-
కీకారణ్యంలో.. మాయన్ నగర శిథిలాలు! అక్కడేం జరిగిందంటే?
దట్టమైన కీకారణ్యంలో పురాతన నగరం బయటపడింది. మెక్సికోలోని బాలంకు అభయారణ్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రపాలజీ అండ్ హిస్టరీ శాస్త్రవేత్తలు అన్వేషణ జరుపుతుండగా, ఈ పురాతన మాయన్ నాగరికతకు చెందిన నగర శిథిలాలు బయటపడ్డాయి.ఇక్కడ ‘ఓకోమ్టున్’ అనే పురాతన శిలా స్థూపాలు, భారీ రాతి భవంతులు కనిపించాయి. చుట్టూ దట్టంగా భారీ వృక్షాలతో కూడిన అడవి ఉండటంతో ఈ నగరం ఇన్నాళ్లూ ఎవరికీ కనిపించలేదు. ఇది క్రీస్తుశకం 250–800 సంవత్సరాల మధ్య కాలానికి చెందినదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ నగరం 123 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ 50 అడుగుల ఎత్తున పిరమిడ్ నిర్మాణాలు, నివాస భవనాలు, బహిరంగ వేదికలు వంటివి ఉన్నాయి. ఈ వేదికలను మతపరమైన వేడుకల కోసం నిర్మించి ఉంటారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఇవి చదవండి: వానల్లో వార్మ్గా, బ్రైట్గా.. ఉండాలంటే ఇలా చేయండి.. -
పచ్చందనమే పచ్చదనమే.. పచ్చిక నవ్వుల డిజైన్స్ (ఫోటోలు)
-
కౌండిన్య.. గజరాజ్యం
ఎటుచూసినా ఆకాశాన్నంటే పచ్చదనం.. జలజలపారే సెలయేళ్లు.. అడుగడుగునా నీటిగుంటలు.. జీవాలకు సమృద్ధిగా ఆహారం.. ఇది కౌండిన్య. 353 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన దట్టమైన అడవి. అపారమైన జంతుసంపదకు ఆవాస కేంద్రం. చిత్తూరు జిల్లాలో తమిళనాడు సరిహద్దు సమీపంలోని కుప్పం మల్లప్పకొండ దగ్గర నుంచి పలమనేరులో కర్ణాటక సరిహద్దుల వరకు ఉన్న ఈ కౌండిన్య అటవీ ప్రాంతం గజరాజుల సామ్రాజ్యం.సాక్షి, చిత్తూరు: కౌండిన్య అటవీప్రాంతం వివిధ రకాల జంతుసంపదకు నిలయం. ఈ అడవిలో చిరుతపులి, తోడేలు, నక్క, అడవి రేసుకుక్క, దేవాంగపిల్లి, నక్షత్ర తాబేలు, అడవిపిల్లి, ఎలుగుబంటి, హైనా, జింక, దుప్పి, తోడేలు, ఎద్దు, కుందేళ్లు ఎక్కువగా ఉన్నాయి. పక్షి జాతుల్లో కోకిల, రామచిలుక, నెమలి, పావురాలు, పిచ్చుకలు, కొంగలు ఉన్నాయి. సర్పాల్లో కొండచిలువ, కట్లపాము, నల్లత్రాచు, రక్తపింజరిలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అటవీశాఖ లెక్కల ప్రకారం ఏనుగుల సంఖ్య ఎక్కువ. దట్టమైన ఈ అడవిలో ఏనుగుల సంతతి ఏటేటా వృద్ధిచెందుతోంది. గుంపులుగుంపులుగా అడవిలో సంచరించే ఇవి అడపాదడపా గ్రామాల్లోను స్వైరవిహారం చేస్తున్నాయి. మూడురోజులు ఏనుగుల గణనఏటా మాదిరే ఈ సంవత్సరం మే నెలలో కూడా దక్షిణ భారతదేశంలో ఏనుగులను లెక్కించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఒకేసారి మూడురోజులు ఈ గణన నిర్వహించారు. మన రాష్ట్రంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం, పార్వతీపురం, విజయనగరం జిల్లాల్లో ఏనుగుల్ని లెక్కించారు. జిల్లా అటవీప్రాంతంలోని 66 బీట్లలో ఏనుగుల్ని అటవీ సిబ్బంది లెక్కపెట్టారు. తొలిరోజు 15 కిలోమీటర్ల పరిధిలో జిగ్జాగ్ విధానంలో లెక్కించారు.రెండోరోజు కూడా అదే పద్ధతి కొనసాగించారు. చివరిరోజున నీటికుంటలు, చెరువుల వద్ద ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిఘా వేసి ఏనుగుల్ని లెక్కపెట్టారు. అడుగుజాడలు, మలమూత్ర విసర్జన, చెట్లను తోసివేయడం, సమూహం, పరిణామం ఆధారంగా వాటిసంఖ్యను లెక్కించారు. కనిపించిన ఏనుగుల ఫొటోలు తీసి, లింగనిర్ధారణ చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 200 వరకు ఏనుగులు ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు.అందులో కౌండిన్య అటవీప్రాంతంలోనే 100 నుంచి 110 వరకు ఉంటాయని అంచనా. జిల్లాలో చిత్తూరు ఈస్ట్, వెస్ట్, పలమనేరు, కుప్పం, పుంగనూరు ప్రాంతాల్లో సర్వే జరుగుతోంది. గత సంవత్సరం కంటే 10 నుంచి 20 వరకు ఏనుగులు పెరిగి ఉంటాయని భావిస్తున్నారు. కౌండిన్యలో 15 వరకు పిల్ల ఏనుగులు ఉన్నట్లు గుర్తించారు. పిల్ల ఏనుగులు ఉన్నాయంటే వాటి సంతతి బాగా పెరుగుతోందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారులు ఈ లెక్కల వివరాలను కేంద్ర అటవీశాఖకు నివేదిస్తారు. కేంద్ర అటవీశాఖ ఏనుగుల సంఖ్యను ప్రకటిస్తుంది.ఏనుగుల సంచారం ఎక్కువ ఏటా ఏనుగుల సంఖ్యపై సర్వే చేస్తున్నాం. ఈ ఏడాది టెక్నికల్గా సర్వే నిర్వహించాం. ఫ్లగ్ మార్క్స్ ఆధారంగా బ్లాగ్ సర్వే చేశాం. వివరాలను సిబ్బంది ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేశారు. తుది నివేదికను కేంద్ర అటవీశాఖకు అందజేశాం. కుప్పం, పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. – చైతన్యకుమార్రెడ్డి, డీఎఫ్వో -
అడవి బిడ్డల ఆనందం
సాక్షి, అమరావతి: అడవిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన తెగలు ప్రగతి బాటలో పురోగమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్వోఎఫ్ఆర్ పట్టాల జారీ, దేశంలో తొలిసారిగా ఏజన్సీ రైతులకు రైతు భరోసా లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు గిరిజనాభివృద్ధికి ఊతమిస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, అటవీ సంపదతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసింది. అడవితో ముడిపడిన గిరిజనుల జీవితం అక్కడి నుంచే అభివృద్ధి చెందేలా బాటలు వేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణతోపాటు వ్యవసాయం, పోడు భూముల సాగును ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తోంది. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ తాజాగా నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే నేతృత్వంలో ఇ.రవీంద్రబాబు, జి.చిన్నబాబు, నాగరాజు చిక్కాల రూపొందించిన నివేదికను గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు జె.వెంకట మురళి ఆవిష్కరించారు. గిరిజన యువత, కళాకారులు, నాయకులు, అధికారులతో సహా పలువురిని భాగస్వాములను చేశారు. ఆర్వోఎఫ్ఆర్, పీసా, 1 ఆఫ్ 70 చట్టాలు, గిరిజన జీవనోపాధి, సంప్రదాయ కళారూపాలు, అభివృద్ధి ప్రాంతాలను పరిశీలించడంతోపాటు గిరిజనులకు సంబంధించిన పలు పుస్తకాలను అధ్యయనం చేశారు.సాగు.. నైపుణ్యాభివృద్ధి.. మార్కెటింగ్పాడేరు, రంపచోడవరం, సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో 16 గ్రామాల్లో అధ్యయనం నిర్వహించి నివేదిక రూపొందించారు. సాగు, నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్ ద్వారా గిరిజనులకు మరింత మేలు చేయవచ్చని నివేదిక సూచించింది. పంటల సాగులో మెళకువలతోపాటు నైపుణ్యాభివృద్ధి చర్యల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొంది. నల్ల మిరియాలు, మిర్చి, కొండ చీపుర్లు లాంటి అటవీ ఉత్పత్తులు, సాగును ప్రోత్సహించడం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించవచ్చని సూచించింది. ప్రధానంగా అత్యంత బలహీన గిరిజన సమూహాలైన (పీవీటీజీ) మూక దొర, భగత, కొండ దొర, సవర, కొండ రెడ్డి తెగల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆదాయం లభించేలా కొండ చీపుర్లు, గడ్డి పెంపకం, మార్కెటింగ్ నైపుణ్యాలపై శిక్షణ, అవగాహన కల్పించాలని నిర్దేశించింది. కాఫీ తోటల్లో అంతర పంటలుగా నల్ల మిరియాల సాగును ప్రోత్సహించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచవచ్చు. దీంతోపాటు మిర్చి రకాల సాగుపై అవగాహన పెంచడం, అధిక దిగుబడులు సాధించేలా పరిజ్ఞానాన్ని అందించడం, మంచి ధర దక్కేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవడం ద్వారా గిరిజనులకు మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుందని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అధ్యయనంలో పేర్కొంది.అడవి బిడ్డలకు అండగా సీఎం జగన్⇒ గిరిజనులకు ముఖ్యమంత్రి జగన్ కొండంత అండగా నిలిచారు. నవరత్నాల సంక్షేమ పథకాలను అందించి ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు భూమిపై హక్కులు కల్పించి సాగుకు ఊతమిచ్చారు. సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో గిరిజన కుటుంబాలకు ఏకంగా 3.22 లక్షల ఎకరాలను అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్ఆర్) ప్రకారం పట్టాలు అందించడం దేశంలోనే రికార్డు. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీకి దివంగత వైఎస్సార్ శ్రీకారం చుట్టగా సీఎం జగన్ ఆర్వోఎఫ్ఆర్ పట్టాలతోపాటు డీకేటీ పట్టాలు పంపిణీ చేసి ఆ భూములను సాగులోకి తెచ్చేందుకు ఉపాధి హామీతో చేయూతనందించారు. ⇒ దేశంలోనే తొలిసారిగా సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా 3,40,043 మంది గిరిజన రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. 90 శాతం సబ్సిడీతో విత్తనాలు, బిందు, తుంపర సేద్యం పరికరాలు సమకూర్చారు. అల్లూరి జిల్లాలో 2,58,021 ఎకరాల్లో కాఫీ సాగు చేస్తున్న దాదాపు 2,46,139 మంది గిరిజన రైతులకు అన్ని విధాలా అండంగా నిలిచారు. కాఫీ తోటల సాగుకు సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ, పెట్టుబడి సాయం, రుణాలు, యంత్రాలు లాంటివి అందించారు. అంతర పంటగా మిరియాల సాగుకు అవసరమైన పరికరాలు అందించారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర దక్కేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే అధికంగా జీసీసీ చెల్లిస్తోంది. శ్రీశైలం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనుల ద్వారా సేకరిస్తున్న తేనెను రాజమహేంద్రవరం, చిత్తూరులోని జీసీసీ తేనె శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసి ‘గిరిజన్‘ బ్రాండ్తో మార్కెటింగ్ చేస్తున్నారు. గిరిజన రైతులకు వ్యవసాయం, కాఫీ సాగుకు జీసీసీ రుణాలు అందచేస్తోంది. -
