-
నిజం కాదు: అక్రమం అంతకంటే కాదు!
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ల మధ్య వార్ కొనసాగుతోంది. ట్విటర్ తీసుకునే నిర్ణయాలు ట్రంప్కు వ్యతిరేకంగా ఉండటంతో ఆయన మండిపడుతున్నారు. జూన్ 3వ తేదీన జార్జ్ ఫ్లాయిడ్కు న్యాయం జరగాలంటూ చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ట్రంప్ విడుదల చేసిన వీడియోను కాపీరైట్ సమస్య పేరిట ట్విటర్ తొలిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విటర్ నిర్ణయంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ట్విటర్ చర్యలు డెమోక్రట్స్కు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయన్నారు. ‘‘శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారికి ట్రంప్ సానుభూతి తెలుపుతున్నారు. వాళ్లు(ట్విటర్) రాడికల్ లెఫ్ట్ డెమోక్రట్స్ కోసం పోరాడుతున్నారు. ( బఫెట్ తప్పు చేశారు: ట్రంప్ ) ఒకరి పక్ష్యం వహిస్తున్నారు. సెక్షన్ 230 ప్రకారం ఇది అక్రమం’’ అంటూ ఓ పత్రిక ప్రచురించిన వార్తను ట్రంప్ ట్వీట్ చేశారు. అనంతరం యూఎస్ లా ‘‘ఇంటరాక్టివ్ కంప్యూటర్ సర్వీస్’’ను గుర్తు చేశారు. అయితే దీనిపై ట్విటర్ వేదికగా స్పందించిన ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే .. ‘‘ ట్రంప్ ట్వీట్పై కాపీరైట్ సమస్య వచ్చింది. ఓ వ్యక్తి దానిపై ఫిర్యాదు చేశాడు. అందుకే దాన్ని తొలిగించాము. ఆయన ఆరోపణలు నిజం కాదు.. అక్రమం అంతకంటే కాదు’’ అని పేర్కొన్నారు. -
ట్విటర్ గూటికి గూగుల్ మాజీ సీఎఫ్ఓ
సాక్షి, న్యూఢిల్లీ: ట్విటర్ చైర్మన్ గా గూగుల్ మాజీ సీఎఫ్ఓ పాట్రిక్ పిచెట్ నియమితులయ్యారు. ప్యాట్రిక్ పిచెట్ను బోర్డు ఛైర్మన్గా నియమించినట్లు ట్విటర్ నిన్న ( జూన్ 2, మంగళవారం) ప్రకటించింది. ప్రస్తుత డైరెక్టర్ ఓమిడ్ కోర్డెస్టా స్థానంలో తాజా నియామకం జరిగినట్టు తెలిపింది. ఓమిడ్ స్వతంత్ర డైరెక్టరుగా కొనసాగుతారని ట్విటర్ వెల్లడించింది. ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ జాక్ డోర్సీని కొనసాగించడానికి అనుమతించే ఒప్పందంలో భాగంగానే ఈ నియామకమని భావిస్తున్నారు. ట్విటర్ అతిపెద్ద పెట్టుబడిదారు ఇలియట్ మేనేజ్మెంట్ సంస్థ డోర్సీని తొలగించేందుకు యత్నించిన మూడు నెలల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఛైర్మన్గా, పిచెట్ సంస్థ నిర్వహణ స్థిరత్వానికి, ఆర్థిక సాధికారితపై దృష్టి కేంద్రీకరించనున్నారని అంచనా. మరోవైపు తన నియామకంపై స్పందించిన పిచెట్ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా సంస్థను తీర్చిదిద్దే క్రమంలో తన నియామకమనీ, ట్విటర్ మంచి పాలన పట్ల నిబద్ధతను ప్రదర్శిస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు. కాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ట్విటర్ ఫ్యాక్ట్ చెక్ వివాదంలో ట్విటర్ వైఖరిని పిచెట్ బహిరంగంగా సమర్థించారు. 2008-15 వరకు గూగుల్ సీఎఫ్ఓగా పనిచేసిన పిచెట్, కెనడియన్ వెంచర్ క్యాపిటల్ సంస్థ ఇనోవియా క్యాపిటల్లో సాధారణ భాగస్వామిగా ఉన్నారు. 2015 వరకు ట్విటర్ బోర్డు ఛైర్మన్ గా ఉన్న ఓమిడ్ కూడా గూగుల్ మాజీ ఎగ్జిక్యూటివ్ కావడం విశేషం. -
నేను రెడీ, ఉద్యోగులను లాగొద్దు : ట్విటర్ సీఈఓ
