-
పెరుగుతున్న కరోనా కేసులు..
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రజల నిర్లక్ష్యానికి పండుగలు, చలికాలం తోడవడంతో వారం వ్యవధిలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత నెల 25న రాష్ట్రం మొత్తం 582 కేసులు నమోదవగా, 31నాటికి 1,416కు పెరిగింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కేసులు గణనీయంగా పెరిగినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఆయన కరోనా బులెటిన్ విడుదల చేశారు. దీని ప్రకారం గత నెల 25న జీహెచ్ఎంసీలో 174 కేసులుండగా 31న 279కి చేరాయి. ఇదే తేదీల్లో ఆదిలాబాద్లో 9 నుంచి 18కి, భద్రాద్రి కొత్తగూడెంలో 22 నుంచి 79కి, ఖమ్మంలో 17 నుంచి 74కు, జనగామలో 2 నుంచి 21కి, మేడ్చల్లో 38 నుంచి 112కు, రంగారెడ్డిలో 55 నుంచి 132, వరంగల్ అర్బన్లో 7 నుంచి 22కు పెరిగాయి. కామారెడ్డిలో 25న ఒక్క కేసు నమోదు కాకపోగా, 31న 24 నమోదయ్యాయి. ఇలాగే మిగిలిన జిల్లాల్లోనూ కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదయ్యింది. దసరా సమయంలో తక్కువ కేసులు నమోదవగా, ఆ తర్వాత క్రమంగా పెరుగుతున్నాయి. చలికాలంలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. 2.40 లక్షలకు చేరిన కేసుల సంఖ్య... రాష్ట్రంలో ఇప్పటివరకు 43,23,666 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 2,40,048 మందికి పాజిటివ్గా తేలింది. తాజాగా మహమ్మారి బారినపడి మరో ఐదుగురు చనిపోగా... మొత్తం మరణాల సంఖ్య 1,341కి చేరింది. శనివారం ఒక్కరోజే 1,579 మంది కోలుకోగా... కోలుకున్నవారి సంఖ్య 2,20,466కు చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.84 శాతానికి పెరిగింది. మరణాల రేటు 0.55 శాతానికి తగ్గింది. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 18,241. ఇందులో ఇళ్లు, సంస్థల ఐసోలేషన్లో 15,388 మంది చికిత్స పొందుతున్నారు. -
ఇంగ్లాండ్లో మళ్లీ కరోనా ఉధృతి
లండన్: ఇంగ్లాండ్లో కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుతోంది. సెకండ్ వేవ్ మొదలైనట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. గత వారం 99 మంది, ఈవారంలో 139 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నియంత్రణ చర్యలను ప్రభుత్వం కఠినతరం చేసింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధని 18 ఏళ్లు పైబడిన వారికి 200 పౌండ్ల (రూ.18,950) జరిమానా విధిస్తారు. రెండోసారి ఇదే పునరావృతం అయితే 400 పౌండ్లు చెల్లించాల్సిందే. ఉల్లంఘన మళ్లీ జరిగే రెండింతల జరిమానా విధిస్తారు. పదేపదే తప్పు చేస్తే గరిష్టంగా 6,400 పౌండ్లు (రూ.6.06 లక్షలు) చెల్లించాల్సి రావొచ్చు. దేశంలో ప్రతి 10 వేల మందిలో 100 మంది కరోనా బారినపడ్డారు. -
పక్షం రోజులు.. 127 టీఎంసీలు
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ సారి భారీ వరద పోటెత్తింది. పక్షం రోజుల్లోనే ఏకంగా 127 టీఎంసీల మిగులు జలాలు వృథాగా గోదావరిలోకి వెళ్లిపోయాయి. ప్రాజెక్టు ఎగువన ఉన్న మహారాష్ట్రలోని సాగునీటి ప్రాజెక్టుల నుంచి 15 రోజులుగా రోజూ లక్ష నుంచి లక్షన్నర క్యూసెక్కుల వరద జలాలు తరలివస్తున్నాయి. దీంతో ఎస్సీరెస్పీ ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తి అదే స్థాయిలో నీటిని నదిలోకి వదులుతున్నారు. ఈ ఏడాది వర్షాకాలం సీజన్ ప్రారంభమైన జూన్ 1 నుంచి ప్రాజెక్టులోకి సుమారు 234 టీఎంసీల నీరు వచ్చినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు నిండిపోగా, మిగిలిన జలాలను గోదావరిలోకి వదిలి పెడుతున్నారు. వరద కాలువ ద్వారా మిడ్మానేరు జలాశయానికి తరలిస్తున్నారు. అలాగే, కాకతీయ, సరస్వతి, లక్ష్మీకాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, అక్టోబర్ 28 వరకు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తే ఉంచుతారు. దీంతో అక్టోబర్లో కూడా ప్రాజెక్టుకు వరద జలాల రాక కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మొదట 112 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులోకి భారీగా సిల్ట్ చేరడంతో నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు పడిపోయింది. ఐదేళ్లలో ఇన్ఫ్లో ఇలా.. ఇదిలా ఉండగా గత ఐదేళ్లలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన ప్రవాహాలను పరిశీలిస్తే.. 2014–15లో కేవలం 14.77 టీఎంసీలు మాత్రమే ఇన్ఫ్లో వచ్చింది. 2015–16లో మరీ తక్కువగా 4.42 టీఎంసీల ఇన్ఫ్లో మాత్రమే వచ్చి చేరింది. ఇక 2016–17లో 254 టీఎంసీలు రాగా, 2017–18లో 85 టీఎంసీల వరద మాత్రమే వచ్చింది. 2019–20లో 87 టీఎంసీల ఇన్ఫ్లో వచ్చింది. ఈసారి ఇప్పటికే 234 టీఎంసీల వరద జలాలు వచ్చాయి. రబీ పంటలకు భరోసా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఆయకట్టు ఉంది. స్టేజ్ –1 పరిధిలో 9.68 లక్షల ఆయకట్టు ఉండగా, స్టేజ్–2లో మరో ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఖరీఫ్ పంటలతో పాటు రబీ పంటలకు కూడా సాగునీరందనుంది. దీంతో ఆయకట్టు రైతులకు భరోసా ఏర్పడింది. -
హైదరాబాద్లో నిలకడగా.. జిల్లాల్లో దూకుడుగా..
సాక్షి, హైదరాబాద్: మొన్నటివరకు హైదరాబాద్లో ప్రతాపం చూపించిన వైరస్.. ఇప్పుడు జిల్లాల్లో విజృంభిస్తోంది. పట్టణాలు, పల్లెల్లో పంజా విసురుతోంది. వారం రోజుల్లోనే చాలా జిల్లాల్లో రెట్టింపు కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. కొన్ని జిల్లాల్లో మూడు, నాలుగింతలు కూడా రికార్డయ్యాయి. వైద్య, ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన బులెటిన్ మేరకు.. ఈ నెల 20న జీహెచ్ఎంసీ పరిధిలో 473 కేసులుండగా, 26న 449 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ గత వారం రోజులుగా కేసుల సంఖ్య దాదాపు నిలకడగానే కొనసాగుతోంది. కానీ జిల్లాల్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 20న 21 కేసులు నమోదు కాగా, 26న ఏకంగా 72 కేసులు రికార్డయ్యాయి. అంటే మూడింతలకు మించిన కేసులన్న మాట. భూపాలపల్లి జిల్లాలో 20న 12 కేసులు నమోదు కాగా, 26న 26 కేసులు.. అంటే రెట్టింపునకు మించి నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో వారం క్రితం 79 కేసులు నమోదైతే, ఇప్పుడు 152 కేసులు నమోదయ్యాయి. ఇక మహబూబాబాద్ జిల్లాలోనైతే వారం క్రితం 26 కేసులు నమోదైతే, ఇప్పుడు ఏకంగా 102 కేసులు రికార్డయ్యాయి. మంచిర్యాల జిల్లాలో వారం క్రితం 40 కేసులుంటే, ఇప్పుడు 106 కేసులు రికార్డయ్యాయి. నల్లగొండ జిల్లాలో వారం క్రితం 60 కేసులుంటే, ఇప్పుడు 164 నమోదయ్యాయి. నిజామాబాద్లో ముందు 69 కేసులుంటే, ఇప్పుడు 112 నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో వారం క్రితం 35 కేసులుంటే, ఇప్పుడు 77 నమోదయ్యాయి. సిద్దిపేట జిల్లాలో వారం క్రితం 49 కేసులుంటే, ఇప్పుడు 113 కేసులు వచ్చాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 20న 18 కేసులుంటే, 26న 39 కేసులు రికార్డయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 వేల వరకు కంటైన్మెంట్ జోన్లున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. పల్లెల్లోనూ వైరస్ వ్యాప్తి చెందడంతో గ్రామాల్లో అలజడి నెలకొంది. వచ్చే నెలాఖరుకు దాదాపు 3 వేల గ్రామాల్లోకి వైరస్ ప్రవేశించే అవకాశముందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. మరో 2,795 కేసులు.. రాష్ట్రంలో బుధవారం (26వ తేదీన) 60,386 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,795 పాజిటివ్ కేసులు వచ్చాయని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బులిటెన్లో వెల్లడించారు. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,14,483కి చేరింది. తాజాగా కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 788కి చేరింది. కరోనా బారి నుంచి తాజాగా 872 మంది కోలుకోగా, ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 86,095కి చేరిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27,600 యాక్టివ్ కేసులున్నాయి. అందులో ఇళ్లు, ఇతరత్రా ఐసోలేషన్లలో చికిత్స పొందుతున్నవారు 20,866 మంది ఉన్నారు. ఇక తెలంగాణలో ఇప్పటివరకు 11,42,480 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. -
ఉరికొస్తూ... ఊపిరిలూదుతూ...