హిమాచల్ అడవుల్లోనూ కార్చిచ్చు
ఉత్తరాఖండ్లో మాదిరిగానే హిమాచల్ ప్రదేశ్లోని అడవుల్లోనూ కార్చిర్చు కనిపిస్తోంది. సోలన్, మండి, కాంగ్రాలో కోట్లాది రూపాయల విలువైన అటవీ సంపద బూడిదగా మారింది. తాజాగా హిమాచల్లోని మండీ జిల్లా ధరంపూర్ మండప్ గ్రామ అడవుల్లోకి మంటలు వ్యాపించాయి. సోలన్ సమీపంలోని అడవిని కూడా మంటలు చుట్టుముట్టాయి. ఈ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండటం లేదు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం సోలన్ సమీపంలోని కాలాఘాట్లో తాజాగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అటవీ శాఖ ఉద్యోగులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా మంటలు అదుపులోకి రాలేదు. అడవుల్లో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. దీంతో అటవీ శాఖ ఉద్యోగులు స్థానికులను సహాయం కోసం అభ్యర్థించారు. ఎనిమిది గంటలపాటు ఎదురు చూసినా అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకోలేదు.అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ నీలం ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ చాలాసేపటి నుంచి తాము మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నామని, స్థానికుల సహాయం కూడా అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగులు ప్రాణాలను పణంగా పెట్టి మంటలను ఆర్పుతున్నారన్నారు. -
ఉత్తరాఖండ్ నిర్లక్ష్యం
నిర్లక్ష్యం మంటల్లో నిత్యం దహించుకుపోతున్న ఉత్తరాఖండ్ అడవులపై సర్వోన్నత న్యాయస్థానం దృష్టిసారించటం, సంజాయిషీ కోరడం హర్షించదగిన పరిణామం. ఈ మంటల్లో చిక్కుకుని ఇంతవరకూ అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇతర జీవరాశులకు కలిగిన నష్టమెంతో తెలియదు. హిమాలయ సానువుల్లో కొలువుదీరి పర్యావరణ పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న ఈ అడవులపై అధికార యంత్రాంగం ప్రదర్శిస్తున్న అంతులేని నిర్లక్ష్యం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాతావరణపరంగా ఉత్తరాఖండ్లో, పొరుగునున్న హిమాచల్ప్రదేశ్లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ రెండుచోట్లా శీతాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన గాలులు వీస్తాయి. అంతకుముందు విపరీతంగా మంచుకురుస్తుంది. దేవదారు వృక్షాలనుంచి రాలిపడిన ఆకులతో కొండ ప్రాంతాలన్నీ నిండిపోతాయి. ఈ ఆకులు మామూలుగా అయితే చిన్న నిప్పురవ్వ తగిలినా భగ్గునమండుతాయి. కానీ ఆ సమయంలో పడే వర్షాలతో అటవీప్రాంతమంతా చిత్తడిగా మారిపోతుంది. వేసవిలో కూడా ఇదే స్థితి కొనసాగుతుంది. అయితే వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఇదంతా తారుమారైంది. నవంబర్ నుంచే అడవుల్లో అగ్నికీలలు కనబడ్డాయి. ఈ పరిణామాన్ని అంచనా వేయటం పెద్ద కష్టం కాదు. కొండ ప్రాంతమంతా రాలిన ఆకులతో నిండినప్పుడు, ఎండలు మండుతున్నప్పుడు ఏం జరుగుతుందో గత అనుభవాలే చెబుతున్నాయి. దీనికితోడు పొగరాయుళ్లు నిర్లక్ష్యంగా పడేసే చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి కూడా ప్రమాదాలు తెస్తున్నాయి. మాఫియాల బెడద సరేసరి. అటవీ భూములు అందుబాటులోకొస్తే కోట్లు గడించవచ్చని ఉద్దేశపూర్వకంగా అడవుల్ని తగలబెడుతుంటారు. వీరికి రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉంటాయి. ఇక కొండప్రాంతాలకు సమీపంలో పంట వ్యర్థాలను కళ్లాల్లోనే తగలబెట్టే అలవాటు అధికం. ఇది కూడా అడవులు అంటుకోవటానికి కారణమవుతోంది. ఇలాంటివారినుంచి అడవుల్ని కాపాడటానికీ, నిప్పు జాడ కనుక్కుని వెనువెంటనే ఆర్పడానికీ కొండలపై గార్డులు గస్తీ కాస్తుంటారు. కానీ వారంతా ఎన్నికల విధులు నిర్వర్తించటానికి తరలిపోయారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన దాఖలా లేదు. అందువల్లే ఈ దఫా ఇంతవరకూ 1,400 హెక్టార్ల అడవి తగలబడిందని ఒక అంచనా. గత నెలనుంచి చూసుకున్నా అడవులు అంటుకున్న ఉదంతాలు ఒడిశా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్లతో పోలిస్తే ఉత్తరాఖండ్లోనే అధికమని ఈమధ్య ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ) డేటా తెలిపింది. ఉత్తరాఖండ్లో దాదాపు 24,305 చదరపు కిలోమీటర్లమేర అడవులున్నాయి. రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో ఇది 44.5 శాతం. ఇంత విస్తారంగా అడవులున్న రాష్ట్రం వాటిని ప్రాణప్రదంగా చూసుకోవద్దా? కొండలపై రాలిపడే ఆకుల్ని ఏరేందుకూ, తామరతంపరగా పెరిగే గడ్డి మొక్కల్ని తొలగించటానికీ, అగ్ని ప్రమాదాల నివారణకూ మనుషుల్ని నియమించాలి. ఇందుకోసం ఏటా దాదాపు రూ. 9 కోట్లు ఖర్చవుతుందని అంచనా. కానీ చిత్రమేమంటే ప్రభుత్వం కేవలం రూ. 3.15 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. మంటల జాడ లేకుండా చూడాలే తప్ప, ఒకసారి అంటుకుంటే అదుపు చేయటం అంత సులభం కాదు. ఈ నెల మొదట్లో అడవులు తగలబడుతున్నప్పుడు వైమానిక దళ హెలికాప్టర్లు రంగంలోకి దిగి వేలాది లీటర్ల నీటిని వెదజల్లాయి.ఈ చర్య కొంతమేర ఉపయోగపడినా అనుకోకుండా కురిసిన భారీ వర్షంతో పరిస్థితి అదుపులోకొచ్చింది. ఇలా ప్రతిసారీ జరుగుతుందని ఆశిస్తూ కూర్చుంటే అంతా తలకిందులవుతుంది. తమకున్న అడవుల్లో కేవలం 0.1 శాతం ప్రాంతంలో మాత్రమే మంటల బెడద ఉన్నదని ఉత్తరాఖండ్ దాఖలుచేసిన అఫిడవిట్ తెలిపింది. ఎంత శాతమని కాక, ఏమేరకు ముందస్తు ప్రణాళికలు అమలు చేస్తున్నామో, వాటి లోటుపాట్లేమిటో అధ్యయనం చేస్తున్న దాఖలా లేదు. ఎంత ప్రాంతంలో వృక్షాలు దెబ్బతిన్నాయో లెక్కలు చెబుతున్నారు. కానీ పర్యావరణానికి కలిగే నష్టం ఎవరూ గమనించటం లేదు. అగ్ని ప్రమాదాలవల్ల వాతావరణంలో కార్బన్డై ఆక్సైడ్ పరిమాణం పెరుగుతుంది. నేలల్లో తేమ తగ్గిపోతుంది. పోషకాలు కూడా కనుమరుగవుతాయి. వీటికి సంబంధించిన డేటా ప్రభుత్వం దగ్గర ఉందో లేదో తెలియదు. నిజానికి ఇలాంటి డేటాతో స్థానిక ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే, అడవులు తగలబడటంవల్ల భవిష్యత్తులో ఎన్ని చిక్కులు ఏర్పడే అవకాశమున్నదో చెబితే వారే స్వచ్ఛంద సైనికుల్లా ముందుకొస్తారు. అడవులను కాపాడతారు. మాఫియాలను కట్టడి చేసేందుకు సైతం సంసిద్ధులవుతారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఆ రకమైన చొరవేది?ఉత్తరాఖండ్ అడవులు విశిష్ఠమైనవి. అక్కడ రెండు టైగర్ రిజర్వ్లున్నాయి. పక్షుల సంరక్షణ కేంద్రాలున్నాయి. ఇక్కడి గాలులు మోసుకెళ్లే ఆక్సిజన్ కారణంగానే కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ నగరం ఆ మాత్రమైనా ఊపిరి పీల్చుకోగలుగుతోంది. ఇక్కడి వృక్షాలవల్ల హిమాలయాల్లోని మంచుపర్వతాలు ఒక క్రమపద్ధతిలో కరిగి జీవనదులు పారుతున్నాయి. ఇంతటి అపురూపమైన అడవులు మానవ నిర్లక్ష్యం కారణంగా నాశనం కావటం అత్యంత విషాదకరం.ఎంత ప్రాంతమని కాదు...అడవిలోని ఒక్క వృక్షమైనా మన నిర్లక్ష్యంవల్ల, తప్పిదాలవల్ల నేలకొరగరాదన్న దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తే, దానికి అనుగుణమైన చర్యలు తీసుకుంటే అడవులు కళకళలాడతాయి. మనుషులు మాత్రమే కాదు...సకల జీవరాశులూ సురక్షితంగా ఉంటాయి. సర్వోన్నత న్యాయస్థానం జోక్యంవల్ల ఇదంతా నెరవేరితే అంతకన్నా కావాల్సిందేముంది? -
అడవుల్లో ఆరని మంటలు.. చల్లార్చే పనిలో 30 గ్రామాల ప్రజలు!
