-
బిహార్: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా?
పాట్నా: బిహార్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. బీజేపీతో జేడీయూ తెగదెంపులు చేసుకోనుందన్న వార్తల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కీలక సమావేశాలు నిర్వహించాయి. నేడు(మంగళవారం) జేడీయూ ప్రత్యేక సమావేశమైంది. సీఎం నితీష్ కుమార్ అధికారిక నివాసంలో జేడీయూ ఎంపీలు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మరోవైపు మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో ఆర్జేడీ ఎమ్మెల్యేలు, ఎంపీలు భేటీ అయ్యారు. లూలూ తనయుడు తేజస్వీ యాదవ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతేగాక వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం లాలూ ఇంటికి వెళ్లారు. మరోపక్క ఇదే విషయమై బిహార్కు చెందిన బీజేపీ నేతలు డిప్యూటీ సీఎం తార్కిషోర్ ప్రసాద్ నివాసంలో సమావేశమయ్యారు. చదవండి: Bihar Politics: నితీశ్లో ఎందుకీ అసంతృప్తి? మూహుర్తం: సాయంత్రం 4 గంటలకా? బిహార్ రాజకీయాలు క్లైమాక్స్కు చేరాయి. సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటలకు గవర్నర్ను కలిసి తన రాజీనామా సమర్పించనున్నట్లు సమాచారం. మరోవైపు బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్తో సమావేశానికి బీజేపీ కూడా సమయం కోరింది. రాష్ట్ర కేబినెట్లోని మొత్తం 16 మంది మంత్రులు ఈరోజు గవర్నర్కు తమ రాజీనామాలను అందజేయనున్నారు. ఆర్జేడీ-కాంగ్రెస్తో కలిసి నితీష్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నితీష్ కుమార్కు మద్దతిచ్చేందుకు సిద్ధమని కాంగ్రెస్ ప్రకటించింది. అదే విధంగా బీజేపీ నుంచి బయటకు వస్తే, నితీష్ను అక్కున చేర్చుకునేందుకు సిద్ధమని ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ తెలిపింది. -
ఎన్డీయేకు గుడ్బై చెప్పే యోచనలో బిహార్ సీఎం నితీష్
-
బీహార్ రాజకీయాల్లో ఊహించని మలుపు.. బీజేపీకి నితీశ్ షాక్!
పట్నా: ఎన్డీఏతో మిత్రపక్షం జేడీయూ తెగదెంపులు చేసుకోనుందా? ఆగస్టు 11కు ముందే బిహార్లో జేడీయూ-బీజేపీ సర్కార్ కూలిపోనుందా? నితీశ్ కుమార్ మళ్లీ ఆర్జేడీతో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు అవుననే సమాధానం వినిపిస్తోంది. బిహార్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మిత్రపక్షం బీజేపీతో సీఎం నితీశ్ కుమార్ చాలా కాలంగా అంటీమున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశం సహా జులై 17 తర్వాత కేంద్రం నిర్వహించిన నాలుగు సమావేశాలకు నితీశ్ డుమ్మా కొట్టారు. దీంతో ఎన్డీఏ నుంచి ఆయన విడిపోనున్నారనే వాదనలకు మరింత బలం చేకూరింది. అంతేకాదు నితీశ్ మళ్లీ ఆర్జేడీతో జట్టుకట్టాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, వామపక్షాలను కూడా కలుపుకొని బిహార్లో బీజేపీకి షాక్ ఇస్తూ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆయన ఆయా పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వంలో భాగమైన బీజేపీతో విడిపోయి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని నితీశ్ భావించినా.. అందుకు జేడీయూ ఎమ్మెల్యేలు సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆర్జేడీ మద్దతు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నాలుగుసార్లు డుమ్మా జులై 17న దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్షా నిర్వహించిన సమావేశానికి నితీశ్ హాజరుకాలేదు. రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోతున్న సందర్భంగా రామ్నాథ్ కోవింద్కు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమానికి కూడా వెళ్లలేదు. ఆ తర్వాత జులై 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకరానికి కూడా నితీశ్ డుమ్మా కొట్టారు. తాజాగా ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కూడా హాజరుకాలేదు. దీంతో ఆయన ఎన్డీఏకు రాంరాం చెప్పడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆర్సీపీ సింగ్పై అసంతృప్తి.. జేడీయూ మాజీ జాతీయ అధ్యక్షుడు ఆర్సీపీ సింగ్ పార్టీకి శనివారమే రాజీనామా చేశారు. ఆయన కుమార్తెల అక్రమాస్థులకు సంబంధించి సీఎం వివరణ కోరడంతో పార్టీని వీడారు. అయితే ఆర్సీపీ సింగ్పై నితీశ్ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉండటమే ఇందుకు కారణం. గతేడాది మోదీ కేబినెట్ను విస్తరించినప్పుడు ఆర్సీపీ సింగ్ను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా జరగడంపై నితీశ్ తీవ్ర అసహనంతో ఉన్నారు. అలాగే మోదీ కేబినెట్లో రెండు బెర్తులు కావాలని నితీశ్ అడిగితే కేంద్రం అందుకు ఒప్పుకోలేదు. అమిత్ షాపై నమ్మకం లేదా? ఇటీవలే పట్నాలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ సీఎం అభ్యర్థి నితీశ్ కుమారే అని అమిత్ షా ప్రకటించారు. అయినా నితీశ్ బీజేపీపై నమ్మకంగా లేరని తెలుస్తోంది. బిహార్లో పట్టు సాధించాలని అమిత్షా భావించడం, ఆర్సీపీ సింగ్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం, రాష్ట్రంలో బలపడాలని బీజేపీ చూస్తుండటం వంటి అంశాలు నితీశ్ను కాస్త కలవరపాటుకు గురి చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు రాష్ట్ర బీజేపీ నాయకులు తనపై బహిరంగంగా విమర్శలు కురిపిస్తుండటం అస్సలు నచ్చడం లేదట. అందుకే బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే మంచిదని నితీశ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 11లోగా దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన ఆర్జేడీతో చేతులు కలిపితే బీజేపీకి గట్టి షాక్ ఇచ్చినట్లే అవుతుంది. చదవండి: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్కు హోంశాఖ? -
2024 సార్వత్రిక ఎన్నికలు.. ప్రధాని అభ్యర్థిపై అమిత్ షా కీలక ప్రకటన
పట్నా: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ఎవరుంటారని చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ఈ ఉత్కంఠకు తెరదించుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీనే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు. ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు బీజేపీ-జేడీయూ పొత్తు కొసాగుతుందని అమిత్ షా పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని వివరించారు. బిహార్ రాజధాని పట్నాలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ మోర్చాల ఉమ్మడి జాతీయ కార్యవర్గ సమావేశాలకు అమిత్షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివారం ముగింపు కార్యక్రమంలో ప్రసంగించి ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ప్రధాని మోదీ రిటైర్ అవుతారని, ఆయన స్థానంలో బీజేపీ కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొస్తుందనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు రెండేళ్ల ముందే అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. మోదీనే తమ అభ్యర్థి అని కార్యకర్తలకు స్పష్టం చేశారు. కశ్మీరీలు తయారు చేసిన త్రివర్ణ పతాకాలను ఈ కార్యక్రమంలో అందరికీ పంచారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీరీల ఆలోచనలు మారాయని తెలిపిందుకే వారు తయారు చేసిన జెండాలు పంపిణీ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకుని దేశం నలుమూలలా జాతీయ జెండాలను ఎగురవేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఆగస్టు 13-15వరకు మూడు రోజులపాటు ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని సూచించారు. చదవండి: బీజేపీ చర్య సిగ్గుచేటు.. -
అప్పుడు వీడిపోయారు.. ఇప్పుడు కలిశారు.. వారి భేటీతో బీజేపీకి టెన్షన్!
పాట్నా: దేశ రాజకీయ వర్గాల్లో మరో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అందరి అంచనాలకు తలకిందులు చేస్తూ బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ సమావేశమయ్యారు. వీరి భేటీపై సర్వత్ర చర్చ జరుగుతోంది. కాగా, శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సీఎం నితీష్, పీకే కలిసి భోజనం చేశారు. అనంతరం దాదాపు రెండు గంటల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని నితీష్ కుమార్ ధృవీకరించారు. అయితే, ఈ భేటీని రాజకీయ కోణంలో చూడవద్దంటూ సీఎం అభిప్రాయపడ్డారు. అంతకు ముందున్న సత్సంబంధాలతోనే తాము కలిసినట్టు వెల్లడించారు. మరోవైపు పీకే మాట్లాడుతూ.. నితీష్ కుమార్ను మర్యాదపూర్వకంగానే కలిసినట్టు తెలిపారు. కొన్ని రోజుల క్రితం సీఎం ఒమిక్రాన్ బారినపడినప్పడు ఆయనకు ఫోన్ చేసినట్టు చెప్పారు. అప్పుడు నితీష్ తనకు కలవాలని కోరినట్టు పేర్కొన్నారు. అందుకే తామిద్దరం ఇప్పుడు కలిసినట్టు వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా బీహార్లో 2020లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో నితీష్ కుమార్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న పీకే.. అనూహ్యంగా పార్టీని వీడారు. అప్పటి నుంచి వీరిద్దరూ మళ్లీ కలుసుకోలేదు. ఇదిలా ఉండగా.. నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ ఇటీవల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడం సాధ్యమే అంటూ పీకే కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో నితీష్, పీకే భేటీపై బీజేపీ శ్రేణులు సైతం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. -
పట్టపగలు ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు?
