-
12 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పరీక్ష నిర్వహించింది మేమే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూసే పరిస్థితి ఉండేదన్నారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పరీక్ష నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనేనని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు హరీశ్, కేటీఆర్ల ఆరోపణలను కౌంటర్ చేస్తూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఆశ వర్కర్ల గురించి మాట్లాడే అర్హత హరీశ్రావుకు లేదు. బీఆర్ఎస్ హయాంలో ఆశవర్కర్లను గుర్రాలతో తొక్కించారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం. మూడునెలల మా పాలన పూర్తయ్యేలోపే ఎన్నికల కోడ్ వచి్చంది. ఇప్పుడే కోడ్ అయిపోయింది. అన్ని హామీలు అమలు చేస్తాం. త్వరలోనే జాబ్ కేలండర్ విడుదల చేస్తాం.’అని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని, మతఘర్షణల వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. -
అక్టోబర్ 21 నుంచి గ్రూప్–1 మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు వరుసగా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏడు పరీక్షలు వరుసగా హైదరాబాద్లో హెచ్ఎండీఏ పరిధిలో జరగనున్నాయి. ప్రతీ పరీక్షకు 3 గంటల సమయం ఉంటుందని, గరిష్ట మార్కులు 150 అని కమిషన్ వెల్లడించింది. జనరల్ ఇంగ్లిష్ పరీక్ష ప్రశ్నపత్రం మినహా మిగతావన్నీ ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటాయి. అభ్యర్థి ఇష్టానుసారంగా భాషను ఎంచుకుని జవాబులు రాయొచ్చు. కన్వెన్షనల్, డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. ఆరు పరీక్షలను ఎంపిక చేసుకున్న ఒకే భాషలో రాయాల్సి ఉంటుందని, ఒక్కో పరీక్షను ఒక్కో భాషలో రాసే అవకాశం లేదని పేర్కొంది. అలా రాసినట్లైతే వాటిని పరిగణనలోకి తీసుకోమని కమిషన్ స్పష్టంచేసింది. జనరల్ ఇంగ్లిష్ పరీక్ష పదోతరగతి స్థాయిలో ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులను ర్యాంకింగ్ పరిధిలోకి తీసుకోరు.. కానీ ఈ పరీక్షలో క్వాలిఫై అయితేనే ఇతర పరీక్షల పేపర్లను వాల్యుయేషన్ చేస్తారు. ఇందులో ఫెయిలైతే తక్కిన పేపర్లను పరిగణనలోకి తీసుకోరు. అభ్యర్థి నిర్దేశించిన అన్ని పరీక్షలకు తప్పకుండా హాజరు కావాలి. ఇందులో ఏ ఒక్క పరీక్షకు గైర్హాజరైనా వెంటనే అనర్హతకు గురవుతారు. మెయిన్ పరీక్షలకు సంబంధించిన సిలబస్, విధానం తదితర పూర్తిస్థాయి సమాచారం కమిషన్ వెబ్సైట్లో ఉందని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
గ్రూప్–1 ప్రిలిమ్స్కు తీవ్ర పోటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ మూడో సారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలో తీవ్ర పోటీ నెలకొంది. గతంలో రెండుసార్లు నిర్వహించి రద్దు చేసిన ప్రిలిమ్స్తో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఈసారి పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 3.02 లక్షల మంది (74%) ప్రిలిమ్స్ రాసినట్లు కమిషన్ ప్రాథమికంగా వెల్లడించింది.దీనికితోడు ఈసారి ప్రశ్నపత్రం సులభంగా ఉండటంతో కటాఫ్ మార్కులపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అన్ని కేటగిరీల్లో ప్రశ్నలు సులభతరం నుంచి మధ్య స్తంగా ఉన్నట్లు ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. కమిషన్ ప్రాథమిక ‘కీ’విడుదల చేశాకే స్పష్టత కటాఫ్పై వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అర్హతకు కనీసం 50 శాతానికి పైబడి మార్కులు రావాల్సిందేనని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండుసార్లు రద్దు కావడంతో..: వాస్తవానికి గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి 2022 ఏప్రిల్లో 503 ఉద్యోగాల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది అక్టోబర్లో ప్రిలిమ్స్ నిర్వహించి 1:50 నిష్పత్తిలో మెయిన్ పరీక్షలకు తేదీలు ప్రకటించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో ప్రిలిమ్స్ను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్లో రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా అందులో లోపాలు జరిగాయంటూ అభ్యర్థులు కోర్టుకెక్కారు.దీంతో కోర్టు ఆదేశంతో ప్రిలిమ్స్ను కమిషన్రద్దు చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం... కొత్తగా 60 గ్రూప్–1 పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వడంతో టీజీపీఎస్సీ మొత్తంగా 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తును అప్డేట్ చేసుకొనే అవకాశం కల్పించడంతోపాటు కొత్తగా దరకాస్తు చేసుకొనే అవకాశం కలి్పంచింది. దీంతో కొత్తగా 23 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితంగా అభ్యర్థుల సంఖ్య 4.03 లక్షల చేరింది. -
గ్రూప్–1 ప్రిలిమ్స్ వాయిదాకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9న ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ పరీక్ష ఉన్నందున గ్రూప్–1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చి0ది. అయితే పిటిషనర్లు ఈ నెల 1న ఇచ్చిన వినతిపత్రాన్ని పరిశీలించి చట్టప్రకారం నిర్ణయం తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కు స్పష్టం చేసింది. పిటిషన్లో విచారణను ముగించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ పరిధిలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్– ఐఐ/ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 2వ స్క్రీనింగ్ టెస్ట్ ఈ నెల 9న ఉందని, అదేరోజు నిర్వహిస్తున్న గ్రూప్–1 ప్రిలిమ్స్ను వాయిదా వేయాలని కోరుతూ ఎం.గణేశ్, భూక్యా భరత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ పుల్ల కార్తీక్ మంగళవారం విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ..‘గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి షెడ్యూల్ ముందుగానే ప్రకటించాం. 9న పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. 4,03,645 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరూ పరీక్షకు సిద్ధమయ్యారు. కొందరి కోసం లక్షల మందిని ఇబ్బంది పెట్టడం...పరీక్ష వాయిదా వేయడం సాధ్యం కాదు. అయినా పిటిషనర్ల వినతిపత్రంపై అధికారులు చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటారు’అని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయమూర్తి...ఈ పిటిషన్లో మెరిట్స్లోకి వెళ్లడంలేదని, చట్టప్రకారం టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. -
AP: గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. మార్చి 27వ తేదీన ప్రిలిమ్స్ నిర్వహించిన ఏపీపీఎస్సీ.. రికార్డు స్థాయిలోనే 27 రోజుల్లో ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. గ్రూప్ వన్కి మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్ష రాసిన వాళ్ల నుంచి 4,496 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. కిందటి ఏడాది డిసెంబర్ 08వ తేదీన గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో మొత్తం 81 Group 1 పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 02, 09 తేదీల మధ్య మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని ప్రెస్ నోట్లో ఏపీపీఎస్సీ పేర్కొంది. ఫలితాల కోసం క్లిక్ చేయండి పోస్టుల వివరాలివే.. ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9; ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ 18; డీఎస్పీ (సివిల్) 26; రీజనల్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్ 6; కోఆపరేటివ్ సర్వీసెస్లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5; జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 4; జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3; అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు 3; అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2; జైళ్ళ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. -
ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..!
-
AP : గ్రూప్-1 రద్దు నిర్ణయం రద్దు, హైకోర్టు స్టే
సాక్షి, గుంటూరు: APPSC (ఏపీపీఎస్సీ) గ్రూప్ 1 పరీక్ష రద్దుపై గురువారం ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తూ.. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు యధావిధిగా కొనసాగుతారని డివిజన్ బెంచ్ ఊరట ఇచ్చింది. ఏపీపీఎస్సీ దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి విచారణ 27కి వాయిదా వేసింది. 2018 గ్రూప్ వన్ కింద 167 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది ఏపీపీఎస్సీ. అయితే ఎంపికలో అవకతవకలు జరిగాయని, మూడుసార్లు మూల్యాంకన జరిగిందని కొందరు అభ్యర్థులు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. మరోవైపు.. హైకోర్టు ఆదేశాలతో డిజిటల్ మూల్యాంకన రద్దు చేసి ఒకసారి మాత్రమే మాన్యువల్ గా మూల్యాంకన చేశామని వాదనలు వినిపించింది ఏపీపీఎస్సీ బోర్డు. ఇరువర్గాల వాదనలు విన్న సింగిల్ జడ్జి బెంచ్ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. మే 26, 2022న APPSC ప్రకటించిన ఉద్యోగుల జాబితాను తిరస్కరించింది. దీంతో.. ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లలో ఆందోళన మొదలైంది. అయితే.. ఆందోళన అవసరం లేదని, అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడి తీరతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ ఎదుట సవాల్ చేసింది. తీర్పుపై స్టే విధించాలని కోరింది. ఈ క్రమంలో.. మాన్యువల్గా ఒక్కసారే మూల్యాంకనం చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను డివిజన్ బెంచ్కు సమర్పించింది ఏపీపీఎస్సీ. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్వర్వులపై క్షుణ్ణంగా విచారణ జరిపింది ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్. న్యాయస్థానం బెంచ్లో సభ్యులైన జస్టిస్ రవినాథ్ తిల్హారి, జస్టిస్ హరినాథ్ ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను సమగ్రంగా విన్నారు. అన్ని పరిశీలించిన మీదట సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది డివిజన్ బెంచ్. తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో తుది ఆదేశాలు వచ్చేంతవరకు ఉద్యోగులు తమ తమ ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులకు ఊరట లభించినట్లయ్యింది. మరోవైపు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వగానే దానికి నానా వక్రభాష్యాలు జోడించి తప్పుడు ప్రచారానికి దిగింది తెలుగుదేశం, జనసేన. APPSCమీద వచ్చిన తీర్పును అడ్డుపెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. ఓ ఎలక్ట్రానిక్ బోర్డు, దాంట్లో నాలుగు గ్రాఫిక్స్ పెట్టుకుని చంద్రబాబు నానా హంగామా చేశారు. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి అసత్యాలను ప్రచారం చేసేందుకు ప్రయత్నించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులతో సదరు అసత్య ప్రచారాలకు ఫుల్స్టాప్ పడ్డట్టయింది. -
