martial arts
-
ధీరమణులు!
సాక్షి, సిటీబ్యూరో : కళ్లల్లో ఆత్మస్థైర్యం. కరాల్లో పటుత్వం. తొణికిసలాడే గుండె నిబ్బరం. కర్ర పట్టి గిరగిరా తిప్పారంటే శత్రువు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. కరవాలం ఝళిపించారంటే వైరివర్గం గడగడలాడాల్సిందే. చదువులోనే కాదు సాములోనూ శక్తిస్వరూపిణులమేనని నిరూపిస్తున్నారు ఆ బాలికలు. కర్రసాము, ఖడ్గ విన్యాసాల్లో పురుషులకూ తీసిపోమంటున్నారు. తమపై చెయ్యి వేస్తే ‘చండీ ప్రచండుల’మేనంటున్నారు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతున్న విద్యార్థినులు. పుస్తకాలు పట్టిన చేతులే కర్రలు, కత్తులు పట్టి పోరాడగలవని నిరూపిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సైదాబాద్లోని సెయింట్ మాజ్ స్కూల్ పీఈటీ అబ్దుర్ రెహమాన్కు 2003లో ఓ ఆలోచన వచ్చింది. తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్తో పాటు కర్రసాము, ఖడ్గ విన్యాసాలను పాఠశాల విద్యార్థినులకు కూడా నేర్పించాలనుకున్నారు. ఈ శిక్షణ బాలికల ఆత్మవిశ్వాసం, స్వీయరక్షణకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన భావించారు. అనుకున్నదే తడవుగా ఈ నిర్ణయాన్ని పాఠశాల నిర్వాహకుల ముందు పెట్టారు. దీనిని వారు బాలికల తల్లిదండ్రుల దృష్టికెళ్లారు. పలువురు ఇందుకు అభ్యంతరం వ్యక్తంచేశారు. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ విషయం విద్యార్థినులకు తెలియడంతో కొంత మంది తమ తల్లిదండ్రులను ఒప్పించారు. దీంతో పీఈటీ అబ్దుర్ రెహమాన్ శిక్షణ ప్రారంభించారు. మహిళా దినోత్సవం రోజునే.. పాఠశాలలో 15 ఏళ్ల క్రితం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే సెయింట్ మాజ్ స్కూల్లో మార్షల్ ఆర్ట్స్లో విద్యార్థినులకు శిక్షణ ప్రారంభించారు. మొదట్లో ప్రాథమిక తరగతుల పిల్లలకు ఆ తర్వాత 10వ తరగతి చదివే అమ్మాయిలకు శిక్షణ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ స్కూల్లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కోసం ప్రత్యేకంగా ఓ పీరియడ్నే కేటాయించారు. సెయింట్ మాజ్ స్కూల్లో 15 ఏళ్ల క్రితం అమ్మాయిల కోసం ప్రాంభమైన మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ప్రస్తుతం పాతబాస్తీలోని చాలా పాఠశాలల్లో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసిన పలువురు యువతులు శిక్షకులుగా కూడా పనిచేస్తున్నారు. అమ్మాయిల్లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ దేశంలోనే తొలిసారిగా మాజ్ స్కూల్లో ప్రారంభమైందని నిర్వాహకులు చెబుతున్నారు. మంచి స్పందన వస్తోంది.. మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇవ్వడానికి బాలికల తల్లిదండ్రుల నుంచి చక్కటి స్పందన వచ్చింది. మా స్కూల్లో శిక్షణ పొందిన అమ్మాయిలు ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలుస్తుండటం ఎంతో గర్వకారణం. – ముహమ్మద్ ఇద్రీస్ అలీ,సెయింట్ మాజ్ స్కూల్ నిర్వాహకుడు వహ్వా.. ఫరీహా..! ఈ యువతి పేరు ఫరీహా తఫీమ్. బాలికలపై, యువతులపై, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను టీవీలో చూసి మనసు చలించిపోయింది. తనకూ ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చేయాలి అని ఆలోచించింది. స్వీయరక్షణకు దారులు వెతికింది. ఏడో తరగతిలో ఉండగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంటానని తల్లిదండ్రులతో పోరు పెట్టింది. వారు ససేమిరా అన్నారు. అయినా ఆమె తన పట్టు వీడలేదు. అమ్మాయిల ఆత్మరక్షణపై వారికి ఎంతో వివరించింది. దీంతో వారే సరేనన్నారు. ఇంకేముంది మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుతం విక్టోరియా మైదానంలో 50 మందికి శిక్షణ ఇస్తూ పలువురి చేత శెభాష్ అనిపించుకుంటోంది. స్వీయరక్షణకు ప్రాధాన్యమిచ్చి కరాటే, మార్షల్ ఆర్ట్స్ తదితర విద్యలు నేర్చుకోవాలని ఫరీహా తఫీమ్ సూచిస్తోంది. -
మంత్రముగ్ధుల్ని చేసిన నారీ నృత్యరూపకం
-
అభద్రతాభావమే అందుకు కారణం
