-
ఆగిన గుండెకు.. నేరుగా మసాజ్.. కడుపులో నుంచి చేతిని పంపించి..
గుంటూరు మెడికల్: అరుదైన వ్యాధితో బాధపడుతోన్న వృద్ధుడికి గుంటూరు జీజీహెచ్ జనరల్ సర్జరీ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ జరుగుతుండగా రోగి గుండె ఆగిపోగా.. అప్రమత్తమైన జనరల్ సర్జన్ నేరుగా కడుపులో నుంచి చేతిని గుండెపైకి పంపించి గుండెకు మసాజ్ చేసి ఆగిన గుండెను కొట్టుకునేలా చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడారు. బుధవారం గుంటూరు జీజీహెచ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆపరేషన్ వివరాలను జనరల్ సర్జరీ రెండో యూనిట్ ఇన్చార్జి డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ మీడియాకు చెప్పారు. ప్రకాశం జిల్లా నందనవనం గ్రామానికి చెందిన విట్టా వెంకటేశ్వర్లు (70) నెల రోజులుగా కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, వాంతులు, ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడటం తదితర సమస్యలతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని జనవరి 17న గుంటూరు జీజీహెచ్కు తీసుకువచ్చారు. జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ ఆధ్వర్యంలో వృద్ధుడికి అత్యవసర సేవల విభాగంలో పరీక్షలు చేసి (గ్యాస్టిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్) చేసి కడుపులో క్యాన్సర్ వల్ల ఆహారం పొట్టలోకి వెళ్లడం లేదని నిర్ధారించి వార్డులో అడ్మిట్ చేసుకున్నారు. జనరల్ సర్జరీ వార్డులో మెరుగైన చికిత్స అందించేందుకు సీటీ స్కాన్, బేరియం ఎక్స్రే, గ్యాస్ట్రోస్కోపి, ఎండోస్కోపి చేశారు. స్కానింగ్లో గుండె చాలా బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు. దాంతోపాటుగా లక్షల్లో ఒకరికి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన డయాఫ్రాగ్మెటిక్ హెరి్నయాతో రోగి బాధపడుతున్నట్లు గుర్తించారు. గుండె, ఊపిరితిత్తులు, కడుపుకి మధ్యలో ఉండే డయాఫ్రమ్కు రంధ్రం ఏర్పడి అందులో నుంచి కడుపు, పెద్దపేగు సగభాగం గుండెకు, ఊపిరితిత్తులకు అతుక్కున్నట్లు నిర్ధారించారు. సాధారణంగా పుట్టుకతో డయాఫ్రమ్కు రంధ్రాలు ఏర్పడి వయసు పెరిగే కొద్ది పూడుకుపోతుందని కిరణ్కుమార్ చెప్పారు. వెంకటేశ్వర్లు విషయంలో డయాఫ్రమ్కు ఉన్న రంధ్రం పూడుకుపోకుండా పేగులు, కడుపు, గుండె, ఊపిరితిత్తుల మధ్యకు వెళ్లిపోయిందని తెలిపారు. ఆగిన గుండె.. గుండె, ఊపిరితిత్తుల మధ్య అతుక్కుని ఉన్న పేగులు, కడుపును కిందకు తీసేందుకు ఫిబ్రవరి 2న ఆపరేషన్ ప్రారంభించామని, ఆపరేషన్ చేస్తోన్న సమయంలో వృద్ధుడి గుండె ఆగిపోయిందన్నారు. మత్తు వైద్యులు ఛాతిపై నుంచి మసాజ్ చేసే (సీపీఆర్) ప్రయత్నం చేస్తామని, ఆపరేషన్ ఆపాలని సూచించినట్లు చెప్పారు. తక్షణమే తాను డయాఫ్రమ్కి ఉన్న రంధ్రం ద్వారా చేతిని గుండెపైకి పోనిచ్చి నేరుగా చేతితో ఆగిపోయిన గుండెను నొక్కి కార్డియాక్ మసాజ్ చేయడంతో కొద్ది క్షణాల్లో ఆగిన గుండె కొట్టుకోవడం ప్రారంభించిందన్నారు. 3 గంటల సేపు ఆపరేషన్ చేసి ఛాతి, గుండెలోకి వెళ్లిన పెద్ద పేగు, కడుపును కిందకు లాగి మరలా సమస్య ఉత్పన్నం కాకుండా ప్రొలేన్ మెష్ అమర్చి డయాఫ్రమ్ను మూసివేశామన్నారు. 48 గంటల పాటు ఐసీయూలో రోగిని ఉంచి గుండె, ఊపిరితిత్తులు, మెదడు పనితీరు బాగున్నాయని నిర్ధారించుకున్న తరువాత వెంటిలేటర్ తొలగించి సాధారణ వార్డుకు తరలించినట్లు చెప్పారు. వృద్ధుడు కోలుకోవడంతో బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. చదవండి: భారీగా తగ్గిన చికెన్ ధరలు కిలో ఎంతంటే? ప్రైవేట్ ఆసుపత్రుల్లో దీని చికిత్సకు రూ.10 లక్షలు ఖర్చవుతుందని, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేశామని తెలిపారు. జీజీహెచ్కు సీఎం వైఎస్ జగన్ అత్యాధునిక వైద్య పరికరాలు అందజేయడంతో జనరల్ సర్జరీ వైద్య విభాగంలో కార్పొరేట్ ఆసుపత్రి కంటే మెరుగైన ఆపరేషన్లను తాము పేదలకు ఉచితంగా చేస్తున్నామన్నారు. ఆపరేషన్లో తనతోపాటు వైద్యులు రమణాచలం, వంశీ, వెంకటరమణ, సంతోష్, నిఖిల్, అనూష, లిఖిత, కిషోర్, వేణు, కోటి, మత్తు వైద్యులు మహే‹Ùబాబు, ప్రదీప్, ధరణి, శ్వేత పాల్గొన్నట్లు వెల్లడించారు. జనరల్ సర్జరీ వైద్య బృందాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అభినందించారు. -
వింత ఘటన: గుండె లేకుండా జీవించిన తొలి మానవుడు!
సాటి మానవుల పట్ల జాలి, దయ లేకుండా ప్రవర్తిస్తే.. నీకు అసలు హృదయమే లేదంటూ నిందిస్తాం. అసలు మానవుడి గుండె ఒక్కనిమిషం ఆగినా చనిపోయినట్లే. అలాంటిది అసలు గుండె లేకుండా బతకడమేమిటి. నిజమేనా! అన్న డౌటు వస్తుంది ఎవరికైనా. ఎలా చూసినా, ఏవిధంగా ఆలోచించినా అది అసాధ్యం. కానీ ఇక్కడొక మనిషిని చూస్తే ఔను! అని తల ఊపకతప్పదు. ఈ అత్యంత ఆశ్చర్యం కలిగించే ఘటన యూఎస్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..క్రెయిగ్ లూయిస్ అనే 55 ఏళ్ల వ్యక్తి 2011లో అమిలోయిడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది అసాధారణమైన ప్రోటీన్ల పెరుగుదలకు కారణమయ్యే అరుదైన వ్యాధి. ఈ వ్యాధి వేగంగా గుండె, మూత్రపిండాలు, కాలేయంపై దాడి చేసి వాటి పనితీరును దెబ్బతీస్తుంది. దీంతో టెక్సాస్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి చెందిన డాక్టర్ బిల్లీకోన్, డాక్టర్ బడ్ ఫ్రేజియర్, లూయిస్ రక్తాన్ని పల్స్ లేకుండా రక్తం ప్రసరించడానికి సహాయపడే పరికరాన్ని అమర్చాల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటి పరికరాన్ని ఆ ఇద్దరు వైద్యులే రూపొందించారు. ఆ వైద్యులు ఈ పరికరాన్ని దాదాపు 50 దూడలపై పరీక్షించారు. వారు ఆయా జంతువుల హృదయాలను తీసేసి వాటి స్థానంలో ఈ పరికరాన్ని అమర్చారు. అవి తమదైనందిన విధులను గుండె లేకుండానే నిర్వర్తించగలిగాయి. అంతేగాదు సెతస్కోపును ఆవు ఛాతి వద్ద పెట్టి వింటే గుండె చప్పుడూ వినిపించదు. మనం ఈసీజీ పరీక్ష చేసిన ప్లాట్లైన్ చూపిస్తుందని డాక్టర్ కోన్ చెప్పుకొచ్చారు. ఐతే లూయిస్ పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో అతని భార్య లిండా ఆపరికరాన్ని తన భర్త శరీరంలోకి అమర్చడానికి వైద్యులకు అనుమతిచ్చింది. ఈ మేరకు వైద్యులు అతడి గుండెను తీసివేసి ఈ పరికరాన్నిఅమర్చారు. ఇది శరీరంలో నిరంతరం ప్రవహిస్తున్న రక్తం ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుంది. ఈ పరికరాన్ని అమర్చడానికి ముందు లూయిస్ని డయాలసిస్ మెషిన్, శ్వాసయంత్రం తోపాటు బాహ్య రక్త పంపుపై ఉంచారు. భార్య లిండా తన భర్త పల్స్ విన్నప్పుడూ ఆశ్చర్యపోయింది. అతనికి పల్స్ లేదని, ఇది చాలా అద్భుతమైనదని ఆమె చెబుతోంది. కానీ పాపం ఆ వ్యాధి కాలేయం, మూత్రపిండాలపై దాడి చేయడంతో లూయిస్ పరిస్థితి క్షీణించడం ప్రారంభించింది. అతను ఇలా పల్స్ లేకుండా ఒక నెలకుపైగా జీవించాడు. ఐతే శరీరానికి అమర్చిన పంపులు సరిగా పనిచేయకపోవడంతోనే అతను మరణించాడని వైద్యులు ధృవీకరించారు. దీంతో ప్రపంచంలోనే గుండె లేకుండా జీవించిన తొలి మానవుడిగా లూయిస్ నిలిచాడు. (చదవండి: ఆ ఘటన పట్ల చింతిస్తున్నా! క్షమించండి: ఎయిర్ ఇండియా సీఈఓ) -
థాయ్ ప్రిన్స్కి తీవ్ర అస్వస్థత.. కోలుకోవాలని ప్రజలంతా...
థాయ్లాండ్ రాజు వజిరాలాంగ్కార్న్ పెద్ద కుమార్తె థాయ్ యువరాణి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె బ్యాంకాక్కి ఉత్తరాన ఉన్న నఖోన్ రాట్చాసిమాలో జరుగుతున్న మిలటరీ శునకాల శిక్షణ కార్యక్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను హుటాహుటినా బ్యాంకాక్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఇంటిన్సివ్ కేర్లో చికిత్స పొందుతున్నారు . ఆమె గుండె, ఊరితిత్తులు, కిడ్ని సరిగా పనిచేయడం లేదని థాయ ప్యాలెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఆయా భాగాలకి వైద్యపరికరాల అమర్చి చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. వాస్తవానికి థాయ్లాండ్ రాజ్యం వారసత్వ నియమాలు పురుషులకే అనుకూలంగా ఉంటాయి. పైగా రాజు తర్వాత వారసుడిగా పురుషులనే ప్రకటిస్తారు. కాగా, అస్వస్థతకు గురయ్యినా 44 ఏళ్ల ప్రిన్స్ బజ్రకితియాభా మహిడోల్ని థాయ్లాండ్లోని ప్రజలు ప్రిన్సెస్ భా అని పిలుస్తారు. ఆమె థాయ్ రాజు మొదటి భార్య ఏకైక సంతానం. ఆమె థాయ్ రాజ్యంలో చాలా కీలక పాత్ర పోషించి అందరీ మన్ననలను అందుకుంది. ఆమె ఒక చిన్న అభియోగానికి 15 ఏళ్లు వరకు జైలు శిక్ష విధించే పరువు నష్టం వంటి చట్టాలను విమర్శిస్తూ..ప్రజలను రక్షిస్తుందనే మంచి పేరు ఆమెకు ఉంది. ప్రజలంతా రాజకుటుంబంలోని సదరు యువరాణికే పెద్ద పీఠ వేస్తారు. ప్రస్తుతం రాజ్యంలోని ప్రజలంతా ఆమె త్వరగా కోలుకోవాని ప్రార్థనలు చేయడమేగాక ఆమె త్వరగా కోలుకోవాలంటూ పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ ప్రచురిస్తున్నారు. (చదవండి: 5 ఏళ్లైనా వీడని దంపతుల డెత్ మిస్టరీ..హంతకుడి తలపై ఏకంగా 300 కోట్లు) -
అతి వ్యాయామంతో గుండెకు చేటు.. పోటు!