2018 గ్రూప్-1 మెయిన్స్పై రాజకీయ విమర్శలా? : గౌతమ్ సవాంగ్
సాక్షి, అమరావతి: 2018 మెయిన్స్ పరీక్ష రద్దుపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్. సర్వీస్ కమిషన్, ప్రభుత్వంపైనా రాజకీయ విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. అసలు రాజకీయ విమర్శలకు కమిషన్ స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే నిరుద్యోగులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిబంధనలకు అనుగుణంగా జరిగిందని గౌతమ్ సవాంగ్ తెలిపారు. మెయిన్స్ పరీక్ష ప్రశ్నాపత్రాలను పకడ్బందీగా ఒకేసారి మాన్యువల్ వ్యాల్యువేషన్ చేశామని, రెండోసారి జరగలేదని స్పష్టం చేశారు. 162 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు 55 రోజులు క్యాంపులో కూర్చుని వ్యాల్యువేషన్ చేశారన్నారు. వ్యాల్యువేషన్ ప్రక్రియ అంతా సీసీ కెమెరాలో రికార్డు చేసినట్లు తెలిపారు. నియామకాలకు సంబంధించి అన్ని ఆధారాలూ ఎపీపీఎస్సీ వద్ద ఉన్నాయని చెప్పారు. నియామకాల్లో ఏపీపీఎస్సీ చాలా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఉద్యోగాలు చేస్తున్న 162 ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి న్యాయం జరిగేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ క్రమంలో సోమవారం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అప్పీల్ దాఖలు చేశారు. 2019 నుంచి ఇప్పటి దాకా కమిషన్ ఒక్క తప్పు లేకుండా పూర్తి పారదర్శకతతో వేలాది పోస్టులు భర్తీ చేసిందని పేర్కొన్నారు గౌతమ్ సవాంగ్. 2018 గ్రూప్-1 పోస్టుల భర్తీలోనూ అంతే పారదర్శకంగా మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాయని చెప్పారు. ఎంపికైన అభ్యర్థుల్లో 14 మంది ఐఏఎస్కు ఎంపికవ్వడమే అందుకు నిదర్శనమని తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6,296 ఉద్యోగాలను వివాదరహితంగా భర్తీ చేసిందని తెలిపారు. బాబు హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి వివాదాల్లో ఉన్నవాటిని సైతం పరిష్కరించి, పోస్టుల భర్తీ ప్రక్రియను సీఎం జగన్ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ఇందులో విద్యావంతులైన నిరుద్యోగ యువతకు మేలు చేసేలా గ్రూప్-1, గ్రూప్-2 వంటి గెజిటెడ్ పోస్టులతోపాటు, వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజినీర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, మరెన్నో నాన్ గెజిటెడ్ పోస్టులకు నియామకాలు జరిగాయని తెలిపారు. నాడే పడిన వివాదాల బీజం 2018లో బాబు హయాంలో గ్రూప్-1 విషయంలో వివాదాలు తలెత్తిన్నట్లు గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. 2018 మే నెలలో నిర్వహించిన ప్రిలిమ్స్ పేపర్లో దాదాపు 62 తప్పులు దొర్లాయని చెప్పారు. వీటికి నాటి చంద్రబాబు ప్రభుత్వంగానీ, నాటి సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్గానీ సమాధానం చెప్పలేదని ప్రస్తావించారు. గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను సంప్రదాయ పద్ధతిలో సబ్జెక్టు నిపుణులు మూల్యాంకనం చేయడం ఎప్పటి నుంచో ఉండగా..డిజిటల్ మూల్యంకనం ప్రతిపాదన నాటి చైర్మన్ ఉదయ్ భాస్కర్దేనని అన్నారు. సంప్రదాయ పద్ధతి విధానంలో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఉదయ్ భాస్కర్ డిజిటల్ మూల్యాంకనం ప్రతిపాదన చేయగా, నాటి కమిషన్లోని సభ్యులు కూడా ఆమోదం తెలిపి కొత్త ప్రభుత్వం ముందుంచారని చెప్పుకొచ్చారు. అనంతరం దీనిపై జాతీయ స్థాయి సదస్సును విజయవాడలో నిర్వహించేందుకు సన్నాహాలు చేయగా అందుకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించిందని తెలిపారు. మెయిన్స్ పేపర్లను ఈ విధానంలోనే మూల్యాంకనం చేయాలని చూడగా.. నోటిఫికేషన్లో చెప్పని కారణంగా కోర్టు ద్వారా ఈ ప్రక్రియను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. దీంతో సంప్రదాయ విధానంలోనే పేపర్లను మూల్యాంకనం చేశారన్నారు. ‘2018 గ్రూప్-1 ఇంటర్వ్యూలకు 325 మంది ఎంపిక అయ్యారు. ఇందులో ఐఐటీ నుంచి 19 మంది, ఐఐఎం నుంచి 7, ఎన్ఐటీ నుంచి 17, బిట్స్ పిలానీ నుంచి 2, ట్రిపుల్ ఐటీల నుంచి 13 మంది ఉన్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ చేసినవారు 177 మంది, సాధారణ పీజీ 51, గ్రాడ్యుయేట్లు 39 మంది ఉన్నారు. ఇక ఇంటర్వ్యూకు ఎంపికైన వారిలో 40 మంది సివిల్స్ రాయగా.. వీరిలో 14 మంది అదే ఏడాది ఐఏఎస్ సాధించగా, ఇద్దరు కేంద్ర సర్వీసుకు ఎంపికయ్యారు. మరో 24 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. 163 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నారు. వీరంతా 2018 గ్రూప్-1 కంటే ముందే పలు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నవారు. వీరంతా మెయిన్స్లో ప్రతిభ చూపిన తర్వాతే ఇంటర్వ్యూని ఎదుర్కొన్నారు. సివిల్స్ ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకుని చదివినవారికి గ్రూప్-1లో గెలవడం లెక్కకాదు’ అని తెలిపారు. -
51 ఏళ్ల అర్హతను పరిశీలించండి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పోస్టుల రిక్రూట్మెంట్ కోసం గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్ల నుంచి 51 ఏళ్లకు సడలించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ని హైకోర్టు ఆదేశించింది. చాలా ఏళ్ల తర్వాత భర్తీ చేస్తున్న గ్రూప్–1 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం 46 ఏళ్లను అర్హతగా పేర్కొందని, దీనిని 51 ఏళ్ల వరకు పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన నిరుద్యోగి శ్రీనివాస్రెడ్డితో పాటు మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందించలేదని, దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని చెప్పారు. గరిష్ట వయసు సడలింపు ఇస్తూ నోటిఫికేషన్లో మార్పు చేసేలా టీఎస్పీఎస్సీని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఫణిభూషణ్ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ల జారీలో చాలా జాప్యం జరిగిందన్నారు. దీంతో అనేక మంది గ్రూప్–1 పరీక్షలకు అర్హత కోల్పోయారని వివరించారు. ఈ దృష్ట్యా గరిష్ట వయోపరిమితిని పెంచాల్సిన ఆవశ్యకత ఉందని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ ఆంశంలో మెరిట్ జోలికి వెళ్లడంలేదని, ఫిబ్రవరి 2న పిటిషనర్లు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. 4 వారాల్లో దీనిపై నిర్ణయాన్ని తెలియజేయాలని స్పష్టం చేశారు. -
APPSC : జాబ్స్ పిలుపు.. 897 పోస్టులతో గ్రూప్–2 నోటిఫికేషన్
త్వరలో గ్రూప్–1 నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ త్వరలోనే వంద గ్రూప్–1 పోస్టులతో పాటు డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్స్తో మొత్తం 23 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. గతేడాది ఎలాంటి వివాదాలకు తావులేకుండా గ్రూప్–1 నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలల కాలంలోనే పారదర్శకంగా మెయిన్స్ ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేశారు. ఏఈ నియామకాలను కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశారు. పలు న్యాయపరమైన వివాదాలను అధిగమించి గత నాలుగేళ్లల్లో సంస్కరణలు తెచ్చిన కమిషన్ తాజాగా గ్రూప్–2 పోస్టుల భర్తీని సైతం పారదర్శకంగా, 6 నెలల వ్యవధిలో ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టింది. సాక్షి, అమరావతి: యువత ఉత్కంఠకు తెర దించుతూ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్–2 పోస్టుల భర్తీకి ఏపీపీఏస్సీ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఈ నెల 21వతేదీ నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్సైట్లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఓటీపీఆర్తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్–2 ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో ఫిబ్రవరి 25వతేదీన ఆఫ్లైన్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ సైతం ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్లైన్ లేదా సీబీటీలో నిర్వహించనున్నారు. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నారు. మే నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి కమిషన్ ప్రకటించిన గ్రూప్–2 నోటిఫికేషన్లో 114 డిప్యూటీ తహసీల్దార్, 150 ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, గ్రేడ్–3 మున్సిపల్ కమిషనర్ల పోస్టులు 4, గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్ 16, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 28 పోస్టులతో పాటు 59 శాఖల్లో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఏఓ), సీనియర్ ఆడిటర్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్, వివిధ సెక్షన్లలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 566 ఉన్నాయి. ఈ మొత్తం ప్రక్రియను మే నెల నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో కమిషన్ ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసింది. వెబ్సైట్లో సిలబస్ అభ్యర్థుల అభ్యర్థన, సౌలభ్యం మేరకు గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్షను ఆబ్జెక్టివ్ తరహాలో ఆఫ్లైన్లో నిర్వహించనున్నారు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీలో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 2.30 గంటల్లో ఓఎంఆర్ షీట్పై సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. మెయిన్స్లో పేపర్–1, పేపర్–2లో 150 చొప్పున ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. పరీక్ష సిలబస్ను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఖాళీలు, వేతనం, వయసు, విద్యార్హతలతో పాటు పూర్తి సమాచారం కోసం కమిషన్ వెబ్సైట్ http://www.psc.ap.gov.inలో చూడవచ్చు. -
నాలుగు నెలల్లో 4 కొలువులు.. అయినా సివిల్స్ లక్ష్యంగా..
