-
గూగుల్ అదిరిపోయే ఫీచర్, రద్దీ ఎలా ఉందో ఇట్టే చెప్పేస్తుంది..!
షాపింగ్ చేయడానికో లేదంటే ఇతరాత్ర పనుల మీద బయటకు వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకు కరోనానే కారణం. మహమ్మారి వల్ల మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. మాట్లాడాలన్నా, ఫ్రీ గా తిరగాలన్నా సాధ్యం కావడం లేదు. రద్దీగా ఉండే ప్రాంతాలవైపు వెళ్లడమే మానేశాం. అందుకే ఆ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ 'గూగుల్ మ్యాప్స్'లో సరికొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్ని గుర్తిస్తుంది. హాలిడేస్లో సరదగా కుటుంబ సభ్యులకు బయటకు వెళ్లేందుకు, లేదంటే షాపింగ్ చేసేలా గూగుల్ మ్యాప్స్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం గూగుల్ సంబంధిత ప్రాంతాలకు చెందిన వ్యాపార వివరాలు, డైరెక్టరీస్ (సంస్థల వివరాలు )ను సేకరించింది. వాటి సాయంతో లోకేషన్లో ఉన్న వ్యక్తుల కదలికలు, ఏ ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉందో గుర్తించేందుకు సహాయపడనుంది. వరల్డ్ వైడ్గా గూగుల్ ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకోసం వరల్డ్ వైడ్గా అందుబాటులోకి తీసుకొనిరానుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలు, మాల్స్, బస్సు, రైల్వేస్టేషన్లతో పాటు, భవనాల రహదారులను గుర్తించడానికి సహాయపడుతుంది. ఈ ఫీచర్ జోడించబడిన తర్వాత, వినియోగదారులు ఒకే చోట అందుబాటులో ఉన్న అన్ని షాపులు, రెస్టారెంట్లు, విమానాశ్రయ లాంజ్లు, కార్ రెంటల్, పార్కింగ్ స్థలాల్ని ఈజీగా గుర్తించవచ్చని గూగుల్ ప్రకటనలో వెల్లడించింది. చదవండి : గూగుల్ అదిరిపోయే శుభవార్త, ఇక యూట్యూబ్లో చెలరేగిపోవచ్చు -
Revolt RV400: కీ అక్కర్లేదు.. స్మార్ట్ఫోన్తోనే బండి స్టార్ట్
వాహనాన్ని స్టార్ట్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా కీ కంపల్సరీ. అది లేకుండా బండి ముందుకు నడవదు. అయితే గత కొంత కాలంగా కీ లేకుండా బండ్లు స్టార్ట్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా.. అవన్నీ రెంటల్ బైక్ సర్వీసెస్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పర్సనల్ బైకులకు సైతం ఈ ఫీచర్ని అందుబాటులోకి వచ్చింది. ఓలా రాకతో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో పరిస్థితులు మారిపోయాయి. ఈ సెగ్మెంట్లో రోజుకో మార్పు చోటు చేసుకుంటోంది. కస్టమర్లను ఆకట్టుకునేలా ఫీచర్లు అందించేందుకు కంపెనీలో పోటీ పడుతునఆనయి. తాజాగా తమ బైకులకు సంబంధించి కీలకమైన మార్పును రివోల్ట్ తీసుకొచ్చింది. కీతో సంబంధం లేకుండానే బండి ఆన్ ఆఫ్ చేసే విధంగా సరికొత్త టెక్నాలజీని రివోల్ట్ అందిస్తోంది. రివోల్ట్ 400 బైకులు స్మార్ట్ఫోన్తో ఆపరేట్ చేయవచ్చు. స్మార్ట్ఫోన్లో రివోల్ట్ యాప్ ద్వారా కీతో సంబంధం లేకుండానే బైను ఆన్, ఆఫ్ చేయవచ్చు. పార్కింగ్ ఏరియాలో బండి ఎక్కడ ఉందో కూడా కనుక్కోవచ్చు. 2021 సెప్టెంబరు నుంచి మార్కెట్లో అందుబాటులో ఉండే బైకులకు ఈ ఫీచర్ను అందిస్తున్నారు. కొత్తవాటితో పాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న బైకులకు సైతం ఈ ఫీచర్ని ఉచితంగానే అందిస్తామని రివోల్ట్ ఫౌండర్ రాహుల్ శర్మ తెలిపారు. రివోల్ట్ షోరూమ్కి వెళ్లి కీ లేకుండా బైకులను ఆపరేట్ చేసే ఫీచర్ను పొందవచ్చన్నారు. అయితే కీ లెస్ ఫీచర్ని కేవలం రివోల్ట్ ఆర్వీ 400 మోడల్స్కే పరిమితం చేశారు. ఆర్వీ 300 మోడల్ బైకులకు ఈ ఫీచర్ని అందివ్వడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రివోల్ట్ ఆర్వీ 400 మోడల్ స్టాండర్డ్ ధర ఆన్ రోడ్ రూ.1,06,999గా ఉంది. కొత్త మోడల్ వివరాలపై స్పష్టత లేదు. -
మాట్లాడితే చాలు ట్వీట్ పడిపోతుంది
చిట్టి చిట్టి మాటలు.గట్టి సందేశాలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న ట్విట్టర్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టాటిస్టా లెక్కల ప్రకారం.. 2021 ఏప్రిల్ నెల నాటికి ట్విట్టర్కి ప్రపంచ వ్యాప్తంగా 199మిలియన్ యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. అయితే వారి సంఖ్యను పెంచేందుకు కొత్త ఫీచర్లను అందుబాటులో తెస్తోంది. ఇందులో భాగంగా వాయిస్ ట్వీట్ ను డెవలప్ చేస్తున్నట్లు ట్విట్టర్ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఐఓఎస్ లిమిటెడ్ యూజర్లకు ఈ ఆప్షన్ను ఎనేబుల్ చేసింది. కానీ, ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్, డెస్క్టాప్ వెర్షన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ట్విట్టర్ ప్రకటించలేదు. కాకపోతే ప్రస్తుతం ఐఓఎస్ యూజర్లకు వాయిస్ ట్వీట్ ఆప్షన్ అందుబాటులోకి తేవడంతో ఆండ్రాయిడ్, డెస్క్ టాప్ యూజర్లు వినియోగించేందుకు త్వరలోనే ఈఫీచర్ పూర్తి స్థాయిలోకి వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్, ఐ పాడ్ వినియోగదారులు ఈ వాయిస్ ట్వీట్ ఆప్షన్ను యూజ్ చేసుకోవచ్చు. ఆపిల్ ఐఫోన్ ,ఐప్యాడ్ యూజర్లు రెండు నిమిషాల 20 సెకన్ల వాయిస్ ట్వీట్లను మాత్రమే రికార్డ్ చేసే సదుపాయం ఉంది. వాయిస్ ట్వీట్ను పోస్ట్ చేయడానికి, వినియోగదారులు ఐఫోన్ లేదా ఐప్యాడ్లో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అనంతరం కంపోజ్ ట్వీట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే వాయిస్ ట్వీట్ చేసే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. అదే ఆప్షన్ లో వేవ్ లెంగ్త్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వాయిస్ ట్వీట్ ను రికార్డ్ చేయాలి. పూర్తయిన తర్వాత డన్ అని క్లిక్ చేసే మీ వాయిస్ ట్వీట్ షేర్ అవుతుంది. చదవండి : ఎస్బీఐలైఫ్ ఇన్సూరెన్స్, కోవిడ్–19 క్లెయిములు భారీగా పెరిగాయ్ -
ఫ్లిప్కార్ట్లో సరికొత్తగా షాపింగ్..ముందుగానే ఇంట్లో చూడొచ్చు..!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన కస్టమర్లకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించనుంది. ఆగ్మెంటెడ్ రియాలిటీతో ఫ్లిప్కార్ట్లోని ఆయా వస్తువులను కస్టమర్లు ముందుగానే తమ ఇంట్లో చూసుకునే సౌకర్యాన్ని ఏర్పాటుచేసింది. ఈ టెక్నాలజీతో కొనుగోలుదారులకు ఆయా వస్తువులపై మరింత అనుభూతిని పొందవచ్చునని ఫ్లిప్కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లిప్కార్ట్ కెమెరా సహాయంతో ఆయా వస్తువుల 3డీ ఇమెజ్లను ఇంట్లో చూడొచ్చును. ఈ ఫీచర్తో ఫర్నిచర్, లగేజ్, పెద్ద ఉపకరణాల కొనుగోలు విషయంలో ఉపయోగకరంగా ఉండనుంది. వస్తువులను కొనుగోలు చేసే ముందు ఫ్లిప్కార్ట్ కెమెరా సహయంతో వస్తువుల పరిమాణం నిర్ధిష్ట స్థలంలో సరిపోతుందా లేదా అనే విషయాన్నికొనుగోలుదారులు సులువుగా అర్థం చేసుకోవడానికి వీలు పడనుంది. ఫ్లిప్కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ జయంద్రన్ వేణుగోపాల్ మాట్లాడుతూ..ఫ్లిప్కార్ట్లో కస్టమర్లకు మరింత షాపింగ్ అనుభూతిని కల్పించడానికి కంపెనీ పలు చర్యలను తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ తెచ్చిన ఈ కొత్త ఫీచర్తో, కస్టమర్ల తమ ఇంట్లో ఆయా వస్తువులను ఏఆర్ టెక్నాలజీ సాయంతో ముందుగానే చూసే సౌకర్యం కల్గుతుందని తెలిపారు. దీంతో కస్టమర్లు వస్తువులను కొనుగోలు చేయడానికి మరింత సులువుకానుంది. ఫ్లిప్కార్ట్ కెమెరాను ఎలా వాడాలంటే..! మీ స్మార్ట్ఫోన్ నుంచి ఫ్లిప్కార్ట్ యాప్ను ఓపెన్ చేయండి. మీరు కొనుగోలు చేయాలనుకున్న వస్తువుల కోసం సెర్చ్ చేయండి. ఆ వస్తువుపై క్లిక్ చేయండి. ఆయా వస్తువుకు ‘వ్యూ ఇన్ యూవర్ రూమ్’ ఆప్షన్పై క్లిక్ చేయండి. కొన్ని క్షణాల తరువాత వచ్చే ఏఆర్ కెమెరాను అలో చేయండి. తరువాత మీరు ఆ వస్తువును ఉంచదల్చుకున్న ప్రాంతంలో మీకు ఆ వస్తువు 3డీ చిత్రం కెమెరాలో కన్పిస్తోంది. -
వాట్సాప్ మరో ఫీచర్, పాస్ వర్డ్ మరిచిపోతే అంతే సంగతులు