‘‘జీవితంలో కొన్ని పనులు చేసే క్రమంలో లేదా ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆ తర్వాతి కాలంలో అపరాదభావం కలిగిస్తాయి. నేనూ అలాంటి అపరాద భావానికి గురయ్యాను’’ అని రాసుకొచ్చారు యాక్షన్ హీరో జాకీచాన్. ఈ చైనా సూపర్ స్టార్ రాసుకున్న స్వీయ చరిత్ర పుస్తకం ‘నెవ్వర్ గ్రో అప్’ 2015లో చైనాలో రిలీజ్ అయింది. ఆ బుక్ ఇంగ్లీష్ వెర్షన్ను తాజాగా ప్రచురించారు. ఈ పుస్తకంలో మార్షల్ ఆర్ట్స్ను నేర్చుకోవడం, ఆ తర్వాతి కాలంలో మద్యపాన అలవాటుతో పోరాడటం గురించి రాసుకొచ్చారు. ‘‘రాత్రంతా తాగుతూనే ఉండేవాణ్ణి. పొద్దునే చూస్తే నా కార్ ఏ చెట్టుకో, దేనికో క్రాష్ అయ్యుంటుంది. అలాగే సాయంత్రం కూడా అదే వరుస. ఈ క్రమంలోనే ఓసారి నా కోపాన్నంతా మా అబ్బాయి మీద చూపించాను. ఒక్క చేత్తో వాణ్ణి లేపి గిర్రున తిప్పి విసిరి కొట్టాను. సోఫాలో పడ్డాడు. నేను విసిరేసిన వేగం వల్ల ఏ చేతికో, వీపుకో తగిలుంటే చాలా సీరియస్ అయ్యుండేది’’ అని రాసుకొచ్చారు జాకీచాన్. ఇలాంటి పనులన్నింటికీ తర్వాత చాలా బాధపడ్డానని, అపరాదభావానికి గురయ్యానని చెప్పుకొచ్చారు. నాలోని అభద్రతా భావం వల్లనే చాలాసార్లు తప్పుగా ప్రవర్తించాను అని నిజాయ తీగా చాలా విషయాలను ఒప్పుకున్నారు జాకీచాన్. -
‘అప్పుడు నా సంపాదన నెలకు రూ.5 వేలు’
కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచనే నన్ను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేలా చేసింది అంటున్నారు బాలీవుడ్ ‘ఖిలాడి’ అక్షయ్ కుమార్. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన అక్షయ్ కుమార్ తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ‘నేను ఇప్పటికి దాదాపు 130 దాకా సినిమాలు చేసి ఉంటాను. కానీ కెరియర్ తొలినాళ్లలో కేవలం యాక్షన్ సినిమాలు మాత్రమే చేశాను. దర్శకులు, నిర్మాతలు కేవలం నన్నో యాక్షన్ హీరోగా మాత్రమే గుర్తించేవారు’ అంటూ చెప్పుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభించాలనే ఉద్దేశంతో బ్యాంకాక్ వెళ్లి ఐదేళ్ల పాటు థాయ్ బాక్సింగ్ నేర్చుకున్నాను అన్నారు. తరువాత ‘ముంబై వచ్చి మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ప్రారంభించాను. అప్పుడు మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ర్గా నెలకు రూ. 5000 సంపాదించేవాడిని. నా పర్సనాలిటీ చూసిన కొందరు నన్ను మోడల్గా ప్రయత్నించమన్నారు. వారి సలహాతో నేను మోడలింగ్ ప్రయత్నాలు ప్రారంభించాను. తొలుత నేను ఓ ఫర్నిచర్ కంపెనీ యాడ్లో నటించాను. కేవలం రెండు గంటల పనికే నాకు రూ. 21,000 ఇచ్చారు. అలా నెమ్మదిగా ఇండస్ట్రీలో ప్రవేశించాను. కెరీర్ తొలినాళ్లలో దాదాపు 10 -11 సంవత్సరాలు యాక్షన్ సినిమాలే చేశాను. ఆ తర్వాత నెమ్మదిగా కామెడీ, రొమాంటిక్ సినిమాలు చేయడం ప్రారంభించాను’ అన్నారు. 1991లో ‘సౌగంధ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు అక్షయ్ కానీ మరుసటి ఏడాది వచ్చిన ‘ఖిలాడి’ సినిమా అక్షయ్ కెరియర్ను మలుపు తిప్పింది. డబ్బు సంపాదించాలనే ఆలోచనతోనే ఇండస్ట్రీలోకి వచ్చాను అన్నారు అక్షయ్. 2018లో ఫోర్బ్స్ విడుదల చేసిన అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో చేరారు ఈ ఖిలాడీ హీరో. ప్రస్తుతం అక్షయ్ విలన్గా నటించిన 2. ఓ విడుదలకు సిద్ధంగా ఉండగా.. హౌస్ఫుల్ 4, కేసరి చిత్రాలకు సైన్ చేశారు. -
మార్షల్ ఆర్ట్స్లో చిచ్చర పిడుగు
పశ్చిమగోదావరి, తణుకు అర్బన్: నేర్చుకోవాలనే తపన ఉంటే ఎన్ని కష్టాలైనా మనముందు తలొంచాల్సిందే.. మన పట్టుదల ముందు ఎంతటి ప్రతిభైనా మోకరిల్లాల్సిందే.. అందుకు ఉదాహరణే మార్షల్ ఆర్ట్స్లో రాటుదేలుతున్న కోటిపల్లి చరణ్. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన చరణ్కు ఊహ తెలిసేటప్పటికీ తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. తణుకుకు చెందిన పెద్దమ్మ, పెద్ద నాన్నలే చేరదీశారు. అనుకోకుండా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ చూసి ఆకర్షితుడయ్యాడు. అతన్ని గురువు ఆదరించి శిక్షణ ఇవ్వడంతో ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపుతున్నాడు. చరణ్ ఆసక్తిని గమనించి.. తణుకు సజ్జాపురంలోని రామకృష్ణ సేవా సమితి వేదికగా మార్షల్ ఆర్ట్స్ గురువు డీడీ సత్య ఎంతోమంది విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ఉదయం సమయంలో ఈ శిక్షణను గేటు బయట నుంచే చరణ్ గమనించేవాడు. ఆ విషయం తెలుసుకున్న గురువు సత్య.. నేర్చుకుంటావా? అని ప్రశ్నించగా చరణ్ వెంటనే తలూపాడు. అప్పటి నుంచి ఉచితంగా శిక్షణ తీసుకుంటూ మార్షల్ ఆర్ట్స్లో సత్తా చూపుతున్నాడు. ఒకసారి చెబితే పంచ్లను ఇట్టే పట్టేస్తాడు. సజ్జాపురం ప్రాథమిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న చరణ్ చదువులోను తెలివైన విద్యార్థే. చిన్నవాడైనా తన కంటే పెద్దవారితో సమానంగా ప్రతిభ ప్రదర్శిస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్లో రాష్ట్రస్థాయిలో ఇంతవరకూ రెండు పతకాలు సాధించాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన కరాటే టోర్నమెంట్లో