-
జీడీపీ యూటర్న్!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ కోలుకుంది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో రెండు త్రైమాసికాల వరుస క్షీణ రేటుతో ‘సాంకేతికంగా’ మాంద్యంలోకి జారిపోయిన భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మెజారిటీ విశ్లేషణలకు అనుగుణంగానే అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి బాట పట్టింది. ఆర్థి క సంవత్సరం మూడవ త్రైమాసికంలో 0.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. తాజా సవరిత గణాంకాల ప్రకారం మొదటి త్రైమాసికం ఏప్రిల్–జూన్ మధ్య జీడీపీ భారీగా 24.4 శాతం క్షీణత నమోదు చేసింది. రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్లో క్షీణత 7.3 శాతానికి పరిమితమైంది (నవంబర్ 20నాటి తొలి అంచనాల ప్రకారం ఈ క్షీణ రేట్లు వరుసగా 23.9 శాతం, 7.5 శాతంగా ఉన్నాయి). రెండు త్రైమాసికాలు వరుస క్షీణతను మాంద్యంగా పరిగణిస్తారు. మూడవ త్రైమాసికంలో వృద్ధి నమోదుకావడంతో భారత్ ఎకానమీ మాంద్యం కోరల నుంచి బయటపడినట్లయ్యింది. ప్రధానంగా వ్యవసాయం, సేవలు, నిర్మాణ రంగాలు ఇందుకు దోహదం చేశాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 3.3 శాతం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► మొత్తం జీడీపీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం వృద్ధి రేటు డిసెంబర్ త్రైమాసికంలో 3.9 శాతంగా ఉంది. ► తయారీ రంగం స్వల్పంగా 1.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► నిర్మాణ రంగం భారీగా 6.2% వృద్ధి చెందింది. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల విభాగంలో భారీగా 7.3 శాతం వృద్ధి నమోదయ్యింది. ► మూలధన పట్టుబడులకు సంబంధించిన ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ విభాగంలో 2.6 శాతం వృద్ధి నమోదయ్యింది. ► వాణిజ్య, హోటెల్ పరిశ్రమ కరోనా మహమ్మారి సవాళ్ల నుంచి బయటకు రాలేదు. మూడవ త్రైమాసికంలోనూ క్షీణత 7.7%గా నమోదైంది. ► ప్రభుత్వ వినియోగ వ్యయాలు 1.1%క్షీణిస్తే, ప్రైవేటు వినియోగ వ్యయం 2.4% తగ్గింది. 0.4 శాతం ఎలా అంటే... మూడవ త్రైమాసికంలో మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ రూ.36.22 లక్షల కోట్లు. 2019–20 ఇదే కాలంలో ఈ విలువ రూ.36.08 లక్షల కోట్లు. వెరసి తాజా సమీక్షా త్రైమాసికంలో వృద్ధి 0.4 శాతంగా ఉన్నట్లు లెక్క. 2020–21లో క్షీణత అంచనా 8 శాతం ! నేషనల్ అకౌంట్స్ రెండవ ముందస్తు అంచనాల ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎకానమీ క్షీణ రేటు 8 శాతంగా ఉంటుందని ఎన్ఎస్ఓ పేర్కొంది. తొలి అంచనాల ప్రకారం ఈ రేటు 7.7 శాతంగా ఉండడం గమనార్హం. 2019–20లో 4 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. తాజా అంచనాల ప్రకారం 2019–20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ 145.69 లక్షల కోట్లు. అయితే 2020–21లో ఈ విలువ 134.09 లక్షల కోట్లకు పడిపోయే వీలుంది. అంటే క్షీణత 8 శాతం ఉంటుందన్నమాట. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఎకానమీ 7.5 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని అంచనావేసిన ఆర్బీఐ, మూడవ త్రైమాసికంలో 0.1%, నాల్గవ త్రైమాసికంలో 0.7% వృద్ధి రేట్లు నమోదవుతాయని సమీక్షలో విశ్లేషించింది. తలసరి ఆదాయం 9.1% డౌన్! తాజా గణాంకాల ప్రకారం 2011–12 ధరలను ప్రాతిపదికగా (ద్రవ్యోల్బణం సర్దుబాటుతో) తీసుకుంటే, 2020–21లో తలసరి ఆదాయం రూ.85,929 ఉంటుందని అంచనా. 2019–20లో ఈ విలువ రూ.94,566. అంటే తలసరి ఆదాయంలో 9.1 శాతం క్షీణత నమోదయ్యే అవకాశం ఉంది. కాగా ప్రస్తుత ధరల ప్రాతిపదిగా చూస్తే, తలసరి ఆదాయం 4.8 శాతం క్షీణతతో రూ.1,34,186 నుంచి రూ.1,27,768కి పడిపోతుంది. -
ఈ ఏడాది భారత జీడీపీ.. మైనస్ 15%
ముంబై: అటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇటు భారత్ ఎకానమీపై కరోనా తీవ్ర ప్రతికూల ప్రభావం తప్పదని పలు అంతర్జాతీయ దిగ్గజ రేటింగ్, ఆర్థిక విశ్లేషణా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఆయా సంస్థల అంచనాల ప్రకారం భారత్ ఆర్థిక వ్యవస్థ 2020–21లో మైనస్ 10 శాతం క్షీణత నుంచి మైనస్ 15 శాతం క్షీణత శ్రేణిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు క్రితం క్షీణ అంచనాలను మరింత పెంచడం ఆందోళన కలిగిస్తున్న అంశం. కాగా 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ కొంత పుంజుకునే వీలుందన్న అంచనాలనూ కొన్ని సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇందుకు బేస్ ఎఫెక్ట్ ప్రధాన కారణంగా ఉండడం గమనార్హం. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ 2020లో మైనస్ 4.4 శాతం క్షీణత నమోదుచేసుకుంటుందని అంచనా వేసిన రేటింగ్ దిగ్గజ సంస్థ ఫిచ్, చైనా మాత్రం 2.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని విశ్లేషిస్తుండడం గమనార్హం. ముఖ్యాంశాలు ఇవీ... 14.8 శాతం క్షీణత... అమెరికా బ్రోకరేజ్ సంస్థ గోల్డ్మన్ శాక్స్: భారత్ ఎకానమీ 2020–21 ఆర్థిక సంవత్సరంలో 14.8% వరకూ క్షీణత నమోదు చేసుకుంటుంది. తీవ్ర ప్రతికూలత నేపథ్యంలో క్రితం అంచనా మైనస్ 11.8 శాతాన్ని మరింత పెంచాల్సి వస్తోంది. ప్రపంచ దిగ్గజ ఆర్థిక వ్యవస్థల్లో భారీగా నష్టపోతోంది భారతదేశమే. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మొదటి త్రైమాసికంలో 23.9% క్షీణిస్తే, సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 13.7%గా ఉండవచ్చు. డిసెంబర్ త్రైమాసికంలో 9.8%, చివరి త్రైమాసికంలో 6.7% క్షీణరేట్లు నమోదయ్యే వీలుంది. ఒక్క 2020 క్యాలెండర్ ఇయర్లో క్షీణత 11.1%గా ఉంటే, 2020–21లో మైనస్ 14.8%గా ఉంటుంది. అయితే 2021–22లో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే వీలుంది. బేస్ రేటు (2020–21లో ఆర్థిక వ్యవస్థ పరిస్థితి) క్షీణతలో ఉండడం వల్ల 2021–22లో వృద్ధి రేటు 15.7% ఉండొచ్చు. కఠినమైన లాక్డౌన్ కారణం.. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం... ఫిచ్: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మైనస్ 5 శాతమే క్షీణిస్తుందని తొలి అంచనా. అయితే ఈ అంచనాను మరింతగా 10.5 శాతానికి పెంచుతున్నాం. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికన్నా ఎక్కువగా మైనస్ 23.9 శాతంగా ఉండడం గమనార్హం. ప్రపంచంలోనే ఏ దేశం అనుసరించని రీతిలో భారత్ లాక్డౌన్ను పాటించింది. దీనితో పెట్టుబడులు, వినియోగం విభాగాలు తీవ్ర ప్రతికూలతలు చూశాయి. భారత్ ఆర్థిక వ్యవస్థ ఊహించి నదానికన్నా ఎక్కువగా పతనం అవుతున్న నేపథ్యంలో వర్ధ మాన దేశాల (చైనా కాకుండా) మార్కెట్ల క్షీణ అంచనాలను కూడా క్రితం మైనస్ 4.7% క్షీణత నుంచి మైనస్ 5.7%కి సవరిస్తున్నాం. ఇక ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, 2020లో మైనస్ 4.4 శాతం క్షీణత నమోదయ్యే అవకాశం ఉంది. అయితే క్రితం అంచనా మైసన్ 4.6 శాతం క్షీణత కన్నా ఇది తక్కువ. కాగా చైనా మాత్రం 2.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని భావిస్తున్నాం. ఇంతక్రితం వృద్ధి అంచనా 1.2%. ఇక అమెరికా క్షీణ రేటు అంచనాను మైనస్ 5.6% నుంచి మైనస్ 4.6 శాతానికి సవరిస్తున్నాం. తిరోగమనంలోనే...! ఎస్బీఐ ఎకోర్యాప్ పరిశోధనా నివేదిక: భారత 2020–21 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో క్షీణ రేటు అంచనాలకు మైనస్ 6.8 శాతం నుంచి మైనస్ 10.9 శాతానికి పెంచుతున్నాం. మొదటి త్రైమాసిక జీడీపీ భారీగా మైనస్ 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకోగా, రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్) ఆర్థిక వ్యవస్థ మైనస్ 12 శాతం నుంచి మైనస్ 15 శాతం వరకూ క్షీణిస్తుంది. మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్) ఈ పరిమాణం మైనస్ 5%–మైనస్ 10% వరకూ ఉంటుంది. నాల్గవ త్రైమాసికం (జనవరి–మార్చి)లో ఈ క్షీణ రేటు మైనస్ 2% నుంచి మైనస్ 5 శాతం వరకూ ఉంటుంది. అయితే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల విషయంలో రుణ వృద్ధి రేటు కనిపిస్తుండడం, కొన్ని కీలక రంగాల్లో క్షీణరేట్లు తగ్గుతుండడం ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న సానుకూల అంశాలు. నష్టం రూ.18.44 లక్షల కోట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్: కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు అంచనాలను క్రితం మైనస్ 5.3% నుంచి మైనస్ 11.8%కి పెంచాల్సి వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏ త్రైమాసికంలోనూ వృద్ధి నమోదయ్యే పరిస్థితి లేదు. ఆర్థిక వ్యవస్థకు 18.44 లక్షల కోట్ల నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బేస్ ఎఫెక్ట్ వల్ల 2021–22లో భారత్ ఆర్థిక వ్యవస్థ 9.9 శాతం వృద్ధి బాటకు మళ్లే వీలుంది. లక్షలాది మంది ఉపాధి అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉంది. 1951 నుంచీ జీడీపీ గణాంకాలు అందుబాటులో ఉండగా, 1958, 1966, 1967, 1973, 1980 ఆర్థిక సంవత్సరాల్లో క్షీణ రేట్లు నమోదయ్యాయి. 1980లో మైనస్ 5.2 శాతం క్షీణత చవిచూసింది. -
భారత్ ఎకానమీ మరింత పతనం
ముంబై: భారత 2020–21 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో క్షీణ రేటు అంచనాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధనా నివేదిక– ఎకోర్యాప్ మరింత పెంచింది. ఇప్పటి వరకూ ఈ అంచనా మైనస్ 6.8 శాతం అయితే ఇది మైనస్ 10.9 శాతం కింది వరకూ పోయే వీలుందని తాజా అంచనాల్లో పేర్కొంది. సోమవారం విడుదలైన గణాంకాల ప్రకారం, మొదటి త్రైమాసిక జీడీపీ భారీగా మైనస్ 23.9 శాతం క్షీణతను నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. దీనితో తన వార్షిక ఎకానమీ అంచనాలకు సైతం మైనస్ 6.8 శాతం నుంచి తాజాగా మైనస్ 10.9 శాతానికి పెంచడం గమనార్హం. నివేదికలోని కొన్ని అంచనాలు, ముఖ్యాంశాలు చూస్తే.. (బంగారం- వెండి.. మూడో రోజూ దూకుడు) ► రెండవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్) ఆర్థిక వ్యవస్థ మైనస్ 12 శాతం నుంచి మైనస్ 15 శాతం వరకూ క్షీణిస్తుంది. ► మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్) ఈ పరిమాణం మైనస్ 5 శాతం నుంచి మైనస్ 10 శాతం వరకూ ఉంటుంది. ► నాల్గవ త్రైమాసికం (జనవరి–మార్చి)లో ఈ క్షీణ రేటు మైనస్ 2 శాతం నుంచి మైనస్ 5 శాతం వరకూ ఉంటుంది. ► మొదటి త్రైమాసికంలో భారీ క్షీణతకు కరోనా వైరస్ కారణమైనా, క్షీణత మరీ ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు. ► ప్రైవేటు వినియోగ వ్యయం (పీఎఫ్సీఈ) వృద్ధి రేటు భారీగా పడిపోయింది. విద్య, ఆరోగ్య రంగాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ► పెట్టుబడుల డిమాండ్లో రికవరీ కనిపించడం లేదు. ఈ విభాగంలో క్షీణత 