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ను విడుదల చేసింది. 2.21.1.5.5 ఆండ్రాయిడ్ యూజర్లు హెచ్డీ ఇమేజ్లను సెండ్ చేయడంతో పాటు, వాట్సాప్ చాట్ను స్టోర్ చేసుకునేలా డిజైన్ చేసింది. అతి తక్కువ టైంలో మిలియన్ యుజర్లను సొంతం చేసుకున్న ఈ యాప్ వినియోదారులకు కోసం రోజురోజుకు ఫీచర్ అప్డేట్స్తో యూజర్లను మరింతగా ఆకర్షిస్తుంది. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా కొత్త కొత్త ఫీచర్లను అందిస్తోంది.. అయితే తాజాగా వాట్సాప్ హెచ్డీ ఇమేజెస్ సెండ్ చేయడంతో పాటు స్నేహితులతో చేసిన చాట్ను థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేసుకునే సదుపాయం కల్పిచ్చింది. వీ బీటా ఇన్ఫో ప్రకారం.. గతంలో మనం వాట్సాప్లో చేసే మెసేజెస్, చాట్ స్టోర్ అయ్యేది కాదు. అయితే తాజాగా వాట్సాప్ ఈ చాట్ ను స్టోర్ చేసేందుకు బీటా వెర్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో ఎవరైనా చాట్ ను గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఎలా పనిచేస్తుంది? వాట్సాప్ తెచ్చిన ఫీచర్ సాయంతో మీ వాట్సాప్ చాట్ ను స్టోర్ చేసేందుకు పాస్ వర్డ్ ను క్రియేట్ చేయాలి. అవసరం ఉన్నప్పుడు పాస్వర్డ్ సాయంతో స్టోర్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఆ మెసేజ్లను చదువుకోవచ్చు. అయితే పొరపాటున మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ మరిచి పోతే స్టోర్ చేసుకున్న చాట్ ను ఓపెన్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. పాస్వర్డ్ మర్చిపోతే స్టోర్ చేసుకున్న వాట్సాప్ చాట్కు పాస్వర్డ్ ఉండేలా డిజైన్ చేసింది. పాస్ వర్డ్ మరిచిపోతే 64 అంకెలతో వాట్సాప్ encrypts చేసింది. ఈ కీ సాయంతో మీరు పాస్ వర్డ్ను అప్డేట్ చేసుకోవచ్చు. పొరపాటున అప్ డేట్ చేసుకున్న పాస్వర్డ్ మిస్ అయితే స్టోర్ చేసుకున్న డేటాను చూసే యాక్సెస్ ను మిస్ అవుతారు. చదవండి : కోట్ల ఆస్తిని కేవలం ఒక్కడాలర్కే అమ్మాడు,కారణం ఇదేనా.! -
ఆపిల్ నుంచి అప్డేట్స్
వెబ్డెస్క్: టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. ఆపిల్ సంస్థ ఉత్పత్తులైన ఐఫోన్, మాక్ప్యాడ్, ఐప్యాడ్ , ఐవాచ్, ఆపిల్ టీవీలకు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్వేర్లలలో ఆపిల్మార్పులు తీసుకురాబోతుంది. జూన్ 7 నుంచి 11 వరకు జరిగే వలర్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్లో ఆపిల్ ఈ వివరాలు వెల్లడించనుంది. ఇంటెల్ స్థానంలో జూన్ 7 నుంచి 11 వరకు ఐదు రోజుల పాటు వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(WWDC) జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈ సారి కూడా వర్చువల్ పద్దతిలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్ వేదికగా తమ ఉత్పత్తుల్లో తీసుకురాబోయే అప్డేట్స్ ఆపిల్ సంస్థ ప్రకటించనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా మ్యాక్ప్యాడ్కు సంబంధించి హార్డ్వేర్లో కీలక మార్పులు ఆపిల్ తీసుకురానుంది. ఇప్పటి వరకు ఆపిల్ మాక్ప్యాడ్లలో ఇంటెల్ ప్రాసెసర్లు ఉపయోగించగా... ఇకపై వాటి స్థానంలో ఆపిల్ స్వంతగా రూపొందించిన ప్రాసెసర్లు వినియోగిస్తారని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం జూన్ 7న ఆరంభమయ్యే డబ్ల్యూడబ్ల్యూడీసీలో వెల్లడికానుంది. ఆపరేటింగ్లో అప్డేట్స్ మ్యాక్ప్యాడ్, ఐప్యాడ్, టీవీలకు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్లో కీలక అప్డేట్స్ను ఆపిల్ ప్రకటించనుంది. ఆపిల్ ఉత్పత్తులు మరింత ప్రభావంతంగా పని చేసేలా, యూజర్ ఫ్రెండ్లీగా ఈ అప్డేట్స్ ఉండనున్నట్లు సమాచారం. ముఖ్యంగా మ్యాక్ప్యాడ్కి సంబంధించి ఓఎస్ 12, ఆపిల్ ఫోన్లకు సంబంధించి ఓఎస్ 15లో ఉండే కీలక ఫీచర్లను డబ్ల్యూడబ్ల్యూడీసీలో ఆపిల్ సంస్థ వెల్లడించే అవకాశం ఉంది. కరోనా కల్లోలం చుట్టుముట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో తమ వినియోగదారులకు ఆరోగ్య సమాచారం అందించేలా తన ఉత్పత్తుల్లో కొత్త ఫీచర్లు ఆపిల్ తీసుకురానున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ఢిల్లీ హైకోర్టులో రేపు విచారణకు ‘ఫ్యూచర్’ పిటిషన్!
న్యూఢిల్లీ: ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్తో చేసుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఫ్యూచర్ గ్రూప్ న్యూఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రేపు ఆ పిటిషన్ విచారణకు రానున్నది. ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్, ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన అప్పీలును మార్చి 22న చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించనుంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ సింగపూర్ ఆర్బిట్రేటర్ ఆదేశాన్ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని, ఈ ఒప్పందంపై తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినట్లు జస్టిస్ జెఆర్ మిధా ధర్మాసనం పేర్కొంది. అయితే, సింగిల్ బెంచ్ ఆదేశాల ప్రభావం ప్రస్తుతం ‘నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)’ ముందు పిటిషన్పై ఉండబోదని ఫ్యూచర్ గ్రూప్ పేర్కొనడం గమనార్హం. ఫ్యూచర్ గ్రూపుకు సంబంధించిన బియానీ, ఇతరుల ఆస్తులను అటాచ్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఫ్యూచర్ గ్రూప్ ఈ కేసుకు సంబంధించి లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చుతూ ఫ్యూచర్ గ్రూప్ సంస్థ డైరెక్టర్లపై రూ. 20 లక్షల ‘కాస్ట్’ను విధించింది. ఢిల్లీ కేటగిరీలో సీనియర్ సిటిజన్లు, పేదలకు వ్యాక్సినేషన్ వినియోగించే విధంగా రెండు వారాల్లో రూ.20 లక్షల కాస్ట్ మొత్తాన్ని ప్రధానమంత్రి సహాయక నిధిలో డిపాజిట్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. రిలయన్స్తో గ్రూప్తో కుదిరిన రూ.24,713 కోట్ల విక్రయ ఒప్పందం అమలు విషయంలో ముందుకు వెళ్లొద్దని ఢిల్లీ హైకోర్టు మార్చి 18న కిశోర్ బియానీ నేతృత్వంలోని రిటైల్ జెయింట్ ఫ్యూచర్ గ్రూప్ను ఆదేశించింది. ఈ విషయంలో ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. చదవండి: రిలయన్స్-ఫ్యూచర్ గ్రూపు డీల్కు బ్రేక్ మొబైల్ యూజర్లకు ఊరట! -
వీడియోకాలింగ్ ఫీచర్తో సరికొత్త టీవీలు: ధర ఎంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ టీసీఎల్ ఇండియాలో తొలి ఆండ్రాయిడ్ 11 టెలివిజన్ (టీవీ)ను విడుదల చేసింది. పీ725 హైఎండ్ టీవీ మోడల్లో వీడియో కాలింగ్ కెమెరా ఉండటం దీని ప్రత్యేకత. 43/50//55/65 ఇంచుల టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ.41,990–89,990 మధ్య ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో టీసీఎల్ టీవీలు, ఏసీ ఉత్పత్తులు మాత్రమే లభ్యమవుతున్నాయి. వేసవికాలం నేపథ్యంలో సీజన్ను దృష్టిలో పెట్టుకొని కొత్తగా బీ.ఐ.జీ కేర్ అండ్ యూవీసీ స్టెరిలైజేషన్ ప్రొ ఏసీ ‘ఒకారినా’ను కూడా విడుదల చేసింది. 1/1.5/2 టన్ల అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.33,990గా ఉంది. పీ725 టీవీని ప్రపంచవ్యాప్తంగా మొదటిసారిగా ఇండియాలోనే విడుదల చేశామని, ఇందులో 65 ఇంచుల టీవీని కేవలం అమెజాన్లో విక్రయించనున్నట్లు టీసీఎల్ ఇండియా జీఎం మైక్ చెన్ తెలిపారు. అమెజాన్ఇండియా టెలివిజన్, కేటగిరీ లీడర్ గారిమా గుప్తా మాట్లాడుతూ తమ కస్టమర్ల కోసం వీడియో కాల్ కెమెరాతో టీసీఎల్ తొలి 4 కేహెచ్డీఆర్ టివిని తీసుకురావడం సంతోసంగాఉందన్నారు. కస్టమర్లకు ఉత్తమమైన నాణ్యమైన ఉత్పత్తులను నిరంతరం అందిస్తున్న టీసీఎల్తో భాగస్వామ్యంతో టెలివిజన్ విభాగంలో బలమైన పోర్ట్ఫోలియో తమసొంతమన్నారు. ఆండ్రాయిడ్ టీవీలు కొత్త శ్రేణి అధునాతన లక్షణాలతో కొత్త, టీవీ అనుభవాన్ని అందిస్తాయన్నారు. టీవీల ధరలు 43 అంగుళాలు టీవీ రూ. 41,990 50 అంగుళాల టీవీ ధర రూ. 56,990 55 అంగుళాల టీవీ రూ. 62,990 65 అంగుళాల టీవీ రూ. 89,990 -
వాట్సాప్ సరికొత్త ఫీచర్..
