Advertisement
Kiran Mazumdar Shaw
-
'అది కోట్ల ఆశల విజయం'.. దిగ్గజ వ్యాపారవేత్తల స్పందన
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా, ఆర్పీజీ గ్రూప్నకు చెందిన హర్ష్ గోయెంకా, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా మంగళవారం ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్ ఆపరేషన్ విజయవంతం కావడంతో స్పందించారు. ఉత్తరాఖండ్లో 17 రోజుల తర్వాత 41 మంది కార్మికులను సురక్షితంగా రక్షించడంతో ఆపరేషన్ పూర్తయింది. నవంబర్ 12న సిల్క్యారా టన్నెల్ కూలిపోవడంతో కార్మికులు 17 రోజుల పాటు అందులోనే చిక్కుకుపోయారు. దాంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. చివరకు మంగళవారం అందరినీ విజయవంతంగా బయటకుతీశారు. దాంతో దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు రెస్క్యూ సిబ్బంది, కార్మికులకు అభినందనలు తెలిపారు. రెస్క్యూ వర్కర్లకు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తన ఎక్స్ ఖాతా ద్వారా సెల్యూట్ చేశారు. ఈ పోరాటంలో కోట్లాది మంది దేశప్రజల ఆశ ఫలించిందని ఆయన అన్నారు. 17 రోజుల పాటు ధైర్యం కోల్పోకుండా తిరిగి వచ్చిన 41 మంది కార్మికుల ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో సహా ఈ రెస్క్యూ మిషన్లో భాగంమైన అందరికీ అభినందనలు చెప్పారు. దేశ ప్రగతికి బాటలు వేసే ఈ కార్మిక సోదరులందరికీ మెరుగైన ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. जीवन और मृत्यु के मैराथन संघर्ष के बीच यह करोड़ों देशवासियों के ‘उम्मीद’ की जीत है। 17 दिन तक एक सुरंग से बिना हिम्मत हारे वापिस लौटने वाले सभी 41 श्रमिकों के आत्मबल को मेरा प्रणाम। NDRF और SDRF की टीमों समेत इस रेस्क्यू मिशन को सफल बनाने वाले हर एक सदस्य को साधुवाद। हम देश की… — Gautam Adani (@gautam_adani) November 28, 2023 మహీంద్రా గ్రూప్ ఛైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా ఈ సంఘటనపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన తన ఎక్స్ ఖాతాలో ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ విజయవంతం కావడంలో 'రాథోల్ మైనర్ల' పాత్రను ప్రశంసించారు. అధునాతన డ్రిల్లింగ్ పరికరాల తర్వాత, వీరు కీలకంగా మారి చివరి నిమిషంలో కార్మికులను కాపాడారని కొనియాడారు. ఆస్ట్రేలియాకు చెందిన భూగర్భ నిపుణుడు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ రెస్క్యూ పరిస్థితిని వివరించినందుకు అభినందనలు తెలిపారు. And after all the sophisticated drilling equipment, it’s the humble ‘rathole miners’ who make the vital breakthrough! It’s a heartwarming reminder that at the end of the day, heroism is most often a case of individual effort & sacrifice. 🙏🏽👏🏽👏🏽👏🏽🇮🇳 #UttarakhandTunnelRescue pic.twitter.com/qPBmqc2EiL — anand mahindra (@anandmahindra) November 28, 2023 ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్పర్సన్ హర్ష్ గోయెంకా కూడా 41 మంది ప్రాణాలను కాపాడటంలో శ్రమించినందుకు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన వరల్డ్కప్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో మ్యాక్స్వెల్ ఇండియాకు వ్యతిరేకంగా రన్నులు కొట్టారన్నారు. కానీ అదే దేశానికి చెందిన డిక్స్ మాత్రం ఇండియాలోని 41 మంది కార్మికులను కాపాడేందుకు శ్రమించారని తెలిపారు. #Maxwell digs a hole against India #INDvsAUS But hey, an Aussie led a different kind of dig saving 41 lives! 💪 My gratitude to NDRF , SDRF, Army, our rat miners and all those involved in this incredible rescue mission. 🇮🇳🇮🇳 #UttarakhandTunnelRescue — Harsh Goenka (@hvgoenka) November 28, 2023 బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా రెస్క్యూ వర్కర్లను ప్రశంసించారు. కార్మికులందరూ సురక్షితంగా బయటపడ్డానికి వీరోచితంగా పోరాడిని సిబ్బందిని చూసి దేశం గర్విస్తోందన్నారు. Uttarkashi Tunnel Rescue Operation Live Updates: All Workers Rescued Safely - Heroic and outstanding sense of duty displayed by rescuers. Enduring resilience displayed by those rescued. Makes our nation proud🙏🙏👏👏👏 https://t.co/q2vqmUTRsG — Kiran Mazumdar-Shaw (@kiranshaw) November 28, 2023 -
కన్నడ నాట తిరుగులేని విజయం: ప్రముఖ మహిళా వ్యాపారవేత్త ట్వీట్ వైరల్
సాక్షి,న్యూఢిల్లీ: కన్నడ నాట కాంగ్రెస్ సాధించిన ఘన విజయంపై ప్రముఖ వ్యాపారవేత్త, బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా కీలకవ్యాఖ్యలు చేశారు. లాస్ ఎంజెల్స్లో ఉన్న తాను కాంగ్రెస్ అఖండ విజయం గురించి విన్నానంటూ ట్వీట్ చేశారు. ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకొనేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక శ్రేయస్సు,సామాజిక సామరస్యం లాంటివే కొలమానాలని పేర్కొన్నారు. Just woke up to the news in Los Angeles that @INCIndia got a resounding mandate from the people of Karnataka. Infrastructure development, economic prosperity & social harmony are the metrics that people will measure to elect its representatives. — Kiran Mazumdar-Shaw (@kiranshaw) May 13, 2023 మరోవైపు కాంగ్రెస్ పార్టీ పట్ల తిరుగులేని మద్దతు, విశ్వాసం ప్రకటించిన ప్రజలకు డీకే శివకుమార్ ప్రత్యక కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం ప్రజలందరికీ అంకితం చేస్తున్నానని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు, హామీలను వెంటనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. Immensely grateful to our people in Karnataka for their unwavering support and faith in Congress Party. I dedicate this victory to all of you and I promise that we shall implement our guarantees immediately to safeguard the future of our beloved Karnataka. Once again, thank… pic.twitter.com/6ZVfvwyLFw — DK Shivakumar (@DKShivakumar) May 13, 2023 కాగా అధికార బీజేపీకి భారీ షాకిస్తూ శనివారం వెలువడిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.సంపూర్ణ మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కన్నడిగులందించిన స్పష్టమైన మెజార్టీని ప్రశంసిస్తూ పలువురు రాజకీయపార్టీల నేతలు ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
సుందరానికి అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: బోర్డులో స్వతంత్ర డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న కిరణ్ మజుందార్ షా పదవీ విరమణ చేయనున్నట్లు ఐటీ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా పేర్కొంది. ఈ నెల 22న పదవీ కాలం ముగిసినట్లు వెల్లడించింది. అయితే నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ సిఫారసుమేరకు ఈ 23 నుంచి డి.సుందరంను లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఎంపిక చేసినట్లు పేర్కొంది. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఇన్ఫోసిస్ బోర్డులో 2014 నుంచి స్వతంత్ర డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. 2018 నుంచి లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అంతేకాకుండా నామినేషన్, రెమ్యునరేషన్ కమిటీ, సీఎస్ఆర్ కమిటీలకు చైర్పర్శన్గా వ్యవహరించారు. బోర్డుకు చెందిన రిస్క్ మేనేజ్మెంట్, ఈఎస్జీ కమిటీలలో సభ్యులుగా ఉన్నారు. ఇన్ఫోసిస్ కుటుంబంలో సభ్యులైన కిరణ్ కొన్నేళ్లుగా విలువైన నాయకత్వం, మార్గదర్శకత్వం వహించారని, ఇందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కంపెనీ చైర్మన్ నందన్ నిలేకని పేర్కొన్నారు. ఇదేవిధంగా లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఎంపికైన సుందరంకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2017 నుంచి సుందరం ఇన్ఫోసిస్ బోర్డులో కొనసాగుతున్నారు. ఫైనాన్స్, వ్యూహ రచనలో అత్యంత సమర్ధుడైన సుందరం కంపెనీ భవిష్యత్ లక్ష్యాలను నిజం చేయడంలో కీలకంగా నిలవగలరని అభిప్రాయపడ్డారు. ఆయన ఆడిట్, రిస్క్ మేనేజ్మెంట్, వాటాదారుల రిలేషన్షిప్, నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ తదితర పలు కమిటీలలో సేవలందించనున్నారు. -
నైకా ఫల్గుణి సంచలనం: తగ్గేదేలే అంటున్న బిజినెస్ విమెన్
