-
మధుమేహం : ఈ సూపర్ ఫుడ్తో చెక్ చెప్పొచ్చు!
ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య అందరిలోనూ కనిపిస్తోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య నానాటికి పెరిగి పోతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. మధుమేహం విషయంలో, రక్తంలో చక్కెర స్థాయులను సాధారణంగా ఉండేలా చూసుకోవడం మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయి తగ్గించుకోవడానికి కొన్ని సూపర్ఫుడ్ల సహాయం తీసుకోవచ్చు. అవేంటో చూద్దామా... దాల్చిన చెక్క: రక్త ప్రవాహంలో చక్కెర కదలికను పెంచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. సొరకాయ: సొరకాయలో 92శాతం నీరు, 8శాతం ఫైబర్ ఉంటుంది. దీనిలో గ్లూకోజ్, చక్కెర సంబంధిత సమ్మేళనాల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు అద్భుతమైన కూరగాయగా పరిగణిస్తారు. కాకరకాయ: రుచికి చేదుగా ఉండే కాకరకాయలో పాలీపెప్టైడ్–పి ఉంటుంది. ఇది ఇన్సులిన్ లాంటి హైపోగ్లైసిమిక్ ప్రొటీన్. ఇది కణాలలోకి గ్లూకోజ్ని తీసుకురావడంలో సహాయపడుతుంది. మెంతులు: ఇవి ఫైబర్, ఇతర రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. శరీరంలోని కార్బోహైడ్రేట్లు, చక్కెరను గ్రహించడంలో సహాయపడతాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర సాధారణంగా ఉంటుంది. ఆకు కూరలు: ఈ కూరగాయలలో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఎ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి. జొన్నలు, రాగులు: జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలలో డయాబెటిస్ను నియంత్రించే కారకాలు ఉంటాయి. రాగి జావ, జొన్న రవ్వతో చేసిన ఉప్మా, జొన్న రొట్టెలు, రాగి జావ, రాగి రొట్టెలు తీసుకోవడం డయాబెటిక్స్కు చాలా మంచిది. -
వేసవి తాపం : మజ్జిగ చేసే మేలు గురించి తెలుసా!
వేసవి కాలం వచ్చేసింది. వాతావరణంలో వచ్చే మార్పులతో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ వేసవి తాపానికి అల్లాడవలసిందే. అయితే కూల్డ్రింకులు, ఇతర శీతల పానీయాలకు బదులుగా వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం కొబ్బరి బొండాలు, చెరుకు రసం, పళ్లరసాలు, మజ్జిగ లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తే మంచింది. వడదెబ్బ తగలకుండా, శరీరం డీ-హైడ్రేషన్ కాకుండా ఉండేందుకు ఇవి చాలా అవసరం. ముఖ్యంగా చవగా, ఈజీగా లభించే మజ్జిగ తీసుకోవడం వల్ల ఎక్కువ లాభాలున్నాయని అంటున్నారు పోషకాహార నిపుణులు. మజ్జిగను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.. వేసవికాలంలో రోజూ రెండుసార్లు మజ్జిగ తాగడం వలన ఆరోగ్యానికి మంచిది. అయితే కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో, వాటిని ఎలా పుచ్చుకోవాలో చూద్దాం... మజ్జిగలో వేయించిన జీలకర్ర పొడి కలుపుకుని తాగడం వలన వేసవి తాపం నుంచి ఉపశమనం కలుగుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది. అంతేకాదు రోజూ మజ్జిగను తాగడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మజ్జిగలో కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు కలిపి తీసుకోవడం వలన దాహార్తి తీరుతుంది. గ్లాసు పల్చటి మజ్జిగలో చిటికడు సొంఠి, చిటికడు సైంధవ లవణం కలుపుకుని తాగితే వేసవి నుంచి ఉపశమనం కలుగుతుంది. మజ్జిగలో ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం, దబ్బాకులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి సేవించడం వలన దాహార్తి తీరడమే కాదు.. శక్తి కూడా చేకూరుతుంది. వేసవి వేడికి తిన్న ఆహారం అరగక ఒక్కోసారి వాంతులు అవుతుంటాయి. అలాంటప్పుడు చిటికడు జాజికాయ పొడిని మజ్జిగలో కలుపుకుని సేవించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మజ్జిగలో విటమిన్ బి12, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం ఉంటాయి. ఇవి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మజ్జిగ ఆరోగ్యకరమైన పానీయం. కనుక వేసవిలో కూల్ డ్రింక్స్ కంటే ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ రెండుసార్లు మజ్జిగను తీసుకోండి. -
కలబందతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో: సౌందర్యానికి కూడా
కలబందలేదా అలోవెరా ప్రతీ ఇంట్లో సర్వ సాధారణంగా ఉంటోంది. ఒకవిధంగా చెప్పాలంటే తులసి మొక్కకు ఇచ్చినంత ప్రాధాన్యతను కలబందకు కూడా ఇస్తున్నారంటూ అతిశయోక్తి కాదు. అందం నుంచి ఆరోగ్యం వరకు కలబంద ప్రయోజనాలు, వాడకం ప్రాచుర్యంలోకి వచ్చింది. ముఖ్యంగా చర్మ సౌందర్యానికి బాగా పనిచేస్తుంది. ఇంకా ఆయుర్వేద మందుల్లోను సౌందర్య ఉత్పత్తుల్లోనూ, దీన్ని విరివిగా వాడతారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం కలబందలో విటమిన్ ఏ , సీ, ఈ, బీ1, బీ2, బీ3, బీ6,బీ 12 లాంటి విటమిన్లతోపాటు ఫోలిక్ యాసిడ్, 18 రకాల అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఇంకా కాల్షియం, క్రోమియం, సెలెనియం, మెగ్నీషియం, జింక్, సోడియం, ఇనుము, పొటాసియం, కాపర్, మాంగనీస్ వంటి దాదాపు ఇరవై మినరల్స్ ఉంటాయి. కలబంద లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ బయొటిక్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉంటాయి. అలోవెరా జెల్ పౌడర్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.ప్రీడయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో కలబంద సప్లిమెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించ గలదు. ఇది ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ని తగ్గిస్తుంది. కలబందలో లాటెక్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది మలబద్ధకానికి మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. కలబంద దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కలబందతో చేసిన మైత్ వాష్ వినియోగం ద్వారా చిగుళ్ల రక్తస్రావాన్ని తగ్గించవచ్చు. అలోవెరా కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇది చర్మం తొందరగా సాగిపోకుండా నివారిస్తుంది. కలబందలో మ్యూకోపాలిసాకరైడ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మంలోని తేమను కాపాడతాయి. కలబంద గుజ్జును రాసుకుంటే, జుట్టు మెత్తగా, మెరిసేటట్టు మారుతుంది. జుట్టు తెగిపోవడాన్ని అరికడుతుంది. చక్కగా, ఒత్తుగా ఎదిగేలా తోడ్పడుతుంది. మాయిశ్చరైజర్ల నుండి ఫేస్ మాస్క్ల వరకు చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఇది చాలా కీలకం. దీనిలోని మాయిశ్చరైజింగ్, యాంటీ ఏజింగ్ లక్షణాలే దీనికి కారణం. అలోవెరా జెల్ కాలిన గాయాలకు చాలా ఉపశమనం ఇస్తుంది. గాయాలు, మచ్చలు తొందరగా మానేలా చేస్తుంది. సన్బర్న్ ఇన్ఫ్లమేషన్ను కూడా తగ్గిస్తుంది. కలబంద రెమ్మ పైన ఉండే తోలును తీసేసి అందులో తెల్లగా ఉన్న గుజ్జును తీసుకొని ఒక పాత్రలో వేయాలి ఇది ఒగరు ఒగరుగా, పుల్లగా కొన్ని చిరు చేదుగా కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం సుగర్ లేదా కొద్దిగా తేనె వేయాలి. దీన్ని మిక్సీలో వేసుకొని కలపాలి.అలా కలిపిన తర్వాత పూర్తిగా నీరు మాదిరిగా తయారవుతుంది. దీన్ని ఉదయాన్నే తాగవచ్చు. తేనె కలిపిన ఈ మిశ్రమాన్ని ముఖానికి, చర్మానికి కూడా అప్లయ్ చేసుకోవచ్చు. పెరటి మొక్కల పోషణలో కూడా కలబంద గుజ్జు, తోలు బాగా ఉపయోగ పడతాయి. ఇన్ని ప్రయోజనాలున్న కలబంద లక్షల్లో ఆదాయ తెచ్చిపెట్టే పంటగా కూడా మారిపోవడం గమనార్హం. -
చింతగింజల మ్యాజిక్ తెలుసా? పురుషులకు మరీ ప్రయోజనం!
చింత గింజలు అంటే చింతపండు వాడుకుని, పులుసు తీసుకున్న తరువాత తీసిపారేసే వేస్ట్ గింజలనుకునేరు. వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చింతపండు గింజల్లో ఉండే ప్రోటీన్లోయాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయని, చికున్ గున్యా కోసం యాంటీవైరల్ మందులను అభివృద్ధి చేయడానికి సమర్థ వంతంగా ఉపయోగించవచ్చని నిపుణుల మాట. దీంతో పాటు వివిధ ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో తెలియాంటే..ఈ కథనాన్ని చదవాల్సిందే..! చింత చెట్టును భారత దేశపు ఖర్జూర చెట్టు అంటారు. గతంలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బయోటెక్నాలజీ విభాగానికి చెందిన రూర్కీ ప్రొఫెసర్లు చింతగింజలపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలు ఎల్సెవియర్ జర్నల్, వైరాలజీలో ప్రచురించబడ్డాయి కూడా. దీని ప్రకారం మధుమేహ నిర్వహణలో ఉపయోగ పడతాయి. చింత గింజల పొడితో దంత సమస్యలను దూరం చేసుకోవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చింతగింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం: చింతపండు గింజలు ప్యాంక్రియాస్ను రక్షిస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పరిమాణాన్ని పెంచుతుంది.చింతపండు గింజల నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా నియంత్రించుకోవచ్చు. దంతాలకు మేలు చేస్తుంది: చింతపండు గింజల పొడితో చిగుళ్ళు ,దంతాలను తోముకుంటే మంచిది. ఎక్కువగా పొగ త్రాగే వారికి. శీతల పానీయాలు, ధూమపానం వల్ల పళ్లు గారపట్టిపోతాయి. ఇందుకోసం చింత గింజలను పొడి చేసి అందులో నీళ్లు కలిపి పేస్ట్లా చేసి రోజూ దంతాలను తోముకోవాలి. దీంతో దంతాలు తెల్లగా మారడంతోపాటు దంతాలపై ఉండే గార, పాచి వదిలిపోతుంది. జీర్ణక్రియ: చింతపండు గింజల రసం అజీర్ణాన్ని నయం చేయడానికి, పిత్తానికి సహజ నివారణగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా, ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఇది కొలెస్ట్రాల్ను మరింత తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లను నివారణలో: యాంటీ బాక్టీరియల్ లక్షణాలుతో చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించుకోవచ్చు. అంతేకాకుండా, ఇది పేగు , మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుండి కూడా కాపాడుతుంది. గుండెకూ మంచిదే: చింతపండు విత్తనాలలో పొటాషియం ఉంటుంది. పొటాషియం బీపీని తగ్గిస్తుంది. రక్తపోటు, ఇతర హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్ల నివారణలో: చింత గింజల్లో యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఈ గింజల పొడిలో నీళ్లు కలిపి ఆ మిశ్రమాన్ని గాయాలు, పుండ్లపై రాసుకోవచ్చు. అలాగే మంగు మచ్చల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చింత గింజలను పొడిలా తయారుచేసి, ఆ పొడిలో తేనె కలిపి మచ్చల ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. చింతగింజల పొడిని రోజూ ఓ అర టీస్పూన్ మేర రోజుకు రెండు సార్లు నీటితో కలిపి తీసుకోవాలి. పాలు లేదా నెయ్యిని కూడా వాడొచ్చు. దీనివల్ల మోకాళ్ల నొప్పులు దూరమవుతాయి. వీర్యకణాల వృద్ధిలో ఆవుపాలు, చింతగింజల పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల పురుషుల్లో వచ్చే లైంగిక సమస్యలు తగ్గుతాయి. వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. ఇలా నోట్: చిట్కాలు అందరికీ ఒకేలా పనిచేస్తాయన్న గ్యారంటీ లేదు. నిపుణులతో సంప్రదించి చింతగింజల పొడిని వాడుకోవాలి. దీని ప్రయోజనానలు వైద్యుడిని సంప్రదించి నిర్ధారించుకోండి. -
వంట దినుసులే కదా అని తేలిగ్గా తీసుకోకండి!
