-
భారతీయ మహిళలకే అధిక ప్రయోజనం!
వాషింగ్టన్: అమెరికాలో హెచ్4 వీసాలు ఉన్నవారికి పని అనుమతిని రద్దు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ఉపసంహరించారు. ఈ నిర్ణయంలో భారతీయ మహిళలే అధికంగా ప్రయోజనం పొందుతారన్న అంచనాలు వెలువడుతున్నాయి. హెచ్–1బీ వీసా కలిగి ఉన్నవారి జీవిత భాగస్వాములకు(భార్య లేదా భర్త), వారి పిల్లలకు (21 ఏళ్లలోపు వయసు) హెచ్4 వీసాలను యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) జారీ చేస్తోంది. అమెరికాలో హెచ్–1బీ వీసా కింద పనిచేస్తున్నవారిలో అత్యధిక శాతం మంది భారతీయ ఐటీ నిపుణులే. ఈ వీసాలతో అమెరికా కంపెనీలు విదేశీ సాంకేతిక నిపుణులను స్వదేశంలోనే నియమించుకోవచ్చు. ఇండియా, చైనా నుంచి ప్రతిఏటా వేలాది మంది హెచ్–1బీ వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు పొందుతున్నారు. బరాక్ ఒబామా ప్రభుత్వ హయాంలో హెచ్–1బీ వీసాలున్నవారి జీవిత భాగస్వాములు అమెరికాలో పెద్ద ఎత్తున ఉద్యోగ అనుమతి కార్డులు దక్కించుకున్నారు. వీరిలో ఎక్కువ మంది భారతీయ మహిళలే కావడం విశేషం. డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టాక వలసలపై కఠినంగా వ్యవహరించారు. హెచ్4 వీసాదారులకు ఉద్యోగ అనుమతిని రద్దు చేస్తున్నట్లు 2017లో ప్రకటించారు. ట్రంప్ నిర్ణయాలను తిరగదోడుతామని ఎన్నికల ప్రచారంలో జో బైడెన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే.. గడువు ముగిసిన హెచ్4 వీసాదారుల ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) చెల్లుబాటును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
శారీ స్పీక్
భారతీయ మహిళల సంప్రదాయ కట్టు అయిన చీర ప్రత్యేకతను సోషల్ మీడియాలో చాటుతూ.. ఆ నేతను బతికించుకోవడానికి ఉత్సవాలూ నిర్వహిస్తోంది ‘శారీ స్పీక్’ గ్రూప్! మొన్న శనివారం హైదరాబాద్ లోని కర్మ శాంగ్రిల్లాలో జరిగిన ఫెస్టివల్ సందర్భంగా ‘శారీ స్పీక్’’ గురించి... శారీ స్పీక్ అనేది ఫేస్బుక్లో ఒక పేజీ. లక్షా పాతిక వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్! చీరకట్టు మీద ఉన్న ప్రేమతో మూడేళ్ల కిందట వినీ టండన్ అనే మహిళ ఈ గ్రూప్ను ప్రారంభించారు. మారిన జీవన శైలి దృష్ట్యా సౌకర్యం కోసం వస్త్రధారణ కూడా మారింది. దాంతో ప్రత్యేక సందర్భాలకే పరిమితమైపోయింది చీర. ఈ సంప్రదాయ కట్టుకు, దానితో కలబోసి ఉన్న నేతకూ పునర్వైభవం తెప్పించి, నేత కార్మికులకూ ఎంతో కొంత సహాయపడ్డానికి ‘శారీ స్పీక్’ గ్రూప్ను మొదలుపెట్టారు వినీ టండన్. ఆరంభించిన అనతికాలంలోనే సభ్యుల సంఖ్య లక్షకు చేరింది. పద్దెనిమిదేళ్లు నిండిన వాళ్లనుంచి అరవై ఏళ్లు పైబడ్డ వాళ్ల దాకా, దేశీ మహిళలతోపాటు విదేశీ వనితలూ ఇందులో సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్ ‘శారీ స్పీక్’ ఉత్సవంలో పాల్గొన్న సభ్యులు వీళ్లంతా చీర నేత, కట్టుతీరుతో పాటు తమ ప్రాంతపు జీవన విధానం, సంస్కృతీ సంప్రదాయల గురించి ఫేస్బుక్లోని ఈ శారీ స్పీక్ పేజీలో రాస్తుంటారు... ఆ చీరతో ఉన్న తమ ఫొటోను జతచేసి మరీ. ‘‘దీని వల్ల ఆ నేతే కాదు, ఆ ప్రాంతం గురించీ, దాని ప్రత్యేకత గురించీ ఇతర సభ్యులకు