14 శాతం ఉంటుందని భావిస్తున్నాం. ► నిర్మాణం, ట్రేడ్ అండ్ హోటెల్స్, విమానయాన రంగాల పునరుద్ధరణ జరగాల్సి ఉంది. ► రవాణా సేవల పునరుద్ధరణ, మౌలికరంగంలో వ్యయాలు పెరగాల్సి ఉంది. ఊరటకలిగిస్తున్న అంశాలు రెండు... తీవ్ర ప్రతికూలతలోనూ రెండు సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఒక అంశం చూస్తే– జూలైకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అలాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి రుణ వృద్ధి కనబడింది. వ్యక్తిగత రుణాల విషయంలోనూ ఇదే ధోరణి ఉంది. ఇక రెండవ సానుకూల విషయానికి వస్తే, మొదటి త్రైమాసికంలో కేంద్రం ప్రకటించిన కొన్ని కీలక ప్రాజెక్టులకు ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. రహదారులు, విద్యుత్తో పాటు ఆసుపత్రుల వంటి కమ్యూనిటీ సేవల ప్రాజెక్టులూ ఇందులో ఉన్నాయి. (మున్ముందు అన్నీ మంచి రోజులే!) -
అధ్వాన్న దిశగా మన ‘ఆర్థికం’
ప్రస్తుతానికి ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడ్డం పెద్ద గీత ముందు చిన్నగీతను చూసినట్టు ఉంటుంది. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి ఇంకా మిగిలుందనే విశ్వాసాలను గౌరవిస్తూ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యాంశాలు చూద్దాం. ఆకస్మిక లేదా తక్షణ ఆర్థిక సమస్యలను ఎదుర్కోడానికి ఆర్బీఐ వద్ద సరయిన క్యాపిటల్ ఉందా లేదా అన్నది ప్రాథమికంగా చూడాలి. అభివృద్ధి చెందిన దేశాలలో సెంట్రల్ బ్యాంకులు 13–14 శాతం ఆస్తులు రిజర్వ్గా ఉంచుకుంటున్నాయి. మనం కేవలం 7 శాతం మించకుండా పెట్టుకున్న రిజర్వ్ ఇది. దేశంలో జరిగే ద్రవ్య లావాదేవీలకు కావాల్సిన వెసులుబాటు ఇప్పుడు ఆర్బీఐకి లోపించింది. కశ్మీరులో 370వ ఆర్టికల్ రద్దు జరిగాక – మన దేశభద్రత విషయంలో విదేశీ మదుపుదార్లు అప్రమత్తంగా ఉంటున్నారు. మన దేశ స్థితి ’ప్రస్తుతానికి బాగలేదు’ నుంచి ’అధ్వానం’ దిశగా వెళుతోందనేది సుస్పష్టం. చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి అక్షరాలా రూ. 1.76 లక్షల కోట్లను డివిడెండ్ పేరుతో బదిలీ చేయాలని నిర్ణయించింది. ఇది భారతీయ ఆర్థిక శాస్త్రంలోనే చారిత్రక సంఘటన. 1990లలో లిబరలైజేషన్ జరగడానికి ముందున్న సంకట సమయంలో కూడా ఈ చర్య తీసుకోలేదు. ఇలా చేయడం తప్పాఒప్పా అని చూడ్డం ఒక కోణం అయితే, ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందా అనేది మరో కోణం. ప్రస్తుతానికి ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి గురించి మాట్లాడ్డం పెద్ద గీత ముందు చిన్నగీతను చూసినట్టు ఉంటుంది. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి ఇంకా మిగిలుందనే విశ్వాసాలను గౌర విస్తూ ముందు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యాంశాలు చూద్దాం. ఇది పూర్వపు గవర్నర్ బిమల్ జలాన్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ ప్రతిపాదించిన సూత్రంప్రకారం ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్ వర్క్లో భాగంగా ఇలా చేయడం జరిగింది. ఆకస్మిక లేదా తక్షణ ఆర్థిక సమస్యలను ఎదుర్కోడానికి ఆర్బీఐ వద్ద సరి అయిన క్యాపిటల్ ఉందా లేదా అన్నది ప్రాథమికంగా చూడాలి. మన రూపాయి విలువ అనుకోని విధంగా క్షీణించినా లేదా పెరిగినా, మన దగ్గర తాత్కాలిక లిక్విడిటీ సమస్యలు ఏవన్నా వచ్చినా, బాండ్ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం అవసరం. అలాంటి వాటి కోసం ఆర్బీఐ కొంత డబ్బు వెనకేసుకుని ఉంటుంది. ఇది కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలలో భాగంగా కొంచెం కొంచెం రిజర్వుగా పెట్టుకుంటూ వచ్చింది. అందులో డివిడెండ్ రూపంలో ప్రభు త్వానికి ప్రతి సంవత్సరం ఏభై, అరవై వేల కోట్లు ఇచ్చుకోగా మిగిలించుకుంటూ వచ్చిన క్యాపిటల్ అది. అభివృద్ధి చెందిన దేశాలలో సెంట్రల్ బ్యాంకులు 13–14 శాతం ఆస్తులు రిజర్వ్గా ఉంచుకుంటున్నాయి. మనం కేవలం 7 శాతం మించకుండా పెట్టుకున్న రిజర్వ్ ఇది. ఇప్పటికి సుమారు రూ. 2.4 లక్షల కోట్ల ఆపత్కాల నిధి ఉంటే అందులో నుండి రూ. 1.23 లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా నిశితంగా ఈ ‘వెసులుబాటు భావాన్ని’ అర్థం చేసుకోవాలంటే ‘తలసరి’ లెక్కన చూడాలి. ఆర్థిక సమస్య తీవ్రత అంచనా దొరకదు. మనకుండే ఆస్తులను మనం ఎంతమందిమి పంచుకుంటున్నాం అన్నది ఒక ఆర్థిక శాస్త్రవేత్తకుండాల్సిన సెన్సిటివిటీ. ఒక వ్యక్తికి ఎంత సంపాదించే సామర్థ్యం ఉంది, అందులో సగటున మనం ఎంత రిజర్వ్గా వాడుకుంటున్నాం అన్నది ముఖ్యం. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడ్డం అంటే వ్యక్తుల సముదాయం, సంస్థల సముదాయం కష్టాల్లో పడ్డట్టు. వ్యక్తిగత స్థాయిలో కాకుండా ఒక సమూహంగా మనం కేంద్రస్థాయిలో కొంత రిజర్వ్ ఏర్పాటు చేసుకుంటాము. ఆ కోణంలో చూస్తే – మన రిజర్వ్ శాతం అభివృద్ధి చెందిన దేశాల రిజర్వ్ శాతంతో పోలిస్తే కనీసం ఐదోవంతు కూడా ఉండదు. ఇలా అత్యవసర నిధి ప్రపంచంలో అతి తక్కువగా ఉన్న దేశాలలో మనదొకటి. అంత తక్కువలో ఉన్నది ప్రభుత్వానికి ఇచ్చేసి వాడుకోమంటున్నాం. దానివలన భవిష్యత్తులో ఏదైనా అనుకోని విపత్తు వస్తే ఆర్బీఐ తట్టుకునే సామర్థ్యం కోల్పోతుంది. మన జీడీపీ సుమారు 190 లక్షల కోట్ల రూపాయలు. మన సేవింగ్స్ రేటు అతి తక్కువ స్థాయిలో ఉంది. 