మన వంట గదే ఔషధాల నిలయం. మనకు తెలియకుండానే మన పూర్వీకులు, పెద్ద వాళ్లు అలవాటు చేసిన, చెప్పిన పద్దతుల ద్వారా కొన్ని ఆరోగ్యకరమైన దినుసులు, మసాలాలను వాడుతుంటాం. ముఖ్యంగా పసుపు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు ఇలా ప్రతిదీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే! ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉండటంతో పాటు, వాడాల్సిన పద్దతిలో వీటిని వాడితే అదనపు రుచిని అందిస్తాయి. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. అలాంటి వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. పసుపు: అనేక యాంటి బయోటిక్ గుణాలు, పోషకాలు ఇందులో ఉన్నాయి. అందుకే ప్రతీ కూరలోనూ చిటికెడు పసుపు వేయడం మన భారతీయులకు అలవాటు. పసుపులో ఉండే కర్కుమిన్ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసకోశ మంటను తగ్గిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు మొదలైన వాటి నుంచి కాపాడుతుంది. జలుబు చేసినపుడు పసుపు ఆవిరిపట్టడం, పసుపు,పాలు తాగడం, గాయాలకు పూయడం లాంటివి కూడా మంచిదే. అల్లం: రోజువారీ వినియోగంలో అల్లం పాత్ర చాలా పెద్దదే. అల్లంలో ఉండే జింజెరాల్ అనే సమ్మేళనం శ్వాసకోశ మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థకు మేలు జరుగుతుంది. శ్లేష్మం తగ్గించడంలో సాయపడుతుంది. శ్వాస ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్లంతో శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్ని టీలో అల్లం కలుపుకుని తింటే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా సరే లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్లా చేసుకుని తాగినా మంచిదే. వెల్లుల్లి: వెల్లుల్లి వంటలకు రుచి, వాసనను అందిచడమే కాకుండా జీర్ణ ప్రక్రియను సులభ తరం చేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీటితోపాటు వెల్లుల్లి రెబ్బను తింటే,జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు శరీర బరువు కూడా తగ్గించేందుకు దోహద పడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బీలు వ్యాధులకు నివారణలో పని చేస్తాయి. ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుంది. అలోసిన్-సల్ఫర్ సమ్మేళనం వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఒరేగానో: వంటకాల్లో ఉపయోగించే ఒరేగానో హెర్బ్, యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంది. దగ్గు, ఆస్తమా, బ్రోన్కైటిస్, శ్వాసకోశ వాపు, క్షయవ్యాధి నివారణకు సహాయపడుతుంది. రుమాటిజం, తిమ్మిరి, మైగ్రేన్లు, ఉబ్బరం, ఆకలి లేకపోవడం, విరేచనాలు, కామెర్లు , వంటి ఇతర కాలేయ వ్యాధులకు ఒరేగానోను ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో పాలీ ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. జలుబు, దగ్గు మొదలైన బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే సమస్యల నుంచి రక్షించడంలో సాయపడుతుంది. -
హోలీ..హోలీరే : నేచురల్ కలర్స్, గులాల్ తయారు చేసుకోండిలా!
#Holi 2024:హోలీ అంటేనే రంగుల పండుగ. చిన్నా పెద్దా అంతా రంగుల్లో మునిగి తేలే పండుగ. వసంతకాల వేడుక. పల్లె పట్నం అంతా ఎల్లలు దాటేలా సంబరాలు చేసుకుంటారు. చెడుపై మంచి విజయానికి చిహ్నంగా, రాధాకృష్ణుల ప్రేమకు ప్రతిరూపంగా ఆలయాలుముంగిళ్లు, వాకిళ్లు రంగులతో తడిసి మురిసే సంబరం. ఇంట్లోనే సహజంగా హోలీ రంగులు వసంతం ఆగమనానికి సూచిక హోలీ. ఒకప్పుడు ప్రకృతి ప్రసాదించిన పువ్వులు, ఆకులతో తయారుచేసుకున్న రంగులతో పండుగ జరుపుకునే వారు. కాలక్రమంలో హోలీ ప్రజాదరణ పెరిగింది. సహజ రంగుల స్థానాన్ని రసాయన ఆధారిత సింథటిక్ రంగులు ఆక్రమించేశాయి. సహజ రంగులతో పోలిస్తే చౌకగా ఉంటాయి, కానీ ఆరోగ్యానికి , పర్యావరణానికి హానికరమైనవి, చర్మానికి, ఆరోగ్యానికి మంచిదని కాదని తెలిసినా జాగ్రత్త పడటం లేదు. దీనికి తోడు సహజ రంగులను ఎలా తయారు చేసుకోవాలో తెలియక చాలామంది వీటిని వినియోగిస్తున్నారు. రానున్న హోలీ సందర్భంగా మార్కెట్లో లభించే అసహజ రంగులకు బదులుగా ఇంట్లోనే సహజ రంగులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే పింక్ గులాల్ ఇలా పింక్ గులాల్ కోసం 1-2 మీడియం బీట్రూట్లను తీసుకోవాలి. వాటిని చక్కగాతురుముకోవాలి, దీన్ని ఒక కప్పు నీళ్లుపోసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ ద్రావణాన్ని వడకట్టుకోవాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలుపుకోవచ్చు. దీనికి మొక్కజొన్న పిండి లేదా టాల్కమ్ పౌడర్ని కలుపుకోవచ్చు. పొడిగా కావాలనుకుంటే మైక్రోవేవ్లో వేడి చేయండి. దీన్ని బాగా కలపినా లేదా మళ్లీ గ్రైండ్ చేసినా పింక్ గులాల్ రడీ. రెడ్ కలర్ గులాల్ గులాల్ ను ఇంట్లో తయారు చేసుకోవాలంటే గులాబీ రేకులను తీసుకుని నీటిలో గంటసేపు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. పొడిగా కావాలంటే ఎండబెట్టండి లేదా మీరు మైక్రోవేవ్లోపుంచి డ్రైగా చేసుకోవచ్చు. ఎండబెట్టిన కొన్ని ఎరుపు మందార పువ్వులను తీసుకోండి. వాటిని మెత్తగా పొడి చేయండి. దీనికి కొద్దిగా బియ్యం పిండిని కలుపుకోవచ్చు. ఎర్ర చందనం కలిపిన నీళ్లు ఎర్ర రంగులోకి మారి భలే ఆకర్షణీయంగా ఉంటుంది. దానిమ్మ తొక్కలను నీటిలో ఉడకబెట్టి వాటర్ కలర్ వాడుకోవచ్చు.( కానీ ఈ నీళ్ళ మరకలు ఒక పట్టాన పోవు) పసుపు పసుపు పొడి ఇంట్లోనే పసుపు రంగును తయారు చేసకోవచ్చు. పసుపు రంగులో ఉండే శనగపిండి, పసుపు మిశ్రమంతో ఒక కలర్ సింపుల్గా రడీ అయిపోతుంది. దీని వల్ల ఎలాంటి నష్టం రాదు. పైగా పసుపు, శనగ పిండి సున్ని పిండిలాగా కూడా ఉపయోగపడుతుంది. వీటినే నీటిలో కలిపే తడి రంగును తయారు చేసుకోవచ్చు. అంతేకాదు పసుపు బంతి పువ్వులను తీసుకొని నీటిలో మరగించినా చక్కటి కలర్ వస్తుంది. గ్రీన్ కలర్: ఇంట్లో చాలా సులభంగా లభించే గోరింటాకు పొడితో గ్రీన్ కలర్ తయారు చేసుకోవచ్చు. అప్పుటి కప్పుడు కడిగేసుకుంటాం కాబట్టి పెద్దగా పండదు. అలాగే ఎండ బెట్టిన గోరింట పొడిని నీటిలో కలపి ఈ వాటర్ను వాడుకోవచ్చు. ఇంకా పుదీనీ, బచ్చలికూర లాంటి ఆకుకూరలు వేప, తులసి లాంటి ఆకులను నీటిలో ఉడకబెట్టడం ద్వారా కూడా ఆకుపచ్చ రంగును తయారు చేసుకోవచ్చు. మెరూన్ మెరూన్, లేదా లేత పర్పుల్ రంగును సులభంగా తయారు చేయడానికి బీట్రూట్ రసాన్ని మించింది లేదు. బీట్రూట్ను మెత్తగా దంచుకొని, లేదా మిక్సీలో వేసి ఆ ముద్దను నీటిని రాత్రంతా నానబెట్టండి. దీన్ని చక్కగా వడకట్టుకొని వాడుకోవచ్చు. బ్లూ కలర్: అపరాజిత నీలి రంగు మందారం రేకుల నుండి ఇంట్లోనే చాలా సులభంగా బ్లూ కలర్ తయారు చేసుకోవచ్చు. అంతేకాదు నీలి రంగు అపరాజిత లేధా శంఖం పువ్వులు కూడా బ్లూ కలర్కి బాగా ఉపయోగపడతాయి. పూల రేకులను ఎండబెట్టి, దాని నుండి పొడిని తయారు చేయండి. పొడిలో కాస్త బియ్యం పిండిని కలుపుకోవచ్చు. ఈ పూలను నీళ్లలో నానబెట్టి, ఆ నీళ్లను కూడా వాడుకోవచ్చు. ఆరెంజ్: ఎండిన నారింజ తొక్కలను ఉపయోగించి నిమిషాల్లో ఆరెంజ్రంగును తయారు చేయవచ్చు. తొక్కల్ని ఎండబెట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. తర్వాత మొక్కజొన్న పిండి, కొద్దిగా పసుపు వేసి బాగా కలపాలి. నోట్: వీటితోపాటు, మీకు తెలిసిన, మీ అమ్మమ్మ, బామ్మలను అడిగి తెలుసుకుని మరీ అనేక సహజ రంగులకు తయారు చేసుకోవచ్చు. సహజ రంగులనే వాడదాం. మన ఆరోగ్యాన్ని , ప్రకృతిని కాపాడుకుందాం!! -
గుండె ‘లయ’ తప్పితే..ముప్పే! ఈ లక్షణాలు గమనించండి!