ముంబై: కొత్త ఫీచర్లను అందిస్తూ వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్న వాట్సాప్ తాజాగా సరికొత్త ఫీచర్లను అందించనున్నట్లు పేర్కొంది. మెరుగైన స్టోరేజీ కోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చామని, బీటా యూజర్ల కోసం న్యూ స్టోరేజ్ యూఐ ఫీచర్ను అందించనున్నట్లు తెలిపింది. స్టోరేజీ మేనేజ్ మెంట్ కోసం స్టోరేజీ సెక్షన్ ను వాట్సాప్ అప్ డేట్ చేసింది. కాగా సరికొత్త స్టోరేజీ ఆప్షన్ ద్వారా వినియోగదారులకు మోడ్రాన్ స్టోరేజీ బార్ కనిపిస్తుంది. అంతే కాకుండా వాట్సాప్లో మీడియా ఫైల్స్, ఇతర ఫైల్స్ సైజు కూడా చూడవచ్చు. మరోవైపు ఫైల్స్ పాతవా, కొత్తవా అని రివ్యూ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో వినియోగదారులు అనవసర ఫైల్స్ను డిలీట్ చేయవచ్చు. మరోవైపు సరికొత్త వాట్సాప్ బీటా అప్ డేట్ వెర్షన్ 2.20.201.9 ఫీచర్ అందుబాటులోకి రానుంది. కాగా అప్డేట్ వర్షన్ వల్ల ఫోటోలు, వీడియోలు, ఫైల్లను షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు సరికొత్త వర్షన్ అందుబాటులోకి రాగా, ఐఓఎస్ యూజర్లకు ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తుందో, వాట్సాప్ ఇంకా ప్రకటించలేదు. (చదవండి: వాట్సాప్ చాట్ హ్యాక్.. ఆరా తీస్తున్న పోలీసులు) -
గెలాక్సీ ఏ71, ఏ51.. వినూత్న ఫీచర్లు
గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లపై క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ వంటి పరిశ్రమలో తొలి వినూత్న ప్రైవసీ ఫీచర్లతో శాంసంగ్ నూతన ప్రమాణాలను నెలకొల్పింది. శాంసంగ్ ప్రైవసీ ఇన్నోవేషన్స్ క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ గెలాక్సీ ఏ51, ఏ 71లపై అందుబాటులోకి వచ్చాయి. మీ ప్రైవేట్ యాప్స్, కంటెంట్ భద్రతపై ఎలాంటి ఒత్తిడి, విచారం లేకుండా మీ ప్రైవేట్ జీవితాన్ని ప్రైవేట్గా ఉంచుతూనే అల్ట్జడ్ లైఫ్ మీకు వినోదం అందిస్తుంది. ఫీచర్ భాగస్వామి, హెచ్టీ బ్రాండ్ స్టూడియో మిలీనియల్స్, జడ్ జనరేషన్ వారి స్మార్ట్ ఫోన్లను ఫోటోలు తీసుకోవడం నుంచి గేమ్స్ ఆడటం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో టచ్లో ఉండటం, గూగుల్ సమాచారం వెతకడం సహా అన్ని విషయాల్లోనూ వాడుతున్నారు. ఫోన్ మీ చేతిలో ఉన్నంతవరకూ సురక్షితంగా భావిస్తుంటారు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మీ స్మార్ట్ ఫోన్ వైపు చూస్తే మీరు నిజంగా వారికి ఇచ్చేందుకు తిరస్కరిస్తారా..? మీ ఫోన్ను వారు చేతుల్లోకి తీసుకుని కెమెరాతో ఫోటోలు తీసేందుకు ప్రయత్నించడం వంటివి చేస్తే మీ ప్రైవేట్ కంటెంట్ బయటకు వచ్చే అవకాశాలు అధికం. అల్ట్జడ్ లైఫ్లో చేరడం ద్వారా మీ వ్యక్తిగత జీవితం వ్యక్తిగతంగానే నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుంది. క్విక్ స్విచ్ పేరుతో పరిశ్రమలోనే తొలి ప్రైవసీ ఫీచర్ను శాంసంగ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ స్మార్ట్ ఫోన్ మరొకరికి ఇచ్చినప్పుడు మీకుండే యాంగ్జైటీని ఇది నివారిస్తుంది. పవర్ కీని డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఈ ఫీచర్ పనిచేస్తుంది. శాంసంగ్ ‘మేక్ ఫర్ ఇండియా’ కార్యక్రమం కింద క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ రెండు ఫీచర్లు గెలాక్సీ ఏ71, గెలాక్సీ ఏ51లపై అందుబాటులో ఉంటాయి. (Advertorial) ఫీచర్లపై మరిన్ని వివరాలు.. క్విక్ స్విచ్ : మీ ప్రైవసీని కాపాడుకునేందుకు వేగవంతమైన మార్గం లంచ్, టీ బ్రేక్ సమయాల్లో స్మార్ట్ ఫోన్ను వర్క్ డెస్క్ల వద్ద వదిలేసి వెళ్లే వారిలో మీరూ ఒకరా? వారి ఫోన్లలో ఇతరులు వ్యాసాలు/ డాక్యుమెంట్లను చదివేందుకు అనుమతించే వారిలో మీరూ ఉన్నారా? అందుకు చింతించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత సమాచారాన్ని వ్యక్తిగతంగా ఉంచేందుకు క్విక్ స్విచ్ ఫీచర్ అందుబాటులో ఉంది అల్ట్ జడ్ లైఫ్లో నివసించేందుకు ప్రతిఒక్కరి అవసరాలను క్విక్ స్విచ్ తీర్చేస్తుంది. ఇది సౌకర్యవంతంగా ఉండటంతో పాటు అవరోధాలు లేకుండా ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్ను ఇతరులతో పంచుకునే సమయంలో పవర్ కీని డబుల్ టాప్ చేస్తే సరిపోతుంది. ప్రైవేట్, పబ్లిక్ మోడ్స్లోకి వేగంగా మారే వెసులుబాటును క్విక్ స్విచ్ ఫీచర్ అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ ఫీచర్ను గ్యాలరీకే కాకుండా వెబ్ బ్రౌజర్, వాట్సాప్ వంటి ఇతర యాప్స్ ప్రైవసీకి వాడవచ్చు. మీరు స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంటే ఏ ఒక్కరూ పసిగట్టలేరు. మీ స్మార్ట్ ఫోన్ గ్యాలరీని చూడాలని ఎవరైనా అనుకుంటే మీరు వారికి పబ్లిక్ వెర్షన్ చూపవచ్చు. సెక్యూర్ ఫోల్డర్లో దాచిన ప్రైవేట్ కంటెంట్ మీ ఒక్కరే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇతరులతో పంచదలుచుకోలేని ఫోటోలను డిఫెన్స్ గ్రేడ్ శాంసంగ్ నాక్స్తో భద్రమైన సెక్యూర్డ్ ఫోల్డర్లో మీరు సురక్షితంగా భద్రపరుచుకోవచ్చు. కంటెంట్ సజెషన్స్ : ప్రైవేట్, వ్యక్తిగత కంటెంట్ ఏదో నిర్ధారించేందుకు తెలివైన మార్గం కంటెంట్ సజెషన్స్ సెక్యూర్ ఫోల్డర్ లోపల ‘ఆన్ డివైజ్ ఏఐ’ ఫీచర్గా అందుబాటులో ఉంటుంది. కంటెంట్ సజెషన్స్ స్మార్ట్ ఫోన్లో నిక్షిప్తమైన ఏఐ ఆధారిత ఇంజిన్ ద్వారా నిర్ధిష్ట ఫోటోలను సెక్యూర్ ఫోల్డర్కు తరలించాల్సిందిగా సూచిస్తుంది. ఎలాంటి ఫోటోలు, ముఖాలు, ఏ తరహా ఫోటోలను ప్రైవేట్గా ట్యాగ్ చేయాలో యూజర్ నిర్ణయించుకోవచ్చు. ఆపై ఏ ఒక్కరూ వాటిని యాక్సెస్ చేయలేని విధంగా కంటెంట్ సజెషన్స్ తెలివిగా ఏయే ఫోటోలను ప్రైవేట్ గ్యాలరీకి పంపాలో సూచిస్తుంది. యూజర్ ప్రైవసీని పెంచేందుకు స్మార్ట్ ఫోన్ లోపలే ఏఐ సొల్యూషన్ ఈ పనులను చక్కబెడుతుంది. సర్వర్, క్లౌడ్తో ఎలాంటి ఇంటరాక్షన్ లేకుండానే ఏఐ సొల్యూషన్ ఈ ప్రక్రియను చేపడుతుంది. శాంసంగ్ తొలిసారిగా ఈ ఫీచర్లను మధ్య శ్రేణి సెగ్మెంట్కు అందుబాటులోకి తీసుకువచ్చింది. వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది. జడ్ జనరేషన్, మిలీనియల్స్ను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన క్విక్ స్విచ్, కంటెంట్ సజెషన్స్ ఫీచర్లు యూజర్ల గోప్యత, ప్రశాంతతను కాపాడతాయి. నాక్స్ సెక్యూరిటీ గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్పై యూఐ సాఫ్ట్వేర్ ద్వారా నిర్మితిమైన డిఫెన్స్ గ్రేడ్ సెక్యూరిటీ ఫ్లాట్ఫాం శాంసంగ్ నాక్స్ భద్రతతో గెలాక్సీ ఏ 51, గెలాక్సీ ఏ71 స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సైనిక తరహా గోప్యతా విధానం మీ స్మార్ట్ ఫోన్లో డేటా అంతటినీ పూర్తిగా కాపాడుతుంది. యూజర్ల గోప్యతపై ఇంతగా ఏ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఆలోచించని రీతిలో పరిశ్రమలోనే తొలి గోప్యతా ప్రమాణాలను పాటిస్తూ శాంసంగ్ తనదైన లీగ్లో చేరింది. అల్ట్జడ్ లైఫ్లో నివసించేందుకు గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71లు మెరుగైన ఎంపికలు. (Advertorial) -
ఫ్లిప్కార్ట్ యాప్లో కొత్త ఫీచర్!
ఈ- కామర్స్ దిగ్గజం ఫిప్కార్ట్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో తమ కస్టమర్లకు చేరువగానే ఉంటోంది. వినియోగదారుల సేవలను మరింత సులభతరం చేసేందుకు కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లోని ఫ్లిప్కార్ట్ యాప్లో వాయిస్ అసిస్టెంట్ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. ఈ వాయిస్ అసిస్టెంట్ను ఫ్లిప్కార్ట్ గ్రాసరీ స్టోర్లో, సూపర్ మార్ట్లో ఉపయోగించవచ్చు. హిందీ, ఇంగ్లీష్లో ఇచ్చే వాయిస్ కమాండ్స్ను ఇది అర్థం చేసుకోగలదు. తద్వారా షాపింగ్ చేయడంలో ఇది కస్టమర్లకు ఉపయోగపడుతుంది. ఫ్లిప్కార్ట్ గత సంవత్సరం ఫ్లిప్కార్ట్ సాతి పేరుతో స్మార్ట్ అసిస్టివ్ ఇంటర్ఫేస్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఫ్లిప్కార్ట్ అంతర్గత సాంకేతిక బృందం స్పీచ్ రికగ్నిషన్, నేచురల్ లాంగ్వేజ్ అవగాహన, మెషిన్ ట్రాన్స్లేషన్, టెక్స్ట్ టు స్పీచ్ లాంటివి ఉపయోగించి ఈ వాయిస్ అసిస్టెంట్ను అభివృద్ధి చేశారని సదరు సంస్థ తెలిపింది. ఇది వినియోగదారులు మాట్లాడే భాషను స్వయంగా గుర్తించగలదని, షాపింగ్కు సంబంధించిన సంభాషణను అర్థం చేసుకొని వినియోగదారులకు సహకారం అందిస్తుందని కూడా తెలిపింది. దీనిపై కస్టమర్ల అభిప్రాయాలు తెలుసుకోవడానికి వివిధ పట్టణాలు, నగరాలలో ఐదు నెలలకు పైగా పరిశోధన చేసినట్లు కూడా ఫ్లిప్కార్ట్ తెలిపింది. (ఆహార రిటైల్లో ఫ్లిప్కార్ట్కు నో ఎంట్రీ!) ఫ్లిప్కార్ట్ వాయిస్ అసిస్టెంట్ కేవలం ఇంగ్లీష్, హిందీలోని ఆదేశాలను మాత్రమే కాకుండా ఈ రెండింటి మిశ్రమ భాషా ఆదేశాలకు కూడా ప్రతి స్పందించగలదు. ఈ అనుభవం షాపింగ్చేసినప్పుడు దుకాణదారుడితో మాట్లాడినట్లుగానే అనిపిస్తోంది అని ఫ్లిప్కార్టు పేర్కొంది. ప్రస్తుతం ఈ వాయిస్ అసిస్టెంట్ను ఫ్లిప్కార్ట్ కంపెనీ అండ్రాయిడ్ ఆధారిత యాప్లో మాత్రమే అందుబాటులోకి తీసుకురానుంది. ఐఓఎస్ ఆధారిత యాప్లో, వెబ్లో భవిష్యత్తులో ఇది అందుబాటులోకి రానుంది. (ఫ్లిప్కార్ట్కు భారీ ఎదురుదెబ్బ) -
ఫేస్బుక్లో రహస్య ప్రేమ!
