-
యువకుడి దాడిలో భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలో మరో దారుణం చోటు చేసుకోంది. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ఓక్లహోమా రాష్ట్రంలో మృతి చెందారు. ఆయన గుజరాత్కు చెందిన హెమంత్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. ఆయన ఓక్లహోమాలోని ఓ హోటల్లో మేనేజర్గా పని చేస్తున్నారు. జూన్ 22 రాత్రి 10 గంటల సమయంలో హోటల్ నుంచి వెళ్లిపోవాలని రిచర్డ్ లూయిస్ అనే వ్యక్తిని హెమంత్ కోరారు. దీంతో అతను కోపంతో హెమంత్ మిశ్రా ముఖంపై దాడి చేశాడు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హెమంత్ మిశ్రా మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓ హోట్ల్లో దాక్కున్న నిందితుడు రిచర్డ్ లూయిస్ను అరెస్ట్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రిచర్డ్ను హోటల్ నుంచి హెమంత్ ఎందుకు వెళ్లిపోవాలన్నాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎవరీ సుహాస్ సుబ్రమణ్యం? ఏకంగా డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో విజయం..
వర్జీనియాలో కాంగ్రెస్ స్థానానికి జరిగిన డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ సుహాస్ సుబ్రమణ్యం గెలుపొందారు. సహచర భారతీయ-అమెరికన్ క్రిస్టల్ కౌల్తో సహా మరో 11 మంది అభ్యర్థులను ఓడించారు. నవంబర్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి ఎంపిక కోసం జరిగే అంతర్గత పార్టీ ఎన్నికల్లో సుహాన్ విజయం సాధించారు. అంతేగాదు వర్జీనియ కాంగ్రెస్ డెమోక్రటిక్ ప్రైమరీలో గెలిచిన తొలి భారత సంతతి వ్యక్తిగా నిలిచారు. ఆయన 2019లో వర్జీనియా జనరల్ అసెంబ్లీ, 2023లో వర్జీనియా స్టేట్ సెనేట్కు ఎన్నికైన తొలి భారత సంతతి అమెరికన్. ఆయన ఈ గెలుపుతో నవంబర్లో జరిగే సాధారణ ఎన్నికల్లో 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా యూఎస్ ప్రతినిధుల సభకు పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో సాధారణ రిపబ్లికన్ మైక్ క్లాన్సీతో తలపడతారు.సుహాస్ నేపథ్యం..37 ఏళ్ల సుహాస్ సుబ్రమణ్యం బెంగళూరు నుంచి యూఎస్కు వలస వచ్చిన భారత సంతతి తల్లిదండ్రులకు హ్యుస్టన్లో జన్మించాడు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్హౌస్లో టెక్నాలజీ పాలసీ అడ్వైజర్గా పనిచేశారు. ఒక యూఎస్ మీడియా ఇంటర్యూలో సుహాస్ మాట్లాడుతూ..అమెరికాకు మంచి భవిష్యత్తును అందించేందుకు తాను కాంగ్రెస్కి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సమస్యలను పరిష్కరించేలా భవిష్యత్తుకి బంగారు బాటవేసే కాంగ్రెస్ ఇక్కడ ఉందన్నారు. రాబోయే రెండేళ్లకు మాత్రమే కాదు, రాబోయే 20 ఏళ్లకో లేదా 30 ఏళ్లకో చట్టాలు చేయకూడదు. నాకు పిల్లలు కావాలి. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని వారు ఇద్దరు లేదా ముగ్గురుగా అయ్యేటప్పటికీ మెరుగైన దేశంగా తీర్చిదిద్దిలన్నారు. పైగా వాళ్లు మంచి ప్రపంచంలో జీవించేలా చేయాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఈ అమెరికాలో జీవించాలనే డ్రీమ్ అందరికీ దక్కాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన తల్లిదండ్రులు బెంగళూరు, చెన్నైకి చెందినవారు. కొంతకాలం సికింద్రాబాద్లో ఉన్నారు. వారు అమెరికాకు వచ్చి మంచి వైద్యులుగా స్థిరపడాలనుకున్నారు. అయితే వారు ఇక్కడ వచ్చినప్పుడూ.. తన తల్లిందడ్రులు అంతబాగా ఉన్నవాళ్లు కాదని కేవలం కష్టపడి చదివి తమ అమెరికా డ్రీమ్ని నెరవేర్చుకున్నారని అన్నారు. ఈ కలను అందరూ సాకారం చేసుకోవాని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే ప్రతిఒక్కరూ తాము కోరుకున్న దాంట్లో లేదా ఏదైన బిజినెస్లో విజయం సాధించి ఆర్థికంగా తమను తాము శక్తిమంతంగా చేసుకోగలిగినట్లయితే గొప్ప వ్యాపారాన్ని సృష్టించే అవకాశం ఉందన్నారు. అంతేగాదు ప్రతిఒక్కరూ బాగా చదివి, కష్టపడి పనిచేస్తే..ఎలాంటి స్థితి నుంచి అయినా ఉన్నత స్థితికి చేరుకోగలరు. అలాగే దాన్ని నిలబెట్టుకునే యత్నం కూడా చేయాలని కోరుకుంటున్నాని అన్నారు సుహాస్. వ్యక్తిగత జీవితం..నార్త్వెస్టర్న్ యూనివర్శిటీలో ఆనర్స్తో లా డిగ్రీని సంపాదించిన తర్వాత, సుహాస్ ప్రెసిడెంట్ ఒబామాకు వైట్ హౌస్ టెక్నాలజీ పాలసీ సలహాదారుగా పనిచేశారు. ఇక వైట్ హౌస్ నుంచి నిష్క్రమణ తర్వాత సుహాస్ లౌడౌన్ కౌంటీలో తన స్వంత చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. అలాగే తన కమ్యూనిటీకి వాలంటీర్ మెడిక్, అగ్నిమాపక సిబ్బందిగా కూడా సేవలందించారు. అతను మిరాండా పెనా సుబ్రమణ్యంను వివాహం చేసుకున్నారు. ఆమె కూడా పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రస్తుతం ఆ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో వర్జీనియాలోని యాష్బర్న్లో నివసిస్తున్నారు. (చదవండి: కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు) -
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
ఇండియన్-అమెరికన్ విద్యార్థి హార్వర్డ్ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేషన్ సభ ప్రసంగంలో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. గ్రాడ్యుయేషన్ విద్యార్థి శ్రుతి కుమార్ గాజా సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులపై చర్యపై నిరసన వ్యక్తం చేశారు. డజనుకు పైగా విద్యార్థుల డిప్లొమాలను తిరస్కరించే నిర్ణయంపై యూనివర్సిటీ నేతలను శ్రుతి విమర్శించారు.క్యాంపస్లో వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణపై జరుగుతున్న దాడులపై తీవ్ర నిరాశకు గురయ్యానంటూ ఉద్వేగంగా ప్రసంగించింది. విద్యార్థులు , అధ్యాపకులు మాట్లాడుతున్నా, హార్వర్డ్, మాట వినడం లేదంటూ మాట్లాడింది. ఉద్వేగభరిత హావ భావాలతో, ఆవేదనతో చేసిన ఈప్రసంగానికి కొంతమంది అధ్యాపకులతో సహా అక్కడున్న ఆడియన్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. క్యాంపస్లో చప్పట్లు మారుమోగిపోయాయి. ఇంగ్లీషులో మాట్లాడేందుకు ఎంపికైన సీనియర్ స్పీకర్ శ్రుతి కుమార్, "ది పవర్ ఆఫ్ నాట్ నోయింగ్" పేరుతో సిద్ధం చేసిన ప్రసంగానికి బదులు మధ్యలో తాను రాసిపెట్టుకున్న మరో కాపీని తీసి ప్రసంగించడం మొదలు పెట్టింది. తానీ రోజు ఇక్కడ నిలబడి ఉన్నందున, తన సహచరులను గుర్తించడానికి కొంత సమయం కేటాయించాలి అంటూ ఇజ్రాయెల్ ద్వారా గాజాలో జరిగిన మారణహోమానికి వ్యతిరేకంగా నిరసనలలో పాల్గొన్న విద్యార్థులు అనుభవాలతోపాటు స్వయంగా తన అనుభవాలను కూడా పంచుకుంది.అలాగే దక్షిణాసియా వలస కుటుంబంలో పుట్టి, అమెరికాలోని హార్వర్డ్లో చేరిన తొలి వ్యక్తిగా నెబ్రాస్కా నుండి హార్వర్డ్ దాకా తన ప్రయాణం గురించి వెల్లడించింది. ఒకరికి తెలియని వాటిని గుర్తించడంలోని విలువ గురించి, ఈ ఆలోచన ఎదుగుదలకు, సానుభూతికి ఎలా దారితీసిందో వివరించింది. 2024లో గ్రాడ్యుయేట్ చేయకుండా నిషేధం విధించిన 13 మంది అండర్ గ్రాడ్యుయేట్ల గురించి ప్రస్తావించడం అక్కడి వారిలో భావోద్వేగాన్ని నింపింది. కాగా హార్వర్డ్ యూనివర్శిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఫ్యాకల్టీ వారికి డిగ్రీలు ఇవ్వడానికి అనుకూలంగా మెజారిటీ ఓటు ఉన్నప్పటికీ, పాలస్తీనాకు మద్దతుగా క్యాంపస్ నిరసనలలో పాల్గొన్న 13 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ నిరాకరించారని హార్వర్డ్ క్రిమ్సన్ నివేదించింది. -
యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్గా ప్రమాణ స్వీకారం..!
మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. పట్టుదల, శ్రమించే తత్వం ఉన్న మహిళలు చరిత్రలో తమకో పేజీని లిఖించుకుంటున్నారు. మన దేశ కీర్తి పతాకన్ని ప్రపంచ వినువీధుల్లో ఎగుర వేసి చరిత్ర సృష్టిస్తున్నారు. అలానే భారత సంతతికి చెందిన జయ బాడిగ అమెరికా కాలిఫోర్నియాలోని శాకమెంటో కోర్టులో న్యాయమూర్తిగా నియమితురాలై మన దేశానికి గర్వ కారణంగా నిలిచింది. ముఖ్యంగా ఆమె ప్రమాణ స్వీకారం హాట్టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరీమె? ఆమె నేపథ్యం ఏంటంటే..భారత సంతతికి చెందిన జయ బాడిగ ఆమెరికా కాలిఫోర్నియాలో కౌంటీ సుపీరియర్ కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పైగా ఇలాంటి అత్యున్నత పదవిని అలంకరించిన తొలి తెలుగు మహిళగా చరిత్ర సృష్టించింది జయ బాడిగా. అంతేగాదు ఆమె ప్రమాణ స్వీకారం కూడా నెట్టింట ఓ సంచలనంగా మారింది. భారతీయ మూలాలు ఉన్న ఆమె సంస్కృత శ్లోకాలు పఠిస్తూ.. జడ్జిగా ప్రమాణ స్వీకారం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు సభను ఉద్దేశించి తన మాతృభాష తెలుగులో మాట్లాడి.. ఎన్నటికీ మన మూలాలను మర్చిపోకూడదనే విషయాన్ని చాటి చెప్పింది.అంతేగాదు బాడిగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్లకు పైగా ప్రజలు మాట్లాడే మాతృభాష తెలుగులో మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలకాలని కోరుకున్నాను అని చెప్పారు. ఇలా శాక్రమెంటోలో తెలుగులో మాట్లాడటం తొలిసారి అని బాడిగ అన్నారు. ఆమె ప్రసంగం పూర్తి అయిన వెంటనే కరతాళధ్వనులతో ప్రశంసించారు అక్కడి అధికారులు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె నేపథ్యం..ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో జన్మించిన భారత సంతతి అమెరికన్ న్యాయవాది జయ బాడిగ. ఇక ఆమె 2022 వరకు శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టులో కమిషనర్గా పనిచేసిన జయ బాడిగను అదే కోర్టుకి న్యాయమూర్తిగా కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ నియమించారు. ఆమె బడిగా శాంటా క్లారా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి జ్యూరిస్ డాక్టర్ డిగ్రీని, బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పూర్తి చేశారు. డెమోక్రాట్ పార్టీకి చెందిన బాడిగా, 2020లో కాలిఫోర్నియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్లోనూ, 2018లో కాలిఫోర్నియా గవర్నర్ ఆఫీసు ఆఫ్ ఎమర్జెన్సీ సర్వీసెస్లో అటార్నీగానూ సేవలందించారు. అంతేగాదు బడిగా సర్టిఫైడ్ కుటుంబ న్యాయ నిపుణురాలే గాక పదేళ్లకు పైగా కుటుంబ చట్టంలో పనిచేసిన వ్యక్తి ఆమె. Jaya Badiga impressed by speaking in Sanskrit as well as Telugu on the occasion of taking oath as Santa Clara Chief Justice. pic.twitter.com/tli9FTAQaR— PURUSHOTHAM (@purushotham999) May 22, 2024 (చదవండి: ఆనందమే జీవిత మకరందం!) -
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ శరవేగంగా విస్తరిస్తోంది. అన్నిరంగాల్లో దీని హవానే నడుస్తుంది అన్నంతగా సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది. అలాంటి టెక్నాలజీని అమెరికా శ్వేతసౌధానికి పరిచయం చేసింది మన భారత సంతి అమెరికన్ ఆరతి ప్రభాకర్. అక్కడ ఆమె కీలకమైన బాధ్యతలు చేపట్టిన తొలి భారతీయ అమెరికన్గా కూడా చరిత్ర సృష్టించింది. ఎవరీ ఆరతీ ప్రభాకర్? ఆమె నేపథ్యం ఏంటంటే..ఇంజనీర్ కమ్ సామాజిక కార్యకర్త అయిన ఆరతి ప్రభాకర్ భవిష్యత్తులో ఏఐ హవా గురించి వైట్హౌస్లో పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2022లో ఆరతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ(ఓఎస్టీపీ) డైరెక్టర్ అండ్ సైన్స్ అడ్వైజర్గానూ నియమించారు. దీంతో ఆరతి ఈ అత్యున్నత పదవిలో పనిచేస్తున్న తొలి భారతతి సంతతి అమెరికన్గా చరిత్ర సృష్టించింది. ఆమె ఓఎస్టీపీ డైరెక్టర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్లకు సంబంధించిన విషయాలపై రాష్ట్రపతికి సలహా ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వైట్హైస్లో అందించే సేవలు..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) నియంత్రణకు సంబంధించిన విధానాలను రూపొందించడంలో చురుకుగా పాల్గొంటారు. ఆమె అక్కడ ఏఐ అపార సామార్థ్యాన్ని గుర్తించడమే గాక దాని వల్ల ఎదురయ్యే నష్టాలను సమర్థవంతంగా నిర్వహించవలసిన అవసరాన్ని గురించి నొక్కి చెబుతుంది. ఆమె బైడెన్ పరిపాలనకు సంబంధించిన ఏఐ భద్రత, గోప్యత, వివక్షను పరిష్కరించడానికి ముఖ్యమైన చర్యలు తీసుకుంటుంది. నిజానికి ఆమె ఓవెల్ ఆఫీస్లో ల్యాప్టాప్ని ఉపయోగించి ప్రెసిడెంట్ జో బైడెన్కి చాట్జిపిటి గురించి వివరించడంతోనే వెట్హౌస్లో దీని ప్రాముఖ్యత ఉందని గుర్తించారు బైడెన్. ఆ తర్వాత ఆరునెల్లలోనే అధ్యక్షుడు బైడెన్ ఏఐ భద్రత గోప్యత, ఆవిష్కరణలపై దృష్టి సారించేలా కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వు ఏఐ కొత్త ప్రమాణాలను ఏర్పాటు చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐలో అమెరికన్ నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం తోపాటు వివక్ష నుంచి రక్షిస్తుంది. ఇక ఆరతి ఈ ఏఐ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో అమెరికా అధ్యక్షుడికి సమగ్ర వ్యూహాలు, సలహాలు అందిస్తుంది. ఆమె నేపథ్యం..ఢిల్లీలో పుట్టిన ఆరతి.. మూడేళ ప్రాయంలో ఉండగానే ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లింది. టెక్సాస్లోని లుబ్బాక్లో పెరిగారు. ఆమె ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో పట్టా పొందారు. ఆ తర్వాత అప్లైడ్ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేశారు. దీంతో 1984లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ చేసిన తొలి మహిళగా ఆరతి చరిత్ర సృష్టించింది. ఆమె డాక్టరల్ అధ్యయనాల తదనంతరం వాషింగ్టన్ డీసీలో కాంగ్రెస్ ఫెలోషిప్ను పూర్తి చేసింది. (చదవండి: మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో 60 ఏళ్ల వృద్ధురాలు..!) -
టెక్సాస్లో దారుణం : వివాదంలో జీయర్ ట్రస్టు
