-
జార్ఖండ్లో ఐదుగురు మావోయిస్టులు మృతి
చైబాసా: జార్ఖండ్ రాష్ట్రం పశ్చిమ సింహ్భూమ్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. గువా పోలీస్స్టేషన్ పరిధిలోని లిపుంగా ప్రాంతంలో సోమవారం ఉదయం 5 గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నట్లు ఐజీ అమోల్ వి హోంకార్ చెప్పారు. మావోయిస్టు పార్టీ ఏరియా కమాండర్ టైగర్ అలియాస్ పాండు హన్స్దా, బట్రి దేవ్గమ్లను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఒక ఇన్సాస్ రైఫిల్, రెండు ఎస్ఎల్ఆర్లు, మూడు రైఫిళ్లు, ఒక పిస్టల్ను స్వాదీనం చేసుకున్నామన్నారు. మృతులను జోనల్ కమాండర్ కండె హొన్హాగా, సబ్ జోనల్ కమాండర్ సింగ్రాయ్ అలియాస్ మనోజ్, ఏరియా కమాండర్ సూర్య అలియాస్ ముండా దేవ్గమ్, మహిళా నక్సల్ జుంగా పుర్టి అలియాస్ మర్లా, సప్ని హన్స్డాగా గుర్తించామన్నారు. -
మావోయిస్టుల ఏరివేతకు ‘జల్శక్తి’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులకు పట్టు ఉన్నట్లు చెప్పుకునే బస్తర్ అడవుల్లో ఎండాకాలంలో సహజంగానే పోలీసు బలగాలది పైచేయి అవుతోంది. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో వంద మందికి పైగా మావోయిస్టులు హతమవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అయితే, వానాకాలానికి వచ్చేసరికి అడవులు చిక్కబడటం.. వాగులు, వంకలు ఉప్పొంగడంతో పోలీసుల కూంబింగ్కు అవాంతరాలు ఎదురవుతున్నాయి.ఈ నేపథ్యంలో వానాకాలంలోనూ బస్తర్ అడవుల్లో మావోయిస్టుల నుంచి ఎదురయ్యే దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా అడవుల్లోకి సులభంగా చొచ్చుకెళ్లేందుకు వీలుగా గతంలో ఎన్నడూ లేనివిధంగా రోప్ వేను అందుబాటులోకి తెచ్చాయి. బేస్ క్యాంపుల ఏర్పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు సరిహద్దుగా ఉన్న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పామేడు, ధర్మారం, కవరుగట్ట, కొండపల్లి, బట్టిగూడెం, బాసగూడ ప్రాంతాలు మావోయిస్టులకు అడ్డాలుగా ఉన్నాయి. అతికష్టంపై భద్రతా దళాలు చింతవాగుకు ఇరువైపులా ఉన్న పామేడు, ధర్మారంలో బేస్క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఈ ఏడాది జనవరి 16న రాత్రి 600 మందికి పైగా మావోయిస్టులు ఈ రెండు క్యాంపులను చుట్టుముట్టి భీకరంగా దాడి చేశారు.సుమారు మూడు గంటల పాటు సాగిన దాడిలో ఆరు వందలకు పైగా గ్రనేడ్లు విసిరారు. ఈ దాడిలో భద్రతా దళాలకు చెందిన నలభై మందికి తీవ్రగాయాలైనట్టు సమాచారం. అప్పటికే చింతవాగుపై వంతెన నిర్మాణ పనులు మొదలుపెట్టినా సకాలంలో పూర్తి కాలేదు. దీంతో ఏటా వానాకాలంలో మూడు నెలల పాటు ఉప్పొంగే చింతవాగు భద్రతా దళాలకు ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా భద్రతా దళాలు వంతెనకు ప్రత్యామ్నాయంగా యుద్ధప్రాతిపదికన రోప్వేను నిర్మించాయి. ఈ రోప్వే ద్వారా రెండు క్యాంపుల మధ్య రాకపోకలకు ఆటంకాలు ఉండవని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఆపరేషన్ జల్శక్తి వేసవిలో మావోయిస్టు ప్రభావిత అడవుల్లోకి చొచ్చుకెళ్లిన భద్రతా దళాలు అక్కడ క్యాంపులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇలాంటి క్యాంపులకు వానాకాలంలో భద్రత కరువైపోతోంది. భద్రతా దళాల రక్షణ వ్యవస్థను చీల్చుకుంటూ క్యాంపుల మీద మావోయిస్టులు దాడులు చేస్తున్నారు. దీంతో వానాకాలంలో కూడా బస్తర్ అడవులపై పట్టు సాధించేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ జల్శక్తి పేరుతో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. వరదలు ఎదుర్కొని, దట్టమైన అడవుల్లో కూంబింగ్ నిర్వహించడంపై భద్రతా దళాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే రాకపోకలకు వీలుగా వంతెనలు, రోప్వేల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి.120 మంది హతంకేంద్రం చేపట్టిన మావోయిస్టుల ఏరివేత ఇప్పుడు తుదిదశ (ఆపరేషన్ కగార్ – ది ఫైనల్ మిషన్)కు చేరింది. బస్తర్ అడవుల్లో ఏర్పాటైన వందలాది క్యాంపుల్లో 10 వేల మంది పారామిలిటరీ దళాలు పాగా వేశాయి. వేసవి ఆరంభంలో భద్ర తా దళాల దూకుడుకు కళ్లెం వేసేందుకు మావోయిస్టు పార్టీ టెక్నికల్ కౌంటర్–అఫెన్సివ్ క్యాంపెన్(టీసీ–ఓసీ) పేరుతో దాడులు మొదలెట్టింది. దీనికి ప్రతిగా భద్రతా దళాలు ఆపరేషన్ సూర్యశక్తి పేరుతో ప్రతి వ్యూహాన్ని రూపొందించుకుని దాడులకు దిగాయి. అందువల్లే ఈ ఏడాది మావోయిస్టు పార్టీ నుంచి భద్రతా దళాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఇదే క్రమంలో భద్రతా దళాలు జరిపిన దాడులు, ఎన్కౌంటర్లలో 120 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఇక ఇప్పుడు జల్శక్తి పేరుతో వానాకాలంలోనూ దూకుడు పెంచేందుకు భద్రతా దళాలు సిద్ధమవుతున్నాయి. -
ఛత్తీస్గఢ్: పోలీస్ క్యాంప్పై మావోయిస్టుల బాంబుల వర్షం
ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. నారాయణ్పూర్ జిల్లాలోని అబూడ్మడ్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంప్పై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాంబులతో దాడి చేశారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి.అర్ధరాత్రి జవాన్లు నిద్రిస్తున్న సమయంలో మావోయిస్టులు ఈరక్ బట్టి క్యాంప్పై ఒక్కసారిగా బారెల్ గ్రెనేడ్ లాంచర్లతో విరుచుకుపడ్డారు. నాలుగు బీజీఎల్లను ప్రయోగించారు. దీంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుదాడికి దిగగా మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. అదనపు బలగాలతో క్యాంపు పరిసర అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దాడికి సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. -
చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
చత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య మంగళవారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో కనీసం ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ కూడా ఉన్నారు. రాష్ట్రంలోని నారాయణ్పూర్, కాంకేర్ జిల్లాో సరిహద్దుల్లో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. కాగా 15 రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగడం ఇది రెండోసారి. సంఘటనా ప్రాంతం నుంచి ఒక ఏకే 47తోపాటు ఇతన భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ రీజియన్లో భద్రతా దళాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్మేట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్జీ దళాలు సంయుక్తంగా నక్సల్ ఏరివేత ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా దళాలు ఏడుగుర్ని మట్టుబెట్టాయి. -
ఏవోబీలోకి మావోయిస్టులు?