సాక్షి, ముంబై: ఫోర్బ్స్ 2022 భారతదేశపు 100 మంది సంపన్నుల జాబితాలో ఈ ఏడాది అనేక మంది కొత్త బిలియనీర్లు చోటు సంపాదించడం విశేషం. రూపాయి విలువ క్షీణత, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం ఆందోళనలున్నప్పటికీ దేశం లోని టాప్-100 కుబేరుల సంపద అసాధారణంగా పెరిగిందని ఫోర్బ్స్ డేటా ద్వారా తెలుస్తోంది. ఫల్గుణి నాయర్: ముఖ్యంగా ఇటీవల ఐపీవోతోపాటు పలు సంచనాలకు మారు పేరు నైకా ఫౌండర్ ఫల్గుణి నాయర్ టాప్-50లో చోటు సంపాదించు కున్నారు. రూ. 32,951.71 కోట్లతో దేశంలోని అత్యంత ధనవంతుల స్వీయ-నిర్మిత బిలియనీర్గా ప్రశంస లందుకున్నారు. ఫోర్బ్స్ డేటా ప్రకారం 4.8 బిలియన్ల డాలర్ల నికర విలువతో ఫల్గుణి నాయర్ జాబితాలో 44వ స్థానంలో నిలిచారు. ఐఐఎం అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్ నాయర్ 2012లో "మల్టీ-బ్రాండ్ ఓమ్నిచానెల్ బ్యూటీ-ఫోకస్డ్ రిటైల్ వ్యాపారాన్ని నిర్మించాలనే లక్క్ష్యంతో నైకాను స్థాపించారు. సావిత్రి జిందాల్: ఫోర్బ్స్ ప్రకారం ఓపీ జిందాల్ గ్రూప్ చైర్పర్సన్, సావిత్రి జిందాల్ టాప్-10లో ఉన్న ఏకైక మహిళా బిలియనీర్. 17.4 బిలియన్ డాలర్ల నికర విలువతో 72 ఏళ్ల సావిత్రి జిందాల్ ఈ సంవత్సరం జాబితాలో మొదటి పది మంది ధనవంతుల జాబితాలో ఉన్నారు. ఆమె భర్త ఓం ప్రకాష్ జిందాల్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత, గ్రూప్ బాధ్యతలను చేపట్టారు. ఈ దంపతుల నలుగురు కుమారుల స్వతంత్రంగా కంపెనీలను నిర్వహిస్తున్నారు. రేఖా ఝున్ఝున్వాలా: దివంగత పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్ఝున్వాలా భార్య రేఖాఈ లిస్ట్లో 30వ స్థానంలో నిలిచి తన భర్తన స్థానాన్ని భర్తీ చేశారు. ఆమె నికర సంపద 5.9 బిలియన్ డాలర్లు. (ఫోర్బ్స్ టాప్ -10 లిస్ట్: బిలియనీర్లు అదానీ, అంబానీ ఎక్కడ?) నెహాల్ వకీల్: ఏసియన్ పెయింట్స్కు చెందిన నెహాల్ వకీల్ 0.52 బిలియన్ డాలర్లతో 46వ స్థానంలో నిలిచారు. తొలిసారి 2022 ఫోర్బ్స్ జాబితాలో ఎంట్రీ ఇచ్చారు. 1942లో స్థాపించిన ఏషియన్ పెయింట్స్ కంపెనీని నడుపుతున్న కుటుంబంలోని థర్డ్ జెనరేషన్ ప్రతినిధి నెహాల్. అంతేకాదు బోర్డులో ఉన్న ముఖ్య కుటుంబ సభ్యులలో నేహా ఒకరు. కిరణ్ మజుందార్-షా: బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్-షా 2.7 బిలియన్ డాలర్ల నికర సంపదతో భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో 76వ స్థానంలో నిలిచారు. 1978లో ఆదాయం ద్వారా భారతదేశంలో అతిపెద్ద లిస్టెడ్ బయోఫార్మాస్యూటికల్ సంస్థగా బయోకాన్ అవతరించింది. లీనా తివారీ: 3.7 బిలియన్ డాలర్ల నికర విలువతో, లీనా తివారీ ఈ సంవత్సరం అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో 51వ ప్లేస్లో నిలిచారు. ఫార్మాస్యూటికల్ దిగ్గజం యూఎస్వీ ఇండియా ఛైర్పర్సన్గా, తివారీ 2018లో జర్మన్ జెనరిక్స్ సంస్థ జూటా ఫార్మాను కొనుగోలు చేశారు. అను అగా: 80 ఏళ్ల అను అగా తిరిగి మళ్లీ రిచెస్ట్ ఇండియన్స్ జాబితాలో చోటు సంపాదించారు. 1.9 బిలియన్ డాలర్ల నికర సంపదతో 88వ స్థానంలో నిలిచారు. థర్మాక్స్ అనే లిస్టెడ్ ఇంజనీరింగ్ సంస్థలో అగా మెజారిటీ వాటాను కలిగి ఉంది. అగా 1985లో తన జీవిత భాగస్వామి కంపెనీలో పని చేయడం ప్రారంభించారు. సుదీర్ఘం అనారోగ్యంతో భర్త మరణించడంతో 1996లో ఆమె కంపెనీ బాధ్యతలు చేపట్టారు. తరువాత కెమికల్ ఇంజనీర్ అయి అను కుమార్తె మెహెర్ బాధ్యతలు చేపట్టడంతో 2004లో అగా ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేసి సామాజిక కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. అలాగే ఇండియన్ ఎత్నిక్ వేర్ తయారీదారు, మన్యవార్ బ్రాండ్కు ప్రసిద్ధి చెందిన వేదాంత్ ఫ్యాషన్స్ ఓనర్ రవి మోడీ 3.6 బిలియన్ డాలర్లతో ఫోర్బ్స్ లో చోటు సాధించారు. ఇంకా యూఎన్వో మిండా (గతంలో మిండా ఇండస్ట్రీస్) సీఎండీ నిర్మల్ మిండా మెట్రో బ్రాండ్లకు చెందిన రఫీక్ మాలిక్ జాబితాలో కొత్తగా ప్రవేశించిన వారిలో ఉన్నారు. -
పదే పదే కింద పడినా.. ఎలా పైకి లేచాడో చూడండి!
మనిషి జీవితం.. ఎగుడు దిగుడుల కలబోత. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చాలా సహజం. తన జీవన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుకుడుకులను మనుషులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. లక్ష్యసాధనలో అవాంతరాలు, ఆటుపోట్లు ఉంటూనే ఉంటాయి. వాటన్నింటిని ఓర్పుతో అధిగమించిన వారికే విజయాలు సొంతమవుతాయని చరిత్ర చెబుతున్న సత్యం. పదేపదే ఓటమి ఎదురైనా లెక్కచేయకుండా ముందుకు సాగేవారు విజయులుగా కీర్తిశిఖరాలు అధిరోహిస్తారు. ఇలాంటి ఓ స్ఫూర్తిదాయక వీడియోను బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తన ట్విటర్లో పేజీలో షేర్ చేశారు. గెలుపుదారిలో పడుతు లేస్తూ.. ఓ కళాకారుడు జీవిత సత్యాన్ని కళ్లకుకట్టిన తీరు వీక్షకలను ఆకట్టకుంటోంది. ఎన్నిసార్లు కిందకు పడినా గెలుపు శిఖరాన్ని అందుకునే వరకు విశ్రమించరాదన్న ఇతివృత్తంతో దీన్ని ప్రదర్శించారు. ‘గెలుపు కోసం ప్రయాణం అంత తేలికైన విషయం కాదు. కిందకు పడిపోయిన ప్రతిసారి మరింత పట్టుదలతో ప్రయత్నించాలన్న సందేశంతో దీన్ని ప్రదర్శించిన ఈ కళాకారుడికి హాట్సాఫ్’ అని కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. The Stairs to Success best depicted here. It is not an easy journey - filled with repeated slips and falls, but perserverence to rise each time you fall. Hats of to this Artist who demonstrates this in a seemingly effortless manner. pic.twitter.com/D0PKUMXvYw — Kiran Mazumdar-Shaw (@kiranshaw) October 28, 2022 కాగా, కిరణ్ మజుందార్ షా భర్త జాన్ షా (73) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దీపావళి రోజున తుదిశ్వాస విడిచారు. కాన్సర్తో బాధపడుతూ ఆమె తల్లి యామిని మజుందార్ షా కూడా ఈ ఏడాది జూన్లో కన్నుమూశారు. తల్లిని కోల్పోయిన బాధ నుంచి కోలుకుంటున్న సమయంలో మరో విషాదం ఎదురవడంతో ఆమె తల్లడిల్లుతున్నారు. జీవితంలో ఆటుపోట్లను సమానంతో ఎదుర్కొవాలని తనకు తానే ధైర్యం చెప్పుకుంటున్నారు కిరణ్ మజుందార్ షా. (క్లిక్ చేయండి: శాంసంగ్కు వారసుడొచ్చాడు.. కొత్త సవాళ్లు) -
కుప్పకూలిపోయాను..డియర్.. RIP: కిరణ్ మజుందార్ షా భావోద్వేగం
బెంగళూరు: బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా తన జీవితంలో చోటు చేసుకున్న విషాదంపై భావోద్వానికి లోనయ్యారు. దీపావళి పర్వదినం రోజు తనను శాశ్వతంగా విడిచివెళ్లిన భర్త జాన్ షా ను గుర్తు చేసుకుంటూ ట్విటర్ పోస్ట్ ద్వారా కన్నీటి నివాళి అర్పించారు. ‘‘కుంగిపోయాను.. నా భర్త, సోల్ మేట్, గురువును కోల్పోయాను. నా లక్క్ష్య సాధనలో జాన్ ఎప్పుడూ చాలా అండగా నిలిచారు. ఎంతో మార్గనిర్దేశనం చేశారు. నా జీవితాన్ని ఇంత స్పెషల్గా ఉంచి నందుకు ధన్యవాదాలు. రెస్ట్ ఇన్ పీస్ మై డియర్ జాన్...మీరు లేని లోటు పూడ్చలేనిది’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. కేన్సర్తో బాధపడుతున్న జాన్ షా (73)బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. దీంతో పలువురు వ్యాపార, రాజకీయ పెద్దలు ఆమెకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాన్సర్తో బాధపడుతూ కిరణ్ మజుందార్ షా తల్లి యామిని మజుందార్ షా ఈ ఏడాది జూన్లో కన్నుమూశారు. ఇపుడు భర్తను కోల్పోవడంతో కిరణ్ విషాదంలో మునిగిపోయారు. కాగా స్కాటిష్ జాతీయుడైన జాన్షా 1998లో కిరణ్ మజుందార్ షాను వివాహం చేసుకున్నారు. తరువాత వివిధ బయోకాన్ గ్రూప్ కంపెనీల సలహా బోర్డు సభ్యుడు సేవలందించారు. 1978లో కిరణ్ మజుందార్ షా బయోకాన్ కంపెనీని స్థాపించగా 1999 నుంచి జాన్ షా బయోకాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకరిగా వివిధ హోదాల్లో పనిచేశారు. విదేశీ ప్రమోటర్గా వ్యవహరిస్తూనే బయోకాన్ గ్రూప్ కంపెనీలకు అడ్వైజరీ బోర్డ్ మెంబర్గానూ సేవలు అందించారు. 1999లో బయోకాన్లో చేరడానికి ముందు వస్త్ర తయారీదారు మధుర కోట్స్కు నాయకత్వం వహించారు జాన్ షా. జూలై 2021లో పదవీ విరమణకు ముందు బయోకాన్ వైస్ ఛైర్మన్ ,నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా 22 సంవత్సరాలు కంపెనీకి విశిష్ట సేవలు అందించారు. I am devastated to lose my husband, my mentor and soul mate. I will always be spiritually guided by John as I pursue my purpose. Rest in Peace my darling John. Thank you for making my life so very special. I will miss you profoundly pic.twitter.com/b0qv6ZGI2D — Kiran Mazumdar-Shaw (@kiranshaw) October 25, 2022 -
ప్రపంచ శక్తిగా భారత్ ఎదగాలంటే...
