-
తను.. గూంగీ గుడియా కాదు.. ఉక్కు మహిళ!
బొట్టు, గాజులు, పువ్వులు.. భారతీయ స్త్రీకి అలంకారంగానే చూస్తున్నారు! వాటి చుట్టూ ఆర్థిక, సామాజిక భద్రత చట్రాన్ని బిగించి మహిళను బందీ చేశారు! అయితే స్వాతంత్య్రానికి పూర్వమే బుద్ధిజీవులు ఆ కుట్రను పసిగట్టారు. అలంకారం స్త్రీ హక్కు.. అది ఆత్మవిశ్వాసానికి ప్రతీక.. ఆ ఆత్మవిశ్వాసమే ఆమె ఆర్థిక, సామాజిక సాధికారతకు పునాది అని నినదించారు! వితంతు చదువు, కొలువు, పునర్వివాహం కోసం పోరాడారు. సమాజాన్ని చైతన్యపరచడానికి చాలానే ప్రయత్నించారు. అయినా .. వితంతువుల జీవితాలేం మారలేదు.. సంఘసంస్కర్తల పోరు చిన్న కదలికగానే మిగిలిపోయింది! పురోగమిస్తున్న.. పురోగమించిన సమాజాల్లో ఎన్నో అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి.. చట్టాలు వస్తున్నాయి!కానీ ఆల్రెడీ చట్టాల తయారీ వరకు వెళ్లిన విడో సమస్యల మీద మాత్రం ఆ సమాజాల్లో కనీస అవగాహన కొరవడుతోంది! చర్చలు అటుంచి ఆ పేరు ఎత్తితేనే అపశకునంగా భావించే దుస్థితి కనపడుతోంది! అందుకే యూఎన్ఓ ‘ఇంటర్నేషనల్ విడోస్ డే’ను నిర్వహించడం మొదలుపెట్టింది.. ఏటా జూన్ 23న. ఆ రకంగానైనా ప్రపంచ దేశాలు విడో సమస్యలను పట్టించుకుని వాళ్ల రక్షణ, సంరక్షణ బాధ్యతను సీరియస్గా తీసుకుంటాయని.. ప్రజలూ వాళ్లను సమదృష్టితో చూసే పెద్దమనసును అలవరచుకుంటారని! ఆ సందర్భాన్నే ఈ వారం కవర్ స్టోరీగా మలిచాం!మోదీ 3.0 కేబినేట్లో అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి పొందిన వ్యక్తిగా రక్షా ఖడ్సే రికార్డులోకి ఎక్కారు. ఆ ఘనత ఆమెకు గాలివాటంగా రాలేదు. దాని వెనుక పెద్ద కథే ఉంది. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన రక్షా భర్త, ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అనివార్యంగా రక్షా ఖడ్సే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వరుసగా మూడుసార్లు మహరాష్ట్రలోని రావేర్ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. భర్త తరఫు కుటుంబం నుంచి సహకారం అందడంతో ఆమె రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. అయితే అందరికీ రక్షా ఖడ్సేలా çకుటుంబం నుంచి, సమాజం నుంచి సహాయ సహకారాలు అందడం లేదనడానికి ఒక ఉదాహరణ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇటీవల కనిపించింది.తెలుగు రాష్ట్రాల్లోని ఓ గ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంచాయతీ ముదిరింది. ఒత్తిడి తట్టుకోలేక ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడి తరఫు బంధువులు ఆస్తి పంపకం విషయంలో మృతుడి భార్య తరఫువారు వెనక్కి తగ్గితేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఈ ప్రతిపాదనకు అవతలి వారు ఒప్పుకోలేదు. ఫలితంగా మూడు రోజులైనా దహన సంస్కారాలు జరగలేదు. చివరకు మృతుడి కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గడంతో మూడు రోజుల తర్వాత అంత్యక్రియల ప్రక్రియ ముందుకు సాగింది. ఓవైపు భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మహిళ అదే సమయంలో తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. లేదంటే తనకు, తన పిల్లలకు ఈ సమాజం నుంచి ఎంతమేరకు మద్దతు లభిస్తుందనేది ప్రశ్నార్థకమే! ఆనాటి నుంచి ఈనాటి వరకు భర్తను కోల్పోయి ఒంటరైన మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలపై జరగాల్సినంత చర్చ జరగడం లేదు.మధ్యయుగాల్లో..భర్త చనిపోతే అతని చితిపైనే బతికున్న భార్యకు కూడా నిప్పంటించే సతీ సహగమనం అనే అమానవీయ ఆచారాలను రూపుమాపే ప్రయత్నాలు బ్రిటిష్ జమానాలోనే మొదలయ్యాయి. భర్త చనిపోయిన స్త్రీలకు గుండు చేసి, తెల్ల చీరలు కట్టించి, ఇంటి పట్టునే ఉంచే దురాచారాన్ని పోగొట్టేందుకు రాజా రామమోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు అలుపెరగని పోరాటం చేశారు. వీరి కృషి ఫలితంగా ఈరోజు సతీసహగమనం కనుమరుగైంది. తెల్లచీర, శిరోముండన పద్ధతులూ దాదాపుగా కనుమరుగయ్యాయి. అంతగా కాకపోయినా పునర్వివాహాల ఉనికీ కనపడుతోంది. అయితే ఇంతటితో భర్తను కోల్పోయిన మహిళల జీవితాల్లో వెలుగు వచ్చేసిందా? వారి కష్టాలన్నీ తీరిపోయాయా? అని ప్రశ్నించుకుంటే కాదనే సమాధానమే స్ఫురిస్తుంది. భర్తపోయిన స్త్రీలకు కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు మన దగ్గరే కాదు చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి.ప్రస్తుత ప్రపంచ జనాభాను దాదాపు ఎనిమిది వందల కోట్లకు అటూ ఇటూగా పరిగణిస్తే అందులో వితంతువుల సంఖ్య 25 కోట్లకు పైమాటే! సమాజంలో అందరికంటే అత్యంత నిరాదరణ, అవమానాలు, కనీస మద్దతు వంటివీ కరువైనవారిలో వితంతువులే ముందు వరుసలో ఉన్నారు. జాతి, మతం, కులం, వర్గంతో సంబంధం లేకుండా భర్తను కోల్పోయిన స్త్రీకి సమాజం నుంచి కనీస నైతిక మద్దతు కూడా లభించకపోగా అవమానాలు, అవాంతరాలు ఎదురవుతున్నాయి. సమాజం పుట్టుక నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ జాతి వివక్ష, లింగ వివక్ష, కుల వివక్ష, ఆర్థిక అంతరాల మీద జరుగుతున్నంత చర్చ వితంతు సమస్యల మీద జరగడం లేదు. విపత్తులు, యుద్ధాలు, మహమ్మారులు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నప్పుడు ఈ సమస్య పెరుగుతోంది. కరోనా, రష్యా– ఉక్రెయిన్, ఇజ్రాయేల్– పాలస్తీనా యుద్ధాల నేపథ్యంలోనూ వితంతువుల సమస్యలను ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది.గూంగీ గుడియా..మన దేశ తొలి మహిళా ప్రధాని, ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులరాలైన ఇందిరా గాంధీ తన 43వ ఏట భర్త (ఫిరోజ్ గాంధీ)ను కోల్పోయారు. ఆ తర్వాత రెండేళ్లకు తండ్రి జవహర్ మరణంతో ఆమె రాజకీయ ప్రవేశం అనివార్యమైంది. ఇందిరా రాజకీయ జీవితం తొలినాళ్లలో సోషలిస్ట్ నేత రామ్మనోహర్ లోహియా ఆమెను గూంగీ గుడియా (మూగ బొమ్మ)గా అభివర్ణించేవారు. తర్వాత ఆమె తీసుకున్న బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి నిర్ణయాలు, చేపట్టిన ప్రజాదరణ పథకాలు, గరీబీ హఠావో వంటి నినాదాలతో పాటు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి నాంది పలకడం వంటి సాహసాలతో ఆమె గూంగీ గుడియా కాదు ఐరన్ లేడీ అనే ప్రతిష్ఠను సాధించింది. అప్పటిదాకా వితంతువు దేశానికి అపశకునం అని నిందించిన నోళ్లే ఆమె రాజకీయ చతురతను చూసి దుర్గాదేవిగా కీర్తించటం మొదలుపెట్టాయి. ఆ తరానికి చెందిన ఎంతోమంది తమ పిల్లలకు ఇందిరా ప్రియదర్శిని అనే పేరు పెట్టుకునేలా ప్రేరణను పంచారు ఆమె. ఆఖరికి ఇందిరా సమాధిని శక్తిస్థల్గా పిలిచే స్ఫూర్తిని చాటారు.కరోనాతో మరోసారి..రెండు ప్రపంచ యుద్ధాల సందర్భంగా ఈ ప్రపంచం గతంలో ఎన్నడూ చూడనంతగా వితంతు సమస్యను ఎదుర్కొంది. ఆ గాయాల నుంచి బయటపడే సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదం పెచ్చరిల్లింది. మరోవైపు సామ్రాజ్యవాదం నాటిన విషబీజాల కారణంగా ఆర్థికంగా, రాజకీయంగా బలహీనంగా ఉన్న దేశాల్లో అంతర్యుద్ధాలు గడిచిన రెండు దశాబ్దాల్లో పెరిగాయి. వెరసి ఆయుధాల నుంచి తూటాలు దూసుకువస్తున్నాయి. ఆకాశం నుంచి జారిపడే బాంబుల గర్జన పెరిగింది. ఫలితంగా ఎందరో మృత్యువాత పడుతున్నారు. వీటి వల్ల అనూహ్యంగా వితంతువుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం వీరి సంఖ్య .. ఇరాక్, అఫ్గానిస్తాన్, పాలస్తీనా వంటి ఆసియా దేశాలతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోనూ అధికంగా ఉంది. యుద్ధాలు, అంతర్యుద్ధాలకు తోడు కరోనా వైరస్ ఒకటి. అది సృష్టించిన భయోత్పాతానికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. రోజుల తరబడి స్తంభించిపోయాయి. 2020, 2021లలో లక్షలాది మంది జనం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో అధికారిక లెక్కల ప్రకారమే నాలుగున్న లక్షల మంది కరోనాతో చనిపోయారు. అనధికారికంగా ఈ సంఖ్య మరో పది రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంచనా. కరోనా చేసిన గాయాల కారణంగా మనదేశంలోనూ వితంతువుల సంఖ్య పెరిగింది.మరిన్ని రూపాల్లో.. యుద్ధాలు, విపత్తులు, మహమ్మారుల రూపంలోనే కాకుండా ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, రైతుల ఆత్మహత్యలు వంటివీ మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వితంతువుల సంఖ్య పెరగడానికి కారణాలవుతున్నాయి. కష్టనష్టాలకు ఓర్చి సాగు చేసిన రైతులు అప్పుల పాలవుతున్నారు. మార్కెట్ స్థితిగతులపై అవగాహన లేకపోవడం, కరువు, అధిక వడ్డీలు, ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం వంటి కారణాల వల్ల ఏ ఏటికి ఆ ఏడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. అప్పటికే అప్పుల పాలైన సదరు రైతు కుటుంబం, ఆ రైతు జీవిత భాగస్వామి అలవికాని కష్టాల్లో మునిగిపోయుంటోంది. మరోవైపు వెనుకబడిన ప్రాంతాల్లో మద్యం ప్రాణాలను కబళిస్తోంది. తాగుడు అలవాటైన వ్యక్తులు అందులోనే జోగుతూ కుటుంబాలను అప్పుల్లోకి నెడుతూ అనారోగ్యంపాలై చనిపోతున్నారు. ఆఖరికి ఆ కుటుంబం చిక్కుల్లో పడుతోంది. అందులో అత్యంత వేదనను భరిస్తోంది సదరు మృతుడి జీవిత భాగస్వామే!అత్యంత సంపన్న మహిళ..33.50 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళాగా గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్ కూడా ఒంటరి మహిళే! తన ¿¶ ర్త.. జిందాల్ గ్రూప్ ఫౌండరైన ఓంప్రకాశ్ జిందాల్ మరణం తర్వాత.. స్టీల్, పవర్, సిమెంటుకు చెందిన జిందాల్ గ్రూప్ వ్యాపార సంస్థలకు చైర్పర్సన్ గా ఆ గ్రూప్ వ్యాపార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.సమస్యల వలయం..హఠాత్తుగా భర్తను కోల్పోవడం స్త్రీ జీవితంలో అతి పెద్ద కుదుపు. అప్పటి వరకు తనతో జీవితాన్ని పంచుకున్న వ్యక్తితో ఉండే అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఒక్కసారిగా దూరం అవుతాయి. దీంతో మానసిక తోడును ఒక్కసారిగా కోల్పోతారు. ఆ స్థితిని అర్థం చేసుకుని మానసికంగా తమను తాము కూడగట్టుకోక ముందే ఆచారాలు, సంప్రదాయాలు ఆ స్త్రీ పై తమ దాడిని మొదలెడతాయి. ఆ వెంటనే ఆస్తి పంపకాలు, బాధ్యతల విభజన విషయంలో భర్త తరఫు కుటుంబ సభ్యుల ఒత్తిడి మొదలవుతుంది. కాస్త చదువు, అదిచ్చిన ధైర్యం ఉన్న స్త్రీ అయితే స్వయంగా నిర్ణయం తీసుకుని తనకు, తన పిల్లలకు సురక్షితంగా ఉన్న దారిని ఎంచుకుంటుంది. ఆ రెండూ లేని వితంతువులు భర్త తరఫు కుటుంబం లేదా పుట్టింటి వారి దయాదాక్షిణ్యాలకు తల ఒగ్గుతారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఆ రెండు ఇళ్లలో ఏదో ఒక ఇంటికి స్వచ్ఛంద వెట్టి చాకిరికి కుదిరిపోతారు వారి తుది శ్వాస వరకు. కాలం మారినా ఈ దృశ్యాలు మాత్రం మారలేదు. పై చదువులు, కొలువుల కోసం అమ్మాయిలు ఒంటరిగా విదేశాలకు వెళ్లే పురోగతి ఎంతగా కనిపిస్తోందో.. దేశానికి ఇంకోవైపు భర్తపోయిన ఒంటరి స్త్రీల దయనీయ జీవితపు అధోగతీ అంతే సమంగా దర్శనమిస్తోంది.కుటుంబాల మద్దతు లేకపోయినా, మెరుగైన జీవితం కోసం ధైర్యంగా అడుగు ముందుకు వేసి జీవన పోరాటం మొదలుపెట్టినా.. పొద్దునే ఆమె ఎదురొస్తే సణుక్కుంటూ మొహం తిప్పుకుని వెళ్లడం, శుభకార్యాలకు ఆమెను దూరంగా పెట్టడం, నోములు వ్రతాలకు ఆమెను బహిష్కరించడం, అంతెందుకు దేవుడి గుడిలోనూ అలాంటి అవమానాన్నే పంటి బిగువున భరించాల్సి వస్తోంది ఆమె! వీటన్నిటినీ జయించే శక్తిని కూడదీసుకున్నా, భర్త పోయిన ఆడవాళ్లకు ఇంటా, బయటా ఎదురయ్యే లైంగిక వేధింపుల చిట్టా మరొక కథ. ఇలా విడో అన్నిటికీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిన తీరు అభివృద్ధి చెందుతున్న, చెందిన సమాజాల్లోనూ కామన్ సీన్గా ఉందంటే లేశమాత్రం కూడా అతిశయోక్తి లేదు. మరోవైపు వారికి అందాల్సిన ఆర్థిక మద్దతు కరువైన కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆఖరికి యాచకుల్లో కూడా విడోలకు ఆదరణ ఉండదనేది చేదు వాస్తవం. యాచనకు దిగిన వితంతువులను అపశకునంగా భావించి దానం చేసేందుకు నిరాకరించే జనాలు కోకొల్లలు. ఇలా నిరాశ్రయులైన వారికి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తోన్న శరణాలయాలు ప్రధాన దిక్కుగా ఉంటున్నాయి. ఇక్కడ కూడా మానవత్వం లోపించిన వారి నుంచి వితంతువులకు ఇక్కట్లు తప్పడం లేదు.వరల్డ్ విడోస్ డే..ప్రపంచవ్యాప్తంగా వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, వాటి పట్ల అవగాహన కల్పిస్తూ వారికి మద్దతుగా నిలవడానికి ఐక్యరాజ్య సమితి ‘వరల్డ్ విడోస్ డే’ను నిర్వహించాలని 2011లో నిర్ణయించింది. అందుకు జూన్ 23వ తేదీని ఎంచుకుంది. నాటి నుంచి ‘వరల్డ్ విడోస్ డే’ ద్వారా భర్తపోయిన స్త్రీల రక్షణ, సంరక్షణల కోసం ప్రపంచ దేశాలు తమ పరిధిలో చట్టాలను తీసుకురావడానికి కృషి చేస్తోంది. దీంతో పాటు వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సమాజంలోని అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించడం, ఆచారాలు, సంప్రదాయాల పేరిట వారిపై జరుగుతున్న మానసిక, శారీరక దాడుల నుంచి విముక్తి కల్పించడం వంటివి ఐరాస ముఖ్య ఉద్దేశాల్లో కొన్నిగా ఉన్నాయి.