ఒకపుడు గుండెపోటు అంటే.. మధుమేహం ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి, వయసు మీద పడిన వారికి, ఊబకాయ ఉన్నవారికి మాత్రమే వస్తుంది అని అనుకునే వాళ్ళం. కానీ ప్రస్తుత కాలంలో గుండె పోటు తీరు మారింది. మాకు రాదులే అని అనుకోడానికి లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండానే ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. మరీ ముఖ్యంగా జిమ్ చేస్తున్నవారు, ఎక్కువ కసరత్తు చేస్తున్న వారు కూడా ఎంతోమంది చిన్న వయసులోనే గుండెపోటుతో ప్రాణాలను కోల్పో తున్నారు. అసలు గుండె పోటు ఎందుకు వస్తుంది? గుండె పోటు వచ్చే ముందు మన శరీరం అసలు సంకేతాలు పంపిస్తుందా? ఈ కథనంలో చూద్దాం. జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడిన వారిలో గుండె వ్యాధుల ప్రమాదం ఎక్కువ. అయితే ఇటీవలి కాలంలో అసలు అనారోగ్య సమస్యలేకపోయినా కూడా హార్ట్ ఎటాక్తో చనిపోతున్నారు. గుండెపోటు గుండె కండరానికి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలలో కొవ్వు కాని గడ్డలు కాని ఏర్పడడం వల్ల రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడితే గుండె పోటు వస్తుంది. సాధారణంగా గుండె (కరోనరీ) ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ ,ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల అడ్డంకులు(బ్లాక్స్) ఏర్పడతాయి. రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వీటికి సరైన సమయంలో చికిత్స అవసరం. అలాగే బాడీలో విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిన వారు కూడా గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు వాస్తవానికి కొంతమందిలో తేలికపాటి లక్షణాలు ఉంటాయి. మరికొందరికి తీవ్రమైన లక్షణాలు ఉన్నాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, కానీ చాలామంది వాటిని గుర్తించడంలో వైఫల్యంతోనే ముప్పు ముంచుకొస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి లక్షణాలు గుర్తించి, ప్రాథమిక చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తప్పే అవకాశం చాలా ఉందిలో ఉంటుందని అంటున్నారు. ►గుండెల్లో మంట లేదా అజీర్ణం ►గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం ►ఛాతీలో నొప్పి, గుండె లయలో మార్పులు ►శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ►తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ►తొందరగా అలసిపోవడం, అంటే కొద్దిగా నడిస్తేనే నీరసం ► నాలుగు మెట్టు ఎక్కంగానే ఆయాసం ఇలాంటి లక్షణాలున్నపుడు వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ► మరి కొందరిలో ముందు దవడ, మెడ, జీర్ణాశయం పై భాగంలో నొప్పిగా ఉంటుంది. ► ఒకటి లేదా రెండు రోజులకు మించి ఎడం చెయ్యి లేదా రెండు చేతులలో అకారణంగా నొప్పి, వికారం, వాంతి వచ్చినట్టు ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి లక్షణాలు లేకపోయినా ఎవరు జాగ్రత్త పడాలి ►అధిక బరువు వున్నా, హైబీపీ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నా, ధూమపానం అలవాటు ఉన్న వారంతా గుండె పోటు ప్రమాదం పట్ల అవగాహనతో ఉండాలి. ► అలాగే ఎక్కువ ఒత్తిడి ఉండే ఉద్యోగాలు చేసేవారిలోనూ గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అనేది గమనించాలి. ►ముఖ్యంగా మధ్య వయసులో స్త్రీల కన్నా మగవారికి గుండెపోటువచ్చే ప్రమాదం ఎక్కువని నిపుణులు చెబుతన్నారు. ► మెనోపాజ్ దశలో మహిళల్లో ఈస్ట్రెజెన్ స్థాయి తగ్గిపోతుంది. అప్పుడు వారిలో గుండె పోటు ముప్పు పెరుగుతుంది. అయితే 65 ఏళ్ల తర్వాత పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువ గుండె పోటు వస్తున్నట్టు పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురిలోనూ అలసత్వం ఎంతమాత్రం మంచిది కాదు. ►మరీ ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వచ్చిన చరిత్ర ఉన్నా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వంశపారంపర్యంగా ఈ గుండె వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. పై లక్షణాలున్నవారందరికీ గుండెజబ్బు వచ్చేసినట్టు కాదు. కానీ లక్షణాలు కనిపించగానే రోగ నిర్ధరణ అనేది చాలా కీలకం. క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారంపై శ్రద్దతో పాటు ఏ చిన్న అనుమానం వచ్చినా అజాగ్రత్త చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
పిగ్మెంటేషన్ లేదా మంగు మచ్చలు.. ఇంట్లోనే ఇలా తగ్గించుకోవచ్చు!
వేసవికాలంలో ప్రధానంగా వేధించే సమస్య ముఖం మీద నల్లని లేదా గోధుమ రంగు మచ్చలు. వయసు పెరిగే కొద్దీ ఇవి మరింత బాధిస్తాయి. ఈ మచ్చలను మంగు మచ్చలు లేదా పిగ్మెంటేషన్ అంటారు. నుదురికి ఇరువైపులా, బుగ్గలు, ముక్కుకు ఇరువైపులా అందహీనంగా కనిపిస్తాయి. వీటి నివారణకు లేజర్ చికిత్సలు, మార్కెట్లో దొరికే క్రీమ్లకంటే ఇంట్లోనే చేసుకోగలిగిన పరిష్కారాలు మంచి ఫలితాన్నిస్తాయి. అసలు మంగు మచ్చలు ఎందుకు వస్తాయి? వయస్సుతోపాటు చర్మంపై పడే ప్రతికూలతల వల్ల ఈ మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. హరోన్ల సమతుల్యత లోపం వల్ల, మరికొందరికి వంశపారంపర్యంగా కూడా ఈ మచ్చలు రావచ్చు. అయితే వీటిని శారీరకమైన బాధలేవీ ఉండవు. శరీరంలో మెలనిన్ ఎక్కువగా తయారైతే.. ‘హైపర్ పిగ్మెంటేషన్’కు దారి తీస్తుంది. సూర్య కిరణాల్లోని అతినీలలోహిత కిరణాలు చర్మానికి హాని చేసి, ఆ సమయంలో మెలనిన్ ఎక్కువై మంగు మచ్చలు తయారవుతాయి. జీవక్రియ సమస్యలు, పోషకాహార లోపం, అధిక ఉష్ణోగ్రత, కాలుష్యం,అనుధార్మికత, ఔషధాల వల్ల కూడా ఇవి ఏర్పడతాయి. బంగాళ దుంప: బంగాళ దుంపల తురుమును పలచని గుడ్డలో వేసి రసం తీసుకోవాలి. ఒక కాటన్ ప్యాడ్ను గానీ, దూదిని గానీ ఈ రసంలో ముంచి మచ్చలపై పూయండి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తుంటే తప్పకుండా మచ్చలు తొలగిపోతాయి. టమోటా: గింజలు తొలగించిన టమోటా గుజ్జుకు, కొద్దిగా తేనె కలిపి మచ్చలకు అప్లయ్ చేయాలి. 20 నిమిషాలు ఉంచి ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి మార్పు మీకే తెలుస్తుంది. టమోటా, ముల్తానా మట్టి: టమోటా రసంలో కాస్త గంధం పొడిని కలపండి. ఆ మిశ్రమంలో ముల్తాని మట్టిని కలిపి పేస్టులా చేయండి. అనంతరం ఆ పేస్టును ముఖంపై ఉన్న మచ్చలపై రాయండి. 20 నుంచి 30 నిమిషాల తర్వాత ముఖాన్ని కడగాలి. వారంలో రెండుస్లారు ఇలా చేస్తే మంచు మచ్చలు క్రమంగా తగ్గి పోతాయి. కలబంద: సహజసిద్ధమైన కలబంద గుజ్జు చాలా రకాల చర్మ సమస్యలకు పరిష్కారం. క్రమం తప్పకుండా కలబంద గుజ్జున రాస్తే మంగు మచ్చలు మాటుమాయం. నిమ్మ, రోజ్వాటర్: ఒక గిన్నెలో రోజ్ వాటర్, నిమ్మరసం, కీరదోస రసం, తేనె వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి బాగా పట్టించి, 15, 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. రోజ్ వాటర్ లేని పక్షంలో నిమ్మరసాన్ని వాడుకోవచ్చు. పసుపు: పసుపు, గేదె పాలు, ఎర్ర చందనం కలిపి ముఖానికి రాసుకుంటే సత్ఫలితాలు కనిపిస్తాయి. తాజా గేదె నెయ్యి మంగు మచ్చలపై రాస్తే ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. -
ఓవర్ థింకింగ్ నుంచి తప్పించే ఏడు జపనీస్ టెక్నిక్స్...
మనసు కోతిలాంటిది. ఎప్పుడూ ఒకచోట కుదురుగా ఉండదు. ఈ క్షణం ఒక అంశం గురించి ఆలోచిస్తుంటే, మరుక్షణం మరో అంశంపైకి గెంతుతుంది. కొందరు ఒకే విషయం గురించి అతిగా ఆలోచిస్తూ బాధపడుతుంటారు. సకల మానవ దు:ఖానికి కారణమైన మనసును నియంత్రించడం కోసం అనాదిగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. యోగ: చిత్తవృత్తి నిరోధక: అనే సూత్రంతోనే పతంజలి యోగసూత్రాలు మొదలవుతాయి. అష్టాంగమార్గం ద్వారానే దు:ఖాన్ని తప్పించుకోగలమని బౌద్ధం బోధిస్తుంది. జపాన్ లోని బౌద్ధులు కూడా మనసును నియంత్రించుకోవడం గురించి అన్వేషించి ఏడు టెక్నిక్స్ అందించారు. సైకాలజీ అనేది పుట్టకముందే, వేల సంవత్సరాల కిందటే మొదలైన ఈ టెక్నిక్స్ ను ఇప్పటికీ అక్కడ చాలామంది ఉపయోగిస్తున్నారు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. 1. షోగనై: మీ కంట్రోల్ లో ఉన్న విషయాల గురించి, మీ కంట్రోల్ లేని విషయాల గురించి బాధపడకూడదు. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది కదా. సింపుల్. మీ కంట్రోల్ లో ఉన్న విషయాల గురించి బాధపడటం ఎందుకు? వాటిని ప్రయత్నించి సాధించాలి. మీ కంట్రోల్ లేని విషయాల గురించి ఎంత ఆలోచించినా, ఎంత ప్రయత్నించినా అర్థం లేదు కదా. ఈ వైఖరిని అనుసరిస్తే అనవసర ఆలోచనలు మీ మనసులోకి రానే రావు. మీజీవితంలో కష్టాలూ రావు. వచ్చినా... మీ కంట్రోల్ లో ఉన్నదైతే పరిష్కరించుకుంటారు, లేనిదైతే వదిలేసి ముందుకు సాగవచ్చు. 2. షిరిన్-యోకు: బిజీ బిజీ జీవితంతో విసిగిపోయినప్పుడు.. ‘‘అబ్బ, ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్తే ప్రాణానికి హాయిగా ఉంటుందబ్బా’’ అని అనుకుని ఉంటారుగా. అంతదూరం వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఉన్న ప్రకృతితో మమేకం అవ్వండి. పచ్చదనంలో సమయం గడపండి. అతిగా ఆలోచించకుండా ఉండటానికి ఇది ఉత్తమమైన మార్గం. మీ మనసును శాంతపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. 3. నేన్ బుత్సు: అతిగా ఆలోచించడం నుంచి మనసును మళ్లించడానికి సులువైన మార్గం జపం. అంటే మీరు విశ్వసించే, మీకు నచ్చిన పదాన్ని జపించండి. ఏ పని చేస్తున్నా దానిపైనే ధ్యాస నిలపండి. దానివల్ల ఇతర అంశాల గురించే ఆలోచించే అవకాశం తగ్గుతుంది, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. 4. జాజెన్: ఇది జెన్ బౌద్ధమతంలో విస్తృతంగా అభ్యసించే ధ్యానం యొక్క రూపం. చాలా సులువైన విధానం. మీ ఆలోచనలను మీరు ఎలాంటి జడ్జ్ మెంట్ లేకుండా పరిశీలించడం. అంటే ఒక సాక్షిలా ఆలోచనలను పరిశీలించడం. ఎప్పుడైతే మీరు ఆలోచనలకు స్పందించకుండా, విశ్లేషించకుండా ఉంటారో అప్పుడవి ఆటోమేటిక్ గా తగ్గుతాయి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. 5. గమాన్: జీవితం సుఖదుఖాల, విజయాపజయాల మిశ్రమం. ఒక్కోసారి అనుకోని తీరులో కష్టం ఎదురవ్వవచ్చు. అప్పుడు కుంగిపోకూడదు. నాకే ఎందుకిలా జరిగిందంటూ ఆలోచిస్తూ ఉండిపోకూడదు. ఆలోచనల వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని, అడుగు వేసినప్పుడే ఫలితాలు వస్తాయని గుర్తించి.. ముందడుగు వేయాలి. 6. వాబీ-సాబీ: జీవితంలో అన్నీ తాత్కాలికమేననీ, ఏదీ శాశ్వతం పరిపూర్ణం కావని గుర్తించమని చెప్పే జపనీస్ టెక్నిక్ ఇది. ఎప్పడైతే ఈ విషయాన్ని అంగీకరిస్తారో, అప్పడు పర్ ఫెక్ట్ గా ఉండాలనే ఒత్తిడి నుంచి మీరు తప్పించుకోగలరు. అప్పుడు అతిగా ఆలోచించడం నుంచి మీరు తప్పించుకోగలరు, ప్రశాంతంగా ఉండగలరు. 7. ఇకబెనా: ఇది పువ్వులను అందంగా అమర్చే ఆసక్తికరమైన టెక్నిక్. మీరు పువ్వులను అమర్చేటప్పుడు మీ ధ్యాస మొత్తం వాటిపైనే ఉండాలి. వాటిపై శ్రద్ధ నిలపడం ద్వారా మీ మనసు అందాన్ని సృష్టించడంలో మునిగిపోతుంది. అతిగా ఆలోచించడం నుంచి తప్పించుకుని ప్రశాంతంగా ఉండగలరు. దీన్నే ఫ్లో స్టేట్ అంటారు. మరెందుకు ఆలస్యం వీటిలో మీకు నచ్చిన టెక్నిక్ ఉపయోగించి ఓవర్ థింకింగ్ నుంచి తప్పించుకోండి. అయితే ఇవి మానసిక సమస్యలున్నవారికి కాదని, సైకోథెరపీకి ప్రత్యామ్నాయం కాదనే ఎరుకతో ఉండండి. ఈ ప్రయత్నాలేవీ మీ ఓవర్ థింకింగ్ ను ఆపలేకపోతే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లోని కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ ద్వారా మీ ఓవర్ థింకింగ్ ను తప్పించుకునేందుకు సహాయపడగలరు. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
అలర్జీని ఎలా వదిలించుకోవాలి..?