సాక్షి, హైదరాబాద్: విస్తారంగా వర్షాలు.. పరవళ్లు తొక్కుతున్న ప్రవాహాలు.. నిండుకుండల్లా ప్రాజెక్టులు.. ఇదీ ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్న తాజా దృశ్యం. ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు బిరబిరా వస్తూ సాగునీటి ప్రాజెక్టులకు కొత్త ఊపిరిలూదాయి. ఇప్పటికే కృష్ణా బేసిన్లో ఆల్మట్టి నుంచి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయగా, గోదావరిలో సింగూరు, నిజాంసాగర్ మినహా అన్ని ప్రాజెక్టుల గేట్లు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే లోయర్ మానేరు, మిడ్మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తేశారు. రెండు, మూడు రోజుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు తెరుచుకునే అవకాశాలున్నాయి. నిండేందుకు సిద్ధంగా ఎస్సారెస్పీ... ఎగువ నుంచి స్థిరంగా ప్రవాహాలు వస్తుండటంతో ఎస్సారెస్పీ జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 90.31 టీఎంసీలకుగానూ 78 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. ఆదివారం ఉదయం 52 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగగా, అది మధ్యాహ్నానికి 18 వేల క్యూసెక్కులకు తగ్గింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు అనుగుణంగా, నీటి ప్రవాహాల్లో హెచ్చుతగ్గులున్నాయి. 23 నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి ఏర్పడుతున్న నేపథ్యంలో విస్తారంగా వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రవాహాలు పుంజుకుంటే రెండు, మూడు రోజుల్లో ప్రాజెక్టు నిండొచ్చని భావిస్తున్నారు. 90 టీఎంసీలకు గానూ 85 టీఎంసీల మేర నీరు చేరిన వెంటనే గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని ఇంజనీర్లు చెబుతున్నారు. బోసిపోయిన సింగూరు, నిజాంసాగర్... అన్ని ప్రాజెక్టులకు భిన్నంగా సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు దర్శనమిస్తున్నాయి. అవి పూర్తిగా బోసిపోయి కనిపిస్తున్నాయి. సింగూరులో 29.91 టీఎంసీలకు కేవలం 2.81 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. స్థానిక పరీవాహకం నుంచి 1,122 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ సీజన్లో ఇంతవరకు కేవలం 2.80 టీఎంసీల మేర మాత్రమే కొత్తనీరు వచ్చి చేరింది. నిజాంసాగర్లో 17.80 టీఎంసీలకు కేవలం 1.72 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం 2 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ సీజన్లో కొత్తగా వచ్చి చేరిన నీరు కేవలం ఒక టీఎంసీ మాత్రమే. ఈ రెండు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 4.50 టీఎంసీల లభ్యత ఉంటే అందులో కొత్తగా వచ్చింది 3.80 టీఎంసీలు. గత ఏడాదితో పోలిస్తే ప్రాజెక్టులో 4 టీఎంసీల మేర అధికంగా నిల్వ ఉంది. వచ్చే సెప్టెంబర్లో భారీ తుఫాన్లు వస్తే ఈ ప్రాజెక్టుల్లోకి భారీ ప్రవాహాలు వస్తాయేమోనని ఇంజనీర్లు ఆశాభావంతో ఉన్నారు. -
వాన నీరు లోపలికి.. పాతాళ గంగ పైపైకి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు భూగర్భ జలాలకు కొత్త ఊపిరి పోస్తున్నాయి. ఓ పక్క ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. మరోపక్క నిండుతున్న చెరువులు, ప్రాజెక్టులతో భూగర్భ జల మట్టం రికార్డు స్థాయిలో పైకి ఉబికి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం ఎక్కువగా నమోదు కావడం కన్నా.. ఎక్కువ కాలం నమోదవుతుండటం భూగర్భ మట్టాల్లో గణనీయ పెరుగుదలకు కారణమవుతోంది. రాష్ట్ర పరీవాహక ప్రాంతం, పెరిగిన నీటి మట్టాల ఆధారంగా జూన్, జూలై రెండు నెలల వ్యవధిలోనే 208 టీఎంసీల నీరు భూమిలో ఇంకిందని అంచనా వేస్తుండగా, ఆగస్టులో కూడా 200 టీఎంసీలు పెరిగే అవకాశముందని అంటున్నారు. వాన నీరు లోపలికి.. పాతాళ గంగ పైపైకి.. రాష్ట్రంలో జూన్ చివరలో, జూలైలో విస్తారంగా వర్షాలు కురిశాయి. జూలై నెలాఖరుకు సగటున 373.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, 439.8 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం రికార్డయింది. 33 జిల్లాలకు గానూ 16 జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా, 15 జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గతేడాది జూలైలో రాష్ట్ర సగటు భూగర్భ నీటిమట్టం 14.12 మీటర్లు ఉండగా, ఈ ఏడాది అది 9.26 మీటర్లకు చేరింది. ఏకంగా 4.86 మీటర్ల మేర భూగర్భం పైకి ఎగిసింది. జూన్, జూలైలో 40 రోజులకు పైగా వర్షాలు స్థిరంగా కురవడంతో భూగర్భ జలాలకు కలిసొచ్చింది. కురిసిన వర్షపాతంలో సగటున 10 శాతం నుంచి 11 శాతం నీరు భూగర్భానికి చేరుతుంది. రాష్ట్ర భూ విస్తీర్ణం, ప్రస్తుతం పెరిగిన భూగర్భ మట్టాల ఆధారంగా రెండు నెలల వ్యవధిలో 208 టీఎంసీల నీరు భూమిలోకి చేరిందని భూగర్భ జల శాఖ అంచనా వేసింది. ఇందులో ఒక్క జూలైలోనే 158 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకిందని తెలిపింది. ఆగస్టులో ఈ 19 రోజులుగా కురిసిన వర్షాలతో మరో 200 టీఎంసీల నీరు భూగర్భంలోకి చేరే అవకాశం ఉందని అంటున్నారు. కలిసొచ్చిన కాళేశ్వర జలాలు, చెరువులు.. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు తోడు నిండిన చెరువులు, ప్రాజెక్టులు, కాళేశ్వరం ఎత్తిపోతలు భూగర్భ మట్టాల పెరుగుదలకు కారణమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి బేసిన్లో 13,859 చెరువులు, కృష్ణా బేసిన్లో 5,904 చెరువులు కలిపి 19,763 చెరువులు మత్తడులు దుంకడం, రెండు బేసిన్లలో మరో 6,400 చెరువులు 75 శాతానికి పైగా, 4,800 చెరువులు 50 శాతానికి పైగా నిండటంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఇక కాళేశ్వరం జలాలు భూగర్భ మట్టాల పెరుగుదలకు వరంగా మారిందని భూగర్భ జల శాఖ తన జూలై నివేదికలో వెల్లడించింది. గతేడాది కాళేశ్వరం పరీవాహకంలో 602 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలోనే భూగర్భ జలాలపై ప్రభావం ఉండగా, ఈ ఏడాది జూలైలో 2,419 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పెరిగిందని తెలిపింది. ఈ ప్రభావంతో రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, భువనగిరితో పాటు నిజామాబాద్లోని కొంత ప్రాంతం, కామారెడ్డిలోని తూర్పు ప్రాంతాల్లో భూగర్భ మట్టాలు మెరుగయ్యాయని వెల్లడించింది. రాష్ట్ర విస్తీర్ణంలో 24 శాతం భూగర్భ మట్టం 5 మీటర్ల లోపలే ఉండగా, ఇందులో ఎక్కువగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వనపర్తి, నాగర్కర్నూల్, భద్రాద్రి, జగిత్యాల, ఖమ్మం, నల్లగొండ జిల్లాలోని ఎక్కువ ప్రాంతాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. -
వినియోగంలో ల్యాప్టాప్
సాక్షి,హైదరాబాద్: కరోనా.. కల్చర్ను, వర్క్ కల్చర్నూ మార్చేసింది. సంప్రదాయ పనివిధానాలకు ప్రత్యా మ్నాయాలను ముందుకు తెచ్చింది. ప్రజారవాణా వ్యవస్థలు నిలిచిపోవడంతోపాటు ఇంటి నుంచి బయటకు లేదా ఆఫీసుకు వెళ్లలేని పరిస్థితి. ఎలాగోలా వెళ్లితే ఎక్కడ కరోనా బారిన పడతామోనన్న భయాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం, రిమోట్ డెస్క్ వంటి పని పద్ధతులను వివిధ రంగాల సంస్థలు, ఉద్యోగులు ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ల్యాప్ట్యాప్లు, నోట్బుక్ల వినియోగం పెరిగింది. దీంతో వీటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కరోనాకు ముందు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ మార్కెట్లో నోట్బుక్లు, ల్యాప్ట్యాప్లకు డిమాండ్ నామమాత్రంగా ఉండేది. ఇప్పుడవి హాట్కేకుల్లా అమ్ముడుపోతుండటంతో కొన్ని కంపెనీలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాయి. అయితే వాటి కూడా స్టాక్ అయిపోవడంతోపాటు దేశంలో ఎక్కడ స్టాక్ ఉందో వెతికి పట్టుకుని వినియోగదారులకు అందించేందుకు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఏకంగా కొత్త ప్లాంటు ప్రారంభం ఒక కంపెనీ మరో సంస్థ సహకారంతో తమిళనాడులో ఏకంగా ఒక కొత్త ప్లాంటునే ప్రారంభించింది. దీనిని బట్టి ల్యాప్ట్యాప్లకు డిమాండ్ ఏ మేరకు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అమెజాన్ ఇండియా ఇటీవల నిర్వహించిన ప్రైమ్డే సేల్లోనూ ల్యాప్ట్యాప్ అమ్మకాలే టాప్లో నిలిచాయి. ఏప్రిల్–జూన్ మధ్యకాలంలో లాక్డౌన్ ఉన్నప్పటికీ దాదాపు 20 శాతం మేర షిప్మెంట్లలో వృద్ధి నమోదైనట్టు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) గణాంకాలను బట్టి వెల్లడైంది. డెస్క్టాప్లు అమ్మకాలు తగ్గుముఖం నోట్బుక్ల అమ్మకాల్లో 105.5 శాతం వృద్ధి నమోదైంది. మరోవైపు ల్యాప్టాప్లు/నోట్బుక్ల వైపు వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపడంతో డెస్క్టాప్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి, దీంతో వీటి షిప్మెంట్ కూడా 46 శాతం తగ్గినట్టు ఐడీసీ సమాచారం బట్టి తెలుస్తోంది. ఐటీ సర్వీసెస్, గ్లోబర్ ఎంటర్ ప్రైజెస్, కన్సల్టింగ్ కంపెనీలు నోట్బుక్ల కోసం భారీ ఆర్డర్లు ఇవ్వడంతోపాటు డెస్క్టాప్ల కొనుగోళ్లను గణనీయంగా తగ్గించినట్టు వెల్లడైంది. 91% పెరిగిన ల్యాప్టాప్ల వినియోగం కోవిడ్ మహమ్మారి సందర్భంగా భారత్లో 91 శాతం మేర ల్యాప్టాప్లు ఉపయోగించేవారు పెరిగినట్టు లెనోవ్ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ పరిశీలనలో వెల్లడైంది. కస్టమర్లు తమ పాత ల్యాప్టాప్లను హై పెర్ఫార్మెన్స్ డివైజెస్గా అప్డేట్ చేసుకోవడంతోపాటు వ్యక్తిగత గోప్యత, డేటా భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్టుగా స్పష్టమైంది. దీంతో ఈ కేటగిరిలో ల్యాప్టాప్లు, నోట్బుక్ల మార్కెట్ వృద్ధి అవకాశాలు మరింత పెరిగాయి. -