మెహినీ గిరి..మన దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచే వింతతు సమస్య తీవ్రంగా ఉంది. దీనికి ముఖ్య కారణాలు ఆడపిల్లలకు చదువు లేకపోవడం, మూఢవిశ్వాసాలు, కన్యాశుల్కం. ఈ సమస్యను స్వాతంత్య్రానికి పూర్వమే గ్రహించారు రాజా రామమోహన్ రాయ్, జ్యోతిబా పూలే, కందుకూరి విరేశలింగం వంటి సంఘసంస్కర్తలు. అందుకే ఆడపిల్లలు, బాల వితంతువులకు చదువు, స్వావలంబన, వితంతు వివాహాల కోసమూ అంతే పోరాటం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అంబేడ్కర్ సైతం ఈ అంశంపై దృష్టి సారించారు. అయితే వితంతువుల జీవితాల్లో వెలుగు నింపేందుకు శ్రమించిన వారిలో మోహినీ గిరికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తన జీవితంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ సమస్యపై చర్చను సమాజంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఆమె పాటుపడ్డారు. ఆమె చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2007లో ఆమెకు పద్మభూషణ్ సత్కారాన్ని అందజేసింది.వార్ విడోస్ అసోసియేషన్..స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో లక్నో యూనివర్సిటీలో సైన్ ్స డిపార్ట్మెంట్ను ప్రారంభించడంలో మోహిరీ గిరి తండ్రి కీలకమైన పాత్ర పోషించారు. దీంతో యూనివర్సిటీలో మోహినీ గిరి తండ్రికి ఒక పెద్ద బంగ్లాను కేటాయించడంతో పాటు విశేషమైన గౌరవ మర్యాదలనూ ఆ కుటుంబానికి ఇచ్చేవారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే అంటే మోహినీ పదేళ్ల వయసులో ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో ఆ యూనివర్సిటీలో ఆమె కుటుంబ పరిస్థితి తారుమారైంది. అప్పటికే ఆమె తల్లికి సంగీతంలో డాక్టరేట్ పట్టా ఉన్నా, యూనివర్సిటీ నుంచి సరైన రీతిలో ప్రోత్సాహం లభించలేదు. పిల్లల పెంపకం కష్టం కావడంతో ఆమె యూనివర్సిటీని వదిలి బయటకు వచ్చారు. ఒంటరి తల్లిగా ఆమెకు ఎదురైన కష్టాలు, తమను పెంచి పెద్ద చేయడంలో ఆమె పడ్డ ఇబ్బందులను మోహినీ దగ్గరగా చూశారు. ఆ తర్వాత ఆమె మాజీ రాష్ట్రపతి వరహాగిరి వెంకటగిరి ఇంటికి కోడలిగా వెళ్లారు. ఆ సమయంలోనే అంటే 1971లో ఇండో–పాక్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్కు విముక్తి లభించింది. అయితే ఆ పోరులో ఎందరో జవాన్లు అమరులయ్యారు. వారి భార్యలు తమ జీవిత భాగస్వాములను కోల్పోయి ఒంటరయ్యారు. దీంతో ఆమె 1972లో దేశంలోనే తొలిసారిగా ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ను ప్రారంభించారు.దాడులు..ఆ రోజుల్లో (ఇప్పటికీ చాలా చోట్ల) వితంతువులు బయటి పనులకు వెళ్లడాన్ని అనాచారంగా భావించే వారు. అంతేకాదు రంగురంగుల దుస్తులు ధరించడంపైనా ఆంక్షలు ఉండేవి. జీవితాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రత్యేక నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలు అందుబాటులో ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ ఆధ్వర్యంలో మోహినీ గిరి.. వారణాసి, బృందావన్, పూరి, తిరుపతి వంటి ప్రాంతాల్లో వితంతు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ వారికి ఆశ్రయం కల్పించి ఆ కేంద్రాలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా తీర్చిదిద్దారు. వారి పిల్లలకు చదువులు చెప్పించారు. వీవీ గిరి ప్రభుత్వపరంగా పెద్ద పోస్టుల్లో ఉన్నంత వరకు మోహినీ గిరి చేపట్టిన కార్యక్రమాలన్నింటికీ సహకారం అందించిన సమాజం.. ఆయన పదవుల్లోంచి దిగిపోయిన వెంటనే తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. మోహినీ గిరి.. వితంతువులకు రంగురంగుల దుస్తులు వేసుకోమని ప్రోత్సహిస్తోందంటూ మన తిరుపతిలోనే ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. కోడిగుడ్లు, టొమాటోలు విసిరారు. ఆ దాడులకు ఆమె వెరవలేదు. తన ప్రయాణాన్ని ఆపలేదు. నేటికీ ఆ స్ఫూర్తి కొనసాగుతోంది. ఎందరో బుద్ధిజీవులు మోహినీ గిరి అడుగుజాడల్లో నడుస్తూ వితంతు జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు.వితంతు రక్షణ చట్టాలు..వితంతువులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్రంతో పాటు దేశంలో అనేక రాష్ట్రాలు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇవి కనిష్ఠంగా నెలకు రూ. 300ల నుంచి రూ.3,000ల వరకు ఆయా ప్రభుత్వాల వారీగా అందుతున్నాయి. పెన్షన్ తో పాటుగా వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిం చేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలనూ పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 నుంచి ఇప్పటి వరకు వితంవులు రక్షణ, భద్రత కోసం అనేక చట్టాలను రూపొందించినా, సామాజిక రుగ్మతల కారణంగా చాలా సందర్భాల్లో అవి నిస్తేజమవుతున్నాయి. చట్టాల రూపకల్పన, ప్రత్యేక పథకాల అమలుతో పాటు వివక్ష, సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలు వంటివాటిని దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకరిపై ఆధారపడే స్థితి నుంచి అద్భుతాలు సాధించే దశకు చేరుకుంటారు. – తాండ్ర కృష్ణ గోవింద్ -
International Picnic Day : ఛలో పిక్నిక్...అటు విందు, ఇటు దిల్ పసందు
నేడు (జూన్ 18) అంతర్జాతీయ పిక్నిక్ డే నిర్వహించుకుంటారు. కచ్చితమైన కారణం, మూలంపై పూర్తి స్పష్టతలేనప్పటికీ పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో ఫ్రెంచ్ విప్లవం తరువాత ఇది ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ప్రజలకు అనుమతి ఉండేది కాదు. దీంతో విప్లవం తరువాత ప్రజలు అంతా తమ స్నేహితులు, సన్నిహితులతో గడిపేందుకు, కలిసి భోజనం చేసేందుకు పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్లేవారట. పిక్నిల ద్వారా ప్రజలుకొత్త ఉత్సాహాన్ని పొందేవారట. కాలక్రమంలో ఇందులోని అసలు ఆనందం తెలిసి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులారిటీ పెరిగింది. 2009లో, పోర్చుగల్లోని లిస్బన్లో 20 వేల మందితో జరిగిన పిక్నిక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అతిపెద్ద పిక్నిక్గా రికార్డుల కెక్కింది. రొటీన్ దినచర్య నుండి కొంత విరామం తీసుకుని, మన ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడమే పిక్నిక్. పిక్నిక్ అనే పదం ఫ్రెంచ్ పదం పిక్-నిక్ నుండి ఉద్భవించిందని చెబుతారు. కుటుంబ సభ్యులతోపాటు హితులు, సన్నిహితులతో కలిసి ఉత్సాహంగా కాలం గడపడం, తద్వారా రోజువారీ జీవితాల్లోని ఆందోళన, ఒత్తిడి నుంచి దూరంగా గడిపి, కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకోవాలనేదే ఈ అంతర్జాతీయ పిక్నిక్ డే ఉద్దేశం. పిక్నిక్లు పలు రకాలుచిన్నప్పుడు స్కూలు పిల్లలతో కలిసి సరదాగా జూకు, పార్క్లకు, జాతీయనేతల సినిమాలను చూడటానికి థియేటర్లకు, ఇతర ఎమ్యూజ్మెంట్ పార్క్లకు వెళ్లిన సందర్భాలు జీవితాంతం గుర్తుండిపోతాయి.ఆ తరువాత కాలేజీ రోజుల్లో విహారయాత్రలు, పిక్నిక్ల గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. కొత్త కొత్త స్నేహాలతో కొత్త ఉత్సాహం ఉరకలేస్తూ, నవయవ్వనంలో చేసే చిలిపి చేష్టలు, సరదా సరదా పనులు అద్బుతమైన అనుభవాలుగా మిగిలి పోతాయి. ఇంకా కిట్టీ పార్టీలు, ఆఫీసుపార్టీలు, అసోసియేషన్ల సెలబ్రేషన్లు, కార్తీక వనభోజనాలు ఇలాంటివన్నీ బోలెడన్నీ కొత్త పరిచయాలను, సరికొత్త ఆనందాలను పంచుతాయి. అంతేనా..అటు విందు భోజనం, ఇటు ఆహ్లాదకరమైన వాతావరణంలో దిల్లంతా పసందు.పచ్చని ప్రకృతి, అద్హుతమైన సూర్యరశ్మి, చక్కటి సంగీతం, ఆటా, పాటా, వీటన్నింటికి మించి మనకు నచ్చిన దోస్తులు..ఈ కాంబినేషన్ సూపర్ హిట్టే కదా. అందుకే అప్పుడపుడూ నవ్వులు, కేరింతలతో గడిపేలా పిక్నిక్కి చెక్కేద్దాం. హ్యాపీ పిక్నిక్.. -
మహిళా సాధికారత థీమ్తో యోగా డే
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతియేటా జూన్ 21న నిర్వహిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా యునైటెడ్ కింగ్డమ్ (యుకె)లోని భారత హైకమిషన్ ట్రఫాల్గర్ స్క్వేర్లో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి మాట్లాడుతూ ఈ ఏడాది మహిళా సాధికారత థీమ్తో యోగా డేను నిర్వహించనున్నామని తెలిపారు. గత ఏడాది జరిగిన యోగా కార్యక్రమంలో 700 మందికి పైగా జనం పాల్గొన్నారని, వివిధ సంఘాల సభ్యులు కూడా హాజరయ్యారన్నారు. అదేవిధంగా ఈసారి కూడా అధిక సంఖ్యలో జనం యోగా కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు.యోగా అన్ని వర్గాల వారినీ కలుపుతుందని, అందరికీ ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ తెలిపారన్నారు. ఈ ఏడాది జరిగే యోగా కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొననున్నారన్నారు. బ్రిటిష్ పౌరుడు ఇందర్పాల్ ఓహ్రీ చందేల్ మాట్లాడుతూ యోగా అనేది మన వారసత్వంలో భాగమని, దానితో మనం కనెక్ట్ కావడం అందరికీ ముఖ్యమన్నారు. ఈ ఏడాది జరిగే యోగా దినోత్సవంలో భారత బధిర క్రికెట్ జట్టు సభ్యులు పాల్గొనబోతున్నారని అన్నారు. 2015 నుండి ప్రతీయేటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. -
అన్యాయంగా 37 ఏళ్లు ఖైదు : రూ. 116 కోట్లు పరిహారం
వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది ఒక ధర్మ సూత్రం. కానీ ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి చేయని నేరానికి ఏకంగా 37 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. తాను తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా ఎవరూ అతని మాటలు పట్టించుకోలేదు. ఫలితంగా విలువైన జీవితంలో విలువైన సమయంలో జైలులో మగ్గిపోవాల్సి వచ్చింది. చివరికి న్యాయమే గెలచింది. ఒక కేసులో దొరికిన ఓ సాక్ష్యం ఆధారంగా అతణిని నిర్దోషిగా తేల్చింది. ఈ తప్పిందం దొర్లినందుకు గాను అతనికి రూ. 116 కోట్ల రూపాయలు భారీ పరిహారాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది.అసలేమైందంటే..లైంగికదాడి, హత్య వంటి ఆరోపణలపై ఫ్లోరిడాకు చెందిన రాబర్ట్ డుబోయిస్ను 1982లో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికి అతని వయసు 18 ఏళ్లు మాత్రమే. 19 ఏళ్ల బార్బరా గ్రామ్ను అత్యాచారం చేసి, చంపేశాడంటూ అభియోగాలు నమోదైనాయి. ఈ కేసులో విచారణ అనంతరం అమెరికాలోని ఒక కోర్టు తొలుత అతడికి కోర్టు మరణశిక్ష విధించింది. ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్ సహాయంతో అతని శిక్షను 2018లో దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది. చివరకు తప్పుడు నేరారోపణ కేసులను వాదించడంలో అపారమైన అనుభవం ఉన్న చికాగోకు చెందిన పౌర హక్కుల సంస్థ లోవీ & లోవీ ఈ కేసులో జోక్యం చేసుకుని, ఈ కేసులో బాధితుడి ప్రమేయం లేదని నిరూపించడంలో అతినికి విముక్తి లభించింది. 1980లలో అందబాటులోని, ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన డీఎన్ఏ టెస్ట్ద్వారా నిర్దోషిగా తేలాడు. 2020 ఆగష్టులో ఫ్లోరిడా జైలు నుండి విడుదలయ్యాడు.కొంతకాలం తర్వాత, రాబర్ట్ డుబోయిస్ తనకు జరిగిన నష్టానికి న్యాయం కావాలంటూ పోరాటానికి దిగాడు. టంపా నగరం అధికారులు, విచారణలో పాల్గొన్న పోలీసు అధికారులు , ఫోరెన్సిక్ దంతవైద్యుడిపై (బార్బరా మృతదేహంపై ఉన్న పంటి గాట్లను సరిపోలాయని సర్టిఫై చేసిన) కోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారించిన అమెరికా కోర్టు అతని వాదనను సమర్ధించింది. బాధితుడికి 1.4 మిలియన్ డాలర్ల (రూ. 116 కోట్లు) పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. విడతలవారీగా డుబోయిస్ను ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ సంవత్సరం 90 లక్షల డాలర్లు, వచ్చే ఏడాది 30 లక్షల డాలర్లు, చివరిగా 2026లో 20 లక్షల డాలర్లు డుబోయిస్ అందుకుంటాడు. -
డెన్మార్క్ ప్రధానిపై దాడి
కోపెన్హగన్: డెన్మార్క్ ప్రధాని ఫ్రెడ్రిక్సెన్పై దాడి జరిగింది. కోపెన్హాగన్ స్క్వేర్ వద్ద ప్రధానిపై దుండగుడు ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ ఘటనతో ప్రధాని షాక్కు గురైనట్లు ఆమె కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దాడికి దిగిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన వెంటనే ప్రధానిని సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి తీసుకెళ్లారని ఘటనకు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ప్రధానిపై దాడి తమను కలిచివేసిందని పర్యావరణ మంత్రి ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. మూడు వారాల క్రితమే యూరప్ దేశం స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. -
తానా ప్రపంచసాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవ వేడుకలు !