బంగారు పతకం, విశాఖపట్నంలో జరిగిన వాకో కిక్ బాక్సింగ్ టోర్నమెంట్లో కాంస్య పతకం సాధించాడు. ఇంటర్నెట్లో చూసి కాగితాలు, ఇతర వ్యర్థాలతో రకరకాల బొమ్మలు చేస్తూ ఆకట్టుకుంటాడని ఉపాధ్యాయులు చెబు తున్నారు. పెద్దమ్మ, పెదనాన్నలు కోటిపల్లి దుర్గా భవాని, వెంకటేశ్వరరావులు చరణ్, అతని అన్న సామ్యేల్ బాధ్యతను తీసుకున్నాడు. ఫైటింగ్ అంటే చాలా ఇష్టం నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం. పెద్దమ్మ, పెదనాన్నల ప్రోత్సాహం, గురువు సత్య ఉచిత శిక్షణతో మార్షల్ ఆర్ట్స్లో రాణిస్తున్నాను. సొంత డబ్బులతో మా గురువే టోర్నమెంట్లకు తీసుకువెళ్తున్నారు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలనేది నా కోరిక.– కోటిపల్లి చరణ్, తణుకు స్పాన్సర్లు కావాలి.. మార్షల్ ఆర్ట్స్లో చరణ్కు మంచి నైపుణ్యం ఉన్నా.. ఖరీదైన క్రీడ కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రీడల్లో రాణించాలంటే మంచి పోషకాహారం అవసరం. పేదరికం కారణంగా చరణ్కు ఆ విషయంలో ఇబ్బంది ఎదురవుతుంది. స్పాన్సర్లు అండగా నిలిస్తే భవిష్యత్తులో మంచి ఫైటర్ అవుతాడు. ఎటైనా వంగే శరీర తత్వం అతనిది. మరింత ప్రోత్సహిస్తే విజయాలు సాధించడం ఖాయం. – డీడీ సత్య, మార్షల్ ఆర్ట్స్ గురువు చదువులోను చురుకే చరణ్ చదువులో చాలా చురుగ్గా ఉంటాడు. ఏదైనా ఇట్టే పట్టేస్తాడు. పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.– జి.రుద్రమదేవి, ప్రాథమికోన్నత పాఠశాల ఇన్చార్జ్ హెచ్ఎం, తణుకు -
వయసు 11.. మెడల్స్ 11
పశ్చిమగోదావరి, తణుకు అర్బన్: మార్షల్ ఆర్ట్స్లో సత్తా చాటుతున్నాడు తణుకు మండలం మండపాకకు చెందిన బుడతడు పురాల్ రాకేష్. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతకు నిదర్శనంగా 5వ తరగతి చదువుతున్న రాకేష్ 11 ఏళ్ల వయస్సులో జాతీయ, రాష్ట్రస్థాయిలో 11 మెడల్స్ సొంతం చేసుకుని శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ మెడల్స్లో 10 గోల్డ్, 1 సిల్వర్ మెడల్ ఉండటం విశేషం. వయసుకు, ఎత్తుకు సంబంధం లేకుండా కుంగ్ ఫు ఫైట్స్లో ప్రత్యర్థిని చిత్తు చేస్తున్నాడు. వెళ్లిన ప్రతి పోటీలోనూ మెడల్ సాధిస్తూ క్రీడాభిమానం ఉన్న వారందరి చూపూ తనవైపు తిప్పుకుంటున్నాడు. తల్లిదండ్రులు కూడా కరాటేలో ప్రావీణ్యం ఉండడంతో వారి ప్రోత్సాహంతో మార్షల్ ఆర్ట్స్లోని పెన్కాక్ సిలాట్, కుంగ్ ఫూ, కరాటే, సెల్ఫ్ డిఫెన్స్, కిక్ బాక్సింగ్, థాయ్ బాక్సింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అంశాల్లో శిక్షణ పొందుతున్నాడు. మండపాక చదలవాడ ఇంగ్లిషు మీడియం స్కూలులో చదువుతున్న రాకేష్ ఇటు చదువులోనూ మొదటి ర్యాంకులో నిలుస్తున్నాడు. గురువు సత్య శిక్షణలో.. తణుకు శ్రీ రామకృష్ణ సేవా సమితి భవనంలో సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ షావొలిన్ కుంగ్ ఫు డ్రంకెన్ మార్షల్ ఆర్ట్స్ కుంగ్ ఫు–డు మాస్టర్ డీడీ సత్య శిక్షణలో గత ఏడాదిన్నరగా రాకేష్ రాటుదేలుతున్నాడు. రాకేష్ తండ్రి పురాల్ వెంకటేష్ మండపాకలో చిన్న టిఫిన్ హోటల్ నిర్వహిస్తుండగా తల్లి కనకదుర్గ కూడా భర్తకు సహాయంగా ఉంటారు. చెల్లి జ్యోతి 4వ తరగతి చదువుతోంది. ప్రోత్సాహం కరువు మార్షల్ ఆర్ట్స్ అంటే ఎంతో ఖరీదైన క్రీడ. శిక్షణతో పాటు ఏ టోర్నమెంట్కు వెళ్లాలన్నా వేలల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చినట్టు రాకేష్ తండ్రి వెంకటేష్ చెప్పారు. -
బస్తీల నుంచే బడా బాక్సర్లు
ముంబై: మురికివాడల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే పెద్ద పెద్ద బాక్సర్లుగా ఎదిగారని మాజీ ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ చెప్పాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్ఎమ్ఏ) కుమిటే–1 లీగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తొలిసారి భారత్కు విచ్చేసిన ఈ బాక్సింగ్ దిగ్గజం మీడియాతో మాట్లాడుతూ ‘నాతో సహ చాలా మంది బాక్సర్లు మురికివాడల నుంచి కష్టపడి వచ్చినవాళ్లే! వాళ్లంతా ఇప్పుడు మేటి బాక్సర్లయ్యారు. ప్రస్తుతమున్న టాప్ బాక్సర్లు కూడా బస్తీలకు చెందిన వారే’ అని అన్నాడు. 52 ఏళ్ల మాజీ బాక్సర్ 2005లో రిటైరయ్యాడు. అతను 1988లో 20 ఏళ్లకే ప్రపంచ హెవీవెయిట్ చాంపియన్షిప్ సాధించి ఈ ఘనత సాధించిన తొలి యువ బాక్సర్గా రికార్డులకెక్కాడు. తన కెరీర్లో 50 విజయాలు సాధించగా... ఇందులో 44 నాకౌట్లుండటం విశేషం. కేవలం ఆరు బౌట్లలో మాత్రం ఓటమి పాలయ్యాడు. గొప్ప విజయాలే కాకుండా వివాదాలూ టైసన్ వెంట నడిచాయి. 