కేంద్ర ప్రభుత్వం తన విజన్ ఇండియా 2047 లక్ష్యసాధన కోసం పరిశోధన, సృజనాత్మకత, టెక్నాలజీలను ప్రధాన చోదక శక్తులుగా గుర్తించింది. ఈ లెక్కన 2047 నాటికి భారత్ ఒక విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. స్థానికంగా ఆలోచిస్తూ, విస్తారంగా ప్రపంచ ప్రభావం కలిగించే స్టార్టప్, వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తుంది. ఆరోగ్య సంరక్షణ రంగాన్ని డిజిటల్ పరివర్తనవైపు తీసుకెళ్లే క్షేత్రస్థాయి కార్యాచరణకు ఇప్పటికే పునాది పడింది. 2025 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తిలో 2.5 శాతాన్ని ఆరోగ్య సంరక్షణ రంగంపై వెచ్చించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నాణ్యమైన సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను నిజంగా అందించడానికి 2047 సంవత్సారానికి దాన్ని 5 శాతం పెంచేందుకు తప్పకుండా సన్నద్ధం కావాలి. ► స్వాతంత్య్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మనదేశం గ్లోబల్ ఇన్నో వేషన్ లీడర్ కావాలనేది నా విజన్. ఆరోగ్యరంగం, విద్య, నిలకడైన జీవితాన్ని సమానంగా అందుకుంటూ ఒక సురక్షిత వాతావరణంలో ప్రతి ఒక్కరూ సౌభాగ్యానికి నోచుకునే సమ్మిశ్రితమైన ఆర్థిక వృద్ధిపై దేశం అప్పటికి దృష్టి పెట్టివుంటుంది. మౌలిక భావనలపై మదుపు చేయడం ద్వారా, వ్యవస్థాపకతను ఆర్థిక వృద్ధి నమూనాగా చేయడం ద్వారా భారతదేశం తన పౌరులందరికీ ఉన్నత జీవితానికి హామీ ఇస్తుంది. టెక్నాలజీతో కూడిన పరిశోధన, సృజనాత్మకతలు పెను గంతుతో కూడిన ఆర్థిక వృద్ధికి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. దీనివల్ల 2047 నాటికి భారత్ ప్రపంచంలోని మూడు పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలబడటమే కాదు, అభివృద్ధి చెందిన దేశపు హోదాకు దగ్గరవుతుంది. ► కేంద్ర ప్రభుత్వం తన ‘విజన్ ఇండియా 2047’ లక్ష్యసాధన కోసం పరిశోధన, సృజనాత్మకత, టెక్నాలజీలను ప్రధాన చోదక శక్తు లుగా గుర్తించింది. ఈ రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతోంది. ఈ లెక్కన 2047 నాటికి భారత్ ఒక విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మారు తుంది. స్థానికంగా ఆలోచిస్తూ, విస్తారంగా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం కలిగించే స్టార్టప్, వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తుంది. చిన్న, మధ్య స్థాయి కంపెనీల నుంచి భారీ పారిశ్రామిక కార్య కలాపాలవైపు ఎదిగేలా ‘టెక్నోప్రెన్యూర్ల’ను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ మార్కెట్లకు భారత సృజనాత్మక భావనలను తీసుకుపోయే అవకాశా లను సృష్టించగలుగుతుంది. 2047 నాటికి గ్లోబల్ ఇన్నో వేషన్ ఇండెక్స్లో టాప్ 20 దేశాల్లో భారత్ను ఒకటిగా నిలబట్టే లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. ► సరసమైన ధరలకు లభించే ఇంటర్నెట్తో కూడిన డిజిటల్, డేటా మద్దతు కలిగిన సృజనాత్మక ఆలోచనలు భవిష్యత్తులో వేగంగా ఎదిగే డిజటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో తోడ్పడతాయి. భారత్ దేశా నికి ఉన్న శాస్త్రీయ ప్రతిభ ద్వారా ఆరోగ్యరంగంలో ఉత్పాదకతను, నాణ్యతను ప్రోత్సహించగలదు. ఆ విధంగా సరసమైన ధరలకు ఆరోగ్య సేవలను అందించడం, ముందస్తు వ్యాధి నివారక విధానా లను అమలు చేయడం సాధ్యపడటమే కాకుండా, సమగ్ర ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థకు నిజమైన విలువను తీసుకొస్తుంది. అందరికీ అందుబాటులో ఉండే, వ్యవస్థీకృతంగా, జవాబుదారీ తనంతో ఉండే, సరసమైన ధరలతో, స్వావలంబనతో కూడిన జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించడంలో ఇది తోడ్పడుతుంది. ► భారత్లో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని డిజిటల్ పరివర్తనవైపు తీసుకెళ్లే క్షేత్రస్థాయి కార్యాచరణకు ఇప్పటికే పునాది పడింది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి క్రమబద్ధీకరణలను మరింత సరళం చేస్తూ కేంద్రప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను మనం అభినందించాలి. అదే సమయంలో, మహమ్మారి వినియోగదారుల ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చింది. డాక్టర్లను ‘టెక్ సావీ’లుగా మార్చడమే కాదు, యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ సొల్యూషన్లపై ఆరోగ్య సంరక్షణ రంగం మరిన్ని పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించింది. ఈ పరిణామాలన్నీ తక్కువ వ్యయంతో కూడిన, టెక్నాలజీ ఆధారిత సృజనాత్మక ఆవిష్కరణలను సరసమైన ధరలకు అందించే ఒక ఫలప్రదమైన వాతావరణాన్ని కల్పించాయి. ► ఆరోగ్య సంరక్షణ రంగంలో డిజిటల్ చొరబాటుకు సంబంధిం చిన పూర్తి ప్రయోజనాలను అందించేందుకు భారత్ విధానాల రూప కల్పననూ, నిధులనూ ఒక సమన్వయంతో అమలు చేయవలసిన అవసరం ఉంది. 2025 నాటికి దేశ స్థూల జాతీయోత్పత్తిలో 2.5 శాతాన్ని ఆరోగ్య సంరక్షణ రంగంపై వెచ్చించేలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రామాణీకరించబడిన, నాణ్యమైన సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను నిజంగా అందించడానికి 2047 సంవత్సానికి మన జీడీపీలో ఆరోగ్య సంరక్షణ వ్యయాన్ని 5 శాతం పెంచేందుకు భారత్ తప్పకుండా సన్నద్ధం కావాలి. ► భారత ఔషధ పరిశ్రమ ఇప్పటికే ‘ప్రపంచ ఫార్మసీ’గా వెలు గొందుతోంది. ఔషధోత్పత్తి పరిమాణం రీత్యా భారత్ ప్రపంచంలోనే మూడో ర్యాంకులో నిలబడుతోంది. రాగల 25 సంవత్సరాల్లో ఫార్మా స్యూటికల్ వాల్యూ చెయిన్లో మరింత వాటాను సంగ్రహించగల గాలి. దీనికోసం, వినూత్నమైన బయోలాజిక్స్, బయోసిమిలర్స్, సెల్, జీన్ థెరపీలు, హై ఎండ్ కాంట్రాక్ట్ రీసెర్చ్ , తయారీ సేవల్లో ఆవిర్భవిస్తున్న అవకాశాలపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంది. అలాగే ‘ఎంఆర్ఎన్ఏ’తో పాటు ఇతర నూతన తరం టీకాలు, ‘ఆర్ఫన్ డ్రగ్స్’, విలువైన మందులు, మోలిక్యులార్ డయాగ్నసిస్ వంటి అంశాలపై కూడా మనం దృష్టి సారించాల్సి ఉంది. సరైన విధానాలతో భారత ఔషధ పరిశ్రమ ప్రస్తుతం ఉన్న 50 బిలియన్ డాలర్లనుంచి 2047 నాటికి 500 బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఎదిగి, ప్రపంచంలోని టాప్ అయిదు దేశాల సరసన నిలబడుతుంది. ఇక ఔషధోత్పత్తి పరిమాణం రీత్యా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటాం. ► ఫార్మా రంగంలో 500 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని సాధించే రోడ్ మ్యాప్లో అధునాతన పరిశోధన, సృజనాత్మకతలను స్వీక రించడం, గ్లోబల్ స్థాయి ఆపరేషన్లను నిర్వహించడం, నాణ్యమైన క్రమబద్ధీకరణ వ్యవస్థను రూపొందించడం ఉంటాయి. పరిశోధనతో సంబంధ ప్రోత్సాహకాలు ఫార్మారంగంలో పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులను పెంచుతాయి. అలాగే మరింత మెరుగైన పరిశ్రమ– అకెడమిక్ భాగస్వామ్యాలను పెంచుతాయి. ► 2047 నాటికి అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా మారడానికి, భారత దేశం తన మహిళా శక్తికి సాధికారత కల్పించాలి. ఒక దేశంగా ఆర్థిక ప్రధాన స్రవంతిలో మహిళలకు అవకాశాలను కల్పించడమే కాకుండా, ఉత్పాదక కృషిలో స్వేచ్ఛగా పనిచేసే వీలు కల్పించాలి. వేతనం లేని శ్రమ శృంఖలాల నుంచి వారిని విముక్తి చేయాల్సి ఉంది. ► భారతదేశ నియత కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 24 శాతంగా మాత్రమే ఉంటోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే ఇది అత్యంత తక్కువ శాతంగానే చెప్పాలి. అనియత రంగంలో పనిచేస్తున్న భారత మహిళల్లో చాలా మందికి సామాజిక రక్షణ తక్కువ. పైగా వేతనాలు కూడా తక్కువగా ఉంటు న్నాయి. మహిళలను నియత ఆర్థిక వ్యవస్థలోకి పురుషుల భాగ స్వామ్యంతో సమానంగా తీసుకురాగలిగితే, 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ మరో 60 శాతం వృద్ధి చెందగలదని అంచనా. అంటే ఆర్థిక వ్యవస్థకు 2.9 ట్రిలియన్ డాలర్ల ఆదాయం జమవుతుంది. రెండంకెల వృద్ధిని సాధించాలంటే, మన ‘టాలెంట్ పూల్’లో సగ భాగంగా ఉన్న మహిళల శక్తిని విస్మరించలేము. విద్య, ఆరోగ్యం, ఆర్థిక భద్రత, ప్రాథమిక హక్కుల వంటి అంశాల్లో మహిళా కేంద్రక కార్యక్రమాలను చేపట్టాలి. 