ఒక్కోసారి మనం బాస్తో, సహోద్యోగులతో, స్నేహితులతోనో మాట్లాడే సమయంలో లేదా ఏమయినా ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు తల దురద పెడుతుంటుంది. ఆ సమయంలో కలిగే ఇబ్బంది ఇంతా అంతా కాదు. తల దురదకు కేవలం పేలు లేదా చుండ్రు వంటివి మాత్రమే కాదు, అలర్జీ కూడా కారణం కావచ్చు. అలర్జీ అనేది కేవలం శరీరంపై దద్దుర్ల రూపేణా మాత్రమే వస్తుందనుకోవడానికి వీలు లేదు. తలలో కూడా వస్తుంది. ముందుగా ఈ దురద ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే దాన్ని నివారించడం సులభమవుతుంది. కొన్ని రకాల క్రిముల వల్ల, కొంతమందికి సాధారణంగానే అరచేతులు, అరికాళ్లలో ఎక్కువ చెమట పడుతుంది. ఎప్పటికప్పుడు చెమటను తుడుచుకుంటూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. కొంతమంది ఎక్కువగా నీటిలో నానుతూ పనిచేస్తుంటారు. నీటిలో అదేపనిగా నానడం కూడా అలర్జీకి కారణమవుతుంది. కొన్ని సార్లు డిటర్జెంట్లు కూడా కొంతమందిలో అలర్జీకి కారణమవుతాయి. అదేవిధంగా కొన్ని రకాలైన నూనెలు, ఎరువులు, ఇంధనాలతో కూడా ఈ సమస్య వస్తుంది. పరిష్కారాలు: ఇలా ఇబ్బంది పెట్టే తల దురద నుంచి తప్పించుకోవటానికి మిరియాలు బాగా ఉపయోగపడుతాయి. అర స్పూన్ మిరియాలు, అర స్పూన్ పాలతో కలిపి బాగా నూరాలి. తర్వాత కొద్దిగా నీళ్లలో ఉడికించి పేస్టు మాదిరిగా చేసి దాన్ని ఆరబెట్టి కొద్దిగా వేడి ఉండగానే తలకు రుద్దాలి. అరగంట తర్వాత శీకాయ పొడితో తలస్నానం చేయాలి. ఈవిధంగా వారానికి మూడు, నాలుగు సార్లు చేస్తే తల దురద పూర్తిగా పోతుంది. ఆహారం ద్వారా: ఉప్పు, పులుపు, కారం తక్కువగా ఉండే, బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు అధికంగా ఉండే తాజా పళ్ళు, గ్రీన్ సలాడ్లను తీసుకోవడం మంచిది. మంచినీరు బాగా తాగడం, తగినంత వ్యాయామం, ధ్యానం చేయడం ద్వారా కూడా దురదలను తగ్గించుకోవచ్చు. దురద, దద్దుర్లు నిరోధించేందుకు మరికొన్ని జాగ్రత్తలు: దురద సమస్య ఎక్కువగా ఉంటే ముందు జాగ్రత్తగా తీపి పదార్ధాలను తినటం తగ్గించాలి. శరీరాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి: మనం వంటికి రుద్దుకునే సబ్బు లేదా తలకు రాసుకునే నూనె, మనం వాడే స్ప్రే లేదా కొత్త మోడల్ దుస్తులకు ఉపయోగించే మెటీరియల్ కూడా మన చర్మానికి సరిపడకపోవచ్చు. అందువల్ల ఉన్నట్టుండి దురదలు వస్తుంటే, మన అలవాట్లలో కొత్తగా వచ్చిన మార్పేమిటో తెలుసుకుని దానినుంచి దూరంగా ఉండటం ఉత్తమం. ఇవి చదవండి: 90 శాతం యువతుల్లో ఇప్పటికీ ఆ లోపం, బెస్ట్ ఫుడ్ ఇదిగో! -
90 శాతం యువతుల్లో ఇప్పటికీ ఆ లోపం, బెస్ట్ ఫుడ్ ఇదిగో!
మహిళల్లో, యువతుల్లో ఐరన్ లోపం సమస్య ఆందోళన రేపుతోంది.కానీ దీని గురించిపెద్దగా పట్టించుకోరు. తాజా లెక్కల ప్రకారం 90శాతం యువతులు ఇప్పటికీ ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. నేషనల్ టెక్నికల్ హెడ్, చీఫ్ పాథాలజిస్ట్ అపోలో డయాగ్నోస్టిక్స్ డాక్టర్ రాజేష్ బెంద్రే ఇటీవల ఈ విషయాన్ని ప్రకటించారు. సమతులం ఆహారం, సప్లిమెంట్లపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ మార్పు రావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాసెస్ చేసిన ఆహారాలపై ఎక్కువగా ఆధారపడటం దీనికి ఒక కారణమన్నారు. ఐరన్తో కూడిన ఆహార వనరులు, ఆహార అవసరాలపై అవగాహన లేకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని డాక్టర్ పేర్కొన్నారు. ఐరన్ లోపం, లక్షణాలు ► ఐరన్ తగ్గితే పెరిగే పిల్లల్లో పెరుగుదల లోపాలు కనిపిస్తాయి. అనీమియా వస్తుంది. ► తలనొప్పి, విపరీతమైన నీరసం, అలసట, ఏకాగ్రత కుదరక పోవడం, నెలసరి క్రమం తప్పడంలాంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా మంది గర్భిణీలు కూడా ఇనుము లోపంతో బాధపడుతున్నారు. ►దాదాపు 50-60 శాతం మంది గర్భిణీ స్త్రీలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ► ఐరన్ లోపం పిండం ఎదుగుదలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రసవ సమయంలో ఏదైనా అనుకోని సమస్యలొస్తే ఇబ్బంది అవుతుంది. ► హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోయి, రక్తహీనత, బలహీనత, శ్వాస ఆడకపోవడం, చర్మం పాలిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి ఐరన్ లోపం అనేది అనేక రోగాలకు పెట్టు. శరీరంలోని అన్ని కణజాలాలకు రక్తం ద్వారా ఆక్సిజన్తో పాటు ఇతర పోషకాలు రక్తం ద్వారా అందుతాయి. ముఖ్యంగా ఎర్ర రక్త కణాలు ఆక్సీజన్ ను రక్తం ద్వారా శరీరానికి అందిస్తాయి. అందుకే ఐరన్ పుష్కలంగా ఉండాలంటే సప్లిమెంట్లతో పాటు, పల్లీలు బెల్లం, బెల్లంతో చేసిన పదార్థాలు, బచ్చలికూర, కొత్తిమీర పప్పులు వంటి ఐరన్-రిచ్ ఫుడ్స్ను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. బచ్చలి కూర బచ్చలి కూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. చిక్కుళ్లు: చిక్కుడు జాతి గింజల్లో బీన్స్, బఠానీల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం మాత్రమే కాదు ఇతర పోషకాలు, ఫైబర్ కూడా అధికం. గుమ్మడి గింజల్లో ఐరన్ మాత్రమే కాదు విటమిన్ కె, జింక్, మాంగనీస్ కూడా ఉంటాయి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్సీని తగ్గిస్తుంది. బ్రకోలి: బ్రకోలిలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఇందులోని విటమిన్ సీ ఐరన్ ఎక్కువ గ్రహించేందుకు సహాయపడుతుంది. కాలీఫ్లవర్, క్యాబెజీ వంటి క్రూసీఫెరస్ కుటుంబానికి చెందిన అన్ని కాయగూరలు మన ఆహారంలో చేర్చుకోవాలి. టోఫూ: సోయా నుంచి తయారు చేసే పన్నీర్ టోఫు. ఇందులో నియాసిన్, సెలీనియం వంటి పోషకాలే కాదు విటమిన్ బి12 కూడా పుష్కలంగా ఉంటుంది ఇంకా. థయామిన్, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం లాంటి పోషకాలు, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. చేపలు: చేపల్లో ఐరన్తోపాటు ఒమెగా 3 ఫాటీ ఆసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు చురుకుగా ఉండేందుకు ,మెరుగైన రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు దోహదపడతాయి. నట్స్ అండ్ ఫ్రూట్స్: బాదం, శనగలు జీడిపప్పు, అలాగే జామ, అరటి పండ్లను తీసుకోవాలి. -
భానుడి భగ భగ: ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
మార్చి మాసం ముగియుకుండానే భానుడి భగ భగలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో మండే ఎండలు, వేడిగాలులు తట్టుకొని నిలబడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే వేసవిలో వడ దెబ్బ ప్రమాదం పెరుగుతుంది. మరి వడదెబ్బ, ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎండలు రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో పిల్లా పెద్దా అంతా అప్రతమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా, నీరు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాదు బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి రక్షణ లేకుండా వెళ్లవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ నీరు తాగాలి. వీటితోపాటు రకరకాల ద్రవపదార్థాలు, పానీయాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యాన్నిచ్చే వివిధరకాల తాజా పండ్ల రసాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పెరుగు, మజ్జిగ, సీజనల్ పండ్లు, ద్రాక్ష, బొప్పాయి వంటివి ఈ సీజన్లో తీసుకోవడం మేలు చేస్తుంది. అతిగా ఆహారం తీసుకోవడం హానికరం. నీటిని ఎక్కువగా వాడాలి.దాహంగా ఉంది కదా అని రసాయన సహిత కూల్ డ్రింక్స్, శుభ్రమైన ఐస్ వాడని డ్రింక్స్, ఐస్క్రీమ్స్ తినకూడదు. ఫాస్ట్ ఫుడ్, బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బులతో బాధపడేవారు, శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఎండలోకి వెళ్లకుండా చూడాలి. తప్పదు అనుకుంటే, ఎండను తట్టుకునేలా తలపై టోపీ లేదా గొడుగు వాడాలి. బార్లీని నీటిలో నాన బెట్టి మరిగించి తయారు చేసిన నీళ్లు తాగితే వడదెబ్బ తగలదు. ఉల్లి పాయ రసం తాగితే వడదెబ్బ తగలకుడా చేస్తుంది. దీనితో పాటు, ఉల్లిపాయ రసాన్ని అరికాళ్ళపై పూయడం కూడా మంచిదే. చెమటలు పట్టేటప్పుడు చల్లటి నీరు ఎక్కువగా తాగడం ప్రమాదకరం. అలాగే ఎండలోంచి లోపలికి వచ్చిన వెంటనే గట గటా చల్లని నీళ్లు తాగకూడదు. ఒకవేళ ఏదైనా అనారోగ్యంగా అనిపించినా, వాంతులు, కళ్లు తిరగడం, తలనొప్పి, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపించినా, వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. తక్షణమే చికిత్స తీసుకోవాలి. -
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ వాటర్ ట్రై చేయండి!