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో యువతలో గుండెపోటు సంబంధిత మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అధిక బరువు, శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఇందుకు కారణమని చాలామంది భావిస్తున్నారు. కానీ, కారణం అది కాదంట!. మరి.. అలవాటు లేని వ్యాయామాలు లేదంటే అతి వ్యాయామం వల్ల యువత గుండెపోటు బారిన పడుతున్నారని నిపుణులు గుర్తించారు. పాతికేళ్ల నుంచి 50 ఏళ్లలోపు వారిలో పలువురు జిమ్లో మృతి చెందిన సంఘటనలు ఇటీవలి కాలంలోనే బయటపడ్డాయి. కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్కుమార్, గాయకుడు కేకే, కమేడియన్ రాజు శ్రీవాస్తవ వ్యాయామం చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకల్లో యువత నృత్యాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తగిన శిక్షణ లేకుండానే కఠిన వ్యాయా మాలు చేయడం లేదా అతిగా వ్యాయామం చేయడం వల్ల కరోనరీ నాళాల్లో చీలికలు ఏర్పడతాయని, అంతిమంగా గుండెపోటుకు దారితీస్తుందని మొరాదాబాద్కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. అలవాటు లేని ఎక్సర్సైజ్లకు యువత దూరంగా ఉండాలని మరో వైద్యుడు వివేక్ కుమార్ సూచించారు. ఏ వ్యాయామం ఎలా చేయాలన్న దానిపై తగిన శిక్షణ తీసుకోవాలని చెప్పారు. -
సిగరెట్.. గుండెనూ కాల్చేస్తుంది
సాక్షి, అమరావతి: గుప్పెడంత గుండె శరీరం మొత్తానికి నిరంతరాయంగా రక్తం సరఫరా చేస్తుంటుంది. అంతటి కీలకమైన గుండెకు ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాలు, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి జబ్బులు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా ధూమపానం గుండె ఆరోగ్యంపై అత్యధిక ప్రభావం చూపుతోందని కర్నూలు జీజీహెచ్ వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. గుండె, ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ ప్రభాకర్రెడ్డి, కార్డియాలజీ వైద్యనిపుణుడు వినోద్ బైపాస్ సర్జరీ కేసులపై పరిశీలన జరిపారు. 2016 ఆగస్టు నుంచి 2021 డిసెంబర్ మధ్య కర్నూలు జీజీహెచ్లో నిర్వహించిన 108 బైపాస్ సర్జరీ కేసులను అనలైజ్ చేశారు. ఈ కేసుల్లో గుండె జబ్బు బాధితుల కనిష్ట వయసు 35, గరిష్ట వయసు 85 సంవత్సరాలు కాగా.. మొత్తం కేసుల్లో పురుషులు 90 మంది.. మహిళలు 18 మందిఉన్నారు. అధిక కేసులకు ధూమపానమే కారణం మెడికల్ అనలైజేషన్ ప్రొటోకాల్ ప్రకారం వివిధ కోణాల్లో పరిశీలన జరపగా.. 108 బైపాస్ సర్జరీ కేసుల్లో 60 మందిలో ధూమపానమే ప్రధాన కారణంగా నిర్ధారించారు. ధూమపానం అనంతరం రెండో స్థానంలో మద్యపానం ఉంది. 36 మందిలో మద్యపానం గుండె జబ్బుకు కారణంగా తేలింది. 28 మందిలో రక్తపోటు, 19 మందిలో మధుమేహం చరిత్రను గుర్తించారు. ధూమపానం ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్గా ఉన్న వ్యక్తులు యుక్త వయసు నుంచే ఆ వ్యసనానికి అలవాటుపడి ఉన్నట్టుగా నిర్ధారించారు. సుదీర్ఘకాలం పొగతాగడం వల్ల రక్తనాళాలపై తీవ్ర ప్రభావం పడి బైపాస్ సర్జరీలకు దారి తీసింది. రక్తనాళాలకు హాని ధూమపానం గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. ధూమపానం చేసినప్పుడు పీల్చే రసాయనాలు గుండె, రక్త నాళాలకు హాని కలిగిస్తాయి. దీంతో అథెరోస్క్లెరోసిస్ లేదా ధమనులలో ఫలకం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం కొంతమందికి, ముఖ్యంగా గర్భనిరోధక మాత్రలు ఉపయోగించే స్త్రీలకు, మధుమేహం ఉన్నవారికి మరింత ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక రక్తపోటు, అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలకు దారితీసి గుండె జబ్బుల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఈ క్రమంలో ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. రక్తపోటు, మధుమేహం వంటి జీవన శైలి జబ్బుల బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలి. – డాక్టర్ ప్రభాకర్రెడ్డి, గుండె, ఊపిరి తిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు, కర్నూలు -
ఆ గుండె వయసు.. 38 కోట్ల సంవత్సరాలు!!
వందలు, వేలు కాదు...ఏకంగా 38 కోట్ల సంవత్సరాల కిందటి నాటి గుండెను ఆస్ట్రేలియాలో కనుగొన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుండెగా నిర్ధారించారు. అంతరించిపోయిన ఎన్నో జీవజాతుల రహస్యాలను ఛేదిస్తున్న పరిశోధకులు.. పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింబర్లే ప్రాంతంలో ‘గోగో రాక్ ఫార్మేషన్’లో తవ్వకాలు జరుపుతుండగా ఈ గుండె శిలాజం దొరికింది. దీంతోపాటు కాలేయం, పొట్ట, పేగులు కూడా లభించాయి. ఈ అవయవాలు సొరచేపను పోలి ఉన్నాయని, ఇవి గోగో జాతికి చెందిన చేపవి అయి ఉంటాయని పెర్త్లోని కర్టిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. గోగో చేప.. ఊహాత్మక చిత్రం ఇదీ చదవండి: కరెంటు అక్కర్లేని ఏసీ.. నిమిషాల్లో కూల్ అయ్యే బెడ్ షీట్లు -
స్టెంట్ వేశాక మళ్లీ పూడుకుపోతే..?
అన్ని అవయవాలకు అందినట్లే గుండెకు కూడా రక్తం నిరంతరం అందుతుండాలి. ఒక్కోసారి గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో పూడిక చేరినప్పుడు స్టెంట్లు వేసి, గుండె కండరానికి రక్తం నిరంతరాయంగా అందేలా చూస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇలా స్టెంట్లు వేసినప్పటికీ... అవి మళ్లీ పూడుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు అందుకు కారణాలను కనుగొని, స్టెంట్లలో ఏర్పడ్డ పూడికలను తొలగించి, ఆ రక్తనాళాలు మళ్లీ పూడుకుపోకుండా చేసేందుకు అందుబాటులో ఉన్న చికిత్సల గురించి కథనమిది. గుండెకు రక్తాన్ని చేరవేసే ప్రధాన ధమనుల్లో ఎక్కడైనా పూడికలు ఏర్పడినప్పుడు... సాధారణంగా యాంజియోప్లాస్టీ అనే చికిత్స ప్రక్రియ ద్వారా స్టెంట్ వేసి, సన్నబడ్డ రక్తనాళాన్ని మళ్లీ విచ్చుకునేలా చేస్తారు. అయితే స్టెంట్ వేశాక... మళ్లీ ఆ రక్తనాళం పూడుకుపోకుండా డాక్టర్లు కొన్ని జాగ్రత్తలు సూచిస్తారు. ఉదాహరణకు మధుమేహాన్ని, అధికరక్తపోటును అదుపులో పెట్టుకోవడం, స్మోకింగ్, మద్యం అలవాట్లను పూర్తిగా మానేయడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం, మళ్లీ కొవ్వు పేరుకోడాన్ని నివారించేందుకుగాను కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే సమతులాహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు చెబుతారు. అయితే స్టెంట్ వేశాక కొంతమంది బాధితులు ఈ నియమాలన్నింటినీ పాటించరు. దాంతో... నియమాలు పాటించని వారిలో మళ్లీ పూడికలు వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన లక్షణాలు హఠాత్తుగా ఛాతీలో నొప్పి చెమటలు పట్టడం వాంతులు దీర్ఘకాలికమై లక్షణాలు శ్వాసలో ఇబ్బంది ఛాతీలో అసౌకర్యం నడక, కదలికల సమయంలో ఆయాసం తమ కదలికలు కేవలం కొద్ది దూరాలకు మాత్రమే పరిమితమైపోవడం. నిర్ధారణ పరీక్షలు ఈసీజీ ఎకోకార్డియోగ్రామ్ కరొనరీ యాంజియోగ్రామ్ పూడికలు ఎక్కడ వస్తాయంటే...? ఒక్కోసారి ఇలా వేసిన స్టెంట్లోనే మళ్లీ పూడిక రావచ్చు. లేదా స్టెంట్కు పరిసర ప్రాంతాల్లో రెండోసారి పూడికలు రావచ్చు. స్టెంట్ వేశాక కూడా ఇలా రక్తనాళాలు తిరిగి మూసుకుపోవడానికి 3 నుంచి 5 శాతం వరకు అవకాశాలుంటాయి. ఇన్స్టెంట్ స్టెనోసిస్ అంటే... స్టెంట్ వేశాక ఏర్పడే పూడిక... స్టెంట్ లోపలగానీ లేదా దానికి 5 మిల్లీమీటర్ల పరిధిలోగానీ, స్టెంట్ అంచుల్లోగానీ ఏర్పడితే దాన్ని ఇన్స్టెంట్ స్టెనోసిస్ అంటారు. ఈ పూడికను కరొనరీ ఇమేజింగ్ పద్ధతుల ద్వారా దాన్ని కనిపెట్టాల్సి ఉంటుంది. కరొనరీ ఇమేజింగ్ అంటే ‘ఇంట్రావాస్క్యులార్ అల్ట్రాసౌండ్’ లేదా ‘ఆప్టికల కొహరెన్స్ టోమోగ్రఫీ’ అనే ఇమేజింగ్ ప్రక్రియలు. ఇలా స్టెంట్ లోపలగానీ లేదా చుట్టుపక్కల గానీ, అంచుల్లోగానీ పూడికలు మళ్లీ ఏర్పడటానికి కారణం... స్టెంట్ అవసరమైనంత మేరకు వ్యాకోచించకపోవడం అన్నమాట. ఇలా జరగడాన్ని ‘స్టెంట్ అండర్–ఎక్స్ప్యాన్షన్’ అంటారు. అలాగే స్టెంట్ ఫ్రాక్చర్కు గురికావచ్చు కూడా. స్టెంట్ పొడవు 30 మిల్లీమీటర్లకు మించినప్పుడు అది తిరిగి పూడుకుపోయే అవకాశాలు కొంతమేర ఎక్కువ. అలాగే ఒకటికి మించి... రెండు స్టెంట్లు వేసిన సందర్భాల్లోనూ ఒకదాని పైకి ఒకటి వచ్చేలా (ఓవర్ల్యాప్ చేస్తున్నట్లుగా) వేసిన సందర్భాల్లోనూ ఇలా మరోసారి పూడిక చేరేందుకు అవకాశాలు ఎక్కువ. అలాగే స్టెంట్ వేసినప్పుడు, అందులో ఎముకల తాలూకు అవశేషాలు పేరుకుని ఉన్నట్లయితే, స్టెంట్ అవసరమైన మేరకు వ్యాకోచించడానికి అది అడ్డంకిగా మారవచ్చు. అలాంటిప్పుడు దాన్ని సరిచేయకపోతే... ఆ తర్వాతి కాలంలో తిరగి పూడికలు ఏర్పడేందుకు అవకాశాలు ఎక్కువ. స్టెంట్ లోపల మరో స్టెంట్... ఈ ప్రక్రియను వైద్యులు చివరి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. సాధారణంగా స్టెంట్లోపల మరోస్టెంట్ వేయడం వల్ల రక్తనాళం మరింత ఇరుగ్గా మారిపోయే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా రక్తనాళం తిరిగి పూడుకుపోయే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి మిగతా ఏ విధానాలూ పనిచేయని సందర్భాల్లో మాత్రమే అరుదుగా ఇలా రీస్టెంటింగ్ ప్రక్రియను చివరగా ఉపయోగిస్తారు. డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్... స్టెంట్లలో రెండురకాలు ఉంటాయి. అవి... బేర్ మెటల్ స్టెంట్స్, డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్. ప్రస్తుతం బేర్ మెటల స్టెంట్లు అందుబాటులో లేవు. అయితే ఈ బేర్ మెటల్ స్టెంట్లు తిరిగి పూడుకుపోయేందుకు అవకాశాలు ఎక్కువ. వీటిలో కణజాలం పెరగకుండా నిరోధించడం అసాధ్యం. అందుకే బేర్ మెటల్ స్టెంట్లకు బదులుగా డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్లు వాడుకలోకి వచ్చాయి. ఈ స్టెంట్లలో ఉండే ఔషధ పదార్థం (డ్రగ్) మూడు నెలల నుంచి ఆరు నెలల పాటు విడుదలవుతూ... స్టెంట్లోపల కణజాలం పెరుగుదలను నియంత్రిస్తుంది. తద్వారా ఇది చాలాకాలంపాటు పూడుకుపోకుండా ఉంటుంది. ఇలాంటి డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్లు వేయించుకున్న రోగుల్లో, తిరిగి పూడికలు ఏర్పడే అవకాశాలు కేవలం 3 నుంచి 5 శాతం మేరకే ఉంటాయి. కానీ బేర్ మెటల్ స్టెంట్లు వేయించుకున్నవారిలో తిరిగి పూడికలు ఏర్పడే అవకాశాలు 30 శాతం వరకు ఉంటాయి. అందుకే ఇవి అంతగా ప్రాచుర్యం పొందలేదు. లేజర్తో పూడిక తొలగింపు.... స్టెంట్లో కణజాలం మళ్లీ పెరిగి. అవి మళ్లీ పూడుకుపోయే కండిషన్ను ‘టిష్యూ హైపర్ప్లేసియా’ అంటరు. ఇలాంటి కండిషన్ను లేజర్తో చక్కదిద్దవచ్చు. తొలత లేజర్లను ఉపయోగించి పూడికను తొలగించాక... ఆ తర్వాత డ్రగ్ పైపూతగా ఉన్న బెలూన్ల సహాయంతో స్టెంట్ లోపలి పొరల్లోకి ఔషధపదార్థాన్ని పంపుతారు. ఇందుకోసం ‘పాక్లిటాక్సెల లేదా ‘సిరోలిమస్’ అనే ఔషధాలను (డ్రగ్స్)ను వైద్యులు ఉపయోగిస్తారు. ఇన్స్టెంట్ స్టెనోసిస్కు చికిత్స ఇలా... కరొనరీ ఇమేజింగ్ ద్వారా స్టెంట్ తగినంతగా వ్యాకోచించలేదని గుర్తిస్తే... అప్పుడు ఆ స్టెంట్ తాలూకు అండర్–ఎక్స్ప్యాన్షన్ కండిషన్కు చికిత్స చేసి, సరిదిద్దాల్సి ఉంటుంది. అంతే తప్ప పాత స్టెంట్ స్థానంలో కొత్త స్టెంట్ ఏర్పటు చేయడం సరికాదు. కాబట్టి స్టెంట్ అండర్–ఎక్స్ప్యాన్షన్కు తగిన కారణాలను కనిపెట్టి, వాటిని సరిదిద్దాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో స్టెంట్ చుట్టూరా క్యాల్షియమ్ లేదా దృఢ కణజాలం పేరుకుపోయి స్టెంట్ తగినంతగా వ్యాకోచించడానికి అడ్డుపడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ఒత్తిడితో కూడిన బెలూన్ల సహాయంతో స్టెంట్ను తిగిరి వ్యాకోచించేలా చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో రొటాబ్లేషన్, కటింగ్ బెలూన్ల వంటి ప్రక్రియలతో స్టెంట్ను తగినంతగా వ్యాకోచించేలా చేయవచ్చు. -డాక్టర్ ఎ. శరత్రెడ్డి, సీనియర్ కార్డియాలజిస్ట్ -
సైరస్ మిస్త్రీ విషాదం: పోస్ట్మార్టం నివేదిక ఏం చెబుతోందంటే?
