issues
-
పెన్షన్లపై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన సచ్చివాలయ సిబ్బంది
-
కాణిపాకం వివాదంపై మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందన
-
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మళ్ళీ రచ్చకెక్కిన విభేదాలు
-
Telangana: కొలువులకు ‘కొత్త’ సంకటం
వరంగల్ జిల్లా పోచమ్మ మైదాన్కు చెందిన గోపి రెండో తరగతి వరకు ఇంటి పక్కనున్న పాఠశాలలో చదివాడు. మంచి స్కూల్లో ఇంగ్లిష్ మీడియం చదివించాలని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నయీంనగర్లోని ప్రైవేటు పాఠశాలలో గోపిని తండ్రి చేర్పించాడు. అతను 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. ఇప్పుడు పునర్విభజనలో నయీంనగర్ హన్మకొండ జిల్లాలో భాగమవడం, గోపి ఒకటి నుంచి 7వ తరగతిలో ఎక్కువ సంవత్సరాలు నయీంనగర్లో చదువుకోవడంతో అతని స్థానికత హన్మకొండ అయింది. ఎల్బీనగర్కు చెందిన సృజన్ కుమార్ ఒకటి నుంచి మూడో తరగతి వరకు ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో, 4 నుంచి 10వ తరగతి వరకు ఉప్పల్లోని మరో ప్రైవేటు పాఠశాలలో చదివాడు. ఇంతకుముందు వరకు సృజన్ది రంగారెడ్డి జిల్లా స్థానికత. కానీ జిల్లాల పునర్విభజనతో రంగారెడ్డిని 3 జిల్లాలు చేశారు. సృజన్ పాఠశాల విద్యను ఎక్కువ సంవత్సరాలు మేడ్చల్ జిల్లాలో చదవడంతో ఆ జిల్లా స్థానికుడయ్యాడు. ఇక అతను ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే మేడ్చల్ జిల్లాలోని పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలి. పుట్టిపెరిగిన రంగారెడ్డి జిల్లాలో 5 శాతం ఓపెన్ కేటగిరీ కోటా కింద దరఖాస్తు చేసుకోవాలి. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో 80,039 ఉద్యోగ ఖాళీలున్నట్లు సీఎం కేసీఆర్ 4 రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇందులో జిల్లా కేడర్లోని పోస్టులు 39,829. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం రావడంతో జిల్లా కేడర్ పోస్టుల భర్తీలో స్థానిక, ఓపెన్ కేటగిరీ నిష్పత్తి 95:5గా నిర్ధారించారు. ఈ క్రమంలో జిల్లా కేడర్లోకి వచ్చే 39,829 పోస్టుల్లో 95 శాతం స్థానిక అభ్యర్థులతో భర్తీ చేయాలి. కొత్త జోనల్ విధానంతో స్థానిక అభ్యర్థులకు అత్యధిక అవకాశాలు పెరుగుతున్నా ఇప్పుడు స్థానికత తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. జిల్లాల పునర్విభజనతో అభ్యర్థుల స్థానికత మారింది. కొత్త జిల్లాల సరిహద్దుల్లోని మెజార్టీ అభ్యర్థులకు ఈ సమస్య ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పుట్టి, పెరిగిన జిల్లాలో స్థానిక కోటాలో దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో పలువురు అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. స్థానికత ఇలా.. అభ్యర్థి స్థానికతను నిర్ణయించడంలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ ఏడేళ్లు ఒకేచోట చదవకుంటే ఎక్కువ తరగతులు ఎక్కడ చదివాడో ఆ ప్రాంతం స్థానికతలోకి వస్తాడు. ఈ లెక్కన ఒకటి నుంచి ఏడో తరగతి వరకు గరిష్టంగా నాలుగేళ్లు ఎక్కడ చదువుకుంటే ఆ జిల్లా స్థానికత పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం జిల్లా స్థాయి ఉద్యోగాలన్నీ స్థానికత ప్రకారమే భర్తీ చేస్తారు. దీంతో స్థానికత ధ్రువీకరణకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. పట్టణ ప్రాంతంతో గజిబిజి రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాలను 33 జిల్లాలుగా ప్రభుత్వం విభజించింది. ఇందులో హైదరాబాద్ జిల్లా మినహా మిగతా 9 జిల్లాలు 32 జిల్లాలుగా మార్పు చెందాయి. ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో స్థానికతకు ప్రాధాన్యమిస్తూ నియామకాలు చేపట్టే క్రమం తీవ్ర గందరగోళాన్ని కలిగిస్తోంది. చాలా జిల్లాల్లో పట్టణ ప్రాంతాలను విభజించడంతో స్థానికత సందిగ్ధంలో పడింది. ఉమ్మడి జిల్లా కేంద్రాలకు దగ్గర్లోని పట్టణ ప్రాంతాల్లో కొంత భాగం ఓ జిల్లాలో, మరికొంత భాగం మరో జిల్లాలో చేర్చారు. కొన్నిచోట్ల నగర ప్రాంతాన్ని ఓ జిల్లాగా, గ్రామీణ ప్రాంతాన్ని మరో జిల్లాగా ఏర్పాటు చేశారు. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాను 3 జిల్లాలుగా విభజించారు. ఇందులో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మెజార్టీ భాగం పట్టణ ప్రాంతం కావడంతో ఈ రెండు జిల్లాల్లో చాలా మంది అభ్యర్థుల స్థానికతలో మార్పులు జరుగుతున్నాయి. వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మహబూబ్నగర్–నారాయణపేట, వనపర్తి–గద్వాల, కరీంనగర్–పెద్దపల్లి జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు అనేకం. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు ఉండటం.. దూరం నుంచి వచ్చి పట్టణ çప్రాంతాల్లో చదువుకోవడంతో స్థానికతలో మార్పులు జరుగుతున్నాయి. -
విశాఖ తీరంలో మత్స్యకారుల వేట వివాద పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు
-
సరసమైన ధరలకు వినోదం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
-
ప్రేమవివాహం.. కుటుంబ కలహాలు.. రెండు రోజుల వ్యవధిలోనే..
సాక్షి, యైటంక్లయిన్కాలనీ (కరీంనగర్): ఇరు కుటుంబాల పెద్దలను ఎదిరించి ప్రేమవివాహం చేసుకున్నారు. కానీ జీవిత ప్రయాణంలో ఓడిపోయారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 11న రామగుండం రైల్వేస్టేషన్లో జంగటి అరుణ తన ఇద్దరు పిల్లలు సాత్విక్, సాత్వికను రైలు కిందికి తోసి తాను దూకింది. తల్లి కూతురు మృతి చెందగా.. చికిత్స పొందుతూ రెండు రోజుల వ్యవధిలో కుమారుడు మృతిచెందాడు. మృతురాలి భర్త జంగటి ప్రవీణ్ (32 )కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారంలో ఒంటరితనం భరించలేక ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు క్వాశ్రీరాంపూర్ ఎస్సై వెంకటేశ్వర్ తెలిపారు. మృతుడి తండ్రి కొమురయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు. -
భారీగా గుంతలు: ప్రాణాలు పోతేనే.. పట్టించుకుంటారా?
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ నగరంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పేరుతో రోడ్ల వెంట భారీగా గుంతలు తవ్వుతున్నారు. పైపులైన్లు వేయడంలో ఆలస్యం కావడం.. గుంతల వద్ద కనీసం జాగ్రత్తలు పాటించకపోవడంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. శనివారం వరంగల్ హెడ్ ఫోస్టాఫీస్ సమీపంలోని ఓ వృద్ధుడు అదుపు తప్పి డ్రెయినేజీలో పడిపోయాడు. గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వెంకన్న, షబ్బీర్లు వెంటనే స్థానికుల సహకారంతో బయటకు తీశారు. ఇలా వరంగల్ స్టేషన్ రోడ్డు నుంచి చౌరస్తా వరకు నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా.. వెంటనే అండర్గ్రౌండ్ డ్రెయినేజీ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
‘తెలంగాణకు రావాల్సిన ప్రతి అంశంపై పార్లమెంట్లో చర్చిస్తాం’
న్యూఢిల్లీ: పార్లమెంట్లో జరిగే వర్షాకాల సమావేశంలో తెలంగాణ సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తుతామని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత ఎంపీ నాగేశ్వర్ రావు తెలిపారు. కాగా, ఆదివారం పార్లమెంట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాల గురించి అఖిల పక్షం ఆధ్వర్యంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ, ధరల పెరుగుదలపై చర్చలు జరపాలని పేర్కొన్నారు. అదేవిధంగా, 48 గంటల ముందే బిల్లుల వివరాలను సభకు తెలపాలని కోరినట్టు నాగేశ్వర్రావు తెలిపారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి అంశంపై పార్లమెంట్లో చర్చిస్తామని వివరించారు. -
Corona Virus: ‘లాంగ్ హాలర్స్’ అంటే ఎవరో తెలుసా?