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న 67వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో నాల్గవ వార్షికోత్సవ వేడుకలలో “ప్రజాభ్యుదయంలో సాహిత్యం, కళల పాత్ర: నాడు-నేడు” సదస్సు ఘనంగా జరిగింది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయపు ఉపకులపతిఆచార్య డా. కె. పద్మరాజుముఖ్యఅతిథిగా పాల్గొని తమ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష, సాహిత్య వికాసాలకోసం జరుగుతున్న కృషిని సోదాహరణంగా వివరించారు. తానా పూర్వాధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, అంజయ్యచౌదరి లావు, ప్రస్తుత అధ్యక్షులునిరంజన్ శృంగవరపు, ఉత్తరాధ్యక్షులు డా. నరేన్ కొడాలి, సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాలు ఈ నాల్గవ వార్షికోత్సవం జరుపుకోవడంపట్ల హర్షాతిరేఖం తోపాటు ఈ సాహితీ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు సమస్యలుండేవి. ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి వరకట్నం, మధు సేవ, చింతామణి, రక్త కన్నీరు, మా భూమి, పాలేరు లాంటి నాటకాలు, ప్రజా నాట్యమండలి, జననాట్య మండలి లాంటి సంస్థల ప్రభావం భూస్వామ్యుల, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకుల పోరాటం, ఇక తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యమ గీతాలు, కళాకారుల ఆట పాటలు ప్రజా చైతన్యాన్ని తీసుకువచ్చాయన్నారు”.ఇక విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు డా. గోరటి వెంకన్న,ప్రముఖ సినీగీత రచయితడా. సుద్దాల అశోక్ తేజ,‘తెలంగాణ రాష్ట్ర గీతరచయిత’డా. అందెశ్రీ, సినీగీత రచయిత శ్రీ మిట్టపల్లి సురేందర్, కళాభిమానిడా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ప్రముఖ కవి శ్రీ గొడిశాల జయరాజు, గద్దర్కుమార్తె డా. వెన్నెల గద్దర్,అరుణోదయ కళాకారిణిబండ్రు విమలక్క, బుర్రకథ కళాకారులు పద్మశ్రీ నాజర్కుమారులుషేక్ బాబుజి (బుర్రకథ), ఏర్పుల భాస్కర్ (బైండ్ల గానం); డా. రవికుమార్ చౌదరపల్లి (ఒగ్గుకథ); పాతూరి కొండల్ రెడ్డి (యక్షగానం); దామోదర గణపతిరావు (జానపదగానం) మరియు చాట్రగడ్డ శ్రీనివాసుడు(డప్పువిన్యాసం) పాల్గొని ఎన్నో ఉదాహరణలతో చేసిన ఆసక్తికర ప్రసంగాలు, కళావిన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.(చదవండి: ఆనందమే జీవిత మకరందం!) -
అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
ప్రతి ఏడాది మే 21వ తేదీ అంతర్జాతీయ టీ దినోత్సవం( International Tea Day! జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21, 2019న తీర్మానించింది. దీంతో ఏటా ఆహార, వ్యవసాయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మే 21వ తేదీని ఘనంగా నిర్వహిస్తున్నాయి. టీని ఉత్పత్తి చేయడం, వినియోగానికి అనుకూలమైన కార్యకలాపాలను అమలు చేసేందుకు సమిష్టి చర్యలు తీసుకోవడం, ప్రోత్సహించడం ఈ రోజు ప్రధాన లక్ష్యం.చరిత్రఈశాన్య భారతదేశం, ఉత్తర మయన్మార్, నైరుతి చైనాలో ఈ టీ (Tea) ఉద్భవించిందని చాలా మంది నమ్ముతారు. కచ్చితమైన ప్రదేశం తెలియనప్పటికీ 5వేల ఏళ్ల క్రితం చైనాలో మొదటిసారిగా టీ తాగినట్టు కొన్ని ఆధారాలున్నాయి. భారతదేశంతో పాటు శ్రీలంక, నేపాల్, వియత్నాం, ఇండోనేషియా, బంగ్లాదేశ్, కెన్యాస మలావి, మలేషియా, ఉగాండా, టాంజానియా వంటి టీ ఉత్పత్తి దేశాల్లో 2005నుంచి అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ రోజున టీ ఉత్పత్తి చేసే దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ వర్కర్స్ సంస్థలు సెమినార్లు, పబ్లిక్ ఈవెంట్లను నిర్వహిస్తూ సమావేశమవుతాయి.పొద్దుపొద్దునే వేడి వేడి చాయ్ కడుపులో పడితేగానీ హాయిగా ఉండదు చాలామందికి. ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగించేది టీ. చుట్టాలు వచ్చినా ముందుగా గుర్తొచ్చొది టీ. అలాంటి టీలో ప్రపంచం నలుమూలల ఉన్న వెరైటీలు ఏంటో చూద్దామా..మాచా, జపాన్: గ్రీన్ టీ ఆకులతో ప్రాసెస్ చేసిన టీ పొడి. ఆకుపచ్చరంగులో ఉండే టీ. జపాన్లో ఈ టీ బాగా ఫేమస్. ఇది మట్టి రుచిని కలిగి ఉంటుంది. ముందు సిప్ చేస్తే చేదుగా ఉండి రానురాను మాధుర్యంగా ఉంటుంది. దీన్ని ఐస్డ్ టీ, ఐస్క్రీమ్లు, ఇతర డెజర్ట్లలో కూడా ఉపయోగించింది.టెహ్ తారిక్, మలేషియా: టెహ్ తారిక్ అనేది మలేషియా నుంచి వచ్చిన ఒక ప్రసిద్ధ వేడి పాల టీ పానీయం. సాధారణంగా నురుగుతో ఉంటుంది. 'తే తారిక్' అనే పేరుకు "తీసి తీసిన టీ" అని అర్ధం. ఈ తీపి టీలో ఉడికించిన, స్ట్రాంగ్ బ్లాక్ టీ, ఆవిరైన క్రీమర్, పాలు ఉంటాయి. మరింత రుచిగా ఉండేలా ఏలకులను కూడా జోడించవచ్చు. చా యెన్, థాయిలాండ్: చా యెన్ ఒక ప్రసిద్ధ థాయ్ ఐస్డ్ టీ. ఇది మంచి రిఫ్రెష్ నిచ్చే పానీయం. ఇది బ్లాక్ టీ, రూయిబోస్ టీ, స్టార్ సోంపు, లవంగాలు, దాల్చినచెక్క, ఏలకులు, పాలు, పంచదారతో తయారు చేసే పానీయం. ఇది తీపి, క్రీము, సుగంధ రుచిని కలిగి ఉంటుంది. దీన్ని కొబ్బరి పాలను ఉపయోగించి కూడా తయారు చేసుకోవచ్చు. చా యెన్ని ఐస్ముక్కలతో సర్వ్ చేస్తారు.మసాలా చాయ్: భారతదేశం ఇది చాలా ఫేమస్. చాలా మంది భారతీయులు తమ రోజును ప్రారంభించేందుకు లేదా సాయంత్రం విశ్రాంతి తీసుకోనే టైంలో ఈ మసాలా చాయ్ని ఆస్వాదిస్తారు. ఇది బిస్కెట్లు, రొట్టెలు లేదా పకోరస్ వంటి భారతీయ స్నాక్స్తో కూడా బాగా జత చేస్తుంది. మసాలా చాయ్ని మొదటగా వేడినీటిలో ఆకుపచ్చ ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, అల్లం, సోపు గింజలు వంటి మొత్తం మసాలా దినుసులను టీ ఆకులు వేసి బాగా మరిగిస్తారు. ఆ తర్వాత పాలు జోడించి, కావాల్సిన రంగు వచ్చేలా టీని తయారు చేసుకోవాలి. చాలా మంది ప్రజలు తమ కప్పు మసాలా చాయ్ను ప్రిపేర్ చేసేందుకు చక్కెర లేదా బెల్లం కూడా కలుపుతారు.సిలోన్ బ్లాక్ టీ, శ్రీలంక: సిలోన్ అనేది శ్రీలంకకు పూర్వపు పేరు, దీనిని ఇప్పటికీ టీ వ్యాపారంలో ఉపయోగిస్తున్నారు. శ్రీలంకకు చెందిన ఈ బ్లాక్ టీ స్ట్రాంగ్ రుచిని కలిగి ఉంటుంది. ఇది పూల వాసనలా ఉండి గొప్ప రంగును కలిగి ఉంటుంది. దీన్ని కూల్గా లేదా వెచ్చగా ఆస్వాదించవచ్చు. మీరు దీన్ని ఐస్డ్ టీ లేదా వెచ్చని బ్లాక్ టీగా ఆస్వాదించవచ్చు. -
ఇజ్రాయెల్కు హిజ్బుల్లా ముప్పు.. అధునాతన ఆయుధాలతో దాడులు
యుద్ధ వాతావరణం మధ్య ఇజ్రాయెల్ అట్టుడికిపోతోంది. తాజాగా లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్లోని మిలిటరీ పోస్ట్పై డ్రోన్, క్షిపణి దాడులను చేసింది. హిజ్బుల్లా దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ మీడియాకు తెలిపింది. హిజ్బుల్లా గత ఏడు నెలలుగా ఇజ్రాయెల్పై నిరంతరం దాడులకు తెగబడుతోంది. ఇజ్రాయెల్ గగనతలం నుండి హిజ్బుల్లా ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ దాడులలో హిజ్బుల్లా అధునాతన ఆయుధాలను ఉపయోగించిందని సమాచారం.ఇటీవలి కాలంలో హిజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడులను తీవ్రతరం చేయడం గమనార్హం. గాజా స్ట్రిప్లోని దక్షిణ నగరమైన రఫాలో ఇజ్రాయెల్ చొరబాటు అనంతరం హిజ్బుల్లా ఇజ్రాయెల్ అంతర్గత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతూ వస్తోంది. గత ఏడాది అక్టోబర్ ప్రారంభం నుంచి సరిహద్దు వెంబడి హిజ్బుల్లా కాల్పులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ మధ్యలో ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత, హిజ్బుల్లా దాడులు తీవ్రమయ్యాయి.రఫాలో ఇజ్రాయెల్ సైనిక చర్య అనంతరం హిజ్బుల్లా ఈ విధమైన దాడులకు పాల్పడుతోంది. గాజాలో ఇజ్రాయెల్ దూకుడు వైఖరిని అవలంబిస్తూ దాడులు కొనసాగిస్తే ఉత్తర ఇజ్రాయెల్ నివాసితులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లలేరని హిజ్బుల్లా హెచ్చరించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తున్నంత కాలం తమ బృందం పోరాడుతూనే ఉంటుందని హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా పేర్కొన్నారు. లెబనీస్ ఫ్రంట్, గాజా మధ్య సంబంధాలు స్థిరమైనవని, వాటిని ఎవరూ డీ లింక్ చేయలేరని హసన్ నస్రల్లా స్పష్టం చేశారు. -
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
బ్రెటిస్లావా: స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగులు బుధవారం(మే15) కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దుండగులు నాలుగు రౌండ్లు జరిపిన కాల్పుల్లో ఫికో కడుపులోకి బుల్లెట్ దూసుకుపోయింది.రాజధాని బ్రెటిస్లావాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాండ్లోవా నగరంలోని హౌస్ ఆఫ్ కల్చర్ భవనం బయట ఫికోపై కాల్పులు జరిపారు. మద్దతుదారులతో సమావేశమైన సమయంలో కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన దుండగుల్లో ఒకరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రధానిపై కాల్పుల ఘటనను డిప్యూటీ స్పీకర్ లుబోస్ బ్లహా ధృవీకరించారు. -
ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
అంతర్జాతీయ కుంటుబ దినోత్సవాన్ని ప్రతి ఏడాది మే 15న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. నేటికాలంలో సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడంకోసం ఈ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అధికారులు. గతంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు ఉండడం లేదు. ఈ పరిణామం వల్ల ఒంటరితనం పెరిగిపోయి వ్యసనాలకు బానిసలు కావడం, పట్టించుకునేవారు లేకపోవడంతో మహిళలపై పనిభారం పెరిగి వారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీని కారణంగా సమాజంలో జరిగే దుష్పరిణామాలు గ్రహించిన ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం 1993, మే 15ని అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం ప్రకటించి వేడుకగా జరపడం ప్రారంభించింది. ఈ రోజున కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం అనే అంశాన్ని వివరిస్తూ ప్రజా చైతన్యంకోసం ప్రపంచవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం వంటివి చేస్తారు అధికారులు. 1993 నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో ప్రతి ఏడాది ఒక అంశం థీమ్గా ప్రకటించి ఆ దిశగా ప్రజా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ "వాతారణ మార్పులు కుటుంబాలను ఎలా ప్రభావితం చేస్తుంది" అనే అంశాన్ని హైలెట్ చేశారు. ఈ థీమ్ ఉద్దేశ్యం..వాతావరణ మార్పు, కాలుష్యం కారణంగా కుటుంబాల ఆరోగ్యం, శ్రేయస్సుపై ఎలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా దీన్ని ప్రకటించారు. అంటే తుపానులు, కరువులు, అనే వాతావరణ మార్పులు కారణంగా కుటుంబంలోని వ్యక్తులు జీవనోపాధిని కోల్పోతారు. తద్వారా ఆర్థిక పరిస్థితి వారి బాంధవ్యాలపై తీవ్ర ప్రభావం స్తుంది. కార్లమర్క్స్ చెప్పినట్లు ప్రతి బంధం ఆర్థిక సంబంధమే అన్న పదం అందరికీ స్ఫురణకు వచ్చేలా చేస్తుంది. ఈ ఒక్క వాతావరణ మార్పు మనిషి జీవన మనుగడను ప్రశ్నార్థకంగా మార్చి ఒంటిరిని చేస్తుంది. అందువల్ల ప్రతిఒక్కరూ ఈ వాతావరణ మార్పలు కోసం తమ వంతుగా బాధ్యత తీసుకుని వ్యర్థాలను తగ్గించి మంచి అలవాట్లతో వాతావరణాన్ని కాపాడుకునే యత్నం చేయాలి. ప్రతి కుటుంబం విద్యతోనే బలోపేతం కాగలదని గ్రహించాలి. సహజ వనురులను పునరుత్పత్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. వాతావరణాన్ని ఎంత ఆహ్లాదభరితంగా ఉంచుకుంటే అంతలా మను కుంటుంబాలు, గృహాలు పచ్చగా పదికాలాలు ఉంటాయని చెప్పడమే ఈ ఏడాది థీమ్ ముఖ్యోద్దేశం. అంతేగాదు ఈ ఏడాది 30వ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వాతావరణ మార్పులు, కుటుంబ విలువలను హైలెట్ చేసేలా ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేలా చాల చక్కగా థీమ్ని ఏర్పాటు చేసింది ఐక్యరాజ్యసమితి. అంతేగాదు ఈ రోజు కుటుంబ (చదవండి: నాసా ఏరో స్పేస్ ఇంజనీర్గా తొలి భారతీయ యువతి!) -
