౌమార బాలబాలికలైతే అంతకంటే మరో గంట ఎక్కువే నిద్రపోవాలనీ... అప్పుడే వారిలో జ్ఞాపకశక్తి, పెరుగుదల ఉంటాయని నిద్ర నిపుణులు చెబుతుంటారు. మామూలుగా ఆరు గంటలు నిద్ర కూడా సరిపోతుందని కొందరు చెబుతుంటారుగానీ... ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారికి కోవిడ్ సోకినప్పుడు వారిలో చాలామంది మానసిక అనారోగ్యాలకు గురయ్యారని ఇటీవలి కోవిడ్ సోకిన రోగులను పరిశీలించినప్పుడు తెలియవచ్చింది. అంతేకాదు.. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన అధ్యయనవేత్తల పరిశీలనలోనూ ఇదే నిజమని తేలింది. ఇలా నిద్రలేమితో బాధపడేవారికి కోవిడ్ సోకినప్పుడు వాళ్లలో ఎక్కువ మంది అంటే దాదాపు 75›శాతానికి పైగా మానసిక అనారోగ్యాల బారిన పడ్డారనీ... అందులోనూ డిప్రెషన్తో కుంగుబాటుకు లోనైనవారే ఎక్కువనీ, అటు తర్వాత యంగై్జటీ వంటి బాధలకు గురయ్యారని కూడా వైద్యుల పరిశీలనలో తేలింది. సంఖ్యాపరంగా చూస్తే... డిప్రెషన్, యాంగై్జటీల తర్వాత భావోద్వేగాల పరంగానూ, భౌతికంగానూ బాగా అలసటగా ఫీలయ్యేవారు ఎక్కువన్నది నిపుణుల మాట. మానసిక ఆరోగ్యానికి నిద్ర మరింత అవసరమనే అంశం నిర్ద్వంద్వంగా నిరూపితమయ్యిందంటున్నారు హార్వర్డ్కు చెందిన పరిశోధకులు. -
మెంటల్ హెల్త్ యాక్టివిజం
మనసుకు వైద్యం చాలా ముఖ్యం మానవ హక్కుల కోసం, స్త్రీల హక్కుల కోసం పని చేసే యాక్టివిస్టులు ఉన్నారు. కాని ‘మెంటల్ హెల్త్’ బాగుండాలని పని చేసే యాక్టివిస్టులు తక్కువ. నీరజా బిర్లా– కుమార మంగళం బిర్లా భార్యగా కంటే ‘మెంటల్ హెల్త్ యాక్టివిస్టు’గా వచ్చే గుర్తింపును ఎక్కువ ఇష్టపడతారు. ‘ఎంపవర్’ అనే సంస్థను స్థాపించి బాలల, మహిళల మానసిక ఆరోగ్యం కోసం పని చేస్తున్నారామె. ఇటీవల హైదరాబాద్లో జరిపిన సర్వేలో ఎమర్జెన్సీ నంబర్లకు కేవలం ఒక శాతం మాత్రమే మానసిక సమస్యలు చెప్పుకునే కాల్స్ వచ్చాయి. అంటే మనసుకు వచ్చిన ఆపదను ఇంకా ధైర్యంగా బయటకు చెప్పే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో నీరజా బిర్లా ఏమంటున్నారో విందాం. ‘నా తొలి కాన్పు జరిగి కూతురు (అనన్యా బిర్లా) పుట్టాక నిజానికి అదొక పండగ వాతావరణంగా ఉండాలి. అదంరూ సంతోషంగా ఉండాలి. అందరూ ఉన్నారు కూడా. కాని నేను మాత్రం ఎలాగో అయిపోయాను. నా ఒడిలో చందమామలాంటి బిడ్డ ఉన్నా నా మనసు రకరకాలుగా ఉండేది. ఊరికే ఏడుపు వచ్చేది. చాలా నిరాశగా అనిపించేది. చిరాగ్గా ఉండేది. ఇలా ఎందుకుందో నాకు తెలియలేదు. దీని గురించి ఎవరితో మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. కాని చివరకు తెలిసింది అది ‘పోస్ట్పార్టమ్ డిప్రెషన్’ అని! ఇలా చాలామంది స్త్రీలకు అవుతుందని. ఆ సంగతి నాకు ముందే తెలిస్తే నేను ఆ సమస్యను సరిగ్గా ఎదుర్కొని ఉండేదాన్ని. ధైర్యంగా ఉండేదాన్ని. బహిరంగంగా మాట్లాడేదాన్ని. నాలా ఎంతమంది బాధ పడుతున్నారో అనిపించింది. అప్పటి నుంచి దేశంలో మానసిక ఆరోగ్యం గురించి ఉన్న చైతన్యాన్ని గమనించడం మొదలుపెట్టాను. దాని గురించి ఎవరో పని చేయడం కాదనీ, మనమూ మనకు వీలైన పని చేయవచ్చని ఆరేళ్ల క్రితం ఎంపవర్ సంస్థ స్థాపించాను. పూర్తిగా మానసిక ఆరోగ్యం గురించి ప్రచారం, సహాయం చేసే సంస్థ ఇది. ఈ సంస్థ వల్ల మంచి జరగుతున్నందుకు ఆనందంగా ఉంది’ అంటున్నారు 51 ఏళ్ల నీరజా బిర్లా. ఎన్నో ఏళ్లు సామాజిక సేవ, విద్య రంగాల్లో పని చేస్తున్న నీరజా బిర్లా ఇప్పుడు పూర్తిగా ‘ఎంపవర్’ (మైండ్ పవర్) సంస్థ ద్వారా చేయాల్సిన పని