-
రష్యాలో నదిలో మునిగి... మన విద్యార్థుల మృతి
న్యూఢిల్లీ: రష్యాలోని వెలికీ నోవ్గోరోడ్ ప్రాంతంలోని విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న నలుగురు భారత వైద్య విద్యార్థులు వోల్ఖోవ్ నదిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. మంగళవారం ఈ దుర్ఘటన జరిగినట్టు విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఒక మహిళా విద్యారి్థని కాపాడి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. విద్యార్థులంతా వెలికీ నోవ్గోరోడ్ స్టేట్ వర్సిటీలో చదువుతున్నారు. మృతులంతా మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందిన వారు. మృతుల్లో జియా, జిషాన్ అక్కాతమ్ముళ్లు. నది ఒడ్డున వాకింగ్ తర్వాత వారంతా నదిలోకి దిగారు. ఈత కొడుతుండగా జిషాన్ తమ కుటుంబసభ్యులకు వీడియో కాల్ చేశాడు. ఈత వద్దని కుటుంబసభ్యులు ఫోన్లో వారిస్తుండగానే జియా మునగడం, కాపాడేందుకు ప్రయతి్నస్తూ మిగతావారు కూడా నదిలో కొట్టుకుపోవడం కాల్లో రికార్డయింది. మృతదేహాల తరలింపు కోసం భారత కాన్సులేట్ ప్రయత్నిస్తోంది. -
కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
ఒట్టావా: కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ ప్రావిన్స్లో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చటంతో తాము దేశ బహిష్కరణ ఎదుర్కొంటున్నామని భారతీయ విద్యార్థులు వాపోతున్నారు. ఈ క్రమంలో ప్రాంతీయ చట్టాల మార్పును వ్యతిరేకిస్తూ వందలాది మంది భరతీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారతీయ విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ప్రస్తుతం రెండో వారంలోకి చేరుకున్నాయి. విద్యార్థులు తమ నిరసనను కొనసాగిస్తామని తెలిపారు.🚨 Indian students in Prince Edward Island, a province in Canada, are protesting as they face being deported to India after a sudden change in the provincial immigration rules. 🇮🇳🇨🇦 pic.twitter.com/sSfd2OOH5h— Indian Tech & Infra (@IndianTechGuide) May 21, 2024 అయితే ఈ విషయంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ స్పందించారు. ‘‘భారత్ నుంచి పెద్ద సంఖ్య విద్యార్థులు చదువుకోవడానికి కెనడా దేశానికి వెళ్తున్నారు. విద్యార్థుల సంఖ్య అధికంగా కావటంతో ప్రాధాన్యం ఉంది. అయితే వందలాది విద్యార్థులు దేశ బహిష్కరణ పరిస్థితుల ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి ఇంకా రాలేదు. దానిపై తాజా సమీకణాలు కూడా మాకు ఏం అందలేదు. వాటిపై ఎటువంటి అవగాహన లేదు. అక్కడక్కడ ఒక విద్యార్థికి అలా జరిగి ఉండవచ్చు. అయితే ఇప్పటి వరకు కెనడాలోని భరతీయ విద్యార్థులకు సంబంధించి వారు ఎదుర్కొంటున్నట్లు ఎటువంటి పెద్ద సమస్య కనిపించటం లేదు’’ అని రణ్ధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఈ నిరసన రెండో వారంలో అడుగుపెట్టిందని నిరసన తెలుతున్న భారతీయ విద్యార్థులు తెలిపారు. ‘‘మేము చేపట్టిన నిరసన రెండో వారంలోకి చేరింది. అంతే ధైర్యంగా పోరాడుతున్నాం. మాకు పారదర్శకత కావాలి. నిరసనలు కొనసాగిస్తూనే ఉంటాం’’ అని ఓ భారతీయ విద్యార్థి ‘ఎక్స్’లో పేర్కొన్నారు.ఇటీవల కెనడాలో దేశంలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ రాష్ట్రం వలసదారులను తగ్గించుకోవటం కోసం చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ నిబంధలను మార్పు చేసింది. భారీగా వలసదారులు తమ రాష్ట్రానికి రావటంతో హెల్త్కేర్, నివాస సదుపాయాలపై ప్రతికుల ప్రభావం పడుతుందని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. ఒక్కసారిగా ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐస్లాండ్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మార్చటంతో వర్క్ పర్మిట్లు రద్దై, తాము బహిష్కరణ ఎదుర్కొవల్సి వస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఆస్ట్రేలియాలో చదువు.. వీసాకు కొత్త రూల్
ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. స్టూడెంట్ వీసా కావాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులు దేశం కనీస వేతనంలో కనీసం 75 శాతానికి సమానమైన నిధులను కలిగి ఉండాలని ఆస్ట్రేలియా కొత్త నిబంధనను విధించింది.మే 10 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం.. ఆస్ట్రేలియాలో చదివేందుకు అర్హత సాధించడానికి, భారతీయ విద్యార్థులు తప్పనిసరిగా కనీసం 29,710 ఆస్ట్రేలియా డాలర్లు (దాదాపు రూ. 16,29,964) తమ బ్యాంక్ ఖాతాల్లో బ్యాలెన్స్ చూపించాలి.నాలుగు సార్లు పెంపుఇమిగ్రేషన్ విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆస్ట్రేలియా ప్రభుత్వం గడిచిన ఏడు నెలల్లో విద్యార్థుల పొదుపు సొమ్ముకు సంబంధించి వీసా నిబంధనలను నాలుగు సార్లు సవరించింది. గత సంవత్సరం అక్టోబర్ నాటికి, విద్యార్థి వీసాల కోసం చూపించాల్సిన మినిమమ్ బ్యాంక్ బ్యాలెన్స్ 21,041 ఆస్ట్రేలియన్ డాలర్లు ఉండేది.ఈ ఏడాది మార్చిలో ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేసే ప్రక్రియలో భాగంగా ఆస్ట్రేలియన్ ప్రభుత్వం ఇంగ్లిష్ భాషా సామర్థ్యాన్ని పెంచింది. కోవిడ్ పరిమితుల అనంతరం ఆస్ట్రేలియాకు విద్యార్థుల రాక పెరిగింది. దీంతో వసతికి సైతం కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీసా చట్టాల అమలును కఠినతరం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల్లారా.. రండి మాతృ దేశానికి సేవ చేయండి.. ఫిజిక్స్ వాలా పిలుపు
అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్ధుల్లారా.. మీరెక్కడున్నా దేశానికి తిరిగి వచ్చేయండి. దేశ సేవ చేయండి. దేశ అభివృద్దిలో పాలు పంచుకోండి అంటూ ప్రముఖ ఎడ్యుటెక్ ఫిజిక్స్ వాల వ్యవస్థాపకుడు, సీఈఓ అలఖ్ పాండే పిలుపునిచ్చారు.యూఎస్లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు దేశ సేవ చేయాలని అలఖ్ పాండే కోరారు. తిరిగి రాలేని వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దేశ పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అలఖ్ పాండే ఇటీవల హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల్లో ప్రసంగించేందుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ క్యాంపస్లలో భారతీయ విద్యార్ధులతో దిగిన ఫోటోల్ని, అనుభవాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవును, మన దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ ఏ దేశం పరిపూర్ణంగా లేదు. కానీ యువత దేశాన్ని మార్చుకునే అవకాశం ఉందని అన్నారు. View this post on Instagram A post shared by Physics Wallah (PW) (@physicswallah) -
భద్రత ఉంటేనే అమెరికా చదువులకు!
సాక్షి, హైదరాబాద్: విదేశాలకు తమ పిల్లలను పంపే తల్లిదండ్రులు ఇప్పుడు అక్కడి భద్రతపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో డిగ్రీలకన్నా తమ పిల్లలు భద్రంగా ఉంటారా లేదా అనే ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. అగ్రరాజ్యంలో ఇటీవలికాలంలో భారతీయ విద్యార్థులపై వరుస దాడుల ఉదంతాల నేపథ్యంలో ఈ తరహా జాగ్రత్త కనిపిస్తోంది. ఈ క్రమంలో సవాలక్ష సందేహాలు తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయని అమెరికా వర్సిటీల్లో మన విద్యార్థులు ప్రవేశాలు పొందడంలో సాయం చేసే కన్సల్టెంట్లు చెబుతున్నారు. చేర్చాలనుకునే వర్సిటీలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు కొందరు తల్లిదండ్రులు ముందుగా ఓ వ్యక్తిని పంపి అక్కడి పరిస్థితుల గురించి వాకబు చేయిస్తున్నారు. 2024 అడ్మిషన్ల ఫలితాలు వెల్లడువుతున్న తరుణంలో ఇలాంటి భయాలు తల్లిదండ్రుల్లో ఎక్కువయ్యాయని కన్సల్టెంట్లు అంటున్నారు. అమ్మాయిలను అమెరికాలో పైచదువులకు పంపే తల్లిదండ్రులు మరింత ఎక్కువగా విచారణ చేయిస్తున్నారని బెంగుళూరుకు చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థ సీఈవో ఆదర్శ ఖండేల్వాల్ తెలిపారు. ‘ప్రస్తుతం అడ్మిషన్ ఫలితాలు వెలువడుతున్నాయి. 2024లో భద్రత అనేది ఒక ప్రధాన అంశంగా మారింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. క్రైం రేటుపై వాకబు.. అమెరికాలోని ఏయే యూనివర్సిటీల పరిధిలో ఎంత క్రైం రేటు ఉంది? ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి? డ్రగ్స్ ప్రభావం ఏమైనా ఉందా? అనే అంశాలను తల్లిదండ్రులు ఎక్కువగా పరిశీలిస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ చదువుల కోసం పిల్లలను పంపే తల్లిదండ్రుల్లో నేరాలపై ఎక్కువ ఆందోళన కనిపిస్తోంది. తొలిసారి దేశానికి, కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడమే దీనికి ప్రధాన కారణమని విదేశీ కన్సల్టెన్సీలు విశ్లేషిస్తున్నాయి. షికాగో, బోస్టన్, ఇండియానా వంటి ప్రాంతాల్లో భారతీయ విద్యార్థులపై దాడులతోపాటు అక్కడ ఎక్కువ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా నివేదికలు ఇవే వెల్లడించడంతో ఈ ప్రాంతాలకు పంపాలంటే తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి ఇటీవల ఓ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. సమస్యాత్మకం కాని వర్సిటీల వైపే అమెరికన్ యూనివర్సిటీలకు వస్తున్న దరఖాస్తులను పరిశీలిస్తే తక్కువ సమస్యాత్మకమైన వాటినే భారతీయ విద్యార్థులు ఇష్టపడుతున్నారు. దీనిపై సమగ్ర అవగాహన కలిగాకే విదేశీ చదువులపై ప్రణాళిక రచిస్తున్నారని విదేశాల్లోని స్టడీ కెరీర్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు కరణ్ గుప్తా తెలిపారు. పెద్ద నగరాలు లేదా తక్కువ సమస్యాత్మకమైనవిగా గుర్తించే యూఎస్ వర్సిటీల ఆఫర్లను మాత్రమే ఇష్టపడుతున్నారని తెలిపారు. ఇటీవల హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థి ఫ్లోరిడాలోని ‘చి’ యూనివర్సిటీని ఎంపిక చేసుకున్నాడు. అయితే ఆ ప్రాంతంపై సమగ్ర సమాచారం సేకరించిన తల్లిదండ్రులు తమ కుమారుడిని ఆ వర్సిటీలో కాకుండా ఎన్వైయూ యూనివర్సిటీ మంచిదని అందులో చేర్పించారు. 95% కేసుల్లో, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం తల్లిదండ్రులు స్వీయ నిర్ణయాలు తీసుకుంటున్నారని మరో కన్సల్టెంట్ గుప్తా తెలిపారు. ఆరిజోనా, ఒహాయో, టెక్సాస్, లాస్ ఏంజిలెస్, కాలిఫోర్నియా, డాలస్ వంటి ప్రాంతాలకు తమ పిల్లలను పంపాలనుకొనే తల్లిదండ్రులు ఎక్కువ జాగ్రత్తలు కోరుతున్నారు. వరంగల్కు చెందిన ఓ విద్యార్థి కాలిఫోర్నియాలోని క్లేర్మాంట్ మెక్కెన్నా కాలేజీలో చేరాలని ఇష్టపడ్డాడు. కానీ అతని తల్లిదండ్రులు మాత్రం దానికి బదులుగా బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఆఫర్ను తీసుకోవాలని పట్టుబట్టారు, విద్యార్థి మేనమామ అక్కడ నివసిస్తున్నాడని, అది భద్రత కల్పిస్తుందని భావించారు. కన్సల్టెన్సీల్లోనూ ఆందోళన భారతీయ విద్యార్థులపై ఆందోళనల నేపథ్యంలో కన్సల్టెన్సీలూ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులను మెప్పించే రీతిలో వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా కన్సల్టెన్సీలన్నీ కలిపి తొలిసారిగా విద్యార్థుల భద్రత కోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించాయి. ముందుగా విద్యార్థుల భద్రతపై అవగాహన కల్పిస్తున్నాయి. ఆన్లైన్లో ఆయా ప్రదేశాల సమాచారం అందుబాటులోకి తేవడంతోపాటు అవసరమైతే విద్యార్థులు, తల్లిదండ్రుల బృందాలు కూడా ఆయా వర్శిటీలను సందర్శించేందుకు, అక్కడి సీనియర్ విద్యార్థులతో సంప్రదింపులు జరిపేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. -
యూఎస్లో భారత స్టూడెంట్స్ మరణాలు.. కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఇటీవల అమెరికాలో వరుసగా జరిగిన ఐదుగురు భారత విద్యార్థుల మరణాలకు ఒకదానితో మరొకదానికి ఎలాంటి సంబంధం లేదని, వాటి వెనుక ఎలాంటి కుట్ర లేదని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ వ్యవహారల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ గురువారం మీడియాకు వెల్లడించారు. ‘చనిపోయిన ఐదుగురు భారత విద్యార్థుల్లో ఇద్దరే భారత పౌరులు. మిగిలిన ముగ్గురు భారత సంతతికి చెందిన అమెరికా పౌరులే. డ్రగ్స్కు బానిసైన ఇల్లు లేని ఓ వ్యక్తి వివేక్ సైనీ అనే భారత విద్యార్థిని తలపై సుత్తితో 50సార్లు కొట్టి దారుణంగా చంపాడు. సిన్సినాటిలో జరిగిన మరో ఘటనలో మరో భారత విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వీరు కాక భారత సంతతికి చెందిన ముగ్గురు విద్యార్థులు వివిధ ఘటనల్లో మరణించారు. వీరిలో వివేక్ సైనీ హత్య కేసులో నిందితున్ని అరెస్టు చేశారు. విచారణ వేగంగా జరుగుతోంది.సిన్సినాటి ఘటనలో విద్యార్థి మృతికి సంబంధించిన వైద్య పరీక్షల రిపోర్టుల కోసం వేచి చూస్తున్నాం. భారత విద్యార్థుల మరణాలపై అమెరికాలోని ఆయా ప్రాంతాల ప్రభుత్వ యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నాం. మరణించిన వారి కుటుంబాలకు అవసరమైన సాయం చేస్తున్నాం’ అని జైస్వాల్ తెలిపారు. ఇదీ చదవండి.. ఢిల్లీలో రైతుల భారీ నిరసన.. అడ్డుకున్న పోలీసులు -
విదేశాల్లో విద్యార్థుల మరణాలపై కేంద్రం పకటన
న్యూఢిల్లీ: విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాలపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటులో ప్రకటించింది. గత ఐదేళ్లలో.. విదేశాలలో 403 మంది భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ వెల్లడించారు. మూడోరోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఒక ప్రశ్నకు మంత్రి మురళీధరన్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2018 నుంచి విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందగా.. అత్యధికంగా 91 మంది కెనడా దేశంలో మరణించినట్లు తెలిపారు. ఇంగ్లండ్లో 48, రష్యాలో 40 మంది, అమెరికాలో 36, ఉక్రెయిన్లో 21 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారని పేర్కొంది. అయితే ఇటీవల అమెరికాలో వరుసగా నలుగురు భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాలల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఏ దేశంలో ఇప్పటివరకు అసలు ఎంత మంది విద్యార్థులు విదేశాల్లో మృతి చెందారన్న విషయంపై స్పష్టత ఇచ్చింది కేంద్రం. చదవండి: అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు -
భారత విద్యార్థులకు మాక్రాన్ రిపబ్లిక్ డే కానుక
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కీలక ప్రకటన చేశారు. ఫ్రాన్స్లో చదువుకోవడానికి మరింత మంది భారత విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను తమ విశ్వవిద్యాలయాలకు ఆహ్వానించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తెలిపారు. "ఫ్రెంచ్ ఫర్ ఆల్, ఫ్రెంచ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్" అనే చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రెంచ్ నేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఫ్రెంచ్ రాని విద్యార్థులకు అంతర్జాతీయ తరగతులను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఫ్రాన్స్లో చదివిన భారతీయ విద్యార్థులకు వీసా ప్రక్రియ క్రమబద్ధీకరించబడుతుందని మాక్రాన్ వెల్లడించారు. 2025 నాటికి 20,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షించాలని ఫ్రాన్స్ లక్ష్యంగా పెట్టుకోగా.. 2030 నాటికి 30,000 మంది భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తామని ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. భారత్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం దిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో మాక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురువారం జైపుర్ శివారులోని ఆమెర్ కోటను మాక్రాన్ సందర్శించారు. ప్రధాని మోదీ ఆయనకు అయోధ్య రామమందిర నమూనాను కొనుగోలు చేసి బహూకరించారు. ఇదీ చదవండి: Republic Day 2024: జైపూర్లో మోదీ, మేక్రాన్ రోడ్ షో -