పాట్నా: త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఓ గ్రామంలో పర్యటించాడు. అక్కడి గ్రామస్తులకు రూ.500 నోట్లు ఇస్తూ వీడియోకు చిక్కాడు. ప్రస్తుతం ఆ వీడియో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. పట్టపగలు నగదు రాజకీయం జరగడంపై అధికార పార్టీ గుర్రుమంది. ఫిర్యాదు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు. చదవండి: స్విమ్మింగ్పూల్లో రాసలీలలు.. రెడ్హ్యాండెడ్గా దొరికిన డీఎస్పీ జేడీయూ ఎమ్మెల్సీ నీరజ్కుమార్ శుక్రవారం ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) యువ నాయకుడు, మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్ ఓ గ్రామంలో మహిళలకు డబ్బులు పంచుతూ కనిపించారు. తన కాన్వాయ్లో కూర్చుని అక్కడకు వచ్చిన మహిళలకు బహిరంగంగా రూ.500 నోట్లు ఇస్తున్నాడు. ‘డబ్బులు పంచుతున్న ఈ యువరాజు ఎవరు? లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్’ అని పేర్కొంటూ ఆ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోపై అధికారులకు అధికార పార్టీ జేడీయూ ఫిర్యాదు చేసింది. దీంతో గోపాల్గంజ్ జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. బైకుంత్పుర్ సమీపంలో తేజస్వి డబ్బులు పంచాడని ఆరోపణలు రావడంతో స్థానిక పోలీసులు, బీడీఓను విచారించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ డబ్బు పంపిణీ అధికార పార్టీ, ఆర్జేడీ మధ్య వాగ్వాదం మొదలైంది. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. చదవండి: కుర్రాళ్ల కన్నా రఫ్ఫాడిస్తున్న తాత.. ఈ వీడియో చూడండి कोई जानता नहीं-पहचानता नहीं कौन है ये राजकुमार जिसने आंचल में रुपया गिराया है घमंड का खुमार इस कुमार पर इतना छाया, अमीरी-गरीबी का फ़र्क़ बताया कोई पीछे से लालू का लाल है बताता भूत के वर्तमान का हाल दिखाता जाओ बबुआ अपनी पहचान बनाओ आर्थिक लुटेरे होने का दाग़ मिटाओ pic.twitter.com/lUgV3Hxl11 — Neeraj kumar (@neerajkumarmlc) September 10, 2021 -
Bihar: బిహార్లో హనీమూన్ ముగిసినట్లేనా?
ఎన్డీయే మద్దతుతో బిహార్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఒక్క పెగసస్పైనే కాకుండా అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలపై అసమ్మతిని వ్యక్తపరుస్తున్నారు. కులాలవారీ జనగణన విషయమై బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్తో నితీశ్ ఈమధ్య సమావేశమై చర్చించడం.. భవిష్యత్తులో ఆర్జేడీ, జేడీయూల మధ్య పొత్తు సాధ్యపడుతుందనే సంకేతాలు పంపింది. ఆర్టికల్ 370 రద్దుకు నితీశ్ తొలినుంచీ అనుకూలం కాదు. రామాలయ నిర్మాణంపై కూడా జాగ్రత్తగా మౌనం పాటిస్తున్నారు. నిజానికి నితీశ్ ప్రతిపక్ష శిబిరంలో చేరితే ఏ ఇతర ప్రాంతీయ నాయకుడి కంటే అది పెద్ద ప్రేరణ కలిగించగలదు. మొత్తం ప్రతిపక్షంపై ఆయన ప్రభావం, పలుకుబడి సామాన్యంగా ఉండవు. 14 పైగా ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఎన్డీయేకి వ్యతిరేకంగా కూటమి కడుతున్న నేపథ్యంలో బిహార్ సీఎం వైఖరిలో మళ్లీ మార్పు వస్తే ప్రతిపక్షాలకు అది పెద్ద నైతిక బలాన్ని ఇచ్చినట్లే అవుతుంది. పార్లమెంటును, దేశాన్ని చుట్టిముట్టిన పెగసస్ ఫోన్ హ్యాకింగ్ కుంభకోణంపై విచారణ జరిపించాల్సిందే అంటున్న ప్రతిపక్షంతో బిహార్ ముఖ్యమంత్రి, ఎన్డీయే భాగస్వామి నితీశ్ కుమార్ చేతులు కలపడం సంచలనం కలిగించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపట్టిన జనాభా విధానాలను కూడా నితీశ్ విమర్శించారు. బిహార్లో కులాలవారీ జనగణన అంశంపై తేజస్వీ యాదవ్, తదితర ప్రతిపక్షసభ్యులతో నితీశ్ ఇటీవలే భేటీ కావడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఆర్టికల్ 370 రద్దుకు నితీశ్ అనుకూలం కాదు. కానీ అయోధ్యలో రామాలయ నిర్మాణంపై మాత్రం నితీశ్ మౌనం పాటిస్తున్నారు. కాగా, వరుసగా జరిగిన ఈ పరిణామాలతో బిహార్లో జేడీయూ, బీజేపీ హనీమూన్ ముగిసినట్లేనని సహజంగానే ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. ఒకవైపున ఇరుపక్షాల మధ్య అనేక భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. మరోవైపు జేడీయూ గత నెలలో తొలిసారిగా కేంద్ర మంత్రిమండలిలో చేరింది. జేడీయూ జాతీయ అధ్యక్షుడు రామ్చంద్రప్రసాద్ సింగ్ కేంద్ర ఉక్కుశాఖ మంత్రి అయ్యారు. మరొక పొత్తు పార్టీ ఎల్జేపీకి చెందిన పశుపతి కుమార్ పరాస్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖను దక్కించుకున్నారు. నితీశ్ పలుకుబడి అసామాన్యం... కాకపోతే, దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఐక్యం చేసేందుకు ప్రత్యేకించి మమతా బెనర్జీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో బిహార్ ముఖ్యమంత్రి చాలా యుక్తితో తన ప్రధాన మిత్రపక్షానికి హెచ్చరిక సంకేతాలు పంపారు. నిజానికి నితీశ్ కుమార్ ప్రతిపక్ష శిబిరంలో చేరితే ఏ ఇతర ప్రాంతీయ నాయకుడి కంటే అది పెద్ద ప్రేరణ కలిగించగలదు. ఒక దశలో ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి కూడా నితిశ్ పేరు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మొత్తం ప్రతిపక్షంలో ఆయన ప్రభావం, పరపతి సామాన్యంగా ఉండవు. బిహార్లో బీజేపీ దూకుడు జేడీయూను తోసిపుచ్చింది. నిజంగానే, గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కంటే 31 స్థానాలు అధికంగా బీజేపీ సాధించినప్పటికీ రాష్ట్రంలో పాలకకూటమిలో జూనియర్ భాగస్వామిగానే కొనసాగుతోంది. కానీ బీజేపీలోని ఒక సెక్షన్తో జేడీయూకి పొసగడం లేదు. అదే సమయంలో బిహార్లో అన్నిటికంటే ప్రయోజనం పొందింది బీజేపీనే. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ కంటే తక్కువ స్థానాల్లోనే పోటీ చేసిన బీజేపీ ఏకంగా 74 స్థానాలు గెల్చుకుంది. జేడీయూ 43 స్థానాలకే పరిమితమైంది. ఒక రకంగా ప్రాంతీయపార్టీగా మాత్రమే ఉన్న జేడీయూను అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చావుదెబ్బ తీసిందనే చెప్పాలి. 