కరోనా గురించి కొత్త కొత్త పరిశోధనల్లో తేలుతున్న విషయాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అలాంటి ఒక అధ్యయనంలో ఈ ‘లాంగ్ హాలర్స్’ గురించి తెలిసింది. ‘కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి బాగైపోయాం’ అనుకున్నవారిని సైతం కోవిడ్ లక్షణాలు మరికొంతకాలం పాటు బాధపెడుతుంటాయి. అలా బాధపడే పరిస్థితిని ‘లాంగ్ కోవిడ్’ లేదా ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19’ అనీ... అలా బాధపడేవారినే ‘‘లాంగ్ హాలర్స్’’గా పేర్కొంటున్నారు. క్లివ్లాండ్ క్లినిక్లోని లోరియన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్... ‘ఫ్యామిలీ మెడిసిన్’ విభాగానికి చెందిన వైద్యపరిశోధకుడు క్రిస్టోఫర్ బబియుక్ అనే పరిశోధకుడు ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19’ గురించీ... అలాగే ‘లాంగ్ హాలర్స్’పై తన పరిశోధన పత్రాన్ని సమర్పించగా... ఇటీవలే దీని వివరాలను బయటికి వెల్లడించారు. లాంగ్ హాలర్స్ అంటే ఎవరు, వారి లక్షణాలేమిటి, వారి సమస్యలకు కారణాలేమిటి లాంటి అనేక విషయాలు తెలిపేదే ఈ కథనం. ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ బాధితులు ఎవరు? ఈ ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ బారిన ఎవరు పడతారు? ఎలాంటి లక్షణాలూ లేని అసింప్టమాటిక్ రోగులు దీని బారిన పడరా? కేవలం మూడు, నాలుగు వారాల పాటు కూడా నెగెటివ్ రానివారే దీని బారిన పడతారా?... ఈ సందేహాలు మీ మదిలో రావచ్చు. కానీ అలాంటి మినహాయింపులేమీ ఈ లాంగ్ హాలర్స్కు ఉండవంటున్నారు పరిశోధకులు. ఎలాంటి లక్షణాలూ లేకుండా ఉన్నవారూ, కొద్దిపాటి లక్షణాలతో తేలిగ్గానే కరోనా బారినుంచి తప్పించుకున్నవారు మొదలుకొని సుదీర్ఘకాలం పాటు దాని బారిన పడ్డవారు ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ బారిన పడవచ్చు. అలాగే ఎవరో వయోవృద్ధులకు మాత్రమే అది పరిమితమేమో అంటూ కూడా పొరబడవద్దు. ఎందుకంటే... యౌవనంలో ఉన్నవారూ, నడివయసువారు, అప్పుడే వృద్ధాప్యంలో అడుగుపెట్టినవారు మొదలుకొని బాగా వయోవృద్ధుల వరకు అందరూ దీనిబారిన పడే అవకాశాలున్నాయంటున్నారు క్రిస్టోఫర్ బబియుక్ అనే పరిశోధకుడు. పైగా ఇదొక ఛాలెంజింగ్ పరిస్థితి అని... అందరికీ ఒకేలాంటి చికిత్స కాకుండా... ప్రతి ఒక్కరికీ వారి వారి పరిస్థితి ని బట్టి వేర్వేరు చికిత్సలు అందించేలా జబ్బు విసురుతున్న సవాలే ఈ సమస్య అని క్రిస్టోఫర్ బబియుక్ పేర్కొంటున్నారు. ఆయన పేర్కొన్న శాస్త్రీయ వివరాలు చాలావరకు సాధారణ ప్రజలకూ పనికివచ్చేవే. ప్రశ్న: గతంలో చాలా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారే ‘లాంగ్ హాలర్స్’గా మారే అవకాశం ఉందా? సమాధానం: ఒకరకంగా అలాగే అనుకోవచ్చు. కానీ కచ్చితంగా అదేనిజం అని అనుకోడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే గత మన అనుభవాలను బట్టి గతంలో ఏదో క్రానిక్ జబ్బులతో బాధపడేవారే ఇలా సుదీర్ఘకాలం పాటు ఏవో లక్షణాలతో బాధపడుతుంటారని తేలినా... కొందరు మామూలు వ్యక్తుల్లో సైతం కొన్ని లక్షణాలు అదేపనిగా కొనసాగుతున్నాయి. అందుకే ఈ స్థితి ఫలానా నిర్దిష్ట వ్యక్తుల్లోనే కనిపిస్తుందని ఇదమిత్థంగా ఇప్పుడే చెప్పడానికి వీలు కావడం లేదు. ప్రశ్న : ఈ లాంగ్ హాలర్స్లో కనిపిస్తున్న లక్షణాలేమిటి? సమాధానం: చాలా లక్షణాలే ఈ లాంగ్ హాలర్స్లో ఉన్నాయి. అవి... దీర్ఘకాలికం గా కొనసాగే తీవ్రమైన దగ్గు, ఛాతీ పట్టేసినట్టుగా ఉండటం, శ్వాస సరిగా అందకపోవడం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పులు, కొందరిలో నీళ్లవిరేచనాలు కూడా. అయితే ఈ అందరిలోనూ కనిపిస్తూ ఉండే ఒకే ఒక లక్షణం తీవ్రమైన అలసట. దీన్నే ‘క్రానిక్ ఫెటీగ్’గా చెప్పవచ్చు. ఇలాంటి చాలామంది లాంగ్ హాలర్స్లో ‘బ్రెయిన్ ఫాగ్’ కూడా కనిపిస్తోంది. అంటే... మంచు కప్పి ఉన్నప్పుడు ఏదీ స్పష్టంగా తెలియనట్టే... వీళ్లలో కూడా ఏ ఆలోచనా స్పష్టంగా లేక అయోమయానికి గురవుతుంటారు. దీన్నే ‘బ్రెయిన్ ఫాగ్’ అని అంటారు. ప్రశ్న : ఈ లాంగ్ హాలర్స్ నుంచి ఈ లక్షణాలు ఒకరి నుంచి మరొకరికి పాకుతాయా అంటే ఈ ‘పోస్ట్ అక్యూట్ కోవిడ్–19 (లాంగ్ కోవిడ్)’ అంటువ్యాధా? సమాధానం : అదృష్టవశాత్తూ కాదు. ఎందుకంటే ఇవన్నీ అప్పటికే కరోనా సోకి తగ్గినవారిలో కనిపించే కొన్ని దీర్ఘకాలిక లక్షణాలు. అంతేతప్ప ఇదో వ్యాధి కాదు. అందునా అంటువ్యాధి కాదు. అందుకే, అంటుకుంటుందేమో అని దీనిగురించి ఆందోళన అక్కర్లేదు. కేవలం కరోనా వైరస్తో ఇన్ఫెక్ట్ అయినవారి నుంచే ఆ వైరస్ మరొకరికి అంటుకుంటుది. రెండువారాల తర్వాత వైరస్ దేహం నుంచి తొలగిపోయాక ఏ రోగీ కరోనాను వ్యాపింపజేయలేడు. (అతడు కాంటేజియస్ కాదు). కాబట్టి వ్యాధి సోకిన రెండు వారాల తర్వాత అటు రోగినీ, ఇటు లాంగ్ హాలర్స్నీ అనుమానాస్పదంగా చూడాల్సిన అవసరం లేదు. పైగా వారికి సమాజం నుంచి మరింత సానుభూతి, సహకారం అవసరం. ప్రశ్న: కొందరిలో ఈ లక్షణాలు సుదీర్ఘకాలం ఎందుకు కొనసాగుతున్నాయి? సమాధానం : కరోనా వచ్చి తగ్గాక చాలామందిలో అది వారి అంతర్గత అవయవాల్లో ‘ఇన్ఫ్లమేషన్’ (వాపు, మంట లాంటి స్థితి) తీసుకొస్తుందన్న విషయం తెలిసిందే కదా. బహుశా ఆ ‘ఇన్ఫ్లమేటరీ కండిషన్స్’ అన్నీ సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ లక్షణాలన్నీ కొనసాగుతున్నాయని శాస్త్రవేత్తలూ, పరిశోధకుల అంచనా. అందుకే ఈ అంశాలపై ఇప్పటికే పరిశోధన కొనసాగుతోందనీ, ఇంకా చాలా అధ్యయనాలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు కొనసాగితే సుదీర్ఘకాలంలో అప్పటికే కిడ్నీవ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెజబ్బులు ఉన్నవారిపై కరోనా వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావం వల్ల కలిగే ఫలితాలేమిటో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికైతే పరిశోధనలు మాత్రం విస్తృతంగా కొనసాగుతున్నాయి. ప్రశ్న: ఇప్పుడీ పరిస్థితిలో ‘లాంగ్ హాలర్స్’ ఏం చేయాలి? సమాధానం : కరోనా తగ్గిందనీ, తమకు నెగెటివ్ వచ్చిందని తెలిశాక కూడా లక్షణాలు కనిపిస్తున్నా లేదా కోవిడ్–19 వచ్చి తగ్గిందనుకున్న 28 రోజుల తర్వాత కూడా మళ్లీ లక్షణాలు కనిపిస్తున్నా ముందుగా వారు డాక్టర్ను సంప్రదించాలి. ఇప్పటికి ఉన్న అవగాహన మేరకు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు తమ పల్మునరీ (ఊపిరితిత్తులకు సంబంధించిన), కార్డియోవాస్కులార్ (గుండెకు సంబంధించిన), న్యూరలాజికల్ (మెదడు సంబంధిత) పరీక్షలను వారి వారి డాక్టర్ల సలహాల మేరకు చేయించుకుంటూ ఉండాల్సి రావచ్చు. ఇక ఆ తర్వాత వారంతా క్రమం తప్పకుండా దేహానికి మంచి ఖనిజలవణాలు దొరికేలా ఎప్పుడూ ద్రవాహారాలు తీసుకుంటూ, తగినంత విశ్రాంతి తీసుకుంటూ, మంచి ఆహారం తింటూ, కంటినిండా నిద్రపోతూ... శారీరక, మానసిక ఒత్తిళ్ల నుంచి దూరంగా ఉండాలి. ఈ అంశాలన్నింటినీ ఆరోగ్యవంతులూ, కరోనాకు గురికాని వారందరు కూడా పాటిస్తే అవి వాళ్లందరికీ మేలు చేసేవే. ప్రశ్న: లాంగ్ హాలర్స్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా? సమాధానం : లాంగ్ హాలర్స్తో సహా... ప్రతివారూ, కరోనా వచ్చి తగ్గిన వారు సైతం (వారి వారి దేశాల్లోని ప్రభుత్వ, వైద్య సంస్థలు చెప్పిన నిర్ణీత కాల వ్యవధి ముగిశాక) తప్పక వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. -
Covid Vaccine: సామాన్యుడికి సకాలంలో టీకా అందేనా?
‘సరూర్నగర్కు చెందిన శ్రీకాంత్ రెండో డోసు టీకా కోసం బుధవారం ఆన్లైన్లో స్లాట్బుక్ చేసుకున్నారు. ఆయనకు ఈ నెల ఏడో తేదీన అబ్దుల్లాపూర్మెట్ పీహెచ్సీలో ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యలో టీకా వేయనున్నట్లు ఫోన్కు మెస్సేజ్ కూడా వచ్చింది. ఆ తర్వాతి రోజు బుక్ చేసుకున్న స్లాట్ కేన్సల్ అయినట్లు మళ్లీ మెస్సేజ్ వచ్చింది. సంబంధిత పీహెచ్సీకి వెళ్లి ఆరా తీయగా..టీకాలు స్టాక్ లేకపోవడం వల్లే ఇలా జరిగినట్లు తెలిసి నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. .. ఇలా శ్రీకాంత్ ఒక్కరే కాదు టీకా కోసం కోవిన్యాప్లో స్లాట్బుక్ చేసుకున్న అనేక మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు’. సాక్షి, హైదరాబాద్: కోవిడ్ టీకాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంతా గందరగోళంగా మారింది. ఇప్పటికే ఫస్ట్ డోసు టీకా తీసుకుని, రెండో డోసు కోసం ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుంటున్న లబ్ధిదారులకు...స్లాట్బుకింగ్ రద్దయినట్లు మెస్సేజ్లు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల నిష్పత్తికి తగినన్ని టీకాలు పంపిణీ చేయకపోవడమే ఇందుకు కారణం. టీకాలు ఎప్పుడు వస్తాయో తెలియక వారంతా ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు 45 ఏళ్లు పైబడిన వారు సుమారు 15 లక్షల మందికిపైగా టీకాలు వేయించుకున్నారు. వీరిలో మరో మూడు లక్షల మంది రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఆధార్కార్డు జీరాక్స్ కాపీ తీసుకెళ్లిన వారికి రిజిస్టర్లో పేరు నమోదు చేసుకుని టీకాలు వేసేవారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పని సరి చేసింది. అయితే, చాలా మందికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్పై సరైన అవగాహాన లేదు. కుంటుంబ సభ్యులకు విడివిడిగా ఫోన్లు కూడా లేవు. ఒకే నెంబర్తో కుటుంబ సభ్యులందరి పేర్లు నమోదు చేస్తుండటంతో యాప్ నిరాకరిస్తోంది. ఇంటర్నెట్పై అవగాహన ఉన్న వారు స్వయంగా ఇంట్లోని కంప్యూటర్, సెల్ఫోన్ ద్వారా పేర్లు నమోదు చేసుకుంటుండగా... అవగాహన లేని వారు సమీపంలోని మీ సేవా కేంద్రాలకు వెళ్లి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. మీసేవ నిర్వాహకులు దీన్ని అవకాశంగా తీసుకుని రూ.50 నుంచి రూ.100 వసూలు చేస్తుండటం గమనార్హం. బాధితులకు విషమ ‘పరీక్ష’ ఒక వైపు కరోనా వైరస్ నగరంలో చాపకింది నీరులా విస్తరిస్తుండగా..మరో వైపు ప్రభుత్వం టెస్టుల సంఖ్యను కుదించడం ఆందోళన కలిగిస్తోంది. దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు తదితర సమస్యలతో బాధపడుతూ నిర్ధారణ పరీక్షల కోసం వచ్చిన వారికి నిరాశే మిగులుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 248 ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. ఒక్కో సెంటర్కు రోజుకు సగటున 150 మంది వరకు వస్తుండగా, కిట్ల కొరత వల్ల ప్రస్తుతం 50 మందికి మించి టెస్టులు చేయడం లేదు. 20 ప్రభుత్వ, 63 ప్రైవేటు డయాగ్నోస్టిక్స్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తుండగా, వీటిలో రోజుకు సగటున 25 వేల టెస్టులు చేస్తున్నారు. టెస్టింగ్ కేంద్రాల సామర్థ్యానికి మించి రోగులు వస్తుండటంతో రిపోర్టుల జారీలో తీవ్ర జాప్యం అవుతోంది. నిజానికి 12 నుంచి 24 గంటల్లోపే ఫలితం రావాల్సి ఉన్నా...48 గంటలు దాటినా రావడం లేదు. ఫలితంగా వైరస్ సోకిన వారే కాకుండా విదేశాలకు, రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమైన వారికి రిపోర్టుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఇక తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మరో 1918 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ( చదవండి: కరోనా వేళ.. గుంపులు గుంపులుగా జనాలు ) -
గర్భవతులకు ఇదో పెద్ద సమస్య!