ఎమ్మెస్.. టైమ్ పాస్!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం ఐటీ రంగాన్ని కుదిపివేస్తున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు విదేశీ చదువులపై దృష్టి పెట్టారు. సాఫ్ట్వేర్ రంగం గాడిన పడే వరకూ ఎంఎస్ చేయడమే మేలని భావిస్తున్నారు. ఈ కారణంగా ఈ ఏడాది విదేశీ విద్యకు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగింది. కరోనా నేపథ్యంలో 2021 విద్యా సంవత్సరంలో 4.44 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, 2022లో ఈ సంఖ్య ఏకంగా 6.84 లక్షలకు పెరిగింది. 2023 చివరి నాటికి ఈ సంఖ్య మరో 10 వేల వరకు పెరిగిందని అంచనా. అమెరికా వంటి దేశాల్లో ఐటీ సెక్టార్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని తెలిసినా.. ఈ ఒక్క దేశానికే 2023లో 2.80 లక్షల మంది భారతీయులు విద్య కోసం వెళ్ళారు. మరోవైపు కెనడా వీసా ఆంక్షలకు నిబంధనలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నా, చదువు కోసం వెళ్ళేందుకే విద్యార్థులు ఇష్టపడుతున్నారు. ఎందుకీ పరిస్థితి..? దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 12 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వీరిలో కేవలం 8 శాతం మందికి మాత్రమే నైపుణ్యం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. బహుళజాతి కంపెనీల్లో మంచి వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నది వీళ్ళే. మిగతా వాళ్ళు వచ్చిన ఉద్యోగంతో సంతృప్తి పడుతున్నారు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్సు నేర్చుకుని సంబంధం లేని ఉద్యోగానికి వెళ్తున్నారు. ఇంతకాలం వీళ్ళ అవసరం ఉండేది. అవసరమైన శిక్షణ ఇచ్చి కంపెనీలు వారి సేవలను వినియోగించుకునేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అమెరికాలో వచ్చిన ఆర్థిక సంక్షోభం ప్రభావం భారత్ ఐటీ రంగంపైనా ప్రభావం చూపించింది. ప్రధాన కంపెనీలన్నీ వరుసగా లే ఆఫ్లు ప్రకటించడంతో ఐటీ విభాగం కుదేలైంది. క్యాంపస్ నియామకాలు తగ్గాయి. కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చినా ఉద్యోగాలుమాత్రం ఇవ్వలేదు. దీంతో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తోంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ఫ్రెషర్స్ పోటీని తట్టుకుని నిలబడటం కష్టంగా ఉంది. ఈ కారణంగానే విదేశాల్లో విద్యాభ్యాసానికి వెళుతున్నారు. సమయం వృథా ఎందుకుని.. చాలా కంపెనీలు ఏడాది క్రితం ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కు ఆఫర్ లెటర్స్ ఇచ్చాయి. కానీ చాలా సంస్థలు ఇంత వరకూ నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. నాస్కామ్ తాజాగా జరిపిన ఓ సర్వేలో ఇలాంటి వాళ్ళు భారత్లో 2.5 లక్షలు ఉంటారని తేలింది. మన రాష్ట్రంలోనే 24 వేల మందికి పైగా ఉన్నట్టు స్పష్టమైంది. మరో వైపు అమెరికా ప్రాజెక్టులు తగ్గుతున్నా యని కంపెనీలు చెబుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నియామక ఉత్తర్వులు వస్తాయన్న భరోసా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉండటం దేనికి? అని యువత భావిస్తోంది. ఒకవేళ ఖాళీగా ఉంటే ఆ తర్వాత జాబ్లోకి తీసుకోవడానికి కంపెనీలు అంతగా ఆసక్తి చూపవు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పరిస్థితి చక్కబడే వరకూ ఎమ్మెస్ లాంటిది చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. లభించని బ్యాంకు రుణాలు విదేశీ విద్యకు గతంలో తేలికగా రుణాలు లభించేవి. కానీ గత ఏడాది కాలంగా బ్యాంకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనిన విద్యార్థులు అంటున్నారు. బ్యాంకు రుణాల విధానాన్ని సవరించడమే దీనికి కారణమని బ్యాంకర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్ళేందుకు అవసరమైన సెక్యూరిటీ మొత్తం, అక్కడి ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థి కనీసం రూ.40 లక్షల వరకూ అప్పు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని విదేశాల్లో చదివేటప్పుడు తీర్చేద్దామన్న ధీమాతో వెళ్తున్నారు. విదేశాల్లో ఏదైనా పార్ట్టైం జాబ్ చేయొచ్చనేది వారి ఆలోచన. కానీ గతేడాది డిసెంబర్లో వెళ్ళిన విద్యార్థులకు అమెరికాలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. పార్ట్ టైం ఉద్యోగాలు దొరకడం కూడా కష్టంగా ఉందని అక్కడి విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. ఐటీ కోలుకోవడంపైనే ఆశలు బీటెక్ పూర్తయ్యాక ఇండియాలో ఏడాది పాటు ఉద్యోగం కోసంవిఫల ప్రయత్నం చేశా. చివరకు అమెరికా వెళ్ళి ఎమ్మెస్ చేయాలని నిర్ణయించుకున్నా. ఇంట్లో అర ఎకరం పొలం అమ్మి డబ్బులిచ్చారు. నేను కొంత అప్పు చేశా. డిసెంబర్లో అమెరికా వచ్చా. ఇక్కడ పార్ట్ టైం జాబ్ కష్టమని కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. మళ్ళీ అప్పు చేయమని తల్లిదండ్రులకు చెప్పడం ఇబ్బందిగానేఉంది. ఐటీ కోలుకుంటే పరిస్థితి మారుతుందనే నమ్మకం ఉంది. –శశాంక్ (అమెరికా వెళ్ళిన వరంగల్ విద్యార్థి) ఏడాది క్రితం ఆఫర్ లెటర్ ఇచ్చారు బీటెక్ అవ్వగానే ఆఫ్ క్యాంపస్లో ఓ కంపెనీ ఉద్యోగం ఆఫర్ చేసింది. ఉద్యోగం వచ్చిందని నేను, మా వాళ్ళూ బంధువులందరికీ చెప్పుకున్నాం. ఆ లెటర్ పట్టుకుని ఏడాది నిరీక్షించా. ఎంతకీ అపాయింట్మెంట్ ఆర్డర్ రాలేదు. ఇప్పుడు చిన్నతనంగా ఉంది. అందుకే అప్పు చేసి మరీ అమెరికా వెళ్ళేందుకు సిద్ధమవుతున్నా. ఎమ్మెస్ అయిపోయే లోగా పరిస్థితి మారుతుందనే ఆశ ఉంది.– పి. నీలేశ్ కుమార్ (యూఎస్ వెళ్ళేందుకు సిద్ధమైన హైదరాబాద్ విద్యార్థి) -
కనువిప్పు కలిగించే కోత!
కెనడాతో మరో తంటా వచ్చి పడింది. సెప్టెంబర్లో మొదలయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి విదేశీ విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్ పర్మిట్లపై రెండేళ్ళ పాటు పరిమితులు విధిస్తున్నట్టు ఆ దేశం సోమవారం ప్రకటించింది. వీసాల సంఖ్య తగ్గిందంటే, కాలేజీ డిగ్రీ కోసం అక్కడకు వెళ్ళే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా తగ్గనుందన్న మాట. ఈ వీసాల కోత అన్ని దేశాలకూ వర్తించేదే అయినా, మనవాళ్ళ విదేశీ విద్యకు కెనడా ఓ ప్రధాన కేంద్రం కావడంతో భారతీయ విద్యార్థి లోకం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. కెనడా గడ్డపై ఓ ఖలిస్తానీ తీవ్రవాది హత్య వెనుక భారత్ హస్తం ఉందంటూ ఆ దేశం చేసిన ఆరోపణలతో ఇప్పటికే భారత – కెనడా దౌత్య సంబంధాలు చిక్కుల్లో పడ్డాయి. ఆ కథ కొలిక్కి రాకముందే, విదేశీ స్టూడెంట్ వీసాలకు కెనడా చెక్ పెట్టడం ఇంకో కుదుపు రేపింది. ఇటీవల కెనడాకు వెళ్ళి చదువుకొంటున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో అతి పెద్ద వర్గాలలో ఒకటి భారతీయ విద్యార్థి వర్గం. 2022లో 2.25 లక్షల పైచిలుకు మంది మన పిల్లలు అక్కడకు చదువులకు వెళ్ళారు. వివరంగా చెప్పాలంటే, ఆ ఏడాది కెనడా ఇచ్చిన మొత్తం స్టడీ పర్మిట్లలో 41 శాతానికి పైగా భారతీయ విద్యార్థులకే దక్కాయి. ఇక, 2023 సెప్టెంబర్ నాటి కెనడా సర్కార్ గణాంకాల ప్రకారం అక్కడ చదువుకు అనుమతి పొందిన అంతర్జాతీయ విద్యార్థుల్లో 40 శాతం మంది భారతీయులే. 12 శాతంతో చైనీయులు రెండో స్థానంలో ఉన్నారు. తీరా ఇప్పుడీ కొత్త నిబంధనలు అలా కెనడాకు వెళ్ళి చదవాలనుకుంటున్న వారికి అశనిపాతమే. వారంతా ఇతర దేశాల వంక చూడాల్సిన పరిస్థితి. 