2047 నాటికి నియత రంగంలో 50 శాతం మహిళా భాగస్వామ్యాన్ని తప్పక పెంచాల్సి ఉంటుంది. ► 2047 నాటికి, పునరుద్ధరణీయ శక్తివనరులపై దృష్టి పెట్టాలి. వ్యర్థాలను, ఉద్గారాలను తగ్గిస్తూ, వినిమయ సంస్కృతిని తగ్గించాలి. రీసైకిలింగ్, రీయూజ్ వంటి విధానాలను ప్రవేశ పెట్టాలి. దీనికోసం, భారత్ తన వృద్ధి నమూనాల్లో సంపూర్ణంగా సమగ్ర పర్యావరణ స్వావలంబనను చొప్పించాల్సిన అవసరం ఉంది. ఒక దేశంగా మన విద్యుత్ అవసరాల్లో 80 శాతాన్ని 2047 నాటికి పునర్వినియోగ శక్తి వనరుల ద్వారా తీర్చుకోవడం మన లక్ష్యం కావాలి. పారదర్శకమైన, సమర్థవంతమైన, ఆర్థికంగా సమ్మిశ్రిత రూపంలో ఉండే డిజిటల్ సాధికారిక సమాజాన్ని, విజ్ఞాన ఆర్థిక వ్యవస్థను రూపొందించడం ద్వారా నూరవ స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించగలదు. అలాగే నిజమైన గ్లోబల్ శక్తిగా కూడా నిలబడగలదు. కిరణ్ మజుందార్ షా, వ్యాసకర్త ప్రముఖ పారిశ్రామిక వేత్త (‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’ సౌజన్యంతో) -
ఎన్ఎస్ఈ ’యోగి’ వివాదంపై ట్విట్టర్ వార్..
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణని గుర్తుతెలియని హిమాలయా యోగి ప్రభావితం చేసిన అంశం.. సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపింది. పరిశ్రమ దిగ్గజాల మధ్య వాగ్యుద్ధానికి మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ వేదికగా మారింది. ఎన్ఎస్ఈ బోర్డు మాజీ సభ్యుడు టీవీ మోహన్దాస్ పాయ్, ఫార్మా దిగ్గజం బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్–షా మధ్య ట్వీట్ల యుద్ధం నడించింది. ఎన్ఎస్ఈలో అవకతవకలకు సంబంధించి, యోగి ప్రభావంతో చిత్రా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారంటూ సెబీ ఇచ్చిన ఆదేశాల వార్తాకథనాన్ని ట్విట్టర్లో కిరణ్ ప్రస్తావించారు. దాని లింక్ను షేర్ చేసిన మజుందార్–షా, నియంత్రణ సంస్థను ప్రస్తావిస్తూ ‘భారత్లో టాప్ స్టాక్ ఎక్సే్చంజీని ఒక యోగి తోలుబొమ్మలాట ఆడించారు. ప్రపంచ స్థాయి స్టాక్ ఎక్సే్చంజీగా చెప్పుకునే ఎన్ఎస్ఈలో గవర్నెన్స్ లోపాలు షాక్కు గురిచేస్తున్నాయి. అసలు తనిఖీలు, పర్యవేక్షణే లేకుండా పోయిందా‘ అని ఫిబ్రవరి 13న వ్యాఖ్యానించారు. పాయ్ కౌంటర్..: అయితే, ఎక్సే్చంజీని ఏ యోగీ నడిపించలేదని, దుష్ప్రచారాలు చేయొద్దని 14న పాయ్ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘ఎన్ఎస్ఈని ఏ యోగీ నడిపించలేదు! దయచేసి ఇలాంటి దుష్ప్రచారాన్ని ఆపండి! ఎంతో అధునాతనమైన టెక్నాలజీతో పని చేసే స్టాక్ ఎక్సే్చంజీలో ఇలా జరిగిందని మీరు నిజంగానే నమ్ముతున్నారా? ఎక్సే్చంజీ కోసం ఇరవై నాలుగు గంటలూ పనిచేసే అద్భుతమైన ఉద్యోగులను మీరు అవమానిస్తున్నారు‘ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, మరుసటి రోజున పాయ్ వ్యాఖ్యలపై మజుందార్–షా మళ్లీ స్పందించారు. -
రజినీకాంత్కు అరుదైన గౌరవం.. పక్కా ఫేక్!
వెండితెరపై తన స్టైలిష్ ఆటిట్యూడ్తో సౌత్లోనే కాదు యావత్ ప్రపంచంలో క్రేజ్ సంపాదించుకున్నారు సూపర్స్టార్ రజినీకాంత్. అలాంటి వ్యక్తికి ఓ అరుదైన గౌరవం దక్కింది. రజినీకాంత్ పేరు మీద మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి నెట్లో వైరల్ కాగా, అశేష అభిమానగణం మురిసిపోయింది. అయితే.. ఈ వ్యవహారం ఉత్త పాత ముచ్చటేనని కాసేపటికే ఫ్యాక్ట్ చెక్లో వెల్లడైంది. సోషల్ మీడియాలో ఎక్కడో వైరల్ అవుతున్న ఒక ఫొటోను.. ప్రముఖ ఎంట్రెప్రెన్యూర్ కిరణ్ మజుందర్ షా ఆగష్టు 1న తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. రజినీకాంత్ మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ కామర్స్(అన్నీ స్పెల్లింగ్ మిస్టేక్సే) అండ్ ఆర్ట్స్ పేరిట ఈ కాలేజ్ బోర్డు ఉంది. దీంతో ఆమె సూపర్ స్టార్కు అరుదైన గౌరవం దక్కిందంటూ హర్షం వ్యక్తం చేసింది. అయితే కాసేపటికే అందులో ఉన్న పొరపాట్లను ఆమె గమనించి ట్వీట్ను డిలీజ్ చేసింది. అప్పటికే అది నిజమనుకుని చాలామంది ఆ ఫొటోను షేర్ చేశారు. ఇంకొంత మంది సెటైర్లు వేశారు. దీంతో తలైవా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఫ్యాక్ట్ చెక్.. నిజానికి అది సెటైరిక్గా రూపొందించిన ఒక మీమ్. పైగా ఎప్పుడో పదేళ్ల క్రితం పుట్టుకొచ్చింది. చాలా సార్లు వైరల్ అయ్యింది కూడా. ఇప్పుడు రజినీపై రెగ్యులర్గా వచ్చే మీమ్స్లో భాగంగా వచ్చిందా? లేదంటే యాంటీ ఫ్యాన్ కావాలని ఇప్పుడు పనిగట్టుకుని చేసిన పనేనా? అనేది తెలియాల్సి ఉంది. ఇంకోవైపు తలైవా ఫ్యాన్స్ ఎవరూ ఆ ఫొటోను షేర్ చేయొద్దని రజినీ ఫ్యాన్స్ అసోషియేషన్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేస్తోంది. ఇక ఆ ఒరిజినల్ ఫొటో మాత్రం.. భువనేశ్వర్లోని క్సేవియర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ భువనేశ్వర్ యూనివర్సిటీది. -
కోవిడ్ ముప్పు: అత్యవసర చర్యలపై లాన్సెట్ కీలక హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: ఇపుడిపుడే కరోనా సెకండ్వేవ్నుంచి కోలుకుంటున్న దేశ ప్రజలను థర్డ్వేవ్ పొంచి ఉందన్న అంచనాలు వణికిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ భారత ప్రభుత్వానికి కీలక హెచ్చరికలు చేసింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని లాన్సెట్ మెడికల్ జర్నల్ హెచ్చరించింది. రానున్న కోవిడ్-19 ముప్పుపై అత్యవసర చర్యలు చేపట్టాల్సిందిగా హెచ్చరికలు జారీ చేసింది.ఆరోగ్య సేవలు, కీలక ఔషధాలపై పాదర్శకత, జాతీయంగా ఒకే ధరల విధానం ఉండాలని లాన్సెట్లో 21 మంది నిపుణులు సూచించారు. కరోనావైరస్ ఉధృతి తగ్గుతున్న తరుణంలో అన్ని రాష్ట్రాలు అన్లాక్ ప్రక్రియ షురూ అయిన తరుణంలో ది లాన్సెట్ వెబ్సైట్ 8 రకాల సూచనలను చేసింది. బయోకాన్ కిరణ్ మజుందార్ షా, టాప్ సర్జన్ డాక్టర్ దేవి శెట్టితో కూడిన 21 మంది ఈ చర్యలను సిఫారసు చేశారు. లాన్సెట్ సూచనలు 1. అవసరమైన ఆరోగ్య సేవలను వికేంద్రీకరించబడాలి. కేసుల సంఖ్య, అందుతున్న సేవలు జిల్లా నుండి జిల్లాకు చాలా తేడాలున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో ఒకే విధానం ఆమోద యోగ్యం కాదు. 2. అంబులెన్సులు, ఆక్సిజన్, అవసరమైన మందులు , ఆసుపత్రి సంరక్షణ లాంటి ముఖ్యమైన ఆరోగ్య సేవల ధరలపై పారదర్శక, జాతీయ ధర విధానం, ధరలపై నియంత్రణ ఉండాలి. కొన్ని రాష్ట్రాల్లో చేసినట్లుగా ప్రజలందరికీ ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమా పథకాలను అమలు చేయాలి. 3. కోవిడ్ కేసులు, నిర్వహణపై వాస్తవ సమాచారాన్ని మాత్రమే అందించాలి. పూర్తి స్పష్టతతో, ఆధారాల తో అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా వైరస్పై అవగాహన, చికిత్స ఇతర సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయాలి. ఈ సమాచారం స్థానిక పరిస్థితులు, క్లినికల్ ప్రాక్టీస్లు ఉన్న స్థానిక భాషల్లోఉండాలి. హోం ఐసోలేషన్, చికిత్స, ప్రాధమిక సంరక్షణపై జిల్లా ఆసుపత్రుల్లో తగిన విధానాలుండాలి. 4. ఆరోగ్యం రంగానికి సంబంధించి ప్రైవేటు రంగంతో సహా అన్ని రంగాలలో అందుబాటులో ఉన్న అన్ని మానవ వనరులను కరోనా సంక్షోభ సమయంలో వినియోగించుకోవాలి. ప్రత్యేకించి తగినంత వ్యక్తిగత రక్షణ పరికరాలు, క్లినికల్ ఇంటర్వెన్షన్స్ బీమా, మానసిక ఆరోగ్య మద్దతు వాడకంపై మార్గదర్శకత్వాలను అనుసరించాలి. 5. ప్రాధాన్యత సమూహాలకు టీకా అందించడంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ మోతాదుల వినియోగానికి నిర్ణయం తీసుకోవాలి. దీన్ని మార్కెట్ యంత్రాగాలకు ఏమాత్రం వదిలిపెట్టకుండా ప్రజా ప్రయోజనాలకనుగుణంగా వ్యవహరించాలి. 