ఉత్తరాఖండ్లోని అడవుల్లో చెలరేగుతున్న మంటలు చల్లారడం లేదు. తాజాగా అల్మోరా జిల్లాలోని అడవిలో మంటలను ఆపేందుకు 30 గ్రామాల ప్రజలు నిరంతరం శ్రమిస్తున్నారు.7.5 హెక్టార్లలో విస్తరించి, జిల్లాకే మోడల్ ఫారెస్ట్గా పేరుగాంచిన శ్యాహీదేవి-శీతలఖేత్ అటవీప్రాంతాన్ని కాపాడటంతోపాటు తమ పొలాలు, గడ్డివాములను రక్షించుకునేందుకు ఆయా గ్రామాల్లోని ప్రజలంతా అటవీ ప్రాంతాన్ని చల్లార్చేపనిలో పడ్డారు. వీరు తమ తిండితిప్పలను కూడా అడవుల్లోనే కొనసాగిస్తున్నారు.2003 నుంచి శ్యాహీదేవి-శీతలఖేత్ అడవులను అభివృద్ధి చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఆరోగ్య శాఖకు చెందిన ఫార్మసిస్ట్ గజేంద్ర కుమార్ పాఠక్ ఆధ్వర్యంలో ‘సేవ్ జంగిల్’ పేరుతో 30 గ్రామాల ప్రజలు అటవీ శాఖ సహాయంతో ఓక్, బురాన్ష్, ఫాల్యంట్ తదితర జాతుల అడవులను అభివృద్ధి చేశారు.ప్రస్తుతం ఈ అడవుల్లో మంటలు చెలరేగుతుండటంతో గ్రామస్తులు పగలనక రాత్రనక మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. అడవిలో మంటలు తాడిఖేట్లోని సుదూర గ్రామానికి చేరుకున్నాయి. తమ ఇళ్లు, పొలాలు, గడ్డివాముల గురించి ఆందోళన చెందుతున్న గ్రామస్తులు అటవీ మంటలను చల్లాచ్చే పనిలో తలమునకలవుతున్నారు. గ్రామస్తులు తీవ్రంగా శ్రమించి గ్రామంలోకి మంటలు వ్యాపించకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. -
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు రగులుతూనే ఉంది. అల్మోరా, బాగేశ్వర్ సహా పలు జిల్లాల్లో అడవులు తగలబడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి రాష్ట్రంలోని అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లకు లేఖ రాశారు. అడవుల్లోని మంటలను అదుపు చేసేందుకు నిరంతం చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆ లేఖలో కోరారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం గత సంవత్సరం నవంబర్ ఒకటి నుండి ఇప్పటివరకూ ఉత్తరాఖండ్ అడవులలో మొత్తం 910 అగ్నిప్రమాదాలు సంభవించాయి. దాదాపు 1,145 హెక్టార్ల అటవీప్రాంతం ప్రభావితమైంది. రాష్ట్రంలో అడవుల్లోని కార్చిర్చు అదుపు చేయడం గురించి ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. అడవుల్లో చెలరేగున్న మంటల కారణంగా ఇప్పటివరకు ఐదుగురు మరణించారు. అలాగే అడవుల నుంచి వెలువడుతున్న పొగ కారణంగా స్థానికులు ఊపిరి పీల్చుకోవడంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బరాహత్ శ్రేణి అడవుల్లో గురువారం సాయంత్రం వ్యాపించిన మంటలు ఇప్పటి వరకూ పూర్తిగా అదుపులోకి రాలేదు. తాజాగా ముఖెంరేంజ్లోని డాంగ్, పోఖ్రీ గ్రామానికి ఆనుకుని ఉన్న అడవితో పాటు దుండా రేంజ్లోని చామ్కోట్, దిల్సౌద్ ప్రాంతంలోని అడవులు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. ధరాసు పరిధిలోని ఫేడీ, సిల్క్యారాకు ఆనుకుని ఉన్న అడవులు కూడా తగడలబడుతున్నాయి. అటవీ శాఖ అందించిన సమాచారం ప్రకారం ఉత్తరకాశీ అటవీ డివిజన్లో 19.5 హెక్టార్ల అడవి మంటల కారణంగా కాలి బూడిదైంది. -
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
ఉత్తరాఖండ్లోని కుమావోన్ డివిజన్లోని అటవీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అడవుల్లోని కార్చిచ్చును ఆర్పేందుకు స్థానిక యంత్రాంగం మొదలుకొని, సైన్యం కూడా అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఇంతవరకు మంటలు అదుపులోకి రాలేదు. హెలికాప్టర్ నుంచి బాంబీ బకెట్ ద్వారా అడవుల్లోని మంటలను అదుపు చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నిస్తోంది. ఇంతకీ బాంబీ బకెట్ అంటే ఏమిటి? అది అగ్ని కీలలను ఎలా నియంత్రిస్తుంది?అటవీ ప్రాంతంలో వ్యాపిస్తున్న మంటలను అదుపు చేసేందుకు నైనితాల్ పరిసర ప్రాంతాలలో భారత వైమానిక దళం ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ను వినియోగిస్తోంది. దీనిసాయంతో బాంబీ బకెట్ల ద్వారా అడవుల్లో నీటిని వెదజల్లుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా బాంబీ బకెట్లను హెలికాప్టర్లుకు అనుసంధానం చేస్తూ, అడవుల్లో చెలరేగే మంటలను అదుపు చేస్తున్నారు.బాంబీ బకెట్ అనేది ఒక ప్రత్యేక వైమానిక అగ్నిమాపక సామగ్రి. దీనిని 1980 నుండి వినియోగిస్తున్నారు. ఇది హెలికాప్టర్ నుంచి తేలికగా తెరవగల కంటైనర్. దిగువన ఉన్న ప్రాంతాలకు దీని ద్వారా నీటిని విడుదల చేయవచ్చు. బాంబీ బకెట్ వివిధ పరిమాణాలు, నమూనాలలో అందుబాటులో ఉంది. దీని సామర్థ్యం 270 లీటర్ల నుండి 9,840 లీటర్లకు మించి ఉంటుంది.బాంబీ బకెట్ను 1982లో కెనడియన్ వ్యాపారవేత్త డాన్ ఆర్నీ కనుగొన్నారు. ఈ బకెట్లను ఫైబర్గ్లాస్, ప్లాస్టిక్ కాన్వాస్తో మెటల్ ఫ్రేమ్తో తయారు చేస్తారు. ఇది హెలికాప్టర్లో బాహ్య ట్యాంక్ మాదిరిగా కనిపిస్తుంది. దీనిలో నీటిని ఎక్కడి నుండైనా నింపవచ్చు. అడవుల్లో కార్చిచ్చు నియంత్రణకు బాంబీ బకెట్లు ఎంతగానో ఉపయక్తమవుతాయి. -
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు.. రంగంలోకి దిగిన ఆర్మీ
ఉత్తరాఖండ్లోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు నైనిటాల్ నగరం వరకు విస్తరిస్తోంది. మంటల కారణం పొగ కమ్ముకుంటుంది. ప్రస్తుతం మంటలు నైనిటాల్ హైకోర్టు కాలనీవైపు విస్తరిస్తున్నాయి. దీంతో అప్రత్తమైన ఉత్తరఖండ్ ప్రభుత్వం మంటలు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం కోరింది. దీంతో మంటలు ఆర్పడానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగింది. ఆర్మీ అధికారులు హెలికాప్టర్ల సాయంతో చెలరేగతున్న మంటలపై నీటిని వెదజల్లుతూ ఆర్పుతున్నారు. నైనిటాల్ లేక్లో బోటింగ్ సేవలు నిలిపిస్తున్నట్లు అధికారాలు ప్రకటన విడుదల చేశారు.‘ఇప్పటివరకు హైకోర్టు కాలనీకి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. కానీ మంటలు ప్రమాదకారంగా పలు భవనాలకు సమీపంగా చేరుకుంటుంది’ అని హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రాటర్ తెలిపారు. నైనిటాల్ జిల్లాలోని లారియా కాంటా అడవుల్లో కూడా మంటలు వ్యాపించగా.. అక్కడి ఐటీఐ భవనం పాక్షికంగా దెబ్బతింది. అడవులకు నిప్పు పెట్టారన్న అనుమానాలు ఉన్న ముగ్గురు వ్యక్తులను రుద్రప్రయాగ్లో అరెస్ట్ చేసినట్లు ఫారెస్ట్ డివిజినల్ అఫీసర్ అభిమాన్యూ తెలిపారు.ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అడవుల్లో చెలరేగిన మంటలపై శనివారం సమీక్ష నిర్వహించారు. మంటలు ఆర్పడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గడిచిన వారం రోజుల్లో అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారు 31 కొత్త అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. -
అగ్గి రాజుకుంటోంది
సాక్షి, హైదరాబాద్ : అడవుల్లో ‘అగ్గి’ రాజుకుంటోంది. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో అడవుల్లో అగ్నిప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే 1,500లకు పైగా అగ్నిప్రమాదాలు రిపోర్ట్ కాగా నల్లమల, ములుగు, ఇతర ప్రాంతాల్లోని 6 వేల హెక్లార్లలో అటవీభూమికి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ♦ రాష్ట్రంలోని మూడోవంతు దాకా అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు /ప్రమాదాలు పొంచి ఉన్నాయని, అడవులకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో (ఫారెస్ట్ ఫ్రింజ్ ఏరియా) మూడో వంతు అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి అగ్ని ప్రమాదా లకు సంబంధించి పదిహేను ఏళ్లుగా సేకరించిన సమాచారం, డేటా ఆధారంగా చేసిన విశ్లేషణల్లో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. ♦ తెలంగాణవ్యాప్తంగా మూడువేలకు పైగా ఫారెస్ట్ బీట్లు ఉన్నాయి. ప్రతీ ఫారెస్ట్ బీట్లో ఫైర్బ్లోయర్లు, రేక్స్, పారలు, ఫైర్ బీటర్స్, సిబ్బందికి అగ్నినిరోధక దుస్తులు, బూట్లు, హెల్మెట్లు వంటివి అందుబాటులో ఉండాలి. అయితే ప్రస్తుతం 550 ఫైర్బ్లోయర్లు ఉండగా వాటిలో పదిశాతం వరకు మరమ్మతులు చేయాల్సి ఉందని సమచారం. ♦ వేసవిలో అగ్నిప్రమాదాలు అధికంగా జరిగే అవకాశమున్న రోజులలో (పీక్ సీజన్లో) కేవలం 95 ‘క్విక్ రెస్పాన్స్ టీమ్స్’ క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్నట్టుగా వెల్లడైంది. దీనిని బట్టి అడవుల్లో అగ్నిప్రమాదాల నియంత్రణకు సంబంధించి అధికా రులు పూర్తిస్థాయిలో సన్నద్ధమై లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ వాదనను అటవీశాఖ అధికారులు ఏకీభవించడం లేదు. ♦ ములుగు, అమ్రాబాద్, ఇతర అటవీ ప్రాంతాల్లో కావాలనే అగ్ని ప్రమాదాలకు పాల్పడుతున్న వారిని గురించి వన్యప్రాణి పరిరక్షణ చట్టం కింద కేసులు పెట్టామని, ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి వాటికి పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు అత్యధికంగా మానవ తప్పిదాలతోనే ఈ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, అయితే ఇవి చిన్న చిన్నవే కావడంతో ఎక్కువ నష్టం జరగకుండా ఆర్పేస్తున్నామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అటవీశాఖ ‘ఫారెస్ట్ఫైర్స్’ చాలా దగ్గరగా పర్యవేక్షిస్తోందని, ఈ మంటల అదుపునకు వెంటనే చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 21,739 కి.మీ పరిధిలో ఫైర్లైన్స్ వేయడంతో పాటు, అడవులకు ఆనుకుని 11వేల కి.మీలలో ‘పెరిఫెరల్ ట్రెంచెస్’ తవ్వి మంటల అదుపునకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అరణ్యభవన్లో రాష్ట్రస్థాయిలో ఫైర్ మానిటరింగ్, కంట్రోల్ సెల్ ఏర్పాటు చేసి 24 గంటలు పర్యవేక్షిస్తూ ,ఫైర్ అలర్ట్స్ కోసం టోల్ఫ్రీ నంబరు, వాట్సాప్నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. అగ్గి ప్రమాదాలకు అవకాశం ఇలా.. ♦ రాష్ట్రంలో మొత్తం 53 అటవీ డివజన్లు ఉండగా, వాటిలో 23 దాకా హై–ఫైర్ ప్రోన్గా గుర్తించారు ♦ 1,208 ఫారెస్ట్ రేంజ్లకు గాను 45 రేంజ్లలో హై–ప్రోన్ రేంజేస్గా ఉన్నాయి ♦ పదివేల ఫారెస్ట్ కంపార్ట్ మెంట్లు (ఒక్కోటి 250 నుంచి 500 హెక్టార్లు కవర్ చేస్తుంది) ఉన్నాయి ♦ వీటిలో 1,120 కంపార్ట్మెంట్ల (హై–ఫైర్ ప్రోన్) దాకా పెద్ద అగ్నిప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు ♦ 1,700లదాకా మధ్యంతరంగా (మీడియం–ఫైర్ప్రోన్) అగ్నిప్రమాదాలకు ఎక్కువ అవకాశాలు ♦ 4,260 దాకా అటవీ సమీప గ్రామాల్లో అగ్నిప్రమాదాలకు అవకాశం ♦ వీటిలో 1,250లకుపైగానివాస ప్రాంతాల్లో అత్యధికంగా ప్రమాదాలు జరిగే చాన్స్. -
ఎండల ఎఫెక్ట్.. నీటి కోసం వచ్చి గుంటలో పడ్డ ఏనుగు
చెన్నై: దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. మనుషులతో పాటు మూగజీవాల గొంతులు కూడా ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఎండల దెబ్బకు అడవుల్లో ఉండే సహజ నీటి వనరులన్నీ ఎండిపోయి అక్కడ నివసించే వన్యప్రాణులు దాహంతో అల్లాడిపోతున్నాయి. తమిళనాడులోని సత్యమంగళం అడవులపై కూడా ఎండల ఎఫెక్ట్ పడింది. అడవిలో దాహం తీర్చుకునేందుకు నీళ్లు లేకపోవడంతో ఓ ఆడ ఏనుగు అక్కడికి సమీపంలో ఉన్న పళనిచామి గుడి వద్దకు వచ్చింది. నీటి కోసం వెతుక్కుంటుండగా ప్రమాదవశాత్తూ అక్కడే ఉన్న గుంటలో పడిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే స్పందించారు. ఏనుగు వద్దకు ఒక వెటర్నరీ డాక్టర్ నేతృత్వంలో మెడికల్ టీమ్ను పంపించారు. ఏనుగును గుంటలో నుంచి బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదీ చదవండి.. దోమలు బాబోయ్ దోమలు -
అడవి తల్లిని వీడం.. బయటకెళ్లి బతకలేం
సాక్షి, నాగర్కర్నూల్: అడవి నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లేందుకు చెంచులు తీవ్ర విముఖత చూపుతున్నారు. ఏళ్లుగా అడవినే నమ్ముకుని జీవిస్తున్న తాము బయటకు వెళ్లి బతకలేమని, తాము అడవిలోనే ఉంటామని తేల్చి చెబుతున్నారు. అడవుల్లో పులులకు ఆటంకం లేకుండా జనసంచారాన్ని తగ్గించడంతోపాటు మానవులకు, వన్యప్రాణులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని తగ్గించే పేరిట నట్టడవిలోని చెంచులను మైదాన ప్రాంతాలకు తరలించాలని అటవీ అధికారులు నిర్ణయించడం తెలిసిందే. ఈ మేరకు నల్లమల అటవీప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న సార్లపల్లి చెంచుపెంట వాసులను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నాగర్కర్నూల్ జిల్లా డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీ నుంచి రీలొకేషన్కు అనుమతి రావడంతో ఈ నెల 5న గ్రామస్తుల నుంచి ఒప్పందాలపై సంతకాల సేకరణ ప్రారంభించింది. రీలొకేషన్లో భాగంగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, లబ్ధిదారుల మధ్య ఎంఓయూ కోసం అటవీశాఖ అధికారులు గ్రామస్తులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో 2–3 నెలల్లోనే సార్లపల్లి వాసుల రీలొకేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. సార్లపల్లి తర్వాత విడతల వారీగా కుడిచింతలబైల్, కొల్లంపెంట, కొమ్మెనపెంట వాసులను సైతం అడవి బయటకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్యలను చెంచులు వ్యతిరేకిస్తున్నారు. తమను అడవి బయటకు తరలించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. మల్లాపూర్ పెంటలోని చెంచుల ఆవాసాలు ఎనీ్టసీఏ ద్వారా పునరావాస ప్యాకేజీ.. అయినా చెంచులు విముఖం అడవి లోపల నివసిస్తున్న వారిని బయటకు తరలిస్తే ఒక్కో కుటుంబానికి ఎన్టీసీఏ ద్వారా రూ.15 లక్షల పునరావాస ప్యాకేజీ అందించనుంది. వీరి పునరావాసం కోసం నాగర్కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద అటవీశాఖకు చెందిన స్థలాన్ని కేటాయించారు. రూ.15 లక్షల ప్యాకేజీ వద్దనుకుంటే బాచారం వద్ద 220 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం, జీవనోపాధి కోసం 5 ఎకరాల వ్యవసాయ భూమిని అందజేస్తారు. సార్లపల్లిలో 269 కుటుంబాలు ఉండగా, వాటిలో 83 కుటుంబాలే చెంచులు. మిగతా కుటుంబాల్లో ఇతర వర్గాల సంఖ్యే ఎక్కువగా ఉంది. ఎనీ్టసీఏ ప్యాకేజీకి ఇప్పటివరకు 186 కుటుంబాలు ఒప్పుకోగా వాటిలో చెంచు కుటుంబాలు ఆరే ఉన్నాయి. అడవి నుంచి బయటకు తరలింపునకు మెజార్టీ శాతం చెంచు కుటుంబాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. కనీస సౌకర్యాలకు దూరం.. నల్లమల అటవీప్రాంతంలో మొత్తం 88 ఆవాసాల్లో చెంచులు నివసిస్తున్నారు. వీటిలో 20 ఆవాసాలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కోర్ ఏరియాలో ఉన్నాయి. అడవిలో అటవీ శాఖ ఆంక్షల నేపథ్యంలో ఇక్కడి చెంచులు కనీస మౌలిక సదుపాయాలకు సైతం నోచుకోవడం లేదు. అడవిలో ఉన్న అప్పాపూర్ గ్రామ పంచాయతీ మినహా మరెక్కడా చెంచుపెంటల్లో కనీసం అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాల, వైద్యశాల లేవు. మేం అడవిలోనే ఉంటాం.. బయటకు పోలేం ఏళ్లుగా తాతల కాలం నుంచి అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. మేం బయటకు పోయి జీవించలేం. మా వల్ల వన్యప్రాణులు, పులులకు ఎలాంటి హాని లేదు. ఇప్పుడు కూడా ఉండదు. దయచేసి మమ్మల్ని అడవి నుంచి విడదీయద్దు. మేమంతా అడవిలోనే ఉంటాం. –చిగుర్ల లింగమ్మ, చెంచు మహిళ, సార్లపల్లి, అమ్రాబాద్ మండలం, నాగర్కర్నూల్ జిల్లా మమ్మల్ని ఆగం చేయొద్దు.. అడవిలో ప్రశాంతంగా ఉన్న మమ్మల్ని ఆగం చేయద్దు. మేం బయటి ప్రపంచంలో బతకలేం. బాచారం లాంటి మైదాన ప్రాంతాలకు తరలిస్తే అక్కడ ఏజెన్సీ నియమాలు, హక్కులు వర్తించవు. మైదాన ప్రాంతాల్లో ఉన్న చెంచులు మాకంటే దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. – కుడుముల మల్లేశ్, చెంచు యువకుడు, సార్లపల్లి స్వచ్ఛందంగా ముందుకొస్తేనే.. టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో జంతు సంరక్షణ కోసమే స్థానికులకు మరోచోట పునరావాసం కలి్పస్తున్నాం. రీ లొకేషన్లో ఒత్తిడి లేదు, స్వచ్ఛందంగా ముందుకొస్తేనే తరలింపు ఏర్పాట్లు చేస్తున్నాం. – రోహిత్ గోపిడి, డీఎఫ్ఓ, నాగర్కర్నూల్ జిల్లా -
పశ్చిమ కనుమలలో ప్రాణదాతలు
‘ప్రాణదాత’ అనే మాట మనుషులకు సంబంధించే ఎక్కువగా వినబడుతుంది. ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’లోని మహిళలు మాత్రం పశ్చిమ కనుమల అరణ్యాలలోని మొక్కల ప్రాణదాతలు. ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మొక్కలు, చెట్లను కాపాడడానికి ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ ద్వారా మొక్కవోని కృషి చేస్తున్నారు. పచ్చటి అడవి పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోకుండా కష్టపడుతున్నారు... పశ్చిమ కనుమల అడవులు అపూర్వమైన చెట్లజాతులు, జంతుజాలం, పక్షి, చేప జాతులకు ప్రసిద్ధి పొందాయి. అయితే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయుసిఎన్) పశ్చిమ కనుమల గురించి ఆందోళన వ్యక్తం చేసింది. అటవీ నిర్మూలన, వాతావరణ మార్పుల వల్ల మన దేశంలోని పశ్చిమ కనుమలు ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్రాంతంలోని అడవులను రక్షించుకోవడానికి, జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి కేరⶠలోని పెరియాలో ఎన్నో సంవత్సరాల క్రితం ఏర్పాటైన ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ లోని ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’ కృషి చేస్తోంది. 27 మంది మహిళలు ఉన్న ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’ ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’లో అరుదైన మొక్కలను సంరక్షిస్తోంది. ‘మొక్కలను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాం. ప్రమాదంలో ఉన్న మొక్కలకు ఈ గురుకులం శరణార్థి శిబిరంలాంటిది. ఆస్పత్రి కూడా అనుకోవచ్చు. మొక్కలకు సంబంధించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మట్టిపాత్రలతో ఉంటుంది’ అంటుంది ఎకోసిస్టమ్ గార్డెనర్ సుప్రభా శేషన్. తొంభై శాతం అడవులు మాయమైన పరిస్థితిని ‘పర్యావరణ మారణహోమం’గా అభివర్ణిస్తుంది సుప్రభా శేషన్. అడవులనే ఇల్లుగా భావిస్తున్న సుప్రభ శేషన్ ‘గ్రీన్ ఆస్కార్’గా గుర్తింపు పొందిన యూకేలోని టాప్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ‘విట్లీ’కి ఎంపికైంది. గురుకుల బొటానికల్ శాంక్చువరీ (జీబిఎస్) అరుదైన మొక్కల ‘స్వర్గధామం’గా పేరు తెచ్చుకుంది పశ్చిమ కనుమల ప్రాంతాలలో 50 లక్షల మందికి పైగా నివసిస్తున్నందున అడవులు ప్రమాదం అంచున ఉన్నాయి. 28 ఏళ్లుగా ‘జీబిఎస్’లో పనిచేస్తున్న సుప్రభా శేషన్ అరణ్యాలకు సంబంధించిన పరిస్థితులు విషమించడాన్ని ప్రత్యక్షంగా చూసింది. ‘అరుదైన మొక్కలను కాపాడడంలోని ఆనందం అంతా ఇంతా కాదు’ అంటుంది సీనియర్ గార్డెనర్ లాలీ జోసెఫ్. పాతిక సంవత్సరాలుగా ఈ అభయారణ్యంలో పనిచేస్తున్న జోసెఫ్ ‘మొక్కలు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉండగలం’ అంటోంది. ‘నేను చూస్తుండగా అడవిలో ఒక చెట్టు నేల కూలిపోవడాన్ని మించిన విషాదం మరొకటి లేదు’ అంటుంది లాలీ జోసెఫ్. కీటకాలు, పాముల నుంచి రక్షణగా పెద్ద బూట్లు ధరించిన ‘ఆల్–ఫిమేల్ రెయిన్ ఫారెస్ట్ ఫోర్స్’లోని మహిళలు అడవులలో తిరుగుతుంటారు. ప్రమాదంలో ఉన్న మొక్కలు, చెట్లను రక్షించడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు. సహజ పదార్థాల నుంచి పురుగు మందులను తయారుచేస్తుంటారు. అడవి గుండె చప్పుడు విని... దిల్లీలో పెరిగిన సుప్రభా శేషన్... కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలోని బ్రోక్వుడ్ పార్క్ సెంటర్ (యూకే)లో చదువుకుంది. అక్కడ ఉన్నప్పుడు తొలిసారిగా కేరళలోని ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ గురించి విన్నది. ల్యాండ్ స్కేప్ గార్డెన్స్, పార్క్ ల్యాండ్ల చరిత్రపై ప్రాజెక్ట్ చేస్తున్న సుప్రభ శేషన్ని కేరళలోని ‘గురుకుల’ ఆకర్షించింది. అమెరికాలోని ల్యాండ్ ఇనిస్టిట్యూట్లో ఒక సంవత్సరం పాటు అధ్యయన కార్యక్రమాల్లో భాగం అయిన సుప్రభ ఆ తరువాత మన దేశంలోని ఆదివాసీ గూడేలలో మకాం వేసి అడవుల గుండె చప్పుడు విన్నది. తన ప్రయాణంలో భాగంగా ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’ (జీబిఎస్) వ్యవస్థాపకుడు వోల్ఫ్ గాంగ్ను కలిసింది. ‘జీబీఎస్’ ద్వారా అడవులను రక్షించడానికి వారు చేస్తున్న ప్రయత్నాల గురించి తెలుసుకుంది. అలా లాలీ జోసెఫ్, సుమ కెలోత్లాంటి ఇతర ‘జీబియస్’ సభ్యులతో కలిసి అడవిబాట పట్టింది. పశ్చిమ కనుమలలోని పర్వతాలను అధిరోహించింది. అంతరించిపోతున్న మొక్కల జాతుల గురించి తెలుసుకోవడమే కాదు వాటి పరిరక్షణలో భాగంగా ‘జీబియస్’గా గార్డెనర్గా ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ నల్లని రాళ్లలో.. ‘గురుకుల బొటానికల్ శాంక్చువరీ’లోని సీనియర్ గార్డెనర్ అయిన లాలీ జోసెఫ్, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న మొక్కల కోసం అన్వేషిస్తుంటుంది. గురుకులంలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ద్వారా వాటిని బతికించే ప్రయత్నం చేస్తుంది. కొండ, కోనలు తిరుగుతూ మొక్కల యోగక్షేమాలు తెలుసుకుంటుంది. -
అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం
యాదాద్రి: నాగార్జునసాగర్ ఫారెస్ట్ డివిజన్లోని నాగార్జునపేట తండా ప్రాంతంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. మంటలు లేచి అడవిని చుట్టుముట్టడంతో అటవీశాఖ సిబ్బంది ఆప్రాంతానికి వెళ్లి ఫైర్బ్లోయర్ల సహాయంతో ఆర్పారు. కిలోమీటరు మేరమంటలు అంటుకోవడంతో అష్టకష్టాలు పడి మంటలను అదుపులోకి తెచ్చారు. నాగార్జునపేట ప్రాంతంలో రైతులు పత్తికట్టెతో పాటు చెలకలలో ఉన్న చెత్తచెదారాలను తగుల బెట్టి వాటిని ఆర్పకుండానే రావడంతో గాలికి సమీపంలోగల అటవీ ప్రాంతం అంటుకుంది. మంటలు చెలరేగడంతో రైతులు ఇచ్చిన సమాచారం మేరకు హుటాహుటిన వెళ్లి మంటలను ఆర్పారు. -
పాతాళవనం కాదు! అదొక 'నేలమాళిగలో ఉద్యానవనం..!'
'మన జీవితంలో మనం ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు చూసుంటాం. ఎన్నో అద్భుతాలను చూసుంటాం. అవి మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చి ఉంటాయి. కానీ ఇలాంటి పాతాళవనాన్ని కాదు కాదు, ఉద్యానవనాన్ని మీరెప్పుడైనా చూశారా! చూడాలంటే.. పాతాళంలోకి దిగాల్సిందే.., దిగాలంటే.. అమెరికాకు వెళ్లాల్సిందే..! ఆశ్చర్యం, అద్భుతం రెండూ కలిస్తేనే ఈ వనం. మరి అదేంటో కాస్త ముందే తెలుసుకుందామా..!' ఈ పాతాళవనం అమెరికాలో ఉంది. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో ఉన్న ఈ ఉద్యానవనం వెనుక కొంత చరిత్ర ఉంది. ఇటలీలోని సిసిలీ నుంచి అమెరికాకు వలస వచ్చిన బాల్డసరె ఫారెస్టీరె ఫ్రెస్నోలో 1904లో పది ఎకరాల భూమి కొన్నాడు. ఇక్కడి మట్టి నిమ్మ, నారింజ వంటి పండ్లతోటల పెంపకానికి అనుకూలంగా లేకపోవడమే కాదు, ఇక్కడి వాతావరణం కూడా వేసవిలో విపరీతమైన వేడిగా ఉండేది. వేసవి తాపాన్ని తట్టుకునే విశ్రాంతి మందిరం కోసం బాల్డసరె ఈ భూమిలో ఇరవైమూడు అడుగుల లోతున నేలమాళిగను తవ్వించాడు. నేలమాళిగలోనే గదులు గదులుగా నిర్మాణం చేపట్టి, లోపలకు గాలి వెలుతురు సోకేలా తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చుట్టూ తవ్వకాన్ని విస్తరించి, చిన్న చిన్న మొక్కలతో ఉద్యానవనాన్ని పెంచాడు. గాలి వెలుతురు ధారాళంగా ఉండటంతో ఈ నేలమాళిగలో మొక్కలు ఏపుగా పెరిగాయి. బాల్డసరె 1946లో మరణించాడు. అమెరికా ప్రభుత్వం 1977లో దీనిని చారిత్రక ప్రదేశంగా గుర్తించింది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా నేలమాళిగలో పెరిగిన ఈ ఉద్యానవనం నేటికీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇవి చదవండి: చిపి చిపీ చాపా... డుబిడుబిడు -
అమెరికాలో కార్చిచ్చు
కనాడియన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అడవికి నిప్పంటుకుని లక్షల ఎకరాల్లో పచ్చదనం మటుమాయమైంది. చెట్లు కాలిబూడిదయ్యాయి. సమీప ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇప్పటికే 2,00,000 ఎకరాల విస్తీర్ణంలో అటవీప్రాంతాన్ని కాల్చేసిన కార్చిచ్చు మరింత పెద్దదవుతూ అక్కడి ప్రజలు, ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా పరిణమించింది. దీంతో టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ దాదాపు 60 గ్రామాల్లో విపత్తుగా ప్రకటించి సహాయక చర్యలను ముమ్మరంచేశారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేందుకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అణ్వాయుధాల కేంద్రం బంద్ ఈ ప్రాంతంలో సంభవించే అతి పెద్ద కార్చిచ్చులకు ది స్మోక్హౌజ్ క్రీక్ఫైర్గా పిలుస్తుంటారు. భయంకరమైన ఎండ, వేడి, పొడి వాతావరణం కారణంగా ఉత్తర టెక్సాస్ అడవిలో కార్చిచ్చు అంటుకుంది. సోమవారం మొదలైన ఈ కార్చిచ్చు టెక్సాస్ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సంభవించిన అతిపెద్ద కార్చిచ్చు ఘటనల్లో ఐదోది కావడం గమనార్హం. ఈ కార్చిచ్చు దెబ్బకు ఆమరిల్లో పట్టణంలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న అమెరికా అణ్వాయుధాల కేంద్రంలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేసినట్లు ప్యాన్టెక్స్ సంస్థ వెల్లడించింది. జాతీయ రహదారుల వెంట చెట్లకు సైతం మంటలు అంటుకోవడంతో ఆయా హైవేలపై వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఓక్లహామా రాష్ట్ర సరిహద్దుల్లోని హెమ్ఫిల్, హచిన్సన్ కౌంటీల్లోనూ కార్చిచ్చు వ్యాపించింది. మియామీ, కనాడియన్ పట్టణాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సెనేటర్ కెవిన్ స్పార్క్స్ స్థానికులకు విజ్ఞప్తిచేశారు. కనాడియన్ పట్టణాన్ని కార్చిచ్చు దాదాపు చుట్టేసింది. స్కెలీటౌన్, వీలర్, అలీసన్, బ్రిస్కో పట్టణాల నుంచీ స్థానికులు వేరే చోట్లకు వెళ్లిపోయారు. కార్చిచ్చు ఘటనల కారణంగా టెక్సాస్ రాష్ట్రంలో మొత్తంగా కోటి 10 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా అమెరికాను కార్చిచ్చులు నిత్యం వణికిస్తున్నాయి. -
ఇదేం అడవి? రాళ్లు మొలవడం ఏంటీ..?
ఎక్కడైన పచ్చదనం పరుచుకున్న అందమైన అడవులే ఉంటాయి. అక్కడ ఉండే చెట్ల రకాల్లో తేడాలు ఉంటాయోమో గానీ పచ్చదనం అనేది కామన్. మహా అయితే కొన్ని చోట్ల నదులతో కూడిన అడవులు ఉంటాయి. అలా ఇలా కాకుండా రాళ్లు ఉండే అడవి గురించి విన్నారా?. పైగా అక్కడ చెట్లకు బదులు రాళ్లు మొలుస్తాయట. దగ్గరకెళ్తే చెట్లలా ఉండే శిలాజాల్లా కనిపిస్తాయట. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? అయితే చైనాలోని కున్మింగ్ నగరానికి వచ్చేయండి. ఆ వింత అడవిని చూసేయండి. ఎక్కడుందంటే..సాధారణంగా అడవుల్లో చెట్లు మొలుస్తాయి. అక్కడ మాత్రం రాళ్లు మొలిచాయి. అందుకే ‘స్టోన్ ఫారెస్ట్’గా పేరు పొందింది. ఈ శిలారణ్యం చైనా దక్షిణ ప్రాంతంలోని యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్ నగరానికి తొంబై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దాదాపు నాలుగువందల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎటుచూసినా, కొండల్లా బారులు తీరిన శిలలే కనిపిస్తాయి. ఇవన్నీ సున్నపురాతి శిలలు. ఇవి నేల నుంచి మొలుచుకొచ్చినట్లు ఉంటాయి. దగ్గరగా చూస్తే, ఇవి శిలాజాల్లా మారిన చెట్లలా కనిపిస్తాయి. చైనాలోని ఈ శిలారణ్యాన్ని చూడటానికి విదేశీ పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఈ శిలారణ్యాన్ని యునెస్కో 2007లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. (చదవండి: అనకొండకి చెందిన మరో జాతి! వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
అరణ్యానికి ఆసరా
అడవులనూ, ఆదివాసీలనూ రక్షించుకోవటం అంటే మానవాళి తనను కాపాడుకోవటమేనని బ్రెజిల్ పర్యావరణవేత్త చికో మెండిస్ ఏనాడో చెప్పిన మాట. దాన్ని విస్మరించటం ఎంత అనర్థదాయకమో, అది చివరకు ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందో పాలకులు గ్రహించటం లేదు. కనుకనే అడవుల నిర్వచనానికి సంబంధించినంతవరకూ నిఘంటు అర్థానికీ, 1996లో తాము వెలువరించిన తీర్పునకూ తు.చ. తప్పకుండా కట్టుబడివుండాలని మొన్న సోమవారంనాడు సర్వోన్నత న్యాయ స్థానం చెప్పవలసి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు కావస్తున్నా మన దేశంలో ‘అడవి’కి నిర్దిష్టమైన నిర్వచనం లేదు. దేశంలో అటవీభూముల విస్తీర్ణం ఎంతో స్పష్టమైన, సమగ్రమైన రికార్డు కూడా లేదు. ఒక అంచనా ప్రకారం మన దేశంలో మొత్తం ఎనిమిది లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులున్నాయి. ఇది మరో 1,540 చదరపు కిలోమీటర్ల మేర పెరిగిందని మూడేళ్ల క్రితం కేంద్రం ప్రకటించింది. అయితే 1980 నాటి అటవీ సంరక్షణ చట్టానికి నిరుడు ఆగస్టులో తీసుకొచ్చిన సవరణల వల్ల ఆ చట్టం పరిధి కుంచించుకుపోయిందనీ, ఫలితంగా 1,97,000 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతానికి ముప్పు ఏర్పడిందనీ పిటిషనర్లు ఆరోపించారు. వివాదాస్పదమైన 1ఏ నిబంధన అటవీప్రాంతంగా రికార్డుల్లో వుండి 1980–96 మధ్య చట్టబద్ధంగా అటవీయేతర ప్రయోజనాలకు వినియోగిస్తున్న భూములు, అంతర్జాతీయ సరిహద్దులకు 100 కిలోమీటర్ల దూరంలోవుండి వ్యూహా త్మక అవసరాలకు వినియోగపడే ప్రాంతం ఈ చట్టం పరిధిలోనికి రాదని చెబుతోంది. అలాగే మావోయిస్టు ప్రాంతాల్లో ఆంతరంగిక భద్రతకై చేపట్టే నిర్మాణాల కోసం అయిదు హెక్టార్ల వరకూ అటవీయేతర భూమిగా రికార్డుల్లోవున్న ప్రాంతాన్ని సేకరించవచ్చని చెబుతోంది. ఇక జూ, సఫారీ వంటి అవసరాల కోసం కూడా ఈ తరహా భూమిని తీసుకోవచ్చని వివరిస్తోంది. అడవులే అయిన ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వంవల్లనో, మరే ఇతర కారణంవల్లనో రికార్డుల్లోకి ఎక్కని భూముల న్నిటికీ ఈ చట్టసవరణవల్ల ముప్పు ఏర్పడుతుందని పిటిషనర్ల వాదన. ఈ కేసులో సుప్రీంకోర్టు వెలు వరించిన తాత్కాలిక ఆదేశాల పర్యవసానంగా 1980 నాటి అటవీ సంరక్షణ చట్టం నిబంధనలూ, 1996లో సర్వోన్నత న్యాయస్థానం టీఎన్ గోదావర్మన్ కేసులో ఇచ్చిన ఆదేశాలూ వర్తిస్తాయి. అడవులను సంరక్షించాలని పర్యావరణవేత్తలు కోరినప్పుడల్లా అభివృద్ధి మాటేమిటన్న ప్రశ్న వినబడుతూ వుంటుంది. ఆ రెండూ పరస్పర విరుద్ధాలన్నట్టు... ఒకటి కోల్పోతేనే రెండోది సాధ్యమ న్నట్టు మాట్లాడతారు. ఇది సరికాదు. ఏ కారణంతో అడవుల్ని హరించినా అది ఆత్మవినాశనానికే దారితీస్తుంది. అడవులంటే కేవలం వృక్షాలు మాత్రమే కాదు... అక్కడుండే ఆదివాసులూ, ఆ అడవిని ఆలంబనగా చేసుకుని జీవించే వన్యమృగాలతో సహా సమస్త జీవరాశులూ కూడా! అడవులను ధ్వంసం చేసినప్పుడు ఆవాసం కరువై వన్యమృగాలు జనావాసాల్లోకి చొరబడతాయి. ఆదివాసులు జీవిక కరువై ఇబ్బందుల్లో పడతారు. ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడేవి. కానీ పర్యావరణానికి కలిగే చేటు అపారమైనది. అటవీప్రాంతం తగ్గితే కరువు, అకాలవర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అందువల్ల అభివృద్ధికీ, పర్యావరణ పరిరక్షణకూ సమతూకం వుండేలా ప్రభుత్వ విధానాలుండాలి. 2006 నాటి పర్యావరణ (పరిరక్షణ) చట్టం కింద రూపొందించిన పర్యావరణ ప్రభావ మదింపు నిబంధనలు కొంతమేరకు ఈ సమతూకాన్ని సాధించాయి. అయితే దాన్ని నీరు గార్చిన పర్యవసానంగా మైనింగ్ కోసం, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం, మౌలిక సదుపాయ ప్రాజెక్టుల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం ఇస్తున్న అనుమతులు ఆ సమతూకాన్ని దెబ్బతీసి కార్పొరేట్ ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చాయని ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రిక వెలువరించిన కథనాలు వెల్లడించాయి. వివిధ కారణాలవల్ల పర్యావరణ అనుమతులు పొందని కంపెనీలకు ఆర్నెల్లపాటు మినహాయింపునిచ్చిన 2017 నాటి కేంద్ర నిబంధనలే ఇందుకు కారణం. 2017–24 మధ్య వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన బాక్సైట్, బొగ్గు, ఇనుము మైనింగ్లతోపాటు, సిమెంట్ ఫ్యాక్టరీలు, సున్నపురాయి వంటి వంద ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయని ఆ కథనం చెబుతోంది. 1996లో జస్టిస్ జేఎస్ వర్మ, జస్టిస్ బీఎన్ కృపాల్ ఇచ్చిన తీర్పు అడవికి విస్తృత నిర్వచనాన్నిచ్చింది. దాని ప్రకారం చట్టం నిర్వచనానికి సరిపోయే అటవీప్రాంతాలతోపాటు యాజమాన్యం ఎవరిదన్న అంశం జోలికి పోకుండా అడవిగా చట్టం గుర్తించిన అన్ని ప్రాంతాలూ అడవులు గానే భావించాలి. నిరుడు అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు తీసుకొచ్చిన సందర్భంగా పార్లమెంటులో మాట్లాడిన కేంద్ర పర్యావరణమంత్రి భూపేందర్ యాదవ్ ఆ చట్టం వల్ల ఆదివాసీ ప్రాంతా ల్లోని పాఠశాలల్లో కనీసం ఆడపిల్లల కోసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేకపోతున్నామని వాపోయారు. ఇందులో నిజం లేదు. 2006 నాటి అటవీ హక్కుల చట్టం అలాంటి అవసరాల కోసం మినహాయింపునిస్తోంది. పర్యావరణ సమతూకాన్ని సాధించగలిగినప్పుడే దేశంలో హరితావరణాన్ని కాపాడు కోగలుగుతాం. చాలా దేశాలు అడవుల్ని కోల్పోయిన పర్యవసానంగా జరిగిన నష్టాన్ని గమనించుకుని వాటి పునరుద్ధరణకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. బ్రెజిల్ వంటి దేశాలు అడవులను ప్రాణప్రదంగా చూసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ప్రభుత్వాల కళ్లు తెరిపించాలి. ధర్మాసనం చెప్పినవిధంగా ఏప్రిల్ 15కల్లా దేశంలోని అన్ని రకాల అటవీ భూములపై సమగ్ర వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలి. అడవుల రక్షణపై పౌరుల అవగాహనను పెంపొందించే చర్యలకు ఉపక్రమించాలి. -
నాట్య భంగిమల్లా ఉండే వృక్షాలు! ఎక్కడున్నాయంటే..
మన ఊహకే అందని విచిత్రాలు ఈ ప్రకృతి సొంతం. ఎంతలా ఏఐ వంటి మహత్తర టెక్నాలజీల వచ్చినా కొన్ని విచిత్రాలు ఇప్పటకీ ఓ పట్టాన అర్థం కావు. ఎందువల్ల ఇలా జరిగిందనేది మేధావుల మెదడుకు అందదు. కానీ అవి ఓ మనిషి నువ్వు ఎన్ని కనిపెట్టిన మమ్మల్ని అందుకోలేవు అన్నట్లు ప్రకృతి తన వైవిధ్యాన్ని, గొప్పతనాన్ని ఎప్పటికప్పుడూ చెంపదెబ్బ కొట్టినట్లు చెబుతూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడూ నా అధీనుడవే అంటుంది. అహం చూపించావో అంతం చేసేస్తా అన్నట్లు కన్నెర జేస్తుంది ప్రకృతి. ఎప్పటికీ నీ శక్తికి, వైవిధ్యానికి దాసోహం అంటే అన్ని అర్థమయ్యేలా అమ్మలా వివరిస్తుంది. 'దటీజ్ నేచర్' అని చెప్పకనే చెబుతుంది. ఈ నాటి ఆసక్తికర విశేషాలేంటో చూద్దామా! ►నాట్య భంగిమల్లా కనిపించే ఈ నిలువెత్తు వృక్షాలు ఇండోనేసియాలోని సుంబా దీవి మడ అడవుల్లోనివి. ఉప్పునీరు పుష్కలంగా ఉండే చోట ఈ చెట్లు పెరుగుతాయి. సుంబా దీవిలోని వలాకిరి బీచ్లో ఈ చెట్లు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ప్రకృతి సౌందర్యాన్ని కెమెరాల్లో బంధించాలనుకునే ఫొటోగ్రాఫర్లు తరచుగా ఇక్కడకు వస్తుంటారు. సూర్యోదయ, సూర్యాస్తమ వేళల్లో ఈ చెట్ల ఫొటోలు తీస్తుంటారు. ►మనుషులు మొట్టమొదటగా మచ్చిక చేసుకున్న జంతువులు మేకలు. మనుషులు మేకలను పదివేల ఏళ్ల కిందటే మచ్చిక చేసుకుని, పెంపుడు జంతువులుగా మార్చుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ►కొందరికి ఎలుకలంటే చచ్చేంత భయం. ఎలుకల పట్ల ఉండే ఈ భయాన్ని వైద్య పరిభాషలో ‘మ్యూరోఫోబియా’ అంటారు. ►ఏదో మాట వరసకు గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలం గాని, దాని చేత నీళ్లు తాగించలేం అంటుంటారు. అదంతా అపోహ మాత్రమే! గుర్రాలకు నీళ్లు తాగడం బాగా ఇష్టం. ఒక గుర్రం రోజుకు సగటున ముప్పయి నుంచి అరవై లీటర్ల వరకు నీటిని అవలీలగా తాగేయగలదు. (చదవండి: పసికందులు ఎందుకు ఏడుస్తున్నారో ఠక్కున చెప్పేసే డివైజ్!) -
నేవీ రాడార్ స్టేషన్ కోసం అటవీ భూములు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వికారాబాద్ మండలం పూ డూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ (రాడార్) స్టేషన్ ఏ ర్పాటు ఖరారయ్యింది. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని తూర్పు నౌకాదళ కమోడోర్ కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ కలి శారు. వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటు కోసం అట వీ భూముల బదిలీ ఒప్పందంపై వికారాబాద్ డీఎఫ్వో, నా వల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు సంతకాలు చేశారు. దామ గూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1,174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించేందుకు ఈ ఒప్పందం కుదిరింది. దేశంలోనే రెండోది భారత నావికాదళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేష న్ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను ఉపయోగిస్తుంది. దామగూడెం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసే స్టేష న్ దేశంలో రెండోది కాగా.. తమిళ నాడులోని తిరునల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొదటిది. రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఎప్పుడో గుర్తించింది. 2010 నుంచే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావ రణ అనుమతులు, క్లియరెన్స్లన్నీ వచ్చినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో భూముల కేటాయింపు ముందుకు సాగలేదు. వాస్తవానికి 2014లోనే నేవీ ప్రతిపాదనలకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూసంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు రూ.18.56 కోట్లు కూడా నేవీ చెల్లించింది. అయితే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని దామగూడెం ఫారెస్ట్ ప్రొటెక్షన్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఒక ఆలయం ఉండటంతో దానికి ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు నేవీ అంగీకరించింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం కూడా నౌకాదళ అధికారులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ దిశగా ముందడుగు పడింది. 2027లో పూర్తి దామగూడెంలో నేవీ స్టేషన్తో పాటు ఏర్పడే టౌన్షిప్లో స్కూళ్లు, హాస్పిటళ్లు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. దాదాపు 600 మంది నావికా దళంతో పాటు ఇతర సాధారణ పౌరులుంటారు. దాదాపు 2,500 నుంచి 3,000 మంది ఈ టౌన్షిప్లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడతారు. ప్రాజెక్టులో భాగంగా దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కి.మీ. రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త వీఎల్ఎఫ్ సెంటర్ ఏర్పాటు పూర్తి కానుంది. -
TS: హమ్మయ్యా.. ఆ పులులు సేఫ్!
