-
'ఊరికి బంధువులొస్తున్నారు'.. కానుకలతో కాచుకోండి..!
'సంక్రాంతి పండగ వస్తే ఊర్లోకి పాత బంధువులొస్తారు. పండిన పంట నుంచి హక్కుగా తమ భాగం తీసుకుపోతారు. హరిదాసులు, గంగిరెద్దుల వారు, కొమ్మదాసరులు, జంగం దేవరలు, పిట్టల దొరలు, గారడీ వాళ్లు.. వీరందరికీ సంక్రాంతి వస్తే సంవత్సరానికి సరిపడా సాయం. సాటివారికి సాయం చేయడమే సంక్రాంతి'. సంక్రాంతి అనగానే ఊళ్లోకి బంధువులే కాదు డూడూ బసవన్నలు కూడా వస్తారు. సంక్రాంతి అంటే తిని, తేన్చి, సంబరాలు చేసుకునే పండగ మాత్రమే కాదు... రైతు సౌభాగ్యానికీ పల్లె సౌభాగ్యానికీ సహకారం అందించిన అన్ని వర్గాల వారికీ పంపకాలు చేసే పండగ కూడా. సంక్రాంతి పండగ సమయంలో ఇంటికి పుట్ల కొద్దీ చేరిన ధాన్యం నుంచి రైతు తనకు సేవ చేసిన, సాయం చేసిన వర్గాల వారికి భాగం ఇస్తాడు. ‘మేర’ పంచుతాడు. పాలేర్లకి, సేద్యగాళ్లకి. పనివాళ్లకి వడ్లు పోస్తాడు. కొందరికి కొత్తబట్టలు పెడతాడు. అయితే వీరు కాకుండా ఊరి మీద హక్కుగా తమ వాటా కోసం వచ్చే సంప్రదాయ వృత్తికళకారులు వచ్చి ఊరిలో ఆడి, పాడి వినోదం పంచి తమ వడ్లు మూట గట్టుకుని పోతారు. శ్రీమద్రమా రమణ... ‘సద్గురుని కృపచే తారతమ్యము తరచి గనుమన్నా.. ధరణి లోపల మూఢమతులకు దొరుకుటకు బహు దుర్లభమ్మిది’.. అని పాడుతూ గురు కటాక్షం వలనే భక్తిని, ముక్తిని చేరుకోవాలని బోధిస్తూ వీధివీధిన తిరుగుతూ సంక్రాంతి శోభను తెస్తాడు హరిదాసు. పండగ రోజుల్లో దానికి ముందు ధనుర్మాసంలో హరిదాసు తిరగని ఊరు, వీధి ఎంతో బోసిపోతాయి. నెత్తిన అక్షయపాత్ర, భుజాన తంబూర, చేతిలో చిడతలతో ‘శ్రీమద్రమా రమణ గోవిందా’ అంటూ భిక్ష స్వీకరించా ‘కృష్ణార్పణం’ అంటూ మనం సంపాదించిన దానిలో కొంత పేదలకు అర్పణం చేయడం ద్వారా దేవునికి సమర్పణం చేసిన పుణ్యం పొందాలని సూచిస్తాడు హరిదాసు. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి వీధి వాకిట్లో హరిదాసు కోసం గృహిణులు కాచుకుని ఉండేవారు. ఇప్పుడు పై అంతస్తుల్లో, అపార్ట్మెంట్ బాల్కనీల్లో నుంచి చూస్తూ కిందకు దిగడానికి బద్దకిస్తున్నారు. హరిదాసు అక్షయ΄ాత్రలో జారవిడిచే కాసిన్ని బియ్యం మన ఇంటి సంపదను అక్షయపాత్రగా మారుస్తాయి. డూడూ బసవన్నలు ‘గంగిరెద్దులా తల ఊపకు’ అని అంటారు గాని దైవచిత్తానికి తల ఊపుతూ భారం అంతా నీదే అనుకోవడానికి మించిన వేరే సుఖం ఏముంటుంది? డూడూలు కొట్టే బసవన్నను యజమాని ముద్దుగా చూసుకున్నట్టే జీవుణ్ణి దేవుడు ముద్దుగా చూసుకుంటారు. గంగిరెద్దులు ఇంటి ముందుకొచ్చి సన్నాయి పాట వినిపిస్తే ఆ కళే వేరు. రంగు రంగుల పాతబట్టలు ఇస్తే అవి బసవడి మూపురం మీదకు చేరుతాయి. కాసులిస్తే గంగిరెద్దులవాడి నల్లకోటు జేబులో చేరుతాయి. కాసిన్ని డబ్బులు ఎక్కువిస్తే గంగిరెద్దులు విన్యాసం చేస్తాయి. యజమాని ఛాతీ మీద సుతారంగా గిట్టలు ఆడిస్తాయి. బుడబుడలు... కొమ్మదాసరులు ‘అంబ పలుకు జగదంబ పలుకు’ అంటూ డమరుకం వాయిస్తూ బుడబుక్కల వాళ్ళు వస్తారు సంక్రాంతికి. తలపాగా, కోటు, గొడుగు చేతబూని శుభాల భవిష్యత్తును చెబుతూ భిక్ష స్వీకరిస్తారు. వారు వేగంగా వాయించే డమరుకం గొప్ప శబ్ద విన్యాసం సృష్టిస్తుంది. వీరికి డబ్బు. వడ్లు, పాతబట్టలు ఇవ్వాల్సిందే. ఇక ఊరికి ఒకప్పుడు కొమ్మదాసరులు వచ్చేవారు. వీరు ఊరి మధ్యలోని చెట్టు కొమ్మెక్కి కూచుని కింద గుడ్డ పరిచి వచ్చేపోయేవారి మీద వ్యాఖ్యానం వినిపిస్తుండేవారు. తగిన సొమ్ము ముట్టజెప్తేనే దిగేవారు. కొయ్య తుపాకీతో పిట్టల దొరలు వస్తారు పెద్ద పెద్ద వాళ్లతో కలిసి తిరగాలనుకునే సామాన్యుడి కలలకు మాటల మలాం పూస్తారు. ‘మేము స్నానం చేసిన సబ్బు నీళ్లతో పేద దేశాల వాళ్లు డ్యాములు కట్టుకున్నారు’ అంటారు. ‘మా ఇంట్లో కేజీ బంగారం కుక్క నాకిందని చెత్తకుప్పలో పడేశాం’ అంటారు. ‘మోదీ గారు పిలిచి పాకిస్తాన్ మీద యుద్ధానికి పొమ్మని ఆర్రూపాయలు అడ్మాన్సు ఇచ్చారు’ అంటారు. దుబాయ్ షేకుతో టిఫిని తిని అమెరికా ప్రెసిడెంట్తో లంచ్కు కూచోపోబోతున్నాం అంటారు. తర్వాత శంఖం ఊదుతూ జంగం దేవరలు వస్తారు. గారడీ వాళ్లు, కనికట్టు ప్రదర్శించేవాళ్లు.. వరుస కడతారు. రైతు ఎవరినీ కాదనడు. అందరినీ ఆదరిస్తాడు. ఇక సాయంత్రమైతే ఊళ్లో పాట కచేరీలు, డాన్సు ప్రోగ్రాములు ఉంటాయి. రకరకాల కళాకారులు దిగుతారు. సినిమా నాటకాలు ఒకప్పుడు వేసేవారు. సినిమాలు కూడా వేసేవారు. సంక్రాంతి సందేశం... సామూహిక ఉత్సవం. జీవితం సాటి మనుషులతో కలిసి మెలిసి సాగాలని చెప్తుంది. ఉన్నది పంచుకుని తినాలని చెప్తుంది. శ్రమ చేసి సమృద్ధితో జీవించమని చెబుతుంది. నలుగురూ కలిసి ప్రకృతి వనరులను ఫలవంతం చేసుకుని నలుగురూ వృద్ధి కావాలని కోరడమే సంక్రాంతి. ఇవి చదవండి: Makar Sankranti 2024: పతంగులు ఎందుకు ఎగురవేస్తారో తెలుసా? -
నటి సాయి పల్లవి కమ్యూనిటీకి చెందిన ‘హేతై హబ్బా’ వేడుక గురించి తెలుసా?