కృష్ణమ్మ పరుగులు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరుగు లు పెడుతోంది. ఎగువ నుంచి శనివారం సాయంత్రం 98,975 క్యూసెక్కులు చేరుతుండగా రాత్రి 12 గంటలకు ఇది రెండు లక్షల క్యూసెక్కులకు పెరుగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ దఫా వరదకు శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండవచ్చని అంచనా వేస్తున్నాయి. ► పశ్చిమ కనుమల్లో ప్రధానంగా కృష్ణా, ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సగటున 72 మి.మీ.ల వర్షపాతం పడింది. దాంతో కృష్ణా, ఉపనదుల్లో గంట గంటకూ వరద పెరుగుతోంది. ► ఆల్మట్టిలోకి వరద పెరుగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) సూచనల మేరకు డ్యామ్ నీటినిల్వలను ఖాళీ చేసి దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్లోనూ అదే పరిస్థితి. దాంతో జూరాలకు భారీగా వరద చేరుతోంది. జూరాల వరదను దిగువకు వదులుతున్నారు. ► శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు జలాలు విడుదల చేస్తుండటంతో నాగార్జునసాగర్ నీటిమట్టం 558.20 అడుగులకు చేరుకుంది. ► అప్పర్ తుంగ, భద్ర డ్యామ్, సింగటలూరు బ్యారేజీ నుంచి భారీ వరదను దిగువకు వదులుతుండటంతో తుంగభద్రలోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ► పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, కిన్నెరసాని నుంచి నీటి ప్రవాహం చేరుతుండటంతో గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1.17 లక్షల క్యూసెక్కులు చేరుతుం డగా 7 వేల క్యూసెక్కులు డెల్టాకు, మిగిలిన 1.11 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
సాగర్ సాగు.. ఆశాజనకం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్ పరిధిలో కురుస్తున్న వర్షాలతో ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోవడం.. దిగువన రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ఉధృతంగా ప్రవాహా లు నమోదవుతుండటంతో నాగార్జునసాగర్ కింది ఆయకట్టు రైతాంగంలో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రాజెక్టులో ఇప్పటికే కనీస నీటి మట్టాలకు ఎగువన అరవై టీఎంసీల నీటి లభ్యత ఉండటం..ఎగువ నుంచి ప్రవాహాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఖరీఫ్కు సాగునీటి విడుదలకు ప్రభుత్వ యంత్రాంగం సన్నాహాలు మొ దలుపెట్టింది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు తొలి వారం నుంచే నీటి విడుదల జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. పూర్తి ఆయకట్టుకు..? సాగర్ ఎడమకాల్వ కింద మొత్తంగా 6.40 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. గత ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో కేవలం 35 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించారు. యాసంగి సీజన్లో మాత్రం 6.15 లక్షల ఎకరాలకు నీరివ్వగా 55 టీఎంసీల మేర నీటిని వినియోగించారు. ప్రస్తుతం సైతం 6.30 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించగా, దీనికి 60 టీఎంసీలు అవసరమని లెక్కించారు. దీంతో పాటే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్పీ) కింద 2.63 లక్షల ఎకరాలకు మరో 20 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు మరో 10 టీఎంసీలు కలిపి మొత్తంగా 90 టీఎంసీల అవసరాలను గుర్తించారు. ఎగువన ప్రాజెక్టులన్నీ నిండి ఉండటం, నవంబర్– డిసెంబర్ వరకు సైతం ఎగువ నుంచి ప్రవాహాలు కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో 90 టీఎంసీల మేర నీటిని ఇవ్వడం పెద్ద కష్టం కాదని ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న 60 టీఎంసీల లభ్యత నీటిని ఐదారు తడుల ద్వారా ఆయకట్టుకు విడుదల చేయాలని యోచిస్తున్నారు. అయితే ఆయకట్టు ప్రాంత ప్రజా ప్రతినిధులతో ఒకమారు చర్చించిన అనంతరం వారి సూచనల మేరకు నీటి విడుదల చేయాలని భావిస్తున్నారు. గత ఏడాది ఆగ స్టు నుంచి నవంబర్ వరకు నీటి విడుదల కొనసాగింది. ఈ ఏడాది సైతం ఆగస్టు తొలి వారం నుంచి నీటి విడుదల కొనసాగే అవకాశం ఉంద ని నీటి పారుదల వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎగువ పరవళ్లతో సాగర్ పరవశం... గడిచిన ఇరవై రోజులుగా పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే రెండు ప్రాజెక్టుల నుంచి భారీగా నీటి విడుదల చేస్తుండటంతో ఆ నీరంతా జూరాల మీదుగా శ్రీశైలం చేరుతోంది. ప్రస్తుత సీజన్లో జూరాలకు 80 టీఎంసీల మేర కొత్త నీరురాగా, శ్రీశైలానికి స్థానికంగా వచ్చిన ప్రవాహాలు కలుపుకొని మొత్తంగా 85 టీఎంసీల మేర కొత్త నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకు గానూ 90 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులోంచే పవర్హౌస్ల ద్వారా నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్లో ఇప్పటివరకు 30 టీఎంసీల కొత్త నీరు చేరింది. సాగర్లో నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు కాగా ప్రస్తుతం 191 టీఎంసీల నీరుంది. 31 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. ఇందులో కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు 60 టీఎంసీల మేర ఉంది. ఈ నీటిని సాగర్ కింది ఆయకట్టు అవసరాలకు వినియోగించే అవకాశాలున్నాయి. -
సామాజిక వ్యాప్తి మొదలు?
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రస్తుతం రోజుకు 40 వేల వరకు కరోనా కేసులు నమోదవుతుండటం, బాధితుల సంఖ్య 11 లక్షలు దాటడంతో వ్యాధి విషయంలో భారత్ సామాజిక వ్యాప్తి దశకు చేరుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఒక్క లక్షద్వీప్ను మినహాయించి మిగిలిన ప్రాంతాలన్నింటిలోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కనీసం 27 రాష్ట్రాల్లో రోజుకు వెయ్యికిపైగా కొత్త కేసులు నమోదవుతుండటం, అతితక్కువ కేసులు ఉన్న అండమాన్ నికోబార్లోనూ వాటి సంఖ్య 150కు చేరుకోవడంతో సామాజిక వ్యాప్తి విషయమై సర్వత్రా చర్చ మొదలైంది. వ్యాధుల నిపుణుల అంచనాల మేరకు దేశంలో సామాజిక వ్యాప్తి ఇప్పటికే మొదలైంది. కానీ ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు సరికదా.. సామాజిక వ్యాప్తి అనేది లేనేలేదని అంటోంది. ఇంతకీ ఈ సామాజిక వ్యాప్తి అంటే ఏమిటి? ఉంటే దాని పరిణామాలేమిటి? అంతా అస్పష్టతే.. దేశంలో కరోనా వ్యాధి ఎలా వచ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకుంటే సామాజిక వ్యాప్తి అంటే ఏమిటో అర్థం చేసుకోవడం సులువు అవుతుంది. కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన చైనాలోని వూహాన్ నుంచి కొంత మంది విద్యార్థులు దేశంలోకి వచ్చిన తరువాత ఇక్కడ వ్యాధి మొదలైంది. ఆ సమయంలో విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ పరీక్షించడం, వైరస్ ఉన్న వారిని వేరు చేసి చికిత్స అందించడంతోపాటు ఆయా వ్యక్తులు ఎవరెవరితో సంబం ధాలు పెట్టుకున్నారన్న విషయాన్ని ఆరా తీసి వారందరికీ పరీక్షలు నిర్వహించారు. దీంతో వ్యాధి ఎవరి నుంచి ఎవరికి సోకిందో స్పష్టంగా తెలిసింది. అంతేకాకుం డా వ్యాధిని అక్కడికక్కడే కట్టడి చేసేందుకు అవకాశమేర్పడింది. అయితే సమయం గడుస్తున్న కొద్దీ వ్యాధిని వ్యాప్తి చేస్తున్న వారు ఎవరు? బాధితులు ఎవరనేది తెలుసుకోవడం కష్టమైంది. ఇలా ఎవరి నుంచి ఎవరికి వ్యాధి సోకిందో కచ్చితంగా నిర్ధారించలేని స్థితిని సామాజిక వ్యాప్తి అని పిలుస్తారు. ఉందా.. లేదా? దేశంలోని 11 లక్షల నిర్ధారిత కోవిడ్ కేసులను నిశితంగా పరిశీలిస్తే సామాజిక వ్యాప్తి ఉందన్నది స్పష్టంగా తెలిసిపోతుందని వైద్య నిపుణులు అంటున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు కూడా అనధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. కొంతకాలం క్రితం భారత వైద్య పరిశోధన మండలి దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిందని, తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారిపై జరిగిన ఈ సర్వేలో 40 శాతం మంది సమస్యకు కారణమేమిటో స్పష్టంగా చెప్పలేకపోయారని, ఇది సామాజిక వ్యాప్తికి సూచికేనని వారు చెబుతున్నారు. ముందుజాగ్రత్తలే మేలు.. ప్రభుత్వం ఇప్పటికైనా సామాజిక వ్యాప్తిని అంగీకరించడం మేలని దేశంలోనే ప్రముఖ వ్యాధుల నిపుణులు జయప్రకాశ్ ములియిల్ అంటున్నారు. వ్యాధిని కట్టడి చేయడంలో విఫలమయ్యాయన్న నిందను భరించాల్సి వస్తుందని ప్రభుత్వాలు సామాజిక వ్యాప్తిని నిరాకరిస్తూ ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం అంగీకరించినా, అంగీకరించకపోయినా వ్యాధి కట్టడి, చికిత్స విషయంలో ఎలాంటి మార్పులూ ఉండబోవన్నారు. పరీక్షలు చేయడం, వ్యాధిగ్రస్తులను గుర్తించి ఇసోలేషన్లో ఉంచడం, చికిత్స కల్పించడమే మన ముందున్న మార్గమన్నారు. ప్రజలు కూడా మునుపటి లాగానే తరచూ చేతులు కడుక్కోవడం, ముఖానికి మాస్క్ వేసుకోవడం, వీలైనంత వరకు జనసమర్ధ ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిదని సూచించారు. -
