-
ఆస్ట్రాజెనెకా కరోనా టీకాకు మరో షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ వినియోగంపై వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కరోనా వైరస్ నివారణకు గాను వాక్సీన్ తీసుకున్న తరువాత రక్తం గడ్డకడుతున్నట్టు వస్తున్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో టీకా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తాజాగా డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్ దేశాలు గురువారం ప్రకటించాయి. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులకు రక్తం గడ్డకట్టినట్లు కేసులు వెలుగు చూడటంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు డెన్మార్క్ ఆరోగ్య అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది. డెన్మార్క్లో పరిస్థితులు బాగానే ఉన్నా, వ్యాక్సిన్తో ముడిపడి ఉన్న కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. వీటిని మరింత దగ్గరగా పరిశీలించాల్సిన అవసరం ఉందని హెల్త్ అథారిటీ డైరెక్టర్ సోరెన్ బ్రోస్ట్రోమ్ తెలిపారు.అందుకే వాడకాన్ని పూర్తిగా నిషేధించలేదు కానీ, తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. టీకా సురక్షితమైనది సమర్థవంతమైందని రుజువు చేసే విస్తృత డాక్యుమెంటేషన్ ఉంది కానీ, ఇతర యూరోపియన్ దేశాలలో తీవ్రమైన దుష్ప్రభావాల గురించి సమాచారాన్ని పరిశీలించాలని బ్రోస్ట్రోమ్ చెప్పారు. (అమెరికన్ల జీవితాలు మారుతాయ్!) మార్చి 9 నాటికి యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో 30 లక్షలమందికి పైగా టీకాలు తీసుకోగా.. రక్తం గడ్డకట్టిన 22 కేసులు నమోదయ్యాయని యూరోపియన్ మెడిసన్స్ ఏజెన్సీ (ఇఎంఎ) తెలిపింది. అలాగే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కారణంగా ఆస్ట్రియా నర్సు మరణించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. టీకా తీసుకున్న తరువాత ఆమె తీవ్రమైన రక్త గడ్డంకట్టే సమస్యతో చనిపోవడంతో ఆస్ట్రాజెనెకా టీకా వాడకాన్ని నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నాలుగు యూరోపియన్ యూనియన్ దేశాలు ఎస్టోనియా, లాట్వియా, లిధుయేనియా, లక్సంబర్గ్లు కూడా తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ క్రమంలో డెన్మార్క్ నార్వే, ఐస్లాండ్ కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. (కోవిడ్ ముప్పు తొలగిపోలేదు) -
ఐస్లాండ్లో పేలిన అగ్ని పర్వతం
బోథ్: అమెరికాలోని ఐస్లాండ్లో అగ్నిపర్వతం పేలి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం గుర్రాలతండాకు చెందిన మయూరి సింగ్ మృతి చెందారు. ఆమె భర్త ప్రతాప్సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 9వ తేదీన ఈ ఘటన జరగగా.. ఇక్కడి బంధువులకు ఆలస్యంగా విషయం తెలిసింది. సింగ్ బంధువుల కథనం ప్రకారం.. గుర్రాలతండాకు చెందిన ప్రతాప్సింగ్ ఇరవై ఏళ్ల క్రితం అమెరికా వలస వెళ్లాడు. అక్కడ పలు వ్యాపారాలు చేస్తున్నాడు. ఈనెల 9న ఐస్లాండ్ చూసేందుకు భార్యాభర్తలిద్దరూ వెళ్లారు. అక్కడ ఉన్న వాతావరణాన్ని చూస్తున్న క్రమంలో అక్కడే ఉన్న అగి్నపర్వతం ఒక్కసారిగా బద్ధలైంది. ఈ ఘటనలో మయూరిసింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ప్రతాప్సింగ్ను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం బుధవారం ఉదయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఇమాముల్ను దారుణంగా ట్రోల్ చేసిన ఐస్లాండ్
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో ఘోరంగా విఫలమైన పాకిస్తాన్ ఓపెనర్ ఇమాముల్ హక్ను ఐస్లాండ్ క్రికెట్ దారుణంగా ఆడేసుకుంది. ఈ మ్యాచ్తో ఐస్లాండ్ క్రికెట్కు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఇమాముల్ ఒక ప్లేయర్ కాదు అనేంతగా ట్వీటర్ అకౌంట్లో విమర్శలు చేసింది. ఆసీస్తో రెండో టెస్టులో ఆడుతున్న ఇమాముల్ హక్ తొలి ఇన్నింగ్స్లో రెండు పరుగులు చేస్తే, రెండో ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. ఇక ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రెండు టెస్టులకు గాను రెండు ఇన్నింగ్స్లు ఆడి 489 పరుగులు చేశాడు. అందులో 154 పరుగుల్ని బ్రిస్బేన్లో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో సాధిస్తే, ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో అజేయంగా 335 పరుగులు చేశాడు. దీన్ని టార్గెట్ చేస్తూ.. వార్నర్ రెండు ఇన్నింగ్స్లో చేసిన పరుగుల కంటే ఇమాముల్ హక్ తన కెరీర్లో సాధించిన పరుగులే తక్కువంటా ఎద్దేవా చేసింది. ఇప్పటివరకూ ఇమాముల్ హక్ 11 టెస్టు మ్యాచ్లకు గాను 21 ఇన్నింగ్స్లు ఆడి 485 పరుగులు చేశాడు. ఇక పాకిస్తాన్ తన రెండో ఇన్నింగ్స్లో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. ఇమాముల్ హక్ డకౌట్గా వెనుదిరిగితే, అజహర్ అలీ 9 పరుగులు చేసి నిరాశపరిచాడు. బాబర్ అజామ్ కూడా 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పాకిస్తాన్ 16.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 39 పరుగుల వద్ద ఉండగా వర్షం పడటంతో మ్యాచ్ నిలిపివేశారు. David Warner has scored more runs in his last two innings than Imam-ul-Haq has scored in his entire test career. #AUSvPAK — Iceland Cricket (@icelandcricket) December 1, 2019 -
పదేళ్లయినా పాడవని బర్గర్!
రేక్జవిక్ : బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ ఎన్ని రోజులు తాజాగా ఉంటాయి? మహా అయితే రెండ్రోజులు. కానీ, ఈ ఫొటోలో కనిపిస్తున్నవి ఏకంగా పదేళ్లయినా పాడవలేదు! ఆశ్చర్యంగా ఉందా? అయితే, ఇది చదవండి. బర్గర్లు, పీజాల తయారీలో ప్రసిద్ధి చెందిన మెక్డొనాల్డ్ కంపెనీ ఐస్లాండ్లో 2009లో తన చివరి అవుట్లెట్ను మూసివేసింది. అయితే, చివరగా హిజోర్టర్ స్మెర్సెన్ అనే వ్యక్తి ఆ షాప్లో ఫ్రెంచ్ ఫ్రైస్, ఓ బర్గర్ కొన్నాడు. అయితే అతను ఈ వాటిని తినేందుకు బదులు, మెక్డొనాల్డ్ గుర్తుగా అలానే ఉంచుకోవాలనుకున్నాడు. మొదట్లో అతను వీటిని తన దగ్గర నిల్వ చేశాడు. తరువాత నేషనల్ మ్యూజియంకు అప్పగించాడు. ఇప్పుడు వాటిని ఒక హోటల్లో భద్రపరిచారు. అయితే, సుమారు పదేళ్లయినా ఇప్పటికీ అవి తాజాగా ఉన్నాయి. దీని గురించి తెలుసుకున్న వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. కాగా వీటి గురించి ఫుడ్సైన్స్కు చెందిన ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ తేమ ఏమాత్రం లేనందునే అవి తాజాగా ఉన్నాయని అన్నారు. -
మైనస్ ఎనిమిది డిగ్రీల చలిలో...