స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడు. తనదైన నటన, అందం, అభినయంతో చాలా తక్కువ కాలంలోనే ఆడియెన్స్ను విశేషంగా ఆకట్టుకున్న చక్కటి నటి సాయి పల్లవి. కేవలం నటనకు మాత్రమే కాకుండా, సినిమాల కథలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఆమె ప్రత్యేకత. ఒక విధంగా చెప్పాలంటేనే ఈ వైఖరే సాయి పల్లవికి నటిగా గౌరవనీయమైన స్థాయిని అందించింది. పాత్ర ఏదైనా సహజంగా ఆ పాత్రలో ఒదిగి పోవడం ఆమెకు వెన్నతోపెట్టిన విద్య. అంతేకాదు నాట్యంలో కూడా నాట్య మయూరి అనిపించుకుంది. బడగ తెగకు చెందిన సాయి పల్లవి ఫిదాలో అల్లరి అమ్మాయిగా ఫిదా చేసింది. ప్రేమమం మొదలు తెలుగులో నటించిన లవ్ స్టోరీలో సారగ దరియా అంటూ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంకా విరాటపర్వంలో డీగ్లామరైజ్డ్ పాత్రలో పేదల కష్టాలపై పోరాడే అన్నల ఆకర్షితురాలైన యువతిగా, శ్యామ్ సింగ రాయ్ సినిమాలో దేవదాసిగా సాయి పల్లవి నటన నభూతో నభవిష్యతి. ఏ పాత్రనైనా అవలీలగా నటించడం ఆమెకు తెలుసు. అయితే సాయి పల్లవి తమిళనాడులో నీలగిరి పర్వత ప్రాంతానికి చెందిన బడగ అనే గిరిజన తెగకు చెందిన అమ్మాయి సాయి పల్లవి. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది పల్లవి. అసలు ఏంటీ బడగ జాతి ఈ వివరాలు చూద్దాం. #WATCH | Tamil Nadu: A large number of devotees participate in the Hethiyamman temple festival, in Nilgiris. pic.twitter.com/jLBINIdul9 — ANI (@ANI) January 1, 2024 బడగా, అంటే అర్థం 'ఉత్తరం. పాత కన్నడ బడగానా నుంచి వచ్చింది. బడగాలపై పరిశోధన దాదాపు ఆరు దశాబ్దాలపాటు పరిశోధించిన అమెరికన్ మానవ శాస్త్రవేత్త పాల్ హాకింగ్స్ ప్రకారం సుల్తానుల హింసనుంచి పారిపోయి మైసూర్ మైదానాల నుండి వలస వచ్చిన వొక్కలిగాలుగా భావిస్తారు. నీలగిరి జిల్లాలో దాదాపు 400 గ్రామాలలో బడగలు నివసిస్తున్నారట. బడగలు బడగా అనే భాషను మాట్లాడతారు. దాదాపు ఇది కన్నడ భాషకు దగ్గరగా ఉంటుంది. కానీ లిపి లేదు. ఇంగ్లీష్, తమిళం, మలయాళం, తెలుగు భాషలతోపాటు బడగ భాషను కూడా సాయి పల్లవి బాగా మాట్లాడుతుంది. బడగలు దాదాపు 400 గ్రామాలలో నివసిస్తున్నారు. నీలగిరి జిల్లాలో బడగలు అతిపెద్ద ఆదిమ తెగలు. నీలగిరి మొదట గిరిజనుల భూమి.కుకల్, కడనాడ్, ఈతలార్, నుండాల, మేలూరు, హులికల్, అతికరాట్టి, మేల్కుంద, కిల్కుంద, కెట్టి, తంతనాడు, మిలిదేను, నందట్టి, జక్కనారి, అరవేను, తిన్నియూర్, అయ్యూరు, కన్నెరిముక్కు, బెరగని, త్వున్నేర్, జక్క, తదితర గ్రామాల్లో వీరు నివసిస్తారు.వీరిని నీలగిరి గౌడలు అని కూడా అంటారు.బడగాలు ప్రాచీన శిలాయుగానికి చెందినవారిగా చరిత్రకారులు భావిస్తారు. బడగాలు పండుగలను "హబ్బా" అని పిలుస్తారు. బడగాస్ ప్రధాన దేవతలు హెతాయ్ , అయ్య. అలాగే శివుడు, కృష్ణుడు, ఖాలి, మారి, మునియప్పను కూడా పూజిస్తారు. ముఖ్యమైన పండుగలు డెవ్వా హబ్బా, హేతే హబ్బా, సకలతి హబ్బా, ఉప్పట్టువ హబ్బా. గిరిజన తెగ అయిన బడగాలు మా ఖలీ హబ్బా, దేడిసిమి హబ్బా, కృష్ణ జయంతి, వినాయగర్ చతుర్థి, మర్రి హబ్బా, మురుగర్ హబ్బా, రామర్ హబ్బా, హనుమాన్ జయంతి తోపాటు ప్రకృతిని, నీటిని, సూర్యుడు, సర్పాలను ప్రకృతిని పూర్వీకులను కూడా పూజిస్తారు. ఆదివాసి బడగా పురాతన అగ్ని తయారీ ప్రక్రియ (చెకుముకి రాళ్ల రాపిడి ద్వారా నిప్పు తయారీని) ఇప్పటికీ వారి దేవా పండుగ సమయంలో అవసరమైన ఆచారంగా ప్రదర్శిస్తారు వారు రెండు రాళ్లు లేదా రెండు కర్రలు రుద్దడం ద్వారా రాపిడి ద్వారా అగ్నిని ఉత్పత్తి చేశారు. దీన్ని "నీలిగోలు" లేదా నిటారుగా ఉండే కర్ర అంటారు. శివుని అవతారంగా భావించే సూర్యుడిని,విష్ణువు అవతారంగా నాగప్పను ఆరాధిస్తారు హేతై హబ్బా ప్రతి సంవత్సరం డిసెంబరు-జనవరిలో ఒక నెల పాటు హేతై హబ్బాను ఘనంగా జరుపుకుంటారు. తమిళ మార్గశిర మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే తొలి సోమవారం హేతై హబ్బా వేడుకను నిర్వహిస్తారు. రక్షకురాలిగా , ప్రయోజకురాలిగా విశ్వసించే హేతై అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఈ పండుగ పచ్చని నీలగిరి ప్రకృతి దృశ్యం నేపథ్యంలో భక్తులు సాంప్రదాయ తెల్లని దుస్తులలో హేతే దేవతను ఆరాధిస్తారు. ప్రతి ఏడాది దాదాపు ఎనిమిది రోజుల పాటు భారీ ఊరేగింపులతో లక్షలాది మంది బడగలు తమ దేవతను కీర్తించేందుకు ఈ వేడుకను జరుపుకోవడం ఆనవాయితీ. సాయి పల్లవి కూడా సాంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలు గతంలో షేర్ చేసింది. బడగ కమ్యూనిటీనుంచి వచ్చిన ఇతర ప్రముఖులు బడగ తెగ సంస్కృతి, ఆచారాలతోపాటు విద్యకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే 80 శాతం అక్షరాస్యతను కలిగి ఉన్నారు. అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలలో , మరికొందరు విదేశాలలో పనిచేస్తున్నారు. వీరిలో ఒకరు మాజీ లోక్సభ ఎంపీ, దివంగత అక్కమ్మ దేవి. ఆమె డిగ్రీ చదివిన తొలి బడగ మహిళ . 1962 నుండి 1967 వరకు నీలగిరి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇక తొలి మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ బెల్లి లక్ష్మీ రామకృష్ణన్ MA ప్రసిద్ధి. ఈమె తొలి మహిళా గెజిటెడ్ అధికారిణి కూడా. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేశారు. -
హిమాచల్కు టూరిస్టుల తాకిడి!
హిమాచల్ ప్రదేశ్లో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు పర్యాటకులు లెక్కకుమించి తరలివచ్చారు. సిమ్లా, మనాలి ప్రాంతాలకు.. ఇసుకవేస్తే రాలనంత జనం వచ్చారు. గత మూడు రోజుల్లో నాలుగు లక్షల మంది పర్యాటకులు సిమ్లా, మనాలిలకు తరలి వచ్చారు. సిమ్లాలోని హోటళ్లలో ఆక్యుపెన్సీ 100 శాతానికి చేరుకుంది. సిమ్లా నగరంలోని హోటళ్లు కిక్కిరిసిపోయాయని ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ పాల్ తెలిపారు. శనివారం నుండి సోమవారం వరకు సెలవులు రావడంతో ఈ ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి పెరిగింది.ధర్మశాల, సిమ్లా, నర్కండ, మనాలి, డల్హౌసీ తదితర ప్రాంతాలతో పాటు హిమాచల్లో క్రిస్మస్ వేడుకలు చేసుకునేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సిమ్లా పోలీసులు నగరంలో వాహనాల ప్రవేశ డేటాను విడుదల చేశారు దీని ప్రకారం గత 72 గంటల్లో సిమ్లాకు 55,345 వాహనాలు వచ్చాయి. ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు కరోనా ముప్పు పొంచివున్న నేపధ్యంలో రద్దీ ప్రదేశాలలో మాస్క్లు ధరించడం, రెండు గజాల దూరం పాటించడం తదితర మార్గదర్శకాలను ఆరోగ్య శాఖ జారీ చేసింది. మరోవైపు సిమ్లాలోని రిడ్జ్ గ్రౌండ్లో సోమవారం నుంచి వింటర్ కార్నివాల్ ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో కోవిడ్ నిబంధనలపై పర్యాటకులకు అవగాహన కల్పించాలని జిల్లా యంత్రాంగం పలు హోటళ్ల యజమానులకు సూచించింది. ఇది కూడా చదవండి: బూస్టర్ డోసు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు? -
క్రిస్మస్ శాంటా తాత ఎవరు? ఏ ఊరి నుంచి వస్తాడు? అసలు నిజమేంటి?