తెలుస్తుంది. కల్చరల్ ఎక్స్ఛేంజ్ జరుగుతుంది. భిన్న సంస్కృతి, సంప్రదాయాల మీద గౌరవం పెరుగుతుంది. ఐక్యతా ఏర్పడుతుంది. అయితే ఈ గ్రూప్లో చీరల అమ్మకాలు, కొనుగోళ్లుండవు’’ అని చెప్తారు శారీ స్పీక్ సభ్యురాలు భాను ఇలపావులూరు. థీమ్స్తో ఫ్యాషన్ షో శారీ స్పీక్ కేవలం సోషల్ మీడియా గ్రూప్కే పరిమితం కాకుండా యేడాదికి రెండుసార్లు భిన్నమైన థీమ్స్తో సమావేశమూ అవుతోంది. దాన్నో పండగలా నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా వాళ్ల వాళ్ల నగరాల్లో ఈ ఫెస్టివల్ను జరుపుకుంటారు. సంప్రదాయపు ఆటలు, పాటలు, ఫ్యాషన్ పరేడ్స్ ఉంటాయి. థీమ్స్ కూడా చాలా గమ్మత్తుగా పెట్టుకుంటారు. ఒకసారి 70, 80ల్లోని సినిమా నటీమణుల్లాగా చీర కట్టుకోవడం, ఇంకోసారి కంచి పట్టు చీరలో, ఒకసారి కాటన్ శారీస్లోనే రావడం... ఇలా రకరకాల థీమ్స్ ఉంటాయి. మొన్న శనివారం (14, డిసెంబర్) జరిగిన ఫెస్టివల్కు థీమ్... ఇతర రాష్ట్రాల చీరకట్టు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలు సంప్రదాయ చీరకట్టును థీమ్గా పెట్టారు. ఈ ఉత్సవాన్ని శ్రీకళా గణపతి, మధు గౌర్, రాహత్ ఖాన్ నిర్వహించారు. స్థానికంగా సరే... యేడాదికి ఒకసారి ‘గోవా’లోనూ శారీ స్పీక్ సంబరాలు జరుగుతుంటాయి. ఆ పండక్కి విదేశీ వనితలూ హాజరవుతారు. హైదరాబాద్ ‘శారీ స్పీక్’ నిర్వాహకులు మధు గౌర్, రాహత్ ఖాన్, భాను ఇ లపావులూరు, శ్రీకళా గణపతి -
మంధాన మెరుపులు.. సిరీస్ కైవసం
ఆంటిగ్వా: వెస్టిండీస్ మహిళలతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను భారత మహిళలు కైవసం చేసుకున్నారు. చివరిదైన మూడో వన్డేలో భారత మహిళలు ఆరు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను 2-1 తో చేజిక్కించుకున్నారు. స్మృతీ మంధాన చెలరేగడంతో భారత్ అవలీలగా గెలుపొందడంతో సిరీస్ను కూడా సొంతం చేసుకుంది. తొలి వన్డేలో వెస్టిండీస్ మహిళలు విజయం సాధించగా, రెండు, మూడు వన్డేల్లో భారత గెలిచింది. ఆఖరి వన్డేలో విండీస్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళలు నాలుగు వికెట్లు వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఓపెనర్లు జెమీమా రోడ్రిగ్స్(69; 92 బంతుల్లో 6 ఫోర్లు), స్మృతి మంధాన(74; 63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో భారత్ సునాయాసంగా గెలుపొందింది. ప్రధానంగా మంధాన మెరుపులు మెరిపించడంతో భారత్ 42. 1 ఓవర్లలోనే విజయం సాధించింది. గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన మంధాన.. రీఎంట్రీలోనే అదరగొట్టింది. తొలి వికెట్కు 141 పరుగులు జత చేసిన తర్వాత రోడ్రిగ్స్ ఔట్ అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మహిళలు 50 ఓవర్లలో 194 పరుగులు చేసి ఆలౌటయ్యారు. విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్(79) మరోసారి రాణించగా, మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో గోస్వామి, పూనమ్ యాదవ్లు చెరో రెండు వికెట్లు సాధించగా, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మలు తలో వికెట్ తీశారు. మూడు వికెట్లు రనౌట్ల రూపంలో రావడం విశేషం. -
అమ్మాయిలదే అగ్రస్థానం!