జీయర్ ట్రస్టు అమెరికాలో ఓ వివాదంలో ఇరుక్కుంది. టెక్సాస్లోని షుగర్ ల్యాండ్లో ఒక భారతీయ అమెరికన్ తండ్రి, ఒక హిందూ దేవాలయం, దాని మాతృ సంస్థపై మిలియన్ డాలర్ల దావా వేశాడు. ఆలయంలో జరిగిన ఓ వేడుకకు హాజరైన తన మైనర్ అయిన 11 ఏళ్ల కొడుకుకు పూజారులు వాతలు పెట్టి, అమానుషంగా ప్రవర్తించారంటూ బాలుడి తండ్రి ఫోర్ట్ బెండ్ కౌంటీకి చెందిన విజయ్ చెరువు కోర్టును ఆశ్రయించాడు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (JET) USA Inc ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న షుగర్ ల్యాండ్లోని అష్టలక్ష్మి ఆలయంలో వేడుకలో భాగంగా ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి తన మాజీ భార్యతోపాటు గుడికి వెళ్లిన తన కొడుకు రెండు భుజాలకు శంఖు చక్రాల గుర్తులు వేశారని తెలిపారు. దీంతో పిల్లవాడు తీవ్రమైన నొప్పితో రోజుల తరబడి బాధ పడ్డాడని, ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి పరిహారంగా 10 లక్షల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.8.33 కోట్లు) పరిహారంగా ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యవహారాన్ని ఆపకుండా ఆలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైద్య సేవలు కూడా అందించలేదని ఆరోపించారు. బాలుడి కుడి, ఎడమచేతిపై వాతలు పలు మీడియా నివేదికల ప్రకారం తల్లిదండ్రుల అనుమతి తీసుకోకుండా ఈ పని చేశారంటూ ఏప్రిల్ 1 న కోర్టులో దావా దాఖలయింది. ఈ ఘటన ఆగస్టు 5న జరిగినట్లు తెలుస్తోంది. పేరెంట్స్ అనుమతిచ్చినా సరే ఇలా మైనర్ శరీరంపై వాతలు పెట్టడం నేరమని విజయ్ న్యాయవాది ఆండ్రూ విలియమ్స్ వాదించారు. టెక్సాస్ హెల్త్ అండ్ సేఫ్టీ కోడ్ ప్రకారం తల్లిదండ్రుల అనుమతి ఉన్నా.. లేకున్నా.. బాలలకు పచ్చబొట్లు పొడవడం, కర్రు పెట్టి ముద్ర వేయడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు. అమెరికన్ చట్టాల ప్రకారం ఇది నేరమేనని తెలిపారు. ఈ కేసులో బాలుడి గాయాలను థర్డ్ డిగ్రీగా పరిగణిస్తారని, కాలిన గాయాలు వీటికి సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ గాయాలపై డాక్టర్ను సంప్రదించినపుడు ఈ గాయాలను గురించి పోలీసులకు నివేదించమని వైద్యుడు కూడా పట్టుబట్టారని లాయర్ విలియమ్స్ వివరించారు. అయితే ఈ వ్యవహారంపై జీయర్ ట్రస్టు నిర్వాహకులు కానీ, ఆలయ కమిటీగానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
లోకం మెచ్చిన కోడింగ్ మాంత్రికుడు : అద్రిత్ సక్సెస్ జర్నీ
‘అబ్బ...ఖాళీ సమయం దొరికింది. ఎంజాయ్ చేయాలి’ అనుకునేవారు కొందరు. ‘ఖాళీ సమయం దొరి కింది... ఏదైనా నేర్చుకోవాలి’ అనుకునేవారు మరికొందరు. అద్రిత్రావు రెండో కోవకు చెందిన కుర్రాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో దొరికిన విరామంలో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎన్నో సాంకేతిక విషయాలను స్వయంగా నేర్చుకున్నాడు. కోడింగ్ మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నాడు... ‘కోడింగ్ మేధావి’గా పేరుగాంచిన ఇండియన్–అమెరికన్ అద్రిత్రావు యాప్ డెవలప్మెంట్ వరల్డ్, డిజిటల్ హెల్త్ ఇన్నోవేషన్లో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కాలిఫోర్నియాకు చెందిన పదహారు సంవత్సరాల అద్రిత్ ఎన్నో యాప్లను రూపొందించి టెక్ దిగ్గజం యాపిల్ ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో హెల్త్కేర్కు సంబంధించిన కట్టింగ్–ఎడ్జ్ రిసెర్చ్లో భాగం అయ్యాడు. ఎనిమిదేళ్ల వయసులో కోడింగ్తో ప్రయాణం ప్రారంభించాడు అద్రిత్. ‘బ్లాక్ ప్రోగ్రామింగ్’తో కంప్యూటర్ సైన్స్తో పరిచయం అయింది. ఆ పరిచయం ఇష్టం అయింది. ఆ ఇష్టం శోధనకు మూలం అయింది. కంప్యూటర్ సైన్స్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన అద్రిత్ ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లను గురించి ఆసక్తిగా తెలుసుకోవడం ప్రారంభించి ఆ తరువాత వాటిపై పట్టు సాధించాడు. కోవిడ్ మహమ్మారి సమయంలో అద్రిత్కు బోలెడు ఖాళీ సమయం దొరికింది. ఈ ఖాళీ సమయంలో యూట్యూబ్, ఇతర ఆన్లైన్ వనరుల ద్వారా యాప్ డెవలప్మెంట్ నేర్చుకున్నాడు. పన్నెండేళ్ల వయసులో ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ సిఫ్ట్ స్టూడెంట్ చాలెంజ్లో అద్రిత్రావు విజేతగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ను కలిసే అరుదైన అవకాశం లభించింది. ‘అదొక ఉత్తేజకరమైన అనుభవం. యాప్ డెవలప్మెంట్కు సంబంధించి నా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రేరణ ఇచ్చింది’ కుక్తో జరిగిన మీటింగ్ గురించి చెబుతాడు అద్రిత్. సినిమాలు, టీవీ షోలను చూడడానికి ప్రేక్షకులకు సహాయపడే యాప్ల నుంచి ఆరోగ్య సంరక్షణలో ఉపయోగపడే యాప్ల వరకు...అద్రిత్ ఖాతాలో వినూత్న యాప్లు ఎన్నో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది బధిరులు ఉన్నారు, కమ్యూనికేషన్ విషయంలో ఇతరులతో వారికి ఎదురవుతున్న సమస్యల గురించి అధ్యయనం చేసిన అద్రిత్కు వారి హావభావాలను ఐఫోన్ కెమెరా ద్వారా స్పీచ్గా మార్చాలనే ఆలోచన వచ్చింది. ఆ తరువాత ‘సిగ్నర్’ అనే యాప్ ద్వారా తన ఆలోచనను నిజం చేసుకున్నాడు. పదమూడు సంవత్సరాల వయసులో చదివిన ఒక వ్యాసం ద్వారా అద్రిత్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఆసక్తి పెరిగింది. ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉయోగించాలనే ప్రయత్నంలో స్టాన్ఫోర్ట్ యూనివర్శిటీలో రిసెర్చ్ ఇంటెర్న్షిప్ ప్రారంభించాడు అద్రిత్. వ్యాధులను గుర్తించే, స్టాండ్ఔట్ ఇన్నోవేషన్గా చెప్పబడుతున్న ‘ఆటోఏబీఐ’లాంటి ఐఫోన్ యాప్లు క్లినికల్ ట్రయల్స్, పేటెంట్ప్రాసెస్లో ఉన్నాయి. పది సైంటిఫిక్ రిసెర్చ్ పేపర్లను ప్రచురించిన అద్రిత్ డిజిటల్ హెల్త్ సోల్యూషన్స్కు సంబంధించి క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్లపై పని చేయడానికి సిలికాన్ వ్యాలీలో ఎక్కువ సమయం గడిపినప్పటికీ ‘సాంకేతిక సహాయంతో ఆరోగ్య సంరక్షణ’ అంశంపై ఎక్కువ దృష్టి పెట్టాడు అద్రిత్. ‘వైద్యుల స్థానాన్ని ఏఐ భర్తీ చేయాలని నేను అనుకోవడం లేదు. అయితే అది వైద్యులకు సహాయపడుతుంది’ అంటున్నాడు. ఈ కోడింగ్ మాంత్రికుడిలోని మరో కోణం...లాభాపేక్ష లేకుండా యంగ్ ఇన్నోవేటర్స్ కోసం ΄ాఠాలు బోధిస్తున్నాడు. ఎంతోమందికి విలువైన సలహాలు ఇస్తున్నాడు.వయసు అడ్డంకి కాదు... కొత్త ఆవిష్కరణలకు వయసు అనేది అడ్డు కాదు. అభిరుచి అనేది ఆవిష్కరణకు ప్రమాణం. మనం ఇష్ట పడుతున్న సబ్జెక్ట్పై ఎంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే అంత విజయం సాధించగలం. కాలం అనేది విలువైనది. విలువైన కాలాన్ని వృథా చేయకుండా విలువైన విషయాలపై దృష్టి పెడితే అద్భుతాలు సాధించగలం. మార్పును తీసుకురాగలం. – అద్రిత్ -
Ashwin Ramaswami: జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికైతే రికార్డే!
భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించనున్నారు. అమెరికాలోని జార్జియా సెనేట్ స్థానానికి పోటీ చేస్తున్న మొదటి జనరల్ జెడ్ (1997-2012 మధ్య పుట్టినవాళ్లు) భారతీయా అమెరికన్ అశ్విన్ రామస్వామి నిలిచారు. 34 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అశ్విన్.. జార్జియాలోని డిస్ట్రిక్ట్ 48 స్టేట్ సెనేట్ కోసం డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థానానికి రిపబ్లికన్ షాన్ స్టిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. తన రాష్ట్రమైన జార్జియాకు సేవ చేయాలన్న ఉద్దేశంతో తాను సెనెట్కు పోటీ చేస్తున్నట్లు అశ్విన్ రామస్వామి తెలిపారు. తనలా రాజకీయంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ మెరుగైన అవకాశాలు ఉండాలని పేర్కొన్నారు. 24 ఏళ్లకే సాఫ్ట్వేర్ ఇంజినీర్గా, ఎన్నికల భద్రత, టెక్నాలజీతో పాటు పలు రంగాల్లో అశ్విన్ రామస్వామి పని చేశారు. అశ్విన్ రామస్వామి ఎన్నికైతే.. కంప్యూటర్ సైన్స్తో పాటు న్యాయవాద డిగ్రీ కలిగి ఉన్న ఏకైక జార్జియా చట్టసభ్యుడిగా రికార్డు సృష్టించనున్నారు. ఇక.. తన తల్లిదండ్రులు 1990లో తమిళనాడు నుంచి అమెరికా వచ్చారని అశ్విన్ తెలిపారు. తాను భారత, అమెరికా సంస్కృతులతో పెరిగిగానని.. తాను హిందువునని తెలిపారు. తనకు భారతీయ సంస్కృతిపై చాలా ఆసక్తి ఉందని.. తాను కాలేజీ సమయంలో సంస్కృతం కూడా నేర్చుకున్నట్లు వెల్లడించారు. తాను రోజూ యోగా, ధ్యానం చేస్తూ ఉంటానని అశ్విన్ పేర్కొన్నారు. చదవండి: Alexei Navalny: నావల్నీ తల, ఒంటిపై కమిలిన గాయాలు -
డొనాల్డ్ ట్రంప్ మానసికస్థితిపై నిక్కీ హేలీ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీదారుగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్పై విమర్శలు గుప్పించారు. ఆమె శనివారం మాట్లాడుతూ ట్రంప్కు కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ మానసిక స్థితిపై నిక్కీ హేలీ మండిపడ్డారు. జనవరి 6,2021న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన హింసాత్మక దాడిని ఆపటంలో తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. శుక్రవారం రాత్రి ట్రంప్ ఓ ర్యాలీలో పాల్గొన్నారని.. జనవరి 6, 2021న అమెరికా క్యాపిటల్ భవనంపైన జరిగిన దాడి విషయంలో తాను భద్రత కల్పించలేకపోయానని పార్టీ శ్రేణులు చేస్తున్న విమర్శలను పదే పదే ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. తాను ఎందుకు ఆ హింసాత్యక ఘటనకు తాను బాధ్యత వహిస్తావని ప్రశ్నించారు. కనీసం అప్పుడు తాను ఆఫీసులో కూడా లేనని పేర్కొన్నారు. ట్రంప్ అప్పటి అమెరికన్ హౌజ్( ప్రతినిధుల సభ) స్పీకర్ అయిన నాన్సీ పెలోసీని దృష్టిలో పెట్టుకొని పొరపాటుపడుతూ తనపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీంతో ఆయన మానసికస్థితి ఏంటో తెలుస్తోందని మండిపడ్డారు. ట్రంప్ మానసిక ఆరోగ్యం దిగజారుతోందని తెలపడానికి ఇదే నిదర్శమని అన్నారు తాను ఎటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయటం లేదన్నారు. కానీ, ఎంతో ఒత్తిడితో కూడుకున్న అగ్రరాజ్యం అధ్యక్ష పదవి చేపట్టడానికి ట్రంప్ మానసిక స్థితి సరిపోతుందా? అని సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి సమయంలో ప్రజలు మరో వ్యక్తిని అమెరికా అధ్యక్షుడిగా కోరుకుంటారని నిక్కీ హేలీ తెలిపారు. చదవండి: US presidential election 2024: నిక్కీ హేలీ నా రన్నింగ్ మేట్ కాదు: ట్రంప్ -
US presidential election 2024: నిక్కీ హేలీ నా రన్నింగ్ మేట్ కాదు: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీదారుగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ తన రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్ష పదవి అభ్యర్థి) కాదని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆమెకు అంత సామర్థ్యం లేదని, ఉపాధ్యక్ష పదవికి ఆమెను ఎంపిక చేసుకోనని వ్యాఖ్యానించారు. అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున అగ్రభాగాన ఉన్న ట్రంప్ శుక్రవారం కాంకార్డ్లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. న్యూహ్యాంప్షైర్లో ట్రంప్కు సమీప ప్రత్యర్థిగా ఉన్న నిక్కీ హేలీ..తాను ఉపాధ్యక్ష పదవి రేసులో లేనని ఇప్పటికే ప్రకటించగా ట్రంప్ పైవిధంగా స్పందించడం గమనార్హం. అదేవిధంగా, ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో నిక్కీ హేలీని జాతిపరంగా హేళన చేశారు. పంజాబ్కు చెందిన సిక్కు తల్లిదండ్రుల కుమార్తె అయిన నిక్కీ హేలీని ‘నింబ్రా’అంటూ పలుమార్లు పేర్కొన్నారు. నిక్కీ తల్లిదండ్రులు అమెరికన్లు కానందున అధ్యక్ష పదవికి ఆమె అర్హురాలు కాదని ఇటీవల పేర్కొన్న ట్రంప్..ఆమె పేరును ‘నిమ్రద’అంటూ తప్పుగా ఉచ్చరించారు. సౌత్ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్గా పనిచేసిన నిక్కీ హేలీ అసలు పేరు నిమ్రతా నిక్కీ హేలీ. వివాహానంతరం నిక్కీ హేలీగా మార్చుకున్నారు. -
22 నెలలకుపైగా న్యాయ పోరాటం.. భారతీయ అమెరికన్కు ఊరట