సాక్షి, పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో తప్పించుకున్నమావోయిస్టులు షెల్టర్ కోసం ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని దండకారణ్యం ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చని కేంద్ర పోలీసు బలగాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ఏవోబీలోని దండకారణ్యంలో కేంద్ర బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కొన్నేళ్లుగా ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది. అయితే, ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దులోని ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతం మావోయిస్టు పార్టీకి అడ్డాగా మారింది. ఆ రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల పరిధిలో ఉన్న బస్తర్ అటవీ ప్రాంతం మావోయిస్టులకు సురక్షితంగా ఉంది. అక్కడి నుంచే మూడేళ్లుగా మావోయిస్టులు తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం కేంద్ర పోలీసు బలగాల నిర్బంధంలో ఉంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పెద్ద సంఖ్యలో పోలీసు పార్టీలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ సుమారు 79మంది కీలక నేతలు, సభ్యులను కోల్పోయింది. కాంకేరు జిల్లాలోని మాడ్ అటవీ ప్రాంతంలో మంగళవారం జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఏకంగా 29మంది మావోయిస్టులు మృతిచెందారు. దీంతో మిగిలిన క్యాడర్ ఛత్తీస్గఢ్ దండకారణ్యానికి సరిహద్దులో ఉన్న ఏపీకి చెందిన అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు, ఒడిశాలోని మల్కన్గిరి, కోరాపుట్ జిల్లాల అటవీ ప్రాంతానికి వచ్చి తలదాచుకుంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. మరోవైపు మావోయిస్టుల కార్యకలపాలను నియంత్రించాలనే లక్ష్యంతో అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఒడిశా పోలీసు బలగాలతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. చింతూరుకు సరిహద్దులోని ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంపై నిఘా పెట్టారు. అప్రమత్తంగా ఉన్నాం ఏవోబీలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లు, మావోయిస్టుల మరణాలు తదితర పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. సరిహద్దులో పోలీసు బలగాలు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. మావోయిస్టుల కదలికలపై నిఘా అధికంగా ఉంది. ఒడిశా> పోలీసు యంత్రాంగం సహకారం తీసుకుంటున్నాం. అన్ని ఔట్ పోస్టుల పరి«ధిలో రెడ్ అలర్ట్ అమలులో ఉంది. – తుహిన్ సిన్హా, ఎస్పీ, పాడేరు -
Chhattisgarh Encounter: మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు
రాయ్పూర్: స్వల్ప రోజుల వ్యవధిలో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు గట్టి దెబ్బలు తగిలాయి. బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వాళ్లలో ఓ మహిళా మావోయిస్టు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం బాసగూడ ప్రాతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఎన్కౌంటర్ జరిగిన ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు బలగాలు ప్రకటించుకున్నాయి. ఇటీవల ఇదే ప్రాంతంలో మావోయిస్టులు ముగ్గురు స్థానికులను హతమార్చారు. దీంతో.. భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగించిన క్రమంలోనే ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. మరోవైపు ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇటీవల వరుసగా ఎదురు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజాపూర్ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు, అంతకు ముందు చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
బస్తర్లో భయం భయం!
తాండ్ర కృష్ణ గోవింద్, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తలపై రూ.కోటి రివార్డు ఉన్న కీలక నేత హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలో కేంద్ర భద్రతా దళాలు క్యాంప్ నెలకొల్పాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు– భద్రతా దళాల మధ్య సాగుతున్న పోరును తెలుసుకునేందుకు ‘సాక్షి’ బస్తర్ అడవుల బాటపట్టింది. అన్నలు విధించిన ఆంక్షలు, పారామిలటరీ చెక్ పాయింట్లను దాటుకుంటూ వెళ్లి వివరాలు సేకరించింది. జవాన్లు, అధికారులతోపాటు మావోయిస్టుల ప్రత్యేక పాలన (జనతన సర్కార్)లో నివసిస్తున్న ప్రజలతో ‘సాక్షి’ ప్రతినిధి మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనపై ప్రత్యేక కథనం.. ముందు, వెనక ప్రమాదం మధ్య.. బస్తర్ దండకారణ్యం పరిధిలోకి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుకుమా, దంతెవాడ,బస్తర్ జిల్లాలు వస్తాయి. ఇక్కడి ప్రజలు రెండు రకాల పాలనలో ఉన్నారు. వారి జీవన స్థితిగతులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ మీడియా బృందం ప్రయత్నించింది. ముందుగా భద్రాద్రి జిల్లా చర్ల మీదుగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పామేడుకు.. అక్కడి నుంచి సుక్మా జిల్లా పువ్వర్తికి వెళ్లింది. ఈ మార్గంలో ఎవరితో మాట్లాడినా.. వారి కళ్లలో సందేహాలు, భయాందోళన కనిపించాయి. కొండపల్లి వద్ద కొందరు గ్రామస్తులు మీడియా బృందాన్ని అడ్డుకున్నారు. ఎవరి అనుమతితో వచ్చారంటూ గుర్తింపు కార్డులు అడిగి తీసుకున్నారు. సాయంత్రందాకా పలుచోట్లకు తీసుకెళ్లారు. తర్వాత ఓ వ్యక్తి వచ్చి ‘‘మీరంతా మీడియా వ్యక్తులే అని తేలింది. వెళ్లొచ్చు. ప్రభుత్వం తరఫునే కాకుండా ఇక్కడి ప్రజల కష్టాలను కూడా లోకానికి తెలియజేయండి’’ అని కోరాడు. అంతేగాకుండా ‘‘ఈ ప్రాంతంలోకి వచ్చేముందు అనుమతి తీసుకోవాల్సింది. అటవీ మార్గంలో అనేకచోట్ల బూబీ ట్రాప్స్, ప్రెజర్ బాంబులు ఉంటాయి. కొంచెం అటుఇటైనా ప్రాణాలకే ప్రమాదం’’ అని హెచ్చరించాడు. దీంతో మీడియా బృందం రాత్రికి అక్కడే ఉండి, మరునాడు తెల్లవారుజామున పువ్వర్తికి చేరుకుంది. అక్కడ భద్రతా దళాల క్యాంపు, హిడ్మా ఇల్లును పరిశీలించింది. అయితే భద్రతాపరమైన కారణాలు అంటూ.. ఫొటోలు తీసేందుకు, వివరాలు వెల్లడించేందుకు పారామిలటరీ సిబ్బంది అంగీకరించలేదు. ఆ పక్క గ్రామంలో హిడ్మా తల్లి ఉందని తెలిసిన మీడియా బృందం వెళ్లి ఆమెను కలిసి మాట్లాడింది. తిరిగి వస్తుండగా నలుగురు సాయుధ కమాండర్లు అడ్డగించారు. బైక్లపై తెలంగాణ రిజిస్ట్రేషన్ నంబర్లను చూసిన ఓ తెలుగు జవాన్ కల్పించుకుని.. ‘‘మీరు కొంచెం ముందుకొచ్చి ఉంటే.. మా వాళ్లు కాల్చేసేవారు’’ అని హెచ్చరించాడు. అదే దారిలో నేలకూలిన ఓ పెద్ద చెట్టును కవర్గా చేసుకుని బంకర్ నిర్మించారని, అందులో సాయుధ జవాన్లు ఉన్నారని, జాగ్రత్తగా వెళ్లాలని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల మధ్య మీడియా బృందం సాధ్యమైనన్ని వివరాలు సేకరించి తిరిగి చర్లకు చేరుకుంది. జనతన్ సర్కార్ ఆధీనంలో.. బీజాపూర్ జిల్లా పామేడు నుంచి చింతవాగు, ధర్మారం, జీడిపల్లి, కవరుగట్ట, కొండపల్లి, బట్టిగూడెం మీదుగా పువ్వర్తి వరకు 60 కిలోమీటర్ల ప్రయాణం సాగింది. పామేడు, ధర్మారం గ్రామాల వరకే ఛత్తీస్గఢ్తోపాటు ప్రభుత్వ పాలన కనిపిస్తుంది. అక్కడివరకే పోలీస్స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి, అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాల వంటివి ఉన్నాయి. తర్వాత చింతవాగు దాటి కొద్దిదూరం అడవిలోకి వెళ్లగానే జనతన సర్కార్కు స్వాగతం పలుకుతున్నట్టుగా మావోయిస్టులు హిందీలో చెక్కలపై రాసి చెట్లకు తగిలించిన బోర్డులు వరుసగా కనిపించాయి. జనతన సర్కార్ ఆ«దీనంలోని ఈ ప్రాంతాల్లో ఎక్కడా బీటీ రోడ్డు లేదు. ఎటు వెళ్లాలన్నా కాలిబాట, ఎడ్లబండ్ల దారులే ఆధారం. పోడు భూములు.. స్తూపాలు జనతన సర్కార్ ఆ«దీనంలోని గ్రామాల్లో మావోయిస్టులు తవ్వించిన చెరువులు, పోడు వ్యవసాయ భూములు, రేకుల షెడ్లలోని స్కూళ్లు కనిపించాయి. కానీ ఎక్కడా తరగతులు నడుస్తున్న ఆనవాళ్లు లేవు. అక్కడక్కడా కొందరు టీచర్లు కనిపించినా మాట్లాడేందుకు నిరాకరించారు. అక్కడక్కడా సంతల్లో హెల్త్ వర్కర్లు మాత్రం కనిపించారు. పరిమితంగా దొరికే ఆహారం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్త్రీలు, పిల్లల్లో పోషకాహర లోపం కనిపించింది. అయితే గతంలో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వారు చెప్పారు. ఏ గ్రామంలోనూ గుడి, చర్చి, మసీదు వంటివి లేవు. జనతన సర్కార్లో మతానికి స్థానం లేదని స్థానికులు చెప్పారు. కొన్నిచోట్ల చనిపోయినవారికి గుర్తుగా నిలువుగా పాతిన బండరాళ్లు, మావోయిస్టుల అమరవీరుల స్తూపాలు మాత్రమే కనిపించాయి. బస్తర్ అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో ఇప్పసారా, లంద, చిగురు వంటి దేశీ మద్యం దొరుకుతుంది. కానీ జనతన సర్కార్ ఆ«దీనంలోని ప్రాంతాల్లో ఎక్కడా మద్యం ఆనవాళ్లు కనిపించలేదు. చాలా మందికి ఆధార్ కార్డుల్లేవు జనతన సర్కార్ పరిధిలోని గ్రామాల్లో సగం మందికిపైగా తమకు ఆధార్కార్డు, ఓటర్ గుర్తింపుకార్డులు లేవని చెప్పారు. వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అంతంతగానే దక్కుతున్నాయి. పువ్వర్తి సమీపంలోని మిర్చిపారా గ్రామానికి చెందిన మడకం సంజయ్ మాట్లాడుతూ.. ‘‘రేషన్ బియ్యం తీసుకుంటున్నాం. అది కూడా మా గ్రామాలకు పది– ఇరవై కిలోమీటర్ల దూరంలో జనతన సర్కార్కు ఆవల ఉండే మరో గ్రామానికి వెళ్లి రెండు, మూడు నెలలకు ఓసారి తెచ్చుకుంటాం..’’ అని చెప్పాడు. ఇక ఎన్నికల ప్రక్రియపై పటేల్పారా గ్రామానికి చెందిన నందా మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ చాలా గ్రామాలకు నామ్ కే వాస్తే అన్నట్టుగా సర్పంచ్లు ఉన్నారు. ఎక్కువ మంది ఎన్నికలను బహిష్కరిస్తారు. అయినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుండటంతో.. సమీప పట్టణాల్లో నివాసం ఉండేవారు నామినేషన్ దాఖలు చేస్తారు. వారిలో ఒకరు సర్పంచ్ అవుతారు. కానీ చాలా గ్రామాల్లో వారి పెత్తనమేమీ ఉండదు. పరిపాలనలో గ్రామ కమిటీలదే ఆధిపత్యం..’’ అని వివరించాడు. సమష్టి వ్యవసాయం చాలా ఊర్లలో ట్రాక్టర్లు కనిపించాయి. వాటికి రిజిస్ట్రేషన్ నంబర్లు లేవు. ఆ ట్రాక్టర్లను ఊరంతా ఉపయోగించుకుంటారని తెలిసింది. ఇక్కడి ప్రజలకు ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేదు. అంతా దట్టమైన అడవి అయినా ఎక్కడా అటవీ సిబ్బంది ఛాయల్లేవు. ఇటీవలికాలంలో చేతిపంపులు, సోలార్ లైట్లు వంటివి కనిపిస్తున్నాయి. వినోదం విషయానికొస్తే.. సంప్రదాయ ఆటపాటలతో పాటు కోడిపందేలను ఆదివాసీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నాం ఇక్కడి ప్రజలకు రక్షణ కల్పించేందుకు, ప్రభుత్వం తరఫున సేవలు అందించేందుకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని పువ్వర్తి వద్ద విధులు నిర్వర్తిస్తున్న సుక్మా జిల్లా ఏఎస్పీ గౌరవ్ మొండల్ చెప్పారు. ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో సర్వే చేపట్టి తాగునీరు, విద్యుత్, స్కూల్, ఆస్పత్రి వంటి సౌకర్యాలు, ఇతర ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. అయితే క్యాంపుల ఏర్పాటులో ఉన్న వేగం ప్రభుత్వ పథకాల అమల్లో కనిపించడం లేదేమని ప్రశి్నస్తే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులే అందుకు కారణమన్నారు. ఇక క్యాంపుల ఏర్పాటు సమయంలో ఆదివాసీలు భయాందోళన చెందినా, తర్వాత శత్రుభావం వీడుతున్నారని మరో అధికారి తెలిపారు. ఈక్రమంలోనే జనతన సర్కారులోకి చొచ్చుకుపోగలుతున్నామన్నారు. ఇప్పటికీ మావోయిస్టులదే పైచేయి.. ప్రభుత్వ బలగాలు ఎంతగా మోహరిస్తున్నా ఇప్పటికీ అడవుల్లో మావోయిస్టులదే ఆధిపత్యం. దీనిపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడి ప్రజలకు ఆటపాటలే ప్రధాన వినోద సాధనాలు. మావోయిస్టులు చేతన నాట్యమండలి వంటివాటి ద్వారా ఇక్కడి ప్రజల్లో విప్లవ భావాలను రేకెత్తిస్తారు. పిల్లలకు ఏడేళ్లు దాటగానే గ్రామ కమిటీల్లో చోటు కల్పించి, భావజాలాన్ని నేర్పుతారు. మావోయిస్టుల పట్ల ఎవరైనా వ్యతిరేకత చూపితే ప్రమాదం తప్పదనే భయాన్ని నెలకొల్పారు’’ అని ఆరోపించారు. హిడ్మా అడ్డాలో క్యాంపు వేసి.. పువ్వర్తి జనాభా 400కు అటుఇటుగా ఉంటుంది. అందులో దాదాపు వంద మంది మావోయిస్టు దళాల్లో ఉన్నారు. వీరిలో హిడ్మా కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకోగా.. ఆయన సోదరుడు దేవా బెటాలియన్ కమాండర్గా ఉన్నారు. పువ్వర్తిలో హిడ్మా కోసం ప్రత్యేక సమావేశ మందిరం, కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండేవి. అక్కడికి కొన్ని అడుగుల దూరంలోనే హిడ్మా సొంతిల్లు ఉంది. ప్రస్తుతం ఇవన్నీ భద్రతా దళాల ఆధీనంలో ఉన్నాయి. ఆధునిక పరికరాల సాయంతో వందల మంది కార్మికులు క్యాంపు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. ఇటీవలి వరకు రోడ్డుకూడా లేని ఈ గ్రామంలోకి ఇప్పుడు పదుల సంఖ్యలో లారీల్లో వస్తుసామగ్రి, రేషన్ తరలించారు. బుల్డోజర్లు, పొక్లెయినర్లు నిర్విరామంగా తిరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్, స్పెషల్ టాస్్కఫోర్స్, డి్రస్టిక్ట్ రిజర్వ్ గార్డ్స్, బస్తర్ ఫైటర్స్ ఇలా వివిధ దళాలకు చెందిన సుమారు ఐదు వేల మంది సిబ్బంది మోహరించారు. గ్రామం నలువైపులా గుడారాలు, బంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు.. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్యాంపులు తమకు ఇబ్బందిగా మారుతున్నాయని చాలా మంది ఆదివాసీలు అంటున్నారు. కొండపల్లికి చెందిన మడావి మాట్లాడుతూ.. ‘‘క్యాంపులు ఏర్పాటైన తర్వాత మా గ్రామాల్లోకి వచ్చే భద్రతాదళాలు విచారణ పేరుతో జబర్దస్తీ చేస్తున్నాయి. రాత్రీపగలు తేడా లేకుండా కాల్పుల శబ్దాలు వినవస్తున్నాయి. విచారణ పేరిట ఎవరైనా గ్రామస్తుడిని తీసుకెళ్తే.. తిరిగి వచ్చే వరకు ప్రాణాలపై ఆశలేనట్టే. అందుకే భద్రతా దళాలు వస్తున్నట్టు తెలియగానే పెద్దవాళ్లందరం అడవుల్లోకి పారిపోతున్నాం’’ అని చెప్పాడు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘‘స్థానికులమైన మాకు భద్రతాదళాల నుంచి కనీస మర్యాద లేదు. అభివృద్ధి పేరిట అడవుల్లోకి వస్తున్నవారు గ్రామపెద్దల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు..’’ అని పేర్కొన్నాడు. -
సీఏఎఫ్ కమాండర్ను పొట్టనబెట్టుకున్న మావోలు
చర్ల: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో మావోయిస్టులు సాయుధ బలగాల కమాండర్ను దారుణంగా చంపారు. కుట్రు పోలీస్స్టేషన్ పరిధిలోని దర్బా గ్రామంలో ఆదివారం జరిగే సంతకు ఛత్తీస్గఢ్ సాయుధ బలగాల 4వ బెటాలియన్ జవాన్లు బందోబస్తుగా ఉన్నారు. ఉదయం 9.30 గంటల సమయంలో గ్రామీణుల వేషధారణలో వచి్చన మావోయిస్టులు ఏమరుపాటుగా ఉన్న కమాండర్ తేజో రాం బౌర్యా తలపై గొడ్డలితో వేటు వేశారు. దీంతో, ఆయన అక్కడికక్కడే కుప్పకూలి, ప్రాణాలొదిలారు. ఆ వెంటనే మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న బలగాలు మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. -
మూడు క్యాంపులపై మావోయిస్టుల దాడి
చర్ల: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు గ్రామం మావోయిస్టులు, జవాన్ల పరస్పర కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా దండకారణ్య ప్రాంతంలోని బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల్లో ఏర్పాటుచేస్తున్న పోలీసు క్యాంప్లపై మావోలు మెరుపుదాడికి దిగారు. పామేడు పోలీస్స్టేషన్ పరిధిలోని ధర్మారం, చింతవాగులో నిర్మించిన క్యాంప్లు, పామేడు పోలీస్ స్టేషన్పై మావోయిస్టులు దాడికి దిగారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో లాంచర్లతో దాడిని ప్రారంభించిన మావోయిస్టులు బుధవారం తెల్లవారుజామున 5 గంటల వరకు కొనసాగించారు. సీఆర్పీఎఫ్ బలగాలు ఎదురుదాడికి దిగగా తెల్లవార్లూ ఆ ప్రాంతం బాంబుల మోతతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 300 నుంచి 400 మంది వరకు మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాడి సమయంలో ఆయా ప్రాంతాల ప్రధాన దారులపై చెట్లు నరికి అడ్డంగా వేసి నిప్పుపెట్టి రహదారిని మూసి వేశారు. ఆ మార్గాల గుండా వస్తున్న గ్రామస్తులను వెనక్కి పంపించారు. మూడు చోట్లా ఏకకాలంలో రాకెట్ లాంచర్లు విసురుతూ, మందుపాతరలు పేల్చుతూ భయోత్పాతం సృష్టించారు. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు సైతం ఎదురుదాడికి దిగాయి. ధర్మారం క్యాంపు నిర్మాణ పనులు కొనసాగుతుండగా అందులోని జవాన్లతో పాటు పని చేసేందుకు గుంటూరు నుంచి వచి్చన 40 మంది కూలీలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ధర్మారం క్యాంప్పై జరిపిన దాడిలో తొమ్మిది మంది జవాన్లు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. -
పోలీసు, మావోయిస్టుల కాల్పుల్లో పసికందు మృతి
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో పోలీసులు, మానోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని మాట్వాండిలో సోమవారం ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురు కాల్పుల్లో ప్రమాదవశాత్తు మాట్వాండికి చెందిన ఆరు నెలల పసికందు మృతి చెందగా.. తల్లి గాయాల పాలైంది. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి పోలీసులు సాయం అంధించారు. పోలీసులు, మానోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు నక్సలైట్లకు గాయాలు అయ్యాయి. చదవండి: గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ను టెర్రరిస్టుగా ప్రకటించిన భారత్! ఇంతకీ నేపథ్యం ఏంటంటే.. -
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్
దుమ్ముగూడెం: ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా కొత్తపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఆరుగురు మావోయిస్టులు తీవ్రంగా గాయపడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కొత్తపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న శిబిరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. వెంటనే తేరుకున్న మావోయిస్టులు ఎదురుకాల్పులు జరుపుతూ సమీప అటవీప్రాంతంలోకి పారిపోయినట్టు సమాచారం. పోలీసులు మావోల క్యాంప్ను ధ్వంసం చేశారు. ఘటనాస్థలిలో భారీగా పేలుడు పదార్థాలను స్వా«దీనం చేసుకున్నారు. ‘‘మావోల జాడ కోసం గాలింపు చేపట్టగా సమీప ప్రాంతాల్లో రక్తపు మరకలు ఎక్కువగా కనిపించాయి. ఎన్కౌంటర్ సందర్భంగా దాదాపు ఆరుగురు మావోలు తీవ్రంగా గాయపడి ఉండొచ్చు లేదా మరణించి ఉండొచ్చు ఉండొచ్చు’’ అని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. -
ఛత్తీస్గఢ్లో పేలిన మందు పాతర..నేలకొరిగిన బీఎస్ఎఫ్ జవాన్
కాంకేర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి ఒక బీఎస్ఎఫ్ జవాను వీర మరణం పొందారు. పర్టాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సడక్టోలా గ్రామ సమీపంలో కూంబింగ్ జరుపుతుండగా గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడులో ఉత్తరప్రదేశ్కు చెందిన బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ అఖిలేశ్ రాయ్(45) చనిపోయారని అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు. -
భద్రాద్రి జిల్లాలో మందుపాతర నిర్వీర్యం