ముంబై: గత ఆదివారం కారు ప్రమాదంలో మరణించిన టాటాసన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రాథిమిక పోస్ట్మార్టం పూర్తియింది. దీని ప్రకారం ఆయన తలకు, గుండెకు తీవ్ర గాయాలయ్యాయి. ఫలితంగా అంతర్గత రక్తస్రావంతో అక్కడి కక్కడే మరణించినట్లు నివేదిక పేర్కొంది. అలాగే పాలీట్రామా (శరీరంలోని అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బ తినడం)కు గురయ్యారని ఈ నివేదిక తేల్చింది.(Instagram: భారీ జరిమానా..షాకింగ్! ఎందుకో తెలుసా?) సోమవారం తెల్లవారుజామున ముంబైలోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని జేజే ఆసుపత్రిలో సైరస్ మిస్త్రీ పోస్టుమార్టం నిర్వహించినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. మిస్త్రీ, జహంగీర్ పండోలే ఇద్దరి శవపరీక్ష నివేదికను కాసా పోలీస్ స్టేషన్కు (ప్రమాదం జరిగిన ప్రాంతం)పంపారు. మరో రెండురోజుల్లో తుది నివేదిక వెలువడ నుంది. ఇందులో మిస్త్రీ మరణానికి ఖచ్చితమైన కారణాన్ని పేర్కొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిస్త్రీ శరీరంనుంచి ఎనిమిది శాంపిళ్లను సేకరించి, తదుపరి పరిశీలన కోసం విసెరా నమూనాలు భద్రం చేశారు. మరోవైపు మంగళవారం తెల్లవారుజామున ముంబైలోని వర్లీ శ్మశానవాటికలో సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై సూర్య నదిపై ఉన్న వంతెనపై వేగంగా వెళుతున్న మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మిస్త్రీతోపాటు, స్నేహితుడు జహంగీర్ పండోలే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ అనాహిత పండోలే, ఆమె భర్త డేరియస్ పండోలే ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మితిమీరిన వేగం మిస్త్రీ , మిస్టర్ జహంగీర్ పండోల్ ఇద్దరూ సీట్ బెల్ట్ ధరించకపోవడమే విషాదానికి దారి తీసిందని పోలీసులుఅధికారులు వెల్లడించారు. ఇదీ చదవండి: New milestone: వావ్.. మార్కెట్లో భారీగా ఇన్వెస్టర్లు, కీలక మైలురాయి ముగిసిన అంత్యక్రియలు జేజే ఆస్పత్రి నుంచి తీసుకొచ్చిన ఆయన భౌతికకాయాన్నిస్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషుల నివాళులర్పించేందుకు వర్లీ శ్మశానవాటికలో ఉంచారు. అనంతరం సెంట్రల్ ముంబైలోని వర్లీలోని ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో హిందూ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరిపించారు. పార్సీ సంఘం సభ్యులు, వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు దహన సంస్కారాలకు హాజరయ్యారు. సైరస్ మిస్త్రీ సోదరుడు షాపూర్ మిస్త్రీ, మామ, సీనియర్ న్యాయవాది ఇక్బాల్ చాగ్లా, పారిశ్రామికవేత్తలు అనిల్ అంబానీ, అజిత్ గులాబ్చంద్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు సైరస్ మిస్త్రీకి తుది నివాళులర్పించారు. అమూల్ ప్రత్యేక నివాళి డైనమిక్ బిజినెస్మ్యాన్ అంటూ అమూల్ ఇండియా మిస్త్రీకి నివాళులర్పించింది. View this post on Instagram A post shared by Amul - The Taste of India (@amul_india) -
వైద్య చరిత్రలో మరో అద్భుతం... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం
కేం బ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ గర్భస్థ పిండాన్ని సృష్టించారు. ఈ పిండంలో మానవ పిండం మాదిరిగా అవయవాలన్ని క్రమంగా అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. గర్భస్థ పిండాన్ని సృష్టించడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. వాస్తవానికి పరిశోధకులు వైద్యశాలల్లో పిండాన్ని స్త్రీలోని అండాలు, పురుషుడిలోని స్పెర్మ్ని ఉపయోగించి కృత్రిమంగా పిండాన్ని రూపొందిస్తారు. దీన్నే టెస్ట్ట్యూబ్ బేబి అంటారు. బాహ్యంగా పిండాన్ని రూపొందించడం. కానీ ఇక్కడ మాత్రం శాస్త్రవేత్తలు వాటిని వినియోగించకుండా కేవలం స్టెమ్ సెల్స్(మూల కణాలను) వినియోగించి కృత్రిమ గర్భస్థ పిండాన్ని రూపొందించారు. ఈ మేరకు ప్రోఫెసర్ మాగ్డలీనా జెర్నికా నేతృత్వంలో తమ బృందం ఈ పిండాన్ని రూపొందిచినట్లు తెలిపారు. అదీకూడా మూడు వేర్వేరు మూలకణాలను తీసుకుని ఈ పరిశోధన చేసినట్లు తెలిపారు. ఆ మూలకణాల్లోని జన్యువులను పరస్పరం చర్య జరుపుకునేలా ప్రత్యేక వాతావరణాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. అలా రూపొందిన ఈ గర్భస్థ పిండం మానవుల గర్భస్థ పిండంలో గుండె కొట్టుకోవడం, మెదడు, చర్మం వంటివి ఎలా అభివృద్ధి చెందుతాయో అలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన కొంతమంది తల్లులకు గర్భం విజయవంతమవ్వడం, మరికొందరికి గర్భస్రావం అవ్వడంవంటివి ఎందుకు జరుగుతాయో తెలుసుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. తల్లిగర్భంలో ఎలా పిండం అభివృద్ధి చెందుతుందో అలా మూలకణాలతో రూపొందిన కృత్రిమ పిండం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ కృత్రిమ పిండాన్ని తల్లి గర్భంలో అమర్చి వివిధ దశల్లో ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోగలగడమే కాకుండా మరిన్ని పరిశోధనలకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు. (చదవండి: ఉక్రెయిన్ విడిచి వచ్చిన పౌరులకు... బంపరాఫర్ ప్రకటించిన పుతిన్) -
దెబ్బతిన్న గుండెకు జీబ్రా ఫిష్ వైద్యం!
జీబ్రా ఫిష్ అనే ఈ చేపలు చాలా అందంగా ఉంటాయి. అవి ఎంత అద్భుతమైన జీవులంటే తమలోని కొన్ని దేహ భాగాలను అవి మళ్లీ పుట్టించుకోగల ప్రత్యేకత వాటి సొంతం. అవి తమ కంటిలోని రెటీనా కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవు. ఏదైనా దెబ్బతగిలినప్పుడు గాయపడ్డ తమ గుండె కణజాలాన్ని మళ్లీ ఉత్పత్తి చేసుకోగలవని తాజాగా తేలింది. మనుషుల గుండె కండరాల్లోని కణాలను కార్డియోమయోసైట్స్ అంటారు. అవి జీబ్రాఫిష్లోలా పునరుత్పత్తి చెందలేవు. గుండె కండరానికి తగినంత ఆక్సిజన్ సరఫరా కాని సందర్భాల్లో... గుండెపోటు వస్తుంది. అప్పుడు మన గుండె తాలూకు కణాలు అంటే కార్డియోమయోసైట్స్ దెబ్బతింటాయి. ఫలితంగా దెబ్బతిన్న చోట గుండెపై చార/గాటు (స్కార్) లాంటిది ఏర్పడుతుంది. దీన్నే ‘ఫైబ్రోసిస్’అంటారు. ఇలా జరిగిన సందర్భాల్లో గుండె మునుపటి కంటే బలహీనమవుతుంది. అయితే జీబ్రాఫిష్లో గుండె కణాల ప్రవర్తన కాస్త విభిన్నంగా ఉంటుంది. ఏదైనా కారణంతో గుండె కణజాలం లేదా కణాలు దెబ్బతింటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే.. ఒక మిల్లీమీటరు సైజులో ఉండే దాని గుండె కణాల్లో 20 శాతం మళ్లీ పుడతాయి. ఈ అధ్యయనం ద్వారా ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కనెక్టివ్ కణజాలం తాలూకు కణాలు కండక్టర్లుగా పనిచేసి, రిపేరుకు తోడ్పడే సిగ్నల్స్ పంపే ప్రోటీన్ల సహాయంతో.. ఇలా కణాలు మళ్లీ పుట్టేలా చేస్తాయని తెలుస్తోంది. ఈ కొత్త అధ్యయనం ద్వారా జీబ్రా ఫిష్లో మాదిరిగా గుండె కణజాలం మళ్లీ పుట్టేలా చేసేందుకు... కణ ఆధారిత చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. దెబ్బతిన్న భాగంలోని కణాలు మళ్లీ పుట్టేలా చేయడానికిగానీ లేదా దెబ్బతిన్న గుండె వద్ద పూర్తిగా రిపేరు చేసేందుకు గానీ వీలవుతుందన్న అద్భుతమైన విషయం తెలియవస్తోంది. ‘‘ఈ చిన్నచేప తమ అవయవాలను ఎలా పునరుత్పత్తి చేసుకోగులుతోందో తెలుసుకోవాలనుకుంటున్నాం’’అన్నారు జర్మనీలోని బెర్లిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సిస్టమ్స్ బయాలజీకి చెందిన ఫిలిప్ జంకర్. ఆయన తన పరిశోధనను సెంటర్ ఫర్ మాలెక్యులార్ మెడిసిన్కు చెందిన మాక్స్ డెల్బ్రక్తో పాటు కొనసాగించారు. పరిశోధన ఫలితాలు ‘నేచర్ జెనెటిక్స్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. మునుపు ఈ ఏడాదే మొట్టమొదటిసారిగా ఓ పంది గుండెను తీసి, మనిషికి అమర్చిన విషయం తెలిసిందే. (అయితే ఆ బాధితుడు ఈ చికిత్స జరిగిన రెండు నెలల్లోనే మరణించాడు). అలాగే ఈ ఏడాది మేలో గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలు వాటంతట అవే కొంతవరకు రిపేరు చేసుకుంటాయన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక జూన్ లో ఎమ్ ఆర్ఎన్ఏ ప్రక్రియ ద్వారా జన్యుపరమైన సూచనలిస్తూ గుండెపోటుకు గురైన ఓ ఎలుక గుండె రిపేరు జరిగేలా ప్రయత్నించి, విజయం సాధించారు. తాజాగా ఈ అధ్యయనంలో ఓ అల్ట్రా కోల్డ్ నీడిల్తో మనుషుల్లో గుండెపోటు ఎలా వస్తుందో ఓ ఎలుకకూ అలాగే జరిగేలా చూశారు. అప్పుడు ఏం జరుగుతుందో పరిశీలించారు. ‘‘గుండెపోటుతో మనిషిలో ఏం జరుగుతుందో... ఎలుక గుండెకూ అదే జరిగింది. అయితే గుండెపోటుతో మనిషి ఆగిపోవచ్చు. కానీ జీబ్రాషిప్లో మాత్రం కొత్త ‘కార్డియోమయోసైట్స్’అనే కణాలు ఉద్భవిస్తుంటాయి. వాటితో దాని గుండె తాలూకు రిపేరు ప్రక్రియ కొనసాగుతుంది. కొత్తగా ఉద్భవించిన ఆ కణాలు స్పందనలనూ కొనసాగిస్తున్నాయి’’అని తెలిపారు ఫిలిప్ జుంకర్స్. ఆశాజనకమే కానీ.. జీబ్రాఫిష్ గుండెకు ఎలాంటి గాయం కానప్పుడు దాని నుంచి దాదాపు 2,00,000 కణాలను వేరుచేసి, సింగిల్ సెల్ సీక్వెన్సింగ్ అనే ప్రక్రియ ద్వారా వాటిని స్కాన్ చేశారు ఈ పరిశోధన బృందంలోని అధ్యయనవేత్తలు. ఆ కణాలను గుండెపోటు తర్వాత దెబ్బతిన్న కణాలతో పోల్చి చూశారు. వాటిలోని ఏ అంశాలు దెబ్బతిన్న తర్వాత చురుగ్గా మారి, రిపేరుకు తోడ్పడుతున్నాయనే విషయాలను పరిశీలించారు. మూడు రకాల ఫైబ్రోబ్లాస్ట్స్ రంగంలోని దూకి, కండరాల్లోని కణాలు తిరిగి పుట్టేలా పురిగొల్పే ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తున్నాయనీ... తిరిగి అవి కనెక్టివ్ కణజాలాన్ని ఉద్భవించేలా చేస్తున్నాయని వారి పరిశీలనలో తెలిసింది. మళ్లీ ఆ జన్యువులను పని జరగకుండా ఆపినప్పుడు.. ఈ పునరుత్పత్తి ప్రక్రియ జరగడం లేదని కూడా తెలుసుకున్నారు. తద్వారా ఈ పునరుత్పత్తి /రిపేరు ప్రక్రియలో ఫైబ్రోబ్లాస్ట్స్ కీలకమైన భూమిక పోషిస్తున్నట్లు తెలుసుకున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు పుట్టే ఇన్ఫ్లమేటరీ కణాలైన ‘మ్యాక్రోఫేజెస్’కు వ్యతిరేకంగా ఈ ఫైబ్రోబ్లాస్ట్స్ పనిచేస్తూ, ఈ రిపేరు ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఎపీకార్డియమ్ అనే గుండె తాలూకు బయటిపొర సైతం ఈ పునరుత్పిత్తి ప్రక్రియలో చాలా చురుగ్గా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతానికి ఈ పరిశోధన కాస్త ఆశాజనకంగానే ఉన్నప్పటికీ మానవుల విషయంలో ఈ ఫైబ్రోబ్లాస్ట్ మెకానిజమ్ ఏ మేరకు పూర్తి సత్ఫలితాలు ఇస్తుందనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. కాకపోతే గుండెపోటుతో దెబ్బతిన్న గుండెను సమర్థంగా రిపేరు చేసేందుకు జరిగే ప్రయత్నాల్లో భవిష్యత్తులో ఈ పరిశోధన చాలా వరకు తోడ్పడే అవకాశమున్నట్లు పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్ -
గుండెను తయారు చేయొచ్చు!