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్, సామాజిక మాధ్యమం ట్విటర్ మధ్య ట్వీట్ల వార్ కొనసాగుతోంది. బిగ్ యాక్షన్ ఉండబోతోంది అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ట్వీట్పై ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే స్పందించారు. ‘ఓ కంపెనీగా, సంస్థ చర్యలకు ఎవరో ఒకరే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు నేను సిద్ధం. దయచేసి నా ఉద్యోగులను ఈ వ్యవహారంలోకి లాగొద్దు. ట్విటర్ కొనసాగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల గురించి తప్పుడు వార్తలు లేదా వివాదాస్పద సమాచారాన్ని ఎత్తి చూపుతూనే ఉంటుంది. మేము ఏవైనా తప్పులు చేస్తే అంగీకరించి సరిచేసుకుంటాము’ అని డోర్సే పేర్కొన్నారు. ‘‘ఫ్యాక్ట్ చెకింగ్ అనేది మమ్మల్ని సత్యానికి మధ్యవర్తిగా చేయదు. మా ఉద్దేశ్యం విరుద్ధమైన ప్రకటనలను గుర్తించి, వివాదంలో ఉన్న సమాచారాన్ని ఎత్తిచూపడం మాత్రమే. తద్వారా ప్రజలు తమకు తాముగా ఏది సత్యమో తెలుసుకోవొచ్చు. మా నుండి మరింత పారదర్శకత చాలా కీలకం కాబట్టి మా చర్యల వెనుక ఉన్న కారణాలను ప్రజలు స్పష్టంగా చూసే అవకాశం ఉంటుంది’’ అని డోర్సే ట్వీట్ చేశారు. ట్రంప్ చేసిన ట్వీట్లు రెండింటి కింద ‘నిజానిజాలు నిర్ధారించుకోవాల్సి ఉంది’ అనే ట్యాగ్ను ట్విటర్ తగిలించడం ట్రంప్కు కోపం తెప్పించిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో మెయిల్ ఇన్ బ్యాలెట్లతో అవకతవకలు జరిగే చాన్సుందని ట్రంప్ మంగళవారం ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు దిగువభాగంలో నీలిరంగు ఆశ్చర్యార్థకం చిహ్నాన్ని ట్విట్టర్ తగిలించింది. అంటే అందులోని నిజానిజాలను నిర్ధారించుకోవాల్సి ఉందని అర్థం. దీంతో ట్రంప్కు కోపమొచ్చింది. ‘ట్విట్టర్ అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోంది. మెయిల్ఇన్ బ్యాలెట్లపై నా ప్రకటన సరికాదని వాళ్లు చెబుతున్నారు. ఫేక్ న్యూస్ ప్రసారం చేసే సీఎన్ఎన్, అమెజాన్, వాషింగ్టన్ పోస్ట్ల ఆధారంగా నిజానిజాలను నిర్ధారించుకోమంటున్నారు’ అని ట్విటర్పై ట్రంప్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా సంస్థలనే బంద్ చేయిస్తానంటూ ట్రంప్ చిందులు తొక్కారు. అటువంటి ఎకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకు ఆయనకు అధికారాలు లేకపోయినప్పటికీ ఈ విధంగా తన కోపాన్ని ప్రదర్శించారు. సంప్రదాయిక అభిప్రాయాల గొంతునొక్కేందుకు టెక్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అలా జరిగే లోపే వాటిని కట్టిడి చేసేందుకు, లేదా బంద్ చేసేందుకు చట్టం తీసుకురావాలని యోచిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా చట్టాల ప్రకారం కంపెనీలను మూసేసే చట్టం తీసుకురావాలంటే అందుకు తొలుత చట్ట సభల ఆమోదం కావాలి. ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ సంస్థ అమోదం కూడా అవసరం అవుతుంది. -
కరోనా : ట్విటర్ సంచలన నిర్ణయం
శాన్ఫ్రాన్సిస్కో: కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో సోషల్ మీడియా, టెక్ దిగ్గజం ట్విటర్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులు ఎప్పటికీ వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి సంస్థగా ట్విటర్ అవతరించింది. ట్విటర్ సీఈవో జాక్ డోర్సే మంగళవారం కంపెనీ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకి ఈ-మెయిల్ ద్వారా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా రిమోట్గా పనిచేసుకునే అవకాశమున్న తమ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటినుంచే పనిచేసుకోవచ్చని ట్విటర్ ప్రకటించింది. సెప్టెంబరుకు ముందు చాలా కార్యాలయాలను తిరిగి తెరిచే అవకాశం లేనందున ఆఫీసుకు రావాలా వద్దా అనేది స్వయంగా వాళ్లే నిర్ణయించుకోవచ్చని వెల్లడించింది. ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విటర్ హెచ్ ఆర్ చీఫ్ జెన్నిఫర్ క్రైస్ట్ వెల్లడించారు. ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో ఇది ఊహించని నిర్ణయమని పేర్కొన్నారు. సీఈవో జాక్ డోర్సే 2020 మధ్యలో మూడు నుండి ఆరు నెలల వరకు ఆఫ్రికాకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. కానీ ప్రస్తుత సంక్షోభ కాలంలో దానిని వాయిదా వేసుకున్నారు. (మెగా ప్యాకేజీ : భారీ లాభాలు) మరోవైపు కరోనా , లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికే ఫేస్బుక్, గూగుల్ లాంటి టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులలో చాలా మందిని ఈ సంవత్సరం చివరి వరకు ఇంటినుంచే పనిచేయడానికి అనుమతించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన సన్నాహకాలకుగాను మే 22 న ఒక రోజు సెలవు తీసుకోవాలని ఉద్యోగులను కోరినట్లు గూగుల్ గత వారం తెలిపింది. కాగా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 4.2 మిలియన్లకు పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు. చాలా దేశాలలో కఠినమైన లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ప్రజారవాణా, వ్యాపార వ్యవస్తలు స్థంభించిపోయీయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల పరిస్థితులలో, పనివేళ్లలో కీలక మార్పుల చోటు చేసుకోనున్నాయి. -
కరోనా : ట్విటర్ సీఈఓ భారీ విరాళం
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారిపై పోరుకు మద్దుతుగా ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో జాక్ డోర్సే ముందుకొచ్చారు. కరోనా సంక్షోభ సమయంలో తన వంతు బాధ్యతగా వంద కోట్ల (ఒక బిలియన్) డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కోవిడ్-19 సహాయక చర్యలకు మద్దతుగా ఈ నిధులను అందిస్తున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. తన సంపదలో 28 శాతం తన ఛారిటీ సంస్థ స్టార్ట్ స్మాల్ ఎల్ఎల్సి ద్వారా గ్లోబల్ కోవిడ్ -19 రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్టు డోర్సే ట్వీట్ చేశారు. ప్రజలకు సహాయపడటానికి ఈ రోజు మనం చేయగలిగినదంతా చేద్దామని, తన నిర్ణయం ఇతరులకు ప్రేరణగా నిలవాలని ఆశిస్తున్నానంటూ వరుస ట్వీట్లలో వెల్లడించారు. డిజిటల్ పేమెంట్ గ్రూప్నకు సంబంధించిన తన వాటా నుంచి ఈ మొత్తాన్ని బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం జాక్ డోర్సీ ఆదాయం 3.3 బిలియన్ డాలర్లు. తన సంపదలో నాలుగింట ఒక వంతు మొత్తాన్ని అతని ఛారిటీ ఫండ్కు విరాళంగా ఇస్తానని, అన్ని విరాళాల వివరాలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుంటాంటూ దీనికి సంబంధించిన లింక్ ను కూడా షేర్ చేశారు జాక్ డేర్సే. ఈ మహమ్మారి నుంచి బయటపడిన అనంతరం తాము కనీస ఆదాయం పథకం, బాలికల ఆరోగ్యం , విద్యపై దృష్టిని కేంద్రీకరిస్తామని చెప్పారు. I’m moving $1B of my Square equity (~28% of my wealth) to #startsmall LLC to fund global COVID-19 relief. After we disarm this pandemic, the focus will shift to girl’s health and education, and UBI. It will operate transparently, all flows tracked here: https://t.co/hVkUczDQmz — jack (@jack) April 7, 2020 -
వారానికి ఏడుసార్లే. మరోసారి వార్తల్లో ట్విటర్ సీఈవో
సెలబ్రెటీల జీవన విధానాలు తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా ట్విటర్ సీఈవో జాక్ డోర్సీ మరోసారి తన ఆరోగ్యం, ఆహారంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తను వారానికి ఏడుసార్లు మాత్రం భోజనం చేస్తానని వెల్లడించి వార్తల్లో నిలిచాడు. డార్సే బుధవారం యూట్యూబ్ యూజర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అలాగే ఆహార నియమాల గూర్చి మరోసారి ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. తాను వారంలో ఏడు సార్లు భోజనం చేస్తానని..