ప్రపంచం మెచ్చిన ఏపీ విద్య
నానాజీ అంకంరెడ్డి, సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలు, పథకాలపై అంతర్జాతీయంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యను అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ క్రమంలో పాఠశాల విద్యలో దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సంస్కరణలకు తెరతీసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేదింటి పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తూ ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాసంస్కరణలపై ప్రపంచవ్యాప్తంగా మేధావులు, వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు అభినందనల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి ఇక్కడి విద్యా సంస్కరణలు, పథకాల తీరుతెన్నులను పరిశీలించి వెళ్లారు. తమ దేశాల్లోనూ వాటిని అమలు చేస్తామని చెప్పడం ఏపీ విద్యకు అంతర్జాతీయంగా దక్కిన గుర్తింపునకు నిదర్శనం. ఇలా ఏపీ విద్యా సంస్కరణలకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభిస్తుంటే చంద్రబాబు మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను వారికి దూరం చేయాలని కుట్రలు పన్నుతోంది. నాణ్యమైన విద్యే మార్గం..‘పేదరికాన్ని జయించాలంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ఒక్కటే మార్గం. దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు. అన్ని దేశాలు దీన్ని అంగీకరించాలి. దీన్ని ఐదేళ్ల కిందటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయడం గొప్ప ముందడుగు’.. స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రి ఇగ్నాజియో క్యాసిస్ ఇచ్చిన కితాబు ఇది. గతేడాది ఫిబ్రవరిలో జెనీవాలో ‘ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్’ అంశంపై మాట్లాడిన ఇగ్నాజియో.. ఏపీలో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన విద్యా పథకాలు చాలా బాగున్నాయని కొనియాడారు. కోవిడ్ తర్వాత ప్రపంచ దేశాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ప్రపంచాన్ని ప్రగతి వైపు నడిపించే విద్యా బోధన, సంస్కరణలను ఏపీ అమలు చేయడం గొప్ప ముందడుగని పేర్కొన్నారు. అలాగే కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్ జెఫ్రీ సాచ్ ఏపీ విద్యా విధానంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీలో గ్లోబల్ విద్యా విధానం అనుసరించడం, పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప అంశంగా పేర్కొన్నారు. ముఖ్యంగా అమ్మ ఒడి, డిజిటల్ విద్య, ట్యాబ్స్ పంపిణీ, ఇంగ్లిష్ ల్యాబ్స్ ఏర్పాటు, టోఫెల్ శిక్షణ భవిష్యత్ తరాలకు ఎంతో అవసరమన్నారు. తాజాగా పలువురు అంతర్జాతీయ సంస్థల ప్రతిని«దులు సాక్షి ప్రతినిధితో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.ప్రపంచ పౌరులుగా పేద విద్యార్థులు..పేద విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రయాణాన్ని ప్రారంభించింది. విద్యావ్యవస్థలో అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు చేయడం పేద పిల్లలకు దక్కిన గొప్ప గౌరవం. విద్యా సాధనలో అట్టడుగు స్థాయిల్లో ఇలాంటి సంస్కరణలనే కోరుకుంటున్నాం.స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఐక్యరాజ్యసమితి కార్యాలయం అట్టడుగు స్థాయిలో నాణ్యమైన, సమగ్ర విద్యను అందించడానికి కృషి చేస్తున్న ప్రభుత్వాలకు ప్రాధాన్యతనిస్తోంది. ఏపీ ప్రభుత్వం నాడు–నేడు పథకం కింద విద్యకు ఇచ్చిన ప్రాధాన్యతను అభినందిస్తున్నా. – లిడియా గ్రిగొరెవా, చీఫ్ ఆఫ్ క్యాబినెట్, యూఎన్వో డైరెక్టర్ జనరల్ ఆఫీస్, జెనీవా ఏపీ పాఠశాలల్లో మార్పులను చూసి ఆశ్చర్యపోయా కంపారిటివ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీలో దక్షిణాసియా స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ (ఎస్ఐజీ) చైర్గా నేను భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న మార్పులను చూసి ఆశ్చర్యపోయాను. గతేడాది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కొలంబియా విశ్వవిద్యాలయంలో వ్యక్తిగతంగా మాట్లాడాను. ఏపీలో విద్యావ్యవస్థ, మౌలిక సదుపాయాల గురించి వారు అనర్గళంగా వివరించారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా విద్యార్థులతో పోటీపడుతూ మాట్లాడారు. ఐఎఫ్పీలు, స్మార్ట్ బోర్డులు, ట్యాబ్లతో ప్రభుత్వ పాఠశాలల్లో టెక్నాలజీని వినియోగించడం నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ మార్పులతో ఏపీ విద్యార్థులు గొప్ప ఫలితాలు సాధిస్తారు. – రాధిక అయ్యంగార్, సెంటర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్, కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్ప్రపంచ అవసరాలకు తగ్గట్టు ఏపీ విద్యార్థులుఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ ప్రత్యేకంగా ఆకర్షించింది. అట్టడుగు వర్గాల విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్ అందించినందుకు ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఏపీ విద్యార్థులు ప్రపంచ అవసరాలకు తగ్గట్టు మారుతున్నారు. ఇది ప్రపంచాన్ని సరికొత్తగా అర్థం చేసుకునేందుకు, పరస్పరం సహాయానికి, భవిష్యత్ను అద్భుతంగా మార్చుకునేందుకు దోహదం చేస్తుంది.బాలికల డ్రాపవుట్లను నియంత్రించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 10 లక్షల మంది బాలికలకు ఉచిత బ్రాండెడ్ శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసింది. అంతేకాకుండా రన్నింగ్ వాటర్ సదుపాయంతో మరుగుదొడ్లను నిర్మించింది. యుక్త వయసు బాలికల సమస్యలను పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్ను అభినందిస్తున్నాను. – దివ్యాన్షి వాధ్వా, ప్రపంచ బ్యాంక్ డేటా సైంటిస్ట్, వాషింగ్టన్ఏపీలో విద్యార్థులందరికీ నాణ్యమైన ఉచిత విద్యఆకలిని, పేదరికాన్ని జయించాలంటే మొదట విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే చేస్తోంది. అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా విద్యార్థులందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తోంది. నైపుణ్య శిక్షణ అనేక మంది పేద విద్యార్థుల జీవితాలను మారుస్తోంది.దీనిద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలను, వేతనాలను పొందగలరు. ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం సమకాలీన ప్రపంచ సవాళ్లను అధిగమించి అవకాశాలను అందుకునేదిగా ఉంది. ప్రీ–స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు చేసిన మార్పులతో నాణ్యమైన విద్యాభివృద్ధిని సాధిస్తుంది. – రజనీ ఘోష్, బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ ఎఫైర్స్ ఇండియా డెస్క్ ఆఫీసర్, అమెరికా ప్రభుత్వంకార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలునా చిన్నప్పటికి, ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్య చాలా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, డిజిటల్ విద్య, విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు, ఇంగ్లిష్ మీడియం బోధన వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఈ అంశాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారడం గర్వకారణం.ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుతో ప్రతిభ గల నాణ్యమైన విద్యార్థులను బయటకు తీసుకురావచ్చు. పేద విద్యార్థులకు ఆంగ్లంలో మంచి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారు అంతర్జాతీయ విద్యాసంస్థల్లో రాణించేందుకు మార్గం సుగమమవుతుంది. పేద విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దుతున్న సీఎం వైఎస్ జగన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. – ఉపేందర్రెడ్డి గాదె, విజ్డమ్ టెక్ సొల్యూషన్స్ డైరెక్టర్, సిడ్నీ, ఆస్ట్రేలియాఆంధ్రప్రదేశ్లోనే ఇంత గొప్ప మార్పు..ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్కరణలను ప్రభుత్వ విద్యార్థులే నేరుగా ఐక్యరాజ్యసమితిలో వివరించారు. దేశ చరిత్రలోనే ఇంత గొప్ప మార్పును ఏపీలో చూస్తున్నామని ప్రపంచ దేశాల ప్రతినిధులు అభినందించారు. కొలంబియా యూనివర్సిటీలో మన విద్యార్థులు అద్భుతమైన ఇంగ్లిష్లో మాట్లాడడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.స్టాన్ఫర్డ్, కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్, జెనీవా యూనివర్సిటీ, యునెస్కో, యునైటెడ్ నేషన్స్ గర్ల్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్, యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ స్కూల్స్ ఫోరమ్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ ఇన్క్లూజన్ వంటి వాటిలో గత ఐదేళ్లుగా ఏపీ విద్య సంస్కరణలపై చర్చ జరుగుతోంది. ప్రతిచోటా ఏపీ విద్యకు ప్రశంసలు లభిస్తున్నాయి. – ఉన్నవ షకిన్ కుమార్, ఐక్యరాజ్యసమితి స్పెషల్ స్టేటస్ సభ్యుడు -
విశాఖ డ్రగ్స్: అంతర్జాతీయ లింకులపై సీబీఐ ఆరా.. బ్రెజిల్కు స్పెషల్ టీంలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. డ్రగ్ డీల్ వెనుక అంతర్జాతీయ లింకులపై ఆరా తీస్తోంది. ప్రత్యేక విచారణ బృందాలు బ్రెజిల్ వెళ్లనున్నాయి. డ్రగ్ డీల్ వెనుక అంతర్జాతీయ లింకులు ఛేదించే దిశగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. డ్రై ఈస్ట్ సప్లయ్ చేసిన ఐసీసీ బ్రెజిల్ సంస్థలో కీలక ఆధారాలు లభిస్తాయని సీబీఐ అంచనా వేస్తోంది. ఇప్పటికే సంధ్య ఆక్వా ప్రతినిధుల కాల్ డేటా, ఈ మెయిల్స్, వాట్స్ అప్ చాటింగ్స్ ద్వారా కొంత మేర సమాచారం లభించింది. నార్కోటిక్స్ పరీక్షల నివేదికల కోసం దర్యాప్తు బృందం ఎదురు చూస్తోంది. సంచలనం రేకెత్తిచిన కేసులో డ్రగ్స్ నిర్ధారణ కోసం వివిధ ల్యాబ్ల్లో పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే మెటీరియల్, డాక్యుమెంటరీ ఆధారాలను సీబీఐ సేకరించింది. సంధ్య ఆక్వా ప్రతినిధుల కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. కాగా, తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఇటీవల మరికొన్ని బ్యాగుల్ని పరీక్షించగా.. 70 శాతం డ్రైఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సీబీఐ విచారిస్తోంది. ఎప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. బ్రెజిల్ నుంచి ఫీడ్ని ఎప్పుడు బుక్ చేశారు.. అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి.. విశాఖ పోర్ట్నే ఎందుకు ఎంచుకున్నారు. ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు? తదితర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం. సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటా, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా సీబీఐ ఫోకస పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్ఎస్కు వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది. -
ముందు ఉట్టి కొడదాం!