2029 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, బిహార్లో ఎన్డీఏ కూటమిలోని రెండు ప్రధాన పార్టీల మధ్య పొరపొచ్చాలు చోటుచేసుకున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏర్పడిన వ్యతిరేకత నితీశ్కుమార్ పలుకుబడిని దెబ్బతీసిందని బీజేపీ నేతలు భావించారు. నాటి ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ బహిరంగంగానే నితీశ్కి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా ఎన్డీయే కూటమికి చెందిన చాలామంది తిరుగుబాటుదారులను తన పార్టీలో చేర్చుకున్నారు. జేడీయూను సంఖ్యాపరంగా కుదించివేసి నితీశ్ ముఖ్యమంత్రిత్వాన్నే బీజేపీ పక్కనపెట్టే కుట్ర చేస్తోందని పుకార్లు రేగాయి. అయితే బీజేపీ నిజాయితీగానే ఆ పుకార్లను తోసిపుచ్చింది. తిరుగుబాటుదారులను పార్టీనుంచి తొలగించి 2020 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా నితీశ్కుమారే కూటమి తరపున ముఖ్యమంత్రిగా ఉంటారని తేల్చి చెప్పింది. అదే సమయంలో చిరాగ్ జేడీయూని దెబ్బతీయడంలో విజయం పొందారు కానీ ఊహించినంతమేరకు సాధించలేకపోయారు. ఎన్డీయేకి విలువైన పొత్తుదారు గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే నితీశ్కుమార్ ఎన్డీయేకి చెయ్యి చూపి ఆర్జేడీతోనూ, దాని ప్రధాన భాగస్వాములైన కాంగ్రెస్, సీపీఎంతో కలిసి కూటమిని ఏర్పాటు చేస్తారని అంచనాలు మొదలయ్యాయి. ఆ తర్వాత 2021 జనవరిలో ఒక జేడీయూ ఎమ్మెల్యే మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో క్లిప్లో మరో ఆరునెలల్లో నితీశ్ ఎన్డీయేని వదిలివేస్తారన్న మాటలు బాగా వైరల్ అయ్యాయి. కానీ మహాఘట్ బంధన్తో చేదు అనుభవం కారణంగా 2017లో నితీశ్ కుమార్ ఆ కూటమి నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో తిరిగి ఆవైపు వెళ్లే అవకాశాలు లేవని కూడా కొందరు చెబుతున్నారు. ఒక జాతీయ పార్టీగా బీజేపీకి నితీశ్ విలువైన భాగస్వామిగా కొనసాగుతారు. నితీశ్ లేకుండా బిహార్లో అధికారం కైవసం చేసుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం తనకు దక్కుతుందనే ఆశ బీజేపీకి లేదు. పైగా దేశవ్యాప్తంగా ప్రాంతీయ సవాళ్లు చుట్టుముడుతున్నాయి. దీంతో తన కూటమి పార్టీలను, ప్రత్యేకించి నితీశ్కుమార్ని తన పక్షంలో నిలుపుకోవడం బీజేపీకి కీలకంగా మారింది. ఈ కోణంలోంచి చూస్తే, బిహార్లో కులాలవారీ జనగణన అంశంపై తేజస్వితో, ఇతర ప్రతిపక్ష సభ్యులతో నితీశ్కుమార్ ఇటీవల సమావేశం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ బీజేపీ కులాలవారీ జనగణనను వ్యతిరేకిస్తూ వచ్చింది. ఎందుకంటే, జనాభా గణనలో ఎలాంటి కీలకమైన మార్పు చేసినా దానివల్ల రిజర్వేషన్లను పునర్వ్యవస్థీకరించాలనే డిమాండు పుట్టుకొస్తుంది. పైగా అది భారీ విస్ఫోటనకు దారితీసే సమస్య అవుతుందని బీజేపీ యోచన. అయితే కులాలవారీ జనగణన అంశమే ప్రతిపక్షాలతో చర్చల సందర్భంగా నితీశ్కు ఏకైక ఎజెండాగా ఉండిందని జేడీయూ నొక్కి చెబుతున్నప్పటికీ, ఒకప్పుడు మిత్రుడిగా ఉండి ఇప్పుడు ప్రత్యర్థిగా ఉన్న తేజస్వితో సీఎం చర్చలు కాస్త అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి. విభేదాల కారణాలు ఉత్తరప్రదేశ్ జనాభా స్థిరీకరణ బిల్లుపై నితీశ్ పరిశీలన ప్రకారం, తన మంత్రిమండలిలోని బీజేపీ సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ జనాభా స్థిరీకరణ బిల్లు వంటిది బిహార్లో చట్ట రూపంలోకి తీసుకొచ్చే అవకాశం లేదనీ, మహిళా విద్య, సాధికారతను మాత్రమే ముందుకు తీసుకుపోవచ్చని తెలుస్తోంది. నితీశ్ కేబినెట్లో బీజేపీ మంత్రి ఒకరు ఈ అంశంపై మాట్లాడుతూ బిహార్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు మాత్రమే కలిగి ఉండాలనే నిబంధన ఇప్పటికే అమలులో ఉందని ఎత్తిచూపారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలకు కులగణన, జనాభా బిల్లు మాత్రమే కారణాలు కావు. గతంలోనూ ఆర్టికల్ 370 రద్దు పట్ల నితీశ్ సానుకూలత వ్యక్తపర్చలేదు కానీ ఒకసారి చట్టం రూపొందిన తర్వాత అందరూ దానికి కట్టుబడాల్సిందేనని నితీశ్ వివరణ ఇచ్చారు. అలాగే అయోధ్యలో రామాలయ నిర్మాణం పట్ల కూడా హెచ్చరించారు కానీ ఈ అంశంపై జాగ్రత్తగా మౌనం పాటించారు. ఇక బీజేపీ తనవంతుగా నితీశ్ సామాజిక నిర్మాణం, సంక్షేమవాదాన్ని దాటి, రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించి, ఉద్యోగావకాశాలు కల్పించడం వైపుగా దృష్టి సారించాలని కోరుకుంటోంది. 2020 నాటి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని నరేంద్రమోదీ కూడా రాష్ట్రంలో వికాసాన్ని తీసుకురాగల ముఖ్యమంత్రిగా నితీశ్ ఉండాలని కోరుకున్నారు. ఈ అన్ని అంశాలూ కలిసి తన మిత్రకూటమి నుంచి సౌకర్యవంతంగా పనిచేసుకుపోయే అవకాశాలను నితీశ్ కుమార్కి తగ్గించివేస్తున్నాయి. 2017లో కూడా మహాఘట్ బంధన్ అలాంటి సౌకర్యాన్ని నితీశ్కి కల్పించడంలో విఫలమైంది. బిహార్లో అదేవిధమైన తప్పును మరోసారి చేయకుండా బీజేపీ తన సహచరులను కట్టడి చేయాల్సి ఉంది. ఎందుకంటే రాజకీయ అస్థిరత్వం రాష్ట్ర పురోగతిని తోసిపుచ్చుతుంది తప్ప దాంతో ఒరిగే ప్రయోజనం లేదు. వ్యాసకర్త: భవదీప్ కాంగ్ సీనియర్ పాత్రికేయురాలు -
మంత్రులుగా 17 మంది ప్రమాణం
పాట్నా: ఎన్నికల్లో గెలిచిన అనంతరం కొద్దిమందితో మంత్రులు, ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయగా తాజాగా కొత్తగా 17 మంత్రులుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్భవన్లో వారితో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పార్టీతో పాటు బీజేపీకి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఇరు పార్టీల ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. బిహార్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మంగళవారం జరిగింది. కొత్తగా 17 మంది మంత్రులుగా గవర్నర్ ఫాగూ చౌహాన్ ప్రమాణం చేయించారు. కొత్తగా మంత్రులుగా నియమితులైన వారిలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అధికార ప్రతినిధి సహనవాజ్ హుస్సేన్ ఉన్నారు. ఆయన గత నెలలో మండలికి ఎన్నికవడంతో ఇవాళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్తగా మంత్రులైన వారిలో జేడీయూ నేతలు సంజయ్ కుమార్ జా, శ్రావణ్ కుమార్, లేసి సింగ్, బీజేపీకి చెందిన మదన్ సాహని, ప్రమోద్ కుమార్ ఉన్నారు. బీహార్ అసెంబ్లీలో 36 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు నితీశ్ బృందంలో 13 మంది మాత్రమే అక్కడ మంత్రులుగా ఉండగా తాజాగా 17 మంది నియమితులవడంతో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడింది. -
ఎదురుదెబ్బ: ఎన్డీయేలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
సాక్షి, న్యూఢిల్లీ : ఆపరేషన్ ఆకర్శ్, మిత్రపక్ష ఒత్తిళ్ళతో బిహార్ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ, జీతన్ రాం మాంఝీ నేతృత్వంలోని హిందూస్థానీ అవామ్ మోర్చాలు ఈసారి రాజకీయ దుమారాలకు వేదికగా నిలవనున్నాయి. చాలా మంది ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని జేడీయూ నేతలు తరుచూ చేస్తున్న వ్యాఖ్యలకు ఒక కాంగ్రెస్ నేత మరింత బలాన్ని చేకూర్చారు. 