సాక్షి, హైదరాబాద్: రిఫ్రిజిరేటర్, టీవీ, వాషింగ్ మెషీన్ వంటివి పాడైపోతే ఏం చేస్తాం? మరమ్మతు చేయించుకుని వాడుకుంటాం. లేదా కొత్తవి కొనుక్కుంటాం. అదే మన శరీరం లోని ఏదైనా అవయవం పాడైతే..? మందు లేసుకునో, శస్త్ర చికిత్స చేయించుకునో పనిచేసేలా చూస్తాం. చాలా అరుదుగా అవయవ మార్పిడి తప్ప మార్కెట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావాల్సిన అవయవాన్ని తెచ్చి అమర్చు కునే పరిస్థితి లేదు. కానీ అలాంటి వెసులుబాటు ఉంటే, మనకు కావాల్సిన అవయవాన్ని తయారు చేసుకోగలిగితే? ఇలాంటి అద్భుతం సాకారమయ్యేందుకు మార్గం సుగమమైంది! చైనాలోని ట్సింగ్హువా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మూలకణాలపై ఈ మేరకు జరిపిన ఓ ప్రయోగం విజయవంతమైంది. మూలకణాలే మూలం.. అవయవాల తయారీ ఎలా అన్న విషయాన్ని తెలుసుకునే ముందుగా మనం మూలకణాల గురించి కొంత అర్థం చేసుకోవాలి. పిండ దశ నుంచి బిడ్డ పుట్టి ఎదిగేంతవరకూ మానవ అవయవాల్లో మూల కణాలు ఉంటాయి కానీ.. వేటి లక్షణాలు వాటివే. పిండంలో ఉండే కణాలనే ఉదాహరణగా తీసుకుంటే అవి గర్భంలో ఉన్న దశలో అన్ని రకాల కణజాలాలు, అవయవాలుగా మారగల సామర్థ్యం కలిగి ఉంటాయి. బిడ్డ పుట్టిన తరువాత.. ఎదిగిన తరువాత మాత్రం ఒక్కో అవయవంలో అత్యల్ప స్థాయిలో ఉండే మూలకణాలు ఆ అవయవంగా మాత్రమే మారగలవు. అంటే మూత్రపిండంలోని మూల కణాలు ఆ అవయవంగా మాత్రమే మారగలవన్న మాట! అయితే పిండదశలో ఉన్న మూలకణం గుండె గానూ మారగలదు. మూత్రపిండంగానూ తయారు కాగలదు. ఉమ్మినీరు గానూ మారగలదు. వీటిని టూటీపోటెంట్ స్టెమ్సెల్స్ అని పిలుస్తారు. స్థూలంగా చెప్పాల్సి వస్తే... నాలుగైదు రోజుల వయసున్న పిండంలోని కణాలే ఈ టూటీ పోటెంట్ కణాలు. ఆ తరువాత కొంత సమయానికి ఇవి శరీరంలోని వేర్వేరు కణాలుగా మారగల సామర్థ్యాన్ని సంతరించుకుంటాయి. వీటిని ప్లూరీపోటెంట్ స్టెమ్సెల్స్ అని పిలుస్తారు. పిండంలో అవయవాలు ఏర్పడటం మొదలైన తరువాత వాటికేదైనా నష్టం జరిగితే సరిచేసేందుకు వీలుగా కొన్ని మూలకణాలు ఉంటాయి. అవి ఆ అవయవ కణాలుగా మాత్రమే మారగలవు. వీటిని మల్టీపోటెంట్ కణాలు అంటారు. పిండం కూడా సృష్టించొచ్చు! ఇవి ఏ అవయవంగానైనా మారగలవని ముందే చెప్పుకున్నాం కదా. ఆ విధంగా సుదూర భవిష్యత్తులో నిస్సంతులకు వీర్యం, అండాల అవసరం లేకుండా పిండాన్ని సృష్టించేందుకు కూడా ఈ టెక్నాలజీ పయోగపడుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పిండాన్నే సృష్టించే సామర్థ్యం ఉన్నప్పుడు అవసరమైన అవయవాల తయారీ పెద్ద కష్టమేమీ కాదని భావిస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీ వాడకం ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మరింత క్షుణ్ణంగా పరిశోధనలు జరపడం ద్వారా ఫలితాలను మరింత కచ్చితంగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూలకణాలను మార్చేశారు చైనా వర్సిటీ శాస్త్రవేత్తలు మనుషుల అవయ వాల్లోని మల్టీ పోటెంట్ మూలకణాలను తీసుకుని.. రసాయన మిశ్రమం సాయంతో టూటీపోటెంట్ కణా లుగా మార్చేశారు. ఇంకోలా చెప్పాలంటే.. పిండ దశలో ఉన్న మూలకణాల మాదిరి మార్చేశారన్నమాట. కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు మల్టీపోటెంట్ కణా లను ప్లూరీపోటెంట్ కణాలుగా మార్చడంలో విజ యం సాధించారు కానీ.. టూటీపోటెంట్ కణా లుగా మార్చడం మాత్రం ఇదే తొలిసారి. ఇందు కోసం వారు కొన్ని వేల పరమాణువుల మిశ్రమా లను పరీక్షించి చివరకు మూడింటిని గుర్తించారు. టీటీఎన్పీబీ, 1–అజాకెన్పాల్లోన్, డబ్ల్యూఎస్6 అని పేర్లు పెట్టిన ఈ మూడు రసాయనాలు ఎలుకల్లోని ప్లూరీపోటెంట్ కణాలను టూటీపోటెంట్ కణాలుగా మార్చగలవని నిర్ధారించుకున్నారు. ఎలుకల పిండాల్లో, పరిశోధన శాలలు రెండింటిలోనూ జరిపిన పరిశోధనల ద్వారా వీటి లక్షణాలన్నీ టూటీపోటెంట్ కణాల మాదిరిగానే ఉన్నట్లు స్పష్టమైంది. -
హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోతుంది.. కానీ ఈ ప్రొటిన్ వల్ల
మనకు ఏదైనా గాయం కాగానే... శరీరం తనను తాను రిపేరు చేసుకునే తీరు అద్భుతం. ప్రతివారి జీవితంలో ఏదో ఓ సందర్భంలో గాయం కాగానే... (అది మరీ పెద్దది కాకపోతే) కొద్దిరోజుల్లోనే దాని ఆనవాలు కూడా తెలియకుండా పోతుంది. భారీ హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోవడం... అవే కండరాలు మళ్లీ పునరుజ్జీవం పొందకపోవడం వల్లనే చాలామందిలో మరణం సంభవిస్తుంది. కానీ చాలా తక్కువగా లేదా ఓ మోస్తరుగా వచ్చిన హార్ట్ అటాక్లోనూ... శరీరం తనను తాను రిపేరు చేసుకునే ప్రక్రియ సాగుతుంది. ఇదెలా జరుగుతుందో తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇదెలా జరుగుతుందో తెలుసుకుంటే... స్వాభావికంగా జరిగే ఇదే ప్రక్రియను... వైద్య చికిత్సగా ఇవ్వడం ద్వారా గుండెను రిపేరు చేసుకోగలమన్నది శాస్త్రవేత్తల భావన. తమ పరిశోధనల ద్వారా అదెలా జరుగుతుందో... రిపేరుకు కారణమయ్యే ప్రోటీన్ ఏమిటో తెలుసుకున్నారు. దాని గురించి తెలిపేదే ఈ కథనం. మన దేహంలో ఏదైనా భాగం గాయపడగానే... వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. ‘లింఫాటిక్ సిస్టమ్’ అనే వ్యవస్థ ఇందుకు తోడ్పడుతుంది. ఇది మన వ్యాధినిరోధక వ్యవస్థలో ఒక కీలక అంశం. దేహంలో అన్నిచోట్ల కండరాలకు రిపేరు జరిగినట్లే... దెబ్బతిన్న గుండె కండరాన్నీ రిపేరు చేయడానికి పూనుకుంటుందీ వ్యవస్థ. రిపేరు ప్రక్రియలో ఏం జరుగుతుంది...? ఎలా జరుగుతుంది? ఏదైనా భాగంలో దెబ్బతగలగానే లింఫాటిక్ సిస్టమ్ ద్వారా ‘మ్యాక్రోఫేజెస్’ అనే కణాలు ఎక్కువ స్థాయిలో విడుదల అవుతాయి. నిజానికి అవి మన వ్యాధినిరోధక వ్యవస్థలో భాగంగా... అవి తెల్లరక్తకణాలపై ఉండే అనుబంధ కణాలే. ‘మ్యాక్రో’ అంటే పెద్దవి... ‘ఫేజెస్’ అంటే హరించేవి అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే అవి హానికరమైన కణాలనూ/అంశాలనూ, బ్యాక్టీరియాను, అతి సూక్ష్మమైన హానికారక క్రిములను తినేయడం/హరించడం చేస్తాయి. అలాగే మన రోజువారీ జీవక్రియల్లో భాగంగా మనలో ప్రతిరోజూ 200 నుంచి 1000 వరకు క్యాన్సర్ కణాలూ వెలువడుతుంటాయి. వాటిని కూడా ఈ మ్యాక్రోఫేజెస్ పూర్తిగా హరించేస్తాయి. (మన వ్యాధినిరోధక శక్తి తగినంత లేని సందర్భాలోనూ, లేదా అక్కడ పుట్టిన మొత్తం క్యాన్సర్ కణాలను ఈ మ్యాక్రోఫేజెస్ పూర్తిగా హరించలేని సందర్భాల్లోనే క్యాన్సర్ వస్తుందన్నమాట). హానిచేసే కణాలను మాత్రమేగాకుండా... ఏదైనా దెబ్బతగిలినప్పుడు ఇన్ఫ్లమేషన్ (మంట, వాపు) కలిగించే కారకాలనూ, దెబ్బతిన్న తర్వాత శిథిలమైపోయి పోగుబడ్డ కణాల గుట్టలనూ ఇవి నిర్మూలిస్తాయి. ఇన్ఫెక్షన్ కలిగించే వాటినీ తొలగిస్తాయి. అంతేకాదు... బయటి పదార్థాలనూ (ఫారిన్బాడీస్నూ) ఎదుర్కొంటాయి. ఇలా ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే... ఇవి పెద్దసంఖ్యలో పుట్టి... ఇలా క్లీన్ చేసే ప్రక్రియను ‘ఫ్యాగోసైటోసిస్’ అని అంటారు. మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తాయి? ఇంతటి కీలకమైన భూమిక నిర్వహించే ఈ ‘మ్యాక్రోఫేజెస్’ ఎలా ఈ పని చేస్తాయన్నది శాస్త్రవేత్తలు ఇటీవలి తమ అధ్యయనాల్లో తెలుసుకున్నారు. ‘నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయీ’కి చెందిన ప్రముఖ పాథాలజిస్ట్ ఎడ్వర్డ్ థోర్ప్ ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో వివరించారు. ‘‘గుండెపోటు రాగానే ఇమ్యూన్ సెల్స్... సరిగ్గా చెప్పాలంటే ‘మ్యాక్రోఫేజెస్’ గుండెకండరం దెబ్బతిన్న చోటికి వెంటనే చేరుకుంటాయి. అక్కడ దెబ్బతిన్న కండరాలనూ, చచ్చుబడ్డ కణజాలాన్నీ (డెడ్ టిష్యూను) తినేయడం ప్రారంభిస్తాయి. ఇందుకోసం ఈ మ్యాక్రోఫేజెస్ ‘వీఈజీఎఫ్–సీ’ అనే ప్రోటీన్ను తయారు చేసి వెలువరిస్తాయి. ‘వాస్క్యులార్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్–సి’ అనే మాటకు సంక్షిప్తరూపమే ఈ ‘వీఈజీఎఫ్–సీ’. ‘డాక్టర్ జకిల్ అండ్ మిస్టర్ హైడ్’ నవలోలాగా... ఈ మ్యాక్రోఫేజెస్ ఇక్కడ రెండు పనులు ఒకేసారి చేస్తుంటాయి. మంచి మ్యాక్రోఫేజెస్... ‘వీఈజీఎఫ్–సి’ని ఉత్పత్తి చేస్తుంటాయి. కానీ అదే సమయంలో కొన్ని చెడు మ్యాక్రోఫేజెస్ ఇన్ఫ్లమేటరీ (మంట, వాపు) కలిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఇవి... అప్పటికే దెబ్బతిన్న గుండె కండరానికీ, ఆ పొరుగున ఉన్న కణజాలాలకు మరింత హాని చేసే అవకాశం ఉంది. ఇలా జరిగే సమయంలో అక్కడ దెబ్బతిని, నశించుకుపోయాక లేదా చచ్చుబడిపోయాక పోగుబడ్డ మృతకణజాలం అంతా తొలగిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఆ మృతకణజాలమంతా పూర్తిగా తొలగిపోయి, పరిశుభ్రమైపోయే ప్రక్రియను ‘ఎఫరోసైటోసిస్’ అంటారు. ఈ ప్రక్రియలోనే ‘మ్యాక్రోఫేజెస్’ కీలక భూమిక పోషిస్తాయి. ఈ ప్రక్రియ ‘వీఈజీఎఫ్–సీ’ ప్రోటీన్తో ఎలా జరుగుతుందనే అంశాన్ని ల్యాబ్లో ఎలుకల సహాయంతో మేము కనుగొన్నాం’’ అంటున్నారు ఎడ్వర్డ్ థోర్ప్. ఈ అంశాల ఆధారంగా గుండెకు మేలు జరిగేదెలాగంటే...? ఇప్పటివరకు జరిగిన పరిశోధన ఆధారంగా... ఈ మ్యాక్రోఫేజెస్నూ, ‘వీఈజీఎఫ్–సీ’ ప్రోటీన్నూ ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. వాటి సహాయంతో హార్ట్ ఎటాక్లో దెబ్బతిన్న గుండె కండరాల రిపేరు వేగంగా జరిగేలా చేయాలన్నది ఇప్పుడు పరిశోధకుల ముందున్న లక్ష్యం. అంతేకాదు... గుండెపోటు వచ్చినప్పుడు అక్కడ జరిగే జీవక్రియల (బయొలాజికల్) తీనుతెన్నులేమిటో తెలుసుకుని, దానికి విరుగుడుగా ‘ఎఫరోసైటోసిస్’ ద్వారా గుండెకండరాన్ని వేగంగా కోలుకునేలా చేయాలని కూడా పరిశోధకులు సంకల్పిస్తున్నారు. చదవండి👉🏾Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి! చదవండి👉🏾Health Tips: రాత్రిపూట అన్నం తినొచ్చా? తినకూడదా? ఒకవేళ తింటే ఏమవుతుంది? -
ఇన్నోసెంట్ హార్ట్ మర్మర్.. చిన్నారుల గుండె గుసగుస..!