చర్ల: పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన భారీ మందుపాతరను గుర్తించిన పోలీసులు శుక్రవారం దాన్ని నిర్విర్యం చేశారు. దీంతో పోలీసు బలగాలకు పెనుప్రమాదం తప్పినట్లయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కలివేరు–పెదమిడిసిలేరు ప్రధాన రహదారిపై బీ కొత్తూరు వద్ద వంతెనకు సమీపాన మావోయిస్టులు 30 కిలోల మందుపాతర ఏర్పాటు చేశారు. ఈ రహదారి మీదుగా సరిహద్దు అటవీప్రాంతానికి నిత్యం బలగాలు కూంబింగ్కు వెళ్లివస్తుంటాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెళ్లే పోలీసులను మట్టుబెట్టేందుకు మావోయిస్టులు ఈ మందుపాతరను అమర్చగా, తనిఖీల్లో భాగంగా గురువారం ఉదయం గుర్తించారు. ఓ పక్క పోలింగ్ జరుగుతున్నందున దాన్ని నిర్వీర్యం చేస్తే వచ్చే శబ్దంతో ఓటర్లు భయబ్రాంతులవుతారని భావించిన పోలీసులు మందుపాతరకు ఉన్న ఎలక్ట్రిక్ వైర్లు తొలగించారు. శుక్రవారం ఉదయం బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఆధ్వర్యాన నిర్వీర్యం చేశారు. కాగా, ఈ మందుపాతరను మావోలు పేల్చినట్లయితే బస్సు లేదా లారీ వంటి భారీ వాహనం కనీసం 20 నుంచి 30 అడుగుల మేర ఎత్తు ఎగిరిపడి తునాతునకలయ్యేదని చెబుతున్నారు. మరోపక్క ఈ మార్గంలో ఇంకా మందుపాతరలు ఉండొచ్చనే భావించిన పోలీసులు నిశితంగా తనిఖీలు చేపడుతున్నారు. -
కొందమాల్లో మావోలు తిష్ట.. జవాన్లు కూంబింగ్ చేస్తుండగా
బరంపురం : కొందమాల్పై ఎప్పుడో పట్టు కోల్పోయిన మావోయిస్టులు మళ్లీ అదే స్థలానికి చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరు చాప కింద నీరులా కొత్త దళాలను ఏర్పాటు చేస్తున్నారా? కొందమాల్–కొలాహండి–గంజాం జిల్లాల సరిహద్దులను కారిడార్గా చేసుకొని కొందమాల్లో తిష్ట వేశారా? అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల కిందట కొందమాల్ జిల్లా పిరింగియా పోలీసు స్టేషన్ పరిధిలో గల కొమనకుల పంచాయతీ, కొంబలోడు గ్రామం దగ్గర పోడుకొట్ట ఘాటీ ప్రాంతంలో మావోల డంప్ బయట పడడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కేకేబీఎన్ దళం మావోయిస్టుల డంపు బయటపడటంతో చత్తీస్గఢ్ నాయకులు కొన్ని అనుబంధ సంస్థలతో కలిసి కొందమాల్–కలాహండి జిల్లాలను కలుపుకుని కొత్త దళం ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పిరింగియా పోలీసు స్టేషన్ పరిధిలో గల కొమనకుల పంచాయతీ, కొంబలోడు గ్రామం దగ్గర పోడుకొట్ట ఘాటీ దట్టమైన అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఎస్ఓజీ జవాన్లు కూంబింగ్ చేస్తుండగా మావోల డంప్ దొరికిందని దక్షిణాంచల్ ఐజీ సత్యబ్రత బోయి తెలియజేశారు. ముమ్మరంగా కూంబింగ్ కొందమాల్ ఏఎస్పీ మినతి మిశ్రా, బౌద్ జిల్లా ఎస్పీ బి.గంగధర్, గంజాం జిల్లాకి చెందిన జగ్మోహన్ మీనాలు ఈ ఘటనపై అప్రమత్తమయ్యారు. కొందమాల్–కొలాహండి–గంజాం జిల్లాల సరిహద్దుల్లోని బల్లిగుడా, రైకియా, బమ్ముణిగామ్, దరింగబడి, గజలబడి, కటింగియా, పాణిగొండా అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. -
మహిళా మావోయిస్టులో అసభ్యకర ప్రవర్తన.. పీఎల్జీఏ సభ్యుడి హతం
చర్ల: మహిళా మావోయిస్టులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న పీఎల్జీఏ సభ్యుడిని మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించి హతమార్చారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పీఎల్జీఏ 17వ బెటాలియన్కు చెందిన మను దుగ్గ పార్టీలో పనిచేస్తున్న మహిళా మావోయిస్టులపై అసభ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయనపై మహిళా మావోయిస్టులు అగ్ర నాయకులకు ఫిర్యాదు చేయగా.. వారు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కాంకేర్ జిల్లాలోని దండకారణ్య ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన మావోయిస్టులు ఆయనను హతమార్చారు. ఈ మేరకు లేఖను కూడా మృతదేహం వద్ద వదిలారు. కాగా, మావోయిస్టులు హతమార్చిన పార్టీ పీఎల్జీఏ సభ్యుడు మను దుగ్గపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది. ఇది కూడా చదవండి: ఇంజనీరింగ్ కాలేజ్ పార్ట్నర్స్ భారీ స్కెచ్.. ఓనర్ హత్యకు సుపారీ -
సర్పంచ్, ఉప సర్పంచ్ల కాళ్లు, చేతులు నరికేస్తాం..
భద్రాద్రి: ఛత్తీస్గఢ్లో అభివృద్ధి పనులకే కాక గనులు తెరిచేందుకు సహకరిస్తే సర్పంచ్, ఉపసర్పంచ్ల కాళ్లు, చేతులు నరకడమే కాక ఇంకా ఎవరైనా ఉంటే హతమరుస్తామని మావోయిస్టులు హెచ్చరించారు. ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్ జిల్లాలోని ఓర్చా బ్లాక్లో నది నీటిని నిల్వ చేసేందుకు కరకట్ట నిర్మిస్తున్నారు. ఆది నుంచి ఈ పనులను వ్యతిరేకిస్తున్న మావోయిస్టులు నిలివేయాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా ఆదివారం రాత్రి ఓర్చా సమీపంలోని ప్రధాన రహదారి వెంట వాల్పోస్టర్లు వేయడంతో పాటు బ్యానర్లు కట్టారు. నదిలో కరకట్ట నిర్మాణ పనులతో పాటు, ఈ ప్రాంతంలో గనుల్లో తవ్వకాలను నిలిపివేయాలని అందులో హెచ్చరించారు. ఈ పనులకు సహకరిస్తున్న సర్పంచ్, ఉప సర్పంచ్ల కాళ్లు చేతులు నరికివేయడమే కాక గైతాపారా, బెస్మెట్ట గ్రామాల ప్రజలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మావోయిస్టులు పేర్కొన్నారు. -
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి
కాళేశ్వరం: మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లా బాంబ్రాగాడ్ తాలూకా దామరంచ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి పోలీసులతో ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ తెలిపారు. పెరిమిలి, అహేరి మావోయిస్టు దళాలు సమావేశమయ్యాయనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా జరిఎదురు కాల్పుల్లో పెరిమిలి దళం కమాండర్ బిట్లు మడావి, వాసు, అహేరి దళానికి చెందిన శ్రీకాంత్ మృతి చెందారు. -
నెత్తురు చిందిన బస్తర్