బరువు తగ్గాలనుకునేవారు రకరకాల పద్దతులను ప్రయత్నిస్తూ ఉంటారు. జీవన శైలి మార్పులతోపాటు, కొన్ని ఆహారనియమాలతో అధిక బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. వాటిల్లో ఒకటి ఓక్రా (బెండకాయ లేదా లేడీస్ ఫింగర్ ) వాటర్. పరగడుపున బెండ కాయ నీళ్లు తాగడం వల్ల చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయని పెద్దలు చెబుతారు. బరువు తగ్గడానికి, రక్తపోటు నియంత్రణలో బెండకాయ ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బెండకాయలో కేన్సర్ నిరోధక లక్షణాలున్నాయి. ముఖ్యంగా పేగు కేన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని వినియోగం, సమయం వ్యక్తిగత ప్రాధాన్యతలు, జీవనశైలిపై ఆధారపడి ఉంటుందనేది గమనించాలి. ఓక్రా వాటర్ అంటే ఏమిటి? బెండకాయ కూర, వేపుడు, పులుసు ఇలా రకరకాల వంట గురించి తెలుసు.కానీ చాలామంది ఓక్రా వాటర్, దాని ప్రయోజనాల గురించి పెద్దగా తెలియదు. ఓక్రా నీటిని తయారు చేయడం సులభం. 24 గంటలు లేదా రాత్రిపూట నీటిలో నానబెట్టడం ద్వారా తయారు చేయవచ్చు. శుభ్రంగా కడిగిన నాలుగు బెండకాయలను ముక్కలుగా కోసం రాత్రంతా నీటిలో ఉంచాలి. దీని మొత్తం వల్ల పోషకాలు నీటిలోకి చేరతాయి. ఉదయాన్ని ఈ నీటిని సేవించడం వల్ల లభించే పోషకాలు, విటమిన్లు ఇలా ఉంటాయి. పోషకాలు, విటమిన్లు కేలరీలు: 31 కిలో కేలరీలు ప్రోటీన్: 2 గ్రాములు కొవ్వు: 0.2 గ్రాములు పిండి పదార్థాలు: 7 గ్రాములు ఫైబర్: 3 గ్రాములు మాంగనీస్: రోజువారీ విలువలో 33శాతం (DV) విటమిన్ సి: రోజువారీ విలువలో 24శాతం చర్మ సౌందర్యం చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. విటమిన్ సి, పొటాషియం, ఫోలియేట్ వంటి విటమిన్లు ,యు మినరల్స్తో నిండిన ఓక్రా వాటర్ సహజ చర్మ టానిక్గా పనిచేస్తుంది, ఆరోగ్యకరమైన , ప్రకాశవంతమైన ఛాయను అందిస్తుంది. యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఫ్రీ రాడికల్స్తో పోరాడటానికి సహాయపడుతుంది. అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. ముఖ్యంగా, ఓక్రాలో ముఖ్యంగా మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది, రక్తంలో చక్కెర నియంత్రణకు ఇది కీలకమైన ఖనిజం. అదనంగా, ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది యాంటీఆక్సిడెంట్గా పనిచేస్తుంది , రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. స్త్రీ,పురుషుల్లో లిబిడో(శృంగారేచ్ఛ)ను పెంచడంలో దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని నమ్ముతారు. -
బీట్రూట్- మిల్క్ ప్యాక్: మచ్చలు మాయం, గ్లోయింగ్ స్కిన్
ఎండాకాలంలో ముఖం, చర్మం సూర్యరశ్మికి గురికావడం వల్ల చాలా సమస్యలొస్తాయి.మొటిమలు ఎక్కువగా వస్తాయి. చర్మం నల్లబడుతుంది. సూర్యరశ్మికి ఎక్కువగా తిరగడం వల్ల చర్మ రంగు మారుతుంది. ఈ సమస్యని దూరం చేయాలంటే బీట్రూట్ క్రీమ్, ప్యాక్ హెల్ప్ చాలా సహాయ పడుతుంది. బీట్ రూట్ క్రీమ్ తొక్కతీసిన అరకప్పు బీట్రూట్ ముక్కలను గిన్నెలో వేసి అరగ్లాసు నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆపేసి బీట్రూట్ ముక్కల్లో టీస్పూను సోంపు వేసి పది నిమిషాలు నానబెట్టాలి. పది నిమిషాల తరువాత బీట్రూట్ ముక్కల్లో ఉన్న నీటిని వడగట్టి తీసుకోవాలి. ఈ నీటిలో టీస్పూను రోజ్ వాటర్, రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి. వారం రోజులపాటు నిల్వ ఉండే ఈ క్రీమ్ను రోజూ ఉదయం పూట రాసుకుంటే.. ముఖం మీద మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పట్టి ప్రకాశవంతముగా కనిపిస్తుంది. బీట్రూట్ ఫేస్ ప్యాక్ స్కిన్ ప్రాబ్లమ్స్ని దూరం చేసి చర్మ రంగుని మెరుగ్గా చేస్తుంది. బీట్రూట్ తొక్క తీసేసి ముక్కలుగా కోయాలి. ఈ ముక్కలకు పాలు కలిపి గ్రైండ్ చేయాలి. దీనిని ముఖానికి ప్యాక్లా అప్లయ్ చేయాలి. అలా మెడమీద కూడా రాసుకోవాలి. 15 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తే ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ దూరమవుతాయి. మురికిని దూరం చేసి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. పాలు కలుపుతాం కాబట్టి, చర్మం మృదువుగా, మెరుస్తుంటుంది. చర్మ సమస్యల్ని దూరం చేసి టోన్ చేయడంలో బీట్రూట్ హెల్ప్ చేస్తుంది. బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే బీట్రూట్లో నేచురల్ కలర్ ఉంటుంది. ఇందులోని బీటా లైన్ ఫెయిర్ స్కిన్టోన్ని అందిస్తుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి చర్మంలోని సమస్యల్ని దూరం చేసి ముడతలు పడకుండా చేస్తుంది. -
విటమిన్ ‘ఏ’ లోపిస్తే ...అంత ప్రమాదమా..!
ఆరోగ్యంగా జీవించాలంటే విటమిన్లు, పోషకాలు చాలా అవసరం. శరీరంలోని అనేక ప్రక్రియలకు విటమిన్ ‘ఏ’ చాలా అవసరం. రెటినోల్, రెటీనా రెటినోయిక్ యాసిడ్ సమ్మేళనం ఈ విటమిన్. అందుకే దీన్ని రెటినోల్ అని కూడా పిలుస్తారు. ఇది కొవ్వులో కరిగే పోషకం. మాంసం, చికెన్, చేపలు , పాలు, ఇతర మాంసాహారంలో ఇది లభిస్తుంది. ఏ విటమిన్ తో వచ్చే లాభాలు, లోపిస్తే నష్టాలు గురించి తెలుసుకుందాం. కెరోటినాయిడ్స్, ఆల్ఫా-కెరోటిన్, బీటా-కెరోటిన్ , బీటా-క్రిప్టోక్సంతిన్ విటమిన్ ఏలో పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక శక్తి, సంతానోత్పత్తి, చక్కటి దృష్టికి ఇవి చాలా కీలకం అంతేకాదు చర్మ ఆరోగ్యాన్ని కూడా ఇది మెరుగుపరుస్తుంది. నిపుణుల అభిప్రాయ ప్రకారం ఏ మిటమిన్ లోపిస్తే శరీర పనితీరు దెబ్బతినడమే కాదు, అంధత్వం నుండి వంధ్యత్వం వరకు చాలా సమస్యలు పొంచి ఉన్నాయి. ఊపిరితిత్తులు, కణజాలాలు, చర్మం, గుండె, రోగనిరోధక వ్యవస్థ సమస్యలకు కూడా దారితీస్తుంది ఇక కాలేయ రుగ్మతలు, అవసరమైన విటమిన్లను గ్రహించే శరీర సామర్థ్యాన్ని దెబ్బతీసే పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. విటమిన్ ‘ఎ’ లోపిస్తే మొటిమలు పొడి చర్మం, కళ్ళు పొడిబారడం వంధ్యత్వం, గర్భ ధారణలో సమస్యలు గొంతు, ఛాతీ ఇన్ఫెక్షన్లు లాభాలు రేచీకటి, వయసు సంబంధిత సమస్యలనుంచి రక్షిస్తుంది. కొన్ని రకాల కేన్సర్ల బారిన పడకుండా కాపాడుతుంది. మొటిమలు, నల్లటి మచ్చలు రాకుండా చూస్తుంది. ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డీతో పాటు, ఎముకల పెరుగుదలకు విటమిన్ ఏ కూడా చాలా అవసరం. ఎముకల బలానికి విటమిన్ఏ కూడా చాలా అవసరం. నోట్: విటమిన్ ఏ ఎక్కువైనా కూడా చాలా ప్రమాదం. విటమిన్ ఏ ఎక్కువైతే హైపర్ విటమినోసిస్ A కి దారి తీస్తుంది. సప్లిమెంట్లతో పోలిస్తే విటమిన్ ఏ సహజంగా లభించే ఆహారాలు (పాలు,గుడ్డు, కేరట్, చేపలు లాంటివి) మేలు. ఏదైనా వైద్యుల పర్యవేక్షణ అవసరం. -
వేసవి కాలంలో చలవ చేయాలంటే ఈ పప్పులు ఉత్తమం
ఎండలు ముదురుతున్నాయి. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు చెమటలు విసిగిస్తాయి. దీంతో శ్రద్ధగా వంట చేయాలంటే చాలా కష్టం. ఎంత తొందరగా పని ముగించుకుని వంటింట్లోంచి బైటపడదామా అని పిస్తుంది. అందుకే దీని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే చమటరూపంలో ఎక్కువ నీరు పోవడం వల్ల, దాహంఎక్కువ కావడం వల్ల, శరీరం తొందరగా వేడెక్కుతుంది. మరి శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచడంతోపాటు పోషకాలు అందించే కొన్ని పప్పులు గురించి తెలుసుకుందామా! వేసవి కాలంలో మనం తీసుకునే ఆహారం పై కూడా శ్రద్ధ పెట్టాలి. పెసరపప్పు, శనగ పప్పు, మినపప్పు, సోయా, బఠానీ లాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. పెసరపప్పు మిగిలిన అన్ని పప్పులతో పోలిస్తే కొద్దిగా భిన్నంగా ఉంటుది. ఎక్కువ చలవ చేస్తుంది. పెసరపప్పు: వేసవికాలంలో ముందుగా గుర్తొచ్చేది పెసరప్పు చేసుకొనే పెసరకట్టు. తేలిగ్గా జీర్ణం అయ్యేలా.. అల్లం, పచ్చిమర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలతో.. కమ్మ కమ్మగా ఉండేలా దీన్ని చేసుకోవచ్చు. అలాగే పెసర పప్పు-మెంతికూర, బీరకాయ-పెసరపప్పు, పొట్లకాయ-పెసరపప్పు ఇలా రకరకాల కాంబినేషన్స్లో దీన్ని తీసుకోవచ్చు. ఈ పప్పులో ప్రోటీన్, విటమిన్ ఎ, బి, సి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం లభిస్తాయి. ఫైబర్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.అలాగే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. కాయధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వేసవిలో పెసరపప్పు చలవచేస్తుందని గర్భధారణ సమయంలో కూడా దీన్ని భేషుగ్గా తినవచ్చని ఆహార నిపుణులు చెబుతారు.. మినపప్పు: ఇది వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. విటమిన్లు, మినరల్స్ ,ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మంచి ఐరన్ లభిస్తుంది. కడుపు, చర్మానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పోపులు, పచ్చళ్లలో వాడటంతోపాటు, ఇడ్లీ, దోస, వడ లాంటి వంటకాలను తయారు చేసుకోవచ్చు. సోయాబీన్: వేసవిలో సోయాబీన్ పప్పు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా స్థిరంగా ఉంటుంది. ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, శక్తి, కాల్షియం, పొటాషియం అందుతాయి. మినపప్పు ఆహారంలో చేర్చుకుంటే రక్తపోటు ,కొలెస్ట్రాల్ను కూడా నియంత్రిస్తుంది. ఎముకలు ధృఢంగా ఉంటాయి. శనగ పప్పు: ఇదిజీర్ణం కావడం కష్టమని, శరీరంలో వేడి పెంచుతుందని వేసవిలో చాలా మంది దీన్ని తినరు. కానీ వేసవిలో ఈ పప్పు తింటే మేలు జరుగుతుంది. ఫైబర్, ఐరన్, మెగ్నీషియం , కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల వేసవిలో కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. నానపెట్టిన శనగలని అల్పాహారంగా చేసి పిల్లలకి పెడితే చాలా మంచిది. అయితే తిన్న తర్వాత ఎక్కువ నీరు త్రాగాలి. నోట్. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్టు పప్పుల్లో కూడా కల్లీ ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కల్తీని జాగ్రత్తగా గమనిస్తూ శ్రేష్ఠమైన పప్పులను ఎంచుకోవాలి. -
కెమికల్ స్ట్రెయిట్నెర్లతో పనిలేకుండానే.. మీ జుట్టు హెల్దీగా, షైనీగా!