6. ప్రజల భాగస్వామ్యం, చొరవే కోవిడ్ నియంత్రణకు కీలకం. కరోనా నియంత్రణ, ఇతర అభివృద్ధి కార్యకలాపాలలో ప్రజల భాగస్వామ్యంతో ముంబై బాగా పనిచేసింది. ముంబైలో ముఖ్యంగా గ్రామీణ పౌర సమాజం చారిత్రాత్మక పాత్ర పోషించింది. (కరోనా సంక్షోభం: గూగుల్ మరోసారి భారీ సాయం) 7. ప్రభుత్వ డేటా సేకరణ, మోడలింగ్లో పారదర్శకంగా ఉంటూ రానున్న వారాల్లో కేసుల ఉధృతికి ఆయా జిల్లాలను ముందస్తుగా సిద్ధం చేయాలి. ఆరోగ్య సంరక్షణ విధానాలను బలోపేతం చేయడం, బాధితుల వయసు, జండర్ ఆసుపత్రిలో చేరిక, మరణాల రేట్లు, కమ్యూనిటీ-స్థాయిలో టీకాలు, చికిత్స ప్రోటోకాల్స్, దీర్ఘకాలిక ఫలితాలపై కమ్యూనిటీ-ఆధారిత ట్రాకింగ్ అవసరం. (Vaccine: గేమ్ ఛేంజర్, కార్బెవాక్స్ వచ్చేస్తోంది!) 8. అలాగే కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారికి, అట్టడుగువర్గాల వారికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చేస్తున్నట్లుగా నగదు బదిలీ ద్వారా ఆర్థిక మద్దతునందించాలి. తద్వారా ఆయా కుటుంబాల్లో జీవనోపాధి కోల్పోవడం వల్ల కలిగే తీవ్ర బాధలు, అనారోగ్య ముప్పును తగ్గించాలి. సంఘటిత రంగంలోని సంస్థలు కార్మికులందరినీ పనిలో కొనసాగించేలా చూడాలి. ఆర్థిక రంగం తిరిగి పుంజుకున్న తరువాత ఈ సంస్థలకు పరిహారం అందించేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలి. తద్వారా కాంట్రాక్టులతో సంబంధం లేకుండా ఆయా కంపెనీల యజమానులు కార్మికులకు ఉద్యోగ రక్షణ కల్పించేలా చూడాలి. చదవండి: టాప్-5 ఐటీ కంపెనీల్లోనే 96 వేల ఉద్యోగాలు: నాస్కామ్ -
దేశీ ఐటీ, ఫార్మాపై ప్రభావం అంతంతే..
బెంగళూరు: యూరోపియన్ యూనియన్ మార్కెట్ నుంచి బ్రిటన్ వైదొలిగినప్పటికీ (బ్రెగ్జిట్) దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా సంస్థలపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ ఉండబోదని నిపుణులు అభిప్రాయపడ్డారు. బ్రెగ్జిట్ అనంతరం కూడా ఆయా సంస్థల వ్యాపారాలు యథాప్రకారమే కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారతీయ టెకీలకు ఇప్పటికే బ్రిటన్, ఇతర యూరప్ దేశాలు వేర్వేరు వీసా విధానాలు పాటిస్తున్నందున ఈ విషయంలో పెద్దగా మారేదేమీ లేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో వి. బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. మరోవైపు, బ్రిటన్లో భారతీయ ఫార్మా సంస్థలు కీలకంగా ఎదిగే అవకాశం దక్కగలదని బయోటెక్ దిగ్గజం బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్–షా తెలిపారు. ‘బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్తో భారత్ పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు అవకాశం లభించగలదని భావిస్తున్నా. ఫార్మా రంగం కూడా ఇందులో ఒకటి కాగలదు‘ అని ఆమె చెప్పారు. డిసెంబర్ 31న యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుంది. -
ఐడియాలున్నా ఫండింగ్ లేదు!
ఈ ఏడాది తొలి ఆరునెలల్లోనే మహిళల స్టార్టప్కు ఫండింగ్ 24 శాతం వరకు పడిపోయిందని ‘మేకర్స్ ఇండియా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఆ తగ్గిన మొత్తం విలువ సుమారు 2 వేల 60 కోట్ల రూపాయలు! మహిళల స్టార్టప్లపై నమ్మకం లేక డబ్బు పెట్టేవాళ్లు ఇలా ముఖం చాటేయవచ్చు కానీ, అవే ముఖాలు ఆశ్చర్యంతో తమ వైపు తిరిగి చూసేలా మహిళలు తమ వ్యాపార దక్షతను చాటుతుండటం విశేషం. ‘బయోకాన్’ సంస్థ ఒక ఆలోచనగా ఆవిర్భవించే నాటికి కిరణ్ మజుందార్ షా వయసు ఇరవై ఐదేళ్లు. అప్పటికే ఆమెకు మంచి ‘బ్య్రూ–మాస్టర్’గా పేరుంది. ‘బయోకాన్’ జీవ ఔషధాల పరిశోధనా సంస్థ కనుక ‘బ్య్రూ–మాస్టర్’గా ఆమెకు ఉన్న అనుభవం తప్పక తోడ్పడుతుంది. అనుభవం సరే. డబ్బు మాటేమిటి? ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలి. ఎవరూ రాలేదు! ఒక మహిళ శక్తి సామర్థ్యాలను నమ్మి బయో టెక్నాలజీ రంగంలోని ఒక అంకుర సంస్థకు (టెక్–స్టార్టప్) రుణం ఇచ్చేందుకు ఒక్క బ్యాంకు కూడా ఆనాడు తొందరపడలేదు. కిరణ్ మజుందార్ షా కొన్ని మాత్రం ముందుకు వచ్చాయి కానీ, రుణం ఇవ్వడానికి ఆమె తండ్రి ఆమెకు షూరిటీగా ఉండాలన్న షరతు విధించాయి. యునైటెడ్ బ్రూవరీస్లో ఆయన హెడ్ బ్య్రూ–మాస్టర్. తండ్రి చేత సంతకాలు పెట్టించడం కిరణ్ మజుందార్కు ఇష్టం లేదు. చివరికి ఓ ‘ఏంజెల్ ఇన్వెస్టర్’ ఆమెకు దొరికారు. అంటే.. బంధువుల్లోనే ఒకరు. అలా బెంగళూరులో బయోకాన్ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఆ సంస్థ నికర విలువ సుమారు 33 వేల కోట్ల రూపాయలు! ∙∙ గుర్గావ్లోని ప్రసిద్ధ ‘విన్గ్రీన్స్ ఫామ్స్’ సంస్థ రైతులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంటుంది. పర్యావరణ సమతౌల్యం కోసం వంద రకాలైన పంటలను పండిస్తుంది. ఆహార, ఆరోగ్య ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఆ సంస్థ వ్యవస్థాపకురాలు అంజు శ్రీవాత్సవ. మొదట్లో సిబ్బందికి జీతాలు ఇవ్వడానికే ఆమెకు కష్టమైపోయింది. పది లక్షల రూపాయల పెట్టుబడితో 2008లో ప్రారంభం అయింది ‘విన్ గ్రీన్స్ ఫామ్స్’. అంజు శ్రీవాత్సవ కిరణ్ మజుందార్లానే అంజు శ్రీవాత్సవ కూడా విన్గ్రీన్స్కు అవసరమైన పెట్టుబడి కోసం తలకు మించిన ప్రయత్నాలు చేయవలసి వచ్చింది. మహిళ అన్న ఒకే ఒక కారణంగా వెంచర్ క్యాపిటలిస్టులు (డబ్బు పెట్టేవారు) వెనకాడారు. కనీసం ఆమెకు తెలిసినవాళ్లలో ఏంజెల్ ఇన్వెస్టర్లైనా లేరు. తన తిప్పలు తనే పడ్డారు. సంస్థను పైకి తెచ్చారు. పెట్టుబడి డబ్బు కోసం వెళ్లినప్పుడు ఖాళీ చేతులు చూపించిన వారికి ఇప్పుడు ఆమె నెలకు 8 కోట్ల రూపాయల ఆదాయాన్ని చూపిస్తున్నారు! ∙∙ ‘నిరమయి’ పేరు వినే ఉంటారు. వినూత్న వైద్య ఆరోగ్య చికిత్స సాధనాలు, విధానాల పరిశోధనా సంస్థ. నిరమయి వ్యవస్థాపకురాలు గీతా మంజూనాథ్. సంస్థ బెంగళూరులో ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ను గుర్తించేందుకు చేసే మామోగ్రఫీ కన్నా కూడా చౌకగా నిరమయి కనిపెట్టిన వ్యాధి నిర్థారణ విధానం ఆ సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ సంస్థ ఆవిష్కరణలన్నీ స్వయంగా మంజూనాథ్ పర్యవేక్షణలోనే జరుగుతాయి. బయోటెక్నాలజీలో 25 ఏళ్ల అనుభవం ఆమెది. అయితే ‘‘మహిళల స్టార్టప్లకు అంత తేలిగ్గా ఏమీ ఫండింగ్ దొరకదు’’ అని మంజూనాథ్ అంటారు. నాలుగేళ్ల క్రితమే మొదలైన ‘నిరమయి’.. సవాళ్లను ఎదుర్కొంటూ ఇప్పుడిప్పుడు కోట్ల రూపాయల రాబడిని పొందుతున్న కంపెనీగా వెంచర్ క్యాపిటలిస్టుల గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడాది 16 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించుకోగలిగింది. ∙∙ స్టార్టప్ను నడపడం బ్రహ్మవిద్యేమీ కాదని మహిళల నేతృత్వంలోని బయోకాన్, విన్గ్రీన్స్, నిరమయి వంటి విజయవంతమైన కంపెనీలు నిరూపిస్తున్నప్పటికీ మహిళల స్టార్టప్లకు ఫండింగ్ దొరకడం అన్నది మాత్రం ఇప్పటికీ పెద్ద విషయం గానే ఉంది! 2020 తొలి ఆరునెలల్లోనే మహిళల స్టార్టప్ కు ఫండింగ్ 24 శాతం వరకు పడిపోయిందని ‘మేకర్స్ ఇండియా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాదిని వదిలేసి చూసినా ఇండియాలో వెంచర్ క్యాపిటలిస్టుల ఫండింగ్లో కేవలం 2 శాతం కన్నా తక్కువ మాత్రమే మహిళల స్టార్టప్లు పొందగలుగుతున్నాయి. కారణం తెలిసిందే. ఐటీ రంగంలో మహిళల వ్యాపార దక్షతలపై ఇన్వెస్టర్లకు నమ్మకం లేకపోవడమే. మహిళల పేరుపై వ్యక్తిగత ఆస్తులు ఉండకపోవడం కూడా మరొక కారణం. గీతా మంజునాథ్ ‘వెంచర్స్ ఇంటెలిజెన్స్’ సంస్థ ఇటీవల జరిపిన సర్వేలో ఫండింగ్ ఉన్న మహిళల స్టార్టప్లు 2018లో 9.2 రెండు శాతంగా ఉంటే, ఈ ఏడాది నవంబరుకు 14.3 శాతానికి పెరిగాయట! మరి ఈ పెరుగుదల ఎలా సాధ్యం అయింది? ఎలా అంటే.. ఆ స్టార్టప్ ల సహ వ్యవస్థాపకులుగా పురుషులు ఉండటం. పురుషుల భాగస్వామ్యం ఉన్నప్పుడే (తండ్రి గానీ, భర్త గానీ, మరొకరు గానీ) మహిళల స్టార్టప్లకు నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు, వెంచర్ కేపిటలిస్టు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. మహిళలకు ఫండింగ్ దొరకపోవడానికి కారణాలను వెతుక్కోవడం కాదు ఇదంతా. ఫండింగ్ లభించకపోయినా మహిళలు వెనకంజ వేయకుండా వ్యాపార రంగంలో అద్భుతమైన ఫలితాలను సాధించి చూపుతున్నారని చెప్పడం. -