గర్భవతుల్లో మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకంటే గర్భసంచి పెరుగుతున్నకొద్దీ అది మూత్రనాళాలపై ఒత్తిడి కలగజేయడం వల్ల మూత్రపిండాలు వాచిపోతాయి. దాంతో మూత్రాశయంలో ఉండే ఇన్ఫెక్షన్ కాస్తా... మూత్రపిండాలకూ చేరే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల అబార్షన్ అయ్యే ప్రమాదమూ ఉంది లేదా నెలల నిండకముందే ప్రసవం కూడా కావచ్చు. అందువల్ల గర్భవతులు మూత్రపరీక్ష చేయించుకుని, ఇన్ఫెక్షన్ ఉంటే తప్పక మందులు వాడాల్సి ఉంటుంది. ఇన్ఫెక్షన్కు చికిత్స సాధారణంగా వచ్చే సిస్టైటిస్కి మూడు రోజుల పాటు యాంటీబయాటిక్స్ కోర్సు సరిపోతుంది. మూత్రపిండాలలో ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే పది నుంచి పదిహేను రోజుల వరకు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొందరిలో తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తున్నట్లయితే దీర్ఘకాలం పాటు చికిత్స (లాంగ్ టర్మ్ సప్రెసెంట్ థెరపీ) అవసరమవుతుంది. ఇందులో చాలా తక్కువ మోతాదులో దీర్ఘకాలం పాటు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. ఇక మూత్రపిండాలలో రాళ్లను తొలగించడం కోసం కొన్ని నాన్సర్జికల్, సర్జికల్ ప్రొíసీజర్స్ అవసరం కావచ్చు. -
ఈ లక్షణాలుంటే కోవాగ్జిన్ టీకా తీసుకోవచ్చా?
సాక్షి, ముంబై: ఒకవైపు కరోనా మహమ్మారి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు సీరం వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారన్న వార్తలు ఆందోళన పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి దేశీయ కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్కు సంబంధించి భారత్ బయోటెక్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇటీవల కోవాగ్జిన్ టీకా దుష్ప్రభావాలపై పలు విమర్శలు వచ్చిన క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా తాజా సూచనలు జారీ చేసింది. ఎవరు తమ టీకాను తీసుకోకూడదు, ఎవరు తీసుకోవచ్చు అనే వివరాలతో ఒక వివరణాత్మక ఫ్యాక్ట్ షీట్ను రిలీజ్ చేసింది. ముఖ్యంగా బలహీనమైన ఇమ్యూనిటీ ఉన్నవారు, రోగనిరోధక శక్తి వ్యవస్థపై ప్రభావం చూపే మందులు వాడేవారు, అలర్జీ ఉన్నవారు తమ కోవాగ్జిన్ టీకాను తీసుకోవద్దు అని భారత్ బయోటెక్ హెచ్చరించింది. భారత్ బయోటెక్ వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం రక్తస్రావ లోపాలు లేదా బ్లడ్ థిన్నర్స్ వాడేవారు టీకా తీసుకోకపోవడం మంచిది. అలాగే జ్వరం లేదా అలెర్జీ ఉన్నవారు, గర్భిణీ, పాలిచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్ తీసుకోవద్దని సూచించింది. దీనితోపాటు మరో కంపెనీ టీకా తీసుకున్న వారు కోవాగ్జిన్ టీకా వాడవద్దని కూడా హెచ్చరించింది. వ్యాక్సిన్ డోస్ తీసుకున్న తర్వాత ఎవరైనా కోవిడ్-19 లక్షణాలను కనిపిస్తే, దాన్ని ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ఆధారంగా "ప్రతికూల సంఘటన" గా పరిగణిస్తారని పేర్కొంది. కాగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సయుక్తంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ రూపొందిస్తోంది. ఇప్పటికీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. అత్యవసర ఉపయోగం కోసం కేంద్రం అనుమతి పొందిన రెండు సంస్థల్లో భారత్ బయెటెక్ ఒకటి. జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం మొదలైన విషయం తెలిసిందే. -
విమానాలకు టేకాఫ్ సమస్యలు
-
ఇంటి కాలుష్యం ఆపండి
మన దేశంలో అభివృద్ధి బాగా జరగాలని అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే సామాన్యుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలంటే అభివృద్ధి జరగాలని మనం అనుకుంటూ ఉంటాం. యువతరం కూడా అభివృద్ధి ఫలాలను పొందేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుంది. అయితే, ఆ అభివృద్ధితో పాటు కాలుష్యం అనేక సమస్యలు తెచ్చిపెట్టింది. తెచ్చిపెడుతూనే ఉంది. కాలుష్యం అనేది పెద్ద పెద్ద పరిశ్రమలకు సంబంధించినది. ఇది ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు.ఈ విషయంలో పర్యావరణ కాలుష్యం, సహజవనరులను కలుషితం చేయడంలో ఎవరికి వారు తమ పాత్రను పోషిస్తున్నారనేది గమనార్హం. కాలుష్యకారకాలతో అభివృద్ధి ఏ విధంగా అనుసంధానించబడిందో.. అది మనం ఇంట్లో ఉపయోగించే వస్తువులతోనే అని తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవచ్చు. ఇంటి నుంచే హానికారాలు షాంపూలూ, డిటర్జెంట్లు, సౌందర్యసాధనాలు, ఎయిర్ప్రెషనర్లు, విండో క్లీనర్లు, డిష్వాష్ ద్రవ్యాలు, హెయిర్ డైలు, మస్కిటో రిఫెల్లెంట్లు (దోమల మందులు), ఫ్లోర్ క్లీనర్లు, టాయిలెట్ క్లీనర్లు.. ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ విలాసవంతులు, ఆధునికులు విరివిగా ఉపయోగించే వస్తువులు. ఇవి చిన్నగా అనిపించే పెద్ద కాలుష్యకారకాలుగా మన ముందు ఇప్పుడు సమస్యాత్మకంగా నిలిచాయి. ఇవి ఇళ్లల్లో ఉండటం అభివృద్ధి అని మనం అనుకుంటూ ఉంటాం. అందువల్ల విలాసవంతులు వాడే ఈ వస్తువులు ఒక సాధారణ ఇంటిలో చోటు సంపాదించుకోవడం ప్రారంభించాయి. తద్వారా ఈ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో అనేక ఎంఎన్సీ కంపెనీలు ఈ వస్తువుల ఉత్పత్తిలో దూసుకుపోయాయి. ఈ వస్తువుల అమ్మకాలలో వచ్చే లాభంతో ఇండియన్ మార్కెట్లో మెరుగైన ఉత్పత్తిని ఇవ్వడానికి ఎమ్ఎన్సీలు పోటీ పడటం ప్రారంభించాయి. మురుగు నీటి నుంచి మంచి నీళ్లలోకి ఈ పోటీ పరుగులో ఎమ్ఎన్సీలు వస్తువుల ఉత్పత్తిలో సంక్లిష్టమైన రసాయన కలయికల వల్ల కలిగే ఆరోగ్యప్రమాదాల గురించి ఏ మాత్రం బాధపడటం లేదు. ఈ ఉత్పత్తులు సామాన్యుడి రోజువారీ జీవితంలో చాలా సహాయకారిగా ఉన్నప్పటికీ వాటి అవశేష ప్రభావం ప్రజారోగ్యం, పర్యావరణ దృక్ఫథం నుండి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉత్పత్తుల వాడకం తర్వాత ప్రమాదకర రసాయన అవశేషాలను వదిలేస్తాం. తరువాత ఇవి మన స్థానిక మురుగు నీటిలో చేరుతాయి. ప్రమాదకర రసాయనాలతో నిండిన మురుగునీరు తరచూ మంచినీటి ప్రవాహాలలోకి చేరుతుంటుంది. మన నగరాలు, పట్టణాలలో చాలా వరకు సమర్థవంతమైన మురుగునీటి శుద్ధి కర్మాగారాలు లేవు. కొన్ని సార్లు అసలు మురుగునీటి ప్రమాదకర స్వభావాన్ని పట్టించుకోం.అంతేకాదు, ఈ మురుగు నదీ జలాలు, సహజ వనరుల్లోకి చేరుకుంటున్నాయి. తత్ఫలితంగా ఈ రసాయనాలు నదుల పర్యావరణ వ్యవస్థ, వాటి మీద ఆధారపడే ప్రాణులకు అపాయం కలిగించడమే కాకుండా మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయి. ఈ హానికరమైన రసాయనాలు ఆహార గొలుసులోకి ప్రవేశిస్తాయి. ఈ రసాయనాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ రసాయనాల ప్రభావాలు కొన్ని సార్లు చాలా ప్రమాదకరమైనవి. అవి తల్లి పాలను కూడా కలుషితం చేస్తాయి. భావితరాలకు ఏమిస్తున్నాం? మన వారసులకు ఆస్తులు అందించడంలో చూపించే ఆసక్తి మేలైన పర్యావరణాన్ని అందించడంలో చూపడం లేదనేది వాస్తవం. ప్రపంచంలోని ప్రాచీన నాగరికతలలో ఒకటైన భారతదేశం ప్రకృతికి అనుకూలమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. సాంకేతికత ఒక జీవనశైలికి దారితీసింది. దీనిలో ఒక సామాన్యుడి రోజువారి జీవితంలో ప్రకృతి ఒక భాగంగా మారింది. కానీ, ఇంత గొప్ప మన సాంస్కృతిక పర్యావరణ వారసత్వాన్ని ముందు తరాలకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాం. నాటి నుండి పాలకులు, ప్రభుత్వాలు మన నాగరిక వారసత్వం గొప్పదనాన్ని మెచ్చుకోలేదు సరికదా కాలక్రమంలో ఒక సామాన్యుడి అవసరాలకు తగినట్లుగా మార్పులను చేర్చడానికి చర్యలు కూడా తీసుకొలేదు. మన ప్రభుత్వాలు ప్రపంచంలోని పాశ్చాత్య దేశాల అభివృద్ధి నమూనాలపై మక్కువ చూపించాయి. ఫలితంగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఆ పరిజ్ఞానంలో దిగుమతికి ఇచ్చిన ప్రాధాన్యత పర్యావరణ రక్షణకు ఇవ్వలేదు. ఇల్లే శిక్షణ ఉత్పత్తుల వాడకం పెరుగుల అభివృద్ధి ప్రక్రియను సూచిస్తుంది కదా అనవచ్చు. కానీ, ఇది ఏ రకం అభివృద్ధి ప్రక్రియో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ ఉత్పత్తులకు ‘నో’ చెప్పడం ఎలా? హానికరమైన రసాయనాల ఉత్పత్తికి ఒక చిన్న ఇంటి సహకారం ఎంత ఉంది? తమ జీవనోపాధి కోసం కష్టపడుతున్న ఒక సామాన్యుడు ప్రకృతి చేతుల్లోకి ఎలా