-
పిల్లలపై పిడుగు! ఫీజు రీయింబర్స్మెంట్కు ఎసరు
సాక్షి, అమరావతి: ‘మీరు.. పరీక్షలు రాయాలంటే ముందు ఫీజు కట్టండి. చివరి సంవత్సరం పాసైన వాళ్లకు సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు మొత్తం చెల్లించాల్సిందే. మెస్, హాస్టల్ చార్జీలు కడితేనే గదులు కేటాయిస్తాం. ప్రభుత్వం ఇచ్చేవరకు చూద్దామంటే కుదరదు. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇక మీకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని ఆశ పడొద్దు. అప్పో.. సప్పో చేసి తీర్చండి. లేదంటే మీ చదువులకు కచ్చితంగా ఆటంకాలు తప్పవు. ఆ తర్వాత మాది బాధ్యత కాదు...’ ఇదీ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా కాలేజీ యాజమాన్యాల బెదిరింపు ధోరణి! ‘‘గత ఐదేళ్లు మా పిల్లల చదువులు సాఫీగా సాగిపోయాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి షెడ్యూల్ ప్రకారం జగనన్న విద్యా దీవెన కింద ఫీజులతోపాటు ఏడాదికి హాస్టల్, మెస్ ఖర్చులు వసతి దీవెనతో మా ఖాతాల్లో పడేవి. వెంటనే మేం కళాశాలలకు చెల్లించేవాళ్లం. మా పిల్లలకు సరిగా చదువు చెప్పకున్నా, హాస్టల్ బాగోలేకున్నా గట్టిగా ప్రశ్నించే వాళ్లం. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే మళ్లీ అప్పులు చేసి పిల్లలను చదివించుకోవాల్సిన దుస్థితి తప్పదని భయమేస్తోంది’’ తల్లిదండ్రులు ఆవేదన ఇది!పేర్ల మార్చడంలో ఉత్సాహం అమలులో ఏది?రాష్ట్రంలో ఐదేళ్ల పాటు నిశ్చింతగా ఉన్న ఉన్నత విద్యా రంగంలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. ఇన్నాళ్లూ ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో చదువుల్లో రాణిస్తున్న పేదింటి బిడ్డల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి ఖర్చులు కలిపి మొత్తం రూ.2,400 కోట్లు బకాయిలు ఇంతవరకు విడుదల కాకపోవడంతో పిల్లల చదువుల పరిస్థితి గాలిలో దీపంలా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఫీజుల బకాయిలు విడుదల కాకపోవడం, కోర్సులు పూర్తి చేసిన వారి చేతికి సర్టిఫికెట్లు అందకపోవడంతో ఆదుర్దా చెందుతున్నారు. ఏ కళాశాలలో చూసినా ఫీజుల గోలే వినిపిస్తోంది. ఇంతకాలం ప్రతి మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికం) విడుదల చేస్తున్న ట్యూషన్ ఫీజుల చెల్లింపులు నిలిచిపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఇంటికి దూరంగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో(వసతి దీవెన) హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులపై ఒక్కసారిగా అప్పు భారం పడింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ హయాంలో అమలైన పథకాలకు పేర్లు మార్చిందే కానీ వాటి అమలు ఊసే విస్మరించింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ (ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్)గా మార్పు చేసింది. షెడ్యూల్ ప్రకారం ప్రతి త్రైమాసికానికి సంబంధించి విడుదల చేయాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టల్–మెస్ చార్జీల విషయాన్ని మాత్రం గాలికొదిలేసింది. నిర్ణీత షెడ్యూళ్ల ప్రకారం ఇవ్వాల్సిన ట్యూషన్ ఫీజు రూ.1,300 కోట్లు, హాస్టల్–మెస్ చార్జీల కింద ఏడాది చివరిలో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు కలిపి మొత్తం రూ.2,400 కోట్లు ప్రభుత్వం నుంచి అందకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.విద్యార్థుల్లో ‘ఫీజుల’ కలవరంప్రతి పేదింటి విద్యార్థికి ఉన్నత స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రుల ఖాతాల్లోనే నేరుగా ఫీజుల మొత్తాన్ని జమ చేసే విధానాన్ని తెచ్చారు. వారి ద్వారా ఫీజులు చెల్లిస్తుండంతో యాజమాన్యాల్లో జవాబుదారీతనం పెరిగింది. ప్రతి త్రైమాసికానికి ముందే షెడ్యూల్ ప్రకటించి నిధులు విడుదల చేశారు. 2023–24 విద్యా సంవత్సరంలో అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 9.44 లక్షల మంది విద్యార్థులకు రూ.708.68 కోట్లను మార్చిలోనే గత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయింది. పోలింగ్ తర్వాత అనుమతి లభించగా కొంత మంది ఖాతాల్లో నగదు జమైంది. ఇంతలో కూటమి అధికారంలోకి రావడంతో హఠాత్తుగా చెల్లింపులు నిలిపివేశారు. ఇంకా రూ.605 కోట్లకుపైగా చెల్లింపులు చేయాల్సి ఉండగా కొత్త ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం విద్యార్థులను కలవరపెడుతోంది. పైగా జూన్లో మూడో విడత(జనవరి–మార్చి) కింద సుమారు రూ.700 కోట్లు ఫీజుల కింద విడుదల చేయాల్సి ఉండగా ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో గత సర్కారు తెచ్చిన పథకాలకు కొత్త ప్రభుత్వం మంగళం పాడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.చదువులపై బాధ్యత లేదా?పేదింటి విద్యార్థులను అత్యున్నత ప్రమాణాలు కలిగిన కళాశాలల్లో చదివించి వారి భవిష్యత్తుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉజ్వల బాటలు వేసింది. విద్యార్థులు, కళాశాలలు ఎక్కడా ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టింది. చదువుల విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించింది. 2017 నుంచి 2019 మధ్య అధికారంలో ఉండగా టీడీపీ ప్రభుత్వం 16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1,778 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టింది. వీటి చెల్లింపుల్లో నాటి ప్రభుత్వం అలసత్వం వహించడంతో కళాశాలలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. విద్యార్థులు సర్టిఫికెట్లు, హాల్ టికెట్ల కోసం అప్పులు చేసి డబ్బులు కట్టాల్సిన దుస్థితి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదింటి బిడ్డల విద్యను బాధ్యతగా భావించి ఆ బకాయిల మొత్తాన్ని చెల్లించింది. ఇప్పడు కూటమి ప్రభుత్వం రాజకీయ కోణంలో చూస్తూ బాధ్యతను మరిచి వ్యవహరిస్తోంది. విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం అందాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్పై మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ ఏడాది నుంచి ఫీజురీయింబర్స్మెంట్ మొత్తాన్ని కళాశాలల ఖాతాల్లో జమ చేసే ఆలోచనలో భాగంగా.. 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టేందుకు ప్రణాళిక వేస్తున్నట్టు తెలుస్తోంది.చెల్లింపులపై దుష్ప్రచారం..ఐటీఐ నుంచి ఐఐటీ, వైద్య విద్య వరకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తూ విద్యార్థులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వైఎస్సార్ సీపీ హయాంలో 29.65 లక్షల మంది విద్యార్థులకు రూ.12,609.68 కోట్లు జగనన్న విద్యాదీవెన కింద ట్యూషన్ ఫీజులు చెల్లించారు. 25.17 లక్షల మంది విద్యార్థులకు వసతి దీవెన కింద హాస్టల్–మెస్ చార్జీల కోసం మరో రూ.4,275.76 కోట్లు అందచేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యా దీవెన, వసతి దీవెనల కింద దాదాపు రూ.18,663 కోట్లకుపైగా (పాత బకాయిలతో కలిపి) వెచ్చించారు. ఎన్నికలకు ముందు షెడ్యూల్ ఇచ్చి మరీ నిధులు విడుదల చేసినా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ కాకుండా నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కుట్రలు చేసింది. విద్యార్థులకు అన్యాయం జరగకూడదని వైఎస్ జగన్ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించడంతో నిధుల విడుదలకు ఒక రోజు సమయం (పోలింగ్కు ముందు) ఇచ్చింది. దీనిపైనా మరోసారి టీడీపీ మద్దతుదారులు కోర్టుకు వెళ్లడంతో కేసు విచారణ జరిగేలోపే ఆ ఒక్కరోజు సమయం కాస్తా గడిచిపోయింది. ఫలితంగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. అనంతరం కొంత మంది ఖాతాల్లో మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ జమైంది. మిగిలిన మొత్తంతో పాటు జూన్లో ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన మొత్తాన్ని చెల్లించే విషయంపై కూటమి ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. కొత్త ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోగా గత ప్రభుత్వంపై నెపం వేసే యత్నం చేస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.1,300 కోట్లు, వసతి దీవెనతో రూ.1,100 కోట్లు చెల్లించకుండా దుష్ప్రచారం చేస్తూ ఎగ్గొట్టేలా వ్యవహరిస్తోంది. ఇదే జరిగితే విద్యార్థుల కుటుంబాలు అప్పులు ఊబిలో కూరుకుపోయి చదువులు గాలిలో దీపంలా మారే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఆదాయ పరిమితి పెంపుతో లబ్ధివసతి ఖర్చులకు సంబంధించి 2014–19 మధ్య రూ.4 వేల నుంచి రూ.10 వేల స్లాబ్ పెట్టి ఇవ్వగా వైఎస్ జగన్ ఆ విధానాన్ని తొలగించి వసతి దీవెన ద్వారా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికీ సమానంగా ఆర్థిక సాయం అందించారు. పేద విద్యార్థులకు భోజన వసతి ఖర్చుల కోసం ఏడాదికి ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. వీలైనంత ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించే లక్ష్యంతో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని పెంచారు. గతంలో బీసీ, ఈబీసీ, కాపు, మైనార్టీలకు రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీ, డీబ్ల్యూలకు రూ.2 లక్షలు పరిమితి ఉండగా అన్ని వర్గాల వారికి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచి ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చారు. ఉన్నత విద్యకు అడ్డంకి.. తిరుపతి ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తయ్యింది. రెండేళ్లుగా జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన టైమ్ టూ టైమ్ మా అమ్మ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. దీంతో సకాలంలో కాలేజీ ఫీజులు చెల్లించాం. ప్రస్తుత ప్రభుత్వం ఇంకా నగదు జమ చేయలేదు. సరి్టఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు కట్టాలని యాజమాన్యం చెబుతోంది. ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. మంత్రి లోకేశ్ విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకోవాలి. – పి.శేఖర్, తిరుపతి -
రైతుకు రొక్కమేది?
సాక్షి, అమరావతి, నెట్వర్క్: తాము అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేలు చొప్పున సాగు సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తొలి విడత సాయాన్ని ఇటీవలే జమ చేసిందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్నదాతా సుఖీభవ ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని కోరాయి. వ్యవసాయదారులకు తొలి విడత పెట్టుబడి సాయాన్ని వెంటనే జమ చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా రైతులతో పాటు కౌలు రైతులు, అటవీ, దేవదాయ, అసైన్డ్ భూసాగుదారులకు పెట్టుబడి సాయం అందించాలని కోరుతూ తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య కడపలో, ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కాటమయ్య పుట్టపర్తిలో, ఆయా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేవీవీ ప్రసాద్, పి.జమలయ్య విజయవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. గత ఐదేళ్లుగా పీఎం కిసాన్ – వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున మూడు విడతల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించిందని గుర్తు చేశారు. తొలివిడత సాయాన్ని గత ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే జమ చేసిందని చెప్పారు. ఆ డబ్బులు దుక్కి పనులు, విత్తనాల కొనుగోలు లాంటి సాగు అవసరాలకు రైతులకు ఎంతగానో ఉపయోగపడేవన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున సాగు సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారని, ఈ హామీని వెంటనే అమలులోకి తేవాలని సూచించారు. తొలి విడత సాయం అందకపోవడంతో పెట్టుబడి ఖర్చుల కోసం ఖరీఫ్ సీజన్లో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రూ.20 వేలు చొప్పున సాగు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని విడతల్లో ఎంత జమ చేస్తారో స్పష్టత ఇవ్వడంతో పాటు త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు కూడా జరపాలన్నారు. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పెంచి పంట రుణాలు అందించాలన్నారు. రూ.3 లక్షల వరకు వడ్డీ లేకుండా, రూ.5 లక్షల వరకు పావలా వడ్డీతో రైతు, కౌలురైతులకు రుణాలివ్వాలని కోరారు. సాగు చేస్తున్న భూమి దామాషాను పరిగణలోకి తీసుకొని పంటరుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రాజెక్టుల కింద ఉన్న ప్రధాన కాలువలు, మేజర్, మైనర్ కాలువలతోపాటు డెల్టా ప్రాంతంలోని మురుగునీటి కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. వ్యవసాయ మోటార్లకు బిగించిన స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించి ఉచిత విద్యుత్ పథకాన్ని సమర్ధంగా అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం 2019లో తెచ్చిన పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సవరించాలని, గ్రామ సభలోనే కౌలు రైతులను గుర్తించి స్వీయ ధృవీకరణ ఆధారంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. గుర్తింపు కార్డులు ఇప్పటివరకు జారీ చేయనందున కౌలు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని పచ్చి రొట్ట విత్తనాలు, అన్ని రకాల పంటల విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, ఎరువులు, పురుగు మందులు 90% సబ్సిడీపై అందించాలన్నారు. దేవదాయ, ధర్మాదాయ సాగు భూముల వేలం పాటలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గత సీజన్లో వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన కౌలురైతులకు కౌలు రేట్లు తగ్గించి నామమాత్రపు ధరతో లీజుకు ఇవ్వాలని కోరారు.ఏలూరులో ధర్నా..ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున సాగు సాయం కింద రూ.20 వేలు వెంటనే రైతులకు అందించాలంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, పోలవరం నిర్మాణం వేగంగా చేపట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు, బండ్లు, నాగలి తదితర పనిముట్లు కొనుగోలుపై 50 శాతం రాయితీ అందించాలన్నారు. ట్రాక్టర్లకు 50 శాతం సబ్సిడీపై డీజిల్ సరఫరా చేయాలని, కల్తీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు వెంటనే అందించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా చోడవరం తహసీల్దార్కు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. సాయం అందకపోవడంతో రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఖరీఫ్ రైతులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం కర్నూలులో డీఆర్ఓకు వినతిపత్రం అందచేశారు.తక్షణమే పెట్టుబడి సాయం ఇవ్వాలిసూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేల పెట్టుబడి సాయం పంపిణీని కూటమి ప్రభుత్వం తక్షణమే ఆచరణలో పెట్టాలి. ఎన్ని విడతల్లో జమ చేస్తారో స్పష్టత ఇవ్వాలి. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు జరపాలి. తక్షణమే తొలి విడత సాయం అందించి రైతులకు అండగా నిలవాలి. లేదంటే దశలవారీగా ఆందోళన చేస్తాం.–జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘంప్రతీ కౌలు రైతుకూ సాయంసామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతీ కౌలు రైతుకూ సాగు సాయం అందించాలి. గతంలో సీజన్కు ముందుగానే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సీసీఆర్సీ కార్డులు ఇచ్చారు. పంటసాగు హక్కుదారుల చట్టం 2019ని సవరించి స్వీయ ధ్రువీకరణతో ప్రతీ కౌలుదారుడికి సీసీఆర్సీ కార్డులివ్వాలి. సాగు సాయంతో పాటు సంక్షేమ ఫలాలన్నీ కౌలు రైతులందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలి.–కె.కాటమయ్య, అధ్యక్షుడు, ఏపీ కౌలురైతు సంఘం -
సచివాలయాలతో సమున్నత సేవలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం పౌర సేవలు, ప్రభుత్వ పథకాల అమలు స్వరూపాన్నే మార్చేసింది. గ్రామ గ్రామాన సరికొత్త చిత్రం ఆవిష్కృతమైంది. పల్లె రూపురేఖలే మారిపోయాయి. విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు సాకారమయ్యాయి. ఎక్కడా లంచాలు, వివక్ష, పడిగాపులకు తావులేకుండా పారదర్శకంగా ప్రతి ఇంటికీ ప్రయోజనాలను అందచేసింది. గ్రామం నుంచి కదలాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ యంత్రాంగాన్నే పల్లె చెంతకు తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో సాకారమైన విప్లవాత్మక మార్పులివి. నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు నిర్వహించిన సంయుక్త సదస్సు ఈ అంశాలను ప్రముఖంగా ప్రస్తావించడం గమనార్హం. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అద్భుతమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసించారు. ఇంటింటికీ పౌర సేవలు, అర్హులకు సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోందని, ప్రధానంగా నీతి ఆయోగ్ నిర్దేశించిన ఎస్డీజీ (సుస్థిరాభివృద్ధి) లక్ష్యాల సాధనకు సచివాలయాలతో క్షేత్రస్థాయి నుంచి కృషి చేశారని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావనా వశిష్ఠ పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల ఆవిష్కరణ డేటా అధారిత పాలన, ప్రణాళికల కోసం డేటా సేకరణపై ఇటీవల లక్నోలో నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు సంయుక్త సదస్సు నిర్వహించాయి. డేటాను నాలెడ్జ్గా మార్చడం, 2047 భారత్ విజన్ లక్ష్యాలను సాధించడం, డేటాను పరిపాలనలో వినియోగించడం తదితర అంశాలపై వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలపై చర్చాగోష్టి నిర్వహించారు. సదస్సులో నీతి ఆయోగ్, ప్రపంచబ్యాంకుతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని ఆయా రాష్ట్రాల్లోని ఆవిష్కరణలపై ప్రముఖంగా చర్చించారు.ప్రతి పౌరుడికీ అందుబాటులో సేవలు..సమగ్ర డేటా సేకరణ ద్వారా పాలనను మెరుగుపరిచే లక్ష్యంతో 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిందని, పాలన వికేంద్రీకరణలో భాగంగా తెచ్చిన ఈ వ్యవస్థ అద్భుతమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ సర్కార్ ప్రశంసించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను వికేంద్రీకరించడంతోపాటు విధాన రూపకర్తలకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు గ్రామాలు, వార్డులలో ఆధునిక పరిజ్ఞానంతో సౌకర్యాలు కల్పించారన్నారు. ఏపీలోని ప్రతి గ్రామంలో ప్రతి పౌరుడికీ ఈ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్లు, నెలవారీ కేటాయింపులు లాంటి సంక్షేమ ప్రయోజనాలను అందజేయడంతోపాటు పౌరుల అవసరాలను గుర్తించి తీర్చుతున్నట్లు తెలిపారు. పరిపాలనాపరమైన ఫిర్యాదులను సింగిల్ విండో వ్యవస్థ ద్వారా పరిష్కరిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వివిధ టెక్ పోర్టల్లను ఏర్పాటు చేయడం వల్ల పైస్థాయి నుంచి కింద స్థాయి వరకు పనులను సమన్వయంతో వేగంగా పూర్తి చేసే వెసులుబాటు కలిగిందన్నారు. విప్లవాత్మక పాలనలో భాగంగా డేటా సేకరణ, క్రోడీకరణ, మార్పిడి ద్వారా సచివాలయాల వ్యవస్థతో ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను అమలు చేశారన్నారు. నీతి ఆయోగ్ రూపొందించిన 116 సూచికల ఆధారంగా 16 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సచివాలయాల వ్యవస్థ దోహదం చేసిందని అభినందించారు. అన్ని పోర్టల్లలో డేటాను సేకరించడంతో పాటు విశ్లేషించి మెరుగైన ఫలితాలు సాధించారన్నారు. పాఠశాలలకు వెళ్లే బాలికల్లో రక్తహీనత నిర్మూలన లాంటి సామాజిక లక్ష్యాలతో పాటు బడికి దూరమైన పిల్లలను తిరిగి స్కూళ్లలో చేర్చడం లాంటి వాటిని సచివాలయాల వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా అమలు చేసిందని ప్రస్తావించారు.ఎస్డీజీ లక్ష్యాల సాధన..నీతి ఆయోగ్ నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయిలో పటిష్ట వ్యవస్థను తెచ్చిందని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సభ్యురాలు భావనా వశిష్ఠ పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు అవసరమైన డేటా సేకరణ, విశ్లేషణ గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచే జరుగుతోందన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలుకు యాప్లు తీసుకొచ్చి అన్ని స్థాయిల్లో పకడ్బందీగా పర్యవేక్షించారన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి పౌరుల అవసరాలను తీర్చడం, గ్రామంలోనే సేవలు అందించడం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రారంభించిందన్నారు. అవి సింగిల్ విండో విధానం ద్వారా పంచాయతీలు, స్థానిక సంస్థలకు సహాయ విభాగంగా పనిచేయడంతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విధానాలను అమలు చేస్తున్నాయన్నారు. సచివాలయాల స్థాయిలోనే పౌరుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనకు సచివాలయాల వ్యవస్థ టెక్ పోర్టల్తో బలమైన నెట్వర్క్ను కలిగి ఉందన్నారు. ఎస్డీజీ లక్ష్యాల సాధనలో భాగంగా ఆరోగ్యం, విద్య సంబంధిత కార్యక్రమాలను గ్రామ, వార్డు సచివాలయాలతో అనుసంధానించినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో కార్యక్రమాల పర్యవేక్షణకు ఇంటిగ్రేటెడ్ డాష్ బోర్డ్ ఏర్పాటైందని, వీటన్నింటినీ ప్రతిబింబించేలా రాష్ట్ర స్థాయి డేటా రూపొందించడం కార్యక్రమాలు విజయవంతంగా అమలుకు దోహదం చేసిందన్నారు. అన్ని స్థాయిల్లో అధికారులు పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. బాలికలలో రక్తహీనత నిర్మూలనకు విద్యాసంస్ధల్లో డేటాను సేకరించి సంబంధిత విభాగాల ద్వారా క్రోడీకరించారని తెలిపారు. వలంటీర్ల ద్వారా భారీ సర్వేతో బడికి దూరమైన పిల్లల డేటాను సేకరించడంతోపాటు తిరిగి స్కూళ్లకు వెళ్లేలా ప్రోత్సహిస్తూ విద్యార్ధి సమాచార పోర్టల్ను నిర్వహిస్తున్నారన్నారు. నవశకం ద్వారా ప్రభుత్వ పథకాలకు అర్హులను పారదర్శకంగా గుర్తించి క్రోడీకరించిన లబ్ధిదారుల డేటాతో పోర్టల్ను నిర్వహిస్తున్నారని తెలిపారు. -
రాష్ట్రవ్యాప్తంగా రాజకోటల్లా టీడీపీ ఆఫీసులు
సాక్షి, అమరావతి: సర్కారు స్థలాలు, పేదల భూములను లాక్కుని పచ్చ భవనాలు నిర్మించుకున్న టీడీపీ పెద్దలు సుద్దులు వల్లించడం గురివింద సామెతను గుర్తు చేస్తోంది. అధికారంలో ఉండగా ఎన్టీఆర్ భవన్ల పేరుతో అత్యాధునిక కార్యాలయాలు సమకూర్చుకున్న టీడీపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వాగు పోరంబోకు, రైతుల భూమిని కబ్జా చేసి మంగళగిరిలో అత్యంత విలాసవంతమైన టీడీపీ జాతీయ కార్యాలయాన్ని నిర్మించుకోగా విశాఖలో దసపల్లా భూముల్లో పాగా వేసి పచ్చ భవనాలు కట్టుకున్నారు. విజయవాడ ఆటోనగర్లో ఇరిగేషన్ స్థలం.. శ్రీకాకుళంలో దళితులకు కేటాయించిన భూమి.. కాకినాడలో జెడ్పీ స్థలం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లెక్క చాంతాడును తలపిస్తుంది. ఇవన్నీ ఎన్టీఆర్ భవన్లే. అధికారం మాటున చంద్రబాబు సమకూర్చుకున్న పార్టీ కార్యాలయాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటున్న ఉండవల్లి కరకట్ట నివాసమే అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటిది. నిబంధనలు, చట్టాలకు తూట్లు పొడిచి కృష్ణా నది ఒడ్డున కట్టిన ఆ విలాస రాజ భవనంలోనే చంద్రబాబు ఎనిమిదేళ్లుగా నివాసం ఉంటున్నారు. అక్రమాల బాటలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భవన్ల పేరుతో విలాసవంతమైన కోటలు కట్టేశారు. వీటిని కప్పిపుచ్చి నిస్సిగ్గుగా వైఎస్సార్సీపీ కార్యాలయాలపై బురద జల్లడంపై విస్మయం వ్యక్తమవుతోంది.పార్టీలకు భూముల జీఓ ఇచ్చిందే బాబునిజానికి చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడే రాజకీయ పార్టీలకు భూములు కేటాయించే విధానాన్ని తెచ్చారు. ఇందుకోసం 2016 జూలై 21న జీఓ నెంబర్ 826 విడుదల చేశారు. రాజధానిలో మూడు కేటగిరీలుగా పార్టీలకు భూములు కేటాయించాలని అందులో పేర్కొన్నారు. మొదటి కేటగిరీలో జాతీయ రాజకీయ పార్టీ / గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీకి అసెంబ్లీలో 50 శాతానికి పైగా బలం ఉంటే 4 ఎకరాలు కేటాయించాలి. రెండో కేటగిరీ కింద అసెంబ్లీలో 25 నుంచి 50 శాతం బలం ఉన్న పార్టీలకు అర ఎకరం కేటాయించాలి. మూడో కేటగిరీలో 25 శాతం కంటే తక్కువ ఉన్న పార్టీలకు వెయ్యి గజాల స్థలం కేటాయించాలి. దీని ప్రకారం అప్పట్లో టీడీపీకి 4 ఎకరాలు, నాడు 67 స్థానాలతో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీకి అర ఎకరం పొందే అర్హత లభించింది. జిల్లా కేంద్రాల్లోనూ ఇదే విధానం ప్రకారం మొదటి కేటగిరీలో ఉన్న పార్టీలకు రెండు ఎకరాలు, రెండో కేటగిరీలో ఉన్న పార్టీలకు వెయ్యి గజాలు, మూడో కేటగిరీలో ఉన్న పార్టీలకు 300 గజాలు ఇవ్వాలన్నది జీవో సారాంశం. ఏడాదికి వెయ్యి రూపాయల చొప్పున 33 ఏళ్ల లీజుకు ఈ విధానంలో భూములు కేటాయించాలని నిర్ణయించారు. నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఇదే విధానం ప్రకారం 30 సెంట్లు కేటాయించాలని 2017 డిసెంబర్ 8న మరో జీఓ 340 జారీ చేశారు.గతంలో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో రాజకీయ పార్టీలకు భూముల కేటాయింపులకు సంబంధించి 2016లో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో లీజు నిబంధనలు బేఖాతర్తాను ఇచ్చిన జీవోకు అనుగుణంగా రాజధానితోపాటు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో టీడీపీ కార్యాలయాల కోసం చంద్రబాబు వరసగా భూములు కేటాయించుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుల పేరిట ఈ భూములు కేటాయిస్తూ ప్రత్యేకంగా జీవోలు జారీ చేశారు. 175 నియోజకవర్గాల్లోనూ టీడీపీ కార్యాలయాల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించి చాలాచోట్ల భూములు కేటాయించి ఆగమేఘాల మీద భవనాలు కూడా కట్టేశారు. నాడు చంద్రబాబు ప్రకటించిన విధానం ప్రకారం 33 ఏళ్ల లీజుకు భూములు కేటాయించాలి. అయితే ఆ నిబంధనను కొన్నిచోట్ల ఉల్లంఘించి ఏకంగా 99 ఏళ్ల పాటు లీజుకు కేటాయించేసుకున్నారు. మంగళగిరి, కాకినాడ, శ్రీకాకుళంలో 99 ఏళ్ల లీజుకు భూములు తీసుకున్నారు. ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో అత్యంత విలువైన భూముల్లో స్థలాలు కేటాయించుకొని కార్యాలయాలు నిర్మించి ఇప్పుడు అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు నడిపిస్తున్నారు. అదే జీవో ప్రకారం వివిధ జిల్లాల్లో వైఎస్సార్సీపీ 33 ఏళ్లకు లీజుకు తీసుకుంటే అదేదో ఘోరం అనే రీతిలో దుష్ప్రచారానికి తెర తీశారు.హైదరాబాద్లో రాత్రికి రాత్రేఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు అత్యంత విలువైన స్థలాలను టీడీపీ కార్యాలయాల కోసం సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో అత్యంత ఖరీదైన ఎకరం స్థలాన్ని రాత్రికి రాత్రే కేటాయించేసుకున్నారు. వాణిజ్య భూమిగా హైదరాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (హుడా) చేతిలో ఉన్న ఆ స్థలాన్ని 1997 ఏప్రిల్ 30న జూబీ్లహిల్స్ మున్సిపాలిటీ నుంచి షేక్పేట ఎమ్మార్వోకు బదలాయించారు. ఆయన అదేరోజు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టీగా ఉన్న డి.శ్రీనివాసరావు పేరు మీదకు మార్చారు. అదే రోజున ట్రస్టుకు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వటం గమనార్హం. ఈ పనులన్నీ గంటల వ్యవధిలో జరిగిపోయాయి. అంతటి విలువైన స్థలాన్ని నెలకు రూ.7,500 అద్దెకు చంద్రబాబు కేటాయించుకున్నారు. హైటెక్ సిటీ నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న ఎల్ అండ్ టీ సంస్థ ద్వారా అత్యాధునిక హంగులతో ఎన్టీఆర్ భవన్ను నిర్మించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాల వారీగా టీడీపీ కార్యాలయాలకు భూములు కేటాయించుకున్న చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక కూడా అదే తీరును కొనసాగించారు.పోరంబోకు భూమికి మంగళం!ప్రస్తుతం చంద్రబాబు, టీడీపీ నేతలు సకల విలాసాలతో దర్జాగా మీడియా, పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్న మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం స్థలం కోల్కతా–చెన్నై హైవేను ఆనుకుని ఉంది. 3.65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం విలువ రూ.75 కోట్లకుపైనే ఉంటుంది. ఇందులో వాగు పోరంబోకు, కాలువ భూమి, రైతులకు కేటాయించిన డి పట్టా భూములూ ఉన్నాయి. కాలువను పూడ్చి... పోరంబోకు భూమిని ఆక్రమించి... రైతుల భూములను కబ్జా చేసి మరీ టీడీపీ జాతీయ కార్యాలయం కట్టారు. 99 ఏళ్ల లీజుకు కేటాయించుకున్న ఈ స్థలానికి ఏడాదికి చెల్లించేది ఎకరాకు రూ.1,000 మాత్రమే. నిజానికి ఆ భూమికి సంబంధించి 1974లోనే బొమ్ము రామిరెడ్డి పేర 0.65 సెంట్లు, కొల్లా రాఘవరావు పేరిట 1.75 ఎకరాలు, కొల్లా భాస్కరరావు పేరిట 1.75 ఎకరాలను డి పట్టాలుగా ఇచ్చారు. వారిని బలవంతంగా తరిమేసి సాగు చేస్తున్న పంటలను పొక్లెయిన్లతో దున్నేసి రాత్రికి రాత్రే టీడీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. బాధిత రైతులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా పట్టించుకోకుండా చంద్రబాబు పార్టీ భవనం కట్టేశారు. ఆ రైతుల తరపున మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణలో ఉంది. 8 అంతస్తుల విలాసవంతమైన ఈ ఎన్టీఆర్ భవన్ను అనుమతి లేకుండా నిర్మించేశారు. ఉల్లంఘనలు, అక్రమాలకు పర్యాయపదం టీడీపీ జాతీయ కార్యాలయం.గుంటూరులోనూ గుటకాయ స్వాహాతొలుత 2015లో గుంటూరు అరండల్పేటలోని పిచుకలగుంటలో టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యి గజాల స్థలాన్ని కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకుని అదనంగా పక్కనే ఉన్న మరో 1,500 గజాల స్థలాన్ని ఆక్రమించి ఈ భవనాన్ని నిర్మించారు. మున్సిపల్ స్థలాలను లీజుకు ఇచ్చే పరిస్థితి లేకపోయినా చంద్రబాబు బలవంతంగా ఈ భూమిని లీజుకు తీసుకున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి కౌన్సిల్లో తీర్మానం చేయించి ఆక్రమించిన స్థలంతో కలిపి 2,500 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించుకుని పార్టీ భవనం కట్టేశారు.సిక్కోలులో దళితుల భూమిలో పాగాశ్రీకాకుళంలో ఎస్సీల ఇళ్ల స్థలాల కోసం సాంఘిక సంక్షేమ శాఖ సేకరించిన భూమిని టీడీపీ కార్యాలయానికి తీసుకున్నారు. ఉడా, కార్పొరేషన్ అధికారుల అనుమతి లేకుండా పార్టీ భవనాన్ని నిర్మించారు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న మరికొంత స్థలాన్ని ఆక్రమించేశారు. 80 అడుగుల ప్రధాన రోడ్డులో ఉన్న ఈ స్థలం విలువ 2017లోనే అనధికారికంగా రూ.20 కోట్లు ఉంది. ఏడాదికి రూ.25 వేల చొప్పున 99 సంవత్సరాల లీజుకు తీసుకున్న ఈ స్థలంలో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించి 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు స్వయంగా చంద్రబాబే ప్రారంభించారు.కాకినాడలో జెడ్పీ స్థలంపై కన్నేసి..కాకినాడలో విలువైన జిల్లా పరిషత్ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించుకుని విలాసవంతమైన భవనాన్ని కట్టారు. మేడలైన్ ఆఫ్ కాకినాడ ప్రాంతంలో 2 వేల గజాలను 99 ఏళ్ల లీజుకి జిల్లా పరిషత్ తీర్మానం ద్వారా టీడీపీ పరం చేశారు. ఈమేరకు 2016 నవంబర్ 1న భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేశారు. దీని విలువ రూ.10 కోట్లకు పైమాటే.బెజవాడ నడిబొడ్డున రూ.40 కోట్ల స్థలంవిజయవాడ నడిబొడ్డున ప్రజావసరాలకు ఉపయోగపడే విలువైన భూమిని అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఒత్తిడితో టీడీపీ కార్యాలయానికి అప్పగించారు. గుణదల పరిధిలోకి వచ్చే ఆటోనగర్–గురునానక్ కాలనీకి ఆనుకుని ఇరిగేషన్ శాఖకు 95 సెంట్ల భూమి ఉంది. ఇరిగేషన్ విభాగం ఫ్లోరేజి, ఇతర పనుల కోసం దీన్ని వినియోగించేవారు. ఇందులో కార్యాలయం కూడా ఉండేది. అయితే టీడీపీ ఆఫీసు కోసం దీన్ని ఇవ్వాలని అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి కూల్చేశారు. ఇరిగేషన్ మెటీరియల్, యంత్రాలను మరోచోటకు తరలించారు. అన్ని అభ్యంతరాలనూ తోసిరాజని 99 ఏళ్ల లీజుకిచ్చేశారు. ఆటోనగర్ పరిధిలో ఉన్న ఈ స్థలాన్ని పారిశ్రామిక అవసరాలకు మాత్రమే వాడాలనే నిబంధన ఉన్నా ఐలా పాలకవర్గాన్ని బెదిరించి నోరు మూయి ంచారు. వాణిజ్య భూమిగా కన్వర్షన్ చేసి టీడీపీ కార్యాలయం నిర్మించుకున్నారు. దీని విలువ రూ.40 కోట్లకు పైమాటే. విశాఖలో దసపల్లా కొండను తొలచి..విశాఖపట్నంలో దసపల్లా కొండను తొలిచి మరీ టీడీపీ కార్యాలయాన్ని కట్టేశారు. దసపల్లా భూముల్లో 2 వేల గజాల్ని 33 ఏళ్ల పాటు ఏడాదికి రూ.25 వేలు లీజు చొప్పున 2002లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టీడీపీకి కేటాయించింది. ఆ స్థలంతోపాటు పక్కనే ఉన్న కొండను (మరో వెయ్యి గజాల మేర) కూడా ఆక్రమించి 2016లో టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండానే జీ+3 భవనం నిర్మించి 2018లో లోకేశ్ ప్రారంభించారు. -
ఏపీ ప్రభుత్వంలో కొనసాగుతున్న బదిలీలు
-
పోలింగ్ అనంతర దాడులపై పూర్తి వివరాలివ్వండి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో కొన్ని వర్గాల ప్రజలే లక్ష్యంగా జరుగుతున్న లక్షిత దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని మరోసారి ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక నిర్దిష్టంగా ఓ రాజకీయ పార్టీకి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుంటూ రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, హింసను అణిచివేసి, బాధితులను రక్షించేందుకు అవసరమైన చర్యలను సత్వరమే చేపట్టేలా కేంద్ర హోంశాఖను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఆదేశించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కొవ్వూరి వెంకట్రామిరెడ్డి వాదనలు వినిపిస్తూ, ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన వారిపై మరో రాజకీయ పార్టీకి చెందిన వారు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆస్తులనూ ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని వివరించారు. ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం లేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఫిర్యాదులు ఇచ్చినప్పుడు ఏం చేయాలన్న దానిపై నిర్దిష్ట విధానం ఉందిగా అని ప్రశ్నించింది. అయినా కూడా కేసులు నమోదు చేయడం లేదన్నారు. దాడులపై రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీలకు వైఎస్సార్సీపీ ఎంపీ ఫిర్యాదు చేశారని, అయినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. హింస, దాడులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేస్తూ స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా ఆదేశాలివ్వాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, డీజీపీని ఆదేశించింది. -
Andhra Pradesh: భారీగా ఐఏఎస్ల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ఏపీ మెడికల్ సర్వీసెస్ వీసీ–ఎండీ డి.మురళీధర్రెడ్డిలను తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్నను నియమించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) కమిషనర్గా కాటమనేని భాస్కర్ నియమితులయ్యారు. తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ను బదిలీ చేసి గనులు, భూగర్భ వనరుల శాఖ కమిషనర్, డైరెక్టర్గా నియమించారు. తిరుపతి జాయింట్ కలెక్టర్కు ఆ జిల్లా కలెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అనిల్కుమార్ సింఘాల్ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్గా బి.రాజశేఖర్కు బాధ్యతలు అప్పగించారు. -
సచివాలయంలో పెండ్యాల ప్రత్యక్షం
సాక్షి, అమరావతి: గతంలో టీడీపీ ప్రభుత్వంలో ‘స్కిల్’ కుంభకోణంలో కీలక పాత్ర పోషించి, సీఐడీ నోటీసులివ్వడంతో విదేశాలకు పరారైన పెండ్యాల శ్రీనివాస్ మళ్లీ తెరపైకి వచ్చారు. వందల కోట్ల నిధులను దారి మళ్లించిన ఈ ‘స్కిల్’ కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ నిధుల తరలింపులో పెండ్యాల శ్రీనివాస్ కీలక సూత్రధారి అని సీఐడీ తేల్చింది. దీంతో ఆయన అమెరికాకు వెళ్లిపోయారు. ప్రణాళిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న ఆయన వెంటనే విధులకు హాజరుకావాలని జారీ చేసిన మెమోను కూడా బేఖాతరు చేయంతో ఉన్నతాధికారులు ఆయన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో శ్రీనివాస్ అమెరికాలో అజ్ఞాతవాసాన్ని ముగించుకుని సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. తనపై సస్పెన్షన్ ఎత్తివేసి, పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను కోరారు. నల్లమూటలు బాబు బంగ్లాకు చేర్చించి పెండ్యాలే2014 – 19 మధ్య కాలంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో పలు కుంభకోణాల్లో పెండ్యాల శ్రీనివాస్ కీలక పాత్రధారిగా వ్యవహరించారు. అప్పట్లో సీఎం చంద్రబాబుకు పీఎస్గా వ్యవహరించిన ఆయనకు కేంద్ర ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడంతో డొంకంతా కదిలింది. అమరావతిలో రూ.3 వేల కోట్లతో తాత్కాలిక సచివాలయాల నిర్మాణ కాంట్రాక్టుల కుంభకోణంతోపాటు ఇతర అక్రమాల్లో ఆయన పాత్రధారిగా ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. కాగా కేంద్ర జీఎస్టీ విభాగం సమాచారంతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో చంద్రబాబు అవినీతి బాగోతం బయటపడింది. దీనిపై సీఐడీ దర్యాప్తు చేయడంతో మొత్తం అవినీతి దందా బట్టబయలైంది. నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్ఎస్డీసీ నిధులను షెల్ కంపెనీల ద్వారా తరలించినట్టు వెల్లడైంది. ఆ నిధులను పెండ్యాల శ్రీనివాస్తోపాటు షెల్ కంపెనీల ప్రతినిధి మనోజ్ పార్థసాని హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి చేర్చినట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. కీలక ఆధారలు లభించడంతో సీఐడీ అధికారులు పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసానిలకు గత ఏడాది సెప్టెంబరు 5న నోటీసులు జారీ చేశారు. వారిని ఈ కేసులో సాక్షులగా పేర్కొంటూ గత ఏడాది సెప్టెంబరు 14న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పెండ్యాల శ్రీనివాస్కు ఉన్న రెండు ఈ మెయిల్ ఐడీలకు మెయిల్చేయడంతోపాటు హైదరాబాద్లోని ఆయన చిరునామాకు స్పీడ్పోస్ట్ ద్వారా నోటీసులు పంపారు. నోటీసులు అందినట్లు ఆయన కుమార్తె సీఐడీ అధికారులకు తెలిపారు. నోటీసులు జారీ కాగానే పెండ్యాల శ్రీనివాస్ ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే అమెరికాకు పరారయ్యారు. తనకు హఠాత్తుగా ఆరోగ్యం దెబ్బతినడంతో అమెరికా వెళ్తున్నట్టు ఆయన ప్రణాళిక శాఖకు ఓ మెయిల్ ద్వారా తెలిపి వెళ్లిపోయారు.మెమో జారీ చేసినా బేఖాతరు.. సస్పెన్షన్పెండ్యాల శ్రీనివాస్ అనుమతి లేకుండానే విదేశాలకు వెళ్లిపోవడాన్ని ప్రణాళిక శాఖ తీవ్రంగా పరిగణించింది. ఆయన సెలవు దరఖాస్తును తిరస్కరించి, మెమో జారీచేసింది. అధికారులు హైదరాబాద్లోని పెండ్యాల శ్రీనివాసరావు నివాసానికి వెళ్లి ఆయన తండ్రికి మెమో కాపీని అందించారు. మెమో అందుకున్నప్పటి నుంచి వారం రోజుల్లో ఆఫీసుకు వచ్చి సంజాయిషీ ఇవ్వాలని పెండ్యాల శ్రీనివాసరావును ప్రణాళిక శాఖ ఆదేశించింది. ఆ మెమోను ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో ప్రభుత్వ సర్వీసు నిబంధనలను అనుసరించి పెండ్యాల శ్రీనివాస్ను ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 30న సస్పెండ్ చేసింది.బాబు రాగానే మళ్లీ ప్రత్యక్షంకాగా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే పెండ్యాల శ్రీనివాస్ రాష్ట్రానికి తిరిగి వచ్చారు. బుధవారం నేరుగా సచివాలయానికి వచ్చి తనపై విధించిన సస్పెన్షన్ను తొలగించి, పోస్టింగ్ ఇవ్వాలని ప్రణాళిక శాఖ అధికారులను విజ్ఞప్తి చేశారు. ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే సాగుతోందన్నది సుస్పష్టమవుతోంది. ఎందుకంటే స్కిల్ కుంభకోణం కేసులోనే చంద్రబాబు అరెస్ట్ అయి 52 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ కుంభకోణంలో కీలక పాత్రధారిగా ఉన్న పెండ్యాల శ్రీనివాస్ను సీఐడీ సాక్షిగా పేర్కొంది. దాంతో ఆ కేసు దర్యాప్తును పూర్తిగా పక్కదారి పట్టించేందుకు పెండ్యాల శ్రీనివాస్ను కూడా ఒక సాధనంగా వాడుకోవాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా స్పష్టమవుతోంది. స్కిల్ కుంభకోణం కేసును నీరుగార్చే దిశగా చంద్రబాబు పావులు కదుపుతున్నారని, అందులో భాగంగానే పెండ్యాల శ్రీనివాస్ తిరిగి వచ్చారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సిందే. -
21 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 21వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. తొలుత 19వ తేదీ అనుకున్నా, ఆ తర్వాత 24 నుంచి నిర్వహించాలని యోచించింది. ఎక్కువ మంది మంత్రులు ఇంకా బాధ్యతలు తీసుకోకపోవడం, పలు ఇతర కారణాలతో 21 నుంచి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. 2 రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం. మొదటిరోజు ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం, రెండవ రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారని చెబుతున్నారు. -
ఐదు సంతకాలు.. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గురువారం అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్లో సాయంత్రం 4.41 గంటలకు వేద పండితుల పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. సీఎం హోదాలో ఐదేళ్ల తర్వాత తొలిసారి వెలగపూడిలోని సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు రాజధాని రైతులు, మహిళలు సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఇరువైపులా నిలబడి రహదారిపై పూలు చల్లి ఘనస్వాగతం పలికారు. వెంకటపాలెం వద్ద గజమాలతో స్వాగతించారు. సచివాలయం వద్ద ఉద్యోగులు, అధికారులు సీఎంను సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఆలిండియా సర్వీస్ అధికారులు.. పలువురు మంత్రులు సీఎంని కలసి శుభాకాంక్షలు తెలిపారు. తొలి రోజు ఐదు ఫైళ్లపై సీఎం చంద్రబాబు సంతకాలు చేశారు. మొదటి హామీ అయిన మెగా డీఎస్సీపై నిరుద్యోగుల సమక్షంలో తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామన్న రెండో హామీపై రైతుల సమక్షంలో సీఎం సంతకం చేశారు. సామాజిక పెన్షన్లు రూ.4 వేలకు పెంపు దస్త్రంపై లబ్ధిదారుల సమక్షంలో మూడో సంతకం చేశారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, నైపుణ్య గణన దస్త్రంపై విద్యార్థుల సమక్షంలో ఐదో సంతకాన్ని పెట్టారు. ఇక ప్రజల పాలన ఉంటుందని ప్రకటించారు. కాగా డిసెంబర్ 31లోగా 16,347 టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిందిగా పాఠశాల విద్యాశాఖను ఆదేశిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..⇒ ఉద్యోగాలు లేవని ఎన్నికల ప్రచార సమయంలో యువత తమ ఆవేదనను నా దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వం డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. పరిశ్రమలు రాకపోవడంతో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లేవు. దేశంలోనే ఎక్కువగా మన రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగం రేటు ఉంది. తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతామని ఎన్నికల ప్రచారంలో నేను, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేశా. ⇒ గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అనేక సమస్యలున్నాయి. భూములకు రక్షణ లేకుండా చేసే ఈ చట్టంతో ప్రజలకు ఇబ్బందులు వస్తాయి. భూమిని కొంతమంది కొనుగోలు చేయగా మరికొందరికి వారసత్వంగా లభించింది. ఆ పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకోవడం ఎంత వరకు న్యాయం? దానం చేసినట్లు జగనన్న భూహక్కు అని రాసుకున్నారు. చట్టాన్ని తెచ్చి ఆయన మనుషులను పెట్టుకుంటామన్నారు. సొంత మనుషులతో రికార్డులు మార్చడానికి ప్రయత్నించారు. రికార్డులు మార్చి సెటిల్మెంట్లు కూడా చేసుకున్నారు. ఒకసారి రికార్డులు మార్చితే హైకోర్టుకు వెళ్లాలి. హైకోర్టుకు వెళితే ఏళ్లు పడుతుంది. అందుకే దీన్ని రద్దు చేస్తున్నాం. ⇒ మొదటిసారి రూ.35తో పెన్షన్లు ప్రారంభించింది ఎన్టీఆర్. సమైక్య రాష్ట్రంలో నేను దాన్ని రూ.75కి పెంచా. విభజన తర్వాత రూ.200 ఉన్న పెన్షన్లను రూ.1,000కి, తర్వాత రూ.2 వేలకు పెంచా. తర్వాత వచ్చిన ప్రభుత్వం విడతల వారీగా పెంచింది రూ.వెయ్యి మాత్రమే. ఎన్నికల హామీ మేరకు పెన్షన్ రూ.4 వేలకు పెంచాం. పెంచిన పెన్షన్తో పాటు ఏప్రిల్, మే, జూన్కి సంబంధించి నెలకు రూ.1,000 చొప్పున కలిపి ఇస్తానని చెప్పా. పెంచిన వాటితో కలిపి జూలైలో రూ.7 వేలు పెన్షన్ లబ్ధిదారులకు అందుతుంది. దివ్యాంగుల పెన్షన్ కూడా రూ.6 వేలకు పెంచాం. పెంచిన పెన్షన్ మూడు నెలలకు వర్తిస్తున్నందున జూలైలో దివ్యాంగులు రూ.12 వేలు తీసుకుంటారు. ⇒ ఉన్నత చదువులు చదివినా సరైన స్కిల్స్ లేకపోవడంతో యువతకు ఉద్యోగాలు రావడం లేదు. ప్రపంచంలో ఇప్పటి వరకు జనాభా లెక్కలు చేశారు. కులాల వారీగా లెక్కులు తీశారు. మొదటి సారిగా స్కిల్ గణనకు శ్రీకారం చుట్టాం. ఎవరికి ఎలాంటి నైపుణ్యం ఉంది? దేశంలో ఏ ఉద్యోగాలు ఉన్నాయి? దానికి తగ్గ స్కిల్స్ ఉన్నాయా లేదా? అన్నది లెక్కిస్తున్నాం. పెట్టుబడులు వచ్చినప్పుడు వేరే రాష్ట్రాల నుంచి ఉద్యోగులు కాకుండా మన రాష్ట్రం నుంచే మానవ వనరులు సమకూర్చేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ⇒ పేదవాళ్లకు అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో గతంలో టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్లు తీసుకొచ్చాం. రూ.5 చొప్పున అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందించాం. చిరు ఉద్యోగులు, కూలీ పనులకు వెళ్లే వారికి అవి ఎంతో ఉపయోగపడ్డాయి. కర్నాటకలో ఇందిరాగా>ంధీ పేరుతో, తమిళనాడులో అమ్మ క్యాంటీన్ పేరుతో వాటిని ఏర్పాటు చేస్తే మనం అన్న క్యాంటీన్లను తీసుకొచ్చాం. చాలా మంది అన్న క్యాంటీన్లలో భోజనాలకు విరాళాలు కూడా ఇచ్చారు. గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని మూసివేసింది. బృహత్తర కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఐదో సంతకం అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై చేశా. ఎన్ని క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనేది పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటాం. -
AP: స్పీకర్ రేసులో సీనియర్లు..
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేపు(బుధవారం) కొలువుదీరనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, స్పీకర్ పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. స్పీకర్ రేస్లో సీనియర్లు పోటీ పడుతున్నారు.కళా వెంకట్రావ్, అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరి పేర్లు పరిశీలనలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ముగ్గురు కూడా ఏడు సార్లు ఏడుసార్లు గెలిచిన ఎమ్మేల్యేలే.. గతంలో చంద్రబాబును రఘురామకృష్ణం రాజు.. స్పీకర్ పదవి అడగ్గా, 2014 ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడెల శివప్రసాద్కి చంద్రబాబు స్పీకర్ పదవి ఇచ్చారు. ఈ సారి అదే ఫార్ములా అనుసరిస్తారా? సామాజిక సమీకరణలు పాటించి బీసీ, ఎస్పీలకు ఇస్తారా?. గతంలో స్వీకర్ గా పని చేసిన అనుభవం ఉన్న నాదెండ్లకి మరోసారి అవకాశం కల్పిస్తారా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది.చంద్రబాబు కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ మరోవైపు, చంద్రబాబు కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. మంత్రుల జాబితా ఇంకా ప్రకటించలేదు. మంత్రి పదవి ఫోన్ల కోసం టీడీపీ ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. రాత్రికి చంద్రబాబు నివాసానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకోనున్నారు. అమిత్ షా అనుమతి తర్వాతే మంత్రుల జాబితా వెల్లడించే అవకాశం ఉంది. -
ఏపీలో స్కూల్స్ రీ-ఓపెన్ తేదీ పొడిగింపు ఉత్తర్వులు జారీ
అమరావతి, సాక్షి: వేసవి సెలవుల అనంతరం ఆంధ్రప్రదేశ్లోని అన్ని పాఠశాలల పునఃప్రారంభ తేదీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో రేపు కాకుండా.. ఎల్లుండి(జూన్13న) పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఏటా జూన్ 12 వ తేదీన పాఠశాలలు తెరుచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో ఒక్కరోజు సెలవును పొడిగించింది విద్యాశాఖ. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండగా.. ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏపీ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్
-
కొత్త సీఎస్గా నీరబ్కుమార్ ప్రసాద్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ప్రస్తుత సీఎస్ డా.కేఎస్ జవహర్రెడ్డిని బదిలీ చేస్తూ నీరబ్కుమార్ప్రసాద్ను సీఎస్గా నియమిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలిచ్చింది. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ చాంబర్ టీటీడీ వేద పండితులు, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సుల మధ్య నీరబ్ కుమార్ ప్రసాద్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ సహచర కార్యదర్శులు, శాఖాధిపతులు, ఇతర అధికారులు, సిబ్బంది సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేసి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో సమర్థంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందంజలో నిలిపేందుకు సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జీఏడీ కార్యదర్శి సురేశ్ కుమార్, స్పెషల్ సీఎస్లు గోపాల కృష్ణ ద్వివేది, రజత్ భార్గవ, కె.విజయానంద్, పీసీసీఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు కె.సునీత, ప్రవీణ్ ప్రకాశ్, ప్రద్యుమ్న, ఐటీ కార్యదర్శి కె.శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్ తదితరులున్నారు. -
ఏపీ కొత్త సిఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్..
-
ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. బడి తెరిచిన రోజే వాటిని అందించేందుకు ఇప్పటికే ప్రింటర్స్ నుంచి జిల్లా స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా, మొదటి సెమిస్టర్కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలను పంపిణీకి సిద్ధం చేశారు. 1, 2 తరగతులు మినహా మిగతా అన్ని తరగతుల పాఠ్య పుస్తక ముఖచిత్రాలు మార్చారు. ముఖ చిత్రాల ఆధారంగా సులభంగా పుస్తకాలను గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. గతంలో ఇచ్చినట్టుగానే ఈసారీ ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న స్కూళ్లు ప్రారంభమవుతాయి. జూన్ 8వ తేదీకే అన్ని స్కూళ్లకు విద్యార్థుల సంఖ్యను అనుసరించి పుస్తకాలను తరలించనున్నారు. 8, 9, 10 తగరతుల విద్యార్థులకు 1.08 కోట్ల రెండో సెమిస్టర్ పుస్తకాల ముద్రణ సైతం దాదాపు పూర్తయింది. సెమిస్టర్–2 బోధన అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటిని జూలైలో విద్యార్థులకు అందిస్తారు.ఈసారి పదో తరగతి ఇంగ్లిష్ మీడియంలోగత విద్యా సంవత్సరం వరకు 1 నుంచి 9వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం అమల్లో ఉంది. జూన్లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారనుంది. ఈ నేపథ్యంలో ఎన్సీఈఆర్టీ సిలబస్ను అనుసరించి అధికారులు పుస్తకాలను సిద్ధం చేశారు. పదో తరగతి ఫిజికల్ సైన్స్ పుస్తకాలను తొలిసారి పూర్తి ఆర్ట్ పేపర్పై ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. ఈ కోర్సు బోధనకు ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులను ఎక్స్పర్ట్స్గానూ నియమించింది. ఫ్యూచర్ స్కిల్స్ సిలబస్ను అనుసరించి మొత్తం 4.30 లక్షల పుస్తకాలను సిద్ధం చేసింది. బైలింగ్యువల్లో మేథమెటిక్స్, బయాలజీ, ఫిజిక్స్, సామాజిక శాస్త్ర పాఠ్య పుస్తకాలను విద్యార్థులు ఆసక్తిగా చదివేలా తీర్చిదిద్దారు. దీనిద్వారా విద్యార్థులకు సబ్జెక్టులపై మరింత అవగాహన పెరుగుతుందని, ఆంగ్ల భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను మార్కెట్లోకి రెండు రోజుల్లో విడుదల చేస్తామని ప్రభుత్వ టెక్టŠస్ బుక్స్ డైరెక్టర్ కొండా రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. వాటిని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పుస్తకాల ముద్రణను జ్యుడిషియల్ ప్రివ్యూ పూర్తయిన తర్వాతే కాంట్రాక్టు అప్పగించామన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒకటి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు పాఠశాల విద్యా శాఖ వెబ్సైట్ ( ఠీఠీఠీ. ఛిట్ఛ. ్చp. జౌఠి. జీn)లో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. -
మరో ఐదు మెడికల్ కాలేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు 2024–25 విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి. ఈ దిశగా సీఎం జగన్ ప్రభుత్వం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుంది. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో కొత్తగా వైద్య కళాశాలలను ప్రారంభించి ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాబట్టేలా వైద్య శాఖ కసరత్తు చేస్తోంది. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) త్వరలో ఐదు చోట్ల ఇన్స్పెక్షన్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. తనిఖీలు పూర్తయిన అనంతరం ఆయా కళాశాలలకు అనుమతులు మంజరు కానున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తెస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2023–24లో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం వైద్య కళాశాలలను ఇప్పటికే ప్రారంభించారు. ఒక్కో చోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చారు.ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగాఐదు చోట్ల ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులను అభివృద్ధి చేస్తున్నారు. వైద్య కళాశాలకు 222, బోధనాస్పత్రికి 484 చొప్పున 3,530 పోస్టులను మంజూరు చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఎస్పీఎం, జనరల్ మెడిసిన్, గైనిక్, పీడియాట్రిక్స్ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు నర్సింగ్, మెడికల్, నాన్ మెడికల్, అడ్మినిస్ట్రేషన్ పోస్టులను మంజూరు చేసి భర్తీ కూడా చేపట్టారు. ఈ కళాశాలలన్నీ మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్నందున పోస్టులన్నీ భర్తీ చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ప్రారంభించే 7 వైద్య కళాశాలలకు ఈ తరహా ఇబ్బందులు తలెత్తకుండా ఫ్యాకల్టీకి అదనపు ప్రోత్సాహకాలు కల్పించారు. పాడేరు, మార్కాపురం, పార్వతీపురం, పిడుగురాళ్ల, పెనుకొండ కాలేజీల్లో ఫ్యాకల్టీకి బేసిక్పై 50 శాతం ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. మైదాన ప్రాంతాల్లోని పులివెందుల, మదనపల్లె, ఆదోని, అమలాపురం, బాపట్ల, పాలకొండ, నర్సీపట్నం కళాశాలల్లో బేసిక్పై 30 శాతం ప్రోత్సాహకాన్ని అందించనున్నారు. రూ.8,480 కోట్లతో మెడికల్ కాలేజీలువైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాడు–నేడు ద్వారా రూ.16 వేల కోట్లతో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసింది. ఇందులో రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించింది. ఈ ఏడాది మరో ఐదు ప్రారంభం కానున్నాయి. మిగిలిన ఏడు వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ఈమేరకు ఏడు చోట్ల ప్రభుత్వాస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసేందుకు వీలుగా పడకల సంఖ్య పెంచుతూ వైద్య శాఖ నిర్ణయం తీసుకుంది. -
పశుపోషకులకు బాసటగా..
సాక్షి, అమరావతి: ఎవరైనా ఊహించారా మూగజీవాల కోసం అంబులెన్స్లు వస్తాయని, పాడి రైతు ఇంటి వద్దే ఆ మూగజీవాలకు వైద్యం అందుతుందని.. అయితే ఈ ఊహాతీతమైన విషయాన్ని నిజం చేసింది వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చి పాడి రైతులకు అండగా నిలిచింది. మూగజీవాలకు అత్యవసర సమయాల్లో ఉచితంగా మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో తీసుకొచ్చిన మొబైల్ అంబులేటరీ క్లినిక్స్ పశుపోషకులకు వరంగా మారాయి. 108 తరహాలోనే ఫోన్ చేసిన అరగంటలోనే పాడిరైతుల ఇంటి వద్దకు చేరుకుని వైద్యసేవలు అందిçస్తున్నాయి. పాడి రైతుల జీవనా«దారాన్ని నిలబెడుతున్నాయి. ఈ వాహనాలు రోడ్డెక్కి రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే 8.81 లక్షల మూగజీవాలను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలిగాయి. ఏపీలోని సంచార పశు వైద్య సేవలపై కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్ బృందాలు అధ్యయనం చేశాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వీటిని ప్రవేశపెడుతున్నారు. ఏపీలో సేవలను సమర్థంగా నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈఎంఆర్ఐ) గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థకే ఆ రెండు రాష్ట్రాలు వాహనాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఏపీ మోడల్లోనే పంజాబ్, కేరళ తదితర రాష్ట్రాల్లో మొబైల్ అంబులేటరీ వాహన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.సకాలంలో వైద్యసేవలందించడమే లక్ష్యం..గతంలో పశువులకు అనారోగ్య సమస్య తలెత్తితే సుమారు 5 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే పశు వైద్యశాలలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. పాడి పశువులకు రైతుల ఇంటి ముంగిటే వైద్యసేవలందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2022 మే 20వ తేదీన మొబైల్ అంబులేటరీ క్లినిక్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నియోజకవర్గానికి 2 చొప్పున రూ. 210 కోట్లతో 340 అంబులెన్స్లను, ప్రత్యేకంగా 1962 కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అంబులెన్స్లో పశువైద్యుడు, వెటర్నరీ డిప్లొమో సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను అందుబాటులో ఉంచారు. 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రో స్కోప్తో సహా 33 రకాల పరికరాలతో కూడిన చిన్న ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనంలో 51 రకాల వైద్య పరికరాలను ఉంచారు. ప్రథమ చికిత్సతో పాటు చిన్న తరహా శస్త్రచికిత్సలు, కృత్రిమ గర్భధారణ లాంటి సేవలకు ప్రతీ వాహనంలో రూ. 30 వేల విలువైన 81 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ వాహనాల ద్వారా 295 పశువైద్యులు, 337 పశువైద్య సహాయకులు సేవలందిస్తున్నారు. పశువులను సమీప ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా వాహనంలో హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యాన్ని కల్పించారు. వైద్య సేవల అనంతరం తిరిగి ఇంటి వద్దకే తీసుకొచ్చి అప్పగించేలా ఏర్పాటు చేయడంతో రైతులకు వ్యయ ప్రయాసలు, రవాణా భారం తొలగిపోయాయి. 1962 కాల్ సెంటర్కు నిత్యం సగటున 1778 ఫోన్కాల్స్ వస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో ఈ వాహనాలు మండలానికి 5 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న 11,987 మారుమూల గ్రామాలకు చేరుకుని వైద్య సేవలందించాయి. సుమారు రెండేళ్లలో రూ. 24.48 కోట్ల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఫలితంగా ఇప్పటి వరకు 7,55,326 మంది పశుపోషకులకు జీవనోపాధిని కాపాడగలిగారు.⇒ బాపట్ల జిల్లా రామకృష్ణ నగర్కు చెందిన పి.వెంకటేశ్వర్లుకు ఆరు పాడి గేదెలున్నాయి. ఓ పశువు కొమ్ము విరిగిపోవడంతో తీవ్ర రక్తస్రావంతో కదల్లేని స్థితిలో కూలబడిపోయింది. ఉదయం 9.40 గంటలకు 1962కి కాల్ చేయగా 10.30 నిమిషాలకు అంబులెన్స్ ఇంటికే వచ్చింది. నొప్పి నివారణకు డాక్టర్ ఇంజక్షన్ ఇవ్వడంతో కొద్దిసేపట్లోనే కోలుకుని లేచి నిలబడగలిగింది. ఇప్పటివరకు మనుషుల కోసమే అంబులెన్స్ వస్తుందనుకున్నాం. మూగ జీవాలను సైతం సంరక్షిస్తూ ఉచితంగా మందులు కూడా అందించే సౌకర్యం కల్పించిన సీఎం జగన్కు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.నిజంగా గొప్ప ఆలోచన..నాకు ఐదు పాడి ఆవులున్నాయి. పశువులు కొట్లాడుకోవడంతో ఓ ఆవు తీవ్రంగా గాయపడింది. 1962కి ఫోన్ చేయగా గంటలో అంబులెన్స్ ఇంటికే వచ్చింది. గాయాన్ని శుభ్రం చేసి కుట్లు వేసి వైద్యం చేశారు. ఉచితంగా మందులిచ్చారు. గతంలో పశువైద్యశాలకు తరలించేందుకు ఎంతో ఇబ్బంది పడేవాళ్లం. ఇంటి వద్దే జీవాలకు సేవలందించడం నిజంగా గొప్పఆలోచన. సీఎం జగన్కు కృతజ్ఞతలు. –కాటి విద్యాసాగర్, కోతపేట, బాపట్ల జిల్లాఅరగంటలోనే అంబులెన్స్..మాకు రెండు పాడి గేదెలు, నాలుగు సన్న జీవాలున్నాయి. మేతకు వెళ్లిన ఓ గేదెకు కాలు చీరుకుపోవడంతో నడవలేక పోయింది. 1962కు కాల్చేస్తే అరగంటలో అంబులెన్స్ వచ్చింది. పశువు కాలుకు డ్రెస్సింగ్ చేసి బ్యాండేజ్ కట్టారు. నొప్పికి ఇంజక్షన్ ఇచ్చారు. హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా పశువుని తరలించే విధానం చాలా బాగుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం.– ఎం.అసిరిరెడ్డి, దళ్లిపేట, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లామాబోటి రైతులకు ఎంతో మేలు..నాకు 12 ఆవులున్నాయి. ఓ ఆవు కడుపునొప్పితో చాలా ఇబ్బందిపడింది. 1962కి కాల్ చేశా. వెంటనే అంబులెన్స్ వచ్చింది. డాక్టర్ చికిత్స అందించారు. ఆవు కోలుకొని నిలబడేలా చేశారు. మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ల ఏర్పాటు ఆలోచన చాలా బాగుంది. మాబోటి పేద రైతులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. – పర్రి ఉమా మహేశ్వరరావు, పర్రిపుత్రుగ, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా -
ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
-
ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఊరట ఇస్తూ.. డీబీటీ(నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ) పథకాలకు నిధుల విడుదల ప్రారంభం అయ్యింది. నిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్కు రూ.502 కోట్లు విడుదల అయ్యాయి. రెండు మూడు రోజుల్లో మిగిలిన పథకలకూ నిధుల్ని విడుదల చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల వేళ నిధులు విడుదల కాకుండా తెలుగు దేశం పార్టీ కుట్రలు చేసింది. ఈసీకి ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే ఈసీ సైతం డీబీటీ నిధులు విడుదలకు చేయకుండా ఆదేశాలిచ్చింది. దీంతో.. ఎన్నికల సంఘంపై ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. అయితే విచారణ సందర్భంగా ఈసీ తీరుపై కోర్టు ఆగ్రహం వెల్లగక్కింది. ఈలోపే పోలింగ్ తేదీ వచ్చేయడంతో నిధుల విడుదల ఆగిపోయింది. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో నిధుల విడుదల తిరిగి ప్రారంభం అయ్యింది.మాట నిలబెట్టుకున్న సీఎం @ysjagan డీబీటీ పథకాల నిధుల విడుదలకి గత వారం ఏపీ హైకోర్టు అనుమతించినా.. కుట్రపూరితంగా అడ్డుకున్న చంద్రబాబు పోలింగ్ తర్వాత అకౌంట్లలో డబ్బులు వేస్తామని లబ్ధిదారులకి హామీ ఇచ్చిన జగనన్న మాట ప్రకారం ఆసరా కింద అక్కచెల్లెమ్మల అకౌంట్లలో రూ.1480 కోట్లు,…— YSR Congress Party (@YSRCParty) May 16, 2024 -
ఏపీ: జిరాక్సులు కాదు.. ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇస్తున్నారు
సాక్షి, అమరావతి/అక్కిరెడ్డిపాలెం (గాజువాక): స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాక ఒరిజినల్ డాక్యుమెంట్లు కాకుండా జిరాక్సు కాపీలు మాత్రమే ఇస్తున్నారనే ప్రచారం పచ్చి అబద్ధమని తేలిపోయింది. రిజిస్ట్రేషన్లు చేయించుకున్న అనేక మంది తమకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒరిజినల్ డాక్యుమెంట్లే ఇస్తున్నారని చెబుతున్నారు. వారంతా ఒరిజినల్ డాక్యుమెంట్లను కూడా చూపిస్తున్నారు. ఈ–స్టాంపింగ్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్లకూ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇస్తున్నారని వినియోగదారులు తెలిపారు. పలుచోట్ల నాన్–జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు అందుబాటులో ఉండటంతో అక్కడా రిజిస్ట్రేషన్లు చేసి గతంలో మాదిరిగానే ఒరిజినల్ డాక్యుమెంట్లు జారీ చేస్తున్నారు. ఆస్తి పత్రాలను ప్రభుత్వం వద్దే ఉంచుకుంటారనే ప్రచారం నిజం కాదని రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న వారికి స్పష్టంగా తెలుస్తోంది. అనుమానాలు సృష్టిస్తున్న సోషల్ మీడియా ప్రచారం భూముల రిజిస్ట్రేషన్పై సోషల్ మీడియా, టీడీపీ ప్రచారం చేస్తున్న ఐవీఆర్ఎస్ కాల్స్ విన్న వారు మాత్రం అది నిజమేనని భ్రమపడుతున్నారు. అనుమానం ఉన్నవారు ఎవరైనా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళితే.. అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల తీరు, ఇస్తున్న డాక్యుమెంట్లు ఒరిజినల్సా, జిరాక్సులా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరో ముఖ్యాంశం ఏమిటంటే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు, ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి అసలు సంబంధమే లేదనే విషయం కూడా అక్కడికి వెళ్లిని వారికి అవగతమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో కావాలని ప్రజల్లో అపోహలు సృష్టించడం కోసమే జిరాక్సుల ప్రచారం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. భూ హక్కు చట్టంపై వదంతులు నమ్మొద్దు ఆస్తి తాలూకా ఒరిజనల్ డాక్యుమెంట్లను చూపుతున్న ఆర్.కృష్ణగాజువాక ప్రాంతానికి చెందిన ఈయన పేరు ఆర్.కృష్ణ. ప్రస్తుతం హైదరాబాద్లోని ఎంఎస్సీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇటీవల గాజువాకలోని ఓ ఆస్తిని ఈయన కొనుగోలు చేశారు. గాజువాక జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బుధవారం తన ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పత్రాలను రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి అందుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. ‘ల్యాండ్ టైట్లింగ్పై వస్తున్న వదంతులను, సోషల్ మీడియాలో ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని కొందరు వక్రీకరించడంపై అనుమానం వచ్చి సబ్ రిజిస్ట్రార్ను వివరణ కోరాను. ఆస్తి హక్కు పత్రాల ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారా, జిరాక్స్ డాక్యుమెంట్లు ఇచ్చారా అని అడిగాను. ఈ వదంతులన్నీ అవాస్తవమని సబ్ రిజిస్ట్రార్ చెప్పారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఆస్తి హక్కుదారునైన నాకు ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందజేశారు. సోషల్ మీడియాలో భూ హక్కు చట్టంపై వస్తున్న వదంతులన్నీ అవాస్తవాలే. వీటిని ఎవరూ నమ్మవద్దు’ అని చెప్పారు. ఈ విషయాలపై ఓ వీడియో కూడా విడుదల చేశారు.ఒరిజినల్సే ఇచ్చారు ఉయ్యూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. రిజిస్ట్రేషన్ అయ్యాక ఒరిజనల్ దస్తావేజులు ఇచ్చారు. ఒరిజినల్స్ ఇవ్వడం లేదు, జిరాక్స్ కాపీలు ఇస్తున్నారంటూ కొన్ని టీవీల్లో వస్తున్న వార్తలు నిజం కాదు. – తాతినేని రామ్మోహనరావు, గోపువానిపాలెం, పమిడిముక్కల మండలం, కృష్ణా జిల్లా ఆ ప్రచారం నిజం కాదు నా తల్లితో కలిసి ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను. పావు గంటలో రిజ్రస్టేషన్ చేశారు. వెంటనే డాక్యుమెంట్ ఇచ్చారు. రిజిస్ట్రార్ ఆఫీసులో డాక్యుమెంట్ ఇవ్వడం లేదని బయట జరుగుతున్న ప్రచారం నిజం కాదు. మా చేతికి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారు. – ప్రసాద్, చింతలపూడి, ఏలూరు జిల్లాఒరిజినల్ తీసుకున్నాను నేను భీమునిపట్నం రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో స్థలం కొన్నాను. రిజిస్ట్రేషన్ కోసం వెళితే వెంటనే పూర్తి చేశారు. సబ్ రిజిస్ట్రార్ను కలిసి కొత్త విధానంలో డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని చెబుతున్నారని అడిగాను. అది అబద్ధమని చెప్పారు. వెంటనే నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చారు. – శ్రీకాంత్, భీమిలి, విశాఖ జిల్లా -
ఇది... భూ హక్కుకు భరోసా!
ప్రజల భూమి హక్కును కాపాడటం ప్రభుత్వాల రాజ్యాంగ బాధ్యత. ప్రస్తుతం చాలా ఉన్న సివిల్ కేసులకు, క్రిమినల్ కేసులకు కారణం భూమిపై యజమానికి వున్న హక్కును లేక టైటిల్ ను గుర్తించే చట్టబద్ధమైన వ్యవస్థ లేకపోవటం. వారసత్వం, కొనుగోలు, బదిలీ, కేటాయింపు ద్వారా భూమిపై యాజమాన్య హక్కు మార్పిడి జరుగుతుంది. రిజిస్ట్రేషన్ వ్యవస్థ భూమికి సంబంధించిన ఈ బదలాయింపు లావాదేవీలను రిజిస్టర్ చేస్తుంది. అంతేకాని లావాదేవీల ద్వారా పొందిన హక్కును రిజిస్టర్ చేయదు. అందువలన రిజిస్ట్రేషన్ విధానం భూమిపై సంపూర్ణ హక్కుకు రుజువు కాదు. అందుకే ఒకరు భూమిని కొని రిజిస్టర్ చేయించుకుంటే అదే భూమిని మరొకరు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ‘డబుల్ రిజిస్ట్రేషన్’ అనే సమస్య ఎక్కువగా వింటున్నాం. ‘లాండ్ టైటిలింగ్ చట్టం –2022’ ఈ సమస్యకు పరిష్కారం. పట్టాదారు పాస్ బుక్, టైటిల్ డీడ్, 1బీ ఆడంగల్, మరే ఇతర రెవెన్యూ రికార్డులు కూడా భూమిపై యజమానికి ఉన్న యాజమాన్య హక్కును నిరూపించే పత్రాలు కావు (పి. కిశోర్ కుమార్ వర్సెస్ విట్టల్ కె పట్కర్, 2023). రెవెన్యూ రికార్డుల్లో వివరాలు పొందుపరచే ‘మ్యుటేషన్’ కేవలం భూమిశిస్తు కట్టటానికి ఉపయోగపడే పత్రం. ఈ మ్యుటేషన్ వలన భూమిపై హక్కులు కల్పించబడవు, ధ్రువీకరించ బడవు (సవర్ణి వర్సెస్ ఇందర్ కౌర్, 1996). ఆంధ్ర ప్రదేశ్ (భూమి హక్కులు మరియు పట్టాదార్ పాస్ పుస్తకాలు) చట్టం, 1971 చట్ట బద్ధంగా భూములకు సంబంధించిన హక్కుల రికార్డులను తయారు చేయడానికీ, ఆ రికార్డులను నిర్వహించడానికీ ఉద్దేశించిందే కాని యజమానికి భూమిపైన ఉన్న హక్కులను ధ్రువీకరించదు (సీతారామ్ పాటిల్ వర్సెస్ రాంచంద్ర నాగో పాటిల్, (1977). పట్టాదారు పాస్ బుక్ కూడా యాజమాన్య హక్కును నిర్ధారించదు (గౌసియా బేగమ్ వర్సెస్ బసిరెడ్డి రుక్మిణమ్మ, 2013). ఈ దేశంలో ఏ రెవెన్యూ రికార్డు కూడా భూమిపైన యజమానికి వున్న హక్కును లేదా టైటిల్ను సంపూర్ణంగా నిర్ణయించదు, నిర్ధారించదు. భూమిపైన యజమానులకు ఉన్న హక్కులను లేక టైటిల్ కాపాడే విధంగా, భూ యజమానికి ఉన్న హక్కును ధ్రువీకరించి, హక్కు భద్రతకు హామీని ఇచ్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘లాండ్ టైటిలింగ్ చట్టం’ చేసింది. ఇది విప్లవాత్మకమైనది. భారత దేశంలో భూ యజమాని హక్కు(టైటిల్)ను చట్టబద్ధంగా గుర్తించిన మొట్ట మొదటి చట్టం ఇది. ఈ చట్టం లాండ్ టైటిలింగ్ అథారిటీనీ, స్థిరాస్తిపై హక్కునూ రిజిస్టర్ చేసే వ్యవస్థనూ ఏర్పాటు చేసి, టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిని నియమిస్తుంది. ఈ చట్టం ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతంలో ఉన్న భూమి వివరాలకు సంబంధించిన రికార్డును సిద్ధం చేసి, స్థిరాస్తి గుర్తింపు సంఖ్య కేటాయించి, దాని సరిహద్దులతో రికార్డ్లో నమోదు చేసుకోవాలి. ఈ రికార్డులు మూడు రకాలు. 1. రికార్డు ఆఫ్ టైటిల్ 2. రికార్డు ఆఫ్ చార్జ్ 3. వివాదాలలో వున్న భూమి రికార్డు. ప్రారంభంలో తాత్కాలిక టైటిల్ రికార్డును సిద్ధంచేసి, నోటిఫై చేసి, భూ హక్కు దారులకు ఆ రికార్డు పైన వున్న అభ్యంతరాలను స్వీకరించి, ఆ అభ్యంత రాలను నివృత్తి చేస్తారు. ఏ అభ్యంతరం లేని భూముల టైటిల్ను రికార్డు ఆఫ్ టైటిల్లో నమోదు చేస్తారు. ఈ రికార్డులో నమోదు చేసిన రెండు సంవత్సరాల తరువాత ఆ భూమిపై ఉన్న హక్కు యజమాని సంపూర్ణ హక్కుగా గుర్తించబడుతుంది. భూమికి సంబంధించి సివిల్ కోర్ట్లో లేక రెవెన్యూ కోర్ట్లో అయినా కేసు వుంటే, దాని తీర్పు ప్రకారం రెండు సంవత్సరాల తరువాత కూడా హక్కును నమోదు చేస్తారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న అన్ని రెవెన్యూ రికార్డుల స్థానంలో ఒకే ఒక్క రికార్డు ‘రికార్డు ఆఫ్ టైటిల్’ అమలులోకి వస్తుంది. ఈ రికార్డు భూ యజమానికి వున్న హక్కును సంపూర్ణ హక్కుగా ఈ చట్టం గుర్తిస్తుంది. భారత దేశంలో భూ యజమాని హక్కును (టైటిల్) చట్టబద్ధంగా గుర్తించిన మొట్టమొదటి చట్టం ఇది. చట్టంలోని సెక్షన్ 38... భూమి టైటిల్ హక్కుకు సంబంధించిన వివాదాలను సివిల్ కోర్ట్ పరిధి నుండి మినహాయించి, రెవెన్యూ కోర్ట్కు బదలాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తమవుతున్నది. ఈ సెక్షన్ రాజ్యాంగ బద్ధతను గూర్చిన వివాదం ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయ స్థాన పరిధిలో వుంది. సివిల్ కోర్ట్ అధికారాలను కొనసాగిస్తూ మధ్యంతర వుత్తర్వులు వెలువరించింది హైకోర్ట్. మరో వివాదాస్పద అంశం సెక్షన్ 14 ప్రకారం టైటిల్ రిజిస్టర్లో నమోదు కాబడిన లేక నమోదుకాని భూములకు సంంబంధించి అభ్యంతరాలు వున్నట్లయితే, సంబంధిత వ్యక్తులు టైటిల్ రిజిస్ట్రేషన్ అప్పీలేట్ అధికారికి అర్జీ పెట్టుకోవాలి. రెవెన్యూ అధికారి అప్పీలేట్ అధికారిగా వుంటాడు కాబట్టి ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది అనేది ఒక వాదన. సివిల్ కోర్ట్లో భూవివాద పరిష్కారం ఆలస్యం అవుతుంది అని ఈ విధానాన్ని ఈ చట్టంలో అమలు చేశారు. రెవెన్యూ న్యాయస్థానాలు ఈ చట్టంలో కొత్తగా ఏర్పాటు చేసినవి కావు. అనేక ఏళ్లుగా అమలులో వున్న ఈ రెవెన్యూ కోర్టులను ఎప్పుడు ప్రజలు, న్యాయవాదులు వ్యతిరేకించలేదు. అమలుచేసే అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారనే అభియోగంతో చట్టాన్ని కొట్టి వేయటం న్యాయ శాస్త్ర ప్రాథమిక సూత్రానికి వ్యతిరేకం. భూమిని కొనుగోలు చేసినప్పుడు ఆ కొనుగోలు లావాదేవీలను రిజిస్టర్ చేయించినట్లే, సంబంధిత అధికారి దగ్గర హక్కును లేక టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ విధానం భూ యజమానికి వున్న భూమిపై వున్న హక్కుకు రక్షణ, భద్రత. కొనిన స్థలం చుట్టూ కంచ వేయించు, గోడ కట్టు అని మన శ్రేయోభిలాషులు చేసే హెచ్చ రికలు ఇక అవసరం లేదు. స్థిరాస్తిని టైటిల్ రికార్డులో నమోదు చేసిన తరువాత, హక్కును కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. ఈ దేశంలో భూమి కొని దానిని టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసుకొని విదేశాలకు వెళ్ళి ఎన్ని సంవత్సరాల తరువాత తిరిగి భారతదేశానికి వచ్చినా,వారి భూమి అన్యాక్రాంతం కాదు. ముఖ్యంగా ఈ చట్టం ’సెకండ్ రిజిస్ట్రేషన్’ సమస్యకు పరిష్కారం. దీనికి కారణం భూమి కొనిన యజమాని హక్కుకు ఈ చట్టం ప్రభుత్వాన్నే కాపలాదారునిగా చేస్తుంది. ప్రభుత్వం భూమిని పరిరక్షించటంలో విఫలమైనా, టైటిల్కి సంబంధించి సమస్య వచ్చినా భూమి యజమానికి ప్రభుత్వం బీమా చెల్లిస్తుంది. రెవెన్యూ రికార్డు లేకుండా చాలా కాలంగా భూమిని పండించుకుంటున్న బలహీన వర్గాలకు పంపిణీ చేసిన భూమిని కూడా వెంటనే రికార్డు ఆఫ్ టైటిల్లో నమోదు చేయాలి. వారి హక్కుకు భద్రత మరియు బీమా కల్పించాలి. ఈ చట్టం అమలు వలన బలహీన వర్గాల ప్రజలకు వారి అనుభవంలో వున్న భూమికి, వారికి బదలాయించే భూమి హక్కుకు భద్రత కల్పించ వలసిన బాధ్యత ప్రభుత్వంపై వుంటుంది. ఆ విధంగా పేద, బలహీన వర్గాల వారికి కూడా ఈ చట్టం వలన మేలు జరుగుతుంది.డా‘‘ నేలటూరి జేసు రత్న కుమార్ వ్యాసకర్త పూర్వ సహాయ సంచలకులు,ఏపీ జ్యుడీషియల్ అకాడెమీ ‘ 98857 20777 -
ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
సాక్షి, అమరావతి: ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండటంతో చంద్రబాబు గ్యాంగ్ పిచ్చెత్తిపోయి ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఏమీ లేక వైఎస్ జగన్పైన, ఆయన ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసి, ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రజల భూములపై వారికే హక్కులు కల్పించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై నీచమైన ప్రచారం చేస్తోంది. భూముల వ్యవస్థను సమూలంగా మార్చడం ద్వారా ప్రజలకు.. తద్వారా సమాజానికి, రాష్ట్రానికి ఎంతో మేలు చేసే ఈ చట్టాన్ని స్వలాభం కోసం వివాదాస్పదంగా మారుస్తోంది. అసలు ఈ చట్టంపై కూటమి నేతల ఆరోపణలు.., వాస్తవాలేమిటో తెలుసుకుందాం..కూటమి నేతల ఆరోపణలు–వాస్తవాలుఆరోపణ: ప్రజల ఆస్తులు లాక్కోవడానికే ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది.వాస్తవం: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అసలు లక్ష్యమే ప్రజల ఆస్తులు కాపాడటం, వాటికి పూర్తి భద్రత కల్పించడం. ప్రభుత్వమే గ్యారెంటీ సర్టిఫికెట్ ఇవ్వడం. భూ యజమానులకు నష్టం కలిగితే పూర్తి పరిహారం చెల్లించడం. భూములు లాక్కోవడం అనేది ఈ చట్టంతో సాధ్యం కాదు.ఆరోపణ: భూ పత్రాలు ప్రభుత్వం వద్దే ఉంటాయి.వాస్తవం : భూ పత్రాలు ప్రభుత్వం చేతిలో ఉండవు. మీ వద్ద ఉన్న పత్రాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోదు. కేవలం రికార్డులు పరిశీలించి, ప్రజలకు గ్యారెంటీ సర్టిఫికెట్ ఇస్తుంది. ఇదే తుది కాపీ అవుతుంది. భవిష్యత్తులో 30 రకాల పత్రాల అవసరం ఉండదు.ఆరోపణ: కొత్త చట్టం అమల్లోకి వస్తే యాజమాన్య హక్కులను నిరూపించుకోవాలి.వాస్తవం : మీ వద్ద భూములు ఉంటే వాటి హక్కులను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం ప్రకారం ప్రభుత్వం వద్ద ఆ వివరాలు ఉంటాయి. ఆ వివరాల ప్రకారమే గ్యారెంటీ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అందులో అభ్యంతరాలు ఉంటే రెండేళ్ల పాటు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్పీళ్లను పరిశీలించి శాశ్వత రిజిస్టర్లో నమోదు చేస్తారు.ఆరోపణ: కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు.వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లను అప్పిలేట్ అథారటీ పరిష్కరిస్తుంది. అక్కడ న్యాయం జరగకుంటే హైకోర్టులోని ప్రత్యేక బెంచ్ని ఆశ్రయించవచ్చు. ఆ బెంచ్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చు. కోర్టు ఇచ్చిన తుది తీర్పునే అప్పిలేట్ అథారిటీ అమలు చేస్తుంది. దీనిని మార్చే అధికారం మళ్లీ కోర్టుకే ఉంటుంది.ఆరోపణ: కోర్టుల్లో కేసులు వేసేందుకు టీఆర్ఓకు సమాచారమివ్వాలి.వాస్తవం : సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ, మీరు కోర్టులో కేసు వేసినట్లు సంబంధింత అధికారులకు తెలపాలి. తద్వారా మీ భూమి ఎక్కడికీ పోకుండా ఉంటుంది.ఆరోపణ: కొత్త చట్టం కింద భూహక్కుల నిర్ధారణ ఎవరు చేస్తారు?వాస్తవం : ఇప్పటికే ఉన్న భూమి వివరాలతో ఒక టైటిల్ రిజిస్టర్ మీ గ్రామానికి లేదా పట్టణానికి వస్తుంది. ఆ రిజిస్టర్లోని రికార్డులకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుంది. ఒకవేళ మీకు నష్టం కలిగితే ప్రభుత్వమే పూర్తి నష్ట పరిహారం చెల్లిస్తుంది. మీకు అధికారుల ద్వారా జరిగిన మార్పుల్లో అభ్యంతరాలుంటే కోర్టుల్లో సవాల్ చేయొచ్చు.ఆరోపణ: వారసత్వ హక్కుల వివాదాలు వస్తాయి.వాస్తవం : వారసత్వంగా సంక్రమించే ఆస్తులను టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ద్వారా మీ పేరు మీద బదిలీ చేసుకోవచ్చు. వారసత్వం విషయంలో వివాదాలు ఉంటే కోర్టుకు వెళ్లాలి. కోర్టు తీర్పు ఆధారంగా రిజిస్టర్లో మీ పేర్లను నమోదు చేస్తారు.ఆరోపణ: ఈ చట్టం ఎక్కడా అమల్లో లేదు. ఏపీలోనే ఉంది.వాస్తవం : ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో అమల్లో ఉంది. ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, ఆఫ్రికా దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. తద్వారా అక్కడి భూముల హక్కులకు భద్రత పెరిగింది. ఆయా దేశాల్లో ఈ వ్యవస్థ విజయవంతంగా నడుస్తోంది.ఆరోపణ: ఇది రాష్ట్ర ప్రభుత్వ చట్టమే. కేంద్రానిది కాదు.వాస్తవం : ల్యాండ్ టైట్లింగ్ చట్టం కోసం 1986లో ప్రొఫెసర్ డి.సి.వాధ్వా ఏకసభ్య కమిషన్ను కేంద్రం నియమించింది. ఈ కమిటీ 1989లో టైటిల్ గ్యారెంటీ చట్టం అమలును సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది. ఆ తర్వాత 2008, 2011, 2015, 2019లో నాలుగుసార్లు ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపారు. 2019లో నీతి ఆయోగ్ కమిటీ కొత్త ముసాయిదాను రాష్ట్రాలకు పంపింది. 2024 డిసెంబర్లోపు అమలు చేయాలని ఆదేశించింది.ఆరోపణ: కొత్త చట్టం ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చింది.వాస్తవం : ఇంకా అమల్లోకి పూర్తిస్థాయిలో రాలేదు. చట్టం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇందుకు సంబంధించిన నిబంధనలు తయారు కావాలి. గెజిట్కు సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రూపొందించలేదు.ఆరోపణ: ఈ చట్టం వల్ల రైతులకు నష్టం.వాస్తవం : ఈ చట్టం వల్ల రైతులకు పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. 30 రకాల పత్రాల అవసరం ఉండదు. భూ వివాదాలు, సర్వే నంబర్లు, సరిహద్దుల సమస్యలు పరిష్కారం అవుతాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగాల్సిన అవసరం ఉండదు. మీ భూమిపై మీకు శాశ్వత హక్కులు వస్తాయి. భూకబ్జాల పీడ వదులుతుంది. మీ భూమిపై ఇతరులు దౌర్జన్యం చేసే అవకాశం ఉండదు. బ్యాంకులు సైతం సులువుగా లోన్లు జారీ చేస్తాయి.ఆరోపణ : ప్రజల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు చెల్లకుండా పోతాయి.వాస్తవం : ఈ చట్టం జాతీయ స్థాయిలో చర్చించి నీతి ఆయోగ్ సిఫారసు చేసిన చట్టం. అసెంబ్లీలో కూడా ఆమోదముద్ర పడింది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా మద్దతు ఇచ్చింది. రాష్ట్రమంతటా ఈ చట్టం ఒక్కరోజే అమల్లోకి రాదు. భూముల సర్వే తర్వాత అభ్యంతరాలను పరిష్కరించాక తుది రిజిస్టర్ రూపొందించిన ప్రదేశాల్లో కాలానుగుణంగా చట్టం అమల్లోకి వస్తుంది. అప్పటివరకు రైతుల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు చెల్లుబాటులోనే ఉంటాయి. ఒక్కసారి తుది రిజిస్టర్ ద్వారా ప్రభుత్వం టైటిల్ గ్యారెంటీ ఇచ్చాక పాత రికార్డులు చెల్లవు.ఆరోపణ : వందల చట్టాలు అమల్లో ఉండగా ఈ కొత్త చట్టం ఎందుకు?వాస్తవం : భూ రికార్డులకు సంబంధించి ఏపీలో 124 రకాల చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాలేవీ ఇవ్వని భరోసా కొత్త చట్టం ఇస్తుంది. ఆర్వోఆర్ చట్టం ద్వారా కేవలం రికార్డు మాత్రమే ఉంటుంది. ఆ రికార్డు ద్వారా సంక్రమించే హక్కులకు గ్యారెంటీ ఉండదు. కానీ కొత్త చట్టం హక్కులకు గ్యారంటీ ఇస్తుంది.ఆరోపణ : స్టాంపు కాగితాలకు బదులు జిరాక్సులు ఇస్తున్నారు.వాస్తవం : గత వంద సంవత్సరాలుగా స్టాంపు కాగితాలపైనే లావాదేవీలు నడిచాయి. కానీ, ప్రభుత్వం ఇచ్చే గ్యారెంటీ సర్టిఫికెట్ స్టాంపు కాగితాలకంటే విలువైనది. వీటిని జిరాక్స్ కాపీలు అని అనడం నీచమైన చర్య. ఒకవేళ గ్యారెంటీ సర్టిఫికెట్ పోగొట్టుకున్నా, టైట్లింగ్ ఆఫీసర్ వద్ద మీ వివరాలు పదిలంగా ఉంటాయి. మళ్లీ సర్టిఫికెట్ పొందవచ్చు.ఆరోపణ: న్యాయవాదులకు అన్యాయం జరుగుతుంది.వాస్తవం : ఈ చట్టం అమల్లోకి వస్తే భూ వివాదాలు తగ్గిపోతాయి. తద్వారా సివిల్ కేసులు కూడా భారీగా తగ్గుతాయి. అందువల్లే న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు. కానీ, ఈ చట్టం వల్ల పూర్తి పారదర్శకత లభిస్తుంది. ప్రజలకు మంచి జరుగుతుంది. హైకోర్టులో అప్పీల్ చేయడానికి అవకాశం ఉంటుంది కనుక న్యాయవాదులకు సివిల్ కేసులు కూడా వస్తాయి.ఆరోపణ : పాస్ పుస్తకాలపై సీఎం బొమ్మ ఉంది కాబట్టి ఆ భూమి మీది కాదు.వాస్తవం : ఇది దిక్కుమాలిన వాదన. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, రాజకీయ లబ్ధి పొందేందుకు కొన్ని అరాచక శక్తులు చేస్తున్న ఆరోపణ ఇది. కొత్త పాస్ పుస్తకాలను ప్రభుత్వం గ్యారెంటీతో ఇస్తుంది. ఈ పుస్తకాల ద్వారా రైతు లేదా భూ యజమానికి పంట సాయం వస్తుంది. సబ్సిడీలు వస్తాయి. బ్యాంకుల ద్వారా రుణాలొస్తాయి. పరిహారం వస్తుంది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లకు ఈ పుస్తకం ఆధారం. చాలా ప్రభుత్వ పథకాల అమలు సందర్భంగా ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రుల బొమ్మలు పెడుతుంటారు. కరోనా వేక్సినేషన్ సర్టిఫికెట్ల మీద ప్రధాని బొమ్మ ముద్రించారు. ముఖ్యమంత్రి బొమ్మ ఉన్నంత మాత్రాన ఏమీ జరగదు. -
సమాన అవకాశాల... విద్యా విప్లవం
భారతీయ సమాజంలో అసమానతలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం అవకాశాలు అందరికీ సమానంగా లేకపో వడం. ముఖ్యంగా మంచి విద్యను అభ్యసించే అవ కాశం కొందరికే ఉండటం. దీన్ని గమనించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కనివిని ఎరుగని రీతిలో విద్యావ్యవస్థ రూపురేఖలను మార్చేశారు. దీంతో ఎక్కడో కొండ కోనల్లో నివసించే ఆది వాసీ పిల్లలు సైతం పట్టణ ప్రాంత విద్యార్థులతో సమానంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిపుచ్చుకుంటు న్నారు. ఇదో విప్లవం. ఈ విప్లవ ఫలితాలు ఇప్పుడి ప్పుడే దృశ్యమానమవుతున్నాయి. కొండబారిడి గిరి జన గ్రామానికి చెందిన బాలిక మనస్విని ఐక్యరాజ్య సమితి దాకా వెళ్లడం ఇందుకు ఒక ఉదాహరణ.కొండబారిడి ఒక సవర ఆదివాసీ పల్లె. ఆరు దశాబ్దాల క్రితం ఇక్కడ వెంపటాపు సత్యం అనే బడి పంతులు భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమించి సాయుధ విప్లవం సృష్టించాడు. నేడు అదే గ్రామంలో ఇపుడు చదువుల విప్లవం కూడా మొద లైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నదే కొండ బారిడి. ఆ పల్లెకు చెందిన ఎస్. మనస్విని ఆంగ్లంలో అరుదైన ప్రతిభ చూపడంతో తనతో పాటు మరో 9 మంది విద్యార్థులను అమెరికాలోని ఐక్యరాజ్య సమితి ఆహ్వానించగా... అక్కడ ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ సంస్థల సదస్సులో పాల్గొని వచ్చింది.‘ఏపీలో విద్యావ్యవస్థపై ఐక్యరాజ్య సమితిలో మాట్లాడాను. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యావిధానం, ‘నాడు–నేడు’తో మా స్కూల్ స్వరూపమే మారిపోవడం గురించి వివరించాను. మన ప్రభుత్వం మాలాంటి పేదల చదువు కోసం చేస్తున్న కృషిని తెలుసుకొని వారు ఎంతో ఆశ్చర్య పోయారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్కూల్స్లో ఎలా ప్రవేశ పెడుతున్నారు? వాతావరణ మార్పుల ప్రభావం గురించి చెప్పాను. మారుమూల గిరిజన పల్లెకు చెందిన నాకు ఇదొక మరువలేని అనుభూతి’ అని సంతోషంగా చెప్పింది మనస్విని. సింగిల్ పేరెంట్కు చెందిన ఈ ఆదివాసీ బాలిక గుమ్మలక్ష్మిపురం, కేజీబీవీ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. సర్కారు బడుల్లో చదివే పేద పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించాలనే తప నతో ఆధునిక విద్యాబోధన, మౌలిక వసతుల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నాడు–నేడు’ కార్యక్రమంలో 44,512 ప్రభుత్వ బడులను బాగు చేసే కార్యక్రమాన్ని మూడు దశలుగా విభజించి ముందుకెళుతోంది. ‘అమ్మ ఒడి’ వంటి వినూత్న పథకాలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ను పెంచాయి. దాదాపు 2,47,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు మారడం ఇందుకు నిదర్శనం.అరకు నుండి డుంబ్రిగుడ వెళ్లేదారిలో జైపూర్ బస్స్టాప్ ఎదురుగా కొండల మధ్య ఇంద్రధను స్సులా మెరిసిపోతున్న కోట లాంటి రెసిడెన్షియల్ గిరిజన పాఠశాల దగ్గర ఆగాం. విశాలమైన ప్లేగ్రౌండ్లో ఆడుకుంటున్న తమ పిల్లలను చూడడా నికి వచ్చిన పేరెంట్స్ని పలకరించినపుడు...‘ప్రభుత్వం తన ఆలోచనలకు అనుగుణంగా చేపట్టిన పనులతో ఈ ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లను మించి మారిపోయాయి. మా పాపను ఈ స్కూల్లో చేర్పించడానికి సీట్లు లేక చాలా కష్ట పడాల్సి వచ్చింది. ప్రభుత్వ ప్రయత్నం బాగుంద’ని అన్నారు. ‘గిరిజన గ్రామాల్లో బడులను ఏకపక్షంగా ఇంగ్లిష్ మీడియంలోకి మార్చడం లేదు. ప్రతిదీ పద్ధతి ప్రకారం, శాస్త్రీయ విధానంలో సాగుతోంది. ప్రతి పుస్తకాన్నీ బైలింగ్యువల్ పద్ధతిలో... అంటే ఒక పేజీ ఇంగ్లిష్, పక్క పేజీ తెలుగులో ముద్రించారు . దీని వల్ల పిల్లలు తెలుగును మర్చిపోకుండా ఇంగ్లిషును నేర్చుకుంటున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల బడి మానేసే పిల్లల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింద’ని పార్వతీపురం మన్యం జిల్లా, చాపరాయి బిన్నిడి పాఠశాల ఉపాధ్యాయుడు వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా 40 వేల తరగతి గదుల్లో ఐఎఫ్బీలు ఏర్పాటు చేసినట్టు ఆమధ్య ఒక ఆంగ్ల ఛానెల్ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్యూలో సీఎం వై.ఎస్. జగన్ చెప్పినపుడు అవి విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకుందామని, గుమ్మలక్ష్మీపురం గ్రామంలోని ఒక స్కూల్కి వెళ్లాం. అక్కడ విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ఉన్న ట్యాబ్స్ ఇచ్చారు. ఆరో తరగతి నుంచి, ఆపై తరగ తుల్లోని ప్రతి క్లాస్రూమ్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. గుండె పనిచేసే విధా నాన్ని డిజిటల్ స్క్రీన్ మీద విద్యార్థులకు టీచర్లు బోధించడం చూశాం. ఇలా ఒక ప్రణాళికా బద్ధంగా పాఠశాల విద్యా రంగంలో వినూత్న మార్పులు మొదలై టీచర్లలో నైపుణ్యం, సామర్థ్యం పెంపుకు కూడా సర్కారు కృషి చేస్తున్నది. ఏపీ విద్యారంగం సరికొత్త మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇందువల్ల సమాన విద్యావ కాశాలకు నోచుకుంటున్నారు బడుగులు. ఇంతకంటే కావలసినదేముంది?శ్యాంమోహన్ వ్యాసకర్త కార్టూనిస్ట్, జర్నలిస్ట్మొబైల్: 94405 95858 -
గుండె ఘోష విన్నారు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)లో గుండె జబ్బులదే అగ్రస్థానం. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ మునుపెన్నడూలేని రీతిలో ఎన్సీడీ నిర్వహణపై పక్కా ప్రణాళికతో అడుగులు వేశారు. ఇందులో భాగంగా.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో ప్రభుత్వాస్పత్రుల ఆధునీకరణ సహా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా గుండె జబ్బులు, క్యాన్సర్ తదితర పెద్ద జబ్బులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. కార్డియాలజీ, కార్డియో వాసు్క్యలర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేస్తూ ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ (ఈసీసీ) కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్లో చికిత్స అందించి బాధితుల ప్రాణాలను కాపాడింది. నగరాలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు గుండెపోటు బారినపడితే తొలి 40 నిమిషాల్లోనే ఈ కార్యక్రమం ద్వారా ప్రాథమిక వైద్య సేవలు లభించేలా చర్యలు తీసుకున్నారు. హబ్ అండ్ స్పోక్ విధానంలో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. సామాన్యులకూ అందుబాటులోకి హార్ట్కేర్ సర్వీసులు.. తిరుపతి రుయా ఆస్పత్రిలో 2022 జనవరి నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఈ ఈసీసీ నడుస్తోంది. గతేడాది సెప్టెంబర్లో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం జీజీహెచ్లను హబ్లుగా తీర్చిదిద్ది కార్యక్రమాన్ని విస్తరించారు. నాలుగు చోట్ల కార్డియాలజిస్ట్ వైద్యులతో పాటు, క్యాథ్ల్యాబ్ సౌకర్యం ఉంది. హబ్లకు ఆయా జిల్లాల పరిధిలోని 69 స్పోక్స్ (సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఆస్పత్రులు)ను అనుసంధానంచేసి హార్ట్కేర్ సర్వీసులను సామాన్యులు, గ్రామీణులకు అందుబాటులోకి తెచ్చారు. అనంతరం అన్ని జీజీహెచ్లను హబ్లుగా, సెకండరీ హెల్త్ ఆస్పత్రులను స్పోక్స్గా తీర్చిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చారు. స్పోక్స్గా వ్యవహరించే ఆస్పత్రుల్లో ఛాతినొప్పి, ఇతర గుండెపోటు లక్షణాలతో వచ్చిన వ్యక్తులకు వెంటనే ఈసీజీ తీస్తున్నారు. ఆ ఫలితాన్ని హబ్లో ఉన్న కార్డియాలజిస్ట్కు పంపుతున్నారు. కార్డియాలజిస్ట్లు సంబంధిత కేసు గుండెపోటుదా కాదా అని నిర్ధారించి గుండె రక్తనాళం ఎంత శాతం పూడుకుపోయిందో పరిశీలించి థ్రాబోలైసిస్ థెరపీని సూచిస్తున్నారు. ఇలా సూచించిన కేసుల్లో రూ.40 వేల విలువ చేసే థ్రాంబోలైసిస్ ఇంజక్షన్ను బాధితులకు ఉచితంగా ఇస్తున్నారు. గతేడాది సెప్టెంబరు 29 నుంచి ఇప్పటివరకూ 3 వేల మందికి పైగా ఛాతినొప్పితో స్పోక్స్కు రాగా వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో గుండె రక్తనాళం 100 శాతం పూడిపోవడంతో వచ్చే ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియాల్ ఇన్ఫార్క్షన్ (స్టెమీ) సమస్యతో బాధపడుతున్న 489 మందికి వెంటనే థ్రాంబోలైసిస్ నిర్వహించారు. వీరిలో 424 మంది క్షేమంగా ఉన్నారు. సకాలంలో వైద్యసాయం అందకపోయినట్లయితే వీరందరూ కూడా మృత్యువాత పడేవారని వైద్యులు చెబుతున్నారు. భవిష్యత్లోనూ మరింత రక్షణ.. మరోవైపు.. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్సీడీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షించారు. గుండె జబ్బులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఐదేళ్లలో 3.67 లక్షల గుండెపోటు బాధితులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేశారు. ఇందుకు రూ.2,300 కోట్లకు పైగా వెచ్చించారు. మరింత సమర్థవంతంగా గుండెపోటు మరణాలను నియంత్రించడానికి ఈసీసీను అమలులోకి తెచ్చారు. ఇక వచ్చే ప్రభుత్వంలో గుండె సంబంధిత వైద్యసేవల కోసం విశాఖ, కర్నూలు, గుంటూరుల్లో హబ్లు ఏర్పాటుచేస్తామని వైఎస్సార్సీపీ 2024 మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.