2008లో 37 శాతంగా ఉన్న ఈ సేవింగ్స్ రేటు ఇప్పుడు 30 శాతానికి పడిపోయింది. అంటే వ్యక్తిలేదా సంస్థ స్థాయిలో మనకుండే వెసులుబాటులో నాలుగో వంతు ఇప్పటికే తగ్గిపోయింది. మన దేశంలో జరిగే ద్రవ్య లావాదేవీలకు కావాల్సిన వెసులుబాటు ఇప్పుడు ఆర్బీఐకి లోపించింది. అంటే – రేపు చైనా, అమెరికా వ్యాపార ఘర్షణ వలన రూపాయి దెబ్బతిన్నా, మన బాండ్ మార్కెట్లో వడ్డీరేట్లు అస్తవ్యస్తతకు గురైన సందర్భాలను ఎదుర్కోవడంలో ఆర్బీఐ శక్తి సామర్థ్యాలు బాగా తగ్గుముఖం పట్టినట్టే. ఇంతకుముందులా నమ్మకంగా వేలకోట్లు మార్కెట్లో పెట్టేసి అడ్డుపడి సమతూకంగా వ్యవహరించే స్థితి ఇక ఆర్బీఐకి లేదు. ఇది వాస్తవం. సింపుల్గా చెప్పాలంటే మన ఆర్థిక వ్యవస్థను దేహంగా భావిస్తే, మనలో కొవ్వు రూపంలో నిలువ ఉన్న సొమ్ము ఈ ఆర్బీఐ రిజర్వ్. ఇది కాస్తా సగానికి పైగా కరిగిపోయింది. మన శక్తి లోపించే కొద్దీ కొవ్వు కరిగిపోతే ఇక ఉన్న కండలు కరిగించాల్సిన పరిస్థితి వస్తుంది అని సాధారణ పరిభాషలో చెప్పుకోవచ్చు. ఉదాహరణకు కశ్మీరు విషయంలో 370 ఆర్టికల్ రద్దు జరిగాక – మన దేశభద్రత విషయంలో విదేశీ మదుపుదార్లు అప్రమత్తంగా ఉంటున్నారు. ఒక్క జూలైలోనే విదేశీ వ్యవస్థాగత మదుపుదార్లు సుమారు రూ. 8,000 కోట్లను దేశంనుంచి ఉపసంహరించారు. మనదేశంలో ఉండే రాజకీయ పరిస్థితుల వలన, అంతర్జాతీయంగా అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ఘర్షణ వలన ఆర్థిక వ్యవస్థ ఏ దిశగా వెళుతుందో ఇతమిద్దంగా చెప్పడం కష్టం. ఫైనాన్స్ దిగ్గజం ఐఎల్ఎఫ్ఎస్ ఊహించని విధంగా కూలిపోవడం మన ఆర్థిక వ్యవస్థకు ఒక షాక్. అలాగే దీవాన్ లాంటి పెద్ద హౌసింగ్ సంస్థలు ఇకపై లోన్లు ఇవ్వలేని స్థితికి వచ్చి, డీఫాల్ట్ చేస్తున్నపరిస్థితి ఊహించనిది. కేవలం గత సంవత్సరంలోనే బ్యాంకింగ్ రంగంలో బయటపడిన మోసం విలువ రూ. 70,000 కోట్లు. ఇవి మనం ముందే ఊహించి ప్లాన్ చేసుకున్న పరిణామాలు కావు. ఇవన్నీ ఆర్థికవ్యవస్థలో కరిగిపోతున్న మన ఆస్తి విలువలు. ఒక్క ఐఎల్ఎఫ్ఎస్ కరిగిపోవడంతో రమారమి లక్షకోట్ల ప్రాజెక్టులు నిధులు పొందే సామర్థ్యం మనదగ్గర క్షీణించింది. ఈవిధంగా మనం ప్రతి బ్యాంకులో ప్రస్తుతం ఉన్న సంస్కృతి చూస్తూ పోతే కొన్నిలక్షల కోట్ల ప్రాజెక్టులకు నిధులు అందచేయగలిగే సామర్థ్యం ఇప్పటికే కోల్పోయాం. ఈ పరిస్థితి అంతా గమనిస్తే– మన ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్ళడానికి కావాల్సింది మన దగ్గర ఎన్నడూలేని విధంగా పడిపోతున్న గ్రామీణ వినియోగ సామర్థ్యం పెరగడం. అధిక జనాభా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. స్వేచ్ఛగా ఖర్చు పెట్టడం కూడా పట్టణ స్థాయిలో బాగా దెబ్బతిన్నది. వీటి కోసం మనం చిన్నతరహా, మధ్యతరహా సంస్థలను ప్రోత్సహించాల్సి ఉంది. మొండి బకాయిల బూచి చూపించి మనం అప్పులు ఇవ్వడం ఆపేస్తే ఇక ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. నిజానికి ఉద్దేశపూర్వక ఎగవేతదారులైన పెద్ద సంస్థల వలన జరిగినవే ఎక్కువ శాతం. మొత్తం లోన్లలో ఉద్దేశపూర్వక ఎగవేతదారుల శాతం 10 కంటే తక్కువ ఉండొచ్చు. వాస్తవానికి అది ఎక్కువే. అయితే – నూరుశాతం అప్పు తీసుకున్న వాళ్ళు ఎగవేయడానికి తీసుకుంటారనే భావంతో పోలిస్తే మాత్రం తక్కువే. ఈ చిన్న, మధ్యతరహా పరిశ్రమలకి అందవలసిన అప్పుల కోసం ఒక రిస్క్ కుషన్ ఏర్పాటు చేసుకోవలసి ఉంది. పెద్ద బ్యాంకులను విలీనం చేసే ఆలోచన చేసిన ప్రభుత్వం ఈ రూ. 1.76 లక్షల కోట్లలో రూ. 70,000 కోట్లు బ్యాంకులకు ఇచ్చి ఇదెలా సాధించగలదో మనకు ఇప్పటికీ తెలీదు. మిగతా డబ్బులు ప్రభుత్వం ఈ సంవత్సరం తగ్గిన పన్నుల చెల్లింపులు పూరించడానికి వాడుతుందని తెలిసింది. బదిలీ అయిన ఈ మొత్తం డబ్బును ప్రభుత్వం ఎలా వినియోగం చేస్తుందనేది కీలకమైనప్పుడు, ఇది కేవలం ద్రవ్యలోటుకు వాడుకోడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనేది నిరాశాజనకమైన విషయం. ప్రాజెక్టులకు నిధులు ఆగిపోయిన ఈ పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులు పెరిగి, సామాన్య మానవుడి ఆదాయ స్థాయి పెంచాల్సిన దిశగా ఈ డబ్బు ఉపయోగపడదు అనేది విదితం. మన దేశ స్థితి ‘ప్రస్తుతానికి బాలేదు’ నుంచి ‘అధ్వానం’ దిశగా వెళుతోందనేది సుస్పష్టం. మన ఆర్బీఐ కష్టమొస్తే కోలుకునే శక్తి ఇంతకు ముందులా ఉండబోదు. సామాన్యుడికి అందని ఈ సూక్ష్మ విషయాలు ఇకపై తప్పనిసరిగా వ్యక్తిగత క్షేమం దృష్ట్యా గమనంలో ఉంచుకోవాల్సి ఉంది. ప్రముఖ ఆర్థికవేత్త అన్నట్టు ఆర్థిక మందగమనం ఉన్నప్పుడు పెంపుడు కుక్క కూడా బిస్కెట్లు దొరికే పరిస్థితి ఉందా లేదా అని ఆలోచిస్తుందట. ప్రభుత్వం ఈ డబ్బుతో మేజిక్ చేసే పరిస్థితిలో లేదు. అందుకు పాలసీ స్థాయిలో నిర్ణయాలు అవసరం. విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులపై ట్యాక్స్ తీసేయడం లాంటివి గొప్ప ఊపిరి పీల్చుకునే చర్యలు కావు. ప్రభుత్వమే ముందుపడి అమలు చేసే ప్రాజెక్టులను త్వరితగతిన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వ సంస్థల నుండి రావల్సిన బకాయిలను వెంటనే వ్యవస్థలోకి తేవాల్సి ఉంది. ముఖ్యంగా – మన దేశం కాంగ్రెస్ పాలన నుంచి ఇప్పటిదాకా కూడా ‘పాలసీ బాటిల్ నెక్స్’తో సతమతమౌతూనే ఉంది. ఇవేవీ మనం పట్టించుకోకుండా ఇంకా ఎన్నాళ్ళు ఇలా కొవ్వు కరిగించుకుంటాం? వ్యాసకర్త: పి. విక్టర్ విజయ్ కుమార్ ఇన్వెస్డ్మెంట్ బ్యాంకర్, భారీమౌలిక పరిశ్రమల చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఈ–మెయిల్ : pvvkumar@yahoo.co.uk -
విని‘యోగం’ మళ్లీ ఎప్పుడు?