గడచిన దశాబ్దకాలం మహిళకు ఒక టర్నింగ్ ఎరాగా నిలిచింది. అప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నట్లే అమెరికా యూనివర్సిటీల్లో కూడా అమ్మాయిలు తక్కువగా ఉండేవారు. గత పదేళ్లుగా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 2009 నుంచి మొదలైన పెరుగుదల క్రమంగా పుంజుకుంటోంది. రాజ్యాంగ ప్రవేశికలో.. న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయపరంగా అవకాశాలు, గౌరవమర్యాదలు ప్రతి ఒక్కరికీ సమానంగా ఉంటాయి అని రాజ్యాంగ ప్రవేశిక చెప్తోంది. అంటే మహిళలు, మగవాళ్లు అనే తేడా రాజ్యాంగంలో చెప్పడం లేదు. మరి సమాజంలో ఈ అంతరం ఎందుకు ? అమ్మాయిలకు చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్పిస్తే, పెద్దయ్యాక ఎమోషనల్గా ఖర్చు చేయరు. ‘ఆడవాళ్లకు డబ్బును తెలివిగా ఖర్చు చేయడం చేతకాదు’ అనే అపోహను తుడిచివేయవచ్చు. ఆస్ట్రేలియాలో పెళ్లి చేసుకోబోయే వాళ్లకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కౌన్సెలింగ్ ఉంటుంది. జీవిత భాగస్వామితో ఘర్షణ తలెత్తకుండా ఎవరి స్వాతంత్య్రాన్ని వాళ్లు కాపాడుకుంటూ సాధికారతను నిలబెట్టుకోవడం నేర్పిస్తారు. మహిళల బ్యాంకు అకౌంట్లు గతంలో కంటే ఇప్పుడు యాక్టివ్గా ఉంటున్నాయి. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు మహిళలకు ప్రభుత్వం ఇచ్చే ముద్రా రుణాలను నేరుగా బ్యాంకు అకౌంట్లోనే జమ చేయడం, ఉపాధి హామీ పథకాల డబ్బును కూడా అకౌంట్లోనే జమ చేయడం వంటి నిర్ణయాలతో అకౌంట్లు యాక్టివ్గా ఉంటున్నాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే? - మహిళలకు తమ శక్తిసామర్థ్యాల మీద అవగాహన కల్పించడం - తమకు ఇష్టమైన రంగాలను గుర్తించగలగడం, వాటిని కెరీర్గా ఎంచుకునే హక్కు కలిగి ఉండడం - సమాన అవకాశాలు పొందడానికి ఉన్న దారులను తెలుసుకోవడం, వాటిని సాధించుకోవడం - తమ మీద, తమ జీవితం మీద సంపూర్ణ అధికారం తమదే అనే స్పృహ మహిళలో కలిగించడం, దానిని నియంత్రించుకోగలిగిన శక్తిని, సంపాదించుకునే హక్కు కలిగి ఉండడం - ఆర్థిక అంశాలతోపాటు సమాజానికి మరింత ఎక్కువ కంట్రిబ్యూషన్ ఇచ్చేటట్లు శక్తి పెంపొందించడం(ఇవి... మహిళా సాధికారత కోసం ఐక్యరాజ్యసమితి సూచించిన సూత్రాలు) 358 మిలియన్ల భారతీయ మహిళలకు బ్యాంకు అకౌంట్లున్నాయి.గతంలో అకౌంట్ ఉన్నప్పటికీ చాలా వరకు లావాదేవీలు జరిగేవి కాదు. ఇప్పుడు యాక్టివ్ అకౌంట్లు 29 నుంచి 42 శాతానికి పెరిగాయి. కెన్యా, టాంజానియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఇండోనేసియాలతో పోలిస్తే భారతీయ మహిళలు చాలా ముందున్నారు. మహిళా బ్యాంకుల ఏర్పాటు ఒక విప్లవం. జార్ఖండ్లో 10 మహిళా బ్యాంకుల స్థాపన వల్ల 32,000 మంది మహిళలు బ్యాంకు లావాదేవీలతో అనుసంధానమయ్యారు. వారిలో 17,000మంది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ లబ్ధిదారులు. పిఎమ్జెడివై (ప్రధానమంత్రి జన్ధన్ యోజన) పథకంలో ఓపెన్ చేసిన బ్యాంకు అకౌంట్లలో ఎక్కువ భాగం మహిళలకే ప్రాధాన్యం ఇచ్చింది. మహిళలకు బ్యాంకు ఖాతాలు పెరగడానికి అది కూడా ఓ కారణం. ఓపెన్ అయిన అకౌంట్లను నిరర్థకంగా వదిలేయకుండా లావాదేవీలు నిర్వహించడం మహిళల్లో పెరుగుతున్న ఆర్థిక చైతన్యానికి సూచిక. -
అతివల సందడి