శక్తివంతమైన మహిళగా నిర్మల
న్యూఢిల్లీ: ఫోర్బ్స్ ప్రపంచంలో 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్లో 41వ స్థానంలో నిలిచారు ఆర్థిక మంత్రి. నిర్మలా సీతారామన్తో పాటు హెచ్సీఎల్ కార్పొరేషన్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోషిణీ నాడార్ మల్హోత్రా, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్షా ఈ జాబితాలో నిలిచిన మిగతా భారతీయ మహిళలు. ఇక ఈ జాబితాలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వరుసగా పదో సారి ప్రథమ స్థానంలో నిలవగా.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ హెడ్ క్రిస్టిన్ లగార్డ్ వరుసగా రెండో సారి రెండో స్థానంలో నిలిచారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యాక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ తొలసారి ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మొదటిసారే ఆమె ఏకంగా మూడో స్థానంలో నిలిచారు. (చదవండి: సూపర్ కుమార్) Announcing the World's 100 Most Powerful Women of 2020: https://t.co/fSEkDPz9Nh #PowerWomen pic.twitter.com/8u6uB1LTYI — Forbes (@Forbes) December 8, 2020 ఇక గతేడాది కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమితురాలైన నిర్మలా సీతారామన్ ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో రోషిణీ నాడార్ 55 స్థానంలో నిలవగా.. కిరణ్ మజుందార్ షా 68వ స్థానంలో నిలిచారు. ఇక ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన వారిలో 10 మంది దేశాధినేతలు, 38 మంది సీఈఓలు, ఐదుగురు ఎంటర్టైనర్లు ఉన్నారు. వీరందరి వయస్సు, జాతీయత, ఉద్యోగ వివరణలో విభిన్నంగా ఉన్నప్పటికి.. వారు 2020 లో తలెత్తిన ప్రత్యేకమైన సవాళ్లను పరిష్కరించడానికి వారు తమ ప్లాట్ఫారమ్లను ఉపయోగిస్తున్నారు "అని ఫోర్బ్స్ తెలిపింది. -
విషాదం: ‘కాన్సర్తో పోరాడి ఓడిపోయారు’
న్యూఢిల్లీ: పద్మ భూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ ఇషర్ జడ్జ్ అహ్లువాలియా(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా కాన్సర్తో పోరాడిన ఆమె శనివారం తుదిశ్వాస విడిచారు. కాగా ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియాను ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి పవన్, అమన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇషర్ జడ్జ్ అహ్లువాలియా ఐసీఆర్ఐఈఆర్(ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్) చైర్పర్సన్గా పనిచేశారు. విద్య, సాహిత్య రంగంలో ఆమె చేసిన కృషికి గానూ 2009లో భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.(చదవండి: కోవిడ్ వ్యాక్సిన్: రూ. 80 వేల కోట్లు ఉన్నాయా?!) కాగా ఇషర్ జడ్జ్ అహ్లువాలియా మరణం పట్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అహ్లువాలియా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆర్థికవేత్త, తన హయాంలో రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్గా ఆమె ఎనలేని కృషి చేశారని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొనియాడారు. ఇక బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా అహ్లువాలియాతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఎంతో ప్రతిభావంతురాలైన తన స్నేహితురాలు ఈ లోకాన్ని వీడి వెళ్లారన్నారు. ఆమె జీవితం మహిళలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కాన్సర్తో పోరాడి ఓడిన శ్రీమతి అహ్లువాలియా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్, భారత విదేశాంగ మాజీ కార్యదర్శి నిరుపమ్ మీనన్ రావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. (కరోనాతో అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ ఛైర్మన్ మృతి) Isher Ahluwalia who just passed away, was one of India’s distinguished economists, a MIT PhD, and author of an influential book ‘Industrial Growth in India’. She built up ICRIER, a fine economic think tank. She had her own distinctive identity apart from being Montek‘s wife. — Jairam Ramesh (@Jairam_Ramesh) September 26, 2020 -
వ్యాక్సిన్ అభివృద్ధిలో తొందర పనికిరాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై బయోకాన్ చైర్పర్సన్, ఎండీ కిరణ్ మజుందార్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ తయారీలో తొందర పనికి రాదని, త్వరితంగా అభివృద్ధి చేయడం సాధ్యం కాదని ఆస్ట్రాజెనెకా ప్రయోగాల ఆటంకం ద్వారా తేలిందని పేర్కొన్నారు. సురక్షితమైన వ్యాక్సిన్ను వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో మాత్రమే ఆమోదం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. క్లినికల్ పరీక్షల్లో సమస్యల కారణంగా బ్రిటన్, భారతదేశంతో పాటు ఇతర దేశాలలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. (ఆస్ట్రాజెనెకా ట్రయల్స్కు డీసీజీఐ బ్రేక్) టీకా పరీక్షలను జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉందని వైద్య, శాస్త్రీయ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న అంశం ఇదేనని మజుందార్ షా పేర్కొన్నారు. పరీక్షల సందర్భంగా ప్రతి తీవ్రమైన ప్రతికూలతను పరిశోధించాల్సి ఉంటుందనీ, చాలా అప్రమత్తంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు. కాగా ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ను కొన్ని సమస్యల కారణంగా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆస్ట్రాజెనెకా బుధవారం ప్రకటించింది. దీంతో దేశంలో పరీక్షలకు అనుమతి పొందిన సీరం సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) తాజా ఆదేశాల మేరకు పరీక్షలను నిలిపివేసింది. ఇది ఇలా ఉంటే కరోనా వైరస్ రోగుల్లో మోడరేట్ నుండి తీవ్రంగా ఏర్పడే సైటోకిన్ రిలీజ్ సిండ్రోమ్, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ చికిత్సకు బయోకాన్ ఐటోలిజుమాబ్ ఇంజెక్షన్ను మార్కెట్ చేసుకునేందుకు జులైలో డీసీజీఐ అనుమతిని సాధించిన సంగతి తెలిసిందే. (ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేతపై సీరం స్పందన) -
కిరణ్ మజుందార్ షాకి కరోనా పాజిటివ్
