-
కనిమొళి అభినందన.. ఆమె ఉద్యోగం పోయింది?
సాక్షి, చైన్నె: కోయంబత్తూరు నగర ప్రైవేటు బస్సులో తొలి మహిళా డ్రైవర్గా అందరి మన్ననలు పొందుతున్న ఎం షర్మిల(24) శుక్రవారం రోడ్డున పడ్డారు. ఆమె నడిపిన బస్సులో ఎంపీ కనిమొళి ప్రయాణం చేసిన కొన్ని గంటల్లో ఆ బస్సు డ్రైవర్ ఉద్యోగాన్ని షర్మిల కోల్పోవాల్సి వచ్చింది. కోయంబత్తూరులో బస్సు డ్రైవర్ షర్మిల ఇటీవల సెలబ్రటీ అయ్యారు. ఆమె ఓ ప్రైవేటు బస్సుకు డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఓ యువతిగా ఆమె బస్సు నడిపే విధానం సామాజిక మాధ్యమాలలో, మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తమకు షర్మిల ఆదర్శం అంటూ అనేక మంది యువతులు అనేక మంది మీడియా ముందుకొచ్చారు. తాము సైతం డ్రైవింగ్ నేర్చుకుని బస్సులను నడిపేందుకు సిద్ధమయ్యారు. సెలబ్రటీగా మారిన షర్మిలను అభినందించేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడే వాళ్లు మరీ ఎక్కువే. డ్రైవర్గా ఆమె పనితీరును పరిశీలించేందుకు డీఎంకే ఎంపీ కనిమొళి శుక్రవారం కోయంత్తూరుకు వచ్చారు. కండక్టర్ తీరుతో.. షర్మిల నడిపే బస్సులో ఇదివరకు ఉన్న మగ కండక్టర్ను తొలగించి శుక్రవారం నుంచి కొత్తగా లేడీ కండక్టర్ను ఆ ట్రావెల్స్ యాజమాన్యం నిర్ణయించింది. అయితే, ఆ లేడీ కండక్టర్ రూపంలో షర్మిలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తన బస్సులోకి హఠాత్తుగా కనిమొళి ఆమెతో పాటు మరికొందరు ఎక్కడంతో షర్మిల ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆమె పనితీరున స్వయంగా కనిమొళి వీక్షించి, అభినందించారు. అయితే, ఆ లేడీ కండక్టర్ టికెట్టుకు చిల్లర ఇవ్వాల్సిందేనని కనిమొళితో పాటు ఆమెతో వచ్చిన వారిపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. జాబ్ పోలేదు? తనకోసం కనిమొళి రావడంతో ఆ కండక్టర్ను షర్మిల వారించారు. అయితే, ఆ కండక్టర్ మరింత దూకుడుగా వ్యవహరించడంతో తదుపరి స్టాప్లో కనిమొళితో పాటుగా మిగిలిన వారు బస్సు దిగి వెళ్లిపోయారు. అయితే.. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమోగానీ గాంధీపురం స్టాప్లో బస్సును ఆపేసి షర్మిల దిగి వెళ్లిపోయారు. పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతున్నానని తన యజమాని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఆమె ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. ఎంపీ కనిమొళి పట్ల మహిళా కండక్టర్ ప్రవర్తన సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇక ఆ బస్సు నడపనని షర్మిల స్పష్టం చేశారు. ఏదేమైనా తన కలల కొలువుకు దూరమైనట్టు బాధపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే బస్సు యజమాని దురై కన్నా మాత్రం మరోలా స్పందించారు. వ్యక్తిగత పబ్లిసిటీ షర్మిలకు పెరిగిందని, అయినా, తాము భరిస్తున్నామని, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించలేదని బస్సు యాజమాని దురై కన్న పేర్కొన్నారు. ఈ వ్యవహారం కనిమొళి దృష్టికి చేరడంతో షర్మిలతో ఆమె వ్యక్తిగత సహాయకులు మాట్లాడినట్టు సమాచారం. -
అమ్మో మన ధోని, కోహ్లి, రిషభ్ ఇలా ఉంటారా?
-
తుంగభద్ర డ్రెయిన్లో పడి మహిళా వలంటీర్ మృతి
మన్నవ(చేబ్రోలు): పొన్నూరు రూరల్ మండల పరిధిలోని మన్నవ గ్రామంలో మహిళా వలంటీర్ ప్రమాదవశాత్తూ కాలువలో పడి మరణించిన ఘటన గురువారం జరిగింది. అన్నవరపు మానస(26) గ్రామ వలంటీర్గా పనిచేస్తోంది. ఉదయం స్థానికంగా ఉన్న తుంగభద్ర డ్రెయిన్లో దుస్తులు ఉతకటానికి వెళ్లి ప్రమాదవశాత్తూ పడిపోయింది. నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్న మానసను స్థానికులు కాపాడటానికి యత్నించినా ఫలితం లేకపోయింది. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన అనంతనం వలంటీర్ మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పొన్నూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై పొన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వలంటీర్ మానస మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
మరో చీతా కన్నుమూత! జతకట్టే సమయంలో గాయపడటంతో..
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో దక్ష అనే మరో ఆడ చీతా కన్నుమూసింది. మరో రెండు మగ చీతాలతో జతకట్టిన సమయంలో గాయపడటంతో.. కొద్దిగంటల్లోనే దక్ష మృతి చెందిందని, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ అన్నారు. తాము ఆ ఆడ చీతాకు అవసరమైన అన్ని మందులు, చికిత్స తక్షణమే అందించామని, కానీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రాణాలు విడిచిందని తెలిపారు. వాయు, అగ్ని అనే మగ చీతాలతో సంభోగ సమయంలో అవి పరస్పరం హింసాత్మక దాడులు చేసుకున్నాయని, అందువల్లే దక్ష అనే చీతా మరణించిందని చౌహాన్ పేర్కొన్నారు. ఎన్క్లోజర్ నెంబర్ 1లో ఉన్న దక్షను బోమా 7 ఎన్క్లోజర్లో ఉన్న వాయు, అగ్ని అనే రెండు మగ చీతాలతో సంభోగం కోసం విడుదల చేశారు. అయితే ఈ ప్రక్రియలో మగ చిరుతలు హింసాత్మకంగా మారినట్లు కనిపిస్తోంది. కానీ ఇది చాలా సర్వ సాధారణ విషయమని చౌహాన్ చెబుతున్నారు. మగ చిరుతలు జత కట్టే సమయంలో తమకు సంబంధంలేని మగ చిరుతలతో దాడులకు దిగుతాయని, గెలిచిన మగ చిరుత ఆడ చిరుతతో జత కడుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా, గతేడాది ప్రాజెక్టు చీతా కింద దక్షిణాఫ్రికా నుంచి దాదాపు ఇరువై చీతాలను జాతీయ పార్కుకి తీసుకురాగా వాటిలో సాషా, ఉదయ్ అనే రెండు చిరుతలు మార్చి, ఏప్రిల్లో చనిపోయిన సంగతి తెలిసిందే. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఆ రెండు చిరుతలను సెప్టంబర్ 2022లో వేర్వేరు బ్యాచ్లలో మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కుకు తరలించారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది సెప్టెంబర్ 17న తన 72వ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్లోని కునో వద్ద ఉన్న క్వారంటైన్ ఎన్క్లోజర్లోకి నమీబియా నుంచి ఐదు ఆడ చీతా పిల్లలు, మూడు మగ చీతా పిల్లలతో కూడిన ఎనిమిది చీతా పిల్లలను విడుదల చేశారు. (చదవండి: హాట్టాపిక్గా ప్రధాని మోదీ బహిరంగ లేఖ! ఆ లేఖలో ఏముందంటే..) -
టైర్ పేలి స్కూటర్ పల్టీ
బనశంకరి: స్కూటర్ టైర్ పేలిపోయి డివైడరును ఢీకొట్టిన ప్రమాదంలో మహిళా టెక్కీ మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కెంగేరి పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగింది. డీసీపీ సుమన్ పన్నేకర్ తెలిపిన ప్రకారం వివరాలు... మండ్యకు చెందిన సులోచన (24) పద్మనాభనగర ఇట్టిమడులో నివాసం ఉంటూ కోరమంగలలో ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె స్నేహితుడు అనంద్కుమార్ కూడా ఇదే కంపెనీలో పనిచేస్తుంటాడు. సాయంత్రం 5.30 సమయంలో కోరమంగల నుంచి హోసకెరెహళ్లికి స్కూటర్లో సులోచన, అనంద్కుమార్ బయలుదేరారు. ఆనంద్కుమార్ ఫుల్ హెల్మెట్ ధరించగా, సులోచనా హాఫ్ హెల్మెట్ పెట్టుకుంది. నైస్ రోడ్డులో వెళుతుండగా స్కూటర్ టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఇనుప రైలింగ్ను ఢీకొన్నారు. హాఫ్ హెల్మెట్ వల్ల అధిక గాయాలు ఈ ప్రమాదంలో ఇద్దరికి తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలు తగిలాయి. తీవ్ర రక్తస్రావమై స్పృహ కోల్పోయి పడి ఉండగా ఇతర వాహనదారులు అంబులెన్స్ను పిలిపించి ఆసుపత్రికి పంపించారు. సులోచనా తల, మెదడు భాగాల్లో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం ఉదయం కన్నుమూసింది. హాఫ్ హెల్మెట్ వల్ల ఆమె తలకు ఎక్కువ గాయాలు తగిలి మరణానికి దారితీసింది. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. మరో బాధితుడు ఆనంద్ కుమార్ స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సులోచనా మరణవార్త తెలియగానే కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. కెంగేరి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
గెస్ట్ ఎడిటర్ రోల్ బాగా నచ్చింది
మహిళా గెస్ట్ ఎడిటర్ రోల్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చి నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఒక పత్రిక వెలువడడానికి ఇంతమంది శ్రమ దాగి ఉందని నాకు తెలియదు. తెరవెనుక ఉండి నడిపిస్తున్న సిబ్బంది, వారి పనితీరు నాకు స్ఫూర్తినిచ్చింది. – సల్మాబాను సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ఆహ్వానం మేరకు ఎస్సీ కార్పొరేషన్ నల్లగొండ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ సల్మాబాను మంగళవారం యూనిట్ కార్యాలయంలో గెస్ట్ ఎడిటర్గా ఒక్కరోజు విధులు నిర్వర్తించారు. ‘మహిళా గెస్ట్ ఎడిటర్’గా ముఖ్యమైన వార్తలపై ఎడిటోరియల్ సిబ్బందితో చర్చించారు. వార్తల ప్రాధాన్యత, ఎడిటింగ్, పేజినేషన్ను పరిశీలించి సూచనలు చేశారు. కొన్ని వార్తలకు శీర్షికలను కూడా పెట్టారు. మహిళల్లో చైతన్యం కలిగించే వార్తలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా యూనిట్ కార్యాలయంలో వివిధ విభాగాలను పరిశీలించారు. పత్రిక ప్రింటింగ్ విధానం, సిబ్బంది విధులు, టెక్నికల్ అంశాల గురించి కూడా తెలుసుకున్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవాలి.. రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కల్పించిందని, వాటిని అందిపుచ్చుకోవాలంటే కేవలం చదువు వల్లే సాధ్యమవుతుందని సల్మాబాను చెప్పారు. ప్రస్తుతం సమాజంలో మహిళలకు ఉన్న అవకాశాలు, మహిళలు ఉన్నతంగా ఎదగాల్సిన ఆవశ్యకతపై మాట్లాడుతూ.. తాను ఆఫీసర్గా గుర్తింపు పొందానంటే అది రాజ్యాంగంలో కల్పించిన హక్కుల వల్లేనని అన్నారు. తాను ఈ స్థాయిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని, ప్రభుత్వం ఇస్తున్న స్కాలర్షిప్లు, అన్ని రకాల సదుపాయాలు గురించి అవగాహన ఉండాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు మంచి చదువులు చెప్పించి ఆర్థికంగా వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా కృషిచేయాలి ఆమె సూచించారు. హేళన చేసిన వాళ్లే.. గొప్పగా చెబుతున్నారు.. చిన్నప్పుడు తన అమ్మానాన్నను చాలా మంది.. ఆడ పిల్లలను ఎందుకు చదివిస్తున్నారు అని అనడం తాను చూశానని. అయినా వారు కష్టపడి తనను చదివించారని చెప్పారు. అప్పటి నుంచే తాను సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి అనే దిశగా కష్టపడి చదివి ఉద్యోగం సాధించానని, ఆరోజు హేళన చేసిన వాళ్లే ఈ రోజు తన గురించి గొప్పగా చెప్పుకునే స్థాయికి చేరుకోగలిగానని సల్మాబాను చెప్పారు. మహిళలైనా, విద్యార్థినులైనా పనిచేసే చోట, కళాశాలలు, పాఠశాలల్లో జరిగిన విషయాలను ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో పంచుకోవాలని, తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసిపోయి ప్రతి విషయాన్నీ చర్చించాలని చెప్పారు. కొందరు చిన్న చిన్న విషయాలకు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడుతుండడం బాధ కలిగిస్తోందని అన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఎడిటోరియల్ సిబ్బందితో మాట్లాడుతున్న గెస్ట్ ఎడిటర్ సల్మాబాను టెక్నాలజీకి అనుగుణంగా పత్రికా రంగంలో మార్పులు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పత్రికా రంగంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అరచేతిలో ఉండే సెల్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్న ఈ రోజుల్లో జర్నలిజం వ్యాల్యూస్తో పనిచేస్తున్న ‘సాక్షి’ సిబ్బందిని ఆమె అభినందించారు. తనకు గెస్ట్ ఎడిటర్ అవకాశం కల్పించిన సాక్షి యాజమాన్యానికి సల్మాబాను కృతజ్ఞతలు తెలిపారు. ఎడిటర్గా పత్రికను నిర్వహించడం కత్తి మీద సామేనని పేర్కొన్నారు. -
కేడీ పోలీస్.. గుట్టుగా వ్యభిచారం! మహిళా ఎస్ఐ కుటుంబసభ్యులే అలా..!