ఆధునిక కాలంలో స్టయిలింగ్కు, సౌందర్యానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పండగొచ్చినా, ఫంక్షనొచ్చినా బ్యుటీషియన్లకోసం పరుగులు పెడతారు చాలామంది. ముఖ్యంగా గజిబిజిగా ఉన్న జుట్టును, షైనీగా, స్ట్రెయిట్గా చేసుకోవడంపెద్ద టాస్క్. హీట్ లేదా కెమికల్ స్ట్రెయిట్నెర్లను ఉపయోగించకుండా స్ట్రెయిట్నింగ్ కోసం ఇవిగో టిప్స్ . బ్లో డ్రైయర్, హీట్ స్టైలింగ్ టూల్స్, కెమికల్ ట్రీట్మెంట్లు మన కేశాలను డ్యామేజ్ చేస్తాయి. అందుకే సహజ పద్ధతుల ద్వారా జుట్టును స్ట్రెయిట్ చేసుకోవచ్చు. స్ట్రెయిట్నర్ ద్వారా పదే పదే జుట్టును వేడికి గురి చేస్తే తొందరగా ఊడిపోతుంది. సహజమైన షైనింగ్ను కోల్పోయి పొడి బారుతుంది. అందుకే జుట్టును సహజంగా స్ట్రెయిట్ చేసే పద్ధతులు చూద్దాం. జెంటిల్ క్లెన్సింగ్: రాత్రి పూటే సహజమైన నూనెను జుట్టంతా పట్టించి, ఉదయాన్నే రసాయనాలు లేని షాంపూతో స్నానం చేసి వెంట్రుకలను మృదువుగా ఉంందుకు తేలికపాటి కండీషనర్ని వాడాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే జుట్టుగా మృదువుగా మెరుస్తూ చెప్పినట్టు వింటుంది. జుట్టు తడిగా ఉన్నపుడే పళ్లు వెడల్పుగా ఉండే దంతాల దువ్వెనతో సుత్తిమెత్తగా దువ్వుతూ చిక్కు తీయాలి. సహజంగా గాలికి ఆరనివ్వండి. లేదంటే ఫ్యాన్ ముందు మెల్లిగా దువ్వుతూ, బ్రషింగ్ చేసినా పరవాలేదు. చివర్ల నుండి ప్రారంభించి మూలాల వరకు దువ్వాలి. దీంతో జుట్టు ఎక్కువగా రాలదు. స్ట్రయిట్గా వస్తుంది. అలాగే జుట్టుకు కొద్దిగా స్మూతింగ్ సీరమ్ అప్లై చేయండి. లేదంటే కొద్దిగా ఆర్గాన్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా సిలికాన్ వంటి పదార్థాలనూ వాడవచ్చు. పాలు , తేనె: పాలలో ప్రొటీన్లు ఉంటాయి, ఇవి జుట్టును బలోపేతం చేయడంతోపాటు చివర్లు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. తేనెలో తేమను కాసాడే సహజమైన హ్యూమెక్టెంట్ ఉంటుంది. ఒక కప్పు పాలలో రెండు టేబుల్ స్పూన్ల తేనె బాగా కలిసే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు మొదళ్ల నుండి చివరి వరకు బాగా పట్టించాలి. దీన్ని 1-2 గంటలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో జుట్టును వాష్ చేసుకోవాలి. రోలర్ దువ్వెనతో మంచిగా దువ్వు కోవాలి. దీంతో జుట్టు మెత్తగా షైనింగ్గా ఉంటుంది. అరటి-ఆలివ్ ఆయిల్ మాస్క్: అరటిపండులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.ఆలివ్ ఆయిల్ తేమను అందిస్తుంది. అరటిపండులో, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెతో మెత్తగా ఉండలు లేకుండా గుజ్జుగా చేసుకోవాలి. దీన్ని జుట్టుకు బాగా పట్టించాలి. అనంతరం జుట్టును షవర్ క్యాప్తో కప్పి 30 నుంచి 60 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆపై షాంపూతో వాష్ చేసి, కండీషనర్ అప్లయ్ చేయాలి. స్ట్రయిట్గా సిల్కీగా జుట్టు మెరిసిపోతుంది. గుడ్డు- ఆలివ్ ఆయిల్ మాస్క్: గుడ్లలో ప్రోటీన్లు ,పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ జుట్టుకు తేమను అందిస్తుంది. ఒకటి లేదా రెండు గుడ్లను (వాసన పడని వారు పచ్చసొనను తీసివేయాలి) కొట్టి, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట, లేదా గంటసేపు మాస్క్ వేసి ఉంచుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మీరు నమ్మలేనంత మృదువుగా వెంట్రుకలు తయారవుతాయి. అలోవెరా జెల్ మాస్క్: సౌందర్య పోషణలో అలోవెరాకున్న ప్రాముఖ్యతే వేరు. అలోవెరా జెల్ జుట్టును స్ట్రెయిట్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సహజమైన జెల్ను తీసి జుట్టుకు అప్లై చేసి, 30-60 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఆ తరువాత కండిషనర్ తప్పకుండా అప్లయ్ చేయాలి. -
కూల్ డ్రింక్స్ అతిగా సేవిస్తే.. ఎంత ముప్పో తెలుసా? చివరికి...!
నేటి కాలంలో సీజన్తో సంబంధం లేకుండా కూల్డ్రింక్స్ ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఇక వేసవిలో అయితే కూల్ డ్రింక్స్ వినియోగం గురించి చెప్ప నక్కర లేదు. క్షణం కూడా ఆలోచించకుండా పసిపిల్లలకు కూడా తాగిస్తున్నారు. తాగిన ఆ కాసేపు రుచిగా, హాయిగా అనిపించినా, శీతల పానీయాల వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలున్నాయో తెలిస్తే షాకవుతారు. అతిగా కూల్డ్రింక్స్ తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి నిపుణుల హెచ్చరికల్ని ఒకసారి గమనించండి! నలుగురు కలిసిన చోట, పార్టీల్లోనూ, శుభకార్యాల్లోనూ కూల్డ్రింక్స్ ఒక స్టేటస్గా సింబల్గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. చివరకు ఇది ఒక అలవాటుగా మారిపోయి ఫ్రిజ్లలో స్టోర్ చేసుకొని మరీ లాగించేస్తున్నారు. కొందరైతే కూల్ డ్రింక్ తాగితే తప్ప తిన్నది అరగడం లేదు అనే స్థాయికి వచ్చేశారు. ఆరోగ్యనిపుణుల అభిప్రాయం ప్రకారం శీతల పానీయాలు జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కడుపు సమస్యలు తలెత్తుతాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది అజీర్ణం, వాంతులు ..ఇలా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అధిక బరువు: శీతల పానీయాలు, సోడాల్లో వినియోగించే శుద్ధిచేసిన చక్కెర (ఒక్కో బాటిల్లో దాదాపు 10 టీ స్పూన్ల వరకు) అధికంగా ఉంటుంది. కేలరీలు, కెఫిన్ మోతాదు కూడా ఎక్కువే. వీటి ద్వారా పెద్ద మొత్తంలో ఫ్రక్టోజ్ తీసుకోవడంతో లెప్టిన్ హార్మోన్ ప్రభావితమవుతుంది. తద్వారా వేగంగా బరువు పెరుగుతారు. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు మూలం. డయాబెటిక్: రక్తపోటు ముప్పు పెరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఇది మరింత ప్రమాదాన్ని చేకూరుస్తుంది. శీతల పానీయాలలో ఉండే ఫ్రక్టోజ్, రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే ప్రధాన కార్బోహైడ్రేట్ అని గుర్తించాలి. ఫ్యాటీ లీవర్: శుద్ధి చేసిన చక్కెరలో ఉండే ప్రధానమైనవి. గ్లూకోజ్ ఫ్రక్టోజ్. శరీర కణాలు గ్లూకోజ్ను సులభంగా జీర్ణం చేస్తాయి. కానీ ఫ్రక్టోజ్ను అరిగించే పని మాత్రం కాలేయానిదే. కూల్ డ్రింక్స్ఎక్కువైతే ఫ్రక్టోజ్ ఓవర్లోడ్కు దారితీస్తుంది. కాలేయం ఈ ఫ్రక్టోజ్ను కొవ్వుగా మారుస్తుంది. దీంతో లీవర్ సమస్యలొస్తాయి. గుండె, కీళ్ల, సమస్యలు: శీతల పానీయాలు ఎక్కువైతే గుండె ఆరోగ్యంపై ప్రభావితమవుతుంది. అలాగే వీటిల్లోని మితిమీరిన కెఫిన్ నరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ అధికమై గౌట్ , కీళ్లలో వాపు లేదా నొప్పి వస్తాయి. ఇది నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుంది. పంటి సమస్యలు: సోడాల్లో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ దీర్ఘకాలంలో పంటి ఎనామిల్ను దెబ్బతీస్తాయి. ఇవి చక్కెరతో కలిపినప్పుడు, ఈ ఆమ్లాలు నోటిలో బ్యాక్టీరియాకి కారణమవుతాయి. వారానికి రెండు లేదా అంతకంటే ఎక్కువ శీతల పానీయాలు తాగే వ్యక్తుల్లో ప్యాంక్రియాటిక్ కేన్సర్ వచ్చే ప్రమాదం దాదాపు రెండు రెట్టు పెరుగుతుంది. రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో ఎండోమెట్రియల్ కేన్సర్ వచ్చే ప్రమాదం. శీతల పానీయాలు క్రమం తప్పకుండా తాగే వ్యక్తుల జ్ఞాపకశక్తి ప్రభావితమవుతుందని నిపుణులు చెబుతున్నారు. మానవశరీరంపై చాలా హానికరమైన ప్రభావాన్ని చూపే శీతల పానీయాలకు బానిసలైన వారు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలికి అలవాటు పడాలి. -
కామెర్ల వ్యాధి రకాలు: లివర్ని కాపాడే బెస్ట్ ఫుడ్ ఇదిగో!
