-
ఉబెర్ కప్లో ఆడేందుకు సింధు అంగీకారం: ‘బాయ్’ చీఫ్
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్ పీవీ సింధు వచ్చే నెలలో జరిగే థామస్ కప్–ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టీమ్ టోర్నీలో దిగనుంది. నిజానికి వ్యక్తిగత కారణాలతో ఆమె ఈ టోర్నీ నుంచి తప్పుకుంది. తన కుటుంబసభ్యులకు చెందిన వేడుక కోసం ఈ టోర్నీలో ఆడనని చెప్పింది. అయితే భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) చీఫ్ హిమంత బిశ్వ శర్మ ఆమెను ఆడేందుకు ఒప్పించినట్లు తెలిసింది. ‘ఆ టోర్నీలో భారత్కు సానుకూలమైన ‘డ్రా’ ఉండటంతో ఆడాల్సిందిగా సింధును కోరాను. ఆమె జట్టుతో కలిసి ఆడితే భారత్కు పతకం అవకాశాలుంటాయని చెప్పాను. దీంతో ఆమె బరిలోకి దిగేందుకు సమ్మతించింది’ అని హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. సింధు తన కుటుంబానికి చెందిన వేడుకను టోర్నీ ప్రారంభానికంటే ముందుగా నిర్వహించుకుంటానని తనతో చెప్పినట్లు ఆయన వివరించారు. డెన్మార్క్లో వచ్చేనెల 3 నుంచి 11 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ‘బాయ్’ ఈ టీమ్ ఈవెంట్ కోసం 26 మంది షట్లర్లకు హైదరాబాద్లోని గోపీచంద్ అకాడమీలో శిబిరం నిర్వహిస్తోంది. 17న తుది జట్లను ఎంపిక చేస్తారు. -
కరోనా: ఇక నుంచి నాన్ బెయిలబుల్ కేసు
గువహటి : భారత్లో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నా కొందరు మాత్రం నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు అమలు చేయడానికి అసోం ప్రభుత్వం సిద్ధమైంది. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినా, విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినా వారిపై హత్యాయత్నం కేసుతో పాటు నాన్ బెయిలబుల్ కేసు నమోదుచేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ మంత్రి హిమంతా బిస్వా శర్మ ఓ ప్రకటన విడుదల చేశారు. (కరోనా పేషంట్లకు మంచాలు లేవు.. స్పందించిన మంత్రి ) ఇటీవలె బొంగైగావ్, చిరాంగ్ జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో వైద్యులపై ఉమ్మివేయడం, దురుసుగా ప్రవర్తించడం లాంటివి ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. గతంలోనూ ఇలాంటివి జరగడంతో పునరావృతం కాకుండా ఈ మేరకు అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పోరులో ముఖ్యపాత్ర పోషిస్తున్న వైద్యులపై ఇలాంటి చర్యలు అమానవీయం అని మంత్రి హిమంతాబిస్వా అన్నారు. క్వారంటైన్ సెంటర్లలో నిర్లక్ష్య ధోరణి ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టివేస్తుందని అన్నారు. అంతేకాకుండా క్వారంటైన్ సెంటర్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా నేరుగా తనను సంప్రదించవచ్చని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో రోగులకు అందించే ఆహారం నాణ్యత బాలేందంటూ పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులున్నా అధికారుల దృష్టికి తీసుకు రావాలని పేర్కొన్నారు. (త్వరలో వెబినార్ కోమా వ్యాధి: ఆనంద్ మహీంద్రా ) -
అక్కడ అమిత్ షా కన్నా ఆయనే ముఖ్యం
న్యూఢిల్లీ : బీజేపీలో ప్రస్తుతం అమిత్ షా శకం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా అన్ని చోట్ల పార్టీ బలోపేతానికి అమిత్ షా కృషి చేస్తున్నారు. అయితే ఈశాన్య రాష్ట్రల్లో మాత్రం అమిత్ షా ప్రభావం అంతగా లేదట. అక్కడ అమిత్ షా కన్నా అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వా శర్మకే అధిక ప్రాధాన్యం ఉందంటున్నారు పార్టీ జనరల్ సెక్రటరీ రాం మాధవ్. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో పార్టీ హిమంత బిశ్వాకు టికెట్ కేటాయించలేదు. ఈ విషయంపై స్పందించిన రాం మాధవ్.. ‘దీన్ని బట్టి పార్టీ అమిత్ షా కన్నా ఎక్కువ బాధ్యతలు హిమంతకే అప్పగించిందనే విషయం స్పష్టమవుతోంది. ఈశాన్య భారతంపై హిమంత బిశ్వాకు చాలా పట్టుంది. ఇప్పటి వరకూ 5, 6 ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోశించారు. అందుకే పార్టీ.. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ప్రచార భారాన్నంత ఆయన మీదనే మోపింది. ఇందుకు చాలా శక్తి, సమయం కావాలి. ఈ బాధ్యతలు చూడ్డానికే టైం సరిపోదు. ఇక ఆయన కూడా పోటీలో ఉంటే.. పార్టీ ప్రచార బాధ్యతలతో పాటు ఆయన గెలుపు కోసం కూడా కష్టపడాల్సి ఉంటుంది. దీని వల్ల హిమంత బిశ్వాపై ఒత్తిడి పెరుగుతుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే పార్టీ ఆయనకు టికెట్ కేటాయించలేద’ని తెలిపారు. హిమంత బిశ్వాకు టికెట్ కేటాయించకపోవడంపై అమిత్ షా స్పందిస్తూ.. ‘ప్రస్తుతం ఈశాన్యం ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసే ముఖ్యమైన బాధ్యతలను ఆయనకు అప్పగించాం. అందుకే ఈ సారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని తెలిపారు. ఈశాన్య రాష్ర్టాల్లో బీజేపీకి లైఫ్ ఇచ్చిన హిమంత బిశ్వా.. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. 2015లో ఈయన బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఈశాన్య ప్రాంతంలో కమలం వికసించేలా కృషి చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ట్రబుల్ షూటర్గా గుర్తింపు పొందారు. -
‘అందుకే ఆయన పోటీ చేయడం లేదు’
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లిస్ట్లో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వాణీతో పాటు అస్సాం బీజేపీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వా శర్మ పేరు కూడా లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ట్రబుల్ షూటర్గా పేరు పొందిన హిమంత బిశ్వాకు టికెట్ కేటాయించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హిమంతకు టికెట్ కేటాయించకపోవడం వెనక గల కారణాలను ట్విటర్ ద్వారా తెలిపారు. ఈ విషయం గురించి ఆయన ‘ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రస్తుతం హిమంత బిశ్వా శర్మ నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్డీఏసీ) కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అస్సాం, ఈశాన్య రాష్ట్రల్లో పార్టీని బలపర్చడం ముఖ్యం. ఈ బాధ్యతలను హిమంత బిశ్వా చక్కగా నిర్వర్తిస్తారని పార్టీ నమ్ముతుంది. అందుకే ఆయనకు టికెట్ కేటాయించలేదు. అస్సాం బీజేపీ శ్రేణులతో పాటు ఈశాన్య రాష్ట్రాల బీజేపీ నేతలు కూడా ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తారని ఆశిస్తున్నాను. ఈ నిర్ణయం వల్ల అస్సాంతో పాటూ ఈశాన్య భారతం కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నానం’టూ అమిత్ షా ట్విట్ చేశారు. ప్రస్తుతం బిశ్వా అస్సాం ఆర్థిక మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. -
ఈశాన్య రాష్ట్రాలకు రూ.2,350కోట్లు
వరద సాయాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ గువాహటి: ఈశాన్య రాష్ట్రాలకు వరద సాయంగా రూ.2,350 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇందులో అసోం రాష్ట్రానికి తక్షణసాయంగా రూ. 250 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ ఏడాది జూన్లోనే కేంద్రం రూ. 300 కోట్లను ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా విడుదల చేసినట్లు అసోం ఆర్థికమంత్రి హిమంతబిశ్వా శర్మ, జలవనరుల మంత్రి కేశబ్ మహంత మంగళవారం విలేకరులకు తెలిపారు. అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, అసోం రాష్ట్రాల్లోని వరదలపై తాజా పరిస్థితిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమీక్షించారు. సమావేశం అనంతరం మంత్రి కేశబ్ మహంత మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులతో సుమారు ఐదు గంటలపాటు జరిగిన సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల్లోని సమస్యలపై ప్రత్యేక దృష్టిని పెడుతున్నట్లు మోదీ చెప్పారన్నారు. వరద ముంపును ఎదుర్కొనేందుకు స్వల్ప, దీర్ఘ కాలిక ప్రణా ళికలను అమలు చేయాలని.. ఈ అంశంలో ఈశాన్య రాష్ట్రాలకు సంపూర్ణ సహకారం అందజేస్తామని మోదీ చెప్పారన్నారు.