గుండెల్లో గుసగుసలు అన్న మాట ఇక్కడ కవిత్వమో, భావుకతో కాదు. ఇది పక్కా వాస్తవం. కొందరు చిన్నపిల్లల్లో ఇది చాలా సాధారణం. దీన్నే ఇన్నోసెంట్ హార్ట్ మర్మరింగ్ అంటుంటారు డాక్టర్లు. ఈ గుసగుసలు ఎందుకో, అప్పుడేం చేయాలో తెలిపే కథనం ఇది. నెలల పిల్లలు మొదలుకొని... ఏడాదీ లేదా రెండుమూడేళ్ల పిల్లలను డాక్టర్లు స్టెతస్కోప్తో పరీక్షించినప్పుడు కొంతమంది చిన్నారుల్లో గుసగుస శబ్దం (మర్మర్) వినపడుతుంది. అలా వినగానే ‘ఇదేమిటి?... ఇదేదో తేడాగా ఉందే!’ అనిపిస్తుంది. కానీ అలా వినిపించినప్పటికీ దాదాపు చాలా కేసుల్లో తేడా ఏమీ ఉండదు. ఇది చాలావరకు నిరపాయకరమైన కండిషన్. అందుకే దీన్ని ఫంక్షనల్, బినైన్, ఫ్లో మర్మర్ లేదా స్టిల్ మర్మర్ అంటుంటారు. మర్మర్ మర్మమేమిటి? మర్మర్ మర్మమేమిటని పరిశీలిస్తే... ఇదేమైనా గుండె ఆకృతి (స్ట్రక్చరల్) లేదా నిర్మాణపరమైన (అనటామికల్) కారణాలతో ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. అంతా నార్మల్ అయితే ఈ శబ్దం ఎక్కడిది అనే అనుమానం వస్తుంది. అయితే ఈ శబ్దమంతా రక్తప్రవాహానిది. గుండెలోకి రక్తం వస్తున్నప్పుడు కలిగే ప్రవాహపు ఆటంకాలు (ఫ్లో డిస్ట్రబెన్స్)గానీ లేదా రక్తం అక్కడ సుడులు తిరగడం (ఫ్లో టర్బ్యులెన్సెస్), ఆ శబ్దం ప్రకంపనలు (రెసొనెన్సెస్) వల్ల ఇలా జరగవచ్చు. ఒక్కోసారి ఏ సమస్యా లేకపోయినా శబ్దం వినిపించవచ్చు. అందుకే చాలా సందర్భాల్లో ఇది ఏమాత్రం అపాయం కలిగించని సమస్యగా డాక్టర్లు చెబుతుంటారు. ఇది ఎంతమంది పిల్లల్లో? ఎవరిలో? పుట్టిన పిల్లల్లో కనీసం సగం మందికి... అంటే 50 శాతం మంది పిల్లల్లో ఈ హార్ట్ మర్మర్ ఉంటుంది. పుట్టిన పిల్లలు మొదలుకొని... చిన్నారుల్లో ఏదో ఒక దశలో ఇది కనిపించవచ్చు. ఇక ఏ చిన్నారిలోనైనా ఇది రావచ్చు. అయితే జ్వరంతో బాధపడే పిల్లల్లోనూ లేదా గుండె వేగంగా కొట్టుకునేవారిలోగానీ లేదా ఉద్వేగాలకు గురైనప్పుడు గుండె వేగం పెరిగే పిల్లల్లో సాధాణంగా ఈ కండిషన్ కనిపిస్తుంది. పెరిగాక ఈ కండిషన్ తగ్గిపోయినప్పటికీ... కొందరిలో వారు వ్యాయామం చేస్తున్నప్పుడు, బాగా ఉద్వేగానికి గురైనప్పుడు శబ్దం మళ్లీ వినపడవచ్చు. లక్షణాలేమిటి? సాధారణంగా కనిపించే గుండె స్పందనలు కాకుండా... కాస్తంత రక్తప్రవాహపు శబ్దాలు వినిపించడం తప్ప మరే రకమైన ఇతర లక్షణాలూ వీళ్లలో ఉండవు. ఒకవేళ వాళ్లలో ఇంకా ఏవైనా లక్షణాలు కనిపిస్తే అవి మాత్రం గుండెకు ఆపాదించకూడదు. పరీక్షలు ఏవైనా అవసరమా? స్టెతస్కోప్తో విన్నప్పుడు నిపుణులైన డాక్టర్లకు గుండె శబ్దం, లయను బట్టి అది సాధారణమా లేక ఏదైనా సమస్య (అబ్నార్మాలిటీ) ఉందా అన్నది తెలిసిపోతుంది. ఒకవేళ ఇంకా ఏదైనా అనుమానం ఉంటే అప్పుడు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ల ఆధ్వర్యంలో కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. పిల్లల ఆరోగ్య చరిత్రను బట్టి ఆ పరీక్షలేమిటన్నది నిర్ణయిస్తారు. సాధారణంగా ఈసీజీ, అటు తర్వాత ఎకోకార్డియోగ్రామ్తో అది సాధారణమా, అసాధారణమా అన్నది తెలిసిపోతుంది. ఒక్కోసారి గుండె, ఊపిరితిత్తుల పరిస్థితి తెలుసుకోడానికి ఓ సాధారణ ఎక్స్–రే సరిపోతుంది. చికిత్స ఏదైనా ఉందా? చాలా సందర్భాల్లో ఎలాంటి చికిత్సా అవసరం ఉండదు. ఈ చిన్నారులు, పెద్దపిల్లలుగా ఎదిగే సమయానికి ‘గుండె గుసగుసలు’ వాటంతట అవే తగ్గిపోవచ్చు. చిన్నతనంలో ఇలా హార్ట్ మర్మర్ ఉన్న పిల్లలు ఎదిగాక... వారు పూర్తిగా నార్మల్ వ్యక్తుల్లాగే పెరుగుతారు. అంతే ఆరోగ్యంగా ఉంటారు. మరేదైనా కారణాలతో వారికి గుండె సమస్యలు రావచ్చేమోగానీ... భవిష్యత్తులో వారికి వచ్చే గుండె సమస్యలకు ఇది మాత్రం కారణం కాబోదు. అందుకే హార్ట్ మర్మర్ అంటూ రిపోర్ట్ వచ్చే పిల్లల తల్లిదండ్రులు ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్నారు చిన్నపిల్లల వైద్యులూ... చిన్నారుల గుండెనిపుణులు. -
ఎలాంటి వ్యాయామాలు గుండెకు మేలు ??
-
చారిత్రక ఘట్టం.. పంది గుండె మనిషికి!
Pig Heart Transplantation To Human: వైద్య శాస్త్రంలో మరో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. మనిషికి పంది గుండెను విజయవంతంగా అమర్చారు అమెరికన్ వైద్యులు. తద్వారా అవయవాల కొరత, అవి దొరక్క చనిపోతున్న వేల మందికి ప్రాణదానం చేసే అవకాశం లభించినట్లయ్యింది. శుక్రవారం బాల్టిమోర్ ‘మేరీలాండ్ మెడికల్ స్కూల్ ఆస్పత్రిలో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. పంది నుంచి తీసిన గుండెను మనిషికి అమర్చారు. ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు వైద్యులు. జన్యుపరంగా మార్పు చేయబడిన పంది గుండెను అమర్చడం ద్వారా పేషెంట్కు ప్రాణదానం చేసినట్లయ్యింది. 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి ఈ సర్జరీ జరిగింది. సంప్రదాయ మార్పిడికి పేషెంట్ పరిస్థితి అనుకూలించని తరుణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు వైద్యులు. ఇందుకోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం డేవిడ్ కోలుకుంటున్నాడని, ఇంకొన్నాళ్లు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్తున్నారు. పేషెంట్ గనుక పూర్తిగా కొలుకుంటే గనుక అద్భుతమే అవుతుంది. వైద్య శాస్త్రంలో ఇదొక చారిత్రక ఘట్టమని చెబుతున్నారు వైద్యులు. తద్వారా భవిష్యత్తులో ఆర్గాన్ డొనేషన్స్ కొరతను పరిష్కరించడానికి ఒక మార్గం దొరికినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే బ్రెయిన్ డెడ్ అయి కృత్రిమ లైఫ్ సపోర్ట్పై కోలుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చిన సంగతి తెలిసిందే. కిందటి ఏడాది అక్టోబర్లో న్యూయార్క్ యూనివర్సిటీ లాన్గోన్ హెల్త్ మెడికల్ సెంటర్లో వైద్యులు ఈ ఆపరేషన్ చేయగా.. పేషెంట్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. వేలల్లో మరణాలు అమెరికాలో ప్రతీ ఏడాది సగటున ఆరు వేల మందికి పైగా పేషెంట్లు.. గుండె మార్పిడికి ముందే చనిపోతున్నారు. అవయవాల కొరతే అందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం అమెరికాలో లక్షా పదివేల మందికి పైగా గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. 1984లో బబూన్(కోతి జాతికి చెందినది) గుండెను ఓ నవజాత శిశువుకు అమర్చగా.. సర్జరీ విజయవంతం అయినప్పటికీ ఆ పసికందు మాత్రం 20 రోజులే జీవించగలిగింది. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. ఇక పంది శరీరాకృతి, ఎదుగుదల, పైగా మాంసం తింటారు కాబట్టి ఆధారంగా.. అవయవాలు తీసుకోవడానికి ఉత్తమమైందని అమెరికన్ డాక్టర్లు భావిస్తున్నారు. సంబంధిత వార్త: పేషెంట్కు పంది కిడ్నీ అమర్చారు -
ఎక్మో ఎలాంటి సందర్భాల్లో వాడతారో తెలుసా?