11 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్డీఏలో చేరేందుకు సిద్ధపడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు భరత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో ఆరోపణలకు కేంద్రబిందువుగా మారాయి. బిహార్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులున్నాయని కాంగ్రెస్ నేత భరత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత అజిత్ శర్మతో చెప్పానని కూడా ఆయన తెలిపారు. పార్టీ మారేందుకు సిద్ధమైన 11 మంది ఎమ్మెల్యేల పేర్లను సైతం సీఎల్పీ నాయకుడికి ఇచ్చానని, పార్టీని వీడేందుకు సిద్ధమైన వారిలో బిహార్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా కూడా ఉన్నారని భరత్ సింగ్ వ్యాఖ్యానించారు. మదన్ మోహన్ ఝా ఇప్పుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు అశోక్ చౌదరి బాటలో పయనిస్తున్నారని భరత్ సింగ్ ఆరోపించారు. ఈ 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బు ఇచ్చి టికెట్ తీసుకొని ఎన్నికల్లో గెలిచారని ఆయన ఆరోపణలు చేశారు. వీరంతా త్వరలోనే ఎన్డీఏలో చేరుతారని ఆయన జోస్యం చెప్పారు. అంతేగాక 2020 అసెంబ్లీ ఎన్నికలలో పేలవమైన ప్రదర్శన కనబరిచిన తరువాత బిహార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య పరస్పర విభేదాలు తరచూ చర్చల్లో నిలుస్తున్నాయి. అశోక్ చౌదరి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2015 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 27 స్థానాలు గెలుచుకుంది. అప్పుడు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్లు కలిసి నితీశ్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అశోక్ చౌదరి ఆ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన నితీశ్తోనే ఉన్నారు. ఆ తరువాత నితీశ్ మహాకూటమి నుంచి వైదొలిగి బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సైతం అశోక్ చౌదరి కాంగ్రెస్ పార్టీని వీడి జేడీయూలో చేరారు. ప్రస్తుతం చౌదరి విద్యా శాఖ మంత్రిగా, జేడీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాష్ట్ర కాంగ్రెస్ పూర్తిగా చీలిపోతుందని అందరూ భావించారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో ఊగిసలాడుతున్నారు. ఒకవేళ బీజేపీ, జేడీయూల మధ్య అంతరాలు పెరిగి, ఆర్జేడీ ప్రయత్నాలు విజయవంతమైతే అప్పుడు పార్టీని ఎందుకు వీడామనే పశ్చాత్తాపం ఎదురవుతుందనే భయం కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో మంత్రి పదవి కావాలంటున్న మాంఝీ బిహార్ రాజకీయాల్లో రాజకీయ ఒత్తిళ్ళు ఊపందుకుంటున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్యపక్షంగా ఉన్న హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) జాతీయ అధ్యక్షుడు జీతన్ రాం మాంఝీ ఎన్డీఏపై తనదైన శైలిలో ఒత్తిడి పెంచుతున్నారు. త్వరలో శాసన మండలికి నామినేట్ చేయబోయే 12 నుంచి 14 సీట్లలో కనీసం ఒకటైనా తమకు కచ్చితంగా కేటాయించాలని మాంఝీ తెలిపారు. బుధవారం హెచ్ఏఎం జాతీయ కార్యకారిణి సమావేశం అనంతరం మాంఝీ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్ కేబినెట్ విస్తరణలో ఎలాంటి ప్రతిష్టంభన లేదని, జనవరి 14 తర్వాత జరుగబోయే విస్తరణలో తమ పార్టీకి మరో మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో నితీశ్ కుమార్ను నమ్ముతున్నామన్న ఆయన, ఎన్నికల్లో ఒకవేళ ఏడు స్థానాల్లోనూ గెలిచి ఉంటే, అధికార పీఠంపై ఎవరు కూర్చోవాలో నిర్ణయించేవారమని వ్యాఖ్యానించారు. -
నితీష్కు షాక్: ఎమ్మెల్యేల తిరుగుబాటు!
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ చీఫ్ నితీష్ కుమార్పై తిరుగుబాటు చేసేందుకు ఎమ్మెల్యే సిద్ధంగా ఉన్నారంటూ ప్రతిపక్షం చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. జేడీయూ చెందిన 17 ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేత శ్యామ్ రాజక్ చేసిన ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. బీజేపీతో కూటమిగా ఏర్పడి మైనర్ భాగస్వామ్య పక్షంగా నిలిచిన జేడీయూతో కలిసి ఉండేందుకు వారంతా సిద్ధంగా లేరని ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఆయన అన్నారు. అంతేకాకుండా నితీష్ కుమార్ పేరుకే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుకున్నారని, ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు మొత్తం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆదేశాల మేరకే నడుస్తున్నాయని పేర్కొన్నారు. జేడీయూ చెందిన 17 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, చట్టపరమైన సమస్యలు ఎదురుకాకుండా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంలోని కీలక మంత్రి పదవులన్నీ బీజేపీ నేతలకే కట్టబెట్టారని జేడీయూ ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉన్నారని ఆయన ఆరోపించారు. రాజక్ ప్రకటనతో నితీష్ ప్రభుత్వంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. (బీజేపీ-జేడీయూ స్నేహ బంధానికి బీటలు!) ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు విపక్ష గూటికి చేరడం ఇటీవల కాలంలో తరచుగా చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఈ తరుణంలో ఆర్జేడీ నుంచి పొంచి ఉన్న ముప్పును తట్టుకునేందుకు నితీష్ సిద్ధమవుతున్నారు. రాజక్ ప్రకటన అనంతరం పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన నితీష్... ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తమ ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు తేజస్వీ యాదవ్ కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలంతా తమ వెంటే ఉంటారని, బీజేపీ-జేడీయూ ప్రభుత్వంపై వారికి విశ్వాసం ఉందని ప్రకటించారు. తిరుగుబాటు అనేదానికి తమ పార్టీలో చోటులేదని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 43 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. బీజేపీ 74 స్థానాల్లో గెలుపొందగా.. ఆర్జేడీ 75 స్థానాలతో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుతం శాసనసభలో విపక్ష కూటమికి 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అధికారపక్షానికి 127 మంది సభ్యులు ఉన్నారు. (బీజేపీలో చేరిన జేడీయూ ఎమ్మెల్యేలు) మరోవైపు ఎన్డీయే కూటమికి గుడ్బై చెప్పి తమతో చేతులు కలపాలని ఇటీవల ఆర్జేడీ నితీష్ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. తేజస్వీ యాదవ్కు బిహార్ సీఎం పగ్గాలు అప్పగిస్తే రానున్న (2024) పార్లమెంట్ ఎన్నికల్లో విపక్ష కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా నితీష్ను ఎన్నుకుంటామని ప్రకటించింది. ఈ మేరకు ఆర్జేడీ సీనియర్ నేత ఉదయ్ నారాయణ్ చౌదరీ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నితీష్ కుమార్ ఇంకా బీజేపీ మైనర్ భాగస్వామ్య పక్షంగా ఉండాల్సిన పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా అరుణాచల్ ప్రదేశ్లో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరడం ఇరు పార్టీల మధ్య వైరుధ్యానికి దారితీసింది. ఓ రాష్ట్రంలో భాగస్వామ్య పక్షంగా ఉండి మరో రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేలపై గాలం వేయడం రాజనీతి కాదని జేడీయూ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. -
ఎన్డీయేలో టెన్షన్.. ప్రధాని అభ్యర్థిగా నితీష్!