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగానికి చోదక శక్తిగా నిలుస్తున్న వినియోగ రంగం ఈ ఏడాది గడ్డు పరిస్థితులను చవిచూస్తోంది. దేశీయ వినియోగం, ఉత్పాదకతపైనే ఎక్కువగా ఆధారపడిన మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వృద్ధి క్షీణతను చవిచూస్తోంది. భారీ మెజారిటీతో రెండోసారి కొలువు దీరిన ఎన్డీయే సర్కారు కుంగిన ఆర్థిక వ్యవస్థను పరుగెత్తించే చర్యలు చేపడుతుందన్న ఆకాంక్షలు బలంగా ఉండగా, బడ్జెట్ తర్వాత నిరాశ చెందాల్సి వచ్చింది. ముఖ్యంగా వ్యవస్థలో నిధుల లభ్యత పడిపోవడం, ఎన్బీఎఫ్సీ రంగం సంక్షోభం వినియోగాన్ని దెబ్బతీశాయన్న విశ్లేషణ వినిపిస్తోంది. తగ్గిన డిమాండ్... జూలై 5న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి చూస్తే నిఫ్టీ కన్జంప్షన్ ఇండెక్స్ 5.7 శాతం పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు చూసుకుంటే నిఫ్టీ కన్జంప్షన్ ఇండెక్స్ 9.4 శాతం నష్టపోగా, ఇదే కాలంలో నిఫ్టీ–50 3.8 శాతం మేర పెరిగింది. దేశ ఆర్థిక రంగ విస్తరణలో బ్యాంకులతోపాటు ఎన్బీఎఫ్సీ సంస్థలది కీలకపాత్రగా చెప్పుకోవాలి. ఎందుకంటే బ్యాంకింగ్ రంగం నుంచి లోటు ఉన్న రంగాలకు రుణ అవసరాలను ఎన్బీఎఫ్సీ విభాగమే తీరుస్తోంది. ఎన్బీఎఫ్సీ రంగం నిధుల కటకటతో ఆర్థిక రంగ విస్తరణ కూడా ఆగిపోయిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. వినియోగం తగ్గుదల అన్నది మరికొంత కాలం పాటు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 2019–20 ఆర్థిక సంవత్సరానికి 0.3 శాతం మేర తగ్గించి 7%గా పేర్కొనడం గమనార్హం. డిమాండ్ తగ్గడమే అంచనాలను తగ్గించడానికి కారణమని ఐఎంఎఫ్ తెలిపింది. మరికొంత కాలం పాటు... కొత్త ఉద్యోగాలు లేకపోవడం, నగదు లభ్యత తక్కువగా ఉండడం తదితర కారణాలతో డిమాండ్/వినియోగం మరికొంత కాలం బలహీనంగానే ఉంటుందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరగడం సానుకూల చర్య అని, అయితే గతంలో అధిక బేస్తోపాటు ప్రభుత్వ వ్యయాలు గణనీయంగా లేని అంశాలను వారు గుర్తు చేస్తున్నారు. కంపెనీల పరంగా చూస్తే... ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) 2019–20లో తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో గత ఏడు త్రైమాసికాల్లోనే తక్కువ విక్రయాలను నమోదు చేసింది. ఇక వినియోగంలో భాగమైన ఆటోమొబైల్ రంగం కూడా గడ్డు పరిస్థితులను చూస్తోంది. వాహన అమ్మకాలు గత కొన్ని నెలలుగా అంతకంతకూ తగ్గుతూ వస్తున్నాయి. ‘‘ప్రస్తుతం వినియోగ రంగంలో ఉన్న పరిస్థితిని చూస్తుంటే... రానున్న త్రైమాసికాల్లోనూ అమ్మకాల వృద్ధి పెద్ద సవాలుగానే కనిపిస్తోంది. కన్జ్యూమర్ స్టాపుల్స్, ఆటో, క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు (క్యూఎస్ఆర్) జ్యుయలరీ విభాగాలు ఇప్పటికే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుత మందగమనం కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించనుంది’’ అని ఈక్విరస్ సెక్యూరిటీస్ తన నివేదికలో పేర్కొంది. అప్రమత్తంగా ఉండాలి... సమీప కాలంలో ఆర్థిక వ్యవస్థ మరిన్ని సవాళ్లు ఎదుర్కోనున్న నేపథ్యంలో వినియోగ రంగ కంపెనీల ఫలితాల వృద్ధి పుంజుకోకవచ్చు. దీంతో స్టాక్స్ ధరలు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నా యని ఈ రంగం షేర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. దీర్ఘకాల దృష్టితోనే కొనుగోళ్లకు దిగాలని సూచిస్తున్నారు. ఈ విభాగంలో ఎంఅండ్ఎం, టీవీఎస్ మోటార్, మారుతి సుజుకీ, హీరో మోటోకార్ప్, గోద్రేజ్ కన్జ్యూమర్, కోల్గేట్ పామోలివ్, బ్రిటానియా, డీమార్ట్, యునైటెడ్ స్పిరిట్స్, హెచ్యూఎల్ షేర్లు నిఫ్టీ కన్జంప్షన్ సూచీలో ఈ ఏడాది ఇప్పటి వరకు ఎక్కువగా నష్టపోయిన షేర్లు. -
5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమా?!