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ఎంతో ప్రాచుర్యం పొందిన ‘ఫేస్బుక్’ అమెరికా వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ‘సీక్రెట్ క్రష్ (రహస్య ప్రేమ)’ పేరిట డేటింగ్ ఫ్లాట్ఫారమ్ను తీసుకొచ్చింది. ఈ ఫ్లాట్ఫామ్పై తమ ఇష్టాయిష్టాలను నిర్భయంగా పరస్పరం పంచుకోవచ్చు. తమ మిత్రుల మిత్రులను కూడా దీని ద్వారా పరిచయం చేయవచ్చు. వారి వివరాలను కూడా ఈ కొత్త ఫీచర్లో పొందుపర్చవచ్చు. దీనికి ఫేస్బుక్ యూజర్లతోపాటు ఇన్స్టాగ్రామ్ యూజర్లను, ఇన్స్టాగ్రామ్ ఫొటోలను కూడా అనుసంధానించవచ్చు. ‘టిండర్’ అనే డేటింగ్ వెబ్సైట్కు పోటీగా తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ను ఫేస్బుక్ గురువారం నుంచే అమెరికా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇతర డేటింగ్ సైట్లలాగా ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి పరస్పరం ‘మ్యాచ్’ కావాల్సిన అవసరం లేదు. ఫ్రొఫైల్ను లైక్ చేయడం ద్వారా, ఫొటోపై వాఖ్యానం చేయడం ద్వారా ‘సీక్రెట్ క్రష్’తో ఒకరికొకరు సంధానం కావచ్చు. ఈ కొత్త ఫీచర్లో ఒక్కరు తొమ్మిది మంది ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ యూజర్లకు కనెక్ట్ కావచ్చు. తద్వారా వారి మిత్రులే కాకుండా మిత్రుల మిత్రుల ప్రొఫైల్స్ను కూడా షేర్ చేసుకోవచ్చు. మాట్లాడుకోవచ్చు. ఎదుటి వారు నచ్చని పక్షంలో సింపుల్గా ఇంటూ మార్క్ను క్లిక్ చేసి ముందుకు పోవచ్చు. ఓ యూజర్కు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో నిక్షిప్తం చేసిన సమాచారం, ఫొటోలను నేరుగా ఈ ‘సీక్రెట్ క్రష్’పైకి తీసుకొచ్చి మిత్రులతో షేరు చేసుకోవచ్చు. నిజంగా డేటింగ్ చేయాలనుకుంటున్న వారి జాబితాను కూడా ఇందులో ‘సీక్రెట్’గా దాచుకోవచ్చు. ఇందులో యూజర్ల వ్యక్తీకరణ, గోప్యతను ఈ ‘సీక్రెట్ క్రష్’ సమతౌల్యం చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఫేస్బుక్, గూగుల్ లాంటి టెక్ దిగ్గజ సంస్థలను యూజర్ల వ్యక్తిగత గోప్యతను పరిరక్షించలేక పోతున్నాయంటూ ఇటీవల ఎక్కువగా విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే. (ఇది చదవండి: 41 కోట్ల యూజర్ల వివరాలు లీక్) -
గుడ్ న్యూస్: వాట్సాప్ గ్రూప్ కాలింగ్ అప్డేట్
సాక్షి, న్యూఢిల్లీ: రోజుకొక కొత్త ఫీచర్తో వినియోగదారులను ఆకట్టుకుంటున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప తాజాగా మరో ఫీచర్ను లాంచ్ చేసింది. ఇప్పటికే లాంచ్ చేసిన గ్రూప్ కాలింగ్ ఫీచర్లో లోపాలను సవరించి సరికొత్తగా దీన్ని తిరిగి లాంచ్ చేసింది. ఒకేసారి ఇద్దరు లేదా ముగ్గురుతో సంభాషించేలా కొత్త గ్రూప్కాలింగ్ బటన్ అప్డేట్ చేసింది. గతంలో తీసుకొచ్చిన గ్రూప్ కాలింగ్ బటన్ ఒకరికంటే ఎక్కువమందికి ఒకేసారి కాల్స్ చేయడంలో (వాయిస్, వీడియో) వైఫల్యం చెందింది. ఈ లోపాన్ని సవరించిన వాట్సాప్ సరికొత్తగా ఈ ఫీచర్ను కస్టమర్లకు అందుబాటులోకి తెస్తోంది. గతంలోలా కాకుండా నార్మల్ కాల్ తరువాత మిగిలిన వారిని గ్రూప్కాలింగ్లోకి ఆహ్వనించడం కాకుండా డైరెక్టుగా ముగ్గురుతో మాట్లాడవచ్చని కంపెనీ తెలిపింది. ఈ సదుపాయం 2.18.110.17 బీటా వెర్షన్లో అమల్లోకి ఉందని, వచ్చే నెలనుంచి అందరికీ అందుబాటులో వస్తుందని వెల్లడించింది. కాగా ఒక పార్టిసిపెంట్ను సెలక్ట్ చేసుకుని, అనంతరం టాప్రైట్ కార్నర్లో కనిపించే యాడ్ పార్టిసిపెంట్ బటన్ క్లిక్ చేసి రెండవ పార్టిసిపెంట్ను సెలక్ట్ చేసుకోవాలి. ఇలా మరింతమంది పార్టిసిపెంట్స్ను గ్రూప్వాయిస్ కాల్లోయాడ్ చేసుకునే అవకాశాన్ని గతంలో కల్పించింది. అయితే ఇది అంతగా ఆకట్టుకోలేకపోవడంతో తాజా అప్డేట్ను జోడించింది. -
సాయి అతీంద్రియ శక్తి
సాయిలీలలు ఆశ్చర్యకరంగానూ నమ్మలేని విధంగానూ ఉంటాయి. దాసగణు అనే భక్తుడు సాయిని అనుమతి కోరాడు – గంగలో స్నానం చేసి రావాలని. అది కూడా ప్రయాగలోనే అని. ఎప్పటిలాగానే సాయి చిరునవ్వు నవ్వి ‘గణూ! గంగాస్నానానికి ప్రయాగ దాకా వెళ్లాలా? ఈ మన ద్వారకమయే ప్రయాగ, ఇదే ద్వారక, ఇదే పండరిపురం కూడా’ అనడంతో దాసగణు సాయి పాదాల మీద ఆనందంగా శిరస్సు వాల్చి నమస్కరించాడో లేదో, సాయి పాదాల బొటన వేళ్లలో కుడి బొటన వేలు నుండి గంగా, ఎడమ బొటన వేలు నుండి యమునా ధారాపాతంగా ప్రవహించసాగాయి. అందరూ వింతగా చూస్తూ ఆ రెండు నదుల జలాన్నీ తీర్థంగా తీసుకున్నారు. ఇలా జరగడం సాధ్యమా? సాధ్యమే అయితే ఎలా? అనేది మన సందేహం. ఇది ఎలా సాధ్యం? సాధారణంగా మన లక్షణం ఎలా ఉంటుందంటే.. మనం చేయగలిగింది ఎంతో, ఏదో అలాగే అందరూ చేయగలుగుతారనీ, అలా కాకుండా గనుక ఎవరైనా చేస్తే.. అది ఎంత మాత్రం నిజం కాదనీ, అసలు నిజమయ్యే వీలే లేదనీ అనుకుంటుంటాం. ఇంకాస్త పైకి ఆలోచిస్తే.. ఇలాంటివి జరిగాయని చెప్పడం అభూతకల్పనలేనని వాదిస్తూ, అలాంటి వాటిని ప్రచారం కానీయకుండా చేస్తూ ఉంటాం. మంచిదే. అయితే ఇదే యుగంలో మన కళ్ల ముందే జరిగిన కొన్ని వాస్తవాల్ని పత్రికలు, ప్రసార మాధ్యమాలూ చెప్పినవాటినీ చూపించినవాటినీ మనం ఈ సందర్భంలో గమనిద్దాం!భోపాల్లో అలాగే బీహార్లో కూడా పెద్ద భూకంపం వస్తే ఆ వచ్చిన కాలంలో పడిన భవంతుల మట్టి పెళ్లల కింద 72 గంటల పాటు ఒక వృద్ధుడు (68 ఏళ్లు) ఉండిపోయాడు. ఎవరికీ కనపడకుండా కావాలని దాక్కోవడం కాదు. తన మీద మట్టిపెళ్లలు పడి ఆ సమయంలో అరిచినా వినిపించనంతగా అయిపోయింది పరిస్థితి. నీళ్లూ తిండీ గాలీ మరి ఎలా లభించాయో తెలియదు. తర్వాత తవ్వుతుంటే కొన ఊపిరితో ఉంటే ఆయనని పైకి తీస్తే బతికాడు. దీన్ని నమ్మడం సగటు మనిషికి సాధ్యమా? మరి అతణ్ణి ఆ పెళ్లలని తీస్తూ, పైకి రప్పించడాన్ని ప్రసారమాధ్యమాలే చూపించాక కాదని అనలేముగా! మరి ఇదేమిటి?ఏడు సంవత్సరాల బాలుడు. పుట్టిందగ్గర్నుండే కనిపించిన ప్రతి వస్తువు మీదా చేతితో లయకి సరిపడే తీరులో కొడుతూ ఉండడం చేస్తూ ఉండేవాడు. సరిగ్గా 7వ సంవత్సరం వచ్చిందో లేదో సొంతంగా 5 మద్దెలని ఒకదాని పక్కన ఒకదానిని ఉంచి లయబద్ధంగా ఆ శాఖలో ప్రవీణులైన వారి ముందు వాయించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. దీన్ని కాదనగలమా?ఒక రైలు వేగంగా పరిగెడుతుంటే నిండు నెలలు నిండిన గర్భిణి శౌచాలయంలోనికి వెళ్లిందో లేదో, ఆ శిశువు, వ్యక్తులంతా కాలకృత్యాలు తీర్చుకునే ఆ గదిలో ఉండే నేలబారుకన్నం నుండి కిందికి పడిపోయింది. వెంటనే బండిని ఆపితే అది ఆ వేగానికి దాదాపు 1 కి.మీ. దూరంలో ఆగింది. వ్యక్తులు వెనక్కి పరుగెత్తారు. నిమిషాల క్రితం పుట్టిన శిశువు రైలు పట్టాల మధ్యనున్న నల్లకంకరరాళ్ల మీద ఎత్తు నుంచి పడడం, ఈ వ్యక్తులు ఆ శిశువుకోసం వెదకడం, కొంత సమయం గడిచిన తర్వాత కూడా ఆ శిశువు బతికే ఉండడం ఇది నమ్మగల నిజమేనా? మరి చూపించారుగా మాధ్యమాల్లో..గుండె నుండి పలుగు (గునపం లేదా గడ్డపారు) హృదయం నుండి వీపుని చీల్చుకుని ఇవతలికి వస్తే బతికి ఉండడం నిజం కాదా?కొన్ని కుక్కలు పిల్లి పిల్లలకి పాలు ఇవ్వడం, కొన్ని పదుల సంఖ్యలో పాముల్ని ఒక గదిలో పెట్టుకుని వాటి మధ్య పడుకుంటే అవి ఇటూ అటూ తిరుగుతూ అతణ్ని పట్టించుకోనట్లుగానూ, అతణ్ని ఓ రాయో, రప్పో, కొయ్య కర్రో అన్నట్లుగా భావిస్తూ అతణ్ని ఏ మాత్రం కరవకపోవడాన్ని చూస్తున్నాం కదా! ఇది ఆశ్చర్యం కాదా? ఏ మార్గం లేని కాలంలో, ఏ వంతెనా నిర్మించబడని కాలంలో ఏ ఊరికి ఏది తోవయో తెలుసుకునే వీలు ఏ మాత్రమూ ఉండని కాలంలో, చలీ వేడిమీ వర్షాలు ప్రకృతి ధర్మానికి అనుగుణంగా ఉండే కాలంలో, చేతిలో ఏ ఆహారానికి సంబంధించిన ముందు ఏర్పాట్లు లేకుండా, ఎక్కడ ఉండాలో ఆ వివరాలు తెలియకుండా ముందుగా అనుకోకుండా తానొక్కరే ఇటు రామేశ్వరం నుండి అటు హిమాలయ పర్వతం వరకూ (ఆ సేతు శీతాచలం) ఆదిశంకరులవారు తన 19వ ఏట, అది కూడా కాలినడకన వెళ్లొచ్చారంటే అది కళ్లకి కనిపించిన సత్యం కదా! అది అబ్బురపరిచే విషయం కాదూ? కొండ చిలువలు, పాములు, పులులు, సింహాలు, తోడేళ్లు విచ్చలవిడిగా తిరిగే తిరుమల అడవుల్లో గోగర్భమనే పేరున్న గుహలో రాత్రీ పగలూ అనే భేదమే లేకుండా తపస్సు మాత్రమే చేస్తూ సిద్ధిని పొందిన స్వాములవారిని మనం దాదాపు 200 సంవత్సరాల క్రితమే చూసి ఉండటం విస్మయపరిచే విషయం కాదా?