1991లో ‘మిస్ బ్లాక్ రోడ్ ఐలాండ్’ డిజైరీ వాషింగ్టన్పై అత్యాచారం చేసి ఆరేళ్ల శిక్షకు గురయ్యాడు. అనంతరం 1997లో ఇవాండర్ హోలీఫీల్డ్తో జరిగిన బౌట్లో హోలీఫీల్డ్ చెవిని కొరికి డిస్క్వాలిఫై అయ్యాడు. భారత పర్యటనలో అతను ఆసియాలోనే అత్యంత పెద్ద మురికివాడగా పేరొందిన ధారవిని, అలాగే ప్రపంచ ప్రఖ్యాత తాజ్మహల్ను సందర్శించాల్సి ఉంది. ఈ సందర్భంగా టైసన్ తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘నేనూ పేదవాణ్నే. మురికివాడలోనే పుట్టిపెరిగా. వాడల నుంచి బయటపడాలనే లక్ష్యంతోనే కష్టపడ్డాను. అనుకున్నది సాధించి ఇప్పుడు ఈ స్థితికి ఎదిగాను. ఎవరైనా సరే చెమటోడ్చితే అక్కడ్నించి బయటపడొచ్చు. ఎంతో బాగా ఎదగొచ్చు’ అని టైసన్ చెప్పాడు. తనకు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్అంటే చాలా ఇష్టమన్నాడు. లాస్ వెగాస్లో జరిగే యూఎఫ్సీ పోటీలను తిలకించేవాడినని చెప్పుకొచ్చాడు. క్రికెట్ గురించి మాట్లాడుతూ ఈ ఆట తనకు తెలుసని బేస్బాల్లా ఉంటుందని, బ్యాట్తో బంతిని బాదే ఆటే క్రికెట్ అని చెప్పాడు. ఎమ్ఎమ్ఏ కుమిటే–1 లీగ్లో భాగంగా శనివారం భారత్, యూఏఈ జట్ల మధ్య తొలి ఫైట్ జరగనుంది. -
తొలిసారి భారత్కు రానున్న దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్
ప్రపంచ హెవీవెయిట్ బాక్సింగ్ మాజీ చాంపియన్ మైక్ టైసన్ వచ్చే నెలలో భారత్కు విచ్చేయనున్నారు. అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ లీగ్ ప్రాచుర్య కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. సెప్టెంబర్ 29న ఈ వివాదాస్పద బాక్సర్... మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎమ్ఎమ్ఏ) ఈవెంట్ అయిన కుమిటే–1 లీగ్ను ప్రచారం చేసేందుకు ముంబై వస్తున్నారని లీగ్ వర్గాలు తెలిపాయి. భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ సమాఖ్య ఆధ్వర్యంలో తొలిసారిగా జరిగే ఈ టోర్నీలో భారత్ తమ తొలి బౌట్లో యూఏఈని ఎదుర్కొంటుంది. లీగ్ వ్యవస్థాపకులు మొహమ్మద్ అలీ బుద్వాని మాట్లాడుతూ కుమిటే లీగ్ కోసం ప్రపంచ మాజీ చాంపియన్ రానుండటం ఆనందంగా ఉందన్నారు. -
బాలీవుడ్ నటుడికి అరుదైన గౌరవం
తెలుగులో శక్తి, ఊసరవెల్లి లాంటి సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లో నటించిన బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్కు అరుదైన గుర్తింపు లభించింది. బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న జమ్వాల్ తన స్టంట్లతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా భారతీయ సాంప్రదాయ పోరాట కళ కలరియపట్టులో ఎంతో ప్రావీణ్యం ఉన్న విద్యుత్ జమ్వాల్ ప్రపంచంలోని టాప్ సిక్స్ మార్షల్ ఆర్ట్స్ కళాకరుల జాబితాలో స్థానం సంపాదించాడు. అమెరికాకు చెందిన లూపర్ అనే వెబ్ సైట్ ఈ జాబితాను ప్రకటించింది. ఈ లిస్ట్ లో విద్యుత్ జమ్వాల్తో పాటు స్కాట్ అడ్కిన్స్, అతీఫ్ క్రౌడర్, ఇల్రామ్ చోయి, మార్కో జిరోర్, యు జింగ్, జానీ ట్రిగ్యుయెన్ లు ఉన్నారు. ‘గొప్ప మార్షల్ ఆర్ట్స్ కళాకారుడు అంటే తెలుసుకోవాల్సింది ప్రత్యర్థిపై దాడి చేయటం కాదు, ఓపికగా ప్రత్యర్థిని దెబ్బతీయటం తెలుసుకోవాల’న్నారు విద్యుత్ జమ్వాల్. ప్రపంచ దేశాల్లో ఎన్నో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు ఇచ్చిన ఈ యువ కళాకారుడు బాలీవుడ్ చిత్రాల్లో హీరోగానూ రాణిస్తున్నాడు. -
ముందు స్టూడెంట్... తర్వాత టీచర్
ఒక స్టూడెంట్ టీచర్గా మారాలంటే బోలెడంత టైమ్ పడుతుంది. కానీ సమంత మాత్రం తక్కువ టైమ్లోనే స్టూడెంట్ నుంచి టీచర్ స్థాయికి ఎదిగారు. కానీ ఆషామాషీ టీచర్గా కాదు. తేడా వస్తే తాట తీసే కర్రసాము టీచర్ అట. శివకార్తికేయన్, సమంత జంటగా పొన్రామ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘సీమరాజా’. ఇందులో కర్రసాము నేర్పించే టీచర్ సుదందిరదేవి పాత్రలో సమంత నటించారు. ఈ పాత్ర కోసం సమంత కష్టపడి కర్రసాము నేర్చుకున్నారు. 15 సార్లు మార్షల్ ఆర్ట్స్ క్లాసులకు వెళ్లారట. అంటే ముందు స్టూడెంట్గా కర్రసాము క్లాసులకు వెళ్లిన సమంత, వెండితెరపై టీచర్గా మారారు. ఇందులో నటి సిమ్రాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందించారు. ‘సీమరాజా’ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... పవన్కుమార్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ‘యు టర్న్’ సినిమా కూడా సెప్టెంబర్ 13నే విడుదల కానుండటం విశేషం. -
తెలంగాణకు 8 స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్షిప్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటారు. బ్రూస్లీ జీత్ కున్–డో స్పోర్ట్స్ ఆల్ స్టయిల్స్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో 8 స్వర్ణాలతో మెరిశారు. నగరానికి చెందిన డ్రాగన్ షాడో కుంగ్ఫు మార్షల్ ఆర్ట్స్ అకాడమీ (డీఎస్కేఎంఏ)కి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఈ స్వర్ణాలను సాధించడం విశేషం. 18 ఏళ్లు పైబడిన విభాగంలో సబియా ఫాతిమా (ఆరెంజ్ బెల్ట్), మలీహ బేగం (ఆరెంజ్ బెల్ట్), సానియా బేగం (వైట్ బెల్ట్) స్వర్ణాలను గెలుచుకున్నారు. అండర్–17 కేటగిరీలో షిఫా బేగం (ఎల్లో బెల్ట్), షఫికా బేగం (ఎల్లో బెల్ట్), అక్సా ఫాతిమా (ఎల్లో బెల్ట్), ఫిర్దౌస్ బేగం (వైట్ బెల్ట్), మేరాజ్ ఇర్ఫానా (ఎల్లో బెల్ట్) పసిడి పతకాలను సాధించారు. ఈ సందర్భంగా డీఎస్కేఎంఏ కోచ్ సయ్యద్ అన్సార్ అలీ జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన తమ విద్యార్థులను అభినందించారు. -
ఆకాష్తో మరో సినిమా
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొద్ది రోజులుగా తన స్థాయికి తగ్గ విజయాలు సాధించలేకపోతున్నాడు. వరుస ఫ్లాప్లు ఎదురవ్వటంతో పూరికి స్టార్ హీరోలు డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపించటం లేదు. అయితే పూరి మాత్రం ఇవేవి పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే ఆకాష్ పూరిని హీరోగా రీ లాంచ్ చేస్తూ మెహబూబా షూటింగ్ పూర్తి చేశాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. చిత్రయూనిట్ సక్సెస్ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మెహబూబా రిలీజ్ కాకముందే మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు పూరి. అంతేకాదు తన తదుపరి చిత్రాన్ని ఆకాష్ హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట ఈ డాషింగ్ డైరెక్టర్. రిలీజ్కు రెడీ అవుతున్న మెహబూబా ఇంటెన్స్ లవ్ స్టోరి కాగా.. నెక్ట్స్ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఈసినిమాను కూడా పూరి తన సొంత నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ లోనే నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై పూరి టీం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
ఆత్మరక్షణ విద్యలు ఇతివృత్తంగా ‘ఎళుమిన్’
తమిళసినిమా: హాస్యనటుడు వివేక్కు కథానాయకుడిగా రాణించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. అలా ఒకటి రెండు చిత్రాల్లో నటించినా నాన్దా బాలా అనే ఒక్క చిత్రం మాత్రమే తెరపైకి వచ్చినా, అదీ ఆశించిన విజయం సాధించలేదు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో ఎళుమిన్ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో వివేక్కు భార్యగా నటి దేవయాని నటిస్తున్నారు. వీరితో పాటు ప్రవీణ్, శ్రీజిత్, వినీత్, సుఖేశ్, కీర్తిక, దీపిక, అళగం పెరుమాళ్, ప్రేమ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు వీపీ.విజీ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వైఎం మీడియాస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ జగదీశ్వరన్ ఛాయాగ్రహణం, సంగీతాన్ని గణేశ్ చంద్రశేఖర్ అందిస్తున్నారు.చిత్ర వివరాలను దర్శకుడు వీపీ.విజీ తెలుపుతూ ఆత్మరక్షణ విద్యలపై ఆసక్తి కలిగిన ఐదుగురు చిన్నారులు ఆ విద్యల్లో ఘనత సాధించడమే ఎళుమిన్ చిత్ర ఇతివృత్తం అని చెప్పారు. విశ్వనాథన్ అనే వ్యక్తి కొడుకు అర్జున్ మరో ఐదుగురు పిల్లలు మంచి స్నేహితులని, ఈ పిల్లలు ఆత్మరక్షణ విద్యలు కుంగ్ఫూ, కరాటే, బాక్సింగ్, కర్రసాముల్లో శిక్షణ పొందుతారన్నారు. అయితే ఆర్థిక స్తోమత లేని ఐదుగురు పిల్లలకు తల్లిదండ్రుల నుంచే ఆటంకాలు ఎదురవుతాయని చెప్పారు. అలాంటి సమయంలో అర్జున్ తల్లిదండ్రులు వారికి అండగా నిలుస్తారని తెలిపారు. ఇందులో విశ్వనాథన్గా నటుడు వివేక్, ఆయన భార్యగా దేవయాని నటిస్తున్నారని చెప్పారు. ఈ ఐదుగురు పిల్లలు జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను, పరిస్థితుల ప్రభావాలను అధిగమించి వారి లక్ష్యాన్ని ఎలా సాధించారన్నదే ఎళుమిన్ చిత్ర కథ అని తెలిపారు. ఇందులో రిస్కీ ఫైట్స్ సన్నివేశాల్లో కూడా చిన్నారులు అద్భుతంగా నటించారని చెప్పారు. వీరి నిజ జీవితంలో కూడా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని గెలుపొందారని దర్శకుడు తెలిపారు. -
విద్యార్థినులు మార్షల్ ఆర్ట్స్
-
బాలికలకు మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరి
భోపాల్ : మధ్యప్రదేశ్లో అత్యాచారాలను నిరోధించేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. ఇప్పటికే 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష విధించాలనే బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ గురువారం మరో కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్లు, కాలేజీల్లో చదువుకునే యువతులకు మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరిగా నేర్పించాలని ఆయన స్పస్టం చేశారు. కరాటే వంటి విద్యలు నేర్చుకుంటే అత్యాచారాలు, ఇతర ప్రమాదాలనుంచి నుంచి యువతులు తమను తాము రక్షించుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. అత్యాచారాలకు సంబంధించి కీలక బిల్లును ఆమోదించింనందుకు కృతజ్ఞతగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు మహిళలు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైంగిక దాడులు, వేధింపులకు సంబంధించి చట్టపరమైన రక్షణల గురించి ప్రకటనలు, ఇతర ప్రచార సాధనాల ద్వారా అందరికీ తెలియజేయాలని కోరారు. మైనర్లపై అత్యాచారం చేసిన వ్యక్తులు జీవించేందుకు అర్హత లేదని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. -
ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్
సాక్షి, యాదాద్రి: మహిళలపై అఘాయిత్యా లను ఎదురించేందుకు ఉన్నత పాఠశాల స్థాయిలోనే విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇవ్వనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పాఠశాలల్లోని పీడీ, పీఈటీలకు శిక్షణ ఇచ్చింది. వీరితోపాటు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందిన మాస్టర్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తుంది. దీనికి విద్యాశాఖ ఆర్ఎంఎస్ఏ సంయుక్తంగా మూడు నెలల శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. 31 జిల్లాల్లో 5,111 ఉన్నత పాఠశాలలకు నిధులను మంజూరు చేసింది. ఒక్కో ఉన్నత పాఠశాలకు రూ.8,500 చొప్పు న రూ.4.34 కోట్లను మంజూరు చేసింది. ఇలా శిక్షణ ఇవ్వాలి.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, బాలికల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఈ శిక్షణను ఇస్తారు. ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఈటీలు, పీడీలు, పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్ల ఆధ్వర్యంలో మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ జరగాలి. స్వయం ఆత్మరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇవ్వాలి. పాఠశాల గేమ్స్ పిరియడ్లో మాత్రమే వీటిని పీఈటీల ఆధ్వర్యంలో నిర్వహించాలి. శిక్షణ పొందిన బాలికలకు 15 రోజులు లేదా నెల రోజులకోసారి అంతర్ పాఠశాలల స్థాయి, మండల స్థాయిలో వీరికి పోటీలు నిర్వహిం చాలి. ప్రతి ప్రధానోపాధ్యాయుడు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కార్యాలయాలకు వాట్సాప్లో మెసేజ్ పంపాలి. ఇందుకోసం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు ప్రధానోపాధ్యా యులకు ఆదేశాలు జారీ చేశారు. -
కర్ర , కత్తి.. ఏదైనా.. రాహుల్.. హూహా..!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఇన్నాళ్లూ మనకు తెలిసిన రాహుల్ వేరు.. ఇప్పుడు వేరు.. మార్షల్ ఆర్ట్స్లో రాహుల్కు మంచి నైపుణ్యం ఉందన్న విషయం వెల్లడైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ సంఖ్య పెరిగిందట. జపాన్ మార్షల్ ఆర్ట్స్ ఐకిడోలో తనకు బ్లాక్ బెల్ట్ ఉన్నట్లు ఇటీవల రాహుల్ తెలిపారు. అంతేనా.. కత్తి తిప్పడంలోనూ కర్రసాము చేయడంలోనూ రాహుల్ మేటి అని ఆయనకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇచ్చిన గురువు సెన్సె పరిటోస్ చెప్పారు. ‘2009లో తొలిసారిగా రాహుల్ గాంధీని కలిశాను. మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇచ్చాను. రాహుల్ తన ఇద్దరు స్నేహితులతో కలసి ఢిల్లీలోని తుగ్లక్ లేన్ హౌజ్లోఉన్న తన నివాసంలో ప్రాక్టీస్ చేసేవారు. ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ, బావ వాద్రా అప్పుడప్పుడు వచ్చి చూసేవారు’ అని పేర్కొన్నారు. 2013లో జపాన్ నుంచి ఐకిడో మాస్టర్ భారత్ వచ్చినప్పుడు రాహుల్ సంబంధిత పరీక్షలో కూడా పాల్గొని బ్లాక్ బెల్ట్ సాధించారని చెప్పారు. రాహుల్ లండన్లో ఉన్నప్పుడు బ్రెజిలియన్ మార్షల్ ఆర్ట్స్ జీ–జిట్సు కూడా నేర్చుకున్నారని తెలిపారు. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
దెబోరాకు మూడో పతకం
అష్గబాత్ (తుర్క్మెనిస్తాన్): ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో శుక్రవారం భారత్కు రెండు పతకాలు లభించాయి. మహిళల ట్రాక్ సైక్లింగ్ ఆరు ల్యాప్ల కిరిన్ ఈవెంట్లో దెబోరా హెరాల్డ్ రజత పతకాన్ని సాధించింది. ఈ క్రీడల్లో దెబోరాకిది మూడో పతకం. ఇంతకుముందు ఆమె మహిళల 200 మీటర్ల వ్యక్తిగత, టీమ్ స్ప్రింట్ విభాగాల్లో రజత పతకాలు గెలిచింది. మహిళల అండర్ – 48 కురాష్ ఈవెంట్లో మాలప్రభ యెల్లప్ప జాదవ్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఓవరాల్గా భారత్ ఇప్పటివరకు ఐదు స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు సాధించింది. -
భారత్కు నాలుగు పతకాలు
అష్గబాత్ (తుర్క్మెనిస్తాన్): ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో భారత్ మూడో రోజు ఒక స్వర్ణం సహా నాలుగు పతకాలు గెలుచుకుంది. మహిళల పెంటాథ్లాన్ ఈవెంట్లో పూర్ణిమా హెంబ్రామ్ బంగారు పతకం నెగ్గింది. ఐదు ఈవెంట్ల ఈ పోటీలో ఆమె 4,062 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల షాట్పుట్లో తేజిందర్ పాల్ సింగ్, మహిళల 3000 మీ. పరుగులో సంజీవని జాదవ్ చెరో రజతం గెలిచారు. మహిళల లాంగ్ జంప్లో నీనా వారకిల్ కాంస్యం నెగ్గింది. -
చేరుపల్లి వివేక్ తేజకు సింగపూర్లో సత్కారం
నల్గొండకు చెందిన ప్రపంచ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ చేరపల్లి వివేక్ తేజను తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(టీసీఎస్ఎస్) కార్యవర్గ సభ్యులు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. వివేక్ తేజ మార్షల్ ఆర్ట్స్లో ఇప్పటి వరకు 27 బంగారు, 18 రజిత, 16 కాంస్య పతాకాలు గెలుపొందారు. ప్రపంచ స్థాయిలో ఇంకా రాణించి భారతదేశం పేరు మారు మ్రోగించాలని టీసీఎస్ఎస్ సభ్యులు ఆకాంక్షించారు. ఈ నెల 12న ఇండో నేషియాలో జరగబోయే మార్షల్ ఆర్ట్స్లో పాల్గొనడానికి వెళుతున్న సందర్భంగా అక్కడ విజయ కేతనం ఎగురవేసి తెలంగాణ కీర్తిని చాటాలని ఆకాక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పెద్ది శేఖర్ రెడ్డి, బూర్ల శ్రీను, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శి ఎల్లా రామ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు చిల్క సురేశ్, గార్లపాటి లక్ష్మారెడ్డి, శివ రామ్, చెట్టి పల్లి మహేష్, ఆర్.సి.రెడ్డి, దామోదర్ ఇతర సభ్యులు గొనె నరేందర్, అనుపురం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
హైస్కూళ్లలో బాలికలకు మార్షల్ ఆర్ట్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 5,111 ఉన్నత పాఠశాలల్లో బాలికలకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బాలికల్లో ఆత్మస్థైర్యా న్ని పెంచేందుకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్ఎంఎస్ఏ) కింద ఈ శిక్షణ ఇవ్వనుంది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు ప్రారంభం కాగానే శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు ప్రత్యేక షెడ్యూల్ను జారీ చేయనుంది. ఒక్కో స్కూల్కు రూ.8,500 చొప్పున మొత్తం రూ.4.34 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. దీనికి సంబంధించి జిల్లాల వారీ వివరాలతో డీఈవో లకు ఆర్ఎంఎస్ఏ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధికంగా నిజమాబాద్లో 277 స్కూళ్లలో, తక్కువగా కుమ్రం భీం జిల్లాలో 70 స్కూళ్లలో ఈ శిక్షణ ఇవ్వనుంది. -
మహిళా పోలీసులకు హప్కిడో శిక్షణ
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోనిమహిళా పోలీసుల సిబ్బందికి కొరియన్ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని 175 మందికి బుధవారం హప్కిడో అనే యుద్ధ విద్యను నేర్పారు. హోంగార్డు నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయి వరకు ఇందులో పాల్గొన్నట్లు రాచకొండ పోలీస్ కమిషనరేట్ మహేష్ ఎం భగవత్ తెలిపారు. తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ పొందిన సినీనటి ఇషాకొప్పికర్, ఆమె మాస్టర్ సర్దార్ ఎండీ షేక్తో కలిసి ఈ శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా పోలీసులకు ఆత్మరక్షణ మెలకువలతోపాటు విధి నిర్వహణలో భాగంగా నిత్యం ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలో నేర్పినట్లు ఆయన తలిపారు. నేరగాళ్లను పట్టుకోవటం, చైన్ స్నాచర్లు, ఈవ్ టీజర్లు వంటి నిందితులను అరెస్టు చేయటానికి హప్కిడో విశేషంగా ఉపయోగపడుతుందని కమిషనర్ వివరించారు. ఒక పోలీసు అధికారి విధి నిర్వహణలో విజయవంతం కావటానికి ముందుగా ఆత్మరక్షణ చాలా కీలకమైన అంశమని భగవత్ తెలిపారు. -
ఆకాశమే హద్దుగా..