తిరుపతి రూరల్: తిరుపతి ముత్యాలరెడ్డి పల్లె పోలీస్స్టేషన్ పరిధిలో ఓ మహిళా ఎస్ఐ కుటుంబసభ్యులే గుట్టుగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. ఏపీలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి మహిళలను రప్పించి జోరుగా ఈ దందాను నడుపుతున్నారు. ఆ ఎస్ఐ ఏ స్టేషన్లో పనిచేస్తే ఆ స్టేషన్ పరిధిలోనే వీరు దుకాణం తెరుస్తారు. ట్రాన్స్ఫర్ అయితే అక్కడకు మకాం మారుస్తారు. అందులో భాగంగా ఆ మహిళా ఎస్ఐ తిరుచానూరులో పనిచేస్తున్నప్పుడు ఆ స్టేషన్ పరిధిలోని లింగేశ్వరనగర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆమె ముత్యాలరెడ్డిపల్లెకు వచ్చిన తర్వాత ఆ స్టేషన్ పరిధిలోకి వచ్చి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో నిఘా పెట్టిన ఎంఆర్ పల్లె పోలీసులు సీఐ సురేంద్రరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ధనలక్ష్మి నగర్లో దాడులుచేశారు. మహిళా ఎస్ఐ తమ్ముడు ప్రశాంత్, తల్లి, తిరుపతి అవిలాల, హైదరాబాదుకు చెందిన ఇద్దరు మహిళలు, తిరుచానూరుకు చెందిన ఓ విటుడిని పోలీసులు అరెస్ట్చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ సురేంద్రరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా తల్లి, తమ్ముడు వ్యవహారశైలి నచ్చక, వారితో గొడవ పడి మహిళా ఎస్ఐ ఏడాది నుంచి వారికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఎస్ఐ మెడికల్ లీవ్లో వెళ్లిన తర్వాత మూడు నెలలుగా ధనలక్ష్మినగర్లో అద్దె ఇంటిని తీసుకుని ఆమె తల్లి, తమ్ముడు వ్యభిచార గృహం నడుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
'నేను అమ్మనయ్యాను..' కూతుళ్ల కోసం లింగాన్ని మార్చుకున్న తండ్రి..
కన్నకూతుళ్లను దక్కించుకోవడం కోసం ఓ వ్యక్తి తన లింగాన్ని మార్చుకున్నాడు. చట్టపరంగా పోరాటం చేసి ఐడీ కార్డులో మగ నుంచి ఆడగా మారాడు. ఈక్వేడార్లో ఈ ఘటన జరిగింది. చట్టపరంగా లింగాన్ని మార్చుకున్న ఈ వ్యక్తి పేరు రినె సలినాస్ రామోస్(47). భార్యతో విడిపోయాడు. అయితే ఈ దేశ చట్టాల ప్రకారం పిల్లలు తల్లిదగ్గరే ఉండాలనే నిబంధన ఉంది. కానీ తన కూతుళ్లు తల్లి వద్ద సంతోషంగా లేరని, తనకు అప్పగించాలని రామోస్ కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఐడీ కార్డులో తన లింగాన్ని పురుషుడి నుంచి స్త్రీగా మార్చుకున్నాడు రామోస్. చట్టపరంగా అనుమతులు తీసుకున్నాడు. ఇప్పుడు తాను కూడా తల్లిని అయ్యానని, పిల్లలను తనకే అప్పగించాలని రామోస్ కోర్టును కోరాడు. అయితే న్యాయస్థానం దీనిపై తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. రామోస్ తన కూతుళ్ల కోసమే లింగాన్ని మార్చుకున్నప్పటికీ దేశంలోని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. తాము సర్జరీ చేయించుకొని ఆడ నుంచి మగగా, పురుషుడి నుంచి స్త్రీగా మారితే అధికారిక గుర్తింపు లభించేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అలాంటిది ఓ పురుషుడు మాత్రం సులభంగా మహిళగా లింగాన్ని మార్చుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే తాను చేసిన దాంట్లో దురుద్దేశం ఏమీ లేదని రామోస్ పేర్కొన్నాడు. కేవలం తన కూతుళ్ల కోసమే ఇలా చేసినట్లు చెప్పాడు. పురుషులకు కూడా తమ పిల్లలపై హక్కు కల్పించేందుకే తాను పోరాడుతున్నట్లు వివరణ ఇచ్చాడు. చదవండి: బీజింగ్లో కోవిడ్ బీభత్సం -
కోర్టులో లేడీ లాయర్ల ఫైటింగ్ .. వీడియో వైరల్..
-
ఆటోలో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు గుడ్ న్యూస్
-
మహిళల క్యాన్సర్లు: ఓ అవగాహన
క్యాన్సర్లలో మనదేశపు స్త్రీలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) ఎక్కువగా కన్పిస్తుంటుంది. ఈ క్యాన్సర్ను పూర్తిగా నివారించే హెచ్.పి.వి. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీనిపై అమ్మాయిలకు అవగాహన లేక వేయించుకోకపోవడం ఒక కారణమైతే, పరిశుభ్రత తక్కువగా ఉండటం, కాన్పులు ఎక్కువ కావటం, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు కావడం, గ్రామీణ నేపథ్యంలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో హెచ్.పి.వి. వైరస్ ఎక్కువగా ఉండటం వంటివి మరిన్ని ఇతర కారణాలుగా చెప్పుకోవచ్చు. అందుకే పెళ్లి కాని అమ్మాయిలూ లేదా పెళ్లి అయినా, ఈ క్యాన్సర్ లేదని పరీక్షల ద్వారా నిర్ధారించుకున్న తర్వాత ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే సర్విక్స్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోగలం. డాక్టర్ సలహా మేరకు వారు సూచించిన కాల పరిమితుల్లో పాప్స్మియర్స్ చేయించుకుంటూ ఉంటే గర్భాశయ ముఖ ద్వారంలోని కణాల మార్పును ముందే పసిగట్టగలం. ఇంకా స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఏయే క్యాన్సర్స్ ఉన్నాయి, వాటి లక్షణాలు ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. అండాశయాల (ఒవేరియన్) క్యాన్సర్: స్త్రీలలో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్స్ తర్వాత ఈ క్యాన్సరే ఎక్కువ. అండాశయం పొట్టలో ఉండటం వల్ల లక్షణాలు చాలా ఆలస్యంగా గుర్తించగలుగుతాం. అందుకే ఈ క్యాన్సర్ను సైలెంట్ కిల్లర్గా పేర్కొంటారు. పిల్లలు కలగని స్త్రీలలో, బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్ వచ్చిన వారిలో, దీర్ఘకాలం పాటు హార్మోన్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువ. లక్షణాలు: ►పొత్తి కడుపు ఉబ్బి, నొప్పిగా ఉండటం అజీర్తి, వికారం, తేన్పులు వంటి జీర్ణ సంబంధ లక్షణాలు ►యోని అసాధారణ స్రావాలు, మూత్రం ఎక్కువగా రావటం ∙అలసట, జ్వరం, సీఏ 125 రక్త పరీక్ష, అల్టాస్రౌండ్ స్కానింగ్లతో ఈ క్యాన్సర్ను నిర్ధారణ చేయవచ్చు. యుటెరైన్ లేదా ఎండోమెట్రియల్ లేదా గర్భాశయ క్యాన్సర్స్: గర్భసంచిలో ఉండే లైనింగ్ ఎండోమెట్రియల్, ఈ పొర మరీ పలుచగానూ లేదా 14 మి.మీ. కంటే ఎక్కువగా మందంగా ఉండటం మంచిది కాదు. పిల్లలు కలగని స్త్రీలు, శరీరంలో ఈస్ట్రోజెన్ లెవల్స్ ఎక్కువ కాలం పాటు ఉండటం, రొమ్ము క్యాన్సర్ వచ్చి ఉండటం, నెలసర్లు 9 ఏళ్ల కంటే ముందు ప్రారంభం కావడం, మెనోపాజ్కు చేరుకున్న స్త్రీలు, అధిక బరువు ఉన్నవారిలో ఈ క్యాన్సర్ కు గురయ్యే ముప్పు ఎక్కువ. 50 నుండి 64 మధ్య వయస్సు స్త్రీలలో ఈ క్యాన్సర్ ఎక్కువగా కన్పిస్తోంది. అందుకనే మెనోపాజ్ దశకు చేరుకున్న స్త్రీలకు నెలసర్లు పూర్తిగా ఆగిపోయిన ఒక ఏడాది తర్వాత రక్తస్రావం అప్పుడప్పుడు అయినా, తరచుగా అయినా లేక చాలా కొద్దిగా రక్తం కన్పించినా నిర్లక్ష్యం చేయకూడదు. స్త్రీలు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ‘‘ఏంటి? మళ్లీ ఈ వయస్సులో నెలసర్లు మొదలయ్యాయి, ఎవ్వరితో చెప్పుకోను’’ అని మొహమాట పడుతూ ఉంటారు. కానీ అది మొహమాటపడి నిర్లక్ష్యం చేయాల్సిన సందర్భం కానే కాదు. బ్రెస్ట్ క్యాన్సర్కు టెమాక్సిఫెన్ మందు వాడిన స్త్రీలు, పెల్విస్కు రేడియేషన్ తీసుకున్నవారు, హార్మోన్ థెరపీ దీర్ఘకాలంపాటు తీసుకున్నవారు, 55 ఏళ్లు పైబడినా నెలసర్లు ఆగని స్త్రీలలో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ. నెలసరి మధ్యలో, మెనోపాజ్ దశ దాటాక రక్తస్రావం కనిపిస్తే అల్టాస్రౌండ్, హిస్టిరోస్కోపి, బయాప్సీ వంటి పరీక్షలు తప్పనిసరి. వెజైనల్ అండ్ వల్వా క్యాన్సర్స్: యోని, యోని పెదాలకు సంబంధించిన క్యాన్సర్స్ అరుదుగా కన్పించేవే కాని ఈ అవయవాలు క్యాన్సర్స్కు గురైతే ట్రీట్మెంట్ ఇవ్వటం మరింత కష్టం. మెనోపాజ్ వయస్సులో థైరాయిడ్ హార్మోన్ సమస్య ఉన్నవారిలో, హెచ్.