"క్రిస్మస్ రోజున శాంటా తాత వస్తాడు. బహుమతులెన్నో తెస్తాడు. శాంటా ఉత్తర ధ్రువం నుంచి వస్తాడని అందరూ అంటారు. కాదు శాంటా మా ఊరి నుంచి వస్తాడు అంటారు ఫిన్లాండ్ దేశస్తులు. ఫిన్లాండ్లోని ‘రొవానియమి’ పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. ప్రతి క్రిస్మస్కు పర్యాటకులు అక్కడకు వెళ్లి శాంటా ఊరు ఇదేనంటూ సందడి చేస్తారు. ఈ ఊరి విశేషాలు చాలానే ఉన్నాయి. పిల్లలకు చెప్తే అబ్బుర పడతారు." ‘జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ జింగల్ ఆల్ ద వే’.. ఎర్రని దుస్తుల్లో, తలమీద టోపీతో, గుబురు గెడ్డంతో, రైన్ డీర్లు లాగే స్లెడ్జ్ బండి మీద, బోలెడన్ని కానుకలు మూటగట్టుకుని క్రిస్మస్ రాత్రి ఆకాశ వీధుల గుండా క్రిస్మస్ తాత వస్తాడని పిల్లలకు ఒక నమ్మకం. క్రిస్మస్ వచ్చే ముందే తల్లిదండ్రులు పిల్లల్ని ‘క్రిస్మస్ తాత ఏం ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నావు’ అని అడుగుతారు. కొందరు పిల్లలు ‘ఫలానాది ఇవ్వు’ అని క్రిస్మస్ తాతకు లెటర్లు రాస్తారు. కొందరు పిల్లలు ఇవేవీ అడక్కుండా తమకోసం ఏం ఇస్తాడో చూద్దాం అని ఉత్సుకతతో ఎదురు చూస్తారు. ఎవరి బాల్యంలో అయినా ఇది అద్భుతమైన జ్ఞాపకం. క్రిస్మస్ తాత అంటూ ఎవరూ రారు అని పిల్లలకు తెలిసినా.. ఏమో వస్తాడేమో అనుకునే అమాయకమైన వయసు అది. వస్తాడేమో అనిపించే ఉత్సుకత ఉండేప్రాయం అది. అందుకే తల్లిదండ్రులు, బంధువులు చిన్నారులు ఉన్నచోట వారు నిద్రపోయాక వారి కోసం తల దగ్గర కానుకలు పెట్టి వెళతారు. పిల్లలు తెల్లారి లేచి వాటిని చూసుకుని ‘శాంటా ఇచ్చాడు’ అని సంబర పడతారు. శాంటా తాత ఎవరు? ఇది బైబిల్ పాత్ర కాదు. క్రీ.శ.280 కాలంలో టర్కీలో సెయింట్ నికొలస్ అనే ఒక బిషప్ క్రిస్మస్ పండుగ నాడు పేదవారికి, ముఖ్యంగా పిల్లలకు ఎంతో కొంత సహాయం చేసేవాడట. నిద్రపోతున్న వారి పక్కన కానుకలు, డబ్బు పెట్టి వెళ్లేవాడట. సాక్సుల్లో బంగారు నాణెలు పెట్టి ఇళ్లల్లో పడేసేవాడని అంటారు. పండగంటే ఆనందం పంచడమే కదా. ఇది అందరికీ నచ్చింది. ఇలా ఒక తాత వచ్చి కానుకలు ఇస్తే బాగుండు అనే కోరిక పెరిగింది. మంచి కోరికను తీర్చడానికి ప్రపంచమంతా ముందుకొస్తుంది. అందుకే క్రిస్మస్ తాత అందరి తాత అయ్యాడు. సెయింట్ నికోలస్ కాస్తా శాంటా క్లాజ్ అయ్యాడు. శాంటా ఊరు.. నిజమైన శాంటా క్లాజ్ టర్కీ వాడైనా కాలక్రమంలో నార్త్పోల్ వాడయ్యాడు. దీనికి కారణం 1893–96ల మధ్య థామస్ నాస్ట్ అనే అమెరికన్ కార్టూనిస్టు శాంటా క్లాజ్ బొమ్మలు పత్రికలకు గీసి శాంటా నార్త్పోల్ వాడని అడ్రస్ పెట్టాడు. దానికి కారణం ఆ రోజుల్లో నార్త్ పోల్ (ఉత్తర ధ్రువం) ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కనుక దాని చుట్టూ ఒక దైవిక కల్పనలు సాగేవి. సెయింట్స్ అక్కడే ఉంటారని అనుకొని ఉండొచ్చు. అదీగాక అక్కడ ఎప్పుడూ మంచు పడుతూ ఉంటుంది కనుక క్రిస్మస్ అంటే మంచుకాలం కనుక థామస్ నాస్ట్ ఏకంగా 24 గంటలూ మంచు ఉండే ప్రాతాన్ని శాంటా క్లాజ్ తావును చేసి ఉంటాడు. ఇక అక్కడ రైన్డీర్లు ఉంటాయి కాబట్టి వాటిని వాహనంగా మార్చారు. ఫిన్లాండ్ ఊరు.. ఫిన్లాండ్ దేశం వారు శాంటా తమ ఊరి వాడేనని ఒక వాదన మొదలుపెట్టారు – పర్యాటక ఎత్తుగడే కావచ్చు. ఫిన్లాండ్ ఆర్కిటిక్ సర్కిల్లో వచ్చే దేశం కాబట్టి అక్కడ ఎప్పుడూ మంచే కాబట్టి శాంటా ఊరు తమ దేశంలోదే అనుకుని ఉండొచ్చు. అంతటితో ఆగక ‘రొవానిఎమి’ అనే ఊరిని శాంటా ఊరిగా టూరిస్ట్ ఎట్రాక్షన్ చేశారు. ఇక్కడ శాంటా ఇల్లు, శాంటా పోస్టాఫీసు, శాంటా తిరిగే స్లెడ్జ్బళ్లు అన్నీ ఉంటాయి. మైనస్ 12 డిగ్రీల చల్లదనం ఉండే క్రిస్మస్ కాలంలో కూడా టూరిస్టులు శాంటా ఊరికి వెళ్లి సందడి చేస్తారు. మత భావనలు పొందుతారు. ఈ ఊరి వారు శాంటాతో మాట్లాడాలనుకునే పిల్లల కోసం ఒక టెలిఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఇక్కడి పోస్టాఫీసుకు ప్రతి సంవత్సరం 200 దేశాల నుంచి రెండు లక్షల ఉత్తరాలు శాంటా నుంచి పిల్లలకు వస్తాయి. ఇక్కడకు వెళ్లిన పర్యాటకులు ఇక్కడి పోస్టాఫీసులో ఉత్తరం రాసి పడేస్తే కరెక్ట్గా క్రిస్మస్కు అందేలా పంపుతారు. అంటే శాంటా పంపినట్టు పంపుతారు. అదో సరదా. 'శాంటా అబద్ధం కావచ్చు. కాని శాంటా ఉంటాడన్న పిల్లల అమాయక కామన అబద్ధం కాకూడదు. ఈ క్రిస్మస్ రోజున అందరు పిల్లలకూ, ముఖ్యంగా ఆట వస్తువులు లేని పేద పిల్లలకు మీరే శాంటాగా మారండి. హ్యాపీ క్రిస్మస్. ఇవి చదవండి: ముక్కోటి ఏకాదశిన ఉత్తర ద్వార దర్శనమే మేలు.... ఎందుకు? -
విజయవాడ : అమరావతి బాలోత్సవం...ఆకట్టుకున్న చిన్నారుల ఆటపాటలు (ఫొటోలు)
-
ఆ కొత్త సీఎంకు ఏటా 20 వేల రాఖీలు..
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు రాష్ట్రంలోని మహిళల నుంచి ఎంతో ఆదరణ లభించింది. మహిళలకు సంక్షేమ పథకాలు అందించడంలో శివరాజ్ సింగ్ ముందున్నారనే వాదన వినిపిస్తుంటుంది. రాష్ట్ర ప్రజలు ఆయనను ముద్దుగా ‘మామ’ అని పిలుచుకుంటారు. శివరాజ్కు ఇంతటి ప్రజాదరణ ఉన్నప్పటికీ, భారతీయ జనతా పార్టీ అతని స్థానంలో మోహన్ యాదవ్ను ముఖ్యమంత్రిని చేసింది. అయితే మోహన్ యాదవ్ కూడా రాష్ట్రంలోని మహిళల ఆదరణకు దక్కించుకున్నారు. గడచిన పదేళ్లుగా తన అసెంబ్లీ నియోజకవర్గంలోని 20 వేల మంది అక్కాచెల్లెళ్లు ఆయనకు రాఖీ కడుతున్నారు. మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. శివరాజ్ స్థానంలో మోహన్ యాదవ్ పేరును సీఎం పదవికి ప్రకటించడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది. మహిళా ఓటర్లలో ఆయనకున్న ప్రజాదరణ కూడా ఇందుకు ఒక కారణమంటున్నారు. పదేళ్ల క్రితం మోహన్ యాదవ్ రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా ఉజ్జయినిలోని బాగ్పురా, గోపాల్పురా ప్రాంతాలకు చెందిన వెయ్యిమంది మహిళలు మోహన్ యాదవ్కు రాఖీ కట్టారు. ఆ సంఖ్య నేడు 20 వేలకు చేరుకుంది. రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లకు మోహన్ యాదవ్ కానుకలు ఇస్తుంటారు. మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ ఆనందీబెన్ కూడా మోహన్ యాదవ్కు రాఖీ కట్టారు. మోహన్ యాదవ్కు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఒక సోదరి పేరు గ్యారాసి బాయి, మరొక సోదరి పేరు కళావతి యాదవ్. అతనికి ఇద్దరు సోదరులు నంద్లాల్ యాదవ్, నారాయణ్ యాదవ్. మోహన్ యాదవ్ ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నారు. కళావతి యాదవ్ రాజకీయాల్లో కూడా చురుకుగా ఉన్నారు ఉజ్జయినిలోని వివిధ ప్రాంతాల నుండి ఆరుసార్లు కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కళావతి యాదవ్ ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. మోహన్ యాదవ్కు భార్య సీమా యాదవ్, కుమారులు అభిమన్యు యాదవ్,వైభవ్ యాదవ్, కుమార్తె ఆకాంక్ష యాదవ్ ఉన్నారు. ఇది కూడా చదవండి: 2001- 2023.. అదే డిసెంబరు 13.. పార్లమెంట్ దాడుల్లో తేడా ఏమిటి? -
నవరత్న ఖచిత సుమేరు పర్వతంపై శ్రీరాములవారు..
అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో కాశీ విద్వత్ పరిషత్ తాజాగా రామమందిర్ ట్రస్ట్కు శ్రీరాముని సింహాసనం నవరత్న ఖచిత శోభాయమానంగా ఉండాలని ప్రతిపాదించింది. దీంతో రామాలయంలోని గర్భగుడిలో నవరత్నాలతో చేసిన సుమేరు పర్వతంపై శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠితం కానుంది. ఈ సుమేరు పర్వతం వజ్రం, పచ్చ, కెంపు వంటి విలువైన రత్నాలతో రూపొందనుంది. శ్రీరాముని పట్టాభిషేక వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల్లో సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మృగశిర నక్షత్రంలో వైదిక పద్ధతిలో ఈ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఆలయంలో కొలువయ్యే శ్రీరామునికి తొలి హారతిని ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వనున్నారు. కాశీలో కొలువైన విశ్వనాథునితో సహా అక్కడి దేవతామూర్తులందరూ ఈ వేడుకలలో పాల్గొననున్నారు. కాశీలోని సమస్త దేవతలకు ఆహ్వాన పత్రికలు ఇచ్చేందుకు కాశీ విద్వత్ పరిషత్ సన్నాహాలు చేస్తోంది. కాగా సంవద్ శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ రెండు రోజుల సమావేశం శనివారం ప్రారంభమైంది. తొలిరోజు రామజన్మభూమి కాంప్లెక్స్లోని ఆలయంతోపాటు నిర్మాణంలో ఉన్న పది ప్రాజెక్టుల గురించి సమీక్షించారు. ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. జనవరి 20 నుంచి 22 వరకు భక్తులు శ్రీరాముని దర్శనం చేసుకోలేరని ట్రస్టు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్రాణ ప్రతిష్ఠ, వీఐపీల రాక దృష్ట్యా మూడు రోజుల పాటు సాధారణ దర్శనాలను నిలిపివేయనున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: యూపీలో ఘోర ప్రమాదం.. ఎనిమిదిమంది సజీవ దహనం! -
భక్తిశ్రద్ధలతో ఛఠ్ పూజలు (ఫొటోలు)
-
రాజకీయ విభేదాలు.. దీపావళి వేడుకల్లో అజిత్ పవార్, సుప్రియా సూలే
ముంబై: రాజకీయ విభేదాల నడుమ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పూణె జిల్లాలోని బారామతిలో 'భౌ బీజ్' (భాయ్ దూజ్) వేడుకలను జరుపుకున్నారు. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్, వారి కుమారులు పార్థ్ పవార్, జే పవార్తో పాటు మిగిలిన పవార్ కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. ప్రతి ఏడాది పవార్ కుటుంబ సభ్యులు దీపావళి సందర్భంగా భాయ్ దూజ్ వేడుకలు జరుపుకుంటారు. భాయ్ దూజ్ వేడుకలు అన్న చెల్లెల్ల మధ్య బంధాన్ని మరింత బలంగా మారుస్తాయని పేర్కొంటూ సుప్రియా సూలే ట్విట్టర్ వేదికగా ఆ ఫొటోలను పంచుకున్నారు. రాజకీయ మనస్పర్ధల మధ్య ఈసారి వేడుకలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉన్నాయా? అని సుప్రియా సూలేను అడిగినప్పుడు.. 'వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత జీవితం రెండూ భిన్నమైన విషయాలు. ప్రతి సంవత్సరం మాదిరిగానే మేము భాయ్ దూజ్ పండుగను జరుపుకోవడానికి అజిత్ పవార్ నివాసానికి వెళ్లాము. వ్యక్తిగతమైన కక్షలు ఎవరితోనూ ఉండవు' అని అమె అన్నారు. ఈ ఏడాది ఎన్సీపీ నుంచి విడిపోయి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంతో అజిత్ పవార్ చేతులు కలిపారు. అటు నుంచి ఎన్సీపీలో శరద్ పవార్కు అజిత్ పవార్కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ పరిణామాల తర్వాత శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, అజిత్ పవార్తో కలిసి దీపావళి పండగ వేళ వేడుక చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదీ చదవండి: బీజేపీకి 20 ఏళ్ల కంచుకోట.. ఈసారి కష్టమేనా? -
పండగ వేళ రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట
ఢిల్లీ: దీపావళి వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. కొన్ని మార్గాల్లో రైళ్లు కిక్కిరిసిపోయాయి. టికెట్ ముందే బుక్ చేసుకున్నప్పటికీ రైలులో కాలుపెట్టే పరిస్థితి లేదని కొందరు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే యాజమాన్యంపై విమర్శలు కురిపిస్తున్నారు. అధికారుల నిర్వహణ లోపం వల్ల తాము దీపావళికి ఇంటికి చేరుకోలేకపోయామని సోషల్ మీడియా వేదికగా వాపోయారు. "ఇండియన్ రైల్వే నిర్వహణలోపం నా దీపావళిని నాశనం చేసింది. ఏసీ టిక్కెట్ను కొన్నప్పటికీ రైలు ఎక్కే పరిస్థితి లేదు. పోలీసుల నుండి ఎటువంటి సహాయం లేదు. నాలాంటి చాలా మంది రైలు ఎక్కలేకపోయారు," అని ట్విట్టర్ వేదికగా ఓ వ్యక్తి పంచుకున్నాడు. PNR 8900276502 Indian Railways Worst management Thanks for ruining my Diwali. This is what you get even when you have a confirmed 3rd AC ticket. No help from Police. Many people like me were not able to board. @AshwiniVaishnaw I want a total refund of ₹1173.95 @DRMBRCWR pic.twitter.com/O3aWrRqDkq — Anshul Sharma (@whoisanshul) November 11, 2023 దేశ రాజధానిలోనూ దీపావళి వేడుకల సందర్భంగా ప్రయాణికులతో బస్సు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఢిల్లీలో ఆనంద్ విహారీ కౌశాంబి ప్రాంతంలో ఇంటర్ స్టేట్ బస్సు టర్మినల్లో నడవడానికి కూడా వీలులేని దుస్థితి ఏర్పడింది. పండగ సందర్భంగా జనం సొంత ఊళ్లకు వెళుతున్నారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు జనంతో నిండిపోయాయి. #WATCH | Huge rush of people at Anand Vihar- Kaushambi on Delhi-UP border near the Anand Vihar railway station and inter-state bus terminal pic.twitter.com/DkDXSgganz — ANI (@ANI) November 11, 2023 న్యూఢిల్లీలోని స్టేషన్లలో రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. శనివారం సూరత్లో బీహార్కు వెళ్లే ప్రత్యేక రైలు ఎక్కే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మరికొందరు స్పృహతప్పి పడిపోయారని పోలీసులు తెలిపారు. #WATCH | Gujarat | A stampede situation ensued at Surat railway station due to heavy crowd; one person died while three others were injured. The injured were shifted to the hospital: Sarojini Kumari Superintendent of Police Western Railway Vadodara Division (11.11) pic.twitter.com/uAEeG72ZMk — ANI (@ANI) November 11, 2023 ఇదీ చదవండి: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు -
దీపావళికి మీ ఇంటిని అందంగా అలంకరించుకోండి ఇలా..