చెప్పుకోదగ్గ హింసాత్మక ఘటనలు లేకుండా కనీసం రెండేళ్లనుంచి ప్రశాంతంగా కనబడుతున్న ఛత్తీస్గఢ్లో బుధవారం నక్సలైట్లు ఐఈడీ పేల్చి మినీ బస్సులో వెళ్తున్న పదిమంది జిల్లా రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) పోలీసులనూ, ఒక డ్రైవర్నూ హతమార్చిన ఉదంతం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఆ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా పల్నార్–అరణ్పూర్ మధ్యలో ఇటీవలే నిర్మించిన రహ దారిపై ఈ ఐఈడీని అమర్చారనీ, అది కూడా రెండు మూడురోజుల క్రితమేననీ వస్తున్న కథనాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఆదివాసీల హక్కుల కోసం తుపాకులు పట్టామని చెబుతున్న మావోయిస్టుల్లోగానీ, వారిని ఎదుర్కొంటున్న భద్రతా బలగాల తీరులోగానీ ఏ మార్పూ రాలేదని తాజా ఘటన చెబుతోంది. ఒకప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రభావవంతంగా ఉన్న వామపక్ష తీవ్ర వాదం చాన్నాళ్లుగా తగ్గుముఖం పట్టింది. 2000కు ముందు పది రాష్ట్రాల్లోని 200 జిల్లాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తిస్తే ఆ సంఖ్య 2021 నాటికి 41కి పడిపోయిందంటున్నారు. ఇప్పుడది 25 జిల్లాలకు మాత్రమే పరిమితమైందనీ, గత ఎనిమిదేళ్లలో నక్సల్ సంబంధిత హింసాత్మక ఘటనలు 55 శాతం తగ్గాయనీ, మరణాలు కూడా 63 శాతం తగ్గాయనీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నాలుగు నెలల క్రితం విడుదల చేసిన నివేదిక తెలిపింది. హింసను కట్టడి చేయ టానికి అవసరమైన కఠిన చర్యలు తీసుకుంటూనే అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న పర్యవ సానంగా మావోయిస్టుల లొంగుబాట్లు కూడా అధికంగానే ఉన్నాయని ఆ నివేదిక వివరించింది. అయితే ఇలాంటి విజయాలే పోలీసు బలగాల్లో ఒక రకమైన నిర్లక్ష్యానికి దారితీశాయా అన్నది ఆలోచించుకోవాలి. తాజా ఉదంతాన్నే తీసుకుంటే అరణ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావో యిస్టుల కదలికలున్నాయని అందిన సమాచారంతో డీఆర్జీ పోలీసులు అక్కడికి వెళ్లారు. వెళ్లేముందూ, తిరిగొచ్చేటప్పుడూ ఒకే మార్గాన్ని ఉపయోగించకూడదన్న నిబంధన ఉంది. ఒకవేళ తప్పని సరైతే రెండుసార్లూ బలగాల కన్నా ముందు ఒక ప్రత్యేక టీం వెళ్లి ఆ దారిలో మందుపాతరలు, ఇతరత్రా బాంబులు లేవని నిర్ధారించాలి. పైగా ఈమధ్యకాలంలో మావోయిస్టుల వైపునుంచి ఐఈడీల వినియోగం బాగా ఎక్కువైందని తెలుస్తూనే ఉంది. గత నాలుగు నెలల్లో ఐఈడీలు గుర్తించి వెలికితీసిన ఉదంతాలు 34 వరకూ ఉన్నాయని వార్తలు వెలువడ్డాయి. గతంలో భారీయెత్తున ఆది వాసీలను సమీకరించి పోలీసు బలగాలపై విరుచుకుపడిన మావోయిస్టులు ఇటీవల తక్కువమందితో బృందాలను ఏర్పాటుచేసి దాడులకు దిగుతున్నారని ఒక మీడియా కథనం తెలిపింది. పైగా లోగడ కేవలం అయిదారు కేజీల ఐఈడీని పేలుళ్లకు వినియోగిస్తే ఇప్పుడది 30, 40 కేజీలవరకూ ఉంటోంది. అందువల్ల ప్రాణనష్టం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని గమనించి అయినా అరణ్పూర్ వెళ్లిన డీఆర్జీ పోలీసులు తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది. ఒకప్పుడు లొంగిపోయిన ఆదివాసీలతో సల్వాజుడుం పేరుతో ప్రైవేటు దళాలను ఏర్పాటుచేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని రద్దుచేయక తప్పలేదు. ఆ తర్వాతే ఛత్తీస్గఢ్ పోలీసు విభాగంలో డీఆర్జీ పేరుతో ప్రత్యేక దళం ఏర్పాటయింది. ఇందులో కూడా అత్యధికులు లొంగిపోయిన మావోయిస్టులు. వారంతా ఆదివాసీలు. కనుక మావోయిస్టులకు వారిపై గురి ఉంటుంది. అటువంటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలి? ఘటన జరిగిన ప్రాంతంలో ఒకప్పుడు మావోయిస్టులు బలంగా ఉండేవారనీ, ఇప్పుడు వారి ప్రభావం పూర్తిగా పోయిందనీ మీడియా కథనాలు చెబుతున్నాయి. డీఆర్జీ పోలీసుల్లో నిర్లక్ష్యానికి అది కూడా కారణమైవుండొచ్చు. ఒకప్పుడు మధ్య, తూర్పు భారత ప్రాంతాల్లో ఎంతో బలంగా ఉన్న తాము ఎందువల్ల బలహీ నపడవలసి వచ్చిందన్న ఆత్మవిమర్శ మావోయిస్టుల్లో కొరవడిందని తాజా ఉదంతం చెబుతోంది. హింసాత్మక ఘటనలకు పాల్పడటం వల్ల ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరిస్తాయే తప్ప దానివల్ల కలిగే మార్పేమీ ఉండదని పదే పదే రుజువవుతోంది. మావోయిస్టులు ఏదో ఒక చర్యకు పాల్పడగానే సమీప ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రాంతాలపై పోలీసులు విరుచుకుపడటం, అమాయ కులు సైతం బాధితులుగా మారడం చాన్నాళ్లుగా కనబడుతూనే ఉంది. అరెస్టులు, కేసులు, ఏళ్ల తరబడి జైళ్లపాలు కావటం పర్యవసానంగా ఆదివాసీ కుటుంబాల జీవనం అస్తవ్యస్తమవుతోంది. పోషించేవారు లేక ఎన్నో కుటుంబాలు చెప్పనలవికాని ఇబ్బందులు పడుతున్నాయి. గతంతో పోలిస్తే మావోయిస్టుల ప్రభావంలో ఉన్న ప్రాంతాలు తగ్గిపోవడానికి ఇదొక ప్రధాన కారణం. కనీసం ఈ పరిణామమైనా తమ హింసాత్మక చర్యల్లోని నిరర్థకతపై పునరాలోచన కలిగిస్తే బాగుండేది. కానీ ఆ మాదిరి మార్పు రాలేదని ఈ ఉదంతం నిరూపించింది. ప్రజాస్వామ్యంలో భిన్నాభి ప్రాయాలను ప్రకటించటానికీ, ప్రభుత్వ విధానాల్లో లోపాలున్నాయనుకున్నప్పుడు వాటికి వ్యతి రేకంగా ప్రజానీకాన్ని కూడగట్టడానికీ ఎప్పుడూ అవకాశాలుంటాయి. అలాంటి ఉద్యమాలను ప్రభుత్వాలు అణచివేయటానికి ప్రయత్నించినప్పుడు ప్రతిఘటన కూడా అదే స్థాయిలో వస్తున్నది. సాగు చట్టాలపై ఏడాదిపైగా సాగిన రైతు ఉద్యమాన్ని నయానా భయానా నియంత్రించాలనుకున్న కేంద్రం చివరకు వారి డిమాండ్లకు తలొగ్గి ఆ చట్టాలను వెనక్కి తీసుకోకతప్పలేదు. వీటన్నిటినీ మావోయిస్టులు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజా ఉద్యమాలను నిర్మించే ప్రయత్నం చేయాలి. తమ హింసాత్మక చర్యలవల్ల సాధించేదేమీ లేకపోగా ఆదివాసులే కష్టనష్టాలు అనుభవించాల్సి వస్తున్నదని గుర్తించాలి. -
ఛత్తీస్గఢ్ అమరులకు ఘన నివాళులు
దంతెవాడ: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడలో బుధవారం మావోయిస్టుల మందుపాతర పేల్చిన ఘటనలో అమరులైన 10 మంది పోలీసు సిబ్బంది, ఒక డ్రైవర్కు ఘనంగా నివాళులర్పించారు. కర్లి ప్రాంతంలోని పోలీస్లైన్స్లో గురువారం జరిగిన కార్యక్రమంలో మృతుల కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం రోదనలు, భారత్ మాతా కీ జై నినాదాలతో ప్రతిధ్వనించింది. ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తదితరులు హాజరై మృతులకు పూలతో నివాళులర్పించారు. బాధిత కుటుంబాలను బఘేల్ ఓదార్చారు. అనంతరం జవాన్ల భౌతికకాయాలను వాహనాల్లో సొంతూళ్లకు తరలించారు. సీఎం బఘేల్ కూడా భుజం కలిపి ఒక జవాను మృతదేహాన్ని వాహనం వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాలు వృథా కావని, మావోయిస్టులపై పోరు మరింత తీవ్రతరం చేస్తామని చెప్పారు. దంతెవాడ జిల్లా అరన్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసుల వాహనాన్ని నక్సల్స్ మందుపాతరతో పేల్చిన ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు(డీఆర్జీ) విభాగానికి చెందిన 10 మంది జవాన్లు, డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. శవపేటికను మోస్తున్న సీఎం బఘేల్ -
Dantewada: పేలుడు టైంలోని వీడియో బయటకు..