అది కూడా రాత్రి డిన్నర్ మాత్రమే చేస్తానని తెలిపారు. దైనందిన జీవన శైలిలో యోగ విపాసనను పాటిస్తానని..అప్పుడప్పుడు ఉపవాసాలు కూడా ఉంటానని తెలిపాడు. తాను నిత్యం ఐస్ బాత్తో (మంచు) స్నానం చేసి రెండు గంటల పాటు ధ్యానం చేస్తానని అన్నాడు. ఈ సందర్భంగా చాలా ప్రశ్నలు ఎడిట్ బటన్, స్పెల్ చెక్ లాంటి సాంకేతిక అంశాలపై అడిగినప్పటికీ, వ్యక్తిగత ప్రశ్నలు, ఆయన జీవన శైలికి సంబంధించిన అంశాలు ఆసక్తికరంగా మారాయి. కొంత మంది నెటిజన్లు ఆయనపై సెటైర్లు కూడా పేల్చారు. గతంలోవారానికి అయిదుసార్లు అని ప్రకటించిన డోర్సీ, ఇపుడు ఆ కోటాను 7కు పెంచాడని చమత్కరించడం గమనార్హం. తన ఆహారంలో (డిన్నర్) చేపలు, చికెన్, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటానని గత మార్చిలో చెప్పిన విషయం తెలిసిందే. తాను ప్రతి రోజు ఉత్సాహంగా పని చేస్తానని..ఈ నేపథ్యంలోనే మంచంపై ఒరిగిన పది నిముషాల్లోనే నిద్ర తనను పలకిరస్తుందని చెప్పుకొచ్చారు. ప్రతి రోజు విటమిన్ ‘సీ’ ని తీసుకుంటానని అన్నారు. ఉదయం ఐస్బాత్ చేస్తానని దీంతో కేవలం పదిహేను నిముషాల్లోనే తన మెదడు ఉత్సాహవంతంగా పనిచేస్తుందని అన్నారు. సాయంత్రం మరోసారి మూడు నిమిషాల పాటు ఐస్ బాత్ చేసి సేద తీరుతానని డోర్సీ తెలిపారు. చదవండి: ట్విటర్ సీఈవో అకౌంట్ హ్యాక్ -
రాజకీయ ప్రచారానికి ట్విట్టర్ నో!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ వేదికపై రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. వాణిజ్య ప్రకటనలకు ట్విట్టర్ శక్తిమంతమైన వేదికైనప్పటికీ రాజకీయాల విషయానికి వచ్చేసరికి ఎన్నో సమస్యలున్నాయని, ఓటర్లను ప్రభావితం చేసేందుకు వాడుకుంటే కోట్లాదిమందిపై ప్రభావం పడుతుందని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ చెప్పారు. -
ట్విటర్ సంచలన నిర్ణయం
సోషల్మీడియా దిగ్గజం ట్విటర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఫేక్న్యూస్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ప్రకటనలు, రాజకీయ ప్రకటనలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో అన్ని రాజకీయ ప్రకటనలను తన వేదిక నుండి నిషేధించింది. వచ్చే నెల నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. తన వేదికపై రాజకీయ ప్రకటనలను నిషేధిస్తుందని ట్విటర్ చీఫ్ఎగ్జిక్యూటివ్ జాక్ డోర్సే బుధవారం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో అన్ని రాజకీయ ప్రకటనలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాము. రాజకీయ సందేశాలు ప్రజలకుచేరాలి తప్ప కొనకూడదు" అని డోర్సే ట్వీట్ చేశారు. ఈ విధానం గురించి మరిన్ని వివరాలను నవంబర్ 15న వెల్లడిస్తామని, నవంబర్ 22 వ తేదీ నుంచి అన్ని రాజకీయ ప్రకటనలను అంగీకరించడం మానేస్తామని డోర్సే చెప్పారు. మరోవైపు ట్విటర్ తీసుకున్న ఈ నిర్ణయం డెమొక్రాట్ల ప్రశంసంలందుకోగా డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచార కమిటీ అపహాస్యం చేయడం గమనార్హం. We’ve made the decision to stop all political advertising on Twitter globally. We believe political message reach should be earned, not bought. Why? A few reasons…🧵 — jack 🌍🌏🌎 (@jack) October 30, 2019 We’ll share the final policy by 11/15, including a few exceptions (ads in support of voter registration will still be allowed, for instance). We’ll start enforcing our new policy on 11/22 to provide current advertisers a notice period before this change goes into effect. — jack 🌍🌏🌎 (@jack) October 30, 2019 -
ట్విటర్ సీఈవో అకౌంట్ హ్యాక్