వెళుతున్నాడు?! తెలుసుకోవడంలో ఎప్పుడూ అనాసక్తినే చూపుతున్నాం. ఈ రకమైన అభివృద్ధి మన పిల్లలకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని మాత్రమే ఇవ్వగలదని, కచ్చితంగా మంచి ఆరోగ్యాన్ని కాదని మన అనుభవాల నుంచే స్పష్టమవుతుంది. అధునాతన ఎయిర్ కండిషనర్లు, వాటర్ ప్యూరిఫైర్లతో కూడిన ఆధునిక ఇళ్లను మన పిల్లలకు బహుమతిగా ఇవ్వగలం. కానీ, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన తాగునీరు కాదు. ఒక ఇంటి నుంచి ఈ రసాయనాలను విడుదల చేయడం తక్కువే కావచ్చు. ఈ ఉత్పత్తులను ఉపయోగించే జనాభా అధికంగా ఉండటం, గృహ కాలుష్యకారకాలను విస్మరించడం అంత అల్పమైన విషయం కాదని గ్రహించవచ్చు. ఆధునిక సమాజంలో జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి తిరిగి ప్రకృతి చేతుల్లోకి వెళ్లడం అంత సులభం కాకపోవచ్చు. కానీ, మన జీవితంలో ప్రకృతి పాత్రను గుర్తించడంలో మాత్రం ఎప్పుడూ వెనుకబాటులో ఉండకూడదు. ప్రతి ఒక్కరు దీనిని అభ్యాసంగా చేసుకోవాలి. రోజువారీ కార్యకలాపాలలో ప్రకృతికి తగిన గౌరవం ఇచ్చి తీరాలి. భారతదేశంలో గృహ కాలుష్య కారకాలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు త్వరితంగా చర్యలు తీసుకోవాల్సిన సరైన సమయం మాత్రం ఇదే! – ఆరెన్నార్ -
స్పెషల్గా చూస్తారు.. మార్గం చూపుతారు
పరుగులు పెడుతున్న ఈ సాంకేతిక యుగంలో ఒకరితో ఒకరు మాట్లాడుకునే క్షణాలు సన్నగిల్లుతున్నాయి. ఫలితంగా ఎన్నో మానసిక సమస్యలు మనిషిని చుట్టుముడుతున్నాయి. వీటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధలు అనుభవిస్తున్నవారు కొందరైతే.. మానసిక ఎదుగుదల లేని పిల్లల పెంపకం గురించి సమస్యలు ఎదుర్కొనే తల్లిదండ్రులు కొందరు. ‘ఇలాంటి వారికి పరిష్కార మార్గాలు సూచించేందుకు ఒకే కప్పు కింద వందమంది స్పెషలిస్టులతో అవసరమైన థెరపీలతో చికిత్సనందిస్తున్నా’మన్నారు సరిపల్లి శ్రీజ. హైదరాబాద్లోని సనత్నగర్లో ‘పినాకిల్ బ్లూమ్స్’ పేరుతో థెరపీ సెంటర్ను ఏర్పాటు చేసి తగిన మార్గదర్శకాలను రూపొందించారు. పోషకాహార నిపుణురాలైన శ్రీజ పిల్లల న్యూరలాజికల్ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఎలా పయనించారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.మా అబ్బాయి సంహిత్కు ఇప్పుడు నాలుగేళ్లు. చూస్తున్నారుగా చలాకీగా తిరుగుతూ ఎలా మాట్లాడుతున్నాడో.. ఇప్పుడు ఈ మాట ఆనందంగా చెప్పుగలుగుతున్నాను కానీ, మూడేళ్ల క్రితం మేం పడిన బాధ అంతా ఇంతా కాదు. వాడు పుట్టిన ఏడాదికి ఓ రోజు బాగా జ్వరం, నోటి నుంచి నురగలు వచ్చాయి. భయమేసి హాస్పిటల్కి తీసుకెళ్లాం. ట్రీట్మెంట్ పూర్తయ్యి, జ్వరం తగ్గింది కానీ, ఆ తర్వాత నుంచి వాడిలో విచిత్రమైన మార్పులు.. చేతికి ఏది దొరికితే అది విసిరేసేవాడు. పిలిస్తే పలికేవాడు కాదు.. ఈ సమస్యలతో మళ్లీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాం. అక్కడ డాక్టర్ ‘ఆటిజమ్’కు సంబంధించిన ఓ పుస్తకం ఇచ్చి చదవమన్నారు. ‘అసలు మా అబ్బాయికున్న సమస్య ఏంటీ, ఇప్పుడీ పుస్తకం నాకెందుకు ఇచ్చారు?’ అని డాక్టర్ను అడిగితే ‘మీ అబ్బాయికి ఆటిజమ్ సమస్య ఉంది, మిగతా పిల్లల్లా కాదు తను’ అంటూ ఆటిజమ్ పిల్లల ప్రవర్తన గురించి వివరించి కొన్ని మందులు రాసిచ్చారు. అయితే వీడు మిగతా అందరు పిల్లల్లాగే చక్కగా ఆడుకునేవాడు, పెట్టింది తినేవాడు, అనవసరంగా ఏడ్వడం.. వంటివి చేసేవాడు. డాక్టర్తో ఇది ‘ఆటిజమ్’ కాదంటే మళ్లీ చెక్ చేశారు. ఆ పరీక్షలో మా అబ్బాయికి వినికిడి సమస్య ఉందని, దానివల్లే వాడు మేం చెప్పేది సరిగా వినడం లేదని తేల్చారు. బాబుకి మాటలు సరిగా రావాలన్నా, చెప్పింది వినాలన్నా రెండు– మూడేళ్లు స్పీచ్ థెరపీ చేయాలన్నారు. రోజూ స్పీచ్ సెంటర్కి తీసుకెళ్లాలి. వాడు రెండు రోజులు థెరపీ సెంటర్కి వచ్చాడు. మూడో రోజు నుంచి రానని మొరాయించడంతో అక్కడి వాతావరణం, ఆ థెరపీ విధానం నచ్చడం లేదని అర్థమైంది. ఇలాంటి పిల్లలకు థెరపీ ఇవ్వాలంటే ఇంటిలాంటి ప్లేస్ ఉండాలి. అది వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దేదిలా ఉండాలి. ‘అలాంటి సంస్థను మనమే ఎందుకు స్టార్ట్ చేయకూడదు’ అనే ఆలోచనతో వీటికి సంబంధించి ఉన్న రకరకాల సెంటర్స్ గురించి చాలా రీసెర్చి చేశాం. థెరపీతో తెరపి.. ప్రపంచ జనాభాలో 70 శాతం మంది రకరకాల న్యూరలాజికల్ కండిషన్స్, మానసిక సమస్యలతో బాధపడుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ల సర్వే ద్వారా తెలిసింది. ఆ సమస్యలు.. ఆటిజం కావచ్చు, సెరిబ్రల్ పాల్సీ, చిన్న చిన్న ఫోబియాలు, మాటలో లోపాలు, స్ట్రెస్, డిప్రెషన్, ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు, వైవాహిక బంధాలలో సమస్యలు.. ఇలా ఎన్నో సమస్యలతో బాధపడేవారున్నారని తెలిసింది. ఇలాంటి వారికి థెరపీ ఇచ్చి వారి జీవితాలకు తెరపి ఇవ్వాలని మావారు సరిపల్లి కోటిరెడ్డితో కలిసి రెండేళ్ల క్రితం ‘పినాకిల్ బ్లూమ్స్’ పేరుతో స్పీచ్ సెంటర్ను ఏర్పాటు చేశాం. దీంట్లో స్పీచ్ థెరపీతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ మోడిఫికేషన్.. అన్నీ ఒకే దగ్గర లభించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఒక బ్రాండ్... వంద మంది స్పెషలిస్ట్లు వంద మంది స్పెషలిస్ట్లు ఒకే చోట ఉండేలా ఏర్పాట్లు చేశాం. స్పెషల్ చిల్డ్రన్సే కాదు టీనేజ్ పిల్లల ప్రవర్తనలోనూ మార్పులు తీసుకురాదగిన థెరపీలను ఇక్కడ డెవలప్ చేశాం. రకరకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు ఇక్కడకు వచ్చి కౌన్సెలింగ్ తీసుకుంటుంటారు. ఆనందంగా వారి భావి జీవితాలను నిర్మించుకుంటున్నారు. స్పెషల్ చిల్డ్రన్కి థెరపీ ఇప్పించలేని పరిస్థితి ఉన్న తల్లిదండ్రులకు సేవా, కోటి ఫౌండేషన్ల ద్వారా ఉచితంగా చికిత్సను ఇస్తున్నాం. ప్రస్తుతం ఇక్కడ 300 మంది పిల్లలు థెరపీ పొందుతున్నారు. సమస్య తీవ్రతను బట్టి 3 నెలల నుంచి రెండేళ్ల వరకు థెరపీ అవసరం. ఇప్పటికి హైదరాబాద్లో 11 థెరపీ సెంటర్లను ఏర్పాటు చేశాం. ప్రభుత్వం అనుమతి ఇస్తే ప్రతి జిల్లా కేంద్రంలోనూ పినాకిల్ బ్లూమ్స్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అంటూ ముగించారు శ్రీజ. నిర్మలారెడ్డి, ఫొటోలు: శివ మల్లాల పరిశీలిస్తూ... పరిష్కరించాలి... పిల్లల చిన్న వయసులోనే ఆటిజమ్ను గుర్తించకపోవడమే పెద్ద సమస్యగా మారుతోంది. ఈ సమస్య ఉన్న పిల్లల్లో కొందరిలో మాట ఉండదు. వాళ్లంతట వాళ్లు ఆడుకోలేరు, సోషల్ స్కిల్స్ ఉండవు, పిలిస్తే పలకకపోవడం, ఐ కాంటాక్ట్ ఉండకపోవడం వంటివి ప్రాథమిక లక్షణాలు. వీటిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా తీవ్రతను తగ్గించవచ్చు. అలాగే నలుగురిలో కలవలేకపోవడం, డిప్రెషన్, ఆత్మన్యూనత వంటి సమస్యలను కుటుంబసభ్యులు త్వరగా గుర్తించగలిగితే కౌన్సెలింగ్ల ద్వారా పరిస్థితిని చక్కదిద్దవచ్చు. డాక్టర్ శ్రీజ, పినాకిల్ బ్లూమ్స్ నిర్వాహకురాలు -
నైట్షిఫ్ట్లతో డీఎన్ఏలో మార్పులు
ఇతరులతో పోలిస్తే నైట్షిఫ్ట్లలో పనిచేసే వారి డీఎన్ఏలో చాలా ఎక్కువగా మార్పులు వస్తుంటాయని హాంకాంగ్ శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా నిర్ధారించారు. ఫలితంగా గుండెజబ్బులు, నాడీసంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని వీరు అంటున్నారు. అనెస్థీషియా అకడమిక్ జర్నల్లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. నైట్షిఫ్ట్లో పనిచేసే వారి డీఎన్ఏ మార్పులు... మామూలు వారితో పోలిస్తే 30 శాతం వరకూ ఎక్కువ ఉంటాయి. దీనికి నిద్రలేమి కూడా తోడైతే డీఎన్ఏ నష్టం ఇంకో 25 శాతం ఎక్కువ ఉంటుంది. డీఎన్ఏలో తరచూ ఒకటి అరా మార్పులు జరగడం మామూలే అయినప్పటికీ రెండుగా విడిపోయేటప్పుడు ఈ మార్పులు కొనసాగడం.. మరమ్మతులకు లొంగకపోవడం వల్ల సమస్యలు వస్తూంటాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డబ్ల్యూ.చోయి తెలిపారు. తాము జరిపిన అధ్యయనంలో రాత్రిపూట పనిచేసే వారితోపాటు మూడురోజులపాటు సరైన నిద్ర లేని వారి రక్తాన్ని విశ్లేషించామని, కాకపోతే ఈ పరీక్షలు చాలా తక్కువ మందితో జరిపామని చోయి వివరించారు. మరిన్ని విస్తృత పరిశోధనల ద్వారా ఈ ఫలితాలను నిర్ధారించుకున్న తరువాతే డీఎన్ఏ విడిపోవడానికి.. వ్యాధులకూ ప్రత్యక్షసంబంధం ఉందని చెప్పగలమని వివరించారు. -
ఉయ్యాల ఊగితే..మాంచి నిద్ర!