2023లో కెనడా 10 లక్షలకు పైగా స్టడీ పర్మిట్లిచ్చింది. దశాబ్ది క్రితంతో పోలిస్తే ఇది 3 రెట్లు ఎక్కువ. తాజా ప్రతిపాదనతో ఈ ఏడాది ఆ పర్మిట్ల సంఖ్య 3.64 లక్షలకు తగ్గనుంది. అంటే, 35 శాతం కోత పడుతుంది. విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లపై పరిమితి ప్రధానంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకే వర్తిస్తుంది. గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీలు, పీహెచ్డీలకు ఇది వర్తించకపోవడం ఊరట. అయితే, పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్లకు షరతులు వర్తిస్తాయి. గతంలో కెనడాలో పీహెచ్డీ, మాస్టర్స్ కోర్సులు చేస్తుంటే మూడేళ్ళ వర్క్ పర్మిట్ దక్కేది. ఆ దేశంలో శాశ్వత నివాసం సంపాదించడానికి ఈ పర్మిట్లు దగ్గరి దోవ. ప్రధానంగా పంజాబీలు కెనడాలో చదువుతూనే, లేదంటే తాత్కాలిక ఉద్యోగాల్లో చేరుతూనే జీవిత భాగస్వామిని వీసాపై రప్పిస్తుంటారు. ఇక ఆ వీలుండదు. స్టడీ పర్మిట్లలో కోతతో విదేశీ విద్యార్థులకే కాదు... కెనడాకూ దెబ్బ తగలనుంది. పెద్దయెత్తున విదేశీ విద్యార్థుల్ని ఆకర్షించడానికి కెనడాలోని పలు విద్యాసంస్థలు తమ ప్రాంగణాలను విస్తరించాయి. తాజా పరిమితితో వాటికి ఎదురుదెబ్బ తగలనుంది. అంతర్జాతీయ విద్యార్థుల వల్ల కెనడా ఆర్థిక వ్యవస్థకు ఏటా 1640 కోట్ల డాలర్ల మేర ఆదాయం వస్తోంది. కోతలతో ఇప్పుడు దానికి గండి పడనుంది. అలాగే, జీవన వ్యయం భరించగలమంటూ ప్రతి విదేశీ విద్యార్థీ 20 వేల కెనడా డాలర్ల విలువైన ‘గ్యారెంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికెట్’ (జీఐసీ) తీసుకోవడం తప్పనిసరి. అలా కొత్త విద్యార్థుల వల్ల కెనడా బ్యాంకులు సైతం ఇంతకాలం లాభపడ్డాయి. తాజా నిబంధనలతో వాటికీ నష్టమే. అలాగే, దాదాపు లక్ష ఖాళీలతో కెనడాలో శ్రామికశక్తి కొరత ఉంది. విదేశీ విద్యార్థులు ఆ లోటును కొంత భర్తీ చేస్తూ వచ్చారు. గడచిన 2023లో ఒక్క ఆహారసేవల రంగంలో 11 లక్షల మంది కార్మికు లుంటే, వారిలో 4.6 శాతం మంది ఈ అంతర్జాతీయ విద్యార్థులే. ఆ లెక్కలన్నీ ఇక మారిపోతాయి. శ్రామికశక్తి కొరత పెరుగుతుంది. అయినా, కెనడా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీసుకున్న ఈ కోత నిర్ణయం వెనుక అనివార్యతలు అనేకం. చదువు పూర్తి చేసుకొని, అక్కడే వర్క్ పర్మిట్లతో జీవనోపాధి సంపాదించడం సులభం గనక విదేశీ విద్యకు కెనడా పాపులర్ గమ్యస్థానం. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరిగేసరికి, అద్దెకు అపార్ట్ మెంట్లు దొరకని పరిస్థితి. నిరుడు కెనడా వ్యాప్తంగా అద్దెలు 7.7 శాతం పెరిగాయి. గృహవసతి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. దాంతో ట్రూడో సర్కారుపై ఒత్తిడి పెరిగింది. విదేశీయుల వలసల్ని అతిగా అనుమతించడమే ఈ సంక్షోభానికి కారణమని కెనడా జాతీయుల భావన. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీకి ఇది లాభించింది. పైగా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ట్రూడో ఓటమి పాలవుతారని ప్రజాభిప్రాయ సేకరణల మాట. ఈ పరిస్థితుల్లో స్వదేశీయుల్ని సమాధానపరిచి, వలస జీవుల అడ్డుకట్టకై ట్రూడో సర్కార్ ఈ వీసాల కోతను ఆశ్రయించింది. విద్యార్థుల సంఖ్యను వాటంగా చేసుకొని, కొన్ని సంస్థలు కోర్సుల నాణ్యతలో రాజీ పడుతున్న వైనానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ చర్య చేపట్టామని కెనడా మాట. తాజా పరిణామం భారత్కు కనువిప్పు. కెనడాలో పలు ప్రైవేట్ సంస్థలు ట్యూషన్ ఫీజులేమో భారీగా వసూలు చేస్తూ, నాణ్యత లేని చదువులు అందిస్తున్నాయి. అయినా భారతీయ విద్యార్థులు కెనడాకో, మరో విదేశానికో వెళ్ళి, ఎంత ఖర్చయినా పెట్టి కోర్సులు చేసి, అక్కడే స్థిరపడాలనుకుంటున్నారంటే తప్పు ఎక్కడున్నట్టు? మన దేశంలో ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నట్టు? ఇది పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం. 2025 నాటికి భారతీయ కుటుంబాలు పిల్లల విదేశీ చదువులకై ఏటా 7 వేల కోట్ల డాలర్లు ఖర్చుచేస్తాయని అంచనా. చిన్న పట్నాలు, బస్తీల నుంచీ విదేశీ విద్య, నివాసంపై మోజు పెరుగుతుండడం గమనార్హం. నాణ్యమైన ఉన్నత విద్య, ఉపాధి కల్పనలో మన ప్రభుత్వాల వైఫల్యాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ఈ వాస్తవాలు గ్రహించి, ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేదంటే, అమెరికాలో ఉద్యోగాలకు, కెనడాలో వీసాలకు కోత పడినప్పుడల్లా దిక్కుతోచని మనవాళ్ళు మరో దేశం దిక్కు చూడాల్సిన ఖర్మ తప్పదు! -
ఇండియన్ స్టూడెంట్స్ మరణాలు ఎక్కువగా ఆ దేశంలోనే
న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో విదేశాల్లో 403 మంది భారత విద్యార్థులు చనిపోయారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో కెనడా వెళ్లినవారే ఎక్కువ మంది ఉన్నారు. 2018 నుంచి ఇప్పటివరకు కెనడా వెళ్లిన 91 మంది విద్యార్థులు వివిధ కారణాల వల్ల మరణించారు. యునైటెడ్ కింగ్డమ్(యూకే)కు వెళ్లిన 48 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ వివరాలను కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సహజ మరణాలతో పాటు యాక్సిడెంట్లు, ఆరోగ్య పరమైన సమస్యలతో స్టూడెంట్లు మృతిచెందుతున్నట్లు తెలిపింది. అయితే వీటిలో కొన్ని అనుమానాస్పద మరణాలున్నట్లు పేర్కొంది. విదేశాల్లోని భారత విద్యార్థుల భద్రత తమకు అత్యంత ముఖ్యమని కేంద్రమంత్రి మురళీధరన్ చెప్పారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగి విదేశాల్లో విద్యార్థులు మరణిస్తే వాటిపై ఆయా దేశాల అధికారులతో ఫాలోఅప్ చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల మృతికి కారణమైన వారికి సరైన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విదేశాల్లో మృతి చెందతున్న భారత విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఎందుకుంటోందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఎక్కువ మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని విదేశాంగ శాఖ అధికారి అరిందమ్ బగ్చి చెప్పారు. ఇదీచదవండి..ఎంపీ మహువాపై లోక్సభ నిర్ణయం అదేనా..! -
లండన్లో భారత విద్యార్థి మృతి..
నవంబర్ నెలలో బ్రిటన్లో అదృశ్యమైన భారతీయ విద్యార్థి కథ విషాదాంతమైంది. లండన్లోని థేమ్స్ నదిలో 23 ఏళ్ల మిత్ కుమార్ పటేల్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. కాగా ఉన్నత చదువుల కోసం మిత్కుమార్ రెండు నెలల క్రితం (సెప్టెంబరు) యూకే వెళ్లాడు. నవంబర్ 17 నుంచి అతడు కనిపించకుండా పోయాడు. అదృశ్యమయ్యాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో నవంబర్ 21న తూర్పు లండన్లోని కానరీ వార్ఫ్ ప్రాంతం సమీపంలోని థేమ్స్ నదిలో అతని మృతదేహాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు కనుగొన్నారు. అతను ఎలా ప్రాణాలు కోల్పోయాడు? అన్న విషయంపై స్పష్టత లేదు. కానీ అతను హత్యకు గురవ్వలేదని, అనుమానాస్పద మృతి కాదని పోలీసులు చెబుతున్నారు. మిత్కుమార్ పటేల్ వ్యవసాయ కుటుంబానికి చెందిన యువకుడు కావడంతో అతడి తల్లిదండ్రులకు ఆర్థిక సాయం చేసేందుకు నిధులు సమీకరిస్తున్నట్టు అతడి బంధువు పార్త్ పటేల్ అనే వ్యక్తి వెల్లడించాడు. ‘గో ఫండ్ మీ’ ఆన్లైన్ ఫండ్ రైజర్ ద్వారా నిధుల సేకరణ ప్రారంభించామని తెలిపాడు. వారం వ్యవధిలో జీబీపీ(గ్రేట్ బ్రిటన్ పౌండ్స్) 4,500కి(4 లక్షల 76 వేలు) పైగా వచ్చాయని తెలిపాడు. మిత్కుమార్ వయసు 23 సంవత్సరాలని, 19 సెప్టెంబర్ 2023న యూకే వచ్చాడని చెప్పాడు. నవంబర్ 20న షెఫీల్డ్ హాలమ్ వర్సిటీలో డిగ్రీ కోర్సు ప్రారంభించాల్సి ఉందని, అమెజాన్లో పార్ట్టైమ్ జాబ్ కూడా లభించిందని తెలిపాడు. ఇంతలోనే నవంబర్ 17న డైలీ వాక్కు వెళ్లిన పటేల్.. తిరిగి ఇంటికి వెళ్లలేదని చెప్పాడు. నవంబర్ 21న పోలీసులు మృతదేహాన్ని గుర్తించారని.. ఉన్నత చదువుల కోసం వచ్చిన వ్యక్తి ఈ విధంగా చనిపోవడం బాధ కలిగిస్తోందని, అతడి కుటుంబానికి సహాయం చేయాలని భావించామని చెప్పాడు. మిత్కుమార్ మృతదేహాన్ని భారత్కు పంపిస్తామని అన్నాడు. సేకరించిన నిధులను ఇండియాలోని మిత్కుమార్ కుటుంబానికి అందిస్తామని చెప్పాడు. -
స్టూడెంట్ వీసాకు అమెరికా కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు
ఢిల్లీ: భారతీయ విద్యార్థుల కోసం వీసా దరఖాస్తు ప్రక్రియలో అమెరికా రాయబార కార్యాలయం సవరణలు చేసింది. ఈ మార్పులు సోమవారం (నవంబర్ 27) నుండి అమలులోకి వచ్చాయి. ఈ మార్పులు భారతీయ నగరాల్లోని అన్ని రాయబార కార్యాలయాలకు వర్తిస్తాయి. ఎఫ్, ఎమ్, జే వీసా ప్రోగ్రామ్ల క్రింద అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులు ఈ మార్పులను గమనించాలని సూచించారు. అధికారిక వెబ్సైట్లో తమ ప్రొఫైల్ క్రియేషన్, వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకునేటప్పుడు సొంత పాస్పోర్ట్ సమాచారాన్నే వినియోగించాలి. తప్పుడు పాస్పోర్ట్ నంబరు ఇస్తే.. ఆ దరఖాస్తులను వీసా అప్లికేషన్ సెంటర్ల వద్ద తిరస్కరిస్తారు. వారి అపాయింట్మెంట్లు రద్దు అవుతాయి. వీసా రుసుమును కూడా రద్దు చేస్తారు. ఎఫ్, ఎమ్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా స్టూడెండ్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ ధ్రువీకరించిన స్కూల్ లేదా ప్రోగ్రామ్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇక, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు అమెరికా విదేశాంగ శాఖ అనుమతి ఉన్న సంస్థ నుంచి స్పాన్సర్షిప్ అవసరం అవుతుంది. Attention Students! To prevent fraud and abuse of the appointment system, we are announcing the following policy change which will be implemented beginning November 27, 2023. All F, M, and J student visa applicants must use their own passport information when creating a profile… pic.twitter.com/2JqoEg3DJ1 — U.S. Embassy India (@USAndIndia) November 24, 2023 తప్పుడు పాస్పోర్ట్ నంబరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నవారు.. మళ్లీ సరైన నంబరుతో కొత్త ప్రొఫైల్ను క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు అపాయింట్మెంట్ కోసం బుక్ చేసుకోవాలి. ఇందుకోసం మళ్లీ వీసా ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. పాత పాస్పోర్టు పోవడం లేదా చోరీకి గురైతే కొత్త పాస్పోర్ట్ తీసుకున్నవారు, కొత్తగా పాస్పోర్టును రెన్యూవల్ చేసుకున్నవారు.. పాత పాస్పోర్ట్కు సంబంధించిన ఫొటోకాపీ లేదా ఇతర డాక్యుమెంటేషన్లను అందించాలి. అప్పుడే వారి అపాయింట్మెంట్ను అంగీకరిస్తారు. ఇదీ చదవండి: అమెరికాలో భారత రాయబారిని అడ్డుకున్న ఖలిస్థానీ మద్దతుదారులు -