రాయ్పూర్: ఒక డ్రైవర్ సహా పది మంది పోలీసులను పొట్టబెట్టుకున్న మావోయిస్టుల ఘాతుకంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. దాదాపు రెండేళ్ల తర్వాత మావోయిస్టులు భారీ దెబ్బ తీశారు. అయితే దంతేవాడ్ పేలుడు ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. పేలుడు తర్వాత.. ఓ పోలీస్ సిబ్బంది అక్కడే ఉన్న మావోయిస్టులపై కాల్పులు జరపడానికి యత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. పేలుడు తర్వాత.. మరో వాహనంలో ఉన్న పోలీస్ సిబ్బంది ఒకరు అక్కడే ఉన్న మావోయిస్టుల వైపుగా వెళ్తూ.. కాల్పులు జరిపేందుకు పొజిషన్ తీసుకుంటూ కనిపించాడు. ఓ వాహనం కింద దాక్కున్న మరో పోలీస్ సిబ్బంది అక్కడి పరిస్థితులను తన ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియోలో పేలుడు జరిగిన ప్రదేశం కనిపిస్తోంది. ‘‘వాహనం మొత్తం పేల్చేశారు..’’ అంటూ బ్యాక్గ్రౌండ్లో ఓ వాయిస్ వినిస్తోంది. పేలుడు ధాటికి పడిన పదడుగుల లోతు గుంత అంచులనూ క్లిప్లో చూడొచ్చు. ఇక క్లిప్ చివరిలో, తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఆ వీడియో చిత్రీకరించిన పోలీస్ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ.. డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్((DRG) తరపున మేం యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్లో మంగళవారం నుంచి పాల్గొంటున్నాం. బుధవారం మధ్యాహ్నం 1.30 గం. ప్రాంతంలో తిరుగుపయనం అయ్యాం. పేలిన వాహనానికి 100-150 మీటర్ల దూరంలో మేం ప్రయాణిస్తున్న ఎయూవీ ఉంది. మా వాహనంలో మేం ఏడుగురం ఉన్నాం. మొత్తం ఏడు వాహనాల కాన్వాయ్లో.. మూడో వాహనం మావోయిస్టులకు లక్ష్యంగా మారిందని తెలిపారు. పేలుడు ధాటికి ఆ వాహనంలో ఉన్న ఎవరూ ప్రాణాలతో మిగల్లేదు. అంతా చనిపోయారు అని ఆయన తెలిపారు. మేం వాళ్లున్న దిశలో కాల్పులు జరిపాం. వాళ్ల వైపు నుంచి ఒకటి రెండు రౌండ్ల కాల్పులు మాత్రమే వినిపించాయి. ఆ తర్వాత కాల్పులు ఆగిపోయాయి అని ఆ సిబ్బంది తెలిపారు. కాన్వాయ్లోని ఏడు వాహనాల్లో మొత్తంలో 70 మంది సిబ్బంది ఉన్నారని ఆయన వెల్లడించారు. #Viral video surfaces showing moments after #Dantewada Naxal #attack in Chhattisgarh. pic.twitter.com/Xxr2mGr5t0 — Jammu Kashmir News Network 🇮🇳 (@TheYouthPlus) April 27, 2023 -
ఎదురుకాల్పుల్లో నేలకొరిగిన ముగ్గురు జవాన్లు
దుమ్ముగూడెం: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుగొండ అటవీప్రాంతంలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు డీఆర్జీ జవాన్లు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ పోలీసులు, డీఆర్జీ బలగాలు జేగురుగొండ నుంచి దండకారణ్య అటవీ ప్రాంతంలో రోజువారీ గాలింపుల్లో ఉండగా కందేడ్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం మావోయిస్టులు కాల్పులు జరిపారు. ముగ్గురు జవాన్లు మృతి చెందగా గాయపడిన వారిని వెంటనే క్యాంప్కు తరలించి వైద్యమందించారు. రెండు ఏకే 47 తుపాకులు, 51 ఎంఎం మోరా్టర్ను మావోయిస్టులు అపహరించారు. కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయి ఉంటారని పోలీసులంటున్నారు. వారి కోసం భారీగా కూంబింగ్ చేపట్టినట్టు బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్రాజ్ చెప్పారు. ఆర్మీ జవాన్ను హతమార్చిన మావోయిస్టులు చర్ల: ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో శనివారం ఓ ఆర్మీ జవాన్ను మావోయిస్టులు హతమార్చారు. జిల్లాలోని బడెతెవాడకు చెందిన జవాన్ మోతీరామ్ సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. సమీపంలోని ఉసేలీ వారపు సంతలో కోడి పందేలు చూస్తుండగా ముగ్గురు మావోయిస్టులు మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో మోతీరాం అక్కడికక్కడే మృతిచెందారు. -
బీరు బాటిల్ చూస్తే అనుమానించాల్సిన పరిస్థితి.. పక్కా ప్లాన్తో బాంబ్!
రోడ్డుపై, అడవుల్లో ఖాళీ బీరు బాటిళ్లను చూస్తే ఇక అనుమానించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే మావోయిస్టులు కొత్త తరహాలో బీర్ బాటిల్ బాంబును అమర్చి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తమ వద్ద ఉందని చెప్పకనే చెబుతున్నారు. ఛత్తీస్గఢ్ కేంద్రంగా ఉన్న మావోయిస్టులు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురం(కె), భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో తమ కదలికలు ఉన్నాయని చెప్పేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండటంతో మావోయిస్టుల దుశ్చర్యలను గట్టిగా తిప్పికొడుతున్నారు. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/ఏటూరునాగారం: ప్రెషర్ బాంబ్లు, కెమెరా ఫ్లాష్ బాంబ్లు, బ్యాటరీలు ఇలా అనేక రకాల మందుపాతరలు అమర్చిన మావోయిస్టులు రూటు మార్చారు. కూంబింగ్లో పాల్గొనే భద్రతా దళాలు, పోలీసులను ఏమారుస్తూ పేలుడు జరిపి భారీ విధ్వంసం సృష్టించేలా బీరు బాటిల్ బాంబ్ వ్యూహాన్ని అమల్లో పెడుతున్నారు. ప్రెషర్, బకెట్ బాంబులను భద్రతా దళాలు సులువుగా గుర్తిస్తుండటంతో తమ వ్యూహం మారుస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో పేలుడు తీవ్రత పెంచేందుకు మావోయిస్టులు పదునైన ఇనుప ముక్కలను పేలుడు పదార్థాల చుట్టూ ఉంచేవారు. అయితే మెటల్ డిటెక్టర్లు ఉపయోగించినప్పుడు, ఆ బాంబు జాడను భద్రతా దళాలు సులువుగా పసిగడుతున్నట్టు మావోయిస్టులు అనుమానిస్తున్నారు. దీంతో బీరు బాటిల్ బాంబు వ్యూహానికి పదును పెట్టినట్టు తెలుస్తోంది. ఖాళీ బాటిళ్లలో ఐఈడీ మావోయిస్టులు ఖాళీ బీరు బాటిళ్లలో ఐఈడీ తరహా పేలుడు పదార్థాలను కూర్చి విధ్వంసం సృష్టించే వ్యూహంఅమలుకు శ్రీకారం చుట్టారు. తాగి పడేసిన బీరు బాటిల్ అయితే భద్రతా దళాలు అనుమానించకుండా వదిలేస్తాయని, పైగా అందులో అమర్చిన బాంబు పేలినప్పు డు గాజు ముక్కల కారణంగా ప్రమాద తీవ్రత పెరుగుతుందనే అంచనాతో ఈ ప్లాన్ అమలు చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఈ తరహా బాంబులను ఒడిశాలో పేల్చి నట్టు సమాచారం. తాజాగా బీరు బాటిల్లో అమర్చిన బాంబును ములుగు జిల్లాలో పోలీసులు గుర్తించారు. పోలీసులు బయటకు తీసిన బీర్బాటిల్ , పేలుడు పదార్థాలు