-
హర్షల్ పటేల్ సూపర్ త్రో.. మ్యాచ్కు టర్నింగ్ పాయింట్
Harshal Patel Super Throw Turning Point For RCB.. ఐపీఎల్ 2021 సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ సత్తా చాటింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన మూడో జట్టుగా నిలిచింది. అయితే 19వ ఓవర్ వరకు ఇరు జట్ల మధ్య విజయం దోబుచులాడింది. ఇక ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. కాగా 20వ ఓవర్ను హర్షల్ పటేల్ వేశాడు. కాగా హర్షల్ తన తొలి బంతికే షారుక్ ఖాన్ను అద్భుత త్రోతో రనౌట్గా పెవిలియన్కు చేర్చాడు. మ్యాచ్కు ఇదే టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకముందు ఒక ఫోర్.. ఒక సిక్స్తో షారుక్ మంచి టచ్లో ఉన్నాడు. అతను స్ట్రైక్ తీసుకోవాలని భావించాడు. అందుకే హర్షల్ వేసిన తొలి బంతిని హెన్రిక్స్ ఢిఫెన్స్ ఆడినప్పటికి షారుక్ అనవసరంగా పరుగుకు కాల్ ఇచ్చాడు. ఇంకేముంది అప్పటికే సగం క్రీజులో ఉన్న హర్షల్ మెరుపువేగంతో బంతిని త్రో విసరగా.. నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో షారుక్ రనౌట్గా వెనుదిరిగాడు. ఇక షారుక్ అవుటయ్యాడని తెలియగానే కోహ్లి సంబరాలు మాములుగా లేవు. మైదానంలో నే గెంతులు వేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇక మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ మ్యాక్స్వెల్ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ 6 వికెట్లు నష్టపోయి 158 పరుగులకే పరిమితమై 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చదవండి: కేఎల్ రాహుల్ కొత్త చరిత్ర.. వరుసగా నాలుగోసారి Glenn Maxwell: ఒకసారి అంటే సరే.. మళ్లీ అదేనా.. ఏంటి మ్యాక్సీ -
ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ బౌలర్ సరికొత్త రికార్డు..
Harshal Patel Breaks Chahal IPL Record: ఐపీఎల్-2021 సెకెండ్ ఫేస్లో భాగంగా బుధవారం(సెప్టెంబర్ 29) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సరికొత్త రికార్డు ఆవిష్కృతమైంది. ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్(11 మ్యాచ్ల్లో 26 వికెట్లు) రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీసుకోవడంతో ద్వారా హర్షల్.. సహచర ఆటగాడు చహల్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. చాహల్ 2015లో అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగి 15 మ్యాచ్ల్లో 23 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో హర్షల్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ సీజన్లో ఆర్సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు(23 వికెట్లు) చహల్, వినయ్కుమార్ల పేరిట ఉండేది. ప్రస్తుత సీజన్లో హర్షల్ మరో 7 వికెట్లు పడగొడితే లీగ్ చరిత్రలో ఓ సీజన్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. 2013 సీజన్లో చెన్నై బౌలర్ డ్వేన్ బ్రేవో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, నిన్న రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో హర్షల్ పటేల్ ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు తీశాడు. ఈ మధ్యే ముంబైతో మ్యాచ్లో అతను హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. ఇప్పటివరకు 59 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన హర్షల్ 72 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: IPL 2021: అదిరిపోయే రికార్డు.. లీగ్ చరిత్రలో అత్యధికం -
Harshal Patel: కోహ్లి తొడను గట్టిగా రుద్దేశాను.. సిరాజ్ కాలికి గాయం!