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడం తన లక్ష్యమని రెండోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నరేంద్ర మోదీ గట్టిగా చెప్పారు. అదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రతిపాదించారు. 2024–2015 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ లక్ష్యాన్ని సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. అదెలా సాధ్యమని నేడు ఆర్థిక నిపుణులందరి ప్రశ్న. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ 2.8 ట్రిలియన్ (ట్రిలియన్ అంటే లక్ష కోట్లు) డాలర్లు ఉంది. దాన్ని ఐదు ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమంటే దాదాపు రెండింతలు చేయడం. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఇప్పటి ఉంచి జీడీపీ (దేశ జాతీయ స్థూల ఉత్పత్తి) రేటు ఐదేళ్లపాటు వరుసగా 8 శాతం నికరంగా ఉండాలని ఆర్థిక నిపుణులు ఇది వరకే తేల్చి చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వివాదాస్పద లెక్కల ప్రకారమే 2018–19 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ రేటు 6.8 శాతం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ కాలం నాటి లెక్కల ప్రకారం అది 5.7 శాతమే. పాత వివాదాన్ని పక్కన పెట్టి కొత్త లెక్కలే ప్రమాణంగా తీసుకున్నా 2019–20 సంవత్సరానికి జీడీపీ రేటు 7 శాతానికి చేరుకుంటుందని, ఆ తర్వాత మిగతా కాలానికి సరాసరి 7.6 శాతానికి చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారులు అంచనా వేశారు. ఎనిమిది శాతం జీడీపీ సాధించకుండా దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడం ఎలా సాధ్యం? గత నరేంద్ర మోదీ ప్రభుత్వంగానీ, అంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంగానీ లక్ష్యంగా పెట్టుకున్న జీడీపీ రేటును సాధించిన దాఖలాలు లేవు. మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడే రెండంకెల జీడీపీ రేటును సాధించి తీరుతామని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ అది సాధ్యం కాలేదు. ఈ రెండో పర్యాయమైన ఆయన రెండంకెల జీడీపీని సాధిస్తే ఐదు ట్రిలియన్లే కాదు, ఆరు ట్రిలియన్ డాలర్లకు దేశ ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్ల వచ్చు. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కీర్తి, ప్రతిష్టలను సాధించవచ్చు. ఆశించిన ఆర్థిక లక్ష్యాన్ని సాధించాలంటే అన్ని రంగాల్లో ఆర్థిక పెట్టుబడులను ప్రోత్సహించడమే ప్రధాన ఆయుధమని ఆర్థిక సర్వే సూచనలను శిరసా వహించనున్నట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. చిన్న, మధ్య పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక పురోభివృద్ధిని సాధించడంతోపాటు యువత ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంచవచ్చని నిర్మలా సీతారామన్ చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వాటిని ప్రోత్సహిస్తుందో ఆమె వివరించలేదు. ప్రైవేటు పెట్టుబడిదారులకు పన్ను రాయతీలు కల్పించడంతోపాటు విమాన సర్వీసుల్లో వారికి ప్రాధాన్యత కల్పించాలంటూ ఆర్థిక సర్వే చేసిన సూచనలను ఆమె పరిగణలోకి తీసుకుంటారేమో! ‘మేకిన్ ఇన్ ఇండియా’ కింద ప్రైవేటు పెట్టుబడులతో వెలసిన పలు స్టార్టప్ కంపెనీలు మూత పడుతున్న తరుణంలో పారిశ్రామిక పెట్టుబడులు వచ్చి పడడం కష్టమే. (చదవండి: వాహనదారులకు పెట్రో షాక్) -
భారత్ వృద్ధికి ఫిచ్ కోత
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థలో మళ్లీ మందగమన సంకేతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం ఫిచ్ తాజాగా దేశ జీడీపీ వృద్ధి అంచనాల్లో భారీగా కోత విధించటం దీనికి బలం చేకూరుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2018–19) సంబంధించి ముందుగా వెలువరించిన వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 7.2 శాతానికి కుదిస్తున్నట్లు ఫిచ్ పేర్కొంది. గురువారం విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక అంచనాల నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వృద్ధి రేటు 7.8 శాతంగా ఉండొచ్చంటూ ఈ ఏడాది సెప్టెంబర్లో ఫిచ్ పేర్కొంది. జూన్లో 7.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసి... సెప్టెంబర్లో దాన్ని పెంచటం గమనార్హం. అధిక భారం, రుణ లభ్యత తగ్గుమఖం పట్టడం వంటివి వృద్ధి అంచనాలను తగ్గించడానికి ప్రధాన కారణాలుగా రేటింగ్ దిగ్గజం తెలియజేసింది. 2017–18లో వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 8.2 శాతానికి ఎగబాకగా... తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం రెండో త్రైమాసికంలో 7.1 శాతానికి పడిపోయింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఈ ఏడాది వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. దీనికంటే తక్కువగానే ఫిచ్ అంచనాలుండటం గమనార్హం. ఇక 2019–20 ఏడాదికి వృద్ధి రేటు 7 శాతం, 2020–21లో 7.1 శాతంగా ఉండొచ్చని లెక్కగట్టింది. సెప్టెంబర్లో అంచనా వేసిన 7.3 శాతంతో పోలిస్తే వచ్చే రెండేళ్లకు కూడా కోత పడింది. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలివీ... ► ఈ ఏడాది క్యూ2 వృద్ధి రేటు భారీగా పడిపోవడం ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలతలకు నిదర్శనం. ► వినియోగం రేటు 8.6 శాతం నుంచి 7 శాతానికి బలహీనపడినప్పటికీ.. ఇంకా మెరుగ్గానే కనబడుతోంది. పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. 