సాక్షి, బెంగళూరు: బయోకాన్ వ్యవస్థపాపకురాలు, ఎండీ కిరణ్ మజుందార్ షాకి కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘కరోనా కేసుల్లో నేను కూడా చేరాను. కానీ నాకు లక్షణాలు తక్కువగానే ఉన్నాయి... త్వరలోనే కరోనా నన్ను వదిలేస్తుందనే ఆశతో ఉన్నాను’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. మజుందార్ షాకు కరోనా అని తెలిసి చాలా మంది ఆమె త్వరగా కోలుకోవాలని ట్విట్ చేశారు. వీరిలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా ఉన్నారు. ‘ఇలాంటి వార్త విన్నందుకు చాలా బాధగా ఉంది. మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ శశి థరూర్ ట్విట్ చేశారు. (ప్యాసింజర్ రైళ్లను ఇప్పట్లో నడపలేం) I have added to the Covid count by testing positive. Mild symptoms n I hope it stays that way. — Kiran Mazumdar Shaw (@kiranshaw) August 17, 2020 కిరణ్ మజుందార్ షాకు చెందిన బెంగళూరు బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బయోకాన్, కోవిడ్-19 చికిత్స కోసం సోరియాసిస్కు వాడే ఇటోలిజుమాబ్ అనే ఔషధాన్ని తిరిగి తయారు చేయడానికి కృషి చేస్తోంది. గత నెలలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అత్యవసర పరిస్థితుల్లో కరోనా వైరస్ రోగులకు చికిత్స చేయడానికి గాను చర్మ వ్యాధి సోరియాసిస్ను నయం చేయడానికి ఉపయోగించే ఇటోలిజుమాబ్కు అనుమతి ఇచ్చింది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం నాలుగు కోవిడ్ కేంద్రాలలో.. 30 మంది రోగులపై మాత్రమే క్లినికల్ ట్రయల్స్ జరిపి.. దాని ఆధారంగా కోవిడ్-19 చికిత్సకు ఇటోలిజుమాబ్కు అనుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. కానీ కోవిడ్-19 పై నేషనల్ టాస్క్ ఫోర్స్ డీజీసీఐ అనుమతితో సంబంధం లేకుండా క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్లో ఇటోలిజుమాబ్ ఔషధాన్ని చేర్చాలని నిర్ణయించింది. -
‘వాళ్లను అలా వదిలేయడం సిగ్గు చేటు’
సాక్షి, ముంబై : కోవిడ్-19 మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన చర్యలు కేవలం ఆర్థిక మనుగుడకు సరిపోతాయని బయోకాన్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యానించారు. ఈ సమయంలో డిమాండ్ను సృష్టించే పెద్ద అవకాశాన్నికోల్పోయామంటూ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు కొనుగోళ్లు పెరగాలంటే జీఎస్టీ తగ్గింపులు అవసరమని షా చెప్పారు. కొనుగోలును ప్రోత్సహించడానికి స్వల్ప కాలిక ఉపశమనం లభించాలనీ, కనీసం మూడు-ఆరునెలలు పాటు జీఎస్టీ భారాన్ని తగ్గించాలన్నారు. (మనమే మాయం చేశాం..సిగ్గుతో తలదించుకోవాలి!) సరఫరా కోసం ద్రవ్యత లభ్యతను సృష్టించుకున్నాం..కానీ ఆర్థిక పునరుజ్జీవనంలో చాలా ముఖ్యమైన భాగం డిమాండ్ పరిస్థితి ఏంటి అని ఆమె ప్రశ్నించారు. డిమాండ్ పుంజుకోకపోతే ఆర్థిక పునరుజ్జీవనం సాధ్యం కాదనే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మనం పెద్ద అవకాశాన్ని కోల్పోయామని షా అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఉద్యోగుల వేతనాలన్నింటినీ చెల్లించమని అన్ని పరిశ్రమలను కోరడం అన్యాయమన్నారు. డిమాండ్ లేక కుదేలైన సంస్థలకు ఇది కష్టమన్నారు. పరిశ్రమలు పూర్తి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించకపోతే..తాము మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వుంటుందన్నారు. (కరోనా : ఉద్యోగులపై వేటు, క్లౌడ్ కిచెన్స్కు బ్రేక్) మరోవైపు కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ కాలంలో వలస కార్మికుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభ సమయంలో వారి మానాన వారిని వదిలివేయడం అవమానకరమని, దీనికి అందరమూ సిగ్గు పడాలన్నారు. అభివృద్ధి చెందాలని భావిస్తున్న దేశ సౌభాగ్యానికి ఇది మంచిది కాదన్నారు. పేదలకు సామాజిక భద్రత ప్రాముఖ్యాన్ని గురించి నొక్కిచెప్పిన షా, కనీస ప్రాతిపదిక ఆదాయాన్ని ప్రకటించాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. (వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు) ఉద్దీపన ప్యాకేజీ సానుకూలతల గురించి మాట్లాడుతూ సంస్కరణల పరంగా వ్యవసాయం మంచి ప్రోత్సాహం లభించిందని కిరణ్ మజుందార్ షా భావించారు. అయినప్పటికీ, ఆధునికీకరణ పరంగా వారికి ఇంకా ఎక్కువ ప్రోత్సాహకాలు లభించాలన్నారు. అలాగే గ్రామీణాభివృద్ధికి ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సాహకాలు లభించాయని షా తెలిపారు. దీంతోపాటు కరోనా వైరస్ కేసుల సంఖ్య కంటే మరణాల రేటుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. తాను ఎప్పుడూ చెబుతున్నట్టుగానే, పెరుగుతున్న కేసుల గురించి భయపడకుండా మెరుగైన చికిత్సలు, ఔషధాలు, రోగుల నిర్వహణతో వైరస్ను మ్యానేజ్ చేయాలని ఆమె సూచించారు. -
బడ్జెట్ 2020: బయోకాన్ చీఫ్ ఆసక్తికర ట్వీట్
న్యూఢిల్లీ: వరుసగా రెండోసారి కేంద్రంలో కొలువుదీరిన నరేంద్ర మోదీ సర్కారు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఆవిష్కరించింది. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం, బయోకాన్ చీఫ్ కిరణ్ ముజుందార్ షా నూతన బడ్జెట్పై భారీ అంచనాలు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను కాన్యర్తో పోలుస్తూ వైద్య పరిభాషలో ఆసక్తికర ట్వీట్ చేశారు.(బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ మేరకు... ‘‘మన ఆర్థిక క్యాన్సర్కు కీమోథెరపీ కాదు.. ఇమ్యూనోథెరపీ కావాలి. మనం గాయాల గురించి కాదు... దానికి కారణమైన వాటి గురించి ఆలోచించాలి. బడ్జెట్ 2020 ఇలాంటి విధానాన్ని కలిగి ఉంటుందని ఆశిస్తున్నా. మన ఆర్థిక నిరోధక వ్యవ్యస్థలో సంపద సృష్టి అనేది కీలకమైనది! ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏం చెబుతారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఆర్థిక క్యాన్సర్పై ద్రవ్య విధానం కచ్చితంగా ప్రభావం చూపుతుంది. మౌలిక వసతులు, ఆరోగ్యం, విద్య తదితర అంశాలు ఇమ్యూనోథెరపీలో టీ సెల్స్ వంటివి’’ అని కిరణ్ ముజుందార్ షా ట్విటర్లో పేర్కొన్నారు. Fiscal incentives are like CART-Cells to specifically target the economic cancer. Govt investments in infra, healthcare, education etc are like T-Cells to address the malaise broadly. https://t.co/E34R62pGMj — Kiran Mazumdar Shaw (@kiranshaw) February 1, 2020 -
కిరణ్ షాకు అత్యున్నత పౌర పురస్కారం
సాక్షి, బెంగళూరు: బయోకాన్ వ్యవస్థపాపకురాలు,ఎండీ కిరణ్ మజుందార్-షా తన ఖాతాలో అత్యున్నత అవార్డును జమ చేసుకున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం అందించే ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ను అందుకున్నారు. ఆస్ట్రేలియా-ఇండియా ద్వైపాక్షిక సంబంధాన్ని అభివృద్ధి చేయడంలో చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా, ముఖ్యంగా వాణిజ్య, విద్యా సంబంధాలను ప్రోత్సహించడంలో ముఖ్యమైన సేవ చేసినందుకు ఆమెకు అత్యున్నత పౌర గౌరవ అవార్డును అందించడం ఆనందంగా ఉందని ఆస్ట్రేలియా గవర్నర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. అరుదైన ఈ గౌరవం దక్కడం తనకెంతో సంతోషంగా వుందని కిరణ్ షా పేర్కొన్నారు. శుక్రవారం బెంగళూరులోని లీలా ప్యాలెస్లో జరిగిన కార్యక్రమంలో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, కాంగ్రెస్ నేత ఆర్వి దేశ్పాండే, డాక్టర్ దేవి శెట్టి వంట దిగ్గజాల సమక్షంలో కిరణ్ షా ఈ అవార్డును అందుకున్నారు. క్యాన్సర్ పరిశోధన, మహిళా సమస్యలపై కిరణ్ షా ప్రదర్శించిన నిబద్ధతతో పాటు, బెంగళూరు నగరాన్నిజీవించగలిగే నగరంగా ఉండేలా చేయడంలో ఆమె కృషి మనందరికీ తెలుసంటూ ఆస్ట్రేలియా హైకమిషనర్ హరీందర్ సిద్ధూ కిరణ్ షాను ప్రశంసించారు. ప్రపంచంలో విశేషమైన మార్పునకు నాందిపలికిన వ్యక్తులను గుర్తించడం చాలా అద్భుతంగా ఉందన్నారు. కాగా ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం ఫిబ్రవరి 14, 1975న ది క్వీన్ ప్రారంభించారు. ఆస్ట్రేలియాలో చదివిన కిరణ్ షా ఈ పురస్కారాన్ని స్వీకరించిన భారతీయులోనాల్గవ వారు. మదర్ థెరిసా, మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇప్పటికే ఈ గౌరవాన్ని అందుకున్నారు. The Australian Govt. has invested @kiranshaw as an Honorary Member within the #OrderofAustralia (AM) today. Delighted to present this award - Australia’s highest civilian honour - in recognition of her immense contribution in advancing the Australia-India bilateral relationship. pic.twitter.com/x5J6zoHn3G — Harinder Sidhu (@AusHCIndia) January 17, 2020 -
నిర్మలా శక్తి రామన్!