'ఉట్టి కొట్టలేనమ్మ.. స్వర్గానికి నిచ్చెనలు వేసింది' అన్న చందంగా, భూమిపై బతకడం చేతకాని మనిషి అంతరిక్షంలో కాలనీలు కట్టి కాపరం చేస్తానంటున్నాడు. ఆ దిశగా ఆధునిక మానవుడు పరిశోధనలు ముమ్మరం చేస్తున్నాడు. కానీ, అది అంత తేలిక కాదు, పైగా మనిషిని మనిషే చంపుకొని తినే దారుణమైన పరిస్థితులు వస్తాయని కొందరు శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. కరోనా వంటి ఊహాతీతమైన వ్యాధులు వచ్చి, మనిషిని పట్టి పీడిస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఎటువంటి వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని మనిషి భయపడుతూనే ఉన్నాడు. కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తూ వుంటే శాస్త్రవేత్తలు సైతం కంగారుపడిపోతున్నారు. సామాన్య మానవులు బెంబేలెత్తి పోతున్నారు. ఇది ఇలా ఉంటుండగానే, భూమి నుంచి దూరంగా వెళ్ళి, వేరే స్పేస్ లో జీవించవచ్చు అనే విశ్వాసాన్నీ పెంచుకుంటున్నాడు. ఇది కొత్తగా పుట్టిన కోరిక కాదు. ఎప్పటి నుంచో మనిషి ఆలోచిస్తున్నాడు. కరోనా కాలానికి ముందే కొందరు శాస్త్రవేత్తలు అంతరిక్ష జీవనాన్ని ప్రచారంలోకి తెచ్చారు. సాధ్యాసాధ్యాలపై ఇంకా విస్తృతంగా అధ్యాయనాలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త ప్రపంచంలోకి అడుగు పెడదాం, కొత్త లోకాల్లో విహరిద్దాం అని మనిషి ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. భూమిపై ఏదైనా విపత్తు వచ్చినా, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వసతులు, వనరులు సరిపోకపోయినా.. పైకెళ్లి జీవించాలనే ఆలోచనలకు శాస్త్రవేత్తలు మరింత పదునుపెడుతున్నారు. అంగారక గ్రహం లేదా చంద్రమండలంపై కాలనీలు నిర్మంచి జీవించవచ్చు అని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు కూడా! భూమి నుంచి ఆహారాన్ని పంపించే పరిస్థితులపైనా దృష్టి సారిస్తున్నారు. ఇవ్వన్నీ సాధించడానికి సుదీర్ఘకాలం వేచి చూడాల్సిందేనని అర్థం చేసుకోవాలి. ఆ మధ్య ఎడిన్ బర్గ్ యూనివర్సిటీకి చెందిన చార్లెస్ కొకెల్ కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. పాత విషయాలను కొన్నింటిని గుర్తు చేశారు. నిజంగా భూమి నివాసయోగ్యం కానప్పుడు అంతరిక్షం వైపు చూడవచ్చు. కానీ, దానిని సాధించాలంటే ఇంకా ఎన్నో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు. 19వ శతాబ్దంలో నార్త్ వెస్ట్ పాసేజ్ను వెతకాడానికి కెప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్ బయలుదేరారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో దారి తప్పారు. అత్యుత్తమ సాంకేతికత అందుబాటులో ఉన్నా, వారంతా ఒకరినొకరు చంపుకుతినే దారుణమైన దుస్థితి వచ్చిందని ప్రొఫెసర్ చార్లెస్ కొకెల్ గుర్తుచేస్తున్నాడు. అంతరిక్షంలో కూడా అటువంటి పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నాడు. వనరులు, వసతులతో పాటు ఆహారకొరత ప్రధాన సమస్యగా నిలుస్తుందని ఆయన భావిస్తున్నాడు. డాక్టర్ కామెరన్ స్మిత్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంతరిక్షంలో మానవ మనుగడ వేళ్లూనుకోవాలంటే? వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. గ్రహాంతర వాసులకోసం వెతుకులాట కూడా ఇప్పటికే మొదలైంది. అంతరిక్షంలోకి వెళ్లబోయే ముందు, ఈ భూమిని పవిత్రంగా, పచ్చగా కాపాడుకోవడం ముఖ్యం. స్వార్థం శృతి మించి, కోరికలు, విలాసాలు ఆకాశాన్ని అంటిన ఆధునిక మానవుడు సహజ వనరులను ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నాడు. తత్ఫలితంగా అడువులు అంతరించి పోతున్నాయి, జీవనదులు ఇంకిపోతున్నాయి. భూమి క్రుంగిపోతోంది, సముద్ర మట్టాలు పెరిగి పోతున్నాయి. అగ్ని గోళాలు బద్ధలై పోతున్నాయి. ఒక్కటేమిటి? విశ్వరూపమే మారిపోతోంది. ప్రకృతిని అందినకాడికి అంతం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో రుతువుల గమనం మారిపోయింది. భూమి వేడెక్కిపోతోంది. అతివృష్టి అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలు ప్రబలి పోయాయి. ఆణువణువూ కాలుష్య కాసారంగా మారింది. పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం అంతా కలుషితమై పోయింది. ఇంటాబయటా అంతా కాలుష్యమే. దీనికి ముందుగా మనిషి మనసే అత్యంత కలుషితమై పోయింది. అందుకే, కొంగ్రొత్త వింత వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మంచినీరే కాదు, మంచిగాలి కూడా కొనడానికి కూడా దొరకని దుస్థితి వచ్చేసింది. పల్లెల ముఖచిత్రం మారిపోయింది. చేతివృత్తులు ఎగిరిపోయాయి. వ్యవసాయ విధానమే మారిపోయింది. ఆహారరక్షణపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతరిక్షానికి ఆహార సరఫరా సంగతి తర్వాత చూద్దాం. ముందుగా, భూమిపై పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార ఉత్పత్తి జరగడమే ప్రమాదంలో పడింది. ఆధునిక మానవుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మమై పోతోంది. భూమిని పాడుచెయ్యడమే కాక, గ్రహాలను సైతం పాడు చెయ్యడానికి మనిషి తయారవుతున్నాడని కొందరు శాస్త్రవేత్తలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో, కరోనా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలకుండా చూడడం శాస్త్రవేత్తల ప్రథమ కర్తవ్యం. ప్రకృతిని, భూభాగాన్ని రక్షించుకోవడం మానవాళి ప్రాథమిక అవసరం. సహజ వనరులను నిలబెట్టు కోవడం అత్యంత ముఖ్యమైన అంశం. వీటన్నిటిపై దృష్టి సారించడమే అందరి తక్షణ కర్తవ్యం. సమాంతరంగా అంతరిక్ష పరిశోధనలు కొనసాగించుకోవచ్చు. అన్నింటి కంటే ముందుగా, మంచి వైపు మనిషి మారితే? అంతా మంచే జరుగుతుందని విశ్వసిద్దాం. - మాశర్మ -
ధ్యానంతోనే విశ్వశాంతి
నందిగామ/శంషాబాద్ (హైదరాబాద్): ప్రపంచ శాంతికి ధ్యానం ఒక్కటే మార్గమని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అభిప్రాయపడ్డారు. మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. హార్ట్ఫుల్నెస్ సంస్థ గురూజీ కమ్లేష్ పటేల్ (దాజీ)కు కామన్వెల్త్ ఆధ్వర్యంలో గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ పీస్ అవార్డు రావడం ఆనందకరమన్నారు. కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ మాట్లాడుతూ.. దాజీ 160 దేశాల్లో 16 వేల మంది వలంటీర్లు, 5 వేల కేంద్రాల్లో 5 మిలియన్లకు పైగా అభ్యాసీలను కలిగి ఉండటం ప్రపంచ స్థాయిలోనే గొప్ప విషయమని ప్రశంసించారు. ఆయన సేవలను గుర్తించి ‘గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ పీస్’ అవార్డు అందజేస్తున్నందుకు సంతోషిస్తున్నామని చెప్పారు. కమ్లేష్ పటేల్ (దాజీ) మాట్లాడుతూ.. తనకు కామన్వెల్త్ ఆధ్వర్యంలో అవార్డు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు అధ్యాత్మికవేత్తలు ధ్యానం చేశారు. కార్యక్రమంలో ప్రపంచ మత పెద్దల మండలి సెక్రటరీ జనరల్ భావాజైన్, సైంటిస్ట్ డాక్టర్ రోలీన్ మెక్క్రాటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్సియె ఎస్ బీయింగ్ వ్యవస్థాపకుడు డాక్టర్ జోసెఫ్ బెంటన్ హోవెల్ పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి దంపతులకు వీడ్కోలు ఆధ్యాత్మిక సమ్మేళనంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి దంపతులు జగదీప్ ధన్ఖడ్, సుధేష్ ధన్ఖడ్లు తమ పర్యటన ముగించుకుని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరికీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గవర్నర్ తమిళి సై, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఘనంగా వీడ్కోలు పలికారు. -
నకిలీ మందుల ముఠా గుట్టు రట్టు!
దేశరాజధాని ఢిల్లీలో నకిలీ మందులను తయారు చేస్తున్న అంతర్జాతీయ ముఠా వ్యవహారం వెలుగు చూసింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసులో ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు ఉద్యోగులతో సహా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు రూ.1.96 లక్షల విలువైన క్యాన్సర్కు సంబంధించిన నకిలీ ఇంజెక్షన్లను విక్రయించారు. చైనా, అమెరికా తదితర దేశాలకు కూడా వీరు క్యాన్సర్ నకిలీ మందులను పంపారు. నిందితుల వద్ద నుంచి రూ.4 కోట్ల విలువైన రూ.89 లక్షల నగదు, రూ.18 వేల డాలర్లు, ఏడు అంతర్జాతీయ, రెండు భారతీయ బ్రాండ్లకు చెందిన క్యాన్సర్ నకిలీ మందులను క్రైమ్ బ్రాంచ్ స్వాధీనం చేసుకుంది. స్పెషల్ సీపీ క్రైమ్ బ్రాంచ్ షాలినీ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం మూడు నెలల విచారణ అనంతరం పోలీసుల దర్యాప్తు బృందం ఈ ముఠాను పట్టుకోగలిగింది. ఈ కేసులో దర్యాప్తు కోసం పోలీసుల బృందం ఢిల్లీ ఎన్సీఆర్లో ఏకకాలంలో ఎనిమిది చోట్ల దాడులు చేసింది. విఫిల్ జైన్ నకిలీ మందుల రాకెట్కు సూత్రధారిగా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు. ఇతనికి చెందిన ఇళ్ల నుంచి మూడు క్యాప్ సీలింగ్ మిషన్లు, ఒక హీట్ గన్ మెషీన్ మొదలైనవాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని క్యాన్సర్ ఆస్పత్రికి చెందిన ఉద్యోగులు కోమల్ తివారీ, అభినయ్ కోహ్లీలను కూడా ఈ కేసులో అరెస్టు చేశారు. -
ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. మారణాయుధాలు స్వాధీనం!
బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు పిస్టల్స్, నాలుగు మ్యాగజైన్లు, 30 కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై యూఏపీఏ, ఆయుధ చట్టం కింద అమృత్సర్లోని రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్ సెల్లో కేసు నమోదు చేశారు. అమెరికాకు చెందిన హర్ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పసియాన్, ఉగ్రవాది హర్విందర్ సింగ్ అలియాస్ రిండా, అర్మేనియాకు చెందిన షంషేర్ సింగ్ అలియాస్ షేరాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం హ్యాపీ పసియాన్, రిండా, షంషేర్లు పంజాబ్లోని యువతను దేశ వ్యతిరేక కార్యకలాపాల దిశగా పేరేపిస్తున్నారు. హర్ప్రీత్ సింగ్, హర్విందర్ సింగ్లను పోలీసులు అరెస్టు చేశారు. In an intelligence-based operation, Punjab Police averts possible target killings with the arrest of 2 members of Babbar Khalsa International (BKI)-backed terror module The module was operated by #USA based Harpreet Singh @ Happy Passian, a close aide of #Pakistan based… pic.twitter.com/Ab9FNk2xtf — DGP Punjab Police (@DGPPunjabPolice) March 7, 2024 -
సముద్ర వాణిజ్యంలో భద్రతా సవాళ్లను అధిగమిద్దాం
సాక్షి, విశాఖపట్నం/గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): బ్లూ ఎకానమీలో మారీటైమ్ డొమైన్ కీలకంగా వ్యవహరిస్తోందనీ.. 2047 నాటికి భారత్ పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్న మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా.. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని సాముద్రిక ఆడిటోరియంలో గురువారం మధ్యాహ్నం అంతర్జాతీయ మారిటైమ్ సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథి ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ మహా సముద్రాలంతటా దేశాల మధ్య సహకారం, అభివృద్ధికి వేదికగా మిలాన్ మారిందన్నారు. దేశ చరిత్రలో కీలకంగా వ్యవహరిస్తూ సముద్ర భద్రతలో, భారతదేశ సముద్ర చరిత్రలో కీలకమైన పాత్రను పోషించిన ఈస్టర్న్ నేవల్ కమాండ్లో మిలాన్తో పాటు ఇంటర్నేషనల్ సెమినార్ నిర్వహించడం గర్వంగా ఉందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం, వివిధ దేశాలతో భాగస్వామ్యాలు, సహకారంతో సాగర జలాల్లో తలెత్తుతున్న సమస్యల్ని పరిష్కరించడంలో మన దేశం పెద్దన్న పాత్ర పోషిస్తోందన్నారు. సముద్ర వాణిజ్యంలో భద్రత సవాళ్లను కలిసికట్టుగా అధిగవిుంచాలని పిలుపునిచ్చారు. ఇండో పసిఫిక్ జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యం ఎంతో అవసరమని, ఇందుకోసం భద్రత, సుస్థిరతను నిర్ధారించడానికి దేశాలు కలిసివచ్చి.. సహకార వ్యూహాలను అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమని ఉప రాష్ట్రపతి ధన్కర్ చెప్పారు. సదస్సులో నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, వివిధ దేశాల నౌకాదళ ప్రతినిధులు హాజరయ్యారు. అంతకు ముందు మిలాన్–2024 కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు ఐఎన్ఎస్ డేగాలో నాయకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మేయర్ హరివెంకటకుమారి, తూర్పు నావికాదళాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే గణబాబు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, అడిషనల్ డీజీ(గ్రేహౌండ్స్) ఆర్కే మీనా తదితరులున్నారు. -
WINGS INDIA 2024: 20 ఏళ్లలో 2,840 విమానాలు కావాలి
రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఏవియేషన్ రంగానికి భారత్ దన్నుగా నిలుస్తుందని విమానాల తయారీ దిగ్గజం ఎయిర్బస్ ఇండియా ప్రెసిడెంట్ రెమి మిలార్డ్ తెలిపారు. గణనీయంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్కు వచ్చే 20 ఏళ్లలో 2,840 కొత్త విమానాలు అవసరమన్నారు. అలాగే 41,000 మంది పైలట్లు, 47,000 మంది టెక్నికల్ సిబ్బంది కావాల్సి ఉంటుందని గురువారం వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమంలో ఆయన చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందతున్న దేశంగా భారత్ నిలుస్తుందని అంచనాలు ఉన్నట్లు రెమీ తెలిపారు. భారత్ నుంచి రెట్టింపు స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు రెమీ వివరించారు. ప్రస్తుతం 750 మిలియన్ డాలర్లుగా ఉన్న సోర్సింగ్ను ఈ దశాబ్దం చివరికి 1.5 బిలియన్ డాలర్లకు పెంచుకోనున్నట్లు చెప్పారు. భారత్ నుంచి గతేడాది 750 విమానాలకు ఆర్డర్లు రాగా 75 ఎయిర్క్రాఫ్ట్లను దేశీ విమానయాన సంస్థలకు డెలివరీ చేసినట్లు వివరించారు. వీటిలో 41 విమానాలు ఇండిగో సంస్థకు, ఎయిరిండియాకు 19, విస్తారాకు 14, గో ఫస్ట్కు ఒకటి చొప్పున అందించినట్లు రెమీ చెప్పారు. తమ ఏ350 రకం విమానాలు భారత్లో అంతర్జాతీయ ప్రయాణాలకు ఊతమివ్వగలవని పేర్కొన్నారు. గతేడాది ఎయిరిండియాకు ఆరు ఏ350 విమానాలను అందించినట్లు చెప్పారు. భారత్లో విమానాల నిర్వహణ, రిపేర్లు, ఓవరాలింగ్ వ్యవస్థ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. వింగ్స్ ఇండియా హైలైట్స్ ► హెరిటేజ్ ఏవియేషన్ ఎయిర్క్రాఫ్ట్ చార్టర్ కంపెనీ హెరిటేజ్ ఏవియేషన్ తాజాగా హెచ్125, హెచ్130 హెలికాప్టర్ల కోసం ఎయిర్బస్కు ఆర్డరు ఇచి్చంది. వీటిని ప్రాంతీయ కనెక్టివిటీ స్కీము ఉడాన్ కింద సరీ్వసుల కోసం ఉపయోగించనున్నట్లు సంస్థ సీఈవో రోహిత్ మాథుర్ తెలిపారు. ఎత్తైన, వేడిమి ఎక్కువగా ఉండే వాతావరణాల్లో ప్రయాణాలకు హెచ్125 హెలికాప్టర్ ఉపయోగపడుతుంది. ఇక సైట్ సీయింగ్, అత్యవసర వైద్య సరీ్వసులు మొదలైన వాటి కోసం హెచ్130 సహాయకరంగా ఉంటుంది. ► ఎయిర్ ఇండియా గురుగ్రాంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద ఏవియేషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎయిర్బస్, బోయింగ్ కోసం 20కిపైగా సిమ్యులేటర్స్తో పైలట్లకు శిక్షణ. ఆకాశ ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ రకం 150 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఆకాశ ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ రకం 150 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ ఇండియా గురుగ్రాంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద ఏవియేషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎయిర్బస్, బోయింగ్ కోసం 20కిపైగా సిమ్యులేటర్స్తో పైలట్లకు శిక్షణ. జీఎంఆర్ ఏరో జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా ఏవియేషన్ స్కూల్ వర్చువల్గా ప్రారంభం. టీఏఎస్ఎల్ విడిభాగాల తయారీకై మహీంద్రా ఏరోస్పేస్తో కలిసి ఎయిర్బస్ నుంచి ఆర్డర్లను పొందింది. -
పరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ (ఫొటోలు)
-
PhonePe: కొత్త సీఈవోను ప్రకటించిన ఫోన్పే
ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే అంతర్జాతీయ విస్తరణపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రితేష్ పాయ్ను తమ ఇంటర్నేషనల్ పేమెంట్స్ బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించింది. ఫోన్పేలో చేరిన రితేష్ పాయ్.. యూకేకి చెందిన టెర్రాపే (TerraPay)లో ప్రాడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ విభాగానికి ప్రెసిడెంట్గా పనిచేసేవారు. యస్ బ్యాంక్లో సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్గా కూడా పనిచేసిన ఆయన అక్కడ బ్యాంక్ డిజిటల్ వ్యూహానికి నాయకత్వం వహించారు. రితేష్ పాయ్ చేరికపై ఫోన్పే చీఫ్, వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ అంతర్జాతీయ వృద్ధి ప్రణాళికలకు నాయకత్వం వహించడానికి రితేష్ మాతో చేరినందుకు సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫోన్పే 2015 డిసెంబర్లో ఏర్పాటైంది. ఆ తర్వాత దీన్ని ఫ్లిప్కార్ట్ కొనుగోలు చేసి వాలెట్గా రీబ్రాండ్ చేసింది. ఫోన్పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. యూపీఐ యాప్ను ప్రారంభించిన మూడు నెలల్లోనే కోటి మంది యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 2018లో గూగుల్ ప్లేస్టోర్లో ఐదు కోట్ల బ్యాడ్జ్ని పొందిన అత్యంత వేగవంతమైన భారతీయ చెల్లింపు యాప్గా ఫోన్పే నిలిచింది. -
ఏపీ వర్సిటీల్లో అంతర్జాతీయ కోర్సులు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో అంతర్జాతీయ యూనివర్సిటీల కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై సమగ్ర అవగాహన కల్పించేలా ఉన్నత విద్యామండలి రూపొందించిన ‘కెరీర్ టూల్ కిట్’ ఆన్లైన్ టీచింగ్ ప్రోగ్రామ్ను ఆయన మంగళవారం విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ రాష్ట్రంలోని యూనివర్సిటీలు ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 (సబ్జెక్టుల వారీగా) విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేసేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. తద్వారా విదేశాలకు వెళ్లి చదువుకోలేని ఎందరో విద్యార్థులు ఎంఐటీ, హార్వర్డ్ వంటి ప్రఖ్యాత వర్సిటీలు అందించే సుమారు 2 వేల కోర్సులను ఆన్లైన్లో చదువుకునే వెసులుబాటు కల్పింస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలోనే విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా చదువులు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలుస్తోందన్నారు. నూతన జాతీయ విద్యావిధానం కంటే ముందుగానే ఏపీ విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఇందులో భాగంగా ఉన్నత విద్యలో 10 నెలల ఇంటర్న్షిప్ను తప్పనిసరి చేశామన్నారు. తాజాగా తొలిసారిగా స్టైఫండ్తో కూడిన ఇంటర్న్షిప్ను ఇచ్చేలా అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలతో కలిసి విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ఉన్నత విద్యామండలి 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు మేలు చేస్తూ ప్రతి సెమిస్టర్లో విభిన్న అంశాల్లో మార్గనిర్దేశం చేసేలా ‘కెరీర్ టూల్ కిట్’ను తీసుకురావడం అభినందనీయమన్నారు. ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఫ్యూచర్ స్కిల్స్, నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిందన్నారు. వాటి ఫలితాలే ఇండియా స్కిల్ రిపోర్టులో ఏపీని అగ్రగామిగా నిలబెట్టాయన్నారు. సెమిస్టర్ల వారీగా కెరీర్ గైడెన్స్ ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సెమిస్టర్ల వారీగా కార్యాచరణ ప్రణాళిక అందించడం, ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యం, సాఫ్ట్ స్కిల్స్ పెంపుపై ‘కెరీర్ టూల్కిట్’ మెంటార్గా నిలుస్తుందన్నారు. విద్యా ప్రయాణంలో ప్రతి దశలో విద్యార్థులకు వ్యక్తిగత మార్గదర్శకంగా పని చేసేలా 19 రకాల కెరీర్ టూల్ కిట్లను రూపొందించామని తెలిపారు. దేశంలో ఏ యూనివర్సిటీ, విద్యామండలి చేయని విధంగా విద్యార్థి కోర్సులో చేరినప్పటి నుంచి పూర్తి చేసి బయటకు వెళ్లేంత వరకు జాబ్, రీసెర్చ్ ఓరియంటేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆర్థిక క్రమశిక్షణ, సామాజిక దృక్పథాన్ని పెంపొందించేలా ‘కెరీర్ టూల్ కిట్’ను తీసుకొచ్చామన్నారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్పర్సన్లు రామ్మోహనరావు, ఉమా మహేశ్వరిదేవి, సెక్రటరీ నజీర్ అహ్మద్, సెట్స్ స్పెషల్ ఆఫీసర్ సు«దీర్రెడ్డి పాల్గొన్నారు. -
2024 కొత్త కొత్తగా వెల్కమ్