ఈ తీరుగా ఎన్నెన్నో జరుగుతున్నా వాటిని ఆ సమయంలో చూసి ‘అబ్బో! ఆశ్చర్యం’ అనుకోవడం, మళ్లీ కొంతకాలం కాగానే మర్చిపోవడం. మళ్లీ మనదైన ధోరణిలో ఇవన్నీ నిజం కాదంటూనో, నమ్మవద్దంటూనో నోరేసుకుని పడటం సరైన పనేనా? పైవన్నీ కూడా దైవం ఏర్పాటు చేసిన లీలలు. అందరికీ అన్ని శక్తులూ ఉండవు, రావు కూడా. అలాగే అందరి మీదా దైవం తన శక్తిని ప్రసరింపజేయడు. అనుగ్రహాన్ని చూపించడు. ఇనుమనే లోహం అన్నింటి ఆకర్షణకీ లోను కాదు. కేవలం అయస్కాంతమనే దానికే లోబడుతుంది. శిశువు కూడా తనని కన్నతల్లి మాత్రమే – ఇతడు తండ్రి, ఇతడు అన్న.. అంటూ చెప్పినప్పుడు మాత్రమే అంగీకరిస్తాడు తప్ప ఆ తల్లి తనకి అలా పరిచయం చేయనప్పుడు ఒప్పుకోలేడు. చుట్టాల్లో ఎవర్నో చూపించి ‘ఫలానా’ అని చెప్తే ‘ఔనా? నిజమేనని నమ్మమంటావా?’ అన్నట్లు తల్లివైపే చూస్తాడు. ఆమె అంగీకారానికి లోబడే నమ్మడం, నమ్మకపోవడం చేస్తాడు. అంటే ఏమన్నమాట? సాధారణ జీవితాన్ని మాత్రమే గడిపే మనం మనదైన సగటు ఆలోచనల్లో ఉంటూ, అలా ఉన్నప్పుడూ అలాగే జరిగినప్పుడూ మాత్రమే ఆ సంఘటనలనీ లేదా ఆ సందర్భాలనీ నమ్ముతున్నామన్నమాట. అది సరికానే కాదని నిరూపించే ఘట్టాలే పైవన్నీ. సాయి కూడా అంతే! ఒక మసీదు గోడకి ఆనుకుని కూచోవడం, చలి లేదు, వాన లేదు, ఎండ లేదు ఎప్పుడూ ఆ ప్రదేశంలోనే ఉంటూ ఉండటం, లేదా ఆ పాడుబడిన మసీదులో తలదాచుకోవడం... ఇక తిండి విషయానికొస్తే భిక్షాటన ద్వారా వచ్చే రొట్టెలని తెచ్చుకోవడం, వాటిని మూతలు లేని పాత్రలోనే ఉంచడం, అటు నుండి కుక్కలు ఇటు నుండి పిల్లులూ ఇతర ప్రాణులు వచ్చి సగం కొరికినా, ఎత్తుకుపోయినా ఆ ఉన్నవాటినో మిగిలినవాటినో తింటూ జీవించడం... తానెప్పుడూ వ్యాధిగ్రస్తుడైనట్టుగా ఎక్కడా కనిపించకపోవడం... ఇవన్నీ కళ్లముందు కనిపించిన నిజాలేగా! కాదనలేం కదా!ఇప్పుడు ఇది ఎలా సాధ్యమయిందో చూద్దాం!శరీరంలో ఉండే కళ్లూ, చెవులూ, ముక్కూ, కాళ్లూ చేతులూ.. ఇలా అన్ని అవయవాల్నీ చూడగలుగుతున్నాం. అయితే శరీరంలో దాగిన మనసూ బుద్ధీ అనే వాటిని మాత్రం మనం చూడలేం. మనసు అనేది ఓ కోతిలాగా చంచలంగా ఉంటూ చెడుపనిని సైతం చేయవలసిందిగా ప్రేరేపిస్తుంటుంది. ఉదాహరణకి.. ఎవరైనా కొంత సొమ్మును ఎక్కడైనా పడవేసుకుంటే.. దాన్ని చూసిన కన్ను మనసుకి ఆ సమాచారాన్ని చేరవేస్తే.. ‘అక్కడ ఎవరైనా ఉన్నారేమో చూడు జాగ్రత్తగా! లేని పక్షంలో జేబులో పెట్టెయ్! ఎవరడిగినా అది నాదే అని చెప్పు!’ అని ప్రేరేపిస్తుంది మనసు. చేసేవరకూ ప్రోత్సహిస్తుంది కూడా. అయితే తల్లిదండ్రుల సంస్కారం, మనల్ని పెంచిన, మనం పెరిగిన వాతావరణమనేదానికి అనుగుణంగా ‘బుద్ధి’ అనేది ఉంటుంది కాబట్టి, ఆ బుద్ధి ఇలా అంటుంది... ‘అది తప్పు, మనమే అలా పోగొట్టుకున్న పక్షంలో దొరికితే బాగుండుననుకుంటాం కదా! అలా ఆ సొమ్ము దొరికిన వ్యక్తి మనకిస్తే, ఎంతో ఆనందపడి ఆ వ్యక్తికి కృతజ్ఞులమయ్యుంటాం కదా! అదే మరో తీరులో జరిగి ఆ సొమ్ము మన వద్ద పట్టుబడి మనం దొంగగా నిరూపింపబడితే పరువుపోతుంది. మన మీద దొంగ అనే ముద్రపడుతుంది కదా!?’ అని. ఇదుగో! ఈ మనసుని ఆ బుద్ధికి లోబడేలా చేసినట్లయితే వ్యక్తి సరైన తీరులో జీవితాన్ని సాగిస్తాడు. కీర్తి ప్రతిష్టల్ని గడిస్తాడు. ఆ మనసే బుద్ధి ద్వారా ఈ శరీరాన్ని బాగా వ్యాయామం చేయవలసిందని శాసిస్తే ఆ శరీరం బాగా వ్యాయామాన్ని చేసి శరీరబలాన్ని సాధించి, వ్యక్తిని ఓ ‘పహిల్వాన్’ అని అందరూ అనేలా చేస్తుంది.అదే మరి మనసూ బుద్ధీ కలిసి తపస్సుని ప్రారంభించి ఏకాగ్రతతో దైవధ్యానం మీదే దృష్టిని పెడితే.. శరీరవ్యాయామం ద్వారా ఇంద్రియశక్తిని పొందగలిగితే.. (కన్నూ కాలూ చేయీ.. ఇలా అన్ని ఇంద్రియాలూ బలపడడం మంచి శక్తిని కలిగి ఉండడం) ఈ మనసూ బుద్ధీ కలిసి వాటికి సంబంధించిన మరో వ్యాయామం ద్వారా ఇంద్రియాలని అదుపు చేసి తమ అధీనంలో ఉంచుకోగల శక్తిని అంటే.. అతీంద్రియశక్తిని సాధింపజేస్తాయి వ్యక్తికి. అంటే కొద్దిగా వివరించుకోవాలి. త్వక్ (శరీరం) అనేది మొదటి ఇంద్రియం. ఇది ఎన్నో అవయవాల సమూహం. చలికీ వేడికీ కొంతవరకూ తట్టుకోగల ధర్మం కలిగినది మాత్రమే. అతీంద్రియ శక్తి అంటే.. చలీ వేడీ అనే వాటి ప్రభావానికి అతీతంగా ఉండటమని అర్థం. కుంభమేళాలో నాగాసాధువులు ఎక్కడి నుండి వస్తారో తెలియదు. గుంపులు గుంపులుగా వస్తూ ఎముకలు కొరికే చలిలో ఒంటిమీద నూలు పోగు కూడా లేకుండా ఉన్న శరీరంతో పరుగులు పెడుతూ గడ్డకట్టించే నీటిలో చక్కగా స్నానాన్ని సంతోషంగా ముగించి వెళ్లిపోతారు. ఎక్కడుంటారో ఎప్పుడు తింటారో, తినేందుకు వాళ్లకి ఏం దొరుకుతుందో ఊహాతీతం. అలాగే రెండవ ఇంద్రియమైన కన్ను, తాను చూడగలిగినంత దూరాన్ని మాత్రమే చూడగలుగుతూ ఉంటే, అతీంద్రియ శక్తిని సాధించిన వ్యక్తికుండే కన్ను గడిచిన సందర్భాన్నీ, వస్తువుని చూడడం కాకుండా, వ్యక్తుల్ని భౌతికంగా చూడడం కాకుండా, వాళ్లలో దాగిన విశేషాల్ని కనుక్కోగలుగుతుంది. ఇది నిజం కాబట్టి ఎందరో వ్యక్తులుంటే సాయి కొందర్ని మాత్రమే తన సమక్షానికి రావలసిందిగా నిరంతరం సేవలో ఉండవలసిందిగా కోరాడు. కోరతాడు. అలాంటి వారిలో ఒకడే దాసగణు. మనకి జ్ఞానాన్ని బుద్ధికి చేరవేసే శక్తి ఉన్న శరీర భాగాలని (ఇంద్రియాలు) జ్ఞానేంద్రియాలు అంటాం. వాటిలో మొదటిది త్వక్ (శరీరం). అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు పైన అనుకున్నట్టు ఏ వాతావరణానికైనా దుఃఖించదు. అదే సాయి మసీదు గోడకానుకుని మనకి తెలియజేసిన సత్యం. రెండవ జ్ఞానేంద్రియం కన్ను. అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు జరిగిన, జరుగుతున్న, జరగబోయే విషయాలని చూడగలుగుతుంది. ఇది నిజం కాబట్టే సాయి ఆ రోజున అన్నా సాహేబు బయలుదేరి వెళ్తుంటే.. ఈ రైలు ఆ స్టేషనులో ఆగదంటూ సూచించి మరీ రాగలిగాడు. మూడవది చెవి. అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు ఎక్కడ ఎవరు మాట్లాడుకున్నా వాటిని వినగలుగుతుంది. ఇది నిజం కాబట్టే సాయి, ఆనాడు అన్నా సాహేబూ బాలాసాహేబూ ‘కర్మలూ వాటి ఫలితాలూ’ అనేదాని గురించి వాదప్రతివాదాలని తనకి వినిపించనంత దూరంలో చేసుకున్నా ‘ఎవరు గెలిచారు వాదంలో?’ అనగలిగాడు. నాలుగవది జిహ్వ (నాలుక). ఇది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు ఆ నోటితో ఏం మాట్లాడితే అది జరుగుతుంది. ఇది నిజం కాబట్టే దాసగణుతో మాట్లాడుతూ ‘నువ్వు రాదలుచుకోకపోయినా ఎందుకు రావో, ఇక్కడే సేవ చేస్తూ ఎలా ఉండవో చూస్తా’ అని అనగలిగాడు. ఐదవ ఇంద్రియం ఘ్రాణం(ముక్కు). అది అతీంద్రియ శక్తిమంతమైనప్పుడు ఎవరికెంత పూర్వజన్మసంస్కారవాసన ఉందో ఈ విషయాన్ని గ్రహించగలగడం సాధ్యమౌతుంది. ఇది నిజం కాబట్టే సాయి తన వద్ద ఎవరెవరు ఉండవలసినవాళ్లో ఉండగలిగేవాళ్లో తెలుసుకుని, పూర్వజన్మసంస్కారపరులైన అలాంటివారిని మాత్రమే తన స్థానానికి పిలుచుకున్నాడు. వచ్చేలా చేసుకోగలిగాడు.ఈ అతీంద్రియశక్తి జ్ఞానేంద్రియాల విషయంలో పై తీరుగా ఫలిస్తే, అదే అతీంద్రియశక్తి కర్మేంద్రియాలైన మాట, కాలు, చేయి మొదలైన వాటిలో కూడా ఫలించి మాట ద్వారా వశం చేసుకోగలగడం, కాలు ద్వారా గంగా యమునల్ని ప్రవహింపజేయగలగడం.. ఇలా బాబా చేసిన మరిన్ని లీలలని తెలుసుకుందాం! ఎందుకు తెలుసుకోవాలిట? మన జీవితంలో కూడా తీవ్రాతి తీవ్రమైన అసాధ్యమైన సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు ఇలా తన లీల ద్వారా మనల్ని బయటపడేయగలడు కాబట్టి! (సశేషం) - డా. మైలవరపు శ్రీనివాసరావు -
ఫేక్ న్యూస్ కట్టడికి వాట్సాప్ కొత్త ఫీచర్
న్యూఢిల్లీ: నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్ కొత్తగా మరో ఫీచర్ తెచ్చింది. ఇకపై వినియోగదారులు తమకు వచ్చిన మెసేజ్ను స్వయంగా పంపిన వారే రాశారా లేక ఎవరో పంపిన దానిని కేవలం ఫార్వర్డ్ చేశారా అని తెలుసుకోవచ్చు. వాట్సాప్ యాప్ తాజా అప్డేట్లో ఈ ఫీచర్ను జోడించినట్లు సంస్థ మంగళవారం తెలిపింది. వినియోగదారులు ఒక మెసేజ్ను ఫార్వర్డ్ చేసే ముందు అది ఎంతవరకు నిజమో సరిచూసుకోవాలని కోరింది. నకిలీ సమాచారం వ్యాప్తి కాకుండా ఉండేందుకు వినియోగదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని వాట్సాప్ భారత్లో ప్రారంభించింది. వాట్సాప్లో తప్పుడు సందేశాలు వ్యాప్తి చెందడం వల్ల దేశంలో పలుచోట్ల మూకుమ్మడి దాడులు జరగడం, కొందరు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. -