రాత్రిళ్లు నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఈ మధ్యకాలంలో జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోతున్నట్లు అనిపిస్తోందా? అయితే ఒక పనిచేయండి. ఇంట్లో ఓ ఉయ్యాల వేయించుకోండి. ఎంచక్కా దానిపైనే ఊగుతూ నిద్రపోండి. మీ సమస్యలు ఉపశమించే అవకాశం ఉంది. అదెలా అని ఆశ్చర్యపోవద్దు. స్విట్జర్లాండ్, జెనీవా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన రెండు వేర్వేరు అధ్యయనాలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఉయ్యాలపై ఊగడం నిద్రను ఎక్కువ చేయడం మాత్రమే కాకుండా జ్ఞాపకశక్తిని కూడా పెంపొందిస్తుందట. మాములు పరిస్థితుల్లో కూడా బాగా నిద్రపోయే వారు కొంతమందిని ఎన్నుకుని తాము ప్రయోగాలు చేశామని.. ఉయ్యాల ఊపులకు వీళ్లు చాలా తొందరగా నిద్రలోకి జారుకోవడమే కాకుండా.. ఎక్కువ సమయం దీర్ఘనిద్రలో ఉన్నట్లు తెలిసిందని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లారెన్స్ బేయర్ తెలిపారు. అలాగే కొన్ని పదాలను గుర్తుపెట్టుకుని మళ్లీ చెప్పాల్సిందిగా కోరే పరీక్షలోనూ వీరు విజయం సాధించారని తద్వారా వారి జ్ఞాపకశక్తి మెరుగైనట్లు తాము ఒక అంచనాకు వచ్చామని వివరించారు. స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లోనూ దాదాపు ఇదే ఫలితాలు రావడం విశేషం. ఎలుకలను నిద్ర పుచ్చేందుకు వీరు కదిలే పంజరాలను ఉపయోగించారు. -
క్షమాపణలు చెప్పిన స్టార్ హీరో సోదరి
ప్రముఖ డిజైనర్.. రణ్బీర్ కపూర్ సోదరి రిద్ధిమా కపూర్ సాహ్ని, ‘కోకిచి మికిమోటో’ అనే ఆభరణాల సంస్థకు క్షమపణలు తెలిపారు. విషయం ఏంటంటే.. కొన్నాళ్ల క్రితం రిద్ధిమా కపూర్ ‘ఆర్ జ్యూవెలరి’ పేరుతో సొంత బ్రాండ్ను ప్రారంభించి.. ప్రత్యేకంగా ఆభరణాలు తయారు చేయించి అమ్ముతున్నారు. ఈ క్రమంలో పండుగల సీజన్ సందర్భంగా రిద్ధిమా ఒక చెవి దుద్దుల డిజైన్ను విడుదల చేశారు. అయితే ఈ చెవి దుద్దుల డిజైన్, ప్రముఖ ముత్యాల నగల తయారీదారులు ‘కోకిచి మికిమోటో’ కంపెనీ తయారు చేసిన చెవి దుద్దుల డిజైన్ రెండు ఒకే మాదిరిగా ఉన్నాయి. దాంతో రిద్ధిమా, కోకిచి వారి డిజైన్ను కాపీ కొట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. View this post on Instagram The legendary Kokichi Mikimoto is known in the pearl world as the ‘King of Pearls’. His ‘cultured pearls’ —patented in 1916 — is a benchmark for the industry at large. So, naturally ‘Jewellery designer of the year’, @riddhimakapoorsahniofficial couldn’t help herself from selling the iconic Mikimoto pearl and diamond earrings under her namesake label. If this is not #gutsontoast, we don’t know what is! 🤯 . . #gandi #dietsabya #copy #🤢 #riddhimakapoorsahni #mikimoto #mikimotopearls A post shared by Diet Sabya (@dietsabya) on Nov 25, 2018 at 1:57am PST తొలుత ఈ విషయం గురించి ఒక అపరిచిత వ్యక్తి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో ఈ విషయం కాస్తా వైరల్ కావడంతో రిద్ధిమా క్షమాపణలు చెప్పారు. ‘ఒరిజినల్ డిజైన్ని ట్యాగ్ చేయకపోవడం మా తప్పే. డిజైనర్ల సృజనాత్మకతను మేము గౌరవిస్తాము. మేము ఎవరిని కాపీ చేయము.. ఒకవేళ అలాంటి పనులు చేస్తే మాకు స్ఫూర్తినిచ్చిన వారిని మేము ఎప్పటికి గౌరవిస్తాము’ అంటూ రిద్ధిమా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Riddhima Kapoor Sahni (@riddhimakapoorsahniofficial) on Nov 25, 2018 at 8:41am PST -
‘సర్కార్’పై ఏమిటీ అరాచకం!
పుస్తకాలు మొదలుకొని చలనచిత్రాలు, ఛాయాచిత్రాల వరకూ సృజనాత్మక రంగంలోని సకల పార్శా్వల్లోనికీ జొరబడి తమ మాటే చెల్లుబాటు కావాలంటూ ఒత్తిళ్లు తీసుకొచ్చే ధోరణి ఉన్నకొద్దీ పెరుగుతోంది. సర్వోన్నత న్యాయస్థానం పదే పదే చెప్పినా ఈ విషయంలో ఏ మార్పూ రావడం లేదు. తాజాగా వివిధ భాషల్లో విడుదలైన తమిళ చిత్రం ‘సర్కార్’ చుట్టూ ఆ మాదిరి వివాదమే రాజుకుంది. అందులోని కొన్ని సన్నివేశాలు తమ పార్టీ అధినేత జయలలితను, ఆమె తీసుకొచ్చిన జన సంక్షేమ పథకాలను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ పాలక అన్నా డీఎంకే కార్యకర్తలు తమిళనాడులోని థియేటర్లపై పడ్డారు. ఆ చిత్రం బ్యానర్లు, పోస్టర్లు చించి కటౌట్లు ధ్వంసం చేశారు. మంత్రులు ఆ చిత్ర కథానాయకుడు విజయ్, దర్శకుడు మురుగదాస్లకు వ్యతిరేకంగా ప్రకటనలి చ్చారు. ఒక మంత్రి ‘దేశద్రోహం’ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కొన్ని సన్నివేశాలు ప్రభుత్వా నికి వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టేలా ఉన్నాయన్నది అన్నాడీఎంకే నేతల అభియోగం. మురుగ దాస్పై ఫిర్యాదు రావడం తరవాయిగా ఆయన ఇంటిపై రాత్రికి రాత్రే పోలీసులు దాడి చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక సాధారణ పౌరుడెవరైనా తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇంత వేగంగా కదులుతారా? మురుగదాస్ తెల్లారి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది. చివరకు అన్నా డీఎంకే కార్యకర్తలకు అభ్యంతరకరం అనిపించిన సన్నివేశాల తొలగింపునకు, కొన్ని పదాలు వినబడకుండా చేసేందుకు చిత్ర నిర్మాతలు అంగీ కరించాల్సి వచ్చింది. తమ అధినేతను అవమానించినవారిని సాష్టాంగపడేలా చేయగలిగామన్న సంతృప్తి అన్నా డీఎంకే నేతలకు ఉండొచ్చు. కానీ సాధారణ ప్రజలకు ఇదెలాంటి సందేశాన్ని పంపు తుంది? బలప్రయోగంతో దేన్నయినా సాధించుకోగలమన్న అభిప్రాయం కలిగించదా? ప్రభుత్వా నికి సారథ్యం వహించే పార్టీకి ఇది మంచి చేస్తుందా? రేపెవరైనా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇదే మార్గాన్ని అనుసరిస్తే ముఖ్యమంత్రి పళనిస్వామి ఏం చేస్తారు? ప్రజలు ఎన్నికల్లో ఓట్లేసి అధి కారం కట్టబెట్టేది తమ సమస్యలు పరిష్కరించడానికి. అంతేతప్ప తమకు శిరోభారం కలిగించమని కాదు. కానీ అది పుస్తకం కావొచ్చు, అయ్యప్ప సన్నిధికి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు నిర్ణయం కావొచ్చు... దేన్లోనైనా వివాదం రెచ్చగొట్టి లబ్ధిపొందుదామని చూసే ధోరణి రాజ కీయ నాయకుల్లో పెరుగుతోంది. ఏదైనా కళారూపంపై అందరికీ ఏకీభావం ఉండాలని లేదు. దాన్ని మెచ్చేవారున్నట్టే, అదంటే నచ్చనివారు కూడా ఉంటారు. రచయితలైనా, కళాకారులైనా సమాజంలో జరిగేవాటిని విమర్శ నాత్మకంగా ప్రతిబింబిస్తారు తప్ప దేన్నీ గాల్లోంచి సృష్టించలేరు. మనకు రోజూ తారసపడేదే అయినా, అది మన అనుభవంలోకి పదే పదే వస్తున్నా మనం చూడని భిన్న కోణాన్ని వారు అందులో స్పృశించి ఉండొచ్చు. అది సరైంది కాదనుకునేవారు దాన్ని నిశితంగా విమర్శించవచ్చు. నిరసన వ్యక్తం చేయొచ్చు. అదెలా తప్పో నిరూపించవచ్చు. న్యాయస్థానాల్ని సైతం ఆశ్రయించ వచ్చు. కానీ ఈ మార్గాలను వదిలిపెట్టి ఆవేశంతో రోడ్లెక్కి వ్యక్తులపై దాడులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, బెదిరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తుంది. కానీ చిత్రమేమంటే ఆవేశంతో చెలరేగే గుంపులు మాత్రమే కాదు... ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే నేతలు సైతం ఇలాంటి పనులు చేయడానికి వెరవడం లేదు. జనాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించి వారి మెప్పు పొందాలని ఒకప్పుడు పార్టీలు తహతహలాడేవి. ఇప్పుడు రోజులు మారాయి. తామను కునే అభిప్రాయాన్ని వారిపై రుద్ది, దాన్ని జనాభిప్రాయంగా చలామణి చేసి ఆ వంకన ‘బ్లాక్మెయి లింగ్’కు దిగే ధోరణి పెరిగిపోయింది. ‘పద్మావత్’ చిత్రం పడిన కష్టాలు ఇందుకు ఉదాహరణ. షూటింగ్ జరుపుకునే దశ నుంచి దానిపై కర్ణి సేన దాడులు చేస్తూ వచ్చింది. ఆ చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తలలు తీసుకొచ్చినవారికి రూ. 5 కోట్లిస్తామనే వరకూ వ్యవహారం వెళ్లింది. చివరకు ఆ చిత్రంలో తామనుకున్నట్టు ఎలాంటి అభ్యంతరకర సన్నివే శాలూ లేవని తెలిసినా ఈ గుంపు విధ్వంస పోకడల్ని విడనాడలేదు. తమిళనాడు థియేటర్ యజ మానుల సంఘం నాయకుడు సుబ్రమణియమ్ ఆవేదన గమనించదగ్గది. రాజకీయ పార్టీలకూ, నటులకూ మధ్య వివాదం తలెత్తినప్పుడల్లా తమ ఆస్తులు ధ్వంసమవుతున్నాయని, వ్యాపారం దెబ్బతింటున్నదని ఆయన చెప్పారు. నిజమే... ప్రముఖ నటుడు రజనీకాంత్ చిత్రం ‘కాలా’పై ఆర్నెల్లక్రితం ఇలాంటి వివాదమే చెలరేగింది. అనేక కారణాలు చెప్పి ‘కాలా’కు అడ్డంకులు సృష్టిం చేందుకు అటు కర్ణాటకలో, ఇటు తమిళనాడులో అనేక సంఘాలు ప్రయత్నించాయి. చివరకు ఆ వివాదం ఎలాగోలా సద్దుమణిగింది. ఇప్పుడు ‘సర్కార్’కు కూడా అవరోధాలు తప్పలేదు. మన కున్న కళారూపాల్లో సినిమా అనేది కోట్లాది రూపాయలతో ముడిపడి ఉన్న వ్యాపారం. ఏవో సాకులు చెప్పి అడ్డుకోవాలని చూడటం భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడం మాత్రమే కాదు... దానిపై ఆధారపడి ఉన్న వందల కుటుంబాల జీవికను దెబ్బతీయడం. తమిళనాడు ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. చలనచిత్రాలను చూసి, అవి ప్రదర్శనయోగ్యంగా లేవనుకుంటే కత్తిరించడానికి లేదా మొత్తంగా అనుమతి నిరా కరించడానికి ఫిలిం సర్టిఫికేషన్ బోర్డు వంటివి ఉన్నాయి. వాటిపై ఆఖరి మాట చెప్పడానికి న్యాయస్థానాలున్నాయి. అసలు ప్రజాస్వామ్యంలో ఈ సెన్సారింగ్ విధానమే సరికాదని వాద నలొస్తున్న తరుణంలో...రాజకీయ పార్టీలు, కులసంఘాలు సెన్సారింగ్ బాధ్యతను తమ భుజాలకెత్తుకుని అధికారం అండతో గొడవలు సృష్టించడం, బెదిరింపులకు దిగడం దారుణం. రాజ్యాంగంపై, చట్టాలపై విశ్వాసమున్నదని చెబుతున్నవారు ఇలాంటి పోకడలకు పోవడం సరికాదు. -
ఎన్టీఆర్తో గొడవలు లేవు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘నాపేరు సూర్య’ సినిమాతో దర్శకుడిగా వంశీ పరిచయం అయ్యాడు. వక్కంతం వంశీ ‘కిక్’, ‘టెంపర్’, ‘ఎవడు’ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు రచయితగా పనిచేశాడు. అల్లు అర్జున్ కంటే ముందు వంశీ జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో డైరెక్టర్గా మారాలనుకున్నాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ కోసం కథ కూడా సిద్ధం చేశాడు వక్కంతం వంశీ. కొన్ని చర్చలు జరిగిన తర్వాత ఆ ప్రాజెక్టు నుంచి జూనియర్ ఎన్టీఆర్ తప్పుకున్నాడు. గతంలో ఎన్టీఆర్, వంశీల మధ్య విబేధాలు వచ్చాయినే వార్తలు హల్చల్ చేశాయి. వంశీ ప్రస్తుతం ఆ విషయంపై స్పందించాడు. ఎన్టీఆర్తో తనకు ఏ విధమైన వివాదాలు లేవని, ఆయనతో టచ్లో ఉన్నానని చెప్పాడు. ‘ ఎన్టీఆర్తో గొడవలు ఉన్నాయని వచ్చిన రూమర్స్ నిజం కాదు. డైరెక్టర్గా చేయమని ఎన్టీఆర్ నన్ను ప్రోత్సహించాడు. నా మొదటి చిత్రం ఆయనతోనే చేయాలని అనుకున్నాను. స్టోరి కూడా రెడీ చేశాను. కానీ ఆ ప్రాజెక్టును ఆపేశాం. ఆ సమయంలో బన్నీ కోసం ఓ కథ ఉంటే చెప్పమని బుజ్జి గారు అడిగారు. అప్పుడు ‘నా పేరు సూర్య’ కథ సిద్ధం చేశాను’ అని వక్కంతం వంశీ తెలిపాడు. -
నెలసరి సమస్యలకు మండూకాసనం
మండూకాసనం గర్భకోశ వ్యాధులు, రుతుక్రమ సమస్యలను నివారిస్తుంది. ఈ ఆసనంలో మొదట..వెన్ను నిటారుగా వజ్రాసన స్థితిలో కూర్చుని, అరచేతులను తొడల మీద ఉంచాలి.రెండు పిడికిళ్లు బిగించి కింది పొట్టకు ఆనించాలి. మోకాళ్లను కొంచెం దూరం జరిపి, నడుమును (వెన్నును కాదు) వంచి నుదురును నేలకు ఆనించాలి. ఆ స్థితిలో పదిసార్లు శ్వాస తీసుకుని వదిలిన తర్వాత మెల్లగా యథాస్థితికి రావాలి. మొదటి ప్రయత్నంలో నుదుటిని నేలకు ఆనించడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు బలవంతంగా ఆనించే ప్రయత్నం చేయరాదు. సాధనతో సాధ్యం చేసుకోవాలి. ఉపయోగాలు: గర్భకోశ వ్యాధులు, రుతు సంబంధ సమస్యలు పోతాయి. మోకాళ్ల నొప్పులు పోతాయి. నడుము ప్రదేశంలోని దేహభాగాలను ఆరోగ్యవంతంగా ఉంటాయి. పిరుదులలోని కొవ్వు కరిగిపోతుంది. జాగ్రత్తలు: బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు, విపరీతమైన మోకాళ్లనొప్పులతో బాధపడుతున్న వాళ్లు ఈ ఆసనాన్ని సాధన చేయకూడదు. -
ఏలికా.. మాట్లాడాలిక!