దీపావళి అంటే దీపాల పండుగే కాదు, ఇళ్లువాకిళ్లను శుభ్రం చేసి, ఇంటిని చక్కగా సర్దుకోవడం కూడా. ఇంటిని సర్దే క్రమంలో అందంగా అలంకరించుకోవడం కూడా ఈ పండగ సమయంలో చేసే ముఖ్యమైన పని. ఎంత అనుకున్నా ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఇంటిని డెకరేట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా ఏం పర్లేదు.. చిన్నచిన్న ఐడియాలు, చిట్కాలతో మీ ఇంటిని క్షణాల్లో అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో చూడండి. ►గాజు, రాగి, ఇత్తడి వెడల్పాటి పాత్రలో నీళ్లుపోసి తాజాపువ్వులతో నింపేయాలి. పూలమధ్యలో దీపాలను వెలిగించాలి. ఈ పాత్రను గుమ్మానికి ఎదురుగా, డోర్ పక్కన పెడితే చాలా అందంగా ఉంటుంది. ► ఇంటి గుమ్మం పెద్దగా ఉన్నట్లయితే సంప్రదాయబద్ధంగా అలంకరించాలి. గుమ్మం ముందు రంగురంగుల ముగ్గులను పూలతో అలకరించి మధ్యలో దీపాలు పెట్టాలి. ఈ రంగవల్లుల పైన వేలాడే ల్యాంప్స్ను వెలిగిస్తే ఇంటి గుమ్మం కళకళలాడిపోతుంది. ► వివిధ రంగులతో మెరిసిపోయే చీరలు చున్నీలను గ్లాస్ విండో, డోర్లకు కర్టెన్స్లా పెట్టాలి. ఈ చీరలపైన సన్నని లైటింగ్ దండలను వేలాడదీయాలి. గది మధ్యలో సువాసనలు వెదజల్లే దీపాలను వెలిగిస్తే ఇల్లు మరింత కాంతిమంతంగా మారుతుంది. ► గుమ్మం ముందు, హాల్లో వేసే ముగ్గుని రెండు మూడు రకాల పువ్వులతో వేయాలి. ఈ ముగ్గు మధ్యలో మట్టిప్రమిదలు, సువాసనలు వెదజల్లే క్యాండిల్స్ పెట్టి వెలిగించాలి. ► ఇంటిముందు పెద్దగా స్థలం లేనప్పుడు డోర్ పక్కనే ఉన్న గోడ మూలనుంచి దీపాలు పెట్టాలి. వీటిచుట్టూ పూలతో ఆలంకరించాలి. ఇవి ఇంటిని మరింత అందంగా చూపిస్తాయి. ► మార్కెట్లో దొరికే వివిధ రకాల వేలాడే దీపాలను వెలిగిస్తే చీకట్లో సైతం ఇల్లు కాంతులీని, పండుగ వాతావరణం కనిపిస్తుంది. ► గోడలకు వేలాడదీసే రంగురంగుల డెకరేషన్ వస్తువులు మార్కెట్లో చాలా కనిపిస్తాయి. కలర్ఫుల్ పూసలు, దారాలు, రంగురంగుల మెరిసే క్లాత్తో చేసిన, గంటలతో వచ్చే అలంకరణ వస్తువులను గోడకు వేలాడదీసి, కింద మట్టి దీపాలతో అలంకరిస్తే ఇల్లు కళకళలాడిపోతుంది. ► వీటిలో ఏదీ చేసే సమయం లేకపోతే మార్కెట్లో దొరికే చెక్క, యాక్రాలిక్ ల్యాంప్స్ కొనుక్కోని... కిటికీలు, గ్యాలరీలోవేలాడదీస్తే మీ ఇంటి దీపావళికి కళ వస్తుంది. ఇంకెందుకాలస్యం మీ ఇంటికి నప్పే విధంగా సింపుల్ డెకరేషన్ ప్రయత్నాలు మొదలుపెట్టండి. -
బంతిపూలకు మాత్రమే ఆ ప్రత్యేకత.. అందుకే పూజల్లో వాడుతారు
వేడుక వచ్చిందంటే చాలు బంతిపూల తోరణాలతో ఇళ్లూ వాకిళ్లు కళకళలాడుతూ ఉంటాయి. బంతిపూలకు మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే బంతిని మనకు ప్రకృతి ఇచ్చిన బహుమతిగా చెప్పచ్చు. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించగానే భూమిలోని చీకట్లు తొలగి వెలుగు రేకలు అంతటా వ్యాపిస్తాయి. అదేవిధంగా, బంతిపువ్వును చూడగానే, మన మనస్సు తన బాధలను మరచిపోయి సంతోషిస్తుంది. ఈ సారూప్యత వల్ల బంతిపువ్వును సూర్యభగవానుడికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. గణేష్ చతుర్థి, నవరాత్రుల నుండి దీపావళి వరకు ఈ పూలకు చాలా డిమాండ్ ఉంది. మ్యారిగోల్డ్ శాస్త్రీయ నామం టాగెట్స్. భారతదేశానికి 350 సంవత్సరాల క్రితం పోర్చుగీసు వారి రాకతో మెక్సికో నుండి చేరుకుంది బంతి. చాలా అందంగా కనిపించే పసుపు, కుంకుమ రంగులో ఉండే ఈ పువ్వులను అందరూ ఇష్టపడతారు. విస్తారంగా సాగు.. మన దేశంలో బంతిపూల సాగు పెద్ద ఎత్తున చేస్తుంటారు రైతులు. ఇది మతపరమైన ఆచారాలతో పాటు, అనేక ఉత్పత్తుల తయారీలలో కూడా ఉపయోగపడుతుంది. సీజన్ను బట్టి బంతి పువ్వులను సాగు చేస్తారు. ఇది ఏప్రిల్, మే నెలల్లో సాగును ప్రారంభిస్తే ఆగస్టు–సెప్టెంబర్లలో చలికాలం ప్రారంభమవడానికి ముందు పంట చేతికొస్తుంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా 50 రకాల బంతి పువ్వులు ఉన్నాయి, వాటిలో మూడు జాతులు వాణిజ్య, వ్యవసాయం కోసం పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల పొలాలు బంతి పువ్వులతో వెలిగిపోతుంటాయి. త్యాగానికి పేరు బంతి పువ్వు బృహస్పతికి ఇష్టమైనదిగా జ్యోతిష్యులు చెబుతుంటారు. దేవతల గురువు బృహస్పతిని బంతి పువ్వులతో పూజిస్తే జ్ఞానం పెంపొందుతుందని నమ్మకం. పసుపు–కుంకుమపువ్వును కలిపినట్టుగా ఉండే ఈ రంగు త్యాగానికి ప్రసిద్ధి చెందింది, మరోవైపు ఇది అగ్ని వంటి ఉగ్రమైన వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ప్రజల మొదటి ఎంపిక ప్రజలు తమ ఇళ్లను బంతి పువ్వులతో అలంకరిస్తారు. కోల్కతా నుంచి వచ్చే బంతిపూలలో ఒకటి ఎరుపు, మరొకటి పసుపు. ఈ రంగు పువ్వులను బసంతి మేరిగోల్డ్ అంటారు. ఇదే అన్ని చోట్ల జనం మొదటి ఎంపికగా ఎంచుకుంటున్నారు. బంతిపూలతో అందంగా మెరిసిపోవచ్చు బొబ్బలు, కాలిన గాయాలు, దురదలు, చర్మవ్యాధుల నివారణలో బంతి పువ్వులను ఉపయోగిస్తారని ఆయుర్వేదంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రక్తకణాలను ఉత్పత్తి చేసి చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా మార్చగలవు. బంతి పువ్వులు వాపునే కాదు అలసటను తగ్గించడానికి కషాయంలా కూడా ఉపయోగిస్తారు. బంతి పువ్వు పొడి ముడతలు పడిన చర్మాన్ని మృదువుగా చేయడంలో కూడా సహాయపడుతుంది. బంతి పువ్వులు సహజ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కాలుష్యం నుండి చర్మాన్ని కాపాడతాయి. అందమైన ప్రయోజనాలు బంతిపూలు యాంటీ బయొటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. మేరిగోల్డ్ ఫేస్ ప్యాక్ ముఖ చర్మాన్ని బిగుతుగా చేయడంతో పాటు చర్మకాంతిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మొటిమలు, ముఖంపై మచ్చలు ఉన్నవారు బంతి పువ్వు ఫేస్ ప్యాక్ని ఉపయోగించవచ్చు. అందుకే, సౌందర్య ఉత్పత్తులు, మసాజ్ నూనెలు, లోషన్లు, సబ్బులు.. మొదలైన ఉత్పత్తులలో బంతిపువ్వులను ఉపయోగిస్తారు. దీని ఉపయోగం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీన్ని నొప్పి, వాపును తగ్గించడానికి, పేగు, కడుపు రుగ్మతల నుండి ఉపశమనానికి, అల్సర్లను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. -
దుబాయ్లో దీపావళికి ఏం చేస్తారు? బుర్జ్ ఖలీఫాలో ఏం జరుగుతుంది?
దీపావళిని దీపాల పండుగ అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా జరుపుకునే పండుగ ఇది. దీపావళి పండుగ ఆనందం, ఐక్యతలకు చిహ్నం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయ్లో దీపావళి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దీపావళి ఉత్సవ సమయాన ప్రజలు నూనె దీపాలు, కొవ్వొత్తులు వెలిగిస్తారు. ముగ్గులతో గృహాలను, బహిరంగ ప్రదేశాలను అలంకరిస్తారు. ఈ సంప్రదాయం దుబాయ్లో కూడా కనిపిస్తుంది. దుబాయ్వాసులు దీపావళి రోజున తమ ఇళ్లను దీపాల వెలుగులతో నింపేస్తారు. వ్యాపార సంస్థలను విద్యుత్ లాంతర్లతో అలంకరిస్తారు. ఈ దీపాల వెలుగులు దుబాయ్ అంతటా కనిపిస్తాయి. దుబాయ్లో దీపావళి షాపింగ్ ఉత్సాహం కొన్ని వారాల ముందుగానే ప్రారంభమవుతుంది. దుబాయ్లోని మార్కెట్లు, మాల్స్ కొనుగోలుదారులతో సందడిగా కనిపిస్తాయి. భారతీయ సంప్రదాయ దుస్తులైన చీరలు, కుర్తా-పైజామాలు మార్కెట్లలో విరివిగా కనిపిస్తాయి. దీపావళి వేడుకలలో అంతర్భాగమైన తీపి వంటకాలను, రుచికరమైన స్నాక్స్ను విరివిగా విక్రయిస్తుంటారు. దీపావళి నాడు దుబాయ్లో బాణాసంచా వెలుగులు అద్భుతంగా కనిపిస్తాయి. బుర్జ్ ఖలీఫా, పామ్ జుమేరా లాంటి ముఖ్యమైన ప్రాంతాలలో దీపావళి వేడుకలు అంబరాన్ని అంటుతాయి. దీపావళి సందర్భంగా దుబాయ్లోని పలు రెస్టారెంట్లు ప్రత్యేక దీపావళి వంటకాల మెనూలను అందిస్తాయి. అక్కడి భారతీయులు, పర్యాటకులు ఈ సాంప్రదాయ వంటకాల రుచులను ఆనందంగా ఆస్వాదిస్తారు. ఇది కూడా చదవండి: చైనా దురహంకారంపై అమెరికా, భారత్ ఉక్కుపాదం! -
దీపావళి వేడుకలు.. అమెరికాలో స్కూళ్లకు సెలవు
అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కోసం అమెరికాలోని భారతీయులు భారీ వేడుకలను ప్లాన్ చేశారు. అమెరికా ప్రభుత్వం దీపావళిని పండుగగా గుర్తించి పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్లో దీపావళి ఫెస్టివల్ గ్రాండ్గా జరిగింది. పాపాయిని పార్క్లో ఎడిసన్ మేయర్ సామ్ జోషి ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి ఈ వేడకల్లో పాల్గొన్నారు. తెలుగు వైభవాన్ని ఘనంగా చాటుతూ ఈ వేడుకలు నిర్వహించారు. తెలుగు పాట,ఆట కనువిందు చేశాయి. తెలుగు సంస్క్రృతి, సంప్రదాయాలకు ఈ వేడుకలు అద్దం పట్టాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి తీసుకువచ్చారు. ఇక వేదికపై బతుకమ్మలను పెట్టి ఆడపడుచులు ఆడి పాడారు. పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇక పలువురు కళాకారులు భారతీయ సంస్కృతిని చాటిచెప్పేలా ప్రదర్శనలు నిర్వహించారు. జే సీన్ స్ఫెషల్ మ్యూజికల్ ఫెర్మామెన్స్.. అహుతులను అలరించింది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్ ఫుడ్ స్టాల్స్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. షాపింగ్ స్టాల్స్, ఫుడ్ అండ్ రిటైల్ వెండర్స్ స్టాల్స్, కిడ్స్ జోన్, ఫైర్ వర్క్, Raffles బహుమతులు, విందు భోజనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ఈ వేడుకల్లో పాల్గొనటం ఒక అద్భుతమైన అనుభవం అంటూ ప్రవాసులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న ఎడిసన్ మేయర్ సామ్ జోషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
దీపావళిని ఏ ప్రాంతంలో ఎలా చేసుకుంటారు? బెంగాల్ ప్రత్యేకత ఏమిటి?