సాక్షి, విశాఖపట్నం: వివిధ దేశాల సంప్రదాయాలు, సంస్కృతులను కలబోసుకుని, విభిన్న వస్త్రధారణలతో వచ్చిన మహిళలు సందడి చేశారు. భావి పారిశ్రామికవేత్తలు, ఇప్పటికే పారిశ్రామికవేత్తలుగా స్థిరపడ్డ పలువురు మహిళామణులు కలియదిరుగుతూ కనిపించారు. భారత మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమాఖ్య(అలీప్ ఇండియా), దక్షిణాసియా మహిళాభివృద్ధి సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నగరంలో అంతర్జాతీయ మహిళా పారిశ్రామిభివృద్ధి సదస్సు ఇందుకు వేదికైంది. పారిశ్రామిక ‘నవకల్పనలు.. సాంకేతికోత్పత్తి.. పారిశ్రామికీకరణ’అనే అంశం ప్రాతిపదికగా మగువలు తమ సొంతకాళ్లపై ఎలా నిలబడాలి? అందుకవసరమైన వనరులు, ప్రభుత్వ సాయం ఏమి కావాలి? మార్కెటింగ్, నూతన వ్యాపారం, పెట్టుబడి అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం వంటి పలు అంశాలపై సదస్సులో మూడు రోజులపాటు చర్చిస్తారు. నిష్ణాతులతో సమావేశాలు, వారి పరిశోధనాంశాలపై చర్చలు, ఉత్పత్తుల ప్రదర్శనల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, వ్యాపార వర్గాలకు, విద్యార్థులు, విద్యావేత్తలకు ఉపయోగపడేలా విశ్లేషిస్తారు. అలీప్ ఏర్పాటై 25 ఏళ్లయిన సందర్భంగా విశాఖలో తొలిసారిగా ఏర్పాటైన ఈ సదస్సును బుధవారం ఓ హోటల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. సార్క్ దేశాలకు (ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్) చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు సుమారు 200 మంది హాజరయ్యారు. వీరిలో దక్షిణాసియా దేశాల సమాఖ్య సెక్రటరీ జనరల్ అంజాద్ హుస్సేన్ బి సియాల్, దక్షిణాసియా మహిళా అభివృద్ధి ఫోరం అధ్యక్షురాలు ప్రమీలా ఆచార్య రిజాయ్, భారత పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి బినయ్కుమార్, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈడీ రత్నాకర్ అధికారి తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ఇండస్ట్రియలైజేషన్పై సెషన్లు నిర్వహించారు. సదస్సులో సార్క్ దేశాల మహిళా పారిశ్రామికవేత్తలు తాము ఉత్పత్తి చేసిన వస్తువుల ప్రదర్శన, టెక్నాలజీ, యంత్రాలు, ఆహార ఉత్పత్తులను, సేంద్రియ ఎరువుతో పండించిన దినుసులను వివిధ స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచారు. ఆయా దేశాల మహిళలు తమ సంప్రదాయ వస్త్రధారణలతో సదస్సులో ఆకట్టుకున్నారు. చీరకట్టుతో భారత్, శ్రీలంక మహిళలు, తలకు చున్నీలు చుట్టుకుని మాల్దీవుల మగువలు, స్యూట్లను పోలిన దుస్తులతో బంగ్లాదేశ్ వనితలు, టీషర్టులు, జీన్ ఫ్యాంట్లు, చుడీదార్లతో మరికొందరు ప్రత్యేకంగా కనిపించారు. పురుషాధిక్యంతో మహిళల వెనకడుగు బీచ్రోడ్డు(విశాఖ తూర్పు): ఉద్యోగం చేయాలని ఉన్నా చాలా మంది మహిళలు పురుషాధిపత్యం కారణంగా వెనకడుగు వేస్తున్నారని లీప్ ఇండియా ఫుడ్ అండ్ లాజస్టిక్స్ వ్యవస్థాపకారులు నిఖల్ అన్నారు. అదే మహిళలే పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే వారి వద్ద మహిళలకు ఎలాంటి అధిపత్య పోరు లేకుండా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. నగరంలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళ పారిశ్రామిక సదస్సులో బుధవారం పాల్గొన్న ఆమె సాక్షితో మాట్లాడారు. ఇప్పటి వరకు తాను పనిచేసిన నాలుగు సంస్థల్లోనూ పురుషాధిపత్యం ఎదుర్కొన్నానని చెప్పారు. తనలా ఎవరూ ఇబ్బంది పడకూడదని 2014లో లీప్ ఇండియా ఫుడ్ అండ్ లాజస్టిక్స్ కంపెనీని సొంతంగా ప్రారంభించినట్టు వివరించారు. తన