ట్విటర్ సీఈవో, సహ వ్యవస్థపాకుడు జాక్ డోర్సీ ట్విటర్ ఖాతాకే దిక్కులేకుండా పోయింది. డోర్సీ ఖాతాను శుక్రవారం మధ్యాహ్నం హ్యాక్ చేసిన హ్యాకర్లు వివాదాస్పద ట్వీట్లతో దడ పుట్టించారు. ప్రధానంగా ట్విటర్ ప్రధాన కార్యాలయంలో బాంబు వుందంటూ ట్వీట్ చేయడం కలకలం రేపింది. దీంతోపాటు జాత్యహంకార, దేశ విద్రోహపూరిత కామెంట్లు ఉండటంతో కొంతమంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. దాదాపు 4 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్న ట్విటర్ సీఈవో ఎకౌంట్నే హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్లు భారీ షాకిచ్చారు. స్వయంగా సంస్థ సీఈవో ఖాతాకు భద్రత లోపించడం చర్చనీయాంశమైంది. దాదాపు పదిహేను నిమిషాల పాటు ఆయన ఖాతాను స్వాధీనం చేసుకున్న హ్యకర్లు అనుచిత ట్వీట్లు చేశారు. నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ నిర్దోషి, అమాయకుడంటూ ట్వీట్ చేశారు. నల్లజాతీయులు, యూదుల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ట్విటర్ ప్రధాన కార్యాలయంలో బాంబు ఉందని సూచించే ట్వీట్ కూడా ఉంది. అయితే హ్యాకింగ్ను పసిగట్టిన భద్రతా సిబ్బంది డోర్సీ ఖాతాను వెంటనే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒక గంటలోపు సదరు ట్వీట్లను, రీట్వీట్లను తొలగించారు. కొన్ని ట్విటర్ ఖాతాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసారు.. మరోవైపు డోర్సీ ట్విటర్ ఎకౌంట్ ఎలా హ్యాక్ అయిందన్న దానిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు ట్విటర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. భద్రతా పరిశోధకుడు బ్రియాన్ క్రెబ్స్ మాట్లాడుతూ, సిమ్ మార్పిడి లేదా బాధితుడి ఫోన్ నంబర్ద్వారా హ్యాకింగ్ జరిగినట్టు గుర్తించామన్నారు. మొబైల్ ప్రొవైడర్ భద్రతా లోపం కారణంగా అకౌంట్ తో లింక్ చేసిన ఫోన్ నంబర్ను హ్యక్ చేసారన్నారు. కాగా డోర్సీ ఖాతా హ్యాక్ అవడం ఇదే మొదటిసారి కాదు. 2016లో కూడా ఇలాంటి ఉదంతం చోటు చేసుకుంది. దీంతోపాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ట్విట్టర్ ఖాతాలను కూడా హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. -
ట్విట్టర్కి అల్టిమేటం జారీ చేసిన పార్లమెంటరీ కమిటీ
-
ట్విటర్ సీఈవోపై భగ్గుమన్న బ్రాహ్మణులు
న్యూఢిల్లీ : ట్విటర్ సీఈవో జాక్ డోర్సీ ప్రదర్శించిన ఓ పోస్టర్ వివాదాస్పదమైంది. భారత పర్యటనలో భాగంగా ఇటీవల కొంత మంది మహిళా జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. ఓ ఫొటోకు ఫోజిస్తూ.. ఓ పోస్టర్ను ప్రదర్శించారు. ఈ ఫొటోను ఆ సమావేశానికి హాజరైన ఓ జర్నలిస్ట్ తన ట్విటర్ ఖాతాలో ‘మహిళా జర్నలిస్టులు, రచయితలు, సామాజిక కార్యకర్తలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భాగమయ్యాను. భారత్లో ట్విటర్ అనుభవంపై చర్చించాం. చాలా సంతోషంగా ఉంది.. ఈ సంభాషణను వర్ణించడానికి మాటలు రావడం లేదు’ అని క్యాఫ్షన్గా పేర్కొన్నారు. అయితే ఈ ఫొటోలో జాక్ డోర్సీ ప్రదర్శించిన పోస్టర్లో ‘బ్రాహ్మణిక పితృస్వామ్యం నశించాలి’ అని రాసుంది. దీంతో బ్రాహ్మణుల అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కేవలం వామపక్షవాదులతోనే ఎందుకు సమావేశమయ్యారని నిలదీస్తున్నారు. ట్విటర్ ఒక వర్గానికే కొమ్ము కాస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘాటు కామెంట్లతో స్పందించిన ట్విటర్.. జాక్ డోర్సీ కావాలని ఆ పోస్టర్ ప్రదర్శించలేదని, ఆ సమావేశానికి వచ్చిన ఓ దళిత కార్యకర్త ఆమె అనుభవాలు పంచుకోవడంతో పాటు.. ఆ పోస్టర్ను ఆఫర్ చేయడంతో పట్టుకున్నారని వివరణ ఇచ్చింది. ట్విటర్ అందరి వాదనలు వింటుందని స్పష్టం చేసింది. -
ట్విట్టర్ భలే బీట్ చేసింది!