మన బాడీలో పవర్ హౌస్ లివర్. లివర్ పనితీరు దెబ్బ తింటే అనే అనారోగ్యాల బారిన పడతాం. కాలేయం దెబ్బతింటే వచ్చే కామెర్ల వ్యాధి నాలుగు రకాలుగా ఉంటుంది. రక్త పరీక్ష ద్వారా మాత్రం ఈ వ్యాధిని నిర్ణయిస్తారు. వ్యాధి నిర్దారణ ఆధారంగా చికిత్స ఉంటుంది. ప్రీహెపాటిక్: రక్తంలో బిలిరుబిన్ స్థాయి పెరిగితే, దానిని ప్రీహెపాటిక్ కామెర్లు అంటారు. హెపాటిక్ : కాలేయం బిలిరుబిన్ను ఉత్పత్తి చేయలేకపోతే దానిని హెపాటిక్ కామెర్లు అంటారు. పోస్ట్థెపాటిక్: బిలిరుబిన్ పేరుకుపోవడం, శరీరం తొలగించలేకపోవడాన్ని పోస్ట్థెపాటిక్ కామెర్లు అంటారు. అబ్స్ట్రక్టివ్:.పాంక్రియాటిక్ వాహిక మూసుకుపోయినపుడు వచ్చిన కామెర్లను అబ్స్ట్రక్టివ్ కామెర్లుగా పిలుస్తారు. నవజాత శిశువులు కూడా జాండిస్ బారిన పడతారు. దీనికి ‘ఫోటోథెరపీ’ ట్రీట్మెంట్ ద్వారా నయం చేస్తారు లివర్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు లివర్ ఆరోగ్యాన్ని సరైన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రందించాలి. టీ: బ్లాక్ టీ, గ్రీన్ టీ తీసుకుంటే మంచిది. ముఖ్యంగా గ్రీన్ టీని తీసుకోవడం వల్ల లివర్కి బాగా హెల్ప్ అవుతుంది. అలానే ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గిస్తుంది లివర్ ఫ్యాట్ కూడా కరుగుతుంది. రోజూ ఒక కప్పు కాఫీ తీసుకున్నా మంచిదే. టోఫు : సోయాతో తయాయ్యే టోఫు కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సోయా బీన్స్తో సొయా నట్స్ వంటివి కూడా తీసుకోవచ్చు. పండ్లు : ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ ఆరెంజ్, ద్రాక్ష వంటివి తీసుకుంటే లివర్ ఆరోగ్యం బాగుంటుంది. లివర్లో కొవ్వు పేరుకుపోకుండా విటమిన్ సి హెల్ప్ చేస్తుంది. క్రాన్బెర్రీ, బ్లూబెర్రీ వంటివి కూడా తీసుకోవచ్చు. ఓట్స్ , నట్స్: యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.ఇంకా బీన్స్, గింజలు వంటివి కూడా తీసుకో వచ్చు. విటమిన్-ఇ సమృద్ధిగా నట్స్తో ఇంఫ్లమేషన్ తగ్గుతుంది. కూరగాయలు : బ్రోకలీ, కాలీఫ్లవర్, పాలకూర కూరలతో లివర్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ముఖ్యంగా నాన్-ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య నుండి కూడా బయట పడొచ్చు. పాలకూర వంటి వాటిలో గ్లూటాతియోన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నోట్: లక్షణాలు చూసి బయపడిపోకుండా, వైద్యులను సంప్రదించి, రక్త, మూత్రం, తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షల ఆధారంగా చికిత్స తీసుకోవాలి. సమతులం ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, మద్య పానం, ధూమపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. -
డైరెక్టర్ని పొట్టన పెట్టుకున్న జాండిస్? ఎందుకు వస్తుంది? లక్షణాలు
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ అకాలమరణం విషాదాన్ని నింపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన పచ్చకామెర్లు వ్యాధితో చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వ్యాధి ఎలా వస్తుంది. లక్షణాలు ఏంటి? ఇది ప్రాణాంతకమేనా తదితర వివరాలను తెలుసుకుందాం. పచ్చకామెర్లు సరైన సమయంలో చికిత్స తీసుకోనట్టయితే ఇది కూడా ప్రాణాంతక వ్యాధి. తొలి దశలోనే గుర్తించక పోతే నష్టం తీవ్రంగా ఉంటుంది. మన శరీరంలోని లివర్ లేదా కాలేయం చాలా పనులను నిర్వరిస్తుంది. వైరస్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఆల్కహాల్ లేదా మాదకద్రవ్యాల వినియోగం, తదితర కారణాల చేత కాలేయం సరిగ్గా పని చేయనప్పుడు జాండిస్ వ్యాధి వస్తుంది. ఎసిటమైనోఫెన్, పెన్సిలిన్, గర్భనిరోధక మాత్రలు , స్టెరాయిడ్స్ వంటి మందులు కూడా కాలేయ వ్యాధికి కారణం కావచ్చు. ఈ కామెర్లు నవజాత శిశువులు మొదలు ఎవరికైనా రావచ్చు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుంది. కామెర్లలో నాలుగు రకాలు ఉన్నాయి. ప్రధానంగా రక్తంలోని బిలిరుబిన్ను ఉత్పత్తి పెరిగిపోతోంది. ఫలితంగా కళ్లు, గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి. లక్షణాలు ♦ బరువు తగ్గడం, ఆకలి తగ్గుతుంది. మత్తుగా ఉండటం, ♦ శరీరం పసుపు పచ్చ కలర్లోకి మారిపోతుంది. కళ్ళు , మూత్రం కూడా పసుపు రంగులోకి మారతాయి. ♦ కడుపులో మంట ,కడుపు నొప్పి ♦ ముఖ్యంగా పక్కటెముకల దిగువ భాగంలో బాగా నొప్పి , వికారం వాంతి వచ్చినట్టు ఉంటుంది. ♦ చలి, జ్వరం ♦ రక్తపు వాంతులు మద్యపానం, ఇతర కారణలు కొన్ని ఇతర కారణాలతోపాటు అతిగా మద్యం సేవించే వారిలో కాలేయం దెబ్బతినే అవకాశాలు చాలా ఉన్నాయి. పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు కూడా కామెర్లు వచ్చేందుకు దారి తీస్తాయి. కాలేయం నుంచి పేగుల్లోకి పైత్య రసాన్ని తీసుకుని వెళ్లే కాలేయ వాహికలో రాళ్లు, నిర్మాణపరమైన లోపాలు, కేన్సర్ సోకినా కామెర్లకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు కామెర్ల వ్యాధిని నిర్లక్ష్యంచేస్తే రక్తపు వాంతులతోపాటు, రోగి కోమాలోకి వెళ్లి చనిపోయేప్రమాదం కూడా ఉంది. అందుకే అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం నోట్: సమతుల ఆహారాన్ని తీసుకుంటూ, మద్యపానం, ధూమపానం, గుట్కా లాంటి చెడు అటవాట్లకు దూరంగా ఉండాలి. ఆరోగ్య పరిస్థితిని, లక్షణాలను ఎప్పటికపుడు గమనించుకుంటూ ఉండాలి. వ్యాయామం, మెడిటేషన్ వంటి వాటికి సమయంకేటాయించాలి. ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తితే నిర్లక్ష్యం చేయకుండా, సమస్య ఏదైనా వైద్యుల ద్వారా నిర్ధరించుకుని సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. -
చిట్టి..చిట్టి మినప వడియాలు.. ఎన్ని లాభాలో..!
వేసవి కాలం వచ్చిందంటే వడియాలు, అప్పడాలు, ఆవకాయ తదితర పచ్చళ్ళ సందడి షురూ అవుతుంది. వీటిని సంవత్సరం మొత్తానికి సరిపోయేలా తయారు చేసుకోవడంలో గృహిణులు చాలా బిజీగా ఉంటారు. ముఖ్యంగా గుమ్మడి వడియాలు పిండి వడియాలు, మినప,పెసర వడియాలు, సగ్గుబియ్యం వడియాలు ఇలా ఈ జాబితాలో చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతి సులువుగా తయారు చేసుకునే చిట్టి మినప వడియాలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..! చిట్టి చిట్టి మినప వడియాలు తయారీకి కావాల్సినవి అరకిలో మినపప్పు (తొక్కతో ఉన్నదైతే వడియాలు గుల్లగా వస్తాయి) పచ్చిమిరపకాయలు బాగా కారం ఉండేవి 10 కొద్దిగా ఉప్పు, జీలకర్ర, కొద్దిగా అల్లం తయారీ ముందు రోజు రాత్రి నాన బెట్టి ఉంచుకున్న మినప పప్పును శుభ్రంగా కడిగి గ్రౌండర్లోగానీ, రోటిలోగానీ మెత్తగా రుబ్బు కోవాలి. ఎక్కువ జారుగా కాకుండా, గట్టి ఉండేలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఇందులో ఉప్పు, అల్లం, పచ్చిమిర్చి కారం కలిపిన తరువాత మరింత జారుగా అయిపోతుంది పిండి. ఇలా మెత్తగా రుబ్బి పెట్టుకున్న పిండిలో ముందుగానే దంచి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి కారం కలుపుకోవాలి. ఆ తరువాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి(ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు) బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని శుభ్రమైన తడి గుడ్డపై గానీ, ప్లాస్టిక్ కవరైగానీ వేసుకుని ఎండబెట్టుకోవాలి. చక్కగా గల గల మనేలా డేలా ఎర్రటి ఎండలో రెండు మూడు రోజులు ఉంచాలి. వీటిని గుడ్డనుంచి తీసిన తరువాత ఒక బేసిన్లో వేసుకుని మరోసారి ఎండలో పెట్టాలి. పచ్చి లేకుండా బాగా ఎండాయో లేదో చెక్ చేసుకొని వీటిని తడిలేని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ చిట్టి వడియాలు కూరగాయల ధరలు మండిపోతున్న సమయంలో బాగా ఉపయోగపడతాయి. ఉల్లిపాయలతో కలిపి ఇగురు కూరలా చేసుకోవచ్చు. చాలా కూరగాయలతో కలిపి వండుకోవచ్చు. పులుసు కూరల్లో వాడుకోవచ్చు. సైడ్ డిష్గా కూడా భలే ఉంటాయి. మినప పప్పులో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. దీంతో పిల్లలకు, పెద్దవాళ్లతోపాటు అందరికీ మంచిది. మినప పప్పు లోని ఫోలిక్ యాసిడ్ శరీరంలో కొత్త కణాలను, ముఖ్యంగా ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కి సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా వుంటుంది కనుక గుండె ఆరోగ్యానికి మంచిది -
వీకెండ్ స్పెషల్: ఈ టిప్స్ ఎపుడైనా ట్రై చేశారా..?