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్లో ఏర్పడిన బీజేపీ-జేడీయూ స్నేహ బంధానికి బీటలువారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్లో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేరడం ఇరు పార్టీల మధ్య వైరుధ్యానికి దారితీసింది. ఓ రాష్ట్రంలో భాగస్వామ్య పక్షంగా ఉండి మరో రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేలపై గాలం వేయడం రాజనీతి కాదని జేడీయూ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిహార్ వేదికగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు దేశ రాజకీయ చిత్రంలో కొత్త కూటమికి దారి తీసే విధంగా కనిపిస్తున్నాయి. జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను ఎన్డీయే కూటమి నుంచి వెనక్కి తీసుకొచ్చేలా ప్రతిపక్ష ఆర్జేడీ ప్రణాళికలు రచిస్తోంది. అపర చాణికుడ్యిని తమ వైపుకు తిప్పకుంటే ఇక తమకు తిరుగేలేదని భావిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దెబ్బకు భంగపడ్డ నితీష్ కుమార్ను చేరదీసేందుకు ఆర్జేడీ నేతలు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే ఆర్జేడీ సీనియర్ నేత ఉదయ్ నారాయణ్ చౌదరీ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. (వైదొలిగిన నితీష్.. కొత్త వ్యక్తికి బాధ్యతలు) బీజేపీకి గుడ్బై చెప్పి.. తమతో చేతులు కలపాలని సీఎం నితీష్ కుమార్కు నారాయణ్ చౌదరీ సలహా ఇచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి పీఠం తేజస్వీ యాదవ్కు అప్పగిస్తే.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నితీష్ను ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకుంటామని బంపరాఫర్ ఇచ్చారు. విపక్ష నేతలందరితో చర్చించి 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. దానికి ఆర్జేడీ సిద్ధంగా ఉందని, నితీష్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే ఆర్జేడీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నితీష్ కుమార్ఇంకా బీజేపీ మైనర్ భాగస్వామ్య పక్షంగా ఉండాల్సిన పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. (బీజేపీలో చేరిన జేడీయూ ఎమ్మెల్యేలు) భవిష్యత్లోనూ బీజేపీతో కలిసే ఉండే జేడీయూను పూర్తిగా దెబ్బతీస్తారని జోస్యం చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వీ యాదవ్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకు సీఎం పగ్గాలు అప్పగించాలని కోరారు. కాగా మొన్నటి వరకు జేడీయూ అధ్యక్షుడిగా కొనసాగిన నితీష్.. ఇటీవల ఆ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. మరో సీనియర్ నేత ఆర్సీపీ సింగ్కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామం జరిగిన గంటల వ్యవధిలోనే నితీష్ కుమార్ మరో బాంబు పేల్చారు. ముఖ్యమంత్రి పదవి తనకు అక్కర్లేదన్నారు. తనకు ఈ పదవిపై ఏ మాత్రం వ్యామోహం లేదని.. బీజేపీ నేతల ఒత్తిడి మేరకే సీఎం బాధ్యతలు చేపట్టానని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నితీష్ వ్యాఖ్యలు ఎన్డీఏ కూటమిలో కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్జేడీ ఇచ్చిన ఆఫర్ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆర్జేడీ రాజకీయ వ్యూహాలను బీజేపీ నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు. -
వైదొలిగిన నితీష్.. కొత్త వ్యక్తికి బాధ్యతలు
పట్నా : బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజకీయపరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జేడీయూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ఉన్నతాధికారి ఆర్సీపీ సింగ్కు జేడీయూ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. 2019లో పార్టీ చీఫ్గా తిరిగి ఎన్నికైన నితీష్ పదవీకాలం 2022 వరకు ఉన్నప్పటికీ ముందే తప్పుకున్నారు. అయితే ముఖ్యమంత్రిగా, పార్టీ పెద్దగా బాధ్యతలు ఒక్కరి వద్దే ఉండటం సరైనది కాదని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి నితీష్ తప్పుకున్నారు. ఈ మేరకు ఆదివారం పట్నాలో నిర్వహించిన జేడీయూ ముఖ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. (నితీష్కు షాకిచ్చిన జేడీయూ ఎమ్మెల్యేలు) కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆర్సీపీ సింగ్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్నారు. రెండుసార్లు పెద్దల సభకు ఎంపికైన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాకుండా నితీష్ కుమార్కు అత్యంత సన్నిహితుడు కావడంతో పాటు గతంలో జేడీయూ ప్రభుత్వంలో పలు కీలక విభాగాల్లోనూ ఆయన పనిచేశారు. అనంతరం నితీష్ పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి జేడీయూలో చేరారు. ఎన్నికలతో పాటు పాలనలో నితీష్కు వ్యహకర్తగా వ్యవహరిస్తున్నారు. దీంతో జేడీయూ అధ్యక్షుడిగా ఆర్సీపీ సరైన వ్యక్తిగా భావించిన నితీష్.. పార్టీ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఇదిలావుండగా.. అరుణాచల్ ప్రదేశ్లో జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడంతో జేడీయూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. బీజేపీకి ఇది సరైనది కాదని ఆ పార్టీ సీనియర్ నేత కేసీ త్యాగి విమర్శించారు. ఓ రాష్ట్రంలో స్నేహం చేస్తూ మరో రాష్ట్రంలో ద్రోహం చేయడం సరైన విధానం కాదని హితవు పలికారు. ఇది ఇరు పార్టీల మధ్య సఖ్యతను దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే బెంగాల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఒంటరిగా బరిలో నిలుస్తుందని కేసీ త్యాగి వెల్లడించారు. -
నితీష్కు షాకిచ్చిన జేడీయూ ఎమ్మెల్యేలు
సాక్షి, న్యూఢిల్లీ : జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఊహించని షాక్ ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఆరుగురు జేడీయూ శాసనసభ్యులు అధికార బీజేపీలో చేరారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ అధికార ప్రకటన చేశారు. 2019లో జరిగిన అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ ఏడు స్థానాల్లో విజయం సాధించింది. అనంతరం బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. అయితే గతకొంత కాలంగా ఇరు పార్టీల స్థానిక నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే జేడీయూకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. మొత్తం 60 మధ్య సభ్యులు గల అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలో జేడీయూ ఎమ్మెల్యేల చేరికతో బీజేపీ బలం 48కి చేరింది. (మాటల యుద్ధం.. ఆ దమ్ముందా: ప్రశాంత్) ఇక ఏకైక సభ్యుడు గల పీపుల్స్ పార్టీ ఆఫ్ ఆరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సభలో ప్రస్తుతం కాంగ్రెస్ నలుగురు, నేషనల్ పీపుల్స్ పార్టీకి నలుగురు సభ్యుల బలం ఉంది. కాగా బిహార్లో బీజేపీ మద్దతు నితీష్ కుమార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే అరుణాచల్ ప్రదేశ్ వ్యవహరంలో బిహార్ జేడీయూ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమపార్టీకి చెందిన సభ్యులను బీజేపీ మభ్యపెట్టిందని ఆరోపిస్తున్నారు. దీనిపై నితీష్ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. -
నితీష్ కుమార్కు ఆర్జేడీ ఆఫర్
పట్నా : బీజేపీ నామినేటెడ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ తమతో చేతులు కలపాలని ఆర్జేడీ సీనియర్ నేత అమర్నాథ్ గమీ వ్యాఖ్యానించారు. ఎన్డీయే కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సీఎం పీఠంలో నితీష్ కుమార్కు కూర్చోబెట్టడం వెనుక పెద్ద కుట్రదాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రానున్న కొద్దికాలంలోనే నితీష్ ప్రభుత్వం కూలిపోతుందని తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాఘట్బందన్ బిహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసితీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్నాలో సోమవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీ పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీదే విజయమని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఎన్నికైనప్పటికీ అధికారమంతా బీజేపీ నేతల చేతుల్లోనే ఉంటుందన్నారు. ఎలాంటి అధికారాలు లేని సీఎం పీఠంలో నితీష్ ఉండి ఉపయోగంలేదన్నారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి తమతో చేతులు కలపాలని కోరారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలోనూ బీజేపీ ప్రత్యామ్నాయ కూటమికి నాయకత్వం వహించాలని అమర్నాథ్ సూచించారు. కాగా ఇటీవల వెలువడిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. 75 స్థానాలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించగా.. బీజేపీ 74, జేడీయూ 43 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే కూటమిలో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ సీఎం పీఠం మాత్రం జేడీయూకి అప్పగించింది. దీనిపై జాతీయ స్థాయిలో వివిధ రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయిన్పటికీ ముందు కుదిరిన ఒప్పందంలో భాగంగానే నితీష్ను సీఎంగా ఎన్నుకున్నామని బీజేపీ చెబుతోంది. -