మంచి ప్యాకేజీతో వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదనుకున్నాడు. ప్రభుత్వ రంగంలో ప్రజాసేవతో వీలున్న కొలువు కావాలనుకున్నాడు. వరుస పరాజయాలు ఎదురైనా ధిక్కరించాడు. లక్ష్య సాధనకు పరాక్రమించాడు. ఏ దశలోనూ నిరాశను దరి చేరనీయరాదనుకున్నాడు. ఆత్మవిశ్వాసమే మార్గమని విశ్వసించాడు. ఫలితంగా ఈ ఏడాది నాలుగు నెలల వ్యవధిలో నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. చివరకు గ్రూప్–1 ద్వారా డీఎస్పీ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నాడు ఓ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు చుక్కల సూర్యకుమార్. అయినప్పటికీ అంతిమ లక్ష్యం.. సివిల్స్పై గురి వీడలేదు. నిరంతర పరిశ్రమకు చిరునామాగా నిలిచే సూర్యకుమార్ను ఒకసారి పలకరిస్తే.. రాజమహేంద్రవరం: మాది మధ్య తరగతి కుటుంబం. సొంత ఊరు కాకినాడ జిల్లా తొండంగి మండలం పైడికొండ. నాన్న వెంకట రమణ కడియం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్. అమ్మ లక్ష్మి గృహిణి. తమ్ముడు గోవిందరాజు, అక్క స్వాతి ఉన్నారు. తమ్ముడు ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివి ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీలో సూపర్ స్పెషాలిటీ చేస్తున్నాడు. నాకు టెన్తులో మంచి మార్కులొచ్చాయి. స్టేట్లో ఆరో ర్యాంకు వచ్చింది. ఆ మార్కులు ఆధారంగా 2008లో నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. అక్కడ నా చదువుకు గట్టి పునాది పడింది. ఇంటర్లో కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. యూనివర్సిటీ స్థాయిలో టాప్ టెన్లో ఒకడిగా నిలిచాను. 2014లో బీటెక్ అయ్యాక ఇన్ఫోసిస్ ఉద్యోగానికి క్యాంపస్లో సెలక్టయ్యాను. అప్పట్లోనే నాకు వార్షిక జీతం రూ.35 లక్షలు. అందులో కొనసాగి ఉంటే ఇప్పుడు రూ.కోటిన్నరకు చేరేవాడిని. త్రుటిలో చేజారిన అవకాశాలు ఎక్కువ జీతం.. సాఫ్ట్వేర్ ఉద్యోగం నాకు సంతృప్తి కలిగించలేదు. అందులో సంతోషంతో ఇమడలేకపోయాను. రెండేళ్లు పని చేశాను. కానీ పబ్లిక్ సర్వీసుతో సంబంధమున్న ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే కోరిక నాలో బలంగా నాటుకుపోయింది. ఇదే విషయాన్ని నాన్నతో చెప్పాను. ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాను. మా కుటుంబ ఆర్థిక పరిస్థితులకు ఇది ఇబ్బందికరమైనా నాన్న నన్ను ప్రోత్సహించారు. ఢిల్లీలో సివిల్స్ కోచింగుకు జాయినయ్యాను. 2017–20 మధ్య నాలుగుసార్లు రాశాను. ఇంటర్వ్యూ దశకు చేరుకోలేకపోయాను. ఇదే సమయంలో ఇతర పోటీ పరీక్షలపై దృష్టి పెట్టాను. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్, ఎస్సెస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షల్లో తుది జాబితాలో మిస్సయ్యాను. 2020 గ్రూప్–2లో సర్టిఫికెట్ వెరిఫికేషన్లో అవకాశం పోయింది. అదే ఏడాది గ్రూప్–1 మెయిన్కు అర్హత సాధించినా ఇంటర్వ్యూ పోయింది. ఎస్సెస్సీ సీజీల్, నాబార్డు, ఆర్బీఐ.. ఇలా నాలుగైదు పరీక్షలు పాసైనా త్రుటిలో విజయం దూరమయ్యేది. ఈ దశలో మానసిక దృఢత్వం కోల్పోతానేమోనని సంశయించాను. అయినా పట్టుదలతో కష్టపడేవాడిని. నిరాశ చెందేవాడిని కాదు. అంతిమ లక్ష్యం సివిల్స్ 2023– ఈ ఏడాది నా జీవితంపై చాలా మంచి ప్రభావం చూపించింది. వరుస వైఫల్యాల నుంచి గట్టెక్కించేలా చేసింది. నాలుగు నెలల వ్యవధిలో నాలుగు ఉద్యోగాలు వచ్చాయి. దేవదాయ శాఖలో ఈఓ పోస్టుకు ఎంపికయ్యాను. కాగ్ అకౌంటెంటుగా సెలక్టయ్యాను. సరదాగా రాసిన గ్రూప్–4 ఉద్యోగమూ వచ్చింది. గ్రూప్–1లో విజేతగా నిలిచాను. జైల్స్ డీఎస్పీగా ఎంపికయ్యాను. ప్రస్తుతానికి దేవదాయ శాఖలో ఈఓ శిక్షణ పొందుతున్నా.. వచ్చే జనవరిలో డీఎస్పీ ట్రైనింగ్ ఆర్డర్ రాగానే వెళ్లాలని నిర్ణయించుకున్నాను. డీఎస్పీ అయినా నా జీవిత లక్ష్యం మాత్రం సివిల్ సర్వీసెస్కు ఎంపిక కావాలన్నదే. ఎలాగైనా సాధిస్తానని నమ్మకం ఉంది. పేరు : చుక్కల సూర్యకుమార్ తండ్రి : వెంకటరమణ,హెడ్ కానిస్టేబుల్ తల్లి : లక్ష్మి, గృహిణి చదువు : బీటెక్ (ట్రిపుల్ ఐటీ, నూజివీడు) ఎంపిక : గ్రూప్–1లో డీఎస్పీ (జైళ్లు)ప్రస్తుతం ఉంటున్నది : వేమగిరి (తూర్పు గోదావరి) లక్ష్యం నిర్ణయించుకుని శ్రమించాలి జీవితంలో ఏం చేయాలనుకుంటున్నామో మన సామర్థ్యానికి అనుగుణంగా ముందుగానే లక్ష్యం నిర్ణయించుకోవాలి. ఏదైనా సాధించాలంటే కష్టం తప్ప మరో మార్గం ఉండదని తెలుసుకోవాలి. ఒడుదొడుకులు ఎదురైనా ఏ సమయంలోనూ ఆత్మ విశ్వాసాన్ని దూరం చేసుకోకూడదు. నేనైతే ఈ పరీక్షల ప్రిపరేషనులో అన్ని సరదాలు, షికారులు వదులుకున్నాను. ఫెయిల్యూర్స్ వస్తున్నా నిరాశ పడకుండా ప్రయత్నం కొనసాగించాలి. ప్రణాళిక ప్రకారం ప్రిపేరైతే తప్పకుండా విజయం సాధిస్తాం. – చుక్కల సూర్యకుమార్ -
గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దు సబబే
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సమర్ధించింది. నోటిఫికేషన్ నిబంధనలను సవరిస్తూ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయకపోవడం చట్ట వ్యతిరేకమేనని పేర్కొంది. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత సింగిల్ జడ్జి తీర్పు వెలువరించారని, అందులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. జూన్ 11న నిర్వహించిన పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని ఆదేశించింది. బయోమెట్రిక్ సహా నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని నిబంధనలను తప్పకుండా పాటించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)కి తేల్చిచెప్పింది. సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేయాలని కోరుతూ టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను తిరస్కరిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేస్తూ ఈ నెల 23న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. టీఎస్పీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అప్పీల్లో ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాది గిరిధర్రావు, నర్సింగ్, హసీనా సుల్తానా వాడీవేడిగా వాదనలు వినిపించారు. బయోమెట్రిక్పై వాదన ఆమోద యోగ్యం కాదు ‘గత ఏడాది అక్టోబర్లో తొలిసారి గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించినప్పుడు 2.83 లక్షల మంది వరకు హాజరయ్యారని కమిషన్ చెబుతోంది. అప్పుడు సమర్థవంతంగా బయోమెట్రిక్ నిర్వహించిన కమిషన్.. 2.33 లక్షల మంది పాల్గొన్న జూన్లో మాత్రం భారీ సంఖ్య కారణంగా తీసుకోలేదని చెప్పడం ఆమోదయోగ్యం కాదు. కానిస్టేబుల్ పోస్టులు సహా ఇతర పలు పోస్టుల నియామక పరీక్షలకు బయోమెట్రిక్ తీసుకున్నప్పుడు గ్రూప్–1కు తీసుకోకపోవడాన్ని కమిషన్ సమర్ధించుకోలేదు. ఇంకోవైపు 50 వేల మంది పరీక్షకు దూరం కావడం చిన్న విషయమేమీ కాదు. అభ్యర్థుల్లో కమిషన్ విశ్వసనీయత కోల్పోవడమే ఇందుకు కారణంగా కన్పిస్తోంది. నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం ఓఎంఆర్ షీట్లపై ఇద్దరు ఇన్విజిలేటర్ల సంతకాలు ఉండాలి. కానీ కొన్ని షీట్లపై ఒక్కరి సంతకమే ఉంది. దీనికి కమిషన్ సమాధానం సమంజసనీయంగా లేదు. గ్రూప్–1 కంటే ఎక్కువ మంది హాజరైన గ్రూప్–4కు ఓఎంఆర్ షీట్లపై ఫొటో ఇచ్చినప్పుడు గ్రూప్–1కు ఇవ్వకపోవడం అక్రమాలకు ఆస్కారం ఇచ్చేలా ఉంది..’అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆ 258 మంది భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది.. ‘నోటిఫికేషన్ నిబంధనల్లో మార్పుచేర్పులు, సవరణలు చేసే అధికారం కమిషన్కు ఉంది. అయితే నోటిఫికేషన్ వెలువరించాక సవరణ చేయాలనుకుంటే ఆ మేరకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి. గ్రూప్–4 పరీక్షలకు బయోమెట్రిక్ లేదంటూ అనుబంధ నోటిఫికేషన్ వెలువరించిన కమిషన్ గ్రూప్–1 విషయంలో అలా చేయకపోవడం సమర్థనీయం కాదు. జూన్ 11న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తర్వాత 2,33,248 మంది పరీక్షకు హాజరయ్యారని చెప్పిన కమిషన్.. అనంతరం ఆ సంఖ్యను 2,33,506గా చెప్పింది. ఈ వ్యత్యాసం గ్రూప్–1 మొత్తం పోస్టుల్లో (503) సగం కంటే ఎక్కువ (258). ఒకవేళ నిజంగా అక్రమాలు చోటుచేసుకుని ఈ 258 మంది మెయిన్స్ పరీక్షకు ఎంపికైతే.. అంతమంది మెరిట్ అభ్యర్థులు అవకాశం కోల్పోతారు. వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇక ప్రిలిమ్స్ ప్రాథమిక పరీక్ష అని, పట్టించుకోనవసరం లేదన్న కమిషన్ వాదన కూడా ఆమోదయోగ్యంగా లేదు. ఇరుపక్షాల వాదనలను లోతుగా పరిశీలించాక సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఆస్కారం కనబడటం లేదు..’అని బెంచ్ స్పష్టం చేసింది. ముగ్గురి వల్ల లక్షల మంది ఇబ్బందుల్లోకి.. ‘ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పరీక్షను రద్దు చేయాలని కోరారు. ముగ్గురి కోసం లక్షల మంది భవిష్యత్ ఇబ్బందుల్లో నెట్టడం సరికాదు. 2.33 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని అప్పీల్ను ఆమోదించాలి..’అని ఏజీ కోరారు. కాగా.. ‘అభ్యర్థుల సంఖ్యలో తేడా అక్రమాలు తావిచ్చేదిగా ఉంది. పరీక్షల నిర్వహణలో కమిషన్కు చిత్తశుద్ధి లోపించింది. ఒకసారి పేపర్ లీక్ అయినప్పుడు కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్ష నిర్వహించాల్సిన కమిషన్.. రెండోసారి కూడా విఫలమయ్యింది. కాబట్టి పరీక్షను రద్దు చేసి నోటిఫికేషన్లోని నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించాలి..’అంటూ గిరిధర్రావు, నర్సింగ్ వాదించారు. -