ఏ నియోజకవర్గాన్ని చూసినా ఏమున్నది గర్వకారణం.. నగరం సమస్తంసమస్యల పద్మవ్యూహం. వానొస్తే చిగురుటాకులా వణుకుతున్న సిటీ. మరమ్మతులకు నోచుకోని రహదారులు.. అడుగడుగునాగుంతలు.. ఆక్రమణలకు గురైన నాలాలు.. పారిశుధ్యం కొరవడిన వీధులు.. నిధులున్నా ముందుకు సాగని అభివృద్ధి పనులు.. తాగునీటి ఇబ్బందులు.. ప్రగతికి దూరంగా మురికివాడలు... ఇలా ఒకటా రెండా మహానగరాన్ని ఎన్నో సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. వీటన్నింటినీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యేలు మూడేళ్లుగా చెబుతూనే ఉన్నారు. పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. తమ కష్టాలు ఎప్పుడు తీరుతాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో శుక్రవారం నుంచి శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై సభలో సిటీ ఎమ్మెల్యేలు గళం విప్పుతారని నగరవాసులు ఆశిస్తున్నారు. మీ వాణిని మీదైన బాణీలో వినిపించండి ఎమ్మెల్యే సార్లూ..! శేరిలింగంపల్లి:ఎ.గాంధీ ♦ నియోజకవర్గంలో డ్రైనేజీ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. రూ.200 కోట్లతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులు అటకెక్కాయి. ♦ చందానగర్లోని రెడ్డి కాలనీలో ఎస్టీపీ ప్లాంట్ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ♦ నాలాల విస్తరణ ఊసే లేదు. నాలాలు కబ్జాకు గురవుతుండడంతో కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ఇటీవల వర్షాలకు దీప్తిశ్రీనగర్ నీట మునిగింది. గచ్చిబౌలి నాలా పొంగడంతో ఇందిరానగర్, రాంకీటవర్స్ రోడ్డు జలదిగ్భంధంలో చిక్కుకుంది. ♦ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదు. గౌలిదొడ్డి కేశవ్నగర్లో రెండెకరాలు, తాజీనగర్లో 1.25 ఎకరాలు, హఫీజ్పేట్ సాయినగర్లో 1.20 ఎకరాల స్థలం గుర్తించినప్పటికీ పనులు మొదలవడం లేదు. మలక్పేట్ :అహ్మద్ బలాల ♦ మలక్పేట్ నియోజవర్గంలోని మూసారంబాగ్, అక్బర్బాగ్, ఓల్డ్మలక్పేట, చావుణి డివిజన్లలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ♦ మూసీ పరివాహక ప్రాంతాల్లోని తీగలగూడ, షాలివాహననగర్, చావుణి గుడిసెవాసులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటివరకూ పనులు ప్రారంభం కాలేదు. ♦ చాదర్ఘాట్, మలక్పేట్లోని ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యకు ఇంతవరకూ పరిష్కారం చూపలేదు. ♦ మలక్పేట్లోని ఆర్యూబీ కింద రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. ముషీరాబాద్ :కె.లక్ష్మణ్ ♦ హుస్సేన్సాగర్ నాలాకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం కలగానే మారింది. ♦ లోయర్ ట్యాంక్బండ్ గోశాల వద్ద పైప్లైన్ పగిలిపోయి ఏడాదిగా కలుషిత నీరు వస్తోంది. ♦ అశోక్నగర్ బ్రిడ్జి వెడల్పు పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ♦ వీఎస్టీ చౌరస్తా విస్తరణ పనులు చేపట్టాలి. ♦ ముషీరాబాద్లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మహేశ్వరం :తీగల కృష్ణారెడ్డి ♦ నియోజకవర్గంలో ఇంటింటికీ కృష్ణా జలాలు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. మీర్పేట్, జిల్లెలగూడ, బడంగ్పేట్, జల్పల్లి మున్సిపాలిటీల పరిధిలో మూడు, నాలుగు రోజులకు ఒకసారి మంచినీరు వస్తోంది. ♦ జిల్లెలగూడ, మీర్పేట్లోని చెరువులను సుందరీకరిస్తామని ఇచ్చిన హామీ అటకెక్కింది. ఈ ప్రాంతాల్లోని చెరువులు మురుగు నీటితో కంపు కొడుతున్నాయి. ♦ రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. మరమ్మతు పనుల ఊసే లేదు. ♦ ఆర్కేపురం ఎన్టీఆర్నగర్ వాసులకు రెగ్యులరైజేషన్ చేస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. అంబర్పేట..: కిషన్రెడ్డి ♦ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ♦ బతుకమ్మ కుంట పునరుద్ధరణలో తీవ్ర జాప్యం. ♦ అంబర్పేట తహసీల్దార్ కార్యాలయంలో మౌలిక సదుపాయాల కొరత. ♦ ఆధునికీకరణకు నోచుకోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ♦ సమస్యగా పరిణమించిన రత్నానగర్, మోహిన్చెరువు, ఓయూ నాలాలు. చాంద్రాయణగుట్ట: అక్బరుద్దీన్ ఒవైసీ ♦ ఉప్పుగూడ రైల్వే క్రాసింగ్ వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) పనులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో స్థానికులు, వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. పాతబస్తీ..మారదా.. దుస్థితి చార్మినార్, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్పురా నియోజకవర్గాల్లో మూడేళ్లుగా సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు నోచుకోవడం లేదు. పలు ప్రాంతాల్లో ఇప్పటికీ తాగునీటి కుళాయిల్లో మురుగు నీరు సరఫరా అవుతోంది. చార్మినార్ కాలిబాట పథకం పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. -పాషాఖాద్రీ,చార్మినార్ ఎమ్మెల్యే యాకుత్పురా: అహ్మద్ఖాన్ ♦ సంతోష్నగర్ ఐ.ఎస్.సదన్ చౌరస్తా వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం హామీలకే పరిమితమైంది. మూడేళ్లు గడిచినా కార్యరూపం దాల్చలేదు. ♦ పూర్తిస్థాయిలో రీమోడలింగ్ జరగని డ్రైనేజీ వ్యవస్థతో ఇబ్బందులు. ♦ నూర్ఖాన్బజార్ వద్ద నిర్మిస్తున్న మంచినీటి రిజర్వాయర్ పూర్తి కాలేదు. బహదూర్పురా:మోజంఖాన్ ♦ లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ♦ నాలాల విస్తరణ పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. ♦ బహదూర్పురా– కిషన్బాగ్ రోడ్డులో నౌ నంబర్ వరకు ప్లైఓవర్ బ్రిడ్జి మూడేళ్లుగా పెండింగ్లోనే ఉంది. గోషామహల్: రాజాసింగ్లోథా ♦ ధూల్పేట్లోని గుడుంబా తయారీదారులు రోడ్డున పడ్డారు. వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించలేదు. ♦ బేగంబజార్లో చేపల మార్కెట్ అభివృద్ధి అటకెక్కింది. ♦ జుమ్మెరాత్ బజార్లో కల్యాణ మండపం నిర్మిస్తామన్న హామీ నెరవేరలేదు. కుత్బుల్లాపూర్:వివేకానంద్ ♦ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నాలుగేళ్లుగా పక్కా భవనం లేదు. ♦ సుభాష్నగర్ నుంచి ఫాక్స్సాగర్ వరకు నాలా పనులు మొదలు కాలేదు. ♦ జగద్గిరిగుట్టలో బస్సు డిపో ఏర్పాటు కలగానే మారింది. ♦ గాజులరామారం సర్కిల్ పరిధిలో క్వారీ గుంతలు మృత్యుకుహరాలుగా మారాయి. ♦ బహదూర్పల్లి, కొంపల్లి మధ్య రోడ్డు విస్తరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ♦ గండిమైసమ్మ జ్యోతిరావు పూలే స్టేడియం పనులు ఒక్క అడుగు కూడా పడలేదు. ♦ రసాయన వ్యర్థాలను అక్రమంగా నాలాల్లోకి వదులుతున్నా చర్యలు శూన్యం. ఉప్పల్:ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ♦ నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు కలగానే మిగిలింది. ♦ ఉప్పల్ ప్రధాన రహదారి విస్తరణ ప్రతిపాదనకే పరిమితం. ♦ ఏడు చెరువుల పరిరక్షణ హామీ అటకెక్కింది. ♦ ఎమ్మెల్యే నిధులు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికే పరిమితం. ♦ నాచారం ప్రధాన రహదారి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే ధర్నా చేసినా ఫలితం లేదు. ♦ పేదలకు ఇళ్ల నిర్మాణం హామీ నెరవేరలేదు. సనత్నగర్:తలసాని ♦ నియోజకవర్గంలో ట్రాఫిక్ ప్రధాన సమస్య. బేగంపేట్ ప్రాంతంలో నిత్యం రద్దీ ఉంటుంది. ♦ సికింద్రాబాద్ నుంచి అమీర్పేట్, పంజగుట్ట, బాలానగర్, బంజారాహిల్స్, సోమాజిగూడ, సనత్నగర్, ఎరగ్రడ్డ, కూకట్పల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదొక్కటే ప్రధాన మార్గంగా ఉంది. ♦ బండమైసమ్మనగర్, జీవై కాంపౌండ్, పొట్టిశ్రీరాములునగర్, అంబేడ్కర్నగర్ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏడాదిలో నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ పునాదుల దశ దాటలేదు. బస్తీవాసులు అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్ :మాగంటి గోపీనాథ్ ♦ బోరబండలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు హామీ నెరవేరలేదు. ♦ బోరబండ పెద్దమ్మనగర్లో నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. ఇంకా లబ్ధిదారులకు కేటాయించలేదు. ♦ రహమత్నగర్లో ఆర్భాటంగా ప్రకటించిన ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ♦ రహమత్నగర్లో ప్రభుత్వ ఐటీఐ, మ«ధురానగర్లో స్విమ్మింగ్పూల్, రాజీవ్నగర్లో ఇండోర్ స్టేడియం ఏర్పాటు కలగానే మిగిలాయి. మేడ్చల్ :సుధీర్రెడ్డి ♦ ఘట్కేసర్ మండలంలో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామన్న ఎమ్మెల్యే హామీ నేరవేరలేదు. ♦ మేడ్చల్, ఘట్కేసర్, శామీర్పేట మండలాల్లో మినీ స్టేడియాలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. కూకట్పల్లి :మాధవరం కృష్ణారావు ♦ భరత్నగర్ మార్కెట్ను ఆ«ధునికీకరిస్తామని చెప్పిన హామీ నెరవేరలేదు. ♦ బాలానగర్ చౌరస్తాలో నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి పనులు మొదలు కాలేదు. మల్కాజిగిరి :చింతల కనకారెడ్డి ♦ ఆర్ఓబీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ♦ అల్వాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పడకల సంఖ్య పెంచి, కొత్త భవనాన్ని నిర్మిస్తామని చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయి. ♦ సఫల్గూడ చెరువులను మినీ ట్యాంక్లుగా అభివృద్ధి చేసి, ఇక్కడ బోటింగ్, లైటింగ్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. ఎల్బీనగర్ :ఆర్.కృష్ణయ్య ♦ వర్షాలకు కాలనీలు మునిగిపోతున్నాయి. ఇటీవల తపోవన్ కాలనీ, గ్రీన్పార్కు, ఆదర్శనగర్, గడ్డిఅన్నారంలోని ఇళ్లలోని వరద నీరు చేరింది. ♦ నాలాల విస్తరణ ఊసే లేదు. చెరువుల అభివృద్ధి అటకెక్కింది. ♦ రహదారుల విస్తరణ కాగితాలకే పరిమితం. శివారు ప్రాంతాలకు రోడ్లు, తాగునీటి సౌకర్యం లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. -
భయంగా ఉంటోందా?