బాధ్యతలు చేపట్టిన కాసేపటికే రాజీనామా
పట్నా: బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే బిహార్ విద్యా శాఖ మంత్రి రాజీనామా చేశారు. జేడీయూ నేత మేవా లాల్ చౌధరి గురువారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఆయనకు మంత్రి పదవి ఇచ్చారన్న విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. చౌధరి రాజీనామాను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సిఫారసు మేరకు, గవర్నర్ ఫగు చౌహాన్ ఆమోదించారు. కొన్నేళ్ల క్రితం ఒక వ్యవసాయ వర్సిటీకి వీసీగా ఉన్న సమయంలో అక్కడ నియామకాల విషయంలో అక్రమాలు జరిగాయని ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాసేపటికి చౌధరి వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణలకు సంబంధించి తనను ఏ కోర్టు కూడా దోషిగా తేల్చలేదని, ఏ దర్యాప్తు సంస్థ కూడా తనపై చార్జిషీటు దాఖలు చేయలేదని వివరించారు. ‘వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్గా నియామకాల విషయంలో నేను నేరుగా పాలు పంచుకోలేదు. నిపుణుల కమిటీకి చైర్మన్గా మాత్రమే ఉన్నాను’ అని తెలిపారు. రాజీనామా చేసేముందు చౌధరి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో కాసేపు భేటీ అయ్యారు. -
మూన్నాళ్ల ముచ్చట.. మంత్రి రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ విద్యాశాఖ మంత్రి మేవాలాల్ చౌదరి తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా మూడు రోజుల కిందట బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పాటు 14 మంది మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఇందులో భాగంగా తారాపూర్ నియోజకవర్గం నుంచి జేడీయూ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన మేవాలాల్ చౌదరికి విద్యా శాఖను కేటాయించారు. కాగా గతంలో ఆయన భాగల్పూర్ వ్యవసాయ వర్సిటీకి వైస్ చాన్సలర్గా పని చేశారు. ఆ సమయంలో వర్సిటీ పరిధిలో నిర్మించిన పలు భవనాల విషయంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేగాకుండా లంచం తీసుకుని అర్హతలేని వారికి యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ శాస్త్రవేత్తలుగా నియమించారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేవాలాల్కు మంత్రి పదవి కట్టబెట్టడం పట్ల ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తన పదవిని కాపాడుకునేందుకు నితీశ్ అవినీతిపరులకు కేబినెట్లో చోటు కల్పించారంటూ ఆర్జేడీ నేతలు ఆరోపించారు. (చదవండి: వీడియో వైరల్.. నెటిజన్ల విమర్శలు) ఇక ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మేవాలాల్ చౌదరి జాతీయ గీతం తప్పుగా ఆలపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. "పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా" కు బదులుగా "పంజాబ్ వసంత గుజరాత్ మరాఠా" అని పాడటంతో ప్రతిపక్షాలు సహా నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అవినీతి కేసుల మంత్రికి జాతీయ గీతం కూడా ఆలపించడం రాదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలాంటి తరుణంలో మేవాలాల్ చౌదరి రాజీనామా చేయడం గమనార్హం. (చదవండి: బిహార్: మంత్రులకు శాఖల కేటాయింపు) -
బిహార్: మంత్రులకు శాఖల కేటాయింపు
పట్నా : బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నీతిష్ కుమార్ ముఖ్యమంత్రిగా సోమవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆయనతో పాటు 14 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మంత్రి మండలిలో బీజేపీకి 7, జేడీయూకి 5 పదవులు దక్కాయి. హెచ్ఏఎం, వీఐపీలు కూడా మంత్రిమండలిలో స్థానం సంపాదించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రులకు శాఖలు కేటాయిస్తూ సీఎం నితీశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. కీలకమైన హోంశాఖతో పాటు ప్రజా పరిపాలన, విజిలెన్స్ వంటి శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్న ముఖ్యమంత్రి, రేణూ దేవి, తార్ కిషోర్లను డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారు. కాగా రేణూ దేవి గతంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పని చేశారు. ఇక నితీశ్ కేబినెట్లో స్థానం సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం పంచాయతీ రాజ్, సంక్షేమం, పరిశ్రమల శాఖలకు మంత్రిగా వ్యవహరించనున్నారు. నితీశ్ సీఏంగా ఉన్న 15 ఏళ్లలో ఎక్కువ కాలం ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిన సుశీల్ మోదీ స్థానంలో రేణూ దేవి, తార్ కిషోర్కు ఈసారి అవకాశం కల్పించడం గమనార్హం. తార్ కిషోర్ ఆర్థిక, వాణిజ్య పన్నులు, పర్యావరణం, అటవీ, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ , పట్టణాభివృద్ధి శాఖలను పర్యవేక్షించనున్నారు. ఇక మంగళవారం జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో నవంబర్ 23 నుండి నవంబర్ 27 వరకు ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశానికి నూతన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పడిన 17వ అసెంబ్లీ సభ్యులు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.(చదవండి: బిహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి) మాజీ స్పీకర్ విజయ్ కుమార్ చౌదరి (జేడీ-యు)- గ్రామీణ ఇంజనీరింగ్, గ్రామీణాభివృద్ధి, నీటి వనరులు, సమాచారం , ప్రజా సంబంధాలు, పార్లమెంటరీ వ్యవహారాలు బిజేంద్ర ప్రసాద్ యాదవ్(బీజేపీ)- ఇంధన, నిషేధ, ప్రణాళిక, ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు మేవాలాల్ చౌదరి (జేడీ-యు)- విద్యా శాఖ షీలా కుమారి(బీజేపీ)- రవాణా శాఖ మాజీ సీఎం, హెచ్ఏఎం అధినేత జితన్ రామ్ మాంజి కుమారుడు సంతోష్ కుమార్ సుమన్- చిన్న నీటిపారుదల , ఎస్సీ / ఎస్టీ సంక్షేమ శాఖలు ముఖేష్ సాహ్ని(వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ- వీఐపీ)- పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. మంగల్ పాండే (బీజేపీ)- ఆరోగ్య, రహదారి, కళా సంస్కృతి శాఖ అమ్రేంద్ర ప్రతాప్ సింగ్(బీజేపీ)- వ్యవసాయం, సహకార సంస్థలు రాంప్రీత్ పాశ్వాన్- ప్రజారోగ్య, ఇంజనీరింగ్ శాఖ జీవేశ్ మిశ్రా(బీజేపీ)- పర్యాటక, కార్మిక, గనుల శాఖ రామ్ సూరత్ రాయ్- రెవెన్యూ, న్యాయ శాఖ -
నితీష్పై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్
పట్నా : దేశ వ్యాప్తంగా రాజకీయ వేడి రగిల్చిన బిహార్లో నేడు (సోమవారం) కీలక ఘట్టం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కూటమిలో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ.. జేడీయూ అధినేత నితీష్ కుమార్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం నితీష్తో పాటు 14 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. బిహార్ రాజకీయాల్లో చాణిక్యుడిగా పేరొందిన నితీష్.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక సీఎంగా ఎన్నికైన నితీష్కు దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. ఎన్డీయే పక్షాలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం అభినందనలు తెలియజేస్తున్నారు. (సోదరుడికి చెక్.. బీజేపీతో పొత్తుకు సై!) ఈ క్రమంలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సైతం నితీష్కు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంగా ఎన్నికై నితీష్ను అభినందిస్తూనే సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేసిన ప్రశాంత్ కిషోర్ ‘బీజేపీ నామినేటేడ్ ముఖ్యమంత్రి నితీష్కు శుభాకాంక్షలు. సీఎంగా అలసిపోయి, రాజకీయంగా వెనుబడిన ముఖ్యమంత్రి (నితీష్) పాలనను భరించేందుకు బిహార్ ప్రజలు మరో కొనేళ్ల పాటు సిద్ధంగా ఉండాలి’ అంటూ ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. (నితీష్ కుమార్ సీఎం కుర్చీకి ముప్పు!?) కాగా గతంలో నితీష్ కుమార్కు మద్దతుగా నిలిచిన ప్రశాంత్ కిషోర్ గత ఏడాది ఆయనతో విభేదించిన విషయం తెలిసిందే. దీంతో జేడీయూ ఉపాధ్యక్ష పదవి నుంచి ప్రశాంత్ను తొలగిస్తూ నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీతో కలిసి పోటీచేయాలన్న నితీష్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంపైనే ఇద్దరి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో విపక్షాలకు మద్దతుగా ప్రచారం చేస్తారనుకున్న ప్రశాంత్.. మౌనంగా ఉన్నారు. ఎట్టకేలకు నాలుగు నెలల అనంతరం తొలిసారి నితీష్పై స్పందించారు. -
నితీష్ కుమార్ సీఎం కుర్చీకి ముప్పు!?