న్యూయార్క్: అమెరికాలో 22 నెలలకు పైగా న్యాయ పోరాటం తర్వాత ఓ భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఊరట కలిగింది. తాను కొనుక్కున్న ఇంటిలో తిష్టవేసిన జంట ఎట్టకేలకు ఇల్లు విడిచి వెళ్లిపోవడంతో ఆ భారతీయ అమెరికన్ ఊపిరి పీల్చుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో బ్యాంక్ వేలంలో జెరిఖోలోని ఫ్రెండ్లీ లేన్లోని 1,536 చదరపు అడుగుల ఇంటిని బాబీ చావ్లా అనే ఇండియన్ అమెరికన్ కొనుగోలు చేశారు. అయితే ఆ ఇంటి గత యజమానులైన బారీ, బార్బరా పొలాక్ ఆ ఇంటిని విడిచి పెట్టకుండా తిష్ట వేసినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. తాను ఆ ఇంటి కోసం పన్నులు, తనఖా చెల్లింపులు, ఇతర బిల్లుల రూపంలో ఇప్పటివరకు 85 వేల డాలర్లకు పైగా ఖర్చు చేసినట్లు చావ్లా పేర్కొన్నాడు. ఇంటిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన చావ్లా తల్లిదండ్రులను బారీ పొలాక్ తిడుతూ "పాకిస్తాన్కు వెళ్లిపోండి" అంటూ అరుస్తున్న వీడియో బయటకు వచ్చింది. నిందితులు 1990లో 2,55,000 డాలర్లకు ఇంటిని కొనుగోలు చేశారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2006 నాటికి తమ తనఖా చెల్లించడం మానేశారు. కోర్టు పత్రాల ప్రకారం, 2008లో ఇల్లు జప్తునకు రాగా బారీ, బార్బరా పొలాక్ జంట ఒక దశాబ్దానికి ఇల్లు జప్తు కాకుండా దశాబ్దానికిపైగా కేసును లాక్కొచ్చారు. ఇంటి జప్తు నుంచి కాపాడుకునేందుకు ఏకంగా ఏడు సార్లు దివాలా పిటిషన్లు వేశారు. బార్బరా పొలాక్ గత నెలలో తాజాగా మరోసారి దివాలా పిటిషన్ వేయడంతో ఇంటిని ఖాళీ చేయించే ప్రయత్నం ఆగిపోయింది. కాగా గతవారం కేసును విచారించిన ఫెడరల్ న్యాయమూర్తి పోలాక్స్ను మళ్లీ దివాళా పిటిషన్లు దాఖలు చేయకుండా నిరోధించారు. దీంతో ఆ జంట చివరకు డిసెంబర్ 22న ఇంటిని విడిచిపెట్టి వెళ్లారు. "ఇది క్రిస్మస్ అద్భుతంలా అనిపిస్తోంది, నేను నమ్మలేకపోతున్నాను" అని ది న్యూయార్క్ పోస్ట్తో బాబీ చావ్లా అన్నారు. తాను ఆ ఇంటిని తన ఆరు నెలల గర్భిణీ సోదరి, ఆమె భర్తకు ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు. -
అమెరికాలో ఎన్నారై ఘరానా మోసం.. రూ.183 కోట్లు టోకరా
అమెరికాలో ఎన్నారై ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. విలాసాలకు అలవాటుపడిన ఎన్నారై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.183 కోట్లు కొల్లగొట్టాడు. అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన అమిత్ పటేల్ ఈ మోసానికి పాల్పడ్డాడు. యూఎస్ ఫుట్బాల్ టీమ్ జాక్సన్విల్లే జాగ్వార్స్కు ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన అమిత్ పటేల్ ఆ టీమ్కు 22 మిలియన్ డాలర్లు అంటే ఇండియా కర్సెనీలో సుమారు రూ.183 కోట్లు టోకరా పెట్టాడు. ఈ డబ్బుతో జల్సా చేశాడు. ఫ్లోరిడాలో భారీ ఇంటిని కొనుగోలు చేయడంతో పాటు ఖరీదైన టెస్లా కారు, విలువైన వాచ్, క్రిప్టో కరెన్సీ కొన్నాడు. అలాగే చార్టెడ్ ఫ్లైట్స్ లో ఫ్రెండ్స్తో కలసి విహార యాత్రలు చేసేవాడు. ఇక ఈ విషయం బయటకు రావడంతో జాక్సన్విల్లే యాజమాన్యం అమిత్ను 2023 ఫిబ్రవరిలో ఉద్యోగం నుంచి తొలగించింది. ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో అతడిపై కేసు వేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. -
హిందూ మత విశ్వాసమే స్ఫూర్తి: వివేక్ రామస్వామి
వాషింగ్టన్: హిందూ మత విశ్వాసం తనకు అన్ని విషయాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇచి్చందని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి చెప్పారు. అధ్యక్ష రేసులో నిలిచేందుకు కూడా ఆ విశ్వాసమే తనకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడన్నది హిందూ మత మౌలిక విశ్వాసమని 38 ఏళ్ల వివేక్ చెప్పారు. -
గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు.. దిగ్గజ కంపెనీలన్నీ ఇండియన్స్ సారథ్యంలోనే!
టెక్నాలజీలో ప్రపంచ దేశాలు పరుగులు పెడుతున్నాయి. సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ.. కొత్త ఆవిష్కరణలు సృష్టిస్తూ ఒక దేశంతో మరో దేశం పోటీ పడుతున్నాయి. భారత్ కూడా ఏ మాత్రం వెనుకడుగేయకుండా ఎప్పటికప్పుడు తన సత్తా చాటుకుంటోంది. భారతీయులు కూడా జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ అనేక దిగ్గజ కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారు. 2015లో యూట్యూబ్ సీఈఓ నీల్ మోహన్ ఎంపిక కావడంతో దాదాపు 25 పెద్ద సంస్థలు భారతీయ సంతతికి చెందిన వారి నేతృత్వంలోకి చేరాయి. ఇది గర్వించదగ్గ విషయం. మైక్రోసాఫ్ట్ నుంచి గూగుల్ వరకు చాలా కంపెనీలు భారతీయ సీఈఓల నిర్వహణలోనే ఉన్నాయి. ఇదీ చదవండి: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న పాపులర్ యాప్స్ ఇవే! మీకు తెలుసా? మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓగా వసంత్ నరసింహన్, మైక్రోచిప్ టెక్నాలజీ సీఈఓగా గణేష్ మూర్తి, ఐబీఎమ్ సీఈఓగా అరవింద్ కృష్ణన్, నెట్ యాప్ సీఈఓగా జార్జ్ కురియన్, మార్నింగ్ స్టార్ సీఈఓగా కునాల్ కపూర్, మైక్రా టెక్నాలజీ సీఈఓగా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు నిర్వహిస్తూ భారత ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. THE COMPLETE INDIAN TAKEOVER. With Neal Mohan becoming the CEO of YouTube, these are the 25 big firms led by Indian Americans with a total market value of 5 trillion dollars, more than the current Indian GDP. A very proud moment for all Indians.🇮🇳 pic.twitter.com/BPmKsQ6Wus — Aviator Anil Chopra (@Chopsyturvey) November 16, 2023 -