ఉబెర్కు షాకిచ్చిన గూగుల్
శాన్ ఫ్రాన్సిస్కో: ఆన్లైన్ క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్కు గూగుల్మాప్స్ ద్వారా అనూహ్య పరిణామం ఎదురైంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఉబెర్ క్యాబ్ను బుక్ చేసుకునే సదుపాయాన్ని రద్దు చేసింది. ఎలాంటి ముందస్తు హెచ్చరిక, కారణం చెప్పకుండానే ఉబెర్ రైడ్ బుకింగ్ సేవలను తొలగించింది. డైరెక్ట్గా గూగుల్ మ్యాప్ ద్వారా క్యాబ్ను బుక్ చేసుకోలేరని సోమవారం గూగుల్ ప్రకటించినట్టు తెలుస్తోంది. గూగుల్ తన హెల్ప్లైన్ పేజీలో ఈ మేరకు సూచించిందని ఆండ్రాయిడ్ పోలీస్ నివేదించింది. అయితే ఉబెర్ యాప్లో రూటు చూడడం, రైడ్ రిక్వెస్ట్ లాంటివి చేసుకోవచ్చని తెలిపింది. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఉబెర్ క్యాబ్ను బుక్ చేసుకునే సదుపాయాన్ని గత ఏడాది జనవరిలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఉబెర్ అఫీషియల్ యాప్తో సంబంధం లేకుండా.. నేరుగా గూగుల్ మ్యాప్స్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కస్టమర్లకు అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై అటు గూగుల్ కానీ, ఇటు ఉబెర్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఫ్యూచర్ ప్లాన్
‘‘ఈ గది 10్ఠ 8 ఉండాలి’’ అంది శ్రీమతి మాలిక్ వాళ్ల ముందరి టేబుల్ మీదున్న ఇంటి ప్లానును చూపిస్తూ. ఆమె అలా సూచించడం అది మూడోసారి. దానిని ఆమె భర్తగాని, ఇంటి డిజైన్ తయారుచేసే వ్యక్తిగాని గుర్తించినట్లు లేదు. మాలిక్ దంపతులు ఢిల్లీలో సొంతిల్లు కట్టుకోబోతున్నారు. ఇల్లు కట్టడం పూర్తయితే, తన భర్త వేరే చోటికి బదిలీ అయినా తాను మాత్రం సొంత ఇంట్లోనే ఉండాలని శ్రీమతి మాలిక్ మనస్సులో నిశ్చయించుకొంది. భర్త ఉద్యోగంలో బదిలీ మీద తిరిగి తిరిగి ఆమె అలసిపోయింది. ఇప్పుడు పిల్లలు పెరిగి వస్తున్నారు. వాళ్లను ఒక స్కూలు నుంచి మరో స్కూలుకు మారుస్తూ పోవడం ఇంక మంచిది కాదు. ఆమె పిల్లలతో ఢిల్లీలోనే స్థిరపడుతుంది. వాళ్లత్త ఆమెకు తోడు ఉంటుంది. మాలిక్కు కూడా ఇందులో అభ్యంతరం లేదు. ‘‘ఈ గది 10 8 అయ్యుండాలి’’ ఆమె మళ్లీ అంది. ఆమె భర్త పక్క గదిలో ఎవరితోనో టెలిఫోన్లో మాట్లాడుతున్నాడు. ‘‘కాని ఇది స్టోర్’’ వాస్తు శిల్పి ఆమెకు వివరించాడు. ‘‘అవును, అయితే దానిని మా అత్త ఉన్నన్నాళ్లు ఆమెకిచ్చి, ఆ తర్వాత స్టోర్రూమ్గా వాడుకోవచ్చనుకున్నాను’’. వాస్తు శిల్పికి అర్థమైనట్లు లేదు. శ్రీమతి మాలిక్ మాటలు విని అతను అయోమయంగా చూశాడు. ‘‘నా ఉద్దేశం మా అత్త ఆ గదిని వాడుకుంటుంది... మీకు తెలుసుగదా ఆమె ముసలావిడ... ఎక్కువకాలం ఉండదు. ఆమె తర్వాత ఆ గదిని స్టోర్రూమ్గా మార్చుకోవచ్చు’’. మాలిక్ వచ్చి వాళ్లతో చేరాడు. అతను ఫోన్లో మాట్లాడుతూనే తన భార్య సూచనను గురించి కూడా ఆలోచించినట్లున్నాడు. అతను కూడా స్టోర్ కొంచెం పెద్దదిగానే ఉండాలన్న అభిప్రాయంలో ఉన్నాడు. స్టోర్ రూమ్ ఎప్పుడూ పెద్దదిగా ఉంటే పెట్టెల మధ్య ఫ్రీగా తిరగడానికి వీలవుతుంది. వంటగది పక్కగదిని 10 ్ఠ 8 కొలతల్లో కట్టాలని నిర్ణయించబడింది. మండువా కొంత ఇరుగ్గా ఉంటుంది. అది పెద్ద సమస్య కాదు. మిగతా పనంతా పూర్తయింది. ప్లాను ఆమోదం కోసం కార్పొరేషన్కు పంపించారు. శ్రీమతి మాలిక్ ఇంటి నిర్మాణం మీద శ్రద్ధగా పనిచేసింది. రోజంతా గొడుగు వేసుకొని నిలబడి పని చేయించింది. అవసరమైనప్పుడు మేస్త్రీలకు చేతి సహాయం కూడా చేసింది. ఇల్లు కట్టినన్ని రోజులూ అక్కడికి మొట్టమొదట వచ్చేది ఆమే, చిట్టచివర వెళ్లేది ఆమే. తొందరగానే ఇల్లు పూర్తయింది. ఇంటికి కొత్త ఫర్నిచర్ తేవాలని పట్టుబట్టింది. పాత ఫర్నిచర్లో ఒక ముక్కను కూడా కొత్తింట్లోకి తీసుకు రాకూడదనుకొంది. కొత్తింట్లోకి ఎప్పుడు మారాలో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంతలో ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొందని తెలిసింది. శ్రీమతి మాలిక్కు చాలా కోపం వచ్చింది. ఇంటి కట్టడాన్ని పర్యవేక్షిస్తున్నప్పుడే ఇంటికి సంబంధించి అనేక పథకాలను రూపొందించింది. అన్ని మరిచిపోవాల్సి వచ్చింది. అప్పుడే వాళ్లకు ఢిల్లీ నుంచి బదిలీ అయ్యింది. శ్రీమతి మాలిక్ చాలా సంతోషించింది. ఈ యింట్లో ఉండలేక పోయినందుకు బాధపడనక్కరలేదు. ప్రభుత్వమే వాళ్ల యింటిని అద్దెకు తీసుకోవడంతో ఒక రకంగా వాళ్లు అదృష్టవంతులే. ప్రైవేటు వ్యక్తులతో తలనొప్పి. పైగా బాడుగ సక్రమంగా ఇవ్వరు. ప్రభుత్వం నెలనెలా బాడుగను వాళ్ల బ్యాంక్ అకౌంటుకు జమ చేస్తుంది. ఒక చోటి నుండి మరొక చోటికి బదిలీ అవుతూ ఢిల్లీకి పోస్టింగ్ రావడానికి మాత్రం చాలా ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఆమె అత్త చనిపోయింది. వాళ్ల అమ్మాయికి పెళ్లయిపోయింది. వాళ్ల అబ్బాయి మాత్రమే పెళ్లికాకుండా మిగిలి ఉన్నాడు. మాలిక్ రిటైర్ అయ్యేలోపల ఆ పనికూడా చేసేయ్యొచ్చనుకున్నారు. వాళ్లబ్బాయికి పెళ్లయింది, మాలిక్ రిటైర్ అయ్యాడు. ప్రభుత్వం మాత్రం ఇంటిని ఖాళీ చెయ్యలేదు. మాలిక్, అతని భార్య కొడుకు కోడలుతో కలిసి బాడుగ ఇంట్లో ఉన్నారు. మాలిక్ ఇల్లు ఖాళీ చేయించడానికి ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాడు. తాము కట్టించుకున్న ఇంట్లో ఒక్కరోజు కూడా కాపురం చెయ్యకుండానే మాలిక్ మరణించాడు. మూడు నెలల్లో ఇల్లు ఖాళీ అయ్యింది. శ్రీమతి మాలిక్ కన్నా ఆమె కోడలు సొంతింట్లోకి వెళ్లడానికి ఉత్సాహపడుతున్నది. ఇల్లు స్వాధీనం కాగానే, ఇంటికి రంగులు వేయించి, ఇంట్లోకి మారడం ప్రారంభించింది. ఫర్నిచర్ డీలర్ని పిలిచి అతని దగ్గర ఉన్న ప్రతి వస్తువూ పంపమని చెప్పింది. సోమవారం ఉదయం ఇంట్లోకి మారవలసి ఉండింది. మంచిరోజు గనుక ఆరోజే ఇంట్లోకి మారితే బాగుండునని శ్రీమతి మాలిక్ ఆశ. మంగళవారం అమంగళం. ఆరోజు ఇల్లు మారాలని అనుకోనుకూడా అనుకోరాదు. అమ్మ మనసు తెలిసి, కొడుకు వాన కురుస్తున్నా ఇల్లు మారాలని నిర్ణయించుకున్నాడు. సొంతకారుతో బాటు ఒక టాక్సీని రప్పించి, ఇంట్లోకి మారినట్లు మారారు. లగేజి ఇంకా మార్చవలసి ఉంది.వాన ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. కార్లో వెనక సీట్లో కూర్చున్న శ్రీమతి మాలిక్ స్మృతుల్లోకి వెళ్లిపోయింది. ఇల్లు కట్టేటప్పుడు తనెంత శ్రమించింది? భోజనం తప్పిపోయిన రోజులున్నాయి. ఇంటిపని చూస్తూ మండుటెండలో మాడుతూ నిల్చుంది! వానలో ముద్దయిన రోజులున్నాయి. వాస్తు శిల్పి ఇల్లంతా కట్టడం పూర్తయితే ఎలా ఉంటుందో రంగుల చిత్రంగా వేసి చూపించాడు. అందులో ఒక అమ్మాయి మార్బుల్ స్తంభానికి ఆనుకొని వీపు చూపిస్తూ వరండాలో నిలబడినట్లుంది. ఎంత అందం! ఆత్మ తృప్తికి సంకేతం. మెరూన్ చీర ధరించింది. శిల్పి తననే చెక్కినట్లు శ్రీమతి మాలిక్ భావించింది. అయితే ఆమె మెరూన్ చీరలెప్పుడూ కట్టలేదు. స్కెచ్లోని బొమ్మ ఆమెలాగే పొడవుగా ఉంది. ఆ స్కెచ్ను తన కోడలికి చూపించాలనుకొంది. కోడలు ముందు సీట్లో తన భర్త పక్కన కూర్చొని ఉంది. కారుకున్న రియర్వ్యూ గ్లాసును తిప్పుకొని పెదవులకు తిరిగి రంగు అద్దుకుంది. సొంత ఇంటికి వెళ్తూ పెదవులకు రంగు వేసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఈ కాలపు ఆడపిల్లల వాలకమే ఇంత. ఉన్నట్టుండి వాస్తు శిల్పి దిద్దిన బొమ్మ తన కోడలిది కావచ్చని అనిపించింది ఆమెకు. అదెలా సాధ్యం? ఇంటిప్లాన్ తయారు చేసేటప్పుడు కోడలు రంగంలోనే లేదు. అయితే ఆమె బొమ్మలో లాగే మెరూన్ చీర ధరించింది. అవును, ఇది మెరూన్ కలరే. శ్రీమతి మాలిక్కు మెరూన్ కలర్ ఎప్పుడూ ఇష్టం లేదు. వాళ్లు ఇల్లు చేరుకున్నారు. కొడుకు కారును నేరుగా పోర్టికోలోకి పోనిచ్చాడు. కోడలు కారులోంచి ఎగిరి దూకింది. వరండాలో మార్బుల్ స్తంభం దగ్గర నిలబడి ఆనుకొంది. శిల్పి స్కెచ్లో వేసినట్లే నిలబడింది. శ్రీమతి మాలిక్కు గుండెల్లో కలుక్కుమంది. శిల్పి ఈ అమ్మాయినే అనుకరించాడేమో! టాక్సీలోని లగేజి అంతా ఇంట్లోకి చేరింది. బాడుగ తీసుకొని టాక్సీ డ్రైవర్ వెళ్లిపోయాడు. శ్రీమతి మాలిక్ ఇంకా కారు వెనక సీట్లో కూర్చునే ఉంది. ఆమెకు తాను కిందికి దిగిపోతున్న అనుభూతి కలుగుతోంది. కొడుకు కోడలు ఇంట్లోకి వెళ్లారు. ఒకటొకటిగా లైట్లు వేశారు. అన్ని గదులూ వెలుతురుతో నిండాయి. ఉద్వేగంలో శ్రీమతి మాలిక్కు తలుపు తెరవాలని ఎవరూ గుర్తు పెట్టుకోలేదు. హఠాత్తుగా కొడుక్కి తల్లి గుర్తొచ్చింది. పరుగెత్తికెళ్లి కారు తలుపులు తెరిచాడు. ‘నేను ఏమీ తినను, ఆకలిగా లేదు’’ శ్రీమతి మాలిక్ అంది. ‘‘నేను నిద్రపోతాను’’. ‘‘అయితే మీ రూములో పడుకోండి’’ కోడలు 10 ్ఠ 8 కొలతల గదిని చూపిస్తూ అంది. కొడుకు ఆమెను ఆ గదిలోకి పట్టుకుపోయి దించాడు. ఆమెకు బాగా మత్తుగా ఉంది.