సాక్షి, న్యూఢిల్లీ : నితీష్ కుమార్ ఈ రోజు (సోమవారం) సాయంత్రం బిహార్ ముఖ్యమంత్రిగా ఏడవ సారి పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగినట్లయితే బిహార్ రాష్ట్రానికి అత్యధిక కాలంపాటు కొనసాగిన ముఖ్యమంత్రిగా కొత్త చరిత్రను సష్టిస్తారు. ఓ రాష్ట్రానికి అత్యధిక కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేయడం అన్నది మామూలు విషయం కాదు. అందున అగ్రవర్ణ కులం నుంచో లేదా రాష్ట్రంలో ప్రాబల్యం ఎక్కువగా ఉన్న యాదవ కుటుంబం నుంచి కాకుండా ఓ కుర్మి సామాజిక వర్గానికి చెందిన నితీష్ కుమార్ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగడం మామూలు విషయం కాదు. బిహార్ రాష్ట్ర జనాభాలో కేవలం రెండు శాతం మాత్రమే ఉన్న కుర్మీ కమ్యూనిటీ నుంచి ఈ స్థాయికి నితీష్ ఎదగడమే ఓ గొప్ప విషయం. నితీష్ కుమార్ ప్రాతినిథ్యం వహిస్తోన్న జేడీయూ రాష్ట్ర ఎన్నికల్లో ఎన్నడూ కూడా తనంతట తాను మెజారిటీ సీట్లను సాధించలేదు. ఈసారి సీట్లు, ఓట్ల శాతం మరింత తగ్గిపోయింది. ఆ పార్టీకి ఈసారి 15.4 శాతం ఓట్లతో కేవలం 43 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. గత ఎన్నికల్లో 71 సీట్లను సాధించింది. ఈసారి జనతాదళ్కంటే బీజేపీకి అదనంగా 30 సీట్లు రావడం విశేషం. ఈ నేపథ్యంలోనే ఈసారి ముఖ్యమంత్రి పదవి నుంచి నితీష్ కుమార్ తప్పించి ఆ స్థానంలో బీజేపీ సీనియర్ నాయకులకు ప్రాతినిథ్యం కల్పిస్తారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా బిహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం కూడా ఆ ప్రచారానికి తోడ్పడగా, అందుకనుగుణంగా నితీష్ కుమార్ శకం ముగిసట్లేనంటూ బీజేపీ సీనియర్ నాయకులు కూడా వ్యాఖ్యానాలు చేశారు. అందుకు భయపడో, మరెందుకోగానీ ఇదే తన చివరి ఎన్నికలంటూ ప్రచారం చేయడం ద్వారా ప్రజల సానుభూతిని పొందేందుకు నితీష్ ప్రయత్నించారు. ఏదయితేనేం, అతిపెద్ద పార్టీలుగా బిహార్లో ఆవిర్భవించిన బీజేపీ, ఆర్జేడీలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేటన్ని సీట్లు సాధించలేక పోయాయి. మిత్రపక్షాలతో కలసి బీజీపీకి ప్రభుత్వం ఏర్పాటుకు స్పష్టమైన మెజారిటీ లభించింది. బీజీపీ తాను సొంతంగా కాకుండా నితీష్ కుమార్నే ముఖ్యమంత్రిగా కొనసాగించాలనే తెలివైన నిర్ణయం తీసుకుంది. నితీష్ కాదంటే ఆయన ఆర్జేడీ–కాంగ్రెస్ కూటిమికి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రత్యామ్నాయ ప్రభుత్వంలో చేరే అవకాశం స్పష్టంగా ఉండింది. దాన్ని అడ్డుకోవడంలో భాగంగానే బీజేపీకి నితీష్ను సీఎంగా చేయక తప్పలేదు. అయినంత మాత్రాన ఐదేళ్లపాటు నితీష్ను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగించే ఉద్దేశం బీజేపీ అధిష్టానంకు లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. నితీష్ను సీఎం పదవి నుంచి తప్పించినా కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి నుంచి ముప్పు ఉండకుండా ఉండేందుకు ఆ పార్టీల నుంచే కాకుండా, నితీష్ పార్టీ నుంచి సభ్యుల వలసను బీజేపీ స్వీకరిస్తుందని, తద్వారా తానే అధికార పగ్గాలు స్వయంగా స్వీకరించే పరిస్థితిని సష్టించుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక నితీష్ పూర్తికాలం సీఎం పదవిలో కొనసాగరన్నది వారి వాదన. -
డిప్యూటీ సీఎం పదవిపై ఉత్కంఠ
పట్నా : బిహార్లో నూతన ప్రభుత్వం కొలువుదీరేందుకు ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. ఎన్డీయే కూటమి తరుఫున ముఖ్యమంత్రిగా జేయూడీ అధినేత నితీష్ కుమార్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది మంత్రులు సైతం ప్రమాణం చేసే అవకాశం ఉంది. అయితే బిహార్ డిప్యూటీ సీఎం పదవిపై కొంత ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సుశీల్ మోదీ స్థానంలో ఇద్దరు కొత్త వ్యక్తులను నియమిస్తారని తెలుస్తోంది. వీరిలో ప్రధానంగా బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే తారక్ కిషోర్ ప్రసాద్తో పాటు రేణు దేవి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ నితీష్తో పాటు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు స్వీకర్ పదవి సైతం బీజేపీకే దక్కే అవకాశం ఉంది. (35 ఏళ్లుగా పోటీకి దూరం.. ఏడోసారి సీఎం) అయితే సుశీల్ మోదీ ఎందుకు తప్పుకున్నారు అనేది తెలియాల్సి ఉంది. బీజేపీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం.. డిప్యూటీ సీఎం పదవిపై సుశీల్ అంతగా ఆసక్తి చూపడంలేనట్లు తెలుస్తోంది. అయితే నితీష్ కేబినెట్లో కీలకమైన శాఖలన్నీ బీజేపీకే దక్కే అవకాశం ఉండటంతో మంత్రివర్గంలోనే బలమైన శాఖను కట్టబెడతారనే ప్రచారం కూడా సాగుతోంది. మరోవైపు మంత్రి పదవుల కోసం బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. కాగా 74 స్థానాలు బీజేపీ గెలుచుకోగా.. జేడీయూ 44 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. 76 స్థానాల్లో విజయకేతనం ఎగరేసిన ఆర్జేడీ ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోనుంది. -
35 ఏళ్లుగా పోటీకి దూరం.. ఏడోసారి సీఎం
దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ను కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ముందుగా ఇచ్చిన హామీకి కట్టుబడి నితీష్కే సీఎం పీఠం కట్టబెట్టేందుకు బీజేపీ పెద్దలు ఆమోదం తెలిపారు. దీంతో ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు నితీష్ కుమార్ సిద్ధమయ్యారు. గత 35 ఏళ్లుగా అసెంబ్లీ పోటీగా దూరంగా ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రిగా మాత్రం తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నారు. మూడు దశాబ్ధాలకు పైగా శాసనమండలికి ఎన్నికవుతూ.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తున్నారు. పట్నా : నితీష్ కుమార్ ఇప్పటివరకు బిహార్ ముఖ్యమంత్రిగా ఆరుసార్లు ప్రమాణం చేశారు. 2000 (8 రోజులు), మరోసారి 11 రోజులు, 2005, 2010, 2015లో రెండుసార్లు ప్రమాణం చేశారు. 1977 లో తొలిసారిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హర్నాట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. అనంతరం అదే స్థానం నుంచి 1985 లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఆరుసార్లు గెలిచారు. చివరగా 2004 లో నలంద పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి గెలిచారు. తొలిసారి 2000లో బిహార్ సీఎంగా ఎన్నికయినప్పటికీ ఎనిమిది రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత 2005లో మరోసారి సీఎంగా ప్రమాణం చేసే అవకాశం రావడంతో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక అప్పటి నుంచి కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితమై.. బిహార్ను శాసిస్తున్నారు. తాజాగా ఏడోసారి సీఎంగా ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు. 2014-15లో తొమ్మిది నెలల స్వల్ప కాలం మినహా.. 2005 నవంబర్ నుంచి ఇప్పటి వరకు (2020) బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏర్పడిన రాజకీయ విభేదాలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు సన్నద్దతలో భాగంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సమయంలో ఎస్సీ నేత జీతాన్రాం మాంజీ బిహార్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే మారిన రాజకీయ సమీకరణల కారణంగా నితీష్ కుమార్ 2015 లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి పీఠం మరోసారి అధిష్టించారు. ఈ సారి ఎన్నికల్లో లాలూప్రసాద్తో పొత్తు పెట్టుకుని పూర్తిస్థాయి మెజార్టీ సాధించి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మరోసారి 2017 లో ఎన్డీయేతో మరోసారి జట్టుకట్టారు. బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన బిహార్ అసెంబ్లీలోని ఏ సభలోనూ సభ్యుడు కాదు. దాంతో ఆయన పదవీకాలం ఎనిమిది రోజులు మాత్రమే కొనసాగింది. అప్పుడు ఆయన రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యే అవకాశం లేదు. 2005 నవంబర్లో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కూడా ఆయన ఎమ్మెల్యే కాదు. ఆ తర్వాతి ఏడాది ప్రారంభంలో శాసనమండలికి ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా నితీష్ కుమార్ పదవీకాలం 2012 లో ముగియడంతో.. ఆయనను తిరిగి ఎగువ సభకు ఎన్నుకున్నారు. ‘తనకు ఎగువసభ అంటే అమితమైన గౌరవం, అందుకే ఎమ్మెల్సీగా ఉండటానికి ఇష్టపడతాను అంటూ నితీష్ పలు సందర్భల్లో చెప్పుకొచ్చారు. ఒక నియోజకవర్గంపై తన మొత్తం దృష్టిని పరిమితం చేయకూడదనుకుంటునానని, అందకే తాను అసెంబ్లీకి పోటీ చేయను అంటూ అని 2012 జనవరిలో శాసనమండలి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో నితీష్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత ఆరేండ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికవుతాను అని నవ్వుతూ చెప్పారు. నితీష్ కుమార్ 2018 లో శాసనమండలికి వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2024లో ముగియనుంది. సీఎం పీఠాన్ని మార్చాలని బీజేపీ అనుకోకుంటే అప్పటి వరకు నితీష్ సీఎంగా కొనసాగనున్నారు. బిహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎన్డీయేకి 125 సీట్లు దక్కాయి. ఆర్జేడీ సారధ్యంలోని మహాకూటమికి 110 సీట్లకే పరిమితమైంది. ఎల్జేపీ 1, ఇతరులు 7 చోట్ల విజయం సాధించారు. పార్టీల వారీగా చూస్తే.. 75 సీట్లు గెలిచి ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 74 సీట్లు సాధించగా, జేడీయూ 43 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో విజయం సాధించింది. ఇక, సీపీఐఎంఎల్ 11, ఎంఐఎం 5, హెచ్ఏఎంఎస్ 4, వీఐపీ 4, సీపీఎం 3, సీపీఐ 2, ఎల్జేపీ ఒక స్థానంలో గెలిచాయి. నితీష్ దారిలో ఠాక్రే, యోగీ.. కాగా నితీష్తో పాటు మరో రెండు రాష్ట్రాలకు సైతం ఇద్దరు సీఎంలు మండలి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. గోరఖ్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు లోక్సభ ఎన్నికలలో గెలిచారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఎప్పుడూ సాధారణ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే, ఠాక్రే, యోగి ఆదిత్యనాథ్ ఇద్దరూ ఎగువసభ ద్వారా మొదటిసారి ముఖ్యమంత్రి కావడం విశేషం. -
నితీష్కు చిరాగ్ చికాకు!