జిల్లాల్లోనూ ‘వైరస్’ సైరన్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ రాష్ట్రమంతటా చుట్టబెట్టేస్తోంది. ఇంతకాలం హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనే అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొన్ని రోజులుగా జిల్లాల్లో సైతం గణనీయ సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఇప్పటి వరకు వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండగా, వరంగల్ అర్బన్, కరీంనగర్, నల్లగొండ, కామారెడ్డి, మెదక్, సూర్యాపేట, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, భద్రాద్రి–కొత్తగూడెం, నిజామాబాద్,æ మహబూబ్నగర్ జిల్లాల్లోనూ క్రమంగా వ్యాప్తి పెరుగుతోంది. రోజూ జీహెచ్ఎంసీ, రంగారెడ్డి/మేడ్చల్ జిల్లాల పరిధిలో మూడంకెల పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా, దాదాపు మరో 10 జిల్లాల్లో రెండంకెలు, 15 జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు నమోదవుతున్నాయి. క్రమంగా వైరస్ గ్రామీణ జిల్లాలకు సైతం పాకుతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వ్యాప్తి నియంత్రణకు మళ్లీ లాక్డౌన్ విధిస్తారంటూ గత నెలాఖరులో వచ్చిన వార్తలతో చాలామంది నగరం నుంచి సొంతూళ్లకు వలసవెళ్లారు. ఇది కూడా కొంత వరకు జిల్లాల్లో పాజిటివ్ కేసులు పెరగడానికి కారణమైందని జిల్లాల్లోని అధికారులు అంటున్నారు. కొత్తగా 6 జిల్లాల్లో ఉధృతి జీహెచ్ఎంసీతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు ఇప్పటికే హాట్స్పాట్లుగా మారాయి. నల్లగొండ, కరీంనగర్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల్లో సైతం కరోనా పాజిటివ్ కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. గడిచిన పది రోజుల్లో ఈ 6 జిల్లాల్లో వందకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. జీహెచ్ఎంసీ మినహాయిస్తే మరో 10 జిల్లాల్లో కరోనా వ్యాప్తి విస్తృతం అవుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మాస్కుల్లేవ్.. భౌతికదూరం నిల్ లాక్డౌన్ సడలింపులు అమల్లోకి రావడంతో బహిరంగ ప్రదేశాల్లో జనసంచారం మునుపటి స్థితికి చేరింది. లాక్డౌన్ సడలించి నెలకుపైగా గడిచి పోవడం తో ప్రజలు మళ్లీ సాధారణ జీవనానికి అలవడుతున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడమనే నిబంధనలు గాలికొదిలి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఓవైపు కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్నా తమకేమీ కాదనే ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్నారు. ఉదాహరణకు గత వారం రోజులుగా నల్లగొండ జిల్లాలో గణనీయ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నా, స్థానిక ప్రకాశంబజార్ మార్కెట్లో చాలామంది వ్యాపారస్తులు, వర్కర్లు మాస్కుల్లేకుండానే పనిచేస్తున్నారు. కొంతమంది ధరించినా.. వాటిని మూతిపై నుంచి కిందకి లాగి మెడకు వేలాడదీస్తున్నారు. కాగా, బయట కనిపించే వారిలో దాదాపు 50 శాతం మంది మాస్కుల్లేకుండానే తిరుగుతున్నారు. మాస్కులు ధరించకపోతే రూ.1,000 జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా.. కఠినంగా అమలు చేయకపోవడంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. జూలై 1 నుంచి జిల్లాల వారీగా నమోదైన కేసులు జిల్లా కేసులు రంగారెడ్డి 1,042 మేడ్చల్ 718 సంగారెడ్డి 203 నల్లగొండ 155 కరీంనగర్ 122 మహబూబ్నగర్ 110 వరంగల్ అర్బన్ 109 వరంగల్ రూరల్ 108 నిజామాబాద్ 104 మెదక్ 85 కామారెడ్డి 75 సూర్యాపేట 46 కామారెడ్డి 46 మంచిర్యాల 46 భద్రాద్రి కొత్తగూడెం 37 ఆదిలాబాద్ 22 -
ఆల్మట్టికి పోటెత్తిన కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్: కృష్ణాకు ఎగువన వర్షం, దిగువన హర్షం.. చినుకు చినుకుకు ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటే పరీవాహకం పరవశిస్తోంది. ప్రవాహాలు పెరిగినకొద్దీ దిగువ ప్రాజెక్టుల్లో నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. మహా రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా ఎగువన ఉన్న ఆల్మట్టికి రోజురోజుకూ వరద ఉధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆల్మట్టి నుంచి విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటి విడుదలను కర్ణాటక మొదలు పెట్టింది. మరో 50 టీఎంసీలు చేరితే దిగువకు... పశ్చిమ కనుమల్లో 3, 4 రోజులుగా 20 సెంటీమీటర్లకుపైగా వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టిలోకి ప్రవాహాలు పుంజుకుంటున్నా యి. గురువారం ప్రాజెక్టులోకి 49,636 క్యూ సెక్కుల ప్రవాహాలు రాగా, ఇవి సాయం త్రానికి 52 వేల క్యూసెక్కులకు పెరిగినట్లు కేంద్ర జలసంఘం అధికారులు చెబుతున్నా రు. ప్రస్తుతం ఆల్మట్టిలో 129 టీఎంసీలకు 85 టీఎంసీల నిల్వ ఉంది. ఈ సీజన్లో 60 టీఎంసీల కొత్త నీరు వచ్చి చేరింది. ఎగువ నుంచి ప్రవాహాలు ఇంకా పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో ఆల్మట్టిలో విద్యుదుత్పత్తిని కర్ణాటక ఆరంభించింది. విద్యుదుత్పత్తి ద్వారా 10,088 క్యూసెక్కుల నీటిని పవర్హౌస్ల ద్వారా విడుదల చేస్తోంది. మరో 45 టీఎంసీలు చేరితే గేట్లెత్తి ప్రాజెక్టు నుంచి దిగువకు ఎక్కువ పరిమాణంలో నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఆల్మ ట్టి నుంచి నీటి విడుదలతో దిగువన నారాయణపూర్లోకి 10 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ఇక్కడ ప్రస్తుతం 37 టీఎంసీలకుగానూ 26.50 టీఎంసీల నీరునిల్వ ఉంది. మరో 5 టీఎంసీల నీరు చేరిన వెంటనే దిగువన జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుద ల చేసే అవకాశం ఉంది. ప్రవాహాలు ఇదే రీతిన కొనసాగితే ఈ నెల మూడోవారం నుంచి జూరాలకు నీటిని విడుదల చేయొచ్చని నీటి పారుదల శాఖ అంచనా. ప్రస్తుతం జూరాలలో నీటి నిల్వ 9.66 టీఎంసీలకుగానూ 7.80 టీఎంసీలకు చేరింది. ఫలితంగా నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల పంపు ల ద్వారా 1,466 క్యూసెక్కుల నీటిని పం పింగ్ చేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి 16,211 క్యూసెక్కుల మేర నీరు వస్తుం డగా, నిల్వ 100 టీఎంసీలకుగానూ 14 టీ ఎంసీలకు చేరింది. ఉజ్జయిని నదిలోకి 4,587 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ఇ క్కడ నిల్వ 117 టీఎంసీలకుగానూ 60 టీ ఎంసీలకు చేరింది. ఇక స్థానిక పరీవాహకం నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 669 క్యూసెక్కు ల ప్రవాహం వస్తోంది. అక్కడ నిల్వ 215 టీఎంసీలకుగానూ 36.50 టీఎంసీలు ఉం ది. నాగార్జునసాగర్లోకి 1,280 క్యూసెక్కు ల ప్రవాహాలు వస్తుండగా, నిల్వ 312 టీఎంసీలకు 168.54 టీఎంసీలు ఉంది. -
కరోనా కల్లోలం..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ మరింత విజృంభిస్తోంది. కరోనా కేసుల నమోదులోనే కాదు.. వైరస్ బారిన పడ్డ వారి మరణాలు సైతం వేగంగా పెరుగుతున్నాయి. మూడో విడత లాక్డౌన్ ముగిసిన తర్వాత ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడం మొదలైంది. భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకుండా, జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వైరస్ వ్యాప్తి విస్తృతమైంది. రెండు వారాల్లో దాదాపు 100 మంది ఈ వైరస్కు బలయ్యారు. మరోవైపు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పెరిగిన మరణాల సగటు.. కరోనా వైరస్ బాధితులపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. మూడో విడత లాక్డౌన్ అనంతర పరిస్థితులను పరిశీలిస్తే.. రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులతో పోలిస్తే మరణాల సంఖ్య భారీగా ఉంది. నమోదవుతున్న కేసుల్లో దాదాపు 5 శాతం మరణిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత నెల 21 నుంచి ఈ నెల 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,936 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వంద మంది మృత్యువాత పడ్డారు. అంటే ఈ కేసుల్లో సగటున 5 శాతం మరణాలు నమోదయ్యాయి. జూన్ నెల 1 నుంచి 7 వరకు పరిశీలిస్తే.. 950 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 55 మంది చనిపోయారు. ఈ లెక్కన రోజువారీ మరణాల సగటు 5.7 శాతానికి పెరిగింది. ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు వందకు పైగా వస్తున్నాయి. 3 రోజుల్లో పావు వంతు.. కరోనా బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 137 మంది మరణించారు. ఇందులో ఈ నెల 5, 6, 7 తేదీల్లోనే ఎక్కువ మంది చనిపోయారు. ఈ మూడు రోజుల్లో ఏకంగా 32 మంది మృత్యువాత పడినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఇప్పటివరకు నమోదైన మరణాల్లో పావు వంతు మంది మూడు రోజుల్లోనే చనిపోయారు. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కనీస జాగ్రత్తలు పాటించాలని ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు ఏ మాత్రం పట్టించుకోవట్లేదంటూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం జరిగిన వైద్య శాఖ అధికారుల సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నుంచి ఆలయాలు, షాపింగ్ మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో జనసంచారం మరింత పెరుగుతుందని, దీంతో వైరస్ వ్యాప్తి ఎక్కువ అవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తలు పాటించకుంటే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. -
రెండు వారాల్లో రెట్టింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. లాక్డౌన్ సడలింపులతో దాదాపు అన్ని రంగాలపై ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో ప్రజలు సాధారణ పరిస్థితికి వచ్చేశారు. మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పట్ల నిర్లక్ష్యాన్ని చూపుతుండటంతో వైరస్ వ్యాప్తి భారీగా పెరుగుతోంది. గత రెండు వారాల్లో వైరస్ ప్రభావం రెట్టింపు అయ్యింది. లాక్డౌన్ సమయంలో రోజుకు తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం వీటి సంఖ్య భారీగా పెరిగింది. రోజుకు వందకు పైబడి పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సర్కారు సైతం ఆందోళన చెందుతోంది. బాధితుల సంఖ్య భారీగా పెరిగితే వారికి చికిత్స ఎలా ఇవ్వాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. మే నెల 18 నుంచి లాక్డౌన్ ఆంక్షలు భారీగా సడలించారు. అంతకుముందు నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలు, అత్యవసర సేవలందించే సంస్థలకే అవకాశం ఉండగా.. 