‘డిస్కోరాజా’ షూటింగ్కు గుమ్మడికాయ కొట్టే సమయం దగ్గరపడింది. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. పాయల్ రాజ్పుత్, నభా నటేష్, తాన్యాహోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని టాక్. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ఐస్ల్యాండ్లో జరిగింది. భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. అక్కడ మైనస్ ఎనిమిది డిగ్రీల చలిలో కూడా షూటింగ్ చేశారు టీమ్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. వారం రోజులు షూటింగ్ జరిగితే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూరై్తపోతుందట. రజిని తాళ్లూరి, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. -
భూమి భగభగ.. హిమనీనదాలు విలవిల
సాక్షి, అమరావతి: ‘ఐస్ల్యాండ్లోని ఒకుకూల్ హిమనీనదం అంతరించిపోయింది. అది ఇక మృత హిమనీనదం’ అని శాస్త్రవేత్తలు ఒడ్డుర్ సిగురొసన్, కైమెన్ హువే ఈ నెల 18న ప్రకటించారు. వాతావరణ మార్పులతో భూమిపై పర్యావరణానికి ముంచుకొస్తున్న పెనుముప్పుకు తాజా సంకేతం ఇదీ. ఒక్క ఐస్ల్యాండ్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిమనీనదాలు వేగంగా కరిగిపోతుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. మనదేశ నదీజలాలకు ప్రధాన ఆదరవుగా ఉన్న హిమాలయాల్లోని హిమనీనదాలకు కూడా పెనుప్రమాదం ముంచుకొస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముంచుకొస్తున్న ముప్పు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తాజా అధ్యయనం ప్రకారం.. గ్రీన్హౌస్ ఉద్గారాలు ప్రస్తుత రేటులోనే కొనసాగితే ప్రపంచంలో దాదాపు సగం హిమనీనదాలు 2100 నాటికి పూర్తిగా కనుమరుగైపోతాయి. వాయు కాలుష్యంతో గ్రీన్హౌస్ ఉద్గారాల రేటు అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. 2019, ఆగస్టులో గాలిలో కార్బన్ డయాక్సెడ్ సాంద్రత 415.26 పీపీఎంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా శీతల, సమశీతోష్ణ, ఉష్ణ, సముద్ర తీరప్రాంతాలపై తీవ్ర దుష్ఫలితాలకు కారణమవుతోంది. ఆర్కిటిక్, అంటార్కిటిక్ మినహాయించి హిమనీనదాల ఉపరితల ప్రదేశం 50 శాతం తగ్గిపోయింది. హిమాలయాల్లోని 40 శాతం హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ముఖ్యంగా సూత్రి ఢాకా, బాటల్, బారా షిగ్రీ, సముద్ర తాపు, జెపాంగ్ గాథ్, కుంజుమ్ అనే ఆరు హిమనీనదాలు ఏటా 13 మిల్లీమీటర్ల నుంచి 33 మిల్లీమీటర్ల చొప్పున కరిగిపోతున్నాయని గుర్తించారు. వీటిలో బారా షిగ్రీ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. పంజాబ్, హరియాణాలను సస్యశ్యామలం చేస్తున్న చినాబ్ నదికి ఈ హిమనీనదమే ప్రధాన ఆదరువు. ఇది పూర్తిగా కరిగిపోతే చినాబ్ నదిలో నీటి లభ్యత అమాంతం తగ్గిపోతుంది. గంగోత్రి, సియాచిన్ హిమనీనదాలు కూడా అంతకంతకూ కరుగుతుండటం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ఇవేకాకుండా ఆండీస్, ఆల్ప్స్, రాకీ పర్వతాల్లోని హిమనీనదాలు కూడా వేగంగా కరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐస్ల్యాండ్లో మరో 400 హిమనీనదాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయని.. గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించకపోతే రాబోయే 200 ఏళ్లలో అవి పూర్తిగా కనుమరుగైపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మేల్కొనకుంటే పెను ప్రమాదమే భూతాపం పెరుగుతుండటం భారత ఉపఖండంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు, సముద్రమట్టాలు పెరగడం, శక్తివంతమైన తుపానులు, వరదలు విరుచుకుపడటం, మరోవైపు ఎడారీకరణ ఇలా పలు రూపాల్లో దుష్ఫ్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రోజూ లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో కలుస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. 2030 నాటికి ఓజోన్ పొర క్షీణత కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదన 26 శాతం తగ్గుతుందని అంచనా వేశారు. వాతావరణ మార్పుల వల్ల రైతులు, తీరప్రాంత ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాతోపాటు తెలంగాణలోని నల్గొండ, ఒడిశాలోని కలహండీ, కర్ణాటకలోని బెల్గాం జిల్లాలు ఎడారీకరణ ముప్పును ఎదుర్కొంటున్నాయని రిమోట్ సెన్సింగ్ డేటా అధ్యయనాలు వెల్లడించాయి. వాతావరణ మార్పులతో 974 కి.మీ. పొడవైన తీరప్రాంతం ఉన్న మన రాష్ట్రం తరచూ తుపాన్ల బారిన పడుతోంది. తీరప్రాంతం కోతకు గురికావడం, సముద్రపు నీరు పొలాల్లోకి చేరి భూగర్భ జలాలు లవణీకరణకు గురై పంటలు దెబ్బతింటున్నాయి. తీరప్రాంతాన్ని అటవీ శాఖకు అప్పగిస్తే మేలు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. లేకపోతే భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయి. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు తీరప్రాంతం కేంద్ర బిందువుగా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలి. తీరప్రాంతాన్ని అటవీ శాఖకు అప్పగిస్తే బాగుంటుంది. తీరప్రాంతం నుంచి 300 మీటర్ల వరకు మడ అడవులను అభివృద్ధి చేయాలి. తద్వారా కార్బన్ డయాక్సైడ్ను నియంత్రించడంతోపాటు సముద్ర కోత, మట్టి క్షయకరణను నివారించవచ్చు. – మనోజ్ నలనాగుల, భూవిజ్ఞాన శాస్త్ర పరిశోధకుడు -
కరుగుతున్న హిమనదాలు
అంతరించిపోయిన హిమానీనదానికి ఒక విషాద భావగీతం. అవును. ప్రస్తుతం ఐస్లాండ్ శాస్త్రజ్ఞులు సరిగ్గా దీనికే పథకం రచిస్తున్నారు. పశ్చిమ ఐస్లాండ్ ప్రాంతంలో కనుమరుగైపోయిన మొట్టమొదటి హిమానీనదానికి గుర్తుగా ఆగస్టు 18న ఒక స్మారక స్తూపం ఏర్పర్చడానికి రైస్ యూనివర్సిటీ, ఐస్లాండ్ దేశం కలిసి ప్లాన్ చేస్తున్నాయి. ఆ మంచుదిబ్బ పేరు ‘ఓకే’. ఆ స్మారకచిహ్నం ఫలకంపై పొందుపరుస్తున్న సందేశం మనందరినీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. ‘హిమానీనదంగా తన ప్రతిపత్తిని కోల్పోతున్న మొదటి ఐస్లాండ్ మంచుదిబ్బ ఓకే. రాబోయే 200 ఏళ్లలో మన హిమానీనదాలన్నీ ఇదే మార్గం అనుసరించనున్నాయి. మనకు ఏం జరగబోతోందో, మనం ఏం చేయాల్సి ఉందో మనకు స్పష్టంగా తెలుసని ఈ స్మారకస్తూపం గుర్తు చేస్తోంది. మనం దాన్ని చేస్తామా అన్నది లేదా అనేది కూడా మనకే తెలుసు’’ మంచుదిబ్బలు కాదు కరుగుతున్నది భవిష్యత్తు! ఐస్లాండ్ దేశంలోని ఓకే హిమానీనదం ఆ దేశం నుంచి అంతరించిపోతున్న తొలి మంచుదిబ్బ. కానీ ఇది చివరిదేమీ కాదు. వచ్చే 200 సంవత్సరాల్లో ఐస్లాండ్ దేశంలోని మంచుదిబ్బలన్నీ అంతర్థానం కానున్నాయని ఆ స్మారక స్తూప ఫలకం ప్రకటిస్తోంది. అయితే 30 ఏళ్ల తర్వాత అంటే 2050లో ఈ స్మారక స్తూప సందేశాన్ని చూడబోయే ప్రజలందరూ ఓకే హిమానీనదానికి ఆ గతి పట్టించినందుకు ప్రస్తుత తరాన్ని శపించడం ఖాయం. మంచుదిబ్బను కరగదీయడం ద్వారా అత్యంత వేడి, పొడి వాతావరణం కలిగిన భూగ్రహాన్ని మనం భవిష్యత్ తరాలవారికి అందించనున్నాం. ఈ ప్రపంచంలో సంతోషభరితంగా జీవించే అవకాశాన్ని, వారికి దక్కాల్సిన వాటాను మనం దూరం చేసేస్తున్నాం. అంతరించిపోతున్న హిమానీనదాలకు స్మారకస్తూపాలను నెలకొల్పడం నిజంగానే అద్భుతమైన ఆలోచన. అలా మంచుదిబ్బలకు స్మారక స్తూపాలను నిర్మించడం సరైనదే అయినట్లయితే, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారతదేశం, నేపాల్, భూటాన్, చైనా దేశాల్లో విస్తరించిన హిమాలయ పర్వత శ్రేణుల పొడవునా మనం అనేక స్మారకస్తూపాలను నిర్మించవలసి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద జలగోపురంగా పేరొందిన హిమాలయాలు భూమ్మీద లభిస్తున్న స్వచ్ఛమైన జలంలో 40 శాతాన్ని కలిగి ఉంటున్నాయి. కానీ ఇక్కడ 50,000 కంటే ఎక్కువ సంఖ్యలో మంచుదిబ్బలు శరవేగంతో కరిగిపోతున్నాయని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (యూఎన్డీపీ) వారి అంచనా. ఇవి అంతరిస్తున్న వేగాన్ని చూస్తుంటే, ఈ అత్యున్నత పర్వత శ్రేణికి ఇరువైపులా నివసిస్తున్న 130 కోట్లమంది ప్రజల జీవితాల్లో విధ్వంసం సృష్టించడం ఖాయమనే తెలుస్తోంది. మూడో ధ్రువం కరిగితే పెనుముప్పే అంటార్కిటికా, ఆర్కిటిక్ ఖండాల తర్వాత అతిపెద్ద స్థాయిలో మంచును కలిగి ఉన్న మూడో భూభాగంగా హిమాలయాలు గుర్తింపు పొందాయి కాబట్టి దీనిని మూడవ ధ్రువ ప్రాంతం అని పిలుస్తున్నారు. అందుచేత భూగ్రహంలోని అంటార్కిటికా, ఆర్టిటిక్ ధ్రువప్రాంతాలే కాకుండా హిమాలయాలు కూడా వాటికి సమాన స్థాయిలో కరిగిపోయే ప్రమాదం స్పష్టంగానే కనిపిస్తోంది. అయితే హిమాలయాలు యూరోపియన్ ఆల్ఫ్స్ పర్వతాలతో సమాన వేగంలో కరిగిపోవడం లేదు. గత దశాబ్దకాలంలో ఆల్ఫ్స్ పర్వత శ్రేణిలోని అనేక హిమానీనదాలు పూర్తిగా అంతరించిపోయాయి. దక్షిణాసియాలో కంటే యూరప్లో చాలా త్వరగా ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించడమే దీనికి కారణం కావచ్చు. కాకపోతే, 2000 సంవత్సరం నుండి హిమాలయాలు ప్రతి సంవత్సరం ఒకటిన్నర అడుగు కంటే ఎక్కువ స్థాయిలో మంచును కోల్పోతున్నాయని ఇటీవలే కొలంబియా యూనివర్సిటీకి చెందిన లేమోంట్–డొహెర్తీ ఎర్త్ అబ్జర్వేటరీ నిర్వహించిన సమగ్ర అధ్యయనం భారత్లో ఆగ్రహావేశాలను ప్రేరేపిస్తుందని నేను ఊహించాను. దీనికి ముందుగా 1975 నుంచి 2000 సంవత్సరం వరకు హిమాలయాల్లో ప్రతి ఏటా 10 అంగుళాల మేరకు మంచు కరుగుతూ వచ్చింది. అయితే తాజా అధ్యయనం ఆసియాలోని పామిర్, హిందూ కుష్, టియాన్ షాన్ అత్యున్నత పర్వత శ్రేణులను తన పరిశీలనాంశంగా చేర్చలేదు. ఈ స్థాయిలో హిమాలయాలు కరుగుతూ రావడం మొత్తం ఆసియా ప్రాంతానికి విధ్వంసకరంగా పరిణమించనుంది. హిమాలయాల్లో హిమానీనదాలు ప్రమాదకరంగా కరిగిపోవడం జాతికి వాస్తవంగా షాక్ కలిగించాలి. ప్రత్యేకించి హిందీ ప్రాబల్య ప్రాంతంలోని ప్రజలకు ఇది భారీ నష్టాన్ని కలిగించనుంది. కానీ అరుదుగా కొన్ని పతాక శీర్షికల్లో ప్రస్తావించడం తప్పితే దేశప్రజల్లో ఈ పరిణామం ఎలాంటి ఆగ్రహాన్ని కలిగించలేదు. ఈ సమస్యను తమ సంపాదకీయాల్లో ప్రస్తావించడానికి తగినదేనని వార్తా పత్రికలు కనీసం ఆలోచించలేదు. ఇక టీవీ చానెల్స్ అయితే అసందర్భమైన రాజకీయ ప్రకటనలతో చొంగకార్చుకోవడంలో బిజీగా ఉండిపోయాయి. చెన్నై జల సంక్షోభం నుంచి నేర్చుకోమా? హిమాలయ ప్రాంతంలో విస్తరించిన 650 హిమానీనదాలపై సాధారణంగా ఉపగ్రహాలు తీసే ఫొటోలతోపాటు, అమెరికన్ గూఢచర్య ఉపగ్రహాలు తీసిన ఫొటోలను కూడా వర్గీకరించి చేసిన పై అధ్యయనం ప్రకారం ప్రతి సంవత్సరం హిమాలయాలు 800 కోట్ల లీటర్ల నీటిని కోల్పోతున్నాయని తెలిసింది. అంటే ప్రతి సంవత్సరం ఒలింపిక్ పరిమాణంలోని 32 లక్షల స్విమ్మింగ్ పూల్స్లలోని నీటికి సమానమైన నీటిని హిమాలయాలు కోల్పోతున్నాయి. దక్షిణ భారతదేశంలోని చెన్నయ్లో ఇటీవల సంభవించిన జల సంక్షోభం కలిగించిన షాక్ని చూస్తే హిమాలయాల్ని కప్పి ఉంచిన మంచు కరిగిపోతుండటం పట్ల మనందరం కూర్చుని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇది మనందరి భవిష్యత్తుతో ముడిపడిన సమస్య కాబట్టి, మన పిల్లలకు మనం విడిచివెళుతున్న జల రహిత ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల గురించి ప్రజలు తప్పకుండా ఆందోళన చెందాల్సి ఉంటుంది. బలమైన ప్రజాభిప్రాయం జాతి మొత్తాన్ని ప్రకంపింపచేయాలి. ఈ విషయమై భారత పార్లమెంటు కూడా అత్యవసర అర్ధరాత్రి సెషన్కు కూర్చోవాలి. కానీ ఏమీ జరగలేదు. లభ్యమవుతున్న సాగునీటిలో 78 శాతం నీటిని వ్యవసాయ రంగం దుర్వినియోగపరుస్తోందని దెప్పడం మినహా, జీవితం సజావుగానే సాగిపోతోంది. ఈలోగా హిమాలయాల్లో భాగంగా ఏర్పడిన అతి ముఖ్యమైన సింధు, గంగ, బ్రహ్మపుత్ర నదీపరివాహక ప్రాంతాల్లో నీరు క్షీణించిపోతోందని కేంద్ర జల కమిషన్ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇవి ఈశాన్య భారత్, కొంతవరకు మధ్యభారత్ ప్రాంత ప్రజాజీవనానికి అత్యవసర వనరులు. కానీ ఇక్కడ కూడా నీటి లభ్యత తగ్గిపోతుండటం ఎవరూ గుర్తించడం లేదు. ఈ మూడు నదీ పరివాహక ప్రాంతాల్లో సగటున నీటి లభ్యత ఇప్పటికే 40 శాతం క్షీణించిపోయింది. ఇక నదీ పరివాహకప్రాంతం క్షీణించిపోవడంతో తూర్పు, ఉత్తర భారత ప్రాంతంలో 628 చదరపు కిలోమీటర్ల పొడవునా అడవులు హరించుకుపోయినట్లు 2015 అటవీ నివేదిక తెలిపింది ఈ తరం తప్పులతో భవిష్యత్ తరాల బలి ఇలాంటి పరిస్థితుల్లో ఎండిపోతున్న నదుల దిగువ ప్రాంతంలో వ్యవసాయాన్ని, పరిశ్రమలను, తాగునీటి వసతులను దెబ్బతీస్తున్న జల సంక్షోభం నేపథ్యంలో జీవనం సాగిస్తున్న వందల కోట్లమంది ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో హిమాలయన్ రాష్ట్రాలుగా పేరొందిన జమ్మూ– కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్, మేఘాలయ, అసోం, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్లు తమ తమ ప్రాంతాల్లో నెలకొన్న కొండ ప్రాంతాల పరిరక్షణకు కలిసికట్టుగా ఒక విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయిదేళ్ల క్రితం కేదార్నాథ్లో సంభవించిన విధ్వంసం పునరావృతం కాకుండా అనువైన పథకాలు రూపొందించడం, నదీపరివాహక ప్రాంతాల పరిరక్షణకోసం సామూహికంగా మదుపులు పెట్టడంపై ఈ రాష్ట్రాలన్నీ దృష్టి సారించాల్సి ఉంది. పర్వతాలు అందించే పర్యావరణ వ్యవస్థ సేవలకు చెందిన ఆర్థిక విలువను మదింపు చేస్తున్న క్రమంలో నీరు, వృక్షాల పరిరక్షణ, నేల కోత నివారణ, వన్యమృగాల పరిరక్షణ వంటి సేవలను తప్పకుండా మిళితం చేయాలి. వీటిని అంతిమంగా రాష్ట్రాల బడ్జెట్ అంచనాల్లో భాగం చేయాలి. పర్వతాలు అందించగలిగే ఆర్థిక సంపదను కొలిచే కొలమానం ఇదే. అభివృద్ధి పేరుతో ఇంతకాలంగా సాగిస్తూ వచ్చిన కొండల్ని కొల్లగొట్టే ప్రక్రియలకు వెంటనే చెల్లుచీటీ చెప్పాలి. పర్వత ప్రాంత రాష్ట్రాల అభివృద్ధికి ఇది నిజంగానే ఒక వినూత్న మార్గంగా ఉపయోగపడుతుంది. ప్రకృతి, పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడంపైనే పర్వత ప్రాంత రాష్ట్రాలు మనగలుగుతాయి. దీనికి తోడుగా మన పరిశోధనా విధానాలు కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మైదాన ప్రాంతాల్లో సాగించే పరిశోధనా పద్ధతులను నకలు చేస్తూ పర్వతప్రాంతంలో మన యూనివర్సిటీలు యథాతథంగా అమలు చేయడంలో ఎలాంటి సంబద్ధతా లేదు. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
చలిలో చిల్లింగ్
ఇలా పెళ్లయిందో లేదో అలా హనీమూన్ చెక్కేశారు సౌందర్యా రజనీకాంత్, విశాగన్. తమ విహారయాత్రలకు ఐస్ల్యాండ్ బెస్ట్ అనుకుని అక్కడకు వాలిపోయారు ఈ కొత్త దంపతులు. చల్ల చల్లని ప్రాంతంలో చిల్ అవుతూ ఆ మూమెంట్స్ తాలూకు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఐస్లాండ్ ప్రమాదంలో భారతీయుల మృతి
లండన్: ఐస్లాండ్లో విహారయాత్రకు వెళ్లిన మహారాష్ట్రీయుల కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటన్లో ఉండే శ్రీరాజ్, సుప్రీం అనే సోదరులు తమ కుటుంబాలతో కలిసి ఐస్లాండ్లో ‘స్కీయోరార్సండర్’ పర్యాటక ప్రాంతానికి వాహనంలో బయలుదేరారు. గురువారం వేకువజామున నది వంతెన మీదుగా వెళ్తున్న ఆ వాహనం అదుపు తప్పి కిందకు పడింది. దీంతో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు ఐస్లాండ్ పోలీసులు తెలిపారు. -
అర్జెంటీనా ఊపిరి పీల్చుకో..
మాస్కో : అర్జెంటీనాకు ఉపశమనం లభించింది. లియోనల్ మెస్సీ, అర్జెంటీనా అభిమానులు ఎప్పుడూ లేనంతగా ఐస్లాండ్పై క్రొయేషియా గెలవాలి.. కనీసం ఈ మ్యాచ్ డ్రా అవ్వాలని ప్రార్ధించారు. వారి ప్రార్థనలు ఫలించాయి. ఐస్లాండ్పై 2-1తో క్రొయేషియా గెలిచి అర్జెంటీనాను నాకౌట్కు పంపించింది. ఫిఫా ప్రపంచకప్ తొలి నాకౌట్ పోరులో ఫ్రాన్స్తో అర్జెంటీనా శనివారం రోజు(జూన్ 30)న తలపడనుంది. మంగళవారం అర్ధరాత్రి ఐస్లాండ్తో జరిగిన హోరాహోరి మ్యాచ్లో చివరకు క్రోయేషియా విజయం సాధించింది. తొలి భాగం ముగిసే సరికి ఇరు జట్లు ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయాయి. రెండో అర్థభాగం ప్రారంభమైన ఎనిమిది నిమిషాలకు క్రొయేషియా ఆటగాడు బాడెల్జ్ (53వ నిమిషంలో) తొలి గోల్ నమోదు చేశాడు. గోల్పోస్ట్పై ఇరుజట్లు పోటీపడీ దాడులు చేసినా, రక్షణశ్రేణి సమర్థవంతంగా అడ్డుకుంది. 76వ నిమిషంలో పెనాల్టీ కిక్ రూపంలో ఐస్లాండ్ను అదృష్టం వరించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఐస్లాండ్ ఆటగాడు సిగుర్గ్స్సన్ గోల్గా మలిచాడు. రెండో అర్థభాగం పూర్తవుతుందనుకున్న సమయంలో క్రొయేషియా ఆటగాడు పెరిసిక్ కళ్లుచెదిరే రీతిలో గోల్ చేసి తన జట్టును ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. ఇంజ్యూరీ టైమ్లో ఇరుజట్లు మరో గోల్ నమోదు చేయకపోవడంతో క్రొయేషియా విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్లో ఐస్లాండ్ అత్యధిక సార్లు(17) గోల్ కోసం ప్రయత్నించగా, క్రొయేషియా రక్షణశ్రేణి విజయవంతంగా ఆడ్డుకుంది. క్రొయేషియా అనవసర తప్పిదాలు 12 చేయగా, ఐస్ లాండ్ 10 తప్పిదాలు చేసింది. ఈ మ్యాచ్లో రిఫరీలు ఇద్దరు క్రొయేషియా, ముగ్గురు ఐస్లాండ్ ఆటగాళ్లకు ఎల్లో కార్డు చూపించారు. -
అరంగేట్రంలోనే అద్భుతం
ఆడుతున్నది ప్రపంచ కప్లో తొలి మ్యాచ్... ప్రత్యర్థి దిగ్గజం... అయినా ఐస్లాండ్ అదరలేదు... బెదరలేదు! విపరీతమైన దాడులు ఎదురైనా, బంతి ఎక్కువసేపు తమ ఆధీనంలో లేకున్నా దీటుగా నిలిచింది. మెస్సీలాంటి మహామహుడున్న అర్జెంటీనాను నిలువరించింది. అద్భుత ఆటతో అరంగేట్ర మ్యాచ్ను చిరస్మరణీయం చేసుకుంది. మరోవైపు మెస్సీ పెనాల్టీ కిక్ను వృథా చేసి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. మాస్కో: ఫుట్బాల్ పసికూన ఐస్లాండ్ తమ తొలి ప్రపంచ కప్ను ఘనంగా ప్రారంభించింది. కొండలాంటి అర్జెంటీనాతో తలపడుతున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆడింది. సులువుగా గెలిచేస్తుందనుకున్న లియోనల్ మెస్సీ జట్టుకు చుక్కలు చూపింది. శనివారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్లో దుర్బేధ్యమైన డిఫెన్స్తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టి 1–1తో డ్రా చేసుకుంది. ఈ ఫలితం ఐస్లాండ్కు విజయంతో సమానం కాగా, ఓడకపోయినా అర్జెంటీనాకు మింగుడుపడని పరిణామమే. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ ఎన్నడూ లేనంతగా ఏకంగా 11 సార్లు ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడి చేసినా ఒక్కసారీ విజయవంతం కాలేకపోవడం గమనార్హం. ఓ పెనాల్టీ కిక్తో పాటు మెస్సీని అన్నిసార్లు అడ్డుకున్న ఐస్ల్యాండ్ గోల్ కీపర్ హాన్స్ హాల్డర్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. రెండూ మొదటి భాగంలోనే... అర్జెంటీనా స్థాయి జట్టు ఏ క్షణంలోనైనా విరుచుకుపడే ప్రమాదం ఉంటుందని భావించిన ఐస్లాండ్ రక్షణాత్మక ఆటను ఎంచుకుని మ్యాచ్లో ఒక్కడే ఫార్వర్డ్ ప్లేయర్తో బరిలో దిగింది. దీనికి తగ్గట్లే, మెస్సీ నుంచి రెండు ఫ్రీ కిక్లు ఎదురై ప్రారంభం కఠినంగానే సాగినా వెంటనే కోలుకుంది. ఇదే సమయంలో ఆ జట్టుకూ అవకాశం వచ్చినా సఫలం కాలేదు. అనూ హ్యంగా మెస్సీ ఒత్తిడిలో పడటంతో అర్జెంటీనాకూ పైచేయి చిక్కలేదు. అయితే, క్రమంగా అటాకింగ్ గేమ్లోకి దిగింది. దీని ఫలితం 19వ నిమిషంలోనే కనిపించింది. మార్కస్ రోజో అందించిన క్రాస్ పాస్ను బాక్స్ ఏరియా నుంచి కున్ అగ్యురో అద్భుతమైన రీతిలో గోల్పోస్ట్లోకి పంపాడు. ఈ ఆధిక్యాన్ని ఆస్వాదించే లోపే ఒక్కసారిగా మెస్సీ జట్టుకు షాక్ తగిలింది. అర్జెంటీనా డిఫెన్స్లోని అనిశ్చితిని సొమ్ము చేసుకుంటూ 23వ నిమిషంలో ఫిన్బొగాసన్ ఐస్లాండ్కు చరిత్రాత్మక గోల్ అందించాడు. అప్పటికీ మెస్సీ బృందం అప్రమత్తమై దాడులతో ఆధిపత్యానికి ప్రయత్నించింది. ఐస్లాండ్ డిఫెన్స్ను ఛేదించలేక ఫలితం రాబట్టలేకపోయింది. పట్టు వదల్లేదు... అత్యుత్తమ ఆటతో తొలి భాగంలో అర్జెంటీనాను కాచుకుని నిలిచిన ఐస్లాండ్... రెండో భాగంలోనూ పట్టుదల చూపింది. ప్రత్యర్థి గోల్పోస్ట్ వరకు వెళ్లలేకపోయినా, వారి డిఫెన్స్ బలహీనతను సొమ్ము చేసుకుంటూ దూకుడు చూపింది. అయితే 63వ నిమిషంలో ఆ జట్టు ఆటగాడు మాగ్నసన్ కారణంగా అర్జెంటీనాకు పెనాల్టీ కిక్ లభించింది. దీనిని మెస్సీ పేలవంగా కొట్టగా... గోల్ కీపర్ హాల్డర్సన్ కుడి వైపునకు ఒరిగిపోతూ అడ్డుకున్నాడు. ఉపేక్షిస్తే గెలుపు దక్కే పరిస్థితి లేదని భావించిన అర్జెంటీనా... జోరు పెంచి ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేసింది. అయినా ఐస్లాండ్ డిఫెన్స్ను దెబ్బతీయలేకపోయింది. వ్యూహం మార్చిన మెస్సీ దూరం నుంచి గోల్కు ప్రయత్నించినా, కీలక ఆటగాడైన హిగుయెన్ను 84వ నిమిషంలో బరిలో దింపినా ఇవేమీ ఐస్లాండ్ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయాయి. ఇంజ్యూరీ సమయం (90+5) ఆఖర్లో వచ్చిన ఫ్రీ కిక్నూ మెస్సీ సద్వినియోగం చేయలేకపోయాడు. దీంతో మ్యాచ్ 1–1తో డ్రా అయింది. గెలుపు చిక్కకపోయినా... బంతిని ముప్పావు వంతు ఆధీనంలో ఉంచుకోవడం, తీవ్రంగా దాడులకు దిగడం వంటివి అర్జెంటీనాకు ఉపశమనం కలిగించాయి. -
భువిలో మహిళల దీవి
ఐస్ల్యాండ్.. దీవిలా ఉండే దేశం. మహిళలకు అది ‘దివి’ భూమి! ఐరోపాలో ఉంది. ఉత్తర అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఉంటుంది. ‘గ్లోబల్ జెండర్ గ్యాప్’ సంస్థ రిపోర్టు ప్రకారం.. స్త్రీలను భద్రంగా, గౌరవంగా చూసుకునే ప్రపంచ దేశాలలో తొమ్మిదేళ్లుగా ఐస్ల్యాండ్దే ఫస్ట్ ప్లేస్. ఇప్పుడక్కడ స్త్రీ పురుషులు మరింత ఈక్వల్ ఈక్వల్ అయ్యారు. ఎలాగంటే.. న్యూ ఇయర్ నుండి అక్కడ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఇరవై అయిదు, అంతకు మించి ఉన్న సిబ్బంది ఉన్న ప్రతి సంస్థ.. గవర్నమెంట్, ప్రైవేట్.. ఏదైనా సరే, ఆడవాళ్ల కంటే మగవాళ్లకు ఎక్కువ జీవితం ఇవ్వడం చట్టవిరుద్ధం! సమాన పనికి సమానం వేతనం ఉండాల్సిందే. ఆడ, మగ తేడాలు చూపడానికి లేదు. చూపట్లేదు అని ఎలా తెలుస్తుంది? గవర్నమెంటు దగ్గర్నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలి. ‘ఈ సంస్థ సమాన వేతనాలు ఇస్తోంది’ అని! ఆ సర్టిఫికెట్ ఊరికే ఇవ్వదు కదా ప్రభుత్వం. స్కాన్ చేసి, స్క్రీన్ చేసి ఇస్తుంది. సర్టిఫికెట్ ఉన్నవాళ్లకే రాయితీలు అవీ ఇస్తుంది. జీతాలు మిగుల్చుకుందామని చెప్పి, మహిళా ఉద్యోగులకు మగ ఉద్యోగులకన్నా తక్కువ జీతం ఇవ్వాలనే ఏ కంపెనీ అయినా కక్కుర్తి పడితే ఇదిగో ఈ రాయితీలు కట్ అవుతాయి. ఇలాంటి చట్టం తేవాలని లాస్ట్ ఇయర్ మహిళా దినోత్సవం రోజు ఐస్ల్యాండ్ గవర్నమెంట్ ఫిక్స్ అయింది. చక్కగా ప్లాన్ చేసి, ఈ జనవరి ఫస్ట్ నుంచి అమలు చేస్తోంది. ఐస్ల్యాండ్ పార్లమెంటులో సగం మందికి పైగా మహిళలు ఉన్నారు. ప్రధాని కూడా మహిళే! అందుకే ‘ఈక్వల్ పే’ చట్టం సాధ్యమైందా? ఏమైనా స్త్రీకి స్త్రీయే స్నేహితురాలు. అన్నట్టు ప్రపంచంలో ఇలాంటి చట్టం చేసిన మొట్ట మొదటి దేశం ఐస్ల్యాండే. -
ఐస్లాండ్ అద్భుతం
రిక్జావిక్ (ఐస్లాండ్): గతేడాది యూరో ఫుట్బాల్ చాంపియన్షిప్లో తమ క్వార్టర్ ఫైనల్ ప్రదర్శన గాలివాటమేమీ కాదని ఐస్లాండ్ జట్టు నిరూపించింది. కేవలం 3 లక్షల 30 వేల జనాభా ఉన్న ఈ చిన్న యూరోప్ దేశం వచ్చే ఏడాది రష్యాలో జరిగే ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్కు అర్హత సాధించి సంచలనం సృష్టించింది. యూరోప్ జోన్లో భాగంగా జరిగిన తమ చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్లో ఐస్లాండ్ 2–0తో కొసావో జట్టును ఓడించి ప్రపంచకప్ బెర్త్ను దక్కించుకుంది. ఆరు జట్లు ఉన్న గ్రూప్–1లో ఐస్లాండ్ 10 మ్యాచ్లు ఆడి 7 విజయాలు, ఒక ‘డ్రా’, రెండు పరాజయాలతో మొత్తం 22 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ప్రపంచకప్కు అర్హత పొందిన అతి చిన్న దేశంగా (జనాభా పరంగా) ఐస్లాండ్ గుర్తింపు పొందింది. ఇప్పటివరకు ఈ ఘనత ట్రినిడాడ్ అండ్ టొబాగో (2006–కోటి 30 లక్షల జనాభా) పేరిట ఉండేది. వచ్చే ఏడాది జూన్ 14 నుంచి జూలై 15 వరకు రష్యాలో జరిగే ప్రపంచకప్లో మొత్తం 32 జట్లు పాల్గొంటాయి. ఇప్పటివరకు ఆతిథ్య రష్యా జట్టుతో కలిపి 17 జట్లు అర్హత సాధించగా... నవంబర్ 14వ తేదీతో మిగతా 15 జట్లు ఖాయమవుతాయి. -
ఆమెకు ఎందుకింత ఫాలోయింగ్..?
రెక్జావిక్: బిర్నా బ్రాన్స్డాటిర్ అనే 20 ఏళ్ల అమ్మాయి జనవరి నెలలో తప్పిపోయింది. యావత్ దేశం ఆమె గురించే చర్చ. కొండలు, గుట్టలతోపాటు నిర్జీవ ప్రదేశాలన్నింటినీ గాలించండంటూ దేశాధ్యక్షుడు ప్రజలందరికి పిలుపునిచ్చారు. అలా ప్రజల గాలింపులో ఎనిమిది రోజుల తర్వాత ఓ సముద్ర తీరంలో ఆమె మృతదేహం దొరికింది. దేశాధ్యక్షుడు తోర్లాసియస్ జోహానెస్సన్, ప్రధాన మంత్రి బెనెడిక్ట్సన్లతోపాటు ప్రజలంతా ఆమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె రాజకీయవేత్తకాదు, పారిశ్రామికవేత్తకాదు. అందరిలా డిగ్రీ చదువుతున్న ఓ అమ్మాయి. మరి ఆమెకు ఎందుకింత ఫాలోయింగ్ అన్న అనుమానం రావచ్చు. ఐస్లాండ్లో అంతేమరి. అక్కడ ఓ అమ్మాయి చనిపోతే ప్రజలంతా తమ కూతురో, సోదరియో చనిపోయినంతగా, అబ్బాయి చనిపోతే తమ కుమారుడో, సోదరుడో మరణించినంతగా బాధపడతారు. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులూ అంతే. అందుకే ఐస్లాండ్లో క్రైమ్ రేట్ చాలా తక్కువ. హత్యల రేటు ఏడాదికి 1.8 శాతం మాత్రమే ఉంది. నిరుద్యోగం కూడా చాలా తక్కువ. 2008 తర్వాత ఆ దేశంలో ఒక్క ఆత్మహత్య కూడా లేని సంవత్సరాలు ఎన్నో ఉన్నాయి. 2008లో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం కుదిపేసినప్పడు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ఒకటి, రెండు ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. అప్పుడు ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసినా ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోలేదు. 1944లో రక్తపాత రహితంగానే డెన్మార్క్ నుంచి స్వాతంత్య్రం సాధించిన చరిత్ర కూడా ఐస్లాండ్కు ఉంది. ఈ దేశంలో ప్రజలంతా సమానత్వ భావనతో మెదలుతారు. ఆపదలో ఒకరినొకరు ఆదుకుంటూ పరస్పర సహకారంతో ప్రజలంతా బతుకుతారు. ఏడాదిలో తక్కువ ఎండకాలం, ఎక్కువ శీతాకాలం ఉండడం వల్ల కూడా ప్రజల మధ్య పరస్పర సహకారం అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే వారు సమైక్య జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి సమాజంలో హత్యలు జరిగినప్పుడు కలవరం రేగుతుంది. 20 ఏళ్ల బిర్నాను చంపింది కూడా విదేశీయులేనని దర్యాప్తులో తేలింది. గ్రీన్లాండ్ నుంచి వచ్చిన ఇద్దరు నావికులు ఐస్లాండ్ సముద్రం ఒడ్డున లంగర్ వేసినప్పుడు ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారి తిరిగి వారి దేశం వెళ్లిపోవడంతో ఐస్లాండ్ పోలీసులు గ్రీన్లాండ్ వెళ్లి అనుమానితులను హెలికాప్టర్లో తీసుకొచ్చారు. హత్య వెనక కారణం ఏమిటో ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
వాళ్లు వెళ్లిపోయారు... వీళ్లు వడలిపోయారు!
జెండర్ ఫైట్ ఐస్లాండ్లో నిన్న మళ్లీ మధ్యాహ్నం 2.38 నిమిషాల తర్వాత మహిళలెవరూ ఆఫీసులలో కనిపించలేదు! గత కొన్ని సొమవారాలుగా ఆ దేశంలో ఇలా మహిళా ఉద్యోగులు మధ్యలోనే పనిమాని, లే దా పని అక్కడికి ముగించి, ఇళ్లకు వెళ్లిపోతున్నారు. అలాగని వారి ప్రభుత్వం ఆఫ్టర్నూన్ నుంచి ఆడవాళ్లంతా హాయిగా ఇళ్లకు వెళ్లిపోవచ్చని ఏమీ ప్రకటించలేదు. ఉద్యోగినులే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మగవాళ్లకు ఇస్తున్న జీతాలతో పోల్చిచూస్తే... తమకు వచ్చే జీతానికి తాము 2.38 గంటల వరకు మాత్రమే పనిచేస్తే సరిపోతుందని లెక్కగట్టి, అంతవరకే ఆఫీసులలో ఉంటున్నారు ఐస్లాండ్ మహిళా ఉద్యోగులు. సమానమైన పనికి సమానమైన వేతనం ఉండాలని ఎన్నిసార్లు పిడికిలి బిగించి, నినాదాలు చేసినా ఫలితం లేకపోవడంతో వాళ్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. దశాబ్దం క్రితం.. 2005లో మధ్యాహ్నం 2.08 గంటల వరకు పని చేసి వెళ్లిపోయేవారు. 2008లో ఆ వెళ్లిపోయే సమయం 2. 25 గం. అయింది. ఇప్పుడు అదే 2.38కి వచ్చింది. అంటే జీతంలోని అసమానతలు కొద్దికొద్దిగా తగ్గేకొద్దీ సోమవారాల్లో వీళ్లు పనిచేసే టైమ్ నిమిషాల వ్యవధిలో పెరుగుతూ వస్తోంది. ఈ ధోరణితో ప్రభుత్వ కార్యాలయాలు తలపట్టుకుంటున్నాయి. వారానికొకసారి కొన్ని గంటల ముందు మహిళా ఉద్యోగినులు ఇళ్లకు వెళ్లిపోతే వచ్చే నష్టం కన్నా... వాళ్లు వెళ్లిపోయాక వెలవెలపోతున్న కార్యాలయాల్లో పురుష ఉద్యోగులు ఉత్సాహం నశించి, ఈసురోమంటూ పని చేసుకుంటూ పోవడం వల్ల ఉత్పాదక తగ్గి ఎక్కువ నష్టం వస్తోందని అక్కడి సర్వేలు చెబుతున్నాయట! ఈ మాట అలా ఉంచితే... స్త్రీ పురుష వివక్ష లేని దేశంగా కొన్నేళ్ల నుంచీ ఐస్లాండ్ మార్కులు కొట్టేస్తోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వాళ్ల ‘గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్’ ప్రకారం ఐస్లాండ్కు ‘మహిళల స్వర్గసీమ’ అన్న పేరు కూడా ఉంది. ఎంత పేరున్నా నేటికీ ఆ దేశంలోని మహిళలు మగవాళ్లకన్నా 14 నుంచి 17 శాతం తక్కువగా జీతాలు పొందుతున్నారు. -
ఫ్రాన్స్.. ‘పాంచ్’ పటాకా