గ్రూప్-1 రద్దు..హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి షాక్
-
గ్రూప్–1 అభ్యర్థుల్లో గుబులు!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దుకావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఓసారి రద్దుకావడంతో రెండోసారి పరీక్ష రాయాల్సి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయాలంటే ఎలాగని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కష్టపడి చదివామని, వేలు, లక్షలు ఖర్చుపెట్టి శిక్షణ తీసుకున్నామని.. ఇప్పుడంతా వృధా అయినట్లే అని ఆవేదన చెందుతున్నారు. మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించినా అది ఎప్పుడు ఉంటుందో, అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని వాపోతున్నారు. లీకేజీతో ఓసారి.. నిర్లక్ష్యంతో మరోసారి వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీకాగా.. 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి మెయిన్స్ పరీక్ష తేదీలను కూడా ప్రకటించింది. కానీ టీఎస్పీఎస్సీ కార్యాలయం నుంచి ప్రశ్నపత్రాలు లీకైన వ్యవహారం బయటపడటంతో గ్రూప్–1 ప్రిలిమ్స్ను పరీక్షను రద్దు చేసింది. మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులు ఈ నిర్ణయంతో గందరగోళంలో పడ్డారు. ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అందరికీ తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్షలను నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ క్రమంలో రెండోసారి ప్రిలిమ్స్కు 3,09,323 మంది హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోగా.. 2,33,248 మంది పరీక్ష రాశారు. ఈసారి ప్రిలిమ్స్ నిర్వహణ లోపభూయిష్టంగా, అక్రమాలకు తావిచ్చేలా ఉందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. రెండో ప్రిలిమ్స్నూ రద్దు చేయాలని సర్కారును ఆదేశించింది. రద్దయితే వచ్చే ఏడాదే? గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దు తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీలు చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఒకవేళ రద్దు తీర్పును డివిజన్ బెంచ్ సమర్థిస్తే.. మూడోసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఇప్పట్లో ప్రిలిమ్స్ నిర్వహణ సాధ్యంకాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం.. పరీక్ష కోసం కనీసం రెండు నెలల గడువు ఇస్తూ తేదీని ప్రకటించాల్సి ఉంటుంది. వచ్చే నెలలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వస్తే తర్వాత రెండు నెలల పాటు అధికార యంత్రాంగం ఎన్నికల పనిలోనే బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించడం కష్టమనే అభిప్రాయం ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్సభ ఎన్నికలూ జరగాల్సి ఉంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది మే వరకు గ్రూప్–1 పరీక్షలు వాయిదాపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులు ఆగమాగం గతేడాది ఏప్రిల్లో గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతోనే లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమవడంపై దృష్టిపెట్టారు. చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నవారు అది మానేసి, కొందరు దీర్ఘకాలిక సెలవులు పెట్టి పరీక్ష కోసం శిక్షణ తీసుకున్నారు. దీనికితోడు ఏళ్లుగా పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నవారు మరింత ఫోకస్ పెట్టారు. పకడ్బందీగా చదువుకుని ప్రిలిమ్స్ పరీక్షలు రాశారు. కానీ లీకేజీ వ్యవహారంతో పరీక్ష రద్దుకావడంతో నిరుత్సాహానికి గురయ్యారు. అయితే టీఎస్పీఎస్సీ వేగంగా చర్యలు చేపట్టి, తిరిగి ప్రిలిమ్స్ నిర్వహించే తేదీని ప్రకటించడంతో.. అభ్యర్థులంతా ఎంతో ఆశతో రెండోసారి పరీక్ష కోసం సిద్ధమయ్యారు. అలా ఈ ఏడాది జూన్ 11న పరీక్ష రాశారు. ఫలితాల విడుదల, మెయిన్స్కు 1ః50 నిష్పత్తిలో ఎంపిక జాబితా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. తాజాగా హైకోర్టు తీర్పుతో దిక్కుతోచని స్థితి లో పడ్డారు. మూడోసారి పరీక్ష కోసం చదవాల్సి రావడమేంటన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పరీక్ష రాయాలంటే భయంగా ఉంది గ్రూప్–1 ఉద్యోగం సాధించాలని రెండేళ్లుగా సన్నద్ధమవుతున్నాను. ప్రిలిమ్స్ రద్దు తో సమయం, డబ్బు వృథా అయ్యాయి. మరోసారి పరీక్ష రాయాలంటేనే భయం వేస్తోంది. పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి లీకేజీ, మరోసారి నిర్వహణ లోపాలతో రద్దు చేశారు. మొదటిసారి ప్రశ్నపత్రంలో 5 ప్రశ్నలు, రెండోసారి 7 ప్రశ్నలు తొలగించారు. ఇంత నిర్లక్ష్యమైతే ఎలా? – బి.అనిల్ కుమార్, హనుమకొండ -
పేపర్లు లీక్ చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్నారు!
సాక్షి, పెద్దపల్లి: టీఎస్పీ ఎస్సీ పరీక్ష పేపర్లు లీక్చేసి రూ.వేల కోట్లకు అమ్ముకున్న గజదొంగ కేసీఆర్ అని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఉద్యోగ నోటి ఫికేషన్ల పేరిట రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన కేసీఆర్ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పార్టీ శ్రేణులను కోరారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లా డారు. జూన్ 11న టీఎస్పీఎస్సీ రెండోసారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీఎస్పీ ఎస్సీ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పేపర్ల లీకేజీ సూత్రధారులు ముఖ్యమంత్రి కార్యాల యంలోనే ఉన్నారని ఆరోపించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్కు హాజరైన వారికంటే అదనంగా 270 ఓఎంఆర్ షీట్లు ఎలా వచ్చాయో ఆ సంస్థ చైర్మన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. చైర్మన్ జనార్దన్రెడ్డి, సభ్యులను తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి హనుమయ్య, కార్యదర్శి దేవునూరి సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
నాడు జూనియర్ అసిస్టెంట్.. నేడు గ్రూప్–1 అధికారిణి
పొదలకూరు: ఆమె ఒకప్పుడు జూనియర్ అసిస్టెంట్గా పనిచేశారు. కష్టపడి చదివి నేడు గ్రూప్–1 అధికారిణిగా మారారు. కుటుంబం, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉంటే విజయం సొంతమవుతుందని గ్రూప్–1కు ఎంపికై న ఎల్ఎస్ఆర్ రుధిర తెలిపారు. నెల్లూరులోని కొత్తూరుకు చెందిన ఆమె శుక్రవారం సాక్షితో మాట్లాడారు. తండ్రి పద్మనాభరావు. తల్లి శాంతికుమారి. తల్లి గతంలో పొదలకూరు రెవెన్యూ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేశారు. రుధిర పొదలకూరు మండలం వరదాపురం శ్రీసాయినాథ్ స్కూల్లో 2014 – 15 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివారు. తర్వాత ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. 2021లో సివిల్ ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. ఇంకా ఐజీఎన్ఓయూలో బీఏ పూర్తి చేశారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే పట్టుదలతో రాష్ట్ర హైకోర్ట్ పెట్టిన పరీక్ష రాసి జూనియర్ అసిస్టెంట్గా ఎంపికై నెల్లూరు కోర్టులో పనిచేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇటీవల గ్రూప్–1 సాధించి ఖజానా శాఖకు ఎంపికయ్యారు. నా లక్ష్యం ఐఏఎస్ శ్రీసాయినాథ్ స్కూల్లో కరస్పాడెంట్ మురళీకృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి విద్యార్థులను చదివించడంలో ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. ఇది నా భవిష్యత్కు ఎంతో ఉపయోగపడింది. పోటీ పరీక్షలు రాసేందుకు హైదరాబాద్లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా. ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యం. ఇందుకోసం కఠోర శ్రమ పడాల్సి ఉంటుంది. పట్టుదల, కృషి ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చు. – రుధిర -
ఆశయం ముందు తలవంచిన అవరోధాలు
కందుకూరు: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న ఆమె చిన్ననాటి ఆశయం ముందు పెళ్లి, కుటుంబ బాధ్యతలు, అనారోగ్యం వంటి అవరోధాలన్నీ చిన్నబోయాయి. పట్టుదల, నిరంతర కృషితో ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించవచ్చని నిరూపించింది ఉలవపాడు మండలం బద్దిపూడికి చెందిన చేజర్ల రమ్యరెడ్డి. ఇటీవల విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో విజయం సాధించింది. ఎటువంటి కోచింగ్ లేకుండానే తన సొంత ప్రిపరేషన్తో రెండో ప్రయత్నంలోనే గ్రూప్–1 ఆఫీసర్గా ఎంపికై ంది. పబ్లిక్ సర్వీస్ చిన్ననాటి కోరిక బద్దిపూడికి చెందిన శ్రీనివాసులరెడ్డి, కృష్ణవేణి దంపతుల కుమార్తె చేజర్ల రమ్యరెడ్డి. తండ్రి సాధారణ రైతు కావడంతో రమ్య పాఠశాల విద్యను అమ్మనబ్రోలులోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో పూర్తి చేసింది. విజయనగరం జిల్లా తాటిపూడి రెసిడెన్షిల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యను పూర్తి చేసింది. అనంతరం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో బీఫార్మసీ, ఏలూరు జిల్లాలోని నోవా కళాశాలలో ఎంఫార్మసీ పూర్తి చేసింది. ఆ తరువాత రెండేళ్ల పాటు అరబిందో ఫార్మా స్యూటికల్స్లో ఉద్యోగం చేసింది. 2010లో తల్లిదండ్రులు చూసిన సంబంధం మేరకు మాచవరానికి చెందిన వంశీకృష్ణారెడ్డిని వివాహం చేసుకుంది. భర్త మలేసియాలో ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రూమెంటేషన్ ఇంజినీర్గా పనిచేస్తుండడంతో అక్కడికి వెళ్లారు. ఆ తరు వాత 2018లో స్వదేశానికి వచ్చి కరోనా ప్రభావంతో ఇక్కడే ఉండిపోయారు. రెండో ప్రయత్నంలోనే.. రమ్యరెడ్డి తన రెండో ప్రయత్నంలోనే గ్రూప్–1 ఉద్యోగం సాధించింది. 