ఇటీవల ఎక్మో అనే మాట చాలా సందర్భాల్లో వినిపించింది. తాజాగా ప్రముఖ సినీకవి సిరివెన్నెల సీతారామశాస్త్రికి అమర్చిన ఈ వైద్య పరికరాన్ని గతంలో ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం, అంతకు మునుపు తమిళనాడు మాజీ సీఎం జయలలిత.. లాంటి చాలామంది ప్రముఖులకు వాడారు. అలా ఇటీవల చాలా సందర్భాల్లో ఎక్మో అనే మాట వినిపించింది. అసలీ ఎక్మో అంటే ఏమిటో, దాన్ని ఎలాంటి సందర్భాల్లో వాడతారనే విషయాలపై అవగాహన కోసం ఈ సంక్షిప్త కథనం. ఈసీఎంఓ అనే ఇంగ్లిష్ పొడి అక్షరాలు ‘ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేనస్ ఆక్సిజనేషన్’ అనే పదాల ముందక్షరాలు. వీటన్నింటినీ కలిపి ‘ఎక్మో’ అంటారు. పేరునుబట్టే ఇది గాల్లోని ఆక్సిజన్ సమర్థంగా అందిస్తుందని తెలుస్తుంది. ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సపోర్ట్ అని కూడా చెప్పే ఈ ఉపకరణాన్ని... ఊపిరితిత్తులు తమంతట తామే శుభ్రమైన ఆక్సిజన్ తో కూడిన (ఆక్సీజనేటెడ్) రక్తాన్ని అందించలేనప్పుడు వాడుతారు. ఎలా పని చేస్తుంది? ఎక్మో రెండు రకాలు. ఒకటి ఏ–వీ ఎక్మో, మరొకటి...వి–వి ఎక్మో.. ఇందులో వీ–వీ (వీనో–వీనస్) ఎక్మోను ఊపిరితిత్తుల పనితీరు బాగాలేనప్పుడు వాడతారు. అలాగే వీ–ఏ (వీనో – ఆర్టరీ) ఎక్మోను గుండె పనితీరు బాగాలేనప్పుడు (కార్డియో పల్మునరీ సపోర్ట్గా)వాడుతారు. ఎక్మో పరికరంలో ఆక్సిజనేటర్ గ్యాస్ ఎక్స్ఛేంజ్ పరికరం, అలాగే పంప్ అనేవి ముఖ్యమైన భాగాలు. మొదటగా ఒక పైప్ (డ్రైనేజ్ కాన్యులా) ద్వారా తొడలోని సిర నుంచి రక్తాన్ని తీసుకుని, అందులోంచి కార్బన్ డైయాక్సైడ్ను తొలగిస్తారు. తర్వాత ఆక్సిజన్ను రక్తంలోకి ఇంకేలా చేస్తారు. ఇలా చేశాక... ఆ శుద్ధి అయిన రక్తాన్ని మళ్లీ గుండెకు దగ్గర్లో ఉన్న సిరలోకి (వి–వి ఎక్మో) లేదా ధమనికి (వి–ఏ ఎక్మో) రిటర్న్ కాన్యులా ద్వారా పంపిస్తారు. అంతేకాదు... దానికి అమర్చి ఉన్న మానిటర్ మీద నాడి కొట్టుకునే స్పందనలూ, రక్తం ఎంత వేగంతో ప్రవహిస్తోందనే అంశాలు ఎప్పటికప్పుడు నమోదవుతూ ఉంటాయి. ఇదీ సంక్షిప్తంగా ఎక్మో పనిచేసే తీరు. నిజానికి ఇది గుండె చేసే పని కంటే ఊపిరితిత్తులు చేసే పనిని సమర్థంగా నిర్వహిస్తుంటుందని చెప్పవచ్చు. ఎప్పుడూ రోగగ్రస్థమైన వారికేనా? పైన పేర్కొన్న సెలబ్రిటీ ఉదాహరణలతో ఊపిరితిత్తులు బాగా చెడిపోయి, ఆక్సిజన్ అందని స్థితికి చేరిన బాధితులకే అమర్చుతారా అనే సందేహం వస్తుంది. కానీ కేవలం అలాంటి సందర్భాల్లోనే కాదు... గుండె మార్పిడి / ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స వంటివి జరిగినప్పుడు కూడా దీన్ని అమరుస్తారు. ఉదాహరణకు గుండె / ఊపిరితిత్తులు ఏమాత్రం పనిచేయని వారిలో బయటి దాతల నుంచి గుండె / ఊపిరితిత్తులను సేకరించి, అమర్చినప్పుడు ఒక్కోసారి వాటిని దేహం ఆమోదించదు. అలాంటి సమయాల్లో... బయటి గుండె/ఊపిరితిత్తులు దేహానికి అలవాటయ్యేవరకూ ‘ఎక్మో’ సహాయం తీసుకుంటారు. ‘ఎక్మో’తో సపోర్ట్ మొదలుపెట్టాక రోగి కోలుకుంటున్న తీరు నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి దీన్ని చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉండాలి. రోగి స్పందన తెలియడానికి కనీసం ఐదు నుంచి ఏడు రోజులైనా వేచిచూడాల్సి ఉంటుంది. అలా చూస్తూ... ‘ఎక్మో’ సపోర్ట్ను నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తూ పోతారు. ఈ సమయంల్లో అతడి ‘వైటల్స్’... అంటే పేషెంట్ పరిస్థితిని తెలిపే కీలకమైన కొలతలైన... పల్స్, బీపీ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. ఎక్మో సపోర్టు తగ్గించినప్పుడల్లా పల్స్ రేటూ, బీపీ, ఆక్సిజన్, కార్మబ్ డైఆక్సైడ్ శాతం... నార్మల్గా ఉన్నాయా అని చూస్తారు. అవి నార్మల్గా ఉన్నాయంటే రోగి కోలుకుంటున్నట్లు అర్థం. అలా క్రమక్రమంగా ఎక్మో సపోర్ట్ను తగ్గిస్తూ గుండె, ఊపిరితిత్తుల పనితీరు పూర్తిగా నార్మల్ అయ్యే వరకు రోగి కోలుకుంటున్న క్రమాన్ని చూస్తూ... ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎవరెవరిలో... ఎక్మో అమర్చాల్సిన పరిస్థితి సాధారణంగా గుండె ఆగినప్పుడు సీపీఆర్ ద్వారా స్పందనలు తిరిగి వచ్చి పంపు చేసే కేపాసిటి తక్కువ ఉన్నప్పుడు ఎక్మో ద్వారా రక్త ప్రసరణ జరిగి అన్ని అవయవాలు గుండె తిరిగి సాధారణ స్థితిలో పని చేయడానికి దోహదపడుతుంది. ఎక్మోతో పాటు బాధితుడికి డయాలసిస్ కూడా చేయాల్సినప్పుడు పేషెంట్ నుంచి రక్తాన్ని డయాలసిస్ యంత్రంలోకి నేరుగా వెళ్లేలా కాకుండా... ఎక్మో పరికరం ద్వారా డయాలసిస్ యంత్రానికి రక్తాన్ని సరఫరా అయ్యేలా చూస్తారు. గుండె ఆగిపోయిన సందర్భాల్లో దాని స్పందనలను పునరుద్ధరించడానికి బాధితుడి ఛాతీ మీద రెండు చేతులతోనూ నొక్కుతున్నట్లు చేసే సీపీఆర్ (కార్డియో పల్మునరీ రిససియేషన్) చేస్తూ, రక్తప్రసరణ జరుగుతున్నట్లు గుర్తించగానే వెంటనే ఎక్మో అమరుస్తారు. సాధారణంగా గుండె ఆగిపోగానే సీపీఆర్ ఇచ్చి, ఎక్మో ద్వారా రక్తప్రసరణ నార్మల్గా జరుగుతుంటే దేహంలో అన్ని అవయవాలూ సజావుగా పనిచేస్తున్నట్లే అనుకోవచ్చు. అప్పుడు క్రమక్రమంగా ఎక్మో సపోర్ట్ను తగ్గించుకుంటూ పోతారు. ఇలా చేసే సమయంలో ఎక్మో సపోర్ట్ను తగ్గిస్తున్నా... రోగిలోని వ్యవస్థలు తమంతట తాము స్వయంగా తమ విధులను నిర్వహించుకోలేని సందర్భాల్లో మాత్రమే రోగి కోలుకోవడం లేదనే నిర్ధారణకు డాక్టర్లు వస్తారు. చివరగా... ఎక్మో అమర్చడం ఓ చివరి ప్రయత్నంగా చేసే పని. దానిపై కొన్ని అపోహలున్నప్పటికీ... కొన్ని సందర్భాల్లో రోగులు పూర్తిగా కోలుకుని, వారు పూర్తిగా మళ్లీ తమ పూర్వస్థితికి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. సక్కెస్ రేటు తక్కువా? సెలబ్రిటీల ఉదాహరణలతో గానీ లేదా గుండె, ఊపిరితిత్తులు పనిచేయనప్పుడు అమర్చుతారనే సందర్భాల వల్లగానీ ‘ఎక్మో’ పరికరంపై కొన్ని అపోహలు నెలకొని ఉన్నాయి. అందులో మొదటిది... దీన్ని అమర్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే బాధితులు కోలుకునే అవకాశాలు తక్కువనీ లేదా ‘ఎక్మో’కు సక్సెస్ రేటు తక్కువనే అపప్రధ ప్రజల్లో ఉంది. దీనికి కారణం... ఓ పేషెంట్కు ఎక్మో అమర్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది చాలా తీవ్రంగా రోగగ్రస్థమైన స్థితి. అంతటి పరిస్థితుల్లో కోలుకునే అవకాశాలు వాస్తవంగా కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ... చాలా సందర్భాల్లో గుండెకు సంబంధించిన బాధితుల్లో 40 – 50 శాతం, ఊపిరతిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారిలో 60 – 70 శాతం సక్కెస్ రేటు ఉంటాయి. అంతగా రోగసిక్తమైనప్పటికీ 70 శాతం అంటే నిజానికి మంచి విజయావకాశాలు ఉన్నట్లే లెక్క. కానీ రోగి వయసు, అతడికి ఇంతకుముందే ఉన్న అనేక ఆరోగ్య సమస్యలు, ఇతర అనారోగ్యాలూ, రోగనిరోధక శక్తి, కోలుకునే సామర్థ్యం... లాంటి అనేక అంశాలు ఈ విజయావకాశాల (సక్సెస్ రేటు)ను ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ అపోహ. డాక్టర్ శ్రీనివాస కుమార్ రావిపాటి సీనియర్ కన్సల్టెంట్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ -
AP Special: పాములలో గుండె కదులుతూ ఉంటుందా..!?
ఆత్మకూరురూరల్:పాము కనిపిస్తే చాలు మన గుండె వేగం పెరగడం ,రక్తం వడవడిగా పరుగులెత్తడం సాధారణమే. మన గుండె ఒకే చోట ఉంటుంది. పాము విషయానికి వస్తే అలా కాదు. పాము గుండె పరిస్థితులను బట్టి తన శరీరంలో గుండెను మార్చుకుంటూ ఉంటుంది. వేగంగా కదిలే పాము చెట్లను ఎక్కుతున్న పుడు,తన పరిమాణానికి మించిన ఆహార జంతువును మింగుతున్నపుడు గుండె ఒకే చోట ఉంటే అది ఒత్తిడికి గురి అవుతుంది? అలాంటి సందర్భంలో పాము ఎలా అధిగమిస్తుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లోని బైర్లూటిలో పాములపై జరిగిన ఒక వర్క్షాప్లో పాల్గొన్న ఎన్ఎస్టిఆర్(నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్)వన్యప్రపాణుల వైద్యు నిపుణుడు డాక్టర్ ఆచార్య పాముల గురించి కొన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించారు. డాక్టర్ ఆచార్య మేరకు పాములలో గుండె స్థిరంగా ఒక చోట ఉండదు. సాధారణంగా పాములను మూడు భాగాలుగా విభజిస్తే తల ఉన్న ప్రాంతంలో మెదడు, నాలుక,కోరలు, విషగ్రంధులు ఉంటాయి. మధ్యభాగంలో గుండె, చిన్న ప్రేగులు, తోక ప్రాంతంలో పెద్దప్రేగులు ఉంటాయి. అయితే పాములు తమ పరిమాణానికి మించిన జంతువులను మింగుతుంటాయి. ఉదాహరణకు కొండ చిలువలు మేకలను జింకలను మింగుతాయి. అలాగే నాగుపాములు పెద్ద ఎలుకలను మింగుతుంటాయి. పాములకు దంతాలు లేనందున ఆహారాన్ని నమిలి తినలేవు. యథాతధంగా ఫలానా జంతువును మింగినప్పుడు అనివార్యంగా పాము శరీరాన్ని రబ్బరులా సాగతీస్తుంది. ఈ సమయంలో పాము అంతర్భాగమంతా తాను మింగిన జంతువుతో నిండి పోతుంది. అపుడు గుండె ఒక చోట స్థిరంగా ఉంటే అది ఆహార జంతువు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ సమయంలో పాము గుండె దాని తోక వైపు పయనిస్తుంది. ఆహారపు జంతువు జీర్ణమవగానే తిరిగి యథాస్థానానికి చేరుకుంటుంది. అలాగే పాములు వేగంగా చెట్లను ఎగబాకేటపుడు పూర్తిగా ఏటవాలుగా అవ్వడంతో అవసరమైన రక్తాన్ని పాము మెదడుకు పంప్ చేయడానికి గుండెకు కష్టమవుతుంది. ఈ స్థితిలో కూడా పాము గుండె పాము తలబాగానికి ప్రయాణం చేసి పాము మెదడుకు సులువుగా రక్తాన్ని పంప్ చేయగలుగుతుంది. చదవండి: అంతరిక్షంలోనూ అమోఘం -
మిస్ వరల్డ్ అమెరికాగా తొలిసారి భారత సంతతి అమెరికన్
న్యూయార్క్: మిస్ వరల్డ్ అమెరికా 2021ని గెలుచుకున్న తొలి భారత సంతతి అమెరికన్గా శ్రీ సైనీ నిలిచింది. వాషింగ్టన్కి చెందిన శ్రీసైని ప్రపంచ స్థాయిలోనిర్వహించిన ఈ పోటీలో అమెరికాకు ప్రాతినిథ్యం వహించిన తొలి భారత సంతతి అమెరికన్ కావడం విశేషం. అయితే ఆమెకు 12 ఏళ్ల వయసులో జరిగిన కారు ప్రమాదంలో ఎడమవైపు భాగం ముఖంతో సహా అంతా కాలిపోయింది. పైగా ఆమె జీవితాంత పేస్మేకర్ (కృత్రిమ గుండె) సాయంతోనే బతకాలి అయినప్పటికీ వీటిన్నంటిని అధిగమించి మరీ మిస్ వరల్డ్ అమెరికా కిరీటాన్ని గెలుచుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. (చదవండి: తక్షణమే చర్యలు తీసుకుంటాం!) ఈ మేరకు లాస్ ఏంజెల్స్లోని మిస్ వరల్డ్ అమెరికా ప్రధాన కార్యాలయంలో డయానా హెడెన్ శ్రీ సైనికి ఈ కిరీటాన్ని బహుకరించింది. ఈ సందర్భంగా శ్రీ సైని మాట్లాడుతూ......." నేను గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నాభావాలను మాటల్లో చెప్పలేను. ఈ క్రెడిట్ అంతా మా అమ్మనాన్నలకే దక్కుతుంది. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కినందుకు మిస్ వరల్డ్ అమెరికాకు ధన్యావాదులు" అంటూ తన సంతోషాన్ని వ్యక్త చేసింది. శ్రీ ఫోర్డ్స్ సిటీ ఆఫ్ న్యూజెర్సీలో జరిగిన పోటీలో శ్రీ 'మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2018' కిరీటాన్ని కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిస్ వరల్డ్ అమెరికా ఇన్స్టాగ్రామ్లో "మిస్ వరల్డ్ అమెరికా వాషింగ్టన్ అయిన శ్రీ 'ఎండబ్ల్యూఏ నేషనల్ బ్యూటీ అంబాసిడర్' అనే ప్రతిష్టాత్మక స్థానంలోఉంది, ఆమె నిరంతరం చేసిన సేవా కార్యక్రమాల కారణంగా ఈ ప్రతిష్టాత్మక కిరీటాన్ని గెలుచుకుంది. అంతేకాదు డాక్టర్లు అందుబాటులోలేని ప్రాంతాల్లో ఆమె కనబర్చిన సేవ దృక్పథాన్ని యూనిసెఫ్, సుసాన జి కొమెన్(యూఎస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్) వంటి ఇతర సంస్థలు గుర్తించాయి. అందం గురించి మంచి నిర్వచనాన్ని ఇవ్వడమే కాక, మిస్ వరల్డ్ అమెరికా మిషన్ పట్ల అవగాహన కలిగిస్తుంది" అని ప్రశంసించింది. View this post on Instagram A post shared by Shree Saini👑Miss World America (@shreesaini) (చదవండి: పుట్టుకతోనే చేతుల్లేవు.. కానీ చాలానే సాధించింది!) -
ఆ వయసులోపు వారిలో కూడా పెరుగుతున్న గుండెపోటు..