దీపావళిని దీపాల పండుగ అని కూడా అంటారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. మన దేశంలో ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశంలోని అన్నిప్రాంతాలవారు జరుపుకునే పండుగలలో ఇదొకటి. ఇతర దేశాలలోని ప్రవాసులు కూడా దీపావళిని చేసుకుంటారు. ఈ పండుగను హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు తమ సంప్రదాయాల ప్రకారం జరుపుకోవడం విశేషం. దీపావళిని దేశంలో వివిధ ప్రాంతాలలో అక్కడి సంస్కృతి, నమ్మకాల ఆధారంగా జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో రాక్షస రాజు రావణుడిని ఓడించిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ దీపావళిని జరుపుకుంటారు. శ్రీరాముడు, సీతామాతలను స్వాగతించడానికి నాటి ప్రజలు నూనె దీపాలను వెలిగించారట. ఆ దీపాలను తమ ఇళ్లు, వీధుల చుట్టూ అలంకరించారట. తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి, తీపి వంటకాలు ఆరగిస్తూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారట. అందుకే నేటికీ దీపావళినాడు ఉత్తరాదిన అందరూ పరస్పరం స్వీట్లు పంచుకుంటారు. పశ్చిమ భారతదేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర,గుజరాత్లలో దీపావళిని ఎంతో ఘనంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. సంపద, శ్రేయస్సులకు దేవతగా భావించే లక్ష్మదేవిని పూజిస్తారు. దీపాల పండుగను పురస్కరించుకుని తమ ఇళ్ల ముంగిట వివిధ రంగులతో అలంకరిస్తూ ముగ్గులు వేస్తారు. పలు సంప్రదాయ వంటలను తయారు చేసి, ఆరగిస్తారు. అలాగే తీపి వంటకాలను తమ స్నేహితులకు, బంధువులకు పంచిపెడతారు. దక్షిణ భారతదేశంలో దీపావళిని నాడు ప్రజలంతా తెల్లవారుజామునే నిద్ర లేచి, తలకు నూనె రాసుకుని స్నానం చేస్తారు. తరువాత కొత్త దుస్తులు ధరిస్తారు. తమ ఇళ్లలో నూనె దీపాలను వెలిగించి, గణేశుడు, లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. పలు రకాల వంటకాలను తయారు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఆనందంగా దీపావాళి వేడుకలు చేసుకుంటారు. తూర్పు భారతదేశంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో దీపావళినాడు కాళీమాత పూజలు చేస్తారు. ఆ రోజు కాళికామాతను పూజించడం వలన శక్తియుక్తులు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. దేవాలయాలు, ఇళ్లలో కాళీమాత విగ్రహాలను ఏర్పాటు చేసి, వాటికి పూజలు నిర్వహిస్తారు. అలాగే మట్టి ప్రమిదిలలో దీపాలను వెలిగిస్తారు. కాళీమాత విగ్రహాలను ఊరేగిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే పండుగ దీపావళి అనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: ప్రియాంకకు చేదు అనుభవం: పుష్ఫగుచ్ఛం ఇచ్చారు.. పూలు మరచారు! -
‘యూదుల దీపావళి’ ఏమిటి? దేనిపై విజయానికి గుర్తు?
భారతీయులు దీపావళి పండుగ కోసం ఏడాది పొడవునా ఆసక్తిగా వేచిచూస్తుంటారు. ఆ రోజున భారతదేశం యావత్తూ దీపకాంతులతో నిండిపోతుంది. దీపావళి రోజున ఎక్కడ చూసినా వెలుగులు విరజిమ్ముతాయి. అయితే మనం చేసుకునే దీపావళి లాంటి పండుగను యూదులు కూడా జరుపుకుంటారని మీకు తెలుసా? యూదులు ఈ ఉత్సవాన్ని ఎలా జరుపుకుంటారో.. దీపావళికి ఇది ఎలా సరిపోలి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న యూదులు జరపుకునే వెలుగుల పండుగ పేరు హనుక్కా. యూదులు దీనిని దీపాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ యూదులకు చాలా ముఖ్యమైనది. ఈ రోజున ఇజ్రాయెల్ అంతా కాంతులతో నిండిపోతుంది. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ పండుగ ఇజ్రాయిల్లో కేవలం ఒక్కరోజుతోనే ముగిసిపోదు. ఈ పండుగను యూదులు ఎనిమిది రోజులు ఆనందంగా జరుపుకుంటారు. హనుక్కా ఉత్సవ సమయంలో ప్రతి యూదు తమ ఇంటిలో 24 గంటలూ దీపాలు వెలిగిస్తాడు. యూదుల ఈ పండుగను మన దీపావళి తర్వాత అంటే డిసెంబర్లో జరుపుకుంటారు. యూదుల ఈ పండుగను ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 18 వరకూ జరుపుకుంటారు. అయితే ఈ పండుగను ఇజ్రాయెల్ యూదులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులంతా ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగకు ఎంతో గుర్తింపు ఉంది. ఈ ఉత్సవ సమయంలో ఎక్కడెక్కడి యూదులు సైతం వారి ఇళ్లకు చేరుకుని ఆనందంగా గడుపుతారు. శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు మనం దీపావళి జరుపుకున్నట్లే, యూదులు కూడా తమ విజయానికి గుర్తుగా హనుక్కా పండుగను జరుపుకుంటారు. నాటి రోజుల్లో క్రోబియన్ తిరుగుబాటు జరిగినప్పుడు గ్రీకు-సిరియన్ పాలకులకు వ్యతిరేకంగా యూదులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ విధంగా వారిని జెరూసలేం నుండి వెళ్లగొట్టారు. దీనికి గుర్తుగా యూదులు హనుక్కా ఉత్సవాన్ని చేసుకుంటారు. ఇది కూడా చదవండి: ఆసియాను వణికించిన భూ కంపాలివే.. -
వైభవంగా బతుకమ్మ, దసరా పండగ వేడుకలు
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ పోర్ట్లాండ్ సిటీ చార్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా పండగల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలను చార్టర్ ప్రెసిడెంట్ శ్రీని అనుమాండ్ల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళలు, చిన్నారులు సహా పలువురు తెలుగు వాళ్లంతా సందడిగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టి పడేలా ముస్తాబై రంగుల బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మ నిమజ్జనం తర్వాత దసరా ఉత్సవాన్ని పురస్కరించుకొని షమీ స్తోత్రం చదివి జమ్మి (బంగారం) ఇచ్చి పుచ్చికొని అలయ్బలయ్ చేసుకున్నారు. ఇక బతుకమ్మ, రాఫెల్ డ్రా విజేతలకు టీడీఫ్ టీం బహుమతులను అందజేశారు. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలందరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
ఇవాళే సౌభాగ్యదాయిని ‘అట్లతద్ది’!