2018 చివరిలో వెలువడిన గ్రూప్–1 నోటిఫికేషన్ సమయానికి రమ్యకు ఐదేళ్ల కుమారుడితో పాటు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. అయినా సరే గ్రూప్–1 పరీక్షలు రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లింది. ఇంటర్వ్యూలో సరైన మార్కులు రాకపోవడంతో త్రుటిలో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. 2022 సెప్టెంబర్లో మళ్లీ గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదలవగా ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధమైంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ లు పాసై మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించింది. మెయిన్స్ సమయంలో సైనసైటిస్ మేజర్ ఆపరేషన్తో నెల పాటు ప్రిపరేషన్ నిలిచిపోయినా మళ్లీ కోలుకుని పరీక్షలు రాసి విజయం సాధించింది. తాను చిన్ననాటి నుంచి కలలు కన్న ప్రభుత్వ ఉద్యోగం ఆశయాన్ని నెరవేర్చుకుంది. ఇష్టపడి కష్టపడితే ఏదైనా సాధ్యమే చాలా మంది పెళ్లి అయిన తరువాత ఇంకేమి సాధిస్తాం అని చెప్తుంటారు. కానీ సరైన లక్ష్యాన్ని ఎంచుకుని కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. నా ఉద్యోగ ప్రయత్నంలో నా భర్త వంశీకృష్ణారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు చాలా సహకరించారు. అందుకే నాలుగేళ్ల పాటు పట్టు వదలకుండా నిరంతరం కష్టపడి చదివాను. చివరికి నాకు ఇష్టమైన మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంట్లోనే ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. ప్రజలకు సేవ చేసేందుకు ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నా. – రమ్యరెడ్డి -
రెండో ప్రయత్నంలోనే డిప్యూటీ కలెక్టర్.. అలా చేస్తే కోచింగ్ అనసవరం: షేక్ అయేషా
‘ఓటమి ఎదురైనప్పుడే మరింత శ్రమించడం అలవాటవుతుంది... అప్పుడే విజయం ముంగిటకు వచ్చి వాలుతుంది. పట్టుదలతో ముందుకు సాగితే ఎంతటి లక్ష్యమైనా ఇదిగో ఇట్టే మన సొంతమవుతుంది..’ ఇదీ ఏపీపీఎస్సీ గ్రూప్–1 విజేత, డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై న మదనపల్లెకు చెందిన షేక్ ఆయేషా చెప్పిన మాటలు. పేదరికంలో పుట్టినా.. కష్టాలు పలకరించినా వెనుదిరగలేదు. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా మలచుకుని డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై యువతకు ఆదర్శంగా నిలిచారు. ఆయేషా విజయప్రస్థానం ఆమె మాటల్లోనే.. అన్నమయ్య : లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఒకసారి వైఫల్యం ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగితే ఎంతటి విజయానైన్నా ఇట్టే సాధించవచ్చు. సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్, ఇంటర్నెట్ లాంటి సాధనాలు అభివృద్ధి చెందిన నేటి రోజుల్లో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకుని దాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీకాదు. ప్రణాళిక, పట్టుదల ఉంటే కోచింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. ప్రతి రోజు దినపత్రికలు చదివి , కరెంట్ ఎఫైర్స్ నోట్స్ సొంతంగా తయారు చేసుకుంటే మంచి ఫలితాలు సాధించగలం. దానికి నేనే ఉదాహరణ. లక్షసాధనకు ఐదేళ్లు తపస్సు సివిల్స్ నా చిన్ననాటి కల. బీటెక్ పూర్తి చేసిన తరువాత పినాకా ఆర్గనైజేషన్ నిర్వాహకులు యాదగిరి ,ముంబైలోని ఆర్బిఐ గ్రేడ్–బి మేనేజర్ మిథున్ల సూచనలు, సలహాలతో సివిల్స్ వైపు దృష్టి సారించా. 2018లో బీటెక్ పూర్తి చేసే సమయంలోనే క్యాంపస్ సెలక్షన్స్లో, టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎంపికయ్యా. అయినా నా లక్ష్యం గ్రూప్స్ కావడంతో ఉద్యోగంలో చేరలేదు. 2004 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించే పినాకా స్టూటెండ్స్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ వాట్స్ప్ గ్రూపులో చేరాను. ఇందులో గ్రూప్స్కు ప్రిపేర్ కావడానికి అవసరమైన మెటీరియల్ లభించేది. దీనితో పాటు యాదగిరి పూర్తిగా సహకారం అందించారు. 2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడగా దరఖాస్తు చేసుకున్నాను. మొదటి ప్రయత్నంగా 2019లో గ్రూప్–1 ప్రిలిమినరీ, 2020లో మెయిన్స్ పాసై ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. కాని ఎంపిక కాలేదు. ఆ సమయంలో తల్లిదండ్రులు అండగా నిలబడి మరింత ప్రోత్సాహాన్ని అందించారు. మరో ప్రయత్నం చేయడానికి మనోధైర్యాన్ని కల్పించారు. దీంతో నాలో పట్టుదల పెరిగింది. 2022 సెప్టెంబర్లో గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ కాగా ఆత్మస్థైర్యంతో మరింత కష్టపడి పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధించాను. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగాను. ఐదేళ్ల తపస్సు నెరవేరింది. సాధారణ విద్యార్థినే.. 1 నుంచి 10 వరకు ఆరోగ్యమాత ఎయిడెడ్ ఉన్నత పాఠశాలో చదివాను. ప్రాథమిక పాఠశాలలో సాధారణ విద్యార్థిని. ఉపాధ్యాయులు శ్రీనివాసులు, పద్మావతి, సుబ్బలక్ష్మి, హెచ్ఎం వాసుదేవరావులు అన్ని విధాలుగా ప్రోత్సహించారు. మూడో తరగతి నుంచి నాకు మంచి ఫౌండేషన్ వేశారు. పదిలో 9.8 పాయింట్లు వచ్చాయి. ఇంటర్మీడియట్ తిరుపతి ఎన్ఆర్ఐ కాలేజీలో చేరాను. కాలేజీలో ఫిజిక్స్ అధ్యాపకులు గోవిందరాజులు నన్ను బాగా ప్రోత్సహించారు. ఇంటర్మీడియట్లో 982 మార్కులు సాధించాను. బీటెక్ తమిళనాడు తంజావూరులోని శస్త్ర యూనివర్శిటీలో చదివాను. 2018లో బీటెక్ పూర్తి చేశాను. సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నా... తమిళనాడు తంజావూరు శస్త్ర యూనివర్శిటీలో బిటెక్ పూర్తి చేశా. టెక్ట్స్ బుక్స్, ఎన్సీఈఆర్టి బుక్స్ చదివి సొంతంగానే నోట్స్ తయారు చేసుకున్నా. క్రమం తప్పకుండా ప్రతి రోజూ దినపత్రికలు హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, సాక్షి చదవడం అలవాటు చేసుకున్నా. ఆయా పత్రికల్లో వచ్చే ఎడిటోరియల్ కాలమ్స్,కరెంట్ ఎఫైర్స్ చదవడం అలవాటుగా మారింది. రోజుకు తొమ్మిది గంటల పాటు చదివాను. తల్లిదండ్రులే కొండంత అండ: గ్రూప్స్ ప్రిపరేషన్లో తల్లిదండ్రులు అండగా నిలబడ్డారు. నాన్న షేక్ అహ్మద్బాషా చిరు వ్యాపారి. అమ్మ గౌసియాబేగం సాధారణ గృహిణి. నా సక్సెస్లో వారి ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరువలేను. ఏ సమయంలోనైనా నేను ఒత్తిడికి గురైతే నన్ను వెన్నుతట్టి నాలో ఆత్మస్థైర్యాన్ని కల్పించేవారు. ఇక స్కూలు రోజుల్లో ఉపాధ్యాయులు శ్రీనివాసులు, పద్మావతి, సుబ్బలక్ష్మి ,వాసు నా చదువులో ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. వారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఐఏఎస్ కావాలనేది నా ఆకాంక్ష ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. అందుకు శక్తివంచన లేకుండా నా ప్రయత్నాలు చేస్తా. మహిళలను విద్యావంతులు చేయడం, అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించడం, ఆర్థికంగా ఎదిగే విధంగా తోడ్పాటునందిస్తా. ఎక్కడ పని చేసినా అక్కడ నిరక్షరాస్యత లేని ప్రాంతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు సాగుతా. ఫ్రొఫైల్ పేరు : షేక్ ఆయేషా తండ్రి : షేక్ అహ్మద్బాషా తల్లి : షేక్ గౌసియా బేగం నివాసం : మదనపల్లె పాఠశాల విద్య : ఆరోగ్యమాత ఇంగ్లీషు మీడియం స్కూల్, మదనపల్లె కళాశాల విద్య : ఎన్ఆర్ఐ కాలేజీ, తిరుపతి బీటెక్ : శస్త్రా యూనివర్శిటీ, తంజావూరు, తమిళనాడు తన కలే మా కల ఆయిషా చిన్నప్పటి నుంచి సివిల్స్లో రాణించడమే లక్ష్యంగా ఎంచుకుంది. అందు కోసం నిరంతరం శ్రమించింది. తన కలను మాకలగా మార్చుకుని అన్ని విధాలుగా ప్రోత్సహించాం. ఈ సుదీర్ఘప్రయాణంలో చదువులో అవసరమైన అన్నింటిని సమకూర్చాం. దీంతో తన స్వప్నం సాకారం కావడం మాకు సంతోషాన్ని కలిగించింది. – షేక్ అహ్మద్బాషా, గౌసియాబేగం, తల్లిదండ్రులు -
గ్రూప్–1 ఫైనల్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 111 గ్రూప్–1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గురువారం విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 11 నెలల వ్యవధిలోనే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఈ ఫలితాల వివరాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మీడియాకు వెల్లడించారు. మొత్తం 111 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను నిర్దేశిత తేదీల్లో ఏపీపీఎస్సీ నిర్వహించింది. 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ఒక పోస్టుకు ఎంపికపై క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) నుంచి నివేదిక రావాల్సి ఉంది. పోటీపడ్డ ఉన్నత విద్యావంతులు.. మొత్తం 111 పోస్టులకు గాను 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయగా వారిలో పురుషులు 59 మంది (53.6 శాతం) మహిళలు 51 (46.4 శాతం) మంది ఉన్నారు. టాప్ 10 ర్యాంకుల్లో ఆరుగురు మహిళలుండగా నలుగురు పురుషులున్నారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన 220 మందిలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులే. వీరిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మెయిన్స్ రాసిన వారు 32 మంది ఉండగా ఇంటర్వ్యూలకు వరకు వెళ్లిన వారు 13 మంది ఉన్నారు. విద్యార్హతల పరంగా చూస్తే.