కేసీఆర్ పాలన స్వర్ణయుగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్పాలన స్వర్ణయుగాన్ని తీసుకొచ్చిందని, అన్నిరంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలబడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. లండన్ పర్యటనలో ఉన్న ఆమె నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమిని అసోసియేషన్ –యూకే (ఎన్ఐఎస్ఏయూ) సభ్యులతో సంభాషించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు కవిత సమాధానాలు ఇచ్చారు. మహిళారిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, తన రాజకీయ జీవితం తదితర అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సకలజనుల సర్వే నిర్వహించి, ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలు సేకరించడం ద్వారా, వారి జీవితాల్లో మార్పు తెచ్చారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కులవృత్తుల వారిని ప్రోత్సహించేందుకు కృషి చేసిన వివరాలు వెల్లడించారు. మైనారిటీలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల్లో నెలకొల్పడంతో వారిలో విద్య పట్ల ఆసక్తి పెరిగిందని, గతంలో ఎన్నడూ లేనంతగా పాఠశాలలకు హాజరుశాతం పెరిగిందన్నారు. సీఎం కృషి వల్ల తెలంగాణ ప్రగతిపథంలో నడుస్తోందని, సంపద సృష్టించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిపుష్టి చేయాలన్నది తమ అధినేత కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం తాను ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత తరచూ లేవనెత్తిన అంశాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం ఒకటని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలును డీలిమిటేషన్కు ముడిపెట్టడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన వస్తోందని.. తెలంగాణ స్థానిక సంస్థల్లో 55–57 శాతం మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నా, సమావేశాలు నిర్వహిస్తే ఎక్కువ పురుషులు కనిపిస్తారని, ఆ పరిస్థితి మారాలని చెప్పారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసమే రాజకీయాల్లోకి.. తెలంగాణ కోసం కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి తిరిగి కేసీఆర్ పోటీ చేసినప్పుడు మొదటిసారి రాజకీయ ప్రచారం చేశానని కవిత గుర్తు చేశారు. ఓ గ్రామీణ మహిళ తనకు రూ. వెయ్యి ఆదాయం ఎక్కువగా వస్తే పిల్లలను చదివించుకోగలనని అన్నారని, ఆ సమయంలోనే ప్రజాజీవితంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో మార్పు తేవడానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానన్నారు. -
కెనడా కాలేజీలు, వర్సిటీలకు భారత విద్యార్థుల అవసరమే ఎక్కువ!
ఒట్టావా: ఖలిస్తానీ తీవ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యతో కెనడా, భారత దేశాల మధ్య సంబంధాలు ఇటీవల అనూహ్య మార్గంలో పయనిస్తున్నాయి. కెనడా ఉన్నత విద్యాసంస్థల్లో భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువుతున్న కారణంగా కెనడాలోని ఖలిస్తానీ తీవ్రవాదుల భారత వ్యతిరేక ప్రకటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 19వ శతాబ్దం చివరి నుంచీ కెనడాతో పంజాబ్ రాష్ట్రానికి నాటి (బ్రిటిష్ ఇండియా కాలం) నుంచీ చారిత్రకంగా సంబంధాలు ఉండడంతో–తమిళులకు శ్రీలంక ఎలాగో, పంజాబీలకు కెనడా ఇంకా అంతకన్నా ఎక్కువ ఆసక్తి ఉన్న ప్రాంతంగా మారింది. గత పదేళ్లుగా ఏటా కెనడా కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరుతున్న విద్యార్థుల్లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారే సింహభాగం అనేది తెలిసిందే. భారత విద్యార్థులు కెనడలో తమ విద్యాభ్యాసానికి చేస్తున్న వ్యయం (కోట్లాది డాలర్లు) అక్కడి ప్రావిన్సులను (రాష్ట్రాలను) ఆర్థికంగా నిలబెడుతోంది. ప్లస్ టూ తర్వాత, గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సుల కోసం కెనడా వెళ్లి చదువుతున్న భారత విద్యార్థులు ఏటా దాదాపు 20 బిలియన్ల డాలర్లు (2000 కోట్ల డాలర్లు) ఖర్చుచేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో డబ్బు ఇండియా నుంచి కెనడాకు రావడంతో రెండు దేశాల మద్య సంబంధాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్లో అక్కడి విద్యాసంస్థలకు కెనడా సర్కారు కన్నా భారత విద్యార్థులే ఎక్కువ మొత్తంలో ఫీజుల రూపంలో నిధులు సమకూర్చుతున్నారంటే–కెనడాలో భారత్ నుంచి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు ప్రాముఖ్యం ఎంతో అర్థమౌతోంది. కెనడా కాలేజీల్లో స్థానిక విద్యార్థులు చెల్లించే ఫీజులకు మూడు రెట్లు ఎక్కువ ఫీజులను భారత విద్యార్థులు చెల్లిస్తున్నారని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంటే కెనడా ఉన్నత విద్యాసంస్థలు వసూలు చేసే అన్ని రకాల ట్యూషన్ ఫీజుల మొత్తంలో 76 శాతం భారత విద్యార్థుల నుంచే వస్తోందన్న మాట. ముఖ్యంగా ఒంటారియో ప్రావిన్సులోని విద్యాసంస్థలన్నీ భారత విద్యార్థుల ఫీజుల డబ్బుతోనే నడుస్తున్నాయని వార్తలొస్తున్నాయి. విద్యార్థుల నుంచి కెనడాకు 22.3 బిలియన్ డాలర్లు 2022 మార్చిలో కెనడా కాలేజీలు, వర్సిటీల ఆర్థిక పరిస్థితి, విద్యార్థుల సంఖ్యపై చేసిన ఒక విశ్లేషణ ప్రకారం–ఈ ఉత్తర అమెరికా ఫెడరల్ దేశంలో చదువుకునే విదేశీ విద్యార్థులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థలోకి ఫీజులు, ఇతర ఖర్చుల రూపంలో 22.3 బిలియన్ (2230 కోట్ల డాలర్లు) డాలర్ల సొమ్ము పంపుతున్నారు. అంటే, కెనడా ప్రతి సంవత్సరం ఇతర దేశాలకు ఆటోమొబైల్ విడిభాగాలు, కలప, విమానాల ఎగుమతుల ద్వారా సంపాదించేదాని కన్నా అంతర్జాతీయ విద్యార్థులు చెల్లించేదే ఎక్కువ. ఇక సంఖ్య విషయానికి వస్తే 1990ల చివర్లో కెనడాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల సంఖ్య 40 వేలు కాగా, 2020–21 నాటికి ఈ సంఖ్య 4,20,000కు పెరిగింది. 2009 నుంచీ కెనడా కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరి చదువులు పూర్తిచేసుకునే పంజాబీ, ఇతర భారత రాష్ట్రాల విద్యార్థుల సంఖ్య వేగం పుంజుకుంది. ఇండియా నుంచే గాక ఇతర దేశాల నుంచి వచ్చి కెనడాలో చదువుకునే విద్యార్థులు కూడా ఉన్నారు. 2021–22లో కెనడాలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో చేరిన విద్యార్థుల్లో విదేశీ స్టూడెంట్ల సంఖ్య 17.6 శాతం ఉండగా, కెనడా కాలేజీల్లో ఈ అంతర్జాతీయ విద్యార్థల వాటా 22 శాతం ఉంది. ఒంటారియా ప్రావిన్స్ కాలేజీల్లో ఇలాంటి విద్యార్థుల ప్రవేశాల సంఖ్య 2016–17, 2019–20 మధ్య కాలంలో రెట్టింపు కావడం విశేషం. మరో ఆసక్తికర విషయం ఏమంటే–ఇండియాలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్యతో పోల్చితే దానికి ఆరు రెట్ల సంఖ్యలో భారత యువతీయువకులు విదేశీ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో చేరుతున్నారని ఎడ్యుకేషన్ కన్సల్టెంగ్ సంస్థ ఒకటి అంచనా వేసింది. ఇలా విదేశీ ఉన్నత విద్యాసంస్థల్లో చేరే ఇండియన్ స్టూడెంట్స్ సంఖ్య ఇటీవల 7,70,000కు చేరింది. 2024 నాటికి పాశ్చాత్య దేశాలు సహా విదేశాలకు పోయి అక్కడ ఉన్నత విద్యనభ్యసించేవారి సంఖ్య 18 లక్షలకు చేరుతుందని అంచనా. :::విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ ఎంపీ ఇదీ చదవండి: భారత హైకమిషన్కు ఖలిస్తాన్ నిరసన సెగ -