పి.వి. వైరల్, హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ లేదా ఖచ్చితమైన కారణం తెలియకుండా వచ్చే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన ‘‘లైకెన్ స్లీ్కరోసస్’’ అనే చర్మవ్యాధి వల్ల స్త్రీలకు యోని ప్రాంతంలో తెల్లటి మచ్చలు, దురదలతో కూడిన మచ్చలు పడతాయి. ఆ మచ్చలు ‘వల్వార్ కార్సినోమా’ అనే చర్మ సంబంధ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. ‘లైకెన్ స్లీ్కరోసస్’ చర్మ వ్యాధి ఉన్న స్త్రీలు చికిత్స తీసుకోవటంతో పాటు తప్పనిసరిగా క్యాన్సర్ వంటి మార్పులు ఏమైనా చోటు చేసుకుంటున్నాయా అని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. గైనిక్ క్యాన్సర్స్కు చెక్ పెట్టాలంటే స్త్రీలు పాప్స్మియర్ పరీక్షలు చేయించుకుంటూ ఈ కింది లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ►పొత్తికడుపు బరువుగా, పెరుగుతున్నట్లు ఉండటం ∙అసాధారణమైన యోనిస్రావాలు, రక్తస్రావం ∙కలయిక సమయంలో రక్తం కన్పించడం ∙నెలసర్లు ఆగిపోయిన కొంతకాలం తర్వాత రక్తస్రావం ∙అలసట, జ్వరం, బరువు తగ్గటం. ►గైనకాలజికల్ క్యాన్సర్లు ఇతర శరీర భాగాలకు వ్యాపించక ముందే గుర్తిస్తే హిస్టరెక్టమి లేదా ఊఫరెక్టమిలను చిన్నకోతతో చేసే సర్జరీలద్వారా చేయించుకున్న వెంటనే కీమో, రేడియోథెరపీలను తీసుకోవటతో ఈ క్యాన్సర్లను అదుపులో ఉంచటం సాధ్యం అవుతుంది. -
మగాళ్లలో మార్పు తీసుకొచ్చేలా ‘ఫిమేల్’ ఉండాలి: మంత్రి సబితా
మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో రూపొందిన ‘ఫీమేల్’ చిత్రం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడాలని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వీపీఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాని తిక్కిశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ..వెలిచర్ల ప్రదీప్ రెడ్డి తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం ‘ఫిమేల్’. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టైటిల్ రివేలింగ్ పోస్టర్ ను తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మగాళ్లలో మార్పు తీసుకొచ్చే విధంగా ఈ చిత్రం ఉండాలని ఆమె ఆకాంక్షించారు. దర్శకుడు నాని తిక్కిశెట్టి, నిర్మాత వెలిచర్ల ప్రదీప్ రెడ్డి మరియు చిత్రబృందానికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. శుభాంగి తంభాలే టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ బేబీ దీవెన, దీపిక, తమన్నా సింహాద్రి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహిళల పట్ల జరుగుతున్న దారుణాలపై విప్లవాత్మకమైన పరిష్కారాన్ని సూచిస్తూ రూపొందిన ఈ విభిన్న కథాచిత్రం త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. -
ఆ అమ్మాయి ఈడేర లేదు..!
ఆడపిల్ల ఉంటే ఇంట్లోని వారు ఇరుగు పొరుగు వారు ఆ పిల్ల ఈడేరే విషయమై ఎదురు చూస్తూ ఉంటారు. ‘మీ అమ్మాయి ఈడేరిందా?’ అని అడుగుతూ ఉంటారు. కాని అందరు అమ్మాయిలు ఈడేరాలని లేదు. ప్రతి ఐదువేల మంది ఆడపిల్లల్లో ఒకరు ఎప్పటికీ రజస్వల కాని లోపంతో ఉంటారు. ఈ లోపాన్ని ‘టర్నర్ సిండ్రోమ్’ అంటారు. వైద్యశాస్త్రం పెద్దగా ఏ సహాయం చేయలేని ఈ సమస్యను సానుభూతితో అర్థం చేసుకోవడం గురించి ఇటీవల తెలుగులో కథలు వస్తున్నాయి. ఆ కథలు ఏమంటున్నాయి? ‘తొమ్మిదో తరగతికి వచ్చిన చెల్లెలు ఏపుగా ఎదిగి పోతుంటే నేనేమో గిడసబారిన మొక్కలాగా నాలుగున్నర అడుగులు దాటలేదు. అసలే మెడ కురచ. భుజాలు కొంచెం దగ్గరకొచ్చి మరింత చిన్నగా కనిపించేదాన్ని. నాతో కాలేజీకి వచ్చే అమ్మాయిల్లో కొందరికి నేనంటే చాలా చులకన. ఎప్పుడూ ఏదో రకంగా నన్ను ఆట పట్టించడం, జోకులేసి నవ్వుకోవడం వాళ్లకి సరదా. కళ్లలో తడి కనిపిస్తే మరింత ఏడిపిస్తారు. నేను పుష్పవతిని కాలేదు. అంతమాత్రం చేత నన్నెందుకు చిన్నచూపు చూడాలి. అందుకు బాధ్యురాలిని నేను కాదు కదా’ – రచయిత్రి వల్లూరిపల్లి శాంతి ప్రబోధ రాసిన ‘టర్నర్ సిండ్రోమ్’ అనే కథ నుంచి ‘ఎనిమిదో తరగతి అయిపోయింతర్వాత యేసవి సెలవుల్లో మా క్లాసుల మిగిలిన ఆడగుంటలు కరణాలమ్మాయి రాజేస్వరి, తెలకలోళ్ల కమల పుష్పవతులైపోయినారు. మా లచ్చుమత్త వచ్చినప్పుడల్లా ‘ఎప్పుడు మూల కూకుంటావే, ఎప్పుడు తిరపతిగాడిని పెల్లి సేసుకుంటావే’ అని అడుగుతుండీది. కళ్లు మూసి కళ్లు తెరిసినప్పుడికి రోజులు గిర్రున తిరిగిపోతున్నాయిగాని నేను పెద్దమనిషి కాకుండా శీలవతిలాగ మిగిలిపోతానేమో అని మాయమ్మకు, నాయనకు బెంగ పట్టుకున్నాది. మా ఊరిలోన నా ఒయసు ఆడగుంటలు తొమ్మండుగురు. నేను తొమ్మిదో తరగతికొచ్చినప్పుడికి ఏడుగురు పెద్దమనుసులైపోయినారు. నేను, పెదరైతుగారింటి మంగ ఇంకా అవ్వలేదు. నాలాగే కూకోడానికి ఇంకొక మనిషి ఊర్ల ఉందని మాయమ్మకు, మా నాన్నకు కొంచెం దైర్యంగా ఉండేది. ఇదిగో ఇప్పుడు పెదరైతుగారి పిల్ల సంవర్తాడిందనగానే మాయమ్మ, మా నాయిన తడిసిపోయిన సొప్పకట్టల్లాగా అయిపోగానే మొదటిసారి నేను పెద్దపిల్లనవ్వనేమో అని నాకు బయ్యమేసింది’ – రచయిత కరుణ కుమార్ రాసిన ‘పుష్పలత నవ్వింది’ కథ నుంచి. ఆడపిల్ల ఈడేరకపోతే మన దగ్గర భూకంపాలు వస్తాయి. ఆడజన్మ అంటేనే మన దృష్టిలో అమ్మ అయ్యే జన్మ అని అర్థం. సెంటిమెంట్ బలం ఎక్కువ. ఆమె ప్రత్యుత్పత్తికి అనువుగా ఉంటేనే గౌరవం. మన్నన. ప్రత్యుత్పత్తికి యోగ్యంగా లేకపోతే ఆమె మీద, కుటుంబం మీద చాలా ఒత్తిడి పెడుతుంది సమాజం. వింతగా చూస్తుంది. గేలి చేస్తుంది. చులకనతో విడిగా ఉంచేస్తుంది. ఈడేరని అమ్మాయికి సమాజం దృష్టిలో ఏ భవిష్యత్తూ లేనట్టే. ఇది ఒక రకంగా మూస దృష్టి. ఇంత మూసలో అందరూ ఉండకపోవచ్చు. పై రూపం బాగున్నా లోపల స్వల్ప మార్పుల వల్ల భిన్నంగా ఉండొచ్చు. అంతమాత్రం చేత వారికి ఏ భవిష్యత్తూ లేదనట్టుగా చూసే తీరు తప్పు. అలాంటి స్త్రీలు తమకు నచ్చిన రీతిలో జీవితాన్ని నిర్మించుకోవచ్చు. సంతోషంగా జీవించవచ్చు. కుటుంబం, సమాజం చేయాల్సింది అందుకు సహకరించడమే... అని చెబుతూ తెలుగులో కథలు వస్తున్నాయి. అలాంటి రెండు కథలే ‘టర్నర్ సిండ్రోమ్’, ‘పుష్పలత నవ్వింది’. ఆడపిల్లలు ఎందుకు ఈడేరరు? వివిధ కారణాలు ఉండొచ్చు. కాని ప్రధాన కారణం ‘టర్నర్ సిండ్రోమ్’. మనుషుల్లో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. స్త్రీలలో ఈ 23 జతల క్రోమోజోముల్లో ఏదైనా ఒక జతలో ఒక ఎక్స్ క్రోమోజోము ఏర్పడకపోతే అటువంటి వారిలో మొత్తం 45 క్రోమోజోములు ఉంటాయి. ఇలా 45 క్రోమోజోములు ఉన్నవారిలో అండాశయాలు చాలా చిన్నగా ఉండాయి. నెలసరి రాదు. అంటే వీరు ఎప్పటికీ రజస్వల కాలేరు. అది వినా ఇతరత్రా సాధారణ జీవనం జీవించొచ్చు. వైవాహిక జీవితం కూడా పొందవచ్చు. హెన్రీ టర్నర్ అనే అమెరికన్ ఎండోక్రైనాలజిస్ట్ ఈ సంగతి కనిపెట్టాడు కనుక దీనిని టర్నర్ సిండ్రోమ్ అంటారు. ఈ సమస్య ఉన్న 70 శాతం గర్భస్థ శిశువులను ఆల్ట్రాసౌండ్ పరీక్షలలో కనిపెట్టి అబార్షన్ చేస్తున్నారు అమెరికాలో. మిగిలిన ముప్పై శాతం శిశువుల్లో ఈడేరే వయసు వచ్చే దాకా ఈ సమస్య ఉన్నట్టు తెలియదు. కథలు ఏమంటున్నాయి? కరుణ కుమార్ రాసిన ‘పుష్పలత నవ్వింది’, శాంతి ప్రబోధ రాసిన ‘టర్నర్ సిండ్రోమ్’ ఈడేరని ఆడపిల్లల వేదనను చెబుతాయి. ‘పుష్పలత నవ్వింది’లో తండ్రి దాదాపు విరక్తిలోకి వెళతాడు తన ఒక్కగానొక్క కూతురు పెద్దమనిషి కాలేదని. టర్నర్ సిండ్రోమ్లో కథానాయిక తల్లి, నానమ్మ ఎంతో