మారుతున్న జీవనశైలి, స్తబ్దమైన యాంత్రిక జీవనం, పెరుగుతున్న మానసిక ఒత్తిడి, సమయ పాల నలేని ఆహారం, రక్తపోటు, షుగర్ వ్యాధితో పాటు శరీర బరువుపై అదుపుకోల్పోవడం, వైద్య పరీక్షలకు నిర్లక్ష్యం చేయడం వల్ల గుండె సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది. దీంతో పాటు మధుమేహం అధిక ముప్పుగా మారింది. అధిక రక్తపోటు, ఊబకాయ సమస్యలూ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రెండేళ్లుగా సహజంగా గుండెపోటు మరణాలు పెరిగాయి. దీనికితోడు కరోనా మహమ్మారి వల్ల రెట్టింపు అయ్యాయి. ప్రమాదవశాత్తు కాకుండా వయసుతో సంబంధం లేకుండా చోటుచేసుకునే మరణాల్లో ఎక్కువగా గుండె పోటుతోనే అనేది చేదునిజం. బుధవారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. జిల్లాలో 35శాతం బాధితులు ఉమ్మడి జిల్లాలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు 35శాతం ఉన్నట్లు అంచనా. వీరిలో మగవారు 22శాతం, మహిళలు 13 శాతం ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 40శాతం, పట్టణాల్లో వీరి 56శాతం ఉంటుందని వైద్యాధికారుల తేల్చారు. ఆకస్మిక సమస్య ఎదురైన వారిలో 10శాతం మాత్రమే చికిత్స తీసుకుని కోలుకుంటున్నారు. 20ఏళ్ల లోపు వారికి.. గుండె పోటు చాలా తక్కువగా 50 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే వచ్చేది. కానీ ప్రస్తుతం 20ఏళ్ల వయసు యువకుల దగ్గర నుంచి 70ఏళ్ల వరకు వస్తుంది. ప్రధాన కారణంగా అధిక ఒత్తిడి, ధూమపానం, మద్యం, చిన్న వయస్సులో షుగర్ రావడం, బీపీ, ఫాస్ట్ఫుడ్, లావు పెరగడం, చెడు కొలాస్ట్రాల్ వల్ల దారితీస్తున్నాయి. ఆస్పత్రికి వచ్చే 100రోగులలో 70శాతం మంది గుండె సంబంధిత రోగాలతో బాధపడుతున్నారు. 50 నుంచి 60శాతం పెరిగాయి జిల్లాలో కోవిడ్ వల్ల 50నుంచి 60శాతం మందికి గుండె సంబంధిత సమస్యలు పెరిగాయి. కరోనా సోకిన 7నుంచి 10రోజుల మధ్య కాలంలో ఈ సమస్య బాగా వేధిస్తుంది. గతంలో అధిక కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, మద్యం, సిగరెట్ వల్ల సమస్య ఉండేది. అధిక ఆయాసం, గుండె నొప్పి ఉంటే వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గర సరైన చికిత్స తీసుకోవాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. – మహేష్ బాబు, కార్డియాలజిస్ట్, మహబూబ్నగర్ వ్యాయామం లేకపోవడం వల్లే.. చిన్నారులు నిత్యం టీవీ ఎదుట కూర్చొని చిరుతిండి తినడంతో పాటు ఎలాంటి వ్యాయామం లేకుండా ఉండటం వల్ల అధికంగా ఊబకాయం పెరిగి చిన్న వయస్సులో గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఉద్యోగులు పనులు పూర్తి చేసుకొని ఎలాంటి వ్యాయామం లేకుండా నిద్రపోవడం. తెలియకుండానే కొవ్వు పెరిగి రక్తంలో బ్లాక్స్ ఏర్పాటు అవుతాయి. దీంతో గుండె, మెదడు స్ట్రోక్ వస్తోంది. రోజు 45నిమిషాల పాటు వ్యాయామం చేసి, మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోకుంటే మంచిది. మాంసం వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. – బాలశ్రీనివాస్, జనరల్ ఫిజీషియన్, మహబూబ్నగర్ చదవండి: Skin Care: ముడతలు, మచ్చలు, మృతకణాల నివారణకు అరటి తొక్క ఫేస్ మాస్క్.. -
World Heart Day: గుండెను గడ్డ కట్టించి, నిల్వచేశారు!
World Heart Day: గుండె మార్పిడి అంటేనే, కఠినమైన, క్లిష్టమైన ప్రక్రియ. దాత శరీరం నుంచి గుండెను వేరు చేసిన తరువాత నిర్దిష్ట సమయంలోగా దాన్ని దాతకు అమర్చాల్సి ఉంటుంది. గుండెను ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోవడమే దీనికి కారణం. ఫ్రిడ్జ్లో పెడితే కణజాలం పై మంచు స్ఫటికాలేర్పడి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుండెతోపాటు ఇతర అవయవాలను కూడా కొంచెం ఎక్కువకాలం నిల్వచేసే పద్ధతులపై ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిల్లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్త బోరిస్ రుబిన్ స్కీ విజయం సాధించారు. గుండె కణజాలాన్ని అతిశీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరచడమే కాకుండా, ఆ తరువాత అది మళ్లీ కొట్టుకునేలా కూడా చేయగలిగారు ఈయన. చదవండి: చనిపోయినా.. మరో ఎనిమిది మందిని బతికించొచ్చు! ఎప్పుడో 16 ఏళ్ల క్రితం రుబిన్స్కీ ‘‘ఐసోకోరిక్ సూపర్ కూలింగ్’’పేరుతో అభివృద్ధి చేసిన ఓ టెక్నిక్కు మరింత పదును పెట్టి అవయవ కణజాలంపై మంచు స్ఫటికాలు ఏర్పడకుండానే నిల్వ చేయగలిగారు. ఒక ద్రవంలో అవయవాన్ని లేదా భద్రపరచాల్సిన పదార్థాన్ని ఉంచి అందులోకి గాలి చొరబడకుండా చేయడం దీంట్లోని ప్రత్యేకత. మూలకణాల సాయంతో అభివృద్ధి చేసిన గుండె కణజాలాన్ని తాము ఈ పద్ధతి ద్వారా –3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయగలిగామని, ఒకరోజు నుంచి మూడు రోజులపాటు దీన్ని నిల్వ చేసి చూడగా ప్రతిసారి అది మళ్లీ కొట్టుకుందని రూబిన్స్కీ తెలిపారు. చదవండి: భరించలేని నెలసరి సమస్యలా? ఈ 10 చిట్కాలు ట్రై చేయండి.. -
ఒక్క పెగ్గే కదా అంటూ తాగేస్తున్నారా... అది కూడా ప్రాణాంతకమే!
Single Glass Of Alcohol Also Affects Atrial Fibrillation: ఒక్క పెగ్గు మద్యంతో నష్టం లేదు.. పైగా ఆరోగ్యానికి మంచిది అని చాలామంది భావిస్తుంటారు. అయితే ఒక్క స్మాల్ వేసుకున్నా సరే.. అది గుండెకు చేటే అంటోందీ తాజా పరిశోధన! ఆరోగ్యంపై మద్యం ప్రభావంపై చర్చ ఈ రోజు తాజాది కాదు. కాకపోతే చాలాకాలంగా అందరూ బలంగా విశ్వసించిన విషయం ఏమిటంటే.. ‘ఏదో.. అప్పుడప్పుడూ సరదా కొద్దీ... విందు భోజనం తరువాత కొంచెం ‘పుచ్చుకుంటే’ తప్పేమీ కాదు’ అన్నది! కానీ... కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన ఒక పరిశోధన మాత్రం అవన్నీ హంబగ్ అని తేల్చేసింది. వీరి లెక్క ప్రకారం.. ఒక్క డ్రింక్ తీసుకున్నా గుండె కొట్టుకోవడంలో తేడాలొచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుంది. గుండె కొట్టుకునే తీరులో హెచ్చుతగ్గులు ఉంటే దాన్ని ఆట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. కొన్ని సందర్భాల్లో ఈ ఆట్రియల్ ఫిబ్రిలేషన్ ప్రాణాంతకమూ అయ్యే అవకాశం ఉంది. ‘‘ఈ సమస్య తాగుబోతుల్లో ఎక్కువని ఒక అంచనా ఉండేది. కానీ ఒక డ్రింకు పుచ్చుకున్నా ప్రమాదం ఎక్కువయ్యే అవకాశం ఉంది’’ అని తాజా పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవ్తేత గ్రెగరీ మార్కస్ చెబుతున్నారు. తాము వంద మంది రోగులపై పరిశోధన చేశామని, ఒక డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వారికి ఆట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చే అవకాశం రెట్టింపు అయ్యిందని చెప్పారు. వీరు రెండో డ్రింక్ కూడా తీసుకుంటే ప్రమాదం మూడు రెట్లు పెరిగిందని అన్నారు. అయితే తాము పరిశోధనలు చేసిన వారు ముందుగానే ఈ సమస్యతో బాధపడుతున్న వారు కాబట్టి సాధారణ వ్యక్తుల్లో ఒక్క డ్రింక్ కూడా ప్రమాద హేతువు కావచ్చునని చెప్పవచ్చునని వారు వివరించారు. శషభిషలకు తావు లేకుండా... ముందుగా చెప్పుకున్నట్లు ఆరోగ్యంపై మద్యం ప్రభావాన్ని కచ్చితంగా లెక్కకట్టడం అంత సులువైన పనేమీ కాదు. పరిశోధనలో పాల్గొన్న వారు తాము ఎంత మద్యం పుచ్చుకున్నదీ స్పష్టంగా తెలియజేయాల్సి ఉండటం దీనికి ఒక కారణం. అంతేకాకుండా.. వారి జీవితాల్లోని ఇతర అంశా లను కూడా పరిగణనలోకి తీసుకుని తుది అంచనా వేయాల్సి ఉంటుంది. కాలిఫోర్నియా వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ శషభిషలను, ఊహాగానాలను తొలగించేందుకు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని సేకరించారు. పరిశోధనల్లో పాల్గొన్న వారు తరచూ తమ రక్తాన్ని స్వయంగా పరీక్షించుకునే ఏర్పాట్లు చేశారు. మధుమేహ పరీక్ష తరహాలో రక్తంలో మద్యం మోతాదును లెక్కకట్టారు. ‘‘ఫలితాలు చెప్పే విషయం ఒక్కటే.. మద్యం ఎంత ఎక్కువైతే.. ప్రమాదమూ అంతేస్థాయిలో పెరుగుతోంది’’ అని మార్కస్ వివరించారు. ఈ పరిశోధన ఫలితాలు దశాబ్దాలుగా చాలామంది రోగులు చెప్పిన అంశాలకు దగ్గరగా ఉన్నాయని, కాకపోతే ఈసారి కచ్చితమైన లెక్కలతో తాము ఫలితాలను నిర్ధారించగలిగామని వివరించారు. తగినన్ని నీళ్లే ఆయుధం...! గుండెజబ్బులను నివారించేందుకు జీవనశైలి మార్పులు ఎంత అవసరమో.. తగినన్ని నీళ్లు తాగడం కూడా అంతే ముఖ్యం. యూరప్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు దీన్ని పరిశోధన పూర్వకంగా నిర్ధారించారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది రోజూ తగినన్ని నీళ్లు తాగడం లేదని, కనీసం ఒక్క గ్లాసు అదనంగా తాగినా గుండెసంబంధిత సమస్యలను అధిగమించవచ్చునని వీరు చెబుతున్నారు. ‘గుండె విఫలమయ్యేందుకు ఉన్న అవకాశాలను నివారించేందుకు లేదా ఆలస్యం చేసేందుకు నీళ్లు చాలా ఉపయోగపడతాయి’ అంటారు ఈ తాజా పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త నటాలియా దిమిత్రైవ. ప్రతిరోజూ పురుషులైతే మూడు లీటర్ల వరకూ నీరు తీసుకోవాలని, మహిళలైతే 1.6 నుంచి 2.1 లీటర్ల వరకూ ఉండాలని తెలిపారు. – సాక్షి, హైదరాబాద్ చదవండి: National Nutrition Week: ఆరోగ్యానికి 5 చిట్కాలు.. అన్నీ తెలిసినవే! -
పిక్కలు.. గుండెకు బ్రాంచ్ ఆఫీస్లు
పిక్కలు... గుండెకు బ్రాంచ్ఆఫీస్లా పనిచేస్తాయి. దేహం పై భాగంలో ఉండే గుండె మెయిన్ ఆఫీస్ అయితే... పిక్కలు కాళ్లలో ఉన్న క్యాంప్ ఆఫీసు అన్నమాట. గుండె అన్ని అవయవాలకూ రక్తాన్ని పంప్ చేసినట్టే... పిక్క కూడా పై వైపునకు రక్తం వేగంగా వెళ్లేందుకు దోహదపడుతుంది. పిక్క చేసే ఎక్స్ట్రా డ్యూటీ గురించి తెలిపే కథనం ఇది. గుండె పంపింగ్ ప్రక్రియ వల్ల దేహంలోని అన్ని భాగాలకూ రక్తం అందుతుంది. మెదడు ఇతర భాగాల నుంచి మళ్లీ గుండెకు రక్తం చేరడం ఒకింత సులువు. కానీ పాదాల నుంచి పైవైపునకు రక్తం అందడం భూమ్యాకర్షణ (గ్రావిటేషనల్) శక్తి కారణంగా ఒకింత కష్టం అవుతుంది. కానీ పైవైపునకు రక్తప్రవాహం సాఫీగా జరిగేందుకు పిక్క దోహదపడుతుంది. అందుకే దాన్ని ‘కాఫ్ మజిల్ పంప్’ అంటారు. దేహానికి రెండో గుండె అనీ, ‘పెరిఫెరల్ హార్ట్’ అని కూడా అంటారు. గుండెకు బ్రాంచ్ ఆఫీస్ డ్యూటీ ఇలా... పిక్కలోని అన్ని కండరాలూ కలిసి గుండె డ్యూటీలు నిర్వహించినప్పటికీ... గ్యాస్ట్రోనెమియస్, సోలెయస్ అనే ప్రధాన కండరాలు మరింతగా ఈ విధిని నిర్వహిస్తాయి. ఇవి ఓ క్రమపద్ధతిలో ముడుచుకుంటూ, విప్పారుతూ (రిలాక్స్ అవుతూ) ఓ క్రమబద్ధమైన రీతిలో రక్తనాళాల్లోని రక్తాన్ని పైకి నెడుతుంటాయి. భూమ్యాకర్షణ కారణంగా ఈ రక్తనాళల్లోని రక్తం కిందికి రాకుండా వాల్వ్ (కవాటాల) ఆపుతుంటాయి. ఇలా... గుండెకు చేరాల్సిన రక్తాన్ని కిందికి రాకుండా ఒకేవైపునకు ప్రవహించేలా చూస్తాయి. ‘పిక్క’ బలం లేకపోతే... పిక్క సరిగా పనిచేయకపోతే వైవైపునకు ప్రవహించాల్సిన రక్తం కాళ్లలో ఉండిపోతుంది. అందులో ప్రాణవాయువు లేకపోవడం వల్ల అక్కడి కండరాల్లోని కణాలకు తగినంత ఈక్సిజన్ అందదు. ఫలితంగా ఆ కండరాలు అలసటకు గురవుతాయి. దాంతో వచ్చే సమస్యల్లో కొన్ని... ► కాళ్ల చివరలకు రక్తసరఫరా తగ్గడం ∙ వ్యాధి నిరోధకత ఇచ్చే లింఫ్ నిర్వీర్యం కావడం ∙చెడు రక్తాన్ని తీసుకుపోయే సిరల సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఫలితంగా... ► కాళ్లు ఎప్పుడూ అలసినట్టుగా ఉండటం ►కాళ్లూ, పాదాలలో వాపు ►వేరికోస్ వెయిన్స్ సమస్య కనిపించడం (అంటే... కాళ్లలో చెడు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు (సిరలు) ఉబ్బినట్లుగా చర్మం బయట నుంచి కనిపిస్తుండటం). దాంతో కాలిపై పుండ్లు ఓ పట్టాన తగ్గవు. ►కాళ్ల సిరల్లో రక్తం గడ్డకట్టడం (డీప్ వీన్ థ్రాంబోసిస్) వంటి సమస్యలు రావచ్చు. నివారణ ఇలా... ► బరువును అదుపులో ఉంచుకోవాలి. ∙క్రమం తప్పకుండా నడవడం (రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు నడక వ్యాయామం అవసరం. దాంతో కేవలం పిక్కలకు మాత్రమే కాకుండా... అన్ని కండరాలకూ వ్యాయామం సమకూరి ఆరోగ్యం బాగుంటుంది). ∙కాళ్లపై రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటే... వాటిని అదిమి ఉంచే ‘వీనస్ స్టాకింగ్స్’ అనే సాక్స్ వంటి తొడుగులను డాక్టర్ సలహా మేరకు వాడాలి. ఒకవేళ అప్పటికీ ఫలితం కనిపించకపోతే తప్పనిసరిగా డాక్టర్ను సంప్రదించాలి. సమస్యలు ఎవరిలో... ► చాలా సేపు కదలకుండా అదేపనిగా కూర్చుని పనిచేసేవారికి ∙ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వృత్తుల్లో ఉండేవారికి (లెక్చరర్లు, టీచర్లు, ట్రాఫిక్పోలీసులు... మొదలైనవారికి) ∙స్థూలకాయంతో ఉన్నవారిలో ∙గర్భవతులుగా ఉన్న సమయంలో మహిళల్లో కొందరికి ఈ సమస్య రావచ్చు. -డాక్టర్ పీ సీ గుప్తా సీనియర్ వాస్క్యులార్ అండ్ ఎండోవాస్క్యులార్ సర్జన్ -
చనిపోయినా.. మరో ఎనిమిది మందిని బతికించొచ్చు!