Harshal Patel on His hat-trick Celebrations Vs MI: కెరీర్లో తొలి హ్యాట్రిక్ విజయం సాధించడం ఏ బౌలర్కైనా మధుర జ్ఞాపకమే. అలాంటి ఆనంద క్షణాల్లో పక్కన ఉన్న వాళ్లతో సంతోషం పంచుకోవడం, ఎగిరి గంతేయడం సహజం. ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా సెప్టెంబరు 26న దుబాయ్లో జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ అలాంటి అద్భుత అనుభూతిని పొందాడు. 17వ ఓవర్లో ముంబై ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, రాహుల్ చహర్ వెంట వెంటనే అవుట్ చేసి.. తొలి హ్యాట్రిక్ కొట్టాడు. దీంతో అతడి సంబరాలు అంబరాన్నంటాయి. కెప్టెన్ విరాట్ కోహ్లి, సహచర బౌలర్ మహ్మద్ సిరాజ్ సహా జట్టు సభ్యులంతా అతడిని ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. అయితే, ఆ సమయంలో కోహ్లి, సిరాజ్కు చిన్నపాటి అసౌకర్యం కలిగింది. స్వల్ప గాయాలు కూడా అయ్యాయట. ఈ విషయం గురించి 30 ఏళ్ల హర్షల్ పటేల్ ఐపీఎల్20.కామ్తో మాట్లాడుతూ.. తన వల్ల వాళ్లిద్దరికీ ఇబ్బంది కలిగిందన్నాడు. ‘‘అవును.. నా సెలబ్రేషన్స్లో భాగంగా సిరాజ్ కాలికి గాయమైంది. అయితే, ఇప్పుడు తను బాగున్నాడు. హ్యాట్రిక్ కొట్టిన ఆనందంలో కోహ్లి... తొడను గట్టిగా రుద్దేశాను. తనకు అసౌకర్యం కలిగించాను. అందుకే, సెలబ్రేషన్ అయి పోగానే వారిద్దరి పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశాను’’ అని చెప్పుకొచ్చాడు. బుధవారం నాడు రాజస్తాన్తో మ్యాచ్కు ముందు ఈ మేరకు మాట్లాడుతూ... తన బౌలింగ్ శైలికి యూఏఈ పరిస్థితులు చక్కగా సరిపోతాయని పేర్కొన్నాడు. ఇక నిన్నటి మ్యాచ్లో హర్షల్ పటేల్.. 3 వికెట్లతో రాణించిన సంగతి తెలిసిందే. చదవండి: Glenn Maxwell: కోహ్లి 10 వేలు, మాక్సీ 7 వేల పరుగులు.. ఇప్పుడు చెప్పండిరా! T20 World Cup 2021: మంచి ఫామ్లో ఉన్నాడు.. కానీ దురదృష్టవంతుడు We couldn’t be more proud of that performance last night, @HarshalPatel23! 🤩#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/vq0YkoMbU8 — Royal Challengers Bangalore (@RCBTweets) September 27, 2021 -
తొలి భాగం మొత్తం వీళ్లదే.. రాహుల్ మెరుపులు.. గబ్బర్ గర్జన.. సంజూ శతక్కొట్టుడు
Recap Of First Half IPL 2021: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్-2021 రెండో అంచె నేటి నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్ కారణంగా ఆకస్మికంగా వాయిదా పడిన క్యాష్ రిచ్ లీగ్.. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్తో పునః ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్ మొదటి దశలో చాలా మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. బౌలర్లపై బ్యాట్స్మెన్లు పూర్తి ఆధిపత్యం చలాయించారు. భారీ సంఖ్యలో ఫోర్లు, సిక్సర్లు నమోదవ్వడంతో పరుగుల వరద పారింది. కొన్ని మ్యాచ్ల్లో బౌలర్లు సైతం ప్రతాపం చూపినప్పటికీ వారి ప్రభావం నామమాత్రమే. సీజన్ తొలి దశలో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. టీమిండియా బ్యాట్స్మెన్లు పరుగుల వరద పారించారు. ముఖ్యంగా శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గబ్బర్.. ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్ల్లో 54.28 సగటుతో 380 పరుగులు చేసి ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుత సీజన్లో అత్యధిక ఫోర్ల (43) రికార్డు కూడా ధవన్ పేరిటే ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 3 హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ధవన్.. ఓ ఇన్నింగ్స్లో అత్యధికంగా 92 పరుగులు చేశాడు. తొలి దశలో గర్జించిన గబ్బర్.. రెండో దశలో ఎలా రాణిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చదవండి: IPL 2021: జోరు మీదున్న ధోని.. సీఎస్కే ప్రతీకారం తీర్చుకుంటుందా? మరోవైపు తొలిదశ ఐపీఎల్-2021లో టీమిండియా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం మెరుపులు మెరిపించాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఆశించిన మేరకు ప్రభావం చూపనప్పటికీ.. వ్యక్తిగతంగా రాణించాడు. ఈ సీజన్లో రాహుల్ సారధ్యంలో పంజాబ్ 8 మ్యాచ్ల్లో మూడింటిలో మాత్రమే నెగ్గింది. అయినా బ్యాట్స్మెన్గా రాహుల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 7 మ్యాచ్ల్లో 66.20 సగటుతో 331 పరుగులు చేసి ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాటు ఈ సీజన్లో అత్యధిక సిక్సర్లు (16), అత్యధిక అర్ధ సెంచరీ(4)ల రికార్డులు కూడా రాహుల్ పేరిటే నమోదై ఉన్నాయి. కాగా, టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులో ఉన్న రాహుల్ రెండో దశలోనూ రాణించి.. జట్టును విజయాల బాట పట్టించాలని పంజాబ్ కింగ్స్ అభిమానులు కోరుకుంటున్నారు. వీరిద్దరితో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డుప్లెసిస్( 7 మ్యాచ్ల్లో 64 సగటుతో 320 పరుగులు, 4 హాఫ్ సెంచరీలు), మరో ఢిల్లీ ఆటగాడు పృథ్వీ షా(8 మ్యాచ్ల్లో 38.50 సగటుతో 308 పరుగులు, 3 అర్ధ శతకాలు), రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్(7 మ్యాచ్ల్లో 46.16 సగటు, 145.78 స్ట్రయిక్ రేట్తో 277 పరుగులు, సెంచరీ), మరో రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్(7 మ్యాచ్ల్లో 36. 29 సగటు, 153.01 స్ట్రయిక్ రేట్తో 254 పరుగులు, సెంచరీ), రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు దేవ్దత్ పడిక్కల్(6 మ్యాచ్ల్లో 39 సగటు, 152.34 స్ట్రయిక్ రేట్తో 195 పరుగులు, సెంచరీ) జోరును ప్రదర్శించారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ సీజన్ మొత్తానికే హైలైట్గా నిలిచాడు. 7 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టి సీజన్ టాప్ బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇందులో ఓసారి ఐదు వికెట్ల ప్రదర్శన(5/27) కూడా ఉంది. హర్షల్ తర్వాత చెప్పుకోదగ్గ బౌలింగ్ ప్రదర్శనల్లో ఆవేశ్ ఖాన్(8 మ్యాచ్ల్లో 14), క్రిస్ మోరిస్(7 మ్యాచ్ల్లో 14) ఉన్నారు. ముంబైతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఆటగాడు ఆండ్రీ రసెల్(5/15) సీజన్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. చదవండి: ఆ మూడు బాదితే రోహిత్ ఖాతాలో మరో రికార్డు.. -
ఇరగదీసిన డివిల్లియర్స్.. సిక్సర్ల వర్షం.. కానీ సెంచరీ వృథా!