ఒత్తిడికి గురవుతారు. కథానాయిక కూడా. అయితే ‘పుష్పలత నవ్వింది’లో తల్లి, కూతురు కలిసి తండ్రికి అబద్ధం చెబుతారు. అమ్మాయి ఈడేరిన నాటకం ఆడతారు. అదొక ఇంటి రహస్యంగా ఉంచుతారు. ‘మంచి మనసున్న కుర్రాడిని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత అతనే అర్థం చేసుకుంటాడు’ అనే ముగింపు ఇస్తే... ‘టర్నర్ సిండ్రోమ్’ లో మాత్రం కథానాయిక బాగా చదువుకుని మొదట తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంటుంది. కుటుంబం నుంచి దూరంగా వచ్చి తన సమస్య తెలిసి తనతో జీవితాన్ని పంచుకునే అబ్బాయిని జీవితంలోకి ఆహ్వానిస్తుంది. ఈ రెండు కథల్లోనూ కథానాయికలకు కుటుంబం నుంచి, సమాజం నుంచి సవాలే ఎదురయ్యింది. ఇంత సవాలు అక్కర్లేదు. మనుషులకు ఎన్నో శారీరక లోపాలు ఉంటాయి. కళ్లద్దాలు రావడం కూడా ఒక లోపమే కదా. అలాంటి సర్వసాధారణ లోపంగా భావించే దశకు ఇటువంటి ఆడపిల్లల విషయంలో సమాజం వెళ్లాలి. ఆ చైతన్యం కథలు ఇస్తున్నాయి. అలాంటి కథలను ఆహ్వానించాలి. మా సమీప బంధువు ఒకరు తన కూతురు పెద్దమనిషి కావటం లేదని చాలా సంవత్సరాలు బాధపడటం దగ్గరగా చూశాను. అలాగే వరుసకు నాకు మేనత్త అయ్యే ఒకామె చివరి వరకు పెళ్లి లేకుండా ఉండిపోవడం చూసాను. అప్పుడే ఈ సమస్య వెనుక ఉన్న సామాజిక కోణం అర్థమయ్యింది. అప్పుడు ఈ కథ రాయాలని అనిపించింది. – కరుణకుమార్, రచయిత, సినీ దర్శకుడు నాకు బాగా తెలిసిన ఓ పోస్ట్గ్రాడ్యుయేట్ యువతి ఒక సందర్భంలో తన సమస్య గురించి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. మహిళలందరికీ నెలసరి అనే శరీర ధర్మం సహజం. కానీ కొందరిలో ఉండదు. అది నిజం. నాకు తెలిసిన గైనకాలజిస్ట్ దగ్గరకి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాను. ఫలితం శూన్యం. అప్పటి నుంచి ఈ సమస్యపై రాయాలి అనుకునేదాన్ని. శరీర అంతర్గత అవయవాల్లో సమస్య ఉన్న ఆ అమ్మాయిలు ఎటువంటి మానసిక, సామాజిక, శారీరక సమస్యలు ఎదుర్కొంటారో అని నేను చేసిన ఆలోచనకు జవాబే ఈ కథ. – వల్లూరుపల్లి శాంతిప్రబోధ, రచయిత్రి ఇది కూడా చదవండి: Period Pain and Cramps: రోజుకో నువ్వుల ఉండ, ఇంకా... -
‘కళావతి’ పాటతో కల్లోలం రేపుతున్న సింగర్స్ (ఫొటోలు)
-
భార్య సమ్మతి లేకుంటే.. బలాత్కారమే!
బెంగళూరు: తాళి కట్టినంత మాత్రాన, అర్ధాంగిగా స్వీకరించినంత మాత్రాన అమ్మాయిపై సర్వహక్కులు తమవేననే భావన భారత పితృస్వామ్య వ్యవస్థలో బలంగా వేళ్లూనుకుపోయింది. ఇది సరికాదని, స్త్రీ సమ్మతి లేకుండా భర్త బలవంతంగా కోరిక తీర్చుకుంటే.. దాన్ని మానభంగంగానే పరిగణించాలని కర్ణాటక హైకోర్టు బుధవారం విస్పష్టంగా పేర్కొంది. మారిటల్ రేప్ను నేరంగా పరిగణించాల్సిన సమయం వచ్చిందంటూ పరోక్షంగా దేశంలో అత్యంత ముఖ్యమైన, కీలకమైన చర్చకు తెరతీసింది. ఇష్టం లేకున్నా కోరిక తీర్చుకున్నాడని ఓ మహిళ పెట్టిన కేసును కొట్టివేయాలని ఆమె భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ ఎం.నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం అందుకు తిరస్కరించింది. వైవాహిక బంధం భర్తకు ప్రత్యేక అధికారాలు, పెత్తనం ఏమీ కట్టబెట్టదని.. స్ట్రీకి ఇష్టం లేని సంభోగం కచ్చితంగా రేప్ కిందకే వస్తుందని, భర్త అయినంత మాత్రాన దీనికేమీ మినహాయింపు ఉండదని అభిప్రాయపడింది. చారిత్రక చర్చకు తెరలేపింది. కూతురిని కూడా భర్త లైంగికంగా వేధించాడని సదరు మహిళ ఫిర్యాదు చేయడంతో.. అతనిపై బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) కింద కూడా కేసు నమోదు చేసి విచారించాల్సిందిగా అదేశించింది. లైంగిక వాంఛలకు పెళ్లి లైసెన్స్ కాదు! సతీమణి ఇష్టానిష్టాలకు విలువనివ్వకుండా... ఎప్పుడు పడితే అప్పుడు వాంఛలు తీర్చుకోవడానికి పెళ్లి అనేది ఒక లైసెన్స్ కాదని జస్టిస్ నాగప్రసన్న పేర్కొన్నారు. పాశ్చాత్యదేశాల్లో మహిళ సమ్మతి లేకుండా సంభోగానికి పాల్పడితే దాన్ని చట్టపరంగా నేరంగానే పరిగణిస్తున్నారు. అయితే భారత్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటం, పితృస్వామ్య వ్యవస్థ భావనలు బలంగా వేళ్లూనుకొని ఉండటం, సామాజిక కట్టుబాట్లు, ఆచారవ్యవహారాల పేరిట.. కేంద్ర ప్రభుత్వాలు చాన్నాళ్లుగా ఈ అంశం జోలికి (మారిటల్ రేప్ను నేరంగా మార్చే చట్ట సవరణకు) పోవడం లేదు. భార్యాభర్తలు అనే దానితో సంబంధం లేకుండా.. అమ్మాయి సమ్మతి లేకుండా లైంగిక దాడికి పాల్పడితే అది కచ్చితంగా నేరమే అవుతుందని జస్టిస్ నాగప్రసన్న బుధవారం అభిప్రాయపడ్డారు. బలత్కారమనేది స్త్రీల మానసిక స్థితిపైన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, వారికి భయకంపితులను చేస్తుందని పేర్కొన్నారు. అమ్మాయిని బలవంతంగా అనుభవించడం నేరమైనపుడు అది జీవిత భాగస్వామి అయినా సరే నేరంగానే చూడాలన్నారు. ‘తరతరాలుగా పురుషుడు భర్త అనే ముసుగులో.. మహిళలను తన సొంత ఆస్తిగా చూస్తున్నాడు. భార్యలు తమ చెప్పుచేతల్లో ఉండాలనుకునే బూజుపట్టిన ఆలోచనలు, సంప్రదాయాలను సమూలంగా తుడిచిపెట్టాల్సిందే. భర్తకు రేప్ నుంచి మినహాయింపునిస్తున్న భారత నేర స్మృతిలోని (ఐపీసీ) 375 సెక్షన్ ఏమాత్రం ప్రగతిశీల ఆలోచన కాదు. నా దృష్టిలో అది తిరోగమన భావన. అర్ధాంగిగా స్వీకరించిన మహిళ శరీరం, ఆలోచనలపై తమకు సంపూర్ణ హక్కులు దఖలు పడ్డాయనే భావన.. కచ్చితంగా తిరోగమన ఆలోచనే. స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమనే భావనకు ఇది తూట్లు పొడుస్తుంది. అందువల్లే చాలాదేశాలు మారిటల్ రేప్ను నేరంగా చేశాయి. యునైటెడ్ కింగ్డమ్, అమెరికాలోని 50 రాష్ట్రాలు, ఆస్ట్రేలియాలోని మూడు ఫ్రావిన్సులు, న్యూజిలాండ్, కెనడా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్... తదితర దేశాలు మారిటల్ రేప్ను నేరంగా పరిగణిస్తున్నాయని జస్టిస్ నాగప్రసన్న ఎత్తిచూపారు. భారత్లోనూ అసంఖ్యాక స్త్రీల మౌనరోదనను గుర్తించి చట్టసభల సభ్యులు ఈ మేరకు మారిటల్ రేప్ చట్టంలో మార్పులు తేవాలని అభిప్రాయపడ్డారు. -
ఎస్తేర్ ‘జిమ్’దాబాద్.. ఏపీ తొలి మహిళా బాడీబిల్డర్
సృష్టికి మూలం స్త్రీ. ప్రతి మగాడి గెలుపు వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. కానీ ఈ వనితల విజయం వెనుక వారి స్వయంకృషి ఉంది. అచెంచల ఆత్మవిశ్వాసం.. మొక్కవోని దీక్ష.. కఠోర సాధనతో వీరు తాము అనుకున్న లక్ష్యం సాధించారు. అవరోధాలను అవకాశాలుగా మలుచుకుని శక్తిసామర్థ్యాలకు పదునుపెట్టారు. ఉరిమే ఉత్సాహంతో ముందుకురికారు. జయభేరి మోగించి విజయతీరాలు చేరారు. తమ రంగాల్లో అనితరసాధ్యమైన ప్రతిభ కనబరిచారు. మహిళా లోకం సగర్వంగా తలెత్తుకునేలా.. కృషితో నాస్తి దుర్భిక్షం అని నిరూపించారు. చదవండి: ఇదేం కోడిగుడ్డు? వింత ఆకారాన్ని చూసేందుకు ఎగబడుతున్న జనం తెనాలి(గుంటూరు జిల్లా): రావూరి ఎస్తేరు రాణి.. ఈమె జీవితం వడ్డించిన విస్తరి కాదు.. చిన్నప్పుడే అమ్మానాన్నలకు దూరమయ్యారు. పేదరికం శాపంలా వెంటాడుతున్నా.