పరిశ్రమ ద్వారా మూడు వేల మంది మహిళలకు ఉపాధి కల్పించానన్నారు. మహిళా సాధికారత కోసం ప్రతి మహిళకు శిక్షణ ఇచ్చేలా జాతీయ స్కిల్స్ అభివృద్ధి విభాగంతో ఒప్పందం చేసుకున్నట్టు ఆమె తెలిపారు. అనుభవజ్ఞులతో శిక్షణ ఇవ్వడంతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరుకు చర్యలు తీసుకున్నప్పుడే మహిళలకు పరిశ్రమ ఏర్పాటు సులభతరం అవుతుందన్నారు. ఎంతో కష్టపడి పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు సరైన గోదాములు లేకపోవటంతో రైతులు నష్టపోతున్నారన్నారు. ఆహార భద్రత చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో స్టోర్స్ను ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని భావించిందని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతగా గత నెలలో ఢిల్లీ, అసోం, పంజాబ్ రాష్ట్రాల్లో రూ.200 కోట్ల నిధులతో గోదాముల ఏర్పాటుకు పిలిచిన టెండర్లను తమ సంస్థ దక్కించుకుందన్నారు. అమరావతి వచ్చి సమస్య చెప్పుకోమన్నారు.. సీఎం సూచనపై దళిత మహిళా పారిశ్రామికవేత్త దివ్య ఆవేదన బీచ్రోడ్డు(విశాఖ తూర్పు): దళిత మహిళలకు బ్యాంకులు, కార్పొరేషన్లు సహకారం అందించడం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి ఓ యువ దళిత పారిశ్రామికవేత్త దివ్య తీసుకెళ్లింది. మహిళా పారిశ్రామిక సదస్సులో పాల్గొన్న సీఎం తిరిగి వెళుతుండగా ఆమె కలిసి మాట్లాడింది. ప్రభుత్వమే నేరుగా సబ్సిడీ ఇవ్వాలని కోరగా.. సీఎం స్పందిస్తూ ఇలాంటి ఏమైనా ఉంటే అమరావతి వచ్చి మాట్లాడు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్పొరేషన్లు, బ్యాంకులు పరిశ్రమల ఏర్పాటు కోసం కమీషన్లు అడుగుతున్నాయని, సీఎంకు చెబుదామంటే ఆయనేమో అమరావతి రావాలంటున్నారని దివ్య ఆవేదన వ్యక్తం చేసింది. పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సాహం అవసరం తల్లిదండ్రులు తమ పిల్లలను డాక్టరో, ఇంజినీర్లు చేయాలని భావించకుండా పాఠశాల స్థాయి నుంచే పారిశ్రామికవేత్తగా ఎదిగేలా ప్రోత్సహించాలని సెంటర్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూవర్ డెవలప్మెంట్ డైరెక్టర్ రూప మాగంటి అన్నారు. మహిళా పారిశ్రామికవేత్త సదస్సులో పాల్గొన్న ఆమె సాక్షితో మాట్లాడారు. ఇంటర్లో పారిశ్రామిక రంగంపై అవగాహన సదస్సులు, శిక్షణ ఇస్తే భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలుగా ఎదిగి సంస్థను ముందుకు తీసుకొని వెళ్లగలుగుతారన్నారు. కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేసే వారు ఆరు నెలల నుంచి 12 నెలల వరకు శిక్షణ తీసుకోవాలన్నారు. పరిశ్రమలను పట్టణాలకే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె చెప్పారు. తమ సంస్థ ద్వారా ఇప్పటి వరకు సుమారు 3500 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారీ చేశామన్నారు. అమరావతిలో కొత్తగా తమ సంస్థ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఆమె చెప్పారు. ఇటువంటి సదస్సుల వల్ల మిగతా దేశాల్లోని ఉత్పత్తులపై అవగాహన పెంచుకోవచ్చన్నారు. ఆకట్టుకున్న ఉత్పత్తుల ప్రదర్శన బీచ్రోడ్డు (విశాఖ తూర్పు): అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో ఏర్పాటు చేసిన ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయి. వస్త్రాలు, కాస్మొటిక్స్, డ్రైఫ్రూట్స్, గృహ అలంకరణాలు తదితర ఉత్పత్తుల గురించి సదస్సుకు