AB de Villiers Scores Century Intra Squad Match : ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో దశ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే యూఏఈ చేరుకున్న జట్లు ప్రాక్టీసు మొదలెట్టేశాయి. ఇక ఈసారైనా కప్ కొట్టాలన్న ఆశయంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు నెట్స్లో గట్టిగానే శ్రమిస్తున్నారు. రెండు జట్లుగా విడిపోయి ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్లతో కావాల్సినంత ప్రాక్టీసు చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాటి మ్యాచ్లో... ఆర్సీబీ ఏ కెప్టెన్ హర్షల్ పటేల్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పవర్ప్లేలో వికెట్ కోల్పోయిన ‘ఏ’ జట్టును స్టార్ ఆటగాడు ఏబీ డివిల్లియర్స్, మహ్మద్ అజారుద్దీన్ ఆదుకున్నారు. ఏడో ఓవర్ ముగిసేసరికి డివిల్లియర్స్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. అదే జోరులో శతకం(46 బంతుల్లో 104 పరుగులుఏడు ఫోర్లు, 10 సిక్సర్లు) కూడా పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ ఏ 212 పరుగులు చేయగలిగింది. అయితే లక్ష్యఛేదనలో భాగంగా దేవదత్ పడిక్కల్ సారథ్యంలోని ఆర్సీబీ బీ మెరుగైన ఆట కనబరిచింది. చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు చేయాల్సి ఉండగా.. బౌండరీ బాది విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మూడు వికెట్లు కోల్పోయి 216 పరుగులు సాధించి గెలుపొందింది. ఈ టీంలో కేఎస్ భరత్ 95 పరుగులు సాధించి సత్తా చాటగా.. ఆర్సీబీ ఏ జట్టులోని సెంచరీ చేసిన డివిల్లియర్స్ పోరాటం వృథాగా పోయింది. ఈ ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్కు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. చదవండి: IPL 2021 Phase 2: నాలాంటి ‘ఓల్డ్ మ్యాన్’కు కష్టమే: డివిల్లియర్స్ Bold Diaries: RCB’s Practice Match AB de Villiers scores a century, KS Bharat scores 95 as batsmen make merry in the practice match between Devdutt’s 11 and Harshal’s 11.#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/izMI4LCSG1 — Royal Challengers Bangalore (@RCBTweets) September 15, 2021 -
అత్యంత చెత్త రికార్డు సమం చేసిన ఆర్సీబీ బౌలర్
ముంబై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డును సమం చేశాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఒకే ఓవర్లో ఏకంగా 37 పరుగులు సమర్పించుకుని, 2011 సీజన్లో కొచ్చి టస్కర్స్ బౌలర్ ప్రశాంత్ పరమేశ్వరన్ 37 పరుగల చెత్త రికార్డును ఈక్వల్ చేశాడు. ప్రస్తుత సీజన్లో అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ను(15 వికెట్లు) సొంతం చేసుకున్న హర్షల్ పటేల్.. ఈ మ్యాచ్లో మొదటి మూడు ఓవర్ల పాటు చాలా పొదుపుగా బౌలింగ్(14 పరుగలు) చేసి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. అయితే, ఆఖరి ఓవర్లో జడ్డూ విశ్వరూపం ప్రదర్శించడంతో హర్షల్ తేలిపోయాడు. జడేజా ధాటికి అతను 5 సిక్స్లు, ఒక ఫోర్, డబుల్ నోబాల్తో కలిపి ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు. గతంలో క్రిస్ గేల్ ధాటికి పరమేశ్వరన్ కూడా ఒకే ఓవర్లో 37 పరుగుల సమర్పించుకున్నాడు. పరమేశ్వరన్ బౌలింగ్లో గేల్ 4 సిక్స్లు, 3 ఫోర్లు బాది 36 పరుగులు పిండుకున్నాడు. ఇందులో ఒక నోబాల్ ఉంది. ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో వీరి తర్వాత స్థానాల్లో పంజాబ్ బౌలర్ పర్వీందర్ ఆవానా(33 పరుగులు), పంజాబ్ బౌలర్ రవి బొపారా(33 పరుగులు) ఉన్నారు. ఆవానా బౌలింగ్లో చెన్నై ఆటగాడు రైనా 2 సిక్సర్లు, 5 ఫోర్లు, ఓ నోబాల్ కలిపి 33 పరుగుల రాబట్టగా, బొపారా బౌలింగ్లో గేల్ 4 సిక్సర్లు, 7 వైడ్లు, 2 సింగల్స్తో కలిపి 33 పరుగులు పిండుకున్నాడు. చదవండి: భజ్జీ.. సెలబ్రిటీలకు మాత్రమే రిప్లై ఇస్తావా? -