గురించే శ్రద్ధ పెడుతున్నారు. తనను తాను ‘మెంటల్ హెల్త్ యాక్టివిస్ట్’గా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇద్దరు జర్నలిస్టులు ఆరేళ్ల క్రితం నీరజా బిర్లా ‘ఎంపవర్’ ఆవిర్భావం గురించి ప్రెస్మీట్ పెడితే ఇద్దరే జర్నలిస్టులు హాజరయ్యారు. ‘చూడండి... మన దేశంలో మానసిక ఆరోగ్యం గురించి ఎంత నిర్లక్ష్యం ఉందో. అదొక నిషిద్ధ విషయంగా కూడా ఉంటోంది. ఎవరైనా తమకు మానసిక అనారోగ్యం ఉందంటే పిచ్చి అని సమాజం ముద్ర వేస్తుందనే భయం ఇప్పటికీ పోలేదు. దీని గురించే ఎక్కువగా చైతన్యం కలిగించాలి. జ్వరం వస్తే ఎంత సులభంగా చెప్పుకుంటామో అంత సులభంగా చెప్పుకోగలగాలి. బండి మీద నుంచి కింద పడితే అందరూ పరిగెత్తి వెళ్లి ఎంత సహజంగా సాయం చేస్తారో... ‘‘యాంగ్జయిటీగా ఉంది, పానిక్గా ఉంది, డిప్రెషన్గా ఉంది’’ అంటే కూడా అంతే సహజంగా సాయం చేసేలా ఉండాలంటారు నీరజ. పిల్లల స్థాయి నుంచి ‘ఎంపవర్’ మొదలెట్టినప్పుడు నీరజ ఆలోచనలు స్కూలు స్థాయి నుంచి మానసిక ఆరోగ్యం గురించి చైతన్యం కలిగిస్తే చాలు అనేంతవరకే ఉన్నాయి. లెక్కల సిలబస్, సైన్స్ సిలబస్ ఉన్నట్టే మానసిక ఆరోగ్యం గురించి కూడా సిలబస్ చిన్నప్పటి నుంచి పిల్లలకు ఉండాలని ఆమె అనేక స్కూళ్లలో ఆ సిలబస్ పెట్టించారు. అంతే కాదు, పిల్లల కోసమే ప్రత్యేకమైన వర్క్షాప్స్ నిర్వహించారు. ‘అసలు అందరి కంటే ఎక్కువగా కౌమార దశలో ఉన్న పిల్లల మానసిక ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టాలి. ఆ వయసులోనే బాడీ షేమింగ్, పర్సనాలిటీ డిజార్డర్స్, ఈటింగ్ డిజార్డర్స్... ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా తలనొప్పి, జ్వరం లాంటి సమస్యలే అని వారికి తెలిస్తే వారు సులువుగా వాటిని ఎదుర్కొంటారు’ అంటారు నీరజా. అయితే పని కొనసాగే కొద్దీ ఆమె మానసిక ఆరోగ్య సమస్యలు పిల్లలు, స్త్రీలు అని కాకుండా అన్ని దశల, వయసుల్లో ఉన్నవారికి అవసరం అనే అవగాహనకు వచ్చారు. ఆ మేరకు పనిచేస్తున్నారు. ఈమె సాగిస్తున్న ఈ ఉద్యమంలో కుమార్తె అనన్యా బిర్లా కూడా భాగస్వామి అయ్యింది. ఇటీవల జరుగుతున్న డిప్రెషన్ ఆత్మహత్యలను పరిశీలిస్తే మానసిక ఆరోగ్యం గురించి పెద్ద ఎత్తున ప్రతి చోటా చర్చలు, చైతన్య శిబిరాల అవసరం తెలిసి వస్తోంది. ప్రభుత్వాలు, సంస్థలు ఆ దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలి. నగరాల్లో క్లినిక్లు ‘ఎంపవర్’ ఆధ్వర్యంలో నేరుగా వైద్య సహాయం అందించే క్లినిక్లను ముంబైలో 3 ఏర్పాటు చేశారు నీరజ.. ఆ తర్వాత కోల్కటా, బెంగళూరు, హైదరాబాద్, గోవా, పిలానీలలో క్లినిక్లను ఏర్పాటు చేశారు. వీరు నేరుగా వైద్య సహాయం అందిస్తే కౌన్సిలర్ల వ్యవస్థను కూడా విస్తృతం చేసుకుంటూ వెళుతున్నారు. ‘మన దేశంలో సమస్య ఏమిటంటే మనకు మానసిక సమస్య ఉందని తెలిశాక వైద్యానికి ఎక్కడికి వెళ్లాలో తెలియదు. సైకియాట్రిస్ట్లు పెద్దగా అందుబాటులో కూడా ఉండరు. యాంగ్జయిటీ సమస్య ఉన్న మనిషి జీవితంలోని సమస్యలు ఎదుర్కొంటూ యాంగ్జయిటీని కూడా ఎదుర్కొంటూ బతకాల్సి రావడం చాలా కష్టం. కాని మన దగ్గర అలాగే జరుగుతుంటుంది. నడక, వ్యాయామం ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మన దగ్గర బలం అంటే శారీరక బలమే. కాని మానసిక బలం ముఖ్యం. శరీరానికి ఎలా వ్యాయామం అవసరమో మనసుకు అంతే వ్యాయామం అవసరం. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల మానసిక ఆరోగ్యానికి మొదట ప్రాధాన్యం ఇవ్వాలి’ అంటారు నీరజ .