‘మా అత్త ఆ గదిని వాడుకుంటుంది. ఆమె తర్వాత ఆ గదిని స్టోర్రూమ్గా మార్చుకోవచ్చు’. పడక మీద పడుకొన్న శ్రీమతి మాలిక్ చెవుల్లో ఈ మాటలు మార్మోగాయి. ఆమె మాటిమాటికి తల తిప్పుతూంది. ఆమె కేమయ్యింది? భర్త ఎప్పుడో పోయాడు. ఆమె అతణ్ని అనుసరిస్తుంది. అప్పుడు ఆమె కోడలు ‘‘ఇల్లు బాగానే ప్లాన్ చేశారు. స్టోర్ రూమ్ ఒక్కటి లేదు. ఒక పెద్ద స్టోర్ రూమ్ కావాలి’’ అనడం వినిపించింది. శ్రీమతి మాలిక్ ఆ మాటలు వింది. ఆమెకు లోతులకు లోలోతులకు, అగాధమైన బావిలోకి దిగిపోతున్నట్లు అనిపించింది. -
చదివినా...తెలియదు
న్యూ ఢిల్లీ : ఉదయం లేవగానే మనలో చాలామంది చేసే పని వాట్సాప్లో స్నేహితులకు గుడ్మార్నింగ్ అంటూ సందేశాలు పంపడం. సందేశాలు పంపి ఊరుకుంటామా...లేదు అవతలివారు మన సందేశం చూశారా, లేదా అని గమనిస్తాం. చూసి కూడా బదులు ఇవ్వకపోతే బాధపడతాం, తిట్టుకుంటాం, మరీ కోపమోస్తే బ్లాక్ చేస్తాం. ఇదంతా జరగడానికి కారణం వాట్సాప్లో ఉన్న రీడ్ రెసిప్ట్ ఫిచర్. దీనివల్ల అవతలి వారు మన మెసేజ్ చదివారో, లేదో మనకు తెలుస్తుంది. మనం వాట్సాప్లో మెసేజ్ పంపినప్పుడు ఒకటే యాష్ కలర్ టిక్ మార్కు వస్తుంది. మనం పంపిన మెసేజ్ అవతలి వారి మొబైలకు చేరగానే రెండు యాష్ కలర్ టిక్ మార్కులు వస్తాయి. మెసేజ్ చదవగానే రెండు నీలంరంగు టిక్ మార్కులు వస్తాయి. దీని వల్లనే అవతలి వారికి మనం మెసేజ్ చదివామో, లేదో తెలుస్తుంది. కానీ ఇప్పుడు వాట్సాప్లో వచ్చిన ఓ కొత్త ఫీచర్తో మనం మెసేజ్ చదివినా అవతలి వారికి తెలియదు. ఎంటా ఫీచర్, ఎలా సెట్ చేసుకోవాలని అనుకుంటున్నారా...అది చాలా సులభం. దానికోసం మీ మొబైల్లో సెట్టింగ్స్ ఏం మార్చక్కరలేదు. చాలా సులభంగా దీనిని సెట్ చేసుకోవచ్చు. అందుకు ముందుగా మీరు 1. మీకు వాట్సాప్లో మెసేజ్ రాగానే, ముందుగా నోటిఫికేషన్ పానెల్ను కిందికి స్ర్కోల్ చేసి, ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేయండి. 2. ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో ఉన్నారు. వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజ్లు చదవండి. 3. చదవడం అయిపోయాక వాట్సాప్ విండోను క్లోస్ చేయండి. 4. వాట్సాప్ను పూర్తిగా క్లోస్ చేసిన తర్వాత ఏరోప్లేన్ మోడ్ను ఆఫ్ చేయండి. చాలా సులభంగా ఉంది కదా... ఏరోప్లేన్ మోడ్ ఆన్లో ఉంటేనే ఇలా చేయడం కుదురుతుంది. ఇంకో విషయం ఏంటంటే వాట్సాప్ విండోను క్లోస్ చేయకుండా కేవలం బాక్ బటన్ను మాత్రమే ప్రెస్ చేస్తే మళ్లీ మీరు ఆన్లైన్లోకి వెళ్లగానే మీరు మెసేజ్ చదివినట్లు చూపించే బ్లూ టిక్ మార్క్స్ కనిపిస్తాయి. అందుకే వాట్సాప్ విండోను పూర్తిగా క్లోస్ చేయడం మరవకండి. -
అరెరె.. పొరపాటున కొత్త ఫీచర్ ప్రత్యక్షం!
లండన్: వాట్సాప్ మొబైల్ యాప్ రిప్లై ప్రైవేట్లీ అనే సదుపాయాన్ని పొరపాటున యాక్టివేట్ చేసింది. ఈ విధానంలో గ్రూపులో ఉంటూనే ఓ సభ్యుడికి గ్రూప్ నుంచి ఇతర సభ్యులకు తెలియకుండా సందేశం పంపొచ్చు. వాట్సప్ బీటా ఆప్డేట్లో ఈ సదుపాయం కనిపించిన కాసేపటికే మాయమైందని బ్రిటన్ మీడియా తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉందని, ఇతర ఫీచర్లతో కలిపి రిప్లై ప్రైవేట్లీని విడుదల చేస్తారని వెల్లడించింది. డెవలపర్లు పొరపాటును దీనిని యాక్టివేట్ చేసి ఉంటారని అభిప్రాయపడింది. కాగా, మరికొన్ని రోజుల్లో ఈ కొత్త ఫీచర్ను తమ యూజర్లకు తెచ్చే పనిలో యాజమాన్యం బిజీగా ఉండగా ఓ యూజర్ మొబైల్లో పొరపాటున ఈ ఫీచర్ కనిపించడం గమనార్హం. -
ఫేస్బుక్ కూడా ఈ ఫీచర్ను పరీక్షిస్తోంది
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కొత్త ఫీచర్ను లాంచ్ చేయనుంది. సోషల్ నెట్ వర్క్లో కస్టమర్లు నిజమైన పేర్లను ఉంచేలా నియోగదారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ ఫీచర్ను పరీక్షిస్తోంది. ఇండియాలో వినియోగదారులకు ఆధార్ కార్డు ప్రకారం పేర్లను ప్రవేశ పెట్టాలని భావిస్తోంది. చాలా పరిమితంగా ప్రస్తుతానికి దీన్ని టెస్ట్ చేస్తున్నట్టు ఫేస్బుక్ తెలిపింది. తాము పరీక్షిస్తున్న ఈ ఫీచర్ ఒక ఐచ్ఛిక ప్రాంప్ట్ అని , ఆధార్ కార్డుపై పేరును తప్పనిసరిగా నమోదు చేయవలసిన అవసరం లేదని ఫేస్బుక్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే తాజా చర్య ప్రకారం ఫేస్బుక్ లో కొత్తగా అకౌంట్ తెరిచే వారు ఆధార్ కార్డులో ఉన్న పేరు మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ కాకుండా ఆధార్ కార్డ్ మీద ఉన్న పేరును పేర్కొనాలని సూచిస్తోంది. ఇది కూడా కొందరికి మాత్రమేనని, తప్పనిసరి కాదని ఫేస్బుక్ స్పష్టం చేసింది. తద్వారా ఫేస్బుక్ యూజర్లు స్నేహితులు, బంధువులు మిమ్మల్ని గుర్తించడం సులభమవుతుందని అంటోంది. కాగా పాన్ కార్డు, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబర్లతో సహా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేసింది. ఈ లింకింగ్కోసం కొంత గడువును కూడా ఇచ్చింది. అయితే ఆధార్ లింకింగ్ ప్రక్రియపై వివాదం, ఇటీవ సుప్రీంకోర్టు ఆధార్ అనుసంధాన సమయం పొడిగింపు అంశాలు తెలిసిన సంగతే. -
వాట్సాప్లో కూడా లైవ్ లొకేషన్ షేరింగ్
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ అద్భుతమైన ఫీచర్ను ప్రారంభించింది. ఈ సరికొత్త ఫీచర్ త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. అదే లైవ్ లొకేషన్ షేరింగ్ సదుపాయం. వాట్సాప్ అధికారిక బ్లాగ్ ప్రకారం, రాబోయే వారాలలో ఆండ్రాయిడ్, ఐఓ ఎస్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. గూగుల్ మ్యాప్స్ లాంటి వివిధ వేదికలపై ఈ సౌకర్యం అందుబాటులో ఉన్నప్పటికీ, వాట్సాప్ తాజా ఫీచర్ వినియోగదారులను భారీగా ఆకర్షించగలదని భావిస్తున్నారు. నెలవారీ 1.3 బిలియన్ యాక్టివ్ యూజర్లతో దూసుకుపోతున్న వాట్సాప్ తాజా ఫీచర్లు ప్రపంచవ్యాప్త నవీకరణగా నిలవనుంది. దీని ద్వారా వాట్సాప్ యూజర్లు తమ లైవ్ లొకేషన్ను అవతలి వాట్సాప్ యూజర్లకు, అలాగే వాట్సాప్ గ్రూప్నకు కూడా షేర్ చేయవచ్చు. 15 నిమిషాలు నాన్స్టాప్గా లైవ్ లో ఉండవచ్చు. ఇలా గరిష్టంగా సుదీర్ఘంగా ఎనిమిది గంటల పాటు లైవ్ను ఎంచుకోవచ్చు. ఈ లైవ్ లొకేషన్ను షేరింగ్ తో యూజర్లు ఎక్కడ ఉన్నారో వారి ఫ్రెండ్స్కు, కుటుంబ సభ్యులకు సులభంగా తెలిసిపోతుంది. అలాగే గ్రూపులకు సంబంధించి లైవ్లొకేషన్ను ఎంచుకున్న గ్రూపు సభ్యుల లొకేషన్స్ ఒకే మ్యాప్లో దర్శనమిస్తాయి. ఎంతసేపు లైవ్ లో ఉండాలనేది యూజర్ నిర్ణయించుకోవచ్చు. మరోవైపు అబద్ధం చెప్పే యూజర్లు ఈ కొత్త ఫీచర్కు దూరంగా ఉండాల్సిందే. చాట్ బాక్స్ ప్రక్కన పేపర్ క్లిప్ చిహ్నాన్ని నొక్కడం ద్వారా కొత్త ఫీచర్ను యాక్సెస్ చేయవచ్చు. అలాగే వినియోగదారుల గోప్యతపై కూడా వాట్సాప్ భారీ భరోసా కూడా ఇస్తోంది. కాగా ఇదే ఫీచర్ స్నాప్ చాట్ ఈ ఏడ్డాది సమ్మర్లో లాంచ్ చేసింది. అలాగే గూగుల్ మాప్స్, ఫైండ్ మా ఫ్రెండ్స్ యాప్ ద్వారా యాపిల్ కూడా లైవ్ లోకేషన్ సౌలభ్యాన్ని అందిస్తోంది. అలాగే వాట్సాప్ యూజర్ ఫోన్నెంబర్ మార్చిన ప్రతిసారీ .. నెంబర్ షేరింగ్ ఇబ్బంది లేకుండా ఒక నోటిఫికేషన్ను అందుబాటులోకి తెస్తోంది. ఈ నోటిఫికేషన్ద్వారా యూజర్ మొబైల్ నంబర్ చేంజ్ చేశాడని వారికి తెలుస్తుంది. ఇక దీంతోపాటు త్వరలో అందించనున్న అప్డేట్ ద్వారా వాట్సాప్ యాప్ సైజ్ను కూడా భారీగా తగ్గించనుందట. -