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. జిమ్ ట్రైనర్గా ఉపాధి పొందుతూనే బాడీబిల్డర్గానూ రాణించారు. రాష్ట్ర తొలి మహిళా బాడీ బిల్డర్గా గుర్తింపు పొందారు. ఫలితంగా ఈనెల 11న సిక్కింలో జరగనున్న నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీలకు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్తేరురాణి సొంతూరు తెనాలి సమీపంలోని వేమూరు. నాలుగున్నరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమెను, ఆమె తమ్ముడినీ నాయనమ్మ చేరదీసింది. ఇద్దరినీ చదివించింది. గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ వరకు చదివిన ఎస్తేరు రాణి పొట్టకూటి కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ ఇంటికి దగ్గర్లో ఉన్న జిమ్కు వెళ్లి వర్కవుట్స్ చేసేవారు. కొద్దినెలల్లోనే అక్కడ జిమ్ ట్రైనర్గా మారారు. ఆ తర్వాత శరీర సౌష్టవ పోటీలకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నారు. కఠోర సాధనతో ఏడాదిన్నరలోపే అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీల్లో పాల్గొనేందుకు గత జనవరిలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో సత్తాచాటారు. ఏపీ నుంచి జాతీయ పోటీల్లో పాల్గొనబోతున్న తొలి బాడీ బిల్డర్గా గుర్తింపు పొందారు. ప్రముఖుల ప్రోత్సాహం ఎస్తేరురాణికి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్కుమార్ రూ.లక్ష, అడిషనల్ డీజీపీ శ్రీధర్, సునీల్ కలిసి రూ.50 వేలు చొప్పున సాయాన్ని సమకూర్చారు. వెన్నుతట్టి ప్రోత్సహించారు. నిత్యం ఆరు గంటల కఠోర సాధన ఎస్తేరురాణి రోజూ ఆరు గంటలు కఠోర సాధన చేస్తారు. ఈ సాధన ఫలించాలంటే రోజూ కిలో చికెన్, ఇరవై గుడ్లు మెనూలో ఉండాలి. వచ్చే జీతం సరిపోకపోయినా.. కొందరి సాయంతో మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు. నేషనల్స్లో పతకం సాధించి ఉద్యోగం పొందాలనేదే లక్ష్యమని ఎస్తేరు రాణి చెబుతున్నారు. ప్రతిభా ‘మాధవీ’యం తెనాలి: చుండూరు మండలం మోదుకూరుకు చెందిన ఇంజినీరింగ్ ప్రొఫెసర్ గాలి మాధవీలతకు ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఆర్ట్స్, మేనేజ్మెంట్ విభాగాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ సేవలందించిన 75 మంది మహిళల జాబితాను ప్రకటించింది. అందులో మాధవీలతకు స్థానం లభించింది. భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ కె.విజయరాఘవన్, బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ ఈ నెల 3న ఈ జాబితాను ప్రకటించారు. వీరి స్ఫూర్తిదాయక సేవలను ‘షి ఈజ్ 75 విమెన్ ఇన్ స్టీమ్’ పేరుతో పుస్తక రూపంలో తీసుకురానున్నారు. నేటి తరానికి స్ఫూర్తినిచ్చేందుకు వీరి వీడియోలను ప్రదర్శిస్తారు. సదస్సులో వీరిని పరిచయం చేస్తారు. ఆ జాబితాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సైంటిస్ట్లు, కళాకారులు, సమాజ సేవకులు, మానవతావాద డాక్టర్ల సరసన చుండూరు మండలం మోదుకూరుకు చెందిన కనకారెడ్డి, శివలీల కోడలు మాధవీలతకు స్థానం లభించింది. సాధారణ రైతు కుటుంబం నుంచి.. ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు గ్రామం మాధవీలత స్వస్థలం. 1971లో సాధారణ రైతు కుటుంబంలో అన్నపూర్ణమ్మ, వెంకారెడ్డి దంపతులకు జని్మంచారు. జేఎన్టీయూ, కాకినాడలో ఇంజినీరింగ్ పూర్తిచేసి, స్వగ్రామంలో తొలి ఇంజినీరుగా గుర్తింపును పొందారు. ఎన్ఐటీ, వరంగల్లో ఎంటెక్, ఐఐటీ మద్రాస్లో పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని సర్వోత్తమ విశ్వవిద్యాలయం ఐఐఎస్సీలో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇదే విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్పర్సన్గా మాధవీలత సైన్స్ని, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువచేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నారు. భారతదేశంలో జమ్ములో గల చీనాబ్ నదిపై రూ.1000 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోని అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జి డిజైన్, నిర్మాణంలో మాధవీలత ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వ్యక్తిగత విషయానికొస్తే గృహిణిగా, అమ్మగా తన పాత్రపోషిస్తూనే వృత్తిపరంగానూ రాణిస్తున్న మాధవీలత అభిరుచిలోనూ తనదైన శైలి కబరుస్తుంటారు. కవితలనూ రాస్తుంటారు. ‘ఆశా’వహ దృక్పథంతో.. గుంటూరు వెస్ట్: ఆశావహ దృక్పథమే ఆమెను ముందుకు నడిపింది. పరిస్థితులకు ఎదురీదుతూనే ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. రూ.200తో వ్యాపారం మొదలు పెట్టి రూ.40లక్షల టర్నోవర్కు చేర్చారు. ఆమె పేరు ఆశా సేకూరు. ఊరు గుంటూరు. సహజసిద్ధ ఉత్పత్తుల తయారీతో సమున్నత ప్రగతి సాధించారు. ఇప్పుడు విదేశాలకూ తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆశా విజయగాథ ఆమె మాటల్లోనే.. ఆలోచనాత్మకంగా ముందడుగు.. 2008లో విజయ్ ప్రసాద్తో పెళ్లయింది. నేను గర్భిణిగా ఉండగా ఆయన నడిపే యానిమేషన్ స్టుడియో ఆర్థిక ఇబ్బందులతో మూతపడింది. ఎనిమిదో నెలలోనే కూతురు తన్వీ పుట్టింది. సమస్యలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయినా బెదిరి పోలేదు. ఆ సమయంలో పాప రంగు రావాలని కొన్ని లోషన్స్ వాడాను. అవి వికటించి ర్యాషెస్ వచ్చాయి. అమ్మమ్మకు చెబితే వంటగదిలో లభించే కొన్ని వస్తువులతో సున్నిపిండి చేసి ఇచ్చింది. ఇది పాపకు బాగా పనిచేసింది. అప్పుడే సహజసిద్ధ ఉత్పత్తులు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. సున్నిపిండి తయారీకి కేవలం రూ.200 ఖర్చయింది. ఆచరణ ఇలా.. ఆ తర్వాత పాప శరీరానికి బాదం ఆయిల్ మంచిదని రూ.5.000 వెచ్చించి చత్తీస్గఢ్ నుంచి ఆయిల్ ఎక్స్్రస్టేట్ మిషన్ కొన్నాను. కేజీ బాదం పప్పును పిండితే కేవలం 150 గ్రాములే వచ్చింది. దానిలో మరికొన్ని వస్తువులు కలిపి పాపకు వాడాను. బాగా పనిచేసింది. ఆ తర్వాత సహజసిద్ధ ఉత్పత్తుల తయారీలో ఆయుర్వేదిక్ కాస్మొటాలజీ, ఆర్గానిక్, ఇతర సర్టిఫికేట్ కోర్సులు చేశా. సొంతంగా సహజసిద్ధ సౌందర్య ఉత్పత్తులు తయారు చేసి మొదట నా బిడ్డకు వాడేదాన్ని. వాటి ఫలితాల ఆధారంగా తన్వీ నేచురల్స్ పేరిట సంస్థ స్థాపించి మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టా. ప్రస్తుతం 25 రకాల వస్తువులు తయారు చేస్తున్నా. సంస్థ టర్నోవర్ ఇప్పుడు రూ.40లక్షలు. విదేశాలకూ ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నా. ప్రస్తుతం 600 మంది రెగ్యులర్ వినియోగదారులు ఉన్నారు. యువతకూ ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నా అనుభవాలు వారికి మార్గదర్శకంగా ఉంటాయని భావిస్తున్నాను. -
అవాక్కయ్యే విషయం: ఒక సగం ఆడ.. మరో సగం మగ
Dual Gender Stick Insect That Is Half Male And Half Female: ఈ ఫొటోలో ఉన్నది చార్లీ. మిడతలాంటి కీటకం. గ్రీన్బీన్ స్టిక్ ఇన్సెక్ట్ అని పిలుస్తారు. బ్రిటన్కు చెందిన లారెన్ గార్ఫీల్డ్ దాన్ని పెంచుకుంటున్నాడు. ఉన్నట్టుండి ఓ రోజు చార్లీ శరీరం రంగు మారడం మొదలైంది. ఇదేమిటా అని శాస్త్రవేత్తలకు చూపిస్తే.. అవాక్కయ్యే విషయం బయటపడింది. ఎందుకంటే చార్లీ ఒక సగం ఆడ కీటకం, మరోసగం మగ కీటకమని గుర్తించారు. సాధారణంగా ఈ రకం కీటకాల్లో మగవి ముదురు గోధుమ రంగులో చిన్నవిగా, ఆడవి లేత ఆకుపచ్చ రంగులో రెండింతలు పెద్దవిగా ఉంటాయి. చార్లీ ఆడకీటకంలా పెద్ద సైజులో ఒకవైపు ఆకుపచ్చ రంగులో ఉండగా, మరోవైపు ముదురు గోధుమ రంగులో మగ కీటకం లక్షణాలు ఉన్నాయి. ఈ తరహా కీటకాల్లో ఈ లక్షణాన్ని గుర్తించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు తేల్చడంతో.. పరిశోధనల కోసం లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియానికి ఇచ్చేశాడు. -