జీవితంలో కొన్ని సమస్యలు చెప్పుకోవడానికి చాలా చిన్నవిగానే అనిపిస్తాయి. అనుభవించిన వాళ్లకు మాత్రమే వాటి బాధ అర్థమవుతుంది. తరచుగా అలాంటి చిన్నా చితకా సమస్యలు ఎదురవుతూ ఉన్నట్లయితే ఈ పరిహారాలను పాటించండి.ఆర్థిక ఇక్కట్లు, ఆరోగ్య బాధలు లేకపోయినా, ఒక్కోసారి ఏదో తెలియని భయం వెంటాడుతుంటుంది. అప్పుడు అశ్వగంధ వేరును బూడిదరంగు దారంలో కట్టి మెడలో వేసుకోండి. అలాగే, అశ్వగంధాది లేహ్యాన్ని రెండుపూటలా సేవించండి. కొందరికి సాధారణ సమయాల్లో మామూలుగానే ఉన్నా, ప్రయాణాలు చేసే సందర్భాల్లో తెలియని భయాలు కలుగుతుంటాయి. అలాంటప్పుడు ప్రయాణానికి బయలుదేరే ముందు కాలభైరవుడికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించండి. కొందరు విద్యార్థులు బాగానే చదివినా పరీక్షలంటే తగని భయం ఏర్పడుతుంది. పరీక్షల పట్ల విపరీతమైన భయంతో ఇబ్బంది పడే విద్యార్థులకు తల్లి చేతుల మీదుగా మెడలో వెండి హారాన్ని ధరింపజేయాలి. అలాగే, పరీక్షలంటే భయపడే విద్యార్థులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. కొందరికి తరచుగా పీడకలలు వస్తుటాయి. కలల్లో తరచుగా క్రూరమృగాలు, పాములు, భూతప్రేత పిశాచాదులు కనిపించి ఉలిక్కిపడి నిద్రలేస్తుంటారు. ఆ తర్వాత భయంతో ఒక పట్టాన నిద్రపట్టదు. పీడకలలు భయపెడుతున్నట్లయితే, సంజీవని పర్వతం మోస్తున్న ఆంజనేయుడి బొమ్మ గల వెండి లేదా రాగి లాకెట్ను ఎర్రతాడుతో మెడలో వేసుకోండి. ప్రతి మంగళవారం ఉదయం ఆంజనేయ ఆలయంలో దర్శనం చేసుకుని, ఆలయం వెలుపల ఉండే యాచకులకు అరటిపండ్లు పంచిపెట్టండి. – పన్యాల జగన్నాథ దాసు -
‘క్యాష్లెస్’ కాస్త ఖరీదే!!
డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న సమస్యలు • కార్డులు, వాలెట్లు, నెట్ బ్యాంకింగ్కు చార్జీలు • కార్డులపై చెల్లింపులకు ఏకంగా 2 శాతంపైనే • వాలెట్లో డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే తంటా • నెట్ సహా అన్ని లావాదేవీల్లో వైఫల్యాలు • ట్రాన్సాక్షన్ పూర్తి కాదు.. ఖాతాలో డబ్బులేమో మాయం • ఎక్కడికి వెళ్లాయో అర్థమవ్వదు;ఎవరినీ సంప్రదించాలో తెలీదు • కొత్త మాధ్యమాలకు కరవైన నిబంధనలు • సామాజిక మాధ్యమాలను ఆశ్రయించాలంటున్న నిపుణులు నిజం!! ఇది డిజిటల్ యుగం. మీడియా నుంచి ఆర్థిక లావాదేవీల దాకా అన్నీ డిజిటల్ మయమే. అందుకే ప్రభుత్వం కూడా చలామణిలో ఉన్న కరెన్సీని ఒక్కసారిగా రద్దు చేసి డిజిటల్ లావాదేవీల ప్రచారం మొదలుపెట్టింది. కరెన్సీ పెద్దగా అందుబాటులో లేదు కనక జనం కూడా విధిలేక డిజిటల్ లావాదేవీల వైపు అడుగులేస్తున్నారు. కాకపోతే ఇంకా చాలామందికి మొబైల్ వాలెట్లు వాడేదెలా? దానికి చార్జీలేమైనా అవుతాయా? ఇంటర్ నెట్లో బ్యాంకింగ్ లావాదేవీలు ఎలా చేయాలి? ఒకవేళ మధ్యలో ఫెయిలైతే పరిస్థితేంటి? కార్డుల ద్వారా ఎవరికైనా చెల్లింపులు చేయొచ్చా? చార్జీలేమైనా భరించాల్సి ఉంటుందా? ఇలాంటి సందేహాలు చాలానే ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానమే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... మొబైల్లోనే ఉంటుంది మీ వాలెట్... సుజన ఆన్లైన్లో మొబైల్ ఫోన్ కొంటూ... మొబైల్ వాలెట్తో చెల్లించింది. లావాదేవీ పూర్తయినట్లు వాలెట్ ప్రొవైడర్ నుంచి సుజనకు మెయిల్ వచ్చింది. ఆన్లైన్ రిటైలర్ మాత్రం తనకు పేమెంట్ అందలేదన్నాడు. కాబట్టి ఫోన్ పంపలేదు. ఒక వారం గడిచింది. అయినా సుజన డబ్బులు ఆమె ఖాతాలోకి రాలేదు. ఎవరికి చెప్పాలన్నది ఆమెకు తెలియలేదు. ఏం చేయాలంటే..! పేటీఎం సహా చాలా వాలెట్లు ఫిర్యాదులు తీసుకోవటానికి ఫోన్ నెంబరేమీ ఇవ్వటం లేదు. యాప్ లేదా వెబ్సైట్ ద్వారా మెయిల్ పంపటానికి మాత్రం అవకాశం ఇస్తున్నాయి. అంటే... మనం గట్టిగా ఎవరినీ అడగటానికి లేదు. మెయిల్ ఇవ్వటం... సమాధానం వచ్చేదాకా చూడటం.... అంతే చేయగలిగింది. అయితే చాలా వరకూ మెయిళ్లకు ఈ సంస్థలు స్పందించి లావాదేవీల్ని పరిష్కరిస్తున్నాయి. ‘‘లావాదేవీలు నిర్వహించే మాధ్యమాన్ని బట్టి లావాదేవీ సెటిల్మెంట్ ఉంటుంది. కొన్ని సార్లు ట్రాన్సాక్షన్లు ఫెయిలవుతాయి. ఇలాంటపుడు ఆ లావాదేవీ మొత్తం తిరిగి మనకు చేరడానికి కొన్ని సెకన్ల నుంచి ఏడు పనిదినాల సమయం పట్టొచ్చు. ఇంకా ఎక్కువ సమయం పడితే.. అపుడు ఆ డబ్బులు పూల్ అకౌంట్లో ఉంటాయి. వాలెట్స్/ బ్యాంకులు.. పేమెంట్ నెట్వర్క్ ప్రొవైడర్తో కలిసి ఈ అకౌంట్లను నిర్వహిస్తాయి’’ అని పేయూ ఇండి యా సర్వీస్ డెలివరీ హెడ్ హరి వేలాయుధన్ చెప్పారు. వాలెట్లు ఎలా వాడాలి? పేటీఎం, మొబిక్విక్, ఆక్సిజన్, ఫోన్పే, స్వైపే... ఇలా రకరకాల మొబైల్ వాలెట్లు అందుబాటులో ఉన్నాయి. దేని ప్రయోజనాలు దానివి. దేని నష్టాలు దానివి. ఎందుకంటే అన్ని వాలెట్లూ అన్ని లావాదేవీలకూ వాడలేం. ఉదాహరణకు మనం ఒక దుకాణంలో పేటీఎం ద్వారా చెల్లించాలని భావిస్తే... సదరు దుకాణదారుడు కూడా పేటీఎం వాడుతుండాలి. తను వేరే వాలెట్ వాడితే కుదరదు. వీటిని వాడాలనుకున్న వారు మొబైల్ ఫోన్లో ఆండ్రాయిడ్ లేదా యాపిల్ ప్లే స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మన వివరాలతో రిజిస్టర్ చేసుకుని... మనకున్న ఆన్లైన్ బ్యాంకు ఖాతా నుంచో, లేకపోతే క్రెడిట్/డెబిట్ కార్డు నుంచో దీన్లో డబ్బులు వేయాలి. అప్పటి నుంచి వాడటం మొదలుపెట్టొచ్చు. చార్జీలెలా ఉంటాయంటే... వాలెట్లలో ఉన్న ప్రస్తుతం చాలా వాలెట్లు మనం లావాదేవీలు చేసేటపుడు ఎలాంటి చార్జీలూ వసూలు చేయటం లేదు. కాకపోతే వాలెట్లో డబ్బులు వేసేటపుడు మన బ్యాంకులు మాత్రం లావాదేవీ చార్జీ తీసుకుంటున్నాయి. ఒకవేళ మనం వాలెట్లో ఉన్న డబ్బుల్ని బ్యాంకు ఖాతాలో వేసుకోవాలన్నా ఇవి 1–4 శాతం మధ్య చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ గమనించి వాడాల్సి ఉంటుంది. మీ బ్యాంకంతా... ఇంటర్నెట్లోనే రాజేష్ తన బ్యాంకు ఖాతా నుంచి మొబైల్ వాలెట్కు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బు బదిలీ చేశాడు. బ్యాంకు ఖాతా నుంచి డబ్బు వెళ్లింది. కానీ వాలెట్లో జమ కాలేదు. ఎందుకిలా? బ్యాంకును ఫోన్లో సంప్రదించాడు. ‘‘సర్! ఇది రెండంచెల వ్యవస్థ. రెండింటి మధ్య పేమెంట్ గేట్వే ఉంటుంది. ఇది బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు తీసుకొని.. దాన్ని వాలెట్లో జమ చేస్తుంది. గేట్వేకు చేరక ముందే లావాదేవీ ఫెయిలయి ఉండొచ్చు. సర్వర్ పనిచేయకపోవడం, నెట్వర్క్ సమస్యలు ఉండొచ్చు. గేట్వే కంపెనీలు బ్యాంకులతో రోజూ లావాదేవీలను సెటిల్ చేస్తాయి. ఇది జరిగి మీ ఖాతాలోకి డబ్బులు రావటానికి 1–2 పనిదినాలు పట్టొచ్చు’’ అని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ వివరించాడు. ఒకవేళ పేమెంట్ గేట్వే డబ్బుల్ని తీసుకున్నాక లావాదేవీ ఫెయిలైతే ఆ డబ్బులు వాలెట్కు చేరుతాయి. అదీ కథ. ‘‘నిజమే! వాలెట్ నుంచి బ్యాంక్కు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసేటపుడు ఎక్కువ సమస్యలొస్తున్నాయి’’ అని పేటీఎం సీనియర్ వైస్ప్రెసిడెంట్ దీపక్ అబాట్ చెప్పారు. ‘‘బ్యాంకుల్లో రద్దీ వల్ల రిఫండ్ ఆలస్యం కావొచ్చు. మేం వాటికి రెఫరెన్స్ నంబర్ను పంపిస్తాం. బ్యాంకులో జరిగే ప్రక్రియతో మాకెలాంటి సంబంధం ఉండదు. మా దగ్గరకొచ్చిన కస్టమర్లకు ఏం చేయాలో సూచనలు మాత్రమే ఇవ్వగలం’’ అని వివరించారాయన. నెట్బ్యాంకింగ్ చేసేదెలా? ఇంటర్ నెట్ బ్యాంకింగ్ చేయడానికి మీకు మొదట బ్యాంకు ఖాతా ఉండాలి. తరవాత బ్యాంకు బ్రాంచిలో సంప్రదిస్తే వారు చిన్న దరఖాస్తు