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) వంటి జాతీయ ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన వారు 35 మంది ఉన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను, ఇంటర్వ్యూలను అత్యంత పకడ్బందీగా ఏపీపీఎస్సీ నిర్వహించింది. ఇంటర్వ్యూ బోర్డులో ఇద్దరు అఖిల భారత సర్వీస్ అధికారులు, సబ్జెక్టు నిపుణులు, వైస్ చాన్సలర్లు, ఐఐటీ, ఐఐఎం తదితర అత్యున్నత సంస్థల ప్రముఖులను సభ్యులుగా చేర్చింది. అత్యున్నత ప్రమాణాలతో ఎంపికలు జరిగి రాష్ట్రానికి ఉత్తమ సేవలు అందించేలా తుది ఎంపికలను పూర్తి చేసింది. మెయిన్స్ పరీక్షలకు 6,455 మంది ఎంపిక.. గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతేడాది సెప్టెంబర్ 30న నోటిఫికేషన్ వెలువరించింది. మొత్తం 1,26,450 మంది దరఖాస్తు చేయగా జనవరి 8న నిర్వహించిన ప్రిలిమ్స్కు 86,494 మంది హాజరయ్యారు. ప్రిలిమ్స్ ఫలితాలను కేవలం 19 రోజుల్లోనే కమిషన్ వెల్లడించింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు 6,455 మందిని ఎంపిక చేసింది. జూన్ 6 నుంచి 10 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలకు 4,688 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల మూల్యాంకనాన్ని అత్యంత పారదర్శకంగా 34 రోజుల్లోనే ఏపీపీఎస్సీ పూర్తి చేయించింది. జూలై 14న మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. వీరిలో 220 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. ఆగస్టు 2 నుంచి 11 వరకు మూడు బోర్డులతో వీటిని నిర్వహించింది. టాప్–5 ర్యాంకర్లు వీరే.. భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష భూమిరెడ్డి పావని కంబాలకుంట లక్ష్మీప్రసన్న కె.ప్రవీణ్కుమార్రెడ్డి భానుప్రకాశ్రెడ్డి మిమ్మితి టాపర్స్ ఇలా.. పేరు: గణేశ్న భాను శ్రీలక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష విద్యార్హత: గ్రాడ్యుయేషన్, ఢిల్లీ యూనివర్సిటీ స్వస్థలం: సీసలి, కాళ్ల మండలం, పశ్చిమ గోదావరి తండ్రి: వెంకట రామాంజనేయులు ( ప్రభుత్వ ఉపాధ్యాయుడు, డీఈవో కార్యాలయంలో ఏపీవో) ► భాను శ్రీలక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష గ్రూప్–1లో మొదటి ర్యాంకు సాధించారు. ఢిల్లీ యూనివర్సిటీలోని లేడీ శ్రీరామ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రిలిమ్స్ పూర్తిచేసి సెప్టెంబర్ 15 నుంచి జరగనున్న మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నట్టు తండ్రి రామాంజనేయులు తెలిపారు. పేరు: భూమిరెడ్డి పావని విద్యార్హత: బీటెక్ (ఈసీఈ) తండ్రి: భూమిరెడ్డి గంగయ్య (రైతు) తల్లి: లక్ష్మీదేవి స్వస్థలం: మైదుకూరు, వైఎస్సార్ జిల్లా ► పావని గ్రూప్–1 ఫలితాల్లో 2వ ర్యాంకు సాధించారు. 2016 నుంచి హైదరాబాద్లో గ్రూప్స్కి సన్నద్ధమవుతున్నారు. 2016, 2017లో గ్రూప్–2 మెయిన్స్వరకు వెళ్లారు. 2018లో గ్రూప్–1 ఇంటర్వ్యూ వరకు వెళ్లగలిగారు. తల్లిదండ్రులు, సోదరి భాగ్య, సోదరుడు గణేష్ సహకారంతో కష్టపడి చదివి ఈసారి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. పేరు: కె.లక్ష్మీప్రసన్న విద్యార్హత: బీటెక్ (ఐటీ) 2013, రాజంపేట స్వస్థలం: టంగుటూరు గ్రామం, అన్నమయ్య జిల్లా భర్త: పి.చంద్రదీప్ (పంచాయతీ సెక్రటరీ) తండ్రి: కె.సుబ్బారాయుడు (ఆర్టీసీ రిటైర్డ్ కండక్టర్) తల్లి: సరస్వతి ► లక్ష్మీ ప్రసన్న గ్రూప్–1 ఫలితాల్లో 3వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఆమె టీవీ పురం పంచాయతీలో గ్రామ–వార్డు సచివాలయ వ్యవస్థలో పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నారు. 2014 నుంచి సివిల్స్కు సన్నద్ధమవుతున్నారు. పేరు: కుప్పిరెడ్డి ప్రవీణ్ కుమార్రెడ్డి విద్యార్హత: బీటెక్ (ఈఈఈ), 2009, మదనపల్లె స్వస్థలం: ప్రొద్దుటూరు, వైఎస్సార్ జిల్లా తండ్రిపేరు: కేసీ వెంకటరెడ్డి(డీసీసీబీ రిటైర్డ్ సూపర్వైజర్) తల్లి: కె.రామసుబ్బమ్మ ► ప్రవీణ్కుమార్రెడ్డి గ్రూప్–1 ఫలితాల్లో 4వ ర్యాంకు సాధించారు. ఆయన 2018లో గ్రూప్–1 నోటిఫికేషన్లో పరీక్ష రాయగా.. 2022లో రిజల్ట్స్ వచ్చాయి. 47వ ర్యాంకు సాధించగా.. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా సెలక్టయ్యారు. కానీ.. 2018లోనే గ్రూప్–2 పరీక్ష రాయగా.. 2020లో వెలువడిన ఫలితాల్లో 11వ ర్యాంక్ సాధించి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా ఎంపికై ప్రస్తుతం మదనపల్లెలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా పని చేస్తున్నారు. అంతకు ముందు ఎనిమిదేళ్లు ఒరాకిల్ టెక్నాలజీస్ అండ్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేశారు. 2018 నాటి గ్రూప్–1 ఫలితాలు 2022లో వెలువడే నాటికే ఆయన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా ఉద్యోగంలో చేరిపోవడంతో.. మరింత మెరుగైన ర్యాంకు కోసం శ్రమించారు. -
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష.. పోలీసుల నిఘా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కొనసాగుతోంది. చివరి నిమిషంలో అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఐడీ కార్డుతో పాటు గుర్తింపు పత్రాలు తీసుకురాని అభ్యర్థులను పోలీసులు బయటికి పంపించారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో గత అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రిలిమినరీ పరీక్షను తిరిగి నిర్వహించనున్నట్లు వెల్లడించిన టీఎస్పీఎస్సీ... ఈనెల 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. పోటీ తీవ్రమే.. వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 ఉద్యోగ (గ్రూప్–1) ఖాళీలున్నాయి. వీటికి 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా, గత అక్టోబర్ 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 2,86,051 మంది హాజరయ్యారు. అనంతరం మెయిన్ పరీక్షలకు అర్హత సాధించిన వారి వివరాలను టీఎస్పీఎస్సీ వెల్లడించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఈ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. చెప్పులు వేసుకొస్తేనే అనుమతి అభ్యర్థులు ఒరిజినల్ హాల్టికెట్తో హాజరుకావాలి. హాల్టికెట్పై ఫొటో సరిగ్గా లేకుంటే మూడు ఫొటోలపై గెజిటెడ్ అధికారి సంతకంతో కూడిన హాల్టికెట్తో హాజరుకావాలి. అభ్యర్థులు తప్పకుండా గుర్తింపు కార్డు (పాన్, ఆధార్, ఓటర్ ఐడీ తదితరాలు)ను వెంట తెచ్చుకోవాలి. పరీక్షా హాల్లోకి అభ్యర్థులను అనుతించే విషయంలో కమిషన్ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు వేసేస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే ధరించాలి. బూట్లు ధరించకూడదు. బెల్టు ధరించిన అభ్యర్థులను సైతం పక్కాగా పరిశీలించిన తర్వాతే అనుమతిస్తారు. పరీక్ష తీరును పరిశీలించేందుకు టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను సైతం ఏర్పాటు చేసినట్లు కమిషన్ వెల్లడించింది. -
AP: ఉద్యోగాల వెల్లువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం నగారా మోగించింది. కీలకమైన గ్రూప్–1, గ్రూప్–2కు సంబంధించి మొత్తం 1,000 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో గ్రూప్–1 పోస్టులు 100కాగా గ్రూప్–2 పోస్టులు 900 ఉన్నాయి. ఈ మొత్తం పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఉదయం గ్రూప్–1, 2 పోస్టుల భర్తీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు. త్వరితగతిన ఈ పోస్టులను భర్తీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్ల జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని అధికారులు ఆయనకు తెలిపారు. వీలై నంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలని సీఎం సూచించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర అంశాలపైనా దృష్టి సారించాలని ఆదేశించారు. బాబు పాలనంతా బూడిదే.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఐదేళ్లపాటు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. సరిగ్గా సాధారణ ఎన్నికలకు ముందు 2018 డిసెంబర్లో మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారు. వీటి భర్తీకి పరీక్షలు కూడా నిర్వహించే సమయం లేకుండా కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ఈ వ్యవహారమని అప్పట్లోనే విద్యావేత్తలు, అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేలా తొలి రోజు నుంచే అడుగులు ముందుకు వేశారు. ఏపీపీఎస్సీ ద్వారా కూడా వేలాది పోస్టులను ఈ నాలుగేళ్లలో భర్తీ చేయించారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ న్యాయవివాదాల్లో చిక్కుకొని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు అందని ద్రాక్షలా మారగా వాటన్నింటినీ పరిష్కరింపజేశారు. అంతేకాకుండా వాటిని భర్తీ చేయించారు. ఏపీపీఎస్సీ ద్వారానే ఈ నాలుగేళ్లలో 5 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. కీలకమైన గ్రూప్–1తో సహా ఇతర పోస్టులూ వీటిలో ఉన్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 4.5 లక్షల ఉద్యోగులు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య 6 లక్షలకు పెరిగిందంటే ఏ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగిందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు, ఇతర సంస్థల్లో 15 నుంచి 20 లక్షల ఉద్యోగాలు యువతకు లభించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ ) రంగంలో ఉద్యోగాలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో 1.10 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉండగా ఒక్కోదానిలో కనీసంగా 10 మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించాయి. వలంటీర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పోస్టుల్లోనూ.. గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ పథకాల లబ్ధిని అందించడానికి ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున ప్రభుత్వం గ్రామ, వార్డు వలంటీర్లను నియమించింది. మొత్తం 2.65 లక్షల మందికి గౌరవ వేతనం అందిస్తూ ఉపాధి కల్పించింది. అలాగే గతంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. ప్రైవేటు సంస్థలకు గుత్తాధిపత్యం ఇవ్వడం వల్ల వారికి ఉద్యోగ భద్రత, సరైన వేతనాలు అందేవి కావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కాంట్రాక్టు పోస్టులతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్నే ఏర్పాటు చేయించారు. బ్రోకర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వారికి పూర్తి వేతనాలు చెల్లించడంతోపాటు ఈఎస్ఐ వంటి సదుపాయాలూ కల్పించారు. వీరికి అరకొర వేతనాలు ఉండగా జీతాలను భారీగా పెంచారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఏకంగా మినిమమ్ టైమ్ స్కేల్ను అమల్లోకి తెచ్చారు. ఫలితంగా ఆ ఉద్యోగులకు ఎంతో న్యాయం జరిగింది. చదువులు పూర్తవగానే ఉద్యోగాలు సాధించేలా శిక్షణ రాష్ట్రంలో విద్యార్థులను పూర్తి నైపుణ్యాలతో తీర్చిదిద్ది.. వారు చదువులు పూర్తిచేసి బయటకు రాగానే ఉద్యోగాలు సాధించేలా సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు చదువుతున్నప్పుడే వారికి అనేక ప్రతిష్టాత్మక సంస్థలతో శిక్షణ ఇప్పించి నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నారు. డిగ్రీ కోర్సుల్లోనూ ఇంటర్న్షిను తప్పనిసరి చేయించారు. డిగ్రీలో చేరే విద్యార్థులు కూడా పది నెలలు ఇంటర్న్షిప్ పూర్తి చేసేలా కోర్సులను అమలు చేయిస్తున్నారు. విద్యార్థులు పూర్తిస్థాయిలో నైపుణ్యం పొందేలా అధికారులు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకు రాష్ట్రంలోని అన్ని కళాశాలలను వివిధ పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న 27,119 సంస్థలతో అనుసంధానించారు. శిక్షణ సమయంలోనే ఉద్యోగాలు.. విద్యార్థులకు ఇంటర్న్షిప్ కోసం రాష్ట్రంలోని మైక్రో స్థాయి నుంచి మెగా పరిశ్రమల వరకు ఉన్నత విద్యా మండలి వాటిని విద్యా సంస్థలతో అనుసంధానం చేసింది. తయారీ, సేవా రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ సమయంలో మంచి పనితీరు కనబరిచేవారికి ఆ కంపెనీలే ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా 2018లో రాష్ట్రంలో ఏడాదికి 37 వేల మందికి మాత్రమే అవకాశాలు దక్కగా ఆ తర్వాత నుంచి ప్లేస్మెంట్స్లో భారీ వృద్ధి నమోదైంది. 2019–20లో 52 వేలకు, 2020–21లో 69 వేలకు, 2021–22లో 85 వేలకు ప్లేస్మెంట్లు పెరిగాయి. ఇక ఈ విద్యాసంవత్సరంలో 1.20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ట్రిపుల్ ఐటీల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా భారీగా డిమాండ్ పెరిగింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో వీరికి ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. 2020–21 వరకు మొత్తం 13,208 మంది విద్యార్థులు నియామకాల కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో 5,111 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభించాయి. ట్రిపుల్ ఐటీ నూజివీడు క్యాంపస్లో 2,610 మందికి, ఆర్కే వ్యాలీలో 2,501 మందికి ఐటీ కంపెనీలు కొలువులు ఇచ్చాయి. టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో, అలక్రిటీ, ఏడీపీ, అచలా, పర్పుల్ టాక్, పర్పుల్ కామ్, సెలెక్ట్, నుక్కడ్ షాప్స్, సెవ్యా, సినాప్సిస్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంటేషన్, రాంకీ, ఆర్వీ, హెటిరో, అటిబిర్, అమర్రాజా తదితర కంపెనీల్లో విద్యార్థులకు ఉద్యోగాలు దక్కాయి. అనలాగ్ డివైసెస్, ఫ్రెష్ డెస్క్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, సినాప్సిస్, జేవోటీటీఈఆర్, థాట్ వర్క్స్, ఏడీపీ, మేథ్ వర్క్స్, గోల్డెన్ హిల్స్ సంస్థలు అత్యధిక వేతనాలు అందించాయి. చదవండి: ఎంపీ అవినాష్రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్ విడుదల -
గ్రూప్–1 టాపర్ ఎవరో చెబితే ప్రభుత్వం కూలుతుంది: ఆర్ఎస్ ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ గ్రూప్–1 మొదటి ర్యాంకు ఎవరిదో చెబితే బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్లకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా గ్రూప్–1 టాపర్లు ఎవరో ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంగళవారం బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ భోరోసా దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ సిబ్బంది, ఈ కేసులో నిందితులైన రాజశేఖర్రెడ్డి, దాసరి కిషోర్లకు గ్రూప్–1 ప్రిలిమ్స్లో 150 మార్కులకుగాను 120 మార్కులు సాధించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు తెలిసిన వారే టీఎస్పీఎస్సీ సభ్యులుగా ఉన్నారని, అందువల్ల ఆ కమిషన్ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఏ నిరుద్యోగ బిడ్డల త్యాగం వల్ల తెలంగాణ వచి్చందో, ఆ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలను కేసీఆర్ ప్రభుత్వం రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకు అమ్ముకుంటోందని ప్రవీణ్కుమార్ ఆరోపించారు. ‘టెన్త్’లో అలా.. టీఎస్పీఎస్సీలో ఇలా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ‘సిట్’విచారణ నత్తనడకన సాగుతోందని... నిందితులను బాధితులుగా చూపే ప్రయత్నం జరుగుతోందని దుయ్యబట్టారు. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో పోలీసులు 48 గంటల్లోనే పాత్రదారులు, సూత్రదారులను అరెస్ట్ చేశారని... కానీ టీఎస్పీఎస్సీ కేసులో సూత్రదారులు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నందునే ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఆరోపించారు. ఈ కేసుపై స్పందించకుండా ముఖ్యమంత్రి మౌనం వహిస్తున్నారంటే తప్పు చేసినట్లు అంగీకరిస్తున్నట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే ముఖ్యమంత్రి గద్దె దిగాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్కు దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్దకు రావాలని, తాము పేపర్ లీక్కు సంబందించి ఆధారాలతో వస్తామని ఆయన సవాల్ చేశారు. 18న నిరసన దీక్ష... టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిరుద్యోగులకు న్యాయం చేసేలా ప్రతిపక్ష పారీ్టలంతా ఏకతాటిపైకి రావాలని ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. అలాగే కొత్త కమిషన్ వేశాకే పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్తో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అన్ని పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాలతో ఈ నెల 18న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేయనున్నట్లు ప్రవీణ్కుమార్ తెలిపారు. సీఎంకు 25 ప్రశ్నలు రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు వాడుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మంగళవారం బీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలను ఓటుబ్యాంకుగా చూడటమే తప్ప చిత్తశుద్ధి లేదని విమర్శించారు. 2016లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికైనా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని... కానీ గతంలో దళిత, బహుజనులకు ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా 25 ప్రశ్నలతో సీఎంకు రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ -
లీకేజీలో నమ్మలేని నిజాలు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షలో నమ్మలేని నిజాలు బయటకొస్తున్నాయని... బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారి వద్ద పనిచేసే వాళ్లు గ్రూప్–1 పరీక్షలో క్వాలిఫై అయినట్లు తమకు సమాచారం అందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘లక్షలాది మంది నిరుద్యోగులను వంచించిన కేసీఆర్ ప్రభుత్వం దీనిపై 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. గ్రూప్–1 పరీక్షల్లో జరిగిన అక్రమాలు, కేసీఆర్ కొడుకు నిర్వాకంపై అతిత్వరలో వాస్తవాలు బయటపెడతాం. అసలైన దోషులను తెలంగాణ సమాజం ముందుంచుతాం’అని సంజయ్ పేర్కొన్నారు. జెడ్పీటీసీ, సర్పంచ్, సింగిల్విండో చైర్మన్ పిల్లలు క్వాలిఫై... ‘జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికిపైగా క్వాలిఫై అయ్యారు. ఒక చిన్న గ్రామంలో ఆరుగురు అర్హత సాధించారు. వారంతా బీఆర్ఎస్ నేతల కొడుకులు, బంధువులు, వాళ్ల వద్ద పనిచేసే వాళ్లే. నలుగురు సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో చైర్మన్ కొడుకుతోపాటు ఒక జెడ్పీటీసీ వద్ద బాడీగార్డ్గా పనిచేసే వ్యక్తి కొడుకు, ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు క్వాలిఫై అయ్యాడు. ఒక సర్పంచ్ కుమారుడికి అర్హత అయ్యే అవకాశమే లేనప్పటికీ క్వాలిఫై చేశారు’అని సంజయ్ ఆరోపించారు. కేటీఆర్ సహకారంతోనే లీకేజీ... ‘కేసీఆర్ కొడుకు మంత్రి కేటీఆర్ సహకారంతోనే పేపర్ లీకేజీ జరిగింది. ఆయన సన్నిహిత వ్యక్తే ఇదంతా చేశాడు. ఒక్కొక్కరి నుంచి రూ. 3 నుంచి రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం ఉంది. తక్షణమే కేసీఆర్ కొడుకును కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి’అని సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం కొడుకు ప్రమేయం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ నియమించిన సిట్తో విచారణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని పునరుద్ఘాటించారు. నయీం డైరీ, సినీ తారల డ్రగ్స్ కేసుల తరహాలోనే పేపర్ లీకేజీ కేసును సైతం సిట్కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని సంజయ్ ఆరోపించారు. -