అమ్మాయిల సంఖ్య ‘అనంత’లోనే తక్కువ.. ఎందుకిలా?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య నిష్పత్తిలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అమ్మాయిల సంఖ్య ఇప్పటికీ తక్కువగా ఉంది. 2021 జనవరి నుంచి డిసెంబర్ వరకూ బర్త్ రేషియో (జననాల నిష్పత్తి) పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 902 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. అమ్మాయిల సంఖ్య తగ్గిపోతూ ఉండటం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గడిచిన మూడు దశాబ్దాల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు చెబుతున్నారు. చదవండి: టెలీ మెడిసిన్ సేవల్లో ఏపీ టాప్ చివరి స్థానంలో అనంత.. అబ్బాయిలు, అమ్మాయిల నిష్పత్తిలో అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే చివరిస్థానంలో ఉంది. రాష్ట్ర స్థాయిలో చూసినప్పుడు ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు సగటున 937 మంది అమ్మాయిలు ఉన్నారు. అదే జిల్లాలో చూస్తే వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం 902 మంది అమ్మాయిలు ఉండడం ఆందోళన కలిగించే అంశం. దీన్నిబట్టి రమారమి వందమంది అమ్మాయిలు తక్కువగా పుడుతున్నట్టు స్పష్టమవుతోంది. కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా 908 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఎందుకిలా? కొన్ని కుటుంబాల్లో అమ్మాయిలంటే ఇప్పటికీ చిన్నచూపు ఉంది. మగ సంతానానికి ఇస్తున్న ప్రాధాన్యత అమ్మాయిల విషయంలో ఉండడం లేదు. మారుమూల ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువ. లింగనిర్ధారణ పరీక్షలు చేయించడం, అమ్మాయి అని తెలియగానే అబార్షన్ చేయించడం పరిపాటిగా మారింది. దీనివల్ల అమ్మాయిల నిష్పత్తి తగ్గిపోతోంది. జిల్లాలో లింగనిర్ధారణ నిరోధక చట్టం ( పీసీ పీ అండ్ డీటీ) గట్టిగానే అమలు చేస్తున్నారు. ఎక్కడైనా లింగనిర్ధారణ చేశారని తేలితే తీవ్ర చర్యలుంటాయని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు అధికారులు హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ వైద్యుల (రేడియాలజిస్ట్/సోనాలజిస్ట్) పట్టాలు రద్దు చేయడానికైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొందరు గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు కుమ్మక్కై లింగనిర్ధారణ, అబార్షన్లు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఎవరైనా లింగనిర్ధారణ చేసినట్టు ఫిర్యాదు చేసి.. అది నిజమని తేలితే ఫిర్యాదుదారుడికి రూ.25 వేల బహుమతి ఇస్తారు. అలాగే ఆ ఫిర్యాదుపై విచారణ జరిగి డాక్టరుకు గానీ, నిర్వాహకులకు గానీ శిక్షపడితే రూ.లక్ష బహుమతి ఇస్తామని జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రకటించింది. నిఘా మరింత పెంచాం జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లపైనా నిఘా ఉంచాం. ఎక్కడైనా లింగనిర్ధారణ చేస్తున్నట్టు తెలిస్తే మాకు ఫిర్యాదు చేయొచ్చు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరిస్తే ఇలాంటి వాటిని అరికట్టవచ్చు. – డాక్టర్ కామేశ్వరప్రసాద్, డీఎంహెచ్ఓ రాయలసీమ జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య ఇలా.. జిల్లా అమ్మాయిలు వైఎస్సార్ జిల్లా 925 చిత్తూరు 924 కర్నూలు 908 అనంతపురం 902 -
తవాయిఫ్ల నుంచి దేవదాసీల వరకు
స్త్రీని తన లైంగిక బానిస చేసుకోవడానికి పురుషుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. బలవంతపు పడుపువృత్తి లేదా ఆచారాల ముసుగులో నిర్బంధ లొంగుబాటు కొనసాగించాడు. దక్షిణభారతదేశంలో దేవదాసి వ్యవస్థ ఉత్తర భారతదేశంలో తవాయిఫ్లు గొప్ప నాట్యకత్తెలుగా సంగీతకారిణిలుగా గుర్తింపు పొందినా వీరి లైంగిక అస్తిత్వం వీరిని సమాజంలో అథమ స్థానానికి నెట్టింది. సినిమా ఈ పాత్రలను తరచూ ప్రస్తావించింది. తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’ కూడా దేవదాసీ వ్యవస్థ దురాచారాన్ని గట్టిగా చర్చించింది. అలాంటి పాత్రలపై ఒక అవలోకన. ‘శ్యాం సింగరాయ్’ సినిమాలో బెంగాల్లో 1970 నాటి సాంఘిక దురన్యాయాల మీద తిరగబడతాడు హీరో నాని. ఆ కాలంలో హరిజనులపై అగ్రకులాలు చేసే దుర్మార్గాలను వ్యతిరేకిస్తాడు. అది కొంత వరకు కుటుంబం సహిస్తుంది. కాని ఎప్పుడైతే అతడు ‘దేవదాసి’ వ్యవస్థలో మగ్గుతున్న సాయి పల్లవిని తీసుకుని కోల్కతా వెళ్లిపోయి ఆమెకు విముక్తి ప్రసాదించి వివాహం చేసుకుంటాడో ఆ కుటుంబం రగిలిపోతుంది. తమ పరువును బజారున పడేస్తున్నాడని ఏకంగా అతణ్ణి హత్య చేసి శవం మాయం చేస్తుంది. ‘స్త్రీ శరీరానికి’, ‘పాతివ్రత్యానికి’, దాని చుట్టూ ఉండే ‘సామాజిక విలువ’కు ఈ హత్య ఒక తీవ్ర సూచిక. తమ ఇంటి యువకుడు స్త్రీలను పేదరికంలో నుంచి బయటకు తెస్తే ఆమోదం ఉంటుందేమో కాని, తక్కువ కులం నుంచి వివాహం చేసుకుంటే ఆమోదం ఉంటుందేమో కాని, ‘శీల పతనం’లో ఉండే స్త్రీకి గౌరవం తేవడానికి ప్రయత్నిస్తే మాత్రం కుటుంబం కాని, సమాజం కాని సహించదు. పురుషుడి శీల పతనానికి మించి స్త్రీల శీల పతనానికి ఎక్కువ విలువ, తీవ్రత ఆపాదిస్తుంది సమాజం. నిజానికి పురుషుడు తన స్వార్థం, సుఖం కోసం కల్పించిన వ్యవస్థ ‘దేవదాసీ’ వ్యవస్థ. దేవుణ్ణి అడ్డం పెట్టి పై వర్గాల వారు కింద వర్గాల స్త్రీలను లైంగిక దోపిడికి వాడుకోవడమే ఈ వ్యవస్థ పరమ ఉద్దేశం. పురుషుడు తాను తయారు చేసిన ఈ వ్యవస్థను గౌరవించడు సరి కదా ఈసడిస్తాడు. ఈ వర్గంలో ఎంతో గొప్ప ప్రావీణ్యం ఉన్న స్త్రీలు కళల్లో తయారైనా వారంతా ఇంటి బయటే ఉండాలి తప్ప ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఈ భావజాలాన్ని భారతీయ/ తెలుగు సినిమా అప్పుడప్పుడు చర్చిస్తూ వచ్చింది. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ కూడా చర్చించింది. ‘ధర్మపత్ని’తో మొదలయ్యి... 1941లో బి.శాంతకుమారి, భానుమతి నటించిన ‘ధర్మపత్ని’ సినిమా నుంచి ‘దేవదాసీ’ వ్యవస్థ ప్రస్తావన మన సినిమాల్లో వస్తూనే ఉంది. ‘ధర్మపత్ని’లో హీరోయిన్ శాంతకుమారి పెంపుడు తల్లి ఒకప్పుడు దేవదాసి అని తెలియడంతో హీరోకు కష్టాలు మొదలవుతాయి. దేవదాసి పెంచిన కూతురిని కోడలిగా ఆమోదించడం అసాధ్యమని హీరో వివాహానికి ఆటంకం ఏర్పడుతుంది. చివరకు శాంతకుమారి హీరోను పెళ్లి చేసుకోలేకపోతుంది. ‘దేవదాసు’లో ప్రేమ విఫలమైన అక్కినేని దేవదాసి అయిన చంద్రముఖి (లలిత–ట్రావెన్కోర్ సిస్టర్స్) పంచన చేరుతాడు. ఆ పాత్ర ఎంత ఉదాత్తంగా ఉన్నా ఆమె స్థాయి ఇలాంటి పతితులకు ఆశ్రయం కల్పించేదే తప్ప ఇల్లాలు అయ్యే స్థాయి మాత్రం కాదు. ‘శంకరాభరణం’లో శంకర శాస్త్రి అంతటివాడు ‘ఆటపాటలే వృత్తి’గా చేయబడిన కుటుంబం నుంచి వచ్చిన మంజుభార్గవి చేతికి తంబూర ఇస్తేనే సహించలేకపోతుంది పాడులోకం. మంజుభార్గవి సంగతి సరే ఏకంగా శంకరశాస్త్రినే నిరాకరిస్తుంది. స్త్రీలు మోయాల్సిన పాతివ్రత్యపు బరువు పట్ల దానికుండే పట్టింపు అది. మరి ఆ స్త్రీలను ఆ స్థితికి తెచ్చింది ఎవరు? ‘మేఘ సందేశం’లో ఇంటి ఇల్లాలి నుంచి ఎటువంటి స్ఫూర్తి పొందలేని అక్కినేని కళావంతురాలైన జయప్రదను అభిమానిస్తే ఆరాధిస్తే వారిరువురికి కూడా ఏకాంత వాసమే దక్కుతుంది. స్త్రీలకు తమ శరీరాల మీద, జీవితాల మీద పూర్తి హక్కు లేదని సమాజం పదే పదే చెప్పడం ఇది. అనార్కలికి దక్కని ప్రేమ... దక్షణాదిలో దేవదాసీ వ్యవస్థ ఉన్నట్టే ఉత్తరాదిలో తవాయిఫ్ల వ్యవస్థ ఉంది. తవాయిఫ్లు వినోద నాట్యకత్తెలు. గాయనీమణులు. దర్బారుల్లో ఆడిపాడటం వీరి పని. అంతిమంగా ఎవరో ఒకరి పంచన వీరు చేరక తప్పదు. వైవాహిక జీవితం వీరికి ఉండే అవకాశం లేదు. అందుకే ‘మొఘల్–ఏ–ఆజమ్’లో దిలీప్ కుమార్ను ప్రేమించిన మధుబాలకు