-
ఆ హీరోకి నేను ఫీమేల్ వెర్షన్: నటి
ముంబై: మోడల్ గా కెరీర్ ఆరంభించి హీరోయిన్ గా మారిన వారిలో ఊర్వశీ రౌతెలా ఒకరు. యాక్షన్-రొమాన్స్ మేలవింపుతో సింగ్ సాబ్ ద గ్రేట్ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'లో నటనకు గానూ మంచి మార్కులు కొట్టేసింది. యమహా ఫాసినో మిస్ దివా 2015- మిస్ యూనివర్స్ ఇండియా కంటెస్టెంట్ గా అందరికీ సుపరిచితురాలు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఈ బ్యూటీ నిర్ణయించుకుంది. థైక్వాండో, జిమ్నాస్టిక్స్ లలో శిక్షణ తీసుకుంటానని చెప్పిన ఊర్వశీ.. తాను అక్షయ్ కుమార్ ఫిమెల్ వెర్షన్ గా పేరు తెచ్చుకోవాలని ఆశపడుతున్నట్లు పేర్కొంది. అక్షయ్ ని స్ఫూర్తిగా తీసుకుని మార్షల్ ఆర్ట్స్ లో పట్టు సాధిస్తానంటోంది. ప్రస్తుతం టీ సిరీస్ తో మూడు మూవీల కోసం ఒప్పందం కుదుర్చుకున్న ఈ అందాల భామ ఆ పనిలో బిజీగా ఉన్ననని చెప్పింది. 'గాల్ బాన్ గాయి' అనే సాంగ్ లో తాను భాగస్వామిని అయ్యానని దీంతో గ్రేట్ సింగర్ సుఖ్ బిర్ తో పనిచేయాలన్న తన కల నెరవేరిందని చెప్పుకొచ్చింది. తనకు యాక్షన్ మూవీలలో నటించడమంటే ఎంతో ఇష్టమని.. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న తర్వాత ఆ తరహా సినిమాలు చేయాలనుందని తెలిపింది. -
ఆత్మరక్షణకు శిక్షణ
ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతున్నానంటోంది నటి తాప్సీ. ఈ బ్యూటీ ఇటీవల ఎక్కువగా సెల్ఫ్ ప్రచారం చేసుకోవడానికి తెగ తంటాలు పడుతోందనిపిస్తోంది. ఆ మధ్య తాను ఢిల్లీ భామను, తనకు ధైర్యం ఎక్కువ అని డబ్బా కొట్టుకుంది. హిందీ చిత్రం పింక్లో అత్యాచారానికి గురైన యువతి పాత్రల్లో నటించిన తాప్సీ ఇటీవల తాను నిజ జీవితంలో పోకిరిల దురాఘతాలకు గురయ్యానని చెప్పుకుని వార్తల్లో నిలిచింది. తాజాగా ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటున్నానంటూ మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే ఈ సారి తాను నటించనున్న చిత్రంలోని పాత్ర పోషణ కోసం ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటున్నట్లు తాప్సీ పేర్కొంది. కోలీవుడ్లో ఆడుగళం, కాంచన-2 వంటి రెండు మూడు విజయాలతోనే సరిపెట్టుకున్న ఈ ముద్దుగమ్మకు ఇక్కడ అవకాశాలు కరువయ్యాయి. అయితే లక్కీగా హిందీలో జాక్పాట్ లాంటి అవకాశాన్ని కొట్టేసింది. అక్కడ బిగ్బీ అమితాబ్తో పింక్ చిత్రంలో నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో బాలీవుడ్లో చిన్నగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. తాజాగా నామ్ షబానా అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ చిత్రం కోసమే ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ పొందుతోందట. దీని గురించి తను తెలుపుతూ పింక్ చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని అంది. ప్రస్తుతం నామ్ షబానా చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. ఇది తాను ఇంతకు ముందు నటించిన బేబి చిత్రానికి సీక్వెల్ అని చెప్పింది. ఇందులోని పాత్ర కోసం క్రావ్ మగా అనబడే ఇజ్రాయిల్ దేశంలో ప్రాచుర్యం పొందిన ఆత్మరక్షణ విద్యతో పాటు అయికిడో అనే జపాన్ ఆత్మరక్షణ విద్య తదితర మూడు రకాల విద్యలను నేర్చుకుంటున్నట్లు చెప్పింది. ఇందుకోసం నిత్యం గంటన్నర సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపింది. కథా పాత్రకు అవసరం అవ్వడంతో ఈ విద్యల్లో శిక్షణ పొందుతున్నట్లు వివరించింది. ఇందులో నటుడు అక్షయ్కుమార్ అతిథి పాత్రలో నటించనున్నారని, ఆయనకు తనకు మధ్య యాక్షన్ సన్నివేశాలు చోటు చేసుకంటాయా అన్నది తెలియదని అంది. మనోజ్ బాజ్పాయ్, మలయాళ నటుడు పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారని తాప్సీ తెలిపింది.