18 నుంచి సాధారణ వ్యాపారాలు, రవాణా సౌకర్యం, అంతర్రాష్ట్ర రాకపోకలు.. ఇలా మెజారిటీ రంగాలకు సడలింపులు ఇవ్వగా, ప్రజలు బయటకు రావడం ఒక్కసారిగా పెరిగింది. ముందు అదుపులో ఉన్నా.. రాష్ట్రంలో తొలి కరోనా కేసు మార్చి 2న నమోదైంది. మార్చి 16 నుంచి విద్యా సంస్థలు, ఫంక్షన్ హాళ్లు, సినిమా హాళ్లు, హోటళ్లను ప్రభుత్వం మూసేయగా.. మార్చి 22 నుంచి అత్యవసర సేవలందించే సంస్థలకు మినహా అన్ని రంగాలకు లాక్డౌన్ ప్రకటించింది. మే 18 వరకు లాక్డౌన్ పూర్తిస్థాయిలో కొనసాగడంతో రాష్ట్రంలో 1,592 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా అన్ని రంగాలకు సడలింపులు రావడంతో కేసుల సంఖ్య రెట్టింపయింది. బుధవారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో 3,020 కేసులు నమోదైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. రెండున్నర నెలల పాటు నమోదైన కేసులు.. లాక్డౌన్ సడలింపులతో రెండు వారాల్లోనే రెట్టింపయ్యాయి. ముఖ్యంగా మే 21 నుంచి కేసుల సంఖ్య వరుసగా పెరుగుతూ.. ఒక్కో రోజు వందకు పైబడి కేసులు నమోదవుతున్నాయి. వలస కూలీలకు అనుమతివ్వడం, అంతర్రాష్ట్ర రవాణాకు అనుమతించడంతో రాకపోకలు భారీగా పెరిగాయి. దీంతో గత రెండు వారాల్లోనే రాష్ట్రంలో 1,306 కేసులు నమోదయ్యాయి. ఎక్కువ కేసులు గ్రేటర్ పరిధిలోనే.. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. గత రెండు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,306 కేసులు నమోదు కాగా.. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 805 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 315 మంది వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారున్నారు. రెండు వారాల్లో నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీవే 62 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2 వారాల్లో నమోదైన కేసుల్లో వలస కార్మికులు, విదేశాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే.. 991 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీలో కేసుల శాతం 81 కావడం గమనార్హం. జనసాంద్రత అధికంగా ఉండటం, భౌతికదూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం, జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే కేసులు అధికమవుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో కరోనా తీవ్రత తగ్గినట్లు చాలామంది భావిస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. -
ఎల్లుండి నుంచి ఎగిరిపోవచ్చు!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ లాక్డౌన్ కారణంగా నిలిచి పోయిన విమానాలు తిరిగి ఎగర డానికి సన్నద్ధమవుతున్నాయి. దేశీయ విమానాలు నడిపేందుకు కేంద్రం అనుమతినివ్వడంతో హైదరాబాద్ అంతర్జా తీయ విమానాశ్రయం నుంచి వివిధ నగరాలకు విమానాలను నడిపేందుకు ఎయిర్లైన్స్ సంస్థలు బుకింగ్లు ప్రారంభిం చాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 25న మొదటి విమానం బయల్దేరనుంది. ఆ తర్వాత బెంగళూర్, ముంబై, చెన్నై, కోల్కతా తదితర మెట్రో నగరాలకు విమానాలు వెళ్లనున్నాయి. అనంతరం అన్ని ప్రధాన నగరాలకు హైదరాబాద్ నుంచి విమానాల రాకపోకలు అందుబాటులోకి వస్తాయి. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, కడప తదితర నగరాలకూ పలు ఎయిర్లైన్స్ బుకింగ్లు ప్రారంభించాయి. దశల వారీగా దేశంలోని 35 నగరాలకు విమానయాన సేవలు వినియోగంలోకి రానున్నాయి. పెరిగిన చార్జీలు... లాక్డౌన్ అనంతరం ప్రారంభమవుతున్న అన్ని దేశీయ విమాన సర్వీసుల్లో చార్జీలు పెరిగాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఈనెల 25న టికెట్ ధర రూ.8,407 ఉంది. స్పైస్జెట్లో ఇది రూ.11,220 వరకు ఉంది. హైదరాబాద్–చెన్నై టికెట్ ధర రూ.4,551 ఉండగా.. ముంబైకి రూ.4,603 చార్జీ ఉంది. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, తదితర నగరాలకు కూడా చార్జీలు పెరిగాయి. కరోనా కారణంగా విమానంలోని సీట్ల సం ఖ్యను తగ్గిస్తున్నారు. 80 నుంచి 100 సీట్లున్న చిన్న ఫ్లైట్లలో సుమారు 40 నుంచి 50 సీట్లు మాత్రమే వినియోగంలోకి రానున్నాయి. అలాగే 250 నుంచి 300 సీట్లుండే ఫ్లైట్లలోనూ సీట్ల సంఖ్యను భారీగా కుదించనున్నారు. ప్రతి విమానంలో చివరి 3 సీట్లను వదిలేస్తారు. ప్రయాణ సమయంలో అనుకోని విధంగా ప్రయాణికులు అనారోగ్యానికి గురైనా, కరోనా లక్షణాలు కనిపించినా వారిని వెనుక సీట్లలోకి మారుస్తారు. కరోనా నిబంధనల మేరకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అన్నివిధాలుగా సిద్ధం చేశారు. ఎయిర్ పోర్టులోకి ప్రవేశించి విమానం ఎక్కే వరకు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. -
ఉద్యోగాలు పోతున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: దేశంలో రోజురోజుకు నిరుద్యోగం పెరిగిపోతోంది. కరోనా కారణంగా అమలు చేస్తున్న లాక్డౌన్తో కూలీలు ఉపాధికి దూరమయ్యారు. వివిధ రంగాల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. లాక్డౌన్ ప్రభావం అసంఘటిత రంగంపై తీవ్రంగా పడింది. మార్చి ఒకటో తేదీ నాటికి దేశంలో నిరుద్యోగం 7.91 శాతమే ఉండగా అనేక రంగాల్లో ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి శనివారం నాటికి అది 23.56 శాతానికి చేరుకుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి 9 శాతం ఉన్న నిరుద్యోగం.. మార్కెట్ పరిస్థితులు దిగజారిపోవడంతో 25 రోజుల్లోనే 14 శాతం నిరుద్యోగం పెరిగింది. ప్రసుత్తం 23.56 శాతం ఉన్న నిరుద్యోగం ఈ నెలాఖరుకు 26 శాతానికి చేరుకుంటుందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అంచనా వేసింది. మార్చి ఒకటో తేదీన పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.63 శాతం ఉంటే ఈనెల 25వ తేదీ నాటికి 25.46 శాతానికి చేరుకుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 7.58 శాతం నుంచి 22.71 శాతానికి పెరిగింది. లాక్డౌన్ నుంచి మొదలుకొని.. మార్చి 22న ప్రకటించిన లాక్డౌన్ ప్రభావం ఆ నెలలో కనిపించకపోయినా వారం రోజుల తర్వాత ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తన ప్రభావాన్ని భారీగా చూపింది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోవడంతో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ను కఠినంగా అమలు చేయడంతో నిరుద్యోగం పెరుగుతూ వచ్చింది. ఏప్రిల్ రెండో వారం నుంచి దీని ప్రభావం తీవ్రంగా పడింది. ఏప్రిల్ మొదటి వారంలో పెరుగుదల సాధారణంగా ఉన్నా.. రెండో వారంలో పెరుగుదల ఎక్కువవుతూ వచ్చింది. మూడో వారం గడిచేసరికి 23.56 శాతానికి చేరింది. పునరుద్ధరణ ప్రభుత్వాలకు సవాలే: ప్రొఫెసర్ కోదండరామ్ సర్వీసు సెక్టార్ నిలిచిపోయింది. ఐటీ రంగం, రియల్ ఎస్టేట్ ఆగిపోయింది. హౌస్హోల్డ్ సేవలు నిలిచిపోయాయి. భవన నిర్మాణ కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. అగ్రికల్చర్ కొంత కొనసాగుతున్నా లాక్డౌన్ ప్రభావం తీవ్రంగానే పడింది. రాష్ట్రంలో 50 శాతం కార్మికులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నవారున్నారు. అసంఘటిత రంగంలో దినసరి వేతన కూలీలు, ప్లంబర్స్, వెల్డర్స్, ఎలక్ట్రీషియన్ రంగాల్లోని వారికి పనే లేదు. వాటన్నింటిని ఎలా పునరుద్ధరిస్తారనేదే ఇప్పుడు ప్రభుత్వాలకు పెద్ద సవాలే. అన్నింటి కంటే మెజారిటీ కార్మికులు, ఉద్యోగులున్న అసంఘటిత రంగాన్ని ముందుగా రివైవ్ చేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో అందుకు ఉపాధి హామీ లాంటి కార్యక్రమం చేపట్టాలి. ధాన్యం నిల్వలు అధికంగా ఉన్నందునా పని చేసిన వారికి వాటిని పంపిణీ చేయడం తిండి లేక ఇబ్బంది పడే పరిస్థితి పోతుంది. ఇదీ రాష్ట్ర పరిస్థితి.. ఇక తెలంగాణలో లేబర్ పార్టిసిపేషన్ రేట్ (ఎల్పీఆర్) గతేడాది డిసెంబర్ మధ్యలో 53.44 ఉండగా, నిరుద్యోగం రేట్ 2.30 శాతంగా ఉంది. అది మార్చి చివరి నాటికి 5.8 శాతానికి పెరిగింది. ఈ నెలాఖరుకు నెలవారీ లెక్కలు రానున్నాయి. అయితే దేశంలో నిరుద్యోగం రేటు (అన్ ఎంపాయ్మెంట్ రేట్–యూఈఆర్) ఏప్రిల్ 1 నుంచి 25 రోజుల్లోనే అంతకుముందు ఉన్నదానిపై 14 శాతం పెరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో నిరుద్యోగం రేట్ యావరేజ్గా 15 శాతం వరకు వెళ్లే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో గత డిసెంబర్లో ఎల్పీఆర్ 43.13 శాతం ఉండగా, యూఈఆర్ 4.22 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీఆర్ 60.61 శాతం ఉండగా యూఈఆర్ 1.35 శాతంగా ఉంది. తగ్గిపోయిన కార్మిక భాగస్వామ్యం సుదీర్ఘ లాక్డౌన్తో దేశంలో కార్మిక భాగస్వామ్యం తగ్గిపోయింది. దినసరి వేతన కూలీలు, భవన నిర్మాణ కార్మికుల ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సేవా రంగంలోనూ పనులు లేకుండా పోయాయి. దీంతో కార్మిక భాగస్వామ్యం రేటు 41.96 శాతం నుంచి 35.01 శాతానికి పడిపోయింది. ఉద్యోగ, ఉపాధి రేటు కూడా భారీగా పడిపోయింది. మార్చి ఒకటో తేదీ నాటికి ఉపాధి 39.84 కోట్ల మందికి ఉంటే ఏప్రిల్ 19 నాటికి 27.07 కోట్ల మందికే ఉపాధి ఉన్నట్లుగా తేల్చింది. అంటే దేశంలో కార్మికులు, చిన్న ఉద్యోగులు 12.77 శాతం మంది ఉద్యోగ, ఉపాధిని కోల్పోయారు. -
అసలు సమస్య ఆ 6%