హాజరైన ప్రతినిధులకు మహిళలు వివరించారు. ఈ సదస్సులో విదేశీ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఈ స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించి ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భారత్లో మహిళలు ప్రత్యేకం ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్లో మహిళలను ప్రత్యేకంగా చూస్తారని, అం దుకే వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆసక్తి చూపించడం లేదని యూఎస్ ఏకు చెందిన మైస్టిక్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు ఉజాలి అన్నారు. మహిళా పారిశ్రామిక సదస్సులో ఆమె పాల్గొని వర్చువల్ రియాలటీపై మాట్లాడారు. అనంతరం ఆమె సాక్షితో మాట్లాడుతూ ఓ మహిళ తన సొంతగా వ్యాపారం చేయాలని భావిస్తే భారత్లో వింతగా చూస్తారని, ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితిలో కొంత మార్పు వస్తుందని చెప్పారు. ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలను మహిళలు అందిపుచ్చుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. మహిళలు ఇంకా ఎదగాలి.. సాక్షి, విశాఖపట్నం: ‘మహిళలు అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. మరిన్ని అవకాశాల కోసం తపిస్తున్నారు..’అని అమెరికాలోని న్యూజెర్సీలో 20 ఏళ్ల నుంచి కూచిపూడి నృత్య శిక్షకురాలిగా ఉన్న స్వాతి అట్లూరి అభిప్రాయపడ్డారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మహిళా సాధికారత ఒక్క మగువలకే కాదు.. సొసైటీకి కూడా అవసరమన్నారు. ఇలాంటి సదస్సుల ద్వారా తానెంతో నేర్చుకోవలసి ఉందని చెప్పారు. న్యూజెర్సీలో స్థాపించిన కూచిపూడి నృత్య శిక్షణ కేంద్రం ద్వారా తాను ఇప్పటి దాకా 1500 మందికి పైగా శిక్షణ ఇచ్చానన్నారు. వీరిలో 90 శాతం మంది భారతీయులేనన్నారు. -
మన మహిళలు వరల్డ్ కప్ గెలిస్తే..
న్యూఢిల్లీ:ఇంగ్లండ్ లో జరుగుతున్న మహిళా వన్డే వరల్డ్ కప్ను భారత్ గెలిస్తే మాత్రం కచ్చితంగా కొత్త శకం ఆరంభం కావడం ఖాయమని టీమిండియా మెన్స్ క్రికెటర్ సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం మన మహిళా క్రికెటర్ల ఆట తీరు చూస్తుంటే వరల్డ్ కప్ గెలవడం ఏమాత్రం కష్టం కాదని రైనా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. భారత మహిళా జట్టు జైత్రయాత్రను తాను ఎంతగానో ఆస్వాదిస్తున్నట్లు తెలిపిన రైనా.. ప్రధానంగా ఈ క్రెడిట్ అంతా కెప్టెన్ మిథాలీ రాజ్కే చెందుతుందని కొనియాడాడు. ఇక్కడ ఆమె వ్యక్తిగత ప్రదర్శనే కాకుండా జట్టులోని మిగతా క్రికెటర్లను కూడా చక్కగా వినియోగించుకునే తీరు బాగుందని రైనా అన్నాడు. భారత మహిళలు పాకిస్తాన్ పై సాధించిన విజయం చాలా స్పెషల్ అయితే, వరల్డ్ కప్ గెలిచి మరొక స్పెషల్ తో తిరిగి రావాలని రైనా ఆకాంక్షించాడు. -
సిరీస్ భారత్దే
మూలపాడు(విజయవాడ):వెస్టిండీస్ మహిళలతో జరుగుతన్న మూడు వన్డేల సిరీస్ను భారత మహిళలు కైవసం చేసుకున్నారు. ఆదివారం ఇక్కడ ఏసీఏ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన రెండో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను 2-0 తో చేజిక్కించుకుంది. విండీస్ విసిరిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 38.0 ఓవర్లలో ఛేదించింది.