2016–17ద్వితీయార్థం నుంచీ పెరుగుతున్నాయి. ► దిగుమతుల అంతకంతకూ పెరిగిపోవడంతో వాణిజ్య లోటు మరింత ఎగబాకవచ్చు. ► వచ్చే ఏడాదిలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చే విధంగానే కేంద్ర ప్రభుత్వం ద్రవ్య విధానాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. ► 2019 చివరినాటికి డాలరుతో రూపాయి మారకం విలువ 75 స్థాయికి పడిపోవచ్చు(ప్రస్తుతం 71 స్థాయిలో కదలాడుతోంది). ► ప్రభుత్వం వ్యయాలను పెంచడం ద్వారా.. ప్రధానంగా మౌలిక సదుపాయాలకు భారీగా నిధులను వెచ్చిండం వల్ల జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి పడిపోకుండా అడ్డుకట్ట పడింది. మరోపక్క, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ► బ్యాంకింగ్ రంగం ఇంకా అధిక మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్యల్లోనే కొట్టుమిట్టాడుతోంది. మరోపక్క ఐఎల్అండ్ఎఫ్సీ డిఫాల్ట్ తర్వాత బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్బీఎఫ్సీ)లకు ద్రవ్య సరఫరా తగ్గి.. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ► రానున్న నెలల్లో ద్రవ్యోల్బణం కొద్దిగా పెరిగే అవ కాశాలున్నాయి. ఇటీవలి కాలంలో తగ్గిన ఆహారోత్పత్తుల ధరలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడం, రూపాయి పతనం కారణంగా దిగుమతుల భారం కావడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు. ► ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్లు పెరుగుతుండటం రూపాయి క్షీణతకు మరింత ఆజ్యం పోస్తాయి. దీనివల్ల కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా ఎగబాకవచ్చు. ప్రపంచ వృద్ధి అంచనాలు యథాతథం.. ఈ ఏడాది (2018) ప్రపంచ వృద్ధి అంచనాలను యథాతథంగా 3.3 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఫిచ్ పేర్కొంది. వచ్చే ఏడాది( 2019) అంచనాల్లోనూ (3.1%) మార్పులు చేయలేదు. మరోపక్క, చైనా వృద్ధి రేటు ఈ ఏడాది 6.6 శాతం, వచ్చే ఏడాది 6.1 శాతం చొప్పున ఉండొచ్చని అంచనా వేసింది. గత అంచనాలను కొనసాగించింది. ఇక ఒపెక్ దేశాలు క్రూడ్ ఉత్పత్తిలో కొంత కోతకు అంగీకరించే అవకాశం ఉందని... దీనివల్ల ప్రస్తుత స్థాయి నుంచి ముడిచమురు ధరలు కొంత పుంజుకోవచ్చని ఫిచ్ అభిప్రాయపడింది. ‘2018 ఏడాదికి సగటు క్రూడ్(బ్రెంట్) బ్యారెల్ ధర 72.5 డాలర్లుగా ఉండొచ్చు. వచ్చే ఏడాది అంచనా 65 డాలర్లలో మార్పులేదు. 2020 అంచనాలను మాత్రం 57.5 డాలర్ల నుంచి 62.5 డాలర్లకు పెంచుతున్నాం’అని ఫిచ్ తెలిపింది. కాగా, అక్టోబర్ ఆరంభంలో భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురు రేటు 85 డాలర్ల నుంచి నవంబర్ ఆఖరి నాటికి 60 డాలర్ల దిగువకు పడిపోయిన సంగతి తెలిసిందే. -
ప్రపంచంలో ఐదో స్థానం మనదే
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది బ్రిటన్ను వెనక్కి నెట్టేసి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. పెరుగుతున్న వినియోగం, బలమైన ఆర్థిక కార్యకలాపాలతో ఇది సాధ్యమవుతుందన్నారు. అంతేకాదు, వచ్చే 10–20 ఏళ్లలో ప్రపంచంలో మొదటి మూడు అగ్ర దేశాల్లో భారత్ చోటు సంపాదిస్తుందన్న ఆశాభావాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. ‘‘ఈ ఏడాది ఫ్రాన్స్ను అధిగమించాం. వచ్చే ఏడాది బ్రిటన్ను కూడా దాటిపోయే అవకాశం ఉంది. దాంతో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం’’ అని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కార్యాలయ భవన ప్రారంభోత్సవం సందర్భంగా జైట్లీ పేర్కొన్నారు. దేశ జీడీపీ 2017 చివరికి 2.597 ట్రిలియన్ డాలర్లుగా పరిగణించగా, అదే సమయానికి ఫ్రాన్స్ జీడీపీ 2.582 ట్రిలియన్ డాలర్ల వద్దే ఉండటంతో ఫ్రాన్స్ స్థానాన్ని మన దేశం సొంతం చేసుకుంది. అయితే, జీడీపీలో తలసరి వ్యయం పరంగా ఫ్రాన్స్ కంటే మన దేశం వెనుకనే ఉండటం గమనార్హం. మన దేశ జనాభా 134 కోట్ల స్థాయిలో ఉండటమే ఇందుకు కారణం. ఫ్రాన్స్ జనాభా కేవలం 6.7 కోట్లే. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 2017 చివరి నాటికి 2.94 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. దేశ జీడీపీ వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో 6.7% నమోదు చేయగా, ఈ ఏడాది 7.4%కి చేరుతుందని ఆర్బీఐ, కేంద్రం అంచనా వేస్తున్నాయి. తక్కువ వృద్ధి దేశాలను దాటేస్తాం భారత్ కంటే తక్కువ వృద్ధి రేటున్న దేశాలను అధిగమించే సత్తా మన దేశానికి ఉందని జైట్లీ పేర్కొన్నారు. ‘‘ఆర్థిక కార్యకలాపాల విస్తరణతోనే వృద్ధి పెరుగుతోంది. వచ్చే 10–20 ఏళ్లలో మన వృద్ధి రేటును పెంచేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతం వృద్ధి ఎక్కువగా ఉత్తరాది, దక్షిణాది, పశ్చిమ ప్రాంతాల్లోనే ఉంది. తూర్పున వృద్ధి వేగాన్ని అందుకోవాల్సి ఉంది. ఇక్కడా వృద్ధిని చూడనున్నాం’’ అని జైట్లీ వివరించారు. ఆర్థిక కార్యకలాపాలు పెరగనున్న దృష్ట్యా సీసీఐ విస్తరించాల్సిన అవసరం ఉందని జైట్లీ పేర్కొన్నారు. డీమోతో పెరిగిన పన్ను వసూళ్లు డీమోనిటైజేషన్తో దేశంలో పన్ను వసూళ్లు పెరిగాయని జైట్లీ తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలను వ్యవస్థీకృతం చేయడంతోపాటు, మరింత వృద్ధికి దోహదపడిందని చెప్పారు. రద్దు చేసిన పెద్ద నోట్లలో 99.3% తిరిగి బ్యాంకుల్లోకి వచ్చాయని ఆర్బీఐ ప్రకటించడంతో, డీమోతో కేంద్రం సాధించిందేమిటని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ‘‘చాలా వరకు కరెన్సీ బ్యాంకుల్లోకి వచ్చాయని, దీంతో డీమోనిటైజేషన్ ఉద్దేశాలు నెరవేరలేదన్న ప్రకటనలు వస్తున్నాయి. జమ చేయని నోట్లు చెల్లుబాటు కాకుండా పోవడం ఒక్కటే డీమోనిటైజేషన్ ఉద్దేశమా? ముమ్మాటికీ కాదు’’ అని జైట్లీ పేర్కొన్నారు. దేశాన్ని పన్నులు చెల్లించే విధంగా మార్చడమే పెద్ద లక్ష్యంగా పేర్కొన్నారు. ఆదాయపన్ను వసూళ్లు డీమోనిటైజేషన్కు ముందు రెండు సంవత్సరాల్లో వరుసగా 6.6 శాతం, 9 శాతంగా ఉండగా, డీమోనిటైజేషన్ తర్వాతి సంవత్సరాల్లో 15 శాతం, 18 శాతం మేర నమోదైనట్టు జైట్లీ తెలిపారు. మూడో సంవత్సరంలోనూ ఇదే వృద్ధి కనిపిస్తుందన్నారు. -