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ ఉల్లంఘనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. జిల్లాల్లో ప్రజలు నూటికి నూరు పాళ్లు సహకరిస్తుంటే.. పట్టణాల్లో మాత్రం లాక్డౌన్ ఆశయాన్ని నీరుగార్చేలా.. పోలీసుల ప్రయత్నాలను అపహాస్యం చేసేలా కొందరు ప్రవర్తిస్తున్నారు. లాక్డౌన్ ఎంతకాలం కొనసాగించాలి? అన్న అంశంపై ఆన్లైన్లో తెలంగాణ పోలీసులు ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. అందులో లాక్డౌన్ను సమర్థిస్తూ దాదాపుగా 94 శాతం మంది మద్దతు తెలిపారు. కానీ, కేవలం 6 శాతం మంది మాత్రం లాక్డౌన్ ఎందుకు పెట్టారు? దాని ఉద్దేశం ఏంటి? దానివల్ల ప్రయోజనాలు ఏంటి? అన్న విషయాలపై అస్సలు తమకు ఐడియానే లేదని సమాధానమిచ్చారు. వీరితోనే అసలు సమస్య అని పోలీసులు పేర్కొంటున్నారు. వీరికి కనీసం లాక్డౌన్ సమయాలపై కూడా అవగాహన లేకపోవడం గమనార్హం. అందుకే, ఇష్టానుసారంగా వేళాపాళా లేకుండా బయటికి వస్తున్నారు. వీరు వైరస్ క్యారియర్లుగా మారితే కరోనా కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముం దని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. వీరే ప్రమాదం.. లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్న వారిలో జిల్లాల వాసులు, గ్రామీణులు ముందున్నా.. నగరాలు, పట్టణాల్లో కొందరు ఆకతాయిలు మాత్రం వీటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఈ పోకడలు గ్రేటర్ పరిధిలో మరీ అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకూ లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లమీదకు వచ్చిన లక్షకుపైగా వాహనాలు కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే కావడం విశేషం. వీరికి నిబంధనల పట్ల ఏమాత్రం లెక్కలేదన్న విషయం దీనితో తేటతెల్లమవుతోంది. ఉల్లంఘనుల్లో అధికశాతం చదువుకున్న యువతే కావడం గమనార్హం. ఉల్లంఘనల శాతం జిల్లాల్లో 30 శాతంగా ఉండగా, హైదరాబాద్లో మాత్రం 50 శాతంగా ఉండటం గమనార్హం. ఇక పాతబస్తీలో లాక్డౌన్ నిబంధనలు సరిగా అమలు కావడం లేదు. లాక్డౌన్ అంటే అస్సలు ఐడియాలేని వారిలో ఇక్కడే అధికంగా ఉన్నారు. ఈ ఆరుశాతం మంది కరోనా వైరస్ను మోసుకెళ్లే క్యారియర్లుగా మారే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం పూట సడలింపుతో.. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు కిరాణా, ఇతర నిత్యావసర సరుకుల వ్యాపారాలకు అనుమతి ఉంది. కానీ, ఇదే ఆసరాగా చేసుకుని చాలామంది భౌతికదూరాన్ని పాటించడం లేదు. అసలే కరోనా పాజిటివ్ కేసుల్లో గ్రేటర్ మొదటిస్థానంలో ఉన్నా, ఇక్కడ కొందరు ప్రజలు ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగిలిన జిల్లాల్లో పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతుంటే.. ఇక్కడ అలాంటి పరిస్థితులు కనిపించకపోవడం గమనార్హం. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అసలు లాక్డౌన్ లక్ష్యం నెరవేరకుండా పోతుందని, ఆయా ఏరియాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ధరలు డబుల్!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్.. నిత్యావసర సరుకులు మినహా మిగతా వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలన్నీ బంద్. కొన్ని రంగాలకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలాంటి మినహాయింపులు లేవని స్పష్టం చేయడంతో దుకాణాలకు పడిన తాళం తెరవని పరిస్థితి నెలకొంది. ఇదంతా ఒకవైపు మాత్రమే. దీర్ఘకాలంగా వ్యాపారం నడవకుంటే గిట్టుబాటు కాదనుకున్న కొందరు వ్యాపారులు దొడ్డి దారిన అమ్మకాలకు తెరలేపారు. అది కూడా రెట్టింపు ధరలకు.. కొనుగోలుదారు అవసరాన్ని బట్టి విక్రయాలను జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా నిర్మాణ రంగంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టనప్పటికీ.. ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాల పనులను అంతర్గతంగా సాగిస్తున్నారు. అవసరమైన మెటీరియల్ కొనేందుకు సంబంధిత డీలర్లు, వ్యాపారులను సంప్రదిస్తుండగా ధరలను అమాంతం పెంచేస్తున్నారు. కొందరు రాత్రిపూట దుకాణాలను తెరుస్తుండగా.. మరికొందరు దొడ్డి దారిని ఎంచుకుని కస్టమర్లకు అవసరమైన సామగ్రిని సర్దుతున్నారు. కార్మికులు, కూలీలున్నారని... మార్చి 22న జనతా కర్ఫ్యూ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించింది. ఆ తర్వాత కేంద్రం దేశవ్యాప్త లాక్డౌన్కు పిలుపునిచ్చింది. ఏప్రిల్ 14 వరకు ప్రకటించిన లాక్డౌన్.. అనంతరం మే 3వరకు పొడిగించింది. దీంతో ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు, కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. కొందరు సొంత ప్రాంతాలను కాలిబాటన ప్రయాణం కాగా.. మరికొందరు తమ ఓనర్ల వద్దే తలదాచుకున్నారు. లాక్డౌన్ పొడిగించడంతో అటు పనిలేక, ఇటు పైసలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు నిర్మాణదారులు వారికి ఆశ్రయం కల్పిస్తూ వారితో మిగులు పనులను చేయించేందుకు ఉపక్రమించారు. దీంతో వారికి ఉపాధి దొరకడంతో పాటు వీరికి పనులు పెండింగ్లో కాకుండా కొనసాగించే వెసులుబాటు వచ్చింది. భగభగలే.. అయినా కొనుగోలే... బడా నిర్మాణ సంస్థలు అవసరమైన సామగ్రిని ముందస్తుగా సిద్ధం చేసుకున్నప్పటికీ.. వ్యక్తిగత నిర్మాణాలు, చిన్నపాటి ఇళ్లను నిర్మిస్తున్న వారు ఎప్పటికప్పుడే తెచ్చుకుంటారు. లాక్డౌన్ రెండోసారి పొడిగించిన తర్వాత అప్పటివరకు నిలిచిపోయిన పనులను మెల్లగా ప్రారంభించారు. ఈనెల 20 నుంచి కేంద్రం ఇచ్చిన సడలింపుల ప్రకారం కొందరు పనులు వేగిరం చేశారు. అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడం కత్తిమీద సాములా మారింది. చాలా చోట్ల డీలర్లు ధరలు పెంచేస్తున్నారు. సిమెంటు, స్టీలు, హార్డ్వేర్, సానిటరీ, రంగులు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సరుకుల ధరలు 30% నుంచి రెట్టింపు చేసి విక్రయిస్తున్నారు. ఇసుక, ఇటుక, కంకర, గ్రానైట్ (రాళ్లు) ధరలూ భారీగా పెరిగాయి. అయినా కొనుగోలుదారులు వెనక్కు తగ్గడం లేదు. నిర్మాణ పనులను నిలిపేయడం కంటే కాస్త ఎక్కువ పెట్టి సాగించడమే మేలని భావిస్తున్నారు. సమయం కలసిరావడంతో పాటు కూలీలు, కార్మికుల కొరతను సర్దుబాటు చేసుకోవచ్చని భావిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత జరిగే పరిణామాలను అంచనా వేస్తూ నిర్మాణ పనులను కానిచ్చేస్తున్నారు. అపోహలు.. వదంతులు.. రాష్ట్రంలో లాక్డౌన్ మే 7 వరకు కొనసాగనుంది. ఇటు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరికొంత పొడిగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో మరికొన్ని రోజులు నిర్మాణ పనులు నిలిచిపోతాయనే భావన నిర్మాణదారుల్లో ఉంది. మరోవైపు సరుకు రవాణా కష్టమవుతుందని, నిర్మాణ సామగ్రికి తీవ్ర కొరత ఏర్పడుతుందని దుకాణదారులు ప్రచారం చేస్తున్నారు. ఈ అపోహలు, వదంతుల మధ్య వ్యాపారులు ధరలు పెంచేసి సొమ్ము చేసుకుంటుండగా.. నిర్మాణదారులు మాత్రం ముందు జాగ్రత్త కింద స్టాకును తెచ్చిపెట్టుకుంటున్నారు. నగర శివార్లు, పట్టణ ప్రాంతాల్లో.. జోరుమీదున్న రియల్ ఎస్టేట్ రంగం స్పీడు ఈ ఏడాది జనవరిలో కాస్త తగ్గింది. అయితే పట్టణాలు, గ్రేటర్ హైదరాబాద్ శివారుల్లో నిర్మాణ పనులు ఆశాజనకంగానే ఉన్నా యి.చాలాచోట్ల కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదలుపెట్టినవి మెజార్టీ 50 శాతంపైగా పూర్తయ్యాయి. మిగతావి పూర్తి చేసేలోపు కరోనా వ్యాప్తి.. లాక్డౌన్ రావడంతో ఈ ప్రభావం నిర్మాణ పనులపై పడింది. రెండో విడత లాక్డౌన్ వున్నా కొందరు అంతర్గతంగా పనులు చేయిస్తున్నారు. కార్మికులు, కూలీలకు,ఓనరకూ నష్టం లేకుండా ఉంది. కొన్ని రకాల నిర్మాణ సామగ్రి ధరలు ఇలా.. ► భవన నిర్మాణంలో కీలకమైంది సిమెంటు, ఇసుక. ప్రస్తుతం సిమెంటు దుకాణాలు మూతబడటంతో అవసరమున్న వారు రెట్టింపు ధరను చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. లాక్డౌన్కు ముందు సాధారణ రకం, బ్రాండెడ్ రకం ఒక్కో బ్యాగు ధర రూ.240 నుంచి 320 మధ్య ఉండగా.. ప్రస్తుతం రూ.450 నుంచి 520 వరకు విక్రయిస్తున్నారు. ► లాక్డౌన్తో ప్రస్తుతం ఇసుక రవాణా నిలిచిపోయింది. అయితే ఈ వ్యాపారం చేసే వాళ్లు ఇసుకను డంప్ చేస్తుంటారు. దీంతో అవసరమున్న నిర్మాణదారులు సమీపంలో ఉన్న సాండ్ డంపింగ్ యార్డు నుంచి కొనుగోలు చేస్తున్నారు. నెల రోజుల క్రితం టన్ను ఇసుక రూ.2,100 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.3,600 నుంచి రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. ► నెల రోజుల క్రితం ఇటుక సాధారణ రకం, లైట్ వెయిట్ రకం ధరలు రూ. 5.25 నుంచి రూ. 7.50 ఉండగా.. ప్రస్తుతం రూ.10 నుంచి రూ.11.50 చొప్పున అమ్ముతున్నారు. ► రెడీమెడ్ డోర్లు చదరపు అడుగు (స్క్వేర్ ఫీట్) రూ.80 ఉండగా.. ప్రస్తుతం రూ.130 నుంచి రూ.150 చొప్పున విక్రయిస్తున్నారు. ► ఎలక్ట్రికల్ సామగ్రిపై కనిష్టంగా రూ.40 శాతం అధికంగా విక్రయిస్తున్నారు. హార్డ్వేర్, శానిటరీ సరుకు లు కూడా ఇదే తరహాలో ధరలు పెంచేశారు. ► మరోవైపు సరుకు రవాణా చేసే వాహనదారులు సైతం చార్జీలను ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. -
‘ఎల్పీజీ’పై తొందరవద్దు!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతుండంతో వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. లభ్యత తగ్గిపోతుందన్న ఆందోళనతో వినియోగదారులు అవసరానికి మించి బుకిం గ్లు చేస్తుండటంతో డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఆయిల్ కంపెనీలపై ఒత్తి డి పెరుగుతోంది. ఈ క్రమంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఎక్కడా లేదని, విని యోగదారులు ఆందోళనకు గురికావొద్దని ఇండియన్ ఆయిల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కళికృష్ణ ప్రకటించారు. కొరత లేదు.. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి, మా ర్చి నెలల్లో బుకింగ్లు పెరి గాయి. దేశవ్యాప్తంగా రోజుకు 15–18 లక్షల బుకింగ్లు ఉం టుండగా, మార్చి నాటికి 20 నుంచి 22 లక్షలకు పెరిగాయి. పది రోజులుగా ఏకంగా రోజుకు దేశవ్యాప్తంగా 25లక్షల బు కింగ్లు జరుగుతున్నాయి. హైదరాబాద్లో రోజుకు 2లక్షల వరకు బుకింగ్లు ఉంటుం డగా, అవిప్పుడు ఏకంగా 3.50లక్షల వరకు పెరిగాయి. రెండ్రోజుల కిందట వరకు తొలి సిలెండర్ బుకింగ్ చేసిన అనంతరం రెండో బుకింగ్ చేసేందుకు కేవలం ఒక్క రోజు వ్యవధి మాత్రమే ఉండటంతో బుకింగ్లు పెరగడంతో, ఆయిల్ కంపెనీలు పలు ఆంక్షలు తెచ్చాయి. ఒక్కో సిలిండర్ బుకింగ్కు మధ్య గ్యాప్ను 14 రోజులకు పెంచాయి. అంటే 14 రోజుల తర్వాతే రెండో సిలిండర్ బుక్ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన తగ్గించే ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్తో పాటే ఎల్పీజీ నిల్వలు సరిపడేంతగా ఉన్నాయని, సాధారణంగా సరఫరాను సైతం కొనసాగిస్తున్నాయని ప్రకటించింది. అనవసరం బుకింగ్లు వద్దని, డిజిటల్ చెల్లింపులకు మొగ్గు చూపాలని సూచనలు చేసింది. ఎల్పీజీ వినియోగదారుల కోసం హెల్ప్లైన్ 1906ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. -
తరుముకొస్తున్న కరోనా!