AP: గ్రూప్–1 ప్రిలిమ్స్లో కీలక మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహిస్తున్న ప్రిలిమ్స్లో ఏపీపీఎస్సీ కొన్ని కీలక మార్పులు చేసింది. గ్రూప్–1లో పేపర్–1, పేపర్2గా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఆఫ్లైన్ ఓఎమ్మార్ ఆధారిత పత్రాలతో పరీక్ష ఉదయం, మధ్యాహ్నం జరుగుతుంది. ఒక్కో పేపర్లో 120 చొప్పున ప్రశ్నలుంటాయి. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. గతంలో లేనివిధంగా ప్రతి పరీక్ష కేంద్రంలో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, సూపరింటెండెంట్లే కాకుండా జిల్లాస్థాయి అధికారి ఒకరిని ప్రత్యేక పర్యవేక్షకునిగా నియమిస్తున్నారు. కోడింగ్ తప్పయితే.. ఈసారి ప్రిలిమ్స్ పరీక్షలో అభ్యర్థులు అనుసరించాల్సిన విధివిధానాలకు సంబంధించిన సవివర సమాచారం ప్రశ్నపత్రాలు, ఓఎమ్మార్ పత్రాల్లో ముద్రించి ఉంటుంది. వాటిని ముందుగా తెలుసుకునేందుకు వీలుగా వాటి నమూనాలను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచారు. దీనివల్ల అభ్యర్థికి సమయం కలసి రావడంతోపాటు పరీక్షపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ప్రశ్నపత్రం, ఓఎమ్మార్ బుక్లెట్లపై కోడింగ్ సిరీస్ నంబర్లు సరిసమానంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. తప్పు కోడింగ్ ఉంటే కనుక ఆ జవాబు పత్రాలు చెల్లుబాటు కావు. అభ్యర్థి తన రిజిస్టర్ నంబర్ను ప్రశ్నపత్రం బుక్లెట్పై నిర్ణీత స్థలంలోనే రాయాలి. అభ్యర్థులు హాల్టికెట్లతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా పరీక్ష కేంద్రాల వద్ద చూపించాలి. అభ్యర్థులు ఉదయం 9 గంటల నుంచి 9.30 వరకు పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించాలి. ఆ తరువాత 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ కింద 9.45 వరకు మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 వరకు అనుమతిస్తారు. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ కింద 1.45 వరకు అవకాశమిస్తారు. తరువాత ఎవరినీ అనుమతించరు. అభ్యర్థి దరఖాస్తు ఫారంలో బయోడేటా వివరాలను తప్పుగా సమర్పించి ఉంటే ఇన్విజిలేటర్ వద్ద అందుబాటులో ఉన్న నామినల్ రోల్స్లో డేటాను అప్డేట్ చేసుకోవచ్చు. ఓఎమ్మార్ సమాధాన పత్రంలో ఇన్విజిలేటర్ సంతకాన్ని తీసుకోవాలి. ఓఎమ్మార్లో ఒరిజినల్, డూప్లికేట్ పత్రాలు అభ్యర్థికి ఇచ్చే ఓఎమ్మార్ సమాధాన పత్రం రెండు కాపీలుగా ఉంటుంది. పరీక్ష పూర్తయిన తరువాత అభ్యర్థి పైన ఉండే ఒరిజినల్ కాపీని ఇన్విజిలేటర్కు అందించాలి. దిగువన ఉండే డూప్లికేట్ సమాధాన పత్రాన్ని తన రికార్డుకోసం తీసుకువెళ్లాలి. అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నపత్రంపై సమాధానాలను ఎంపిక చేయరాదు. కేవలం ఓఎమ్మార్ సమాధాన పత్రంలో ఇచ్చిన స్థలంలో నీలం లేదా నలుపు బాల్పెన్నుతో బబుల్ చేయాలి. వైటనర్, మార్కర్, ఎరేజర్లను వినియోగించినా ఆ సమాధాన పత్రం చెల్లదు. అంధత్వం, రెండు చేతులకూ వైకల్యం, మస్తిష్క పక్షవాతం గల అభ్యర్థులకు స్క్రయిబర్లను అనుమతిస్తారు. ఈసారి అత్యధికంగా 714 మంది స్క్రయిబర్లు కావాలని దరఖాస్తు చేశారు. అభ్యర్థులు స్క్రయిబ్ను తామే తెచ్చుకుంటే వారికి ఆ పోస్టుకు నిర్ణయించిన అర్హత కన్నా తక్కువ అర్హత ఉండాలి. అభ్యర్థి తెచ్చుకున్న స్క్రయిబ్ అర్హుడు కాకుంటే చీఫ్ సూపరింటెండెంటు వేరొకరిని ఏర్పాటు చేస్తారు. ప్రిలిమ్స్కు పకడ్బందీ ఏర్పాట్లు రాష్ట్రంలో గ్రూప్–1 క్యాడర్ పోస్టుల భర్తీకి ఈ నెల 8వ తేదీన ప్రిలిమనరీ (స్క్రీనింగ్ టెస్ట్) పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తిచేశామని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. గురువారం ఏపీపీఎస్సీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లోని 297 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 1,26,449 మంది హాజరవుతారన్నారు. పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించి సకాలంలో పూర్తిచేయాలన్నది కమిషన్ లక్ష్యమని చెప్పారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. యూపీఎస్సీ తరహాలోనే.. ఈ సారి గ్రూప్–1లో 92 పోస్టుల భర్తీకి వీలుగా నోటిఫికేషన్ ఇచ్చాం. గత గ్రూప్–1లో మిగిలిన 16 నుంచి 18 వరకు పోస్టులను క్యారీఫార్వర్డ్ కింద ఈ నోటిఫికేషన్కు జత చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. న్యాయపరమైన సలహాల అనంతరం ప్రిలిమ్స్ నిర్వహించే 8వ తేదీలోపు వాటిని ప్రకటిస్తాం. యూపీఎస్సీ మాదిరిగా గ్రూప్–1 పోస్టులను నిర్ణీత కాలపట్టిక ప్రకారం పూర్తి చేయించాలని భావిస్తున్నాం. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని అదే రోజు రాత్రి లేదా మరునాడు ప్రకటిస్తాం. రెండు లేదా మూడు వారాల్లోపు ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటిస్తాం. అనంతరం మెయిన్స్ సన్నద్ధతకు తగిన వ్యవధి ఇచ్చి ఏప్రిల్ నెలాఖరున మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తాం. ఆపై రెండు నెలల్లో మూల్యాంకనం ముగించి జూన్కల్లా ఫలితాలు విడుదల చేస్తాం. అనంతరం రెండువారాలు గడువు ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేయిస్తాం. అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మరో కొత్త గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేస్తాం. ప్రాథమిక కీపై అభ్యంతరాల సంఖ్య వేలల్లో ఉంటున్నందున ప్రశ్నకు రూ.100 చొప్పున చెల్లించాలన్న నిబంధన పెట్టాం. సరైన అభ్యంతరమైతే ఆ మొత్తాన్ని వెనక్కు ఇచ్చేస్తాం. ఇంటర్వ్యూలకు మూడు బోర్డులు గ్రూప్–1లో ఇంటర్వ్యూలను గతంలో వద్దనుకున్నా ప్రజలతో నేరుగా సంబంధాలు నెరిపి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన క్యాడర్ పోస్టులు కాబట్టి అభ్యర్థుల పర్సనాలిటీకి సంబంధించిన అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. అందుకే ఇంటర్వ్యూలను పునరుద్ధరించారు. గతంలో ఒకే బోర్డుతో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించగా.. ఇప్పుడు మూడు వరకు బోర్డులతో చేపడుతున్నాం. ఇందులో కమిషన్ చైర్మన్, సభ్యుడితో పాటు ఇద్దరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సబ్జెక్టు నిపుణులైన వీసీ లేదా సీనియర్ ప్రొఫెసర్లు, రిటైర్డు ప్రొఫెసర్లను బోర్డులో నియమిస్తున్నాం. అత్యంత పారదర్శకంగా కేవలం మెరిట్ ప్రాతిపదికనే ఎంపికలు ఉంటాయి. కనుక ఏ ఒక్కరూ బయట వ్యక్తులు, మధ్యవర్తుల మాటలు విని మోసపోవద్దు. గ్రూప్–2 సిలబస్ను హేతుబద్ధీకరిస్తాం గ్రూప్–2 పోస్టుల భర్తీపైనా ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి నోటిఫికేషన్ ఇస్తాం. గ్రూప్–2కు సంబంధించి సిలబస్ విధానంలో మార్పులు తీసుకురానున్నాం. సిలబస్లో రేషనలైజేషన్ చేస్తాం. ప్రిలిమ్స్, మెయిన్స్కు ఒకే రకమైన సిలబస్ను అనుసరిస్తున్నందున దానిని హేతుబద్ధం చేస్తాం. గ్రూప్–2 స్కీమ్, ప్యాట్రన్లో మాత్రం ఎలాంటి మార్పులుండవు. -
తుది తీర్పునకు లోబడే గ్రూప్–1 ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి గ్రూప్–1 అభ్యర్థులు దాఖలు చేసిన కేసులో తుది తీర్పునకు లోబడే ఫలితాలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల వినతిని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు సూచించింది. గ్రూప్–1 ప్రాథమిక పరీక్ష ఫలితాల వెల్లడికి ముందే సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ 2022, సెప్టెంబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 33ను విడుదల చేసిందని.. కొత్త రిజర్వేషన్ల మేరకు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ.. మెదక్ జిల్లా సర్ధనా హవేలీఘన్పూర్ పోచమ్మరాల్ తండాకు చెందిన జీ. స్వప్న సహా మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు. పరిపాలనా విభాగం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)ని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ జీవోను వచ్చే ఆదివారం జరిగే ప్రాథమిక పరీక్షకు వర్తింపజేయాలని కోరారు. 503 పోస్టులను భర్తీ చేయడం కోసం ఈ ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. పెంచిన రిజర్వేషన్లకు అనుగుణంగా రోస్టర్ పాయింట్ల నిర్ణయించకుండానే గ్రూప్–1 ప్రిలిమినరీ నిర్వహిస్తున్నారని.. పాయింట్లు కేటాయిస్తే ఎస్టీ అభ్యర్థులకు రిజర్వేషన్ కోటా కింద దాదాపు 50 పోస్టులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రస్తుతం ప్రాథమిక పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించారు. అయితే తుది ఫలితాలు మాత్రం తీర్పునకు లోబడే ఉంటాయని పేర్కొంటూ..విచారణ వాయిదా వేశారు.