Shanya Gill: పన్నెండు సంవత్సరాల వయసులోనే ఫైర్–డిటెక్షన్ డివైజ్ ఆవిష్కరణ
సైన్స్ పాఠాలను కూడా చందమామ కథల్లా ఆసక్తిగా వింటుంది శణ్య గిల్. ఆ ఆసక్తి వృథా పోలేదు. చిన్నవయసులోనే ఆవిష్కర్తను చేసింది. థర్మో ఫిషర్ సైంటిఫిక్ జూనియర్ ఇన్వెంటర్స్ ఛాలెంజ్–2023లో పన్నెండు సంవత్సరాల శణ్య గిల్ తయారు చేసిన ఫైర్–డిటెక్షన్ డివైజ్ ప్రథమ స్థానంలో నిలిచింది... కాలిఫోర్నియా(యూఎస్)లో సిక్త్స్–గ్రేడ్ చదువుతుంది శణ్య. సైన్స్, సైంటిస్ట్లు తనకు బాగా ఇష్టం. సైన్స్లో కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవడం అంటే ఆసక్తి. శణ్య గిల్ ఇంటికి సమీపంలోని ఒక రెస్టారెంట్లో అగ్నిప్రమాదం జరిగి భారీ నష్టం సంభవించింది. ఇంటా బయటా ఈ ప్రమాదానికి సంబంధించిన రకరకాల మాటలు ఎక్కడో ఒక చోట వినేది శణ్య గిల్. అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఒక పరికరం తయారు చేయాలనుకుంది. రకరకాల ప్రయోగాలు చేసింది. ఆ ప్రయోగాలు వృథా పోలేదు. కంప్యూటర్కు అనుసంధానించిన థర్మల్ కెమెరాను ఉపయోగించి సమర్థవంతమైన ఫైర్–డిటెక్షన్ సిస్టమ్ను రూపొందించింది శణ్య. శణ్య తయారు చేసిన ఫైర్–డిటెక్షన్ డివైజ్ సాధారణ సంప్రదాయ స్మోక్ డిటెక్టర్ కంటే చాలా వేగంగా పనిచేస్తుంది. నష్టం జరగకుండా అప్రమత్తం చేస్తుంది. ‘రెస్టారెంట్ అగ్నిప్రమాదం ప్రభావంతో అమ్మ రకరకాలుగా భయపడేది. కిచెన్లోని స్టవ్ ఆఫ్ అయిందో లేదో అమ్మ ఒకటికి రెండుసార్లు చెక్ చేసేది. ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది. మరోవైపు ఎక్కడ చూసినా ఆ అగ్నిప్రమాదానికి సంబంధించే మాట్లాడుకునేవారు. ఇదంతా చూసిన తరువాత అగ్నిప్రమాదాలను నివారించే పరికరాన్ని తయారు చేయాలనుకున్నాను. నేను తయారు చేసిన ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ద్వారా ఎంతో మందిని అగ్నిప్రమాదాల బారిన పడకుండా కాపాడవచ్చు’ అంటుంది శణ్య గిల్. శణ్యకు సైన్స్తోపాటు ఆటలు, క్రాఫ్టింగ్, కోడింగ్ అంటే ఇష్టం. జూనియర్లకు పాఠాలు చెప్పడం అంటే ఇష్టం. బయో మెడికల్ ఇంజనీర్ కావాలనేది శణ్య గిల్ లక్ష్యం. -
సాంగ్ రైటర్ కమ్ సింగర్..స్ఫూర్తినిచ్చే పాటలతో అలరిస్తుంది!
టీనేజ్లో న్యూయార్క్కు వెళ్లిన రవీనా అరోరా సింగర్, సాంగ్ రైటర్గా మంచి పేరు తెచ్చుకుంది ‘స్వీట్ టైమ్’ ‘టెంప్టేషన్’ ‘హానీ’ పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక లైవ్ షోలలో పాశ్చాత్య ప్రేక్షకులను హిందీ సాంగ్స్తో అలరిస్తుంటుంది. స్టేజీ మీద ఉన్నట్టుండీ...‘వుయ్ ఆర్ గోయింగ్ టు సింగ్ ఇన్ హిందీ నౌ’ అని ప్రకటిస్తుంది. ఆడిటోరియమ్ కేకలతో నిండిపోతున్న సమయంలో ‘ఏక్, దో, తీన్, చార్, చలోనా, మేరె సాత్’ అంటూ హిందీ పాట అందుకుంటుంది. 60,70లలోని హిందీ చిత్రాల పాటలను పాడుతూ కూడా ఈతరం కుర్రకారును ఆకట్టుకుంటుంది. ‘సంగీతంలో భిన్న ధోరణులను అన్వేషించడం ఇష్టం’ అంటున్న అరోరాకు లతా మంగేష్కర్, ఆశా భోంస్లేలా స్వరం ఇష్టం. భావగర్భితమైన పాట ఇష్టం. రవీనా పాటలు ‘ఆహా, ఒహో’లకు పరిమితమైన పసందైన పాటలు కాదు. ఎన్నో సామాజిక సమస్యలు ఆమె పాటలో భాగమై ఉంటాయి. ‘ఇతరులకు స్ఫూర్తినిచ్చేలా, తమను తాము ప్రేమించుకునేలా, తమను తాము స్పష్టంగా అర్థం చేసుకునేలా, ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేలా నా పాట ఉండాలనుకుంటాను’ అంటోంది రవీనా అరోరా. (చదవండి: దర్శకురాలు కావాలనుకుంది..కానీ తండ్రి హఠాన్మరణం ఆమెను) -
ఛీ..ఛీ.. విమానంలో వికృత చేష్టలు.. ఇండో అమెరికన్ వైద్యుని అరెస్టు..
విమానంలో బాలిక ఎదుట అసభ్యంగా ప్రవర్తించిన భారత సంతతి వైద్యుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితునికి పక్కసీటులో కూర్చున్న బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై అభియోగాలు మోపారు. గత ఏడాది మేలో ఈ ఘటన జరగగా.. అనేక విచారణల తర్వాత అరెస్టు చేశారు. సుదీప్త మొహంతీ(33) అమెరికాలోని బోస్టన్లో ఇంటర్నల్ మెడిసిన్, ప్రైమరీ కేర్ విభాగంలో వైద్యునిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మే నెలలో స్నేహితురాలితో కలిసి బోస్టన్కు విమానంలో వెళుతున్నారు. కాగా పక్క సీటులో 14 ఏళ్ల మైనర్ బాలిక కూర్చుంది. ఆ బాలిక తన నానమ్మ తాతయ్యలతో ప్రయాణిస్తోంది. మొహంతీ పక్కనే బాలిక ఉండగా.. అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. ఇది గమనించిన బాలిక పక్క సీటులోకి వెళ్లిపోయింది. విమానం దిగగానే తన నానమ్మ, తాతయ్యలతో పాటు విమాన సిబ్బందికి తెలిపింది. బాలిక ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. మొహంతీపై కేసు నమోదు చేశారు. అనంతరం న్యాయస్థానం ముందు ప్రాథమికంగా హాజరుపరిచారు. అప్పుడు ఆంక్షలను విధిస్తూ విడుదల చేశారు. విమానంలో అసభ్య చేష్టలకు పాల్పడితే అమెరికా శాసనం ప్రకారం అతనికి 90 రోజుల వరకు జైలు శిక్షతో పాటు 5000 అమెరికా డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. ఇదీ చదవండి: అమానవీయం: చికెన్ ఇవ్వలేదని.. చెప్పులతో దళితునిపై దాడి.. -
వైట్హౌస్ భారతీయ- అమెరికన్ సలహాదారు కీలక నిర్ణయం.. ‘డ్యూక్’కు తిరుగుముఖం!