సాక్షి, హైదరాబాద్: సామాజిక దూరం పాటించడం ఒక్కటే ప్రస్తుతానికి కరోనాను నియంత్రించే పద్ధతి గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా జ నం చెవికెక్కటం లేదు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు జోడించి అ ర్థించినా ప్రజల తీరు మారటం లేదు. లాక్డౌన్కు సంబంధించి కఠిన ఆంక్షలు విధించినా నిత్యావసర వస్తువుల కోసం ఉదయం నుంచి సాయంత్రం వర కు ప్రజలు రోడ్లపైకి వచ్చే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ వెసులుబాటును దుర్వినియోగం చేస్తూ ప్రజలు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నా రు. మార్కెట్లు, మెడికల్స్ ఎదుట గుంపులుగా పోగ వుతూ సాధారణ రోజులను తలపిస్తున్నారు. ఇప్పు డు ఈ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా పరిణ మించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న పాజిటివ్ కేసులు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉంది. సగటున దేశంలో రోజూ 100కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వచ్చే పక్షం రోజులు మనకు కీలక తరుణం. జాగ్రత్తగా ఉండాలంటూ స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జాగ్రత్తపడాల్సిన అతివిలువైన సమయాన్ని దుర్వినియోగం చేసినందున తీవ్ర భయంకర పరిస్థితిని చవిచూస్తున్నామని, మీరైనా జాగ్రత్త పడండంటూ ఇటలీ, స్పెయిన్ దేశాలకు చెందిన పౌరులు మన దేశానికి సూచిస్తున్న వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు ఉదయం ఆరుకు ముందు, సాయంత్రం ఆరు తర్వాత రోడ్లు ఖాళీగా మారి జనం ఇళ్లకే పరిమితమవుతున్నా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు జన సమూహాలు కనిపిస్తున్నందున లాక్డౌ న్ ఉద్దేశం నీరుగారుతోందని నిపుణులు అంటున్నా రు. ప్రస్తుతం రెండో దశలో ఉన్న కరోనా వ్యాప్తి, మూడో దశకు చేరుకుంటే చేతులెత్తేయటం తప్ప చేసేదేమీ ఉండదని గట్టిగానే హెచ్చరిస్తున్నా చాలా మందిలో ఆ భయం ఎక్కడా కనిపించటం లేదు. అవగాహన ఎటు పోతోంది? ఉదయం నుంచి రాత్రి వరకు ఏ టీవీ న్యూస్ చానల్ పెట్టినా కరోనాకు సంబంధించిన వార్తలే ప్రసారమ వుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ చానళ్లలో కూడా ప్రముఖుల సందేశాలు ప్రసారమవుతున్నాయి. వైరస్ వ్యాప్తి అత్యంత ఉధృతంగా ఉండి రోజుకు సగటున 600 మందికి పైగా చనిపోతున్న ఇటలీ, స్పెయిన్ దేశాలకు సంబంధించిన దృశ్యాలు ప్రసారమవుతున్నాయి. వీటన్నింటికి మించి వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో భయం పుట్టించే తరహాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రజల్లో చైతన్యం రాకపోవటం గమ నార్హం. సాధారణంగా ఆంక్షలు విధించినప్పుడు భయంతో అమలు చేయటం కద్దు.. కానీ, కరోనాలాంటి భయంకర వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నా.. జాగ్రత్తలు పాటించకపోవటం విచిత్రం. పోలీసులున్నప్పుడు జాగ్రత్తగా.. ప్రజలను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు రోడ్లపైనే ఉంటున్నారు. వారున్న సమయంలో మాత్రం దుకాణాల ముందు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు మొదలు చిన్నచిన్న కూరగాయల బండ్ల వరకు పోలీసులు కనీసం ఒక మీటర్ దూరం చొప్పున చాక్పీసులతో రోడ్లపై వృత్తాకారంలో గీతలు గీయించారు. వాటిల్లో ఒకరి తర్వాత ఒకరు నిలబడాలని ఆదేశించారు. పోలీసులున్న సమయంలో అలాగే ఉంటున్నారు. వారు అక్కడి నుంచి వెళ్లిపోగానే గుంపులుగా పోగవుతు న్నారు. కొన్ని దుకాణాల నిర్వాహకులు మాత్రం తగిన సూచనలు చేస్తుండటంతో వాటి ముందు పోలీసులు చెప్పినట్టుగా ఉంటున్నారు. మిగతావాటి ముందు యజమానులు పట్టించుకోకపోతుండటంతో షరామామూలుగానే ఉంటోంది. కూరగాయల మార్కెట్లలో దారుణం హైదరాబాద్లోని ప్రధాన కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఎక్కడా ఆంక్షలు అమలు కావటం లేదు. ఒక్కో దుకాణం వద్ద పదుల సంఖ్యలో గుమికూడుతున్నారు. ప్రస్తు తం రాష్ట్రంలో ఎక్కడా కూరగాయలకు కొరత లేదు. అయినా జనం మార్కెట్లకు ఎగబడుతున్నారు. కఠిన ఆంక్షలు అవసరం కూరగాయల మార్కెట్ల వద్ద వలంటీర్లనో, పోలీసు లనో ఉండేలా చేస్తే తప్ప తీరు మారే సూచనలు కనిపించటం లేదు. ఎక్కడైనా జనం గుమికూడితే చర్యలు తీసుకుంటామనో, యజమానులపై కఠినం గా వ్యవహరిస్తామనో... హెచ్చరిక చేయాల్సి ఉంది. ప్రస్తుతం అన్ని విభాగాల సిబ్బంది ఇళ్లకే పరిమిత మైనందున అటువంటి వారి సేవలను ఇందుకు వినియోగించాలని, వారికి ఆరోగ్యపరంగా ఇబ్బం ది లేకుండా డ్రెస్సులు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌస్లు ఇచ్చి, ప్రత్యేక గౌరవ వేతనం చెల్లిస్తూ వినియోగించుకోవాలన్న సూచనలు వస్తున్నాయి. -
ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్లో..
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా జన సంచారం లేక బోసిపోతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు స్వీయ నిర్బంధం పేరిట ఇళ్లకే పరిమితం కావడంతో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగింది. దీంతో పెరిగిన ఆన్లైన్ రద్దీని తట్టుకునేందుకు టెలికం సంస్థలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇంటర్నెట్ సామర్థ్యం పెంపుదలపై దృష్టి సారించారు. మార్చి మొదటి వారంలో రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో పలు ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రం హోమ్) వెసులుబాటును కల్పించాయి. విద్యాసంస్థల మూసివేత, కార్పొరేట్, ప్రభుత్వ సంస్థలు కూడా ఇళ్ల నుంచే పని చేయాలని తమ ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు ఐదున్నర లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా, సుమారు 70 శాతం మంది ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి అవసరమైన సాంకేతిక వసతులు సమకూర్చేందుకు ఐటీ సంస్థలు ఇంటర్నెట్ సేవలు అందించే డాంగుల్స్ను గంప గుత్తగా కొనుగోలు చేశాయి. గతంలో రూ.999 మేర పలికిన డాంగుల్ ధర ప్రస్తుతం రెండింతలు పలుకుతోంది. మరోవైపు మార్చి రెండో వారం నుంచి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ల కోసం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కు ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. గతంలో ఉన్న బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ల సంఖ్యతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో కేవలం పక్షం రోజుల వ్యవధిలో మూడింతలు పెరిగినట్లు సర్వీస్ ప్రొవైడర్లు చెప్తున్నారు. ఆన్లైన్లోనే గడుపుతున్న జనం లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన జనం ఎక్కువ సమయం ఆన్లైన్లోనే గడుపుతున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల వినియోగం పెరగడంతో పాటు వినోదం కోసం ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో మొబైల్ ఇంటర్నెట్ వాడకం కూడా గణనీయంగా పెరిగిందని టెలికం సంస్థలు చెప్తున్నాయి. బ్యాం కింగ్ లావాదేవీలు కూడా ఆన్లైన్ విధానంలో జరుగుతుండటం కూడా ఇంటర్నెట్ వాడకం పెరిగేందుకు దోహదం చేస్తోంది. దేశవ్యాప్తంగా మార్చి రెండో వారంతో పోలిస్తే ప్రస్తుతం 30 శాతం మేర డేటా వినియోగం పెరగ్గా, మెట్రో నగరాల్లో ఇది మరింత ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆన్లైన్ వినియోగం పెరిగిపోవడంతో రద్దీ పెరిగి ఇంటర్నెట్ వేగం తగ్గినట్లు వినియోగదారులు చెప్తున్నారు. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెరిగిన ఇంటర్నెట్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన సేవలు అందించేందుకు టెలికం సంస్థలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీ) ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాయి. సమాచార, వినోద రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) సర్వీస్ ప్రొవైడర్లు వీడియోల నాణ్యతను తగ్గించాయి. వీడియో నాణ్యతను తగ్గించడం ద్వారా సుమారు 20% మేర డేటాను పొదుపు చేయ డం సాధ్యమవుతుందని ఓటీటీ సర్వీస్ ప్రొవైడర్లు చెప్తున్నారు. మరోవైపు పెరిగిన ఇంటర్నెట్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని టెలికామ్ సంస్థలు, ఐఎస్పీలు బ్యాండ్విడ్త్ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. రాష్ట్రంలో బలమైన ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ వ్యవస్థ, డేటా సెంటర్లు ఉన్నందున బ్యాండ్విడ్త్ (సామర్థ్యం) పెంచడంలో ఎలాంటి ఇబ్బందులు లేవని ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. -
బాబోయ్ ధరలు... ఫిర్యాదుల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసరాల ధరల పెరుగుదలపై పౌర సరఫరాల శాఖకు ఫిర్యాదులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ముఖ్యంగా కూరగాయలు, పప్పుల ధరలు పెంచేస్తున్నారంటూ వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. గురువారం ఒక్కరోజే ఇలాంటివి నాలుగు వందల వరకు వచ్చాయి. వీటితో పాటే రేషన్ బియ్యం సరఫరా, ప్రభుత్వం ప్రకటించిన రూ.1,500 సాయం ఎప్పటిలోగా వేస్తారన్న అంశాలపైనా అధికంగా ఫోన్లు చేశారు. రేషన్ వినియోగదారుల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు పౌర సరఫరాలశాఖ 1967, 180042500333 టోల్ఫ్రీ నంబర్తో పాటు 7330774444 వాట్సాప్ నంబర్, 040–23447770 ల్యాండ్లైన్ నంబర్ను అందుబాటులో ఉంచింది. అధిక ధరలకు నిత్యావసరాలు విక్రయించారన్న ఫిర్యాదులను వాటికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. ఈ నంబర్లకు ఉదయం 10 గంటల నుంచే ఫోన్లు మొదలయ్యాయని వినియోగదారుల ఫోరం డైరెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఇక ఫిర్యాదులను క్రోడీకరించి జిల్లాల వారీగా విభజించి ఆయా జిల్లా అధికారుల పరిశీలనకు పంపారు. వాటి ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. -
మెరిసిన బంగారం..