స్టూడెంట్స్ పంట పండింది! రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్న భారతీయ విద్యార్థుల పంట పండింది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో భారత్కు చెందిన విద్యార్థులకు అమెరికా రికార్డు స్థాయిలో వీసాలు జారీ చేసింది. యూఎస్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి దరఖాస్తు చేసుకున్న భారతీయ విద్యార్థులకు 90,000 కంటే ఎక్కువ వీసాలు జారీ చేసినట్లు భారత్లోని యూఎస్ మిషన్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ప్రకటించింది. నాలుగింట ఒకటి ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసిన ప్రతి నాలుగు స్టూడెంట్ వీసాలలో ఒకటి భారతీయ విద్యార్థులకే జారీ చేసినట్లు యూఎస్ మిషన్ పేర్కొంది. అలాగే తమ ఉన్నత విద్య లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ను ఎంచుకున్న విద్యార్థులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుత సెషన్ కోసం స్టూడెంట్ వీసా దరఖాస్తులు ముగిసిన నేపథ్యంలో యూఎస్ మిషన్ ఈ గణాంకాలను విడుదల చేసింది. చైనాను అధిగమించిన భారత్ 2022లో యునైటెడ్ స్టేట్స్లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులతో ప్రపంచంలోని అగ్ర దేశంగా భారత్ చైనాను అధిగమించింది. 2020లో దాదాపు 2,07,000 మంది అంతర్జాతీయ భారతీయ విద్యార్థులు యూఎస్లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తాజా నివేదిక హైలైట్ చేసింది. భారత్ నుంచి విద్యార్థులను ఆకర్షించడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు అందించే సులభతరమైన అప్లికేషన్ ఫార్మాలిటీలు, ఆర్థిక సహాయం, స్కాలర్షిప్లు ఈ పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది. ఫ్రాన్స్ కూడా.. ఇంతకుముందు ఫ్రాన్స్ కూడా భారత్ నుంచి సుమారు 30,000 మంది విద్యార్థులను ఉన్నత చదువుల కోసం తమ దేశానికి స్వాగతించాలన్న లక్ష్యాన్ని వ్యక్తం చేసింది. 2030 నాటికి భారతీయ విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఆ దేశం ప్రయత్నాలు చేస్తోంది. విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడం, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం , రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక స్నేహాన్ని పెంపొందించడం ద్వారానే ఈ లక్ష్యం సాధ్యమవుతుంది. The U.S. Mission in India is pleased to announce that we issued a record number – over 90,000 – of student visas this Summer/ in June, July, and August. This summer almost one in four student visas worldwide was issued right here in India! Congratulations and best wishes to all… — U.S. Embassy India (@USAndIndia) September 25, 2023 -
కెనడాలో పిల్లలు.. భారతీయ తల్లిదండ్రుల్లో ఆందోళన
ఢిల్లీ: కెనడా-భారత్ మధ్య వివాదంతో భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ తమ పిల్లల భద్రత ప్రమాదకరంగా మారిందని భయపడుతున్నారు. జాతీయత ఆధారంగా తమ పిల్లలు వివక్షను ఎదుర్కొంటున్నారని కలత చెందుతున్నారు. కెనడాలో ఉన్న ఇండియన్ విద్యార్థులకు ఏదైనా హెల్ప్లైన్ క్రియేట్ చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ని పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జఖ్కర్ కోరారు. ఇండియన్ కాన్సులేట్ను సంప్రదించి ఏదైనా సహాయం పొందవచ్చని స్పష్టం చేశారు. సలహాలు, సూచనల కోసం ఓ వాట్సాప్ గ్రూప్ నెంబర్ను కూడా రిలీజ్ చేశారు. Set up helpline for Indian students, NRIs in Canada: Punjab BJP chief urges Centre #India #Canada https://t.co/dT8lYAE9qm — IndiaToday (@IndiaToday) September 23, 2023 'నా కూతురు ఏడు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లింది. ఇరుదేశాల మధ్య ప్రతిష్టంభన కారణంగా నా కూతురు చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతోంది.' అని భల్విందర్ సింగ్ చెప్పారు. 'నా ఇద్దరు కూతుళ్లు కెనడాకు వెళ్లారు. కానీ భారత్-కెనడా ప్రభుత్వాల వివాదం ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశంపై త్వరగా ఏదైనా ఓ పరిష్కారానికి రావాలి' అని కుల్దీప్ కౌర్ కోరారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతవారం వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఇది రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఆ తర్వాత ఇరుదేశాలు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇరుపక్షాలు దౌత్య వేత్తలను బహిష్కరించాయి. కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపణలు చేస్తోందని భారత్ మండిపడింది. అయితే.. ఖలిస్థానీ ఉగ్రవాదులు భారతీయ హిందువులపై హెచ్చరికలు కూడా జారీ చేశారు. కెనడా విడిచి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ పరిణామాల మధ్య ఇరు దేశాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఉన్నత చదువుల కోసం అక్కడికి వెళ్లిన తమ పిల్లలు వివక్ష ఎదుర్కొంటున్నారని భారతీయ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..? -
భారతీయ విద్యార్థులకు షాక్: వీసా ఫీజు భారీగా పెంపు
UK Student Visa యునైటెడ్ కింగ్డమ్ సర్కార్ భారతీయ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది. విద్యార్థి , పర్యాటక వీసాల ధరలను ఏకంగా 200 శాతం పెంచేసింది. ఈమేరకు బ్రిటన్ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. పార్లమెంటరీ ఆమోదం తరువాత పెంచిన ఫీజులు అక్టోబర్ 4వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ పెంపుతో ప్రభుత్వ పథకాలకు ఎక్కువ నిధుల ప్రాధాన్యతకు అవకాశం లభిస్తుందని యూఏ హోం ఆఫీస్ పేర్కొంది. దీంతో లక్షలాదిమంది భారతీయ విద్యార్థులపై భారం పడనుంది. UK హోమ్ ఆఫీస్ ప్రకటన ప్రకారం, ఆరు నెలల కంటే తక్కువ కాలానికి విజిట్ వీసా ధర 15 నుండి 115 పౌండ్లకు చేరింది. విదేశీ విద్యార్థుల నుంచి వసూల్ చేసే స్టడీ వీసా(Study Visa) ఫీజు దాదాపు 127 పౌండ్లనుంచి 490 చేరింది. అలాగే పర్యాటకులకు ఇచ్చే విజిట్ వీసా ఫీజు కూడాపెరగనుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ డేటా ప్రకారం, 2021-2022లో 120,000 కంటే ఎక్కువ మందే భారతీయ విద్యార్థులు యూకేలో చదువుతున్నారు. కాగా జూలైలో అక్కడి ప్రభుత్వం వర్క్, విజిట్ వీసాల ధరలో 15 శాతం పెరుగుదలను ప్రకటించింది. ప్రయార్టీ, స్టడీ వీసాలు, స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ల ఫీజును 20 శాతం పెంచింది. -
మన పిల్లలకు అండగా నిలుద్దాం
సాక్షి, అమరావతి: అమెరికా వెనక్కు పంపిన భారతీయ విద్యార్థుల్లో కొంత మంది తెలుగు విద్యార్థులూ ఉన్నారనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఆరా తీశారు. ఆ విద్యార్థుల పూర్తి వివరాలు తెలుసుకుని, వారికి అండగా నిలవాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి ఈ అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర విద్యార్థుల కోసం సీఎం ఆదేశాల మేరకు.. ప్రభుత్వం వేగంగా స్పందించి పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. విదేశాంగ శాఖతో మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు దృష్టి సారించారు. వెనక్కి వచ్చిన విద్యార్థులు వ్యాలిడ్ వీసాలను కలిగి ఉండటంతో వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమస్యను త్వరగా పరిష్కరించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. అమెరికా నుంచి బహిష్కరణకు గురైన తెలుగు విద్యార్థులు ఏపీఎన్ఆర్టీఎస్ను సంప్రదించాలని అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి తెలిపారు. ఇందుకోసం ఏపీఎన్ఆర్టీఎస్ ప్రత్యేకంగా హెల్ప్లైన్ నంబర్ కేటాయించిందన్నారు. ఈ హెల్ప్లైన్ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, +91 8632340678, 8500027678 సంప్రదించాలని సూచించారు. లేదా info@apnrts.com, helpline@apnrts.com కు మెయిల్ చేయాలని చెప్పారు. నిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకోండి అమెరికా వీసా ఉన్నంత మాత్రాన ఆ దేశంలోకి ప్రవేశమనేది గ్యారెంటీ కాదని, విద్యార్థులు యూఎస్ ఇమ్మిగ్రేషన్ (పోర్ట్ ఆఫ్ ఎంట్రీ) వద్ద కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. లాప్టాప్, మొబైల్లో అమెరికా నిబంధనలను ఉల్లంఘించేలా సందేశాలు (పార్ట్టైమ్ జాబ్, బ్యాంక్ బ్యాలెన్స్ మేనేజ్ తదితర) ఉండకూడదని తెలిపారు. ఆ దేశంలోకి ప్రవేశం ఎందుకనే అంశాన్ని చెప్పి, వారిని ఒప్పించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో ముందుగానే విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. విద్యార్థి దశలో అమెరికాలో జీవించడానికి అవసరమైన ఆర్థిక స్థోమతకు తగిన రుజువులు, యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, తదితరాల గురించి మన విద్యార్థులను అడిగినప్పుడు సంతృప్తికర సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వకపోతే విద్యార్థులు యూఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించే అవకాశం ఉందని వారు భావిస్తారని చెప్పారు. ఈ విషయాలపై విద్యార్థులు ముందుగానే అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారు. పేరున్న ఏజెన్సీల ద్వారానే విద్యార్థులు అమెరికా వెళ్లేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. -