భారతీయ- అమెరికన్ ఆరోన్ 'రోనీ' ఛటర్జీ తాజాగా నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ (ఎన్ఈసీ)లో వైట్ హౌస్ కోఆర్డినేటర్ పదవి నుండి వైదొలగారు. డ్యూక్ యూనివర్శిటీలో బిజినెస్ ప్రొఫెసర్గా తిరిగి తన పదవిలోకి వెళ్లనున్నారు. సెమీకండక్టర్ పరిశ్రమలో చిప్స్, సైన్స్ చట్టానికి చెందిన $50 బిలియన్ల పెట్టుబడిని సెమీకండక్టర్స్ పరిశ్రమలో అమలు చేయడం కోసం గత ఏడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో ఛటర్జీ ఈ పదవిలో నియమితులయ్యారు. “బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో రెండేళ్లు పనిచేసిన తర్వాత తిరిగి డ్యూక్ యూనివర్శిటీకి వెళ్లాలని భావిస్తున్నాను. వైట్హౌస్లోని నా సహోద్యోగులందరికీ, ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ కీలకమైన ఆర్థిక, జాతీయ భద్రతా సమస్యలపై పనిచేసినందుకు సంతోషిస్తున్నాను’అని ఛటర్జీ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. వైట్ హౌస్లోని ఫుక్వా స్కూల్ ఆఫ్ బిజినెస్కు కొంతకాలం సేవలు అందించిన ఆయన ఇప్పుడు రిలీవ్ అయ్యారు. గ్లోబల్ చిప్ల కొరతకు పరిష్కారం దిశగా.. చిప్స్ అండ్ సైన్స్ చట్టాన్ని సెమీకండక్టర్ల ఉత్పత్తిని పెంచడానికి, పరిశోధన, రూపకల్పనలో నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ప్రపంచ వేదికపై దేశానికి పోటీతత్వాన్ని అందించడానికి అమలు చేశారు. దీనిని విభిన్న సెమీకండక్టర్ వర్క్ఫోర్స్ను పెంచడానికి గత సంవత్సరం ఆమోదించారు. పొలిటికో తెలిపిన వివరాల ప్రకారం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చేపట్టిన సెమీకండక్టర్ వ్యూహం గ్లోబల్ చిప్ల కొరతకు పరిష్కారం చూపించనుంది. అలాగే యుఎస్ ఆధారిత తయారీ సౌకర్యాలపై దృష్టి సారించింది. ఇతర దేశాల సరఫరాదారులపై తక్కువ ఆధారపడే ప్రయత్నంలో భాగంగా ఈ చట్టం అమలు చేశారు. తైవాన్, చైనాలతో పెరుగుతున్న ఇబ్బందుల నుంచి పరిష్కారానికి అమెరికాకు ఈ చట్టం చేయడం బాధ్యతగా మారింది. పరిపాలన విషయంలో అద్భుతమైన ఆస్తి కాగా ఛటర్జీ 2021 ఏప్రిల్ నుండి వాణిజ్య శాఖకు చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేశారు. అక్కడ చటర్జీ వాణిజ్య కార్యదర్శి గినా రైమోండోకు ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. ఆ సమయంలో ఆయన ఈ రంగంలో అమెరికాలో పోటీతత్వం పెరిగేందుకు, కార్మిక మార్కెట్లు, సరఫరా గొలుసులు, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత, ఆర్థిక వృద్ధికి సంబంధించిన విధానాన్ని అభివృద్ధి చేయడానికి సారధ్యం వహించారు. పొలిటికో ఒక ప్రకటనలో ఛటర్జీని పరిపాలన విషయంలో అద్భుతమైన ఆస్తిగా అభివర్ణించింది. ఈ రంగంలో అమెరికాలో చైన్ సిస్టమ్ను బలోపేతం చేయడం, జాతీయ భద్రతను బలోపేతం చేయడం, అమెరికా అంతటా మరిన్ని ఉద్యోగాలను సృష్టించడంలో అతని నైపుణ్యం, మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడిందని పేర్కొంది. అత్యుత్తుమ సేవలకు అనేక అవార్డులు కాగా ఛటర్జీ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిపాలనలోనూ సేవలు అందించారు. వైట్ హౌస్ కౌన్సిల్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్లో సీనియర్ ఆర్థికవేత్తగా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో విజిటింగ్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేశారు. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్లో టర్మ్ మెంబర్గా పనిచేసిన ఆయన గోల్డ్మన్ సాక్స్లో ఆర్థిక విశ్లేషకుడిగానూ సేవలు అందించారు. ఈ నేపధ్యంలో ఛటర్జీ అనేక అవార్డులు అందుకున్నారు. ఎంటర్ప్రెన్యూర్షిప్లో విశిష్ట పరిశోధన కోసం 2017 కౌఫ్ఫ్మన్ ప్రైజ్ మెడల్, ఆస్పెన్ ఇన్స్టిట్యూట్ నుండి రైజింగ్ స్టార్ అవార్డు, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ సొసైటీ ఎమర్జింగ్ స్కాలర్ అవార్డును చటర్జీ అందుకున్నారు. చటర్జీ తన పీహెచ్డీని బర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని హాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి పూర్తిచేశారు. అంతకు ముందు ఆర్థిక శాస్త్రంలో బీఏ పట్టాను కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి అందుకున్నారు. ఇది కూడా చదవండి: ఆఫ్రికా ఎందుకు అగ్గిలా మండుతోంది? నైగర్ పరిస్థితేంటి? -
కోర్టుకు హాజరైన ట్రంప్..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారని అభియోగాలను ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం కోర్టుకు హాజరయ్యారు. ఈ విషయంలో తాను నిర్దోషినని తనకే పాపం తెలీదని చెప్పారు. ఇండియన్ అమెరికన్ మహిళా న్యాయమూర్తి మోక్సిలా ఎ ఉపాధ్యాయ ఎదుట ట్రంప్ హాజరయ్యారు. రాజకీయ ప్రత్యర్థులే ఈ కేసులో ఇరికించారని ట్రంప్ పేర్కొన్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించినప్పటికీ దానిని అధికారికంగా వెల్లడించకుండా 2021 జనవరిలో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడికి పాల్పడ్డారంటూ అభియోగాలు నమోదయ్యాయి. ట్రంప్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కోర్టు హాలు వెనుక తలుపులోంచి లోపలికి ప్రవేశించారు. ఎవరీ ఉపాధ్యాయ ?: న్యాయమూర్తి మోక్సిలా ఎ ఉపాధ్యాయ గుజరాత్లో జన్మించారు. ఆమె చిన్నతనంలో తల్లిదండ్రులు అమెరికా వెళ్లిపోవడంతో కన్సస్లో పెరిగారు. -
C R Rao: తెలుగోడికి స్టాటిస్టిక్స్ నోబెల్ అవార్డు, 102 ఏళ్ల వయసులో ఘనత
ప్రపంచ ప్రఖ్యాత గణాంకశాస్త్ర నిపుణుడు, భారతీయ అమెరికన్ కల్యంపూడి రాధాకృష్ణరావు (102) స్టాటిస్టిక్స్ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. గణాంక శాస్త్ర రంగంలో నోబెల్ అవార్డుగా భావించే ఇంటర్నేషల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు సీఆర్ రావును వరించింది. సాధించడానికి వయస్సుతో పని లేదని నిరూపించిన గొప్ప వ్యక్తి సీఆర్ రావు. వయస్సు అనేది కేవలం ఒక నెంబర్ అని మాత్రమే చెప్పే.. రాధాకృష్ణారావు.. జీవితంలో ఎన్నో సాధించి ఐకాన్గా నిలిచారు. 62 ఏళ్లకు కూతురి దగ్గర ఉండేందుకు అమెరికా వెళ్లిన రావు, 70 ఏళ్ల వయస్సులో పిట్స్బర్గ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేరారు. ఆయనకు 75 ఏళ్లున్నప్పుడు అమెరికా ప్రభుత్వం పౌరసత్వం ఇచ్చింది. 82 ఏళ్ల వయస్సులో రావు వైట్ హౌజ్ ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ మెడల్ ఫర్ సైన్స్ అవార్డు అందుకున్నారు. 102 ఏళ్ల వయస్సులో స్టాటిస్టిక్స్ నోబెల్ అందుకుంటున్నారు. సీఆర్ రావు 1920 సెప్టెంబరు 10న బళ్లారి జిల్లా హడగళిలోని తెలుగు కుటుంబంలో పుట్టారు. ఏపీలోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో చదువుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, కోల్కతా యూనివర్సిటీలో ఎంఏ స్టాటిస్టిక్స్ చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్ కాలేజీలో 1948లో పీహెచ్డీ పూర్తి చేశారు. (చదవండి: ‘మహా’ రాజకీయాల్లో మరో ట్విస్ట్.. అజిత్ను కలిసిన ఉద్ధవ్) ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్గా ఎదిగారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆయన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ బఫెలోలో రీసెర్చ్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. కలకత్తా మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన సీఆర్ రావు పరిశోధన పత్రానికిగాను ఈ అవార్డు దక్కింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ అవార్డును అందజేస్తారు. 2019లో అమెరికాకు చెందిన ప్రొఫెసర్ బ్రాడ్లీ ఎఫ్రాన్, 2021కి అమెరికాకు చెందిన ప్రొఫెసర్ Emerita Nan Laird లకు అందజేశారు. (చదవండి: భార్యాపిల్లల గుర్తుగా చేసిన పనికి.. రూ. 90 కోట్లు అదృష్టం వరించింది!) 2023కి సీఆర్ రావుకు అవార్డు అందనుంది. భారత స్టాటిస్టిక్స్ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్తో సత్కరించింది. -