వార్నర్ అనుకున్నది తప్పు.. అంపైరే కరెక్ట్: ఎస్ఆర్హెచ్ కోచ్
చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్తో బుధవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ పేసర్ హర్షల్ పటేల్ రెండు ఫుల్టాస్ నో బాల్స్(బీమర్లు) వేశాడు. అయిన్పటికీ ఫీల్డ్ అంపైర్లు అతనికి ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదు. ఒక బీమర్ను చివరి ఓవర్ మూడో బంతికి సంధించిన హర్షల్.. 18 ఓవర్ నాల్గో బంతికి బీమర్ వేశాడు. ఈ రెండు బీమర్లలో ఒక దాన్ని రషీద్ ఖాన్ బౌండరీకి తరలించాడు. ఆఖరి ఓవర్లో యార్కర్ వేసే యత్నంలో బీమర్ పడగా, దాన్ని రషీద్ ఖాన్ భారీ షాట్గా మలిచాడు. కాగా, ఒక మ్యాచ్లో రెండు బీమర్లు వేసిన హర్షల్ పటేల్ను ఎందుకు ఓవర్ వేయకుండా నిషేధించలేదని డగౌట్లో ఉన్న ఎస్ఆర్హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 2017 లో మార్చిన క్రికెట్ రూల్స్ ప్రకారం ఒక బౌలర్ రెండు బీమర్లు వేసి వార్నింగ్కు గురైతే అతన్ని మళ్లీ బౌలింగ్ ఎటాక్కు దిగకుండా నిబంధనను మార్చిన సంగతి తెలిసిందే. ఈ నిబంధననే గుర్తుచేశాడు వార్నర్. ఎందుకు హర్షల్ పటేల్ బౌలింగ్ చేయకుండా ఆపలేదని ప్రశ్నించాడు. ఇదే విషయాన్ని డగౌట్లో ఉన్న వారితో పంచుకున్నాడు ఈ లెఫ్ట్హ్యాండ్ బ్యాట్స్మన్. అయితే వార్నర్ ఏదైతే అనుకున్నాడో అది తప్పని అంటున్నాడు ఎస్ఆర్హెచ్ హెడ్ కోచ్. హర్షల్ పటేల్కు అంపైర్ ఎందుకు వార్నింగ్ ఇవ్వలేదో వివరించాడు. ట్రేవర్ బేలిస్. పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన బేలిస్.. ‘హర్షల్ రెండు బీమర్లు వేసిన మాట నిజమే. మామూలుగా రెండు బీమర్లు వేస్తే ఆ బౌలర్ బౌలింగ్ ఎటాక్ నిలిపివేయాలి. కానీ అంపైర్స్ అలా చేయలేదు. ఇక్కడ అంపైర్స్ చేసింది కర్టెక్టే. జేసన్ హోల్డర్కు హర్షల్ పటేల్ వేసిన తొలి బీమర్ బ్యాటర్స్ బాడీని టార్గెట్ చేసేదిగా లేదు. అది బ్యాట్స్మన్ బాడీకి బాగా పక్కగా వెళ్లింది. దాంతో రెండో బీమర్ వేసినా కూడా అంపైర్ ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదు. ఇక్కడ అంపైర్ చేసింది కరెక్ట్’ అని బేలిస్ చెప్పుకొచ్చాడు. ఓవరాల్గా తాము మంచి క్రికెట్ ఆడకపోవడం వల్లే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని బేలీస్ అన్నాడు. ఆర్సీబీ నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్ను ఛేదించలేక చతికిలబడింది. గెలవాల్సిన మ్యాచ్ను తీసుకెళ్లి ఆర్సీబీ చేతిలో పెట్టింది. ఆరు పరుగుల తేడాతో ఆరెంజ్ ఆర్మీ ఓటమి పాలైంది. 15 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోవడంతో సన్రైజర్స్ తిరిగి తేరుకోలేకపోయింది. 0 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైన సన్రైజర్స్ పరాజయం చెందింది. ఇక్కడ చదవండి: విరాట్ కోహ్లికి మందలింపు తుదిజట్టులో అతడికి స్థానం ఉంటేనే హైదరాబాద్ గెలుపు! -
Harshal Patel: ఎందుకనుకున్నారు.. ఏమిటో చూపించాడు!