అమెరికాలో తెలుగు విద్యార్థులకు వెన్నక్కి పంపిస్తున్న అధికారులు
-
చైనాను అధిగమించి.. దూసుకెళ్తున్నారు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : అమెరికాలో గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ చదువుల కోసం వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో చైనీయులు అధిక సంఖ్యలో ఉన్నారు. తర్వాత స్థానంలో భారత్ ఉంది. కానీ ఈ పరిస్థితి మరికొన్ని సంవత్సరాల్లోనే మారనుంది. త్వరలోనే భారత్ మొదటి స్థానంలోకి రానుంది. చైనా నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటమే ఇందుకు కారణం. ఇటీవలి కాలం వరకు అమెరికా విద్యాసంస్థలు చైనా విద్యార్థులను చేర్చుకోవ డానికి అధిక ప్రాధాన్యతనిచ్చేవి. కోవిడ్ తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేప థ్యంలో అమెరికా విద్యాసంస్థలు భారత్ను తమకు అనుకూలమైన అతిపెద్ద మార్కెట్గా పరిగణిస్తు న్నాయి. స్ప్రింగ్ స్నాప్షాట్ పేరిట ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) నిర్వహించిన సర్వే ఈ విషయం స్పష్టం చేస్తోంది. 2020 నుంచి 2023 నాటికి చైనా నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య 3,68,800 నుంచి 2,53,630కి తగ్గగా.. అదే సమయంలో భారత్ నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య 1.90 లక్షల నుంచి 2.53 లక్షలకు పెరిగినట్లు ఐఐఈ పేర్కొంది. 2030కి 3.94 లక్షల మందితో భారత్ అగ్రస్థానానికి చేరుతుందని అంచనా వేసింది. భారత్ వైపే 57% సంస్థలు మొగ్గు గ్రాడ్యుయేషన్తో పాటు అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులను ఆకర్షించడానికి అమెరికా విద్యాసంస్థలు ప్రయత్ని స్తున్నాయి. ప్రతి పది మంది గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో నలుగురు విదేశీ విద్యార్థులు ఉండేలా ఈ రిక్రూట్మెంట్ విధానం కొనసాగుతోంది. 2023–24 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థుల చేరికకు సంబంధించి ఏప్రిల్ నుంచి మే మధ్య కాలంలో ఐఐఈ సర్వే నిర్వహించింది. మొత్తం 527 విద్యాసంస్థల నుంచి డేటా సేకరించింది. సుమారు 57 శాతం సంస్థలు భారత్ విద్యార్థులను ఎక్కువగా చేర్చుకోవడానికి ప్రయత్నించినట్లు వెల్లడించింది. 2022–23 కంటే 2023–24 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థుల నుంచి తమకు అధికంగా దరఖాస్తులు అందినట్లు 61 శాతం కాలేజీలు/యూనివర్సిటీలు వెల్లడిస్తే.. మరో 28 శాతం విద్యా సంస్థలు తమకు గత సంవత్సరం వచ్చిన మేరకు దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నాయి. మరో 12% విద్యా సంస్థలు మాత్రం తమకు దరఖాస్తులు తగ్గినట్లు తెలిపాయి. అమెరికాకు తగ్గిన ఆదాయం కోవిడ్ తరువాత గడిచిన రెండేళ్లుగా విదేశీ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా, కోవిడ్ కంటే ముందున్న ఆదాయం రాలేదని ఐఐఈ సర్వే వెల్లడిస్తోంది. కోవిడ్కు ముందు 2018 విద్యా సంవత్సరంలో విదేశీ విద్యార్థుల నుంచి అమెరికాకు వచ్చే ఆదాయం దాదాపు 45 బిలియన్ డాలర్లు.. మన రూపాయల్లో అది రూ. 3.7 లక్షల కోట్లు. ఇప్పటివరకు ఏ విద్యా సంవత్సరంతో పోల్చినా ఇదే అత్యధిక ఆదాయం. కాగా అప్పట్లో ఏటా దాదాపు 11 లక్షల వరకు విదేశీ విద్యార్థులు అమెరికాలో విద్యాభాస్యం కోసం వచ్చేవారని పేర్కొంది. అయితే 2022–23లో విదేశీ విద్యార్థుల వల్ల అమెరికాకు 33.8 బిలియన్ డాలర్ల ఆదాయం మాత్రమే సమకూరింది. అంటే మన కరెన్సీలో ఇది రూ.2.7 లక్షల కోట్లు. అమెరికా విద్యా సంస్థలకు ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల నుంచి పోటీ ఎక్కువ అవుతున్నట్లు సర్వేలో తేలింది. అంటే ఈ దేశాల విద్యా సంస్థల్లో కూడా విదేశీ విద్యార్థులు అధిక సంఖ్యలో చేరుతున్నారన్నమాట. ప్రస్తుతం దాదాపు 10 లక్షల మంది వరకు విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. టాప్ టెన్ దేశాలివే.. విదేశీ విద్యార్థుల చేరికకు సంబంధించి ఐఐఈ గణాంకాల ప్రకారం.. గత సంవత్సరం చైనా, భారత్, దక్షిణ కొరియా, కెనడా, వియత్నాం, తైవాన్, సౌదీ అరేబియా, బ్రెజిల్, మెక్సికో, నైజీరియా దేశాలు వరుసగా తొలి పది స్థానాల్లో ఉన్నాయి. ఈ టాప్ టెన్ దేశాల విద్యార్థులే కాకుండా ఇతర దేశాల విద్యార్థులను సైతం అమెరికా విద్యాసంస్థలు ఆకర్షిస్తున్నాయి. 2021–22 సంవత్సరంలో 11వ స్థానంలో ఉన్న జపాన్ నుంచి 14 శాతం పెరుగుదల ఉండగా, చైనా నుంచి 8.6 శాతం తగ్గుదల కనిపించింది. 2023లో జపాన్ విద్యార్థుల సంఖ్యలో 33 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది. నైజీరియా నుంచి కూడా అనూహ్యంగా విద్యార్థులు పెరిగినట్లు ఐఐఈ తెలిపింది ఇక సౌదీ అరేబియా నుంచి 17 శాతం మేర విద్యార్థులు తగ్గారు. అయితే 2030 నాటికి ఈ దేశం నుంచి విద్యార్థులు గణనీయంగా పెరగనున్నారు. తర్వాత నేపాల్, బంగ్లాదేశ్ల నుంచి కూడా విద్యార్థుల సంఖ్య పెరిగి ఆ రెండు దేశాలు టాప్ టెన్లో (8, 9 స్థానాల్లోకి)కి రానున్నాయి. ఇంగ్లిష్ మాట్లాడే ఇతర దేశాలకూ విద్యార్థులు విదేశీ విద్యార్థులకు అమెరికానే తొలి ప్రాధాన్యత అయినప్పటికీ..అమెరికాతో పాటు ఆంగ్లం మాట్లాడే ఇతర దేశాలకు కూడా విద్యార్థులు గణనీయ సంఖ్యలో వెళుతున్నారు. ఈ మేరకు ఆమెరికాకు విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్తో పాటు జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు విదేశాల నుంచి విద్యార్థులు వెళ్తున్నారు. ఆయా దేశాలు విదేశీ విద్యార్థులను ఆకట్టుకోవడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తున్నాయి. – డాక్టర్ ఎస్తేర్ డి బ్రిమ్మర్, ఈడీ, సీఈఓ, నేషనల్ అసోసియేషన్ ఫర్ ఫారిన్ స్టూడెంట్ ఎఫైర్స్ -
కెనడాలో భారతీయ విద్యార్థులకు ఊరట
ఒట్టావా: కెనడాలో నిరసన ప్రదర్శనలు చేస్తున్న భారతీయ విద్యార్థులకు గొప్ప ఊరట లభించింది. పంజాబ్కు చెందిన లవ్ ప్రీత్ సింగ్ సహా 700 మంది భారతీయ విద్యార్థుల్ని తిరిగి మన దేశానికి పంపడాన్ని కెనడా ప్రభుత్వం వాయిదా వేసింది. తదుపరి నోటీసులు అందేవరకు వారు కెనడాలో ఉండవచ్చునని స్పష్టం చేసింది. ఫోర్జరీ ఆఫర్ లెటర్లతో విద్యావకాశాలకు అనుమతి సంపాదించి లవ్ ప్రీత్ సహా ఇతర విద్యార్థులు కెనడాకి వచ్చారని కెనడియన్ బోర్డర్ సర్వీసు ఏజెన్సీ (సీబీఎస్ఏ) విచారణలో తేలింది. దీంతో జూన్ 13లోగా కెనడా వీడి వెళ్లిపోవాలంటూ లవ్ ప్రీత్ సింగ్తో పాటు 700 మంది వరకు విద్యార్థులకు నోటీసులు అందాయి. ఒక సంస్థ చేసిన మోసానికి గురైన తాము బాధితులమే తప్ప మోసగాళ్లము కాదని తాము ఎందుకు దేశం విడిచి వెళ్లాలంటూ విద్యార్థులు నిరసన ప్రదర్శనలకి దిగారు. జలంధర్కు చెందిన కన్సల్టెంట్ బ్రిజేష్ మిశ్రా కెనడాలోని పెద్ద పెద్ద కాలేజీలు, యూనివర్సిటీల నుంచి తప్పుడు ఆఫర్ లెటర్లు సృష్టించి ఆ విద్యార్థుల్ని ఆరేళ్ల క్రితమే కెనడాకు పంపారు. రాయబార కార్యాలయం కూడా కాలేజీలు ఇచ్చిన లెటర్స్ ఫోర్జరీ అని గుర్తించలేకపోయింది. విద్యార్థులు ఆయా కాలేజీలకు వెళ్లేవరకు అవి ఫేక్ అని తెలియలేదు. ఆ తర్వాత వేరే కాలేజీల్లో సీటు ఇప్పిస్తానని మిశ్రా నమ్మబలికాడు. కెనడాలో శాశ్వత నివాసం కోసం ఆ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రభుత్వం జరిపించిన విచారణలో కాలేజీల ఆఫర్ లెటర్స్ ఫోర్జరీ అన్న విషయం బయటపడింది. దీంతో బ్రిజేష్ మిశ్రాకు చెందిన ఎడ్యుకేషన్ అండ్ మైగ్రేషన్ సర్వీసెస్ను రద్దు చేశారు. అప్పట్నుంచి ఆ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగానే మారింది. -
అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి
న్యూయార్క్: అమెరికాలో ఇండియానా రాష్ట్రంలో సరస్సులో ఈతకెళ్లిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఈ నెల 15వ తేదీన సిద్ధాంత్ షా(19), ఆర్యన్ వైద్య(20)లు మరికొందరితో కలిసి మొన్రో సరస్సులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈదుతూనే ఇద్దరూ నీళ్లలో మునిగిపోయారు. అధికారులు ఎంతగా ప్రయత్నించినా వారి జాడ దొరకలేదు. ఈ నెల 18వ తేదీన ఇద్దరి మృతదేహాలు సరస్సులో తేలియాడుతూ కనిపించగా వెలికితీశారు. సిద్ధాంత్, ఆర్యన్లు ఇండియానా యూనివర్సిటీకి చెందిన కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులని అధికారులు వెల్లడించారు. వీరిద్దరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భారతీయులకు ఈసారి 10 లక్షలకుపైగా వీసాలు..!