అట్లతద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. ‘తదియ’ నే ‘తద్దె’ అంటారు. ఉండ్రాళ్ల తద్దె , అట్ల తద్దె అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీనిని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏమిటీ? తదితరాల గురించే ఈ కథనం!. ఈ పండుగకు గోరింటాకు పెట్టుకోవడం చాలా ముఖ్యం అట్లతద్దె ఈ తద్ది ప్రసిద్దమైనది. ఆంధ్ర ఆడపడుచులకు చాల ముఖ్యమైన పండుగ. అట్లతద్ది ముందురోజు భోగి అని పిలుస్తారు. ఆడపిల్లలందరూ చేతులకు, కాళ్ళకు గోరింటాకు పెట్టుకుని తెల్లవారుఝామునే లేచి ఉట్టి కింద కూర్చుని చద్దన్నం తింటారు(ఇప్పుడు ఉట్లు లేవు లెండి) ఆటపాటలతో కాలక్షేపం చేసి ఉయ్యాలలూగుతారు! పగలంతా ఉపవాసముండి సాయంకాలం చంద్రోదయం అయిన తరువాత చంద్రదర్శనం చేసుకుని 'చంద్రోదయోమా వ్రతం' చేసి అట్లు దానమిచ్చి , ఉమాదేవిని పూజించి భోజనం చేస్తారు. ఈ అట్లతద్దికి గోరింటాకును పెట్టుకోవడం చాల ముఖ్యం! చర్మ వ్యాధులు రాకూడదని.. గోరింట అంటే గోరు+అంటు= గోరింట అని బ్రౌణ్యం చెపుతోంది. సంస్కృతంలో కూడ దీన్ని నఖరంజని అంటారు. దీన్ని బట్టి చూస్తే గోరింటాకు గోర్లకు మంచిది అని తెలుస్తుంది. ఈ గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి మొగుడొస్తాడని సరసాలడతారు. గ్రీష్మఋతువులోని ఆషాఢమాసంలోనూ వర్షఋతువులోని భాద్రపద మాసంలోనూ శరదృతువులోని ఆశ్వయుజ మాసంలోనూ మూడు సందర్భాలలో గోరింటాకును పెట్టుకుంటారు. ఇవి మూడు వానకారు పబ్బాలుగా ప్రసిద్ది! తెల్లవారుఝాము నుంచీ ఆడపిల్లలు పాడుతూ ఆడుకునే పాటలలో ఎన్నో ఆరోగ్యరహస్యాలను పొందుపరిచారు. ఇళ్ళల్లో నీళ్ళతావుల్లో తిరిగే ఆడవాళ్ళకు చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటికి వాడవలసిన మందులను తెలిపే పాట.... 'కాళ్ళగజ్జ కంకాళమ్మ వేగుచుక్క వెలగామొగ్గ మొగ్గా కాదు మోదుగనీరు నీరుకాదు నిమ్మలబావి బావికాదు వావిటికూర కూరకాదు గుమ్మిడిపండు పండుకాదు పాపిడిమీసం' కాళ్ళకు గజ్జి లాంటి చర్మవ్యాధులొస్తే కంకాళమ్మ ఆకును నూరి పసరుతీసి రాస్తే గజ్జి పోతుంది. దానికి లొంగకపోతే వెలగ మొగ్గను నుజ్జుచేసి శరీరంపై పూసుకోవాలి. అప్పటికీ తగ్గకపోతే వావిటికూరను ముద్దగాజేసి పట్టీలు వేసుకోవాలి అప్పుడు ఆ వ్యాధి నిమ్మళించి గుమ్మడి పండులాగ నిగనిగలాడతారని ఈ పాటలో చెప్పారు! అలాగే గోరింటాకు పెట్టుకున్నగోళ్ళు వాటి రంగులు చూసుకుంటూ 'చిప్పచిప్ప గోళ్ళు సింగరాజు గోళ్ళు' అని పాడుకుంటారు. 'ఒప్పులకుప్ప ఒయ్యారిభామా సన్నబియ్యం ఛాయాపప్పు మునగాపప్పూ నీమొగుడెవరు గూట్లోరూపాయి నీమొగుడు సిపాయి' అని ఈరోజు ఉదయంనుంచి తయారు చేసిన పదార్ధాల మూలాలను తలచుకుంటూ వీర్యవృద్ధి కలిగిన ఈ పిండివంటలన్నీ రాబోయే మొగుడికోసమేనని మేలమాడుతూ రోటిపాటలు పాడతారు.ఆ రోళ్ళకు ఉయ్యాలలు కట్టి ఊయలలూపుతూ పెళ్ళయిన పడుచులను మొగుడిపేరు గట్టిగా చెప్పేదాకా వదలకుండా ఊపుతారు. పెట్టుకున్న గోరింటాకు ఎలా పండిందో చూసుకుని మురిసిపోతూ ... 'గోపాలకృష్ణమ్మ పెళ్ళయ్యేనాడు గోరింట పూచింది కొమ్మలేకుండా మాఇంట అబ్బాయి పెళ్ళయ్యేనాడు మల్లెలు పూచాయి మొగ్గలేకుండా' ఈ సంప్రదాయ స్త్రీ పాటనే కృష్ణశాస్త్రిగారు తమపాట పల్లవిగా మలచుకున్నారు. తరువాత వారి చరణమే 'మందారంలా పూస్తే మంచిమొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సిందూరంలా పూస్తే చిట్టిచేయంతా అందాల చందమామ అతనే దిగివస్తాడు' అనుకుంటూ చంద్రోదయోమావ్రతం చేసుకుంటారు! ఇవన్నీ నిన్నామొన్నటి వరకు పల్లెపడుచుల అట్లతద్ది ఆటపాటలు. బహుశః ఏ పైలోకాలలోనో తెలుగు ఆడపడుచులకు వాళ్ళ చిన్నతనంలోని పాటలన్నీ వినాలనిపించిందేమో ... ఈ పాటల ఊయలలను తీసుకుపోయి అందనంత ఎత్తులో వాళ్ళదగ్గరే ఉంచేసుకున్నారు. కానీ ఊయలెప్పుడూ ఒకేచోట ఉండదు! అది కిందకు రాక తప్పదు!! మళ్ళీ ఈ అట్లతద్ది ఆటపాటలు మాకందివ్వకా తప్పదు!!! ఈ తరం పడుచులందరికీ ఒకటే వినతి! రండి లేవండి తెల్లవారు ఝామునే చద్దన్నం తిని మన ఆటపాటల ఊయలను మనమే పట్టుకుందాం రండి!! 'అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్ సీమ పచ్చిమిరపకాయ్ చిఱ్ఱో చిఱ్ఱో నీ మొగుడు కొడితే మొఱ్ఱో మొఱ్ఱో' అట్లతద్ది అంతరార్థం త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొంద గోరి మొదటి సారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు వర్థిల్లుతా యని శాస్త్ర వచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం. రుతుచక్రం సరిగా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలూ ఉండవు. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని , శక్తిని కలిగిస్తుంది. ఈ పండుగను అవివాహిత స్త్రీలు చేస్తే మంచి మొగుడు వస్తాడని, పెళ్లైన వారు చేస్తే సౌభాగ్యం కలకలం ఉంటుందని శాస్త్ర వచనం. (చదవండి: కోరికలు కలలోని పూదోటలు! వాటి కోసం పరుగులు తీస్తే చివరికి..) -
బన్నీ ఉత్సవంలో అపశృతి ముగ్గురు మృతి
-
ఆయుధ పూజ చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
అరుణాచల్ ప్రదేశ్: విజయదశమి పర్వదినం సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయుధ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇక్కడికి నాలుగు సంవత్సరాల క్రితం వచ్చానని, అప్పుడు జవానులతో కలిసి విజయదశమి జరుపుకోవాలని అనుకున్నానని, దేశ భద్రతకు బాధ్యత వహిస్తున్న సైనికులను చూసి గర్వపడుతున్నానని అన్నారు. తవాంగ్ చేరుకునే మందు రక్షణ మంత్రి అస్సాంలోని తేజ్పూర్ సందర్శించారు. అక్కడి నాలుగు కార్ప్స్ హెడ్క్వార్టర్స్సైనికులతో సంభాషించారు. ఇక్కడ అన్ని స్థాయిల సైనికులు ఒకే కుటుంబ సభ్యులుగా కలిసి భోజనం చేయడాన్ని రాజ్నాథ్ ప్రశంసించారు. వివిధ రాష్ట్రాలు, మతాలు, నేపథ్యాల నుండి వచ్చిన సైనికులు ఒకే బ్యారక్స్, యూనిట్లలో కలిసి పని చేయడం భారత సైన్యానికున్న ఐక్యతను తెలియజేస్తుందన్నారు. ఇది కూడా చదవండి: రావణుని వైభోగం ఎంత? అవశేషాలు ఎక్కడున్నాయి? विजयादशमी के पावन अवसर पर तवाँग में ‘शस्त्र पूजा’। https://t.co/JIYcBbd1no — Rajnath Singh (@rajnathsingh) October 24, 2023 -
రావణునికి కంగన నిప్పు.. చరిత్రలో తొలిసారి!