ట్విట్టర్ తెలియని వారెవరూ ఉండరు. సామాజిక మాధ్యమంలో దీనికెంతో పేరుంది. అయితే కొన్ని క్వార్టర్లుగా కంపెనీ యూజర్ల బేస్ తగ్గి, లాభాలు రాక, నష్టాల్లో మునిగితేలుతోంది. ఈ కంపెనీని అమ్ముదామనుకుని శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, ఆర్థిక నష్టాలను తలకెత్తుకోవడానికి ఏ కంపెనీ ఆసక్తి చూపలేదు. ఆసక్తికరంగా ఎన్నో క్వార్టర్లలో నిరాశపరిచే ఫలితాలను ప్రకటించిన ట్విట్టర్ మొదటిసారి అంచనాలను అధిగమించింది. ఆదాయాలు, రాబడులలో అంచనావేసిన దానికంటే మెరుగ్గా బుధవారం తన ఫలితాలను ప్రకటించింది. ఈ కంపెనీ యాక్టివ్ యూజర్ల బేస్ నెలకు 328 మిలియన్లకు చేరినట్టు ట్విట్టర్ తెలిపింది. ఇది అంచనావేసిన దానికంటే ఏడు మిలియన్లు ఎక్కువని తెలిసింది. అదేవిధంగా గత క్వార్టర్ కంటే కూడా 9 మిలియన్లు ఎక్కువట. అదేవిధంగా కంపెనీ రెవెన్యూలు 548 మిలియన్ డాలర్లుగా ఉన్నాయని కంపెనీ సీఈవో జాక్ డోర్సే ప్రకటించారు. ఒక్క షేరుపై ఆర్జించే ఆదాయం కూడా 11 శాతం ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ రెండూ వాల్ స్ట్రీట్ అంచనావేసిన దానికంటే ఎక్కువని తెలిసింది. అయితే ఒక్కో షేరుపై ఈపీఎస్ 1 శాతం మాత్రమే ఉంటుందని విశ్లేషకులు అంచనావేశారు. అదేవిధంగా రెవెన్యూలు కూడా 511.9 మిలియన్ డాలర్లుగానే ఉంటాయని తెలిపారు. వీరి అంచనాలను ట్విట్టర్ బీట్ చేసింది. రోజువారీ వాడకం వరుసగా నాలుగో క్వార్టర్ లోనూ ఏడాది ఏడాదికి 14 శాతం పెంచుకున్నట్టు కంపెనీ పేర్కొంది. అయితే డైలీ యాక్టివ్ యూజర్ నెంబర్ ను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఫలితాల ప్రకటనాంతరం ప్రీమార్కెట్ ట్రేడింగ్ లో కంపెనీ షేర్లు 11 శాతం పైకి ఎగిశాయి. ట్వీట్లకు తేలికగా రిప్లై ఇవ్వడానికి, సంభాషణ కొనసాగించడానికి కంపెనీ పలు మార్పులను చేపట్టినట్టు డోర్సే చెప్పారు. సెర్చ్, బ్రౌజ్, లైవ్ కంటెంట్ అందించే సామర్థ్యాన్ని పెంచామన్నారు. -
ట్విట్టర్ యూజర్లకు ఆ ఫీచర్ వచ్చేస్తోంది!