వీకెండ్ వచ్చిందంటే లేట్గా నిద్ర లేవడం, లేజీగా ఉండటం, ఎక్కువ ఫుడ్ లాగించేయడంకాకుండా, రోజంతా సరదాగా సంతోషంగా గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. స్నేహితులు, సన్నిహితులతో ఉత్సాహంగా గడపాలి. దీంతో రాబోయే వారమంతా చురుగ్గా ఉండే శక్తి వస్తుంది. పచ్చని ప్రకృతిలో ఎంజాయ్ చేయాలి. కాలుష్యానికి తావులేని పార్క్లకు వెళితే, మంచి ఆక్సిజన్ లభిస్తుంది. మన చుట్టుపక్కల చిన్నపిల్లలతో గడిపినా, కలిసి పెయింటింగ్ వేసినా, ఆటలాడినా భలే ఉత్సాహం వస్తుంది. అలాగే రాబోయే వారమంతా యాక్టివ్గా ఉండేలా కొన్ని ఆరోగ్య చిట్కాలు ఇవిగో.. ♦ వేసవి కాలం వచ్చేసింది.. ఫ్రిజ్ నీరు కంటే కుండ వాటర్ బెటర్. మరీ ఎక్కువ చల్లని పదార్థాలు, డ్రింక్స్కు దూరంగా ఉండాలి. ♦ పిల్లలకు ఇంట్లో తయారు చేసిన ఐస్ క్రీ పెడితేమంచిది. ఎక్కువ నీళ్లు తాగేలా జాగ్రత్త పడాలి. ♦ నడక, యోగా లాంటి వ్యాయామాలు, అలాగే బ్మాడ్మింటన్ లాంటి ఔటర్ గేమ్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. ♦ రోజూ నిద్రపోయే ముందు నానబెట్టిన బాదం, డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటే ఆరోగ్యకరమైన కొవ్వులు ,ఇతర పోషకాలు లభిస్తాయి. డ్రై ఫ్రూట్స్లో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ , డైటరీ ఫైబర్ కూడా అధికం. ♦ కొన్ని ఎండు ద్రాక్ష కొన్ని ధనియాలు నీరు పోసి మరిగించి చల్లార్చి ఆ కషాయాన్ని ఉదయం, సాయంకాలం తాగాలి. కీళ్ల వాపులు తగ్గి పోతాయి. ♦ రొటీన్కి టీ కి బదులుగా అల్లం టీ తాగితే మంచి ఉత్సాహం వస్తుంది. అలాగే దంత సమస్యలు ఉన్నవారు.. నోటి దుర్వాసనతో బాధపడుతున్న వారు.. అల్లాన్ని ఎండబెట్టి పొడి చేసి దాంట్లో కాస్త నీరు కలిపి పేస్ట్లా చేసి దానితో పళ్లు తోముకుంటే చిగుళ్లు, దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. ♦ సీజనల్ వ్యాధులను తగ్గించడంలో అల్లం బాగా పనిచేస్తుంది. కాస్త అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని పూటకు ఒక కప్పు మోతాదులో తాగుతుంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. ♦ అల్లం , కీరా, నిమ్మకాయ రసం కలిపిన మిశ్రమాన్ని ప్రతి రోజు ఉదయం పూట తాగాలి. నొప్పులు, వాపులు తగ్గి పోతాయి. -
ఈస్ట్రోజెన్ - అద్భుతమైన ఫుడ్స్ : ఈ డేంజర్ కూడా ఉంది!
#EstrogenandFood ఈస్ట్రోజెన్ మన శరీర పనితీరులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలోని జీవ క్రియలకు ఈస్ట్రోజన్ చాలా అవసరం. క్లీవ్ల్యాండ్ క్లినిక్ ప్రకారం ఈస్ట్రోజన్ మహిళలలో నెలసరి, పునరుత్పత్తి వ్యవస్థ, లైంగిక కోరికను ప్రభావితం చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, కొల్లాజెన్ ఉత్పత్తిలో, ఎముకలు, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ సాయ పడుతుంది. జీవితకాలంలో ఈస్ట్రోజెన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు సాధారణం అయితే, ఈ స్థాయిల్లో తీవ్ర అసమతుల్యత వస్తే మొత్తం ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితంచేస్తుంది. శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గితే నెలసరి క్రమం తప్పడం, వివాహిత మహిళల్లో గర్భాధారణ లాంటి సమస్యలొస్తాయని క్లీవ్ల్యాండ్ క్లినిక్ హెచ్చరించింది. ఈస్ట్రోజెన్ తగ్గితే ఏమవుతుంది. శరీరంలో తగినంత ఈస్ట్రోజెన్ లేకపోతేచాలా సమస్యలొస్తాయి. అలాగే మెనోపాజ్ సమయంలో , అండాశయాల శస్త్రచికిత్స తొలగింపు తర్వాత ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గి పోతుందని ఎండోక్రైన్ సొసైటీ తెలిపింది. వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు, యోని పొడిబారడం, నిద్రలేమి , మైగ్రేన్ లాంటి సమస్యలు ఈస్ట్రోజెన్ తగ్గిందనడానికి సంకేతం. దీనికి సాధారణంగా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకోవచ్చు. అయితే దీన్ని దీర్ఘకాలంకొనసాగించలేం. అందుకే ఈస్ట్రోజెన్ అధికంగా ఉండే ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల సహజంగా ఈ స్థాయిలను పెంచుకోవచ్చు. ఈస్ట్రోజెన్ లభించే ఆహారాలు ► పాలు, గుడ్లు వంటి జంతు ఆధారిత ఉత్పత్తులు మన ఆహారంలో చేర్చుకుంటే ఈస్ట్రోజెన్ ఉత్పత్తి పెరుగుతంది. అయితే ఈ ఆహారాలను మితంగా తీసుకోవడం మంచిది. ► అవిసె గింజలు , గోధుమ గింజలు, సోయాబీన్స్ ఉత్పత్తులు తీసుకోవాలి. ► ఖర్జూరం, ప్రూనే, ఆప్రికాట్లు వంటి డ్రై ఫ్రూట్స్లో ఫైటోఈస్ట్రోజెన్లు పుష్కలంగా ఉంటాయి. ► ఈస్ట్రోజెన్-రిచ్ ఫుడ్స్ కోసం చూస్తున్నట్లయితే నువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి. ఇతర ముఖ్యమైన పోషకాలతో పాటు ఫైటోఈస్ట్రోజెన్లలో కూడా లభ్యం.5 ఈస్ట్రోజెన్ లోపం కారణంగా ఎముకల సమస్యలతో బాధపడేవారికి వెల్లుల్లి బెస్ట్. ►బ్రోకలీ , క్యాబేజీ, బచ్చలికూర వంటి ఆకులు మందంగా ఉండే ముదురు రంగు ఆకుకూరలు ►ప్రముఖ డైటీషియన్ డానా కాన్లీ ప్రకారం ఒమేగా-త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభించే అవిసె గింజల్లో అత్యధిక ఫైటోఈస్ట్రోజెన్ కంటెంట్ ఉంది. ►రాస్ బెర్రీస్, క్రాన్ బెర్రీస్, స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లతోపాటు, ఫైటోఈస్ట్రోజెన్లు కూడా ఉన్నాయి. నోట్: ఈస్ట్రోజెన్ లభించే ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఫార్మకాలజీ 2017 అధ్యయనం ప్రకారం ఈస్ట్రోజెన్ను ఎండోక్రైన్ డిస్రప్టర్గా పరిగణిస్తారు. ఈ ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల వంధ్యత్వం ఈస్ట్రోజెన్-సెన్సిటివ్ అవయవాలలో కేన్సర్ ముఖ్యంగా రొమ్ము , గర్బాశయ, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. -
ఉల్లితో కలిగే ప్రయోజనాలు..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని చిన్నప్పటి నుంచి విన్నదే. అయితే, దానివల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే మాత్రం మనమే మరొకరికి చెబుతాం ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని... ఇంతకీ ఉల్లి ఏం మేలు చేస్తుందో, ఎలా చేస్తుందో తెలుసుకుందాం. మజ్జిగ లేదా పెరుగుతో కలిసిన ఉల్లి శరీరానికి మంచిచేసే ఎన్నో పోషకాలనిస్తుందని పరిశోధనలలో వెల్లడైంది. పచ్చిఉల్లిని ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ అదుపులో ఉంటుందని పరిశోధనల్లో తెలిసింది. అంతేకాదు, ఉల్లిని తినడం వల్ల ఎలాంటి దుష్పలితాలూ ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గి, హార్ట్స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయి. ఉల్లిగడ్డను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. ఉల్లిపాయను గుజ్జుగా చేసి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్తో కలిపి తింటూ ఉంటే జీర్ణసంబంధిత సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను రోజూ ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది. పచ్చి ఉల్లిగడ్డ తినడం వల్ల బీపీ, హార్ట్ అటాక్, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు రావు. రాత్రి పడుకునే ముందు పచ్చి ఉల్లిపాయ తింటే, వేసవిలో వడదెబ్బ ముప్పు తప్పుతుంది. దీనితోపాటు, పచ్చి ఉల్లిపాయలో వేసవి వేడి నుండి రక్షించే గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో ఉన్న విషాన్ని తొలగిస్తుంది. నిద్రకు ముందు పచ్చి ఉల్లిపాయ తినడం నిద్రలేమిని దూరం చేస్తుంది. జలుబు, కఫంలో ఉల్లిపాయ చాలా మేలు చేస్తుంది. ఉల్లి రసం, తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి త్వరగా తగ్గుతాయి. ఉల్లిపాయల్లో ఉండే విటమిన్ సీ, కాల్షియం నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉల్లి అనేకరకాల క్యాన్సర్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. దీనితోపాటు, ఉల్లిపాయ తినడం వల్ల కడుపు, పెద్దప్రేగు, రొమ్ము, ఊపిరితిత్తులు ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలైనవి తగ్గుతాయి. ఉల్లి కీళ్లకు, గుండెకు మేలు చేస్తుంది. ఉల్లిగడ్డలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, డయేరియాల నుంచి కాపాడే ఆహారంలో ఉల్లిదే అగ్రస్థానం.. ఉల్లిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. పచ్చిఉల్లిపాయను రోజు తింటే ఎముకల బలహీనతను అధిగమించవచ్చు. ఉల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు సంబంధ సమస్యల్ని దూరం చేస్తాయి. ఉల్లి రసాన్ని మాడుకు పట్టించడం వల్ల జుట్టు రాలడంతోపాటు చుండ్రు సమస్యలు తగ్గుతాయి. జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. జుట్టు పెరుగుతుంది. మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఉల్లి మంచి ఔషదం. ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి రోజూ ఉదయం తీసుకుంటే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. తేనెటీగలు లేదా తేలు కుట్టినప్పుడు ఉల్లి రసాన్ని రాస్తే సత్వర ఉపశమనం ఉంటుంది. ఇవి చదవండి: శ్రామికలోక శక్తిమంతులు. -
కీళ్ల నొప్పులను తొలగించే చిట్కాలు మీకోసం...
నేటి కాలంలో 30 ఏళ్లు దాటితే చాలు కీళ్ల నొప్పులు ప్రారంభమవుతున్నాయి. ఈ పరిస్థితిలో వాటిని ఎదుర్కోవటానికి చాలామంది చాలా చిట్కాలు పాటిస్తున్నారు. కానీ ఎటువంటి ఫలితాలు ఉండటం లేదు. కానీ ఆహారంలో ఈ మూడు పండ్లను చేర్చుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఆ పండ్లేమిటంటే... నారింజ: రోజూ నారింజను తినడం వల్ల శరీరంలో నీటి కొరత తీరుతుంది. ఇందులో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్లనొప్పులని తగ్గించడంలో సహాయపడుతుంది. ద్రాక్ష: వీలయినంత వరకు ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా అనేకరకాల వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. చిన్నప్పటినుంచి పిల్లలకి ద్రాక్షపండ్లను తినిపించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పుచ్చకాయ: వేసవి కాలంలో పుచ్చకాయ తినడం అన్ని విధాల శ్రేయస్కరం. దీనివల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. తక్షణ శక్తి లభిస్తుంది. దీనిని తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలి. ఎండాకాలం బయటికి వెళ్లే ముందు లేదా బయటి నుంచి వచ్చిన తర్వాత పుచ్చకాయ తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు కీళ్లనొప్పులని తగ్గిస్తాయి. ఇవి చదవండి: మిమ్మల్ని మీరే పట్టించుకోవాలీ..!