కొమురం భీం, సాక్షి: కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో కలకలం రేపిన పులుల మృత్యువాత సంఘటనలో అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి.. రెండు పులులపై విష ప్రయోగం జరిగినట్టు గుర్తించిన అటవీశాఖ సెర్చ్ ఆపరేషన్ ను సీరియస్ గా తీసుకుంది. చివరికి మూడు రోజుల పాటు అడవిని జల్లెడ పట్టిన అనంతరం తల్లి పులి రెండు పిల్లల జాడ ట్రాప్ కెమెరాలకు చిక్కడంతో ఆపరేషన్ ను నిలిపివేసింది. కొమురంభీం జిల్లా కాగజ్ నగర రేంజ్ దరిగాం అడవుల్లో టైగర్ సర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. మూడు రోజుల విస్తృత గాలింపు తర్వాత ఎట్టకేలకు కనిపించకుండా పోయిన S6 పులి దాని రెండు పిల్లలు ట్రాప్ కెమెరాకు చిక్కాయి. దరిగాం అడవిలో విష ప్రయోగంతో చనిపోయిన రెండు పులులతో పాటు మరో రెండు పులులు మిస్ అవడంపై అలర్ట్ అయిన జిల్లా అటవీశాఖ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.. మూడు వందల మంది సిబ్బందిని రంగంలోకి దింపింది. 72 బృందాలు , 105 ట్రాప్ కెమెరాల తో మూడు రోజుల పాటు అడవిని జల్లెడ పట్టారు అటవీ శాఖ అధికారులు.. అయితే సిబ్బందికి మిస్ అయిన పులులు కనిపించడంతో ఆపరేషన్ సక్సెస్ గా ముగిసింది. ఎస్ 6 తల్లి పులితో పాటు కనిపించకుండా పోయిన పులి పిల్లలు సైతం క్షేమంగా ఉన్నాయంటూ తేల్చింది కొమురంభీం జిల్లా అటవీ శాఖ. గత ఏడాది డిసెంబర్ 27 న దరిగాం అటవి ప్రాంతంలో ఎస్ 9 పులి ఓ పశువు పై దాడి చేయగా.. ఆ పశువును మరోసారి తిన్న కే15 పులి ఈనెల 6 న మృత్యువాత పడింది. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే ఐదేళ్ల మగపులి ఎస్ 9 సైతం మరణించింది. దీంతో పులి మరణాల కేసును సీరియస్గా తీసుకున్న ఉన్నతాదికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో.. పశువుపై విష ప్రయోగం జరిగినట్టు తేలింది. ఆ పశువు మృతి చెందిన సమీపంలో నాలుగు పులుల పాదముద్రలు లభించడంతో ఆందోళన చెందింది అటవీశాఖ. దీంతో అలర్ట్ అయిన అటవిశాఖ చనిపోయిన పులులతో పాటు పశువు మాంసం తిన్న మరో రెండు పులుల కోసం అన్వేషణ సాగించింది. ఈనెల 9 న టైగర్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభింవింది.. మొదటి రోజు 14 ట్రాకింగ్ టీములు, 22 ట్రాప్ కెమెరాలతో దరిగాం అటవి ప్రాంతాన్ని జల్లెడ పట్టింది. 24 గంటలు దరిగాం అడవిని జల్లెడ పట్టిన మిస్ అయిన పులుల ఆచూకీ లభించకపోవడంతో ట్రాకింగ్ టీంను 72 కు పెంచింది. దరిగాం అటవీ ప్రాంతంతో పాటు సర్కపల్లి, గోంది అటవి ప్రాంతంలోను సర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేసిన అటవీ శాఖ 105 కెమెరాలను ఏర్పాటు చేసి మానిటరింగ్ చేసింది. దీంతో ఈనెల 11 న దరిగాం గోంది అటవి ప్రాంతంలో మరో పశువుపై పులిదాడి చేసి హతమార్చగా.. ఆ పశువు వద్ద ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు పులి చిక్కింది. దాని పాదముద్రల ఆధారంగా మూడేళ్ల వయస్సున ఆడపులి.. ఎస్ 6 గా గుర్తించిన అటవిశాఖ ఊపిరి పీల్చుకుంది. 73వ క్యాంపు వారికి కే 14 పులి పాదముద్రలు 51 క్యాంప్ టీంకు కే 16, 17 పాదముద్రలు లభించడంతో సర్చ్ ఆపరేషన్ ని నిలిపివేసింది. 62 గంటల పాటు ఓ యుద్దంలా సాగిన టైగర్ సర్చ్ ఆపరేషన్ పులులు క్షేమంగా ఉన్నాయన్న సమాచారంతో సక్సెస్ గా ముగియగా.. దరిగాం అటవీ ప్రాంతంలో లెక్కకు మించి పులుల సంచారం సాగుతుందన్న సమాచారంతో అటవిశాఖకు మరింత దృష్టి సారించింది. ఇప్పుడు ఆ పులులను వేటగాళ్ల కంటపడకుంటా క్షేమంగా కాపాడటం.. ఆ పులులతో మనుషులకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూడటం తప్పని సరిగా మారింది. మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలోని ఓ రైతుకు పత్తి చేనులో పులి కనిపించింది. వెంటనే రైతు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పులి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పారెస్ట్ అదికారులు గుంపులు గుంపులు చేనులల్లో పనులు చేసుకోవాలని ఫారెస్ట్ కర్జెల్లి రేంజ్ అధికారి నవ్య రైతులకు సూచిస్తున్నారు. ఇటు దరిగాం అటవీ సంఘటన లో పలువురిని అదుపులోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు వేగం చేశారు.. నిర్లక్ష్యం వహించిన అధికారులపై సైతం చర్యలు తీసుకునే అవకాశం లేపోలేదని తెలుస్తోంది. -
ఈ వారం పిల్లల కథ - ‘దత్తత’
బ్రహ్మపుత్రా నది మధ్యలో ఉన్న మాజాలీ ద్వీపంలోని మంజీరా అడవికి రాజు కృపి. ఆ అడవిలోని జంతువులన్నిటికీ కృపి అంటే ఎంతో గౌరవం. ఉన్న లోటల్లా కృపికి పిల్లలు లేకపోవడమే. ‘నా తరువాత ఈ అడవిని పాలించే రాజు లేకపోతే జంతువుల పరిస్థితి ఏమిటీ?’ అంటూ దిగులుచెందుతూ ఎప్పుడూ అదే ఆలోచనలో ఉండేది. ఒకరోజు.. ఆ అడవిలోనే ఉండే కరటం అనే కాకి ‘మృగరాజా.. ఆహార వేట కోసం నేను వెళ్లే పల్లెల్లో.. పిల్లలు లేనివాళ్ళు మరొకరి పిల్లలను తెచ్చి పెంచుకుంటుంటారు. దాన్ని దత్తత అంటారట. అలాగే మీరు కూడా ఎవరినైనా పెంచుకుంటే ఈ సమస్య తీరుతుంది’ అంది. అక్కడే ఉన్న ఎలుగుబంటి ‘ఓ కరటం.. నీకు మతి పోయిందా? పక్కవాళ్ల పిల్లలను తెచ్చి పెంచుకోవడానికి మానవులంతా ఒకేలా ఉంటారు కాబట్టి సాధ్యపడుతుంది. కానీ ఇక్కడ మనం వేరు వేరు జంతువులం. పిల్లి పిల్లను తెచ్చి మృగరాజు పెంచుకుంటుందా ?’ అంది. ‘మరైతే ఎలా ఈ సమస్య తీరేది?’ అంటూ కలతచెందింది కరటం. అక్కడే చెట్టు మీద ఉన్న గద్ద ‘మహారాజా.. దిగులుపడకండి. నేను అనేక అడవులు తిరుగుతాను. ఎక్కడైనా సింహం పిల్లలుంటే మీకు చెబుతాను. అప్పడు దత్తత గురించి ఆలోచించవచ్చు’ అంది. ‘ఈ ఆలోచన బాగుంది. అయితే ఈ రోజు నుండే వెతకడం మొదలుపెట్టు’ అంది ఎలుగుబంటి. అలా వెళ్ళిన గద్ద పక్కనున్న అడవులన్నిటినీ గాలించడం మొదలుపెట్టింది. నదీ తీరంలో దానికి ఓ పావురం కలసింది. ‘నిన్నటి నుండి చూస్తున్నా .. ఆహారం కోసం కాకుండా నువ్వు దేనికోసమో వెతుకుతున్నట్టున్నావ్?’ అని అడిగింది. ‘అవును’ అంటూ తన రాజు గురించి, ఆయన బాధ గురించి చెప్పింది గద్ద. ‘ఉయ్యాల్లో పిల్లను పెట్టుకుని ఊరంతా వెదికినట్టుంది. మన పక్కనున్న కంజీరా అడవి రాణికి రెండు మగ పిల్లలు పుట్టాయి. జాగ్రత్తగా ప్రయత్నిస్తే మీ రాజు ఆశ ఫలించవచ్చు’ అంది పావురం. వెంటనే గద్ద కంజీరా అడవి వైపు ఎగిరి అక్కడి రాణి బిడ్డలను చూసింది. ముద్దుగా ఉన్నాయి. దయతలచి ఒక పిల్లనిస్తే భవిష్యత్తులో తమకు రాజు లేడనే లోటుండదు అనుకుంది. ఆ ఆలోచనతోనే తన అడవికి వెళ్లి రాజు సహా అక్కడి జంతువులన్నిటికీ తను చూసిన విషయాన్ని చెప్పింది. ‘మహారాజా .. ఒక తల్లి నుండి పిల్లను తేవడం చిన్న విషయం కాదు. చాకచక్యంగా వ్యవహరించి సాధించాలి’ అంది కరటం. ‘అవును.. మహారాజా! నానొక ఆవకాశం ఇవ్వండి. యువరాజును తీసుకొస్తా!’ అంది ప్రవాళం అనే కుందేలు. ‘అది నీవల్ల అయ్యే పనికాదు’ అని కుందేలును విదిలించి ‘మహారాజా.. ఆ అవకాశం నాకు ఇవ్వండి. నేను తీసుకొస్తా’ అంది త్రిశిర అనే నక్క. ‘అవును.. మహారాజా! త్రిశిర తెలివైనది. అవసరమైతే తన దొంగ తెలివితేటలనూ ఉపయోగించి పని పూర్తి చేయగలదు కూడా!’ అంది ఎలుగుబంటి. అలా మృగరాజు దగ్గర అనుమతి తీసుకుని కంజీరా అడవికి బయలుదేరింది త్రిశిర. కొంత దూరంలో దానికి ఓ తోడేలు జత కూడింది. రెండూ కలసి కంజీరా అడవికి చేరుకున్నాయి. రెంటికీ ఆకలి దంచేయసాగింది. ఎక్కడైనా ఆహారం దొరికితే బాగుండు అనుకున్నాయి. కొద్దిదూరంలోనే బాగా బలిసిన అడవి కోడి కనిపించింది. పొట్టికాళ్ళు.. మెలితిరిగిన పంచరంగుల తోక.. నెత్తిమీద ఎర్రని జుట్టు.. దాన్ని చూడగానే నోట్లో నీళ్లూరాయి తోడేలుకు. ‘రాజు సంగతి తరువాత.. ముందు దీన్నో పట్టుపడదాం’ అంది త్రిశిరతో. ‘తొందరపడకు. ఇది మన అడవి కాదు. పైగా మనం ఓ ముఖ్యమైన పని మీద వచ్చాం’ హెచ్చరించింది త్రిశిర. ‘నిజమే పని చేయాలంటే ఓపిక కావాలి. నీరసంతో పని చేయలేం కదా! అయినా కోడిని కొడితే ఎవరూ పట్టించుకోరు!’ అంది తోడేలు. ఆ కోడి మీదకు దూకుదాం అని ఆ రెండూ అనుకునేలోపు చాలా జంతువులు నక్కను, తోడేలును చుట్టుముట్టాయి. ‘మా మృగరాజును నిద్రలేపే కోడి పుంజునే చంపుదామని వచ్చారంటే.. మీ కెంత ధైర్యం?’ అని బెదిరించాయ్. భయపడిపోయిన త్రిశిర ‘అమ్మబాబోయ్’ అంటూ పరుగు తీసింది. తోడేలూ దాన్ని అనుసరించింది. అలా బెదిరిపోయి వచ్చిన త్రిశిరను చడామడా తిట్టాయి జంతువులన్నీ! ‘మహారాజా.. ఈసారి నాకిచ్చి చూడండి అవకాశం’ అని మళ్లీ అడిగింది ప్రవాళం. ‘ఏ పుట్టలో ఏ పాముందో.. సరే’ అంటూ అనుమతిచ్చింది మృగరాజు. వెంటనే ప్రవాళం.. వైద్యుడు కోతి బావను కలసి సువాసన తైలం తీసుకుంది. దాన్ని ఆనప బుర్రలో పోసుకుని.. భుజాన వేసుకుని కంజీరా అడవికి బయలుదేరింది ప్రవాళం. కంజీరా రాజును కలసింది. చాలా వినయంగా ‘రాజా .. మీరు చాలా మంచివారని.. జంతువుల పట్ల స్నేహభావంతో మెలగుతారని తెలిసింది. మా మంజీరా మహారాజు మీ కోసం ఈ సువాసన తైలం పంపారు. దీన్ని మీ మెరుస్తున్న జూలుకు రాసుకుంటే మీ వయస్సే కనపడదు’ అంటూ మాటల్లో పెట్టింది. ‘భలే మాట్లాడుతున్నావే’ అంది కంజీరా మృగరాజు. కొంత స్థిమితపడ్డాక మెల్లగా ‘రాజా.. మీకిద్దరు బిడ్డలని తెలిసింది. ఒకరు ఈ అడవికి రాజయితే మరొకరు పక్కనున్న మంజీరా అడవికి రాజు కావచ్చు’ అన్నది ప్రవాళం. ‘పక్క అడవికి రాజా? అదెలా?’ అని ఆశ్చర్యపోయింది మృగరాజు. అప్పుడు ప్రవాళం తమ మృగరాజుకు పిల్లల్లేని విషయం చెప్పి, దత్తత గురించీ చెవిన వేసింది. అది విని ఆలోచనలో పడింది కంజీరా మృగరాజు. ‘ఈ కుందేలు చెప్పింది బావుంది. పక్క అడవినీ నా బిడ్డే ఏలుతాడంటే అంతకంటే ఇంకేం కావాలి! ఇక్కడుంటే రెండిటిలో ఒకటే రాజవుతుంది. రెండోది మంత్రో ఇంకేదో అధికారి కాగలదు అంతే. ఈ భేదం వల్ల భవిష్యత్తులో రెండిటి మధ్య విరోధమూ తలెత్తొచ్చు. కాబట్టి బిడ్డను దత్తతకు పంపడమే సరి. పైగా ఆ రాజుకు మంచి పేరే ఉంది. కనుక ఆ రాజు మాట మన్నించి చిన్న కొడుకును దత్తతకు పంపాలి’ అనుకుంది. ఆ విషయాన్ని రాణితోనూ చెప్పింది. రాణీ సరే అంది. ఆ రెండూ కలసి తమ చిన్న కొడుకును ప్రవాళంతో మంజీరా అడవికి సాగనంపాయి. అక్కడ మంజీరాలోని జంతువులన్నీ తమ చిన్న రాజుకు ఘన స్వాగతం పలికాయి. తెలివితో రాజు సమస్యను తీర్చిన ప్రవాళాన్ని ప్రశంసలతో ముంచెత్తాయి. అలా తనకు వారసుడు దొరికినందుకు మంజీరా మృగరాజూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. -కూచిమంచి నాగేంద్ర -
మందపాలుడి కథ
పూర్వం మందపాలుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయనకు లపిత అనే భార్య ఉండేది. అయితే, వారికి సంతానం లేదు. మందపాలుడికి తపస్సు చేయాలనే కోరిక కలిగింది. వెంటనే బ్రహ్మచర్య దీక్ష వహించి, ఒక కీకారణ్యంలోకి చేరుకున్నాడు. అక్కడ వెయ్యేళ్లు ఘోర తపస్సు చేశాడు. తర్వాత యోగమార్గంలో ప్రాణత్యాగం చేశాడు. ప్రాణాలు వదిలిన తర్వాత ఊర్ధ్వ లోకాలకు పయనమయ్యాడు. పుణ్యలోకాల్లోకి ప్రవేశించకుండా దేవదూతలు అతడిని అడ్డుకున్నారు. ‘నన్నెందుకు అడ్డుకుంటున్నారు? వెయ్యేళ్లు తపస్సు చేసిన నాలాంటి తపస్సంపన్నుడైన మహర్షికి పుణ్యలోకాల్లో ప్రవేశం లేకపోవడానికి కారణం ఏమిటి? నేనే పాపం చేశాను?’ అని మందపాలుడు దేవదూతలను నిలదీశాడు. ‘ఎంత తపస్సు చేసినా ఏం ప్రయోజనం? సంతానం లేనిదే సద్గతులు సంప్రాప్తించవు. నువ్వు తిరిగి భూలోకానికి వెళ్లి, సంతానం పొంది వస్తే, అప్పుడు పుణ్యలోకాల్లోకి ప్రవేశించగలవు’ అని బదులిచ్చారు దేవదూతలు. మందపాలుడు మళ్లీ భూలోకానికి వచ్చేశాడు. త్వరితగతిన సంతానం పొందడం భూమ్మీద పక్షులకే సాధ్యమని, పక్షుల్లో లావుక పిట్టలు మరింత త్వరితగతిన సంతానం పొందగలవని గుర్తించి, లావుక పిట్టగా మారాడు. జరిత అనే లావుక పిట్టతో కాపురం చేసి, సంతానం పొందాడు. పక్షుల రూపంలో పుట్టినా, మందపాలుడి నలుగురు కుమారులూ బ్రహ్మజ్ఞానులు. సంతానం కలిగిన తర్వాత మందపాలుడు జరితకు, ఆమె నలుగురు కుమారులకు ఖాండవవనంలో ఒక గూడును ఏర్పరచాడు. కొంతకాలం అక్కడ ఉన్న తర్వాత తన మొదటి భార్య లపిత దగ్గరకు బయలుదేరాడు.ఒకరోజు అతడికి మార్గమధ్యంలో ఖాండవవనం వైపు వస్తున్న అగ్నిదేవుడు ఎదురయ్యాడు. అగ్నిని చూడగానే, అతడు ఖాండవవనాన్ని దహించడానికే వస్తున్నాడని మందపాలుడికి అర్థమైపోయింది. అగ్నికీలల్లో తన భార్యకు, సంతానానికి ప్రాణగండం తప్పదని గ్రహించి, అగ్నిసూక్తాలు పఠిస్తూ ఎదురేగి, అగ్నికి నమస్కరించాడు. మందపాలుడి స్తోత్రాలకు అగ్నిదేవుడు ప్రసన్నుడయ్యాడు. ‘మహర్షీ! ఏమి కోరిక?’ అని అడిగాడు. ‘అగ్నిదేవా! ఈ ఖాండవవనంలోనే నా భార్య, నా నలుగురు కొడుకులు లావుక పిట్టల రూపంలో ఉన్నారు. ఖండవవనాన్ని దహించేటప్పుడు వాళ్ల మీద దయచూపు. వాళ్లకు ప్రాణహాని లేకుండా కాపాడు’ అని ప్రార్థించాడు. ఈ సంగతి జరితకు, ఆమె పిల్లలకు తెలియదు. సరేనంటూ అగ్నిదేవుడు మందపాలుడికి అభయమిచ్చాడు. కృష్ణార్జునుల అండతో అగ్నిదేవుడు ఖాండవవనాన్ని దహించడం ప్రారంభించాడు. అగ్నిని నిలువరించడానికి వచ్చిన దేవేంద్రుడితో కృష్ణార్జులు యుద్ధం సాగించారు. వనాన్నంతటినీ అగ్నికీలలు దహించివేస్తూ దూసుకొస్తుండటంతో జరిత భయపడింది. రెక్కలు రాని కూనలను ఎలా రక్షించుకోగలననుకుని ఆమె దుఃఖించసాగింది. కూనలను వదిలేసి, తన మానాన తాను ఎగిరిపోవడానికి ఆమెకు మనసు రాలేదు. అందుకని ఆమె తన కొడుకులకు ఒక ఉపాయం చెప్పింది.‘బిడ్డలారా! ఈ చెట్టు కిందనే నేల మీద ఎలుకలు చేసిన బొరియ కనిపిస్తోంది. మీరు నెమ్మదిగా వెళ్లి అందులో దాక్కోండి. నేను బొరియ ప్రవేశమార్గాన్ని మట్టితో కప్పేస్తాను. అప్పడు మీకు అగ్ని వేడి సోకదు. అగ్ని చల్లారిన తర్వాత మనం మళ్లీ కలుసుకుందాం’ అంది.జరిత కూనలలో పెద్దవాడు జరితారి ‘అమ్మా! ఎలుకల బిలంలోకి వెళితే, అక్కడ మమ్మల్ని ఎలుకలు చంపి తినేస్తాయి. ఎలుకలకు ఆహారం కావడం కంటే, అగ్నికి ఆహుతైపోవడమే పుణ్యం. గాలితో పాటు అగ్ని మరోవైపు మళ్లితే, ఇక్కడే మేం బతికే అవకాశం ఉంటుంది. కనుక మేం ఇక్కడే ఉంటాం. నువ్వు ఎగిరి పారిపో! కనీసం నీకైనా ప్రాణాపాయం తప్పుతుంది. మేం కాలిపోయినా, నీకు మళ్లీ సంతానం కలుగుతుంది. ప్రాప్తముంటే మళ్లీ మేమే నీకు సంతానంగా కలగవచ్చు. నీ పుణ్యం వల్ల మేం బతికి బయటపడ్డామంటే మనం మళ్లీ కలుసుకోవచ్చు’ అని చెప్పాడు. ఇలా రకరకాలుగా నచ్చచెప్పి, నాలుగు కూనలూ తల్లిని సాగనంపాయి. ఇంతలో వనమంతా దహించేస్తూ ఉన్న అగ్ని పక్షికూనలు వైపు వచ్చాడు. మందపాలుడి కుమారులైన నలుగురూ వేదమంత్రాలతో అగ్నిదేవుడిని స్తుతించారు. అగ్ని వారికి అభయమిచ్చి, వారికి ఏ అపాయం లేకుండా కాపాడాడు.ఖాండవ దహనం పూర్తయి, అగ్ని చల్లారిన తర్వాత జరిత తిరిగి వచ్చింది. తన గూడు, పిల్లలూ క్షేమంగా ఉండటం చూసి సంతోషించింది. -
క్యాచ్ ద ట్రాప్..!
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల వేట నిరోధానికి స్పెషల్ డ్రైవ్ ‘క్యాచ్ ద ట్రాప్’కార్యక్రమాన్ని రాష్ట్ర అటవీ శాఖ ప్రారంభించింది. అడవుల్లో జంతువుల వేటకు వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు, విషపదార్ధాలు, పేలుడు పదార్ధాలు వంటివి ఉపయోగించకుండా కార్యాచరణను శుక్రవారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాల పరిశీలన ద్వారా వేటగాళ్ల గుర్తింపు, పరికరాల స్వాదీనం, గత రికార్డులు, కేసుల ప్రకారం సోదాల నిర్వహణ వంటివి అమలు చేస్తోంది. వివిధ రకాల వలలు, ఉచ్చులు, లైవ్ వైర్లు ఉపయోగించి అటవీ జంతువులను చంపడం/వేటాడటాన్ని గతంలోనే నిషేధించడం తెలిసిందే. వేటకు అడ్డుకట్ట..: అడవి జంతువుల నుంచి వ్యవసాయ పంటల నష్ట నివారణకు కొందరు, అటవీ జంతువుల మాంసం వినియోగం, వ్యాపారానికి మరికొందరు సాగిస్తున్న జంతువుల వేటకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ ప్రత్యేక డ్రైవ్ లో అధికారులు వీలైనన్ని అటవీ ప్రాంతాలను పరిశీలించి వేటగాళ్లను గుర్తించడంతో పాటు వారు వాడే పరికరాలను స్వాదీనం చేసుకోవటం వంటి చర్యలను చేపడుతున్నారు. గత రికార్డులు, కేసులను పరిశీలించి అనుమానితులను సోదా చేసి వేటకు ఉపయోగించే పరికరాలను స్వాదీనం చేసుకుంటున్నారు. ముందుగా అడవిని ఆనుకుని ఉండే వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాలు, ప్రాంతాలను క్షేత్ర సా్థయిలో పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా స్వాదీనం చేసుకున్న అన్ని వేటలకు ఉపయోగించే మెటీరియల్/పరికరాలు సరిగ్గా రికార్డ్ చేయటంతో పాటు, సురక్షితమైన కస్టడీ కోసం వాటిని హైదరాబాద్కు రవాణా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రోత్సాహం అందించనున్నారు. వేట సమాచారం ఇస్తే రివార్డులు..: వేటకు సంబంధించి సమాచారాన్ని ఇచ్చే ఇన్ఫార్మర్లకు తగిన రివార్డులు అందజేయనున్నారు. అయితే వారి గుర్తింపును రహస్యంగా ఉంచనున్నారు. చట్టవిరుద్ధమైన వేట, అందుకోసం ఉపయోగించే వస్తువుల సమాచారం తెలిస్తే సంబంధిత జిల్లా అటవీ అధికారికి లేదా 9803338666 నంబర్కు, లేదా టోల్ ఫ్రీ నంబర్ 18004255364కు తెలియజేయవచ్చునని అటవీ శాఖ సూచించింది..