World Organ Donation Day 2021: బతికున్నప్పుడే కాదు.. చనిపోతూ నలుగురికి ప్రాణం పోయడం మనిషికి దక్కిన ఏకైక వరం. ఆ లెక్కన అవయవదానం గొప్ప కార్యం. కానీ, సమాజంలో పూర్తి స్థాయిలో దీనిపై అవగాహన చాలామందికి కలగట్లేదు. అవయవాలు దానం చేయడం వల్ల దాత ఆరోగ్యం చెడిపోతుందనే అపోహ ఉంది. అదేవిధంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులకు సంబంధించి కూడా అవయవదానం చేసేందుకు వారి కుటుంబ సభ్యులు అంత సులువుగా అంగీకరించరు. అందుకే అందరిలో అవగాహన కల్పించేందుకే ప్రతీ ఏడు ఆగస్టు 13న ‘ప్రపంచ అవయవ దాన దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. తొలి అవయవదానం ప్రపంచంలో మొట్టమొదటి అవయవదానం.. 1954లో అమెరికాలోని బోస్టన్లోని పీటర్ బెంట్ బ్రీగమ్ ఆస్పత్రిలో జరిగింది. రోనాల్డ్ లీ హెర్రిక్ అనే వ్యక్తి తన కవల సోదరుడైన రోనాల్డ్ జే హెర్రిక్కి కిడ్నీని దానం చేశాడు. సోదరుడి మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతుంటే లీ హెర్రిక్ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. 1954లో జరిగిన ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యింది. కిడ్నీ మార్పిడి తర్వాత ఎనిమిదేళ్ల పాటు జే హెర్రిక్ జీవించాడు. ఇక కిడ్నీ దానం చేసిన లీ హెర్రిక్ మరో 56 ఏళ్ల పాటు జీవించి 2010లో చనిపోయాడు(వృద్ధాప్య సంబంధిత సమస్యలతో). ఇక ఆపరేషన్ని సక్సెక్స్ చేసిన డాక్టర్ జోసెఫ్ ముర్రే.. తర్వాత కాలంలో నోబెల్ బహుమతి పొందాడు. ప్రమాదం లేదు హెర్రిక్ సోదరుల అవయవమార్పిడి శస్త్ర చికిత్స వైద్య రంగంలో ఆ రోజుల్లో సంచలనం సృష్టించింది. అవయవదానం చేస్తే ఎటువంటి ప్రమాదం లేదనే విషయాన్ని లోకానికి చాటి చెప్పింది. అప్పటి ప్రపంచ వ్యాప్తంగా అవయవదానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క అమెరికాలోనే నలభై మూడు వేలకు పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. ఎనిమిది మంది ప్రాణాలు ఒక వ్యక్తి నుంచి ఎనిమిది రకాల అవయవాలను ఇతరులకు దానం చేసే వీలుంది. గుండె, మూత్రపిండాలు, పాంక్రియాస్, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చర్మపు టిష్యు, ఎముకల్లోని మజ్జ, చేతులు, ముఖం, స్టెమ్సెల్స్, కళ్లని ఇతరులకు మార్పిడి చేసే అవకాశం ఉంది. కిడ్నీ, కాలేయ మార్పిడి, ఎముక మజ్జ బతికుండగానే దగ్గరి వాళ్ల కోసం దానం చేస్తుంటారు. ఇక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి వారి కుటుంబ సభ్యుల సమ్మతితో ఇతర అవయవాలను సేకరిస్తుంటారు. వీటి సాయంతో మరో ఎనిమిది మందికి ప్రాణాలను కాపాడే వీలుంది. జీవన్దాన్ ట్రస్ట్ అవయవమార్పడి కోసం కేంద్రం జీవన్దాన్ ట్రస్ట్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బ్రయిన్డెడ్ అయిన వ్యక్తుల సమాచారం ఈ ట్రస్ట్కి అందిస్తే వారు అవయవాలు సేకరించి అవసరం ఉన్న రోగులకు కేటాయిస్తుంటారు. ప్రస్తుతం జీవన్దాన్ ట్రస్టు దగ్గర వివిధ అవయవాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 2,467గా ఉంది. ఇందులో అత్యధికంగా కిడ్నీలు 1,733, కాలేయం 631, గుండె 35, ఊపిరిత్తులు 60, క్లోమం 8గా ఉన్నాయి. సర్కారు దవాఖానాలు భేష్ కార్పోరేట్ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినప్పుడు ఎక్కువ హడావుడి కనిపిస్తుంది. కానీ ఈ ఆపరేషన్లు చేయడంలో ప్రభుత్వ ఆస్పత్రులు కూడా మెరుగైన పనితీరే కనబరుస్తున్నాయి. హైదరాబాద్లోని నిజామ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో ఇప్పటి వరకు 2013 నుంచి ఇప్పటి వరకు 283 అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. ఇందులో 267 కిడ్నీలు, 11 కాలేయ, 5 గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. బ్రెయిన్ డెడ్ అయిన 31 మంది చేసిన అవయదానం వల్ల ఇక్కడ 283 మందికి లైఫ్ లభించింది. ఇక ఉస్మానియాలో 62, గాంధీలో 9 ఆపరేషన్లు జరిగాయి. బ్రెయిన్ డెడ్ మెదడులో రక్తనాళాలు చిట్లి అంతర్గతంగా రక్తస్రావం జరిగినప్పుడు మెదడు పని చేయడం ఆగిపోతుంది. ఇటువంటి కేసులను బ్రెయిన్ డెడ్గా వ్యవహరిస్తారు. రోడ్డు ప్రమాదం, బీపీ వల్ల కూడా ఇటువంటి మరణాలు జరుతుంటాయి. వైద్యుల బృందం బ్రయిన్డెడ్గా నిర్థారించిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో అవయవాలను సేకరిస్తారు. కొన్ని సార్లు బతికుండగానే తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం కిడ్నీలు, కాలేయం దానాలు కూడా జరుగుతుంటాయి. - సాక్షి, వెబ్డెస్క్ -
ఆగిపోయిన గుండెకు మళ్ళీ ఊపిరి పోసిన అంబులెన్స్ సిబ్బంది..
కరీంనగర్: అంబులెన్స్ సిబ్బంది సమయస్ఫూర్తీతో ఆగిపోయిన గుండెకు మళ్లీ ఊపిరిపోసి మానవత్వం చాటుకున్నారు. ఈ అరుదైన సంఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. కాగా, మంథని మండలం గంగిపల్లికి చెందిన సుజాత అనే మహిళకు మూడు రోజుల క్రితం బాలుడు జన్మించాడు. బాబుకు అనారోగ్యం కారణంగా నిన్న కరీంనగర్ సివిల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్సను అందిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా, బాబు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే వరంగల్ ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు తల్లిదండ్రులకు సూచించారు. దీంతో సీరియస్ కండిషన్లో ఉన్న తమ బాలుడిని కరీంనగర్ నుంచి వరంగల్కు అంబులెన్స్లో తరలిస్తున్నారు. అయితే, అంబులెన్స్లో ప్రయాణిస్తుండగా.. పసికందు గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది వెంటనే.. హార్ట్ బీట్ చెస్ట్ కంప్రెషన్ విధానంలో మళ్ళీ గుండె కొట్టుకునేలా చేశారు. దీంతో ఆ బాలుడు తిరిగి సాధారణంగా స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
వైద్యశాస్త్రంలో వింత: ఓ యువతికి కుడి వైపున గుండె
Right Side Heart Girl: గుండె ఎటు వైపు ఉందని చిన్నపిల్లాడిని అడిగిన ఎడమ వైపు.. లేదా లెఫ్ట్ సైడ్ అని సమాధానం ఇస్తారు. అయితే ఇప్పుడు ఆ సమాధానం మారేలా ఉంది. ఎందుకంటే ఓ యువతికి ఎడమ వైపున కాకుండా కుడి వైపు గుండె ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయమైనా ఇది వాస్తవం. తాజాగా చేసుకున్న పరీక్షల్లో ఈ విషయం తెలియడంతో ఆ యువతి షాక్కు గురయ్యింది. ఆమె చేసుకున్న పరీక్షల్లో గుండె కుడి వైపున ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అమెరికాలోని చికాగో నగరానికి చెందిన 19 ఏళ్ల యువతి క్లారీ మక్ విపరీతమైన దగ్గుతో బాధపడుతోంది. రెండు నెలల నుంచి దగ్గు వస్తుండడంతో పరీక్షించుకోవాలని ఆస్పత్రికి వెళ్లింది. రాత్రిపూట విధులు నిర్వహిస్తుండడంతో జలుబు, దగ్గు సాధారణంగా భావించినట్లు క్లారీ తెలిపింది. జూన్లో ఆస్పత్రికి వెళ్లి మందులు వేయించుకున్నా తగ్గలేదు. ఎంతకీ దగ్గు తగ్గకపోవడంతో ఊపిరితిత్తుల సమస్య ఉండవచ్చని వైద్యులు భావించారు. తదుపరి వైద్యం కోసం ఎక్స్ రే చేయించుకోవాలని చెప్పారు. ఎక్స్ రే చేసుకున్న అనంతరం రిపోర్ట్ను పరిశీలించిన వైద్యులు షాక్కు గురయ్యారు. వైద్యులు వచ్చి ‘నీకు గుండె కుడి వైపున ఉంది’ అని చెప్పడంతో తాను గందరగోళానికి గురయ్యానని.. షాక్లో ఉన్నట్లు క్లెయిర్ మక్ తెలిపారు. నాకేమన్నా అవుతుందని వైద్యులను అడిగితే ఎలాంటి సమస్య లేదని వైద్యులు చెప్పినట్లు తెలిపింది. గుండె కుడి వైపు ఉండడాన్ని వైద్య పరిభాషలో ‘డెక్స్ట్రోకార్డియా’ అని అంటారు. ఈ వివరాలన్నీ క్లెయిర్ మక్ టిక్టాక్లో ఓ వీడియో రూపొందించి విడుదల చేసింది. ఆమె వీడియోను లక్షల్లో చూశారు. 4,33,00 మంది కామెంట్లు చేశారు. దేవుడి దయతో బాగున్నానని ఆ వీడియోలో తెలిపింది.