మన్మోహన్ కన్నా మోదీ బెటర్
న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ మాజీ ప్రధాని మన్మోహన్ కంటే ప్రస్తుత ప్రధాని మోదీ హయాంలోనే బాగుందని సోషల్ మీడియా పోల్లో అధిక శాతం అభిప్రాయపడ్డారు. మూడీస్ సంస్థ శుక్రవారం భారతదేశ సౌర్వభౌమ రేటింగ్ను పెంచిన నేపథ్యంలో ఫేస్బుక్, ట్వీటర్లో ఎకనామిక్స్ టైమ్స్ ఈ పోల్ నిర్వహించింది. ఫేస్బుక్ పోల్లో 69 శాతం మన్మోహన్ కంటే మోదీయే ఉత్తమమని చెప్పగా, 31 శాతం మంది మన్మోహన్కు అనుకూలంగా ఓటేశారు. మొత్తం 3 లక్షల మంది ఈ పోలింగ్లో పాల్గొన్నారు. ట్వీటర్ పోల్లో 74 శాతం మోదీకి అనుకూలంగా, 20 శాతం మన్మోహన్కు అనుకూలంగా నిలిచారు. ట్వీటర్ పోల్లో 3500 మంది పాల్గొన్నారు. గడ్డుకాలంలోనే ఆర్థిక వ్యవస్థ: మన్మోహన్ కొచ్చి: అమెరికాకు చెందిన రేటింగ్ సంస్థ మూడీస్ భారత సౌర్వభౌమ రేటింగ్ను పెంచినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలం నుంచి ఇంకా బయటపడలేదని మన్మోహన్ అన్నారు. కొచ్చిలోని ఓ కళాశాలలో శనివారం ఆయన మాట్లాడుతూ రేటింగ్ పెరగడం మంచిదేననీ, అయితే అంతమాత్రానికే ఆర్థిక వ్యవస్థ అంతా సవ్యంగా ఉన్నట్లు పొరబడకూడదని అన్నారు. నోట్టరద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ గమనం మందకొడిగా తయారైందన్నారు. సరైన కసరత్తు లేకుండా జీఎస్టీ తెచ్చారని, 211 రకాల వస్తువులపై అధిక పన్ను వేసి తర్వాత తగ్గించాల్సి వచ్చిందన్నారు. -
భారత ఆర్థికవ్యవస్థలో 10 శాతం వీరివద్దనే
న్యూఢిల్లీ : భారత ఆర్థికవ్యవస్థ 2 ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు కోటి కోట్లకు పైగానే. ఈ కోటి కోట్లలో సుమారు 10 శాతం మేర సంపద, అంటే 200 బిలియన్ డాలర్లకు పైనా సంపద దేశంలోని టాప్-20 పారిశ్రామికవేత్తల దగ్గరే ఉన్నట్టు తెలిసింది. 2017 తొలి ఏడు నెలల కాలంలో వీరి సంపద అదనంగా 50 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్టు బ్లూమ్బర్గ్ బిలీనియర్ ఇండెక్స్లో వెల్లడైంది. 18 మంది టాప్ ఇండియన్ బిలీనియర్లలో ప్రతి ఒక్కరూ ఈ ఏడు నెలల కాలంలో తమ సంపదను 1 బిలియన్ డాలర్లు(రూ.6400 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువగానే పెంచుకున్నారని ఈ ఇండెక్స్ తెలిపింది. ఆయిల్ నుంచి టెలికాం వరకు వ్యాపారాలతో మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తన సంపదను అదనంగా ఏకంగా 13 బిలియన్ డాలర్లను పెంచుకున్నట్టు తెలిసింది. అదేవిధంగా అదానీ గ్రూపుకు చెందిన గౌతమ్ అదానీ, విప్రో అజిమ్ ప్రేమ్జీ, ఆర్కే దమానీ వంటి వారు బ్లూమ్బర్గ్ డేటాలో దూసుకుపోయినట్టు వెల్లడైంది. వీరి సంపద 3-4 బిలయన్ డాలర్ల మధ్యలో ఎగిసినట్టు ఇండెక్స్ తన రిపోర్టులో పేర్కొంది. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు తొమ్మిదేళ్ల గరిష్టంలో ట్రేడవుతున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ జియోను విజయవంతంగా ఈ ఇండస్ట్రీస్ను లాంచ్ చేయడంతో తమ, నమ్మకం మరింత పెరుగుతుందని గ్రూప్ చెబుతోంది. విప్రో ప్రమోట్చేస్తున్న అజిమ్ ప్రేమ్జీ ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్లో వాటాను కలిగి ఉన్నారు. అంతేకాక ఎన్సీసీ, జుబిలెంట్ ఫుడ్వర్క్స్, క్రాంప్టన్ గ్రీవ్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, జేఎం ఫైనాన్సియల్ సంస్థల్లో అజిమ్ ప్రేమ్జీ ట్రస్ట్ వాటాలను కలిగి ఉంది. వీటన్నింటితో ప్రేమ్జీ సంపద 3.8 బిలియన్ డాలర్లు ఎగిసి 16 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ముఖేష్ అంబానీ, ప్రేమ్జీ మాత్రమే కాక, దమానీ, గౌతమ్ అదానీ, ఉదయ్ కొటక్, కుమార్ మంగళం బిర్లా, పంకజ్ పటేల్, విక్రమ్ లాల్, లక్ష్మీ మిట్టల్, కేపీ సింగ్, అజయ్ పిరామిళ్, పల్లోజి మిస్త్రీ వంటి వారు బ్లూమ్బర్గ్ బిలీనియర్ ఇండెక్స్కి ప్రతేడాది 2 బిలియన్ డాలర్లను అందిస్తున్నారు. -
పారిశ్రామిక ఉత్పత్తి.. స్వల్ప ఊరట
న్యూఢిల్లీ: కొంచెం ఊరటనిస్తూ... జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధిబాటలోకి ప్రవేశిం చింది. మూడు నెలలపాటు అసలు వృద్ధిలేకపోగా, క్షీణతలో ఉన్న ఈ సూచీ 2014 జనవరిలో స్వల్పంగా 0.1% వృద్ధిని (2013 జనవరితో పోల్చితే) నమోదుచేసుకుంది. విద్యుత్, మైనింగ్ రంగాలు ఈ సానుకూల ఫలితానికి కొంత కారణం. కాగా మొత్తం సూచీలో 75% వాటా ఉన్న తయారీ రంగం మాత్రం ఇంకా నీరసంగానే ఉంది. రంగాల వారీగా ... విద్యుత్ ఉత్పత్తి రంగం జనవరిలో 6.5% వృద్ధిని నమోదుచేసుకుంది. 2013 జనవరిలో ఈ రేటు 6.4%. మొత్తం ఐఐపీలో 14% వాటా కలిగిన మైనింగ్ రంగం జనవరిలో (-) 1.8% క్షీణబాట నుంచి 0.7% వృద్ధిలోకి మళ్లింది. తయారీ రంగం 2.7 శాతం వృద్ధి నుంచి 0.7 క్షీణతలోకి జారింది. వినియోగ వస్తువుల రంగం 2.5 శాతం వృద్ధి నుంచి 0.6 శాతం క్షీణతలోకి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ రంగంలో క్షీణత మరింత పెరిగింది. ఇది -2.5 శాతం క్షీణత నుంచి - 4.2 క్షీణతలోకి జారింది. ఊహించిన విధంగానే... తాజా గణాంకాలపై ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ సీ రంగరాజన్ మాట్లాడుతూ, ఐఐపీ తాజా గణాంకాలు ఊహించిన విధంగానే ఉన్నాయన్నారు. ఫిబ్రవరి-మార్చి నెలల్లో తయారీ రంగం క్రియాశీలత మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నారు.