ఫేస్బుక్లో కొత్త ఫీచర్
శాన్ఫ్రాన్సిస్కో: కొత్త, కొత్త ఆప్షన్లతో యూజర్లను ఆకర్షిస్తున్న సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్ తాజాగా మరో సరికొత్త ఆప్షన్ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే అనేక రకాల ఆప్షన్లు తీసుకొచ్చిన ఫేస్బుక్ ఇపుడు ఆహారం కోసం 'ఆర్డర్ ఫుడ్' ఫీచను లాంచ్ చేసింది. గత ఏడాది కాలంగా పరీక్షలు నిర్వహిస్తున్న సంస్థ ఇకపై ఇంటర్నెట్ యూజర్లు ఫేస్బుక్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్, డెస్క్టాప్ యూజర్లు నేరుగా ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. ముందుగా అమెరికా ఈ సేవలను ప్రారంభించింది. ఇకపై మీరు అధికారికంగా ఫుడ్ పికప్ లేదా డెలివరీ కోసం నేరుగా ఆర్డర్ చేసుకోవచ్చని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ హిమెల్, బ్లాగ్లో శుక్రవారం ప్రకటించారు. మెనులో 'ఆర్డర్ ఫుడ్' విభాగాన్ని సందర్శించడం ద్వారా సమీపంలోని రెస్టారెంట్లు బ్రౌజ్ చేసి, స్టార్ట్ ఆర్డర్ బటన్ క్లిక్ తో ఇష్టమైన ఫుడ్ను ఎంచుకోవచ్చని తెలిపారు. దీంతో ఇష్టమైన ఆహారాన్ని పొందాలంటే సమీపంలో ఉన్న రెస్టారెంట్స్ లేదా హోటల్స్కు వెళ్లడమో లేదంటే రెస్టారెంట్ల వెబ్సైట్లు కానీ,వివిధ యాప్లు కానీ ఓపెన్ చేయాల్సిన పనిలేకుండా నేరుగా ఫేస్బుక్ ద్వారా ఉన్న చోటు నుంచే ఫుడ్ ఆర్డర్లు చేయవచ్చు. -
ఫేస్బుక్లో అద్భుతమైన ఫీచర్
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ నెట్వర్కింగ్ సైట్ దిగ్గజం ఫేస్ బుక్ మరో సరికొత్త ఫీచర్ను విడుదల చేస్తోంది. అత్యవసర సమయాల్లో ప్రాణదానంగా నిలిచే రక్తదానానికి ప్రోత్సహమిచ్చేలా ఒక అద్భుతమైన ఫీచర్ను త్వరలోనే అందుబాటులోకి తేనుంది. దీని ప్రకారం ఫేస్బుక్ వినియోగదారుడు ఫేస్బుక్ లో రక్తదాతగా నమోదు కావచ్చు. ముందుగా ఢిల్లీ, హైదరాబాద్లోని ఈ సేవలను ప్రారంభిస్తోంది. తదుపరి కొన్ని వారాల్లో ఇతర నగరాలకు విస్తరించనుంది. అక్టోబర్ 1 జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈ ఫీచర్ను లాంచ్ చేయనుంది. ముందుగా న్యూస్ఫీడ్లో బ్లడ్ డోనర్గా రిజిస్టర్ చేసుకునేలా ఒక లింక్ను ఫేస్బుక్ జోడించనుంది. ఇందులో ఆసక్తి వున్నవారు సంబంధిత వివరాలతో నమోదు కావాల్సి ఉంటుంది. తద్వారా రక్తదాతలతో , రోగులు, హాస్పిటల్, రక్త బ్యాంకులు సులువుగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. భారత దేశంలో చాలా నగరాల్లో రక్తం కొరత చాలా ఉన్నట్టు తాము గుర్తించామని, అలాగే ఫేస్బుక్, వాట్సాప్ లో దీనికి సంబంధించి సందేశాలువిరివిగా షేర్ అవడం కూడా తాము గమనించామని అందుకే ఈ ఫీచర్ను లాంచ్ చేస్తున్నట్టు ఫేస్బుక్ దక్షిణ ఆసియా ప్రోగ్రాం హెడ్ రితేష్ మెహతా పిటీఐకి తెలిపారు. దేశంలో రక్త దానం గురించి అవగాహన పెంచడమే తమ ఉద్దేశ్యమని ఫేస్బుక్ మేనేజర్(హెల్త్) హేమ బుద్దరాజు చెప్పారు. అలాగే ‘ఓన్లీ మి’ ఆప్షన్ ద్వారా యూజర్ గోప్యతను కాపాడతామని ఇది ఆండ్రాయిడ్, మొబైల్ వెబ్ లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. తమ పరిశోధనలో భాగంగా, రక్తం బ్యాంకులు, ఆసుపత్రులు, ఎన్జీఓలు, ఇతర పరిశ్రమ నిపుణులతో చర్చించినట్టు ఆమె పేర్కొన్నారు. -
క్రీడలతో బంగారు భవిత
ఏఎన్యూ రెక్టార్ సాంబశివరావు మహిళా కబడ్డీ పోటీలు ప్రారంభం గుంటూరు రూరల్ : క్రీడలతో మానసికోల్లాసంతో పాటు భంగారు భవితను పొందవచ్చని ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ రెక్టార్ కేఆర్ఎస్ సాంబశివరావు తెలిపారు. బుధవారం తాడికొండ మండలం లాం గ్రామంలోని చలపతి ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఏఎన్యూ అంతర్ కళాశాలల మహిళా కబడ్డీ పోటీలను ఆయన రిబ్బన్ కట్చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థులు క్రీడల పట్ల ఎక్కువ మక్కువ చూపుతారని చెప్పారు. విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చే సరికే క్రీడల కన్నా చదువుపై శ్రద్ధ చూపటంతో నైపుణ్యాలు తగ్గిపోతాయన్నారు. ఏఎన్యూ పరిధిలోని కళాశాలల నుంచి మొత్తం 10 టీంలు పోటీల్లో పాల్గొన్నాయి. ఏఎన్యూ, ఎమ్ఏ జట్లు విజేత.... మొదటిరోజు జరిగిన నాకౌట్ పోటీలలో పది జట్లు పాల్గొనగా అందులో మొదటి మ్యాచ్ గుంటూరు సెయింట్ ఆన్స్ జట్టు, వైఎ ప్రభుత్వ కళాశాల చీరాలజట్టుతో తలపడగా, చలపతి పార్మసీ కళాశాల జట్టుతో నరసరావుపేటకు చెందిన కృష్ణవేణి కళాశాల జట్టుతో, ఒంగోలుకు చెందిన వాసవి డిగ్రీ కళాశాల జట్టుతో డీఎస్ ప్రభుత్వ కళాశాల జట్టుతో, చిలకలూరిపేటకు చెందిన ఏఎమ్జీడిగ్రీ కళాశాల జట్టుతో ఎన్యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల జట్టుతో తలపడ్డాయి. ఈ పోటీలలో ఆచార్య నాగార్జున కళాశాల జట్టు, ఎమ్ఏ ప్రభుత్వ కళాశాల చీరాల జట్టు గెలుపొందాయి. రేపు జరిగే సెమి పైనల్ పోటీలలో కృష్ణవేణి డిగ్రీ కళాశాల జట్టు, ఏఎన్యూ జట్టుతో, డీఎస్ ప్రభుత్వ కళాశాల జట్టుతో గుంటూరు ప్రభుత్వ కళాశాల జట్టు తలపడనున్నాయి. చలపతి విద్యాసంస్థల అధినేత వైవి ఆంజనేయులు, ప్రిన్సిపల్ డాక్టర్ నాదెండ్ల రామారావు, తదితరులు ఏఎన్యూ రెక్టర్ సాంబశివరావును ఘనంగా సన్మానించారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
జిల్లా కబడ్డీ, టేబుల్ టెన్నిస్ జట్ల ఎంపిక వేళంగి(కరప): చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ప్రిన్సిపాల్ సత్తి వీరవెంకట సత్యనారాయణరెడ్డి అన్నారు. కరప మండలం వేళంగి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క» డ్డీ, టేబుల్టెన్నిస్ జిల్లాజట్ల ఎంపిక ఆటల పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి ప్రణాళికాబద్ధంగా చదువుకుంటూ, ఆటలలో కూడా ప్రావీణ్యం సంపాదించాలని, అందుకు అనుగుణంగా శిక్షణ పొందాలన్నారు. జిల్లా స్కూలు గేమ్స్ ఫెడరేషన్ అండర్–19 కార్యదర్శి వై.తాతబ్బాయి పర్యవేక్షణలో వివిధ కళాశాలల పీడీలు వి.సీతాపతిరావు, ఈవీవీ సత్యనారాయణ, పి.రత్నసామ్యూల్, పి.గంగాధర్రెడ్డి, జే.రఘరాం, సతీష్, టీ.వీరయ్యచౌదరి, రాష్ట్ర బాస్కెట్బాల్ అసోసియేషన్ కోశాధికారి గన్నమనేని చక్రవర్తిఎంపిక కమిటీ సభ్యులుగా వ్యహరించారు. జిల్లా క» డ్డీ బాలుర జట్టు టి.దుర్గాచంద్, కె.హరిబాబు, వి.ధనశేఖర్, పి.బాలసుబ్రమణ్యం, పి.ధర్మతేజ(కాకినాడ), కె.చక్రవర్తి, బి.అనిల్(సామర్లకోట), పి.భవానీప్రసాద్(కిర్లంపూడి), కె.ప్రసాద్(గొల్లపాలెం), ఎ.రాము(కొత్తపేట), ఎ.వీరబాబు(కాకినాడ), ఎస్.రాజేష్(రాజమహేంద్రవరం), జి.సేలంరాజు(పెద్దాపురం) జిల్లా కబడ్డీ బాలికల జట్టు ఎన్.కావ్య, ఐ.సూర్యభవానీ(కాకినాడ), పి.జగదేశ్వరీదేవి, ఎంవీవీ సాయిలక్ష్మి(గొల్లపాలెం), పి.ఐంద్రాణి(కాజులూరు), ఎన్.శిరీష(గోకవరం), ఎన్.నాగశ్రీదేవి(కిర్లంపూడి), కె.ఆకాంక్ష(వేళంగి), కె.రాణి, పి.జ్యోతి(రామచంద్రపురం), ఎస్.ఐశ్వర్య, డి.చంద్రకళ(ఆలమూరు), ఎన్.దీప్తి(రావులపాలెం) జిల్లా టేబుల్ టెన్నిస్ బాలుర విభాగంలో ఎండీ ఫిరోజ్, ఎం.బద్రీప్రకాష్(రాజమహేంద్రవరం), జి.కిశోర్, ఎం.వినోద్కుమార్(అమలాపురం), జి.వెంకటస్వామి(రామచంద్రపురం) టేబుల్టెన్నిస్ బాలికల విభాగంలో డి.సాయిదీక్షిత(తుని), పీఎస్ఆర్ఎస్ సరాజిత, ఎం.ప్రజ్వల, పి.వైష్ణవి(కాకినాడ), షేక్ జహీరా షిహార్(రామచంద్రపురం) జిల్లా జట్లకు ఎంపికైన ఈక్రీడాకారులు రాష్ట్ర స్థాయిపోటీలలో పాల్గొంటారని జిల్లాస్కూలు గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి తాతబ్బాయి తెలిపారు. హైస్కూల్ హెచ్ఎం బి.వెంకటశివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.