చూస్తూండగానే నూతన సంవత్సరం వచ్చేసింది. 2024కు గ్రాండ్గా వెల్కం చెప్పేందుకు అంతా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. అయితే కొన్ని దేశాల వారు కొత్త ఏడాదిని స్వాగతిస్తూ పార్టీ మూడ్లో ఉంటే.. మరికొన్ని దేశాల వారు ఇంకా రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తూనే ఉంటారు. అంతర్జాతీయ టైమ్ జోన్ల ప్రకారం.. ప్రపంచంలో మొట్టమొదటగా న్యూజిలాండ్ సమీపంలోని కిరిబతి దీవుల వారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. తర్వాత న్యూజిలాండ్, ఆ్రస్టేలియా స్వాగతం పలుకుతాయి. ఇదే సమయంలో పలు దేశాల్లో ఇంకా డిసెంబర్ 31వ తేదీనే మొదలవుతూ ఉంటుంది. మరి ఇలా ఏయే దేశాలు కొత్త సంవత్సరానికి ముందుగా వెల్కం చెప్తాయో చూద్దామా.. ► ప్రపంచంలో మొదట పసిఫిక్ మహాసముద్రంలోని దీవులైన కిరిబతిలో నూతన సంవత్సరం మొదలవుతుంది. మన దేశంలో డిసెంబర్ 31న మధ్యాహ్నం 3.30 గంటలు అవుతున్న సమయంలోనే.. కిరిబతిలో అర్ధరాత్రి 12.00 గంటలు దాటేసి జనవరి 1 మొదలైపోయింది. మన దేశ సమయంతో పోల్చి చూస్తే, కొన్ని దేశాల్లో ఎప్పుడు కొత్త సంవత్సరం మొదలవుతుందంటే.. ►న్యూజిలాండ్.. మనకు సాయంత్రం 4.30 ►ఆ్రస్టేలియా.. మనకు సాయంత్రం 6.30 ►జపాన్, దక్షిణ కొరియా.. మనకు రాత్రి 8.30 ►చైనా, మలేషియా, సింగపూర్.. మనకు రాత్రి 9.30 ►థాయిలాండ్, వియత్నాం.. మనకు రాత్రి 10.30 ►యూఏఈ, ఒమన్.. మనకు జనవరి 1 వేకువజాము1.30 ► గ్రీస్, దక్షిణాఫ్రికా, ఈజిప్్ట.. మనకు వేకువజామున 3.30 ►జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, మొరాకో, కాంగో.. మనకు జనవరి 1 తెల్లవారుజామున 4.30 ►యూకే, ఐర్లాండ్, పోర్చుగల్.. మనకు వేకువన 5.30 ►బ్రెజిల్, అర్జెంటీనా.. మనకు జనవరి 1 ఉదయం 8.30 ►ప్యూర్టోరికో, బెర్ముడా, వెనెజువెలా.. మనకు జనవరి 1 ఉదయం 9.30 ►అమెరికా తూర్పుతీర రాష్ట్రాలు, పెరూ, క్యూబా.. మనకు జనవరి 1 ఉదయం 10.30 ►మెక్సికో, కెనడా, అమెరికా మధ్య రాష్ట్రాలు.. మనకు జనవరి 1 ఉదయం 11.30 ►అమెరికా దక్షిణ తీర రాష్ట్రాలు (లాస్ ఎంజిలిస్, శాన్ఫ్రాన్సిస్కో..).. మనకు జనవరి 1 మధ్యాహ్నం 1.30 ►హవాయ్.. మనకు 1న మధ్యాహ్నం ఉదయం 3.30 ►సమోవా దీవులు.. మనకు జనవరి 1 సాయంత్రం 4.30 ►బేకర్, హౌలాండ్ దీవులు.. మనకు 1న సాయంత్రం 5.30 సమీపంలోనే ఉన్నా.. ఓ రోజు లేటు.. వివిధ దేశాలు చాలా విస్తీర్ణంలో ఉన్నా.. ఏదో ఒక సమయాన్ని మొత్తం దేశానికి పాటిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ దేశాల్లో ఒక చివరన ఉన్న ప్రాంతాల్లో సూర్యోదయం అయ్యాక కొన్ని గంటల తర్వాతగానీ మరో చివరన ఉన్న ప్రాంతాల్లో తెల్లవారదు. ఇలా వివిధ దేశాల ఆదీనంలో ఉన్న ప్రాంతాల్లో ఆయా దేశాల సమయాన్నే పాటించే క్రమంలో.. సమీపంలోనే ఉన్న ప్రాంతాల్లో కూడా వేర్వేరు తేదీలు, సమయం ఉంటుంటాయి కూడా. ►దీనివల్ల పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఉండే అంతర్జాతీయ డేట్లైన్ కూడా మెలికలు తిరిగి ఉంటుంది. ►మామూలుగా అయితే.. ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ముందే రోజు మారిపోయే కిరిబతి దీవులకన్నా రెండు గంటలు ఆలస్యంగా సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో అదే తేదీ, రోజు ఉండాలి. కానీ అమెరికా అధీనంలో ఉన్న ఈ దీవుల్లో ఆ దేశ సమయాన్ని పాటిస్తారు కాబట్టి.. అవి మొత్తంగా ఒక రోజు వెనకాల ఉంటాయి. ►ఉదాహరణకు కిరిబతిలో సోమవారం ఉదయం 8 గంటలు అవుతుంటే.. దానికన్నా రెండు గంటల తర్వాత సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో మాత్రం ఆదివారం ఉదయం 6 గంటల సమయమే ఉంటుంది. ►ఈ కారణంతోనే ప్రపంచంలో అన్ని ప్రాంతాలకన్నా చివరిగా.. ఈ దీవుల్లో కొత్త సంవత్సరం మొదలవుతుంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
A టు Z ఇయర్ ఎండర్
కరువులు. కల్లోలాలు. కొట్లాటలు. కన్నీళ్లు... క్లుప్తంగా చెప్పుకుంటే ప్రపంచానికి 2023 ప్రధానంగా మిగిల్చిన గుర్తులివే! 2022లో ఉక్రెయిన్పై రష్యా మొదలు పెట్టిన ఆక్రమణ 2023 పొడవునా పడుతూ లేస్తూ కొనసాగింది. ఇది చాలదన్నట్టు ఏడాది చివర్లో ఇజ్రాయెల్ దండయాత్ర పాలస్తీనాలో కనీవినీ ఎరగని మానవీయ సంక్షోభానికి కారణమైంది. లక్షలాది మంది ఆకలి కేకలు ఐరాస సామర్థ్యంపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తాయి. అంతర్జాతీయ సమాజంలో మానవీయ స్పందన కరువైన తీరును కళ్లకు కట్టాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అటు కరువు, ఇటు వరదలతో అతలాకుతలమయ్యాయి. భూతాపోన్నతి ఒకానొక దశలో 2 డిగ్రీల లక్ష్మణరేఖను దాటేసి ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పును మరోసారి గుర్తు చేసింది. ఏదో ఒక రూపంలో అడపాదడపా తలెత్తుతున్న కరోనా ఏడాది ముగుస్తుండగా కొత్త వేరియంట్ రూపంలో మరోసారి గుబులు పుట్టిస్తోంది. చంద్రయాన్, జీ20 సదస్సు నిర్వహణ వంటివి భారత కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ వేదికపై మరింతగా చాటాయి. 2023 త్వరలో కాలగర్భంలో కలిసిపోనున్న నేపథ్యంలో ఈ ఏడాది భారత్లోనూ, అంతర్జాతీయంగానూ జరిగిన ప్రధాన సంఘటనలపై విహంగ వీక్షణం. – సాక్షి, నేషనల్ డెస్క్ A ఆర్టికల్ 370 జమ్మూ కశ్మిర్కు పలు విషయాల్లో ప్రత్యేక హోదా కల్పించిన ఈ వివాదాస్పద ఆర్టికల్ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. ఏ రాష్ట్రానికీ విడిగా అంతర్గత ప్రజాస్వామ్యం అంటూ ఉండబోదని కుండబద్దలు కొట్టింది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం డిసెంబర్ 11న ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. దాంతో కశ్మిర్కు ప్రత్యేక పతాకం, రాజ్యాంగం, అంతర్గత వ్యవహారాల్లో పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 శాశ్వతంగా కాలగర్భంలో కలిసిపోయింది. B బైడెన్ అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడైన 81 ఏళ్ల బైడెన్.. 2024లో అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ నెగ్గి తన రికార్డును తానే మెరుగుపరచాలని ప్రయత్నిస్తున్నారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్కు సాయుధ, ఆర్థిక మద్దతు కొనసాగింపుపై విమర్శలతో పాటు పాలస్తీనాలో మానవీయ సంక్షోభం ముదురుతున్నా యుద్ధం ఆపేలా ఇజ్రాయెల్ను ఒప్పించలేకపోతున్నారంటూ ఈ ఏడాది మరో అప్రతిష్ట కూడా మూటగట్టుకున్నారాయన. రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష బరిలో దిగేలా ఉన్న డొనాల్డ్ ట్రంప్ నుంచి బైడెన్కు గట్టి పోటీ తప్పకపోవచ్చంటున్నారు. కోర్టు కేసులు 77 ఏళ్ల ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లని పక్షంలో 2020లో మాదిరే ఈసారి కూడా అధ్యక్ష పీఠం కోసం వీరిద్దరే పోటీ పడేలా ఉన్నారు. C చంద్రయాన్–3 అంతరిక్ష రంగంలో భారత కీర్తి పతాకను సమున్నతంగా ఎగరేసిన కీలక ప్రయోగం. 2023 జూలై 14న శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం దిగ్విజయం సాధించింది. ఆగస్టు 5న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన వ్యోమ నౌక 23న చంద్రుని దక్షిణ ధ్రువ సమీపంలో సురక్షితంగా దిగింది. ఈ విజయానికి గుర్తుగా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రధాని మోదీ ప్రకటించారు D డొనాల్డ్ ట్రంప్ బహుశా అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పదుడైన నేత. ఆ దేశంలో నేరాభియోగాలు ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షునిగా రికార్డు సృష్టించారు. నీలి చిత్రాల తారతో అఫైర్ను కప్పిపుచ్చేందుకు డబ్బుల చెల్లింపు వ్యవహారంలో గత ఏప్రిల్లో కోర్టు మెట్లెక్కిన సందర్భంగా సాంకేతికంగా అరెస్టు కూడా అయ్యారు! ఇదీ రికార్డే. దీంతోపాటు 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ క్యాపిటల్ భవనంపై తన సమర్థకులను దాడికి ఉసిగొల్పిన కేసులో ట్రంప్ను కొలరాడో సుప్రీంకోర్టు తాజాగా దోషిగా తేల్చింది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించింది! ఇలా అనర్హతకు గురైన తొలి మాజీ అధ్యక్షునిగా కూడా నిలిచారు. అయినా ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు! E ఎలక్షన్స్ 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఊపునిస్తే విపక్ష కాంగ్రెస్ను తీవ్ర నిరాశకు లోను చేశాయి. ఈ ఏడాది చివర్లో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పాలిత రాజస్తాన్, ఛత్తీస్గఢ్ల్లో బీజేపీ విజయబావుటా ఎగరేయడమే గాక మధ్యప్రదేశ్లోనూ ఘనవిజయం సాధించింది. ఎన్ని హామీలిచ్చినా రాజస్తాన్లో ఓటమి చవిచూడటమే గాక అధికారం నిలుపుకోవడం ఖాయమని భావించిన ఛత్తీస్గఢ్నూ కోల్పోవడంతో కాంగ్రెస్ తీవ్ర నైరాశ్యానికి లోనైంది. తెలంగాణలో సాధించిన అనూహ్య విజయం ఈ ఓటముల ముందు చిన్నబోయింది. ఈ నేపథ్యంలో విపక్ష ఇండియా కూటమి సారథిగా కాంగ్రెస్ ప్రాధాన్యం కూడా తగ్గుముఖం పట్టింది. లోక్సభ ఎన్నికల్లో తమకే ఎక్కువ సీట్లు కేటాయించాలంటూ భాగస్వాముల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి! F ఫారిన్ అఫైర్స్ విదేశీ వ్యవహారాల్లో 2023 భారత్కు మిశ్రమ ఫలితాలిచ్చింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మాదిరిగానే గాజాపై ఇజ్రాయెల్ దాడి విషయంలో కూడా ఏ పక్షం వైపూ పూర్తిగా మొగ్గకుండా ఎప్పట్లాగే కేంద్రం ఆచితూచి స్పందిస్తూ వస్తోంది. అంతేగాక జీ20 సదస్సు నిర్వహణ వంటి పలు అంతర్జాతీయ విజయాలు మన ఖాతాలో పడ్డాయి. అయితే కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ ఉందన్న ఆ దేశ ప్రధాని ఆరోపణలు ద్వైపాక్షిక సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఒకరకంగా ఇరు దేశాల మధ్య నెలల తరబడి ‘దౌత్య యుద్ధమే’ జరిగింది. ఈ విషయంలో అమెరికా కూడా కెనడాకే దన్నుగా నిలవడం మనకు ఇబ్బందికరంగా మారింది. G జి 20 ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ తొలిసారి ఆతిథ్యమిచ్చింది. సెపె్టంబర్లో ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర ప్రముఖ దేశాల అధినేతలు తరలివచ్చారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్ను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మూడు రోజుల శిఖరాగ్రం ఘనవిజయం సాధించి అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి ప్రతష్టలను మరింతగా పెంచింది. H హెచ్1బీ రెన్యువల్స్ వేలాది భారతీయ టెకీలకు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న కీలకమైన హెచ్1బీ వీసాల విషయంలో అగ్ర రాజ్యం ఈ ఏడాది కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని ఇకపై అమెరికాలోనే రెన్యువల్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. తొలి విడతగా 20 వేల దరఖాస్తుల ప్రాసెసింగ్ ప్రక్రియను మొదలు పెట్టింది కూడా. దాంతో రెన్యువల్స్కు భారత్కో, మరో దేశానికో వెళ్లాల్సిన అవస్థ తప్పనుంది. I ఇమ్రాన్ ఖాన్ గతేడాది పాకిస్తాన్ ప్రధాని పదవి పోగొట్టుకుని, హత్యాయత్నం నుంచి తూటా గాయాలతో బయట పడ్డ ఇమ్రాన్ ఖాన్ ఈ ఏడాది ఏకంగా జైలుపాలయ్యారు! భూ వివాదం కేసులో తొలుత మే 9న హైకోర్టు ప్రాంగణంలోనే అరెస్టయ్యారు. తర్వాత విడుదలైనా తోషాఖానా కానుకల కేసులో ఆగస్టు 6న మళ్లీ అరెస్టయ్యారు. అప్పటినుంచీ జైల్లోనే మగ్గుతున్నారు. ఆయనపై 140కి పైగా కేసులు దాఖలయ్యాయి! ఫిబ్రవరిలో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్ను అడ్డుకోవడమే లక్ష్యంగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ పావులు కదుపుతోంది. పాక్లో సర్వశక్తిమంతమైన సైన్యం కూడా అందుకు పూర్తిగా సాయపడుతున్నట్టు కని్పస్తోంది. J జిన్పింగ్ మావో అనంతరం చైనాలో అత్యంత శక్తిమంతుడైన నాయకునిగా అవతరించారు. 2023 మార్చిలో ఏకంగా వరుసగా మూడోసారి దేశ అధ్యక్షునిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. చైనా చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక నాయకునిగా రికార్డులకెక్కారు. పార్టీలోని ప్రత్యర్థులను ఉక్కుపాదంతో అణచివేస్తూ ఎదురులేని నాయకునిగా మారారు. అయితే కరోనా కల్లోలాన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోయారన్న అప్రతిష్టను మూటగట్టుకున్నారు. లాక్డౌన్ను భరించలేక జనం భారీగా తిరుగుబాటుకు దిగడంతో నిబంధనలను సడలించాల్సి రావడం జిన్పింగ్ ప్రతిష్టకు మచ్చగా మిగిలింది. రియల్టీ భారీ పతనం, ఆర్థిక ఒడిదుడుకులు ఆయనకు సవాలుగా మారాయి. K కింగ్ చార్లెస్–3 బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేకం జరుపుకున్నారు. మే 6న అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలంతా హాజరయ్యారు. 73 ఏళ్ల చార్లెస్–3 2022 సెప్టెంబర్ 8న తన తల్లి క్వీన్ ఎలిజబెత్–2 మరణంతో గద్దెనెక్కారు. అత్యంత పెద్ద వయసులో ఆ బాధ్యతలు చేపట్టి రికార్డులకెక్కారు. 8 నెలల తర్వాత లాంఛనంగా పట్టాభిషిక్తుడయ్యారు. L ఎల్జీబీటీక్యూఐ స్వలింగ సంపర్కం ఈ ఏడాదీ తరచూ వార్తల్లో నిలిచింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అది పార్లమెంటు పరిధిలోని అంశమంటూ అక్టోబర్ 17న తీర్పు వెలువరించింది. అయితే స్వలింగ సంపర్కులకూ ఇతరుల మాదిరిగానే అన్ని హక్కులూ ఉంటాయని స్పష్టం చేసింది. వాటిని కాపాడాలని, వారిని ఎవరూ చిన్నచూపు చూడకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని కేంద్రాన్ని, రాష్ట్రాలను ఆదేశించింది. M మణిపూర్ కల్లోలం ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ ఈ ఏడాది జాతుల హింసతో అట్టుడికింది. సంఖ్యాధికులైన మెయితీ తెగ వారు తమను గిరిజనేతరులుగా గుర్తించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన కుకీలు మే 3న జరిపిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. కుకీ మహిళను దారుణంగా హింసించి నగ్నంగా ఊరేగించడమే గాక అత్యాచారానికి పాల్పడటంతో రాష్ట్రం భగ్గుమంది. అలా చెలరేగిన హింసాకాండ నేటికీ కొనసాగుతూనే ఉంది. వందలాది మంది మరణించగా కనీసం 40 వేల మందికి పైగా కుకీలు పొరుగు రాష్ట్రాలకు వలస బాట పట్టారు. కేంద్రం మెయితీల పట్ల పక్షపాతం చూపుతూ సమస్య పరిష్కారంపై మీనమేషాలు లెక్కిస్తోందంటూ విమర్శలపాలైంది. N నార్త్ కొరియా ఉత్తర కొరియా 2023 పొడవునా వరుస క్షిపణి పరీక్షలతో హోరెత్తిస్తూనే ఉంది. పొరుగు దేశం దక్షిణ కొరియానూ, అమెరికానూ హడలెత్తిస్తూనే ఉంది. మొత్తమ్మీద ఈ ఏడాది అది 36కు పైగా క్షిపణి పరీక్షలు జరిపింది. వీటిలో రెండు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు కూడా ఉన్నాయి! దాంతో ఉద్రిక్తతల తగ్గింపుకు ఇరు దేశాల మధ్య 2018లో కుదిరిన ఒప్పందాన్ని దక్షిణ కొరియా రద్దు చేసుకునే దాకా వెళ్లింది. O అపోజిషన్ కాంగ్రెస్తో పాటు 28 విపక్షాలు ఒక్క వేదికపైకి రావడం 2023లో జరిగిన ముఖ్య రాజకీయ పరిణామం. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ చొరవతో ఈ కూటమి తెరపైకి వచ్చింది. జూలై 18న బెంగళూరులో జరిగిన రెండో భేటీలో కూటమికి ఇండియా పేరును ఖరారు చేశారు. కూటమి నాలుగుసార్లు సమావేశమై భావి కార్యాచరణపై చర్చించింది. ఎన్నికలు ముంచుకొస్తున్నందున జనవరి రెండో వారంలోగా సీట్ల సర్దుబాటును ఖరారు చేసుకునే పనిలో ఉంది. P పాకిస్తాన్ దివాలా 2023లో పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు మరింతగా పెరిగాయి. నిత్యావసరాలకు కూడా కటకటలాడే పరిస్థితి తలెత్తింది. బియ్యం, గోధుమ పిండి తదితరాల కోసం జనం కొట్టుకుంటున్న దృశ్యాలు పరిపాటిగా మారాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు అట్టడుగుకు చేరాయి. ఏడాది చివరికి వచ్చేసరికి పాస్పోర్టుల ముద్రణకు కావాల్సిన పేపర్ దిగుమతికి కూడా చెల్లింపులు చేయలేని పరిస్థితికి చేరింది. దాంతో ఒక దశలో పాస్పోర్టుల జారీయే నిలిచిపోయింది. Q క్వేక్స్ ఈ ఏడాది భారీ భూకంపాలతో పలు దేశాలు అతలాకుతలమయ్యాయి. ఫిబ్రవరి 6న 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం తుర్కియే, సిరియాల్లో పెను విధ్వంసమే సృష్టించింది. 50 వేల మందికి పైగా దీనికి బలయ్యారు. వీరిలో 44 వేలకు పైగా మరణాలు తుర్కియేలోనే సంభవించాయి! అనంతరం సెపె్టంబర్ 8న మొరాకోలో వచ్చిన 6.8 తీవ్రతతో కూడిన భూకంపానికి 3,000 మందికి పైగా బలయ్యారు. డిసెంబర్ 19న వాయవ్య చైనాలో వచ్చిన భూకంపం 150 మందిని బలి తీసుకుంది. ఉత్తరాఖండ్లోని జోషీ మఠ్లో నేల కుంగుబాట పట్టిన వైనమూ కలకలం రేపింది. వందలాది ఇళ్లు నిలువునా పగుళ్లిచ్చాయి! R ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ ఈ ఏడాది తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై దేశ గౌరవాన్ని రెట్టింపు చేసింది. ఆస్కార్ అవార్డు సాధించిన తొలి భారతీయ చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుకు ఉత్తమ పాట అవార్డు దక్కింది. మార్చిలో జరిగిన ఆస్కార్ వేడుకలో గీత రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అవార్డును అందుకున్నారు. 2009లో భారతీయ సినిమా ‘స్లమ్డాగ్ మిలియనీర్’లో ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన జై హో పాటకూ ఆస్కార్ వచ్చినా ఆ సినిమాను యూకే ప్రొడక్షన్స్ పతాకంపై హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ రూపొందించారు. S సస్పెన్షన్లు 2023 ముగింపుకు వచ్చిన వేళ విపక్ష ఎంపీల భారీ సస్పెన్షన్లు పార్లమెంటు శీతాకాల సమావేశాలను వేడెక్కించాయి. డిసెంబర్ 13న లోక్సభలో జరిగిన భద్రతా వైఫల్యంపై కేంద్రాన్ని నిలదీస్తూ విపక్ష ఎంపీలు ఉభయ సభలనూ రోజుల తరబడి హోరెత్తించారు. దాంతో లోక్సభ, రాజ్యసభ రెండింటి నుంచీ కలిపి వారం రోజుల వ్యవధిలో ఏకంగా 149 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేయడం పార్లమెంటు చరిత్రలో ఇదే తొలిసారి. ఈ వరుస సస్పెన్షన్లు రాజకీయంగా దుమారం రేపాయి. T టన్నెల్ మనిషి సంకల్పం ముందు మంచు శిఖరం తలొంచింది. ఉత్తరాఖండ్లో సిల్్కయారా సొరంగం కుప్పకూలి లోన చిక్కుబడ్డ 41 మంది కార్మికులు 16 రోజుల ఉత్కంఠ తర్వాత సురక్షితంగా బయట పడ్డారు. హైవే పనుల్లో భాగంగా నిర్మాణంలో ఉన్న ఈ సొరంగం నవంబర్ 12న పాక్షికంగా కూలిపోయింది. రెస్క్యూ ఆపరేషన్లో రోజుకో సమస్యలతో నిత్యం సస్పెన్సు నెలకొంటూ వచ్చింది. కీలకమైన చివరి అంకం సినిమా క్లైమాక్స్నే తలపించింది. యంత్ర బలం చేతులెత్తేసిన వేళ ర్యాట్ హోల్ కార్మికులు చివరి 12 మీటర్ల మేరకు శిథిలాలను జాగ్రత్తగా తవ్వేసి కారి్మకులను బయటికి తీసుకొచ్చారు. U యూసీసీ ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) ఈ ఏడాది కూడా వార్తల్లో నిలిచింది. కులమత తదితర విభేదాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ ఒకే రకమైన వ్యక్తిగత చట్టాలను వర్తింపజేసేందుకు ఉద్దేశించిన యూసీసీని అమలు చేసే దిశగా ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిపై ఏర్పాటైన దేశాయ్ కమిటీ నవంబర్లో ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో యూసీసీ విషయమై దేశవ్యాప్తంగా ఆసక్తికర పరిణామాలు జరగవచ్చు. V వెనెజులా పొరుగున ఉన్న బుల్లి దేశమైన గయానాలో ని ఎసిక్వెబో ప్రాంతంలో అపార చమురు నిక్షేపాలపై వెనెజులా కన్నేయడం ఉద్రిక్తతలకు కారణమైంది. అవసరమైతే సైనిక చర్యకు దిగైనా దాన్ని దక్కించుకునే దిశగా పావులు కదుపుతుండటంతో దక్షిణ అమెరికాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. W వార్స్ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా మొదలు పెట్టిన యుద్ధం ఈ ఏడాదంతా కొనసాగుతూనే ఉంది. హమాస్ మెరుపుదాడి కారణంగా అక్టోబర్లో పాలస్తీనాపై ఇజ్రాయెల్ తలపెట్టిన యుద్ధమూ భీకరంగా సాగుతూనే ఉంది. ఇలా 2023 యుద్ధ సంవత్సరంగా గుర్తుండిపోనుంది. X ఎక్స్ ప్రముఖ సోషల్ సైట్ ట్విట్టర్ను సుదీర్ఘ కాలయాపన, వివాదాల తర్వాత 2022 చివర్లో సొంతం చేసుకున్న ఎలాన్ మస్్క, గత జూలైలో దాని పేరును ఎక్స్గా మార్చి మరో సంచలనం సృష్టించారు. బ్లూ టిక్ తీసేయడం మొదలుకుని ఆయన తీసుకున్న పలు నిర్ణయాలతో సంస్థ విలువ సగానికి సగం పడిపోయింది. Y యెవగనీ ప్రిగోజిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడు. వాగ్నర్ ప్రేవేట్ సైనిక మూక చీఫ్. పుతిన్తో విభేదాల నేపథ్యంలో ఆగస్టు 23న ‘విమాన ప్రమాదం’లో ప్రిగోజిన్ మరణించాడు. రష్యాలో ఇలా అనుమానాస్పదంగా కాలగర్భంలో కలిసిపోయిన వారి జాబితాలో చేరిపోయాడు. Z జియోనిజం పశి్చమాసియాలో ప్రత్యేక యూదు రాజ్య స్థాపనకు పుట్టుకొచ్చిన ఉద్యమం. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో ఇది మరోసారి తెరపైకి వచ్చింది. తాను జియోనిస్టునని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాజాగా ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. -
ఎగుమతులు మళ్లీ మైనస్లోకి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ తీవ్ర అనిశ్చితి పరిస్థితులకు భారత్ వస్తు ఎగుమతులు అద్దం పడుతున్నాయి. అక్టోబర్లో ‘ప్లస్’లోకి వచి్చన ఎగుమతులు తిరిగి నవంబర్లో మైనస్లోకి జారిపోయాయి. 2022 ఇదే నెలతో పోలి్చతే 2023 నవంబర్లో ఎగుమతుల విలువ 2.83% క్షీణించి 33.90 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక 10 నెలల తర్వాత అక్టోబర్లో ఎగువబాటకు చేరిన దిగుమతులు నవంబర్లో మళ్లీ క్షీణతలోకి జారాయి. 4.33% పతనంతో 54.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 20.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ముందు.. వెనుకలు ఇలా... అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెప్టెంబర్లో 2.6 శాతం క్షీణించాయి. అక్టోబర్లో సానుకూల ఫలితం వెలువడింది. మరుసటి నెలలోనే మళ్లీ క్షీణరేటు నమోదయ్యింది. ఏప్రిల్–నవంబర్ మధ్య క్షీణ గణాంకాలే.. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 6.51 శాతం క్షీణించి 278.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.67 శాతం క్షీణించి 445.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు– ఈ ఏడు నెలల్లో 166.36 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎనిమిది నెలల కాలంలో పసిడి దిగుమతులు 21 శాతం పెరిగి 32.93 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
మన బలమేంటో మనమే నిరూపించాలి
క్రీడల పట్ల ఆసక్తితోపాటు చదువులోనూ రాణిస్తూ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది హైదరాబాద్ వాసి, 28 ఏళ్ల స్ఫూర్తి ఏనుగు. లా చదువుతూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీల్లోనూ పాల్గొని పతకాలు సాధిస్తోంది. ఇటీవల కిర్గిజ్స్థాన్లో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొని బంగారు పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా పవర్ లిఫ్టర్ స్ఫూర్తి ఏనుగు పంచుకున్న విషయాలు ఇవి... ‘‘సహజంగా ఇళ్లలో బరువులెత్తే పనులు అమ్మాయిలకు చెప్పరు. అవి, కేవలం అబ్బాయిల పనే అన్నట్టు చూస్తారు. చిన్నప్పటి నుంచి శిక్షణ ఇవ్వడం లేదా టెక్నిక్స్ తెలుసుకుంటే బరువులు ఎత్తడం అమ్మాయిలకూ సులువే. ప్రొఫెషనల్ అవ్వాలన్నా, శారీరక బరువు, మానసిక సమతుల్యత సాధించాలన్నా వెయిట్ మానేజ్మెంట్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఛాలెంజెస్ అమ్మాయిలకు ఈ రంగంలో ప్రధాన సమస్య నెలసరి సమస్య. అది ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి ఒకే బరువును మోయలేం. శక్తిలోనూ మార్పులు వస్తుంటాయి. ఇందుకు తీసుకునే ఆహారం అబ్బాయిలతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. బరువులు ఎత్తే సమయంలో కండరాలు పట్టేస్తుంటాయి. దెబ్బలు తగులుతుంటాయి. జాయింట్స్ దగ్గర సమస్యలు వస్తుంటాయి. బరువులు ఎత్తే సమయంలో ఊపిరిలో తేడాలు వస్తుంటాయి. కానీ, వీటన్నింటినీ సాధనతో అధిగమిస్తుంటాను. మంచి ఆహారం, సరైన నిద్రాసమయం, స్ట్రెస్ లెవల్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రతిరోజూ ప్రయత్నిస్తుంటాను. ఈ విషయంలో మా అమ్మ సాధన, నాన్న రామారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. బరువును బ్యాలెన్స్ చేసుకోవడానికి... సెకండ్ క్లాస్ నుంచి స్పోర్ట్స్లో ప్రవేశం ఉంది. డిస్క్ త్రో, జావలిన్ త్రో వంటి క్రీడల్లో పతకాలు సాధించాను. రెండేళ్ల నుంచి వెయిట్లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. కరోనా టైమ్లో బరువు పెరిగాను. పది కేజీల బరువు తగ్గాలనుకున్నాను. అందుకు డైట్లో మార్పులు చేసుకోవడానికి బదులు నాకు ఎలాగూ స్పోర్ట్స్ అంటే ఇష్టం కాబట్టి, బరువు తగ్గడానికి వెయిట్లిఫ్టింగ్ సాధన చేశాను. ప్రాక్టీస్ చేసేటప్పుడు మనల్ని మనం ఎలా క్రమశిక్షణగా మలచుకోవాలో నిపుణుల ఆధ్యర్వంలో తెలిసిపోతుంది. అందుకు అనుగుణంగా సరైన దినచర్యను అమలు చేసుకుంటూ, విజయం దిశగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. ఆలోచనలో మార్పు.. అమ్మాయిలు చిన్నప్పటి నుంచే క్రీడలను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వారు ఎంచుకున్న రంగంలోనూ చాలా బాగా దూసుకుపోగలరు. ఇంట్లో వాటర్క్యాన్స్, గ్యాస్ సిలిండర్, సోఫా.. వంటి బరువులు ఎత్తడంలో కూడా టెక్నిక్స్ ఉంటాయి. సాధారణంగా అమ్మాయిలు కూడా 50–60 కేజీల బరువు ఎత్తగలరు. కానీ, టెక్నిక్స్ తెలియకుండా ఎత్తి, నొప్పితో బాధపడుతుంటారు. దీంతో అమ్మాయిలు వెయిట్ లిఫ్టింగ్ చేయలేరు అనే అభిప్రాయం మనలో చాలా మందిలో పాతుకుపోయి ఉంది. మన ఆలోచనలో మార్పు రావాలంటే తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ దిశగా అమ్మాయిలను ప్రోత్సహించాలి. క్రీడలతోపాటు ... చదువునూ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎంబీయే పూర్తి చేశాను. సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతూనే స్పోర్ట్స్లో సాధన చేస్తూ వచ్చాను. ఇప్పుడు లా చదువుతున్నాను. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనే కాదు, కిందటి నెలలో కిర్గిజ్స్థాన్లో జరిగిన ఏడబ్ల్యూసీ ఓపెన్ వరల్డ్ కప్లో పాల్గొని బంగారు పతకాన్ని సాధించాను. మా అమ్మనాన్నల ప్రోత్సాహంతో పాటు కోచ్ ఇచ్చే గైడెన్స్ ఎంతగానో తోడ్పడుతున్నాయి. మరిన్ని పోటీలు, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతిచోటా ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాటిని దృఢ సంకల్పంతో, పట్టుదలతో ఎదుర్కొన్నవారే విజేతలవుతారు. ‘వెయిట్ లిఫ్టింగ్ అంటే అబ్బాయిలదే. అమ్మాయిలకు ఏం సాధ్యమవుతుంది, సూటవదు’ అనే మాట ఇప్పటికీ ఈ రంగంలో మొదటగా వినిపిస్తుంది. కానీ, మనల్ని మనం గెలిచి చూపినప్పుడు అమ్మాయిలుగా మన బలం ఏంటో కూడా ప్రపంచానికి తెలుస్తుంది’’ అని వివరిస్తుంది స్ఫూర్తి. – నిర్మలారెడ్డి