న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ఈ ఏడాది అగ్రశ్రేణి వంద అత్యంత శక్తివంతమైన మహిళల్లో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకున్నారు. అంతర్జాతీయంగా శక్తివంతమైన 100 మంది మహిళల 2019 జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేయగా.. ఇందులో మన దేశ ఆర్థిక మంత్రి 34వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో భారత రక్షణరంగానికి సారథ్యం వహించిన ఆమె.. ప్రస్తుతం మొత్తం భారత ఆర్థిక వ్యవస్థకు పూర్తిస్థాయి బాధ్యతలు వహిస్తూ దేశ తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్ణయాత్మక పాత్ర నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ పన్నుల తగ్గింపు వంటి వ్యూహాత్మక నిర్ణయాలతో సత్తా చాటుతోన్న నిర్మలా సీతారామన్ ప్రతిభకు నిదర్శనంగా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కింది. ఇక మన దేశం నుంచి మరో ఇద్దరు మహిళలకు ఈ జాబితాలో స్థానం లభించింది. హెచ్సీఎల్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్, సీఈఓ రోష్ని నాడార్ మల్హోత్రా 54వ స్థానంలో నిలిచారు. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా 65వ స్థానాన్ని దక్కించుకున్నారు. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోకాన్ చైర్మన్, ఎండీ కిరణ్ మజుందార్ షా బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్పర్సన్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె నికర సంపద రూ.310 కోట్ల అమెరికా డాలర్లు (2019). దేశంలోనే అతిపెద్ద బయోఫార్మాసూటికల్ కంపెనీ ఏర్పాటుచేసి, సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక రోష్ని నాడార్ విషయానికొస్తే, ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురుణ్ ఇండియా రిచ్ లిస్ట్ (2019) ప్రకారం, భారత్లోనే అత్యంత మహిళా సంపన్నురాలు. అగ్రస్థానంలో ఏంజెలా మెర్కల్ ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలోనూ జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కల్ టాప్లో నిలిచారు. గత తొమ్మిదేళ్ళుగా అత్యంత శక్తివంతమైన మహిళగా తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంటూనే ఉన్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీనా లగార్డ్ రెండో ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఇక అమెరికా ప్రతినిధుల సభకు స్పీకర్ నాన్సీ పెలోసీ మూడో స్థానంలో నిలిచారు. జాబితాలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్(4 వ ర్యాంకు), జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బరా(5) బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా(29), అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్(42) ఉన్నారు. కొత్తగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 23 మందిలో పర్యావరణ పరిక్షణకోసం గళమెత్తిన స్వీడన్కు చెందిన 16 ఏళ్ల గ్రేటా థంబర్గ్ కూడా ఉన్నారు. ఆమె 100వ స్థానంలో నిలిచారు. -
వృద్ధికి చర్యలు లోపించాయి..
న్యూఢిల్లీ: ట్విట్టర్ వేదికపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. వృద్ధికి మద్దతునిచ్చే చర్యలు లోపించాయంటూ షా విమర్శించారు. ట్విట్టర్పై విమర్శలకు సహజంగా బదులివ్వని నిర్మలా సీతారామన్.. షా విమర్శలకు మాత్రం స్పందించారు. ‘‘మీరు గమనించే ఉంటారు ఆర్థిక మంత్రిగా నేను ఆ పనే చేస్తున్నాను. ఆర్థిక రంగానికి సంబంధించి తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉన్నాను’’ అని సీతారామన్ ట్వీటిచ్చారు. ముఖ్యంగా బుధవారం సీతారామన్ మీడియా సమావేశం పెట్టి ఈ సిగరెట్లను నిషేధిస్తున్నట్టు ప్రకటించడాన్ని షా తప్పుబట్టారు. ఆమేమీ వైద్య మంత్రి కాదుగా అన్నది ఆమె ఆశ్చర్యం. ‘‘ఈ సిగరెట్లను నిషేధించినట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ చెప్పారు. ఇది వైద్య మంత్రిత్వ శాఖ నుంచి రాలేదు? గుట్కా నిషేధం గురించి ఏమిటి? ఆర్థిక రంగ పునరుద్ధరణకు కావాల్సిన చర్యలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ప్రకటనలు ఏవి?’’ అని షా ట్వీట్ చేశారు. దీనికి సీతారామన్ స్పందిస్తూ... మంత్రుల బృందానికి అధిపతిగా తాను బుధవారం మీడియా సమావేశం నిర్వహించినట్టు వివరణ ఇచ్చారు. ‘‘కిరణ్ జీ, ఈ మీడియా సమావేశాన్ని గ్రూపు ఆఫ్ మినిస్టర్స్ చైర్ హోదాలో దీన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పే మొదలుపెట్టాను’’ అని సీతారామన్ చెప్పారు. వైద్య మంత్రి హర్షవర్దన్ విదేశీ పర్యటనలో ఉన్నట్టు తెలిపారు. -
మహిళా లీడర్లు తగినంత మంది దొరకడం లేదు..
ముంబై: జూనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్ప టికీ సారథ్య బాధ్యతలు వహించగలిగే వారిని తగినంత స్థాయిలో దొరకపుచ్చుకోవడం కష్టంగా ఉంటోందని బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా చెప్పారు. రాబోయే ఐదు, పదేళ్లలో ఈ పరిస్థితి మారి లీడర్లుగా మరింత మంది మహిళలను చూడగలమని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే పరిస్థితులు మారుతున్నాయని, కానీ ఈ వేగం ఆశించినంత స్థాయిలో ఉండటం లేదని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మజుందార్ షా పేర్కొన్నారు. మహిళలకు సాధికారత కల్పించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ పెద్ద హోదాల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగానే ఉంటోంది. ముఖ్యంగా కంపెనీల బోర్డుల్లో సంఖ్యాపరంగా మహిళా డైరెక్టర్లు తక్కువగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
కిరణ్ మజుందార్ షాకు అరుదైన గౌరవం
హైదరాబాద్ : గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) గవర్నింగ్ బోర్డు సభ్యురాలు కిరణ్ మజుందార్ షాకు అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్య సమితి విభాగం యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్(యూఎస్ఎన్ఏఈ) సభ్యురాలిగా ఆమె ఎన్నికయ్యారు. యూఎస్ఎన్ఏఈ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ షానే కావడం గమనార్హం. బయో ఫార్మాసూటికల్స్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవకాశం దక్కింది. ఆమెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడంపై గవర్నింగ్ బోర్డు ప్రతినిధులు, ఫ్యాకల్టీ హర్షం వ్యక్తం చేశారు. -
టాప్ 100 శక్తివంత మహిళల్లో మనవాళ్లు నలుగురు
న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందిందిన ఈ ఏడాది అగ్రశ్రేణి వంద అత్యంత శక్తివంతమైన మహిళల్లో మన దేశానికి చెందిన నలుగురు మహిళలకు చోటుదక్కింది. హెచ్సీఎల్ రోష్ని నాడార్ మల్హోత్రా, బయో కాన్ కిరణ్ మజుందార్ షా, హిందుస్థాన్ టైమ్స్ శోభన భర్తియ, సినీతార ప్రియాంక చోప్రా జాబితాలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 మందితో రూపొందించిన ఈ జాబితాలో అగ్రస్థానంలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నిలిచారు. ఆమె ఈ జాబితాలో టాప్లో నిలవడం ఇది వరుసగా ఎనిమిదో సంవత్సరం. రెండో స్థానంలో యూకే ప్రధాని థెరిసా మే, మూడో స్థానంలో ఐఎమ్ఎఫ్ ఎమ్డీ క్రిస్టినా లగార్డే ఉన్నారు. 51వ స్థానంలో రోష్ని నాడార్... హెచ్సీఎల్ టెక్నాలజీస్కు సీఈఓగా వ్యవహరిస్తున్న రోష్ని 51వ స్థానంలో నిలిచారు. కిరణ్ షా 60వ స్థానంలో, హెచ్టీ మీడియా సీఎండీ శోభనా భర్తియ 88వ స్థానంలో నిలిచారు. ప్రియాంక చోప్రా 94వ స్థానంలో నిలిచారు. -
మాల్యాకు అవకాశమివ్వాలి: మజుందార్ షా
హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై మీడియాయే విచారణ జరపటం వల్ల ప్రయోజనం లేదని బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యానించారు. రుణ డిఫాల్ట్ సమస్యను బ్యాంకులతో సెటిల్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటూ మాల్యా స్వయంగా చెప్పినందున, ఆయనకు సముచిత అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. ‘బకాయిలు తక్షణం రాబట్టేయాలంటూ రుణాలిచ్చిన బ్యాంకులను, ఇతర రుణ దాతలను, ప్రభుత్వాన్ని... ఇలా ప్రతి ఒక్కరినీ ఇవాళ మీడియానే విచారణ చేసేస్తోంది. ఇది సరికాదు. ఈ మీడియా హడావుడి వల్ల అసలు ప్రక్రియ కుంటుపడుతోంది’ అని ఆమె అభిప్రాయపడ్డారు. మాల్యా కచ్చితంగా భారత్ తిరిగి వస్తారని మజుందార్ షా ధీమా వ్యక్తం చేశారు. సరైన దివాలా చట్టం లేకపోవడం వల్లే రుణ, ఆర్థిక వివాదాల పరిష్కారానికి చాలా సమయం పట్టేస్తోందన్నారు.