ఓపెనర్ స్మృతీ మందనా(44) ఆకట్టుకోగా, మరో ఓపెనర్ కామిని(2) నిరాశపరిచింది. ఆ తరువాత దీప్తి శర్మ(32), కెప్టెన్ మిథాలీ రాజ్(45)లు రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన విండీస్ 50.0 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. విండీస్ మహిళల్లో డాటిన్(63) హాఫ్ సెంచరీ సాధించగా,అగ్విల్లెరా(25) ఫర్వాలేదనిపించింది. జూలెన్ గోస్వామి, ఏక్తా బిస్త్, రాజేశ్వరి గైక్వాడ్లు తలో రెండు వికెట్లతో రాణించారు. తొలి వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక నామమాత్రమైన మూడో వన్డే నవంబర్ 16న జరుగనుంది. -
తొలి వన్డేలో భారత్ ఘన విజయం
మూలపాడు(విజయవాడ):మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్ మహిళలతో జరిగిన తొలి మ్యాచ్లో భారత మహిళలు ఘన విజయం సాధించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ ను 131 పరుగులకే కూల్చేసిన భారత్.. ఆ తరువాత నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు దీప్తి శర్మ(16), మందనా(7)లు నిరాశపరిచినా, కెప్టెన్ మిథాలీ రాజ్(46 నాటౌట్), వేద కృష్ణమూర్తి(52 నాటౌట్) రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించారు. దాంతో భారత జట్టు 39.1 ఓవర్లలోలక్ష్యాన్ని అందుకుని సిరీస్ లో 1-0తో ఆధిక్యం సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్ 132 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. హెలే మాథ్యూస్(24), అగ్విల్లెరియా(42 నాటౌట్)లు మాత్రమే విండీస్ జట్టులో మోస్తరుగా ఆకట్టుకున్నారు. విండీస్ మహిళల్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.భారత మహిళల్లో ఏక్తా బిష్ మూడు వికెట్లు సాధించగా,రాజేశ్వరి గైక్వాడ్ కు రెండు వికెట్లు లభించాయి. జూలన్ గోస్వామి, శిఖా పాండేలు తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే నవంబర్ 13 వ తేదీన జరుగనుంది. -
అమెరికాలోనూ మనోళ్లే టార్గెట్
చైన్ స్నాచర్ల బారిన పడుతున్న భారత మహిళలు సాక్షి, హైదరాబాద్: ఇక్కడే కాదు... అమెరికాలోనూ చైన్ స్నాచర్ల టార్గెట్ భారత మహిళలేనట! మూడు నెలల్లో అక్కడ మొత్తం 13 చైన్ స్నాచింగ్ కేసులు నమోదైతే అందులో 11 మంది భారత సంతతికి చెందిన మహిళలే బాధితులు. అమెరికాలోని ఫ్రీమాంట్ పోలీసు విభాగ అధికారిణి జెనీవా బొస్క్వస్ ఇటీవల ఈ వివరాలు వెల్లడించారు. షాపింగ్ ప్రాంతాలతో పాటు నివాస సముదాయ పరిసరాల్లో నడుచుకొంటూ వెళుతన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని గొలుసుల చోరీలకు తెగబడుతున్నారన్నారు. బాధితుల్లో ఎక్కువగా ఇండో-అమెరికన్ మహిళలే ఉన్నారన్నారు. ‘బరువైన’ నగలపై గురి... భారత సంస్కృతి ప్రతింబింబించేలా ఇండో-అమెరికన్ మహిళలు అధిక బరువుండే బంగారు గొలుసులు ధరించేందుకు ఇష్టపడుతున్నారు. వీటి విలువ మార్కెట్లో 300 నుంచి 3,000 డాలర్లు ఉంటోంది. దీంతో వీటిపై చైన్ స్నాచర్లు కన్నేశారు. ఇలాంటి మహిళలనే టార్గెట్ చేసి కొట్టేసిన నగలను గుర్తింపునడగని షాపుల్లో సులువుగా అమ్మేస్తున్నారు. ఫ్రీమాంట్ హబ్ షాపింగ్ ప్రాంతంలో నడుచుకొంటూ వెళుతుండగా బైక్పై వచ్చిన దుండగులు తన మెడలోని గొలుసు లాక్కెళ్లారని ఓ భారత సంతతి మహిళ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వద్దకు వచ్చిన ఆఫ్రికన్ మెడలో గొలుసు తెంపుకొని వెళ్లాడనేది మరో మహిళ ఫిర్యాదు. ఈ క్రమంలో బంగారు ఆభరణాలను దుస్తుల లోపల ధరించాలని బొస్క్వస్ సూచిస్తున్నారు. -
సమర్థ నేతలుగా ఎదగండి!