దేశవ్యాప్తంగా విజయ దశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయ దశమి రోజున పలు ప్రాంతాల్లో రావణుని దిష్టిబొమ్మను దహనం చేసి, చెడుపై మంచి విజయం సాధించిందనే సందేశాన్ని అందిస్తారు. రావణ దహన వేడుకల సందర్భంగా ఢిల్లీలో జరిగే ‘లవకుశ రామ్లీల’ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈసారి విజయ దశమి వేడుకల్లో ఓ మహిళ రావణుని దిష్టిబొమ్మను దహనం చేయనుంది. ఇది రామ్లీల చరిత్రలో కొత్త అధ్యాయమని పలువురు చెబుతున్నారు. లవకుశ రామ్లీలలో రావణుని దహనం చేసేది మరెవరో కాదు నటి కంగనా రనౌత్. కంగన తదుపరి చిత్రం తేజస్పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కంగనా రనౌత్ ఢిల్లీలోని లవకుశ రామ్లీలలో రావణ దహనానికి సంబంధించిన సమాచారం ఇచ్చారు. ఆమె తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. వీడియోలో కంగనా రనౌత్ తాను రావణ దహనం చేయడానికి ఢిల్లీకి వస్తున్నట్లు తెలిపారు. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) ఈ వీడియోలో నటి తన తేజస్ సినిమాను కూడా ప్రమోట్ చేశారు. ‘ఎర్రకోటలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ కార్యక్రమ 50 ఏళ్ల చరిత్రలో ఒక మహిళ రావణుని దిష్టిబొమ్మను దహనం చేయడం ఇదే మొదటిసారి. జై శ్రీరామ్’ అని కంగన క్యాప్షన్లో రాశారు. కంగనా రనౌత్కి పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంగన రనౌత్ నటించిన తేజస్ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ విజయదశమి శుభాకాంక్షలు -
ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలు
ఈరోజు (మంగళవారం) విజయదశమి సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) దసరా ర్యాలీ నిర్వహించింది. సంఘ్ సభ్యులు నాగ్పూర్లో ‘పథ సంచాలన్’ (రూట్ మార్చ్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, గాయకుడు శంకర్ మహదేవన్ పాల్గొన్నారు. #WATCH | Maharashtra | RSS chief Mohan Bhagwat paid tribute to the founder of the organisation K. B. Hedgewar in Nagpur, at the RSS Vijayadashami Utsav event. Singer-composer Shankar Mahadevan who is the chief guest of the function is also with him. pic.twitter.com/joytMQ3aN6 — ANI (@ANI) October 24, 2023 సంఘ్ ప్రధాన కార్యాలయంలో భగవత్ గాయకుడు మహదేవన్కు స్వాగతం పలికారు. ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఈ దసరా వేడుకల కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా హాజరయ్యారు. ఇరువురు నేతలు ఆర్ఎస్ఎస్ సంప్రదాయ వేషధారణలో హాజరయ్యారు. విజయదశమి సందర్భంగా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్రేవాల్కు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నివాళులర్పించారు. -
కులులో ఘనంగా అంతర్జాతీయ దసరా ఉత్సవాలు
విపత్తుల నుంచి కోలుకున్నమూడు నెలల తర్వాత హిమాచల్లోని కులులో దసరా సందడి నెలకొంది. అంతర్జాతీయ కులు దసరా వేడుకలు నేటి నుంచి(మంగళవారం) ధాల్పూర్ మైదానంలో ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 30 వరకూ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ దసరా ఉత్సవాలు కులు-మనాలిలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహకరంగా మారనున్నాయి. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు రఘునాథుని రథయాత్రతో మహాకుంభ్ పేరుతో ఈ దసరా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. రఘునాథుని రథాన్ని లాగడానికి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. రథమైదాన్ నుండి రథయాత్ర ‘జై సియారామ్’ నినాదాలతో రఘునాథ్ ధాల్పూర్కు చేరుకోనుంది. అనంతరం జిల్లా నలుమూలల నుంచి తీసుకువచ్చిన దేవతా మూర్తుల విగ్రహాలను ఆయా మండపాల్లో కొలువుదీర్చనున్నారు. 14 దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాలు ఈ ఉత్సవంలో వివిధ ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. దసరా చరిత్రలో తొలిసారిగా మలేషియా, రష్యా, దక్షిణాఫ్రికా, కజకిస్తాన్, రొమేనియా, వియత్నాం, కెన్యా, శ్రీలంక, తైవాన్, కిర్గిజిస్తాన్, ఇరాక్, అమెరికా తదితర దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాలు ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వనున్నాయని పార్లమెంటరీ చీఫ్ సెక్రటరీ సుందర్ సింగ్ ఠాకూర్ తెలిపారు. కులు దసరా వేడుకలు 1660 నుండి జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: రామరావణ యుద్ధానికి నేతలు, ప్రముఖులు -
ఈ రోజే ఎందుకు విజయదశమి జరుపుకుంటున్నాం?
మంగళవారం రోజున లేని శ్రవణ నక్షత్రం శమీ పూజకు ప్రధానం శ్రవణా నక్షత్రం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా విజయదశమి ఏ రోజున అనే విషయంలో దోబూచులాడుతుంది. ధర్మశాస్త్ర గ్రంథాలైన నిర్ణయ సింధు, ధర్మసింధు ప్రకారము విజయదశమి 23న సోమవారం రోజు జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అసలు కారణం ఏమిటి? విజయదశమి పండగ ఏ రోజున అనే విషయమై గందరగోళ పరిస్థితులను తెరదించే ప్రయత్నంలో భాగంగా విజయదశమి పండుగపై పూర్తి వివరణ ఇది... ఎందుకీ గందరగోళం.. విజయదశమి పండుగకు ప్రధానంగా కావలసినది దశమితో కూడిన శ్రవణా నక్షత్రం... ఈ శ్రవణా నక్షత్రం సమయంలోనే శమీ పూజ జరపవలసి ఉంటుంది. శమీ పూజకు అత్యంత ప్రాధాన్యమైనది. శ్రవణా నక్షత్రం 22వ తారీకు ఆదివారం సాయంత్రం గంటలు 3:35 నిమిషములకు వచ్చి తెల్లవారి సోమవారం 23వ తేదీ సాయంత్రం గంటలు 3:35 నిమిషముల వరకు ఉంటుంది. మంగళవారం నాడు ధనిష్ట నక్షత్రం చొరబడుతుంది.ధనిష్ట నక్షత్రం విజయదశమి పండుగకు విరుద్ధం. ఈ ప్రకారంగా సోమవారంనాడు అపరాహ్ణ ముహూర్తం లో దశమి పగలు గంటలు 2:29 నిమిషములకు ప్రారంభమవుతోంది. అపరాహ్ణ కాలము(మధ్యాహ్నాం) పగలు గంటలు 1:00 నుంచి మధ్యాహ్నము 3: 28 వరకు శ్రవణా నక్షత్రం ఉంటుంది. .అంటే ఈ సమయంలో శ్రవణా నక్షత్రముతో దశమి కూడితే అది విజయదశమి అవుతుంది. కనుక దశమితో శ్రవణ నక్షత్రం కూడినందున అక్టోబర్ 23 సోమవారం రోజున దసరా లేదా విజయదశమి పండుగ జరుపుకుంటున్నాం. అందుకే ఈ రోజునే శమీ పూజ నిర్వహించాలని పండుతులు నిర్ణయించారు. శృంగేరిలో కూడా.. శృంగేరి పీఠంలో కూడా విజయదశమి శమీ పూజ సోమవారము నిర్వహిస్తున్నట్లు పీఠం నిర్వాహకులు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు దేవస్థానాలలో 23వ తారీఖున జరుపుకోవాలని చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 23 సోమవారం నాడే విజయదశమిని ఆచరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పంచాంగం అనుసరించి విజయవాడ కనకదుర్గ దేవాలయంలో కూడా 23 సోమవారం రోజున దసరా పండగ అని వేద పండితులు నిర్ణయించారు. పంచాంగ కర్తలందరూ కలసి గత మాసంలోనే విజయదశమి 23 సోమవారం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందువల్ల 23వ తేది సోమవారం రోజున దసరా పండుగ శమీ జరుపుకోవడం అందరికీ శ్రేయస్కరం. (చదవండి: స్త్రీ శక్తి విజయం విజయ దశమి) -
విజయదశమిపై అయోమయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన విజయదశమిని జరుపుకొనే రోజు విషయంలో కొంత అయోమయం నెలకొంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో దసరాను ఈనెల 24న జరపనుండగా, అధికారికంగా తెలంగాణలో 23న జరుపుతున్నారు. కొందరు పండితులు 23నే జరుపుకోవాలని సూచిస్తుండగా, కొందరు 24నే పండుగని స్పష్టం చేస్తుండటంతో ప్రజల్లో కొంత అయోమయం నెలకొంది. ధృక్ గణితాన్ని అనుసరించే పంచాంగకర్తలు మంగళవారం పండుగ నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. దశమి తిథి మధ్యాహ్న వ్యాప్తి మంగళవారమే ఉన్నందున.. ఆ రోజే పండుగ జరుపుకోవాలన్నది వారి అభిప్రాయం. కానీ, పూర్వ గణితాన్ని అనుసరించే పంచాంగకర్తల్లో చాలామంది సోమవారమూ పండుగ చేసుకోవాలని పేర్కొంటున్నారు. దశమి తిథి, శ్రవణ నక్షత్రం కలిసి ఉన్నరోజే దసరా అన్న ప్రామాణికాన్ని కొన్ని పంచాంగాల్లో సూచిస్తున్నారు. మరికొన్ని పంచాంగాల్లో మాత్రం ఆరోజు ఆ రెండూ కలవలేదని పేర్కొంటుండటం విశేషం. ఇక తెలంగాణ ప్రాంతంలో సాయంత్రం వేళ శమీ (జమ్మి) వృక్షానికి పూజించటం, పాలపిట్టను దర్శించటం లాంటి పద్ధతులు ఆచరణలో ఉన్నాయి. దశమి తిథి సోమవారం రోజు మాత్రమే సాయంత్రం వేళలో కొనసాగుతోంది. మంగళవారం రోజు దశమి తిథి మధ్యాహ్నం 3.20 గంటల వరకు మాత్రమే ఉంది. దీంతో సాయంత్రం వేళ దశమి తిథి సోమవారం రోజే ఉన్నందున ఆరోజే పండుగన్న విషయాన్ని కూడా కొందరు బలంగా చెబుతుండటం విశేషం. పూర్వ గణితం, ధృక్ గణితాల మధ్య ఉన్న తేడాలు చాలా ఏళ్లుగా పండుగల్లో భిన్న రోజులను సూచిస్తున్నాయి. ఫలితంగా రెండు రకాల పంచాంగాల్లో పండుగ తేదీల్లో తేడాలుంటూ ప్రజల్లో అయోమయానికి కారణమవుతున్నాయి. దీన్ని దూరం చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణలో కొన్నేళ్లుగా తెలంగాణ విద్వత్సభ పేరుతో పండిత్ ఓ సమూహం ఏర్పాటు చేసుకుని ఉమ్మడిగా తేదీలను ఖరారు చేస్తున్నారు. ఈసారి ఆ సభ 23నే దసరా అని సూచించింది. తొలుత 24నే పండుగని పేర్కొన్న ప్రభుత్వం, ఈ విద్వత్సభ సూచన మేరకు 23కు మార్చింది. దీంతో దాన్నే ప్రామాణికంగా తీసుకుని ఎక్కువ మంది సోమవారం రోజే పండుగ జరుపుకోనున్నారు. సద్దుల బతుకమ్మను కొన్ని ప్రాంతాల్లో శనివారం చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఆదివారం నిర్వహించనున్నట్లు సమాచారం.