వాషింగ్టన్: భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నవేళ భారతీయుల వీసా ప్రక్రియను వేగిరం చేసి ఈ ఏడాది 10 లక్షలకుపైగా వీసాలు జారీచేస్తామని అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. విద్యార్థి వీసాలకు అధిక ప్రాధాన్యతనిచ్చేందుకు బైడెన్ సర్కార్ కృత నిశ్చయంతో ఉందని అమెరికా సహాయ మంత్రి (దక్షిణ, మధ్య ఆసియా విభాగం) డొనాల్డ్ లూ పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు. ‘ వీసా ప్రాసెసింగ్ ప్రక్రియలో హెచ్–1బీ, ఎల్–వీసాలకూ తగిన ప్రాధాన్యత కల్పిస్తాం. విద్యార్థి వీసాలు, ఇమిగ్రెంట్ వీసాలుసహా మొత్తంగా ఈ ఏడాది ఏకంగా 10 లక్షలకుపైగా వీసాలను మంజూరుచేస్తాం. ఈసారి సమ్మర్ సీజన్లో అమెరికాలో విద్యనభ్యసించనున్న భారతీయ విద్యార్థుల సౌలభ్యం కోసం అన్ని స్టూడెంట్ వీసాల ప్రాసెసింగ్ను పూర్తిచేస్తాం’ అని చెప్పారు. బీ1(వ్యాపారం), బీ2(పర్యాటక) కేటగిరీలుసహా తొలిసారిగా వీసా కోసం దరఖాస్తుచేసుకున్న వారి అప్లికేషన్ల వెరిఫికేషన్ వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉన్న విషయం విదితమే. అమెరికాకు వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో సంఖ్య పరంగా ప్రపంచంలో భారత్ రెండోస్థానంలో ఉంది. కొన్ని చోట్ల 60 రోజుల్లోపే.. ‘హెచ్–1బీ, ఎల్ వీసాల జారీపైనా దృష్టిపెట్టాం. భారత్లోని కొన్ని కాన్సులేట్లలో ఈ వీసాల కోసం వేచిఉండే కాలం 60 రోజుల్లోపే. అమెరికా, భారత్ ఇరుదేశాల ఆర్థికవ్యవస్థకు ఈ వర్కింగ్ వీసాలు కీలకం. అందుకే వీటి సంగతీ చూస్తున్నాం’ అని వెల్లడించారు. ‘ పిటిషన్ ఆధారిత నాన్ఇమిగ్రెంట్ విభాగాల కింద దరఖాస్తుచేసిన వీసాదారులు తమ వీసా రెన్యువల్ కోసం మళ్లీ స్వదేశానికి వెళ్లిరావాల్సిన పనిలేకుండా అమెరికాలోనే పని పూర్తిచేసుకునేలా ఏర్పాటుచేయదలిచాం. ఇక ఆర్థిక అనిశ్చితి కారణంగా ఉద్యోగాలు కోల్పోయి 60 రోజుల్లోపు అమెరికాను వీడాల్సిన ప్రమాదం ఎదుర్కొంటున్న హెచ్–1బీ వీసాదారులకు.. అవకాశమున్న మరికొన్ని ‘వెసులుబాట్ల’ను వివరిస్తూ అదనపు సమాచారాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఇచ్చింది’ అని వివరించారు. -
విదేశీ విద్య మరింత భారం.. భారత విద్యార్థులకు కొత్త టెన్షన్!
సాక్షి, అమరావతి: విదేశీ విద్య భారత విద్యార్థులకు మరింత భారమవుతోంది. ఇప్పటికే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అంతకంతకూ పతనమవుతోంది. దీంతో భారత విద్యార్థులు అమెరికాలో చదువుకోవాలంటే మరిన్ని ఎక్కువ రూపాయలను ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను పెంచడంతో విద్యా రుణాలు తడిసి మోపెడవుతున్నాయి. అయితే విదేశాల్లో చదివితే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని, అత్యధిక వేతనాలు వస్తాయన్న ఆశతో వెళ్తున్న విద్యార్థుల్లో అత్యధికులు చివరకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చదువులు ముగిసిన వెంటనే విద్యార్థులు మంచి కొలువులు సాధిస్తే సరి.. లేకపోతే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. విదేశీ చదువులు ముగిస్తున్న వారిలో కేవలం నాలుగో వంతు మందికి మాత్రమే ఆయా దేశాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయని గణాంకాలు తెలుపుతున్నాయి. కంపెనీలు ఆర్థిక పరిస్థితులతో కొందరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. తక్కిన వారంతా స్వదేశానికి తిరిగొచ్చి ఇక్కడ ఉద్యోగాలు వెతుక్కుంటున్నారు. మరోవైపు ఇక్కడి వేతనాలు, విదేశీ చదువుల కోసం చేసిన అప్పులకు పొంతన లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇక ఆ కొలువులూ దక్కని వారి కుటుంబాలు ఆ అప్పులు తీర్చడానికి సతమతమవుతున్నాయి. గత ఐదారేళ్లలో ఒక్క కరోనా సమయంలో మినహాయిస్తే ఏటా కనీసం 4 లక్షల వరకు విద్యార్థులు చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టాక.. కరోనా తగ్గుముఖం పట్టడంతో విదేశీ చదువులకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో సహజంగానే ఆ మేరకు రుణాల శాతం కూడా ఎక్కువైంది. 2019లో 5.86 లక్షల మంది భారత విద్యార్థులు విదేశాల్లో చదువుల కోసం వెళ్లారు. 2020లో ఆ సంఖ్య ఒక్కసారిగా సగానికి తగ్గి 2.59 లక్షలకు పడిపోయింది. కరోనా వ్యాప్తి కారణంగా అనేక దేశాల్లో రాకపోకలపై నిషేధాలు, విద్యా సంస్థల మూత ఇందుకు కారణాలుగా నిలిచాయి. 2021 నుంచి కరోనా తగ్గుదలతో క్రమేణా మళ్లీ విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2022లో ఆ సంఖ్య గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరింది. గతేడాది 7.5 లక్షల మంది విదేశాలకు వెళ్లారని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచే అధిక రుణాలు విదేశాల్లో చదువులకోసం వెళ్లే విద్యార్థులు ఫీజుల కోసం అత్యధికంగా ప్రభుత్వ బ్యాంకుల రుణాలపైనే ఆధారపడుతున్నారు. దాదాపు 95 శాతం మంది విద్యార్థులు ఈ రుణాల ఆధారంగానే విదేశీ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో 2021లో విదేశీ విద్య కోసం ప్రభుత్వరంగ బ్యాంకులు అందించిన రుణాల మొత్తం రూ.4,503.61 కోట్లుగా ఉంది. 2020లో మంజూరు చేసిన రుణాలతో పోల్చి చూస్తే ఇది 23.5 శాతం తక్కువ. కరోనా కారణంగా 2020లో విదేశీ విద్యకు ఆటంకాలు ఏర్పడడంతో విద్యా రుణాల మంజూరు కూడా భారీగా తగ్గింది. 2022లో రుణాల మంజూరు అమాంతం పెరిగింది. గతేడాది ప్రభుత్వ రంగ బ్యాంకులు విదేశాల్లో చదువుల కోసం వెళ్లే విద్యార్థులకు రూ.7,576.02 కోట్లను మంజూరు చేశాయి. 2021లో మంజూరు చేసిన రుణాలతో పోల్చి చూస్తే ఇది 68.2 శాతం అధికం. 2022లో మొత్తం విద్యా రుణాలు రూ.15,445.62 కోట్లు ఇవ్వగా అందులో దాదాపు సగం మేర అంటే రూ. 7,576.02 కోట్లు విదేశీ విద్యకోసం ఇచ్చినవే. చెల్లించడానికి ఇబ్బందులు ఇటీవల కాలంలో వడ్డీ రేట్లు భారీగా పెరగడంతో ఆ ప్రభావం విద్యా రుణాలపైన పడుతోందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. తీసుకున్న రుణం వడ్డీతో కలిపి తడిసి మోపెడవుతోందని, దీన్ని తీర్చడానికి సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరిస్తున్నారు. ఉద్యోగాల్లో చేరి అధిక వేతనాలు తీసుకుంటున్న వారే తిరిగి కట్టలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. అలాంటిది అరకొర వేతనాలు, లేదా అసలు ఉద్యోగమే లేని వారి కుటుంబాలు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాయని అంటున్నారు.