ఆ ప్రేమ దక్కదు. ఆమెకు ప్రాణాలతో బొందపెట్టే శిక్ష దక్కుతుంది. ఆమె ఏ చిన్న నవాబు కూతురో అయినా ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. తండ్రి ఎవరో తెలియని ఒక వ్యవస్థను తయారు చేసి ఆ పుట్టిన సంతానాన్ని తిరిగి అదే కూపంలో ఉంచే అమానవీయమైన వ్యవస్థ ప్రతిఫలం ఇది. దీనిని స్త్రీలే అనుభవించాలి. పురుషుడు కాదు. ‘గైడ్’ సినిమాలో దేవదాసీ అయిన వహిదా రహెమాన్ను పెళ్లి చేసుకుని ఉద్ధరించాననుకుంటాడు ఆమె భర్త. కాని అతడి లోలోపల ఆమె మీద అనుమానం, చిన్నచూపు. ఆ పెళ్లి నుంచి ఆమె బయటపడి దేవానంద్లో ప్రేమ వెతుక్కున్నా ఆ పరుషుడు కూడా అంతే దారుణంగా ఆమెతో వ్యవహరిస్తాడు. చివరకు ఆమె జీవితకాల విరక్తిని పొందుతుంది. ఇక రేఖ చేసిన ‘ఉమ్రావ్జాన్’ తవాయిఫ్ల జీవన విషాద వీచిక. ఎన్నో ప్రశ్నలు.. పాత్రలు మత దురాచారాల వల్ల కాని, కొన్ని సమూహాల వెనుకబాటుతనం వల్ల గాని, సామాజిక దోపిడి వల్ల గాని స్త్రీలు లైంగిక వ్యాపారాల్లో చిక్కుకుంటే ఆ స్త్రీలు తిరిగి గౌరవం పొందడానికి యుగాల కొలదీ పోరాటం చేయవలసి వస్తోంది. వారికి ఉండవలసిన సమాన హక్కుల గురించి, సమాన మర్యాద గురించి మారవలసిన భావజాల దృష్టి చాలా ఉంది. ‘పవిత్రత’, ‘శీలం’ అనే మాటలకు సర్వకాల సర్వావస్థల్లో ఒకే ప్రమాణం ఉండదని, స్థలకాలాలను బట్టి వాటికి అర్థాన్ని ఆపాదించాల్సిన పద్ధతి మారుతుండాలని, ముఖ్యంగా ఇవి స్త్రీలు మాత్రమే మోయాల్సిన పదాలు కావని పురుషులు కూడా సమాన హక్కుదారులే అని మళ్లీ మళ్లీ చర్చించాల్సిన సినిమాలు పాత్రలు రావాలి. ఇకపై అదే జరుగుతుందని ఆశిద్దాం. -
జనాభా వృద్ధికి జాగ్రత్తగా పగ్గం
దేశంలో జనాభా విస్ఫోటన భయం కొంత తగ్గినట్టే! జనాభా వృద్ధి నియంత్రణ చర్యలు ఫలితా లిస్తున్నాయి. దాదాపు దేశమంతటా ఆశించిన స్థాయిలోనే జనాభా వృద్ధిని కట్టడి చేయగలిగినట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) తేల్చింది. మరో ఆరోగ్యకరమైన సంకేతం... దేశంలో మహిళా జనాభా పురుష జనాభాను దాటడం. ప్రతి వెయ్యి మంది పురుషులకు దేశంలో 1020 మంది మహిళలున్నట్టు తాజా సర్వే తెలిపింది. ఇలా మహిళల జనాభా పెరగడం, దాదాపు మూడు దశాబ్దాల ఈ సర్వే పర్వంలో తొలి నమోదు! అయితే ఈ లింగ నిష్పత్తి జననాల స్థాయిలో (ఎస్సార్బీ) ఇలా లేదు! అక్కడ పరిస్థితి భిన్నంగానే ఉంది. ప్రతి వెయ్యిమంది పురుషులకు 929 మంది మహిళలే ఉంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్వో) సహజమని చెప్పే స్త్రీ–పురుష నిష్పత్తి 950–1000తో పోలిస్తే ఇది తక్కువే! కానీ, అయిదేళ్ల కిందటి 2015–16 సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–4) చెప్పిన నిష్పత్తి (919–1000) కన్నా ప్రస్తుత పరిస్థితి మెరుగే! పరిమిత నమూనాలతో జరిపే ఈ సర్వే ఫలితాలను ప్రామాణికంగా భావించరు. పదేళ్లకోసారి వచ్చే సాధా రణ జనాభా లెక్కలే ప్రామాణికం. 2001, 2011 జనాభా లెక్కల్లో స్త్రీ–పురుష నిష్పత్తి సరళి కూడా ఇట్లాగే ఉంది. సాపేక్షంగా ఈ సర్వే నివేదికలూ వాస్తవికతకు దగ్గరగా ఉన్నట్టే! ఒకటి మాత్రం నిజం. వివిధ సమాజాల్లో ఈ లింగవివక్ష, కాన్పుకు ముందే లింగ నిర్ధారణ దురదృష్టకరం, నేరం! ఆడ పిల్లలను అంతమొందించే బ్రూణహత్యలు జరుగుతూనే ఉన్నాయి. వెయ్యిమంది పురుషులకు హిమాచల్ప్రదేశ్(875), తమిళనాడు(878), హరియాణా(893), ఒడిశా(894) లాగే తెలంగాణ (894)లోనూ మహిళల సంఖ్య తక్కువగా నమోదయింది. ఆంధ్రప్రదేశ్లో కొంత మెరుగ్గా (934) ఉంది. కేరళలో అయిదేళ్ల కింద 1047గా ఉన్న మహిళల సంఖ్య తాజాగా 951కి పడిపోయింది. ఢిల్లీలో 812 నుంచి ఏకంగా 923కి పెరిగింది! ఒట్టి జననాల్లో కాకుండా మొత్తం జనాభాలో మహి ళల నిష్పత్తి పురుషుల కన్నా ప్రస్తుతం పెరగడానికి పలు కారణాలుంటాయి. మరణాల రేటులో వ్యత్యాసం, మహిళల్లో ఆయుఃకాలం పెరగటం వంటివీ ఈ అంశాన్ని ప్రభావితం చేస్తాయి. కుటుంబ ఆరోగ్య సర్వేలో కొన్ని మంచి ఫలితాలు కనిపిస్తే, మరికొన్ని విషయాల్లో ఆందోళనకర సంకేతాలు వెలువడటాన్ని పాలకులు గుర్తించాలి. పిల్లలు, మహిళల్లో పౌష్టికాహార లోపం, ఇనుము కొరవడి రక్తహీనత (అనీమియా) ప్రబలడాన్ని తీవ్రంగా పరిగణించి, నివారణ చర్యల్ని ముమ్మరం చేయాలి. పిల్లల్లో రక్తహీనత కేసులు గత సర్వే కాలంలో 58.6 శాతం ఉంటే, ఇప్పుడది 67 శాతానికి పెరిగింది. గర్భిణీల్లో 50.4 శాతం నుంచి 52.2 శాతానికి, 15–49 మధ్య వయస్కులైన మహిళల్లో 53 నుంచి 57 శాతానికి పెరిగింది. అదే వయసు పురుషుల్లో 22.7 నుంచి 25 శాతానికి పెరగటం సమస్య తీవ్రతకు నిదర్శనం. ‘అనీమియా రహిత భారత్’ నినాదంతో, 2022 నాటికి కేసుల్ని తగ్గిం చాలని కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తున్నా ఆశించిన ప్రగతి లేదని సర్వే తేల్చింది. పళ్లు, కూరగాయలు సరిగా తినకపోవడం, ఇతరత్రా పౌష్టికాహార లోపాలతోనే రక్తహీనత పెరిగి సమస్య జటిలమౌతోంది. కరోనా కాలంలో ఆదాయాలు రమారమి పడిపోయి, నిత్యావసరాల ధరలు పెరగ టం కూడా ఈ సమస్యను తీవ్రతరం చేసింది. రోజువారీ భోజనంలో, తమ ఆర్థిక స్థాయిలోనూ సమ కూర్చుకోగలిగిన నిర్దిష్ట ఆహార పదార్థాలపైన జనాలకి స్పష్టమైన అవగాహన ముఖ్యం. జాతీయ పౌష్టికాహార సంస్థ ప్రచారం కల్పిస్తున్నప్పటికీ, సరిపోవడం లేదు. ప్రజలింకా చైతన్యం కావాలి. దేశవ్యాప్తంగా మొత్తం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను గ్రూపులు చేసి రెండు విడతల్లో నిర్వహించిన ఈ సర్వే ఏపీ, తెలంగాణల్లో తొలివిడతలోనే జరిగింది. వైద్యారోగ్యపరంగా కొన్ని మంచి సంకేతాలీ రాష్ట్రాల్లో వెలువడ్డాయి. పౌరులకు ఆరోగ్య భీమా వర్తింపజేయడంలో దేశంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అగ్రభాగాన ఉన్నాయి. ఏపీలో పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి ‘నాడు– నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాసుపత్రుల రూపురేఖల్ని మారుస్తున్న చర్య సత్ఫలితాలిస్తోంది. ఆస్పత్రుల్లో కాన్పులు పెరిగాయి. కాన్పువేళ, తదనంతరం మాతా–శిశు మరణాలు తగ్గాయి. కొన్ని విషయాల్లో దేశవ్యాప్తంగానూ ఆశావహ సంకేతాలున్నాయి. దేశంలో నాల్గింట మూడొంతుల మంది మహిళలు బ్యాంకుల్లో అకౌంట్లు తెరిచారు. స్త్రీ–పురుషుల్లోనూ ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగింది. గృహ హింస, అదీ జీవిత భాగస్వామి నుంచి తగ్గినట్టు నమోదైంది. కుటుంబ నియంత్రణ పట్ల అవ గాహన పెరగటమే కాక సురక్షిత పద్ధతులు వారికి తెలిసి వచ్చాయి. జననాల రేటు తగ్గించడంలో ఇదెంతో ఉపయోగపడ్డట్టు గణాంకాలున్నాయి. జనాభా వృద్ధి కట్టడిలో చాలా రాష్ట్రాలు గణనీయ ఫలితాలే సాధిస్తున్నాయి. మొత్తం సంతానోత్పత్తి రేటు(టీఎఫ్పార్)ను 2.1 కన్నా తక్కువకి నియం త్రిస్తే జనన–మరణాల ప్రక్రియ కొనసాగుతూనే, ఇప్పుడున్న జనసంఖ్య స్థిరపడుతుందనేది ఓ లెక్క! బిహార్, మేఘాలయ, మణిపూర్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ తప్ప దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలూ టీఎఫ్పార్ని 2 కన్నా కిందే నిలిపేయడం మంచి పరిణామం. అయినా, 2040–50 సంవత్సరాల మధ్య భారత్ అత్యధిక (160 నుంచి 180 కోట్ల మందితో) జనాభా దేశంగా ఆవిర్భవించనుంది. 2031 నాటికే చైనాను అధిగమిస్తామని మరో అధ్యయనం! 2022కే అధిగమి స్తామన్న ఐక్యరాజ్యసమితి (యూఎన్) అంచనాను తప్పించామంటే, జన విస్ఫోటన తేదీని మనం ముందుకు, మరింత ముందుకు జరుపుతున్నట్టే లెక్క! ఇది ఆశావహ సంకేతం!! -
యువతి గురించి తెలియక పిచ్చి వేషాలు వేసి అడ్డంగా బుక్కయ్యాడు!
ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న మహిళలు, బాలికలు ఎక్కడో ఒక దగ్గర లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. కొందరు ఆకతాయిలైతే బరితెగించి చుట్టూ ఎందరు ఉన్నా మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా బస్సులో ఒంటరిగా కుర్చన్న యువతితో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. తీరా చూస్తే ఆమె ఓ లేడీ బ్రూస్లీ కావడంతో అతను దెబ్బలు తినడంతో పాటు అందరి ముందు అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 20న బ్రెజిల్లోని బెలెమ్కు చెందిన ఓ మహిళ బస్సులో ఇంటికి వెళుతోంది. ఆ సమయంలో బస్సు ప్యాసింజర్లతో పుల్గా ఉంది. ఆమె ఎదురుగా నిలుచున్న ఓ వ్యక్తి పిచ్చి చేష్టలు మొదలుపెట్టాడు. బస్సులో ప్యాసింజర్లు అంత మంది ఉన్నా తన పైశాచికత్వాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. చుట్టూ ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారని ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో చిర్రెత్తు కొచ్చిన ఆ యువతి అతడి ముక్కుపై గట్టాగా ఒక్క పంచ్ ఇచ్చింది. దెబ్బకు ఆ వ్యక్తికి కళ్లు బైర్లు కమ్మాయి. వెంటనే వెనకాల నుంచి గొంతును చేతుల్తో చుట్టి పడేసింది. దీంతో ఊపిరాడక అల్లాడిపోయాడు. చివరికి డ్రైవర్ బస్సును నేరుగా పోలీస్స్టేషన్ దగ్గరకు తీసుకెళ్లడంతో అతడిని పోలీసులకు అప్పగించారు. కాగా గత ఏడాది కూడా బస్సులో తనకు ఇలాంటి అనుభవమే ఎదురైందని అందుకే ఆత్మరక్షణ కోసం తాను ప్రత్యేకంగా ముయే థాయ్, కాపోయిరాలను కళను నేర్చుకున్నట్లు ఆ యువతి తెలిపింది. బ్రెజిలియన్ చట్టం ప్రకారం లైంగిక వేధింపుల నేరానికి పాల్పడినట్లు రుజువైతే, నిందితుడికి ఏడాది నుంచి ఐదు సంవత్సరాల మధ్య జైలు శిక్ష పడే అవకాశం ఉంది. చదవండి: జైలుకెళ్లొచ్చాక కూడా బిడ్డలపై అత్యాచారం చేస్తా: తండ్రి -
రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు!
రాజస్థాన్లోని జైపూర్కి చెందిన ఓ రెస్టారెంట్.. కస్టమర్లకు ఓ విచిత్ర షరతు పెట్టింది. కస్టమర్ల పక్కన మహిళ ఉంటేనే లోపలికి ప్రవేశమట. అందేంటి?? అనుకుంటున్నారా... దీనికి సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి ఆకలేసి సదరు హోటల్కి వెళ్లబోతే, పక్కన లేడీ ఎవ్వరూ లేరని వెనక్కి పంపారట. దీనితో ఒక మహిళను తీసుకొచ్చి, హోటల్లో కూర్చోబెట్టి కడుపునిండా తిన్నాడట. ఐతే పాపం ఆ మహిళ మాత్రం పప్పు రోటీ తినడానికి ఈ వ్యక్తి నన్నిక్కడికి తీసుకొచ్చాడనే క్యాప్షన్తో తన ఇమేజ్తో సహా ట్విటర్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ పోస్టుపై నెటిజన్లు విభిన్న కామెంట్లు చేస్తున్నారు. చదవండి: మార్నింగ్ వాక్కి వెళ్లింది... కోటీశ్వరరాలైంది!! So this guy took me here to have dal roti because pic.twitter.com/PVrgeuS4H9 — Harshita Sharma (@Harshita511) October 17, 2021 -
యువనటి ఆత్మహత్య కేసులో ట్విస్టు.. నటుడు వివేక్పై ఆరోపణలు
శివాజీనగర్ (కర్ణాటక): బుల్లితెర నటి సౌజన్య ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నటుడు వివేక్ ప్రేమ, పెళ్లిపేరుతో వేధించడం వలన తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి ప్రభు మాదప్ప ఆరోపించాడు. నటుడు వివేక్, అసిస్టెంట్ మహేశ్లపై కుంబళగోడు పోలీస్స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. కాగా, తన కూతురు అమాయకురాలని,ఎలాంటి తప్పు చేయలేదని తెలిపాడు. తన కూతురు దగ్గర ఉన్న బంగారం,డబ్బులు కనిపించడంలేదని ఫిర్యాదులో ప్రభు మాదప్ప పేర్కొన్నాడు. ఈ మేరకు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడికి ఒక సంవత్సరం నుంచి తన కూతురితో పరిచయం ఉందని తెలిపాడు. తన కూతురిని ప్రేమించాలని వేధించాడని చెప్పుకొచ్చాడు. కాగా, పోలీసులు వచ్చేలోగా ఘటనా స్థలం నుంచి తన కూతురి మృత దేహన్ని నిందితుడు మార్చాడని ఆరోపించాడు. ఆమె మొబైల్ కూడా కనిపించడం లేదని తెలిపాడు. మొబైల్ దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నాడు. ఇక ఈ ఆరోపణలపై నటుడు వివేక్ స్పందిస్తూ.. ఇప్పుడు తానేమి చెప్పలేనని అన్నాడు. నటి సౌజన్య తనకు.. ఏడాదిగా తెలుసని అన్నాడు. ఆమె చాలా అమాయకురాలని అన్నాడు. సౌజన్య.. ఒత్తిడికి గురైనప్పుడల్లా తనబాధను నాతో చెప్పుకునేదని వివేక్ పేర్కొన్నాడు. మరోవైపు సౌజన్య గదిలో లభించిన నాలుగు పేజీల సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఆమె తన మానసిక స్థితి బాగాలేదని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసింది. ఇక ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని సూచించారు. కాగా, పోస్ట్మార్టం నివేదిక వచ్చాక మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. చదవండి: Actress Soujanya : విషాదం.. సూసైడ్ నోట్ రాసి యువనటి ఆత్మహత్య -
అర్చకత్వంలోనూ సగం..
దేవాలయాల్లో అర్చకులుగా ఎక్కువగా పురుషులే కనిపిస్తుంటారు. ఇప్పుడా స్థానాల్లోకి సైతం మహిళలు అడుగుపెట్టేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తమిళనాడుకు చెందిన 28 ఏళ్ల సుహంజన గోపీనాథ్ వడియార్ (పూజారి) బుధవారం బాధ్యతలు చేపట్టి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అర్చకత్వం చేస్తూ మరెంతోమంది మహిళలకు ప్రేరణగా నిలవనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ సుహంజనను పూజారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం తో తమిళనాడులో రెండో మహిళా పూజారిగా నిలిచింది సుహంజన. 208 మంది అర్చకులను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా.. దీనిలో మహిళా పూజారిగా సుహంజన, ఇతర కులాల నుంచి శిక్షణ పొందిన అర్చకులు 24 మంది ఉన్నారు. మాడంబాకమ్లోని ధేనుపురీశ్వరర్ ఆలయంలో సుహంజన వడియార్గా సేవలందించనుంది. సుహంజనను అర్చకత్వం చేయడానికి ఆమె భర్త, మామగారు ముందుండి ప్రోత్సహించడం విశేషం. తమిళనాడులో మహిళ అర్చకత్వం చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. తండ్రి మరణించడంతో అతడు చేసే అర్చకత్వాన్ని వారసురాలిగా అతని కుమార్తె చేయవచ్చని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిన్నియక్కళ్ తమిళనాడులోనే తొలి మహిళా పూజారిగా బాధ్యతలు చేపట్టింది. పిన్నియక్కాళ్ తండ్రి పిన్న తేవార్ మధురైలోని అరుల్మిగు దురై్గ అమ్మన్ కోవెలలో పూజారిగా పనిచేసేవారు. ఆయనకు ఆరోగ్యం బాగోకపోవడంతో ఆలయంలో ఆయన చేయాల్సిన పనులను పిన్నియక్కాళ్ చేసేది. కొంత కాలం గడిచాక ఆరోగ్యం క్షీణించి పిన్నతేవార్ 2006లో మరణించాడు. దీంతో ఆయన స్థానంలో పిన్నియక్కాళ్కు ఆ బాధ్యతలు ఇవ్వడానికి గ్రామస్థులు ఒప్పుకోలేదు. ఆమె హైకోర్టును ఆశ్రయించడం తో పిన్నియక్కాళ్ అర్చకత్వం నిర్వహించవచ్చని కోర్టు తీర్పు చెప్పింది. దాంతో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి 2007లో పిన్నియక్కాళ్ను పూజారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేగాక ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ఇదే విషయాన్ని వక్కాణించి చెప్పడం విశేషం. ‘‘నేను కరూర్ సామినాథన్లో మూడేళ్లు అర్చకత్వాన్ని చదివాను. ఇది ఒక ఉద్యోగ అవకాశంగా నేను చూడడం లేదు. నిర్మాణాత్మకమైన సాంప్రదాయం ఇది. అర్చకత్వాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ మహిళలు కూడా ఇది చేయగలరని సందేశాన్ని సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాను’’అని సుహంజన చెప్పింది. -
దూసుకొచ్చిన మహిళా ‘ఆక్సిజన్’ రైలు
బెంగళూరు: కరోనా వ్యాప్తి బాధితులకు అందించేందుకు చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో ఇతర ప్రాంతాల నుంచి ప్రాణవాయువు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా, జార్ఖండ్ల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది. అయితే తాజాగా చేసిన ఆక్సిజన్ సరఫరా ఎంతో ప్రత్యేకతతో కూడుకున్నది. ఎందుకంటే ఆ ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపిన వారంతా మహిళలే. మహిళా పైలెట్లే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ను నడిపి ప్రత్యేకత చాటారు. జార్ఖండ్లోని జంషెడ్పూర్ టాటానగర్ నుంచి బయల్దేరిన 7వ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ శుక్రవారం కర్నాటకలోని బెంగళూరుకు చేరింది. ఆ రైల్లో సిబ్బందితో పాటు పైలెట్లంతా మహిళలు ఉండడం విశేషం. ఈ విషయాన్ని తెలుపుతూ రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ బెంగళూరు చేరుకుందని తెలిపారు.