యూరో కప్లో ఐస్లాండ్ సంచలన ప్రదర్శన క్వార్టర్స్లో ముగిసింది. సూపర్స్టార్లతో నిండిన ఆతిథ్య ఫ్రాన్స్ జట్టు తమ స్థాయికి తగ్గట్టుగానే ఆడి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అయితే పసికూన ఐస్లాండ్ ఈ మ్యాచ్లో అసాధారణ తెగువ చూపింది. ఫ్రాన్స్ డిఫెన్స్ లోపాలను సొమ్ము చేసుకుంటూ ద్వితీయార్ధంలో రెండు గోల్స్ కూడా సాధించి శభాష్ అనిపించుకోగలిగింది. ఇక సెమీస్లో తమ చిరకాల శత్రువు జర్మనీపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఫ్రాన్స్ సిద్ధమవుతోంది. * యూరో కప్ సెమీస్లోకి ప్రవేశం * క్వార్టర్స్లో 5-2తో ఐస్లాండ్పై విజయం పారిస్: యూరో చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించిన జట్టుగా నిలిచేందుకు ఫ్రాన్స్ జట్టు మరో అడుగు ముందుకేసింది. ఆదివారం జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్స్లో స్ట్రయికర్ ఒలివియర్ గిరౌడ్ రెండు గోల్స్తో అదరగొట్టడంతో ఆతిథ్య జట్టు 5-2 తేడాతో ఐస్లాండ్పై నెగ్గింది. దీంతో తమ చిరకాల శత్రువు జర్మనీతో అమీతుమీ తేల్చుకునేందుకు శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బరిలోకి దిగనుంది. గత ప్రపంచకప్ క్వార్టర్స్లో ఫ్రాన్స్ జట్టు జర్మనీ చేతిలోనే ఓడింది. ప్రిక్వార్టర్స్లో ఇంగ్లండ్ను కంగుతినిపించిన ఐస్లాండ్ను ఈ మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టు తేలిగ్గా తీసుకోలేదు. వారి బలం, బలహీనలతలపై దృష్టి పెట్టి తగిన వ్యూహాలతో బరిలోకి దిగింది. దీనికి తోడు సొంత అభిమానుల మద్దతుతో ఆరంభం నుంచే చెలరేగిన ఫ్రాన్స్ పూర్తి స్థాయి అటాకింగ్తో తొలి అర్ధభాగంలోనే నాలుగు గోల్స్తో పైచేయి సాధించింది. ఓవరాల్గా ఫ్రాన్స్ తరఫున ఒలివియర్ గిరౌడ్ (12, 59వ నిమిషాల్లో), పోగ్బా (20), పయేట్ (43), గ్రిజ్మన్ (45) గోల్స్ సాధించారు. ఐస్లాండ్కు సితోర్సన్ (56), జర్నాసన్ (84) గోల్స్ అందించారు. ఆరంభం నుంచే దూకుడు మ్యాచ్ ప్రారంభం నుంచే ఫ్రాన్స్ జట్టు ఆటగాళ్లు ఎదురుదాడికి దిగారు. దీంతో జట్టు 12వ నిమిషంలో ఖాతా తెరిచింది. మిడ్ఫీల్డ్ నుంచి మటౌడి ఇచ్చిన పాస్ను ఏరియాలో అందుకున్న గిరౌడ్ గోల్గా మలిచాడు. 18వ నిమిషంలో ఐస్లాండ్ ఆటగాడు బొడ్వర్సన్ హెడర్ ప్రయత్నం నేరుగా గోల్కీపర్ లోరిస్ చేతుల్లోకి వెళ్లింది. కానీ మరో నిమిషంలోనే రైట్ వింగ్ కార్నర్ నుంచి గ్రిజ్మన్ ఇచ్చిన పాస్ను పాల్ పోగ్బా హెడర్ గోల్గా మలిచి ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. ఇదే జోరుతో ప్రథమార్ధం మరో రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా ఫ్రాన్స్ రెండు గోల్స్తో రెచ్చిపోయింది. 43వ నిమిషంలో గ్రిజ్మన్ ఇచ్చిన పాస్ను ఐస్లాండ్ ముగ్గురు డిఫెండర్లకు చిక్కకుండా బాటమ్ కార్నర్ వైపు గోల్ చేయగా 45వ నిమిషంలో బ్యాక్ నుంచి పోగ్బా ఇచ్చిన లాంగ్ పాస్ను అందుకున్న గ్రిజ్మన్ బంతిని కాస్త ముందుకు తీసుకెళ్లి చిప్ షాట్తో గోల్ కీపర్ పైనుంచి నెట్లోకి పంపి ఫస్ట్ హాఫ్ను 4-0తో ముగించాడు. 56వ నిమిషంలో ఐస్లాండ్ మ్యాచ్లో బోణీ చేసింది. రైట్ ఫ్లాంక్ నుంచి సిగర్డ్సన్ ఇచ్చిన క్రాస్ను పోస్టుకు అతి సమీపం నుంచి సితోర్సన్ గోల్ చేశాడు. అయితే వెంటనే కోలుకున్న ఫ్రాన్స్ 59వ నిమిషంలోనే ఐదో గోల్ చేసింది. 40 గజాల దూరం నుంచి సంధించిన పయేట్ ఫ్రీకిక్ను వేగంగా అందుకున్న గిరౌడ్ హెడర్తో గోల్ చేశాడు. పలు ప్రయత్నాల అనంతరం ఐస్లాండ్ ఫ్రాన్స్ డిఫెన్స్ను ఛేదించి రెండో గోల్ చేయగలిగింది. అరి స్కులసోన్ క్రాస్ను జర్నాసన్ గోల్ చేసి ప్రత్యర్థి ఆధిక్యాన్ని కాస్త తగ్గించగలిగినా ప్రయోజనం లేకపోయింది. సెమీస్లో ఎవరితో ఎవరు పోర్చుగల్ X వేల్స్ గురువారం రాత్రి 12.30 గంటల నుంచి జర్మనీ X ఫ్రాన్స్ శుక్రవారం రాత్రి 12.30 గంటల నుంచి సోనీ సిక్స్లో ప్రత్యక్షప్రసారం 1 యూరోలో వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఒక్క మార్పు కూడా లేకుండా బరిలోకి దిగిన జట్టుగా ఐస్లాండ్ చరిత్ర సృష్టించింది. -
ఇంగ్లండ్ గుండె పగిలింది
ఫుట్బాల్ అంటే వారికి ప్రాణం... ఆట కోసం నిద్రాహారాలు మానేస్తారు... ప్రపంచంలో ఏ మూల తమ జట్టు ఆడుతున్నా వేలాదిగా వెళ్లి జట్టును ప్రోత్సహిస్తారు. ఆ దేశంలో పుట్టిన ఆటగాడు ఎవరైనా బాగా ఆడాడంటే దేవుడిలా ఆరాధిస్తారు. ఇంగ్లండ్లో ఫుట్బాల్కు ఉన్న ఆదరణ, మమకారం ఇది. అందుకే ఆ దేశంలో జరిగే ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ. అయితే 1966 ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన తర్వాత ఇంగ్లండ్ జాతీయ జట్టు మాత్రం ఏ టైటిల్ గెలవలేదు. ఈసారి యూరోలో ఎలాగైనా తమ జట్టు గెలుస్తుందని భారీ అంచనాలతో ఉన్న ఇంగ్లండ్ గుండె పగిలింది. యూరో ప్రిక్వార్టర్స్లో ఐస్లాండ్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోయింది. నైస్: ఐస్లాండ్ జనాభా కేవలం 3 లక్షల 38 వేలు. జట్టులో స్టార్ ఆటగాళ్లెవరూ లేరు. జట్టులో ఎవరికీ పెద్దగా అనుభవం కూడా లేదు.అయినా స్ఫూర్తిదాయక ఆటతీరుతో చెలరేగిన ఐస్లాండ్... ఈ యూరోలోనే పెను సంచలనం నమోదు చేసింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ఐస్లాండ్ 2-1తో ఇంగ్లండ్ను ఓడించి క్వార్టర్ ఫైనల్కు చేరింది. ఐస్లాండ్ తరఫున సిక్వెర్డ్సన్ (6వ ని.), సిగ్తోర్సన్ (18వ ని.) గోల్స్ చేయగా, కెప్టెన్ రూనీ (4వ ని.) ఇంగ్లండ్కు ఏకైక గోల్ అందించాడు. 