* సాంకేతికాంశాల్లో పట్టు సాధించండి * మహిళా ప్రజా ప్రతినిధులకు ప్రధాని పిలుపు న్యూఢిల్లీ: ‘మహిళాభివృద్ధి గురించి మాత్రమే కాదు.. అంతకుమించి మహిళల నేతృత్వంలో అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది’ అని ప్రధానిమోదీ ఉద్ఘాటించారు. చట్టసభల్లోని మహిళా ప్రతినిధుల జాతీయ సదస్సునుద్దేశించి ఆదివారం మోదీ ప్రసంగించారు. ‘మిమ్మల్ని మీరు సమర్ధవంతంగా తీర్చిదిద్దుకోండి. సాంకేతిక అంశాల్లో సాధికారత సాధించండి. అన్ని అంశాలపై పట్టు సాధించడం ద్వారా మీ నాయకత్వాన్ని పటిష్టం చేసుకోండి. మీ ప్రాంతంలో మీ నాయకత్వానికి సంబంధించి మీదైన ముద్ర వేయండి. మీ పనితీరు, ఆలోచన ప్రజల్లో స్థిరపడితే మీ ఆలోచనలను ప్రజలు ఆమోదించడం మొదలెడతారు.’ అంటూ మహిళా ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. అయితే, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లు అంశంపై మాట్లాడలేదు. పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం కనీసం 12% కూడా లేకపోవడంపై రాష్ట్రపతి తన ప్రసంగంలో ఆవేదన వ్యక్తం చేశారు. స్వచ్చంధంగా మహిళలకు అధిక సంఖ్యల సీట్లు కేటాయించాలని ఉపరాష్ట్రపతి సైతం రాజకీయ పార్టీలకు విజ్ఞప్తిచేశారు. ప్రధాని మోదీ మాత్రం మహిళలకు రిజర్వేషన్ల అంశం జోలికి పోకుండా.. వ్యక్తిత్వాన్ని, పనితీరును మార్చుకోవాలంటూ మహిళలకు సూచించడంపై దృష్టి పెట్టారు. ‘క్షమ, ఓపిక లాంటివి స్త్రీలకు సహజ లక్షణాలు. భర్త, పిల్లల కోసం వారెంతో త్యాగం చేస్తార’ని వ్యాఖ్యానించారు. వ్యవస్థలో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయని, కేవలం వ్యవస్థలో వచ్చే మార్పు సరిపోదని పేర్కొన్నారు. ఈర్ష్య.. ఆత్మన్యూనత వద్దు కింది స్థాయి నుంచి మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, పోటీకి వస్తారేమోనన్న ఈర్ష్య భావనలను వదలుకోవాలని మహిళా ప్రతినిధులకు ప్రధాని హితవు చెప్పారు. ‘రాజకీయాలంటేనే పోటీ. ఈ పోటీలో అసూయ ఆధిపత్యం పెరిగితే మీరు అభివృద్ధి చెందలేరు. నా రంగంలోకి మరింత సమర్ధులైన వారు వస్తే నా పరిస్థితి ఏంటి? అనే ఆలోచన కానీ, నా ప్రాంతంలో మరొకరిని ఎదగనివ్వననే ఆలోచన కానీ వద్దు. అలా కాకుండా, ఇతర మహిళలనూ ప్రోత్సహిస్తే మరింత పైకి ఎదగగలమనే భావనను పెంపొందించుకోండి. దానిద్వారా పిరమిడ్ తరహా నాయకత్వ నిర్మాణం రూపొందుతుంది. మీరు మరింత పైకి ఎదుగుతారు’ అని వివరించారు. ఆత్మన్యూనత వల్ల ఏమీ సాధించలేరన్నారు. అవకాశం లభిస్తే.. పురుషుల కన్నా స్త్రీలే మెరుగైన పనితీరు చూపగలరన్నారు. ‘ఎంతోమంది విదేశాంగ మంత్రులుగా పనిచేశారు. వారి పేర్లు కూడా మనకు గుర్తులేవు. కానీ అత్యుత్తమ పనితీరుతో సుష్మాస్వరాజ్ విదేశాంగ మంత్రిగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు’ అని తన మంత్రివర్గ సహచరురాలిని ప్రశంసించారు. ‘రువాండా పార్లమెంట్లో 65% మహిళలే, వారి నేతృత్వంలో ఆ దేశం గొప్పగా ముందుకు వెళ్తోంద’న్నారు. తన మంత్రివర్గంలోనూ మహిళలకు సముచిత ప్రాధాన్యతనిచ్చానన్నారు. పార్లమెంటు ఉభయసభల్లోని మహిళా ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఒక ఈ- వేదికను ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని సూచించారు. ‘మార్పులకు పురుషుల కన్నా మహిళలు త్వరగా అలవాటవుతారు. చదువుకోని మహిళలు కూడా వంటగదిలో కొత్త కొత్త సాంకేతికతలతో కూడిన వస్తువులను అలవోకగా ఉపయోగిస్తుంటారు. ఏకకాలంలో అనేక పనులు చేయగలగడం భారతీయ మహిళలకు కొట్టిన పిండి’ అని ప్రశంసల్లో ముంచెత్తారు. చట్టాల రూపకల్పనలో క్రియాశీల పాత్ర పోషించాలని మహిళా ప్రజా ప్రతినిధులకు మోదీ పిలుపునిచ్చారు. ‘మహిళా సాధికారత అనే ఆలోచనే సరైంది కాదు. శక్తి లేనివారికి సాధికారత అవసరం. ఇప్పటికే శక్తిమంతమైన వారికి సాధికారత ఏంటి? మహిళలకు సాధికారత కల్పించేందుకు మగవాళ్లెవరు? సవాళ్లను ఎదుర్కొంటే తప్ప మన శక్తి మనకు తెలియదు’ అంటూ వారిలో స్ఫూర్తి నింపేందుకు ప్రధాని ప్రయత్నించారు.