ముంబై: కోవిడ్–19 ప్రభావ మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు సురక్షిత సాధనం– యల్లో మెటల్వైపు ఒక్కసారిగా దృష్టి సారించారు. దీనితో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్– నైమెక్స్లో పసిడి ఔన్స్ (31.1 గ్రాములు) మంగళవారం ఒకేరోజు ఏకంగా 130 డాలర్లు పెరిగింది. సోమవారం ఇక్కడ ధర ముగింపు 1568 డాలర్లు. మంగళవారం ట్రేడింగ్ ఒక దశలో 1,698 డాలర్లను తాకింది. ఈ వార్త రాసే రాత్రి 10 గంటల సమయంలో కొంత లాభాల స్వీకరణకులోనై 1,660 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 101కి డాలర్ ఇండెక్స్... ఇదే సమయంలో ఆరు దేశాలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 101.50కి పడిపోయింది. సోమవారం ముగింపు 103.24 కావడం గమనార్హం. అమెరికాలో కోవిడ్–19 మరణాలు పెరుగుతుండడం, ఆర్థిక వ్యవస్థ, ఈక్విటీల బలహీన ధోరణి నేపథ్యంలో ఇన్వెస్టర్లు డాలర్ల నుంచి కూడా పెట్టుబడులను వెనక్కు తీసుకుని తిరిగి పసిడిలోకి తరలించారని కొన్ని వర్గాల విశ్లేషణ. ఇదే పరిస్థితి కొనసాగితే, రెండు వారాల క్రితం చూసిన తన తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,704 డాలర్ల (52 వారాల గరిష్టం)ని మళ్లీ పసిడి అధిగమించి 1,800 డాలర్ల దిశగా దూసుకుపోయే అవకాశం ఉంది. రూపాయికి 26 పైసలు లాభం... అంతర్జాతీయంగా బలహీనపడిన డాలర్ ఇండెక్స్, ఈక్విటీల రిలీఫ్ ర్యాలీ వంటి అంశాల నేపథ్యంలో మంగళవారం డాలర్ మారకంలో రూపాయి విలువ నాలుగు ట్రేడింగ్ సెషన్ల వరుస చరిత్రాత్మక పతన స్థాయి నుంచి కొంత కోలుకుంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 26పైసలు కోలుకుని 75.94 వద్ద ముగిసింది. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ఆర్థిక ప్యాకేజీపై కేంద్రం కసరత్తు చేస్తోందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన కూడా రూపాయి సెంటిమెంట్ను బలపరిచింది. మంగళవారం ఒక దశలో 76.40ని కూడా రూపాయి చూసింది. ఇది ఇంట్రాడేలో చరిత్రాత్మక కనిష్టం. ప్రత్యామ్నాయం పసిడే: డబ్ల్యూజీసీ ప్రస్తుత తీవ్ర ఆర్థిక అనిశ్చితి, ఒడిదుడుకుల పరిస్థితుల్లో పెట్టుబడులకు ప్రత్నామ్నాయం బంగారమేనని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) తన తాజా నివేదికలో పేర్కొంది. పెట్టుబడుల పోర్టిఫోలియోను మెరుగ్గా ఉంచుకోడానికి పసిడి ఎంతో మెరుగైన సాధనమని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో స్టాక్లు, బాండ్ల రిస్క్లకు అలాగే కరెన్సీ విలువలు పడిపోవడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి సమస్యలకూ పసిడి పటిష్ట ప్రత్యామ్నాయ పెట్టుబడిగా నిలుస్తుందని ‘వ్యూహాత్మక అసెట్గా పసిడి’ అన్న నివేదికలో డబ్ల్యూజీసీ విశ్లేషించింది. -
రెచ్చిపోతున్న ఈవ్ టీజర్స్
-
బర్త్ సర్టిఫికెట్ కావాలి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బర్త్ సర్టిఫికెట్ల కోసం బల్దియాకు దరఖాస్తులు అనూహ్య సంఖ్యలో పెరుగుతున్నాయి. అంటే దీనర్థం నగరంలో జననాల రేటు పెరుగుతోందని కాదు.. తాము నగరంలోనే జన్మించామని నిరూపించుకునేందుకు కొందరికి ఉన్నపణంగా అవసరం ఏర్పడిందని.. ఈ దరఖాస్తుదారుల్లో రోజుల వయసున్న పిల్లలతోపాటు.. కాటికి కాలు చాచిన వృద్ధులున్నారు. ముఖ్యంగా పాతబస్తీలో గతంతో పోలిస్తే.. జనన ధ్రువీకరణ దరఖాస్తుల సంఖ్యలో ఆకస్మిక పెరుగుదల నమోదవుతోంది. ప్రతిరోజూ బల్దియాకు వివిధ సర్కిళ్లకు వచ్చే దరఖాస్తులు, జారీ చేసే సర్టిఫికెట్లను పరిశీలిస్తే.. ఈ విషయం తేటతెల్లమవుతోంది. ముఖ్యంగా గతేడాది డిసెంబర్, ఈ జనవరి నెలను పరిశీలిస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) జారీ చేసిన సర్టిఫికెట్ల సంఖ్యలో ఈ తేడా స్పష్టమవుతుంది. ఉదాహరణకు 2020 జనవరి 1వ తేదీన 88 మంది పురుషులకు బర్త్ సర్టిఫికెట్లు మంజూరయ్యాయి. అందులో 38 మంది ఒకే వర్గానికి చెందినవారున్నారు. అదేరోజు 101 మంది మహిళలకు బర్త్ సర్టిఫికెట్లు మంజూరవ్వగా.. అందులో 32 మంది ఒకే వర్గానికి చెందినవారు ఉండటం గమనార్హం. ఇదే గతేడాది జనవరి 1వ తేదీన ఇందులో సగం సంఖ్యలోనే దరఖాస్తులు ఉండటం ఆశ్చర్యానికి గురి చేసిందని ఓ జీహెచ్ఎంసీ అధికారి వెల్లడించారు. దాదాపు రోజువారీ సగటు కంటే 100 శాతం దరఖాస్తులు పెరిగాయని అధికారులు అంటున్నారు. పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ) అమల్లోకి వచ్చాకే.. ఈ దరఖాస్తులు పెరిగాయని కూడా అధికారులు చెబుతున్నారు. మరీ నిజాం కాలం నాటి సర్టిఫికెట్లా? ‘1936లో జన్మించిన నాకు బర్త్ సర్టిఫికెట్ ఇవ్వండి.. 1945లో పుట్టిన నాకు జనన ధ్రవీకరణ పత్రం ఇవ్వండి..’అంటూ పాతబస్తీలోని వివిధ సర్కిల్ ఆఫీసుల్లో బల్దియా అధికారులకు మునుపెన్నడూ చూడని దరఖాస్తులు వస్తున్నాయి. 86 ఏళ్లు పైబడిన వ్యక్తికి ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్తో ఏం పని? అని అధికారులు ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో స్వాతంత్య్రానికి పూర్వం, నిజాం హయాంలో ఉన్న బల్దియా రికార్డులను తిరగేయాల్సి రావడంతో ఇవి సహజంగానే జీహెచ్ఎంసీ అధికారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీరి రికార్డుల వెరిఫికేషన్ కోసం అధికారులు నానాతంటాలు పడుతున్నారు. పాత నిజాం కాలం నాటి ఉర్దూలో ఉన్న రికార్డులను తిరగేయాల్సి వస్తోంది. అందులో 99 శాతం దరఖాస్తుల్లో వీరి డేటా దొరకడం లేదు. దీంతో ఆర్డీవో, పోలీసులకు వీరి దరఖాస్తును విచారణ కోసం పంపుతున్నారు. దరఖాస్తుదారుడు విద్యావంతుడైతే.. అందుబాటులో ఉన్న పత్రాల ఆధారంగా ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. లేని వారికి దరఖాస్తుదారుడు సమర్పించిన వివరాల ఆధారంగా మంజూరు చేస్తారు. వక్ఫ్బోర్డుకూ అదే రీతిలో దరఖాస్తులు ఇటు వక్ఫ్ బోర్డుకు సైతం వివాహ ధ్రువీకరణ పత్రాలు కావాలంటూ దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. గతంలో రోజుకు 100 నుంచి 150 వరకు దరఖాస్తులు వచ్చేవి. అయితే జనవరి నుంచి రోజుకు 450 నుంచి 500కు పైగా దరఖాస్తులు వస్తున్నాయని సమాచారం. ఈ సర్టిఫికెట్లలో కూడా వివాహం జరిగిన తేదీ, సంవత్సరం, జాతీయత తదితర వివరాలు ఉండటం గమనార్హం. అనూహ్యంగా పెరిగిన ఈ దరఖాస్తులను చూసి వక్ఫ్బోర్డు అధికారులే విస్మయం చెందుతున్నారు. ఆ దేశాల వారేనని అనుమానం.. నగరంలోని పాతబస్తీతో పాటు ఇటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో దాదాపుగా 10 వేలకు పైగా బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చెందిన రొహింగ్యాలు శరణార్థులుగా వచ్చి ఆశ్రయం పొందారు. వీరంతా ఇప్పటికే అక్రమ మార్గంలో ఓటరు, ఆధార్, పాన్, పాస్పోర్టులు పొంది భారత పౌరులుగా చలామణి అవుతోన్న విషయం తెలిసిందే. త్వరలో తెలంగాణలోనూ సీఏఏ, జాతీయ పౌర పట్టిక (ఎన్నార్సీ) అమలుకానున్న నేపథ్యంలో వీరంతా బర్త్, మ్యారేజ్ సర్టిఫికెట్లకు తప్పుడు దరఖాస్తులు చేసుకుంటున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. 1936 నుంచి 1980 వరకు పలువురు తమకు కొత్తగా జనన ధ్రువీకరణాలు కావాలని అడుగుతుండటంతో, వాటిలో అనుమానాస్పదంగా.. రికార్డుల్లోలేని దరఖాస్తుల విచారణ కోసం పోలీసులకు అప్పగిస్తున్నారు.