సామాజిక మాధ్యమిక సాధనాల్లో ఒకటైన ట్విట్టర్ తన వినియోగదారులకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. యూజర్లు తమ ట్వీట్లను ఎడిట్ చేసుకునేలా అవకాశం కల్పించేందుకు సన్నద్ధమవుతోంది. యూజర్లకు అనుకూలంగా ట్విట్టర్ను మార్చాలని భావించిన కంపెనీ సీఈవో జాక్ డోర్సే ప్రజల అభిప్రాయాల కోసం గురువారం ఓ ట్వీట్ చేశారు. 2017 ట్విట్టర్లో మెరుగుపరచదలిచిన లేదా సృష్టించదగిన అత్యంత ముఖ్యమైన విషయమేమిటని ట్విట్టర్లో కోరారు. దీనికి సమాధానంగా చాలామంది యూజర్లు ఎడిటింగ్ ట్వీట్స్ ఫీచర్ను అందుబాటులోకి తేవాలని కోరారు. అదేవిధంగా ట్వీట్లను ఆర్గనైజ్ చేసుకునేలా అవకాశం కల్పించాలన్నారు. ప్రజాభిప్రాయానికి అనుకూలంగా త్వరలోనే ట్వీట్లను ఎడిట్ చేసుకునే ఫీచర్ను తీసుకొస్తామని డోర్సే పేర్కొన్నారు. ఒకే ట్వీట్పైనే వివిధ వెర్షన్లలో యూజర్లు సమీక్షించాల్సినవసరం కూడా ఉందన్నారు. అదేవిధంగా ట్విట్టర్లో వచ్చే అంశాలపై కూడా పారదర్శకత తీసుకురావడానికి అత్యధిక ప్రాముఖ్యం ఇవ్వాలని యూజర్లు కోరారు. సోషల్ నెట్వర్కింగ్లో ఎక్కువగా పాపులర్ అయిన ట్విట్టర్ ఎన్నికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన యూజర్ల వృద్ధి రేటును మాత్రం పెంచుకోలేకపోతోంది. ప్రజల ట్వీట్ల మేరకు ట్విట్టర్ను రీడిజైన్ చేయాలని భావిస్తోంది. 140 క్యారెక్టర్ లిమిట్ నుంచి వీడియోలను, ఫోటోలను ట్విట్టర్ వైదొలగించింది. సైట్పై లైవ్ 360 డిగ్రీ వీడియోలను నిన్ననే ట్విట్టర్ ఆవిష్కరించింది. Following in the footsteps of Brian Chesky: what's the most important thing you want to see Twitter improve or create in 2017? #Twitter2017 @jack Ability to edit tweets and organize Twitter lists. — Anthony Quintano (@AnthonyQuintano) December 29, 2016 -
ట్విట్టర్ సీఈవో అకౌంట్ కూడా..
ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ ట్విట్టర్ అకౌంట్ కూడా శనివారం హ్యాకింగ్కు గురయింది. ఇటీవలే ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ల సోషల్ మీడియా అకౌంట్లను అవర్ మైన్ గ్రూప్ హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. జాక్ డార్సీ ట్విట్టర్ అకౌంట్ ను అవర్ మైన్ గ్రూప్ హ్యాక్ చేసి, అదే అకౌంట్లో హ్యక్ చేసినట్టు వెల్లడించింది. జాక్ డార్సీ ఫాలోవర్స్ 3.73 మిలియన్ల మందికి ఈ హ్యాకింగ్ విషయాన్ని అవర్ మైన్ ప్రచారం చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ లను తొలగించినా.. ఆ హ్యాకింగ్ స్క్రీన్ షాట్ లు బయటికి వెల్లడించింది. కానీ ఈ గ్రూప్ అకౌంట్ల హ్యాకింగ్ కు ఎలా పాల్పడుతుందో క్లియర్ గా తెలియడం లేదు. సోషల్ నెట్ వర్క్ ల సిస్టమ్ దొంగతనం వల్ల హ్యాకింగ్ కు పాల్పడటం లేదని మాత్రం తెలిసింది. అయితే అవర్ మైన్ గ్రూప్, తనకు తాను భద్రతా సంస్థగా అభివర్ణించుకుంటోంది. ఈ హ్యాకింగ్ ఘటనలు మళ్లీ జరగకుండా, సర్వీసులను ఆఫర్ చేస్తుందని వెల్లడిస్తోంది. వెబ్ సైట్లు, సోషల్ మీడియా అకౌంట్లు, కంపెనీల భద్రతా వలయాలను స్కాన్ చేసి, తన సైట్ లో భద్రతకు సంబంధించి ప్రచార సేవలను అందిస్తున్నట్టు చెబుతోంది. -
ట్విట్టర్ సీఈవోకు జీతం లేదట!
ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవడం లేదు. అయితే తన వ్యక్తిగత, నివాస భద్రత కోసం మాత్రం రూ. 46 లక్షలు తీసుకుంటున్నారట. ఆయనకంటే ముందున్న సీఈవో డిక్ కాస్టోలో రూ.62 లక్షల జీతం తీసుకున్నారు. అందులో వేతనతంతో పాటు కారు సర్వీసు, సెక్యూరిటీ ఖర్చులన్నీ ఉన్నాయి. ప్రస్తుతం ట్విట్టర్కు దాదాపు 30 కోట్ల మంది యాక్టివ్ యూజర్లున్నారు. అయితే ఫేస్బుక్కు మాత్రం ఏకంగా 150 కోట్ల మంది యూజర్లున్నారు. దాంతో మార్కెటింగ్ వర్గాలు కూడా ట్విట్టర్ కంటే ఫేస్బుక్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది మూడో త్రైమాసికం నాటికి 30.7 కోట్ల మంది యూజర్లుండగా, ఈ త్రైమాసికం చివరకు 30.5 కోట్ల మంది ఉన్నారు. యూజర్లు పెద్దగా పెరగకపోవడంతో ట్విట్టర్ షేరు ధర కూడా దాదాపు 13 శాతం వరకు పడిపోయిందని టెక్ క్రంచ్ తెలిపింది. ట్విట్టర్లో చాలా మార్పులు చేయాలని అనుకుంటున్నామని, ప్రస్తుతమున్న 140 క్యారెక్టర్ల పరిమితి ఇబ్బందిగా ఉందని, అయితే దానివల్ల తక్కువ మాటల్లో బలమైన స్టేట్మెంట్లు ఇవ్వడానికి కూడా వీలవుతోందని డోర్సీ అన్నారు. దీనివల్లే ట్విట్టర్కు విభిన్నమైన గుర్తింపు కూడా వస్తోందని తెలిపారు. -
బాస్ అంటే ఇతడేరా!
కాలిఫోర్నియా: జీవితాల్లో వెలుగులు నింపే తల్లి, తండ్రి, గురువు, అతిథుల తర్వాతి స్థానాన్ని బాస్కే ఇచ్చేయాలని ట్విట్టర్ ఉద్యోగులు కోరుతూ ఉండొచ్చు! ఎందుకంటారా.. వాళ్ల బాస్, అదేనండీ ట్విట్టర్ కంపెనీ సీఈవో జాక్ డోర్సీఉద్యోగులకు భారీ బొనాంజా ప్రకటించాడు. కంపెనీలో తనకున్న షేర్లలో 33 శాతాన్ని ఉద్యోగుల సహాయ నిధికి ధారాదత్తం చేశాడు. ఉద్యోగుల పేరిట బదిలీ చేసిన ఆ షేర్ల విలువ 197 మిలియన్ డాలర్లు. మన కరెన్సీలో దాదాపు 1,277 కోట్ల రూపాయలు! షేర్లు ఇవ్వడాన్ని ఉద్యోగులపై తిరిగి పెట్టుబడిపెడుతున్నట్లు (రీఇన్వెస్ట్మెంట్)గా జాక్ అభివర్ణించినా, అతడి నిర్ణయం వేలాది ఉద్యోగుల జీవితాల్లో భారీ మార్పులకు నాంది పలకడం ఖాయం. వేలకోట్ల విలువైన ట్విట్టర్ కంపెనీలో అతడికి 3.2 శాతం వాటా ఉంది. అందులో నుంచి 33 శాతం అంటే కంపెనీలో 1 శాతం విలువైన షేర్లు ఉద్యోగులకు పంచేయడం ద్వారా అతని వాటా 2.2 శాతానికి తగ్గింది. అయినా సరే ఉద్యోగుల సంక్షేమమే ప్రధానమన్నది ఆయన తలంపు. అయితే సీఈవోగా బాధ్యతలు స్వీకరించి నెల రోజులైనా గడవక ముందే జాక్ ఇంతటి సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక మతలబూ ఉంది! గత వారమే 336 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. మిగతా ఉద్యోగులకు తనపట్ల నమ్మకాన్ని, పని పట్ల మరింత ప్రేమను కల్గించేందుకే షేర్ల గాలం వేసినట్లు తెలిసింది. లోగుట్టు ఏదైనా.. ఉద్యోగులు మాత్రం మంచి ఖుషీగా ఉన్నారు.