పట్నా : గత ఏడాది జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్గా బరిలో దిగిన సీనియర్ నేత సరయూ రాయ్ ఏకంగా సీఎం రఘువర్దాస్పై పోటీ చేసి ఆయనను ఓడించారు. సీఎంను మట్టికరిపించడంతో పాటు బీజేపీ విజయావకాశాలనూ దెబ్బతీసిన సరయూ రాయ్ తరహాలో బిహార్లో చిరాగ్ పాశ్వాన్ నితీష్ కుమార్కు చుక్కలు చూపారు. చిరాగ్ పాశ్వాన్ కారణంగానే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీల తర్వాత జేడీయూ మూడోస్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని జేడీయూ వర్గాలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. రఘవర్దాస్తో పోలిస్తే సీఎం స్ధానం నిలబెట్టుకోవడం మాత్రం నితీష్ కుమార్కు ఊరట ఇస్తోంది. చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ తమను టార్గెట్ చేస్తూ విమర్శల దాడి చేయడంతో జేడీయూ మంత్రులు పలువురు ఓటమి పాలయ్యారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పేర్కొనడం గమనార్హం. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్లతో కలిసి పోటీచేసినప్పుడు జేడీయూ 71 స్ధానాలను గెలుపొందగా తాజా ఎన్నికల్లో ఆ పార్టీ 43 స్ధానాలకు పరిమితమైంది. జేడీయూ అభ్యర్ధులపై తమ అభ్యర్ధులను నిలపడం చిరాగ్ నిర్ణయమా లేక ఇతరుల ప్రోద్బలంతో జరిగిందా అనేది చెప్పలేమని, కేంద్రంలో నరేంద్ర మోదీ తదుపరి కేబినెట్ విస్తరణలో ఈ దిశగా స్పష్టత వస్తుందని జేడీయూ సీనియర్ నేత చెప్పుకొచ్చారు. ఎల్జేపీ అభ్యర్ధులంతా ఏ కూటమితో కలవకుండా ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటారని, ప్రతి జిల్లాలోనూ తమ పార్టీ పటిష్టంగా ఉందని ఎన్నికల ఫలితాల అనంతరం చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. జేడీయూకు వ్యతిరేకంగా ఎల్జేపీ ప్రచారం సాగించడంతో పాలక పార్టీ ఊహించిన విధంగానే భారీ ఎదురుదెబ్బ తగిలింది. -
నితీష్ ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే..
పట్నా : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరోసారి బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. దీపావళి తర్వాత నవంబర్ 16న సీఎంగా నితీష్కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ కన్నా తక్కువ స్థానాల్లో జేడీయూ గెలిచినప్పటికీ.. ముందే కుదిరిన అంగీకారం మేరకు నితీష్ కుమారే సీఎంగా ఉంటారని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో ఏడోసారి జేడీయూ నేత నితీష్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా తనకు అఖండ విజయం అందించిన ప్రజలకు, ఇందుకు సహకరించిన ప్రధాని మోదీకి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. (నితీష్ కుమారే బీహార్ సీఎం: ఎన్డీయే) ఇక ప్రభుత్వ ఏర్పాటు విషయమై జేడీ(యూ) కోర్ కమిటీ నిన్నరాత్రి బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించింది. ఈ ఎన్నికల్లో జేడీయూతో పోలిస్తే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీ మంత్రివర్గంలో అధిక వాటాను, కీలక శాఖలను డిమాండ్ చేసే అవకాశముంది. కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 125 కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో బీజేపీ 74 స్థానాలు, జేడీయూ 43 స్థానాలు గెలుచుకుంది. గట్టిపోటీనిచ్చిన ఆర్జేడీ నాయకత్వంలోని విపక్ష మహా కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకుంది. (నితీష్ సీఎం అయితే మాదే క్రెడిట్: శివసేన) -
సవాళ్లను ఎదుర్కొని గెలిచిన ఎన్డీయే
పట్నా: 15 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను, ఇటీవల వేరుపడిన మిత్రపక్షం ఎల్జేపీ శత్రుత్వాన్ని, ఆర్జేడీ యువనేత సారధ్యంలోని విపక్షాన్ని విజయవంతంగా ఎదుర్కొని బిహార్లో ఎన్డీయే మరోసారి అధికారంలోకి రానుంది. 243 సీట్ల అసెంబ్లీలో, మెజారిటీ మార్క్ 122 కన్నా కేవలం 3 స్థానాలు అధికంగా సాధించి, మరోసారి బిహార్ గద్దెనెక్కనుంది. గట్టిపోటీనిచ్చిన ఆర్జేడీ నాయకత్వంలోని విపక్ష మహా కూటమి 110 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ విజయంతో వరుసగా నాలుగోసారి జేడీయూ నేత నితీశ్కుమార్ సీఎం కానున్నారు. 2015 ఎన్నికల్లో 71 సీట్లు సాధించిన జేడీయూ ఈ ఎన్నికల్లో 43 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. 2015లో నితీశ్ బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగంగా ఎన్నికల్లో పోటీ చేశారు. మిత్రపక్షం జేడీయూ కన్నా ఎక్కువ స్థానాల్లో(74) గెలిచినా.. ముందే కుదిరిన అంగీకారం మేరకు నితీశ్కుమారే సీఎంగా ఉంటారని బీజేపీ స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో జేడీయూ ఆశించినన్ని స్థానాలను గెలవలేకపోవడం వెనుక మాజీ మిత్రపక్షం ఎల్జేపీ హస్తం ఉంది. ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ను అంగీకరించినప్పటికీ.. ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీ మంత్రివర్గంలో అధిక వాటాను, కీలక శాఖలను డిమాండ్ చేసే అవకాశముంది. ఎంఐఎం, బీఎస్పీ, ఆర్ఎల్ఎస్పీల ‘మహా ప్రజాస్వామ్య, లౌకిక కూటమి’ ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మహా కూటమి విజయావకాశాలను బాగా దెబ్బతీసిందని, ముఖ్యంగా ముస్లిం ఓట్లను ఈ కూటమి చీల్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
12 ఓట్లతో గెలుపు, అన్నీ అనుమానాలే!
పట్నా: ఉత్కంఠ రేపిన బిహార్ ఎన్నికల ఫలితాల్లో జేడీయూకి ఓ చోట అనూహ్యం విజయం దక్కింది. హిల్సా నియోజకవర్గంలో జేడీయూ అభ్యర్థి కృష్ణ మురారీ శరణ్ 12 ఓట్ల మెజారిటీతో ఆర్జేడీ అభ్యర్థి ఆర్తీ మునిపై విజయం సాధించారు. మురారీకి 61,848 ఓట్లు రాగా, మునికి 61,836 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఇదే విషయాన్ని పేర్కొన్నారు. అయితే, ఆర్జేడీ మాత్రం ఇవన్నీ తప్పుడు లెక్కలని ఆరోపణలకు దిగింది. తొలుత తమ అభ్యర్థి ముని 547 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారని రిటర్నింగ్ అధికారి చెప్పి.. మళ్లీ మాట మార్చారని ఆర్జేడీ నేతలు వాదిస్తున్నారు. విన్నింగ్ సర్టిఫికెట్ కూడా ఇస్తామని చెప్పి.. అంతలోనే డ్రామాకు తెరతీశారని విమర్శించారు. (చదవండి: బిహార్ సీఎం పదవిపై ఉత్కంఠ!) సీఎం నితీష్ కుమార్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వచ్చిన తర్వాతే ఇదంతా జరిగిందని ఆర్జేడీ నేతలు విమర్శిస్తున్నారు. ‘తొలుత తమ అభ్యర్థికి 500 పైగా ఓట్ల మెజారిటీ అని చెప్పారు. సీఎం ఆఫీస్ నుంచి కాల్ రాగానే 13 ఓట్ల తేడాతో తమ అభ్యర్థి ఓడిపోయాడని కొత్తగా మాట్లాడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల రద్దు కారణంగా విజయం తారుమారైందని సమర్థించుకుంటున్నారు’అని ఆర్జేడీ నేతలు విమర్శించారు. మరోవైపు జేడీయూ అభ్యర్థికి 232 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాగా.. ఆర్జేడీ అభ్యర్థికి 233 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని ఈసీ తెలిపింది. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని ఈసీ అధికారులు స్పష్టం చేసింది. ఇక తమ కూటమి అభ్యర్థులు 119 చోట్ల విజయం సాధించాల్సి ఉండగా.. 111 మంది మాత్రమే గెలిచారని, ఫలితాలపై అనుమానాలున్నాయని ఆర్జేడీ తెలిపింది. 119 అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. (చదవండి: బీజేపీదే బిహార్)