1966 తర్వాత మరో మేజర్ టైటిల్పై కన్నేసిన ఇంగ్లండ్ ఆశలు మరోసారి ఆవిరయ్యాయి. ఆరు మార్పులతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మైదానంలో చురుకుగా కదల్లేకపోయింది. ఆరంభంలో స్టెర్లింగ్ ఇచ్చిన పాస్ను స్టూరిడ్జ్ గోల్గా మలిచే ప్రయత్నంలో ఐస్లాండ్ గోల్ కీపర్ ఫౌలయ్యాడు. దీంతో నాలుగో నిమిషంలో లభించిన పెనాల్టీని రూనీ బాటమ్ నుంచి లక్ష్యాన్ని చేర్చాడు. దీంతో కెరీర్లో 53వ గోల్తో డేవిడ్ బెక్హామ్ సరసన నిలిచాడు. అయితే ఇంగ్లండ్ ఆనందం రెండు నిమిషాల్లోనే ఆవిరైంది. ఐస్లాండ్ రైట్ విండ్ మిస్సైల్ కారీ ఆర్నసన్ హెడ్తో అందించిన పాస్ను సిక్వెర్డ్సన్ చాకచక్యంగా నెట్లోకి పంపి స్కోరును సమం చేశాడు. మరో 12 నిమిషాల తర్వాత సిక్వెర్డ్సన్, బోద్వర్సన్లు సమయోచితంగా కదులుతూ ఇచ్చిన పాస్ను సిగ్తోర్సన్ ఇంగ్లండ్ గోల్ కీపర్ హార్ట్ను ఏమారుస్తూ గోల్పోస్ట్లోకి పంపాడు. తర్వాత ఇంగ్లండ్ సూపర్ అటాకింగ్తో రెచ్చిపోయినా ఐస్లాండ్ రక్షణశ్రేణి సమర్థంగా తిప్పికొట్టింది. రెండో అర్ధభాగంలో కాస్త వ్యూహాత్మకంగా ఆడిన ఇంగ్లండ్ ఒకటి, రెండు అవకాశాలను సృష్టించుకున్నా ఐస్లాండ్ డిఫెండర్లు అడ్డుకోవడంతో ఓటమి తప్పలేదు. హడ్సన్ రాజీనామా! ఓటమికి బాధ్యత వహిస్తూ ఇంగ్లండ్ కోచ్ రాయ్ హడ్సన్ మేనేజర్ పదవికి రాజీనామా చేశారు. వాస్తవంగా ఈ టోర్నీ తర్వాత ఆయన కాంట్రాక్ట్ ముగియనుంది. అయితే తను మరోసారి ఒప్పందాన్ని పునరుద్ధరించుకునే అవకాశాల్లేవని హడ్సన్ స్పష్టం చేశారు. ‘మరో రెండేళ్లు పదవిలో ఉండాలని అనుకున్నా. కానీ ఇది పూర్తిగా ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. యూరో తర్వాత నా కాంట్రాక్ట్ను పునరుద్ధరించేవాళ్లు. కానీ ఇప్పుడు వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నా’ అని హడ్సన్ పేర్కొన్నారు. -
ఐస్లాండ్ అధ్యక్షుడిగా జొహాన్నెసన్
రెక్జావిక్: హిస్టరీ ప్రొఫెసర్ జొహాన్నెసన్.. ఐస్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. శనివారం జరిగిన ఎన్నికల్లో 39.1 శాతం ఓట్లతో ఆయన గెలుపొందారు. ఐస్లాండ్కు చెందిన పలువురు సీనియర్ రాజకీయ నాయకులకు విదేశాల్లో అవినీతి ఖాతాలు ఉన్నట్లు పనామా పత్రాల్లో వెల్లడైన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. జొహాన్నెసన్ తన 48వ పుట్టిన రోజునే అధ్యక్షుడిగా ఎన్నికవడం విశేషం. మరోవైపు స్వతంత్రంగా బరిలోకి దిగిన మహిళా పారిశ్రామికవేత్త హల్లా టొమాస్డొటిర్ 27.9 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రచారంలో జొహాన్నెసన్కు గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపించిన మాజీ ప్రధాని డేవిడ్ ఆడ్సన్ 13 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. గత రెండు దశాబ్దాలుగా అధ్యక్షుడిగా ఉన్న ఓల్ఫర్ రాగ్నర్ గ్రిమ్సన్ స్థానంలో జొహాన్నెసన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ద్వీపం జనాభా కేవలం 3.34 లక్షలు కాగా, 10 శాతం మంది యూరో-2016 ఫుట్బాల్ టోర్నమెంట్లో తమ జట్టు ప్రదర్శన చూసేందుకు ఫ్రాన్స్ కు వెళ్లిపోయారు. -
ఎందుకు కట్టాలి?
ఇతని పేరు మాట్ బోటెన్. ఇంగ్లాండ్లోని కార్డిఫ్ నివాసి. గర్ల్ఫ్రెండ్తో కలసి ఐస్ల్యాండ్కు హాలీడే ట్రిప్నకు బయలుదేరాడు. గాత్విక్ ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్కు వెళ్లగా... మీ లగేజీ నిర్ణీత పరిమితి కంటే ఎక్కువగా ఉంది... 45 పౌండ్లు (దాదాపు 4,250 రూపాయలు) కట్టాలని అక్కడి సిబ్బంది చెప్పారు. దీన్ని తప్పించుకోవడానికి మనోడికి వెంటనే ఓ ఐడియా తట్టింది. బ్యాగును ఓపెన్ చేసి... అందులో ఉన్న దుస్తులన్నింటినీ ఇలా ధరించేశాడు. ఒకదానిపై మరొకటి వేసుకున్నాడు. చివరికి అదనంగా ఓ షూ జత ఉంటే దాన్నిలా ప్యాంటు రెండు జేబుల్లోకి దోపుకున్నాడు. తోటి ప్రయాణికులు నవ్వుకుంటున్నా... చెక్ ఇన్ సిబ్బంది నోళ్లు వెళ్లబెట్టి చూస్తుండగా... దర్జాగా వెళ్లి విమానంలో కూర్చున్నాడు. ఒక్క పైసా అదనంగా కట్టకుండానే. పైగా ఈ ఫొటో తీసి ‘నేను వెళుతోంది ఐస్ల్యాండ్కు కదా... అందుకే ఇలా’ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. -
ఎంత పెద్ద ఏనుగో...
డైనోసార్ల కాలంనాటి భారీ ఏనుగు నీళ్లు తాగుతున్నట్లు ఉంది కదూ...! నిజానికి ఇది దక్షిణ ఐస్ల్యాండ్లోని హీమేయ్ దీవిలో సముద్రతీరంలో ఏర్పడిన లావా ఆకృతి. 1973లో ఇక్కడి ఎల్డ్ఫెల్ అనే అగ్నిపర్వతం బద్దలై లావాను వెదజిమ్మింది. దగ్గర్లోని హార్బర్ను రక్షించుకోవాలనే ఉద్దేశంతో స్థానికులు చల్లని సముద్రపు నీటిని మోటర్ల సాయంతో లావాపై వెదజల్లారు. అప్పుడు ఏర్పడిందే ఈ ఏనుగు. పర్యాటకులకు ఇదో పెద్ద ఆకర్షణగా మారిందట. -
వారి తలరాతలు బాగున్నాయి...
ఫొటో చాలా కలర్ఫుల్గా, అద్భుతంగా ఉంది కదూ? ఫొటోయే కాదు.. ఆ విమానంలో ఉన్నవారి తలరాత కూడా చాలా బావుంది. అందుకే పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఐస్లాండ్లోని హోలుహ్రౌన్ ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వతంపై సరదాగా చక్కర్లు కొట్టాలని కొందరు సందర్శకులు ఈ విమానంలో బయలుదేరారు. సరిగ్గా అగ్నిపర్వతం దగ్గరకు వెళ్లేసరికి అది బద్దలై ఒక్కసారిగా లావా ఇంతెత్తున లేచింది. దాదాపు 850 డిగ్రీల సెల్సియస్ వేడితో ఉన్న లావా.. ఏకంగా 200 మీటర్ల ఎత్తుకు పెల్లుబికింది. అయితే అదృష్టం కలిసిరావడంతో ఈ విమానానికి ఎలాంటి ముప్పూ వాటిల్లలేదు. అదే సమయంలో ఈ అగ్నిపర్వతం చుట్టూ చక్కర్లు కొడుతున్న మరో విమానంలో నుంచి బల్దూర్ అనే వ్యక్తి ఈ చిత్రాన్ని చకచకా కెమెరాలో బంధించారు. -
అవార్డుల కాంతి..
నింగిలో పచ్చని రంగులో మెరిసిపోతున్న ఉత్తర ధ్రువ కాంతులు.. కింద నీటిలో దాని ప్రతిబింబం.. ఐస్లాండ్లోని వత్నజోకల్ నేషనల్ పార్కు వద్ద బ్రిటన్కు చెందిన ఫొటోగ్రాఫర్ జేమ్స్ వుడ్ఎండ్ తీసిన చిత్రమిది. ఇదింత బాగుంది కాబట్టే.. తాజాగా ప్రకటించిన ఆస్ట్రోనమీ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2014 పోటీలో మొదటి బహుమతిని సొంతం చేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని రాయల్ అబ్జర్వేటరీ గ్రీన్విచ్ , బీబీసీ స్కై వాళ్లు ఏటా ప్రదానం చేస్తున్నారు.