చెన్నై: హర్షల్ పటేల్.. పెద్దగా అంచనాలు లేని క్రికెటర్. ఈ ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీకి ఆడిన తొలి మ్యాచ్లోనే అవకాశం దక్కించుకుని శభాష్ అనిపించాడు. నిన్న ఆర్సీబీకి ఆడిన మ్యాచ్ హర్షల్ పటేల్కు 49వ ఐపీఎల్ మ్యాచ్. కానీ ఈ మ్యాచ్ కంటే ముందు ఏనాడు అతను ఆకట్టుకున్న దాఖలాలు లేవు. ప్రధానంగా ఐపీఎల్లో హర్షల్ పటేల్ నామమాత్రపు ఆటగాడే. సుదీర్ఘ కాలంగా దేశవాళీ మ్యాచ్ల్లో పేస్ బౌలర్గా రాణిస్తున్న హర్షల్.. ఐపీఎల్కు వచ్చేసరికి మాత్రం ఓ మోస్తరు బౌలర్గానే మిగిలిపోతున్నాడు. గత ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 5 మ్యాచ్లు ఆడిన హర్షల్ 3 వికెట్లే తీశాడు. దాంతో అతను ఆర్సీబీకి అవసరమా.. అనే అనుమానాలు వచ్చాయి. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్సీబీ అతన్ని తీసుకుంది. అసలు హర్షల్ పటేల్ తీసుకోవడమే ఒకటైతే, తొలి మ్యాచ్లనే అతనికి అవకాశం ఇవ్వడంపై ఆర్సీబీ కూర్పు బాలేదని అభిమానుల నోట వినిపించింది. కానీ వారి అంచనాలను తప్పని నిరూపించాడు హర్షల్. ఏకంగా ఐదు వికెట్లు సాధించి ముంబైపై రికార్డు నమోదు చేశాడు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్పై ఏ జట్టులోని ఆటగాడు కూడా 5 వికెట్లు తీయలేదు. కానీ ఈ సీజన్లో తొలి మ్యాచ్లోనే హర్షల్ ఈ ఘనత సాధించాడు. ముంబై ఇండియన్స్పై ఈ రికార్డు నెలకొల్పిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. ఎలా వచ్చాడు.. ఆర్సీబీ ఎందుకు తీసుకుంది? ఈ సీజన్ కోసం వేలానికి ముందు బెంగళూరు ‘ట్రేడింగ్ విండో’లో హర్షల్ను తీసుకుంది. ఆర్సీబీకి ఒక భారత పేస్ బౌలర్ అవసరం ఉండటంతో హర్షల్ను తీసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో ‘నోబాల్’తో అతను బౌలింగ్ మొదలు పెట్టాడు. ఆపై లిన్ సిక్స్, సూర్య ఫోర్ బాదడంతో తొలి ఓవర్లో మొత్తం 15 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే 16వ ఓవర్లో తిరిగొచ్చిన అతను సత్తా చాటాడు. హార్దిక్ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసిన హర్షల్... తన తర్వాతి ఓవర్లో కిషన్ను కూడా ఇలాగే వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్నైతే అతను శాసించాడు. భారీ షాట్లు ఆడే అవకాశం ఉన్న కృనాల్ , పొలార్డ్ లను తొలి రెండు బంతుల్లో అవుట్ చేసిన అనంతరం త్రుటిలో హ్యాట్రిక్ను చేజార్చుకున్నాడు. అయితే నాలుగో బంతికి జాన్సెన్ (0)ను కూడా బౌల్డ్ చేసి ఐదో వికెట్ సాధించాడు. ఫలితంగా తన ఐపీఎల్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. అదే సమయంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. అరంగేట్రమే ఆర్సీబీతో.. హర్షల్ పటేల్ ఐపీఎల్ అరంగేట్రమే ఆర్సీబీతో మొదలైంది. 2012 సీజన్ ఐపీఎల్లో భాగంగా జరిగిన వేలంలో హర్షల్ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీ డేర్డెవిల్స్తో జరిగిన మ్యాచ్లో హర్షల్ పటేల్ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఆ మ్యాచ్లో రెండు ఓవర్లు వేసి 10 పరుగులిచ్చిన హర్షల్.. వికెట్ కూడా తీయలేదు. ఇక బ్యాటింగ్లో డకౌట్ అయ్యాడు. ఆ సీజన్ మొదలుకొని 2017 వరకూ ఆర్సీబీతోనే కొనసాగాడు. 2018లో ఢిల్లీ డేర్డెవిల్స్కు జట్టు అతన్ని వేలంలో కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఢిల్లీ డేర్డెవిల్స్ కాస్త ఢిల్లీ క్యాపిటల్స్గా మారగా అప్పట్నుంచి గత సీజన్ వరకూ ఢిల్లీ క్యాపిటల్స్తో కొనసాగాడు. ఈ సీజన్లో ట్రేడింగ్ విధానం ద్వారా ఆర్సీబీలోకి రీఎంట్రీ ఇచ్చి కోహ్లి చేతే ప్రశంసలు అందుకున్నాడు. నిన్న హర్షల్ బౌలింగ్ వేసిన విధానం చూస్తుంటే అతను ఆర్సీబీ ఆడే ప్రతీ మ్యాచ్లోనూ ఉండటం దాదాపు ఖాయం. ఇదే విషయాన్ని కోహ్లి కూడా స్పష్టం చేశాడు. ఈ సీజన్ మొత్తం హర్షల్ను కొనసాగించాలనుకుంటున్నట్లు కోహ్లినే తెలపడం హర్షల్ కీలక బౌలర్గా మారడానికి ఒక సువర్ణావకాశం ఇచ్చినట్లే. -
సీజన్ మొత్తం తననే కొనసాగించాలనుకుంటున్నాం: కోహ్లి
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 తొలి మ్యాచ్లో తమకు అద్భుత విజయం దక్కడంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ హర్షల్ పటేల్పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. డెత్ ఓవర్ బౌలర్గా తనను సీజన్ మొత్తం కొనసాగిస్తామని పేర్కొన్నాడు. మ్యాచ్ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ నుంచి హర్షల్ను మేం కొనుగోలు చేశాం. తనదైన ప్రణాళికలతో, జట్టు తనపై పెట్టిన బాధ్యతను నెరవేర్చడంలో సఫలం అయ్యాడు. ఈ మ్యాచ్లో తను ఎంతో ప్రత్యేకంగా నిలిచాడు. డెత్ ఓవర్లలో తన సేవలు వినియోగించుకుంటాం. ఒక కెప్టెన్గా తన నుంచి నేనేం ఆశించానో, ఆ అంచనాలను తను అందుకున్నాడు’’ అని కితాబిచ్చాడు. ఇక జెమీసన్, యజువేంద్ర చహల్, మహ్మద్ సిరాజ్ సైతం శుభారంభం చేశారని కోహ్లి పేర్కొన్నాడు. కాగా శుక్రవారం నాటి మ్యాచ్లో ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ అద్భుతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, కీరన్ పొలార్డ్, మార్కో జెన్సన్ వంటి ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్లను పెవిలియన్కు చేర్చి ఉత్కంఠ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన హర్షల్ ఆర్సీబీ అభిమానుల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా సీజన్ ఆరంభ మ్యాచ్లో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, ఆర్సీబీ 2 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యానఇన ఛేదించి గెలుపుతో బోణీ కొట్టింది. చదవండి: అందుకే హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేదు.. కానీ పడిక్కల్ను పక్కకు పెట్టడానికి కారణం అదేనా..