తీసుకుని నెట్బ్యాంకింగ్ ఐడీ ఇస్తారు. పాస్వర్డ్ను పోస్ట్లో పంపిస్తారు. ఈ ఐడీ, పాస్వర్డ్ సాయంతో నెట్బ్యాంకింగ్ లావాదేవీలు చేయొచ్చు. ఈ నెట్బ్యాంకింగ్ ద్వారా బిల్లులు చెల్లించటంతో పాటు, ఇతరుల బ్యాంకు ఖాతాలకు, మొబైల్ వాలెట్లకు డబ్బులు బదిలీ చేయొచ్చు. ఇపుడు ప్రతి బ్యాంకూ మొబైల్ యాప్లు తెచ్చింది. మొబైల్ యాప్ ద్వారానే నెట్బ్యాంకింగ్ లావాదేవీలన్నీ జరుపుకోవచ్చు. వాలెట్లతో పోలిస్తే వీటికి భద్రత ఎక్కువ. చార్జీలూ తక్కువ. చార్జీలూ ఉంటాయి... ఇతరుల ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేయాలంటే వారిని మీ పేయీలుగా జత చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నాక... ఇమీడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్)తో పాటు నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు బదిలీ చేయొచ్చు. ప్రతి లావాదేవీకీ కొంత చార్జీ ఉంటుంది. ఇది రూ.2–5 మధ్య ఉంటుంది. ఎక్కువ మొత్తాలకైతే ఆర్టీజీఎస్, తక్కువ మొత్తాలకైతే నెఫ్ట్, తక్షణం (సెకన్లలో) డబ్బు బదిలీ కావాలంటే ఐఎంపీఎస్ వాడాలి. ఐఎంపీఎస్కు కాస్త ఎక్కువగా రూ.5 వరకూ చార్జీలవుతాయి. కార్డు వాడొచ్చు... కానీ చార్జీలుంటాయ్ సౌమ్య ఓ షాపులో సరుకులు కొని డెబిట్ కార్డుతో చెల్లించబోయింది. స్వైప్ చేశాక.. కాసేపటికి ట్రాన్సాక్షన్ తిరస్కరణకు గురైనట్లు అక్కడ మెసేజీ కనిపించింది. కానీ మొబైల్కు మాత్రం బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. బ్యాంకును సంప్రదిస్తే... ఆ డబ్బులు తిరిగి వస్తాయని, కంగారు పడొద్దని చెప్పారు. కంగారు సంగతి సరే! ముందు దుకాణదారుకు చెల్లించటానికి డబ్బులుండాలి కదా!! అనుకుంది. స్నేహితుల సాయంతో పని పూర్తిచేసింది. కార్డులు వాడటమెలా? నిజానికి ప్రభుత్వమిపుడు కరెన్సీని తగ్గించి డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహిస్తోంది. నెట్బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ల వంటివి కాస్త ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉన్నవారికే కాగా... అందరికీ చేతనైనది కార్డుల వాడకమే. ఎందుకంటే దేశంలో చాలా కుటుంబాలకు బ్యాంకు ఖాతాలున్నాయి. వారికి డెబిట్ కార్డులూ ఉన్నాయి. కొందరికైతే క్రెడిట్ కార్డులుంటాయి. షాపుల్లో చెల్లింపులకు కార్డులు వాడొచ్చు. ఇంటర్నెట్లో కూడా ఈ కార్డుల ద్వారా లావాదేవీలు జరపొచ్చు. ఈ కార్డుల వాడకానికి కావాల్సిన పిన్ నంబరును బ్యాంకులే ఇస్తాయి. చార్జీలతో జాగ్రత్త! డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం... డిజిటల్ లావాదేవీలు జరిపేవారిపై చార్జీలను కూడా బాదుతుండటం గమనార్హం. కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరించే ప్రతి వ్యాపారీ... చివరికి అలా స్వీకరించిన డబ్బును తన బ్యాంకు ఖాతాలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలా బ్యాంకు ఖాతాలోకి డబ్బులు తీసుకునేటపుడు బ్యాంకులు 2 నుంచి 4 శాతం చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ తామెందుకు భరించాలని భావిస్తున్న వ్యాపారులు.... ఆ చార్జీల్ని కూడా కస్టమర్లపైనే వేస్తున్నారు. వీటిని భరించటమెందుకని భావిస్తున్న కస్టమర్లు... కార్డు బదులు నగదు ఇవ్వటానికే మొగ్గు చూపుతున్నారు. ఇదంతా ఒక గొలుసు వ్యవస్థ. ఇటీవలే పెట్రోలు బంకులు ఈ విషయంపై సమ్మె చేశాయి. తమను కస్టమర్ల నుంచి చార్జీలు వసూలు చేయొద్దని చెబుతూ... తమ వద్ద నుంచి మాత్రం బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. సమ్మె చేస్తామన్నారు. కార్డులు తీసుకోకూడదని కూడా ఒక దశలో నిర్ణయించారు. చివరికి ప్రభుత్వం జోక్యం చేసుకుని కొంత గడువు అడగటంతో వెనక్కి తగ్గారు. నిజానికిది ఒక్క పెట్రోలు బంకుల సమస్య మాత్రమే కాదు. కార్డుల్ని స్వీకరించే వారందరి సమస్య. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఎలాంటి లావాదేవీలూ లేని లైఫ్టైమ్ ఫ్రీ కార్డులు జారీ చేస్తున్నాయి. కానీ తమకు చార్జీలవుతున్నాయి కాబట్టి వ్యాపారులు ఈ కార్డుదారుల నుంచి కూడా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది 4 శాతం వరకూ ఉండటంతో కస్టమర్లు గగ్గోలు పెడుతున్నారు. మనలో ఆ సత్తా ఉందా? వాలెట్లెలా వాడాలి? కార్డులెలా వాడాలి? నెట్ బ్యాంకింగ్ ఎలా చేయాలి? చార్జీలెంత? అనే విషయాలన్నీ పక్కనబెడితే... ఆసలు డిజిటల్ లావాదేవీల్ని ప్రోత్సహించే వ్యవస్థ మన దగ్గర ఉందా? అన్నది మరో ప్రశ్న. ఎందుకంటే డిజిటల్ లావాదేవీల్లో ఫెయిలవటం సాధారణంగా మారిపోయింది. ఇక మోసగాళ్ల సంగతి సరేసరి. అనుక్షణం అప్రమత్తంగా లేకపోతే ఖాతాలో డబ్బులు మాయం. పైపెచ్చు కొత్తగా వస్తున్న డిజిటల్ మాధ్యమాలకు సరైన నిబంధనలు కూడా లేవు. ఉదాహరణకు డబ్బులు తీసుకెళ్లడానికి ఏటీఎంకు వెళతాం. అక్కడ డబ్బులు రావు. కానీ డబ్బులు కట్ అయినట్లు మన మొబైల్కి మేసేజ్ మాత్రం వస్తుంది. తర్వాత మళ్లీ మన ఖాతాలో ఆ డబ్బులు జమవుతాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు.. సమస్య పరిష్కారానికి ఆర్బీఐ కొన్ని నిబంధనలు పెట్టింది. ఏటీఎంలో డబ్బులు రాకుండా, మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయితే.. ఈ విషయాన్ని బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు అందిన ఏడు పనిదినాల్లో బ్యాంకులు ఆ సమస్యలను పరిష్కరించాలి. లేకుంటే అవి రోజుకు రూ.100 జరిమానా భరించాలి. కానీ వాలెట్స్, యూపీఐ వంటి కొత్త పేమెంట్ చెల్లింపు మాధ్యమాలకు వచ్చేసరికి ఇలాంటి నిబంధనలు లేవు. లావాదేవీలకు, ఉద్యోగుల సంఖ్యకు పొంతన లేదు.. ‘‘పెద్ద నోట్ల రద్దు తరవాత లావాదేవీల పరిమాణం 10 రెట్లు పెరిగింది. కానీ ఉద్యోగుల సంఖ్య మాత్రం 1.5–2 రెట్లే పెరిగింది. అందుకే ఫెయిలైన లావాదేవీల పరిష్కారానికి కొన్ని సంస్థలు ఎక్కువ రోజుల సమయం తీసుకోవచ్చు’ అని మొబిక్విక్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) ఆకాశ్ గుప్తా చెప్పారు. వాలెట్ సంస్థలు వారి సిబ్బందిని వేగంగానే పెంచుకుంటున్నాయని తెలియజేశారు. ‘నవంబర్కు ముందు మొబిక్విక్లో 160 మంది ఉద్యోగులు ఉన్నారు. మార్చి చివరి నాటికి వీరి సంఖ్య 1,000కి చేరొచ్చు’ అని తెలిపారు. సోషల్ మీడియాను వాడేసుకోవచ్చు... లావాదేవీ ఫెయిలయ్యాక రెండు నుంచి ఏడు రోజుల్లోగా రిఫండ్ రాకపోతే.. వెంటనే వాలెట్ సర్వీస్ ప్రొవైడర్ను సంప్రదించాలి. మీకు వచ్చిన రెస్పాన్స్ సంతృప్తికరంగా లేకపోతే ఇంకా గట్టిగా ప్రయత్నించండి. ప్రతి వాలెట్ సంస్థ వాటి వెబ్సైట్లో సమస్య పరిష్కారపు నిబంధనలను పొందుపరిచే ఉంటుంది. అక్కడ సంబంధిత అధికారుల వివరాలు ఉంటాయి. వారిని సంప్రదించాలి. ‘‘చిట్టచివరిగా గ్రీవెన్స్ అధికారి వద్ద సమస్య కచ్చితంగా పరిష్కారమవ్వాలి. అక్కడా కాకపోతే మీరు ఆర్బీఐ గ్రీవెన్స్ సెల్ను సంప్రదించొచ్చు’ అని ఫ్రీచార్జ్ అధికార ప్రతినిధి చెప్పారు. సమస్యను బ్యాంక్ లేదా వాలెట్ సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేస్తే త్వరగా పరిష్కారం కావచ్చని చిల్లర్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ చెప్పారు. ‘సంస్థలు వారి సోషల్ మీడియా ఇమేజ్కు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. మీ సమస్య ఏడు రోజులు దాటినా కూడా తీరకపోతే.. అప్పుడు మీరు ఆయా సంస్థల సోషల్ మీడియా పేజ్లను వాడుకోండి’ అని సూచించారు. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం