-
Lok sabha elections 2024: అమేధీ నుంచి రాబర్ట్ వాద్రా..?
సాక్షి, న్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఉత్తర్ప్రదేశ్లోని అమేధీ నియోజకవర్గం నుంచి అగ్రనేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా రాజకీయ అరంగేట్రం చేసే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగా అమేధీ ప్రజలు తనను కోరుకుంటే ఎంపీగా ప్రాతినిధ్యం వహించేందుకు సిధ్దమని ఆయన ఇటీవల చేసిన ప్రకటన ఈ తరహా ప్రచారానికి బలాన్నిస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం అమేధీ ఎంపీగా ఉన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి, ‘ఆమె వల్ల అమేధీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆమెను ఎన్నుకోవడం ద్వారా తప్పుచేశామని నమ్ముతున్నారు’ అంటూ విమర్శలు సంధించడంతో వాద్రా పోటీ ఖాయమని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. -
Parliament Session 2024: యూపీఏపై నిర్మల నిప్పులు
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో ఒక్క కుటుంబానికే ప్రాధాన్యమిచ్చి, దేశ ఆర్థిక పరిస్థితిని దయనీయ స్థితికి దిగజార్చారంటూ కాంగ్రెస్పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దుమ్మెత్తిపోశారు. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం, భారతీయులపై దాని ప్రభావం’ అంశంపై లోక్సభలో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘మోదీ ప్రభుత్వానికి దేశమే తొలి ప్రాధాన్యం. యూపీఏకు మాత్రం ఆ ఒక్క (గాం«దీ) కుటుంబమే ముఖ్యం. 2008లో దేశం ఆర్థికమాంద్యం కోరల్లో చిక్కుకుంటే జాతి ప్రయోజనాల పరిరక్షణకు యూపీఏ ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఆర్థిక వ్యవస్థను కాపాడే ప్రయత్నాలు చేయకపోగా కాంగ్రెస్ చేతులెత్తేసింది. పలు స్కామ్లతో దేశార్థికాన్ని దీనావస్థలోకి నెట్టి 2014లో ని్రష్కమించారు. వాళ్లు అధికారంలో కొనసాగితే ఇంకెన్ని దారుణాలు జరిగేవో దేవుడికే తెలుసు. సోనియా గాంధీ సూపర్ పీఎంగా ఉండటం వల్లే యూపీఏ హయాంలో ఆర్థికవ్యవస్థ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది. వాళ్లిప్పుడు మాకు సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో నేరి్పస్తున్నారా?’’ అంటూ ఆగ్రహించారు. కోవిడ్ సంక్షోభంలో మోదీ సర్కార్ ఎంతటి సమర్థతతో, అంకితభావంతో పనిచేసిందో, పరిస్థితిని చక్కదిద్దిందో అంతా చూశారన్నారు. వరుస కుంభకోణాలు ‘‘బొగ్గు కుంభకోణం కారణంగా దేశం రూ.1.86 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయిందని కాగ్ ఆక్షేపించింది. సుప్రీంకోర్టు సైతం యూపీఏ ప్రభుత్వాన్ని తలంటి ఏకంగా 214 బొగ్గు బ్లాకుల లైసెన్స్ను రద్దుచేసింది. కోల్స్కామ్ ధాటికి చివరకు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. బొగ్గు కొరత ఏర్పడింది. విద్యుదుత్పత్తి తగ్గింది. మొత్తంగా పెట్టుబడులూ దెబ్బతిన్నాయి. అదే మోదీ ప్రభుత్వ పాలనలో పారదర్శకంగా బొగ్గు బ్లాకుల వేలం జరిగింది. వాళ్లు బొగ్గును బూడిదగా మార్చారు. మా మోదీ సర్కార్ లాభసాటి విధానాలతో బొగ్గును వజ్రాల వ్యాపారమంత విలువైనదిగా మార్చింది’’ అన్నారు. నాడు పరువు పోతే నేడు ప్రతిష్ఠ పెరిగింది ‘‘యూపీఏ హయాంలో కామన్వెల్త్ క్రీడల కుంభకోణంతో దేశం పరువు పోయింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సును ఔరా అనిపించేలా నిర్వహించి దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా పెంచాం. బ్యాంకింగ్ రంగమంటే మాకు గౌరవం. కానీ యూపీఏ హయంలో ప్రభుత్వ పెద్దలు తాము చెప్పిన వారికి రుణాలొచ్చేలా చేసి మొండిబకాయిలు పెరగడానికి కారకులయ్యారు. మోదీ హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు 3.2 శాతానికి దిగొచ్చాయి’’ అన్నారు. యూపీఏ పాలనపై బురదజల్లుతున్నారంటూ నిర్మల ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. -
PRANAB, MY FATHER: రాహల్కు పరిణతి లేదు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీలో చరిష్మా గానీ, రాజకీయ పరిణతి, అవగాహన గానీ లేవని దివంగత రాష్ట్రపతి, ఆ పార్టీ దిగ్గజ నేత ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారట. అది కాంగ్రెస్ కు చాలా సమస్యగా పరిణమించిందని ఆవేదన పడ్డారట. అంతేకాదు, గాంధీ–నెహ్రూ కుటుంబ అహంకారమైతే రాహుల్ కు వచ్చింది గానీ వారి రాజకీయ చతురత మాత్రం అబ్బలేదు‘ అని కొన్నేళ్ల కిందట తన డైరీలో రాసుకున్నారట. ‘కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవాన్ని రాహుల్ తీసుకురాగలడా? ప్రజల్లో స్ఫూర్తి నింపగలరా? ఏమో! నాకైతే తెలియదు‘ అంటూ అనుమానాలు వెలిబుచ్చారట. ’ప్రణబ్: మై ఫాదర్’ పేరిట రాసిన తాజా పుస్తకంలో ఆయన కూతురు శర్మిష్ఠ ముఖర్జీ ఈ మేరకు పలు వివరాలు వెల్లడించారు. సోమవారం విడుదల కానున్న ఈ పుస్తకంలో ఇలాంటి చాలా విషయాలను ఆమె పంచుకున్నారు. ముఖ్యంగా రాహుల్ కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సు చించివేశారని తెలిసి ప్రణబ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని చెప్పారు. ‘అలా చేయడానికి ఆయన ఎవరసలు? కనీసం కేబినెట్ సభ్యుడు కాదు. పైగా అప్పుడు ప్రధాని (మన్మోహన్ సింగ్) విదేశాల్లో ఉన్నారు. తన చర్య పార్టీపై, ప్రభుత్వం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఆలోచించరా? సొంత ప్రభుత్వ ఉత్తర్వులను అలా మీడియా ముందు ముక్కలు చేయడం 2014లో యూపీఏ కూటమి ఓటమికి కూడా ఒక కారణమైంది‘ అని ప్రణబ్ మండిపడ్డారట. ‘రాహుల్ హుందాగానే ప్రవర్తిస్తారు. కానీ దేన్నీ సీరియస్గా తీసుకోరు. బహుశా ఆయనకు అన్నీ చాలా సులువుగా లభించడమే కారణం కావచ్చు. రాహుల్ మాత్రం అత్యంత కీలక సమయాలు, సందర్భాల్లో కూడా చీటికీమాటికీ దేశం విడిచి ఎటో మాయమవుతారు. ఇది కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు తప్పుడు సందేశమే ఇచ్చింది‘ అని ప్రణబ్ అభిప్రాయపడ్డట్టు శర్మిష్ఠ తెలిపారు. -
సమర సన్నాహాలు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎట్టకేలకు ప్రతిపక్ష పార్టీ సొంత గూటిలో సర్దుబాట్లతో సమరానికి సన్నద్ధమవుతున్నట్టుంది. పది నెలల నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆదివారం నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన తీరు చూస్తే అదే అనిపిస్తుంది. నిరుడు జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున ఖర్గే ఆచితూచి వ్యవహరిస్తూ, ఇన్నాళ్ళకు పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ’ (సీడబ్ల్యూసీ)ని పునర్వ్యవస్థీకరించారు. సరికొత్త సీడబ్ల్యూసీపై గాంధీ కుటుంబ ముద్ర సుస్పష్టం. అయితే, ఒకపక్క విశ్వాసపాత్రులైన పాత కాపుల్ని కదిలించకుండానే, మరోపక్క కొత్త వారికీ, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారికీ, వివిధ సామాజిక వర్గాలకూ స్థానం కల్పించారు. ఇలా పార్టీలో నవనవోత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించడం స్వాగతనీయం. సోనియా కుటుంబానికి వీరవిధేయుడైనప్పటికీ, కేవలం డూడూబసవన్నలా ఖర్గే ఉండిపోలేదు. కొత్త కార్యవర్గంలో గాంధీ శిబిరం వారితో పాటు తన సొంత శిబిరం వారికీ చోటిచ్చారు. వివిధ సామాజిక వర్గాలకు చోటిస్తూ సమ తూకం సాధించడంతో ఈ కొత్త కార్యవర్గం రానున్న ఎన్నికల టీమ్ అని అర్థమవుతోంది. సోనియా అధ్యక్ష కాలంలోని 2020 సెప్టెంబర్ తర్వాత సీడబ్ల్యూసీ ప్రక్షాళన మళ్ళీ జరగడం ఇప్పుడే! అనేక విడతల చర్చల తర్వాత కొత్త కమిటీ కొలువు తీరింది. 39 మంది శాశ్వత సభ్యులు, 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 14 మంది రాష్ట్ర ఇన్–ఛార్జ్లు, నలుగురు సంస్థాగత ఇన్–ఛార్జ్లు, మరో 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు – ఇలా మొత్తం 84 మంది సభ్యులతో మునుపెన్నడూ లేనంతటి అతి పెద్ద సీడబ్ల్యూసీ ఇది. పాత, కొత్తల మేలు కలయికగా ఏర్పాటైన వర్కింగ్ కమిటీలో ప్రజా స్వామ్య స్ఫూర్తిని పెంచడం హర్షణీయం. రాజస్థాన్లో సొంత పార్టీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి 2020లో పార్టీ రాష్ట్ర అధ్యక్షపదవి, ఉప ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్న సచిన్ పైలట్కు కార్యవర్గంలో స్థానమివ్వడం, అలాగే నిరుడు పార్టీ అంతర్గత ఎన్నికల్లో అధ్యక్ష పీఠానికి ఖర్గేతో పోటీపడిన శశి థరూర్కు సైతం చోటివ్వడం ఆశ్చర్యకరమే. అలాగే, పార్టీకి సోనియా నాయకత్వాన్ని ప్రశ్నించిన జి–23 బృందంలోని అసమ్మతి నేతల్లో భాగమైన ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్లను సైతం కొత్త సభ్యులుగా తీసుకోవడం గమనార్హం. ఇది అవసరమైన రాజకీయ చాణక్యమే. విభిన్న స్వరాలు వినిపించేవారిని సైతం విధాన నిర్ణయాలు తీసుకొనే వేదికలో భాగస్వాముల్ని చేయడం అంతర్గత ప్రజాస్వామ్యానికి సూచిక. 138 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర గల ఒక పార్టీ సమకాలీన చైతన్యశీల ప్రస్థానానికీ, పురోగతికీ దీర్ఘకాలంలో అది కీలకం కూడా! ముఖ్యంగా ఈ ఏడాది చివరి కల్లా మిజోరమ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలున్న వేళ ఆ ప్రాంతాలకూ ప్రాముఖ్యం, ప్రాతినిధ్యం ఇస్తూ ఈ పునర్వ్యవస్థీకరణ సాగడం గమనార్హం. ఎన్నికలున్న రాజస్థాన్లో అసమ్మతి నేత సచిన్ పైలట్కూ, అలాగే ఛత్తీస్గఢ్లో బలమైన ఫ్యాక్షన్ నాయకుడూ, ఓబీసీ అయిన మంత్రి తామ్రధ్వజ్ సాహూకూ పార్టీ అత్యున్నత వేదికలో చోటివ్వడం తక్షణ ప్రయోజ నాలకు తప్పక పనికొస్తుంది. అలా చూస్తే, ఆలస్యమైనా ఖర్గే ఆలోచించి పావులు కదిపారనుకోవాలి. గత కమిటీలో ఒక్క ఓబీసీయే ఉంటే, ఈసారి ఆరుగురికి స్థానం దక్కడం, 9 మంది ఎస్సీలకూ, ఒక గిరిజన నేతకూ సీటివ్వడం... ఉదయ్పూర్ డిక్లరేషన్కూ, సామాజిక న్యాయానికీ కట్టుబడి ఉన్నామనే భావన కలిగించడానికీ కాంగ్రెస్కు ఉపకరిస్తుంది. అయితే, 15 మంది స్త్రీలకు స్థానం కల్పించినా, మహిళా సాధికారత మంత్రం పఠిస్తున్న పార్టీ ఈ సంఖ్యను మరింత పెంచుకోవడం అవసరం. నిజానికి, సీడబ్ల్యూసీలో 50 ఏళ్ళ లోపు వారు 50 శాతమైనా ఉండాలన్నది లక్ష్యమని కాంగ్రెస్ కొంతకాలంగా చెబుతోంది. గత ఏడాది మేలో ఉదయ్పూర్లో జరిగిన చింతన్ శిబిర్లో, ఈ ఏడాది ఫిబ్రవరిలో రాయ్పూర్లో సాగిన పార్టీ ప్లీనరీలో ఆ మేరకు సంకల్పం కూడా చెప్పుకుంది. తాజా పునర్వ్యవస్థీకరణ ఆ లక్ష్యాన్ని చేరుకోలేదు. అయితే, పవన్ ఖేరా, సుప్రియా శ్రీనతే లాంటి యువ నాయకత్వాన్ని సైతం ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చడం పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించే ప్రయత్నంగా భావించవచ్చు. సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యుల సంఖ్యను 23 నుంచి 35కు పెంచుతామని రాయ్పూర్ ప్లీనరీలో చెప్పిన పెద్దలు ఆ అవధిని మరింత పెంచి, 39 మంది శాశ్వత సభ్యులను తీసుకోవడమూ అనేక రాజకీయ అనివార్యతలకు అద్దం పడుతోంది. సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరపకుండా, ఖర్గేయే నామినేట్ చేస్తారని నిర్ణయించిన పార్టీ ఇప్పటికి ఈ ఘట్టాన్ని పూర్తి చేసింది. వెరసి, కొత్త కార్యవర్గం కూర్పు కొంత సృజనాత్మక ధోరణిలో, మరికొంత రాజీ మార్గంలో పయనించిందని చెప్పక తప్పదు. శశిథరూర్ పేర్కొన్నట్టు, సిద్ధాంతాలకు కట్టుబడిన కార్యకర్తలే ఏ పార్టీకైనా జీవనాడి. వారితో నిండిన పార్టీలు, కార్యవర్గాలే ప్రజాకాంక్షలను నెరవేర్చడంలో ముందడుగు వేయగలవు. సీడబ్ల్యూసీ కూర్పులో ఆ సంగతి ఖర్గే బాగానే గ్రహించారు. కానీ, సవాళ్ళు ముగిసిపోలేదు. అద్వానీ తర్వాత స్వతంత్ర భారతావనిలో ఏకకాలంలో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా, లోక్సభ, రాజ్యసభల్లో ప్రతి పక్ష నేతగా ఉన్న 81 ఏళ్ళ ఖర్గే ఎన్నికల బరిలోనూ కాంగ్రెస్ను తీరానికి చేర్చాలి. ఆ మధ్య దాకా నీరసించిన పార్టీ నిరుడు హిమాచల్లో, ఈ ఏడాది కర్ణాటకలో దక్కిన విజయాలతో తెరిపిన పడింది. ఆ విజయ పరంపరను కొనసాగించాలంటే అభ్యర్థుల ఎంపిక, ప్రచారవ్యూహాలు,‘ఇండియా’ కూటమిలో ఇతర ప్రతిపక్షాలతో సంప్రతింపులు – ఇలా ఖర్గే చేతి నిండా పని ఉంది. సోనియా కుటుంబంతో సమన్వయం చేసుకుంటూనే ఆ పనిని ఆయన ఎంత సమర్థంగా నిర్వహిస్తారో చూడాలి. ఒక్కమాటలో అసలు ఆట ఇప్పుడే మొదలైంది! -
రాహుల్ గాంధీకి వాళ్లతో లింకులు.. ఆజాద్ సంచలన ఆరోపణలు..
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ మాజీ నేత, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్. రాహుల్ విదేశాలకు వెళ్లి కలవకూడని వ్యాపారవేత్తలను కలుస్తారని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు మాట్లాడారు. దీన్నే అవకాశంగా అందిపుచ్చుకున్న బీజేపీ.. రాహుల్ విదేశాల్లో కలిసిన ఆ వ్యాపారవేత్తలు ఎవరో చెప్పాలని డిమాండ్ చేసింది. వాళ్లను ఎందుకో కలిశారో కూడా వివరణ ఇవ్వాలని నిలదీసింది. హిండెన్బర్గ్ నివేదిక అనంతరం గౌతమ్ అదానీకి, ప్రధాని మోదీకి మధ్య ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని రాహుల్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై పార్లమెంటు సాక్షిగా గళమెత్తిన ఆయన మోదీ, అదానీ విమానంలో కలిసి ప్రయాణించిన ఫొటోను కూడా సభలో ప్రదర్శించారు. అయితే రెండు రోజుల క్రితం అదానీ కంపెనీలకు చెందిన రూ.20వేల కోట్ల బినామీ డబ్బు ఎవరిదని రాహుల్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. నిజాన్ని దాస్తూ బీజేపీ ప్రతిరోజు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని వ్యాఖ్యానించారు. అదానీ పేరులోని అక్షరాలతో కాంగ్రెస్ మాజీ నాయకులు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పేర్లు కలిసేలా ఫొటో పోస్టు చేశారు. ఇందులో గులాం నబీ ఆజాద్ పేరుతో పాటు జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ కుమార్ రెడ్డి, హిమంత బిశ్వ శర్మ, అనిల్ ఆంటోని పేర్లు ఉన్నాయి. सच्चाई छुपाते हैं, इसलिए रोज़ भटकाते हैं! सवाल वही है - अडानी की कंपनियों में ₹20,000 करोड़ बेनामी पैसे किसके हैं? pic.twitter.com/AiL1iYPjcx — Rahul Gandhi (@RahulGandhi) April 8, 2023 దీనిపైనే స్పందిస్తూ ఆజాద్ రాహుల్పై ఫైర్ అయ్యారు. గాంధీ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆ కుటుంబం అంటే తనకు ఇప్పటికీ అభిమానమే అని, అందుకే ఇంతకంటే ఎక్కువ ఏమీ మాట్లాడలేనని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీని వీడటానికి మాత్రం రాహుల్ గాంధీనే ప్రధాన కారణమని ఆజాద్ మరోసారి తేల్చిచెప్పారు. …their entire family (the Gandhis) have all along had association with businessmen, including him (Rahul Gandhi). He (Rahul) goes abroad and meets undesirable businessmen… - Ghulam Nabi Azad Rahul Gandhi must explain who are these businessmen he meets and for what purpose? pic.twitter.com/2juk0GlvhW — BJP (@BJP4India) April 9, 2023 కాగా.. అదానీ పేరులోని అక్షరంతో తన పేరును చూపడాన్ని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా తప్పుబట్టారు. అదానీతో సంబంధం లేని తనను ఈ వ్యవహారంలోకి లాగినందుకు రాహుల్పై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. చదవండి: కాంగ్రెస్కు మరో కొత్త సమస్య..నిరాహార దీక్ష చేస్తానంటున్న సచిన్ పైలట్ -
Sankalp Satyagraha: మోదీ పిరికిపంద
న్యూఢిల్లీ: ‘‘దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రధాని రాజీవ్గాంధీ కుమారుడు రాహుల్. దేశ ఐక్యత కోసం వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అలాంటి వ్యక్తి దేశాన్ని ఎందుకు అవమానిస్తారు?’’ అని ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. ‘‘బీజేపీ నేతలు రాహుల్ను మీరు జాఫర్ అంటూ ఎగతాళి చేశారు. జాతి వ్యతిరేక శక్తి అని నిందించారు. మా తల్లిని అవమానించారు. నెహ్రూ ఇంటిపేరు ఎందుకు పెట్టుకోలేదంటూ మమ్మల్ని ఎద్దేవా చేశారు. మా కుటుంబాన్ని, కశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని ఆక్షేపించారు. అయినా వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు? జైలు శిక్షలు విధించలేదు?’’ అని ప్రశ్నించారు. తమ కుటుంబాన్ని ఇప్పటికీ అవమానిస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘హార్వర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదివిన రాహుల్ను ‘పప్పు’ అని ఎగతాళి చేస్తున్నారు. కానీ ఆయన పప్పు కాదని బీజేపీ నాయకులకు తెలిసిపోయింది. అందుకే పార్లమెంటు నుంచి బయటికి పంపించారు’’ అంటూ దుయ్యబట్టారు. రాహుల్పై అనర్హత వేటుకు నిరసనగా కాంగ్రెస్ ఆదివారం దేశవ్యాప్తంగా ‘సంకల్ప్ సత్యాగ్రహ’ దీక్షలు చేపట్టింది. ఢిల్లీలో రాజ్ఘాట్ వద్ద దీక్షలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితర అగ్ర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రియాంక నిప్పులు చెరిగారు. ‘‘మోదీ ఉత్త పిరికిపంద. అధికారం వెనుక దాక్కుంటున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. అహంకారపూరిత మోదీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం నేర్పించడం తథ్యమన్నారు. అరాచక బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘‘మా కుటుంబం ధారపోసిన రక్తం దేశ ప్రజాస్వామ్యానికి ఊతమిచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నాం’’ అని చెప్పారు. ఇకపై తాము మౌనంగా ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘మోదీ’లను విమర్శిస్తే నొప్పెందుకు: ఖర్గే ‘‘ఒక వ్యక్తిని కాపాడడానికి మొత్తం ప్రభుత్వం, కేబినెట్ మంత్రులు, ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. అసలు అదానీ ఎవరు? ప్రభుత్వం ఆయనకు ఎందుకు అండగా ఉంటోందో చెప్పాలి’’ అని ప్రియాంక నిలదీశారు. ‘‘ప్రజల హక్కుల కోసం రాహుల్ పోరాడుతున్నారు. జోడో యాత్రలో ఆయన వెంట లక్షల మంది నడిచారు’’ అన్నారు. అక్రమాలకు పాల్పడి విదేశాలకు పరారైన నీరవ్ మోదీ, లలిత్ మోదీలను విమర్శిస్తే బీజేపీ ప్రభుత్వానికి నొప్పి ఎందుకని ఖర్గే ప్రశ్నించారు. సత్యాగ్రహం పేరిట కాంగ్రెస్ దీక్ష చేయడం సిగ్గుచేటని బీజేపీ దుయ్యబట్టింది. దానికి ఆ అధికారమే లేదని బీజేపీ నేత సుధాంశు త్రివేది అన్నారు. ‘అనర్హత వేటు పడిన ఎంపీ’ ట్విట్టర్ ఖాతాను అప్డేట్ చేసిన రాహుల్ లోక్సభ సభ్యుడిగా తనపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో రాహుల్ ఆదివారం తన ట్విట్టర్ ఖాతాను అప్డేట్ చేశారు. బయోడేటాను ‘అనర్హత వేటుపడిన ఎంపీ’గా మార్చారు. తన అధికారిక వయనాడ్ ట్విట్టర్ ఖాతాలోనూ ‘డిస్క్వాలిఫైడ్ ఎంపీ’ అని రాశారు. -
మాట జారిన ఖుర్షీద్!.. రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్ ఖర్గే అంటూ బీజేపీ సెటైర్లు..
దేశంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇటీవలి కాలంలో జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ను సైతం కోల్పోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు పార్టీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గాంధీ ఫ్యామిలీ దూరంగా ఉండి.. ఎన్నికలు నిర్వహించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ చీఫ్గా సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యారు. అయితే, తాజాగా కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. కాగా, సల్మాన్ ఖుర్షీద్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ గాంధీ కుటుంబీకులే నేతృత్వం వహిస్తున్నారని స్పష్టం చేశారు. తమ పార్టీలో చాలా మంది నేతలున్నా కీలక నేతలు మాత్రం గాంధీ కుటుంబీకులేనని చెప్పారు. మల్లికార్జున ఖర్గే.. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడని, పార్టీని సంస్ధాగతంగా పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పుకొచ్చారు. ఇక, సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్పందించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేను రిమోట్ కంట్రోల్ అధ్యక్షుడిగా బీజేపీ పేర్కొంది. ఈ క్రమంలో బీజేపీ ప్రతినిధి గౌరవ్ భాటీయా స్పందిస్తూ.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరున్నా నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు మాత్రమే ఉంటుంది. అందుకే ఖర్గేను.. రిమోట్ కంట్రోల్ ప్రెసిడెంట్ అని పిలవాలా?.. లేక రబ్బర్ స్టాంప్ ప్రెసిడెంట్ అనాలా అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. -
కాంగ్రెస్ కొత్త సారథి ఎవరైనా గాంధీల సలహాలు కచ్చితంగా తీసుకోవాలి
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పార్టీలో గాంధీ కుటుంబం ఉనికిని ఏ మాత్రం ప్రభావితం చేయవని ఆ పార్టీ సీనియర్ నేత పి.చిందరం అభిప్రాయపడ్డారు. కొత్త సారథిగా ఎవరు బాధ్యతలు చేపట్టిన గాంధీల సలహాలు, సూచనలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టినా రిమోట్ కంట్రోల్ మాత్రం గాంధీల చేతిలోనే ఉంటుందనే ఆరోపణలను చిదంబరం తోసిపుచ్చారు. జిల్లా స్థాయిలో ఓటింగ్ జరిగి అధ్యక్షుడ్ని ఎన్నుకున్న తర్వాత కూడా ఇది సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శుక్రవారం ఓటింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 9 వేల మంది పార్టీ ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఖర్గే గాంధీల విధేయుడని, ఆయన గెలిచినా నడిపించేది గాంధీలేనని విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలో చిదంబరం స్పందించారు. 2024 ఎన్నికల్లో విజయం కోసం పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని కోరిన నేతల్లో ఆయన కూడా ఉన్నారు. కొత్తగా పార్టీ బాధ్యతలు చేపట్టేవారు సంస్థాగత ఎన్నికలు నిర్వహించి కొత్త నాయకులను ఎన్నుకునేలా చేయాలని, పార్టీలో మార్పులు తీసుకురావాలని తాజాగా సూచించారు. మరోవైపు తాను గెలిస్తే పార్టీలో సమూల మార్పులు తీసుకొస్తానని పోటీకి ముందే శశిథరూర్. ఖర్గే కూడా పార్టీలో యువతకే ఎక్కువ అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశారు. గాంధీల నుంచి విలువైన సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకుంటానని స్పష్టం చేశారు. ఖర్గే, థరూర్లో ఎవరు గెలుస్తారో బుధవారం తెలిపోనుంది. ఆరోజే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. చదవండి: ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. 96% ఓటింగ్ నమోదు -
Bharat Jodo Yatra: ఖర్గే, థరూర్ ప్రజాదరణ ఉన్న నాయకులు
తురువెకెరే: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న మల్లికార్జున ఖర్గే, శశి థరూర్.. ఇద్దరూ ప్రజల్లో మంచి ఆదరణ, హోదా ఉన్న నాయకులేనని పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. అధ్యక్షుడిగా ఎన్నికైన వారిని గాంధీ కుటుంబం రిమోట్ కంట్రోల్తో ఆడించడం ఖాయమంటూ విమర్శలు చేయడం దారుణమని, అది వారిని అవమానించడమే అవుతుందని అన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీతో పాలనతో దేశ ప్రజలు విసుగెత్తిపోయారని పేర్కొన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థిక అసమానతలు జనాన్ని కుంగదీస్తున్నాయని వాపోయారు. అందుకే భారత్ జోడో యాత్రలో లక్షలాది మంది పాల్గొంటున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు గాంధీ కుటుంబం చెప్పినట్టల్లా ఆడాల్సిందేనంటూ కొందరు చేస్తున్న విమర్శలను రాహుల్ తిప్పికొట్టారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలో మీరు ఎందుకు పోటీ చేయడం లేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. అందుకు గల కారణాలను 2019లోనే తన రాజీనామా లేఖలో తెలియజేశానని అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలతో మమేకం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు వివరించారు. ఈ విధానం మన దేశ చరిత్ర, సంస్కృతిని వక్రీకరించేలా ఉందన్నారు. విద్యను కేంద్రీకృతం చేయడం కాదు, వికేంద్రీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన దేశ చరిత్ర, సంప్రదాయాలు, భాషలను ప్రతిబింబించే విద్యా విధానం కావాలన్నారు. దేశంలో విద్వేషాలు, హింసను రెచ్చగొట్టేవారిపై పోరాటం సాగిస్తున్నామని తెలిపారు. అధికారం కోసం కాదు తుమకూరు: భారత్ జోడో పాదయాత్ర 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం కాదని రాహుల్ చెప్పారు. మతం పేరుతో దేశాన్ని చీల్చడానికి బీజేపీ సాగిస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడానికి, ఆ పార్టీ అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ఒక కులం, ఒక మతం కోసం పని చేయలేదని, దేశంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిందని రాహుల్ చెప్పారు. తనను పనికిరానివాడు అని చిత్రీకరించడానికి బీజేపీ నాయకులు రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ, తానేంటో ప్రజలకు తెలుసని అన్నారు. శనివారం రాహుల్ దాదాపు 25 కిలోమీటర్ల దూరం నడిచారు. పెద్దసంఖ్యలో జనం పాల్గొన్నారు. -
పోటీ అక్కర్లేదన్నా పట్టుబట్టాడు.. ఖర్గే కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అందరి ఆమోదంతో ఒకే అభ్యర్థి ఉంటే బాగుంటుందని, ఎన్నిక ఏకగ్రీవం కావాలని అభిలషించానని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలో తన నివాసంలో ఏర్పాటుచేసిన పత్రికా సమావేశంలో ఖర్గే పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు. ‘సర్వామోదంతో, పోటీ లేకుండా ఒక్కరినే పార్టీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని నా ప్రతిపాదన. అదే విషయాన్ని శశిథరూర్కు చెప్పా. నాతో ఆయన విబేధించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నిక మంచిది అని థరూర్ వాదించారు. తానూ బరిలో దిగుతానని చెప్పారు’ అని ఖర్గే మీడియాకు వెల్లడించారు. ‘ఒక వేళ పార్టీ చీఫ్గా ఎన్నికైతే గాంధీల కుటుంబం ఇచ్చే అమూల్యమైన సలహాలను పరిగణనలోకి తీసుకుంటా. నేనేమీ గాంధీలు బలపరిచిన అధికారిక అభ్యర్థిని కాదు. ఇప్పుడు పార్టీలో జీ–23 అంటూ ఎలాంటి అసంతృప్త నేతల కూటమి లేదు. అందరం కాంగ్రెస్ నాయకులమే. ఆర్ఎస్ఎస్–బీజేపీని సమష్టిగా ఎదుర్కొంటాం ’అని ఖర్గే స్పష్టంచేశారు. ‘నేను పార్టీలో ఎవరిపైనో పోటీకి దిగలేదు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో భాగమే ఈ పోటీ. పార్టీలో సమూల మార్పులు ఉన్నపళాన జరగవు’ అని ఖర్గే అభిప్రాయపడ్డారు. పార్టీపై గాంధీలు గుత్తాధిపత్యం చేస్తారనే బీజేపీ ఆరోపణను ఖర్గే తిప్పికొట్టారు. ‘కాంగ్రెస్లో ఎన్నికల ప్రాధికార వ్యవస్థ ఉంది. ఓటింగ్ హక్కులున్నాయి. బీజేపీలో అలాంటిదేమీ లేదు. బీజేపీలో ఎన్నికలు జరిగాయా? జేపీ నడ్డాను ఎన్నుకున్నదెవరు? ఆ పార్టీలో డెలిగేట్స్ ఎంతమంది?’ అని ఖర్గే ప్రశ్నించారు. థరూర్ బహిరంగ చర్చ ప్రతిపాదనను తిరస్కరించారు. చదవండి: రాహుల్ భారత్ జోడో యాత్రలో సోనియా గాంధీ -
అందుకే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచా
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే ఆదివారం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించారు. తాను ఎవరి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడానికి పోటీ చేయట్లేదని, పార్టీ సీనియర్ నేతలు, యువనేతలు కోరడం వల్లే బరిలోకి దిగినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ను బలోపేతం చేయడే తన లక్ష్యమన్నారు. అలాగే తన వెనుక గాంధీ కుటుంబం ఉందని వస్తున్న వార్తలను కూడా ఆయన కొట్టిపారేశారు. గాంధీలు ఎవరికీ మద్దతు ప్రకటించలేదని చెప్పారు. ఎన్నికలు చాలా పారదర్శకంగా జరుగుతాయని పేర్కొన్నారు. జీ-23నేతలు మాత్రం తనకే మద్దతు తెలిపారని వివరించారు. ఒక్కరికి ఒకే పదవి ఉండాలనే పార్టీ నిబంధనను గౌరవిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ సమర్పించిన రోజే రాజ్యసభలో ప్రతిపక్షనేత పదవికి తాను రాజీనామా చేసినట్లు ఖర్గే వెల్లడించారు. ఒకేవేళ ఈయన అధ్యక్షుడిగా గెలిస్తే 136ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తొలి దళిత నేతగా అరుదైన ఘనత సాధిస్తారు. ఖర్గే గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పు రాదని, తాను గెలిస్తేనే సంస్కరణలు తీసుకొస్తానని శశిథరూర్ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఖర్గే స్పందించారు. ఎవరు గెలిచినా పార్టీలో సంస్కరణల కోసం సమష్టి నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే బీజేపీపై విమర్శలు గుప్పించారు ఖర్గే. కమలం పార్టీ పాలనలో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆ పార్టీ నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు. మరోవైపు ఖర్గేకు మద్దతుగా ఆయన కోసం ప్రచారంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవులకు గౌరవ్ వల్లభ్, దీపిందర్ హుడా, నజీర్ హుస్సేన్ రాజీనామా చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయని చెప్పేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఖర్గే విజయం కోసం తమవంతు కృషి చేస్తామన్నారు. చదవండి: శుక్రవారం నామినేషన్.. శనివారం రాజీనామా -
కాంగ్రెస్లో గాంధీల స్థానంపై శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు సీనియర్ నేత శశి థరూర్. అక్టోబర్ 17న జరగనున్న ఎన్నికల్లో మరో సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేతో పోటీ పడనున్నారు. ఈ క్రమంలో గాంధీ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు శశి థరూర్. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలో గాంధీలు ఒక భాగం మాత్రమేనని పేర్కొన్నారు. ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా పలు అంశాలపై మాట్లాడారు థరూర్. అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీచేయటాన్ని సోనియా గాంధీ స్వాగతించారని, తమ కుటుంబం తటస్థంగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు థరూర్ చెప్పారు. తాను సోనియా గాంధీ ఆమోదం కోసం ఆమెను కలవలేదని, అయికే.. వారి అధికారిక వైఖరి ఏంటని తెలుసుకునేందుకే భేటీ అయినట్లు చెప్పారు. ‘మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు, మేము ఎల్లప్పుడూ ఏకాభిప్రాయంతో పనులు చేస్తాం, మాకు వదిలివేయండి, సరైన వ్యక్తిని కనుగొంటాము అని ఆమె చెప్పలేదు. దానికి విరుద్ధంగా.. ఎన్నికలు పార్టీకి మంచిదని నమ్ముతానన్నారు. నీవు పోటీ చాయాలనుకుంటే.. స్వాగతిస్తా అన్నారు. అధికారిక అభ్యర్థి అంటూ ఎవరూ ఉండరని చెప్పారు. ఈ పోటీ కేవలం సహచరుల మధ్య జరుగుతోన్న పోరు మాత్రమే. నాకు 14 ఏళ్ల అనుభవం ఉంది. అన్ని రకాలుగా పోటీకి అర్హుడినే. నా అభ్యర్థిత్వంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు ’ అని తెలిపారు శశి థరూర్. పార్ట చీఫ్ కోసం పోటీ పడుతోన్న ఏ అభ్యర్థి అయినా.. గాంధీ కుటుంబీకుల చేతిలో కీలుబొమ్మగా మారతారా? అని ప్రశ్నించగా.. ‘కాంగ్రెస్లో గాంధీల స్థానం.. పార్టీ డీఎన్ఏతో వారికున్న అవినాభావ సంబంధాలు గొప్పవని నేను కచ్చితంగా నమ్ముతాను. వారి నుంచి, వారి వారసత్వం నుంచి మనల్ని మనం వేరు చేసే ప్రశ్నే లేదు. వారు క్రీయాశీలకంగా వ్యవహరించొద్దని భావిస్తే.. ఆ భయం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావటం లేదు.’ అని పేర్కొన్నారు థరూర్. మరోవైపు.. రాహుల్ గాంధీ ఇప్పటికీ పార్టీ ఇంఛార్జ్గానే కనిపిస్తారని తెలిపారు. అలాగే.. తాను జీ-23 తరఫున అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవటం లేదని స్పష్టం చేశారు. నాకు కేవలం 23 మంది కాదు, 9,100 మంది మద్దతు కావాలంటూ తెలిపారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: దిగ్విజయ్ సింగ్ -
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ట్విస్ట్.. చివరిరోజు తెరపైకి కొత్త పేరు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తెరపైకి కొత్తపేరు వచ్చింది. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున ఖేర్గే రేసులో ఉండనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్లకు చివరి రోజున అనూహ్యంగా ఖర్గే బరిలోకి రావడం ఆసక్తికరంగా మారింది. హస్తం పార్టీ అధ్యక్ష పదవికోసం సీనియర్ నేతలు శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్లో ఊహించని పరిణామాల కారణంగా సీఎం అశోక్ గహ్లోత్ రేసు నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో గాంధీ కుటుంబం విధేయుల్లో ఒకరైన ఖర్గేను బరిలోకి దింపాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఆమె ఆమోదం తెలిపితే ఖర్గే వెంటనే నామినేషన్ దాఖలు చేస్తారని పేర్కొన్నాయి. ఈయన పోటీతో అధ్యక్షపదవికి త్రిముఖ పోరు ఉండనుంది. దిగ్విజయ్ డౌట్! మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దిగ్విజయ్ సింగ్.. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఖర్గే నివాసానికి వెళ్లారు. పోటీలో ఉండాలంటే బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు వీరు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. అయితే గాంధీల విధేయుడైన ఖర్గే బరిలో ఉండటంతో దిగ్వజయ్ సింగ్ పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. దళిత వర్గానికి చెందిన ఖర్గే.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. 8 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు లోక్ ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. హోంమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. జీ-23నేతల ఆయోమయం మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని జీ-23 నేతలు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు సీనియర్ నేతలు పృథ్విరాజ్ చవాన్, భూపిందర్ హుడా, మనీశ్ తివారీలు ఆనంద్ శర్మ నివాసంలో భేటీ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే పోటీ చేయాలా? వద్దా? అనే విషయంపై వీరు సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. అధ్యక్ష పదవి రేసులో నిలిచేందుకు ముకుల్ వాస్నిక్, కుమారి సెల్జా పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు పార్టీ సన్నిహత వర్గాలు పేర్కొన్నాయి. చాలా ఏళ్ల తర్వాత దక్షిణాది నుంచి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్కు శుక్రవారం(సెప్టెంబర్ 30) చివరి తేది. అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ సారి గాంధీ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండటంతో 25 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబానికి చెందని వారు పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి 1994లో పీవీ నరసింహారావు చివరిసారిగా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు శశిథరూర్, ఖర్గే ఎవరు గెలిచినా మరోసారి ఆ పదవి చేపట్టిన దక్షిణాది నేతగా అరుదైన ఘనత సాధిస్తారు. వీవీ నరసింహారావు తర్వాత 1996-98 వరకు సీతారాం కేసరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి 2017వరకు సోనియా గాంధీనే ఆ పదవిలో కొనసాగారు. చదవండి: ‘గాంధీలు లేకుండా కాంగ్రెస్ పార్టీ శూన్యం’ -
‘గాంధీలు లేకుండా కాంగ్రెస్ పార్టీ శూన్యం’
భోపాల్: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ-గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్ పార్టీ శూన్యమని నొక్కి చెప్పారు. మరోవైపు.. వివిధ రాష్ట్రాల్లో పార్టీలో తలెత్తిన సంక్షోభంపై మాట్లాడారు. ‘చాలా సార్లు పార్టీలో చీలికలు వచ్చాయి. కానీ 99 శాతం కాంగ్రెస్ నేతలు దేశానికి స్వంతంత్రానికి ముందు, తర్వాత సేవ చేసిన కుటుంబానికి మద్దుతుగానే నిలిచారు. నెహ్రూ-గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్కు గుర్తింపే లేదు.’ అని పేర్కొన్నారు. రాజస్థాన్ సంక్షోభం దురదృష్టకరం.. అశోక్ గెహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటంతో రాజస్థాన్లో సంక్షోభం తలెత్తిన పరిస్థితులు దురదృష్టకరమన్నారు దిగ్విజయ్ సింగ్. పార్టీ అధ్యక్ష పదవికి గెహ్లోట్ పోటీ చేస్తే.. ఆయన నిర్ణయాన్ని అధిష్టానం గౌరవించేదన్నారు. ‘ఇప్పటికీ, అశోక్ గెహ్లోత్ అధికారిక అభ్యర్థిగా భావిస్తున్నాం. ఆయన పోటీలో ఉంటే దానిని స్వాగతిస్తాం. ఆయన ఎల్లప్పుడూ కాంగ్రెస్కు విధేయుడిగానే ఉన్నారు. కానీ, రాజస్థాన్లో తలెత్తిన దురదృష్టకర పరిస్థితులతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది.’ అని తెలిపారు దిగ్విజయ్ సింగ్. ఇదీ చదవండి: దిగ్విజయ్తో థరూర్ భేటీ.. అధ్యక్ష ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు -
కాంగ్రెస్ అధ్యక్ష బరిలో శశి థరూర్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సోనియా గాంధీ!
సాక్షి,న్యూఢిల్లీ: అక్టోబర్లో జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారని భావిస్తున్న ఆ పార్టీ ఎంపీ శశిథరూర్.. సోనియా గాంధీతో సోమవారం సమావేశమయ్యారు. పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని కొందరు యువ కార్యకర్తలు రూపొందించిన ఆన్లైన్ పిటిషన్కు ఆయన అంగీకారం తెలిపిన అనంతరం ఈ భేటీ జరగడం గమనార్హం. అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని శశి థరూర్ సోనియా గాంధీకి ఈ భేటీలో చెప్పారని, అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. దీంతో ఆయన అక్టోబర్ 17న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. కొద్దినెలల క్రితం ఉదయ్పూర్లో కాంగ్రెస్ చేసిన తీర్మానాలకు అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని పార్టీకి చెందిన కొందరు యువ నాయకులు ట్విట్టర్లో ఓ పిటిషన్ను రూపొందించారు. దీనికి మద్దతుగా 650మంది పార్టీ నాయకులు సంతకాలు చేశారు. దీన్నే ట్విట్టర్లో షేర్ చేసి తాను స్వాగతిస్తున్నట్లు శశిథరూర్ తెలిపారు. దీనిపై ప్రచారం చేస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. I welcome this petition that is being circulated by a group of young @INCIndia members, seeking constructive reforms in the Party. It has gathered over 650 signatures so far. I am happy to endorse it & to go beyond it. https://t.co/2yPViCDv0v pic.twitter.com/waGb2kdbTu — Shashi Tharoor (@ShashiTharoor) September 19, 2022 తీర్మానాలివే.. కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడమే గాక కుటుంబం నుంచి ఒక్కరికి ఒకే పదవి ఇవ్వాలనే తీర్మానాలను ఉదయ్పూర్ సమావేశాల్లో కాంగ్రెస్ ఆమోదించింది. అయితే ఐదేళ్లకుపైగా పార్టీలో పనిచేసే కుటుంబాలకు దీని నుంచి మినాహాయింపు ఇచ్చింది. ఇందులో భాగంగానే అక్టోబర్ 17న అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. వాస్తవానికి ఈ ఎన్నికలు సెప్టెంబర్లోనే జరగాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల అక్టోబర్కు వాయిదావేశారు. అయితే ఎన్నికలు జరుగుతాయని అందరూ భావిస్తుండగా.. కొన్ని రాష్ట్రాల అధ్యక్షులు రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్మానాలు చేస్తున్నారు. అధ్యక్షుడి ఎంపికను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకే వదిలేయాలని మూడు రాష్ట్రాల పీసీసీలు ఇప్పటికే తీర్మానాలకు ఆమోదం తెలిపాయి. దీంతో ఎన్నికలు లేకుండా మళ్లీ గాంధీ కుటుంబసభ్యులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని చూస్తున్నారనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్లో నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావాలనే పిటిషన్కు శశిథరూర్ బహిరంగంగా మద్దతు తెలిపారు. పార్టీలో సంస్కరణల కోసం డిమాండ్ చేసిన జీ-23 నేతల్లో ఈయన కూడా ఒకరు. ఈ విషయంపై 2020లోనే సోనియా గాంధీకి లేఖ రాశారు. కచ్చితంగా పోటీ.. తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తానని థరూర్ కొద్దిరోజుల క్రితమే చెప్పారు. తాను పోటీ చేసేది లేనిది త్వరలో తెలుస్తుందన్నారు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరో నాయకుడు కాంగ్రెస్ పగ్గాలు చేపడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ సుముఖంగా లేకపోతే రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ను బరిలోకి దింపాలని సోనియా భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అదే జరిగితే శశిథరూర్ తప్పకుండా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. చదవండి: వీడియో లీక్ ఘటన.. పంజాబ్ సీఎం కీలక నిర్ణయం -
కాంగ్రెస్ది 'భారత్ జోడో' యాత్ర కాదు 'పరివార్ జోడో' యాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భారత్ జోడో యాత్ర బుధవారం ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. దీనికి సబంధించి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశారు. ఇందులో గాంధీ కుటుంబంతో పాటు వాద్రా కూడా ఉన్నారు. Bharat Jodo! 🇮🇳 🙏 pic.twitter.com/KxDqLGoFfk — Robert Vadra (@irobertvadra) September 7, 2022 ఈ ఫోటోపై స్పందిస్తూ బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. రాహుల్ గాంధీ చేపట్టింది 'భారత్ జోడో' కాదు 'పరివార్ జోడో'(కుటుంబాన్ని ఏకం చేసే)యాత్ర అని సెటైర్లు వేసింది. బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా ఈమేరకు ట్వీట్ చేశారు. ఈ ఏడాది జూన్లో తాను రాజకీయాల్లోకి వస్తానని సూచనప్రాయంగా చెప్పారు రాబర్ట్ వాద్రా. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించిన అనంతరం ఈ విషయాన్ని తెలిపారు. దేశంలో మార్పు అవసరమని, అది తన వల్ల సాధ్యమవుతుందని ప్రజలు అనుకుంటే కచ్చితంగా రాజకీయ ప్రవేశం చేస్తానని వాద్రా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్కు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపడుతున్నారు. బుధవారం సాయంత్రం కన్యాకుమారిలో ఇది ప్రారంభమవుతుంది. మొత్తం 12 రాష్ట్రాలను కవర్ చేస్తూ 3,570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. చదవండి: వాద్రా ఫోటో.. భారత్ జోడో యాత్రపై బీజేపీ నేత సెటైర్లు -
విధేయుని అసమ్మతి
గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ను వీడటం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఆయన కొంతకాలంగా పార్టీపై బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా దశాబ్దాల పాటు ఆయన పార్టీలో, ప్రభుత్వంలో ఎన్నో కీలక పదవులు అనుభవించారు. ఏ సంక్షోభాన్నయినా సులువుగా పరిష్కరిస్తారని పేరు తెచ్చుకున్నారు. ఏ రాష్ట్రంలోనైనా పార్టీలో చీలికలొచ్చినా, ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్నా అధిష్టానానికి మొదట గుర్తుకొచ్చే పేరు ఆజాదే. ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇన్చార్జ్గా అంతర్గత సమస్యల్ని తనదైన శైలిలో పరిష్కరించారు. నాయకత్వంపై బహిరంగ విమర్శలు 1970లో కాంగ్రెస్లో చేరినప్పటి నుంచీ అర్ధ శతాబ్దం పాటు గాంధీల కుటుంబానికి వీరవిధేయుడిగా ఆజాద్కు పేరుంది. అలాంటి నేత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాభవాన్ని కోల్పోతున్న సమయంలో పార్టీకి కాయకల్ప చికిత్స జరగాలనే డిమాండ్తో 2020లో ఏర్పాటైన జీ23 సభ్యుల గ్రూప్లో ఆజాద్ కీలకంగా వ్యవహరించడం ఆందరినీ విస్మయానికి లోను చేసింది. ఇప్పటికైనా మేల్కొనకపోతే పార్టీ మునిగిపోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పార్టీలో కలకలం రేపాయి. నాటినుంచీ పలు సందర్భాల్లో పార్టీ నాయకులపై ఆజాద్ తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా ఓటముల నేపథ్యంలో పార్టీలోని ఫైవ్ స్టార్ కల్చర్ను ఏకిపారేశారు. ‘టికెట్ రాగానే మా నాయకులు ఫైవ్ స్టార్ హోటల్ రూమ్ బుక్ చేస్తారు. ఏసీ కారులేకుండా బయటకు అడుగు కూడా వేయరు. ఈ సంస్కృతి మారనిదే ఎవరూ గెలవలేరు‘‘ అన్నారు. మోదీపై ‘వీడ్కోలు’ పొగడ్తలు ఈ ఏడాది జనవరిలో కేంద్రం ఆజాద్కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. అప్పుడే ఆయన బీజేపీలో చేరతారన్న విశ్లేషణలు వినిపించాయి. దాన్ని ఆయన స్వీకరించరని పార్టీ ఆశించింది. కానీ ఆజాద్ మౌనమే వహించారు. ఎనిమిదిసార్లు రాజ్యసభ ఎంపీగా చేసిన ఆయన, తాజాగా ఫిబ్రవరిలో పదవీ కాలం ముగిసిన సందర్భంగా చేసిన వీడ్కోలు ప్రసంగం కూడా కలకలం రేపింది. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయితో పాటు ప్రధాని మోదీని కూడా ఆకాశానికెత్తారు. ‘‘మోదీపై నేనెన్నోసార్లు మాటల దాడి చేశా. అయినా ఆయనెప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోలేదు. అందుకు ధన్యవాదాలు. ఆయనకు కృతజ్ఞుడినై ఉంటా’’ అని చెప్పుకొచ్చారు. ఇటీవల జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవి చేపట్టడానికి ఆజాద్ నిరాకరించారు. సొంత కుంపటే! బీజేపీలో చేరతారన్న ఊహాగానాలకు ప్రస్తుతానికైతే ఆజాద్ తెరదించారు. ‘‘కశ్మీర్లో ఎన్నికలున్నందున సొంత పార్టీ పెట్టి బరిలో దిగుతా. అక్కడ గెలిచాక జాతీయ స్థాయిలో పార్టీని విస్తరిస్తా’’ అని ఓ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ పార్టీ వెనక బీజేపీ హస్తమే ఉందంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాంగ్రెస్కు ఆజాద్ గుడ్బై
సాక్షి, న్యూఢిల్లీ: వరుస పరాజయాలు, నేతల నిష్క్రమణతో నీరసించిన కాంగ్రెస్కు మరో భారీ షాక్. గాంధీల కుటుంబానికి విధేయుడైన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ (73) కాంగ్రెస్ను వీడారు. పార్టీతో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. అన్ని పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. రాహుల్గాంధీపై ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. ఇప్పటిదాకా పార్టీ వీడిన ఏ నాయకుడూ చేయని రీతిలో తీవ్ర విమర్శలు చేశారు. ‘‘రాహుల్వి పిల్ల చేష్టలు. సీనియర్లను గౌరవించని తత్వం’’ అంటూ దుయ్యబట్టారు. అలాంటి అపరిపక్వ వ్యక్తి నాయకత్వంలో పనిచేయలేనంటూ అధినేత్రి సోనియాగాంధీకి ఐదు పేజీల లేఖ రాశారు. ‘‘పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్ని రాహుల్ పూర్తిగా కుప్పకూల్చారు. ప్రశ్నించిన సీనియర్లపై కోటరీతో వ్యక్తిగత దాడి చేయించారు. శవయాత్రలు చేయించారు. పార్టీని అన్నివిధాలుగా పతనావస్థకు చేర్చారు. ఏమాత్రం సీరియస్నెస్ లేని అలాంటి వ్యక్తికే పగ్గాలిచ్చేందుకు నాయకత్వం ఎనిమిదేళ్లుగా విఫలయత్నం చేస్తూ వచ్చింది. తద్వారా జాతీయ స్థాయిలో బీజేపీని, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను చేజేతులారా అందలమెక్కించింది’’ అని ఆరోపించారు. అందుకే బరువెక్కిన హృదయంతో పార్టీతో నా 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చానన్నారు. భారత్ జోడో యాత్ర ప్రారంభించడానికి ముందు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జోడో అంటూ కార్యాచరణ చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్లో అసమ్మతి నేతలతో కూడిన జీ23 గ్రూప్లో ఆజాద్ కీలక నేతగా వ్యవహరించడం, పార్టీ తీరును కొన్నేళ్లుగా విమర్శిస్తూ ఉండటం తెలిసిందే. ఆయన రాజీనామాను దురదృష్టకరంగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. బీజేపీతో పోరు కీలక దశకు చేరిన సమయంలో ఇలా చేయడం దారుణమంటూ వాపోయింది. ఆజాద్ డీఎన్ఏ ‘మోడీ’ఫై అయిందంటూ దుయ్యబట్టింది. ఏడాది కాలంలో దాదాపు15 మంది దాకా నేతలు కాంగ్రెస్ను వీడారు! రాహుల్ రాకతో సర్వం నాశనం సోనియాకు రాసిన లేఖలో రాహుల్ తీరును ఆజాద్ తూర్పారబట్టారు. ‘‘పార్టీ అధినేత్రిగా కేంద్రంలో యూపీఏ1, 2 ప్రభుత్వాల ఏర్పాటులో మీరు కీలక పాత్ర పోషించారు. సీనియర్ల సలహాలను పాటించడం, వారి తీర్పును విశ్వసించడం, వారికి అధికారాలప్పగించడం అందుకు ప్రధాన కారణాలు. దురదృష్టవశాత్తు 2013లో రాహుల్ ఉపాధ్యక్షుడయ్యాక పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్నే కుప్పకూల్చారు. సీనియర్లు, అనుభవజ్ఞులైన నాయకులందరినీ పక్కన పెట్టారు. ఏ అనుభవమూ లేని కొత్త కోటరీయే పార్టీ వ్యవహారాలను నడుపుతోంది. కాంగ్రెస్ కోర్ గ్రూప్లో పొందుపరిచి, కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించి, రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేసిన ఆర్డినెన్స్ను రాహుల్ మీడియా ముందు చించిపారేశారు. ఇలాంటి చిన్నపిల్లల ప్రవర్తన వల్లే 2014లో అధికారానికి దూరమయ్యాం. ముందు సోనియా, తర్వాత రాహుల్ నాయకత్వంలో 2014–22 మధ్య 49 అసెంబ్లీ ఎన్నికలకు గాను ఏకంగా 39సార్లు ఘోరంగా ఓడిపోయాం. వరుసగా రెండు లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలయ్యాం. పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యవర్గ సభ్యునిగా నేనిచ్చిన ప్రతిపాదనలన్నీ స్టోర్ రూమ్కే పరిమితమయ్యాయి. 2013 జైపూర్ చింతన్శిబిర్లో పార్టీ పునరుజ్జీవం కోసం చేసిన సిఫార్సులదీ తొమ్మిదేళ్లుగా అదే గతి! రాహుల్కు వ్యక్తిగతంగా పదేపదే గుర్తు చేసినా వాటిని పట్టించుకోలేదు. పార్టీని గాడిలో పెట్టేందుకు 23మంది సీనియర్లం లేఖలు రాస్తే రాహుల్ కోటరీ నేతలు మాపై వ్యక్తిగత దాడి చేసి అవమానించారు. కోటరీ ఆదేశాల మేరకు జమ్మూలో నా శవయాత్ర చేశారు. ఇంకో సీనియర్ ఇంటిపైకి గూండాలను పంపారు. వారిని రాహుల్ వ్యక్తిగతంగా సన్మానించారు’’ అని ఆరోపించారు. రిమోట్ కంట్రోల్ మోడల్ ద్వారా యూపీఏ ప్రభుత్వ సమగ్రతను కుప్పకూల్చారంటూ సోనియాపైనా ఆజాద్ విమర్శలు గుప్పించారు. ‘‘మన ఓటమికి కారణమైన అదే మోడల్ను పార్టీకీ వర్తింపజేసి రాహుల్ సర్వనాశనం చేశారు. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రహసనం, బూటకం. దేశవ్యాప్తంగా ఎక్కడా ఏ స్ధాయిలోనూ ఎన్నికలు జరగలేదు. ఏఐసీసీ కార్యాలయంలో కూర్చున్న కోటరీ తయారు చేసిన కమిటీ జాబితాలపై సంతకం చేయాల్సిందిగా బలవంతపెట్టారు’’ అంటూ దుయ్యబట్టారు. కోటరీ గుప్పెట్లో బందీ కోటరీ గుప్పెట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బందీ అయిందని ఆజాద్ ఆరోపించారు. ‘‘తద్వారా పోరాట పటిమను, కాంక్షను పూర్తిగా కోల్పోయింది. పుంజుకునే అవకాశమే లేనంతగా పతనావస్థకు చేరింది. ఇప్పుడు కూడా అసమర్థులకు పగ్గాలు అప్పగించే ఫార్సు మొదలవబోతోంది’’ అని కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఉద్దేశించి ఆరోపించారు. ‘‘ఇదీ విఫల ప్రయోగంగా మిగిలిపోతుంది. ఎందుకంటే మళ్లీ ఓ కీలుబొమ్మనే గద్దెనెక్కిస్తారు’’ అన్నారు. స్వాతంత్య్రం అమృతోత్సవాల వేళ పార్టీకి ఇంతటి దురవస్థ ఎందుకు ప్రాప్తించిందో ఏఐసీసీ నాయకత్వం తనను తాను ప్రశ్నించుకోవాలని సూచించారు. తను, తన సహచరులం జీవితాంతం నమ్మిన విలువల కోసం కృషి చేస్తామని చెప్పారు. కపిల్ సిబల్, అశ్వనీకుమార్ తదితర నేతలు కాంగ్రెస్ను వీడటం తెలిసిందే. రాహుల్పై ఆజాద్ ఆరోపణలు... ► రాహుల్ ఏ మాత్రం పరిపక్వత లేని వ్యక్తి. అన్నీ పిల్లచేష్టలే. ఆయన రంగప్రవేశంతో, ముఖ్యంగా 2013లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడయ్యాక పార్టీ సర్వనాశనమైంది. ► అనుభవజ్ఞులైన సీనియర్లందరినీ రాహుల్ పక్కన పెట్టారు. తొత్తులతో కూడిన కోటరీ ద్వారా పార్టీని నడుపుతూ భ్రష్టు పట్టించారు. ► సోనియా పేరుకే పార్టీ చీఫ్. ముఖ్య నిర్ణయాలన్నీ రాహుల్వే. కొన్నిసార్లు ఆయన సెక్యూరిటీ గార్డులు, పీఏలూ నిర్ణయాలు తీసేసుకుంటున్న దారుణ పరిస్థితి నెలకొంది! ► ప్రభుత్వ ఆర్డినెన్స్ను మీడియా సాక్షిగా చించేయడం రాహుల్ అపరిపకత్వకు పరాకాష్ట. ప్రధాని అధికారాన్ని పూర్తిగా పార్టీ ముందు మోకరిల్లేలా చేసిన ఈ పిల్లచేష్టే 2014 లోక్సభ ఎన్నికల్లో యూపీఏ ఘోర ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ► కాంగ్రెస్ను పూర్తిగా చెప్పుచేతల్లో పెట్టుకునే క్రమంలో రాహుల్ నేతృత్వంలోని చెంచాల బృందం పార్టీకి చెప్పలేనంత ద్రోహం తలపెట్టింది. జాతీయోద్యమానికి నాయకత్వం వహించి దేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన పార్టీ వారివల్లే ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. ► 2019 లోక్సభ ఎన్నికల తర్వాత సారథ్య బాధ్యతల నుంచి తప్పుకునే ముందు పార్టీ కోసం జీవితాలను ధారపోసిన సీనియర్ నాయకులందరినీ వర్కింగ్ కమిటీ భేటీలోనే రాహుల్ తీవ్రంగా అవమానించారు. ఆజాద్ నైజం బయటపడింది: కాంగ్రెస్ దశాబ్దాల పాటు అన్ని పదవులూ అనుభవించి కీలక సమయంలో పార్టీని వీడటం ద్వారా ఆజాద్ తన అసలు నైజం బయట పెట్టుకున్నారంటూ కాంగ్రెస్ మండిపడింది. పదవి లేకుండా ఆజాద్ క్షణం కూడా ఉండలేరంటూ ఏఐసీసీ మీడియా హెడ్ పవన్ ఖేరా చురకలు వేశారు. ‘‘అందుకే రాజ్యసభ సభ్యునిగా పదవీకాలం ముగియగానే పార్టీ వీడారు. పార్టీని బలహీనపరిచేందుకు నిత్యం ప్రయత్నించారు. ఇప్పుడేమో పార్టీ బలహీనపడిందని విమర్శలు చేస్తున్నారు’’ అంటూ ఆక్షేపించారు. రాహుల్పై ఆజాద్ విమర్శలను కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ కొట్టిపారేశారు. ‘‘మోదీని పార్లమెంటులోనే ఆజాద్ ఆకాశానికెత్తారు. పద్మభూషణ్ స్వీకరించారు. ఆయన రిమోట్ మోదీ చేతిలో ఉందనేందుకు ఇవన్నీ నిదర్శనాలు’’ అంటూ ట్వీట్ చేశారు. ఆజాద్కు కాంగ్రెస్ అన్నీ ఇచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు. రాహుల్పై ఆయనా చేసిన విమర్శలు దారుణమన్నారు. పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడిలాంటి విమర్శలు చేయడం ఆజాద్ దిగజారుడుతనానికి నిదర్శనమని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. -
వారి ముందు చూపు వల్లే ఈ రోజు దేశం మనుగడ: శివసేన
ముంబై: మహారాష్ట్ర అధికార పార్టీ శివసేన సంచలన వ్యాఖ్యలు చేసింది. నెహ్రూ-గాంధీ కుటుంబం వల్లనే ప్రస్తుతం కరోనా సంక్షోభంలో భారత్ మనుగడ సాగించ గలుగుతున్నదని శివసేన పేర్కొంది. కాగా, కోవిడ్ కట్టడిలో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడింది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో చిన్నదేశాలు సాయం చేయడం మన నేటి దుస్థితికి అద్దం పడుతుందని విమర్శించింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ మోదీ ప్రభుత్వం మాత్రం వేలాది కోట్లతో నిర్మిస్తున్న సెంట్రల్ విస్తా ప్రాజెక్టును ఆపేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేదని తన అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్లో ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేశంలో కరోనా సంక్షోభ సమయంలో పేద దేశాలు భారత్కు సహాయం చేస్తుండగా, ఢిల్లీలో 20,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును నిలుపుదల చేసేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా లేరని శివసేన మండిపడింది. ఒక వైపు బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్ వంటి చిన్న దేశాల నుంచి వైద్య సహాయం పొందుతూ మరోవైపు పార్లమెంట్ కొత్త భవన నిర్మాణం, ప్రధానమంత్రి కొత్త నివాసం నిర్మాణం కొనసాగించడంపై ఎవరూ విచారం వ్యక్తం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని శివసేన ఎద్దేవా చేసింది. "కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న భారతదేశం నుంచి ప్రపంచానికి ముప్పు ఉందని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనాపై పోరాటంలో ఎక్కువ దేశాలు భారత్కు సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్ 10,000 రెమ్డెసివిర్ వైల్స్ పంపగా, భూటాన్ మెడికల్ ఆక్సిజన్ పంపింది. నేపాల్, మయన్మార్, శ్రీలంక కూడా ‘ఆత్మనిర్భర్’ భారతదేశానికి సహాయం అందించాయి" అంటూ రాసుకొచ్చింది. "స్పష్టంగా చెప్పాలంటే.. నెహ్రూ-గాంధీలు సృష్టించిన వ్యవస్థల వల్లనే భారత్ మనగులుగుతున్నది. చాలా పేద దేశాలు భారత్కు సహాయం అందిస్తున్నాయి. గతంలో పాకిస్తాన్, రువాండా, కాంగో వంటి దేశాలు.. వేరే దేశాల నుంచి సహాయం పొందేవి. దేశంలో ప్రస్తుత పాలకుల వల్ల భారత్ అలాంటి స్థితికి దిగజారుతున్నది" అని శివసేన విమర్శించింది. "కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీకి ఆరోగ్య మంత్రిత్వ శాఖను అప్పగించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారని, ప్రస్తుత కేంద్ర ఆరోగ్య మంత్రి పూర్తిగా విఫలమయ్యారన్నదానికి ఇదే నిదర్శనమని శివసేన విమర్శించింది. “పండిట్ నెహ్రూ, (లాల్ బహదూర్) శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ హయాంలోని మునుపటి ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల వల్లనే ప్రస్తుతం దేశం మనుగడ సాధిస్తున్నది. వారు ఇచ్చిన విశ్వాసానికి దేశం ప్రస్తుతం కృతజ్ఞతలు తెలుపుతోంది" అని సామ్నా పేర్కొంది. -
గాంధీ కుటుంబానికి ‘కట్ మనీ’
కారైక్కల్/సాక్షి, చెన్నై: పుదుచ్చేరి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.15,000 కోట్ల నిధుల నుంచి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి ఢిల్లీలోని గాంధీ కుటుంబానికి కట్ మనీ పంపించారని కేంద్ర హోంశాఖ అమిత్ షా ఆరోపించారు. వారసత్వ, కుటుంబ రాజకీయాల వల్లే పుదుచ్చేరితోపాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పతనమయ్యిందని తేల్చిచెప్పారు ఆదివారం పుదుచ్చేరిలోని కారైక్కల్లో ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు. కాంగ్రెస్లో ప్రతిభావంతులకు చోటు లేదని విమర్శించారు. 2016లో పుదుచ్చేరిలో కాంగ్రెస్ను గెలిపించిన నమశ్శివాయంను కాదని, నారాయణస్వామిని ముఖ్యమంత్రిని చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పెద్దలకు నారాయణస్వామి కట్టుబానిస అని ఆక్షేపించారు. కమల వికాసాన్ని అడ్డుకోలేరు పుదుచ్చేరిలో ఈసారి బీజేపీని గెలిపించాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వస్తే పుదుచ్చేరిలో భారతదేశ ఆభరణంగా మారుస్తామని హామీ ఇచ్చారు. మొన్నటిదాకా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నారాయణస్వామి గాంధీ కుటుంబ సేవలో తరించడం తప్ప ప్రజలకు చేసేందేమీ లేదని తప్పుపట్టారు. పుదుచ్చేరి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను గాంధీ కుటుంబానికి చేరవేశారని, ఆఖరికి ఎస్టీ, ఎస్టీల నిధులను కూడా వదల్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుదుచ్చేరిలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. గొప్ప భాష అయిన తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. స్పీకర్ శివకొళుందు రాజీనామా పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ శివకొళుందు ఆదివారం పదవికి రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైకి రాజీనామా లేఖను అందజేశారు. -
నాలుగుసార్లు లోక్సభ వాయిదా
న్యూఢిల్లీ: బీజేపీ నేతల వ్యాఖ్యలపై లోక్సభ శుక్రవారం నాలుగు పర్యాయాలు వాయిదాపడింది. ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ బిల్లు–2020పై చర్చ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ప్రధానమంత్రి నిధులను దుర్వినియోగం చేసిందంటూ, గాంధీ కుటుంబంపై చేసిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షం నిరసనలకు దిగింది. పీఎం రిలీఫ్ çఫండ్ను ఇప్పటి వరకు రిజిస్టర్ చేయించనేలేదని ఠాకూర్ పేర్కొన్నారు. గాంధీ కుటుంబం దేశాన్ని నాశనం చేసిందని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. పలువురు సభ్యులు తమ స్థానాల నుంచి నిలుచుని మాట్లాడుతుండటంపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరు కొనసాగితే సస్పెండ్ చేస్తామని వారిని హెచ్చరించారు. అయినా నిరసనలు ఆపకపోవడంతో సభను రెండుసార్లు వాయిదా వేశారు. అనంతరం స్పీకర్ స్థానంలో ఉన్న రమాదేవి కూడా సభను రెండుసార్లు వాయిదా వేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ ఎంపీలకు కరోనా పరీక్షను తప్పనిసరి చేశారు. ప్రతి రోజు ఉదయం ఉభయ సభలకు చెందిన ఎంపీలు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు సభ్యుల వేతనాలను ఏడాది పాటు 30% తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లుకు శుక్రవారం పార్లమెంటు ఆమోదం తెలిపింది. కోవిడ్పై పోరుకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన విపక్ష సభ్యులు, ఎంపీల్యాడ్స్ నిధులను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ బిల్లును లోక్సభ మంగళవారమే ఆమోదించగా, శుక్రవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. హర్సిమ్రత్ రాజీనామా ఆమోదం కేంద్ర మంత్రి పదవికి శిరోమణి అకాలీదళ్ నేత హర్సిమ్రత్ కౌర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి కోవింద్ ఆమోదించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన రైతాంగానికి సంబంధించిన మూడు బిల్లులకు వ్యతిరేకంగా ఆమె గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అలాగే, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖను అదనంగా అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
గాంధీలు వారే, గాడ్సేలు వారే....!
సాక్షి, న్యూఢిల్లీ : శతాధిక వత్సరాల జాతీయ పార్టీ కాంగ్రెస్లో సమూల ప్రక్షాళన జరగబోతుందన్న సంకేతాలు వెలువడడంతో 24వ తేదీన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. బ్రహ్మాండం బద్దలయ్యేలా ఏదో జరగబోతోందని ఆశావహులందరు ఆశించారు. పార్టీలో సమూల మార్పులు కోరుతూ పార్టీ అధిష్టానానికి 23 మంది పార్టీ సీనియర్ నేతలు రాసిన లేశ వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఆ పార్టీలో వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ కోల్పోతోందని, కార్యకర్తల్లో నైరాశ్యం ఆవహించిందని సీనియర్ నేతలు ఆ లేఖలో ఆరోపించారు. పార్టీకి పూర్వ జవసత్వాలు తీసుకరావాలంటే పార్టీకి సమర్థ నాయకత్వం అవసరం అని, అందుకు పార్టీలో అధికార వికేంద్రీకరణ జరగాలని, అంతర్గత ప్రజాస్వామ్యం బలపడాలని, పార్టీ పదవులన్నింటికి ఎన్నికలు జరగాలని వారు భాషించారు. అందుకు అనుగుణంగా ప్రియాంక గాంధీ స్పందించారు. ( ‘మనసు నొప్పించి ఉంటే క్షమించండి’) పార్టీ అధ్యక్షులుగా గాంధీ కుటుంబేతరులు ఉండాలని మరోసారి నొక్కి చెప్పారు. అందుకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కాగానే అధ్యక్ష పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు సోనియా గాంధీ ప్రకటించారు. సోనియా గాంధీతోపాటు తాము కూడా పార్టీ పదవులకు రాజీనామా చేస్తామని గులాం నబీ ఆజాద్ లాంటి సీనియర్ నాయకులు ప్రకటించారు. సీనియర్ నాయకులు రాసిన పార్టీ అంతర్గత లేఖపై అంతర్మథనం జరుగుతుందని, గాంధీల నాయకత్వంపై నిర్మాణాత్మక దాడి కొనసాగుతుందని రాజకీయ వర్గాలతోపాటు సామాన్య ప్రజలు కూడా భావించారు. అయితే అందుకు విరుద్ధంగా సమావేశం కాస్తా గాంధీల దర్బార్గా మారిపోయింది. అసమ్మతి గళాలు హఠాత్తుగా మూగబోయాయి. రాజీనామాలకు సైతం రొమ్ము విరిచిన పార్టీ సీనియర్ నాయకులు సొమ్మసిల్లినట్లు సద్దుమణిగారు. సోనియా గాంధీ రాజీనామా చేయాల్సిన అవసరం లేకుండానే కుర్చీకి అతుక్కుపోయారు. మరో ఆరు నెలల్లో పార్టీ అధ్యక్షులను ఎన్నుకుంటామన్న హామీతో దర్బార్ దర్జాగా ముగిసిపోయింది. 2019లో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అపజయం పాలైనప్పటి నుంచి నాయకత్వ మార్పు మాట వినిపిస్తోంది. ‘ప్లీజ్ ప్లీజ్...పార్టీ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తాను. ఒప్పుకోండి! ప్లీజ్’ అంటూ రాహుల్ గాంధీ ముందుకు వచ్చారు. గాంధీ కుటుంబేతరులు పార్టీ పగ్గాలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందంటూ గాంధీలే మాట్లాడారు. చేతులు కట్టుకుని ముందు నిలబడే గాంధీ విధేయులంతా ఒకసారి తర్జనభర్జన పడ్డారు. పార్టీ పగ్గాల విషయంలో పొత్తు కుదరక మరోసారి చేతులు కట్టుకున్నారు. గాంధీ నాయకత్వం తలచుకుంటే పీవీ నర్సింహారావు, సీతారామ్ కేసరి తరహాలో పార్టీ పగ్గాలు ఇతరులకు అప్పగించవచ్చు. అలా చేయకుండా పార్టీ నాయకత్వ మార్పుపై చర్చాగోష్టిలు పెట్టడం విధేయత ప్రకటించుకొని పదవులను కాపాడుకోవడం గాంధీలకు పరిపాటిగా మారినట్లు ఉంది. పార్టీ పగ్గాలు ఇతరులు చేపట్టాలంటూ గాంధీలుగా పిలుపునిస్తూ గాడ్సేలుగా ఆ ప్రయత్నాలను వారే అడ్డుకుంటున్నట్లు అర్థమవుతోంది. -
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభంపై రచ్చ
-
గాంధీలదే కాంగ్రెస్..!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు స్వరాలతో రేగిన ప్రకంపనలు పాలపొంగు మాదిరి చప్పున చల్లారిపోయాయి. పార్టీ తాత్కాలిక చీఫ్గా కొనసాగాలని, సంస్థను బలోపేతం చేయడానికి అవసరమైన మార్పులు తీసుకురావాలని సోనియాగాంధీని కోరుతూ సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనువైన పరిస్థితులు రాగానే ఏఐసీసీ సదస్సు ఏర్పాటు చేయాలని, అందులో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని... అప్పటిదాకా పార్టీ అధ్యక్షురాలిగా సోనియానే కొనసాగాలని ఆ తీర్మానంలో సీడబ్ల్యూసీ పెద్దలంతా స్పష్టంచేశారు. ఎక్కువ మంది సోనియా గాంధీకి మద్దతుగా నిలిచినప్పటికీ.. సమావేశంలో వ్యతిరేక స్వరాలు కూడా వినిపించాయి. పార్టీలో మార్పులు కోరుతూ సీనియర్లు లేఖ రాసిన సందర్భంపై రాహుల్ గాంధీ మండిపడగా... సమావేశంలో ఉన్న గులాం నబీ ఆజాద్ కూడా అదే రీతిలో స్పందించారు. సమావేశం బయట ఉన్న కపిల్ సిబల్ కూడా బహిరంగంగా ట్వీట్ చేశారు. కానీ కొద్దిసేపటికే పరిస్థితులు మారిపోయి తాత్కాలికంగానైనా అంతా ఒక్క చేతికిందికి వచ్చేశారు. ఉదయం నుంచి హైడ్రామా.. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఏడు గంటలపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో తొలుత సోనియా గాంధీ తాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. క్రియాశీలకంగా ఉండే, పూర్తి సమయం కేటాయించే అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ ఆగస్టు మొదటివారంలో పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కపిల్ సిబల్ తదితర 23 మంది నేతలు రాసిన లేఖపైనే ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ లేఖ రాగానే పార్టీలో మార్పుల గురించి చర్చించేందుకు సోనియాగాంధీ ఈనెల 20న పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కు లేఖ రాశారు. పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికపై చర్చ ప్రారంభించేందుకు వీలుగా సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో భాగంగా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో 52 మంది పాల్గొన్నారు. ఒక్క తరుణ్ గొగోయ్ మినహా సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, ముఖ్యమంత్రులు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎక్కువ మంది సోనియా గాంధీకి మద్దతుగా నిలిచినప్పటికీ.. సమావేశంలో వ్యతిరేక స్వరాలూ వినిపించాయి. లేఖ రాసిన సమయం, సందర్భంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. లేఖ రాసినవారు బీజేపీతో కుమ్మక్కయ్యారని కూడా ఆయన ఒకదశలో వ్యాఖ్యలు చేసినట్లు తెలియవచ్చింది. దీనికి గులాం నబీ ఆజాద్ ఘాటుగా స్పందిస్తూ బీజేపీతో కుమ్మక్కయినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాలు విసిరినట్టు సమావేశంలో పాల్గొన్న సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. సోనియా గాంధీ ప్రారంభ ఉపన్యాసం అయ్యాక సీనియర్ నేతలు మన్మోహన్సింగ్, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్ మాట్లాడుతూ... సీనియర్ల లేఖను తప్పుపట్టారు. సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగాలని మన్మోహన్సింగ్ ఆకాంక్షించారు. లేఖ రాసిన వారిపై ఆయా నేతలు విమర్శలు గుప్పించారు. కొత్త పార్టీ చీఫ్ను ఎన్నుకునేందుకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని, అందుకు వర్చువల్ ఏఐసీసీ సెషన్ నిర్వహించాలని పి.చిదంబరం సూచించారు. సందర్భాన్ని తప్పుపట్టిన రాహుల్ గాంధీ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ... లేఖపై సంతకం చేసిన వారిని ఘాటుగా విమర్శించారు. ముఖ్యంగా లేఖ రాసిన సమయాన్ని, సందర్భాన్ని తప్పుపట్టారు. సోనియాగాంధీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు, రాజస్తాన్లో పార్టీ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ లేఖ రాయడాన్ని తప్పుపట్టారు. దీనికి సంబంధించి సమావేశం పూర్తికాకముందే బయటకు లీకులు వెలువడ్డాయి. వీటి ఆధారంగా ఒక వార్తా సంస్థ చేసిన ట్వీట్ దుమారం రేపింది. లేఖ రాసిన వారు బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ గాంధీ మండిపడ్డారంటూ ఆ వార్తా సంస్థ చేసిన ట్వీట్కు కపిల్ సిబల్ ట్వీట్ ద్వారా సమాధానమిచ్చారు. పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా రంగంలోకి దిగారు. రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని ఆయన ట్వీట్ చేశారు. మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. పార్టీలో ఒకరితోనొకరు గొడవ పడడానికి బదులు మోదీ పాలనపై కలసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తాత్కాలికంగా సద్దుమణిగాయా? పార్టీలో, సమావేశంలో ధిక్కార స్వరాలు వినిపించాయనడానికి పార్టీ నేతలు చేసిన ట్వీట్లు చాలు. రణ్దీప్ సూర్జేవాలా ట్వీట్లో ‘పార్టీ్టలో ఒకరినొకరు కొట్టుకునే కంటే మోదీ పాలనపై కలిసికట్టుగా పోరాడాలి’ అన్న వ్యాఖ్య అంతర్గత పోరు నిజమేనన్న సంకేతాన్నిస్తోంది. అలాగే తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని, రాహుల్ని అనలేదని, ఇతర కాంగ్రెస్ నేతలను మాత్రమే అన్నానని ఆజాద్ చేసిన ట్వీట్ కూడా సమావేశంలో జరిగిన వాడీవేడిని బయటపెడుతోంది. ఇక బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్ అన్నట్టుగా వార్తలు వెలువడడంతో సిబల్ వెంటనే స్పందించి ట్వీట్ చేయడం కూడా అంతర్గత పోరుకు సంకేతమేనని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే అంతర్గత పోరు బహిరంగం కావడం, ఒక దశలో పార్టీలో దాదాపు 400 మంది సీనియర్లు మూకుమ్మడి రాజీనామాలు చేయబోతున్నారని ప్రచారం కావడంతో రాహుల్ గాంధీ స్వయంగా సిబల్తో మాట్లాడారు. తాను అలా అనలేదని చెప్పడంతో సిబల్ వెంటనే ట్వీట్ తొలగించారు. అలాగే లేఖ రాసిన వారిలో సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన వారు ఆజాద్, ఆనంద్ శర్మ ఇద్దరే. సమావేశంలో వీరి వైఖరిని అహ్మద్ పటేల్ తదితరులు తీవ్రంగా ఆక్షేపించారు. లేఖను తయారు చేసింది ఆనంద్ శర్మే అని ఆరోపించినట్టు కూడా తెలిసింది. నేతలంతా చివరికి లేఖ రాసిన వ్యక్తుల్ని కాకుండా సందర్భాన్ని తప్పుపడుతూ గాంధీ కుటుంబానికి విధేయత ప్రకటించారు. అలాగే రాహుల్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాలని కూడా కోరారు. మరోవైపు సమావేశం వెలుపల, వివిధ ప్రాంతాల్లో రాహులే అధ్యక్షుడు కావాలంటూ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో చివరకు ఏఐసీసీ సెషన్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరిగేవరకు సోనియానే చీఫ్గా కొనసాగాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. ధిక్కార స్వరం వినిపించిన వారు కూడా ఈ తీర్మానంలో భాగం కావటంతో తాత్కాలికంగా పరిస్థితి సద్దుమణిగిందనే చెప్పాలి. సమావేశం చివరలో సోనియా ‘మనది పెద్ద కుటుంబం. భిన్న అభిప్రాయాలు ఉంటాయి. కానీ ప్రజల కోసం కలిసి పోరాడాలి. సంస్థాగత అంశాలు ఎప్పుడైనా పరిష్కరించుకోవచ్చు..’అని ప్రకటించినట్టు కేసీ వేణుగోపాల్ చెప్పారు. కాగా, సీడబ్ల్యూసీ భేటీ తర్వాత లేఖ రాసిన సీనియర్లు కొందరు గులాంనబీ ఆజాద్ నివాసంలో భేటీ అయ్యారు. కపిల్ సిబల్, శశిథరూర్, ముకుల్ వాస్నిక్, మనీష్ తివారీలు హాజరైన వారిలో ఉన్నారు. బలహీనపరచడాన్ని అనుమతించలేం: సీడబ్ల్యూసీ ఏఐసీసీ సమావేశం నిర్వహణకు పరిస్థితులు అనుకూలించేదాకా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగాలని సోనియా గాంధీని కోరుతూ సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానించింది. పార్టీ ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సంస్థాగతంగా మార్పులు చేపట్టడానికి సోనియాకు అధికారాన్ని కట్టబెట్టింది. సోనియా, రాహుల్ల నాయకత్వాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించింది. పార్టీని, నాయకత్వాన్ని బలహీనపర్చేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేసింది. పార్టీ అంతర్గత వ్యవహారాలను మీడియాలో, బాçహాటంగా చర్చించకూడదని, వాటిని పార్టీ వేదికలపైనే లేవనెత్తాలని కోరింది. సుమారు 7 గంటల పాటు జరిగిన సీడబ్ల్యూసీ భేటీ వివరాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. ‘కాంగ్రెస్ అధ్యక్షురాలికి రాసిన లేఖపై సీడబ్ల్యూసీ లోతుగా చర్చించి ఈ తీర్మానాలు చేసింది. వేలాది మంది ప్రాణాలను తీసిన కరోనా మహమ్మారి, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, పేదరికం, చైనాతో ఉద్రిక్తతలు వంటి సవాళ్లను దేశం ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ప్రభుత్వం విభజన రాజకీయాలు చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తమ స్వరం వినిపించారు. ఈ దిశగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయత్నాలను పార్టీ మరింత బలోపేతం చేయాలి’ అని తీర్మానంలో సీడబ్ల్యూసీ పేర్కొంది. గులాం నబీ ఆజాద్ రాజీనామాపై ట్వీట్ మీటింగ్ ఒకవైపు సాగుతుండగానే ఆజాద్ ఒక ట్వీట్ చేశారు. ‘మీడియాలోని ఒక వర్గం తప్పుగా అన్వయించింది. మేం ఆ లేఖ బీజేపీతో కుమ్మక్కై రాసినట్టు నిరూపించాలని రాహుల్ను ఉద్దేశించి నేను అన్నట్టుగా తప్పుగా అన్వయించింది. నేను భేటీలో ఏమన్నానంటే.. నిన్న కొందరు కాంగ్రెస్ వ్యక్తులు మేం బీజేపీతో కుమ్మక్కయి లేఖ రాశామని అన్నారు. అది చాలా దురదృష్టకర సంఘటన. ఈ ఆరోపణను నిజమని నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నాను’ అని ట్వీట్ చేశారు. సోనియానే కొనసాగాలి పార్టీ ప్రెసిడెంట్గా సోనియా గాంధీనే కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గట్టిగా కోరారు. సీడబ్ల్యూసీ భేటీలో కేసీ వేణుగోపాల్, సోనియాగాంధీల అనంతరం మన్మోహన్ ప్రసంగించారు. నూతన అధ్యక్ష ఎంపిక ప్రక్రియ ప్రారంభమయ్యే పూర్తిస్థాయి ఏఐసీసీ సమావేశాలు జరిగేవరకు అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగాలని ఆయన సోనియాను కోరారు. నాయకత్వ మార్పు కోరుతూ సీనియర్లు లేఖ రాయడాన్ని ఆయన తప్పుబట్టారు. అది దురదృష్టకరమన్నారు. ‘హైకమాండ్ బలహీనమయితే, కాంగ్రెస్ పార్టీ బలహీనమవుతుంది’అని వ్యాఖ్యానించారు. మరోవైపు, సోనియా గాంధీ కొనసాగనట్లయితే.. అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ స్వీకరించాలని మరో సీనియర్ నేత ఏకే ఆంటోనీ కోరారు. సీనియర్లు రాసిన లేఖ కన్నా.. ఆ లేఖలోని అంశాలు క్రూరంగా ఉన్నాయని ఆంటోనీ విమర్శించారు. అందుకే ఆ ట్వీట్ను తొలగించా!: సిబల్ రాహుల్ గాంధీని ఘాటుగా విమర్శిస్తూ చేసిన ట్వీట్ను ఆ తరువాత సీనియర్ నేత కపిల్ సిబల్ తొలగించారు. బీజేపీతో కుమ్మక్కు అయ్యారన్న వ్యాఖ్య తాను చేయలేదని రాహుల్ గాంధీ స్వయంగా తనతో చెప్పారని, అందువల్ల ఆ ట్వీట్ను తొలగిస్తున్నానని సిబల్ వివరణ ఇచ్చారు. ‘బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్ అంటున్నారు. రాజస్తాన్ హైకోర్టులో కాంగ్రెస్ తరఫున జరిపిన పోరాటంలో విజయం సాధించాం. మణిపూర్లో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే విషయంలో పార్టీ తరఫున విజయవంతంగా పోరాడాం. 30 ఏళ్లలో ఏ అంశంపైన కూడా బీజేపీకి మద్దతిస్తూ ఒక వ్యాఖ్య కూడా చేయలేదు. అయినా, బీజేపీతో కుమ్మక్కయ్యామని అంటున్నారు’అని తొలగించిన ఆ ట్వీట్లో సిబల్ పేర్కొన్నారు. పూర్తి సమయం పని చేసే నాయకత్వం ప్రస్తుతం పార్టీకి అవసరమని పేర్కొంటూ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో సిబల్ కూడా ఒకరు. నెహ్రూ– గాంధీ కుటుంబం నుంచి ఐదుగురు ► ఇతరులు 13 మంది ► స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సోనియాగాంధీ సిద్ధమయ్యారు. రాహుల్ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టడానికి విముఖంగా ఉన్నారని సమాచారం. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి పదోన్నతికి ప్రియాంకా గాంధీ సిద్ధంగా లేరని అంటున్నారు. గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడు వస్తారా? కాలమే తేల్చాలి. ఇప్పటికైతే సోనియాను కొనసాగాల్సిందిగా సీడబ్ల్యూసీ తీర్మానించింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే... ఇప్పటిదాకా కాంగ్రెస్కు 18 మంది అధ్యక్షులుగా పనిచేశారు. వీరిలో నెహ్రూ– గాంధీ కుటుంబానికి చెందిన ఐదుగురే దాదాపు 40 ఏళ్లు పార్టీ పగ్గాలు చేపట్టారు. ఈ కుటుంబం నుంచి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా, రాహుల్లు అధ్యక్షులుగా పనిచేశారు. అందరికంటే అత్యధికకాలం పార్టీని నడిపింది సోనియా గాంధీనే. ఇప్పటిదాకా ఆమె 20 ఏళ్లు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఈ కుటుంబం నుంచి కాకుండా ఇతరులు 13 మంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. వారు... జేబీ కృపలానీ, పట్టాభి సీతారామయ్య, పురుషోత్తందాస్ టాండన్, యు.ఎన్.ధేబర్, నీలం సంజీవరెడ్డి, కె.కామరాజ్, ఎస్.నిజలింగప్ప, జగ్జీవన్ రామ్, శంకర్దయాళ్ శర్మ, డి.కె.బరూహ్, కాసు బ్రహ్మానంద రెడ్డి, పి.వి.నరసింహారావు, సీతారాం కేసరి. -
కాంగ్రెస్లో విభేదాలు!
న్యూఢిల్లీ: కీలక సీడబ్ల్యూసీ భేటీ నేడు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్లో విభేదాలు బయటపడ్డాయి. పార్టీ అగ్ర నాయకత్వంలో సమూల మార్పు కావాలని కోరుతున్న వర్గం ఒకవైపు, రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్న మరో వర్గం తెరపైకి వచ్చాయి. పార్టీ నాయకత్వంలో మార్పు ప్రస్తుతం అత్యవసరమని, క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో చురుగ్గా పనిచేసే శాశ్వత నాయకత్వం, ఏఐసీసీ, పీసీసీ కార్యాలయాల్లో అనునిత్యం అందుబాటులో ఉండే నాయకత్వం ఇప్పుడు పార్టీకి కావాలని పేర్కొంటూ సుమారు 23 మంది సీనియర్ నేతలు ఇటీవల సోనియాగాంధీకి లేఖ రాశారు. మరోవైపు, గాంధీ కుటుంబ సభ్యులే కాంగ్రెస్కు సరైన నాయకత్వం అందించగలరని మరికొందరు నేతలు స్పష్టం చేశారు. పార్టీ శ్రేణుల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు, అభిమానం ఉన్న నాయకుడిగా రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను మళ్లీ చేపట్టాలని పలువురు సీనియర్లు డిమాండ్ చేశారు. కాగా, పార్టీ నాయకత్వంలో మార్పు కావాలని కోరుతూ రాసిన లేఖపై ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందించినట్లు తెలుసోంది. పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. (అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా..!) ఈ విషయాన్ని పార్టీలోని సన్నిహిత నేతలకు ఆమె ఇప్పటికే స్పష్టం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. సోమవారం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీలో దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశముందని వెల్లడించాయి. అయితే, సోనియా పార్టీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోనున్నారన్న వార్తలను కాంగ్రెస్ ఖండించింది. సోనియా గాంధీ నుంచి అలాంటి ప్రకటనేదీ రాలేదని పార్టీ స్పష్టం చేసింది. పార్టీ ప్రెసిడెంట్గా సోనియా గాంధీ కొనసాగడమో, లేక రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టడమో సరైన నిర్ణయమని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, లోక్సభలో కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురి, మాజీ కేంద్ర మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, అశ్విన్ కుమార్, కేకే తివారీ తదితరులు అభిప్రాయపడ్డారు. నాయకత్వ మార్పు కోరుతూ లేఖ రాసినవారిలో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, శశి థరూర్, కపిల్ సిబల్, మనీశ్ తివారీ, హరియాణా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హూడా తదితరులున్నారు. గత సంవత్సరం ఆగస్ట్ 10న సీడబ్ల్యూసీ అభ్యర్థన మేరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి తరువాత రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగేందుకు అయిష్టత చూపి తప్పుకొన్న విషయం తెలిసిందే. చాలా మార్పులు జరగాలి.. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. సీడబ్ల్యూసీని పునర్వ్యవస్థీకరించాలని, పీసీసీలకు మరిన్ని అధికారాలను అప్పగించాలని సోనియాకు రాసిన లేఖలో సీనియర్లు కోరారు. అధికారం కేంద్ర స్థాయిలో ఎక్కువగా కేంద్రీకృతం కావడం, ప్రతీ చిన్న అంశాన్ని అగ్ర నాయకత్వమే నిర్ణయించడం దీర్ఘకాలంలో పార్టీకి ప్రతికూలంగా పరిణమిస్తుందని వారు ఆ లేఖలో హెచ్చరించారు. నాయకత్వ స్థాయిలో అనిశ్చితి వల్ల పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం ఆవరిస్తుందని, అది చివరకు పార్టీని బలహీన పరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నూతనంగా రూపొందే సమగ్ర, క్రియాశీల నాయకత్వంలోనూ నెహ్రూ–గాంధీ కుటుంబం కీలక భూమిక నిర్వహించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రథమ ప్రధాని నెహ్రూ దార్శనికత కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిగా కొనసాగుతుందన్నారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక బృందం సీడబ్ల్యూసీ ఎంపిక, పనితీరుపైనా వారు లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ రాజ్యాంగంలో పేర్కొన్న విధానం ద్వారా సీడబ్ల్యూసీ ఏర్పడాలన్నారు. అలాగే, కేంద్ర పార్లమెంటరీ బోర్డు, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలను మళ్లీ కొత్తగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని లేఖలో సూచించారు. ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావిస్తూ.. సాధ్యమైనంత త్వరగా పార్టీ పునరుత్తేజం కోసం చర్యలు చేపట్టాలన్నారు. వ్యవస్థీకృత, సమీకృత నాయకత్వ విధానం తక్షణావసరమన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో సీడబ్ల్యూసీ సమర్ధంగా పని చేయడం లేదని అభిప్రాయపడ్డారు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ ఓటమికి చాలా కారణాలున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. 2019 ఎన్నికలు జరిగి 14 నెలలు పూర్తయినా.. ఇప్పటికే ఆ ఓటమిపై నిష్పక్షపాత సమీక్ష జరగలేదన్నారు. దేశంలో ప్రస్తుతం అభద్రతతో కూడిన భయ వాతావరణం నెలకొని ఉందని, ఈ పరిస్థితులను ఎదుర్కొనే క్రియాశీల విపక్షంగా నిలవాల్సిన బాధ్యత కాంగ్రెస్పై ఉందన్నారు. ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ల్లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనను కూడా సీనియర్లు ఆ లేఖలో తప్పుబట్టారు. ఆ నిర్ణయం రాహుల్ గాంధీదేనన్న విషయం గమనార్హం. డీసీసీ అధ్యక్షుల నియామక నిర్ణయాన్ని పీసీసీ అధ్యక్షుడి సూచనల మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తీసుకునేలా చూడాలన్నారు. నిష్పక్షపాత విధానంలో సంస్థాగత ఎన్నికలు జరగాలని కోరారు. ప్రజాస్వామ్య, లౌకిక వేదిక ప్రజాస్వామ్య, లౌకిక శక్తులతో కూడిన దేశవ్యాప్త కూటమిని రూపొందించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించాలని సూచించారు. గతంలో కాంగ్రెస్లో ఉన్న నేతలందరినీ కూడా ఈ వేదికలో భాగస్వామ్యులను చేయాలన్నారు. మళ్లీ రాహుల్ రావాలి ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరుతూ మరి కొందరు నేతలు లేఖ రాశారు. ఎంపీ మానికం ఠాగోర్ ఈ డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ‘గాంధీలు త్యాగానికి గుర్తులు. రాహుల్ గాంధీ మళ్లీ అధ్యక్షుడు కావాలని 1,100 మంది ఏఐసీసీ సభ్యులు, 8,800 పీసీసీ సభ్యులు, 5 కోట్లమంది పార్టీ కార్యకర్తలు, 12 కోట్లమంది పార్టీ మద్దతుదారులు కోరుకుంటున్నారు’అని ఆయన పేర్కొన్నారు. గాంధీ కుటుంబమే బెస్ట్ ప్రస్తుత పరిస్థితుల్లో గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించారు. పార్టీ పునర్వ్యవస్థీకరణకు ఇది సరైన సమయం కాదన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గట్టి విపక్షం రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బలమైన, ఐక్య విపక్షం లేకపోవడం బీజేపీకి కలసి వస్తోందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడిగా.. మొత్తం పార్టీ కోరుకునే, శ్రేణులందరికీ చిరపరిచితుడైన నాయకుడు కావాలని, గాంధీ కుటుంబ సభ్యులే అందుకు సరైన వారన్నారు. కాంగ్రెస్ కార్యకర్త లేని గ్రామం దేశంలో లేదని, ఆ ఘనత గాంధీ కుటుంబం కారణంగానే సాధ్యమైందని తెలిపారు. కోరుకున్నంత కాలం సోనియాగాంధీనే ప్రెసిడెంట్గా ఉండాలని, ఆ తరువాత రాహుల్ ఆ బాధ్యతలను తీసుకోవాలని సూచించారు. సీనియర్ల లేఖ దురదృష్టకరమని రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ అన్నారు. నాయకత్వానికి సంబంధించి ఎన్నికల నిర్వహణ ఈతరుణంలో సరైన నిర్ణయం కాదని, దానివల్ల విభేదాలు పెరిగే అవకాశముందని సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. రాహుల్కు పార్టీ శ్రేణులు, నాయకుల మద్దతుందన్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం.. పార్టీ రాజ్యాంగం ప్రకారం.. సీడబ్ల్యూసీలో పార్టీ ప్రెసిడెంట్, పార్లమెంట్లో పార్టీ నేత, 23 మంది ఇతర సభ్యులు ఉంటారు. ఆ 23 మందిలో 12 మందిని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎన్నుకుంటుంది. మిగతావారిని పార్టీ ప్రెసిడెంట్ ఎంపిక చేస్తారు. 1990 నుంచి సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరగలేదు. అప్పటినుంచి, ఏకగ్రీవ మార్గంలో సీడబ్ల్యూసీ సభ్యుల ఎంపిక జరుగుతోంది. కాంగ్రెస్లో సంచలనం సృష్టించిన తాజా లేఖలో పలువురు మాజీ కేంద్ర మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ నేతలు సంతకాలు చేశారు. వారిలో గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, శశి థరూర్, పీజే కురియన్, ఆనంద్ శర్మ, మనీశ్ తివారీ, రేణుకా చౌదరి, మిలింద్ దేవ్రా, అజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, జితిన్ ప్రసాద, భూపిందర్ సింగ్ హూడా, రాజిందర్ కౌర్ భట్టల్, వీరప్ప మొయిలీ, పృథ్వీరాజ్ చవాన్, రాజ్ బబ్బర్, అరవింద్ సింగ్ లవ్లీ, సందీప్ దీక్షిత్ తదితరులున్నారు. నేడు జరగనున్న సీడబ్ల్యూసీ భేటీలో ఈ లేఖలోని అంశాలపై లోతైన, వాడి వేడి చర్చ జరిగే అవకాశముందని భావిస్తున్నారు.