ఫాక్స్ కార్పొరేషన్ స్ట్రీమింగ్ సర్వీస్కు సీఈవోగా అంజలీ సూద్
ఫాక్స్ కార్పొరేషన్ ఉచిత యాడ్-సపోర్టెడ్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ట్యూబీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా భారతీయ-అమెరికన్ అంజలీ సూద్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 1 నుంచి కంపెనీ సీఈవోగా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. విమియో కంపెనీ సీఈవోగా ఉన్న అంజలీ సూద్, తొమ్మిదేళ్లు అక్కడ పనిచేశాక ఇటీవలే పదవి నుంచి వైదొలిగారు. ట్యూబీ ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫర్హాద్ మస్సౌదీ అనంతరం ఆమె ఆ కంపెనీగా సీఈవోగా నియమితులయ్యారు. విమియో కంటే ముందు ఆమె టైమ్ వార్నర్, అమెజాన్ కంపెనీల ఫైనాన్స్, మీడియా, ఈ-కామర్స్ విభాగాల్లో పనిచేశారు. సీఈవోగా అంజలి సూద్ నాయకత్వంలో విమియో ప్రపంచవ్యాప్తంగా వీడియో క్రియేటర్లు, ఇతర ప్రొఫెషనల్స్కు కేంద్రంగా మారింది. 300 మిలియన్లకు పైగా యూజర్లను సంపాదించుకోవడంతోపాటు గణనీయమైన ఆదాయాన్నీ ఆర్జించింది. అమెరికాలో ఇటీవల అత్యధికంగా వీక్షించిన ఫ్రీ యాడ్ సపోర్టెడ్ స్ట్రీమింగ్ సర్వీస్గా ట్యూబీ నిలిచింది. నీల్సన్ ప్రకారం.. ట్యూబీకి 64 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఈవోగా అంజలీ సూద్ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ట్యూబీని ఫాక్స్ కార్పొరేషన్ 2020లో 440 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. మొత్తం టీవీ వీక్షణ నిమిషాల్లో ప్లూటోటీవీ, పీకాక్, హెచ్బీవో మ్యాక్స్లను కూడా ట్యూబీ అధిగమించింది. -
వారి నిర్లక్ష్యంతోనే నా భార్య మృతి.. రిసార్ట్, బోట్ కెప్టెన్పై ఎన్ఆర్ఐ దావా
తన భార్య మరణానికి వారి నిర్లక్ష్యమే కారణమంటూ ఓ రిసార్ట్, బోట్ కెప్టెన్పై ఒక భారతీయ-అమెరికన్ దావా వేశారు. ఫ్లోరిడాలో గత ఏడాది పారాసెయిలింగ్ చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో భారత్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీనివాసరావు అలపర్తి భార్య మృతి చెందారు. ఆయన కొడుకు, మేనల్లుడు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ ప్రమాదానికి వాటర్ ఫ్రంట్ రిసార్ట్, బోట్ కెప్టెన్ల నిర్లక్ష్యమే కారణమంటూ తాజాగా ఆయన వారిపై దావా వేశారు. శ్రీనివాసరావు అలపర్తి మన్రో కౌంటీ సర్క్యూట్ కోర్టులో బోట్ కెప్టెన్, అతని సహాయకుడు, రిసార్ట్ యాజమాన్యంపై 68 పేజీల వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. 2022 మే 30న శ్రీనివాసరావు, ఆయన భార్య సుప్రజ (33), వారి పదేళ్ల కొడుకు, తొమ్మిదేళ్ల మేనల్లుడు ఫ్లోరిడా కీస్లో పారాసైలింగ్కు వెళ్లారు. ఈ సమయంలో వాతావరణం ప్రతికూలంగా మారింది. కొన్ని నిమిషాల తర్వాత బోట్ కెప్టెన్ డేనియల్ కౌచ్ పారాసైల్ను బోట్కి అనుసంధానించే టౌలైన్ను కత్తిరించాడు. దీంతో సుప్రజ, ఇద్దరు పిల్లలు రెండు మైళ్ల దూరం గాలిలో తేలుతూ కాంక్రీట్ వంతెనకు తగిలారు. ఈ ప్రమాదంలో సుప్రజ మృతి చెందగా పిల్లలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. బోట్ సిబ్బంది వాతావరణ సూచనను గమనించి, యూఎస్ కోస్ట్ గార్డ్కు సమాచారం అందించడంలో విఫలమయ్యారని శ్రీనివాసరావు తన దావాలో ఆరోపించారు. అంతేకాకుండా సిబ్బంది తమకు లైఫ్ జాకెట్లు వంటి తగిన భద్రతా పరికరాలను అందించలేదని, నియంత్రణ కోల్పోయిన తర్వాత పారాసైల్ను సరిగ్గా కిందికి తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
కొడుకును కాపాడబోయి...
న్యూయార్క్: భారతీయ అమెరికన్ ఒకరు తన కొడుకును కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియాలోని శాంటాక్రజ్ కౌంటీలో వారం క్రితం ఈ విషాదం చోటుచేసుకుంది. జొన్నలగడ్డ శ్రీనివాసమూర్తి కుటుంబంతో పాంథెర్ బీచ్కు వెళ్లారు. అలల్లో కొట్టుకుపోతున్న 12 ఏళ్ల కొడుకును కాపాడేందుకు నీళ్లలోకి దిగారు. మరొకరి సాయంతో కొడుకును ఒడ్డుకు తీసుకొచ్చారు. అంతలో బలమైన అల మూర్తిని లోపలికి లాక్కెళ్లింది. ఈత రాని ఆయన లోతైన నీళ్లలో మునిగిపోయారు. తీవ్రంగా గాయపడిన మూర్తిని సహాయక సిబ్బంది బయటికి తీసి హెలికాప్టర్లో హాస్పిటల్కు తరలించినా ప్రాణాలు దక్కలేదు. -
బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయురాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇండియన్ అమెరికన్కు మరోసారి తన ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ విధానాల్లో నిపుణురాలైన భారత సంతతికి చెందిన నీరా టాండన్ను తన దగ్గర దేశీయ విధాన సలహాదారుగా నియమించారు. బైడెన్ ప్రభుత్వ విధానాలు రచించడం, వాటిని అమలు పరిచే బాధ్యతల్ని ఆమెకు అప్పగించారు. శ్వేత సౌధం విధాన మండలిలో ఒక ఆసియన్ అమెరికన్కు చోటు లభించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటి సారి. ‘‘ఆర్థిక విధానాల దగ్గర్నుంచి జాతి సమానత్వం వరకు ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైన ఆరోగ్యం, విద్య, వలస విధానాలను రూపొందించడం, వాటిని పక్కాగా అమలు జరిగేలా చూడడానికి టాండన్ను డొమెస్టిక్ పాలసీ అడ్వయిజర్గా నియమిస్తున్నాను’’ అని బైడెన్ ప్రకటించారు. టాండన్ ప్రస్తుతం అధ్యక్షుడికి సీనియర్ సలహాదారుగా ఉన్నారు. గతంలో ఒబామా, క్లింటన్ ప్రభుత్వాల్లో కూడా ఆమె పని చేశారు. -
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షునిగా అజయ్ బంగా
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ సంస్థలకు సారథులుగా వెలుగొందుతున్న భారతీయుల జాబితాలో ప్రముఖ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగా నిలిచారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షునిగా ఎంపికయ్యారు! ఆయన నియామకాన్ని ఖరారుచేస్తున్నట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు బుధవారం ప్రకటించారు. జూన్ రెండో తేదీ నుంచి ఐదేళ్లపాటు అధ్యక్షునిగా బంగా సేవలందిస్తారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఒక భారతీయ అమెరికన్ అధ్యక్షుడు ప్రపంచ బ్యాంక్ పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి. 63 ఏళ్ల బంగాను ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ పదవికి నామినేట్చేశారు. బంగా జనరల్ అట్లాంటిక్ సంస్థ ఉపాధ్యక్షునిగా, మాస్టర్కార్డ్ సీఈవోగా చేశారు. కేంద్రం 2016లో ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.