మందుపాతరలు, ప్రెషర్బాంబుల ఘటనలు ►ఈనెల 4న చర్ల మండలం కుర్నపల్లి మార్గంలో ఎర్రబోరు–బోదనెల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై అమర్చిన శక్తిమంతమైన 20 కిలోల మందుపాతరను చర్ల పోలీసులు నిర్వీర్యం చేశారు. ►గత నెల 28న చర్ల మండలంలోని కొండెవాయి సమీపంలోని ప్రధాన రహదారిపై శక్తిమంతమైన మందుపాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. ►గత నెల 26న కొండెవాయి అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలను మట్టుబెట్టేందుకు అమర్చిన ప్రెషర్ బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. ►గత నెల14న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పెగడపల్లి వద్ద అమర్చిన మందుపాతరను పేల్చడంతో ఏఎస్ఐ మహ్మద్ అస్లాం తీవ్రంగా గాయపడ్డాడు. ►2022 డిసెంబర్లో ఉంజుపల్లి సమీపంలో పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకొని పెట్టిన ప్రెషర్బాంబు పేలి ఆవు మృతిచెందింది. ►2021 జూలైలో చర్ల శివారు లెనిన్కాలనీ సమీపంలో చర్ల యువకుడు ప్రమాదవశాత్తు ప్రెషర్ బాంబును తొక్కడంతో అది పేలింది. కొత్త కోణంలో బాంబు... గతంలో ఏటూరునాగారం ఏజెన్సీ అప్పటి పీపుల్స్వార్ నక్సల్స్కు ప్రయోగశాలగా ఉండేది. ఇప్పుడు మావోయిస్టులు ఛత్తీస్గఢ్, వాజేడు, వెంకటాపురం(కె) ప్రాంతాలను అనువైనవి గుర్తించి తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త తరహా దాడులకు వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం పామునూరు అటవీ ప్రాంతంలో మందుపాతర అమర్చినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వాటిని వెతుక్కుంటూ వెళ్లిన భద్రత బలగాలకు విద్యుత్ వైర్లు కనిపించాయి. వాటిని చూసుకుంటూ ముందుకెళ్లగా ఖాళీ బీరు బాటిల్ కనిపించింది. ఆ వైర్లు ఆ సీసాలోకి పోయినట్లు గుర్తించిన పోలీసులు బాంబ్ స్క్వాడ్ను పిలిపించి నిర్వీర్యం చేశారు. ఐఈడీ నింపిన సీసాలో భద్రత బలగాలకు గుచ్చుకునేలా ఇనుప బోల్ట్లు, రాగి రేకు ముక్కలు, ప్లాస్టిక్ లెడ్, కార్బన్ ముక్కలు, గన్ పౌడర్ ఇతర పేలుడు పదార్థాలను అందులో కూర్చి పెట్టారు. అది పేలితే పెద్ద ప్రమాదం ఉండేదని పోలీసులు చెబుతున్నారు. -
మావోయిస్టుల ఘాతుకం.. బీజేపీ నేత దారుణ హత్య
చర్ల: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు హాజరై తిరిగి వెళుతున్న బీజేపీ నేతను బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలోనే దారుణంగా నరికి చంపారు. దీంతో ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. బీజాపూర్ జిల్లా ఆవుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో గల పెకారం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ బీజేపీ అధ్యక్షుడు కెక్కెం నీలకంఠ (45) స్వగ్రామం పెకారం గ్రామం కాగా, కొంతకాలంగా ఊసూరులోనే ఉంటున్నాడు. ఆదివారం పెకారంలో వివాహ వేడుకకు హాజరయ్యాడు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన మావోయిస్టులు నీలకంఠను కత్తులతో పొడవడంతో పాటు గొడ్డళ్లతో దారుణంగా నరికారు. ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నందునే హతమార్చామని మృతదేహం వద్ద లేఖ వదలివెళ్లారు. దీంతో, ఈ ఘటన సంచలనంగా మారింది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరాచకాలు చూస్తే చంపాలని అనిపిస్తోంది..!
విద్యానగర్ (కరీంనగర్): టీఆర్ఎస్ పాలనలో ఎంపీటీసీలు మొదలు.. ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు అవినీతి అడ్డూఅదుపు లేకుండా పోయిందని, అందుకే మావోయిస్టుల హెచ్చరికలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు అన్నారు. ఆదివారం కరీంనగర్ ప్రెస్భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నాయకుల అవినీతి ఇలాగే సాగితే రానున్న రోజుల్లో ‘అన్నలు’వస్తారని, పది నిమిషాల్లో అందరినీ చంపేసి వెళ్లిపోతారని సంచలన వ్యాఖ్యాలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, మెడికల్ ఉద్యోగాల మాఫియాపై మావోయిస్టులు సీరియస్గా ఉన్నారని, వారు దాడి చేయాలనుకుంటే 10 నిమిషాల్లో పని పూర్తిచేసి బార్డర్ దాటి వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి అంతా సీఎం కేసీఆర్కు తెలిసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ మంత్రి బావ రూ.8కోట్ల ప్రాపర్టీని ఆక్రమించినప్పటికీ అతడిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యేల అరాచకాలు చూస్తే తనకే చంపాలని అనిపిస్తోందని గోనె వ్యాఖ్యానించారు. -
గూడ్స్ రైలుని హైజాక్ చేసిన మావోయిస్టులు
సాక్షి, విశాఖపట్నం: దంతెవాడ–కిరండూల్ సెక్షన్లో వెళ్తోన్న కేవీఎస్ 11 నంబర్ గూడ్స్ రైలుని మావోయిస్టులు ఆదివారం సాయంత్రం 10 నిమిషాల పాటు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. బచెలి–భాన్సీ బ్లాక్ సెక్షన్ 433 కి.మీ సమీపంలో గూడ్స్ వెళ్లే ట్రాక్ పైకి 50 మంది మావోయిస్టులు చేరుకున్నారు. ట్రాక్కి అడ్డంగా నిలబడి రెడ్ క్లాత్ చూపుతూ..ట్రైన్ని నిలిపివేయాలని ఆదేశించారు. అప్రమత్తమైన సిబ్బంది.. ఎమర్జెన్సీ బ్రేక్ వేసి. రైలుని ఆపారు. ట్రైన్లోకి మారణాయుధాలతో మావోయిస్టులు ప్రవేశించి డ్రైవర్, ఇతర సిబ్బంది, వెనుక భాగంలో ఉండే గార్డ్ నుంచి వాకీ టాకీలు తీసుకున్నారు. మిగిలిన కొందరు ట్రాక్పై కాపలా కాయగా..కొంతమంది లోకోమోటివ్కి బ్యానర్ కట్టారు. అనంతరం కొన్ని కరపత్రాల్ని గూడ్స్ రైలు సిబ్బందికి ఇచ్చి దంతెవాడ వరకూ వెళ్లి అక్కడ పంపిణీ చేయాలని ఆదేశించారు. 10 నిమిషాల తర్వాత రైలు దిగి మావోయిస్టులు అడవిలోకి వెళ్లడంతో అక్కడి నుంచి రైలు బయలుదేరి భన్సీకి చేరుకుంది. వాల్తేరు డీఆర్ఎం అనూప్కుమార్ సత్పతి ఆ సెక్షన్ పరిధిలో మిగిలిన రైళ్ల రాకపోకల్ని నిలిపివేయాలని ఆదేశించారు. కోరస్ కమాండో బృందాన్ని ఆయా ప్రాంతాలకు పంపించారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామని వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టి..రైళ్ల రాకపోకల్ని పునరుద్ధరిస్తామని డీఆర్ఎం తెలిపారు. కాగా, సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు 18వ క్రాంతి కారీ వార్షికోత్సవాన్ని దేశమంతా నిర్వహిస్తున్నామని, దాన్ని విజయవంతం చేయాలని కరపత్రాల్లో పేర్కొన్నారు.